నడిరోడ్డుపై చొక్కాపట్టి నిలదీసింది
న్యూఢిల్లీ: సామాన్య ప్రజలు మీకు వెదవల్లా కనిపిస్తున్నారా అని ఓ యువతి ఢిల్లీ నడిరోడ్డుపై ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలను నిలదీసింది. ఆస్పత్రికి అత్యవసర పరిస్థితితో వెళుతున్న ఆమె కారు నడిరోడ్డుపై ఆగిపోయేందుకు ఆప్ కార్యకర్తలే కారణం కావడంతో వారిపై శివమెత్తింది. రోజూ నాటకాలు వేస్తున్నారా అని వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ యువతిని చంపేస్తాను.. లైంగిక దాడి చేస్తాను అని బెదిరించిన కేసులో ఆప్ ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్ ను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఆప్ కార్యకర్తలంతా రోడ్డపైకి వచ్చి పలు వీధులు బ్లాక్ చేశారు. ఫలితంగా ట్రాఫిక్ సమస్య తలెత్తింది.
అందులో ఆస్పత్రికి వెళుతున్న ఓ యువతి కారు దిగి వేగంగా బయటకు వచ్చి'అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంచేస్తున్నారు? రోజుకో వేషాలు వేస్తున్నారా? ట్రాఫిక్ క్లియర్ చేయండి? మేం ఆస్పత్రికి వెళ్లాలి' అని చెప్పింది. అంతలో ఓ ఆప్ కార్యకర్త మేం వెళ్లనివ్వం ఏం చేసుకుంటావో చేస్కో అన్నాడు. దాంతో మరింత ఆగ్రహానికి లోనైన ఆ యువతి అతడి చొక్కా పట్టుకొని 'సామాన్యులు మీకు వెదవల్లా కనిపిస్తున్నారా.. ఇలాగేనా నిరసనలు చేసేది? మాకు ఎందుకు సమస్యలు సృష్టిస్తున్నారు? మీ ఒక్క ఎమ్మెల్యే కోసం మేం వేలమంది బాధపడాలా? కార్లో పేషెంట్ ఉందంటే అర్థం కాదా' అని అసహనం వ్యక్తం చేసింది. దానికి ఆప్ ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్యేను విడిచిపెట్టమని పోలీసులకు చెప్పాలని, వేరే రూట్ లో నుంచి ఆస్పత్రికి వెళ్లండంటూ బదులిచ్చారు. దీంతో అదే సమయానికి అక్కడికి పోలీసులు వచ్చారు.