బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఎదురుదెబ్బ
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఎదురుదెబ్బ తగిలింది. షేక్ హసీనా ఆస్తుల సీజ్కు ఢాకా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఆమె భారత్లో ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే. షేక్ హసీనాతో పాటు, ఆమె కుటుంబ సభ్యుల ఆస్తులను కూడా సీజ్ చేయాలని ఢాకా కోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో బ్యాంక్ అకౌంట్లను అధికారులు సీజ్ చేయనున్నారు.గత ఏడాది ఆగస్ట్లో బంగ్లాదేశ్లో అల్లర్లు చెలరేగగా, భారీ హింస చోటుచేసుకుంది. దీంతో ప్రధాని పదవికి రాజీనామా చేసిన ఆమె.. భారత్లో తలదాచుకుంటున్నారు. ఈ క్రమంలో హసీనాను బంగ్లాదేశ్కు రప్పించేందుకు ఆ దేశం చాలా ప్రయత్నాలు చేసింది. ఆమె పాస్ పోర్టును కూడా రద్దు చేసింది. హసీనాను తమ దేశానికి పంపించాలని భారత ప్రభుత్వానికి బంగ్లాదేశ్ కూడా లేఖ రాసింది. అయితే, తాజాగా ఢాకా కోర్టు హసీనా, ఆమె బంధువుల ఆస్తులు, బ్యాంక్ ఖాతాలను సీజ్ చేయాలని ఆదేశించింది.కాగా, భారత్లో తలదాచుకుంటున్న షేక్ హసీనాను బంగ్లాదేశ్కు రప్పించడమే తమ తొలి ప్రాధాన్యత అని ఆ దేశ ప్రభుత్వం ఇటీవల ఉద్ఘాటించింది. హసీనాను విచారించేందుకు ప్రయత్నాలను కొనసాగిస్తామని దేశ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ ప్రెస్ కార్యదర్శి షఫీకుల్ ఆలం తెలిపిన సంగతి తెలిసిందే. ‘‘హసీనా పార్టీ అవామీ లీగ్ భవితవ్యంపై నీడలు కమ్ముకున్నాయి...ఆ పార్టీ దేశ రాజకీయ ముఖచిత్రంలో ఉండాలా, వద్దా అనేది ప్రజలతో పాటు ఇతర పార్టీలు నిర్ణయిస్తాయి. హత్యలు, అదృశ్యాలు, నేరాలకు పాల్పడిన వారికి శిక్ష పడాల్సిందే’’ అంటూ ఆయన నొక్కి చెప్పారు. హసీనా ప్రభుత్వం మానవాళిపై నేరాలకు పాల్పడుతోందంటూ ఐరాస మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం ఇచ్చిన నివేదికను ఉదాహరించారు. ఈ నేపథ్యంలో హసీనాను అప్పగించే విషయమై భారత్పై ఒత్తిడి పెరిగిందన్నారు.