Cockfigh Betting
-
మద్యం, జూదం, కాసుల వేట
సాక్షి, అమరావతి: ఇసుక నుంచి మద్యం దాకా కాసుల వేటకు అలవాటు పడిన టీడీపీ కూటమి నేతలు కోడి పందేలను వదల్లేదు. సంప్రదాయం ముసుగులో మూడు రోజులపాటు సాగించిన జూదక్రీడలో సంపాదనే లక్ష్యంగా బరి తెగించారు. మునుపెన్నడూ లేని విధంగా ఊరూవాడా కోడి పందాలు, పేకాట, గుండాటలను యథేచ్ఛగా నిర్వహించారు.వైఎస్సార్సీపీ హయాంలో సంప్రదాయాన్ని గౌరవిస్తూ మూడు రోజులపాటు షరతులతో కోడి పందేల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే పచ్చ ముఠాలు ఎల్లో మీడియాలో నానా రభస సృష్టించాయి. గుడివాడలో క్యాసినో నిర్వహించారంటూ.. అమ్మ ఒడి సొమ్ము ఆవిరైపోయిందని.. ఒక చేతితో ఇచ్చి మరో చేతితో లాక్కున్నారంటూ దుష్ప్రచారాలకు తెగబడ్డ కూటమి నేతలు ఈ ఏడాది కోడి పందేలకు రాజకీయ రంగు పులిమి ఆదాయ మార్గంగా మార్చేశారు. రాష్ట్రాన్ని క్యాసినో అడ్డాగా మార్చేశారు. పలుచోట్ల కోడి పందేలను కూటమి ప్రజాప్రతినిధులు, మంత్రులు స్వయంగా ప్రారంభించడంతోపాటు వారి ఫొటోలతో బరుల వద్ద ప్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. చట్టాన్ని ఉల్లంఘించి.. జూదానికి జై కత్తులు కట్టి కోడి పందేలను నిర్వహించకూడదని చట్టాలు చెబుతుండగా కూటమి ప్రజా ప్రతినిధులు వాటిని నిస్సిగ్గుగా ఉల్లంఘించారు. దెందులూరు నియోజకవర్గం దుగ్గిరాలలో రూ.కోటికిపైగా ఖర్చు చేసి మినీ స్టేడియంలా తీర్చిదిద్దిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మూడు రోజుల పాటు జూదాల జాతర నడిపించారు. ఏలూరు జిల్లాలో ఎంపీ పుట్టా మహేష్కుమార్, అనకాపల్లిలో ఎంపీ సీఎం రమేష్, కాకినాడలో జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, పిఠాపురం టీడీపీ ఇన్చార్జీ వర్మ, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, పులివెందులలో బీటెక్ రవి కోడి పందేలను ప్రారంభించడంతోపాటు దగ్గరుండి పర్యవేక్షించారు. హోంమంత్రి వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేటలో యథేచ్ఛగా పందేలు వేశారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో కూటమి నేతల కనుసన్నల్లోనే పందేలు జరిగాయి. తాడిగడపలోని వక్ఫ్ భూమిలో, ఉభయ గోదావరి జిల్లాల్లో దేవాలయాలకు అతి సమీపంలో, రాయచోటిలో క్రషర్ స్థలాన్ని ఆక్రమించి మరీ కోడి పందేలు వేసినా పోలీసులు కన్నెత్తి చూడలేదు. సీజ్ ద గ్యాంబ్లింగ్.. అనలేరా? తామేమీ తక్కువ తినలేదన్నట్టుగా జనసేన నేతలు కోడి పందేలకు ప్రత్యేక బరులు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. భీమవరానికి సమీపంలోని తాడేరులో సంక్రాంతి సంబరాల పేరుతో ఏర్పాట్లు చేసుకున్న జనసేన స్థానిక నేతలు కోడి పందేలు, రాత్రి రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించారు. తాడిగడపలో బరికి ఆనుకుని ఉన్న జాతీయ రహదారిపై అనధికారింగా టోల్ వసూళ్లకు దిగారు. కాకినాడలో సీజ్ ద షిప్ అని వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ సీఎం పవన్ జూద క్రీడలపై ఎందుకు స్పందించడం లేదని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. వసూళ్ల దందా.. మూడు రోజుల్లో ఏకంగా రూ.5 వేల కోట్లు బెట్టింగ్ల రూపంలో చేతులు మారినట్టు అంచనా. ప్రతి పందేనికి ఒడ్డిన మొత్తంలో 10 శాతం కేవుల్ (కమిషన్) వసూలు చేశారు. అంటే పది నిమిషాల్లో తేలిపోయే కోడి పందెంలో బెట్టింగ్ రూ.కోటి గెలిస్తే అందులో రూ.10 లక్షలు నిర్వాహకులకు చెల్లించాలి. అనధికారికంగా మద్యం బెల్ట్షాపు మూడు రోజులు ఏర్పాటు చేసుకోవాలంటే బరి స్థాయిని బట్టి రూ.లక్ష నుంచి రూ.5 లక్షలు నిర్వాహకులకు కప్పం కట్టారు. ఫలితంగా బెల్ట్షాపుల విక్రయాలతో మద్యం ఏరులై పారింది. గుండాట, పేకాట, కోతాట పెట్టాలంటే రోజుకు కనీసం రూ.10 వేల నుంచి రూ.లక్షకుపైగా రుసుం వసూలు చేశారు. కోడి పకోడి, బిర్యానీ, సిగరెట్, వాటర్, కూల్డ్రింక్స్ స్టాల్స్ పెట్టుకోవాలంటే రోజుకు రూ.5 వేల నుంచి రూ.25 వేలు చెల్లించాల్సి వచ్చింది. మోటార్ సైకిల్కు రూ.50, కార్కు రూ.200 వసూలు చేశారు. విజయవాడ రూరల్ మండలం పాములకాల్వ సమీపంలో బుధవారం రాత్రి పొద్దుపోయాక కోడిపందాలు నిర్వహించడంతో అక్కడకు వెళ్లిన వన్టౌన్ ఎస్సై హరిప్రసాద్పై నిర్వాహకులు తిరగబడటం కూటమి నేతల అరాచకాలకు పరాకాష్ట. -
Cockfights: కోడి పందేలకు రె'ఢీ'
Makar Sankranti Celebrations 2022: జిల్లాలో కోడిపందేలకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. భారీగా పోలీసుల ఆంక్షలు, దాడులు, వరుస కేసులు నమోదు చేస్తున్నా పందేలు ఆగే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లావ్యాప్తంగా కీలక ప్రాంతాల్లో పందెం బరులు సిద్ధమవుతున్నాయి. సంక్రాంతి పండుగ మూడు రోజులపాటు (శుక్ర, శని, ఆదివారాలు) లక్షలాది రూపాయలు పందేలు నిర్వహించేలా బరులు సన్నద్ధం చేస్తున్నారు. ఇదంతా ఏటా సాగే తంతు అయినా పోలీసులు కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పందేలు నిరోధించడానికి చర్యలు తీసుకుంటున్నారు. అయినా ఏళ్ల తరబడి నుంచి కొనసాగుతున్న వ్యవహారం కాబట్టి పందేలు కూడా అదేస్థాయిలో నిర్వహించేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. రహస్యంగా ఏర్పాట్లు జిల్లాలో కోడిపందేలను తిలకించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో తరలివస్తారు. సంక్రాంతి పండుగ సాంప్రదాయ క్రీడలతో పాటు కోడిపందేలు దాదాపు వందేళ్లుగా జిల్లాలో కొనసాగుతున్నాయి. కోర్టు ఉత్తర్వులు, పోలీసుల ఆంక్షలు ఉన్నా పందేల జోరు స్థాయి మాత్రం తగ్గడం లేదు. ఈ ఏడాది కూడా జిల్లాలోని భీమవరం, నరసాపురం, జంగారెడ్డిగూడెం, ఉంగుటూరు, దెందులూరులో పందేల నిర్వహణకు పదుల సంఖ్యలో బరులు సిద్ధం చేస్తున్నారు. వాస్తవానికి వారం రోజుల ముందు నుంచే కోడిపందేల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్న క్రమంలో పోలీసులు సీరియస్గా కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో రహస్యంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా బరులు జిల్లా పోలీస్ యంత్రాంగం భీమవరం, నరసాపురం, జంగారెడ్డిగూడెం, దెందులూరు, ఉంగుటూరు, ఏలూరు రూరల్ ప్రాంతాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టి కోడిపందేలు జరిగితే సంబంధిత ఎస్సై, సీఐలపై సస్పెండ్ వేటు ఉంటుందని స్పష్టంచేసింది. అయినా ఆయా ప్రాంతాల్లో స్థానికంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధానంగా నరసాపురం ప్రాంతంలో ముత్యాలపల్లి, కోత్తాట, పేరుపాలెం, కేపీపాలెం, నరసాపురం పట్టణంలోని లక్ష్మణేశ్వరం, పితానిమెరిక, పీచుపాలెం, పాలకొల్లులో కలగంపూడి, మొగల్తూరులో బరులు సిద్ధమయ్యాయి. ఇక్కడ రూ.5 వేల నుంచి రూ.10 లక్షల వరకు పందేలు జరుగనున్నాయి. భీమవరం ప్రాంతంలో ఐ.భీమవరం, ఆకివీడు, కాళ్ల మండలంలోని జువ్వలపాలెం, సీసలి, కాళ్ల, వెంపలో భారీగా కోట్లల్లో పందేలకు బరులు సిద్ధం చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం ప్రాంతంలో శ్రీనివాసపురం, లక్కవరం, దేవులపల్లిలో భారీగా పందేలు నిర్వహించనున్నారు. పేరంపేట, తాడువాయి, పంగిడిగూడెంలో బరులు సిద్ధమయ్యాయి. ఉంగుటూరు పరిధిలో నారాయణపురం, గొల్లగూడెం, బాదంపూడి, రాచూరు, నల్లమిల్లిలో బరులు సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. దెందులూరు నియోజకవర్గంలో శ్రీరామవరం, పెరుగ్గూడెం, పోతునూరు, కొవ్వలి, గొల్లమ్మగూడెం, గంగన్నగూడెం, జోగన్నపాలెంలో పందేల నిర్వహణకు ఏర్పాట్లు సాగుతున్నాయి. వీటితో పాటు జిల్లాలోని మరిన్ని ప్రాంతాల్లో బరులు ముస్తాబవుతున్నాయి. పోలీసులకు సవాలు కోడిపందేల కట్టడి అంశం ఏటా పోలీసులకు సవాలుగా మారుతుంది. పండుగకు వారం, పది రోజుల నుంచి బైండోవర్ కేసులు, కోడికత్తులు స్వాధీనం చేసుకుని సాంప్రదాయ క్రీడలు నిర్వహించాలని పిలుపునిస్తూ పోలీసులు శాఖాపరంగా హడావుడి చేసినా చివరి మూడు రోజులు మాత్రం స్పందన నామమాత్రంగానే ఉంటుంది. దీంతో కొన్ని గంటల పాటైనా భారీగా కోడిపందేలు సాగుతుంటాయి. కోడిపందేలతో పాటు పేకాట, గుండాటలు కూడా లక్షల్లో కొనసాగుతుంటాయి. జిల్లాలో పోలీసులు ఇప్పటివరకు 3,783 బైండోవర్ కేసులు నమోదు చేసి 4,600 కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నారు. -
పంతం నీదా.. నాదా.. సై..
-
దొరికితే దొంగ.. దొరక్కపోతే..
దొరికితే దొంగ.. దొరక్కపోతే పోలీస్.. సారీసారీ దొర.. ఒక గ్రామంలో నిత్యం కోడి పందాలు జరుగుతున్నాయి. పోలీసులు ఆ వ్యవహారాన్ని ‘మామాళ్లు’గానే పట్టించుకోవడం లేదు. అయితే స్పెషల్ బ్రాంచ్ అధికారులకు (ఎస్బీ) విషయం తెలిసి దాడులు చేయాల్సిందిగా ఆదేశించారు. దీంతో మన పోలీసులకు దాడులు చేయక తప్పింది కాదు. ఆ దాడుల్లో 10 మందిని అరెస్టు చేసి సుమారు రూ.3 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఎఫ్ఐఆర్లో అలవాటులో పొరపాటుగా ఏదో అటూఇటూగా రూ.2 లక్షల పైగా సొమ్ము తక్కువ చూపారు. ఈ విషయం డిపార్టమెంట్లో ఆ నోట ఈ నోట.. నాని.. చివరకు ఎస్పీకి చెవికి చేరింది. దీంతో ఆయన సీరియస్ అయ్యి ఎస్బీ అధికారులను విచారణకు ఆదేశించినట్టు సమాచారం. ఈ విషయం తెలిసిన మన పోలీసులు తెగులు సోకిన కోడిలా విలవిల్లాడిపోతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఆ వివరాలేంటో చూద్దామా? ఏలూరు (సెంట్రల్) : చింతలపూడి మండలం వెంకటాపురం గ్రామంలోని ఒక కోడి పందాల శిబిరంపై ఇటీవల పోలీసులు ఆకస్మిక దాడిలో స్వాధీనం చేసుకున్న భారీ మొత్తంలో సొమ్మును పక్కదారి పట్టించినట్టు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలను సీరియస్గా తీసుకున్న జిల్లా ఎస్పీ భాస్కర్భూషణ్ స్పెషల్ బ్రాంచ్ అధికారులను(ఎస్బీ) విచారణకు ఆదేశించినట్టు తెలిసింది. కొద్దికాలంగా వెంకటాపురంలో రోజూ కోడి పందాలు నిరాటంకంగా జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ పందాలపై అక్కడి పోలీసులు ఎటువంటి దాడులు నిర్వహించకపోవడంతో విషయం ఎస్బీ అధికారులకు తెలిసింది. వెంటనే దాడులు నిర్వహించాలని చింతలపూడి పోలీసులను ఆదేశించారు. ఆ సొమ్ములు కోళ్లు ఎత్తుకుపోయాయా? ఈ క్రమంలో ఈ నెల 23న చింతలపూడి పోలీసులు వెంకటాపురం గ్రామంలో కోడి పందాల స్థావరంపై దాడులు నిర్వహించారు. ఆ దాడుల్లో 10 మందిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.66,750, రెండు కార్లు, నాలుగు మోటారు సైకిళ్లు, రెండు కోళ్లను స్వాధీనం చేసుకున్నట్టు ఎఫ్ఐఆర్లో చూపించారు. అయితే ఈ దాడుల్లో 10 మంది దగ్గర నుంచి రూ.మూడు లక్షలు వరకు స్వాధీనం చేసుకుని రూ. 66,750 మాత్రమే లెక్కల్లో చూపించారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పోలీసులు లెక్కల్లో తేడాలు ఉన్నాయని అక్కడి నిఘా వర్గాలు ఈ విషయం జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకు వెళ్లడంతో ఆయన చింతలపూడి పోలీసులు అధికారులపై ఎస్బీ అధికారులను విచారణకు ఆదేశించినట్టు సమాచారం. పోలీసులు నిర్వహించిన దాడిలో దొరికిన ఓ కాంట్రాక్టరు దగ్గర నుంచే పోలీసులు రూ.లక్ష వరకు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. ఎస్పీ ఈ విషయంపై సీరియస్గా ఉండడంతో సదరు కాంట్రాక్టరుకు తిరిగి డబ్బులు ఇచ్చేందుకు అక్కడే ఓ అధికారి వద్ద పంచాయతీ పెట్టారని నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. భారీ మొత్తాన్ని పక్కదారి పట్టించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరిపై జిల్లా పోలీసు బాస్ ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి మరి.