‘కాంకర్’తో ఖజానాకు 1,195 కోట్లు
♦ వాటా విక్రయం విజయవంతం
♦ రిటైల్ ఇన్వెస్టర్ల నుంచీ మంచి స్పందన
న్యూఢిల్లీ: కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(కాంకర్) 5 శాతం వాటా విక్రయం పూర్తిగా విజయవంతమైంది. బుధవారం సంస్థాగత ఇన్వెస్టర్లకు కేటాయించిన విభాగం 2 రెట్లు సబ్స్క్రైబ్ కాగా, గురువారం రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించిన విభాగం షేర్లు గురువారం 1.26 రెట్లు సబ్స్క్రైబ్ అయింది. రిటైల్ ఇన్వెస్టర్లకు 19.49 లక్షల షేర్లు కేటాయించగా, 24.49 లక్షల షేర్లకు బిడ్లు వచ్చాయి. 1.84 రెట్లు సబ్స్క్రైబ్ అయింది. రూ.438 కోట్ల విలువైన బిడ్లు వచ్చాయి. ఆఫర్ ధర(రూ.1,195)లో రిటైల్ ఇన్వెస్టర్లకు 5 శాతం డిస్కౌంట్ లభించింది. రెండు వారాల వ్యవధిలో ప్రభుత్వం చేపట్టిన రెండో ప్రభుత్వ రంగ వాటా విక్రయం ఇది.
గత నెల 23న జరిగిన ఎన్టీపీసీ వాటా విక్రయానికి రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి తగిన స్పందన రాలేదు. కాంకర్ కంపెనీకి సంబంధించి ఒక్కో షేర్ను రూ.1,195 ధరకు ఈ 5 శాతం వాటా విక్రయం ద్వారా ప్రభుత్వం రూ.1,165 కోట్లు సమీకరించింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఏడు (ఐఓసీ, ఎన్టీపీసీ, ఈఐఎల్, పీఎఫ్సీ, ఆర్ఈసీ, డ్రెడ్జింగ్ కార్పొరేషన్, కాంకర్) ప్రభుత్వ రంగ సం స్థల్లో వాటా విక్రయం ద్వారా ప్రభుత్వం రూ.19,517 కోట్లు సమీకరించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.25,000 కోట్లు సమీకరించాలని లక్ష్యం గా పెట్టుకుంది. కాగా రైల్వేల నిర్వహణలో ఉన్న కాంకర్లో ప్రభుత్వ వాటా 61.8%. 5 శాతం వాటా విక్రయం ఇది 56.80 శాతానికి తగ్గుతుంది.