breaking news
Dabba Trading
-
కొత్త పంథాలో ‘డబ్బా ట్రేడింగ్’!
సాక్షి, సిటీబ్యూరో: ఆహార ఉత్పత్తులు, బంగారం, వెండి, ముడిచమురు తదితరాలకు సంబంధించిన కమోడిటీ ట్రేడింగ్కు సమాంతరంగా ప్రభుత్వానికి పన్ను ఎగ్గొడుతూ అక్రమార్కులు సాగించే ‘డబ్బా ట్రేడింగ్’ (Dabba trading ) ఇప్పుడు కొత్త పంథాలో సాగుతున్నట్లు నిఘా, ఆదాయపు పన్ను శాఖ వర్గాలు గుర్తించాయి. హవాలా, క్రిప్టో కరెన్సీ ద్వారా లావాదేవీలు జరిగే ఈ అక్రమ వ్యవహారాల వెనుక మాఫియా హస్తం ఉన్నట్లూ నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.క్రిప్టోతో పాటు హవాలా, నగదు రూపంలో లావాదేవీలు జరుగుతుండటంతో పెద్ద మొత్తంలో నల్లధనం మార్పిడి జరుగుతున్నట్లు తేల్చాయి. ప్రభుత్వానికి పన్ను రూపంలో రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్న ఈ వ్యవహారాలపై కన్నేసి ఉంచాల్సిందిగా నిఘా, పోలీసు వర్గాలకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. దీనికి సంబంధించి ఇటీవల నగరంలోని బంజారాహిల్స్, అబిడ్స్, కళాసీగూడల్లోనూ ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేసినట్లు సమాచారం.అధికారికంగా షేర్ల క్రయవిక్రయాలు నిర్వహించడానికి స్టాక్ ఎక్సేంజ్లు ఉంటాయి. ఇదే రకంగా కమోడిటీస్కు సంబంధించిన లావాదేవీలు నెరపడానికి ప్రత్యేక ఎక్సేంజ్ వంటి వ్యవస్థ ఉంది. వీటిలో జరిగే లావాదేవీలన్నీ పాదర్శికంగా, ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి సాగుతుంటాయి. ప్రతి క్రయవిక్రయం పైనా ప్రభుత్వానికి నిర్దేశిత శాతం పన్ను కచ్చితంగా చెల్లించాల్సి ఉంటుంది. వీటికి సమాంతరంగా లావాదేవీలను అధికారికంగా ఎక్కడా నమోదు చేయకుండా నిర్వహించే లావాదేవీలనే డబ్బా ట్రేడింగ్ అంటారు.ప్రస్తుతం బంగారం, వెండికి సంబంధించిన లావాదేవీలు మాత్రమే ఈ డబ్బా ట్రేడింగ్ ద్వారా ఎక్కువగా జరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా వ్యవస్థీకృతంగా జరిగే ఈ వ్యవహారాలు అటు షేర్ మార్కెట్లోనూ, ఇటు కమోడిటీ మార్కెట్లోనూ జోరుగా సాగుతున్నాయి. లావాదేవీల రుసుం మిగుల్చుకోవడానికి నిర్వాహకులు, పన్ను భారం తప్పించుకోవడంతో పాటు నల్లధనంతో కూడిన లావాదేవీలను నెరపడానికి వినియోగదారులు వీటిని ప్రోత్సహిస్తున్నారు.కమోడిటీస్ డబ్బా ట్రేడింగ్లో చక్కెర, ముడిచమురు, వ్యవసాయ ఉత్పత్తులు, బంగారం, వెండి వంటి వస్తువులను ధర తక్కువగా ఉన్నప్పుడు కొని, డిమాండ్ వచ్చేదాకా వేచి ఉండి విక్రయిస్తుంటారు. సాధారణంగా షేర్లు, కమోడిటీస్కు సంబంధించిన క్రయ విక్రయాలన్నీ పక్కా పత్రాలతో కంప్యూటర్ల ఆధారంగా ఆన్లైన్లో జరుగుతుంటాయి. అతి తక్కువ సందర్భాల్లోనే మాత్రమే వాస్తవంగా వస్తుమార్పిడి జరుగుతుంది.డబ్బా ట్రేడింగ్ మాత్రం బ్యాంకు లావాదేవీలు, డీ మ్యాట్ అకౌంట్లతో సంబంధం లేకుండా పూర్తి ఆఫ్లైన్లో జరిగిపోతుంది. ఏళ్లుగా హవాలా మార్గంలో సాగుతుండగా... ప్రస్తుతం క్రిప్టో కరెన్సీ రూపంలోనూ జరుగుతున్నట్లు తేలింది. ఆదాయం భారీగా ఉండటంతో మాఫియా శక్తులు డబ్బా ట్రేడింగ్లో అడుగుపెట్టాయని పోలీసులు అనుమానిస్తున్నారు. దుబాయ్, జార్జియాల్లోనూ ఈ డబ్బా ట్రేడింగ్ నెట్వర్క్ నడుస్తోందని అధికారులు గుర్తించారు.గుజరాత్లోని అహ్మదాబాద్, సూరత్లతో పాటు మహారాష్ట్రలోని ముంబైల్లో మాఫియాలతో సంబంధాలున్న వ్యక్తులు వ్యవస్థీకృతంగా ఈ డబ్బా ట్రేడింగ్, హవాలా రూపంలో నగదు మారి్పడి నిర్వహిస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ తరహా ట్రేడింగ్ నిర్వహిస్తున్న వ్యక్తులు దేశ వ్యాప్తంగా ఏజెంట్లు, సబ్–ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. హవాలా రాకెట్లు సైతం వీరి చేతుల్లోనే ఉండటంతో చిన్న చిన్న స్లిప్పులు, కొన్ని కరెన్సీ నెంబర్లను కోడ్వర్డ్స్గా ఏర్పాటు చేసుకోవడం ద్వారా ద్రవ్య మార్పిడి చేసేస్తున్నారు.హవాలా లింకులు ఉండటం కూడా మాఫియా హస్తానికి సంబంధించిన అనుమానాల్ని బలపరుస్తున్నాయి. ఉన్నతాధికారులు ఆదేశాలతో అప్రమత్తమైన నిఘా, పోలీసు అధికారులు రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాలతో పాటు ట్రేడింగ్ లావాదేవీలు జరిగే ప్రాంతాలపై డేగకన్ను వేశారు. -
‘డబ్బా ట్రేడింగ్’ చట్ట విరుద్ధం
క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా డబ్బా ట్రేడింగ్ చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది. ఈ అంశంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండవలసిందిగా హెచ్చరించింది. చట్ట విరుద్ధంగా జరిగే ట్రేడింగ్ సర్వీసుల ద్వారా ఎలాంటి లావాదేవీలు చేపట్టవద్దని సూచించింది. ఈ విషయంలో జాగరూకతతో వ్యవహరించవలసిందిగా పేర్కొంది.స్టాక్ మార్కెట్లకు సమాంతరంగా నియంత్రణలులేని ఆఫ్మార్కెట్లో నిర్వహించే అక్రమ లావాదేవీలకు దూరంగా ఉండమంటూ హెచ్చరించింది. గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజీలకు సంబంధం లేకుండా నిర్వహించే ఇలాంటి లావాదేవీలు భారీ రిస్క్లతో కూడి ఉంటాయని తెలియజేసింది. అంతేకాకుండా సెక్యూరిటీస్ కాంట్రాక్టుల చట్టంలోని పలు నిబంధనల ఉల్లంఘనకు సైతం దారితీస్తాయని హెచ్చరించింది. వెరసి డబ్బా ట్రేడింగ్ చట్ట విరుద్ధమేకాకుండా.. రిస్క్లను సైతం ఎదుర్కోవలసి ఉంటుందని వివరించింది. నియంత్రణ, అవగాహన, చట్టబద్ధ సంస్థల సహకారంతో సెబీ ఇన్వెస్టర్ల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసింది.ఇదీ చదవండి: రూ.కోటిలోపు ఫ్లాట్ల అమ్మకాలు డీలాఏమిటీ డబ్బా ట్రేడింగ్..సెబీ నిర్వచించిన విధంగా డబ్బా ట్రేడింగ్ అనేది చట్టవిరుద్ధమైన, క్రమబద్ధీకరించని ఆఫ్ మార్కెట్ ట్రేడింగ్. ఇది గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజీల నియంత్రణలో ఉండదు. సెబీ గుర్తింపు పొందిన ఏ ఎక్స్ఛేంజ్లోనూ ఈ ట్రేడులు నమోదు అవ్వవు. వ్యాపారులు, డబ్బా ఆపరేటర్ల మధ్య నగదు రూపంలో సెటిల్మెంట్లు జరుగుతాయి. ప్రధానంగా స్టాక్ ధర కదలికలపై బెట్టింగ్ వేస్తారు. సెక్యూరిటీల వాస్తవ కొనుగోలు లేదా అమ్మకం ఉండదు. వీటిని అనుసరించడం సెక్యూరిటీస్ కాంట్రాక్ట్స్ రెగ్యులేషన్ యాక్ట్, 1956, సెబీ యాక్ట్ 1992, భారతీయ న్యాయ్ సంహిత 2023ను ఉల్లంఘించడం అవుతుందని గుర్తుంచుకోవాలి. -
స్టాక్ మార్కెట్లో డబ్బా ట్రేడింగ్ అంటే ఏంటి?
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లో ఇద్దరు వ్యక్తులు చట్టవిరుద్ధమైన డబ్బా ట్రేడింగ్ను ఆఫర్ చేస్తున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్ఛేంజీ(ఎన్ఎస్ఈ) తాజాగా పేర్కొంది. స్టాక్ ఎక్ఛేంజీ ప్లాట్ఫామ్తో సంబంధంలేకుండా బయట షేర్లలో లావాదేవీలు చేపట్టడాన్ని డబ్బా ట్రేడింగ్గా వ్యవహరిస్తారు. ఇది చట్టవిరుద్ధంకాగా.. కొంతమంది ఆపరేటర్లు ఇలాంటి ట్రేడింగ్ రింగ్లో లావాదేవీలు చేపట్టేందుకు ఇతరులను అనుమతిస్తారు. వెరసి ఇలాంటి లావాదేవీలపట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా ఇన్వెస్టర్లను ఎన్ఎస్ఈ హెచ్చరించింది. డబ్బా ట్రేడింగ్ను నితిన్ శాంతీలాల్ నగ్డా, నరేంద్ర వి.సుమారియా ఆఫర్ చేస్తున్నట్లు వెల్లడించింది. వీళ్లు ట్రేడింగ్ సభ్యులు(టీఎం)గా రిజిస్టర్కావడంతో అధీకృత వ్యక్తులు(ఏపీ)గా వ్యవహరిస్తున్నట్లు పేర్కొంది. వెరసి చట్టవిరుద్ధమైన ఎలాంటి ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్లోనూ లావాదేవీలు చేపట్టవద్దంటూ ఇన్వెస్టర్లకు ఎన్ఎస్ఈ హెచ్చరికలు జారీ చేసింది. వీటికి ఇన్వెస్టర్లే బాధ్యత వహించడంతోపాటు.. నష్టాలను ఎదుర్కోవలసి ఉంటుందని తెలియజేసింది. ఇలాంటి లావాదేవీ లకు స్టాక్ ఎక్సే్ఛంజీల నుంచి ఎలాంటి అనుమతులు లభించవని స్పష్టం చేసింది.