ముసునూరులో ఉద్రిక్తత
‘వనజాక్షి’ ఘటన విచారణ కమిటీ ఎదుటే చింతమనేని వర్గం దౌర్జన్యం
సాక్షి, విజయవాడ బ్యూరో: కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దార్ వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేని దాడికి పాల్పడిన ఘటనలో విచారణ ఉద్రిక్తతకు దారి తీసింది. ద్విసభ్య కమిటీ సభ్యులు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ జేసీ శర్మ, సెర్ప్ సీఈఓ సాల్మన్ ఆరోగ్యరాజ్ గురువారం విచారణ జరిపారు. ఘటన జరిగిన ముసునూరు మండలం, రంగంపేట, పెదవేగి మండలం విజయరాయి ఇసుక రీచ్లప్రాంతాన్ని పరిశీలించేందుకు బృందం వెళ్లింది. వనజాక్షిపై దాడికి దారితీసిన పరిస్థితులను ముసునూరు నాయకుడు, మాజీ ఎంపీపీ వైఎస్సార్ చౌదరి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులకు వివరిస్తుండగా, అప్పటికే డ్వాక్రా మహిళల ముసుగున వందలాది మంది మహిళలు, అనుచరగణంతో అక్కడికి చేరుకున్న చింతమనేని వర్గం అడ్డుతగిలి దాడికి యత్నించారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
దీంతో కమిటీ సభ్యులు విజయవాడ సబ్-కలెక్టర్ కార్యాలయంలో విచారణ జరుపుతామంటూ అక్కడి నుంచి నిష్ర్కమించారు. విజయవాడ సబ్కలెక్టర్ కార్యాలయంలో విచారణకు బాధితురాలు వనజాక్షి, చింతమనేని హాజరయ్యారు. దాదాపు 5 గంటలపాటు విచారణ కమిటీ అందరి అభిప్రాయాలు సేకరించింది. తనపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని వనజాక్షి కమిటీ సభ్యులను కోరారు. రంగంపేట-విజయరాయి ఇసుక క్వారీ వివాదం నేపథ్యంలో రీ-సర్వే చేసి కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల సరిహద్దులు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. తాను తప్పు చేసినట్టు తేలితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి వైదొలుగుతానని చింతమనేని స్రవాల్ విసిరారు.