East Godavari District News
-
రామతత్త్వాన్ని అందరూ అర్థం చేసుకోవాలి
ఫ వాల్మీకి రామాయణాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి ఫ శేష ప్రశ్నల సమాధానాలకు ఉత్తరకాండ చదవాలి ఫ ‘సాక్షి’తో సామవేదం షణ్ముఖశర్మ ఫ నేటి నుంచి ఉత్తరకాండ ప్రవచన సప్తాహం సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ఆధునిక సమాజంలో.. ప్రాచీన మహర్షుల కోవకు చెందిన ప్రవచనకర్త ఆయన. ఆర్ష సాహిత్య వైభవంపై దేశ విదేశాల్లో ప్రవచనాలు, ఆధ్యాత్మిక గ్రంథ రచనలు, సాధకుల సందేహాలను నిత్యం నివృత్తి చేయడం, రాజమహేంద్రవరం శివారు కొంతమూరు గ్రామంలో శ్రీ వల్లభ గణపతి ఆలయ నిర్వహణ, భారతీయ ఋషిపీఠం ఆధ్యాత్మిక పత్రిక నిర్వహణ ఆయన దైనందిన జీవితంలో భాగం. ఆయనే సమన్వయ సరస్వతి, ప్రవచన విరించి సామవేదం షణ్ముఖశర్మ. 2023 డిసెంబర్ 13 నుంచి 2024 జనవరి 23 వరకూ రాజమహేంద్రవరంలోని హిందూ సమాజంలో వాల్మీకి రామాయణంపై వరుసగా 42 రోజుల పాటు ఆయన ప్రవచనాలు నిర్వహించారు. దీనికి కొనసాగింపుగా మంగళవారం నుంచి అదే వేదికపై రామాయణం ఉత్తరకాండపై వారం రోజుల పాటు ప్రవచనాలు కొనసాగించనున్నారు. ఈ సందర్భంగా తనను కలసిన సాక్షితో ఆయన ఉత్తరకాండలోని పలు విశేషాలను వివరించారు. రామతత్త్వాన్ని అందరూ అర్థం చేసుకోవాలని, దీనికి వాల్మీకి రామాయణాన్నే ప్రామాణికంగా తీసుకోవాలని చెప్పారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. రామకథ సమగ్ర స్వరూపం కోసం.. ఉత్తరకాండతో కలిపితేనే రామాయణ శ్లోకాలు 24 వేలు అవుతాయి. మొదటి ఆరు కాండలు రచించిన తరువాత కొద్ది విరామం అనంతరం మహర్షి వాల్మీకి ఉత్తరకాండ రచించారు. మహర్షి వాల్మీకి ప్రణీత రామాయణంలో బాలకాండ నుంచి యుద్ధకాండ వరకూ ఉన్న షట్కాండలలో తలెత్తే కొన్ని శేష ప్రశ్నలకు ఉత్తరకాండలో సమాధానాలు లభ్యమవుతాయి. (‘ఉత్తరం’ అనే పదానికి సమాధానం, జవాబు అనే అర్థాలున్నాయి.) ఉదాహరణకు సీతాదేవి జనకుని యజ్ఞంలో నాగలిచాలున జన్మించిందని, ఆమె అయోనిజ అని ఉత్తరకాండ మనకు వివరిస్తుంది. రావణుడు రంభను బలాత్కరించి, నలకూబరుని శాపానికి గురవడం, తనను చూసి పరిహసించిన రావణుడిని నందీశ్వరుడు శపించడం తదితర అంశాలను కూడా మనం ఉత్తరకాండలో చూడవచ్చు. బాలకాండలో రాముని జనన విశేషాలు చెప్పిన మహర్షి ఉత్తరకాండలో ఆయన అవతార పరిసమాప్తిని వివరించారు. బాలకాండ నుంచి యుద్ధకాండ వరకూ మాత్రమే రామాయణ పారాయణలు జరగడం పరిపాటి అయినా, ఉత్తరకాండను ప్రత్యేక గ్రంథంగా పారాయణ చేసే పూర్వ సంప్రదాయం ఉంది. సీతాపరిత్యాగం.. కాలవైపరీత్యం ● సీతాదేవి గురించి జనాపవాదాన్ని శ్రీరామునికి ఆయన గూఢచారి భద్రుడు వివరిస్తాడు. ‘ప్రభూ! సీతాదేవితో సుఖించడానికి రాముని మనస్సు ఎలా అంగీకరిస్తోంది? ఎంతో కాలము పరుల పంచన ఉన్న తన భార్యను శ్రీరాముడు ఎలా చేరదీశాడు? రేపు మనమూ మన భార్యల పట్ల ఇంతటి సహనం చూపాలా? (అస్మాకమపి దారేషు సహనీయం భవిష్యతి)’ – ఈ సన్నివేశం అయోధ్య కాండ 43వ సర్గలో కనపడుతుంది. ఒక రజకుని మాటను విని శ్రీరాముడు నిండు గర్భిణిని పరిత్యజించాడని వాల్మీకి మహర్షి చెప్పలేదు. అగ్నిపునీత అయిన ఆ తల్లిని అయోధ్యవాసులు నమ్మలేదా అనే ప్రశ్నకు సమాధానం మనం చెప్పుకోవాలి. శ్రీరాముడు పట్టాభిషిక్తుడయ్యేనాటికి, సీతాపరిత్యాగ సమయానికి చాలా విరామం ఉంది. కొన్ని తరాలు గడిచాయి. నాటి యువతరం నమ్మకపోయి ఉండవచ్చు. కాలం కొన్ని సమయాల్లో వింత పోకడలు పోతుంది. ఇది కాలవైపరీత్యం అని చెప్పుకోవాలి. ఇది అత్యంత బాధాకరం. ● ‘కూడళ్లయందు, అంగళ్లయందు, రాజమార్గములయందు, వనములలో, ఉపవనాల్లో సీతాదేవిని గురించి ప్రజలు ఇలా పెక్కువిధాలుగా, నోటికి వచ్చిన రీతిలో మాట్లాడుకుంటున్నారు’ అని భద్రుడు శ్రీరామునికి నివేదించాడు. రాజు ఆదర్శపాలకుడు కావాలి. రాజు ప్రవర్తన వివాదాలకు అతీతంగా ఉండాలి. లోకాపవాదును దూరం చేయడం కోసం సీతాదేవిని శ్రీరాముడు పరిత్యజించాడు. అందుకే వారి ప్రస్తావన లేదు శ్రీరాముని సోదరుల భార్యల గురించి ఉత్తరకాండలో సైతం ప్రస్తావించలేదు. ప్రధాన కథలో వారి ప్రాధాన్యం లేకపోవడమే దీనికి కారణం. సుమంత్రుడు భవిష్యత్తు ఎలా చెప్పగలిగాడు? ఒక్క సీతాదేవిని మాత్రమే కాదు.. భవిష్యత్తులో శ్రీరాముడు నిన్ను సైతం పరిత్యజిస్తాడని సుమంత్రుడు లక్ష్మణునితో అంటాడు. (ఉత్తరకాండ 50వ సర్గ). నీవు యాగం చేసి, పుత్ర సంతానం పొందుతావని కూడా దశరథునితో సుమంత్రుడు బాలకాండలో చెబుతాడు. భృగు మహర్షి శాపం వలన శ్రీరాముడు భార్యా వినియోగాన్ని అనుభవిస్తున్నాడని కూడా సుమంత్రుడు లక్ష్మణునికి చెబుతాడు. ఒక మహర్షి అనుగ్రహంతో సుమంత్రుడు భవిష్యద్దర్శనం చేయగలిగాడు. -
కాలువల మూసివేత సాధ్యమేనా?
డెల్టా ప్రధాన పంట కాలువలకు డిసెంబరు 7వ తేదీ నుంచి ఏప్రిల్ 14వ తేదీ వరకు నీటి విడుద ఇలా (టీఎంసీ)లలో...: తూర్పు డెల్టా : 34.293 మధ్య డెల్టా : 20.291 పశ్చిమ డెల్టా : 56.478 మొత్తం : 111.382 ● ఏప్రిల్ 15న మూసివేయడానికి సన్నాహాలు ● ఇప్పటికీ శివారులకు సాగు నీటి అవసరం ● మరో ఐదు రోజులు పెంచాలని కోరుతున్న వ్యవసాయశాఖ ● తాగునీటి ప్రాజెక్టుల కోసం కూడా పెంచాల్సిన గడువు ● రబీలో ఇప్పటి వరకు 111 టీఎంసీల వినియోగం ● అయినా శివారుల్లో కీలక సమయంలో సాగునీటి ఎద్దడి ● నీటి యాజమాన్యంలో అట్టర్ ఫ్లాప్ సాక్షి, అమలాపురం: గోదావరి డెల్టా పంట కాలువల మూసివేతకు సాగునీటి పారుదల శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15వ తేదీ అర్ధరాత్రి నుంచి మూడు ప్రధాన పంట కాలువలకు నీటి విడుదల నిలిపివేయాల్సి ఉంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద హెడ్ స్లూయిజ్ గేట్లు మూసివేసేందుకు అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారు. అయితే డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రబీకి మరో ఐదు రోజులు నీరందించాలని వ్యవసాయ శాఖ అధికారులు కోరుతుండడంతో ఈ నెల 20వ తేదీ వరకు గడువు పెంచే అవకాశముందని సాగునీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. దీనిపై మంగళవారం తుది నిర్ణయం తీసుకోనున్నారు. నీటి యాజమాన్యంలో సమన్వయలోపం గోదావరి మూడు డెల్టాల పరిధిలో సుమారు 8.86 లక్షల ఎకరాల్లో వరి, ఇతర వ్యవసాయ పంటలు సాగవుతున్నాయి. ఈ సీజన్లో సాగుకు, తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు కలిపి మొత్తం 90 టీఎంసీలు ఉంటే సరిపోతుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో తూర్పు, మధ్య డెల్టాలో 4.80 లక్షల ఎకరాలలో వరి ఆయకట్టు ఉంది. దీనిలో సుమారు 4.20 లక్షల ఎకరాల్లో రబీ వరి సాగు జరిగిందని అంచనా. పంట కాలువలు, చానల్స్ అధ్వానంగా ఉన్నాయి. ఈ ఏడాది రబీ సాగు ఆరంభంలో షార్ట్ క్లోజర్ పనులు చేస్తామని చెప్పారు కాని పూడిక తీత, గుర్రపుడెక్క తొలగింపు పనులు చేయలేదు. ఇది సాగునీటి సరఫరాకు ప్రధాన అవరోధంగా మారింది. దీనికితోడు నీటి యాజమాన్య విషయంలో అధికారుల మధ్య సమన్వయం కొరవడడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డెల్టాకు 111 టీఎంసీలు గోదావరి డెల్టాలో డిసెంబరు 7వ తేదీన మొదలైన రబీ షెడ్యూలులో ఏప్రిల్ 15 వరకు 111.355 టీఎంసీల నీటిని పంట కాలువలకు విడుదల చేశారు. దీనిలో తూర్పు డెల్టాకు 34.293, మధ్యడెల్టాకు 20.291, పశ్చిమ డెల్టాకు 56.478 టీఎంసీల చొప్పున అందించారు. రబీ సాగు, ఇతర అవసరాలకు వాస్తవంగా 90 టీఎంసీల అయితే పంటకు సరిపోతోంది. కాని అంత కన్నా అధికంగా నీరు ఇచ్చామని అధికారులు చెబుతున్నారు. అయినా డెల్టా శివారులు, మెరక ప్రాంతాల్లో ఫిబ్రవరి, మార్చి నెలల్లో తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొన్న విషయం తెలిసిందే. తూర్పు డెల్టా, పిఠాపురం బ్రాంచ్ కెనాల్, మధ్య డెల్టా అనే తేడా లేదు. తూర్పు గోదావరి, కాకినాడ, బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలలో ఇంచుమించు అన్ని మండలాల్లో ఏదో ఒక సందర్భంలో రైతులు నీరందక ఇబ్బంది పడ్డారు. తూర్పు డెల్టాలో కరప, కాజులూరు, తాళ్లరేవు, కె.గంగవరం, పీబీసీలో కొత్తపల్లి, మధ్య డెల్టా పరిధిలో ఐ.పోలవరం, ముమ్మిడివరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం, మలికిపురం మండలాల్లో చేలు నెరలు తీసిన విషయం తెలిసిందే. వంట కాలువలకు విడుదల చేసిన నీరుతోపాటు డెల్టాలో పలుచోట్ల వ్యవసాయ విద్యుత్ మోటార్లతో చేలకు పెద్ద ఎత్తున నీరందించారు. ఇలా కనీసం ఒకటిన్నర టీఎంసీ, మురుగునీటి కాలువలపై క్రాస్బాండ్లు వేయడం ద్వారా కూడా నీటిని చేలకు మళ్లించడం ద్వారా మరో ఐదు టీఎంసీల వరకు నీటిని చేలకు తరలించామని అధికారులు చెబుతున్నారు. ఇలా చూస్తే మొత్తం 117.50 టీఎంసీల నీటిని రబీ కాలంలో అందించినట్టు. అయినప్పటికీ తూర్పు, మధ్య డెల్టాలోని ఏకంగా పదకొండు శివారు మండలాల్లో నీటి ఎద్దడి ఏర్పడిందంటే అది ముమ్మాటికీ నీటిపారుదల శాఖ అధికారులు నిర్లక్ష్యమేనని రైతులు చెబుతున్నారు. నీటి ఎద్దడి ప్రభావంతో రైతులు పలు రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నారు. పంట బోదెలు, చానల్స్ నుంచి, డ్రెయిన్ల నుంచి మోటార్లతో నీరు తోడకం వల్ల ఎకరాకు అదనంగా రూ.మూడు వేల నుంచి రూ.ఐదు వేల వరకు పెట్టుబడి అయ్యింది. ఎద్దడికి గురైన ప్రాంతంలో దిగుబడి పడిపోవడం కూడా రైతులకు లాభాలు మాట అటుంచి పెట్టుబడులు వస్తే గొప్ప అన్నట్టుగా మారింది. నేడు నిర్ణయం డెల్టాలో రబీ సాగుకు మరో ఐదు రోజుల పాటు గడువు పెంచే అవకాశముంది. దీనిపై మంగళవారం ధవళేశ్వరంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈనెల 15వ తేదీ అంటే మంగళవారం అర్ధరాత్రి తరువాత బ్యారేజీ గేట్లు వేసేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే కోనసీమ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వి.బోసుబాబు అభ్యర్థించడంతో ఇరిగేషన్ సర్కిల్ సూపరింటెండెంట్ గోపినాఽథ్, గోదావరి డెల్టా సిస్టమ్ చీఫ్ ఇంజినీరు (సీఈ) దీనిపై మంగళవారం తుది నిర్ణ యం తీసుకోనున్నారు. వ్యవసాయశాఖతోపాటు తాగునీటి చెరువులు పూర్తిస్థాయిలో నింపాల్సి ఉన్నందున ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కూడా గడువు పెంచాల్సిందిగా కోరుతున్నారు. ఈ కారణంగా ఈ నెల 20వ తేదీ వరకు కాలువల మూసివేత గడువు పెంచే అవకాశముందని సమాచారం. -
మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీగా సత్యనారాయణ
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీగా కేవీ సత్యనారాయణ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 1991 బ్యాచ్కు చెందిన ఆయన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో సీఐగా, కాకినాడ ట్రాఫిక్ డీఎస్పీగా, రాజమహేంద్రవరం స్పెషల్ బ్రాంచి, ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్, పరవాడ డీఎస్పీగా విధులు నిర్వహించారు. రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో పని చేస్తూండగా సాధారణ బదిలీల్లో భాగంగా ఆయనను జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీగా నియమించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ, శక్తి యాప్ గురించి జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ ఆధ్వర్యాన జిల్లావ్యాప్తంగా విస్తృత అవగాహన కల్పిస్తానని చెప్పారు. మహిళల మొబైల్ ఫోన్లలో ఈ యాప్ ఇన్స్టాల్ చేయించి, తద్వారా మహిళలు, బాలికలపై జరిగే నేరాలను అరికడతామని అన్నారు. మహిళల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంబేడ్కర్ ఆశయాలు స్ఫూర్తిదాయకం రాజమహేంద్రవరం రూరల్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని చిత్రపటానికి బొమ్మూరులోని రూరల్ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో వేణు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేడ్కర్ విశేషంగా కృషి చేశారన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గత ఐదేళ్ల పాలనను అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా అందించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ నక్కా రాజబాబు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల వీర్రాజు (బాబు), మాజీ ఎంపీపీ రేలంగి సత్యనారాయణ, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు చీకురుమిల్లి చిన్న, మహిళా అధ్యక్షురాలు అంగాడి సత్యప్రియ తదితరులు పాల్గొన్నారు. అంబేడ్కర్కు ఘన నివాళిసీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు ఘనంగా నివాళి అర్పించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో అంబేడ్కర్ చిత్రపటానికి ఆయన పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆ మహనీయుని సేవల ను స్మరించుకున్నారు. వివిధ శాఖలు, కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చదువుతోనే ఉన్నత స్థాయికి.. సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల విద్యార్థులు ఇంటర్మీడియెట్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి, ఆదర్శంగా నిలిచారని జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా గోకవరం బస్టాండ్ సమీపాన సోమవారం నిర్వహించిన వేడుకల్లో.. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినులను అభినందించి, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాజమహేంద్రవరంలోని సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహం–2కు చెందిన గోలి మౌనిక ఫస్టియర్లో 423/500, సెకండియర్లో మద్దల సుశీల 910/1000 చొప్పున అత్యధిక మార్కు లు సాధించారని తెలిపారు. వారిని అభినందించారు. వచ్చే విద్యా సంవత్సరంలో మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేస్తామని జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎంఎస్ శోభారాణి అన్నారు. అదనపు ఎస్పీ మురళీకృష్ణ, ఆర్డీఓ ఆర్.కృష్ణనాయక్ పాల్గొన్నారు. అనంతరం దాతల సహకారంతో పలువురికి చీరలు పంపిణీ చేశారు. -
ఔషధ గుణం.. ఆరోగ్య ప్రదం
ఆలమూరు: వేసవి తాపాన్ని అధిగమించేందుకు, శరీరంలో సంభవించే అనేక రుగ్మతలను నివారించి ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చేందుకు ప్రకృతి ప్రసాదించిన తాటిముంజలు ఐస్ యాపిల్గా విశేష ప్రాచుర్యం పొందాయి. ఈ తాటిముంజల సీజన్ ఇప్పుడే ప్రారంభం కావడంతో, వీటికి విపరీతమైన డిమాండు ఏర్పడింది. తాటికాయలు ముంజల దశలో జెల్లీ మాదిరిగా, పట్టుకుంటే జారిపోయేంత మృదువుగా ఉంటాయి. మరో మూడు నెలల్లో తాటిముంజలు తాటిపండ్లుగా మారడంతో పాటు, ఆరోగ్యకరమైన తేగలనూ ఇస్తాయి. ఈ తాటిముంజలు శరీరంలోని చక్కెర, ఖనిజాల ప్రమాణాలను సమతుల్యం చేసే లక్షణం కలిగి ఉన్నందున వీటికి విపరీతమైన డిమాండు ఉంటుంది. కాలక్రమంలో.. గ్రామీణ ప్రాంతాల్లో తాటి చెట్లు అధికంగా ఉండేవి. తాటిముంజల లభ్యత ఎక్కువగా ఉన్నా.. చెట్లు ఎక్కి ముంజకాయలు దింపే కార్మికుల కొరత ఏర్పడడంతో వీటి లభ్యత నానాటికీ తగ్గిపోతోంది. ఎలుకల బెడద కారణంగా పొలాల్లో, రియల్ ఎస్టేట్ కారణంగా మారుమూల గ్రామాల్లో సైతం తాటిచెట్లను నరికేస్తుండటంతో భవిష్యత్తులో ఇవి కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందన్న ఆందోళన ఉంది. ఆరోగ్య ప్రదాయినిగా.. ప్రకృతిలో విరివిగా లభ్యమయ్యే ఈ తాటిముంజలు కల్తీ లేని, స్వచ్ఛమైనవి కావడంతో ఆరోగ్య ప్రదాయినిగా భావిస్తుంటారు. జిల్లాలో తాటిముంజలు సేకరించే వారు కరవయ్యారు. దీంతో మైదాన ప్రాంతాల్లో ఉన్న డిమాండును దృష్టిలో ఉంచుకుని కొందరు మెట్ట, చాగల్నాడు ప్రాంతాలకు చెందిన రైతు కూలీలు తాటిముంజలను పట్టణ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో తాటిముంజల సీజన్ ప్రారంభమైంది. తాటిముంజుల పరిమాణాన్ని బట్టి డజను రూ.80 నుంచి రూ.120 వరకూ విక్రయిస్తున్నారు. ధర ఎక్కువగా ఉన్నా తాటిముంజల ప్రియులు దీనిని లెక్కచేయడం లేదు. లేలేతగా ఉండే తాటిముంజలు అద్భుత రుచితో నోరూరిస్తున్నాయి. ఆరోగ్య రక్షణకు దోహదం వేసవి నుంచి వర్షాకాలం ప్రారంభం వరకూ లభ్యమయ్యే తాటిముంజలను తినడం వల్ల సంపూర్ణ ఆరోగ్య రక్షణ లభిస్తుంది. పోషకాలు అధికంగా ఉండటంతో పాటు, వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. సీజన్ సమయంలో ప్రతి ఒక్కరూ భుజించాల్సిన అవసరం ఉంది. – ఏవీవీ రాజా అక్కుల, హెల్త్ ఎడ్యుకేటర్, పెదపళ్ల, ఆలమూరు మండలం చక్కని ఆరోగ్యం లభిస్తుంది తాటిముంజలు తింటే చక్కని ఆరోగ్యం లభిస్తుంది. ఐస్ యాపిల్గా పిలిచే తాటిముంజలను ఏడాదికి ఒకసారైనా తినాలని కోరిక ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో అంతంతమాత్రంగానే లభ్యమవుతుండటం వల్ల తాటిముంజలను కొనుగోలు చేయకతప్పడం లేదు, – ఎ.రామసీత, గృహిణి, ఆలమూరు ప్రయోజనాలివే.. ● తాటిముంజల్లో విటమిన్లు, ఫాస్పరస్, థయామిన్, బీ–కాంప్లెక్స్, కాల్షియం, పొటాషియంతో పాటు, సోలెబుల్ ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ● వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల డీహైడ్రేషన్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. వేసవితాపం, వడదెబ్బ నుంచి రక్షణ కల్పిస్తుంది. వికారం, వాంతులను నివారిస్తుంది. ● తాటిముంజలను తినడం వల్ల శరీరంలో పేరుకున్న హానికర వ్యర్థ పదార్థాలను బయటకు పంపడంతో పాటు, రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ● వేసవిలో ఏటా సీజన్లో క్రమం తప్పకుండా తాటిముంజలను తినడం ద్వారా చెడు కొలస్ట్రాల్ను తగ్గించుకుని, మంచి కొలస్ట్రాల్ను వృద్ధి చేసుకోవచ్చు. లివర్ను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ● వీటిలో తక్కువ మొత్తంలో క్యాలరీలు, ఎక్కువ మొత్తంలో పోషకాలుండటం వల్ల అలసట, నిర్జలీకరణం నుంచి ఉపశమనం కలిగించి, శరీర బరువు పెరగకుండా చేస్తుంది. ● వీటిలో ఉండే పోషకాలు జీర్ణ సంబంధ సమస్యలను తగ్గించి, జీర్ణ ప్రక్రియను మెరుగు పరుస్తాయి. ● ఆహారం సక్రమంగా జీర్ణమై గ్యాస్, ఎసిడిటీ, ఉదర సంబంధ సమస్యల నివారణకు దోహదపడుతుంది. ● మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలను బాగా తగ్గిస్తుంది. వేసవిలో వచ్చే చికెన్ ఫాక్స్ని నివారించి, శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. ● తాటిముంజల్ని గుజ్జుగా చేసి ముఖానికి పూతలా వేస్తే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. ● చర్మానికి కావాల్సినంత తేమను అందించి చెమటకాయల్ని నివారిస్తుంది. ఎండ వేడిమికి ముఖంపై ఏర్పడే మచ్చలను తగ్గిస్తుంది. తాటిముంజలతో శరీరానికి విటమిన్లు పుష్కలం ప్రస్తుత సీజన్లో విపరీతమైన డిమాండ్ ఐస్ యాపిల్గా ప్రాచుర్యం -
వివాహిత అదృశ్యంపై కేసు నమోదు
కొవ్వూరు: కాకినాడ జిల్లా పెద్దాపురంలో శంకరయ్యపేటకి చెందిన వీరవాసరపు ఏసురత్నం అనే వివాహిత 14వ తేదీ తెల్లవారుజాము మూడు గంటల నుంచి కనిపించడం లేదని అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ పి.విశ్వం తెలిపారు. కొవ్వూరులో ఉంటున్న ఆమె అత్త వారి ఇంటికి వేసవి సెలవుల నిమిత్తం వచ్చినట్లు ఆమె తల్లి ఏలేశ్వరపు దుర్గ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లి మరలా తిరిగి రాలేదని పేర్కొన్నారు. ఆచూకీ కోసం పలు చోట్ల వెతికినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. వివరాలు తెలిస్తే 94407 96622 నంబర్కు తెలియజేయాలని ఆయన సూచించారు. కొబ్బరితోటలో పిడుగు పడి మంటలు సఖినేటిపల్లి: మండల పరిధిలోని గొంది గ్రామంలో ఆదివారం రాత్రి ఉరుములు, మెరుపులతో భారీ శబ్ధంతో పడిన పిడుగుపాటుకు ఒక రైతు కొబ్బరి తోటలో మంటలు ఎగిసి పడ్డాయి. మంటలను స్థానికులు నీళ్లతో ఆర్పివేశారు. పిడుగుపాటుకు చెట్లకు నష్టం వాటిల్లింది. -
రాష్ట్రానికి 160 అగ్నిమాపక వాహనాలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 160 అగ్నిమాపక వాహనాలను మంజూరు చేసిందని రాష్ట్ర అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ (డీజీ) మాదిరెడ్డి ప్రతాప్ తెలిపారు. రాజమహేంద్రవరం ఇన్నీసుపేటలోని అగ్నిమాపక కేంద్రం వద్ద అగ్నిమాపక వారోత్సవాలను సోమవారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. తొలుత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ ఏడాది అగ్నిప్రమాదాల్లో ఇప్పటి వరకూ రూ.9.28 కోట్ల ఆస్తి నష్టం జరిగిందని, రూ.38.28 కోట్ల ఆస్తులను కాపాడామని చెప్పారు. అగ్ని ప్రమాదాల్లో చిక్కుకున్న ఏడుగురిని రక్షించామన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్, దేవరపల్లిల్లో అగ్నిమాపక కేంద్రాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాంబే డాక్ యార్డులో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన అగ్నిమాపక బ్రిగేడియర్స్ సంస్మరణార్థం ఏటా ఏప్రిల్ 14 నుంచి అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించుకుంటున్నామని చెప్పారు. వంటింట్లో గాలి, వెలుతురు ఉండేటట్లు చూసుకోవాలని, అగ్ని ప్రమాదాన్ని గమనించిన వెంటనే ప్రతి ఒక్కరూ ఆయా ప్రదేశాల నుంచి ఆరుబయట సురక్షిత ప్రదేశా లకు వెళ్లాలని సూచించారు. విద్యుత్ వలన అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ తగు నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. 25 అగ్నిమాపక కేంద్రాల నిర్మాణానికి చర్యలు ప్రాంతీయ అగ్నిమాపక అధికారి ఇ.స్వామి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రూ.250 కోట్లు మంజూరు చేసిందని, మొదటి విడతగా రూ.153 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ఈ నిధులతో 25 అగ్నిమాపక కేంద్రాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. పాఠశాలలు, ఆసుపత్రులు, వాణిజ్య సముదాయాల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా సరిపడా నీటిని, ఫిక్స్డ్ ఫైర్ ఫైటింగ్ ఇన్స్ట్టలేషన్ను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. గోదాములు, గ్రామీణ ప్రాంతాలు, కర్మాగారాల్లో అగ్నిప్రమాదాల నివారణకు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. అగ్ని నిరోధక స్వభావం గల వస్తువులతోనే పందిళ్లు నిర్మించుకోవాలన్నారు. జిల్లా విపత్తు స్పందన, అగ్నిమాపక అధికారి ఎం.మార్టిన్ లూథర్ కింగ్, జిల్లా సహాయ అగ్నిమాపక అధికారి పేరూరి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
సరదా తెచ్చిన తంటా
కొవ్వూరు: విజ్జేశ్వరం లాకులకు దిగువన చిగుర్లంక వద్ద సరదాగా స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకుల్లో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. మరొకరిని స్థానికులు కాపాడారు. సోమవారం సాయంత్రం నిడదవోలు చర్చిపేటకి చెందిన మర్తి ప్రకాష్కుమార్ (15), రాజమహేంద్రవరానికి చెందిన గంధం హర్ష(18), మరో యువకుడు స్నానం చేసేందుకు చిగుర్లంక వద్ద గోదావరి పాయ వద్దకు వచ్చారు. స్నానాలు ఆచరిస్తున్న ప్రదేశంలో లోతు తక్కువగా ఉందని భావించి నదిలోకి దిగారు. వారు దిగిన ప్రదేశానికి కొద్ది దూరంలోనే లోతు ఎక్కువగా ఉండడంతో నీట మునిగారు. ఒకరిని ఒకరు కాపాడుకునే ప్రయత్నంలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. అక్కడే సమీపంలో ఉన్న ఆరుగురు యువకులు గుర్తించి కాపాడే ప్రయత్నం చేశారు. అప్పటికే ప్రకాష్కుమార్, హర్ష నదిలో గల్లంతయ్యారు. మరో యువకుడిని కాపాడి ఒడ్డుకు చేర్చారు. సమాచారం తెలుసుకున్న రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆర్డీవో రాణి సుస్మిత, డీఎస్పీ జి.దేవకుమార్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. రూరల్ ఎస్సై కె.శ్రీహరిరావు, తహసీల్దార్ ఎం.దుర్గాప్రసాద్ జాలర్లు, గజ ఈతగాళ్ల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. ఇదే ప్రదేశంలో రెండేళ్ల క్రితం స్నానాలకు దిగి పురుషోత్తపల్లి గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్లు మృత్యువాత పడ్డారు. హర్ష తండ్రి మూడు నెలల క్రితమే మృతి గోదావరిలో గల్లంతైన హర్ష ప్రస్తుతం వైజాగ్లో ఇంటర్ మీడియట్ చదువుతున్నాడు. తండ్రి మూడు నెలల క్రితమే మృతి చెందారు. తల్లి ౖశైలజ రాజమహేంద్రవరంలో ఓ ప్రయివేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్నారు. హర్ష పెద్ద సోదరి అబిల పోలియో వ్యాధి బారిన పడింది. రెండో సోదరి హేనాకి వివాహం చేశారు. అంబేద్కర్ జయంతి, వేసవి సెలవులను పురస్కరించుకుని నిడదవోలులో ఉంటున్న అక్క హేనా ఇంటికి వచ్చారు. గతంలో హర్ష కుటుంబం నిడదవోలులోనే ఉండేవారు. సోమవారం మధ్యాహ్నం వరకు అంబేడ్కర్ జయంతి వేడుకలో పాల్గొని భోజనం చేసి వచ్చాడని హర్ష చిన్నాన్న మల్లవరపు వినోద్ చెబుతున్నారు. హర్ష తండ్రి మృతి చెంది మూడు నెలలు అయ్యింది. ఇంతలోనే సెలవులకని వచ్చి హర్ష గల్లంతు కావడం జీర్ణించుకోలేక పోతున్నామని అన్నారు. బయటికి వెళ్లి గంటలో వచ్చేస్తానని చెప్పాడని, ఇంతలో ఇలాంటి వార్త వినాల్సి వస్తుందనుకోలేదని కన్నీటి పర్యంతం అయ్యారు. పదో తరగతి పరీక్ష రాశాడు మృతుడు మర్తి ప్రకాష్కుమార్ పదో తరగతి పూర్తి చేశారు. తండ్రి కిషోర్ ప్రయివేటు అంబులెన్స్ డ్రైవర్గా పని చేస్తున్నారు. తల్లి కువైట్లో ఉంటున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రకాష్కుమార్కి సోదరుడు ఉన్నారు. ప్రస్తుతం ఇంటర్ మీడియట్ చదువుతున్నారు. కుమారుడు గల్లంతైన విషయం విదేశాల్లో ఉన్న తల్లి తెలుసుకుని తల్లడిల్లిపోతోంది. ప్రమాదంపై మంత్రి దిగ్భ్రాంతి గోదావరి నదిలో స్నానానికి దిగి యువకులు గల్లంతు కావడం బాధాకరం అని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గజ ఈతగాళ్లతో పాటు కాకినాడ నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని రప్పిస్తున్నామన్నారు. మత్య్సశాఖ, అగ్నిమాపక సిబ్బంది గజ ఈతగాళ్ల సాయంతో నదిలో యువకుల ఆచూకీ కోసం గాలిస్తున్నారని చెప్పారు. ఇటీవల తాడిపూడిలో ఐదుగురు మృతి చెందడం,ఇప్పుడు ఈ ప్రమాదం బాధాకరం అన్నారు. -
రత్నగిరిపై పెళ్లి సందడి
● నవ దంపతులతో ఆలయం కిటకిట ● స్వామివారి దర్శనానికి 40 వేల మంది ● రెండు వేల వ్రతాల నిర్వహణ అన్నవరం: రత్నగిరి సత్యదేవుని ఆలయం ఆదివారం వేలాది భక్తులతో కిటకిటలాడింది. శనివారం రాత్రి, ఆదివారం తెల్లవారు జామున రత్నగిరిపైన, శుక్రవారం రాత్రి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. దీంతో నవ దంపతులు, బంధు మిత్రులతో స్వామివారి దర్శనానికి బారులు తీరారు. సుమారు 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించగా, రెండు వేల వ్రతాలు నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. స్వామివారి దర్శనానికి గంట, ప్రదక్షిణ దర్శనానికి అరగంట పట్టింది. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షలు ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. స్వామివారి నిత్యాన్నదాన పథకంలో ఐదు వేల మంది భక్తులకు ఉచిత భోజన సౌకర్యం కల్పించారు. ఆదివారం రాత్రి, సోమవారం పెద్ద సంఖ్యలో వివాహాలు జరగనుండడంతో రామాలయం వద్ద వార్షిక కల్యాణ మండపం ఎదుట ఉన్న విశ్రాంతి మండపంలో మండపాలు ఏర్పాటు చేశారు. ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్షరాయవరం: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో 2025–26 విద్యా సంవత్సరంలో ఐదో తరగతి, జూనియర్ ఇంటర్లో ప్రవేశాలకు ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా నిర్వహించారు. ఆరు సెంటర్లలో నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 533 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 270 మంది హాజరయ్యారు. కాకినాడ జిల్లా పరిధిలో తొమ్మిది సెంటర్లలో నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 1,143 మందికి 786 మంది, తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని ఐదు సెంటర్లలో ప్రవేశ పరీక్ష నిర్వహించగా, 809 మందికి 605 మంది హాజరయ్యారు. జూనియర్ ఇంటర్లో ప్రవేశాలకు కోనసీమ జిల్లాలో ఆరు సెంటర్లలో నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 1,067 మందికి 733 మంది హాజరు కాగా, కాకినాడ జిల్లాలో 1,667 మందికి 1,179 మంది, తూర్పుగోదావరి జిల్లాలో 1,282 మందికి 954 మంది హాజరైనట్టు ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఎస్.శైలజ తెలిపారు. -
భూసారానికి నవధాన్య సాగు
● పీఎండీఎస్తో వేరు వ్యవస్థకు భద్రత ● ఈ పద్ధతిపై విస్తృతంగా అవగాహన ● సేద్యానికి విత్తన కిట్లు సిద్ధం కొత్తపేట: ప్రధాన పంటకు ముందు ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ (రుతుపవనాలకు ముందు వేసే పంట – నవధాన్యాల సాగు) సాగు చేపట్టడం ద్వారా సేంద్రియ కర్బనాన్ని పెంచుతుందని, ఈ సాగు పట్ల రైతులు అవగాహన కలిగి ఉండాలని వ్యవసా యశాఖ అధికారులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ విధానంలో ప్రయోగాత్మకంగా నవధాన్యాల రకాల విత్తనాలను కలిపి వెదజల్లే పద్ధతి గురించి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ సాగుపై వ్యవసాయ శాఖ కొత్తపేట సబ్ డివిజన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎం.వెంకట రామారవు సాక్షికి వివరించారు. ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ (పీఎండీఎస్) సాగు అనేది పంట కాలానికి సంబంధం లేకుండా ప్రధాన పంటకు ముందు 20 నుంచి 30 రకాల వివిధ పంట విత్తనాలను కలిపి వెదజల్లి, సాగుభూమిని సజీవ వేరు వ్యవస్థతో ఎల్లప్పుడూ కప్పబడి ఉండే ప్రక్రియ. ఈ ప్రక్రియ 365 రోజులు భూమి పంటలతో కప్పబడి ఉండాలనే వ్యూహంతో ముఖ్య భూమిక పోషిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఈ విధానాన్ని నవధాన్యాల సాగు పద్ధతిగా పిలుస్తారు. మామూలు పద్ధతిలో చేసే వ్యవసాయ క్రమంలో దుక్కి దున్ని, ఎరువులు వాడి, పంటల మధ్య బీడు పెట్టే ప్రక్రియలో భూమిలో సేంద్రియ కర్బన శాతం తగ్గుముఖం పడుతుంది. ప్రకృతి వ్యవసాయ పంటల సాగు సేంద్రియ కర్బనాన్ని పెంచుతుంది. పంటలు కిరణ జన్య సంయోగ క్రియ నుంచి ఆహారాన్ని తయారు చేస్తాయి. అలా తయారైన ఆహారంలో 30 శాతం వరకు వేర్ల ద్వారా స్రవించబడి, నేల పైపొరల మీద ఆధార పడ్డ అసంఖ్యాక జీవరాశుల సంఖ్యను పెంపొందిస్తూ మొక్కలు, వాటి పోషకాల సరఫరా చేయడానికి సహాయపడుతుంది. పంట కోసిన అనంతరం తదుపరి పంట విత్తు వరకు నేలలోకి కార్బన్ విడుదల చేయడం ఆగిపోతుంది. కాబట్టి ఏడాది పొడవునా నిరంతరాయంగా పంటలను పండించడం వల్ల సేంద్రియ కర్బన శాతం నేలలోకి చేరుతుంది. ప్రతి సీజన్లో పంటల వైవిధ్యాన్ని మెరుగు పరచడానికి, బీడుగా ఉండే భూములను పంటలతో సాధారణంగా వేసవి నెలలలో పొలాలు బీడుగా ఉంటాయి కాబట్టి పీఎండీఎస్ లోని పలు పంటల ద్వారా ఆదాయం, భూమిలో పోషకాల పెంపుదలతో పాటు పశువులకు నాణ్యమైన పచ్చిమేతగా పొందేందుకు కూడా అవకాశం కల్పిస్తుంది. ప్రస్తుతం రబీ అనంతరం ఖరీఫ్కు ముందు అంటే రుతుపవనాలకు ముందు బీడుగా ఉండే నెలలలో పంటలు సాగు చేయడానికి డ్రై సోయింగ్ పద్ధతి అనువైనది. ఈ విధానంలో పంటల విత్తనాలు ● నవధాన్యాల సాగులో 20 నుంచి 30 రకాల పంటలు సాగు చేయవచ్చు. కనీసం 20 రకాలు తీసుకున్నారు. అవి ఇలా.. ● పచ్చిరొట్ట పైర్లు – జనుము, జీలుగ, పిల్లి పెసర ● పప్పు ధాన్యం పైర్లు – మినుము, పెసర, ఉలవ, బొబ్బర్లు ● నూనె గింజల పైర్లు – వేరుశెనగ, నువ్వులు, ఆముదం ● చిరు ధాన్యం పైర్లు – జొన్న, కొర్ర, రాగి, ● ఆకు కూరలు – గోంగూర, పాలకూర, తోటకూర, చుక్కకూర, ● తీగ జాతి పంటలు – బీర, ఆనప, దోస తదితర పంటలు ● ఈ విత్తనాల కిట్లను వ్యవసాయశాఖ ద్వారా రైతులకు అందజేస్తున్నారు. ● సుగంధ ద్రవ్యాలు – ధనియాలు, ఆవాలు, సబ్ డివిజన్ వారీగా అవగాహన జిల్లా వ్యవసాయ అధికారి పర్యవేక్షణలో వ్యవసాయ సబ్ డివిజన్ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీఏ) ఆధ్వర్యంలో మండలాలు, గ్రామాల వారీగా ఈ నవధాన్యాల సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ విధానంలో అమలు చేస్తున్న ఈ పథకానికి సంబందించి ప్రత్యేకంగా ప్రతి సబ్ డివిజన్కు ఒక మాస్టర్ ట్రైనర్ను నియమించారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 25 వేల మంది రైతులు 22 వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ విధానం అవలంబిస్తుండగా సుమారు 22 వేలు కిట్లు పంపిణీ లక్ష్యంగా నిర్ణయించారు. ప్రస్తుతం 98 గ్రామాల్లో ఈ కార్యక్రమం ప్రారంభించారు. 9,352 కిట్లు పంపిణీ చేస్తున్నారు. దశల వారీగా గ్రామాలను, విస్తీర్ణాన్ని, కిట్ల పంపిణీని విస్తరిస్తారు. ప్రతి సబ్ డివిజన్ పరిధిలో ఒక ప్రణాళికను రూపొందించారు. ఉదాహరణకు కొత్తపేట వ్యవసాయ సబ్ డివిజన్లో 2227.97 ఎకరాలు విస్తీర్ణం కాగా 2489 మంది రైతులు ఉన్నారు. ప్రస్తుతం 1,336 కిట్ల పంపిణీ చేపట్టారు. సాగుతో భూసారం వృద్ధి రైతులు నవధాన్యాల సాగు చేపట్టాలి. తద్వారా భూసారాన్ని పెంచుకోవాలి. ఆరోగ్యకర వ్యవసాయ ఉత్పత్తులను పండించాలి. 20 రకాల విత్తనాల 12 కేజీల కిట్ ఒక ఎకరానికి సరిపోతుంది. ఈ కిట్ ధర రూ 800. రబీ (దాళ్వా) పంట కోతల ముందు చల్లుకోవాలి. బోర్లు సౌకర్యం ఉన్నచోట వేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి. – ఎం వెంకట రామారావు, ఏడీఏ, కొత్తపేట ఈ సాగు వల్ల కలిగే ప్రయోజనాలు పీఎండీఎస్ పద్ధతిలో 365 రోజులు భూమి కప్పబడి ఉంచే నిరంతర సాగు ప్రక్రియకు శ్రీకారం చుడుతుంది. వివిధ పంటల వేర్లు భూమిలో వైవిధ్య రకాల సూక్ష్మజీవులకు ఆశ్రయం కల్పించి పంటలకు ఉపయోగపడే వీటి సంతతిని అభివృద్ధి చేస్తాయి. తద్వారా ప్రధాన పంటకు కావల్సిన స్థూల, సూక్ష్మ పోషకాలను అందుబాటులోకి తీసు కువచ్చి మొక్కల వేరు వ్యవస్థ గ్రహించేటట్టు చేస్తాయి. నవధాన్య పంటలు పశువులకు పోషక విలువలతో కూడిన పచ్చిమేతగా ఉపయోగపడుతుంది. నేల గుల్లబారి వానపాములు వృద్ధి చెందుతాయి. నేలలో నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. పలు పంటల సాగు వల్ల అదనపు ఆదాయం కలుగుతుంది. నేల కోతకు గురికాదు. జీవ వైవిధ్యం, నేలలో సేంద్రియ కర్బన శాతం పెరుగుతుంది. ప్రధాన పంటలో రసాయనిక ఎరువులు వినియోగం తగ్గుతుంది. ప్రధాన పంటలో కలుపు తగ్గుతుంది. పంటలో చీడపీడలు, తెగుళ్లను తట్టుకునే సామర్థ్యం పెరుగుతుంది. ప్రధాన పంట వాతావరణ వైపరీత్యాలను తట్టుకునే సామర్థ్యం పెరుగుతుంది. -
బాకీ అడిగాడని కడతేర్చారు
● దొమ్మేరు హత్య కేసులో వీడిన మిస్టరీ ● ముగ్గురు నిందితుల అరెస్ట్ ● రెండు మోటారు సైకిళ్లు, నాలుగు సెల్ఫోన్ల స్వాధీనం ● 36.7 గ్రాముల బంగారు ఆభరణాలు రికవరీ ● నిందితుడు పెద్దేవం సచివాలయంలో సర్వేయర్ కొవ్వూరు: గత నెల 26వ తేదీ రాత్రి జరిగిన హత్య కేసును పట్టణ పోలీసులు ఛేదించారు. నందమూరు – దొమ్మేరు పుంతరోడ్డులోని పోలంలో పెండ్యాల ప్రభాకరరావు (46) హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో ముగ్గురు నిందితులను ఆదివారం పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ జి.దేవకుమార్ హత్య కేసు వివరాలను వెల్లడించారు. పోలవరం మండలం పాత పట్టిసీమకి చెందిన చుక్కా రామ శ్రీనివాస్ ఈ హత్య చేసినట్లు ధ్రువీకరించారు. ప్రధాన నిందితుడు తాళ్లపూ డి మండలం పెద్దేవం సచివాలయంలో సర్వేయర్గా పనిచేస్తున్నారు. గోపాలపురం మండలం దొండపూడికి చెందిన అంకోలు జగదీష్ దుర్గాప్రసాద్, పోలవరానికి చెందిన నోముల ప్రవీణ్ కుమార్ నిందితుడికి సహకరించినట్లు విచారణలో వెల్లడైంది. ఈ మేరకు ముగ్గురిని 12వ తేదీ మధ్యాహ్నం ప్రధాన నిందితుడు శ్రీనివాస్ ఇంటి వద్ద పట్టణ సీఐ పి.విశ్వం అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. వివరాల్లోకి వెళితే మృతుడు ప్రభాకరావు వింటేజ్ కంపెనీ ఉత్పత్తుల వ్యాపారం చేస్తూ ఏజెంట్ల ద్వారా విక్రయిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే చుక్కా రామ శ్రీనివాస్తో పరిచయం ఏర్పడింది. గత ఏడాది డిసెంబర్లో ప్రభాకరావు వద్ద శ్రీనివాస్ రూ.2.4 లక్షలు అప్పు తీసుకున్నారు. బాకీ తీర్చమని ప్రభాకరరావు ఒత్తిడి తేవడమే కాకుండా శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు కూడా చెప్పాడు. విలాసాలు, క్రికెట్ బెట్టింగ్లకు అలవాటు పడి నిందుతుడు చాలా అప్పులు చేశాడు. ప్రభాకరరావును చంపేస్తే తన బాకీ తీర్చనవసరం లేదని భావించి స్నేహితులైన జగదీష్, ప్రవీణ్కుమార్లకు తెలిపాడు. మార్చి 26వ తేదీ రాత్రి జగదీష్ దుర్గాప్రసాద్ను వెంటబెట్టుకుని కొవ్వూరు పట్టణ శివారున హైవేలో అండర్ పాసేజ్ వద్దకి చేరుకున్నారు. ప్రభాకరరావుకు శ్రీనివాస్ ఫోన్ చేసి రమ్మని పిలిచాడు. ఆర్థిక లావాదేవీలు ఉండడం, వ్యాపార సంబంధాలు ఉండడంతో ప్రభాకరరావు ఇంటి నుంచి మోటారు సైకిల్ వేసుకుని నందమూరు–దొమ్మేరు అండర్ పాసేజ్ వద్దకు చేరుకున్నారు. శ్రీనివాస్ అండర్ పాసేజ్ నుంచి కొద్ది దూరం వచ్చి ప్రభాకరరావు మోటారు సైకిల్ ఎక్కారు. తాను ఫోన్ చేసిన తర్వత రావాలని జగదీష్ దుర్గాప్రసాద్కు సూచించాడు. ఇద్దరు కలిసి నందమూరు–దొమ్మేరు పుంత రోడ్డు మార్గంలో వెళుతూ నీరుకొండ శేషగిరిరావుకు చెందిన డ్రాగన్ ఫ్రూట్తోట వద్ద మూత్ర విసర్జనకు ఆపమని అడిగాడు. అదే సమయంలో శ్రీనివాస్ తన వెంట తెచ్చుకున్న కత్తితో ప్రభాకరరావుపై విచక్షణారహితంగా పలుమార్లు నరికాడు. అనంతరం ప్రభాకరరావు కంఠం నరికి మృతి చెందినట్లు నిర్ధారించుకున్నారు. ఆ సమయంలో మృతుడి కుడి చేతికి ఉన్న బంగారు కడియం, నాలుగు బంగారపు ఉంగరాలు తీయడానికి ప్రయత్నించి రాకపోవడంతో చేతిని నరికి పేపర్ చుట్టి బ్యాగ్లో పెట్టుకున్నారు. మృతుడి వద్ద ఉన్న ఫోన్, మెడలో ఉన్న బంగారు గొలుసు, ఉంగరం బ్యాగ్లో పెట్టుకున్నాడు. అనంతరం జగదీష్ దుర్గా ప్రసాద్కు ఫోన్ చేసి రమ్మని పిలిచి ఇద్దరు కలిసి మోటారుసైకిల్పై దొమ్మేరు, కాపవరం మీదుగా పోలవరం వెళ్లి పోయారు. ఈ విషయాన్ని మూడో నిందితుడు ప్రవీణ్కుమార్కు చెప్పాడు. అనంతరం వారు తెచ్చిన ప్రభాకరరావు చేతికి ఉన్న ఉంగరాలు తీసుకున్నారు. తరువాత చేతిని, హత్యకు వినియోగించిన కత్తిని, ప్రభాకరరావు సెల్ఫోన్ను, నేరం చేసిన సమయంలో వారు ధరించిన దుస్తులను బ్యాగ్లో పెట్టి గుటాల వద్ద గోదావరి నదిలో వదిలేశారు. ఈ కేసులో 31.8 గ్రాముల ఒక బంగారపు గొలుసు, 4.9 గ్రాముల బంగారపు ఉంగరం ప్రధాన నిందుతుడి నుంచి స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు. నేరం చేసిన సమయంలో వినియోగించిన మోటారుసైకిల్ను, రెండు సెల్ఫోన్లను, జగదీష్ దుర్గా ప్రసాద్ వద్ద నేరానికి వినియోగించిన అతని మోటారు సైకిల్ను, ఒక సెల్ఫోన్ను, ప్రవీణ్కుమార్ వద్ద సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. అలాగే గుటాల సమీపంలో నిందితులు గోదావరి నదిలో పడేసిన వస్తువులను, మృతుడి సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో దోచుకున్న బంగారంలో జగదీష్ దుర్గాప్రసాద్ కొయ్యలగూడెంలోని ముత్తూట్ ఫైనాన్స్లో కడియం తాకట్టు పెట్టి రూ.1.26 లక్షలు, తాళ్లపూడిలో కిస్ట్రియన్ సిరియన్ బ్యాంక్ (సీఎస్బీ)లో మూడు ఉంగరాల తాకట్టు పెట్టి రూ.43,600 తీసుకున్నారు. ఈ బంగారు ఆభరణాలను రికవరీ చేయాల్సి ఉందన్నారు. పట్టణ సీఐ పి.విశ్వం, రూరల్ సీఐ కె.విజయ్బాబు, ఎస్సై పి.రవీంద్ర, నిడదవోలు ఎస్సై కె.జగన్మోహనరావు, కొవ్వూరు రూరల్ ఎస్సై కె.శ్రీహరి రావు, ఇతర సిబ్బంది ఈ కేసు చేధించడంలో సహకరించారన్నారు. వీరిని జిల్లా ఎస్పీ నరసింహా కిశోర్ అభినందించినట్లు డీఎస్పీ దేవకుమార్ తెలిపారు. -
కుక్కల దాడిలో నెమలికి గాయాలు
● రక్షించిన హెడ్కానిస్టేబుల్ ● అటవీ అధికారులకు అప్పగింత రాజమహేంద్రవరం రూరల్: జాతీయపక్షి నెమలిని కుక్కల బారినుంచి రక్షి క్షించిన సంఘటన ఆదివారం ఉదయం కొంతమూరు గ్రామంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కొంతమూరు పప్పులమిల్లు ప్రాంతంలో 14 ఎకరాల లే అవుట్లో వై.రామవరం హెడ్ కానిస్టేబుల్ కేవీ మాధవ్ నివాసం ఉంటున్నారు. ఆదివారం ఉదయం సమయంలో ఎటునుంచో వచ్చిన నెమలిని కుక్కలు తరుముతున్నాయి. ఈ లోగా కేవీ మాధవ్ కుమారుడు చూసి కేకలు వేయడంతో అటుగా వెళ్తున్న మోటర్సైకిలిస్ట్ కుక్కలను తరమడం జరిగింది. దీంతో గాయపడిన నెమలిని హెడ్కానిస్టేబుల్ మాధవ్ ఇంటికి తీసుకువచ్చి సపర్యలు చేసి, వెంటనే ఫారెస్టు ఆఫీసర్కు ఫోన్ చేశారు. అధికారులు నెమలిని తమ కార్యాలయానికి తీసుకువచ్చి అప్పగించాలని కోరారు. దీంతో కేవీ మాధవ్ లాలాచెరువు పుష్కరవనం దగ్గర ఉన్న ఫారెస్టు రేంజ్ ఆఫీసుకు తీసుకువెళ్లి ఫారెస్టు రేంజ్ అధికారి దావీదురాజుకు అప్పగించారు. జాతీయ పక్షి నెమలికి ఆరోగ్య పరీక్షలు చేసి వైద్య సేవలు అందించి అనంతరం అడవిలో వదిలేస్తామని దావీదు రాజు వెల్లడించినట్టు హెడ్కానిస్టేబుల్ కేవీ మాధవ్ తెలిపారు. -
వైభవంగా సప్తస్వర అవధాన వైజయంతి
72 మేళకర్త రాగాలపై అవగాహన సదస్సు పి.గన్నవరం: ముంగండ గ్రామంలోని శ్రీత్యాగరాజ ఆరాధన సమితి, ఉభయ తెలుగు రాష్ట్రాల బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో ఆదివారం ప్రముఖ సినీ సంగీత దర్శకుడు స్వర వీణా పాణిచే సప్తస్వర అవధాన వైజయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వీణాపాణిచే 72 మేళకర్త రాగాలపై అవగాహన సదస్సు జరిగింది. వీణాపాణి సప్తస్వర అవధానం సభికులను విశేషంగా ఆకట్టుకుంది. సభికులు అడిగిన రాగాలలో.. వీణాపాణి చేసిన సంగీత అవధానం ఉర్రూతలూగించింది. విశేష అతిథిగా హైదరాబాద్కు చెందిన ఆధ్యాత్మిక పాటల ప్రముఖ రచయిత, సాహితీవేత్త పరిమి కేదార్నాథ్ పాల్గొని మాట్లాడారు. అద్భుతమైన సాహిత్యంతో ఆయన సభికులను మంత్రముగ్ధులను చేశారు. ఈ సందర్భంగా స్వర వీణాపాణి, కేదార్నాథ్ తదితరులను దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికలు అందజేశారు. తొలుత ఎల్.గన్నవరంలోని అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ వారి నివాసాన్ని వారు సందర్శించారు. సీతమ్మ వారి చిత్రపటానికి పూలమాలలు వేశారు. గ్రామంలోని మూడు దేవాలయాలను సందర్శించి పూజలు చేశారు. ఎల్.గన్నవరంలో మిర్తిపాటి నారాయణ, సూర్యకుమారి దంపతుల చిత్ర పటాలకు, ముంగండలో నడిమింటి నాగరాజారావు చిత్ర పటానికి వారు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ముంగండలో హైదరాబాద్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక సభ్యుడు మిర్తిపాటి రామం నేతృత్వంలో జరిగిన అవధాన కార్యక్రమానికి తెన్నేటి లక్ష్మి నర్శింహమూర్తి సంధాన కర్తగా వ్యవహరించారు. బ్రాహ్మణ సంక్షేమ వేదిక (హైదరాబాద్) వ్యవస్థాపకుడు బాల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు వేముల కిషన్రావు, బ్రాహ్మణ వేదిక నాయకులు గొల్లపల్లి ఫణీంద్ర, ప్రముఖ చిత్ర కళాకారుడు రవి పరస, తబలా వాద్యకారుడు టి.మోహన్ తదితరులు హాజరయ్యారు. అధిక సంఖ్యలో సంగీత, సాహిత్య అభిమానులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
వైభవంగా తలుపులమ్మతల్లి జాతరోత్సవాలు
● ఘనంగా ప్రారంభం ● 26న జాగరణ, 27న ఊరేగింపు, తీర్థం తుని రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం లోవ దేవస్థానంలో కొలువై ఉన్న తలుపులమ్మ తల్లి పుట్టింటి సంబరాలు సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి. లోవకొత్తూరు రామాలయంలో గతేడాది భద్రపర్చిన గరగలను ఆదివారం నృత్య కళాకారులు తీసి దేవస్థానానికి తీసుకువెళ్లారు. పుట్టధార పవిత్ర జలాలతో సంప్రోక్షణ చేసి అమ్మవారి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేసి నూతన వస్త్రాలు, పూలతో అలంకరించారు. గరగలను ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్, కార్యనిర్వహణ అధికారి పెన్మెత్స విశ్వనాథరాజు, మాజీ చైర్మన్ దూలం మాణిక్యం, ఇసరపు గాంధీ శిరస్సుపై ధరించి గరగ నృత్యాలతో అమ్మవారి గంధ అమావాస్య సంబరాలను సాంప్రదాయబద్ధంగా ప్రారంభించారు. అనంతరం డప్పు కళాకారుల వాయిద్యాల నడుమ లోవకొత్తూరు గ్రామంలో అమ్మవారి ఉపాలయానికి చేరుకున్నారు. ఈఓ మాట్లాడుతూ 14 రోజులు వివిధ గ్రామాల్లో గరగల నృత్యాలు చేస్తూ కళాకారులు అమ్మవారికి విస్తృత ప్రచారం కల్పిస్తారన్నారు. ఈ నెల 26న లోవ కొత్తూరులో ఉపాలయం ప్రాంగణంలో జాగరణోత్సవాలు, వివిధ సాంస్కృతిక, జానపద, సాంఘిక ప్రదర్శనలు, విద్యుత్ దీపాలంకరణలు ఏర్పాటు చేశామన్నారు. 27న ఊరేగింపు నిర్వహించి, తీర్థం, అమ్మవారి దర్శనాలు ఏర్పాటు చేశామన్నారు. భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలన్నారు. మాజీ సర్పంచ్ పలివెల శ్రీనుబాబు, వేదపండితులు, ప్రధాన అర్చకులు, పలువురు భక్తులు పాల్గొన్నారు. అగ్నిప్రమాదంలో గూడపర్తి వాసి మృతి ● అనకాపల్లి బాణసంచా తయారీ కేంద్రంలో ఘటన ● సామర్లకోటకు చెందిన నలుగురికి గాయాలు ● వేట్లపాలెంలో విషాదం సామర్లకోట: అనకాపల్లి జిల్లా కోటవురట్లలోని బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో మండల పరిధిలోని వేట్లపాలెం శివారు గూడపర్తికి చెందిన దేవర నిర్మల (38) మృతి చెందింది. నిర్మలతో పాటు ఆమె భర్త గొడత వీరవెంకటసత్యనారాయణ, సామర్లకోట పెన్షన్లైన్కు చెందిన యాలంగి రాజు, యాలంగి సంతోషిణి, యాలంగి సారోన్ కూలి పనికి వెళ్లి బాణసంచా తయారీ కేంద్రంలో చేరారు. ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో నిర్మల మృతి చెందగా మిగిలిన వారు స్వల్వ గాయాలలో బయట పడిన్నట్లు వారి బంధువులు తెలిపారు. నిర్మలతో సహజీవనం చేస్తున్న గూడపర్తికి చెందిన గొడత వీరవెంకటసత్యనారాయణకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న నిర్మల కుటుంబ సభ్యులు హుటాహుటిన అనకాపల్లి వెళ్లారు. ఈ ఘటనతో గూడపర్తిలో విషాద ఛాయలు అలముకున్నాయి. సీఐ ఎ.కృష్ణభగవాన్ గూడపర్తి చేరుకుని సమాచారం సేకరించారు. అక్కడి ప్రమాద వార్త తెలిసిన వెంటనే వేట్లపాలెంలో బాణా సంచాతయారీదారులు తమ దుకాణాలను మూసి వేశారు. ఎంపీపీ బొబ్బరాడ సత్తిబాబు గూడపర్తి చేరుకుని సమాచారం సేకరించారు. కాగా సుమారు ఆరేళ్ల క్రితం పెన్షన్లైన్కు చెందిన డొకుబుర్ర రాజు, శేషారావులు పెదపూడిలో బాణా సంచాతయారీకి వెళ్లి మృతి చెందిన విషయం తెలిసిందే. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి)గండేరా (వెయ్యి) 19,000 గటగట (వెయ్యి) 17,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 18,000 గటగట (వెయ్యి) 16,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
ఉత్సాహంగా ఎడ్లబళ్ల పోటీలు
రాజానగరం: వ్యవసాయ ఆధారితంగా ప్రాంతాలలో సంప్రదాయంగా వస్తున్న ఎడ్ల బండ్ల పోటీలను ఏటా ప్రభుత్వం తరఫున నిర్వహించేలా ప్రతిపాదన చేయనున్నట్టు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నారు. మండలంలోని వెలుగుబంద సమీపంలో వృత్తాకారంలో ఆదివారం నిర్వహించిన ఎండ్ల బళ్ల రాష్ట్ర స్థాయి పోటీలకు అపూర్వ స్పందన లభించింది. జీఎస్ఎల్ వైద్య కళాశాల ఎండీ డాక్టర్ గన్ని సందీప్ పోటీలను ప్రారంభించగా, విజేతలకు ఎమ్మెల్యే బత్తుల బహుమతులు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలలో వ్యవసాయ ఆధారిత రైతు కుటుంబాలకు ఇదొక పండుగలాంటిదన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఇటువంటి పోటీలు లేకపోతే పశుసంపద అనేది కనుమరుగై పోయేదన్నారు. గ్రామ దేవత సత్తెమ్మ తల్లి తీర్థమహోత్సవాలను పురస్కరించుకుని వెలుగుబందకు చెందిన కూటి కోటేశ్వర్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలలో వివిధ ప్రాంతాల నుంచి 23 ఎడ్ల జతలు పోటీపడగా, నిర్ణీత వ్యవధిలో గమ్యాన్ని చేరుకున్న ఎనిమిది జతల ఎడ్లను విజేతలుగా ప్రకటించి, బహుమతులు అందజేశారు. మొదటి బహుమతిగా రూ. 20 వేలను పెద పైడితల్లమ్మ (లెక్కల వానిపాలెం), రెండో బహుమతిగా రూ. 16 వేలను వేగుల్ల తేజాచౌదరి (మండపేట), మూడో బహుమతిగా రూ. 14 వేలను పోలుపర్తి రామునాయుడు అందుకోగా, మరో ఐదు జతలను కూడా తదుపరి స్థానాలలో విజేతలుగా ప్రకటించి నగదు బహుమతులను అందజేశారు. -
కూటమి వల.. గంగపుత్రులు విలవిల
● అప్పుడు..ఇప్పుడు అదే మోసం ● 24 గంటల్లో వేట నిషేధం ● అటకెక్కిన మత్స్యకార భరోసా ● రూ.20 వేలు ఇస్తామని బాబుదగా సాక్షి ప్రతినిధి, కాకినాడ: నడిసంద్రమే జీవనాధారంగా బతుకు నావను నెట్టుకొస్తున్న గంగపుత్రులకు పెద్ద కష్టం వచ్చి పడింది. సముద్రంలో మత్స్య ఉత్పత్తుల పరిరక్షణ కోసం ఏటా ఏప్రిల్ నుంచి జూన్ వరకు విధించే వేట నిషేధం ఆ కుటుంబాలకు సంకటంగా మారింది. మత్స్యకార కుటుంబాలపై కూటమి ప్రభుత్వం కక్ష కట్టినట్టు కనిపిస్తోంది. సముద్రంపై వేట విరామం అంటే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వేలాది మత్స్యకార కుటుంబాలకు జీవనోపాధి లేనట్టే. నిషేధ సమయం 60 రోజులు ప్రత్యామ్నాయ ఉపాధి గగనమైపోతుంది. ఎందుకంటే వీరంతా తరతరాలుగా సముద్రంపై వేట తప్ప మరో పని చేయలేరు. ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు విరామ సమయంలో ఆ కుటుంబాలకు వెన్నుదన్నుగా నిలిచే సంకల్పంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సీఎం జగన్మోహన్రెడ్డి క్రమం తప్పకుండా మత్స్యకార భరోసా అందించారు. గత టీడీపీ ప్రభుత్వంలో రూ.4 వేలు ఉన్న వేట నిషేధ భృతిని 2019లో సీఎంగా జగన్మోహన్రెడ్డి మత్స్యకార భరోసా కింద రూ.10 వేలకు పెంచారు. వేట నిషేధం అమలులో ఉన్న సమయంలోనే ఏటా ఠంచన్గా భరోసా సొమ్ము జమ చేస్తూ వచ్చారు. ఇలా నిషేధ సమయంలోనే జగన్ భరోసా సొమ్ము అందివ్వడంతో సముద్ర వేటపై ఆధారపడ్డ మత్స్యకార కుటుంబాలు సంతోషంగా ఉండేవి. వేట విరామ సమయం రెండు నెలలకు కుటుంబాలు నెట్టుకురావడానికి లోటు లేకుండా గడచిపోయేది. ఏటా మాదిరిగానే 2023–24 మత్స్యకార భరోసా కూడా ఇచ్చేందుకు వైఎస్సార్ సీపీ సిద్ధమైంది. ఇందుకు కార్యాచరణ కూడా పూర్తయినప్పటికీ సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో పంపిణీ ప్రక్రియకు బ్రేక్ పడింది. తరువాత వచ్చిన కూటమి ప్రభుత్వం చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు. అధికారంలోకి వచ్చి 10 నెలలు గడచినా.. అప్పుడే రెండోసారి వేట నిషేధ సమయం వచ్చేసింది. ఈ విరామ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే రూ.10 వేల పరిహారాన్ని రెట్టింపు చేసి రూ.20 వేలు ఇస్తామని సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ నమ్మించారు. ఎన్నికలు ముగిసి కూటమి సర్కార్ గద్దెనెక్కి 10 నెలలు గడచిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి కూడా వేట విరామం అమలులో ఉంది. బాబు, పవన్ ఎన్నికల్లో ప్రకటించినట్లుగా తమకు రూ.20 వేల పరిహారం ఇస్తారని వేలాది మత్స్యకార కుటుంబాలు గంపెడాశలు పెట్టుకున్నాయి. వేట నిషేధ సమయంలో పస్తులతో కుటుంబాలను నెట్టుకొచ్చినా కూటమి ప్రభుత్వం కనీసం మానవత్వం చూపించలేదు. సూపర్ సిక్స్ హామీల మాదిరిగానే మత్స్యకారులకు ఇచ్చిన మాటను కూడా నడిసంద్రంలో విడిచి పెట్టేసింది. ఫలితంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సముద్ర వేటపై ఆధారపడ్డ వేలాది మత్స్యకార కుటుంబాలు చుక్కాని లేని నావ మాదిరిగా తయారయ్యాయి. ఇచ్చిన హామీ అమలు చేయకుండా గాలికొదిలేయడంతో ప్రత్యామ్నాయ ఉపాధి లేక రోడ్డున పడ్డాయి. చంద్రబాబు అండ్ కో మాటల గారడీతో నిలువునా ముంచేశారని మత్స్యకార కుటుంబాలు ఘొల్లుమంటున్నాయి. ఈసారీ కడుపు మాడ్చుకోవాల్సిందేనా? గత ఏడాది వేట విరామ సమయంలో పరిహారం రేపు ఇస్తాం, మాపు ఇస్తామంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతూ కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు ఎగనామం పెట్టింది. అసలు గత విరామ సమయంలో పరిహారం అందుకోకుండానే రెండోసారి వేట నిషేధ సమయం మరో 24 గంటల్లో అమలులోకి వచ్చేస్తోంది. పెండింగ్ పరిహారం ఊసే లేదు అని మత్స్యకారులు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వ నిర్వాకంతో మరోసారి కడుపు మాడ్చుకోవాల్సిందేనని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నిషేధ సమయంలో ఉపాధి కోల్పోయిన మత్స్యకారులకు పరిహారం ఏడాది కావస్తున్నా అందించలేదు. కూటమి ప్రభుత్వంలో రెండోసారి కూడా అందుతుందనే నమ్మకం కలగడం లేదంటున్నారు. ఇలా నమ్మించి మోసం చేయడంలో చంద్రబాబుకు మించిన నాయకుడు లేడనే విషయం మరోసారి రుజువైందని మత్స్యకారులు ఆక్షేపిస్తున్నారు. బాబూ.. మాట నిలబెట్టుకో.. మత్స్యకార భరోసా ఏడాదికి రూ.20,000 ఇస్తామని చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. గత ఏడాది మత్స్యకార భరోసా ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇప్పుడు మరోసారి వేట నిషేధ సమయం వచ్చేసింది. అయినప్పటికీ గత ఏడాది ఇవ్వాల్సిన భరోసా ఇంతవరకు ఇవ్వలేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నిషేధ సమయం ముగియకుండానే ఏటా మత్స్యకార భరోసా అందజేసేవారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాలకు కలిపి మత్స్యకార భరోసా నిధులు విడుదల చేయాలి. – చింతా నాగ మునీంద్రరావు, మత్స్యకార నాయకుడు, చింతావానిరేవు, ముమ్మిడివరం మండలం నిషేధ సమయంలో పస్తులుండాల్సి వస్తోంది వేట నిషేధ సమయం రెండు నెలలూ ప్రత్యామ్నాయ జీవనోపాధి లేక సముద్రంపై వేటాడే కుటుంబాల వారు పస్తులుండాల్సి వస్తోంది. నిషేధ సమయంలో ఇవ్వాల్సిన పరిహారం సకాలంలో విడుదల చేయకపోవడంతో నానా కష్టాలు ఎదుర్కొంటున్నారు. రూ.10వేలు పరిహారం కాస్తా రూ.20వేలు చేస్తామంటే ఎంతో నమ్మకంగా ఉన్నారు. తీరా రెండోసారి నిషేధ సమయం వచ్చేసినా చిల్లి గవ్వ కూడా విడుదల చేయలేదు. – మేరుగు ఎల్లాజీ, ఎంపీటీసీ సభ్యుడు, ఉప్పాడ ప్రతి కుటుంబానికి రూ.40వేలు ఇవ్వాలిచంద్రబాబు సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా మోసం చేయడం తగదు. గత ఏడాది ఇవ్వాల్సిన పరిహారం, ఈ నెలలో నిషేధ సమయంలో ఇవ్వాల్సిన సొమ్ము కలిపి ప్రతి కుటుంబానికి రూ.40 వేలు మత్స్యకారుల ఖాతాలకు జమ చేయాలి. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా కాలక్షేపం చేస్తోన్న కూటమి ప్రభుత్వం కనీసం మత్స్యకారుల విషయంలో అయినా మాట నిలబెట్టుకోవాలి. – గుబ్బల తులసీకుమార్, జెడ్పీటీసీ సభ్యుడు, ఉప్పాడ కొత్తపల్లి మండలం 13కేకేడీ 09ఉమ్మడి తూర్పున.. లబ్థిదారులు: 33,704 మంది ఇవ్వాల్సిన మొత్తం: రూ.67.407 కోట్లు జగన్ హయాంలో... మత్స్యకార భరోసా వేటకు వెళ్లే ప్రతి కుటుంబానికి రూ.10వేల చొప్పున 2019–20లో–23,190 మందికి రూ.23,19 కోట్లు 2020–21లో–24,587 మందికి రూ.24,587 కోట్లు 2021–22లో–30,213 మందికి రూ.30,213 కోట్లు 2022–23లో–21,394 మందికి రూ.21,394 కోట్లు 2023–24లో–24,147 మందికి రూ.24,147 కోట్లు 2019–20 నుంచి వేట నిషేధంతో ప్రభావితమైన బోటు యజమానులు, కళాసీలు 1,23,531 మందికి రూ.123.531 కోట్లు జమ చేశారు. కోనసీమ జిల్లాలో.. మండలాలు: ఐ.పోలవరం, కాట్రేనికోన, ముమ్మిడివరం, మామిడికుదురు, ఉప్పలగుప్తం, సఖినేటిపల్లి, రామచంద్రాపురం, కె గంగవరం, అల్లవరం, సఖినేటిపల్లి తీరప్రాంత గ్రామాలు: 45 మొత్తం బోట్లు: 1,700 అర్హులైన మత్స్యకారులు : 9,575 మంది కాకినాడ జిల్లాలో ... మండలాలు: తుని, తొండంగి, యు.కొత్తపల్లి, కాకినాడ రూరల్, తాళ్లరేవు మత్స్యకార తీర గ్రామాలు: 36 మెకనైజ్డ్ బోట్లు: 467, మోటారు బోట్లు: 3,779, సంప్రదాయ బోట్లు 399 వేట నిషేధ లబ్ధిదారులు: 24,147 మంది -
పోలీసుల దర్యాప్తు నమ్మశక్యంగా లేదు
పాస్టర్ ప్రవీణ్ మృతిపై మాజీ ఎంపీ హర్షకుమార్ వ్యాఖ్యలు రాజమహేంద్రవరం సిటీ: హైదరాబాద్కు చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిలో పోలీసుల దర్యాప్తు నమ్మశక్యంగా లేదని ఇప్పటికీ ప్రవీణ్ మృతి ఆక్సిడెంట్ వల్ల జరగలేదని నమ్ముతున్నానని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ అన్నారు. ఆదివారం రాజమహేంద్రవరంలో ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ పోలీసులు మొదటి నుంచి యాక్సిడెంట్ కోణంలోనే దర్యాప్తు చేశారన్నారు. ప్రవీణ్ మరణం యాక్సిడెంట్ అయితే ప్రవీణ్ బ్యాంక్ ఖాతాలు ఎందుకు సీజ్ చేశారో, ల్యాప్టాప్లు, ఐపాడ్లు పోలీసులు ఎందుకు పట్టుకెళ్లారో అర్థం కావడం లేదన్నారు. ప్రవీణ్ షెడ్యూల్ ప్రకారం ప్రమాదం జరిగిన రోజు మహారాష్ట్రలో ఉండాలని అన్నారు. విజయవాడ, కొవ్వూరులో సమావేశాలకు ప్రవీణ్ను పిలిచింది ఎవరు అనే విషయాన్ని పోలీసులు నిగ్గు తేల్చాలన్నారు. పోలీసులు ఇటువంటి నాన్సెన్స్ ఇన్వెస్టిగేషన్లు చేసి ప్రవీణ్ మద్యం సేవించి మృతి చెందాడనే విషయం చెప్పడం మానుకోవాలన్నారు. ప్రవీణ్ మృతిపై అనుమానం ఉన్న వారంతా నోరు విప్పాలని పిలుపునిచ్చారు. ఈ మృతిపై దర్యాప్తునకు మరింత ముందుకు వెళ్లనున్నట్లు ప్రకటించారు. పోలీసులకు సహకరించాలి కంబాలచెరువు (రాజమహేంద్రవరం): భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత, బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రజలు వేడుకలను నిర్వహించుకోవాలని ఎస్పీ డి.నరసింహకిశోర్ సూచించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ఈ వేడుకలలో భాగంగా, శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకొని జయంతి కార్యక్రమాలు నిర్వహించుకోవాలని, పోలీసులకు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. -
ఉపాధ్యాయులు సమాచారం ధ్రువీకరించాలి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రభుత్వ యాజమాన్యంలోని స్కూల్ అసిస్టెంట్స్ సాధారణ సీనియారిటీ జాబితాను ఉపాధ్యాయ సమాచార వ్యవస్థ (టీఐఎస్) ఆధారంగా రూపొందించామని జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు ఆదివారం తెలిపారు. ఆ జాబితాలు ఆర్డీ కాకినాడ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఆర్జేడీఎస్ఈకేకేడీ.ఆర్గ్, సంబంధిత ఉమ్మడి తూర్పు గోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి ఉమ్మడి కృష్ణా జిల్లా విద్యాశాఖల వెబ్సైట్లు, నోటీసు బోర్డులలో అందుబాటులో ఉంచామన్నారు. అయితే సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 16వ తేదీలోగా సంబంధిత ఉమ్మడి జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి సమర్పించి, సరి చేయించుకోవాలన్నారు. అభ్యంతరం చేసే ఉపాధ్యాయుడి పూర్తి పేరు, పదవి, సంబంధిత వివరాలతో సీనియారిటీ జాబితాలో తప్పిదం ఎక్కడ ఉందో స్పష్టంగా పేర్కొనాలన్నారు. ఆధారాలు, సంబంధిత సాక్ష్యాలు ఉంటే వాటిని జత చేయాలన్నారు. టీఐఎస్లో సమాచారం అంతా సరిగానే ఉన్న ఉపాధ్యాయులు అందరూ తమ మొబైల్లోనే వన్ టైమ్ పాస్ వర్డ్ తో తమ డేటాను కన్ఫర్మ్ చేయాలన్నారు. సీతారాములకు ఘనంగా శ్రీపుష్పయాగం రత్నగిరిపై ముగిసిన శ్రీరామనవమి వేడుకలు అన్నవరం : ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో నిర్వహిస్తున్న శ్రీరామనవమి వేడుకల్లో చివరగా తొమ్మిదో రోజు ఆదివారం రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు శ్రీసీతారాములకు శ్రీపుష్పయాగం కార్యక్రమం నిర్వహించారు. రత్నగిరి రామాలయంలో రాత్రి ఎనిమిది గంటలకు నవదంపతులు సీతారాములను వెండి సింహాసనంపై , పెళ్లిపెద్దలు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లను ప్రత్యేక సింహాసనంపై ప్రతిష్టించి పండితులు పూజలు చేశారు. అనంతరం సీతారాములను సుగంధ భరిత పుష్పాలతో పూజించారు. సీతారాములకు వివిధ రకా ల పిండివంటలు నివేదించారు. అనంతరం వేదపండితులు ఆశీస్సులందజేశారు. రామాలయంలో పూలమాలలతో అలంకరించిన ఊయల మీద సీతారాములను పవళింపు చేసి మంత్రాలు చదువుతూ మూడుసార్లు ఊపారు. అనంతరం ఆ ఊయలకు అమర్చిన అద్దంలో సీతారాములను పండితులు దర్శించారు. అనంతరం పండితులకు దంపత తాంబూలాలు బహూకరించారు. భక్తులకు ప్రసాదాలను, ముత్తయిదువులకు జాకెట్టు ముక్కలను పంపిణీ చేశారు. భక్తు లు సీతారాములను అద్దంలో తిలకించి పులకించారు. దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు దంపతులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంతో రత్నగిరి పై శ్రీరామ నవమి మహోత్సవాలు ముగిసాయి. వైభవంగా వెంకన్న శ్రీపుష్పోత్సవం వాడపల్లిలో ముగిసిన కల్యాణోత్సవాలు కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ, భూ సమేత వేంకటేశ్వరుని శ్రీపుష్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభమైన కల్యాణమహోత్సవాలు ఏడో రోజు ఆదివారం రాత్రి శ్రీపుష్పోత్సవంతో ఘనంగా ముగిసాయి. ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్, వైఖానస పండితులు ఖండవల్లి రాజేశ్వరవరప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ మూర్తులకు పల్లకిలో గ్రామోత్సవం నిర్వహించి రాత్రి శ్రీపుష్పోత్సవం నిర్వహించారు. వివిధ రకాల పిండివంటలతో స్వామివారికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలోని అద్దాల మండపంలో వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన ఊయలలో స్వామి వారిని జోల పాటలతో పవళింపజేశారు. పలువురికి దంపతి తాంబులాలు అందచేశారు. కాగా అందరి సహకారంతో స్వామివారి కల్యాణోత్సవాలు ఘనంగా నిర్వహించినట్టు డీసీ చక్రధరరావు తెలిపారు. -
‘నన్నయ’ వీసీకి రత్నసింహ్జీ మహిదా అవార్డు
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఉప కులపతి ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ ‘రత్నసింహ్జీ మహిదా మెమోరియల్ అవార్డు అందుకున్నారు. ఆమెకు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ శనివారం ఈ అవార్డు అందజేశారు. గుజరాత్ నర్మదా జిల్లాలోని రాజ్పిప్లాలో సామాజిక సంస్కర్త, విద్యావేత్త, గిరిజనుల సంక్షేమానికి అంకితమైన దివంగత రత్నసింహ్జీ మహిదా జ్ఞాపకార్థం సంఘ సేవ చేసిన ప్రముఖులకు ఈ సంవత్సరం నుంచి అందజేస్తున్నారు. బిర్సాముండా గిరిజన యూనివర్సిటీ వీసీ మధుకర్బాయ్ ఎస్తో పాటు 19 గిరిజన భాషలకు లిపిని రూపొందించి, భారత రాష్ట్రపతి నుంచి ‘నారీరత్న’ పురస్కారాన్ని అందుకున్న ‘నన్నయ’ వీసీ ఆచార్య ప్రసన్నశ్రీకి ఈ అవార్డును తొలిసారిగా ప్రదానం చేశారు. కారు బోల్తా.. 10 మందికి గాయాలు దేవరపల్లి: అతి వేగంగా వెళుతున్న కారు 16వ నంబర్ జాతీయ రహదారిపై అదుపు తప్పి, పంట పొలాల్లో బోల్తా పడి, ఒకే కుటుంబానికి చెందిన 10 మంది గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం బందార్లపల్లికి చెందిన 10 మంది కుటుంబ సభ్యులు శుక్రవారం రాత్రి అన్నవరం సత్యదేవుని దర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో శనివారం మధ్యాహ్నం 2.40 గంటల సమయానికి దేవరపల్లి మండలం యర్నగూడెం వద్దకు చేరుకున్నారు. అక్కడ కారు ఒక్కసారిగా అదుపుతప్పి హైవే పైనుంచి పల్టీలు కొడుతూ పంట పొలాల్లో పడింది. ఈ ప్రమాదంలో కారులోని 10 మంది స్వల్పంగా గాయపడ్డారు. వారిని స్థానికులు బయ టకు తీసి, హైవే అంబులెన్స్లో గోపాలపు రం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎటువంటి ప్రాణాపాయం లేదని పోలీసులు చెప్పారు. గాయపడిన వారిలో గౌరక్క (కోతుల లత), గౌరక్కగారి చిన్నమ్మాయి, కోతుల సోమశేఖర్, కోతుల యశ్వంత్, కోతుల చందన, భార్గవి, పభ్రేష్, లలిక, శిరీష, కారు డ్రైవర్ గౌరక్కగారి శ్రీకాంత్ ఉన్నారు. సంఘటన స్థలాన్ని సందర్శించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ఇ.సుబ్రహ్మణ్యం తెలిపారు. -
వైఎస్సార్ సీపీలో ‘తూర్పు’నకు అగ్రాసనం
● పీఏసీలో కీలక ప్రాతినిధ్యం ● నియామకాల్లో సామాజిక సమతూకం ● బోస్, తోట, విశ్వరూప్, ముద్రగడకు చోటు సాక్షి ప్రతినిధి, కాకినాడ: వైఎస్సార్ సీపీని క్షేత్ర స్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా పార్టీ అధిష్టానం పలు కీలక నియామకాలు చేపట్టింది. మండల, గ్రామ స్థాయిలో నూతన కమిటీల నియామకాల్లో పాత, కొత్త నేతల కలయికతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపుతోంది. ఈ క్రమంలో వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో పార్టీలో అత్యున్నతమైన పొలిటికల్ అడ్వైజరీ కమిటీ(పీఏసీ)లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు అధిష్టానం అగ్రాసనం వేసింది. పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కన్వీనర్గా వ్యవహరించే ఈ కమిటీలో ఉమ్మడి జిల్లా నుంచి నలుగురు ప్రముఖులకు ప్రాతినిధ్యం కల్పిస్తూ శనివారం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. సామాజిక సమతూకాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ నియామకాలు చేపట్టారు. పీఏసీ సభ్యులుగా రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్చంద్రబోస్, ఎమ్మెల్సీ, మండపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్ తోట త్రిమూర్తులు, అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని నియమించారు. శృంగార వల్లభుని సన్నిధిలో రద్దీ పెద్దాపురం: మండలంలోని తొలి తిరుపతి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభ స్వామి ఆలయం శనివారం రద్దీగా మారింది. సుమారు 15 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారిని అర్చకులు పెద్దింటి నారాయణాచార్యులు, పురుషోత్తమాచార్యులు విశేషంగా అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ సేవల టికెట్లు, అన్నదానం, కేశఖండన ద్వారా స్వామి వారికి రూ.2,80,809 ఆదాయం సమకూరిందని ఈఓ వడ్డి శ్రీనివాస్ తెలిపారు. మూడు వేల మంది భక్తులకు ప్రసాద వితరణ, అన్నదానం ఏర్పాటు చేశామని చెప్పారు. -
అక్క బంగారం కాజేసి కటకటాలకు
● సొంత చెల్లి పెద్దమ్మ కూతురితో కలసి చోరీ ● కట్టర్ సాయంతో తాళాలు తొలగించిన వైనం ● 198 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.10వేల నగదు, ఇంటి డాక్యుమెంట్ల స్వాధీనం నిడదవోలు : సొంత అక్క బంగారంపైనే చెల్లెలు కన్నేసింది. అదును చూసి ఇద్దరి సాయంతో వాటిని అపహరించి చివరకు కటకటాల పాలైంది. స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్లో నిడదవోలు సీఐ పీవీజీ తిలక్ శనివారం స్థానిక విలేకరులకు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని ఎంవీ నగర్లో బలిజ సత్యనారాయణ, శశి లలితాదేవి దంపతులు నివసిస్తున్నారు. లలితాదేవి పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నారు. ఆమె సొంత చెల్లెలు పడాల లక్ష్మీశైలజ తాడేపల్లిగూడెంలో ఉంటోంది. శైలజ ఆర్థిక పరిస్థితుల వల్ల తన అక్క బంగారం దొంగిలించి తన ఆర్థిక అవసరాలను తీర్చుకోవాలని పథకం వేసింది. ఈ మేరకు ఉండ్రాజవరం గ్రామానికి చెందిన తన పెద్దమ్మ కుమార్తె బండి సత్యవేణి సహాయం తీసుకుంది. ఆమెకు ఈ పథకం గురించి చెప్పింది. బీరువా తాళాలు బద్దలు కొట్టడానికి ఓ వ్యక్తిని పురమయించాలని చెప్పింది. ఆమె ఉండ్రాజవరం గ్రామానికి చెందిన కప్పకాయల సురేంద్రను తీసుకుని ఆటోలో ఈ నెల పదో తేదీ మధ్యాహ్నం 12:30 గంటలకు లలితాదేవి ఇంటికి చేరుకున్నారు. వారు ముగ్గురు ఇంటి చుట్టుపక్కల రెక్కీ నిర్వహించి, ఎవరైనా వస్తే చెప్పాలని సత్యవేణిని ఆటో వద్ద కాపలా ఉంచారు. తర్వాత నిందితులు శైలజ, సురేంద్ర కలిసి ఇంటికి వేసిన తాళాన్ని ఐరన్ కట్టర్తో కట్ చేసి లోపలికి ప్రవేశించారు. గదిలో ఉన్న బీరువా లాకర్ను కూడా కట్టర్ సహాయంతో కట్ చేసి బీరువాలోని 198 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.10 వేలు, ఇంటి, ఖాళీ స్థలం డాక్యుమెంట్లు అపహరించుకుపోయారు. దీననిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు పట్టణంలోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలించి నిందితులను గుర్తించారు. పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా శైలజ, సత్యవేణి, సురేంద్రల నేరం చేసినట్టు ఒప్పుకోవడంతో వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తిలక్ పేర్కొన్నారు. వీరి నుంచి 198 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.10 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. బంగారు ఆభరణాలు, డాక్యుమెంట్ల విలువ రూ.12.55 లక్షలు ఉంటుందన్నారు. అతి తక్కువ సమయంలో ముద్దాయిలను గుర్తించి కేసులు ఛేదించిన ఎస్సై కె.జగన్మోహన్రావు, సిబ్బందిని జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ అభినందించి వారికి రివార్డులు ప్రకటించారు. -
చివరి మజిలీ సౌకర్యంగా..
● కొత్తపేటలో కై లాసభూమి కార్యరూపం ● రూ.3 కోట్లతో ఎట్టకేలకు పూర్తి ● నెరవేరిన నంబూరి రెడ్డియ్య కల ● ఘనంగా ప్రారంభం కొత్తపేట: అంతిమ సంస్కారాలకు అధునాతన సౌకర్యాలతో కై లాస భూమి కొత్తపేట పరిసర గ్రామల ప్రజలకు సమకూరింది. స్థానిక బోడిపాలెం వంతెన సమీపంలోని సూర్యగుండాల రేవు ప్రాంతంలో లయన్స్ క్లబ్ కై లాసభూమి ఎట్టకేలకు నిర్మితమైంది. ప్రముఖ వ్యాపారవేత్త, కేబుల్ నెట్వర్క్ అధినేత, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు నంభూరి వీరవెంకట సత్య సూర్య రెడ్డియ్య 20 ఏళ్లనాటి ఆలోచనకు 13 ఏళ్లనాడు రూ.2 కోట్ల అంచనా వ్యయంతో కార్యరూపం దాల్చి ఎట్టకేలకు రూ.3 కోట్ల వ్యయంతో ఎట్టకేలకు నిర్మితమై శనివారం ప్రారంభమైంది. ఘనంగా ప్రారంభోత్సవం లయన్స్ క్లబ్ అధ్యక్షుడు నంభూరి రెడ్డియ్య ఆధ్వర్యంలో ఎంపీ గంటి హరీష్మాధుర్, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఈ కై లాసభూమిని ప్రారంభించారు. వివిధ విభాగాలను లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈవీవీ ఈశ్వరకుమార్, మాజీ గవర్నర్ బాదం బాలకృష్ణ, కై లాసభూమి నిర్మాణ పర్యవేక్షకుడు కంఠంశెట్టి శ్రీనివాసరావు, జనసేన నియోజకవర్గ ఇన్చార్జి బండారు శ్రీనివాసరావు, రాష్ట్ర టీడీపీ నాయకుడు ఆకుల రామకృష్ణ, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యుడు పాలూరి సత్యానందం తదితరులు ప్రారంభించారు. నాడు కల నేటికి సాకారం 2012వ సంవత్సరంలో స్థానిక లయన్స్ క్లబ్ ఏర్పాటుకు జరిగిన సమావేశంలో నంబూరి రెడ్డియ్య ఈ కై లాసభూమి ఆవశ్యకతను ప్రస్థావించారు. ఆయన ప్రెసిడెంట్గా క్లబ్ ఏర్పాటు కాగా కాలక్రమంలో కై లాసభూమి నిర్మాణంపై దృష్టిపెట్టారు. పవిత్ర సూర్యగుండాలపాయకు చేర్చి రూ.12 లక్షలతో 1.50 ఎకరాలు భూమిని కొనుగోలు చేశారు. రెడ్డియ్య వ్యక్తిగతంగా రూ.1.80 కోట్లు వెచ్చించారు. మిగిలిన మొత్తాన్ని దాతల నుంచి సేకరించారు. ఉపాధి నిధులు రూ.40 లక్షలతో కై లాసభూమి వరకు సీసీ రోడ్డు, మిగిలిన పనులకు పలు చోట్ల నిధులు సేకరించారు. ఈ నిధులతో ఒక అంతస్తుతో కూడిన భవనం (మృతదేహాలను భద్రపరిచే ఫ్రీజర్ విభాగం, అస్తికల లాకర్ల విభాగం, కార్యాలయం, సంతాప సభ కోసం హాలు సముదాయం), నాలుగు బెర్తులతో శవ దహనవాటిక, మృతదేహంతో ప్రదక్షిణ చేసే ఓం నమఃశివాలయ షెడ్డు, మృతుని బంధువుల వెయిటింగ్ భవనం, శివుని విగ్రహం, 24 ట్యాప్లతో జల్లు స్నానం పైపులైన్, పార్కు నిర్మాణం పూర్తిచేశారు. ఇంకా కలప షెడ్డు నిర్మాణం పూర్తికావాల్సివుంది. నాడు పెద్దల అంత్యక్రియల్లో పుట్టిన ఆలోచన 2004 అక్టోబర్ 18న నా తండ్రి నంబూరి వీర్రాజు (సిద్ధాంతి) చనిపోయినప్పుడు ఇక్కడ అంత్యక్రియలు నిర్వహించాం. అప్పుడే ఈ శ్మశానానికి వచ్చాను. ఏ సౌకర్యాలు లేక చాలా దుర్భరంగా ఉంది. 2005 జూన్లో రాజమహేంద్రవరంలో మా మావయ్య వాకచర్ల బంగారయ్య మృతి చెందగా అక్కడ రోటరీ కై లాసభూమిలో అన్ని సౌకర్యాల నడుమ అంత్యక్రియలు నిర్వహించాం. అటువంటి కై లాసభూమిని కొత్తపేటలో నిర్మించాలని సంకల్పించి ఎట్టకేలకు పూర్తిచేసి ప్రారంభించాం. చాలా సంతప్తిగా, ఆనందంగా ఉంది. – నంభూరి వీవీఎస్ఎస్ రెడ్డియ్య, కై లాసభూమి నిర్మాత, కొత్తపేట -
ఇంటర్ ఫలితాలలో శశి సత్తా
ఉండ్రాజవరం: ఇంటర్ 2025 ఫలితాలలో వేలివెన్ను శశి క్యాంపస్ విద్యార్థులు మరోసారి అత్యుత్తమ ఫలితాలతో సత్తా చాటారని ఆ విద్యాసంస్థల చైర్మన్ బూరుగుపల్లి రవికుమార్ శనివారం తెలిపారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు కె.సాత్విక్ వర్మ, బి.షన్మిత, డీపీబీ బంగారం 990, ఎస్జేఎం దీపిక, బి.స్నేహ, జిఎస్.వైష్ణవి, కె.నంద కార్తిక్ 989 మార్కులు, ఏజేఎస్ రమాదేవి, ఎస్.హేమలత, పీఎల్ ప్రసన్న, సీహెచ్.పవన్కుమార్, ఎస్.రేఖ 988 మార్కులు సాధించారు. సీనియర్ ఇంటర్ బైపీసీ విభాగంలో 1000 మార్కులకు కె.లీలా వినోదిని 990, జి.చెరిష్ సాయి, పి.ధరణి 989, టి.కీర్తి 988 మార్కులు సాధించారు. వీరితో పాటు 990 మార్కుల పైన నలుగురు, 980 మార్కులపైన 179 మంది, 950 మార్కులపైన 811 మంది, 900 మార్కులపైన 1402 మంది సాధించారని ఆయన తెలిపారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు ఎస్.నాగపూజిత్, వై.రాహుల్, టి.నారాయణ మూర్తి, ఎం.శైలజ, పి.సాయి చరణ్, సీహెచ్.వినీల, కె.కాళీశ్వర, టి.మణికంఠ, ఎం.సాయిలక్ష్మి, బి.సాత్విక్, ఎస్వి.తేజశ్విని, సయ్యద్ అనస్, ఎన్.చాతుర్ వర్మ, యు.ధీరజ్ కుమార్, ఎండి.తహ్లీల్ సామా 466 మార్కులు, బైపీసీలో 440 మార్కులకు ఎల్.దినేష్, జి.భవ్య, ఎస్.స్వర్ణాంజలి, పి.సుష్మ 435 మార్కులతో పాటు 465 మార్కులు పైన 50 మంది, 460 మార్కుల పైన 264 మంది, 430 మార్కులు పైన 1070 మంది, 400 మార్కుల పైన 1567 మంది సాధించారని ఆయన తెలిపారు. ఈ ఫలితాల సాధనకు కృషి చేసిన విద్యార్థులను, అధ్యాపక బృందాన్ని విద్యాసంస్థల వైస్ చైర్మన్ బూరుగుపల్లి లక్ష్మి సుప్రియ అభినందించారు. -
నేటి నుంచి తలుపులమ్మ తల్లి పుట్టింటి సంబరాలు
● లోవ గ్రామంలో 26న జాగరణ ● 27న తీర్థం, ఊరేగింపు ● పలు గ్రామాల్లో జాతరలకు భారీ ఏర్పాట్లు తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారి పుట్టింటి సంబరాలు ఆదివారం నుంచి ఈ నెల 27వ తేదీ వరకూ జరగనున్నాయి. ప్రతి సంవత్సరం గంధామావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని లోవ కొత్తూరు గ్రామంలో తలుపులమ్మ తల్లికి పుట్టింటి సంబరాలు, ఆషాఢ మాసంలో లోవ దేవస్థానం ఆవరణలో నెల రోజులు ఆషాఢ మాసోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. పుట్టింటి సంబరాల సందర్భంగా 14 రోజుల ఉత్సవాల అనంతరం అమ్మవారి ఊరేగింపు, దర్శనాలు, తీర్థం నిర్వహిస్తారు. గ్రామస్తుల అభీష్టం మేరకు లోవ దేవస్థానం అధికారుల పర్యవేక్షణలో లోవ గ్రామంలో ఉపాలయం వద్ద నాలుగెకరాల విస్తీర్ణంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. దీనికి అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ సాంస్కృతిక, జానపద, సాంఘిక ప్రదర్శనలు, కోలాటాలు, భజనలు, కళ్లు మిరుమిట్లు గొలిపే విద్యుద్దీపాలంకరణలు, బాణసంచా పేలుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న స్థానికులు, వారి ఆడపడుచులు, అల్లుళ్లు, బంధుమిత్రులు లోవ కొత్తూరు వచ్చి గంధామావాస్య ఉత్సవాల్లో పాల్గొంటారు. ఈ ఉత్సవాలకు అవసరమైన ఖర్చును లోవ దేవస్థానం నుంచి భరిస్తామని ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. సంబరాలు జరుగుతాయిలా.. మొదటి రోజయిన ఆదివారం గరగల సంబరాలతో అమ్మవారి పుట్టింటి ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. వివిధ గ్రామాల్లో గరగలను ప్రదర్శిస్తూ విస్తృత ప్రచారం నిర్వహిస్తారు. 26వ తేదీ రాత్రి జాగరణ, 27న అమ్మవారి ఊరేగింపు, దర్శనాలు, తీర్థంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈ నెల 26న 50 మంది నాట్య కళాకారులచే సాంస్కృతిక ప్రదర్శనలు, కేరళ లేడీ డ్రమ్స్ టీమ్, కాంతార లైటింగ్ డ్యాన్స్ టీమ్, గోపాల గోపాల ప్రోగ్రాం, పెద్ద ఆంజనేయ బృందాలతో ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. 27న వివిధ వాహనాలపై బళ్ల వేషాలు, నక్కపల్లి వారి మ్యూజికల్ బ్యాండ్, 60 మంది నాట్య కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. వివిధ గ్రామాల్లో.. లోవ దేవస్థానం పరిసర ప్రాంతవాసులకు తలుపులమ్మ తల్లి ఇలవేల్పు కావడంతో గంధామావాస్య రోజున వివిధ గ్రామాల్లో ఉత్సవాలు నిర్వహించనున్నారు. వి.కొత్తూరు, కొత్త వెలంపేట, సీతయ్యపేట, మర్లపాడు, రాజుపేట, జగన్నాథగిరి, గెడ్లబీడు, వెలంపేట కాలనీ, తాళ్లూరు, కుమ్మరిలోవ తదితర గ్రామాల్లో వేర్వేరుగా తలుపులమ్మ తల్లి జాతర భారీగా నిర్వహిస్తారు. దీని కోసం ఆయా గ్రామ కమిటీల ఆధ్వర్యాన భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ ప్రదర్శనల్లో వెండి తెర, బుల్లి తెర నటీనటులు పాల్గొని ఆయా గ్రామస్తులను అలరించనున్నారు. -
ఇంటర్ ఫలితాలలో తిరుమల ప్రభంజనం
రాజమహేంద్రవరం రూరల్: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రధమ, ద్వితీయ సంవత్సర ఇంటర్ ఫలితాలలో రాజమహేంద్రవరంలోని తమ తిరుమల జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యద్భుత ఫలితాలు సాధించినట్లు ఆ విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు తెలిపారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 470కి 467 మార్కులను యు.విరోనిక, ఎం.హర్షిత, ఎస్.తేజ, జి.రాజనీవన్తేజ, ఎ.వీరవెంకట సాయిలిఖి సాధించారని, 466 పైన 31మంది, 464పైన 369 మంది, 460పైన 1086 మంది, 450 పైన ప్రతి ఇద్దరిలో ఒకరికి అనగా 2133 మంది సాధించారని, అలాగే 99.20 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆయన తెలిపారు. బైపీసీ విభాగంలో 440కి 436 మార్కులను 11 మంది విద్యార్థులు కె.సుప్రియ, ఎ.శ్రీరామ తేజశ్విని, సీహెచ్ నేహా గ్రేస్, జి.మోహనరూప, జె.భవిత, కె.గాయత్రి, టి.సరయు, బి.యశస్విని, షేక్ షమీన, ఆర్.వీరగంగ నాగేంద్ర, పి.ప్రణవ్ సాయిగణేష్ సాధించారని, 435పైన 32 మంది, 433 పైన 91మంది, 430 పైన 167 మంది, 400 పైగా మార్కులు 463 మంది సాధించారని, అలాగే 99.47 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆయన తెలిపారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు ఏడుగురు విద్యార్థులు ఎం.ప్రియహాసిని, సీహెచ్ హరిసూర్య, పి.పవిత్ర, కె.మానస, ఎం.లేఖన, ఎస్.సాయిలిఖిత, పి.ధాత్రికావ్యశ్రీ సాధించారని, 23 మంది విద్యార్థులకు 990 మార్కులు, 331 మంది విద్యార్థులకు 985 మార్కుల పైన, 791 మంది విద్యార్థులకు 980 మార్కుల పైన, 2151 మంది విద్యార్థులకు 950 మార్కులపైన సాధించారని, 99.98 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆయన తెలిపారు. బైపీసీ విభాగంలో 1000 మార్కులకు షేక్ ఫాతిమున్నీసా బేగం 991 మార్కులు, పి.నాగవైష్ణవి, సీహెచ్వీడీ రేణుక, ఎన్.వైష్ణవి, బి.హర్షిత, ఎన్.మణి, జి.రితిక 990 మార్కులు సాధించారని, 108 మంది విద్యార్థులు 980 పైన, 204 మంది విద్యార్థులు 970 పైన, 297 మంది విద్యార్థులు 950 మార్కులపైన సాధించారని, అలాగే 100 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా అత్యధికమార్కులు వచ్చిన విద్యార్థులను విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు అభినందించారు. ఈ కార్యక్రమంలో తిరుమల విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరి, విద్యాసంస్థల టీచింగ్, నాన్టీచింగ్ స్టాఫ్ పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి హాకీ విజేత కాకినాడ
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో ఈనెల 6 నుంచి 9 వరకు జరిగిన రాష్ట్రస్థాయి అంతర్ జిల్లాల జూనియర్స్ హాకీ పోటీలలో కాకినాడ జిల్లా బాలుర జట్టు విజేతగా నిలిచిందని జిల్లా హాకీ సంఘ కార్యదర్శి నంబు శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. జిల్లాల విభజన తరువాత సాధించిన ఈ విజయం జిల్లాకు గర్వకారణం అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం కాకినాడ డీఎస్ఏలో జరిగిన కార్యక్రమంలో డీఎస్డీఓ బి.శ్రీనివాస్ కుమార్, పీడీలు రవిరాజు, నూకరాజు, సూరిబాబు, సునీల్, పరశురాం, డిఎస్ఏ హాకీ కోచ్ నాగేంద్రలు విజేతలను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని క్రీడాకారులకు సూచించారు. -
నేడు ఇంటర్ ఫలితాలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఇంటర్మీడియెట్ ఫలితాలు శనివారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. గత నెల 1 నుంచి 19వ తేదీ వరకూ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 127 జూనియర్ కళాశాలలుండగా 51 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల స్పాట్ వేల్యుయేషన్ గత నెల 17 నుంచి ఈ నెల 4వ తేదీ వరకూ నిర్వహించారు. ఈ పరీక్షల ఫలితాలను మన మిత్ర వాట్సాప్ నంబర్ 95523 00009కు హాయ్ అని మెసెజ్ పంపడం ద్వారా చూసుకోవచ్చు. అలాగే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.రిజల్ట్స్బీఐఈ.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు. ఈ ఏడాది ఇంటర్ ప్రథమ సంవత్సరం 22,817 మంది, రెండో సంవత్సరం 20,937 మంది కలిపి మొత్తం 43,754 మంది వి ద్యార్థులు పరీక్షలు రాశారు. నూరు శాతం ఫలి తాలు లక్ష్యంగా ఇంటర్ బోర్డు అధికారులు కార్యాచరణ రూపొందించి, అమలు చేశారు. ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించారు. పరీక్షల్లో ఉత్తీర్ణత, మంచి మార్కు లు ఎలా సాధించాలనే దానిపై అవగాహన కల్పించారు. నమూనా పరీక్షలు నిర్వహించారు. బీఈడీ రికార్డుల మూల్యాంకనం పరిశీలన రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ క్యాంపస్లోని కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో జరుగుతున్న బీఈడీ రికార్డుల మూల్యాంకనాన్ని ఉప కులపతి ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ శుక్రవారం పరిశీలించి, సిబ్బందికి సూచనలిచ్చారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోని అనుబంధ కళాశాలల విద్యార్థులకు చెందిన 2,500 రికార్డుల మూల్యాంకన ప్రక్రియను ఇక్కడి సెమినార్ హాలులో నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య జి.సుధాకర్, ప్రిన్సిపాల్ కె.సుబ్బారావు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
స్తంభాన్ని ఢీకొట్టిన కారు
మామిడికుదురు: మొగలికుదురు గ్రామ పంచాయతీ సమీపంలోని కడలి రోడ్డులో శుక్రవారం తృటిలో ప్రమాదం తప్పింది. కాకినాడ నుంచి వెళ్తున్న కారు రోడ్డు పక్కన ఉన్న పంట కాలువ పావంచాను ఢీ కొట్టి దాని పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. దీంతో విద్యుత్ స్తంభం విరిగిపోయింది. దానికి ఉన్న సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ దూరంగా పడింది. ఈ సమయంలో సమీపంలో ఎవరూ లేక పోవడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. కాకినాడ నుంచి భీమవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి)గండేరా (వెయ్యి) 19,000 గటగట (వెయ్యి) 17,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 18,000 గటగట (వెయ్యి) 16,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
పసుపు ఎగుమతులతో రూ.1,876 కోట్ల ఆదాయం
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): దేశంలో ఉత్పత్తి అయ్యే పసుపునకు అంతర్జాతీయ విపణిలో భారీ డిమాండ్ ఉందని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి తెలిపారు. పసుపు ఎగుమతుల ద్వారా మన దేశానికి ప్రస్తుతం రూ.1,876 కోట్ల ఆదాయం వస్తోందని, వచ్చే ఐదేళ్లలో దీనిని రూ.6 వేల కోట్లకు పైగా పెంచేందుకు బోర్డు కృషి చేస్తోందని చెప్పారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి – జాతీయ వాణిజ్య వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐసీఏఆర్–నిర్కా) శుక్రవారం ఇక్కడ నిర్వహించిన పసుపు పంట భాగస్వాముల సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అధిక కురుకుమిన్ శాతం కలిగిన పసుపు రకాలను సాగు చేస్తే లాభదాయకంగా ఉంటుందన్నారు. మన దేశంలో గోవా మినహా 27 రాష్ట్రాల్లోనూ రైతులు పసుపు సాగు చేస్తున్నారన్నారు. మేఘాలయలో సాగు చేసే లకడాంగ్ అనే పసుపు రకంలో కురుకుమిన్ 9 నుంచి 9.5 శాతం ఉంటుందని, కొంకణ్ ప్రాంతంలో సాగు చేసే రాజాపురి రకంలో 5 నుంచి 6 శాతం ఉంటుందని వివరించారు. మన రాష్ట్రంలోని పాడేరు, లంబసింగి ప్రాంతాల్లో పసుపు సాగుకు అనుకూల వాతావరణం ఉందని చెప్పారు. సేంద్రీయ సాగుపై దృష్టి సారించాలని రైతులకు సూచించారు. ఐసీఏఆర్–నిర్కా డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషుమాధవ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో సాగు చేసే పసుపు రకాలకు భౌగోళిక గుర్తింపు తీసుకు రావడానికి కృషి చేస్తామని చెప్పారు. మన దేశం నుంచి ప్రస్తుతం 1.6 లక్షల టన్నుల పసుపు ఎగుమతి అవుతోందని, ఇది వచ్చే ఐదేళ్లలో 2.7 లక్షల టన్నులకు చేరేలా నిర్కా కృషి చేస్తుందని అన్నారు. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ డైరెక్టర్, వైస్ చాన్సలర్ డాక్టర్ సీహెచ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ, మన దేశంలోని నేలల్లో కర్బన్ శాతం గణనీయంగా తగ్గుతోందని, సేంద్రియ కర్బన్ శాతాన్ని పెంచడానికి మిశ్రమ పంటల సాగు చేపట్టాలని సూచించారు. రైతులకు జాతీయ పసుపు బోర్డు తగు ప్రణాళికలు అందించాలని కోరారు. జాతీయ కిసాన్ సంఘ్ అధ్యక్షుడు కె.సాయిరెడ్డి మాట్లాడుతూ, సాగు ఖర్చుల ఆధారంగా వ్యవసాయ ఉత్పత్తుల ధరలు నిర్ణయిస్తే రైతులకు మేలు జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ దండా రాజిరెడ్డి, రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై.వెంకటేశ్వరరావు, విజ్ఞాన్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ టి.రమేష్బాబు, జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ డైరెక్టర్ రాధికారాణి, ఐటీసీ శాస్త్రవేత్త బీఆర్ రెడ్డి కూడా ప్రసంగించారు. ఈ సందర్భంగా పసుపు పంట విశ్వవిపణిలో భారతదేశ ఆధిపత్యానికి సంబంధించిన వ్యూహాత్మక పత్రాన్ని విడుదల చేశారు. నిర్కా ఏర్పాటు చేసిన స్టాల్లో పసుపు ఉత్పత్తులు, విలువ ఆధారిత పదార్థాల గురించి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సుమన్ కల్యాణి సందర్శకులకు వివరించారు. కార్యక్రమంలో మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు ఉన్నం సింహాద్రి, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ బి.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఫ ఐదేళ్లలో రూ.6 వేల కోట్లకు పెంచేందుకు కృషి ఫ జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గంగారెడ్డి -
ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి
సీతానగరం: మండలంలోని వంగలపూడిలో ఉపాధి కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. వంగలపూడిలో కాలువ పూడిక తీతకు శుక్రవారం 130 మంది కూలీలు వెళ్లారు. వారిలో ఐదుగురు కూలీలు కాలువపై ఉన్న చెట్లను తొలగిస్తున్నారు. ఇంతలో తేనె తుట్టైపె ఉన్న ఈగలు ఒక్కసారిగా వచ్చి వారిలో ముగ్గురిపై దాడి చేశాయి. సమాచారం అందుకున్న ఏపీఓ బీవి సత్యవతి సంఘటన స్థలానికి వెళ్లి తేనెటీగల దాడికి గురైన కోడెల్లి గంగరాజు, ఆరుగుల వెంకటేశ్వర్లు, ఓరిగంటి పాపలను సీతానగరం పీహెచ్సీకి తరలించి వైద్యసేవలు అందించారు. ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. -
సాక్షిపై అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలి
ఫ కక్షసాధింపు బాధాకరం ఫ పత్రికా స్వేచ్ఛను పరిరక్షించాలి ఫ జర్నలిస్టుల డిమాండ్ ఫ ఏఎస్పీకి వినతి కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాష్ట్రంలో అరాచకాలను ప్రశ్నిస్తూ వార్తలు రాసిన సాక్షి పత్రికపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగడం బాధాకరమని జర్నలిస్టు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షి పత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, మరో ఆరుగురు పాత్రికేయ సిబ్బందిపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, పత్రికా స్వేచ్ఛను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఫర్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే), మీడియా మిత్రుల ఆధ్వర్యాన జిల్లా ఏఎస్పీ సుబ్బరాజుకు శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తను హత్య చేసిన టీడీపీ గుండాల అరాచకాన్ని శ్రీసాక్షిశ్రీ పత్రిక వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ హత్య కేసును పక్కదారి పట్టిస్తూ, మీడియాను భయభ్రాంతులకు గురి చేసేలా సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డితో పాటు పల్నాడుకు చెందిన సాక్షి జర్నలిస్టులపై పోలీసులు కేసులు బనాయించారు. దీనిని జర్నలిస్టు నాయకులు తీవ్రంగా నిరసించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పింఛనుకు వచ్చిన వ్యక్తిని కొందరు వ్యక్తులు హతమార్చారని, దీనిపై సాక్షి కథనం ప్రచురిస్తే దానిపై కక్ష సాధింపు చర్యలకు దిగడం బాధాకరమని అన్నారు. హత్య వెనుక కుట్ర కోణంపై పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి, నిందితులకు కఠిన శిక్ష వేయాలన్నారు. అంతే తప్ప, అక్రమ కేసులు బనాయిస్తూ పత్రికా స్వేచ్ఛను, రాజ్యాంగ హక్కులను కాలరాయడం తగదని అన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తామని ఏఎస్పీ సుబ్బరాజు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడు మండెల శ్రీరామమూర్తి, ఎన్టీవీ శ్రీనివాస్, సాక్షి స్టాఫ్ రిపోర్టర్ షేక్ ఫయాజ్ బాషా, సాక్షి టీవీ విలేకరి హరీష్, ఆంధ్రప్రభ గోపి, శేఖర్రెడ్డి, విశ్వనాథం, సత్యంబాబు, దానవాయిబాబు. గంగాధర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
భద్రతా లక్ష్యాల సాధనలో..
యుద్ధ నౌకపై హెలికాప్టర్ విన్యాసాలునాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): భారత్, అమెరికా దేశాలు సంయుక్తంగా కాకినాడ బీచ్లో నిర్వహిస్తున్న ఎక్సర్సైజ్ టైగర్ ట్రయంఫ్ శుక్రవారం ఘనంగా ముగిసింది. హెదరాబాద్ యూఎస్ కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ మాట్లాడుతూ మానవత సహాయ, విపత్తు ప్రతిస్పందన, కాల్పనిక ప్రకృతి వైపరీత్యం తరువాత ఫీల్డ్ ఆసుపత్రి ఏర్పాటు, సరఫరా, పంపిణీ ప్రదేశాలను ఏర్పాటు చేయడం వంటి బాధ్యతలను సంయుక్త బలగాలు చేపట్టాయని తైలిపారు. భారత్తో కలిసి రెండో సారి ఈ విన్యాసాలు చేయడం గర్వంగా ఉందన్నారు. టైగర్ ట్రయంఫ్ వంటి వ్యాయామాల ద్వారా యూఎస్, భారత్ పరస్పర భద్రతా లక్ష్యాలు సాధించడానికి ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. వారం రోజుల పాటు జరిగిన వ్యాయామం, ఉభయచర ల్యాండింగ్ తదితర అంశాలు ముగిసాయని తెలిపారు. విశాఖలో వారంరోజుల పాటు ఆపరేషన్ ప్రణాళిక, యూనిట్–స్థాయి శిక్షణ, సబ్జెక్ట్ నిపుణుల మార్పిడి, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయన్నారు. యూఎస్ నేవీకి సంబంధించిన విడ్బే ఐలాండ్, క్లాస్ డాక్ ల్యాండింగ్ అధికారికంగా జరగాల్సిందన్నారు. ఏప్రియల్ 1న జలాశ్వలో ప్రారంభమైన ఈ వేడుకలో 3 వేల మంది సిబ్బంది, నాలుగు నౌకలు, ఏడు విమానాలు పాల్గొన్నాయని తెలిపారు. ముగిసిన టైగర్ ట్రయంఫ్–2025 విన్యాసాలు చేయడం గర్వంగా ఉందన్న యూఎస్ కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ -
లారీ ఢీకొని వృద్ధుడి మృతి
మామిడికుదురు: నగరం గ్రామంలో ఓఎన్జీసీ రిఫైనరీ గేటు ఎదురుగా 216వ నెంబర్ జాతీయ రహదారిపై లారీ సైకిల్ను ఢీకొట్టిన ప్రమాదంలో వృద్ధుడు దుర్మరణం పాలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే పి.గన్నవరం మండలం మానేపల్లికి చెందిన కోన వెంట్రావు (70) రిఫైనరీ గేటు ఎదురుగా ఉన్న హోటల్లో టిఫిన్కి వెళ్లాడు. అక్కడ టిఫిన్ లేక పోవడంతో పక్కనే ఉన్న మరో హోటల్కి వెళ్లి సైకిల్ నడిపించుకుంటూ రోడ్డు దాటుతున్నాడు. అప్పటికే కదలిన ఓఎన్జీసీ మెయింటెనెన్స్కు సంబంధించిన లారీ ప్రమాదవశాత్తూ వృద్ధుడిపై నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనలో లారీ వెనుక చక్రం వృద్ధుడి పొట్ట కింది భాగం నుంచి వెళ్లడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న 108 వాహనం వచ్చి అందులోని సిబ్బంది సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. నగరం ఎస్సై ఎ.చైతన్యకుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. మోటారు సైకిల్ ఢీకొని..ముమ్మిడివరం: నడిచి వెళుతున్న వ్యక్తి మోటారు సైకిలిస్టు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కొమానపల్లి పంచాయతీ పరిధిలోని కొత్తకాలువకు చెందిన శీలం నాగేశ్వరరావు (54) గురువారం సాయంత్రం కూలిపనికి వెళ్లి తిరిగి వస్తూ రోడ్డు దాటుతుండగా యానాం నుంచి వస్తున్న మోటారు సైకిలిస్టు అతనిని ఢీకొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన నాగేశ్వరరావును అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్య సేవలు అందించిన తరువాత ఇంటికి తీసుకు వచ్చి శుక్రవారం ముమ్మిడివరం ప్రవేటు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. నాగేశ్వరరావు కుమారుడు దుర్గాప్రసాద్ ఫిర్యాదు మేరకు ఎస్సై డి.జ్వాలాసాగర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైలు ఢీకొని.. తుని: అన్నవరం–రావికంపాడు మధ్యలో రైలు ఢీకొని (45) ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్టు తుని జీఆర్పీ ఎస్సై జి.శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం అందిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించామన్నారు. మృతుడు నలుపు, తెలుపు, ఆరెంజ్ రంగు అడ్డచారల టీషర్ట్, సిమెంట్ రంగు ఫ్యాంట్ ధరించాడని, కుడిచేయి దండపై పెద్దసైజు టాటూ ఉందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. అప్పుల బాధతో వివాహిత ఆత్మహత్య అల్లవరం: మండలం తాడికోన గ్రామానికి చెందిన గెడ్డం నాగమణి పురుగుమందు తాగి చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందినట్టు ఎస్సై తిరుమలరావు తెలిపారు. అంగన్వాడీ టీచర్ అయిన ఆమె ఇటీవల ఇల్లు నిర్మించి అప్పుల పాలై గత నెల 23న హార్పిక్లో గడ్డిమందు కలిపి తాగింది. సుమారు 20 రోజుల పాటు అమలాపురంలోకి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. పోక్సో కేసులో నిందితుడికి యావజ్జీవం చాగల్లు: మండలంలోని ఊనగట్ల గ్రామంలో మతి స్థిమితం లేని 16 ఏళ్ల బాలికను అపహరించి అత్యాచారం చేసిన ఘటనలో రాజమహేంద్రవరం నామవరానికి చెందిన నందా శ్రీను అనే వ్యక్తికి యావజ్జీవ కారాగారశిక్ష విధిస్తూ ఏలూరు పోక్సో కోర్టు జడ్జి ఎస్.ఉమా సునంద తీర్పు ఇచ్చినట్టు ఎస్సై కె.నరేంద్ర శుక్రవారం తెలిపారు. 2017 జూలై 19న బాలికపై అత్యాచారం చేయడంతో తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో నందా శ్రీనుపై అప్పటి ఎస్సై జయబాబు కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి యావజ్జీవ కారాగారశిక్ష విధించినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
స్ఫూర్తిప్రదాత ఫూలే
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): సమాజంలో చైతన్యం తీసుకుని రావడం ద్వారా మహాత్మా జ్యోతిరావు ఫూలే స్ఫూర్తిప్రదాతగా నిలిచారని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. ఫూలే జయంతి సందర్భంగా గోదావరి గట్టున ఉన్న ఆయన విగ్రహానికి కలెక్టర్ శుక్రవారం పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ, దేశంలో మహాత్మా అని గాంధీజీని, ఫూలేను మాత్రమే పిలుచుకుంటామని అన్నారు. వారికి సమాజం ఇచ్చిన గౌరవానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనమని చెప్పారు. అభివృద్ధి ఫలాలు అందని అణగారిన వర్గాల కోసం పోరాడిన మహనీయుడు ఫూలే అని అన్నారు. వెనుకబడిన వర్గాల వారు అభివృద్ధి చెందడానికి చదువు ఎంతో అవసరమని చాటిచెప్పారన్నారు. సీ్త్ర విద్యను ప్రోత్సహిస్తే కుటుంబం, తద్వారా సమాజం అభివృద్ధి చెందుతుందని నమ్మి ఆచరణలో చూపించిన వ్యక్తి జ్యోతిరావ్ ఫూలే అని కలెక్టర్ ప్రశాంతి చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు తదితరులు పాల్గొన్నారు. ఫూలే జయంతి సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ప్రతిమ ప్రతిభ చూపిన 110 మంది విద్యార్థినీ విద్యార్థులకు ఫూలే సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యాన రూ.1.10 లక్షలు, బీసీ కార్పొరేషన్ ద్వారా 144 మంది బీసీ, కాపు, ఈబీసీ వర్గాల లబ్ధిదారులకు రూ.352 లక్షల చొప్పున స్వయం ఉపాధి పథకాల అమలుకు ఆర్థిక సహాయం అందించామని కలెక్టర్ తెలిపారు. చంద్రబాబువి డైవర్షన్ పాలిటిక్స్ రాజమహేంద్రవరం రూరల్: ఐ–టీడీపీతో ముఖ్యమంత్రి చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. మీడియా ముందు చేబ్రోలు కిరణ్తో మాట్లాడించడం, తప్పు అని చెప్పడం, క్షమాపణ కోరడం, అరెస్టు చేయడం అన్నీ చంద్రబాబు, ఐ–టీడీపీ స్క్రిప్ట్లో భాగమేనని పేర్కొన్నారు. టీడీపీ అనుకూల మీడియాలో డిబేట్లు చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోందన్నారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎక్కడకు వెళ్లినా ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి కూటమి ప్రభుత్వం ఓర్వలేకపోతోందని అన్నారు. మహాశక్తి లాంటి వైఎస్ జగన్ను అడ్డుకునేందుకు అబద్ధాలు ప్రచారం చేయడంతో పాటు, ఆయన కుటుంబంపై దారుణ వ్యాఖ్యలు చేయడం ద్వారా వారిని మనోవేదనకు గురి చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాప్తాడులో వైఎస్ జగన్కు సరైన భద్రత కల్పించలేదన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ప్రజలు అన్ని విషయాలూ గమనిస్తున్నారని, తగిన బుద్ధి చెబుతారని చెప్పారు. ఇప్పటికై నా చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ మాని, ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలని వేణు హితవు పలికారు. షార్ట్టర్మ్ ఇంటర్న్షిప్నకు దరఖాస్తుల ఆహ్వానం రాజమహేంద్రవరం రూరల్: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యాన సమ్మర్ ఆన్లైన్ షార్ట్టర్మ్ ఇంటర్న్షిప్ కార్యక్రమం–2025 ప్రారంభిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి వీజీడీ మురళి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో మూడు, నాలుగో సంవత్సరం ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థుల కోసం ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా రూపొందించామన్నారు. సీఎస్ఈ, ఐటీ, ఈసీఈ, ఈఈఈ, మెకానికల్, సివిల్ శాఖల విద్యార్థులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రెండు నెలల పాటు కొనసాగే ఈ ఇంటర్న్షిప్లో 80 గంటల థియరీ, 40 గంటల ప్రాక్టికల్ తరగతులు నిర్వహిస్తారని వివరించారు. ప్రధాన కోర్సుల్లో ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కంప్యూటింగ్, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్, డేటా అనాలిసిస్ పైథాన్, డిజంగో వెబ్ డెవలప్మెంట్, ఎంబెడెడ్ సిస్టమ్స్, యూనిటీ 3డీ గేమింగ్ డిజైన్, కాటియా ఎక్స్పర్ట్ డిజైన్ రెవిట్ ఆర్కిటెక్చర్ మోడలింగ్ తదితర కోర్సులలో నైపుణ్యం పెంచేందుకు ఆన్లైన్లో ఈ శిక్షణ ఇస్తారని మురళి తెలిపారు. రోజువారీ క్విజ్లు, వారానికోసారి అసెస్మెంట్లు, ప్రాజెక్ట్ సమీక్ష కూడా ఉంటాయని పేర్కొన్నారు. శిక్షన విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు ఏపీఎస్ఎస్డీసీ నుంచి సర్టిఫికెట్ అందజేస్తామన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు రూ.1,000 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలని తెలిపారు. తొలి విడత ఇంటర్న్షిప్ ఈ నెల 28న, రెండో విడత మే 12న ప్రారంభిస్తారని తెలిపారు. అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు https://naipunyam.ap.gov.in/user®istration?page=online&short&term& internship వెబ్సైట్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు 99888 53335, 87126 55686, 87901 18349, 87901 17279 మొబైల్ నంబర్లలో ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకూ సంప్రదించవచ్చని మురళి తెలిపారు. -
అనధికార లే అవుట్లపై చర్యలు
రాజమహేంద్రవరం సిటీ: అనధికార లే అవుట్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాజమహేంద్రవరం నగరాభివృద్ధి సంస్థ (రుడా) వైస్ చైర్మన్ కేతన్ గార్గ్ హెచ్చరించారు. అనధికార లే అవుట్లపై తీసుకుంటున్న ఎన్ఫోర్స్మెంట్ చర్యలపై రుడా పరిధిలోని గ్రామ పంచాయతీల కార్యదర్శులతో శుక్రవారం ఆయన తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనధికార లే అవుట్ల వలన ప్రజలకు, డెవలప్మెంట్ చార్జీల రూపంలో పంచాయతీలు కోల్పోతున్న ఆదాయం, తద్వారా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కలిగే అడ్డంకులు వంటి వాటిపై అవగాహన కల్పించారు. ప్రతి పంచాయతీ పరిధిలో వారం రో జుల్లోగా ప్రతి అనధికార లే అ వుట్ను గుర్తించాలని ఆదేశించా రు. ఆ వివరాలను పంచాయతీ కార్యాలయం నోటీస్ బోర్డు, ముఖ్య ప్రదేశాల్లో ప్రదర్శించాల ని సూచించారు. ఈ కార్యక్రమం అమలుపై ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహిస్తామని, నిర్లక్ష్యం వహించే పంచాయతీ కార్యదర్శులపై క్రమశిక్షణ చర్యలకు సిఫారసు చేస్తామని కేతన్ గార్గ్ హెచ్చరించారు. -
స్వామీ.. భద్రతేదీ..!
ఫ అన్నవరం దేవస్థానంలో భద్రతకు ఏటా రూ.4.50 కోట్లు ఫ కానరాని లగేజీ స్కానర్లు, మెటల్, హ్యాండ్ డిటెక్టర్లు ఫ 2020లోనే ఇంటెలిజెన్స్ నివేదిక ఫ నాలుగేళ్లయినా అమలుకు నోచుకోని వైనం అన్నవరం: కొద్ది రోజుల కిందట ఓ సత్రంలో మద్యం సీసాల కలకలం.. తాజాగా మద్యం తాగి ఆలయానికి వెళ్తూ పట్టుబడిన నలుగురు వ్యక్తులు.. కారులో మద్యం సీసాలు.. ఇలా వరుసగా జరుగుతున్న ఘటనలు అన్నవరం దేవస్థానంలో భద్రతా ఏర్పాట్లను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఇటీవల తనిఖీలు పెరిగినా అవి మద్యం తాగిన వారిని పట్టుకోవడానికి, మద్యం సీసాలతో రత్నగిరికి వెళ్తున్న వారిని నిరోధించడానికి మాత్రమే పరిమితమవుతున్నాయి. భక్తుల లగేజీని స్కానర్లతోను, భక్తులను మెటల్ డిటెక్టర్లతోను తనిఖీ చేయడం వంటివి దేవస్థానంలో జరగడం లేదు. దేవస్థానంలో భద్రతా చర్యలకు ఏటా రూ. 4.5 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ మొత్తాన్ని 14 మంది స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) సిబ్బందికి జీతాలు, సుమారు 40 మంది హోం గార్డులు, 60 మంది సెక్యూరిటీ గార్డులకు జీతాల రూపంలో ఖర్చు చేస్తున్నారు. వీరిలో ఆయుధాలు కలిగి ఉండే ఎస్పీఎఫ్ సిబ్బంది ఆలయం చుట్టూ మాత్రమే ఉంటారు. వారు 24 గంటలూ అక్కడే ఉంటారు. మిగిలిన భద్రతా విషయాలు వారి పరిధిలో లేవు. ట్రాఫిక్ క్లియర్ చేయడం, స్వామివారి ఆలయం దిగువన క్యూ లైన్ల వద్ద, రోడ్డు జంక్షన్లు, ఉత్సవాల సమయంలో భద్రతా విధుల్లో హోం గార్డులు పాల్గొంటున్నారు. సెక్యూరిటీ గార్డులు కూడా దాదాపు ఇవే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒక్క అంచె తనిఖీ కూడా లేదు తిరుమల – తిరుపతి దేవస్థానంలో మూడంచెల్లో తనిఖీలు చేస్తూంటారు. కొండ దిగువన అలిపిరి వద్ద భక్తుల లగేజీని యంత్రాలతో స్కాన్ చేసి క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. ఆ తరువాత స్వామివారి దర్శనానికి కంపార్ట్మెంట్ లోపలకు వెళ్లే ముందు మరోసారి తనిఖీ చేస్తారు. అనంతరం ఆలయానికి సమీపానికి చేరుకున్నాక క్యూ లైన్లో మరోసారి తనిఖీ జరుగుతుంది. కానీ, అన్నవరం దేవస్థానంలో పకడ్బందీగా ఒక్క అంచెలో కూడా తనిఖీ జరగడం లేదు. లగేజీ తనిఖీ నామమాత్రమే సత్యదేవుని దర్శనానికి వస్తున్న భక్తుల లగేజీని టోల్గేట్ వద్ద సిబ్బంది తనిఖీ చేస్తున్నారు. ఆ సందర్భంగా మద్యం సీసాలు, మాంసాహారం, లేదా మద్యం తాగి పట్టుబడితే చర్యలు తీసుకుంటున్నారు. ఈ తనిఖీలు కూడా సాధారణ రోజుల్లోనే జరుగుతున్నాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండే రోజుల్లో వాహనాల తనిఖీ సాధ్యమే కావడం లేదు. ఒక వాహనం తనిఖీ చేయడానికి 10 నిమిషాలు పడితే, ఆ సమయంలో వెనుక చాలా వాహనాలు నిలిచిపోతాయి. దీంతో తూతూమంత్రంగా తనిఖీలు చేసి పంపించేస్తున్నారు. కార్తికం, వైశాఖం, శ్రావణ మాసాలతో పాటు వివాహాల సీజన్, ఉత్సవాల సమయంలో భక్తులు వేలాది కార్లలో రత్నగిరికి తరలి వస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో యంత్రాల సాయం లేకుండా ఆ కార్లను తనిఖీ చేయడం సాధ్యం కాని పని. ఇంటిలిజెన్స్ అధికారుల సూచనలివీ.. భద్రతను కట్టుదిట్టం చేసేందుకు పోలీస్ ఇంటెలిజెన్స్ అధికారులు 202లో అన్నవరం దేవస్థానంలో పర్యటించారు. ఆ సందర్భంగా పలు సూచనలతో నివేదిక అందజేశారు. వారి సూచనలివీ.. ఫ రత్నగిరి టోల్గేట్ వద్ద కచ్చితంగా రెండు లగేజీ స్కానర్లు ఏర్పాటు చేయాలి. భక్తుల లగేజీ స్కాన్ చేశాక మాత్రమే ఆ వాహనాలను అనుమతించాలి. ఫ దేవస్థానం బస్సులలో వచ్చే వారి లగేజీ కూడా తనిఖీ చేయాలి. ఫ రత్నగిరి మెట్ల దారి వద్ద కూడా లగేజీ స్కానర్ ఏర్పాటు చేసి, ఆ ప్రక్రియ పూర్తి చేశాక మాత్రమే భక్తులను కొండ పైకి అనుమతించాలి. ఫ స్వామివారి ఆలయ ప్రాంగణం లోపలకు వెళ్లేచోట, ఆలయం వద్ద, వెలుపలకు వచ్చేచోట మెటల్ డిటెక్టర్ డోర్లు ఏర్పాటు చేయాలి. ఫ ప్రతి భక్తుడిని హ్యాండ్ డిటెక్టర్లతో తనిఖీ చేశాకే లోపలకు అనుమతించాలి. ఫ స్వామివారి ఆలయానికి రాకపోకలు సాగించేందుకు ఎంట్రన్స్, ఎగ్జిట్ రెండు దారులు మాత్రమే ఉండాలి. ఎక్కువ ఉండకూడదు. ఫ దేవస్థానంలో అన్ని ప్రాంతాలూ కవరయ్యేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. సీసీ టీవీ ఫుటేజ్లు పరిశీలించడానికి సిబ్బందిని 24 గంటలూ అందుబాటులో ఉంచాలి. సీసీ టీవీ ఫుటేజ్లను స్థానిక పోలీసులు కూడా పరిశీలించాలి. అరకొరగానే సూచనల అమలు ఇంటెలిజెన్స్ అధికారుల సూచనల్లో 10 శాతం కూడా దేవస్థానంలో ప్రస్తుతం అమలవడం లేదు. ఎక్కడా లగేజీ స్కానర్లు లేవు. మెటల్ డిటెక్టర్ డోర్లు లేవు. ఒకటి రెండుచోట్ల ఉన్నా పని చేయడం లేదు. భక్తులను తనిఖీ చేసేందుకు హ్యాండ్ డిటెక్టర్లు కూడా లేవు. స్వామివారి ఆలయానికి రెండుకన్నా ఎక్కువ మార్గాలే ఉన్నాయి. చాలాచోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు కానీ, సత్యగిరిపై మాత్రం ఇంకా అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేయలేదు. దీంతో కొంతమంది టోల్గేట్ వద్ద సెక్యూరిటీ గార్డుల కళ్లుగప్పి మద్యం సీసాలు తెచ్చుకుని అక్కడ తాగుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీసీ ఫుటేజ్ను భద్రతా సిబ్బంది కాకాకుండా సాధారణ కాంట్రాక్ట్ ఉద్యోగులే పరిశీలిస్తున్నారు. అటకెక్కిన లగేజీ స్కానర్ల ప్రతిపాదనటోల్గేట్ వద్ద లగేజీ స్కానర్లు ఏర్పాటు చేయాలని 2023లో అప్పటి ఈఓ చంద్రశేఖర్ ఆజాద్ భావించారు. ఈ మేరకు అలిపిరి వెళ్లి, అక్కడ ఏవిధంగా తనిఖీ చేస్తున్నారో పరిశీలించి, నివేదిక ఇవ్వాలని దేవస్థానం ఈఈని ఆదేశించారు. ఆ నివేదిక వచ్చాక టోల్గేట్ వద్ద పెద్ద షెడ్డు నిర్మించి, భక్తుల లగేజీ స్కాన్ చేయడానికి రెండు స్కానర్లు కొనుగోలు చేయాలని ఆయన నిర్ణయించారు. లగేజీ స్కాన్ చేసేటప్పుడు వాహనాలు నిలిచిపోతే ట్రాఫిక్కు ఇబ్బంది కలుగుతుందని భావించి, కళాశాల మైదానంలో నుంచి ఘాట్ రోడ్డు వరకూ మరో రోడ్డు నిర్మించారు. భక్తుల వాహనాలు కళాశాల మైదానంలోకి చేరుకుని, అక్కడి నుంచి స్కానింగ్ అయ్యాక ఘాట్ రోడ్డులోకి ప్రవేశించి రత్నగిరికి వెళ్లేలా ప్రణాళిక రూపొందించారు. అలాగే, ఆటోలు, బైక్ల మీద వెళ్లేవారిని కూడా టోల్గేట్ వద్ద తనిఖీ చేయాలని నిర్ణయించారు. ఆయన బదిలీ అనంతరం టోల్గేట్ వద్ద షెడ్డు నిర్మించారు తప్ప లగేజీ స్కానర్లు, ఇతర చర్యలు తీసుకోలేదు. దీంతో, రద్దీ సమయంలో తనిఖీలు తూతూమంత్రంగానే జరుగుతున్నాయి. గతంలో ఇంటెలిజెన్స్ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా దేవస్థానంలో ఇప్పటికై నా అధికారులు, పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేపట్టాల్సి ఉంది. -
గుర్రాల జోరు.. కుర్రకారు హుషారు!
పిఠాపురం: రేసు గుర్రాల గిట్టల హోరుతో గొల్లప్రోలు మండలం చేబ్రోలు మారుమోగింది. ఉత్కంఠ మధ్య రెప్ప పాటులో గమ్యాన్ని చేరుకోడానికి గుర్రాలు దౌడు తీస్తుంటే రేగిన దుమ్ములో జనం కేరింతలు కొట్టారు. ఎప్పుడో పదేళ్ల క్రితం జిల్లాలో సామర్లకోటలో జరిగిన గుర్రప్పందేలు తరువాత మళ్లీ ఇప్పుడే జరగడంతో వాటిని చూసేందుకు జనం తండోపతండాలుగా తరలివచ్చారు. చేబ్రోలులో శ్రీరామ నవమి ఉత్సవాల సందర్భంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం రాష్ట్ర స్థాయి గుర్రాల పరుగు పోటీ నిర్వహించారు. ఏటా ఈ పందేలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఏడాది కొత్తగా గుర్రప్పందేలు నిర్వహించారు. రాష్ట్రం నలు మూలల నుంచి సుమారు 35 గుర్రాలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి. ఈ పందాల్లో చేనుల అగ్రహారం మణికి చెందిన జెస్సీ గుర్రం ప్రధమ స్థానాన్ని కై వసం చేసుకుంది. రామన్నపాలేనికి చెందిన చోడమాంబిక గుర్రం విక్రమ్ రెండోస్థానాన్ని, అంకుపాలేనికి చెందిన మోదమాంబకు చెందిన గుర్రం మురుగన్ మూడోస్థానాన్ని కై వసం చేసుకుంది. ఆర్ఆర్ పేటకు చెందిన దాడి రాముడు గుర్రం భగి, సింగపూర్ సత్యనారాయణకు చెందిన గుర్రం దేవర, కోటనందూరుకు చెందిన శివరాజ్ బ్రదర్స్ గుర్రం రాఖీ, సామర్లకోటకు చెందిన జగదీష్ రాజా గుర్రం, శివరాజ్ బ్రదర్స్ గుర్రం చిన్ని, ఆర్ఆర్పేటకు చెందిన దాడి నూక హనుమంత్ గుర్రం కాళీ, చోడమాంబిక గుర్రం రాకెట్ వరుసగా నాలుగు నుంచి పది స్థానాల్లో నిలిచి బహుమతులు గెలుచుకున్నాయి. విజేతలకు ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు బహుమతులు అందజేశారు. చేబ్రోలులో ఉత్సాహంగా గుర్రప్పందేలు విజేతలకు బహుమతులు అందజేత -
క్షేత్రం నుంచి క్షాత్రానికి!
పిఠాపురం: వ్యవసాయంలో ప్రత్యేక పాత్ర పోషించే ఎడ్లు నేడు పరుగు పందేలలో ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. పూర్వం నుంచి ఎడ్ల పందాలు కొనసాగుతున్నప్పటికీ కొన్ని ప్రాంతాలకు పండుగలకు మాత్రమే పోటీలు పరిమితమయ్యేవి. ఆ సరదా పోటీలు నేడు మామూలు సందర్భాలలోనూ కొనసాగుతున్నాయి. గెలుపే లక్ష్యంగా రూ.లక్షలు వెచ్చించి మరీ పోటీలకు ఎడ్లను పెంచడంలో పలువురు రైతుల ఆసక్తి చూపుతున్నారు. పందెంలో గెలిస్తే వచ్చేది చిన్న మొత్తమే అయినా దాని ద్వారా వచ్చే సంతృప్తి వెలకట్టలేనిదని వారంటున్నారు. వ్యవసాయ రంగంలో యంత్ర విప్లవం రావడంతో ఎడ్ల పాత్ర గణనీయంగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో వాటిని మరో విధంగా వినియోగిస్తున్నప్పటికీ కొందరు రైతులు ఎడ్ల బండ్ల పోటీల కోసం ప్రత్యేకంగా పెంచుతున్నారు. జిల్లాలో ప్రతి నెలా ఏదో ఒక చోట ఎడ్ల పరుగు పందాలు జరుగుతుండగా రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి పందేల కోసం రైతులు తమ ఎడ్లను తీసుకుస్తున్నారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలులో శనివారం రాష్ట్ర స్థాయి ఎడ్ల పందాలు నిర్వహించనున్నారు. జిల్లాలో లైను పందాలు ఆడుతుండగా, ఇతర జిల్లాల్లో రౌండు పందాలు ఆడుతుంటారు. వీటికి సెపరేటు పరుగు పందాలలో పాల్గొనే ఎడ్లకు గిత్తల ప్రాయం నుంచి ప్రత్యేక శిక్షణ ఇస్తుంటారు. కేవలం ఒక సంవత్సరం వయసు నుంచే చిన్న సైజు బండ్లకు కట్టి పరుగులో శిక్షణ ఇస్తుంటారు. సాధారణ ఎడ్లలా కాకుండా నిత్యం బండి కట్టి పరుగులు పెట్టిస్తు సమయానుకూలంగా దూరాలను లక్ష్యంగా పెట్టి పరుగు పెట్టిస్తుంటారు. సాధారణంగా మైసూరు, దేశవాళీ ఎడ్లను పరుగు పందేలకు వినియోగిస్తారు. పరుగు పందేలలో పాల్గొనే ఎడ్ల ఖరీదు రూ.లక్షలు పలుకుతోంది. ఒక్కో ఎద్దు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పలుకుతుంది. ఒక రకంగా ఒకే జాతికి చెందిన రెండు ఎడ్లను కొనడానికి ఎంత ఖర్చై నా రైతులు వెనుకాడడం లేదు. ఇతర జిల్లాలకు వెళ్లి మరీ రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. మేతలోనే సత్తా పందాలలో పాల్గొనే ఎడ్లకు ప్రత్యేకమైన మేతతో మేపుతుంటారు. కేవలం ప్రత్యేకమైన దాణా పెడుతుంటారు. ఉలవలు, రాగులు, జొన్నలు, నిత్యం ఉడకబెట్టి నానబెట్టిన ఎండుగడ్డి ముక్కలలో వేసి దాణాగా మేపుతారు. వీటి మేతకు సంవత్సరానికి సుమారు రూ.3 లక్షల వరకు వ్యయమవుతుందని రైతులు చెబుతున్నారు. పందేలు ఉన్నా లేకపోయినా వీటి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తప్పదని, మేతలో ఎప్పుడు మార్పు లేకుండా ఖర్చుకు వెనుకాడకుండా మేపాల్సి ఉందంటున్నారు. బండి సదుపాయాలు ప్రత్యేకమైనవి సాధారణంగా బరువులు లాగే ఎడ్ల బళ్లు చాలా బరువుగా పటిష్టంగా పెద్దపెద్ద చక్రాలతో ఉంటాయి. ప్రస్తుతం ఆ చెక్క చక్రాల స్థానంలో టైర్లు వచ్చాయి. గతంలో కేవలం ప్రత్యేకమైన చెక్కతో చేసిన చక్రాలు గల బళ్లు ఉండేవి. కాని పరుగు పందాలలో ఉపయోగించే బళ్లు మాత్రం ప్రత్యేకంగా తయారు చేయిస్తారు. బరువు తక్కుగా ఉండేలా పటిష్టంగా చిన్న సైజులో అందంగా తయారు చేయిస్తారు. వాటికి వివిధ రంగులు వేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. రూటు మార్చిన బసవడు ఏటా పెరుగుతున్న ఎడ్ల పందాలు రూ.లక్షలు పలుకుతున్న పందెపుటెడ్లు ప్రత్యేక పోషణ, సాధన, రక్షణలో జాగ్రత్తలు తీసుకుంటున్న రైతులు గెలుపు కిక్కే వేరంటున్న యజమానులు నేడు చేబ్రోలులో పోటీలకు సమాయత్తం ఎడ్లకు ఎయిర్ కూలర్లు కంటిలో లోపం రాకుండా దుమ్ము ధూళి పడినా కంటి చూపు దెబ్బతినకుండా లక్ష్యం వైపు దూసుకుపోయే విధంగా పందెం ఎడ్ల కళ్లకు కాటుక పెడుతుంటారు. పరిగెట్టి అలిసిపోయిన ఎడ్లకు మనుషుల మాదిరిగానే జండూబామ్ వంటి మందులతో మసాజ్ చేస్తుంటారు. రాత్రి సమయాల్లో ఈగలు, దోమలు కుట్టకుండా దోమ తెరలతో పాటు ప్రత్యేకంగా ఎయిర్ కూలర్లు వాడుతున్నారు. పది నిమిషాల పరుగుకు పది నెలల సాధన పందెంలో ఎడ్లు పది నిముషాలు పరుగు పెట్టాలంటే పది నెలల ముందు నుంచి ప్రత్యేక శిక్షణ, ప్రత్యేక సంరక్షణ ఉంటుంది. ఎంతో శ్రమకోర్చి వాటిని పెంచి పోషిస్తుంటాం. ఎడ్ల పందేలు మన సంప్రదాయం. ఎన్నో ఏళ్లుగా మా తాతల నాటి నుంచి కొనసాగిస్తున్నాం. పందేల్లో పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ప్రతి రోజు పరుగులో శిక్షణ ఇస్తుంటాం. మేతకు ఎక్కువ ప్రాధాన్యనిస్తాం. బలవర్ధకమైన ఆహారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. – రవీంద్రనాథ్ చౌదరి, రైతు, మండపేట ఆనందం కోసమే అంత కష్టం మా కుటుంబంలో పూర్వం నుంచి ఎడ్లను పోషిస్తున్నాం. ముఖ్యంగా పరుగు పందేలంటే మాకు చాలా ఇష్టం. ఏటా వీటి పోషణకు రూ.లక్షలు ఖర్చు అవుతున్నా పోటీలలో గెలుపు సాధించినప్పుడు వచ్చే ఆనందం వెల కట్టలేనిది. అందుకే ఎంత ఖర్చయినా లెక్క చేయం. వీటిని కంటికి రెప్పలా చూసుకుంటాం. వాటికి అనేక సౌకర్యాలు కల్పించి కాపాడుకుంటాం. – కుర్రా పురుషోత్తం, రైతు, బాపట్ల -
చంద్రబాబు చెబుతున్నవన్నీ అబద్ధాలే
రాజమహేంద్రవరం రూరల్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నవన్నీ అబద్ధాలేనని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. బొమ్మూరులోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సందర్భాలు చంద్రబాబు చరిత్రలో ఏనాడూ లేవని విమర్శించారు. మహిళలకు ఉచిత సిలిండర్లు ఇవ్వక ముందే గ్యాస్ ధరలు పెంచేశారన్నారు. పెరిగిన గ్యాస్ ధరను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్య భద్రతను చంద్రబాబు గాలికి వదిలేస్తున్నారన్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ కుటుంబ సభ్యులపై ఐ–టీడీఈపీ నాయకులు అనైతిక వ్యాఖ్యలు చేయడం దారుణమని దుయ్యబట్టారు. గతంలో ఇదే పరిస్థితి ఎదురైనప్పుడు చంద్రబాబు ఏడ్చారని.. ఇప్పుడేం మాట్లాడతారో చెప్పాలని వేణు డిమాండ్ చేశారు. -
చెంతనే గోదారి.. చేలు తడారి..
● నాట్ల దశ నుంచీ రైతుకు ఇక్కట్లే.. ● కోతకు వచ్చినా కష్టాలే.. ● సాగుకు మురుగు నీరే దిక్కు ● బోర్ల ద్వారా అందిస్తున్న అన్నదాతలుపెరవలి: చెంతనే జీవనది గోదావరి ఉన్నా పైరుకు నీటి తడి అందక అన్నదాతలు అల్లాడిపోతున్నారు. రబీ వరి సాగు చివరి దశకు వచ్చింది. పాలు పోసుకున్న గింజలు తగినంత నీటి తడి అందితేనే గట్టిపడతాయి. లేదంటే తాలుతప్పలుగా మిగిలిపోతాయి. మరోవైపు పంట ఎండిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఫలితంగా రైతులు ఇన్ని నెలలుగా పడిన కష్టం, పెట్టిన పెట్టుబడి అక్కరకు రాకుండా పోతాయి. గోదావరి డెల్టా ముఖద్వారమైన పెరవలితో పాటు ఉండ్రాజవరం, నిడదవోలు మండలాల్లో కాలువల ద్వారా తగినంతగా నీరు అందకపోవడంతో రైతులు సాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. వరి నాట్ల దశలో ప్రారంభమైన నీటి కష్టాలు కోత దశకు వచ్చినా తీరడం లేదు. కాలువలకు నీరు అంతంత మాత్రంగానే రావడంతో.. అవి చేలకు ఎక్కక రైతులు దిగాలుగా చూస్తున్నారు. పెట్టుబడి పెట్టి, ఇంత కాలం సాగు చేసిన పంట కళ్లెదుటే పాడైపోతూంటే కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. చాలీచాలని నీరు మెట్ట ప్రాంతం అధికంగా ఉన్న మన జిల్లాలో వరిసాగు ఎక్కువగా బోర్ల పైనే జరుగుతోంది. కాలువల ద్వారా సాగు విస్తీర్ణం తక్కువే. అయినప్పటికీ ఆ ప్రాంతానికి కూడా సాగునీరు సక్రమంగా అందడం లేదు. పెరవలి మండలంలో చిన్న, పెద్ద కాలువలు 69 ఉండగా.. వీటిలో పూర్తి స్థాయిలో నీరు ప్రవహించక శివారు భూములకు నీరు అందడం లేదు. ఈ కాలువలపై 6 వేల ఎకరాలకు సాగు నీరు అందాల్సి ఉండగా ఇందులో సగానికి పైగా భూములకు బోర్ల ద్వారానే నీరందిస్తున్న దుస్థితి ఏర్పడింది. పెరవలి మండలం గరప కాలువ, పెండ్యాల పంపింగ్ స్కీమ్, పేకేరు కాలువ, శక్తమ్మతల్లి కాలువ, ఆచంట కాలువ, కాపవరం కాలువ వంటి వాటితో పాటు డైరెక్టు పైపుల (డీసీ) పరిస్థితి ఇదేవిధంగా ఉంది. ప్రధాన కాలువలో నీరు గట్టును తాకుతూ ప్రవహిస్తే డీసీల ద్వారా నీరు సక్రమంగా పారుతుంది. ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేకపోవడంతో చేను తడవటం లేదని రైతులు వాపోతున్నారు. పెరవలి మండలం ఉసులుమర్రు, కాపవరం, ముక్కామల, ఖండవల్లి, నల్లాకులవారిపాలెం, కానూరు, కాకరపర్రు గ్రామాల్లో నీటి ఎద్దడి ఎక్కువగా ఉంది. ఈ గ్రామాలు కాటన్ బ్యారేజీకి పెద్ద దూరం కూడా కాదు. అయినప్పటికీ తగినంతగా సాగు నీరు అందక ఈ ప్రాంతాల్లోని చేలు నెర్రెలు తీశాయి. అన్నదాతకు అగచాట్లు సాగు చివరి దశకు చేరిన తరుణంలో పైరు ఎండటానికి సిద్ధంగా ఉండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో అల్లాడుతున్నారు. పెరవలి మండలంలోని పలు గ్రామాల్లో సుమారు 600 ఎకరాలకు సాగునీరు అందడం లేదు. దీంతో, బోర్లు, మురుగు కాలువల నుంచి నీటిని తోడుకుంటూ పంటలను రక్షించుకునేందుకు రైతులు నానా అగచాట్లూ పడుతున్నారు. కాలువల్లోకి వస్తున్న కొద్దిపాటి నీటిని పంట చేలకు ఇంజిన్లతో అందిస్తున్నారు. దీనికోసం వారికి అదనంగా చేతి చమురు వదిలిపోతోంది. ఏటా రబీ సాగులో ఇదే దుస్థితిని ఈ ప్రాంతాల రైతులు ఎదుర్కొంటున్నారు. కొవ్వూరు డివిజన్లో 34 వేల ఎకరాల్లో వరిసాగు జరుగుతోంది. ప్రస్తుతం కోతలకు సిద్ధమవుతున్న చేలు 30 శాతం ఉండగా మిగిలినవి ఈ నెలాఖరుకు కోతకు వస్తాయి. దీనివలన మరికొన్ని రోజుల పాటు సాగు నీరు అందించాల్సి ఉంది. చేలు ఇంకా ఆకుపచ్చగానే ఉండటంతో ఈ నెలాఖరుకు కోతకు వస్తాయని, అప్పటి వరకూ నీటి తడి అందించడం తప్పనిసరి అని రైతులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వరి పైరుకు అవసరమైన స్థాయిలో నీరందించాలని అన్నదాతలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. -
13న గురుకుల ప్రవేశ పరీక్ష
రాజమహేంద్రవరం రూరల్: ధవళేశ్వరంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకుల విద్యాలయంలో ఐదో తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో చేరగోరే విద్యార్థులకు ఈ నెల 13న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. ప్రిన్సిపాల్ ఎ.వాణీకుమారి గురువారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ఆ రోజు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఐదో తరగతికి, మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకూ ఇంటర్ ఫస్టియర్కు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని వివరించారు. విద్యార్థులు ఒక గంట ముందు హాజరు కావాలని సూచించారు. పన్ను వసూలులో రాష్ట్రంలో రెండో స్థానం రాజమహేంద్రవరం సిటీ: పన్నుల వసూలులో నగరపాలక సంస్థ రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఈ మేరకు కమిషనర్ కేతన్ గార్గ్ నగదు బహుమతితో పాటు షీల్డ్ అందుకున్నారు. విజయవాడలో గురువారం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్కు రాష్ట్ర మున్సిల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ బహుమతి ప్రదానం చేశారు. వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలిగా లక్ష్మిసాక్షి, రాజమహేంద్రవరం: వైఎస్సార్ సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలిగా మార్తి లక్ష్మి నియమితులయ్యారు. అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపింది. తనపై నమ్మకం ఉంచి జిల్లా మహిళా అధ్యక్ష పదవికి ఎంపిక చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్కు, సహకరించిన మాజీ ఎంపీ, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్కు లక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తానన్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. వాడపల్లి క్షేత్రంలో ఘనంగా సదస్యం కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామివారి కల్యాణ మహోత్సవాల్లో భాగంగా గురువారం పండిత సదస్యం ఘనంగా నిర్వహించారు. దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో ఆలయ ప్రధానార్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంతశ్రీనివాస్, వేద పండితులు ఖండవల్లి రాజేశ్వరవరప్రసాద్ ఆచార్యులు ఆధ్వర్యంలో పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారికి చతుర్వేద పండితులతో ద్రవిడ వేద పారాయణం(మహాదాశీర్వచనం) అందజేశారు. స్వామివారికి డీసీ, ఈఓ చక్రధరరావు పట్టు వస్త్రాలను అందించారు. ఈ సందర్భంగా స్వామివారిని ఆభరణాలతో అలంకరించి, గ్రామోత్సవం నిర్వహించారు. శుక్రవారం గౌతమి గోదావరి నదిలో తెప్పోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు డీసీ, ఈఓ చక్రధరరావు తెలిపారు. శత్రువుకు దడ పుట్టేలా.. కాకినాడ రూరల్: శత్రువుకు దడ పుట్టేలా ఇండో – అమెరికన్ టైగర్ ట్రయంఫ్–25 విన్యాసాలు కాకినాడ తీరంలో జరుగుతున్నాయి. ఇరు దేశాలకు చెందిన వైమానిక దళాలు గురువారం సంయుక్త విన్యాసాలతో అదరగొట్టాయి. సాధారణ ప్రజలకు అనుమతి లేనప్పటికీ ఈ విన్యాసాలు చూసేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. గురువారం ఉదయం యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు కాకినాడ తీర ప్రాంతంతో పాటు సూర్యారావుపేట, వలసపాకల, వాకలపూడి గ్రామాల్లో చక్కర్లు కొట్టాయి. ఆకాశం నుంచి పెద్ద శబ్దం రావడంతో ఇళ్లలోని వారు బయటకు వచ్చి, వాటిని ఆసక్తిగా తిలకించారు. ఇండియన్ ఎయిర్ఫోర్స్ 157హెచ్యూకు చెందిన ఎంఐ–17వీ5 ద్వారా 16 మంది యూఎస్ స్పెషల్ ఫోర్సెస్, గరుడ, పారా కమాండోలను యాంఫిబియస్ విన్యాసాలు జరిగే కాకినాడ బీచ్లోని నావెల్ ఎన్క్లేవ్ వద్ద బీచ్ ల్యాండింగ్ జోన్(ఎల్జెడ్)కు చేర్చారు. బీచ్లోకి సందర్శకులు రాకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. -
రైలు నుంచి జారి పడి వ్యక్తి మృతి
రాజమహేంద్రవరం సిటీ: అదుపుతప్పి రైలు నుంచి జారి పడి ఓ వ్యక్తి మృతిచెందినట్టు రాజమహేంద్రవరం జీఆర్పీ ఎస్సై మావుళ్లు గురువారం తెలిపారు. ద్వారపూడి–కడియం రైల్వేస్టేషన్ల మధ్య సుమారు 45 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్టు చెప్పారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రి మార్చురీలో భద్రపర్చినట్టు తెలిపారు. మృతుడు నీలం రంగు ప్యాంటు, పసుపు రంగు టీ షర్ట్ ధరించి ఉన్నాడని చెప్పారు. టాటానగర్ నుంచి పాలక్కడ్కు జనరల్ టికెట్ ఉందన్నారు.తోట నరికివేతపై కేసుగోపాలపురం: మండలంలోని భీమోలు గ్రామంలో ఈ నెల 3న కొందరు యువకులు జామాయిల్ తోటలోకి అక్రమంగా చొరబడి, కర్రలను నరికి విక్రయించడంపై కేసు నమోదు చేశామని ఎస్సై కర్రి సతీష్కుమార్ గురువారం తెలిపారు. భీమోలు గ్రామానికి చెందిన పేద రైతు షేక్ యాకుబ్ తన ఐదు ఎకరాల జామాయిల్ తోటలోకి అదే గ్రామానికి చెందిన 13 మంది ముఠాగా ఏర్పడి జామాయిల్ తోటలోకి ప్రవేశించారు. తోటలోని కర్రలను నరికి, విక్రయించినట్టు యాకుబ్ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను బెజవాడ రవీంద్ర, పెనుమాక మోషే, హేమంత్, ఖండెల్లి దాసు, ముప్పిడి రామకృష్ణ, రాజేష్, అర్జంగి రాంబాబు, నేకూరి బాలకృష్ణ, బెజవాడ మోహన్రావు, ఖండెల్లి వెంకట్రావు, పత్తిపాటి చందు, వేములూరి రాంబాబు, ఈతకోట పెంటయ్యగా గుర్తించినట్లు ఎస్సై తెలిపారు.పోక్సో కేసులో వ్యక్తి అరెస్టుప్రత్తిపాడు: పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని వంచించిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసి పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు గురువారం అరెస్టు చేశారు. ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి గ్రామానికి చెందిన వి.గన్నిబాబు అదే మండలంలోని మరో గ్రామానికి చెందిన యువతిని ప్రేమించానని నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేయడంతో ఆమె ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది.16లోగా అభ్యంతరాలు,గ్రీవెన్స్ సమర్పించాలిఅమలాపురం రూరల్: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్, పూర్వ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేసేందుకు గత నెలలో అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించినట్టు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వైద్య సేవల సమన్వయాధికారి ఎం.పద్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు దరఖాస్తుల పరిశీలన అనంతరం htpp://artgo davari.nic.in వెబ్సైట్లో ప్రొవిజనల్ లిస్ట్ పొందుపర్చినట్టు చెప్పారు. ఈ జాబితాలో అభ్యంతరాలు ఉంటే ఈ నెల 11 నుంచి 16వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోగా కొవ్వూరు ఆస్పత్రి ఆవరణలోని జిల్లా వైద్య సేవల సమన్వయాధికారి కార్యాలయంలో తగిన ఆధారాలతో సమర్పించాలని కోరారు. అభ్యంతరాలు, గ్రీవెన్స్ పరిశీలన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ వెబ్సైట్లో ఉంచుతామని తెలిపారు. -
మహిళపై టీడీపీ మాజీ కౌన్సిలర్ దాడి
అమలాపురం టౌన్: తమ ఇంట్లో అద్దెకుంటున్న వ్యక్తిపై గొడవకు వచ్చిన అమలాపురానికి చెందిన టీడీపీ మాజీ కౌన్సిలర్ దున్నాల దుర్గ, అతని అనుచరులు తనపై ఇనుప రాడ్లతో దాడి చేసి, గాయపరిచారని స్థానిక నల్లవంతెన రజకపేటకు చెందిన టేకి వెంకటలక్ష్మి డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్కు ఫిర్యాదు చేశారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో గురువారం దీనిపై ఆమె ఫిర్యాదు చేయడమే కాకుండా, తనకు దున్నాల దుర్గ నుంచి రక్షణ కల్పించాలని డీఎస్పీని కోరారు. ఈ నెల 3న రాత్రి పది గంటల ప్రాంతంలో తన ఇంట్లో అద్దెకుంటున్న తోలేటి ఓంప్రకాష్ ఎక్కడ అంటూ తనపై దాడి చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిపై ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని, రాజకీయ పలుకుబడితో మాజీ కౌన్సిలర్ను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె వివరించారు. తనపై దాడి చేసిన దున్నాల దుర్గతో పాటు, దున్నాల దిలీప్, కంచిపల్లి శ్రీను, జక్కపు ప్రసాద్, ఏలూరి అయ్యప్పపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో కోరారు. ఆమెకు సంఘీభావాన్ని తెలిపిన వీసీకే పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొంతు రమణతో కలిసి బాధితురాలు డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. రక్షణ కల్పించాలని డీఎస్పీకి బాధితురాలి ఫిర్యాదు -
జీడి పప్పు పరిశ్రమలకు హై ఓల్టేజీ
మలికిపురం/సఖినేటిపల్లి: హైఓల్టేజీ కారణంగా సఖినేటిపల్లి మండలం మోరిపోడులో బుధవారం రాత్రి పలు జీడిపప్పు పరిశ్రమలకు నష్టం వాటిల్లింది. దీని ప్రభావంతో విలువైన జీడిపప్పు మాడిపోయింది. అలాగే విలువైన విద్యుత్ పరికరాలు, జీడిపప్పు డ్రయ్యర్ మెషీన్లు దెబ్బతిన్నాయి. గ్రామంలోని ముప్పర్తి సుబ్బారావు పరిశ్రమతో పాటు, మరికొన్ని పరిశ్రమల్లో భారీ నష్టం వాటిల్లినట్టు చెబుతున్నారు. జీడి పప్పు ప్రాసెసింగ్ కోసం డ్రయ్యర్ మెషీన్లలో ఉంచగా, తెల్లవారుజామున అటుగా జీడి పప్పు డ్రమ్ముల వద్దకు వెళ్లిన కార్మికులు హైఓల్టేజీని గమనించడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే కార్మికులు మెయిన్ స్విచాఫ్ చేసి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. లేకపోతే మరింత నష్టం వాటిల్లేదని సుబ్బారావు తెలిపారు. సుమారు రూ.10 లక్షల ఆస్తి నష్టం వాటిల్లి ఉంటుందని వ్యాపార వర్గాలు తెలిపాయి. రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ గురువారం దెబ్బతిన్న పరిశ్రమలను పరిశీలించారు. హైఓల్టేజీకి కారణాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. మాడిపోయిన సరకు కాలిపోయిన పరికరాలు -
తాళం పగులగొట్టి ఇంట్లో చోరీ
నిడదవోలు: తాళం పగులగొట్టి పట్టపగలే ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన సంఘటన పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు, స్థానిక దానమ్మగుడి వెనుక వీధిలోని రెండంతస్తుల భవనం కింది పోర్షన్లో పెట్రోల్ బంక్ ఉద్యోగి బలిజ సత్యనారాయణ నివసిస్తున్నారు. ఈయన కుమార్తె ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు. ఉదయం పిల్లలతో సహా అందరూ వెళ్లిపోయారు. ఇంటికి తాళం వేసి సత్యనారాయణ కూడా బయటకు వెళ్లారు. మధ్యాహ్నం 2.30 సమయంలో ఆయన ఇంటికి తిరిగొచ్చారు. దొంగలు ఇంటికి వేసిన తాళాన్ని కట్టర్తో కట్ చేసి, ఇంట్లోకి ప్రవేశించారు. బీరువా లాకర్ను కూడా కట్ చేసి, 35 కాసుల బంగారు ఆభరణాలు, రూ.15 వేల నగదు, కొంత వెండిని అపహరించారు. సమాచారం అందుకున్న పట్టణ ఎస్సై జగన్మోహన్రావు తన సిబ్బందితో సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. 25 కాసుల బంగారం, నగదు అపహరణ -
గంటలో బాలిక ఆచూకీ లభ్యం
పెదపూడి: అనపర్తి మండలం కుతుకులూరు గ్రామంలో నాలుగో తరగతి విద్యార్థిని అదృశ్యం సంఘటన కలకలం రేపగా, గంట వ్యవధిలో పోలీసులు ఆ బాలికను పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. అనపర్తి ఎస్సై శ్రీనునాయక్ తెలిపిన వివరాల మేరకు, కుతుకులూరు గ్రామంలో లంక సత్యనారాయణ కుమార్తె షర్మిల రామవరం ఎంపీపీ స్కూల్లో నాలుగో తరగతి చదువుతోంది. గురువారం ఉదయం టిఫిన్ తెచ్చుకోడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు చట్టుపక్కల వెతికినా బాలిక ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ సుమంత్ సూచనలతో రంగంలోకి దిగిన అనపర్తి ఎస్సై శ్రీను నాయక్, అదనపు ఎస్సై దుర్గాప్రసాద్ తమ సిబ్బంది బాలిక కోసం గాలింపు చేపట్టారు. గంట వ్యవధిలోనే కుతుకులూరు గ్రామంలో ఓ చోట బాలికను పోలీసులు కనుగొన్నారు. ఈ సంఘటనపై బాలికను పోలీసులు వివరాలు అడగ్గా, బాగా చదవడం లేదని తల్లిదండ్రులు మందలించినందుకు వెళ్లిపోయినట్టు చెప్పిందని ఎస్సై తెలిపారు. వెంటనే స్పందించి, బాలిక ఆచూకీని కనుగొన్న పోలీసులను తల్లిదండ్రులు, గ్రామస్తులు అభినందించారు. తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు -
108 అంబులెన్స్కు సుస్తీ..
ప్రత్తిపాడు: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మానస పుత్రికగా పేరొందిన 108కి సుస్తీ చేసింది. ఫోన్ చేయగానే కుయ్.. కుయ్ మంటూ వచ్చే 108 వాహనానికి అవస్థలు వచ్చిపడ్డాయి. ప్రత్తిపాడు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలోని 108 వాహనం సాంకేతిక లోపంతో తరచూ స్టార్ట్ కానంటూ మొండికేస్తోంది. గతేడాది నవంబర్ నుంచి మరమ్మతుల కోసం ఎదురుచూస్తూనే ఉంది. సిబ్బంది చిన్న మరమ్మతులు చేయడం, బండి బయలుదేరడం అన్నట్టు సాగిపోతోంది. 108కు ఎవరైనా కాల్ చేస్తే.. ఆగమేఘాలపై వెళ్లాల్సిన అపర సంజీవనికి ‘స్టారింగ్’ కష్టాలు లొచ్చాయి. ఎవరైనా బండిని నెట్టుతారా అంటూ ఎదురుచూడడం నిత్యకృత్యమైంది. ఎప్పటిలాగే గురువారం బండి స్టార్ట్ కాకపోవడంతో ఇలా.. తలో చేయి వేస్తున్నారు. -
దివాన్చెరువులో చైన్ స్నాచింగ్
రాజానగరం: ఓ మహిళ మెడ నుంచి బంగారు గొలుసును అపహరించిన సంఘటన పట్టపగలే దివాన్చెరువులో చోటుచేసుకుంది. గురువారం ఉదయం 9 గంటల సమయంలో రైస్ మిల్లు వీధిలో జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. నీలంతోటకు చెందిన ఇద్దరు మహిళలు రైసు మిల్లు వీధిలో బంధువుల ఇంటికి కాలినడక బయలుదేరారు. ఇద్దరు వ్యక్తులు బైకుపై వచ్చి యూ టర్న్ తీసుకుని ఓ మహిళ మెడలో ఉన్న ఒకటిన్నర కాసుల బంగారు గొలుసును లాక్కుపోయారు. ఈ ఘటనలో ఆమె మెడకు తీవ్ర గాయమైంది. బైకు నడిపిన వ్యక్తి 40 ఏళ్లలోపు, వెనుక కూర్చున వ్యక్తికి 50 ఏళ్లు పైబడి వయస్సు ఉంటుందని బాధితురాలు తెలిపారు. గొలుసు లాక్కున్న వ్యక్తి హెల్మెట్ ధరించి ఉన్నాడు. సమాచారం తెలుసుకున్న బొమ్మూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, వివరాల కోసం సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఇదే ప్రాంతంలో గత రాత్రి ఓ బైకు అపహరణకు గురైంది. -
ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి
సీతానగరం: ఇటుక బట్టీలో మట్టిని తొక్కుతున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో మండలంలోని రఘుదేవపురానికి చెందిన సిద్ద వెంకటేశ్వరరావు(45) మృతిచెందాడు. పోలీసుల వివరాల మేరకు, ఎప్పటిలాగే గురువారం ఉదయం వెంకటేశ్వరరావు స్థానిక రవీంద్ర కాలనీలోని తన ఇటుక బట్టీ వద్దకు వెళ్లాడు. ఇటుకల తయారీ కోసం మట్టిని ట్రాక్టర్తో తొక్కుతుండగా, అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ క్రమంలో వెంకటేశ్వరరావు అదే మట్టిలో కూరుకుపోయాడు. బట్టీ వద్ద ఉన్నవారు పొక్లెయిన్ సాయంతో ట్రాక్టర్ను తొలగించి, వెంకటేశ్వరరావును బయటకు తీశారు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని స్థానిక బస్టాండ్ సెంటర్ వద్దనున్న ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతడి మృతితో భార్య దుర్గాభవాని, తల్లి సత్యవతి, వివాహాలైన కుమార్తెలు కోటేశ్వరి, సంధ్యారాణి భోరున విలపించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్టు హెడ్ కానిస్టేబుల్ శ్రీను తెలిపారు. -
ఉద్యోగులు నిబద్ధతతో పనిచేయాలి
జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీతకంబాలచెరువు (రాజమహేంద్రవరం): అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ప్రభుత్వ ఉద్యోగులు నిబద్ధతతో బాధ్యతల్ని నిర్వహించాలని, ఆయా వర్గాల వారికి అవగాహన కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. బుధవారం స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో వివిధ వర్గాల ప్రజలు, అణగారిన, వెనుకబడిన వారి ప్రయోజనాల కోసం చట్టపరమైన, సామాజిక సాధికారత పథకాలపై సమన్వయ శాఖల అధికారులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా అమలు చేయవలసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిరుపేదలకు అందే విధంగా వారిని చైతన్యవంతం చేయాలన్నారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బందికి వర్క్ షాప్ నిర్వహించి వారికి పథకాలపై అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో రాజమహేంద్రవరం శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ ఎ.గాయత్రి దేవి, డీఎల్ఎస్ఏ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి, లీగల్ ఎయిడ్ డిప్యూటీ చీఫ్ పీఎంఆర్ ప్రేమ్కుమార్, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కె.విజయకుమారి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కేఎన్ జ్యోతి, ఇతర శాఖల అధికారులు ఎం.సుబ్బారావు, పీవీడీ ప్రసాద్, యు.రాజు, జాబిన, ఆర్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
జగన్కు భద్రత కల్పించడంలో పోలీసులు విఫలం
రాజమహేంద్రవరం రూరల్: అనంతపురం జిల్లా రాప్తాడులో పర్యటించిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి భద్రత కల్పించడంలో పోలీసుశాఖ పూర్తి వైఫల్యం కనపడిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం రాజమహేంద్రవరం రూరల్ మండలం బొమ్మూరులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మాజీ సీఎం వైఎస్ జగన్కు పూర్తిస్థాయిలో భద్రత కల్పించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. రాప్తాడులో వైఎస్ జగన్ను చూసేందుకు వచ్చిన జనాన్ని నియంత్రించడానికే పోలీసులు ఎక్కువగా ప్రయత్నించారన్నారు. ఆయన హెలికాప్టర్ దిగే సమయానికి అక్కడ ఇవ్వాల్సిన భద్రతాలోపం వల్లే ప్రజలు గుమిగూడారన్నారు. అధికారం అనేది ప్రజాస్వామ్య బద్ధంగా ఉండాలి, రాష్ట్రంలో ప్రజలకు చట్టాలపై గౌరవాన్ని పెంచే విధంగా ఉండాలన్నారు. అధికారం మాకు అహంకారం అన్నేటట్టుగా ఈనాడు పత్రికల్లో మంత్రులు ప్రకటనలు చేస్తున్నారన్నారు. జడ్ ప్లస్ కేటగిరి నాయకుడికి మీరు ఇచ్చే భద్రత ఇదేనా అన్ని వేణు ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రజాదరణ గల నాయకుడిగా వైఎస్ జగన్ వస్తుంటే ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తుంటారన్నారు. ప్రభుత్వానికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. పోలీసుశాఖ సరైన భద్రత కల్పించకపోవడం వల్లనే రోడ్డు మార్గాన వైఎస్ జగన్ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. జగన్కు పూర్తిస్థాయిలో భద్రత కల్పించాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడం దారుణం కూటమి ప్రభుత్వంలో పేదలకు అందించే ఆరోగ్యశ్రీసేవలు నిలిచిపోవడం దారుణమని మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించిందని, ఆరోగ్యశ్రీ తో పాటు ఆరోగ్య ఆసరా, విలేజ్ హెల్త్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, నెట్వర్క్ హాస్పిటల్స్ ద్వారా వైద్యం వంటి ఎన్నో సేవలను అందించిందన్నారు. గత ప్రభుత్వం వైద్యంపై శ్రద్ధ తీసుకుని అనేక సౌకర్యాలు కల్పించిందన్నారు. కరోనా సమయంలో సైతం మెరుగైన వైద్య సదుపాయాలను ప్రజలకు అందించిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో రూ.3,500 కోట్ల బకాయిలను ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు చెల్లించి ఆరోగ్యశ్రీని కొనసాగించాలని వేణు డిమాండ్ చేశారు.వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ -
ముగిసిన పది మూల్యాంకనం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్థానిక ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో వారం రోజులుగా జరుగుతున్న పదవ తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ప్రశాంతంగా ముగిసిందని జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు తెలిపారు. మూల్యాంకనం నిమిత్తం 101 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 630 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 200 మంది ప్రత్యేక సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై సమగ్ర విచారణ ఎస్పీ నరసింహకిషోర్ కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం పాస్టర్ ప్రవీణ్ మృతిపై సమగ్ర విచారణ కొనసాగుతుందని జిల్లా ఎస్పీ డీ నరిసింహ కిషోర్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ఎఫ్ఏస్ఎల్ రిపోర్ట్ ఇంకా రాలేదని, అది వచ్చిన తర్వాతే పీఎం రిపోర్టు వస్తుందన్నారు. విచారణలో భాగంగా సేకరించిన వీడియో ఫుటేజ్ నిశిత విశ్లేషణ జరుగుతోందన్నారు. పోస్టుమార్టం రిపోర్టు వారి కుటుంబ సభ్యులకు ఎవరికీ ఇవ్వలేదని, అలాంటి ప్రచారాలను నమ్మవద్దన్నారు. సీసీ టీవీ కెమెరా ఫుటేజ్లు పోలీస్ శాఖ రిలీజ్ చేయలేదన్నారు. పాస్టర్ ప్రవీణ్ మృతి దర్యాప్తుపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికీ కొందరు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పోలీసు వ్యవస్థ సమర్థంగా, సమగ్రంగా పాస్టర్ ప్రవీణ్ మృతిపై దర్యాప్తు చేస్తుందన్నారు. సత్యదేవునికి ఘనంగా జన్మ నక్షత్ర పూజలు అన్నవరం: సత్యదేవుని జన్మనక్షత్రం ‘మఖ’ సందర్భంగా బుధవారం సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీ దేవి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆయుష్య హోమం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున రెండు గంటలకు స్వామివారి ఆలయం తెరిచి స్వామి, అమ్మవార్లకు అర్చక స్వాములు సుప్రభాతసేవ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్ల మూలవిరాట్లకు, శివ లింగానికి పండితులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పళ్ల రసాలు పంచామృతాలతో మహాన్యాస పూర్వక అభిషేకం నిర్వహించారు. అభిషేకం అనంతరం సుగంధ భరిత పుష్పాలతో, స్వామి, అమ్మవార్లను అలంకరించి పూజించారు. ఉదయం ఆరు గంటల నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. ఆలయ ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో అర్చకులు దత్తాత్రేయ శర్మ, సుధీర్, పవన్ ఈ కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి యాగశాల లో ఉదయం తొమ్మిది గంటల నుంచి 11 గంటల వరకు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లకు అయుష్య హోమం, 11 గంటలకు పూర్ణాహుతి నిర్వహించారు. బుధవారం సుమారు 20 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించి పూజలు చేశారు. స్వామివారి దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. నేడు నిజరూప దర్శనం సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీ అమ్మవారు, శంకరులు గురువారం ఏ విధమైన ఆభరణాలు ధరించకుండా (మూల విరాట్లుగా) నిజరూపులో భక్తులకు దర్శనమివ్వనున్నారు. డీఎస్సీ ఉచిత కోచింగ్కు దరఖాస్తుల ఆహ్వానం కాకినాడ సిటీ: కాకినాడ జిల్లాలో అర్హతగల బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్థులకు మెగా డీఎస్సీ పరీక్షకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వెనుకబడిన తరగతుల సంక్షేమం, సాధికారత అధికారిణి ఎం లల్లీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. టెట్ అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థులు తమ సొంత జిల్లాల్లోనే దరఖాస్తు చేసుకోవాలన్నారు. కులధ్రువీకరణ పత్రం, టెట్ పరీక్షలో అర్హత సాధించి రుజువు వంటివి జతపరచాలన్నారు. దరఖాస్తును సంబంధిత వెనుకబడిన తరగతుల సంక్షేమం, సాధికారత అధికారి కార్యాలయం, 2వ అంతస్తు, ప్రగతి భవన్, డీఆర్డీఏ కాంప్లెక్స్, జీజీహెచ్ ఎదుట, కాకినాడ చిరునామాలో సమర్పించాలన్నారు. -
270 కేజీల గంజాయి స్వాధీనం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జాతీయ రహదారిపై దివాన్ చెరువు జీరో పాయింట్ వద్ద కంటైనర్లో తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్ట్టుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు ఈ దాడి చేశారు. ఎస్పీ డి.నరసింహ కిశోర్ బుధవారం విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం.. హర్యానాకు చెందిన సందీప్శర్మ, అదే రాష్ట్రానికి చెందిన లారీ డ్రైవర్ మోనుసైని ఏజెన్సీ ప్రాంతం నుంచి 270 కేజీల గంజాయిని కంటైనర్లో లోడ్ చేసుకుని బయలుదేరారు. దీనిపై ముందస్తు సమాచారం అందుకున్న బొమ్మూరు పోలీసులు, ఈగల్ టీం సభ్యులు ఆ లారీ వచ్చే ప్రాంతంలో కాపు కాశారు. ఎన్ఎల్ 01 ఏజే 6162 కంటైనెర్ను ఆపి తనిఖీ చేయగా గంజాయి బయటపడింది. దీంతో లారీ డ్రైవర్ మోనుసైని పోలీసులకు చిక్కగా, మరో నిందితుడు సందీప్ శర్మ పారిపోయాడు. పట్టుకున్న గంజాయి విలువ సుమారు రూ.13.50 లక్షలు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. లారీడ్రైవర్ను పోలీసులు కోర్టులో హాజరుపర్చగా, అతడిపై తదుపరి చర్యల కోసం సెంట్రల్ జైలుకు రిమాండ్కు పంపారు. గంజాయిని తరలిస్తున్న రూ.30 లక్షల విలువైన కంటైనర్ను సీజ్ చేశారు. కాగా.. గంజాయిని పట్టుకున్న బొమ్మూరు సీఐ పి.కాశీ విశ్వనాథంతో పాటుఈగల్ టీం, పోలీసు సిబ్బందిని ఎస్పీ నరసింహ కిశోర్, ఈస్ట్జోన్ డీఎస్పీ బి.విద్య అభినందించారు. కంటైనర్లో తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు గంజాయి విలువ రూ.13.50 లక్షలు -
కాకినాడ తీరం.. కదన రంగం
● ఉత్సాహంగా టైగర్ ట్రయంఫ్ విన్యాసాలు ● పాల్గొన్న భారత్, అమెరికా సైనికులు కాకినాడ రూరల్: కాకినాడ తీరం కదన రంగాన్ని తలపిస్తోంది. శత్రు దేశాలకు వణుకు పుట్టేలా భారత, అమెరికా దేశాల సైన్యాలు తమ విన్యాసాలను ప్రదర్శిస్తున్నాయి. క్లిష్ట సవాళ్లను ఎదుర్కొనేలా.. అంకిత భావంతో ఇరు దేశాల సైన్యం ఐక్యతను ప్రదర్శిస్తూ పరస్పర సహకారం, రక్షణ సామర్థ్యం పెంపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. భారత్, అమెరికా దేశాల సైన్యం చేపడుతున్న టైగర్ ట్రయంఫ్ – 25 సంయుక్త విన్యాసాలు ఈ నెల ఒకటిన విశాఖలో ప్రారంభమవ్వగా కాకినాడలో 12న ముగియనున్నాయి. కాకినాడ తీరంలోని నావల్ ఎన్క్లేవ్ ప్రాంతంలోనూ, సాగర తీరంలోనూ నాలుగు రోజుల పాటు విన్యాసాలు చేపడుతున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్), ఇండియన్ నేవీ, యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ (యూఎస్ఏఎఫ్) బుధవారం ప్లయింగ్ మిషన్ను నిర్వహించాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన సి – 130 హెర్క్యులస్ ఎయిర్ క్రాఫ్ట్, భారత నావికాదళానికి చెందిన హాక్స్, యూఎస్ఏఎఫ్కి చెందిన సి – 130 సంయుక్త విన్యాసాలలో పాల్గొన్నాయి. అలాగే ఐఎన్ఎస్ జలాశ్వ, యుఎస్ఎస్ కామ్స్టాక్ యుద్ధ నౌకలతో తీరంలో విన్యాసాలు ప్రదర్శించారు. -
ఏమీ బాగోలేదు స్వామీ..
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణస్వామివారి దేవస్థానం.. భక్తులకు అందిస్తున్న సేవలకు సంబంధించి మూడో నెల అభిప్రాయ సేకరణలో కూడా మెరుగుదల కనిపించలేదు. గత ఫిబ్రవరిలో చిట్టచివరి ఏడో ర్యాంకు, మార్చిలో రెండో ర్యాంకు సాధించినా అసంతృప్తి అలాగే ఉంది. తాజాగా ఏప్రిల్ నాలుగో తేదీన విడుదల చేసిన గణాంకాల ప్రకారం భక్తుల అసంతృప్తి ఇంకా పెరిగినట్టు తెలుస్తోంది. అభిప్రాయాల సేకరణ దేవస్థానాల్లో అందే సేవలు, ప్రసాదం నాణ్యత, ఇతర ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ యాప్, ఐవీఆర్ఎస్ ద్వారా భక్తుల అభిప్రాయాలు తెలుసుకుంది. వాటిని ప్రామాణికంగా తీసుకుని తాజా ర్యాంకులు ప్రకటించింది. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి, శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వరస్వామి, ఏలూరు జిల్లాలోని ద్వారకాతిరుమల, విజయవాడలోని కనకదుర్గమ్మ గుడి, సింహాచలం వరాహ నృశింహస్వామి, శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జునస్వామి, అన్నవరం సత్యనారాయణస్వామి దేవస్థానాలకు సంబంధించి మార్చి 20 – ఏప్రిల్ నాలుగో తేదీల మధ్య సేకరించిన అభిప్రాయాల ప్రకారం మంగళవారం ర్యాంకులు విడుదల చేసింది. దర్శనంలో రెండు సత్యదేవుని దర్శనం మీరు అనుకున్న సమయంలో జరిగిందా అనే ప్రశ్నకు 69 శాతం మంది భక్తులు అవునని సమాధానం చెప్పగా, 31 శాతం మంది కాలేదన్నారు. సింహాచలం, శ్రీకాళహస్తి దేవస్థానాలకు కూడా ఇదే విధంగా రెండో ర్యాంకు వచ్చింది. మౌలిక వసతుల్లో ఆరు దేవస్థానంలో మౌలిక వసతుల కల్పన, తాగునీరు, వాష్ రూమ్స్, వెయిటింగ్ ఏరియా, రవాణా సౌకర్యాలు, చెప్పులు భద్రపరిచే చోటు, తదితర విషయాలపై 60 శాతం మంది భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. 40 శాతం మందికి మాత్రం నచ్చలేదు. ఈ విభాగంలో అన్నవరానికి ఆరో ర్యాంకు వచ్చింది. ప్రసాదానికి రెండు సత్యదేవుని ప్రసాదం రుచి, నాణ్యత విషయాలలో 80 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయగా 20 మంది అసంతృప్తి చెందారు. దీనిలో రెండో ర్యాంకు వచ్చింది. పెరిగిన అసంతృప్తి గతంలో జరిగిన అభిప్రాయ సేకరణలో స్వామివారి దర్శనంపై 70 శాతం సంతృప్తి వ్యక్తం చేయగా, ఈసారి అది 69 శాతానికి పడిపోయింది. మౌలిక వసతుల విషయంలో గతంలో 65 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయగా, ఈసారి 60 శాతం మంది మాత్ర మే బాగున్నాయన్నారు. ప్రసాదం రుచి, నాణ్యతపై గతంలో 82.4 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయగా ఈసారి 80 శాతానికి పరిమితమైంది. అన్నవరంలోని సత్యనారాయణస్వామి దేవస్థానం రత్నగిరి సేవలపై భక్తుల అసంతృప్తి అభిప్రాయ సేకరణలో వెల్లడి వరుసగా మూడో నెలా అదే ఫలితం కనిపించని మెరుగుదల -
బాక్సింగ్ పోటీలకు క్రీడాకారుల ఎంపిక
పిఠాపురం: స్థానిక ఆర్ఆర్బీహెచ్ఆర్ కాలేజీ మైదానంలో బుధవారం నిర్వహించిన బాక్సింగ్ పోటీల్లో రాష్ట్ర స్థాయి పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేసినట్లు జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.కృపారావు కోచ్ పి.లక్ష్మణరావు తెలిపారు. వీటికి జిల్లా నలుమూలల నుంచి 25 మంది హాజరుకాగా, 8 మంది మహిళలు, ఇద్దరు పురుషులను ఎంపిక చేశామన్నారు. వీరందరూ ఈ నెల 12, 13వ తేదీలలో విశాఖపట్నంలో జరిగే రాష్ట్ర స్థాయి బాక్సింగ్ యూత్ మెన్ అండ్ వుమెన్ పోటీల్లో పాల్గొంటారన్నారు. రైళ్లలో చోరీలు చేస్తున్న యువకుడి అరెస్టు నిడదవోలు: రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న నిడదవోలు మండలం సింగవరం గ్రామానికి చెందిన ఉలవలపూడి దుర్గారావును బుధవారం రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. భీమవరం రైల్వే సీఐ ఎస్.సోమరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఉలవలపూడి దుర్గారావు కొంత కాలంగా రైళ్లలో ప్రయాణికుల బంగారు ఆభరణాలను దొంగిలిస్తున్నాడు. అలాగే రైలు ఫుట్బోర్డుల దగ్గర నిలబడి ఫోన్ మాట్లాడుతున్న ప్రయాణికులను కర్రతో కొట్టి, ఆ ఫోన్లు కిందపడగానే వాటిని తీసుకుని ఉడాయిస్తాడు. ఇలా అతడు దోచుకున్న 18 సెల్ఫోన్లు, 30 గ్రాముల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసున్నారు. వాటి విలువ సుమారు రూ. 3.70 లక్షలు ఉంటుందని రైల్వే సీఐ తెలిపారు. తాడేపల్లిగూడెం రైల్వే ఎస్సై పి.అప్పారావు, సిబ్బంది పాల్గొన్నారు. వృద్ధుడిపై పోక్సో కేసు నల్లజర్ల: మండలంలోని ఓ పాఠశాలకు చెందిన విద్యార్థులను లైంగికంగా వేధించిన ఓ వృద్ధుడి (హెచ్ఐవీ రోగి)పై పోలీసులు పోక్సో కేసు కట్టారు. పిల్లల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 19,500 గటగట (వెయ్యి) 17,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 18,500 గటగట (వెయ్యి) 16,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
చిన్నతనం నుంచే చోరీల బాట
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): చిన్నతనం నుంచే చోరీల బాట పట్టిన దొంగను నిడదవోలు పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి రూ.50 లక్షల విలువైన 630 గ్రాముల బంగారం, రూ.3.60 లక్షల విలువైన 4 కేజీల వెండి, లక్ష రూపాయల నగదు, టీవీ, మోటారుసైకిల్, ఐరన్ రాడ్డు, స్కూడ్రైవర్ స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్ బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. భీమవరం సమీపంలోని గునుపూడి బ్రాహ్మణవీధిలో నివాసముండే పందిరి వెంకట నారాయణ ఆలియాస్ నారిగాడు చిన్నతనంలోనే చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. 2008లో భీమవరం చుట్టుపక్కల ప్రాంతంలో సైకిళ్లు, ఇనుపముక్కలు దొంగతనం చేసేవాడు. దీంతో పోలీసులు వెంకట నారాయణను పట్టుకుని జువైనల్ హోమ్కు తరలించారు. ఆ తర్వాత పలు చోరీలకు పాల్పడ్డాడు. అతడిని పోలీసులు అరెస్టు చేయడం, బయటకు రావడం, మళ్లీ దొంగతనం చేయడం, తిరిగి జువైనల్ హోమ్కు వెళ్లడం పరిపాటిగా మారింది. అలా అమలాపురం, పి.గన్నవరం, వీరవాసరం, ఆచంట, ఇరగవరం, పెనుగొండ, పెనుమంట్ర ప్రాంతాల్లో చోరీలు చేశాడు. చివరిసారిగా గత ఏడాది అక్టోబర్ 22న ఆలమూరు పోలీసులు అరెస్టు చేసి తిరిగి జైలుకు పంపారు. నెల తర్వాత బెయిల్పై విడుదలైన వెంకట నారాయణ సమిశ్రగూడెం, ఉండ్రాజవరం, పెనుమంట్ర, ఐనవల్లి, పెరవలి, రావులపాలెం, భీమడోలు పోలీస్ స్టేషన్ పరిధిల్లో మరో నేరస్తుడు శివసుబ్రహ్మణ్యంతో కలిసి నేరాలు చేశాడు. ఇదిలా ఉండగా.. వెంకట నారాయణ ఉండ్రాజవరంలోని సీపాని విజయలక్ష్మి ఇంటి తాళాలు పగులకొట్టి విలువైన బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడి కదలికలపై కన్నువేసి చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుడిపై గతంలో 57 కేసులున్నట్టు గుర్తించారు. కేసును చేధించిన నిడదవోలు సీఐ స్వరూప్, ఉండ్రాజవరం ఎస్సై జి.శ్రీనివాసరావు, సమిశ్రగూడెం ఎస్సై కె.వీరబాబు, సీసీఎస్ ఎస్సై రవీంద్ర, ఇతర పోలీసు సిబ్బందిని ఎస్పీ డి.నరసింహ కిశోర్, క్రైం అడిషనల్ ఎస్పీ ఎల్.అర్జున్ ప్రత్యేకంగా అభినందించారు. అంతర్ జిల్లా దొంగ అరెస్టు రూ.50 లక్షల విలువైన బంగారం స్వాధీనం -
ఎన్.సూరవరం కార్యదర్శి సస్పెన్షన్
తుని రూరల్: విధి నిర్వహణలో నిర్లక్ష్యం, వసూలు చేసిన ఆస్తి పన్నులను సబ్ ట్రెజరీలో జమ చేయకపోవడంపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా తుని మండలం ఎన్.సూరవరం పంచాయతీ గ్రేడ్–3 కార్యదర్శి కె.వెంకటలక్ష్మి సస్పెండ్ అయ్యారు. దీనిపై ఈ నెల ఏడో తేదీన కలెక్టర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయినట్టు బుధవారం ఈఓపీఆర్డీ జి.మరిడియ్య తెలిపారు. టి.తిమ్మాపురం, తేటగుంట గ్రామాల్లో బాధ్యతలు నిర్వహిస్తూ, ఇటీవల ఎన్.సూరవరానికి వెంకటలక్ష్మి బదిలీపై వచ్చారు. ఆ రెండు గ్రామాల్లో 2024–25 ఆర్థిక సంవత్సరంలో పన్నులు వసూలు చేసేందుకు డిమాండ్ నోటీసులు ఇవ్వకపోవడం, వసూలు చేసిన మొత్తంలో కొంత సొమ్ము సబ్ ట్రెజరీకి జమ చేయలేనట్టు ఆమైపె ఉన్నత అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో తుని ఎంపీడీఓ, పెద్దాపురం డీఎల్పీఓలు వేర్వేరుగా విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక అందించారు. దాన్ని సమగ్రంగా పరిశీలించిన ఉన్నత అధికారులు కార్యదర్శి వెంకటలక్ష్మిని సస్పెండ్ చేశారు. హాకీ టోర్నీ విజేత ‘కాకినాడ’ ధర్మవరం: స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానం వేదికగా హాకీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జరుగుతున్న 15వ రాష్ట్రస్థాయి బాలుర జూనియర్ హాకీ టోర్నీ విజేతగా కాకినాడ జిల్లా జట్టు నిలిచింది. బుధవారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో వైఎస్సార్ జట్టుపై 2–0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి సత్యకుమార్.. విజేత జట్టును అభినందిస్తూ ట్రోఫీని అందజేశారు. లారీ ఢీకొని వ్యక్తి మృతి ధవళేశ్వరం: వెనుక నుంచి లారీ ఢీకొన్న ఘటనలో మోటారు సైక్లిస్టు మృతి చెందాడు. ధవళేశ్వరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజానగరం మండలం యర్రంపాలేనికి చెందిన నేటి శ్రీను (50) ఈ నెల 4వ తేదీన తణుకు మండలం వేల్పూరులోని బంధువుల ఇంటికి వెళ్లాడు. తిరిగి బుధవారం స్వగ్రామానికి మోటారు సైకిల్పై ప్రయాణమయ్యాడు. ఉదయం 10 గంటల సమయంలో ధవళేశ్వరం హార్లిక్స్ ఫ్యాక్టరీ వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి లారీ అతి వేగంగా వచ్చి ఢీకొంది. తీవ్రగాయాలైన శ్రీనును రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం మృతి చెందాడు. అతడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి భార్య సుజాత ఫిర్యాదు మేరకు సీఐ టి.గణేష్ ఆధ్వర్యంలో ఎస్సై హరిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వైభవంగా పొన్నవాహన మహోత్సవం
కొత్తపేట: వాడపల్లిలోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా మూడో రోజు బుధవారం పొన్న వాహన మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. దేవదాయ, ధర్మాదాయశాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు ఈ కార్యక్రమం జరిపారు. వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం తెల్లవారుజామున స్వామి వారి మేలుకొలుపు, గౌతమి నది నుంచి తీర్థపు బిందెను తీసుకువచ్చి విశేషార్చన, నిత్య హోమాలు నిర్వహించారు. రాత్రి ఉభయ దేవేరులతో స్వామివారు పొన్నవాహనంపై గ్రామంలో విహరించారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం సజ్జాపురానికి చెందిన నందగోపాల మహిళల కోలాట భజన మండలి కోలాటం ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. -
పంజాబ్లో వాడపల్లి యువకుడి మృతి
● మృతుడు వైఎస్సార్ సీపీ నేత సముద్రం కుమారుడు ● స్వగ్రామంలో అంత్యక్రియలు కొవ్వూరు: పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్లో గల లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్న వాడపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నేత, ఉప సర్పంచ్ లంకదాసు సముద్రం పెద్ద కుమారుడు నాగ వెంకట యశ్వంత్ (23) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. అమృత్సర్లో ఓ పరీక్ష రాసేందుకు ఈ నెల 6వ తేదీన తన స్నేహితుడి కలిసి మోటారుసైకిల్పై వెళ్లి తిరిగి వస్తుండగా కుపర్తల సమీపంలో హైవేపై డివైడర్ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో యశ్వంత్తో పాటు అతడి స్నేహితుడు, విజయనగరానికి చెందిన గానా సిద్విక్ వర్మ (23) ఘటనా స్థలంలోనే మృతి చెందారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను అమృత్సర్ నుంచి ఢిల్లీ తీసుకెళ్లి, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి ప్రత్యేక అంబులెన్స్లో మంగళవారం మధ్యాహ్నం యశ్వంత్ స్వగ్రామమైన వాడపల్లి తీసుకొచ్చారు. వాడపల్లి శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఇంజినీరింగ్ పూర్తి చేసుకున్న యశ్వంత్ ఇటీవల క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఎంపికయ్యారు. మద్రాసులో ఉద్యోగం కుడా వచ్చింది. ఈ వారంలోనే ఉద్యోగంలో చేరనున్న సమయంలో మృత్యువాత పడడాన్ని కుటుంబ సభ్యులు తట్టుకోలేక పోతున్నారు. ఎంపీపీ కాకర్ల సత్యనారాయణ (నారాయుడు), మాజీ ఏఎంసీ చైర్మన్ బూరుగుపల్లి వీర్రాఘవులు తదితరులు మృతదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 19,500 గటగట (వెయ్యి) 17,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 18,500 గటగట (వెయ్యి) 16,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
అనుమానాస్పద స్థితిలో ఉద్యోగిని మృతి
నిడదవోలు: మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న నెల్లి కరుణ (28) సోమవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. నిడదవోలు రూరల్ ఎస్సై కె.వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం.. నిడదవోలు మండలం కోరుమామిడి గ్రామానికి చెందిన నెల్లి వెంకట రమణ, సూర్యకుమారి దంపతులకు ఏకై క కుమార్తె కరుణ వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వార్డు సచివాలయ కార్యదర్శిగా ఉద్యోగం సాధించింది. సోమవారం సాయంత్రం విధులను ముగించుకుని కోరుమామిడి గ్రామంలోని ఇంటికి వెళ్లింది. అనంతరం బంధువులతో కలిసి చర్చిలో ప్రార్థన చేసింది. చర్చి నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కడుపునొప్పి, కళ్లు తిరగడం, కాళ్లూ చేతులు వంకర్లు తిరగడం వంటి సమస్యలతో బాధపడుతున్న కరుణను బంధువులు పద్మ, సుబ్బు కలిసి కారులో నిడదవోలు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న కరుణను రాత్రి 9 గంటల సమయంలో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు కరుణను పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గదిలో ఉంచారు. బంధువులు, తల్లిదండ్రులు మాత్రం ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లిపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరుణకు పెళ్లి చేసేందుకు సంబంధాలు కూడా చూశారు. అయితే వివాహం విషయంలో కుటుంబంలో కలహాలు జరుగుతున్నట్లు తోటి ఉద్యోగులు చెబుతున్నారు. కరుణ మరణ సమాచారం తెలుసుకున్న పట్టణంలోని వివిధ వార్డు సచివాలయ ఉద్యోగులు ఆసుపత్రికి తరలివచ్చారు. మృతురాలి కరుణ తల్లి సూర్యకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కె.వీరబాబు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా.. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేష్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని కరుణ మృతదేహన్ని పరిశీలించి సంతాపం వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, మున్సిపల్ కమిషనర్ టి.కృష్ణవేణి, సీపీఎం నాయకులు జువ్వల రాంబాబు, జనసేన పట్టణ అధ్యక్షుడు రంగా రమేష్ సంతాపం తెలిపారు. రేషన్ బియ్యం స్వాధీనం రాజానగరం: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రవాణా చేస్తున్న రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. జాతీయ రహదారిపై జీఎస్ఎస్ వైద్య కళాశాల సమీపంలో సోమవారం రూ.10 లక్షల విలువైన బియ్యం పట్టుబడిన సంగతి తెలిసిందే. ఇదే విధంగా మంగళవారం కూడా పైప్రాంతానికి కొద్దిదూరంలో పిరమిడ్ను చేర్చి ఉన్న పెట్రోలు బంకు వద్ద జాతీయ రహదారిపై రూ.ఒక లక్ష విలువ చేసే రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. బియ్యంతో పాటు రవాణాకు ఉపయోగించిన వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నామని డిప్యూటీ తహసీల్దార్ (పౌరసరఫరాలు) గొలుగూరి బాపిరాజు తెలిపారు. చక్రద్వారబంధానికి చెందిన మాడబోయిన గోపి నుంచి వడిశలేరుకు చెందిన వట్టికూటి మణికంఠ మినీ వ్యాన్ను అద్దెకు తీసుకుని, అనపర్తి నుంచి గండేపల్లికి ఈ బియ్యాన్ని రవాణా చేస్తున్నాడన్నారు. నిందితుడిపై 6ఏ కేసు నమోదు చేశామన్నారు. -
పిడుగు పడి రైతు మృతి
నల్లజర్ల: పిడుగు పడి రైతు మృతి చెందిన ఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. అనంతపల్లి శివారు కృష్ణమ్మగూడెంలో వెలగాని సత్యనారాయణ (47) తన ఇంటి సమీపంలోని మామిడి చెట్టు వద్ద ఉన్న సిమెంట్ బెంచీపై కూర్చున్నాడు. ఈదురుగాలులతో వర్షం పడుతున్న ఆ సమయంలో పిడుగు పడడంతో సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. అతడు నబీపేట నుంచి వచ్చి ఇక్కడి ఎంపీపీ స్కూలు వద్ద ఇల్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నాడు. వివాహిత మౌన దీక్ష కిర్లంపూడి: తన కుమారుడికి రావాల్సిన ఆస్తిని ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ రాజుపాలెంలోని తన అత్తారింటి వద్ద నాగ వెంకటలక్ష్మి అనే వివాహిత తన కుమారుడు, కుటుంబ సభ్యులతో మంగళవారం మౌన దీక్షకు దిగింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. కాజులూరు మండలం పెనుమళ్ల గ్రామానికి చెందిన నాగ వెంకటలక్ష్మికి కొత్తపల్లి మండలం గోర్సకు చెందిన వీరబాబుతో పెద్దల సమక్షంలో వివాహమైంది. కొన్నేళ్ల తరువాత రాజుపాలెంలో వారు స్థిరపడ్డారు. అయితే వీరబాబు మానసిక స్థితి సరిగ్గా ఉండదు. కానీ ఈ విషయం చెప్పకుండానే వివాహం చేశారు. వారికి మగబిడ్డ పుట్టిన తర్వాత ఆమెను అత్తింటివారు దూరం పెట్టారు. కుమారుడికి రావాల్సిన ఆస్తిని వేరే వాళ్లకు కట్టబెట్టేందుకు ప్రయత్నించడంతో పాటు ఇదేంటి అని అడిగితే ఇంట్లోకి కూడా రానివ్వకుండా బయటకు వెళ్లగొడుతున్నారు. దీంతో నాగ వెంకటలక్ష్మి తన కుమారుడితో కలిసి దీక్ష చేపట్టింది. -
ప్రతి రైతు పారిశ్రామికవేత్తగా ఎదగాలి
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): ప్రతి రైతూ పారిశ్రామికవేత్తగా ఎదగాలని, వ్యవసాయాన్ని పరిశ్రమగా చేపట్టాలని జాతీయ వాణిజ్య పరిశోధన, వ్యవసాయ పరిశోధన సంస్థ (నిర్కా) డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషుమాధవ్ అన్నారు. రాజమహేంద్రవరం ఐసీఏఆర్ – నిర్కా (సీటీఆర్ఐ)లో మంగళవారం వ్యవసాయంలో ఆవిష్కరణలు – వ్యవసాయం పారిశ్రామికరణ దిశగా ఆవిష్కర్తల కలయిక కార్యక్రమం జరిగింది. అధ్యక్షత వహించిన శేషుమాధవ్ మాట్లాడుతూ వ్యవసాయంలో వాణిజ్యపరమైన వినూత్న ఆవిష్కరణలు, అవకాశాలతో పాటు వాణిజ్య పంటల ఉత్పత్తుల దిగుమతులను తగ్గించుకునే దిశగా రైతులు, ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలు, అంకుర సంస్థలు కృషి చేయాలన్నారు. న్యూఢిల్లీ ఐసీఏఆర్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ (ఐపీటీఎం) డాక్టర్ నీరు భూషణ్ ముఖ్యఅతిథిగా ఆన్లైన్లో హాజరు కాగా, వారి తరఫున న్యూఢిల్లీ ఐసీఏఆర్ – ఐటీఎంయూ డాక్టర్ వి.విక్రమ్సింగ్ ఆన్లైన్లో సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఐటీఎంయూ నోడల్ ఆఫీసర్, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ హెచ్.రవిశంకర్ మాట్లాడుతూ ఆవిష్కర్తల కలయిక ఆవశ్యకతలను వివరించారు. వాణజ్య వ్యవసాయంపై ఆవిష్కరణలు, విలువ ఆధారిత పదార్థాల తయారీపై రైతుల విజయగాథలు, కోత అనంతరం వాణిజ్య పంటలలో వివిధ ఉత్పత్తులలో సంకలనం చేయబడిన సావనీర్ను అతిథులు ఆవిష్కరించారు. భారత చిరుధాన్యాల పరిశోధనా సంస్థ డైరెక్టర్ డాక్టర్ తారా సత్యవతి, హైదరాబాద్ ఐసీఏఆర్–నారమ్ మేనేజ్మెంట్ డివిజన్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ హెడ్ ఎస్.సెంథిల్ వినాయగం, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ నటరాజ్, నాబార్డు ఏజీఎం సోము నాయుడు, ఎపెడా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆర్పీ నాయుడు మాట్లాడారు. అనంతరం 11 మంది ఔత్సాహిక యువత తమ అనుభవాలను వివరించారు. 11 ఎగ్జిబిషన్ స్టాళ్లలో పసుపు, అశ్వగంధం, ఆముదం, మిరప ఉత్పత్తులతో పాటు ఎన్జీవో, ఎఫ్పీవోలు, ఏపీసీఎన్ఎఫ్ (ప్రకృతి వ్యవసాయం) వారి వివిధ ఉత్పత్తులు, రోబోటిక్స్, డ్రోన్స్, జ్యూట్బ్యాగులను ప్రదర్శించారు. అనంతరం 17 మంది ఔత్సాహిక ఆవిష్కర్తలను సత్కరించారు. నిర్కా డైరెక్టర్ డాక్టర్ శేషుమాధవ్ ఉత్సాహంగా ‘ఆవిష్కర్తల కలయిక’ -
అట్టనాణేలతో లెక్కల పాఠాలు
అమలాపురం టౌన్: బ్రిటీషు కాలంలో దాదాపు 110 ఏళ్లనాటి ఎనిమిది రకాల అట్ట నాణేలను అమ లాపురానికి చెందిన నాణేల సేకరణ కర్త పుత్సా కృష్ణ కామేశ్వర్ సేకరించారు. కాలగర్భంలో కలిసి మరుగున పడిపోయిన ఈ నాణేలు అప్పట్లో అర్ధ రూపాయి, పావలా, బేడా (రెండు అణాలు), అణా, అర్ధణా, కాణి, దమ్మిడి అనే ఎనిమిది రకలుగా చెలామణిలో ఉండేవి. అప్పట్లో ఈ నాణేలను పిల్లలకు లెక్కలు నేర్పడానికి ఉపయోగించేవారని సేకరణ కర్త కృష్ణ కామేశ్వర్ తెలిపారు. అసలైన నాణేలు పిల్లలకు ఇస్తే అవిపోతే అనివార్యమయ్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టకుని వీటిని అట్టతో త యారు చేయించారు. వెండి రంగు, రాగి రంగుతో ఉండే ఈ అట్టనాణేలకు, అసలైన నాణేలకు వ్యత్యాసాన్ని ఎంతో పరీక్షించి చూస్తే తప్ప తెలియదు. ఈ నాణేలను బ్రిటీషు వారు జర్మనీ దేశానికి చెందిన లాంగ్ మన్స్ అనే కంపెనీ ద్వారా తయారు చేయించి మన దేశానికి రప్పించి ఇక్కడ విద్యార్థులకు లెక్కలు నేర్పేవారు. అయితే ఈ పద్ధతి ఎక్కువ కాలం నడవకపోవడంతో ఈ అట్టనాణేలు క్రమేణా అదృశ్యమయ్యాయి. అల్లవరం మండలం కోడూరుపాడు గ్రామానికి చెందిన నడింపల్లి రామరాజు 50 ఏళ్ల కిందట అనేక పాఠశాలలను సందర్శించి తిరిగి అట్టనాణేలను సేకరించారు. ఆయన నుంచి తాను సేకరించినట్లు కృష్ణ కామేశ్వర్ తెలిపారు. 110 ఏళ్ల క్రితం చలామణి సేకరించిన కృష్ణ కామేశ్వర్ -
రోగి మృతితో కుటుంబ సభ్యుల ఆందోళన
● వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపణ ● ఆస్పత్రి వద్ద బైఠాయించి నిరసన కంబాలచెరువు (రాజమహేంద్రవరం): వైద్యుల నిర్లక్ష్యం కారణంగా రోగి మృతి చెందాడంటూ దానవాయిపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి వద్ద మంగళవారం మృతుడి బంధువులు ఆందోళన చేశారు. వివరాల్లోకి వెళితే.. ఆలమూరుకు చెందిన జి.సత్యనారాయణ (55) కూలి పనిచేస్తుంటాడు. అతడు ఆదివారం పనికి వెళ్లి ట్రాక్టర్ పైనుంచి పడిపోయాడు. ఈ ప్రమాదంలో అతడి రెండు కాళ్లూ నుజ్జునుజ్జు అయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు అతడిని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడ పరీక్షించిన వైద్యుడు..ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో సత్యనారాయణను దానవాయిపేటలోని ఆ వైద్యుడు తెలిపిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ అతడి కాళ్లకు ఆపరేషన్ చేసి ఐసీయూలో ఉంచారు. ఆపరేషన్ చేసిన రోజు, మర్నాడు సోమవారం బాగానే ఉన్నాడు. మంగళవారం కుటుంబ సభ్యులు ఐసీయూలోకి వెళ్లి చూసేసరికి సత్యనారాయణ అచేతనంగా పడిఉన్నాడు. అతడి శరీరం పూర్తిగా చల్లబడిపోయింది. దీంతో వెంటనే బయటకు పరుగెత్తుకు వచ్చి విషయాన్ని అక్కడ సిబ్బందికి తెలిపారు. వారు వచ్చి సత్యనారాయణకు వైద్య చికిత్సలు ప్రారంభించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు తెలిసింది. దీనిపై మృతుడి బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేశారు. తాము చెప్పే వరకు పేషెంట్ను పట్టించుకోలేదని, తాము చెబితేనే చనిపోయినట్లు వారికి అర్థమైందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఇదిలావుండగా ఆసుపత్రి వద్ద మృతుడి కుటుంబీకులు ఆందోళన చేస్తున్నారని ఆ ఆసుపత్రి నిర్వాహకులు ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసులకు అక్కడకు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. -
జిల్లాలో గ్యాస్ కనెక్షన్లు ఇలా..
గ్యాస్ధర పెంపు దారుణం గ్యాస్ సిలిండర్పై ఒకేసారి రూ.50 ధర పెంచడం దారుణం. పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఇది ఇబ్బందికర పరిస్థితి. సామాన్య కుటుంబాలు ఏడాదికి రూ.300 వరకు అదనంగా గ్యాస్కు చెల్లించాలంటే కష్టం. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. పెంచిన ధరను రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. – బొంతా మణి, గృహిణి రాజమహేంద్రవరంసాక్షి, రాజమహేంద్రవరం: నిత్యావసర ధరలు, విద్యుత్ చార్జీల పెంపుతో ఇప్పటికే సతమతమవుతున్న ప్రజలపై ప్రభుత్వం వంట గ్యాస్ బండ భారం మోపింది. గృహ అవసరాలకు వినియోగించే 14.2 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.50 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన ధర మంగళవారం నుంచి అమల్లోకి తీసుకురావాలని చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్పురి స్పష్టం చేశారు. ధరల పెంపుతో ప్రస్తుతం జిల్లాలో రూ.832 ఉన్న గ్యాస్ సిలిండర్ రూ.50 పెరిగి.. రూ.882కు చేరింది. ఇది కేవలం సాధారణ వినియోగదారులకే కాకుండా ఉజ్వల పథకం లబ్ధిదారులకు సైతం వర్తింప చేశారు. ఈ పరిణామం సాధారణ, మధ్య తరగతి కుటుంబాల్లో ఆందోళన నింపుతోంది. ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగాయి. విద్యుత్ చార్జీల బాదుడు కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో గ్యాస్ ధర పెరగడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. రోజుకు రూ.6 లక్షల భారం తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా 3 ప్రధాన కంపెనీలు, 43 ఏజెన్సీల ద్వారా గ్యాస్ సరఫరా జరుగుతోంది. మొత్తం 6,68,641 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతి రోజూ 13 వేల వరకు వంట గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేస్తున్నట్టు సమాచారం. సిలిండర్పై రూ.50 పెంపుతో రోజుకు రూ.6.50 లక్షల వరకు వినియోగదారులపై అదనపు భారం పడుతోంది. నెలకు రూ.1.95 కోట్లు వరకు భారం పడుతుంది. ఉజ్వలకూ వర్తింపు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వెనుకబడిన వర్గాలకు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికి ఉజ్వల పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్, స్టవ్ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద జిల్లాలో 41,055 గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేశారు. ప్రస్తుత పెంపును వారికి సైతం వర్తింప చేశారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షల లోపు ఉన్న కుటుంబాలకు మంజూరు చేసిన పథకాన్ని సైతం పెంపులో భాగస్వామ్యం చేయడం ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. నిత్యావసరాలతో ఇబ్బందులు ఇప్పటికే నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కందిపప్పు, మినపప్పు, వంట నూనె తదితర ధరలు పెరిగి సామాన్యుడు కొనలేని పరిస్థితి తలెత్తింది. ఇలాంటి తరుణంలో గ్యాస్ రూ.50 పెరగడంతో మరిన్ని ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయం వెల్లడవుతోంది. నలుగురున్న ఒక మధ్య తరగతి కుటుంబానికి ఒక సిలిండర్ రెండు నెలల వరకు వినియోగించుకోవచ్చు. అంటే ఏడాదికి 6 సిలిండర్లు అవసరం అవుతాయి. ఏడాదికి అదనంగా రూ.300 చెల్లించాల్సి వస్తోంది. పట్టించుకోని కూటమి ప్రభుత్వం కేంద్రం గ్యాస్ ధర ఏకంగా రూ.50 పెంచి ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతున్నా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం నుంచి కనీస స్పందన కరువైంది. రాష్ట్ర పరిధిలో నియంత్రించేందుకు ముందుకురాకపోవడంపై ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర పెంచిన భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాగే పెంచుతూ పోతే తాము వంట ఎలా వండుకోవాలని ప్రశ్నిస్తున్నారు. పెట్రోల్పై రూ.2 పెంపు గ్యాస్ ధరతో పాటు పెట్రోల్, డీజిల్ లీటర్పై ఎక్సైజ్ సుంకం రూ.2 పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ భారం వాహనదారులపై పడదని, ఇంధనాల రిటైల్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని ఆయిల్ కంపెనీలు పేర్కొన్నా.. భవిష్యత్తులో ప్రజలపై భారం తప్పదన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలపై వంటగ్యాస్ ధరల వడ్డన సిలిండర్పై రూ.50 పెంచుతూ నిర్ణయం ఇప్పటికే నిత్యావసర ధరల పెరుగుదలతో సతమతం తాగాజా గ్యాస్ ధర పెరగడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజల్లో అసహనం జిల్లావ్యాప్తంగా 6 లక్షల గ్యాస్ కనెక్షన్లు రూ.50 పెంచడంతో ప్రతి నెలా ప్రజలపై రూ.1.95 కోట్ల భారం పెట్రోల్ ధర రూ.2 పెంపు వాహనాలు ఎలా నడపాలంటున్న వాహనదారులు కంపెనీ ఏజెన్సీలు జనరల్ దీపం ఉజ్వల 5 కిలోల సిలిండరు్ల హెచ్పీసీఎల్ 28 3,35,472 1,19,701 24,644 2,513 ఐవోసీఎల్ 12 64,191 53,245 16,252 14 బీపీసీఎల్ 3 27,456 13,262 159 28 -
16 సమ్మర్ వీక్లీ స్పెషల్ రైళ్లు
రాజమహేంద్రవరం సిటీ: వేసవికాలం ప్రయాణికుల రద్దీని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా మీదుగా 16 వీక్లీ సమ్మర్ స్పెషల్ రైళ్లు ఏర్పాటు చేస్తూ రైల్వే అధికారులు మంగళవారం ప్రకటించారు. 07325 హుబ్లీ– కటీయార్ ప్రతి బుధవారం నడిచే ఈ రైలు ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి 30వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. 07326 కటియార్–హుబ్లీ ప్రతి శనివారం నడిచే ఈ రైలు 12వ తేదీ నుంచి మే 3వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. 06559 ఎస్ఎంవీటీ బెంగళూరు– నారంగి ప్రతీ మంగళవారం నడిచే ఈ రైలు ఈ నెల 29వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. 06560 నారంగి– ఎస్ఎంవీటీ బెంగళూరు ప్రతీ శనివారం నడిచే రైలు ఈ నెల 12వ తేదీ నుంచి మే 3వ తేదీ వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైళ్లు రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లో ఆగనున్నాయని ప్రయాణికులు సద్వినియోగం వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. వేగంగా అర్జీల పరిష్కారం సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): రెవెన్యూ పరంగా పీజీఆర్ఎస్లో 6,765 అర్జీలు పరిష్కారం కోసం రాగా 6,226 పరిష్కరించామని కలెక్టర్ పి. ప్రశాంతి తెలియజేశారు. మంగళవారం అమరావతి నుంచి సీసీఎల్ఏ కమిషనర్ జి.జయలక్ష్మి కలెక్టర్లతో పీజీఆర్ఎస్, వాటర్ ట్యాక్స్, భూముల క్రమబద్ధీకరణ అంశాలపై వీడియో కాన్ఫరెనన్స్ నిర్వహించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ ప్రశాంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివరాలు తెలియజేస్తూ భూముల క్రమబద్ధీకరణ కోసం ఇప్పటి వరకు 278 దరఖాస్తులు రాగా పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, జిల్లా ల్యాండ్ సర్వే అధికారి బి.లక్ష్మీనారాయణ, డిప్యూటీ తహసిల్దార్ శ్రీనివాస్, పాల్గొన్నారు -
యాప్సోపాలు!
● పనిచేయని కొత్త యాప్తో ఇసుక కష్టాలు ● ఎగుమతులు జరగక నిలిచిన వాహనాలు ● కొత్త డ్యూటీలు మాకొద్దు అంటున్న ఉద్యోగులు పెరవలి: ఇసుకాసురులకు ఇచ్చిన అవకాశాలు ఇచ్చినంత సేపు ఇచ్చి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కఠిన నిర్ణయాలు అమలు చేయటంతో ఇసుక ఎగుమతులు అంతంతమాత్రంగా జరుగుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరుకు మైనింగ్ అధికారులు ఇసుక కోసం వచ్చే వాహనాలను ముందుగా ఫొటో తీసి, దాని ప్రకారం ఇసుక బుక్ చేసుకున్న రశీదును ముందుగా వీఆర్ఓ లాగిన్లోకి వెళ్లి... వచ్చిన సమయం నోట్ చేసిన తరువాత కాంట్రాక్టర్ లాగిన్కు వస్తోంది. ఆ తరువాత కాంట్రాక్టర్ ఇసుక లోడ్కి అనుమతి ఇచ్చి, లోడ్ అయిన తరువాత మళ్లీ దానిని ఫొటో తీసి పంపిన తరువాత ఉన్నతాధికారులు ఓకే చేశాక, రశీదు రాసి వాహనదారుడుకి ఇస్తున్నారు. ఈ క్రమంలో ఎవరైనా పొరపాటున తప్పుగా నమోదు చేస్తే సైట్ మొత్తం ఆగిపోతుంది. మళ్లీ సైట్ ఓపెన్ అవ్వాలంటే మైనింగ్ అధికారులకు సమాచారం ఇచ్చి, అక్కడ నుంచి జిల్లా అధికారులకు, అక్కడ నుంచి అమరావతికి పంపించి జరిగిన తప్పు ఇది అని వీరందరికి చెప్పిన తరువాత దానిని సరిచేస్తే మళ్లీ సైట్ ఓపెన్ అవుతోంది. ఇదే క్రమంలో నిన్న ఆదివారం కాకరపర్రు ఇసుక ర్యాంప్, నేడు సోమవారం తీపర్రు ర్యాంప్లో ఇసుక ఎగుమతులు నిలిచిపోయాయి. కొత్త యాప్తో చాలా ఇబ్బందులు పడవలసి వస్తున్నదని దీనివలన ఎగుమతులు జరగక నానా పాట్లు పడుతున్నామని నిర్వాహకుల చెబుతుండగా, వాహనదారులు మాకు అసలు ట్రిప్లు పడటం లేదని, అన్ని సక్రమంగా ఉంటే యాప్ పనిచేయదని, యాప్ పనిచేస్తే ఇసుక ఉండటం లేదని అంటున్నారు. గతంలో రోజుకి మూడు ట్రిప్లు వేస్తే నాలుగు రోజులుగా కేవలం రెండు ట్రిప్లు మాత్రమే వేశామని చెప్పారు. దీంతో కిస్తీలు కట్టలేక, నానా ఇబ్బందులు పడుతున్నామని వాహనదారులు వాపోతున్నారు. ప్రభుత్వం అంతా అయిపోయిన తరువాత ఈ విధమైన నిర్ణయాలు చేయటం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. వీఆర్ఓలు మాత్రం మాకు ఈ డ్యూటీలు వద్దని కోరుతున్నారు. ఒక వీఆర్ఓ నేరుగా కలెక్టర్కు నాకు ఇంగ్లిషు రాదు, నేను యాప్లో నమోదు చేయలేకపోతున్నానని తెలియజేయగా.. జిల్లా అధికారులు సచివాలయ సిబ్బందిని కొత్తగా నియమించటంతో వారు గగ్గోలు పెడుతున్నారు. ఉచిత ఇసుక పథకం ప్రవేశపెట్టి మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఉంది కానీ ఈ యాప్లు వలన ఎటువంటి ప్రయోజనం లేదని, దోచుకోవలసింది అంతా దోచేశారని ఇప్పుడు కొత్తగా నిబంధనలు తెచ్చి ఏమిటి ప్రయోజనం అని పలువురు అంటున్నారు. ఈ కొత్త యాప్ వలన ఎగుమతులు సక్రమంగా జరగక వాహనదారులు, ఇసుక వెళ్లక కాంట్రాక్టర్లు, కొత్త యాప్తో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. -
15న ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్ షిప్ మేళా
రాజమహేంద్రవరం రూరల్: రాజమహేంద్రవరం ప్రభుత్వ ఐటీఐలో పాసైన అభ్యర్థులకు జిల్లాలో గల ప్రముఖ పరిశ్రమలలోను, బ్లూస్టార్, శ్రీసిటీలో అప్రెంటిస్ షిప్ కోసం ఈ నెల 15వ తేదీన ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ఐటిఐ ప్రిన్సిపాల్ ఎల్ఆర్ఆర్ కృష్ణన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో ప్రముఖ సంస్థలు ‘ఆంధ్రపేపర్ లిమిటెడ్‘ రాజమహేంద్రవరం, కడియం యూనిట్లలోను, ధవళేశ్వరంలోని ‘హిందూస్తాన్ యూనిలివర్‘ సంస్థలో ఐటీఐ ఫిట్టర్ పాస్ అయిన అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహణ ద్వారా ఎంపిక జరుగుతుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ సర్టిఫికెట్ల నకలు, ప్రొఫైల్ రిజిస్టర్ కాపీలను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఐటీఐలో ఈ నెల 13 లోపుగా అందజేయాలని ప్రిన్సిపాల్ తెలిపారు. సత్యదేవునికి ఘనంగా ఏకాదశి పూజలు అన్నవరం: సత్యదేవునికి చైత్ర శుద్ధ ఏకాదశి సందర్భంగా అర్చకులు మంగళవారం స్వామి, అమ్మవార్లకు ఘనంగా పూజలు నిర్వహించారు. ఉదయం ఏడు గంటలకు స్వర్ణ పుష్పార్చన, ఉదయం తొమిది గంటల నుంచి 11 గంటల వరకు తులసి దళార్చన నిర్వహించారు. సుమారు 25 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించారు. స్వామివారి వ్రతాలు వేయి నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ. 20 లక్షల ఆదాయం సమకూరింది. ఘనంగా సీతారాముల వేద సదస్యం కాగా, రత్నగిరి రామాలయంలో నిర్వహిస్తున్న శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా మూడో రోజు మంగళవారం సీతారాముల వేద సదస్యం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం నాలుగు గంటలకు నవదంపతులు సీతారాములను వెండి సింహాసనం మీద, పెళ్లిపెద్దలు సత్యదేవుడు, అనంతలక్ష్మీ అమ్మవారిని మరో ఆసనంపై ఉంచి పూజలు చేశారు. సీతారాములకు నూతన పట్టు వస్త్రాలను ఈఓ వీర్ల సుబ్బారావు దంపతులు అందజేశారు. వేదపండితులు గొల్లపల్లి ఘనపాఠీ, చిట్టి శివ, గంగబాబు, రామాలయ అర్చకుడు దేవులపల్లి ప్రసాద్, కల్యాణబ్రహ్మ ఛామర్తి కన్నబాబు, వ్రత పురోహితుడు పాలంకి పట్టాభి కార్యక్రమం నిర్వహించారు. నేడు రాష్ట్ర స్థాయి మేనేజ్మెంట్ ఫెస్ట్ కాకినాడ రూరల్: తిమ్మాపురం గ్రామం అచ్చంపేట జంక్షన్ వద్ద నన్నయ్య ఎంఎస్ఎన్ పీజీ సెంటరులో కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ విభాగం ఆధ్వర్యంలో తలాష్ – 2కె 25 పేరిట రాష్ట్రస్థాయి మేనేజ్మెంట్ ఫెస్ట్ను బుధవారం నిర్వహించనున్నట్టు ప్రిన్సిపాల్ ప్రశాంతి శ్రీ తెలియజేశారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా నన్నయ్య యూనివర్శిటీ వీసీ ప్రసన్న శ్రీ,, ఓఎన్జీసీ ఈడీ రత్నేష్కుమార్ హాజరవుతారన్నారు. సింగిల్ నంబర్ లాటరీ స్థావరాలపై దాడులు కాకినాడ క్రైం: కాకినాడలో కూటమి నేతల అండదండలతో విచ్చలవిడిగా లక్షల్లో జరుగుతున్న నంబర్గేమ్పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. బెంగళూరు కేంద్రంగా చేసుకుని దినసరి కూలీలు, నిరుపేదల జీవితాలతో చెలగాటమాటమాడుతున్న సింగిల్ నంబర్ లాటరీల భాగోతాన్ని గత నెల 20న ‘కూటమి వారి లాటరీ’ శీర్షికన ‘సాక్షి’ వెలుగులోకి తీసుకువచ్చింది. దీనిపై జిల్లా ఎస్పీ బిందుమాధవరావు తీవ్రంగా స్పందించి ఆకస్మికంగా దాడులు చేయించారు. కాకినాడ సాంబమూర్తినగర్ ఫ్లై ఓవర్, సంజయ్నగర్ లారీ ఆఫీసు, ఎమ్ఎస్ఎన్ చారిటీస్ నూకాలమ్మ గుడి వద్ద పార్కు తదితర ప్రాంతాల్లో నిత్యం సింగిల్ నంబర్ లాటరీతో పేదల పొట్టగొడుతున్నారు. ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న జిల్లా ఎస్పీ సింగిల్ నంబర్ లాటరీ స్థావరాలపై ప్రత్యేక పోలీసు బృందాలతో దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో కాకినాడ టూటౌన్, త్రీటౌన్ పరిధిలో పలు సింగిల్ నంబర్ లాటరీ స్థావరాలను పోలీసులు గుర్తించారు. నంబర్ గేమ్ ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి నగదును, మొబైల్ఫోన్లను స్వాఽధీనం చేసుకున్నారు. నంబర్ గేమ్కు మూలాలు, పొరుగు జిల్లాలు, రాష్ట్రాల్లో ఉన్నాయని తెలియడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. -
అక్రమ ర్యాంప్.. జోరుగా తరలింపు
పెరవలి: అధికారి కూటమి నేతలు బరి తెగించి అక్రమ ఇసుక ర్యాంప్ ఏర్పాటు చేయటమే కాకుండా యథేచ్ఛగా రాత్రి పగలు ఇసుక తరలిస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. పెరవలి మండలం ఖండవల్లి పరిధిలోని లంకమాలపల్లికి ఆనుకుని ఉండే ఎర్రవంతెన వద్ద నుంచి నిత్యం యథేచ్ఛగా ఇసుక తరలిస్తున్నా రెవెన్యూ, పోలీస్ డిపార్టుమెంట్లు పట్టించుకోవడం లేదు. అధికారపార్టీ నేతల ఒత్తిళ్లు ఒకవైపు, మామూళ్లూ ఇంకొక వైపు అఽందటంతో అధికారులు ఏమీ పట్టనట్లు ఉంటున్నారని అంటున్నారు. ఇసుక తరలిస్తున్నప్పుడు అధికారులకు ఎవరైనా చెప్పుచుంటే దళారీలను పట్టుకోవటం మాని అధికారులే నేరుగా దళారీలకు ఫోన్ చేసి చెప్పటం విడ్డూరంగా ఉందని అంటున్నారు. ఈ ఫిర్యాదు చేసిన వారు సామాన్యులైతే ఫర్వాలేదు కానీ ప్రతిపక్ష పార్టీ వారయితే వారిని టార్గెట్ చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇప్పటికే అధికార ర్యాంప్ల్లో అధికారుల సాక్షిగా ఇసుక దోపిడీ జరుగుతున్నా చర్యలు లేకపోవడంతో అధికారపార్టీ నేతలు ఒక అడుగు ముందుకు వేసి ర్యాంపునే ఏర్పాటు చేసుకుని ఇసుక అక్రమ రవాణాను జోరుగా చేస్తున్నారు. పెరవలి మండలంలో తీపర్రు, కానూరు–పెండ్యాల, కాకరపర్రు ఇసుక ర్యాంపులు ఉన్నా నేడు ఖండవల్లిలో ఏర్పాటైన అనధికార ఇసుక ర్యాంపు నుంచి నిత్యం రాత్రి సమయాల్లో 20 నుండి 40 ట్రాక్టర్లు ఇసుకను తరలిస్తున్నారు. మంగళవారం జిల్లాలో ఇసుక టెండర్లు వేసే పనిలో కాంట్రాక్టర్లు ఉండగా ఇదే అదనుగా పట్టపగలే ఇసుకను ట్రాక్టర్లతో తరలించారు. తీర ప్రాంతంలోని ప్రతీ గ్రామంలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడానికి పగలు పంచాయతీ కార్యదర్శులు, రాత్రులు రెవెన్యూ సిబ్బంది పహరా కాస్తున్నా ఇసుక తరలివెళ్లిపోతున్నదంటే ఏ స్థాయిలో ముడుపులు అందుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. గతంలో సాక్షి ఈ విషయాన్ని బయట పెడితే కొద్దిరోజులు ఇసుక రవాణా నిలిచిపోయింది కానీ కొన్ని రోజులుగా కొనసాగుతోంది. అధికారులు కాసులకు కక్కుర్తి పడటం వలన ఇసుక అక్రమ రవాణా 3 ట్రాక్టర్లు 6 లారీలుగా కొనసాగుతోంది. ఈ ర్యాంప్ నుంచి ఇసుకను రాత్రి 11గంటల నుంచి తెల్లవారు జాము 4 గంటల వరకు తరలిస్తున్నారు. అధికార నేతలే ర్యాంప్ ఏర్పాటు ఖండవల్లిలో అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధే ఈ ర్యాంప్ ఏర్పాటు చేశారని బహిరంగంగా చెప్పుకుంటున్నారు. ఈ విషయంపై పెరవలి తహసీల్దార్ను వివరణ కోరగా గతంలో ర్యాంప్ ఏర్పాటు చేయటం నిజమేనని, దీనిని ధ్వంసం చేసామని, ఇప్పడు మళ్లీ తోలుతున్నారా అయితే వీఆర్ఓను పంపించి విషయం తెలుసుకుంటానని తెలిపారు. ఎస్సై ఎం.వెంకటేశ్వరరావును వివరణ కోరితే ఇసుక తరలిస్తున్నారని తెలిసిన వెంటనే సిబ్బందిని పంపించామని ఎవరూ దొరకలేదని చెప్పారు. యథేచ్ఛగా రాత్రి పగలు ఇసుక రవాణా -
పేదల ఆరోగ్యంపై.. నిర్లక్ష్యపు పడగ
సాక్షి, రాజమహేంద్రవరం: పేదలకు ఆధునిక, కార్పొరేట్ వైద్యం, శస్త్రచికిత్సలను ఉచితంగా అందించే ఎన్టీఆర్ వైద్య సేవ (ఆరోగ్యశ్రీ) ఆగింది. రెండు దశాబ్దాలుగా ఎంతో మంది పేదల ప్రాణాలు నిలిపిన ఈ పథకం.. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో నిలిచిపోయింది. ఈ పథకాన్ని అమలు చేస్తున్న ప్రైవేటు, కార్పొరేట్ నెట్వర్క్ ఆస్పత్రులకు ప్రభుత్వం కొన్ని నెలలుగా బిల్లులు చెల్లించడం లేదు. ఫలితంగా ఆస్పత్రుల నిర్వహణ కష్టంగా మారిందని, తమకు వెంటనే బకాయిలు విడుదల చేయకపోతే వైద్య సేవలు నిలిపివేస్తామని కొన్ని రోజుల ముందే నెట్వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు నోటీసులు ఇచ్చాయి. బకాయిల అంశాన్ని ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ప్రభుత్వం స్పందించలేదు. ఈ నేపథ్యంలో నెట్వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు సోమవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలను నిలిపివేశాయి. దీంతో సుదూర ప్రాంతాల నుంచి ఆరోగ్యశ్రీ ఉచిత చికిత్స కోసం వివిధ ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లిన రోగులు, వారి బంధువులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొన్నారు. డబ్బులు చెల్లిస్తేనే వైద్యం చేస్తామని ఆయా ఆస్పత్రుల సిబ్బంది చెప్పడంతో కంగు తిన్న పేదలు ఏం చేయాలో తెలియని ఆవేదనతో వెనుతిరిగారు. పేదల ప్రాణదాయినిగా ఉన్న ఈ పథకం నిలిచిపోవడానికి కారణమైన కూటమి ప్రభుత్వానికి వారు శాపనార్థాలు పెట్టారు. రూ.150 కోట్లకు పైగా బకాయిలు ఎన్టీఆర్ వైద్యసేవ కింద తెల్ల రేషన్కార్డు దారులకు కార్పొరేట్ స్థాయిలో వివిధ చికిత్సలు, ప్రొసీజర్లను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. దీనికి అయిన ఖర్చును ప్రభుత్వమే ఆయా ఆస్పత్రులకు చెల్లిస్తూంటుంది. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంటే.. గడచిన పది నెలలుగా నయాపైసా కూడా చెల్లించలేదు. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద గుండె, ఈఎన్టీ, గ్యాస్ట్రో, జనరల్ మెడిసిన్, ఆర్థో తదితర శస్త్రచికిత్సలు చేసిన నెట్వర్క్ ఆస్పత్రులకు జిల్లా వ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. దీని కోసం పదేపదే విజ్ఞప్తులు చేసినా, ఉన్నతాధికారులతో చర్చలు జరిపినా ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో ఈ ఉచిత వైద్య సేవలను ఆయా ఆస్పత్రులు నిలిపివేశాయి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఈహెచ్ఎస్ సేవలు నిలిచిపోయాయి. ఈ తరుణంలో ఎన్టీఆర్ వైద్య సేవలు సైతం ఆగిపోతే తమ పరిస్థితేమిటనే ఆందోళన ప్రజల్లో నెలకొంది. సేవలు నిలిపివేసినట్లు ఆయా ఆస్పత్రుల సిబ్బంది చెబుతూండటంతో శస్త్రచికిత్సలకు వచ్చిన వారు ఆందోళన చెందుతున్నారు. అయితే, జిల్లా వ్యాప్తంగా 35 ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ ఉచిత సేవలు కొనసాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. నిర్వీర్యం చేసేందుకు కుట్ర గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే నెట్వర్క్ ఆస్పత్రులకు ఎన్టీఆర్ వైద్య సేవ బకాయిలు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిన వెంటనే డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం పేరును ఎన్టీఆర్ వైద్య సేవగా మార్చింది. భవిష్యత్తులో ఈ పథకాన్ని పూర్తిగా ఎత్తివేసి బీమా పథకం అమలు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈ పథకం బాధ్యతల్ని ఇన్సూరెన్స్ కంపెనీలకు కట్టబెట్టేందుకు పావులు కదుపుతోంది. ప్రస్తుతం అమలవుతున్న ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.25 లక్షల మేర హెల్త్ కవరేజ్ లభిస్తోంది. ఈ విధానాన్ని బీమాలోకి తీసుకువస్తే.. ఏ మేరకు లబ్ధి చేకూరుతుందనే ప్రశ్న ప్రజల్లో ఉత్పన్నమవుతోంది. రూ.508.49 కోట్లు వెచ్చింపు వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఈ పథకం అమలుకు భారీగా ఖర్చు చేసింది. జిల్లా వ్యాప్తంగా పేద, మధ్య తరగతి ప్రజల వైద్యం, శస్త్రచికిత్సలకు రూ.508,49,95,571 కోట్లు వెచ్చించింది. 2,48,805 మందికి వైద్యం అందించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేసింది. ఏటా రూ.50 కోట్లకు పైనే నిధులు ప్రజారోగ్యం కోసం ఖర్చు చేసింది. ప్రతి కుటుంబానికీ రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యాన్ని వర్తింపజేసి, దీనిని ఏకంగా రూ.25 లక్షలకు పెంచింది. గుండె, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, క్యాన్సర్ వంటి ఖరీదైన శస్త్రచికిత్సలకు సైతం ఆరోగ్యశ్రీలో చోటు కల్పించింది. గత సీఎం వైఎస్ జగన్ చేపట్టిన సంస్కరణలతో ఖరీదైన వ్యాధులకు సైతం ఉచితంగా చికిత్స చేయించుకునే వెసులుబాటు పేదలకు కలిగింది. బైలాటరల్ కాక్లియర్ ఇంప్లాంటేషన్కు రూ.11.97 లక్షలు, ఆల్లోజెనిక్ బోన్మ్యారో స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ (14 ఏళ్లు పైన) రూ.11 లక్షలు, గుండె మార్పిడికి రూ.10.77 లక్షలు వెచ్చించేలా ఏర్పాటు చేశారు. అత్యవసర వైద్యానికి ఇబ్బంది లేదు జిల్లాలో 29 ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ ఆస్పత్రులు ఈ పథకాన్ని ఆపేశాయి. మిగిలిన ఆస్పత్రుల్లో యథావిధిగా నడుస్తోంది. సేవలు నిలిపివేసినా అత్యవస వైద్యానికి వచ్చే రోగులకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. సేవలు ఆపేసిన విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందుతున్నాయి. – డాక్టర్ ప్రియాంక, జిల్లా కో ఆర్డినేటర్, ఎన్టీఆర్ వైద్య సేవ వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఊపిరి పేదలకు కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించాలనే సదుద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వినూత్న రీతిలో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారు. ఆయన తనయుడు, గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ పథకంలో అనేక సంస్కరణలు తీసుకు వచ్చారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక 938 వ్యాధులు, ప్రొసీజర్లతో ప్రారంభమైన ఆరోగ్యశ్రీ పథకం ప్రస్థానం 3,275 వ్యాధులు, ప్రొసీజర్లు విస్తరించారు. నెట్వర్క్ ఆస్పత్రుల్లో కనీస మౌలిక సదుపాయాలు, డ్యూటీ డాక్టర్, స్పెషలిస్టు వైద్యులతో పాటు నర్సు, పారామెడికల్ సిబ్బంది తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. రోగులకు నాణ్యమైన మందులు, పౌష్టికాహారం అందజేసేలా చూశారు. ఆరోగ్య మిత్రతో కూడిన హెల్ప్డెస్క్ పక్కాగా ఏర్పాటు చేశారు. ఆరోగ్యశ్రీ పరిధిలోని వ్యాధులకు చికిత్సను నిరాకరిస్తే ఆయా నెట్వర్క్ ఆస్పత్రులపై చర్యలు తీసుకునేలా నిబంధనలు రూపొందించారు. ఆగిన ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ ఆసుపత్రులకు రూ.150 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాలంటూ యాజమాన్యాల విన్నపాలు స్పందించని సర్కారు.. నిలిచిన వైద్య సేవలు చికిత్సకు వచ్చి నిరాశతో వెనుదిరిగిన రోగులు ఇప్పటికే ఈహెచ్ఎస్ సేవల నిలిపివేత అధికారుల లెక్కలివీ.. జిల్లాలో ఎన్టీఆర్ వైద్య సేవ అందిస్తున్న ఆస్పత్రులు 81 వీటిలో ప్రభుత్వ ఆస్పత్రులు 35 ప్రైవేటువి 46 వీటిలో సేవలు పూర్తిగా నిలిచినవి 29 అడపాదడపా సేవలు అందిస్తున్నవి 17 జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ లబ్ధి వివరాలు సంవత్సరం వైద్యం వెచ్చించిన చేయించుకున్న మొత్తం వారు (రూ.కోట్లు) 2019–20 25,750 62.71 2020–21 29,602 62.15 2021–22 47,039 89.48 2022–23 1,46,414 294.15 -
వర్షాకాలానికి 18 లక్షల టన్నుల ఇసుక సిద్ధం చేయాలి
రాజమహేంద్రవరం సిటీ: వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని 18 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను స్టాక్ యార్డ్లలో సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. తన క్యాంపు కార్యాలయంలో సోమవారం జరిగిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇసుక రీచ్లు నిర్వహిస్తున్న గ్రామాల పరిధిలో మౌలిక సదుపాయాలు, రోడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక స్టాక్ యార్డులకు ఆయా నియోజకవర్గాల్లో అనువైన ప్రదేశాలపై ప్రతిపాదన అందజేయాలని ఆర్డీఓలకు సూచించారు. స్టాక్ పాయింట్ల వద్ద తగిన నిఘా వ్యవస్థ ఉండాలన్నారు. సెమీ మెకనైజ్డ్ కింద పర్యావరణ అనుమతులు పొందిన 10 రీచ్ల ద్వారా 57,82,950 మెట్రిక్ టన్నుల ఇసుక త్వరలో అందుబాటులోకి రానున్నదని కలెక్టర్ తెలిపారు. కాటవరం, సింగవరం, కుమారదేవం, తాడిపూడి, పెండ్యాల ఇసుక ర్యాంపుల నిర్వహణ, పర్యవేక్షణ పశ్చిమ గోదావరి, కాకినాడ, విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు జిల్లాల డీఎల్ఎస్సీ ఆధ్వర్యంలోనే జరుగుతాయని వివరించారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.390 కోట్ల మేర ఖనిజ ఆదాయం సాధించామని జిల్లా మైన్స్ అధికారి డి.ఫణిభూషణ్రెడ్డి తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు, అదనపు ఎస్పీ మురళీకృష్ణ, ఆర్డీఓలు కృష్ణనాయక్, రాణి సుస్మిత, ఆర్డబ్ల్యూఎస్ఎస్ బీవీ గిరి, జిల్లా భూగర్భజల శాఖ అధికారి వై.శ్రీనివాస్, సహాయ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంపత్ కుమార్, ఇరిగేషన్ డీఈ ఆనంద్బాబు తదితరులు పాల్గొన్నారు. డెలివరీ బాయ్స్ ఈ–శ్రమ్లో నమోదు చేసుకోవాలి సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): అమెజాన్, ఫ్లిప్కార్ట్, బిగ్బాస్కెట్, బ్లింకిట్, జొమాటో, స్విగ్గీ, ఊబర్, ర్యాపిడో, ఓలా వంటి సంస్థల్లో పని చేస్తున్న డెలివరీ రంగ ఉద్యోగులు ఈ–శ్రమ్ పోర్టల్లో తమ పేర్లు ఉచితంగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తద్వారా కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసే గుర్తింపు కార్డు పొంది, సంక్షేమ పథకాలు అందుకోవచ్చని వివరించారు. కేంద్ర బడ్జెట్లో అసంఘటిత రంగ కార్మికులకు ప్రకటించిన సంక్షేమ ప్రయోజనాలు అందుకునేందుకు ఆయా ప్లాట్ఫామ్ కార్మికులు తమ పేర్లను ఈ–శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకోవాలని సహాయ కార్మిక కమిషనర్ బీఎస్ఎం వలి కోరారు. పీజీఆర్ఎస్కు 193 అర్జీలు సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ప్రజలు 193 అర్జీలు సమర్పించారు. వారి నుంచి అధికారులతో కలసి జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రత్యేక, మండల స్థాయి అధికారులు పర్యవేక్షించాలని అన్నారు. జిల్లాలో 946 అర్జీలు రీ ఓపెన్ అయ్యాయని, వాటిలో ఇంకా 69 పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. రీ ఓపెన్ అయిన ప్రతి అర్జీదారును వ్యక్తిగతంగా కలిసి, పరిష్కారం వివరాలు తెలియజేయాలని సూచించారు. రాజమహేంద్రవరంలోని జిల్లా వికలాంగుల పునరావాస కేంద్రం ఆధ్వర్యాన ఆరుగురు దివ్యాంగులకు వివిధ ఉపకరణాలను జేసీ అందజేశారు. డీసీహెచ్ఎస్గా పద్మకొవ్వూరు: జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి(డీసీహెచ్ఎస్)గా ఎం. పద్మ నియమితులయ్యా రు. ఇప్పటి వరకూ తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో పని చేస్తున్న ఆమె పదోన్నతిపై ఇక్కడకు వచ్చి, సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆమెను కార్యాలయ సిబ్బంది, కొవ్వూరు ఆసుపత్రి సూపరిండెంటెండ్ కె.సాయికిరణ్ మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఇప్పటి వరకూ ఇక్కడ డీసీహెచ్ఎస్గా పని చేసిన ఎం.పద్మజారాణి విజయనగరం డీసీహెచ్ఎస్గా బదిలీ అయ్యారు. -
వేమగిరిలో తిరుమల క్యాంపస్కు భూమి పూజ
కడియం: వేమగిరి జాతీయ రహదారి పక్కనే తిరుమల విద్యాసంస్థల కొత్త ప్రాంగణానికి సోమవారం భూమి పూజ చేసినట్టు సంస్థ చైర్మన్ నున్న తిరుమలరావు తెలిపారు. వేమగిరి చుట్టుపక్కల ప్రాంతాల విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కోరిక మేరకు ఈ డే స్కాలర్ క్యాంపస్ను ప్రారంభిస్తున్నామన్నారు. ఇక్కడ ఎల్కేజీ నుంచి ఇంటర్ వరకు క్లాస్లు నిర్వహిస్తామని, 2026–27 నుంచి అడ్మిషన్లు జరుగుతాయన్నారు. ముందుగా తిరుమలరావు, సరోజినీదేవి దంపతులు భూమిపూజ చేశారు. కార్యక్రమంలో సంస్థ అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరి, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. -
ఆత్మహత్య కాదు హత్యే అంటూ నిరసన
పోలీసుల అదుపులో 17 మంది సీతానగరం: మండలంలోని రాపాక పంచాయతీ పరిధిలోగల శ్రీరామనగరంలోగల రాజుగారి కల్యాణ మండపంలో ఆదివారం రామచంద్రపురానికి చెందిన వేమగిరి సునీల్ (26) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోలేదని, అది హత్యేనంటూ బంధువులు, స్నేహితులు రాజుగారి గార్డెన్ ఫంక్షన్ హాల్ వద్ద నిరసన చేపట్టారు. సోమవారం రాజమహేద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి సునీల్ మృతదేహం అంబులెన్స్లో తీసుకువచ్చి ఫంక్షన్ హాల్ వద్ద నిరసన తెలిపారు. మృతదేహాన్ని అంబులెన్స్ నుంచి కిందకు దించే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఫంక్షన్ హాల్ యజమాని రాజు, హైదరాబాద్ నుంచి వచ్చిన మహిళ సునీల్ను హత్య చేశారని, వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. కోరుకొండ ఇన్చార్జి సీఐ, రాజమహేంద్రవరం క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఈ బాలసౌరి అక్కడికి వచ్చారు. సీతానగరం – రాజమహేంద్రవరం రోడ్డుపై ధర్నాకు ప్రయత్నించగా ఎస్సై డి.రామ్కుమార్ తన సిబ్బందితో అడ్డుకుని 17 మందిని అదుపులోకి తీసుకుని కోరుకొండ తరలించారు. ఇన్వెష్టిగేషన్ ఆఫీసర్ బాలసౌరి విలేకరులతో మాట్లాడుతూ మృతుడు సునీల్కు వరుసకు మరదలైన మహిళ హైదరాబాద్ నుంచి ఆదివారం ఉదయం ప్రయివేట్ బస్లో సీతానగరం చేరుకుందని, రాజు గారి గార్డెన్ ఫంక్షన్ హాల్లో గది తీసుకున్నారన్నారు. సాయంత్రం 4 గంటలకు మహిళ బాత్రూమ్కు వెళ్లి తిరిగి వచ్చే సరికి సునీల్ ఉరివేసుకుని ఉన్నాడని తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. -
వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ ఉల్లంఘనే..
● ముస్లింల అస్తిత్వాన్ని అస్థిరపరిచే కుట్ర ● జిల్లా వక్ఫ్ బోర్డ్ మాజీ చైర్మన్ మొహమ్మద్ ఆరిఫ్ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): దేశంలోని సుమారు 22 కోట్ల మంది ముస్లింల అస్తిత్వాన్ని అస్థిరపరిచేలా వక్ఫ్ సవరణ చట్టాన్ని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆమోదింపజేసుకుందని వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి, జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ మొహమ్మద్ ఆరిఫ్ అన్నారు. జాంపేటలోని తన కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ, ఈ బిల్లుకు టీడీపీ, జనసేన మద్దతు పలకడం ద్వారా దేశంలోని ముస్లింల మేలును కాంక్షించబోమనే విషయాన్ని రుజువు చేశాయని విమర్శించారు. ముస్లింల ఆస్తులను కాజేసే కుట్రలో భాగంగానే ఈ చట్టం తెచ్చారని, మత విద్వేషాలు రెచ్చగొట్టడమే బీజేపీ ప్రధాన అజెండా అని ధ్వజమెత్తారు. ఈ చట్టం ముస్లింల షరియత్కు పూర్తి విరుద్ధమన్నారు. ముస్లింల అభివృద్ధికి దానం చేసిన స్థిర, చర ఆస్తులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆధీనంలో ఉంచుకోవాలని, తద్వారా వారిని అణచివేసే లక్ష్యంతోనే ఇలాంటి నల్ల చట్టం తీసుకువచ్చారన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 25, 26లను అపహాస్యం చేస్తూ ముస్లింలను భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారన్నా రు. అన్యాక్రాంతమైన లక్షలాది ఎకరాల భూములను తిరిగి స్వాధీనం చేసుకునేలా చట్టంలో ఎలాంటి మార్పూ చేయలేదని, ఇది కేవలం బడాబాబులకు దోచిపెట్టడమేనని ఆరిఫ్ విమర్శించారు. ముస్లింల సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలకు హాని తలపెట్టే ఎటువంటి చర్యలనూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ సీపీ ఏనాడూ చేపట్టలేదని చెప్పారు. ఎన్ఆర్సీ బిల్లును సైతం రాష్ట్రంలో అమలు చేసేది లేదని అసెంబ్లీలో తీర్మానం చేసిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించడం ద్వారా దేశవ్యాప్తంగా మతసామరస్యాన్ని కాంక్షించే మేధావులు, లౌకికవాదులు ఆయనను ప్రశంసిస్తున్నారని చెప్పారు. రాజ్యసభలో వైఎస్సార్ సీపీ క్రాస్ ఓటింగ్ చేసిందంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని దేశవ్యాప్తంగా పలువురు ఖండిస్తున్నారని, ఇది టీడీపీ నీచమైన కుట్రగా అభివర్ణిస్తున్నారని అన్నారు. ముస్లింలకు ఎటువంటి నష్టం జరగనివ్వనని ఇఫ్తార్ విందులో హామీ ఇచ్చి, రెండు రోజులు తిరగక ముందే వక్ఫ్ సవరణ చట్టానికి చంద్రబాబు మద్దతు పలికారని, చెప్పిన మాటపై ఎప్పుడూ నిలబడరనే విషయాన్ని మరోసారి రుజువు చేశారని దుయ్యబట్టారు. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రాష్ట్రంలో అన్యాక్రాంతమైన వక్ఫ్ భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. టీడీపీలోని ముస్లిం నాయకులు ఇప్పటికై నా ఆత్మపరిశీలన చేసుకుని, వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, దీనికోసం పార్టీలకతీతంగా ఉద్యమించడానికి సిద్ధంగా ఉండాలని ఆరిఫ్ పిలుపునిచ్చారు. -
వెంకన్న పెళ్లికొడుకాయనె
ఘనంగా ప్రారంభమైన కోనేటి రాయుడి కల్యాణోత్సవాలు కొత్తపేట: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిచెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామివారి కల్యాణ మహోత్సవాలు సోమవారం కన్నుల పండువగా ప్రారంభమయ్యా యి. దేవదాయ – ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో కల్యాణ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు, భక్తుల కు సౌకర్యాలు కల్పించారు. ఉత్సవాల్లో భాగంగా శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో మిరుమిట్లు గొలిపేలా సుందరంగా అలంకరించారు. బొబ్బర్లంక – రావులపాలెం ప్రధాన రహదారి నుంచి వాడపల్లికి వెళ్లే రహదారుల ముఖద్వారాల్లో కల్యాణోత్సవ స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంతశ్రీనివాస్ ఆధ్వర్యంలో వేద పండితులు ఖండవల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు, ఆలయ అర్చకులు స్వామివారిని వేకువ జామున పెండ్లి కుమారునిగా అలంకరించారు. వేద పండితుల మంత్రాలు, మేళతాళాల నడుమ ఈ వేడుక నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను వారి గోత్ర నామాలతో పెండ్లి కుమార్తెలుగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం 6–15 గంటలకు స్వామివారి ధ్వజారోహణ, అంకురార్పణ, నిత్య బలిహరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఆర్డీఓ పీ శ్రీకర్, సీఐ సీహెచ్ విద్యాసాగర్ కళ్యాణోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. నేడు స్వామివారి కల్యాణోత్సవం వాడపల్లి క్షేత్ర ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి వారి కల్యాణోత్సవాన్ని మంగళవారం రాత్రి వైభవంగా నిర్వహించనున్నట్టు డీసీ అండ్ ఈఓ చక్రధరరావు తెలిపారు. ఆ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మధ్యాహ్నం 3గంటలకు స్వామి వారి రథోత్సవం నిర్వహించనున్నామన్నారు. ప్రజాప్రతినిదులు, నాయకులు, ఽఅధికారులతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. రథోత్సవం, కల్యాణ వేడుకల్లో భక్తులకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నారు. -
వినియోగదారుల హక్కుల రక్షణకు ఆసరా
● తూర్పు గోదావరి, కోనసీమ ఇన్చార్జిగా శ్రీహరి ప్రసాద్ ● ఫౌండర్ హబీబ్ సుల్తాన్ అలీ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): వినియోగదారుల సంక్షేమం, హక్కుల రక్షణ కోసం ఆసరా పనిచేస్తోందని సంస్థ వ్యవస్థాపకుడు, సుప్రీంకోర్టు న్యాయవాది హబీబ్ సుల్తాన్ అలీ చెప్పారు. భారతదేశం అంతటా 10కి పైగా రాష్ట్రాలలో ఒకే లక్ష్యంతో అంకితభావంతో ఆసరా పనిచేస్తోందన్నారు. స్థానిక ప్రెస్క్లబ్లో సోమవారం ఉదయం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వినియోగదారుల రక్షణ చట్టం, 2019 ప్రకారం తమ లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి కసరత్తు చేస్తున్నామన్నారు. 2016లో ప్రారంభమైన తమ సంస్థ 2,500 అవగాహన సదస్సులు నిర్వహించిందని చెప్పారు. వినియోగదారుల తరఫున కోర్టుల్లో కేసులు దాఖలు చేసి ఉచితంగా సేవలు అందిస్తున్నామన్నారు. అయితే ఈ మధ్య స్టేషనరీ వంటి ఖర్చుల కోసం అతి తక్కువ ఫీజు తీసుకుని కేసులు దాఖలు చేస్తున్నామని చెప్పారు. తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల ఆసరా ఇన్చార్జిగా శ్రీహరి రాజూను నియమించినట్లు సుల్తానా అలీ తెలియజేస్తూ, ఆయనకు నియామక పత్రం అందించి, ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీహరి రాజు మాట్లాడుతూ వినియోగదారులకు తమ హక్కులపై అవగాహన కల్పించి, వారు మోసపోకుండా చూస్తామని చెప్పారు. అడ్వకేట్స్ కానివాళ్లను కూడా ఇందులో సభ్యులుగా వేసుకుని, కేసులు దాఖలు చేయిస్తున్నామని అలీ చెప్పారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వాసు, ఈశ్వరాచారి, రామలింగారెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. -
పట్టా పండగకు సన్నాహాలు
● జేఎన్టీయూకే 11వ స్నాతకోత్సవానికి నోటిఫికేషన్ ● ఏప్రిల్ 15వ తేదీ దరఖాస్తులకు తుది గడువు ● గవర్నర్కు ఆహ్వానం బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జేఎన్టీయూ కాకినాడ 11వ స్నాతకోత్సవానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు విద్యార్థులు ఒరిజనల్ డిగ్రీ కోసం ఏప్రిల్ 15 తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని వర్సిటీ వెబ్సైట్లో సూచించారు. గత మార్చి 1వ తేదీన నోటిఫికేషన్ జారీచేయగా తుది గడువు మార్చి 30వ తేదీతో ముగియగా అభ్యర్థులు తక్కువగా దరఖాస్తు చేసుకోవడంతో మరో 15రోజులపాటు ఏప్రిల్ 15వ తేదీ వరకూ గడువు పెంచారు. దీంతో ప్రముఖుల చేతుల మీదుగా సంప్రదాయ వస్త్రధారణలో పట్టా(ఒరిజనల్ డిగ్రీ) అందుకోవాలని కలలు కంటున్న విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి కలిపి స్నాతకోత్సవం నిర్వహిస్తుండేవారు. ఈ విధానానికి స్వస్తిపలికి ప్రతి ఏడాది వేడుకలు నిర్వహించాలనే ఉద్దేశంతో అప్పటి వీసీ ప్రసాదరాజు 2022లో 8వ కాన్వోకేషన్, 23లో 9, గత ఏడాది జనవరి 31వ తేదిన 10వ కాన్వోకేషన్ నిర్వహించారు. అప్పటి వరకూ పెండింగ్లో ఉన్న పట్టాలనీ ఈ కాన్వోకేషన్లో జారీ చేశారు. ఇప్పుడు నిర్వహించే వేడుకలకు సంబంధించి 2023–24 లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటే వీరికి కులపతి హోదాల గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరై విద్యార్థులకు అందజేస్తారు. వేడుకల నిర్వహణ తేదీ, అనుమతికి ఇప్పటికే వీసీ సీఎస్ఆర్కే ప్రసాద్ గవర్నర్ను గత నెల 17వ తేదీన కలిసి విన్నవించారు. దరఖాస్తు చేసుకోవాలి జేఎన్టీయూకే అనుబంధ కళాశాలలలో ఇంజినీరింగ్ లేదా ఫార్మా, మేనేజ్మెంట్ విద్యను పూర్తిచేసిన అభ్యుర్థులు ఒరిజనల్ డిగ్రీ (పట్టా) కోసం బీటెక్, ఎంటెక్ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు గడవు ఏప్రిల్ 15వ తేది వరకూ పెంచాం. గవర్నర్ అనుమతి వచ్చిన వెంటనే తేదీ ప్రకటిస్తాం. – ప్రొఫెసర్ నాగేశ్వరరావు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్, జేఎన్టీయూకే -
రూ.10 లక్షల విలువైన రేషన్ బియ్యం పట్టివేత
రాజానగరం: జాతీయ రహదారిపై జీఎస్ఎల్ వైద్య కళాశాల సమీపంలో అక్రమంగా తరలిస్తున్న రూ.10 లక్షలు విలువ చేసే రేషన్ బియ్యాన్ని సోమవా రం పట్టుకున్నామని స్థానిక డిప్యూటీ తహసీల్దారు (పౌరసరఫరా లు) గొలుగూరి బాపి రాజు తెలిపారు. మూడు వాహనాలలో తరలిస్తున్న ఈ బియ్యాన్ని వాహనాలతో సహా స్వాధీన పర్చుకుని, కేసులు నమోదు చేసేందుకు రాజానగరం పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. గొల్లప్రోలుకు చెందిన ఆకుల స్వామి, పె ద్దాపురం మండలం గోరంట్లకు చెందిన కోన బాలరాజు, కోరుకొండ అచ్చిరాజు తమ వాహనాలలో ఈ బియ్యాన్ని తరలిస్తూ పట్టుబడ్డారు. వారిపై కూడా కేసు లు నమోదు చేయడంతోపాటు ఈ అక్రమ దందాకు ప్రధాన కారకులు ఎవరనే విషయమై ఆరా తీస్తున్నామని చెప్పారు. పట్టుబడిన బియ్యం విలువ రూ.10 లక్షలు కాగా, వాహనాల విలువ రూ.20 లక్షలు పైబడి ఉంటుందన్నారు. -
గల్లంతైన యువకుడి మృతదేహం గుర్తింపు
రావులపాలెం: స్నేహితుల తో సరదాగా గోపాలపురం కాలువ వద్ద స్థానానికి వెళ్లి గల్లంతయిన యువకుడు షేక్ ఖాదర్ (21) మృత దేహం సోమవారం సంఘటన ప్రాంతానికి వంద మీటర్ల దూరంలో కాలువలో గుర్తించారు. ఆదివారం మధ్యాహ్నం గోపాలపురం ఆరుమామిళ్ల గట్టు రేవు వద్ద స్నానానికి దిగిన ఖాదర్ గల్లంతైన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం రేవుకు 100 మీటర్ల దూరంలో మృతదేహం తేలడంతో ఖాదర్ బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో మృతదేహాన్ని కొత్తపేట ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్టు టౌన్ సీఐ శేఖర్బాబు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించగా స్థానిక నెక్కంటి కాలనీలో ఉన్న బరియల్ గ్రౌండ్లో ఖననం చేసినట్టు బంధువులు తెలిపారు. బాయిలర్ డ్రైన్లో పడి వ్యక్తి మృతి పెద్దాపురం: బాయిలర్ డ్రైన్లో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన స్థానిక వాలు తిమ్మాపురం రహదారిలో ఉన్న పట్టాభి ఆగ్రో ఫుడ్స్ రైస్ మిల్లులో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడ నగరానికి చెందిన వేముల శివ (29) ఫ్యాక్టరీకి పనిమీద వచ్చి, ప్రమాదవశాత్తూ కాలుజారి కాలువలో పడిపోయాడు. ఇంతలో బాయిలర్ నుంచి విడుదలైన వేడినీటి కారణంగా అతడు మృతి చెందినట్టు తెలుస్తోంది. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఈ ఘటనపై ఎస్ఐ మౌనిక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 19,500 గటగట (వెయ్యి) 17,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 18,500 గటగట (వెయ్యి) 16,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
కాలువలోకి దూసుకెళ్లిన స్కూలు వ్యాన్
పిఠాపురం: పాఠశాలకు విద్యార్థులను తీసుకెళుతున్న స్కూలు వ్యాన్ ప్రమాదానికి గురై పంట కాలువలోకి దూసుకెళ్లడంతో ఏడుగురు విద్యార్థులు, డ్రైవరుకు గాయాలయిన ఘటన గొల్లప్రోలు మండలం చెందుర్తిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గొల్లప్రోలుకు చెందిన ఒక ప్రైయివేటు స్కూలు వ్యాన్ సోమవారం ఉదయం గొల్లప్రోలు మండలం చెందుర్తిలో విద్యార్థులను ఎక్కించుకుని గొల్లప్రోలు బయలుదేరింది. గ్రామ శివారుకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న ఒక లారీ వేగంగా వచ్చి ఢీకొట్టి వెళ్లిపోవడంతో స్కూలు వ్యాన్ ఒక్కసారిగా అదుపుతప్పి పక్కనే ఉన్న పంట కాలువలోకి దూసుకెళ్లింది. దీంతో వ్యాన్ పంట కాలువలో తిరగబడడంతో వ్యాన్లో ఉన్న జి.హర్షిత, జి.అపర్ణ, జి.సిద్ధు, జి.ధరణి, కె.భార్గవ్, కె.హాసిని, నిహారిక, వ్యాన్ డ్రైవరు వెంకటేష్కు గాయాలయ్యాయి. ప్రమాదాన్ని చూసిన పక్కనే పంట పొలాల్లో పనులు చేసుకుంటున్న రైతులు వ్యాన్లో ఉన్న విద్యార్థులను సురక్షితంగా బయటకు తీశారు. వారిని పిఠాపురంలో ఒక ప్రైయివేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. వ్యాన్ డ్రైవరుకు కాలు విరగగా మిగిలిన విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. పిఠాపురం సీఐ శ్రీనివాస్, ఎస్సై ఎన్.రామకృష్ణ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి కారణంగా చెబుతున్న లారీ ఆపకుండా వెళ్లి పోయినట్లు చెబుతున్నారు. గొల్లప్రోలు పోలీసులు కేసు విచారణ చేపట్టారు. ప్రమాదం జరిగే సమయంలో సమయస్ఫూర్తిగా వ్యవహరించి వేగంగా కాలువలోకి దూసుకెళ్లకుండా డ్రైవరు జాగ్రత్తలు తీసుకోవడంతో పెను ప్రమాదం తప్పినట్లు విద్యార్థులు చెబుతున్నారు. కాలువలో నీరు సైతం తక్కువగా ఉండడం వల్ల విద్యార్థులు ప్రాణాలతో బయటపడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందారు. ఢీకొట్టి వెళ్లిపోయిన లారీ ఏడుగురు విద్యార్థులు, డ్రైవరుకు గాయాలు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం -
పూర్వ విద్యార్థుల భూరి విరాళం
హెచ్ఎంకు రూ.6లక్షల చెక్కు అందజేత రాయవరం: సుమారు నాలుగున్నర దశాబ్దాల క్రితం చదువుకుని వివిధ రంగాల్లో స్థిరపడిన స్నేహితులంతా తిరిగి అదే చదువులమ్మ చెట్టు నీడకు మరోసారి చేరుకున్నారు. ఇంత స్థాయికి చేరుకోవడానికి కారణమైన పాఠశాల అభివృద్ధికి మిత్రులంతా కలిసి భారీ విరాళాన్ని అందజేశారు. రాయవరం శ్రీరామయ్య జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన 1975–80 బ్యాచ్కు చెందిన విద్యార్థులు సోమవారం పాఠశాల హెచ్ఎం వీఎస్ సునీతకు రూ.6లక్షల చెక్కును అందజేశారు. పూర్వ విద్యార్థులు ఆర్వీవీ సత్యనారాయణచౌదరి, తాడి వెంకటరెడ్డి, కె.సత్యనారాయణరెడ్డి, కె.వెంకటరెడ్డి, ఎం.సూరారెడ్డి తదితరులు పాఠశాల హెచ్ఎంకు చెక్కును అందజేశారు. పూర్వ విద్యార్థి ఆర్వీవీ సత్యనారాయణచౌదరి మాట్లాడుతూ పాఠశాల భవనంలోని ఒక తరగతి గదికి మౌలిక సదుపాయాల కల్పనకు ఈ సొమ్మును వినియోగించాలని హెచ్ఎం సునీతకు సూచించామన్నారు. గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ వుండవిల్లి రాంబాబు, ఎస్ఎంసీ చైర్మన్ దేవిశెట్టి చిన్ని, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. -
మా నోములన్ని పండినాయి రామయ్య తండ్రి..
● వైభవంగా రత్నగిరి రాములోరి కల్యాణం ● పెళ్లి పెద్దలుగా వ్యవహరించిన సత్యదేవుడు, అమ్మవారు అన్నవరం: రత్నగిరి క్షేత్ర పాలకునిగా పూజలందుకుంటున్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దివ్యకల్యాణ మహోత్సవం శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ఆదివారం వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు తిలకిస్తుండగా.. రత్నగిరిపై రామాలయం పక్కన వార్షిక కల్యాణ వేదిక మీద.. ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకూ ఈ క్రతువును కన్నుల పండువగా దేవస్థానం అర్చకులు నిర్వహించారు. తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత సేవతో కల్యాణోత్సవ కార్యక్రమాలు ప్రారంభించారు. శ్రీరాముని జన్మ నక్షత్రం పునర్వసును పురస్కరించుకుని తెల్లవారుజామున 4 గంటలకు పండితులు సీతారాములకు పంచామృతాభిషేకం చేశారు. అనంతరం శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం నిర్వహించారు. వధూవరులైన సీతారాములను ఉదయం 7 గంటలకు వెండి ఆంజనేయ వాహనంపై, పెళ్లి పెద్దలు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని వెండి పల్లకీపై గ్రామంలో ఘనంగా ఊరేగించారు. అనంతరం సీతారాములను, సత్యదేవుడు, అమ్మవార్లను ఊరేగింపుగా రత్నగిరిపై కల్యాణ వేదిక వద్దకు తీసుకుని వచ్చారు. సర్వాంగసుందరంగా అలంకరించిన వేదిక మీద ప్రత్యేక సింహాసనంపై సీతారాములను వేద మంత్రోచ్చారణల నడుమ పండితులు వేంచేయించారు. పక్కనే మరో ప్రత్యేక ఆసనంపై సత్యదేవుడు, అమ్మవార్లను వేంచేయించారు. ఉదయం 9.30 గంటలకు విఘ్నేశ్వర పూజతో సీతారాముల కల్యాణోత్సవానికి శ్రీకారం చుట్టారు. సీతారాములకు దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు దంపతులు పట్టువస్త్రాలు, మంచి ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. సీతారాముల వంశీకుల విశేషాలతో కూడిన ప్రవరను కల్యాణబ్రహ్మ చామర్తి వేంకటరెడ్డి పంతులు (కన్నబాబు) వివరించారు. అనంతరం పుణ్యాహవాచనం, యజ్ఞోపవీతధారణ, మహాసంకల్పం, యుగఛిత్రాభిషేకం తదితర కార్యక్రమాలను పండితులు నిర్వహించారు. ఉదయం 11 గంటల సుముహూర్తంలో సీతారాముల శిరస్సులపై అర్చక స్వాములు జీలకర్ర – బెల్లం మిశ్రమాన్ని ఉంచారు. అనంతరం మాంగల్యసూత్రధారణ, తలంబ్రాల ఘట్టాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. రామాలయంలోని సీతారాముల మూలవిరాట్టులకు కూడా అర్చకులు తలంబ్రాలు పోశారు. నూతన దంపతులైన సీతారాములకు పండితులు వేదాశీస్సులు అందజేశారు. సీతారాములకు నివేదించిన పానకం, వడపప్పు ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. నవ వధూవరులు సీతారాములకు పండితులు రాత్రి అరుంధతీ నక్షత్ర దర్శనం చేయించారు. కల్యాణోత్సవాన్ని దేవస్థానం వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠి, గంగాధరభట్ల గంగబాబు, చిట్టి శివ, యనమండ్ర శర్మ, ప్రధానార్చకులు కోట సుబ్రహ్మణ్యశర్మ, రామాలయం అర్చకులు దేవులపల్లి ప్రసాద్, చిట్టిం వాసు, అర్చకులు దత్తు శర్మ, సుధీర్, పవన్, వ్రత పురోహితులు పాలంకి పట్టాభి, అంగర సతీష్ తదితరులు నిర్వహించారు. ఏర్పాట్లను ఆలయ ఏఈఓ కొండలరావు పర్యవేక్షించారు. సీతారాముల కల్యాణానంతరం సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్ల నిత్య కల్యాణాన్ని అదే వేదికపై మధ్యాహ్నం 12 గంటల నుంచి నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి రోజూ ఉదయం 9.30 గంటలకు స్వామివారి నిత్యకల్యాణ మండపంలో నిర్వహిస్తారు. దీనికి సీతారాములు పెళ్లి పెద్దలుగా వ్యవహరిస్తారు. అయితే శ్రీరామనవమి నాడు మాత్రం తొలుత సీతారాముల కల్యాణం జరుగుతుంది. -
ముగిసిన రెజ్లింగ్ పోటీలు
రాజానగరం: దివాన్ చెరువులోని ఎస్వీపీవీ కన్వెన్షన్ హాలులో రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్, ఏపీ అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యాన రెండు రోజుల పాటు జరిగిన రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ చాంపియన్షిప్–2025 పోటీలు ఆదివారం ముగిశాయి. అండర్–15 విభాగంలో విజయవాడ, అండర్–20 విభాగంలో కాకినాడ ఓవరాల్ చాంపియన్షిప్ గెలుచుకున్నాయి. ఈ రెండు విభాగాల్లోనూ రన్నర్స్గా కాకినాడ, విశాఖపట్నం నిలిచాయి. బాలురు, బాలికలకు వేర్వేరుగా నిర్వహించిన ఈ పోటీలకు రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి 400 మంది వరకూ రెజ్లర్లు హాజరయ్యారని నిర్వాహకులు తెలిపారు. విజేతలు ఈ నెల 23న రాజస్థాన్లో జరిగే జాతీయ స్థాయి రెజ్లింగ్ చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐకాన్ చార్టర్ అధ్యక్షుడు టి.రాజా, రాజమహేంద్రవరం అధ్యక్షుడు ఇమ్మని వెంకట్, కార్యదర్శి సురేష్ ఉదయ్గిరి, ప్రోగ్రాం చైర్మన్ కామేశ్వరీదేవి, స్పోర్ట్స్ చైర్మన్ మద్దూరి శంకర్ తదితరులు పాల్గొన్నారు. వచ్చే నెల 7 నుంచి సత్యదేవుని కల్యాణోత్సవాలు అన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని వార్షిక దివ్య కల్యాణ మహోత్సవాల నిర్వహణ దిశగా అన్నవరం దేవస్థానం అడుగులు వేస్తోంది. శ్రీరామ నవమి పర్వదినమైన ఆదివారం సత్యదేవుని కల్యాణోత్సవాల వాల్ పోస్టర్లను దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు ఆవిష్కరించారు. మే 7వ తేదీ (వైశాఖ శుద్ధ దశమి) నుంచి మే 13వ తేదీ (వైశాఖ బహుళ పాడ్యమి) వరకూ వారం రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. మే 8వ తేదీ (వైశాఖ శుద్ధ ఏకాదశి) రాత్రి 9 గంటల నుంచి సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారి దివ్య కల్యాణం కన్నుల పండువగా నిర్వహించనున్నారు. వాల్ పోస్టర్ ఆవిష్కరణలో వేద పండితుడు గొల్లపల్లి ఘనపాఠి, ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యశర్మ, అసిస్టెంట్ కమిషనర్ రామ్మోహనరావు, ఈఈలు రామకృష్ణ, నూకరత్నం, ఏఈఓలు కొండలరావు, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవంలో వినియోగించేందుకు గాను విశాఖ జిల్లా గాజువాకకు చెందిన గుంటపల్లి ప్రసాద్ అరకిలో ముత్యాలను ఈఓ సుబ్బారావుకు అందజేశారు. -
రామాలయానికి వెండి కిరీటాలు
మండపేట: పట్టణంలోని 14వ వార్డు శెట్టిబలిజ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ప్రారంభమైన రామాలయానికి మున్సిపల్ చైర్పర్సన్ పతివాడ దుర్గారాణి వెండి కిరీటాలు సమర్పించారు. ఆలయంలో వినాయకుడు, లక్ష్మీదేవి విగ్రహాలకు సుమారు రూ.లక్ష విలువైన వెండి కిరీటాలు సమర్పించారు. శ్రీరామ నవమి నాడు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆమె దేవతామూర్తులకు కిరీటాలను అలంకరించారు. అనంతరం రాముల వారి కల్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. సీతారాముల అనుగ్రహంతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సొసైటీ మాజీ చైర్మన్ పెంకే గంగాధరం, నాయకులు తాడి రామారావు, శెట్టి నాగేశ్వరరావు, సూరంపూడి సత్యప్రసాద్, పిఠాపురం సత్యనారాయణ, శెట్టిబలిజ సంఘం నాయకులు, మహిళలు, కమిటీ సభ్యులు, యువకులు పాల్గొన్నారు. -
రామనామమే రక్షణ కవచం
● శ్రీరాముడిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలి ● బ్రహ్మంగారి మఠాధిపతి విరజానంద ● వైభవంగా శ్రీరామనవమి శోభయాత్ర ● సుమారు 5 వేల బైక్లతో ర్యాలీ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): యావత్ మానవాళికీ శ్రీరామ నామం అద్భుతమైన రక్షణ కవచం వంటిదని, ఆ నామం ఉచ్చరిస్తేనే పాపాలు తొలగిపోతాయని వైఎస్సార్ కడప బ్రహ్మం గారి మఠాధిపతి విరజానంద స్వామి అన్నారు. రాజమహేంద్రవరంలో ఆదివారం సుమారు 5 వేల బైక్లతో నిర్వహించిన శ్రీరామ శోభాయాత్రను ఆయన పుష్కర ఘాట్ వద్ద ప్రారంభించారు. ఈ యాత్ర త్రీటౌన్ పోలీస్ స్టేషన్, ఆర్యాపురం, పేపర్ మిల్లు, శ్రీరామ నగర్, కోరుకొండ రోడ్డు, కంబాల చెరువు, నందం గనిరాజు జంక్షన్, దానవాయిపేట, ఏవీ అప్పారావు రోడ్డు రామాలయం జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డు, షెల్టాన్ హోటల్, ఆవ వాంబే గృహాలు, తాడితోట, స్టేడియం రోడ్డు, శ్యామలా సెంటర్ మీదుగా తిరిగి పుష్కర్ ఘాట్ వరకూ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ, అందరిలోనూ సోదర భావం వెల్లివిరియాలని, భారతీయ సంప్రదాయాలు, కట్టుబాట్లు అందరికీ తెలిసేలా హిందూ ధర్మం పరిఢవిల్లేలా ఈ శోభాయత్ర శోభాయామానంగా జరిగిందని అన్నారు. ప్రతి పురుషుడూ శ్రీరామచంద్ర ప్రభువుకున్న సుగుణాలను అలవర్చుకోవాలని, అప్పుడే సంపూర్ణ మానవుడు అవుతాడని అన్నారు. దుష్ట శిక్షణార్థం విష్ణుమూర్తే త్రేతాయుగంలో రామునిగా అవతరించి, తన చర్యల ద్వారా మనిషి ఎలా బతకాలో లోకానికి ఆచరించి చూపించాడని అన్నారు. పితృవాక్య పరిపాలకునిగా, ఆదర్శవంతునిగా కీర్తి గడించాడన్నారు. పట్టాభిషేకానికి కొన్ని గంటల ముందు తండ్రి ఆదేశం మేరకు 14 సంవత్సరాల వనవాసం గడపాలని చెబితే.. తండ్రి మాటే వేదవాక్కుగా ఎంతో ఆనందంగా కట్టుబట్టలతో అరణ్యానికి వెళ్లిన త్యాగమూర్తి, సాహసవంతుడు శ్రీరాముడని అన్నారు. అటువంటి త్యాగ గుణాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం, ధర్మాన్ని కాపాడటం ఉత్తమ పురుషుల లక్షణమని చెప్పారు. అంతకు ముందు రథంపై ఉన్న శ్రీసీతారాముల మూర్తులను ఊరేగింపుగా తీసుకుని వచ్చారు. రామ నామ జయ మంత్రాన్ని అశేష రామ భక్తులతో పలికించారు. కార్యక్రమంలో శ్రీరామ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు ప్రముఖ న్యాయవాది పతివాడ రామరాజు, కార్యదర్శి యడ్లపల్లి, అఖిల భారత ధర్మ జాగరణ ప్రముఖ్ ఆలే శ్యామ్కుమార్, ఎంపీ పురందేశ్వరి, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, బత్తుల బలరామకృష్ణ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ తదితరులు పాల్గొన్నారు. -
క్రీడలతో ఒత్తిడికి కళ్లెం
రాజానగరం: క్రీడల ద్వారా మానసిక ఒత్తిడిని అధిగమించడంతో పాటు శరీరదారుఢ్యాన్ని పొందవచ్చని జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్, ఏపీ అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యాన రెండు రోజుల పాటు జరిగే రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీలను దివాన్ చెరువులోని ఎస్వీపీవీ కన్వెన్షన్ హాలులో శనివారం ఆయన ప్రారంభించారు. అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎలీషారావు మాట్లాడుతూ, ఒకప్పుడు రాజమహేంద్రవరానికి చెందిన మాదిరెడ్డి చెన్నకేశవరావు కుస్తీ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ చాంపియన్ అయ్యారని గుర్తు చేశారు. తాలింఖానాలు ఉండటంతో ఆ రోజుల్లో చాలామంది కుస్తీ క్రీడాకారులుండేవారన్నారు. తిరిగి అటువంటి వాతావరణం తీసుకువచ్చే విధంగా పాఠశాలల్లో తాలింఖానాలు ఏర్పాటు చేసి, ఆసక్తి ఉన్న విద్యార్థులను మంచి రెజ్లర్లుగా తీర్చిదిద్దుదామని అన్నారు. అండర్–15, అండర్–20 బాలుర, బాలికల విభాగాల్లో జరుగుతున్న ఈ కుస్తీ పోటీలకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 350 మంది రెజ్లర్లు హాజరయ్యారు. ఐకాన్ చార్టర్ అధ్యక్షుడు టి.రాజా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జీఎస్ఎల్ వైద్య కళాశాల చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు, ఏపీ అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు మాణిక్యాలరావు, కార్యదర్శి వెంకట రమణ, ఐకా న్స్ రాజమహేంద్రవరం అధ్యక్షుడు ఇమ్మని వెంకట్, కార్యదర్శి సురేష్ ఉదయగిరి పాల్గొన్నారు. -
జగ్జీవన్రామ్కు ఘన నివాళి
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్రామ్ జయంతి సందర్భంగా పలువురు ఘనంగా నివాళి అర్పించారు. స్థానిక జాంపేట చర్చి సెంటర్లో ఉన్న ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి, ఎస్పీ డి.నరసింహ కిషోర్, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు, జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సమాజ శ్రేయస్సును ఆకాంక్షించే వ్యక్తిగా జగ్జీవన్రామ్ చేసిన కృషిని కొనసాగిస్తూ, మరికొందరికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్తిబాబు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఎంఎస్ శోభారాణి తదితరులు పాల్గొన్నారు. గామన్ బ్రిడ్జిపై నేటి నుంచి వన్ వే కొవ్వూరు: అఖండ గోదావరి నదిపై రాజమహేంద్రవరం రూరల్ కాతేరు – కొవ్వూరు మధ్య ఉన్న రెండు వరుసల గామన్ ఇండియా బ్రిడ్జిపై ఆదివారం నుంచి వన్వే అమలు చేస్తున్నారు. వార్షిక మరమ్మతుల్లో భాగంగా ఈ నెల 14వ తేదీ వరకూ ఒకవైపు ఉన్న బ్రిడ్జి పైనుంచే రెండువైపుల వాహనాలనూ అనుమతిస్తామని టోల్ప్లాజా మేనేజర్ రాజీవ్సింగ్ శనివారం తెలిపారు. కొవ్వూరు నుంచి కాతేరు వైపు వెళ్లే వాహనాలను రెండో లైన్ మీదుగా అనుమతిస్తామన్నారు. ఇప్పటి వరకూ విశాఖపట్నం వైపు నుంచి వస్తున్న వాహనాలు ఒక బ్రిడ్జిపై, కొవ్వూరు వైపు నుంచి వెళ్లే వాహనాలు మరో వంతెనపై ప్రయాణిస్తున్నాయి. తాజా వన్వే అమలు నేపథ్యంలో ఒక్క వంతెన పైనే రెండువైపుల వాహనాలనూ అనుమతిస్తారు. రెండో వంతెనకు మరమ్మతులు నిర్వహిస్తారు. వన్వేకు వాహనదారులు సహకరించాలని రాజీవ్సింగ్ కోరారు. 8 నుంచి ఇండో – అమెరికా సైనిక విన్యాసాలు కాకినాడ రూరల్: భారత్ – అమెరికా దేశాల సైనిక దళాల సంయుక్త విన్యాసాలకు కాకినాడ సాగర తీరం మరోసారి వేదిక కానున్నది. ఇరు దేశాల మధ్య సైనిక సహకారం, పరసర్ప నైపుణ్యం పెంపొందించుకునే లక్ష్యంతో టైగర్ ట్రయాంఫ్–2025 పేరిట 13 రోజుల పాటు ఈ విన్యాసాలు జరగనున్నాయి. ఈ నెల 1న విశాఖ సాగర తీరంలో ఈ విన్యాసాలు ప్రారంభమయ్యాయి. దీనికి కొనసాగింపుగా ఈ నెల 8 నుంచి కాకినాడ తీరంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. విన్యాసాలు ఈ నెల 13న కాకినాడలో ముగియనున్నాయి. తూర్పు నౌకాదళంతో పాటు ఆర్మీ, ఎయిర్ఫోర్స్ బలగాలు, అమెరికా సైనిక దళాలు ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నాయి. కాకినాడ సూర్యారావుపేటలోని నేవల్ ఎన్క్లేవ్ వద్ద ఇరు దేశాల ఉమ్మడి విన్యాసాల నిర్వహణకు చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే విశాఖ నుంచి వచ్చిన నావికా దళాలు గుడారాలు ఏర్పాటు చేసుకుని తమ పనిలో నిమగ్నమయ్యాయి. ప్రస్తుతం తూర్పు నౌకాదళ పరిధిలోని విశాఖ, కాకినాడ తీర ప్రాంతంలోని సముద్ర జలాల్లో ఐఎన్ఎస్ జలాశ్వ, యూఎస్ఎస్ కామ్స్టాక్ ద్వారా ఇండో, అమెరికా నావికా దళాలు విన్యాసాలు కొనసాగిస్తున్నాయి. కిటకిటలాడిన శృంగార వల్లభుని ఆలయం పెద్దాపురం: వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో తొలి తిరుపతి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభస్వామి ఆలయ శనివారం కిటకిటలాడింది. సుమారు 30 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. వివిధ సేవల టికెట్లు, అన్నదానం, కేశఖండన ద్వారా ఆలయానికి రూ.3,25,934 ఆదాయం సమకూరిందని ఈఓ వడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఐదు వేల మంది భక్తులకు ప్రసాద వితరణ, అన్నదానం ఏర్పాటు చేశామన్నారు. -
హెపటైటిస్ హడల్..!
వారం రోజుల్లో పరీక్షలు పూర్తి గ్రామంలో హైపటైటిస్ పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీనిపై స్థానికులకు అవగాహన కల్పిస్తున్నాం. అన్ని రకాల వైద్య సేవలూ అందిస్తున్నాం. వారం రోజుల్లో పరీక్షలు పూర్తి చేస్తాం. – దుర్గారావుదొర, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి వైద్యులకు పూర్తి సహకారం కామెర్ల సంబంధిత వ్యాధులు ప్రబలుతూండటంతో గ్రామంలో పారిశుధ్య చర్యలు చేపట్టాం. తాగునీటి నాణ్యతపై మరింతగా దృష్టి సారించాం. వైద్య పరీక్షలకు సహకరించాల్సిందిగా గ్రామస్తులకు అవగాహన కల్పించడంతోపాటు వైద్యులకు అన్ని రకాలుగా సహకరిస్తున్నాం. – మల్లిడి వీరబాబ్జీ, సర్పంచ్, పల్లం, కాట్రేనికోన మండలం ● తల్లడిల్లుతున్న పల్లం గ్రామం ● చురుకుగా వైద్య పరీక్షలు ● అంతకంతకూ పెరుగుతున్న కేసులు ● ఆందోళనలో మత్స్యకారులు సాక్షి, అమలాపురం/కాట్రేనికోన: రోజుల తరబడి సాగుతున్న రక్త పరీక్షలు.. పరీక్షలు జరుగుతున్న కొద్దీ బయటపడుతున్న కామెర్ల సంబంధిత వ్యాధులతో మత్స్యకార గ్రామం పల్లం తల్లడిల్లుతోంది. కాట్రేనికోన మండలం శివారు గోదావరి నదీపాయల మధ్య ఉండే ఈ గ్రామంలో హెపటైటిస్ వ్యాధి ప్రబలడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కామెర్ల సంబంధిత వ్యాధులు గ్రామంలో పెద్ద ఎత్తున వెలుగుచూస్తున్నాయి. గ్రామంలో తొలుత నలుగురు గర్భిణుల్లో కాలేయానికి సంబంధించి వాపు లక్షణాలను గుర్తించారు. వీరు కాకినాడలో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో పరీక్షలకు వెళ్లిన సమయంలో ఇది బయట పడింది. అక్కడి నుంచి వచ్చిన సమాచారంతో ఇక్కడ కొంత మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా మరిన్ని కేసులు వెలుగు చూశాయి. దీంతో గ్రామంలో ఉన్న అందరికీ వైద్య పరీక్షలు చేస్తున్నారు. గ్రామంలో మొత్తం 12 వేల వరకు జనాభా ఉండగా, వీరిలో 7,800 మంది వరకూ నివసిస్తున్నారు. మిగిలిన వారు ఇతర ప్రాంతాల్లో వేటకు, ఉద్యోగ, ఉపాధికి వెళ్లారు. గ్రామంలో ఉన్న 18 ఏళ్ల వయస్సు దాటిన వారికి వైద్య పరీక్షలు చేస్తున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకార ఇప్పటి వరకూ 2,281 మందికి పరీక్షలు నిర్వహించగా, వీరిలో హెపటైటిస్–బి సర్ఫేస్ యాంటిజెన్ (హెచ్బీఎస్ఏజీ) 12 మందికి నిర్ధారణ అయ్యింది. హెపటైటిస్–సి వైరస్ (హెచ్సీవీ) తొమ్మిది మందికి పాజిటివ్గా నిర్ధారించారు. గ్రామంలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో హైపటైటిస్– ఎ, బి, సి కేసులు వెలుగు చూస్తున్నాయి. శనివారం ఒక్క రోజే 118 మందికి పరీక్షలు నిర్వహించారు. అయితే గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో తొలి దశలో చేపట్టిన ర్యాపిడ్ టెస్టులో ఇంతకు రెండు మూడు రెట్లు పాజిటివ్ కేసులు వెలుగు చూడడంతో స్థానికుల్లో ఆందోళన పెరుగుతోంది. వైద్య, ఆరోగ్య శాఖతో సంబంధం లేకుండా స్థానికంగా వైద్య పరీక్షలు, ఇంజెక్షన్లు చేసేవారు ఒకే సిరంజిని ఎక్కువ మందికి వినియోగించడం, గ్రామంలో మత్స్యకారుల సామూహిక జీవన విధానం వల్ల ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వేగంగా సంక్రమిస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఇప్పుడు అప్రమత్తమైనప్పటికీ పెద్ద సంఖ్యలో ఒకరి నుంచి ఒకరికి వ్యాధి సంక్రమిస్తోంది భావిస్తున్నారు. మరిన్ని పరీక్షలు జరిగితే మరికొంత మందిలో ఈ వ్యాధి లక్షణాలు బయటపడే అవకాశముందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఇక్కడ ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహిస్తోంది. అలాగే, వ్యాధి లక్షణాలున్న వారికి అవగాహన కల్పించడంతో పాటు మందులు అందజేస్తున్నారు. వారం పది రోజులుగా ఇక్కడ కామెర్లు ప్రబలుతూండగా జిల్లా యంత్రాంగం కేవలం పరీక్షలతో సరిపెడుతోందని, వ్యాధికి సంబంధించిన మందులు వ్యాధిగ్రస్తులకు ఇంకా అందలేదని స్థానికులు చెబుతున్నారు. కలెక్టర్ ఆదేశాలతో పరీక్షలు ముమ్మరం నెలవారీ వైద్య పరీక్షల్లో భాగంగా పల్లం గ్రామంలో కొంత మందికి కాలేయ సంబంధ వ్యాధులైన హెపటైటిస్ బి, సి పాజిటివ్ కేసులు నమోదు కావడంతో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు గత నెల 20న ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లారు. ఈ మేరకు కలెక్టరు ఇంటింటా రక్త నమూనాలు సేకరించి, ర్యాపిడ్ కిట్లతో కాలేయ పరీక్షలు చేయాలని ఆదేశించారు. గత నెల 24న రక్త నమూనాలు సేకరించి, పరీక్షలు చేసేందుకు అవసరమైన ర్యాపిడ్ కిట్లను పల్లం హెల్త్ సెంటర్కు పంపించారు. గత నెల 25 నుంచి వైద్యాధికారుల పర్యవేక్షణలో ఆరోగ్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు ఆరు బృందాలుగా ఇంటింటికీ వెళ్లి రక్త నమూనాలు సేకరించి, ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించారు. ఈ నెల 11వ తేదీ వరకు రక్త నమూనాలు సేకరిస్తామని వైద్యాధికారులు చెబుతున్నారు. గ్రామంలో 18 ఏళ్లు పైబడిన మొత్తం 5,436 మందికి రక్త నమూనాలు సేకరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటి వరకు 2,318 మంది రక్త నమూనాలు సేకరించి ర్యాపిడ్ టెస్ట్లు చేయగా హెపటైటిస్–బి 223, హెపటైటిస్–సి 80 చొప్పున కేసులు నమోదయ్యాయి. కాట్రేనికోన వైద్యాధికారి లిఖిత మాట్లాడుతూ, పాజిటివ్ వచ్చిన వారి రక్త నమూనాలను అదనపు పరీక్షల కోసం అమలాపురం ఏరియా ఆస్పత్రికి పంపిస్తామని చెప్పారు. మరిన్ని పరీక్షలు నిర్వహించి, పాజిటివ్ కేసులకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న యాంటీ వైరల్ మాత్రలు అందచేస్తామన్నారు. -
నచ్చిన చోట ధాన్యం అమ్ముకోవచ్చు
ఉండ్రాజవరం: ధాన్యానికి కనీస మద్దతు ధర కంటే అధికంగా లభిస్తే, రైతులు తమకు నచ్చిన చోట అమ్ముకోవచ్చని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడుతో కలసి మోర్త గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. తొలుత రైతు సేవా కేంద్రం వద్ద మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ, రబీ ధాన్యం సేకరణ లక్ష్యాన్ని 2 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 2.50 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచామన్నారు. ధాన్యం తేమ శాతం విషయంలో రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని, ఎలా ఉన్నా సేకరించాలని అధికారులకు సూచించారు. నాణ్యత లేని సంచులు ఇవ్వరాదన్నారు. ఆన్లైన్లో ధాన్యం కొనుగోలుకు స్లాట్ బుకింగ్ విధానం ప్రవేశపెట్టారన్నారు. ఇందులో భాగంగా రైతులు ఇంట్లోనే కూర్చుని తమ వాట్సాప్ నుంచి 73373 59375 నంబర్కు హాయ్ అని మెసేజ్ చేస్తే కావాల్సిన సమాచారం, సమస్యకు పరిష్కరం లభిస్తాయని మంత్రి చెప్పారు. జేసీ చిన్నరాముడు మాట్లాడుతూ, ధాన్యం సేకరణకు మిల్లర్లు సరఫరా చేసే గోనె సంచులు నాణ్యతగా ఉండాలనే ఉద్దేశంతో వాటిపై ఆయా మిల్లర్ల క్యూఆర్ కోడ్ తప్పనిసరిగా ఉండాలని అన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ రాణి సుస్మిత, జిల్లా ఇన్చార్జి పౌర సరఫరాల అధికారి ఎస్.భాస్కరరెడ్డి, తహసీల్దార్ పీఎన్డీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
పాస్టర్ ప్రవీణ్ది హత్యేనన్నది నా నమ్మకం
● అనుమానం వ్యక్తం చేస్తే కేసు పెట్టారు ● మాజీ ఎంపీ హర్షకుమార్రాజమహేంద్రవరం సిటీ: పాస్టర్ ప్రవీణ్ పగడాలది హత్యేనన్నది తన నమ్మకమని, అలా కాదని నమ్మకం కలిగించాల్సింది పోలీసులేనని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ అన్నారు. రాజమహేంద్రవరంలోని తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏ కేసులో అయినా మూడో రోజు పోస్టుమార్టం నివేదిక ఇవ్వాల్సి ఉందని, అటువంటిది పాస్టర్ ప్రవీణ్ మృతి చెంది 14 రోజులయినా ఇప్పటి వరకూ పోస్ట్మార్టం నివేదిక బయటపెట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని అన్నారు. దీనికి సీఎం చంద్రబాబు, పోలీసులు బాధ్యత వహించాలన్నారు. ఇదంతా చూస్తూంటే హత్యను ప్రమాదంగా చూపాలనే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు. పోస్టుమార్టం నివేదిక ఎందుకు రావడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ప్రవీణ్ మృతదేహానికి రీ పోస్ట్మార్టం చేయించేందుకు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేశానని, ఈ నేపథ్యంలోనే పోస్ట్మార్టం నివేదిక బయట పెట్టకుండా వాయిదా వేస్తున్నారని ఆరోపించారు. ప్రవీణ్ మృతిపై వ్యక్తమవుతున్న అనుమానాలకు సమాధానం చెప్పాల్సి ఉందన్నారు. పోలీసులు ఎంత త్వరగా ప్రెస్మీట్ పెడితే అంత మంచిదని హితవు పలికారు. ప్రవీణ్ మద్యం కొనుగోలు చేసినవి వీడియోలు ఫేక్ అని ఐజీ స్వయంగా చెప్పారని, వాటిని ఎవరు తయారు చేసి, విడుదల చేశారో ఎందుకు కనిపెట్టడం లేదని ప్రశ్నించారు. ప్రవీణ్ మృతిని తొలి నుంచీ యాక్సిడెంట్గానే రుజువు చేయాలని చూస్తున్నారన్నారు. అనుమానం వ్యక్తం చేస్తే తనపై తప్పుడు కేసు పెట్టారన్నారు. ప్రవీణ్ మరణం విషయంలో నిజం బయటకు రావాలన్నానే తప్ప తాను ఏ మతం పైనా నిందలు వేయలేదని అన్నారు. అన్ని మతాలనూ ఆచరించే సెక్యులర్ భావాలుఉన్న కుటుంబం తమదని స్పష్టం చేశారు. ప్రభుత్వం, పోలీసులు చేస్తున్న దర్యాప్తుపై ప్రవీణ్ భార్య జెస్సికా నమ్మకం ఆమె ఇష్టమని, హత్య చేశారన్నదే తన నమ్మకమని హర్షకుమార్ పునరుద్ఘాటించారు. హర్షకుమార్పై కేసు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): మాజీ ఎంపీ హర్షకుమార్పై కేసు నమోదు చేసినట్లు రాజానగరం పోలీసులు శనివారం వెల్లడించారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై తీవ్ర ఆరోపణలు చేసినందుకు ఆయనపై బీఎన్ఎస్ సెక్షన్లు 196, 197 కింద కేసు నమోదు చేశారు. ప్రవీణ్ పగడాలను హత్య చేసి పడేశారని, కేసును పోలీసులు పక్కదోవ పట్టిస్తున్నారని హర్షకుమార్ ఇటీవల ఆరోపించారన్నారు. దీనిపై విచారణకు వచ్చి ఆధారాలు సమర్పించాలని ఆయనకు నోటీసులు ఇచ్చామన్నారు. విచారణకు హాజరు కాకపోగా తిరిగి అవే ఆరోపణలు చేయడంతో తాజాగా కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. -
క్రీడాకారులను తయారుచేద్దామా?
● కోచ్ కావాలనుకునేవారి నుంచి దరఖాస్తుల ఆహ్వానం ● ఆరు వారాల పాటు శిక్షణ ఇవ్వనున్న క్రీడాప్రాధికార సంస్ధ ● ఈ నెల 14 తుది గడువు నాగమల్లితోట జంక్షన్(కాకినాడ సిటి): క్రీడల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించడమే కాదు.. ఆయా స్థాయిల్లో క్రీడాకారులను తయారు చేసేందుకు, వారికి తర్ఫీదు ఇచ్చేందుకు భారత క్రీడాప్రాధికార సంస్థ అవకాశం కల్పిస్తోంది. క్రీడా శిక్షకుడిగా ఎదగాలని, పిల్లలకు క్రీడల్లో శిక్షణ ఇవ్వాలని భావిస్తున్న వారి కోసం భారత క్రీడా ప్రాధికార సంస్థ ఓ వేదికను ఏర్పాటు చేసింది. ఇది వరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి చాలా మంది శిక్షణను పూర్తి చేసుకుని ధ్రువపత్రాలు సాధించారు. నేతాజీ సుభాష్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో 23 క్రీడాంశాల్లో ఆరు వారాల సర్టిఫికెట్ కోర్సుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ఇంటర్మీడియెట్, ఆపై.. ఇంటర్మీడియెట్, ఆపై ఉత్తీర్ణత సాధించి 20 నుంచి 42 ఏళ్లలోపు అభ్యర్థులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది. జిల్లాస్థాయి చాంపియన్ షిప్ పోటీల్లో తొలి మూడు స్థానాలు, రాష్ట్ర స్థాయి ఆలిండియా, వర్సిటీ చాంపియన్ షిప్, జోనల్ ఇంటర్ యూనివర్శిటీ స్థాయి పోటీలలో ప్రాతినిధ్యం, ఎస్జీఎఫ్ జాతీయ స్థాయి పోటీలలో జూనియర్, సీనియర్ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని ఉండాలి. ఏయే అంశాల్లో .... సైక్లింగ్, క్రికెట్, ఫెన్సింగ్, ఫుట్బాల్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్బాల్, హాకీ, జుడో, కబడ్డీ, ఖోఖో, రోయింగ్, సాఫ్ట్బాల్, షూటింగ్, స్విమ్మింగ్, తైక్వాండో, టేబుల్టెన్నిస్, లాన్ టెన్నిస్, వాలీబాల్, వెయిట్లిఫ్టింగ్, రెజ్లింగ్, ఉషూ, యోఆ, త్రోబాల్ తదితర క్రీడాంశాలుంటాయి. శిక్షణ కేంద్రాలు క్రీడాకారులు తాము ఎంచుకున్న క్రీడ ఆధారంగా శిక్షణ కేంద్రాన్ని కేటాయిస్తారు. వారు యూనిఫాంతో పాటు సాధారణ దుస్తులు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. పంజాబ్ రాష్ట్రం పటియాలా, కర్ణాటక రాజధాని బెంగళూరు, పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కత్తాలలో ఎన్ఎస్ఎన్ఐఎస్ శిక్షణా కేంద్రాలు ఉన్నాయి. మే 6 నుంచి జూలై 2 వరకు శిక్షణ... ఆరు వారాల సర్టిఫికెట్ కోర్సులో 30 రోజులు థియరీ, 14 రోజులు ప్రాక్టికల్స్ ఉంటాయి. మే 6 నుంచి జూలై 2 వరకు ఎంపికై న అభ్యర్థులకు శిక్షణ ఉంటుంది. దరఖాస్తుకు ఆఖరు తేదీ ఈనెల 14. మంచి అవకాశం క్రీడారంగంపై ఆసక్తి ఉన్న వారి కోసం భారత క్రీడా ప్రాధికార సంస్థ మంచి అవకాశం కల్పిస్తోంది. ఆరు వారాల పాటు వివిధ క్రీడాంశాల్లో శిక్షణ ఇచ్చి వారికి శిక్షకులుగా గుర్తింపు ఇవ్వనుంది. వివరాలకు 89196 42248 నెంబురులో సంప్రదించండి. – శ్రీనివాస్ కుమార్, డీఎస్డీఓ -
ఆఫీసర్స్ సర్వీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా విజయ రెడ్డి
అమలాపురం రూరల్: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పశుసంవర్ధక శాఖ ఆఫీసర్స్ సర్వీస్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా అమలాపురం అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎల్.విజయ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ నెల 4వ తేదీన కాకినాడ వీపీసీ మీటింగ్ హాల్లో జరిగిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పశుసంవర్ధక శాఖ ఆఫీసర్స్ సర్వీస్ అసోసియేషన్ ఎన్నికలు డాక్టర్ కీర్తి రామకృష్ణ అధ్యక్షతన జరిగాయి. అధ్యక్షుడిగా డాక్టర్ సీహెచ్ బాలచంద్ర యోగేశ్వర్, జనరల్ సెక్రటరీగా డాక్టర్ ఎల్.విజయ రెడ్డి ఎన్నికయ్యారు. విజయ రెడ్డిని జిల్లా పశువైద్య అధికారి కె.వెంకట్రావు, ఉప సంచాలకులు కర్నీడీ మూర్తి, వైద్యులు కలసి శుభాకాంక్షలు తెలిపారు. పేపరుమిల్లు ఉద్యోగి అదృశ్యం రాజమహేంద్రవరం రూరల్: స్థానిక హుకుంపేటలోని అత్తారింటి నుంచి తన సొంతిల్లు ఉన్న కాతేరులోని కంఠమణివారి వీధికి వెళ్లిన పెనుమాక సునీల్కుమార్ కనిపించడం లేదని అతని భార్య పెనుమాక మాణిక్యం శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం స్థానిక పేపర్ మిల్లులో ఉద్యోగం చేస్తున్న పెనుమాక సునీల్కుమార్ ఈ నెల 3వ తేదీ సాయంత్రం 5.30 గంటల సమయంలో హుకుంపేటలోని జనచైతన్య లే అవుట్లోని అత్తగారింటి నుంచి ఏపీ 39 ఎంపీ 3018 నెంబరు రాయల్ ఎన్ఫీల్డ్పై బయటకు వెళ్లాడు. అప్పటి నుంచి తిరిగి ఇంటికి రాలేదని బొమ్మూరు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మాణిక్యం పేర్కొంది. ఈ మేరకు బొమ్మూరు ఎస్సై సీహెచ్వీ రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సునీల్కుమార్ ఆచూకీ తెలిసినా, మోటారు బైక్ ఆచూ కీ తెలిసినా బొమ్మూరు ఇన్స్పెక్టర్ 94407 96533, 94911 22811 ఫోన్ నెంబరులో తనకు తెలియజేయాలని ఎస్సై రమేష్ కోరారు. 05 ఎఎంపీ 252: డాక్టర్ విజయ రెడ్డిని అభినందిస్తున్న వైద్యులు ఉద్యోగులు -
జగన్మోహనం.. శివకేశవ క్షేత్రం
● భక్తులను ఆకట్టుకునే ద్విముఖ రూపాలు ● కోరిన కోర్కెలు నెరవేర్చే దివ్య స్వరూపం ● ప్రపంచ ప్రసిద్ధి చెందిన ర్యాలి క్షేత్రం ● నేటి నుంచి కళ్యాణమహోత్సవాలు కొత్తపేట: ముందు పురుషరూపం, వెనక సీ్త్ర రూపంతో ఏకశిలలో జగన్మోహినీ, విష్ణువు సాక్షాత్కరించే అద్భుత క్షేత్రం ఆత్రేయపురం మండలం ర్యాలి జగన్మోహినీ కేశవస్వామి ఆలయం. అణువణువునా ఆధ్యాత్మికత ఉట్టిపడే క్షేత్రం ర్యాలి. ఈ క్షేత్రంలో ఈ నెల 6 నుంచి 13 వరకూ స్వామివారి కళ్యాణోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఈ దేవాలయం ఆరో స్థానాన్ని దక్కించుకని ఖ్యాతికెక్కింది. ఈ క్షేత్రంలో ముందు భాగం కేశవుని రూపం, వెనుక జగన్మోహినీగ స్వయంభూగా అవతరించారు. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే సర్వపాపాలు హరిస్తాయని భక్తుల విశ్వాసం. ఏకశిలా విగ్రహం ఉన్న ఈ ఆలయంలో అణువణువునా ఉన్న అద్భుతాలు భక్తి భావాలను పెంపొందిస్తాయి. ఈ ఆలయంలో భక్తులందకీ గర్భాలయ ప్రవేశం ఉండటం విశేషం. అంతే కాక ఈ ఆలయానికి ఎదురుగానే పడమర వైపు ఉమా కమండలేశ్వర స్వామి ఆలయం ఉండటం ఒక విశేషం. కాగా శివాలయంలో నీరు ఇంకి పోవడం, శ్రీజగన్మోహునుడి ఆలయంలో స్వామి వారి పాదముల నుంచి నిరంతరం నీరు (గంగ) ఉద్భవించడం సృష్టి రహస్యాలుగా చరిత్ర చెప్తోంది. ఆలయ విశిష్ట చరిత్ర ఈ ఆలయ ప్రత్యేకతలకు తగినట్లే ఆ దైవం వెలిసిన విధానం కూడ ఒక చరిత్ర సంతరించుకుంది. ఈ ఆలయంలో దైవం, రాక్షస సంహారంలో భాగంగా ఏర్పడిన ఒక అవతారమని చారిత్రక కథనం. ఇటు గౌతమి అటు వశిష్ట నదీ పాయల మధ్య ఆవిర్భవించిన ఈ ఆలయ స్థాపనకు, ఈ గ్రామానికి ర్యాలి అన్న పేరు రావడానికి కూడా ఒక కథ ఉన్నట్టు పండితులు వెల్లడిస్తున్నారు. విక్రమదేవుడు అనే భక్తుడు ఒకప్పుడు అడవిలా ఉన్న ప్రాంతంలో వేట సాగిస్తూ ఒక చెట్టు వద్ద నిద్రించాడు. అతనికి కలలో కనబడిన మహావిష్ణువు స్వయంభూ శిల రూపంలో నేను ఈప్రాంతంలో ఉన్నానని నీవు కర్రతో రథం చేయించి లాగుకొని వెళ్ళితే ఆ రథం శీల రాలి పోతుందని అక్కడ తవ్వితే విగ్రహం బయట పడుతుందిని చెప్పి అదృశ్యమయ్యాడని ఒక కథ ప్రచారంలో వుంది. ఆ ప్రకారం విక్రమ దేవుడి ద్వారా ఈ విగ్రహం బయటపడిందని చరిత్ర చెబుతోంది. రథం శీల రాలడం వలన ఈ దైవం వెలసిన ప్రాంతానికి శ్రీర్యాలిశ్రీ అని పేరు వచ్చిందని నానుడి. పాప సంహారం కోసం వెలసిన దైవం అమృతం కోసం తగవులాడుకుంటున్న దేవదానవులను శాంతిపజేసి దానవులకు అమృతం అందకుండా చేసేందుకు మహా విష్ణువు జగన్మోహినీగా ఈ లోకంలో అవతరించిన విషయం తెలిసిందే. ఆ ఘట్టం ముగిసిన తరువాత అత్యంత సుందరంగా ఉన్న జగన్మోహినిని మోహించిన శంకరుడు ఆమెను వెంటాడటంతో సీ్త్ర రూపంలో ఉన్న విష్ణుమూర్తి ర్యాలి గ్రామం వరకూ వచ్చి ఇక్కడ అంతర్థానమైనట్టు ఆలయ చరిత్రకారులు వెల్లడిస్తున్నారు. ఆ సమయంలో వీరిద్దరూ మోహించుకోవడాన్ని సర్వజనానికి తెలిసేటట్టు చేయడం కోసం సీ్త్ర పురుష రూపాల్లో ఏక శిలలో లోకనాఽథులు ఇద్దరూ ఇక్కడ స్వయంభూలుగా వెలిశారని భక్తులు విశ్వాసం అడుగడుగునా అద్భుతాలే లోకనాథులు వెలసిన ఈ గ్రామంలో జగన్మోహిహినీ కేశవస్వామి ఆలయంలో అణువణువునా అద్భుతాలే కనిపిస్తాయి. అత్యంత ఎత్తయినా పురాతన నిలువు గోపురం అందరినీ ఆకర్షించే గర్భగుడితో పాటు శ్రీదేవి, భూదేవి విగ్రాహాలు సైతం ఎంతగానో అకర్షిస్తాయి. ఇవి అన్ని ఒక ఎత్తయితే ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన వింత. ఈ ఆలయ ప్రధాన విగ్రహమే ఐదు అడుగుల ఎత్తున ఉన్న సాలగ్రామ ఏక శిలలో సీ్త్ర పురుష రూపాల్లో శివ కేశవులు సాక్షాత్కరించడం భక్తి పారవశ్యాన్ని పెంపొందిస్తుంది. ఈ ఒక్క శిలలోనే రెండు విధాలైన ఆలయాలు, పొన్న చెట్టు, దక్షిణ భాగంలో గోవర్ధన పర్వతం, మకర తోరణం స్పష్టంగా కనిపిస్తాయి. ఈ సాలగ్రామ ఏక శిలా విగ్రహంలోనే దశావతారాలు కన్పించడం మరో అద్భుత విశేషం. కంఠంలోని హారాలు, కర కంకణాలు, శంకు చక్రాలు జీవం ఉట్టి పడేలా ఆ శివకేశవులే మన ముందు ప్రత్యక్ష మయ్యినట్టుగా చూసేవారికి అనుభూతి కలుగుతుంది. సాలాగ్రామ విగ్రహం పాదాల వద్ద గంగా జలం నిత్యం ఉబుకుతూనే ఉండడం ఇక్కడ మరో విశిష్టత. పాదాల వద్ద వున్న గంగాదేవి విగ్రహం నుంచి ఈ జలం ప్రవహిస్తూ నిత్యం ఆయన పాదాలను కడుగుతుందని భక్తుల విశ్వాసం. విగ్రహం వెనుక వైపు వున్న జగన్మోహినీ రూపం మరింత సమ్మోహనం. సీ్త్ర రూపంలో వున్న మహాశిష్ణువు అత్యంత సౌందర్యంగా కనిపిస్తారు. శిరమున సిగచుట్టూ అప్పుడే సంపెంగ నూనె రాసుకొన్నట్లున్న శిరోజాలు సహజమైన చీర కట్టు, తలలో ముచ్చటగొలిపే చామంతి పువ్వు విశేషంగా కనిపిస్తాయి. అంతేకాక పద్మినీ జాతి సీ్త్రలకు శుభసూచకంగా ఉండేలా పుట్టుమచ్చలు సైతం ఈ విగ్రహంలో సాక్షాత్కరించడం భక్తులను తన్మయత్వంలో ఓలలాడిస్తుంది. ఈ ఆలయాన్ని సందర్శించాలంటే రాజమహేంద్రవరం నుంచి ర్యాలి చేరుకునేందుకు గంట సమయం పడుతుంది. రావులపాలెం చేరుకున్న భక్తులు అక్కడ నుంచి ఊబలంక మీదుగా ర్యాలి చేరుకునేందుకు ఆరు కిలోమీటర్లు ప్రయాణించాల్సి వుంటుంది. రావులపాలెం బస్ కాంప్లెక్సు నుంచి రెండు గంటలకు ఒకసారి ఆర్టీసీ బస్ సౌకర్యం ఉండడంతో పాటు ప్రైవేటు వాహనాల ద్వారా ర్యాలి దివ్య క్షేత్రానికి చేరుకోవచ్చు. కల్యాణ మహోత్సవాలు ఇలా.. ఆదివారం గరుడ వాహన సేవ, గ్రామోత్సవం, రాత్రి 8–45 గంటలకు స్వామి వారి కల్యాణోత్సవం, 7, 8, 9 తేదీల్లో స్వామివారికి అభిషేకం, తులసి పూజ, అమ్మవారికి కుంకుమార్చన, పదో తేదీన సదస్యం, 12న చక్రస్నానం, 13న శ్రీపుష్పోత్పవంతో కల్యాణ మహోత్సవాలు ముగుస్తాయని దేవస్థానం ఈఓ భాగవతుల వెంకటరమణమూర్తి తెలిపారు. -
రారండోయ్ రాములోరి కల్యాణానికి..
● సత్యదేవుడు అమ్మవార్లు పెళ్లిపెద్దలుగా ● వధూవరులైన సీతారాములు ● పసుపు దంచిన ముత్తైదువలు ● రత్నగిరి క్షేత్ర పాలకుడు సీతారాముని కల్యాణం నేడు అన్నవరం: రత్నగిరి క్షేత్ర పాలకుడైన శ్రీరాముని ఆలయంలో నవమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. చైత్ర శుద్ధ అష్టమి శనివారం సత్యదేవుడు, అనంతలక్ష్మి, సత్యవతీదేవి అమ్మవార్లు పెళ్లిపెద్దలుగా రాగా సాయంత్రం నాలుగు గంటలకు వేద మంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ వధూవరులుగా తీర్చిదిద్దారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు దంపతులు నూతన పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం ముత్తైదువులతో పాటు ఈఓ సుబ్బారావు కొంతసేపు పసుపు దంచారు. ఈ సందర్భంగా భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. కార్యక్రమాలను ప్రధాన అర్చకుడు కోట సుబ్రహ్మణ్యశర్మ, వేదపండితులు గొల్లపల్లి ఘనపాఠి, గంగాధరభట్ల గంగబాబు, యనమండ్ర శర్మ, చిట్టి శివ, రామాలయ అర్చకుడు దేవులపల్లి ప్రసాద్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. నేడు సీతారాముల కల్యాణం సీతారాముల కల్యాణాన్ని ఆదివారం ఉదయం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం ఏడు గంటలకు సీతారాములను వెండి హనుమద్వాహనంపై, పెళ్లిపెద్దలు సత్యదేవుడు, అమ్మవారిని పల్లకీ మీద గ్రామంలో ఊరేగిస్తారు. అనంతరం రత్నగిరి రామాలయం వద్ద వార్షిక కల్యాణవేదికపై ఉదయం పది నుంచి ఒంటి గంట వరకూ సీతారాముల కల్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ ముహూర్తంలో మాంగల్యధారణ జరుగుతుంది. అనంతరం భక్తులకు ప్రసాదం, వడపప్పు పానకం పంపిణీ చేస్తారు. తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు రోజుకొక వేడుకతో శ్రీరామ నవమిని తొమ్మిది రోజులపాటు నిర్వహిస్తారు. ఏప్రిల్ 13వ తేదీ రాత్రి ఏడు గంటలకు రామాలయంలో జరిగే శ్రీసీతారాముల శ్రీపుష్పయోతోత్సవంతో కార్యక్రమాలు ముగుస్తాయి. -
తవ్వినదే మృత్యు కుహరమైంది
కపిలేశ్వరపురం: కూటమి నేతల ఇసుక దాహానికి నిండు ప్రాణం బలైంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం కేదారిలంక ర్యాంపు వద్ద గోదావరి నదిలోకి స్నానానికి దిగిన యువకుడు, కొత్తపేట మార్కెట్ వీధికి చెందిన మాంసం విక్రయ వ్యాపారి రొట్టా దుర్గాప్రసాద్ (21) మృతి చెందాడు. దుర్గాప్రసాద్, మరో నలుగురు యువకులు శనివారం గోదావరి నదిలో స్నానానికి దిగారు. ఈ క్రమంలో ఇసుక తవ్విన లోతైన గుంతలో దుర్గాప్రసాద్ గల్లంతయ్యాడు. సమాచారం అందుకొన్న రెవెన్యూ అధికారులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభ్యమైంది. వీఆర్ఓ వెంకటేశ్వరరావు, ఎస్సై డి.రవికుమార్ ఘటనా స్థలంలో శవపంచనామా ప్రక్రియ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతదేహాన్ని తరలించడానికి వీలులేదంటూ మృతుని బంధువులు, కొత్తపేట మార్కెట్ వీధికి చెందిన వారు నిరసన తెలిపారు. ఇసుక ర్యాంపు వద్ద లోతైన గుంతలే దుర్గాప్రసాద్ మృతికి కారణమని, ప్రభుత్వం బాధ్యత తీసుకొని మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మృతదేహం ఎదుట పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వ అధికారుల నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకూ మృతదేహాన్ని తరలించనివ్వబోమంటూ రాత్రి కూడా నిరసన కొనసాగించారు.కూటమి నేతల ఇసుక దాహం ప్రమాదభరితంప్రభుత్వ ఇసుక విధానం గ్రామానికి చెందిన కూటమి నేతలకు కాసులు కురిపించేదిగా ఉంది. దాంతో నిబంధనలను తుంగలోకి తొక్కుతూ విచ్చలవిడిగా గ్రామానికి చెందిన కూటమి నేతల ప్రోద్బలంతో అక్రమంగా ఇసుక తవ్వి సొమ్ము చేసుకున్నారు. ఈ తవ్వకాలతో ర్యాంపు వద్ద లోతైన గుంతలు ఏర్పడ్డాయి. ఇది తెలియని వారు స్నానాలకు దిగుతూండగా స్థానికులు చూసినప్పుడు దిగవద్దంటూ ఇసుక గుంతల ప్రమాదంపై హెచ్చరిస్తున్నారు. అలా సాధ్యం కాని పరిస్థితిలోనే దుర్గాప్రసాద్ ప్రమాదవశాత్తూ నదిలో గల్లంతై మృత్యువాత పడ్డాడు. ర్యాంపులో అక్రమంగా రాత్రింబవళ్లు ఇసుక తవ్వకాలు జరుపుతున్నారంటూ స్థానిక ప్రజాప్రతినిధులు గతంలో జిల్లా కలెక్టర్ దృష్టికి సైతం తీసుకెళ్లారు. కలెక్టర్ ఆదేశాలపై కొద్ది రోజులు ఇసుక తవ్వకాలను నిలిపివేశారు. తర్వాత తిరిగి కొనసాగించారు. -
రాములోరి పెళ్లి సందడి
● కోదండరాముని కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి ● ఆంధ్రా భద్రాద్రి జి.మామిడాడలో రేపు నిర్వహణ పెదపూడి: కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడలోని శ్రీ కోదండరాముడి కల్యాణ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. కోరిన కోర్కెలు తీర్చే కోదండరాముడిగా భక్తులు ఆయనను కొలుస్తారు. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలంలోని భద్రాది రాముడి ఆలయానికి దీటుగా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆంధ్రా భద్రాద్రిగా పేరుగాంచిన ఈ ఆలయంలో తూర్పు, పశ్చిమ దిశల్లో నిర్మించిన గోపురాలు అత్యంత ఎత్తుగా ఉంటాయి. వాటిపై శిల్పాలను భాగవత, రామాయణాల్లోని అపురూప ఘట్టాలతో మనోహరంగా తీర్చిదిద్దారు. అవి భక్తులను ఆకట్టుకుంటాయి. గొల్లల మామిడాడలో శ్రీ కోదండ రామాలయం కల్యాణకాంతులను సంతరించుకుంది. ఆదివారం జరిగే సీతారాముల కల్యాణానికి భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు. వేల సంఖ్యలో వచ్చే భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక్కడ మంచి ముత్యాలను తలంబ్రాలుగా వాడటం విశేషం. కల్యాణ కొబ్బరి బొండాలు, రామనామ తలంబ్రాలు సిద్ధం జి.మామిడాడ గ్రామానికి చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు ద్వారంపూడి యువరాజారెడ్డి అనే సూక్ష్మ కళాకారుడు కోదండ రామాలయంలో ఆదివారం జరిగే సీతారాముల కల్యాణానికి ప్రత్యేకంగా తయారు చేసిన కొబ్బరి బొండాలు, బియ్యపు గింజలపై మూడు భాషల్లో రాసిన రామనామ తలంబ్రాలు సిద్ధం చేశారు. ఆయన మాట్లాడుతూ కల్యాణ కొబ్బరి బొండాలపై శంఖు, చక్ర, నామాలతో కోదండరాముని సీతా, లక్ష్మణ, ఆంజనేయ సహితంగా బొండాలపై రంగురంగుల పొడులు, ముత్యాలు, లేసులు సహాయంతో సుందరంగా తీర్చిదిద్దినట్టు చెప్పారు. బియ్యపు గింజలపై ఎలాంటి సూక్ష్మ పరికరాలు వినియోగించకుండా భక్తి శ్రద్ధలతో పార్కర్ పెన్ను సహాయంతో నిష్టగా 1,00,116 గింజలపై తెలుగు, ఇంగ్లిషు, హిందీ భాషల్లో రాసి సమర్పిస్తున్నట్లు తెలిపారు. 15 ఏళ్లుగా బియ్యపు గింజలపై ఈ మూడు భాషల్లో రాస్తున్నానన్నారు. ఈ తలంబ్రాలను స్వామి వారి కల్యాణ క్రతువులో సమర్పించనున్నట్లు తెలిపారు. ముక్కోటి ఏకాదశికి ప్రారంభమైన ఈ కార్యక్రమం శ్రీరామనవమి రోజుతో పూర్తవుతుందన్నారు. కల్యాణోత్సవ కార్యక్రమాలు వివరాలు 6వ తేదీ మధ్యాహ్నం అభిజిత్ లఘ్నంలో స్వామివారి కల్యాణం 7వ తేదీ సుప్రభాత సేవ, నిత్యోపాసన, డోలు సన్నాయి. రాత్రికి సాంస్కృతిక కార్యక్రమాలు 8వ తేదీ సుప్రభాత సేవ, నిత్యోపాసన, సహస్రనామార్చన, మధ్యాహ్నం 3.30 గంటలకు సదస్యం 9వ తేదీ ఉదయం శేష వాహనంపై స్వామివారి గ్రామోత్సవం 10వ తేదీ ఉదయం వసంతోత్సవం, చక్రస్నానం, కంకణ విసర్జనం, పూర్ణాహూతి, రాత్రికి సాంస్కృతిక కార్యక్రమాలు 11 వ తేది అద్దాల శయన మందిరంలో రాత్రికి ఊయల సేవ, శ్రీ పుష్పయాగం కార్యక్రమాలతో కల్యాణోత్సవాలు ముగిస్తాయి. -
పెట్రోలియం రంగంలో ఉపాధి అవకాశాలు విస్తృతం
ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఈడీ డైరక్టర్ సలోమ యండో బాలాజీచెరువు (కాకినాడ సిటీ): పెట్రోలియం రంగంలో ఉపాధి అవకాశాలు విస్త్రృతంగా ఉన్నాయని ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఈడీ సలోమ యండో పేర్కొన్నారు. జేఎన్టీయూకే ప్రాంగణంలో శుక్రవారం ఉదయం అలూమ్ని ఆడిటోరియంలో ఫిపి స్టూడెంట్ చాప్టర్స్ 13వ వార్షిక సమావేశం నిర్వహించారు. యూసీఈకే కెమికల్ ఇంజినీరింగ్, పెట్రోలియం ఇంజినీరింగ్ విభాగాలలోని జేఎన్టీయూకే ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పెట్రోలియం ఇండస్ట్రీ (ఫిపి) స్టూడెంట్ ఛాప్టర్ ఆధ్వర్యంలో ఇది జరిగింది. జేఎన్టీయూకే ఫిపి స్టూడెంట్ చాప్టర్ ఫ్యాకల్టీ అడ్వయిజర్ ప్రొఫెసర్ కేవీ రావు అధ్యక్షత వహించగా ఉపకులపతి ప్రొఫెసర్ సీఎస్ఆర్కే ప్రసాద్, ఫిపి డైరెక్టర్ (అన్వేషణ ుూఉత్పత్తి) దేబ్ జ్యోతి వెలిగించారు. ముఖ్యఅతిథి శ్రీ సలోమ యాండో మాట్లాడుతూ సహజ వనరుల రంగంలో భారత ప్రభుత్వం నిర్దేశించిన నికర జీరో లక్ష్యాలను సాధించడానికి సంబంధిత సంస్థలు తీసుకుంటున్న వివిధ కార్యక్రమాలను పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. భారతదేశం చమురు వినియోగంలో 3వ స్థానంలో ఉందని, ప్రపంచవ్యాప్తంగా 13.2 బిఓఈ (బ్యారెల్ ఆఫ్ ఈక్వివాలెంట్) వినియోగిస్తుండగా మన దేశంలో 4.7 బిఓఈ వినియోగిస్తున్నామన్నారు. భారతదేశంలో 26 అవక్షేపణా బేసిన్లు ఉండగా మొత్తం 3.36 మిలియన్ల చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో వ్యాపించి ఉన్నాయన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని త్వరలో చమురు నిక్షేపాల అన్వేషణ, అభివృద్ధిపై రోడ్మ్యాప్ సిద్ధం చేస్తున్నామన్నారు. దేశంలోని విద్యాసంస్థలతో కలిసి సంయుక్తంగా ఎనర్జీ ఇనీషియేటివ్ ప్రోగ్రామ్స్ను చేపట్టనున్నామన్నారు. నూతన ఆవిష్కరణలు అవసరం ఉపకులపతి ప్రొఫెసర్ సీఎస్ఆర్కే ప్రసాద్ మాట్లాడుతూ కెమికల్, పెట్రోలియం ఇంజినీరింగ్ విద్యార్థులు ఇంధన వనరుల ఉత్పత్తి రంగంలోకి రానున్న నేపథ్యంలో రాష్ట్ర, దేశ అవసరాల మేరకు ఇంధన వనరులను ఉత్పిత్తి చేసేలా నూతన ఆవిష్కరణలు చేపట్టాలని పిలుపునిచ్చారు. కాలుష్య రహితమైన ఇంధన వనరులను అందించాల్సిన బాధ్యత పీఈసీఈ విద్యార్థులపై ఉందన్నారు. ఫిపి డైరెక్టర్ దేబ్ అధికారి మాట్లాడుతూ విద్యార్థులను ఇంధన రంగంలో భవిష్యత్తు నాయకులుగా తీర్చిదిద్దడమే ఫిపి ప్రధాన లక్ష్యమన్నారు. సహజ వనరుల రంగంలో డ్రిల్లింగ్ మరియు అన్వేషణలో ఖచ్చితత్వం అనేది చాలా ముఖ్యమని, దీన్ని దష్టిలో పెట్టుకుని ఫిపి స్టూడెంట్ చాప్టర్ల ద్వారా ఆధునిక సాంకేతికతపై పట్టు సాధించేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామన్నారు. దేశంలోని 11 విద్యాసంస్థల నుంచి వచ్చిన ఫిపి స్టూడెంట్ చాప్టర్ల ప్రతినిధులకు అతిథులు ఫిపి ఫ్లాగ్, బ్యాడ్జ్ను అందజేసి అభినందించారు. ఫిపి 13వ వార్షిక సమావేశంలో భాగంగా శ్రీభారతదేశంలో అధిక శక్తి సామర్థ్యం, కచ్చితత్వంతో హైడ్రోకార్బన్ల అన్వేషణను వేగవంతం చేయడంశ్రీ అనే నినాదంపై స్టూడెంట్ చాప్టర్లకు నిర్వహించిన పోటీలకు రిలయన్స్ ఇండస్ట్రీస్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నీరజ్ సిన్హా, ఓఎనన్జీసీ ఈస్ట్రన్ ఆఫ్షోర్ అసెట్ ఈడీ అసెట్ మేనేజర్ రత్నేష్ కుమార్, ఓఎన్జీసీ కావేరీ బేసిన్ మేనేజర్ ుూఈడీ శంతను ముఖర్జీలు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. తదుపరి పోటీలలో ప్రథమ, ద్వితీయ స్థానాలలో నిలిచిన స్టూడెంట్ చాప్టర్లకు అతిథులు బహమతులను ప్రదానం చేయడంతో పాటు విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. జేఎన్టీయూకే డైరెక్టర్లు ప్రొఫెసర్ బి.బాలకృష్ణ, ఏ.స్వర్ణకుమారి, యూసీఈకే ప్రిన్సిపాల్ ఎన్.మోహనన్రావు, అక్నూ మాజీ ఉపకులపతి కె.పద్మరాజు, కెమికల్, పెట్రోలియం ఇంజినీరింగ్ విభాగాధిపతులు, అధ్యాపకులు, దేశంలోని వివిధ విద్యాసంస్థలకు చెందిన ఫిపి స్టూడెంట్ చాప్టర్ల ప్రతినిధులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
● అన్నయ్య దిన కార్యక్రమానికి వెళుతుండగా దుర్ఘటన అంబాజీపేట: అతి వేగంగా వచ్చిన లారీ ఓ వ్యక్తి నిండుప్రాణాన్ని బలితీసుకుంది. అన్నయ్య దిన కార్యక్రమాన్ని ముగించేందుకు స్కూటీపై కౌశికకు వెళుతున్న ఇద్దరు అన్నదమ్ములను లారీ ఢీ కొట్టింది. అందులో ఒకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందగా, మరొకరు చికిత్స పొందుతూ మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గంగలకుర్రులో ఈ గత నెల 24న మృతి చెందిన మంగిపూడి సూర్యనారాయణ దిన కార్యక్రమాన్ని మంగిపూడి నాగరాజు, అతని సోదరుడు రామచంద్రరావుల ఇంటి వద్ద నిర్వహించారు. అనంతరం ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు నాగరాజు (64), రామచంద్రరావు (68)స్కూటీపై స్థానికంగా ఉన్న కౌశిక నదికి వెళుతున్నారు. గంగలకుర్రు ప్రాథమిక పాఠశాల సమీపంలో నాలుగు రోడ్ల సెంటర్ వద్దకు వచ్చేసరికి ముక్కామల నుంచి అంబాజీపేట వైపు అతివేగంగా వెళుతున్న లారీ వీరిని బలంగా ఢీ కొట్టింది. దాంతో నాగరాజు, రామచంద్రరావులను 108లో అమలాపురం ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలో నాగరాజు మృతి చెందగా, రామచంద్రరావు చికిత్స పొందుతూ మృతిచెందారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. ఘటనా స్థలాన్ని ఎస్సై కె.చిరంజీవి పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. లారీ డ్రైవర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడని ఎస్సై చెప్పారు. అప్పటి వరకు అన్న దిన కార్యక్రమాన్ని పూర్తి చేసిన అతని సోదరులు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడడం బంధువులు, స్థానికులను కలచివేసింది. అప్పటికే అన్నదమ్ముల్లో ఒకరిని కోల్పోయి శోకసముద్రంలో ఉన్న మంగిపూడి కుటుంబ సభ్యులు మరో ఇద్దరు మృత్యువాత పడ్డారన్న దుర్వార్త వినడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. -
సీతమ్మకు కోవా సారె సిద్ధం
పి.గన్నవరం: స్థానిక శ్రీపట్టాభి రామస్వామి వారి ఆలయంలో ఆదివారం జరుగనున్న సీతారాముల కల్యాణ మహోత్సవాలకు ఆలయ ధర్మకర్తలు పేరిచర్ల భీమరాజు, సత్యవాణి దంపతులు కోవా స్వీట్లతో తయారు చేయిస్తున్న కంత (సారె) భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో శ్రీరాముని తరఫున సీతమ్మవారికి ఈ కంతను సమర్పిస్తారు. వివిధ రకాల ఫలాలు, పుష్పాలు, కూరగాయలు, పంచె, చీర, పర్ణశాల వంటి ఆకృతుల్లో కోవాతో తయారు చేస్తున్న స్వీట్లు భక్తులకు కనువిందు చేస్తున్నాయి. గత 16 ఏళ్ల నుంచి ఈ ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. ఏటా కోవాతో పాటు పలు రకాల పిండి వంటలను తయారు చేయించి సీతమ్మవారికి సమర్పిస్తున్నట్టు సత్యవాణి తెలిపారు. స్థానిక అక్విడెక్టు వద్ద వేంచేసిన శ్రీపట్టాభిరామ స్వామి వారి ఆలయంలో శ్రీరామ నవమి సందర్భంగా వైభవంగా కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. దీనికి 20 రోజుల ముందు నుంచి 100 రకాలకు పైగా కోవాతో స్వీట్లు, పిండి వంటలు తయారు చేయిస్తారు. స్వీట్లు, పిండి వంటల తయారీలో స్థానిక శ్రీరామ్ గార్డెన్స్కు చెందిన మహిళా భక్తులు సహకారం అందిస్తున్నారు. -
మేమంతా శివరామసుబ్రహ్మణ్యం వెంటే..
స్పష్టం చేసిన ఆర్యవైశ్య సంఘం నాయకులు రాజమహేంద్రవరం సిటీ: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఆర్యవైశ్యులంతా ఏపీఐఐసీ మాజీ చైర్మన్, వైశ్య ప్రముఖుడు శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం వెంటే ఉంటామని వైశ్య సంఘం నాయకులంతా స్పష్టం చేశారు .తామంతా రాజకీయ పార్టీల జెండాలతో రాలేదని, వైశ్యుల అజెండాతో మాత్రమే వచ్చామని స్పష్టం చేశారు. శుక్రవారం లాలాచెరువులోని వైశ్య హాస్టల్లో ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లా ఆర్యవైశ్య సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రగళ్ళపాటి కనకరాజు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా రాజకీయాలతో సంబంధం లేకుండా శివరామ సుబ్రహ్మణ్యంను పెద్దగా ఉంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఏ సమస్య వచ్చినా వాటిని పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్నామన్నారు. కోనసీమ జిల్లా విడదీసినప్పుడు రాష్ట్ర మహాసభ బైలాకు విరుద్ధంగా కమిటీ ఏర్పాటు వలన ప్రయోజనం లేదన్నారు. ప్రజలు సేవచేసే వ్యక్తులను గుర్తిస్తారని అన్నారు. శివరామసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జిల్లాలో అందరికీ వైశ్య హాస్టల్ ఒక షెల్టర్ కావాలనే ఉద్దేశంతో ఒక ఫ్లోరు అందిస్తున్నట్లు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆతిథ్యానికి మారుపేరుగా ఉన్నవారిని విడదీయడం సబబు కాదన్నారు. తనను టార్గెట్ చేయాలని చూస్తున్నారని, తనవల్ల ఎవరూ మోసపోలేదని స్పష్టం చేశారు. తాను చెప్పిందే జరగాలని అనుకోనని, ఎవరు చెప్పినా వింటానన్నారు. రాష్ట్ర మహాసభ ఒకే నాయకత్వం కింద ఉండాలని భావిస్తానని, కాని రాష్ట్ర బైలాను పక్కన పెట్టి నియామకాలు చేపట్టడం కరెక్టో కాదో వారే ఆలోచించుకోవాలన్నారు. పెద్దలముందు చేసిన ప్రమాణాల ప్రకారం నడుచుకుంటే సమాజంలో కాని , సంఘంలో కాని గౌరవం ఉంటుందని శివరామ సుబ్రహ్మణ్యం హితవు పలికారు. ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కంచర్ల బాబీ, కార్యదర్శి కుసుమంచి పాపారావు, కోశాధికారి కంచర్ల కృష్ణ మోహన్, నంబూరి రెడ్డియ్య, పల్లపోతు బంగారం, కోరుప్రోలు వెంకటేశ్వరరావు, అత్తలూరి సాయిబాబా, కుసుమంచి సుబ్బరాయులు రాజమండ్రి చాంబర్ అధ్యక్షుడు తవ్వా రాజా పాల్గొన్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 15,500 గటగట (వెయ్యి) 14,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 14,500 గటగట (వెయ్యి) 13,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
మేమంతా శివరామసుబ్రహ్మణ్యం వెంటే..
స్పష్టం చేసిన ఆర్యవైశ్య సంఘం నాయకులు రాజమహేంద్రవరం సిటీ: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఆర్యవైశ్యులంతా ఏపీఐఐసీ మాజీ చైర్మన్, వైశ్య ప్రముఖుడు శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం వెంటే ఉంటామని వైశ్య సంఘం నాయకులంతా స్పష్టం చేశారు .తామంతా రాజకీయ పార్టీల జెండాలతో రాలేదని, వైశ్యుల అజెండాతో మాత్రమే వచ్చామని స్పష్టం చేశారు. శుక్రవారం లాలాచెరువులోని వైశ్య హాస్టల్లో ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లా ఆర్యవైశ్య సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రగళ్ళపాటి కనకరాజు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా రాజకీయాలతో సంబంధం లేకుండా శివరామ సుబ్రహ్మణ్యంను పెద్దగా ఉంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఏ సమస్య వచ్చినా వాటిని పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్నామన్నారు. కోనసీమ జిల్లా విడదీసినప్పుడు రాష్ట్ర మహాసభ బైలాకు విరుద్ధంగా కమిటీ ఏర్పాటు వలన ప్రయోజనం లేదన్నారు. ప్రజలు సేవచేసే వ్యక్తులను గుర్తిస్తారని అన్నారు. శివరామసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జిల్లాలో అందరికీ వైశ్య హాస్టల్ ఒక షెల్టర్ కావాలనే ఉద్దేశంతో ఒక ఫ్లోరు అందిస్తున్నట్లు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆతిథ్యానికి మారుపేరుగా ఉన్నవారిని విడదీయడం సబబు కాదన్నారు. తనను టార్గెట్ చేయాలని చూస్తున్నారని, తనవల్ల ఎవరూ మోసపోలేదని స్పష్టం చేశారు. తాను చెప్పిందే జరగాలని అనుకోనని, ఎవరు చెప్పినా వింటానన్నారు. రాష్ట్ర మహాసభ ఒకే నాయకత్వం కింద ఉండాలని భావిస్తానని, కాని రాష్ట్ర బైలాను పక్కన పెట్టి నియామకాలు చేపట్టడం కరెక్టో కాదో వారే ఆలోచించుకోవాలన్నారు. పెద్దలముందు చేసిన ప్రమాణాల ప్రకారం నడుచుకుంటే సమాజంలో కాని , సంఘంలో కాని గౌరవం ఉంటుందని శివరామ సుబ్రహ్మణ్యం హితవు పలికారు. ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కంచర్ల బాబీ, కార్యదర్శి కుసుమంచి పాపారావు, కోశాధికారి కంచర్ల కృష్ణ మోహన్, నంబూరి రెడ్డియ్య, పల్లపోతు బంగారం, కోరుప్రోలు వెంకటేశ్వరరావు, అత్తలూరి సాయిబాబా, కుసుమంచి సుబ్బరాయులు రాజమండ్రి చాంబర్ అధ్యక్షుడు తవ్వా రాజా పాల్గొన్నారు. -
బూరుగుపూడిలో చోరీ
రూ.45,000 నగదు, 2 కాసుల బంగారం, 200 గ్రాముల వెండి ఆభరణాలు తస్కరణ మధురపూడి: తాళాలు వేసి ఉన్న ఇంట్లోకి చొరబడి నగదు, నగలు చోరీ చేసిన ఘటన కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మండా నాగ భూషణం కుటుంబ సమేతంగా బంధువుల ఇంటికి పెళ్లికి వెళ్లారు. తిరిగి శుక్రవారం ఉదయం ఇంటికొచ్చారు. ఇంట్లో సామాన్లు చిందర వందరగా పడి ఉండటం, తలుపుల తాళాలు పగిలి ఉండటం, గదిలో బద్దలయిన బీరువాను, దాని సొరుగులు మంచంపై పడి ఉన్నట్టు గుర్తించారు. దానిలోని రూ.45,000 నగదు, 2 కాసుల బంగారం, 200 గ్రాముల వెండి ఆభరణాలు, హాలులోని పెద్ద ఎల్ఈడీ టీవీ చోరీ అయినట్టు గుర్తించారు. దీంతో కోరుకొండ పోలీసులకు సమాచారం ఇవ్వగా, ఎస్సై శ్యామ్సుందర్ ఆధ్వర్యంలో పరిశీలించారు. క్లూస్ టీమ్ చోరీ జరిగిన ప్రదేఽశంలో వేలిముద్రలను సేకరించింది. ఎస్సై శ్యామ్సుందర్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు. -
బూరుగుపూడిలో చోరీ
రూ.45,000 నగదు, 2 కాసుల బంగారం, 200 గ్రాముల వెండి ఆభరణాలు తస్కరణ మధురపూడి: తాళాలు వేసి ఉన్న ఇంట్లోకి చొరబడి నగదు, నగలు చోరీ చేసిన ఘటన కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మండా నాగ భూషణం కుటుంబ సమేతంగా బంధువుల ఇంటికి పెళ్లికి వెళ్లారు. తిరిగి శుక్రవారం ఉదయం ఇంటికొచ్చారు. ఇంట్లో సామాన్లు చిందర వందరగా పడి ఉండటం, తలుపుల తాళాలు పగిలి ఉండటం, గదిలో బద్దలయిన బీరువాను, దాని సొరుగులు మంచంపై పడి ఉన్నట్టు గుర్తించారు. దానిలోని రూ.45,000 నగదు, 2 కాసుల బంగారం, 200 గ్రాముల వెండి ఆభరణాలు, హాలులోని పెద్ద ఎల్ఈడీ టీవీ చోరీ అయినట్టు గుర్తించారు. దీంతో కోరుకొండ పోలీసులకు సమాచారం ఇవ్వగా, ఎస్సై శ్యామ్సుందర్ ఆధ్వర్యంలో పరిశీలించారు. క్లూస్ టీమ్ చోరీ జరిగిన ప్రదేఽశంలో వేలిముద్రలను సేకరించింది. ఎస్సై శ్యామ్సుందర్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు. -
రక్తదానంపై అవగాహనకు సైకిల్ యాత్ర
తుని రూరల్: రక్తదానంపై యువతలో అవగాహన, చైతన్యం తీసుకువచ్చే లక్ష్యంతో సేవ్ బ్లడ్ పేరుతో తుని మండలం టి.తిమ్మాపురానికి చెందిన ఆకేటి బుజ్జిబాబు శుక్రవారం సాయంత్రం సైకిల్ యాత్ర చేపట్టాడు. తుని మండలం వి.కొత్తూరు సమీపంలోని పెట్రోల్ బంకులో రాత్రి బస చేశాడు. ఈ సందర్భంగా బుజ్జిబాబు మాట్లాడుతూ, నాలుగు నెలల పాటు తన యాత్ర కొనసాగుతుందన్నారు. రక్తదానం వలన ఎంతో మంది ప్రాణాలు కాపాడవచ్చని, దీనివలన ఎటువంటి నష్టమూ లేదని యువతకు అవగాహన కల్పించడమే తన యాత్ర ముఖ్య ఉద్దేశమన్నారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ అవతరణకు ప్రధాన కారకుడైన పొట్టి శ్రీరాములు త్యాగాన్ని కూడా నేటి తరానికి తెలియజేస్తానన్నారు. పట్టణాలు, ప్రధాన గ్రామాల్లో తన యాత్ర కొనసాగుతుందని తెలిపారు. గతంలో బాలికలను, పక్షులను, మొక్కలను, జంతువులను రక్షించాలన్న నినాదంతో దేశంలోని 28 రాష్ట్రాల్లో 8 నెలల పాటు సైకిల్ యాత్ర చేశానన్నారు. అలాగే, కోల్కతాలో దాడికి గురైన మెడికో మోహితకు న్యాయం జరగాలని విజయవాడ నుంచి కోల్కతాకు 1,400 కిలోమీటర్ల పాదయాత్ర చేశానన్నారు. నేపాల్లో అన్నపూర్ణ బేస్ క్యాంపు నుంచి 4,130 మీటర్ల ఎత్తయిన శిఖరాన్ని అధిరోహించి, జాతీయ జెండాను ఎగురవేశానని బుజ్జిబాబు తెలిపారు. -
ప్రలోభాల్లోనూ మోసాలేనా?
● ప్రలోభపెట్టే ఎంపీపీ ఎన్నికలో గెలిచారు ● కూటమి నేతల తీరుపై అనపర్తి మాజీ ఎమ్మెల్యే ధ్వజం పెదపూడి: ఇటీవల జరిగిన బిక్కవోలు ఎంపీపీ ఎన్నికల్లో కూటమి నాయకులు తమ ఎంపీటీసీ సభ్యులను ప్రలోభపెట్టడమే కాకుండా, ఆ సమయంలో వారికి ఇచ్చిన హామీల అమలులోనూ మోసాలకు పాల్పడ్డారని వైఎస్సార్ సీపీ అనపర్తి నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ఆరోపించారు. అనపర్తిలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. కొంత మంది ఎంపీటీసీ సభ్యులను కూటమి నాయకులు ఏవిధంగా ప్రలోభపెట్టారో, మోసాలు, బెదిరింపులకు పాల్పడ్డారో వివరించారు. దీనిపై ఆ ఎంపీటీసీ సభ్యుల్లో కొందరు ఇటీవల వారి సన్నిహితుల వద్ద వాపోయారన్నారు. వైఎస్సార్ సీపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తే రూ.1.50 లక్షలు ఇస్తామని ఒక ఎంపీటీసీ సభ్యుడిని ఆశ చూపించి, రూ.1.25 లక్షలు మాత్రమే చేతిలో పెట్టారని సూర్యనారాయణరెడ్డి అన్నారు. మరో ఎంపీటీసీ సభ్యుడు తమ గ్రామంలో సుమారు 30 ఏళ్లుగా ఒక దేవస్థానం భూమిలో పశువుల పాక వేసుకుని, పశుపోషణ చేసుకుంటూంటే.. వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ఓటు వేస్తే ఆ పాకను తొలగిస్తామంటూ బెదిరించారని తెలిపారు. స్వగ్రామంలో ఎరువుల వ్యాపారం చేసుకుంటున్న మరో ఎంపీటీసీ సభ్యుడిని వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ఓటు వేస్తే ఆ షాపుపై విజిలెన్స్, వ్యవసాయ అధికారులతో దాడులు చేయిస్తామంటూ బెదిరించారని ఆరోపించారు. మరో ఎంపీటీసీ సభ్యుడు తన గ్రామంలో సప్లయి కంపెనీ నిర్వహించుకుంటున్నారని, వైఎస్సార్ సీపీకి ఓటు వేస్తే ప్రభుత్వ, అధికారిక కార్యక్రమాలకు ఆ సప్లయి కంపెనీకి ఆర్డర్ ఇవ్వబోమంటూ బెదిరించారని చెప్పారు. అలాగే, వాహనంలో గంజాయి పెట్టి కేసులు బుక్ చేస్తామంటూ మరో ఎంపీటీసీ సభ్యుడిని బెదిరించారంటూ తెలిపారు. మరో ఎంపీటీసీ సభ్యుడు ఎంపీడీఓ కార్యాలయం నుంచి వైఎస్సార్ సీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యుల గుర్తింపు కార్డులను అధికారుల అంగీకారంతో తీసుకుంటే, ఆయనపై కూడా అధికారులను ఉపయోగించి తప్పుడు కేసు పెట్టి, ఓటింగ్కు వెళ్లకుండా చేస్తామంటూ స్థానిక పోలీస్ అధికారులను ఉపయోగించి భయపెట్టారని చెప్పారు. ఇలా ప్రలోభాలు, బెదిరింపులు, మోసాలతో ఎంపీపీ పదవి గెలిచారని దుయ్యబట్టారు. ఈ గెలుపును ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తన గొప్పగా చెప్పుకుంటున్నారని, ఇది వైఎస్సార్ సీపీ కక్కిన కూడుకు కూటమి నాయకులు కక్కుర్తి పడినట్లు కాదా అంటూ విమర్శించారు. వైఎస్సార్ సీపీకి పుట్టిన బిడ్డను బీజేపీ బిడ్డగా చెప్పుకోడానికి సిగ్గనిపించడం లేదా అని మండిపడ్డారు. తాను సామెత కూడా సరిగా పలకలేకపోయానంటూ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి విమర్శించారని, అవసరమైతే తాను మాట్లాడిన ఆ వీడియో మరోసారి చూసి, వినాలని అన్నారు. ఎవరికో పుట్టిన బిడ్డను మీ బిడ్డగా చెప్పుకున్నట్లు కాదా అనే సామెతను తాను స్పష్టంగానే పలికానని, గతంలో రామకృష్ణారెడ్డి రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ పేరును కూడా సరిగ్గా పలకలేకపోయిన విషయం మరచి, తనపై వ్యంగ్యంగా మాట్లాడటం సరికాదని సూర్యనారాయణరెడ్డి అన్నారు. -
నాగాంజలి మృతి బాధాకరం
శనివారం శ్రీ 5 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025● ఆమె ఆఖరి కోరిక ప్రకారం దీపక్కు కఠిన శిక్ష పడాలి ● ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ఇవ్వాలి ● బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకూ అండగా ఉంటాం ● మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ సాక్షి, రాజమహేంద్రవరం/కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి మృతి బాధాకరమని మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ అన్నారు. ఆమె మరణవార్త తెలుసుకుని పోస్ట్మార్టం చేస్తున్న ప్రభుత్వాసుపత్రికి చేరుకున్న ఆయన శుక్రవారం బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, మృతురాలు సూసైడ్ నోట్లో ఏం కోరుకుందో దానిపై ఆమె తల్లిదండ్రులతో కలిసి పోరాటం చేస్తామన్నారు. దీపక్కు కఠిన శిక్ష పడాలని నాగాంజలి కోరుకుందని, అది నెరవేరే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీపక్ లాంటి కీచకులకు తగిన శిక్ష విధించడం ద్వారా ఇలాంటి ఘటనలు జరగకుండా చూడవచ్చన్నారు. నాగాంజలి కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం, కిమ్స్ ఆస్పత్రి యాజమాన్యం బాధ్యత తీసుకోవాలని, ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. తానేదో రాజకీయం చేస్తున్నట్లు కొందరు పేర్కొనడం తగదని భరత్రామ్ పేర్కొన్నారు. విద్యార్థులు ధర్నా చేస్తున్నప్పుడు తాను కూడా వెళ్లానన్నారు. నాగాంజలి స్వయంగా ఇంజక్షన్ చేసుకుందా.. లేక ఎవరైనా చేశారా అనే అనుమానాస్పద ఘటన నేపథ్యంలో ఆ అమ్మాయికి తగిన న్యాయం జరిగే వరకూ అండగా ఉండాలని భావించామని వివరించారు. అప్పుడే విషయం బయటకు వచ్చిందని, లేకుంటే ఆ రోజు సాయంత్రమే చక్కబెట్టేసి ఉండేవారని అన్నారు. విషయం బయటకు వచ్చాకే దీపక్పై కఠిన సెక్షన్లు పెట్టారన్నారు. ఈ ఘటనపై హోం మంత్రి స్పందించకపోవడం, కనీసం ఒక ట్వీట్ కూడా చేయకపోవడం దారుణమన్నారు. దీనినిబట్టి కూటమి ప్రభుత్వం ఆడపిల్లలకు ఇచ్చే గౌరవమేమిటో అర్థమవుతోందని భరత్రామ్ అన్నారు. -
రక్తదానంపై అవగాహనకు సైకిల్ యాత్ర
తుని రూరల్: రక్తదానంపై యువతలో అవగాహన, చైతన్యం తీసుకువచ్చే లక్ష్యంతో సేవ్ బ్లడ్ పేరుతో తుని మండలం టి.తిమ్మాపురానికి చెందిన ఆకేటి బుజ్జిబాబు శుక్రవారం సాయంత్రం సైకిల్ యాత్ర చేపట్టాడు. తుని మండలం వి.కొత్తూరు సమీపంలోని పెట్రోల్ బంకులో రాత్రి బస చేశాడు. ఈ సందర్భంగా బుజ్జిబాబు మాట్లాడుతూ, నాలుగు నెలల పాటు తన యాత్ర కొనసాగుతుందన్నారు. రక్తదానం వలన ఎంతో మంది ప్రాణాలు కాపాడవచ్చని, దీనివలన ఎటువంటి నష్టమూ లేదని యువతకు అవగాహన కల్పించడమే తన యాత్ర ముఖ్య ఉద్దేశమన్నారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ అవతరణకు ప్రధాన కారకుడైన పొట్టి శ్రీరాములు త్యాగాన్ని కూడా నేటి తరానికి తెలియజేస్తానన్నారు. పట్టణాలు, ప్రధాన గ్రామాల్లో తన యాత్ర కొనసాగుతుందని తెలిపారు. గతంలో బాలికలను, పక్షులను, మొక్కలను, జంతువులను రక్షించాలన్న నినాదంతో దేశంలోని 28 రాష్ట్రాల్లో 8 నెలల పాటు సైకిల్ యాత్ర చేశానన్నారు. అలాగే, కోల్కతాలో దాడికి గురైన మెడికో మోహితకు న్యాయం జరగాలని విజయవాడ నుంచి కోల్కతాకు 1,400 కిలోమీటర్ల పాదయాత్ర చేశానన్నారు. నేపాల్లో అన్నపూర్ణ బేస్ క్యాంపు నుంచి 4,130 మీటర్ల ఎత్తయిన శిఖరాన్ని అధిరోహించి, జాతీయ జెండాను ఎగురవేశానని బుజ్జిబాబు తెలిపారు. -
హోటళ్ల నిర్మాణాన్ని ప్రోత్సహించాలి
రాజమహేంద్రవరం సిటీ: పర్యాటకపరంగా జిల్లాలో హోటళ్ల నిర్మాణాన్ని ప్రోత్సహించేందుకు ఆసక్తి ఉన్నవారిని గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, జోనల్ స్పెషల్ అధికారి అజయ్ జైన్ అన్నారు. జిల్లా ప్రగతి, ప్రభుత్వ ప్రాధాన్యం కార్యక్రమాల అమలు, సమస్యలు, పరిష్కారం తదితర అంశాలపై శుక్రవారం ఇక్కడ నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. రాజమహేంద్రవరంతో పాటు జిల్లాలో 5 వేల హోటల్ రూములు అందుబాటులోకి తీసుకుని రావాలన్నారు. 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. వాట్సాప్ గవర్నెన్స్ నంబర్ 95523 00009పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని అన్నారు. పీఎం సూర్యఘర్ పథకానికి ఎస్సీ, ఎస్టీ కుటుంబాలను గుర్తించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ, వ్యవసాయ రంగంలో 15.57 శాతం, హార్టికల్చర్ 16.33, పశు సంవర్ధక శాఖ 19.76, అటవీ రంగం 0.16, మత్స్య రంగం 2.92, తయారీ రంగం 7.93, వనరులు, నిర్మాణ రంగంలో 8.36 శాతం చొప్పున వృద్ధి రేటు సాధించేలా చర్యలు తీసుకోనున్నామని వివరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు, మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడుతున్న అజయ్ జైన్ -
భద్రాచలానికి ప్రత్యేక బస్సులు
రాజమహేంద్రవరం సిటీ: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం ఆర్టీసీ డిపో నుంచి భద్రాచలానికి ఏడు ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు డిపో మేనేజర్ షేక్ షబ్నం శుక్రవారం తెలిపారు. 5వ తేదీ సాయంత్రం నాలుగు గంటల నుంచి ప్రతి గంటకు ఒక స్పెషల్ బస్సు నడిచేలా ఏర్పాట్లు చేశామన్నారు. భక్తుల సౌకర్యార్థం వీటికి రిజర్వేషన్ సౌకర్యం కల్పించామన్నారు. సీతారాముల కల్యాణం అనంతరం భద్రాచలం నుంచి 6వ తేదీ ఒంటి గంట నుంచి తిరిగి రాజమహేంద్రవరానికి ప్రత్యేక బస్సులు వస్తాయన్నారు. నేటి నుంచి రబీ ధాన్యం సేకరణ జేసీ చిన్నరాముడు రాజమహేంద్రవరం సిటీ: జిల్లాలోని 216 రైతు సేవా కేంద్రాల్లో శనివారం నుంచి రబీ ధాన్యం సేకరణ ప్రారంభిస్తున్నామని జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లావ్యాప్తంగా 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కామన్ వైరెటీకి రూ.2,300, గ్రేడ్–ఎ రకానికి రూ.2,320 చొప్పున కనీస మద్దతు ధర చెల్లిస్తామన్నారు. హమాలీ, గోనెసంచులు, రవాణా చార్జీలను ప్రభుత్వం ద్వారా చెల్లిస్తామన్నారు. రైతుల సౌకర్యార్థం రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కోసం 216 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు, 216 మంది టెక్నికల్ అసిస్టెంట్లు, 216 మంది హెల్పర్లను తాత్కాలికంగా నియమించామని తెలిపారు. ధాన్యం కొనుగోలు విషయమై సందేహాలు, ఫిర్యాదులకు కలెక్టరేట్లో 83094 87151 నంబరుతో కంట్రోల్ రూము ఏర్పాటు చేశామన్నారు. ఇది ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ అందుబాటులో ఉంటుందని జేసీ చిన్నరాముడు తెలిపారు. స్లాట్ బుకింగ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో (ఒరిజినల్ బ్రాంచి) స్లాట్ బుకింగ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా రిజిస్ట్రార్ ఆర్.సత్యనారాయణ అన్నారు. కార్యాలయంలో స్లాట్ బుక్ చేసుకున్న కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆయన శుక్రవారం ప్రారంభించారు. రిజిస్ట్రేషన్ అనంతరం దస్తావేజులను రాష్ట్ర క్రెడాయ్ చైర్మన్ బుడ్డిగ శ్రీనివాస్కు జిల్లా రిజిస్ట్రార్ ఆర్.సత్యనారాయణ, జాయింట్ సబ్ రిజిస్ట్రార్–1, 2లు ఆర్.రాంబాబు, కె.పుల్లంరాజు అందజేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ, స్లాట్ బుకింగ్ను పబ్లిక్ డేటా ఎంట్రీ విధానం ద్వారా, రిజిస్ట్రేషన్.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్సైట్ ద్వారా, క్యూఆర్ కోడ్ ద్వారా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటుందని వివరించారు. ఈ విధానం వలన కక్షిదారులు వేచి ఉండే సమయం, మధ్యవర్తుల ప్రభావం తగ్గుతాయని చెప్పారు. ప్రస్తుతం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో మాత్రమే ఈ విధానం అమలు చేస్తున్నామని, దశలవారీగా మిగిలిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా అమలు చేస్తామని సత్యనారాయణ తెలిపారు. స్లాట్ బుకింగ్ ద్వారా తొలి రోజు 42 రిజిస్ట్రేషన్లు చేశామని జాయింట్ సబ్ రిజిస్ట్రార్–1 రాంబాబు తెలిపారు. పెళ్లి పీటలు ఎక్కే వేళ.. మృత్యుఘాతం గండేపల్లి/జగ్గంపేట: కొద్ది రోజుల్లో పెళ్లి.. నేడు పుట్టిన రోజు.. ఈ నేపథ్యంలో కొత్త దుస్తులు కొనుక్కుని.. ఎంతో ఆనందంగా తిరిగి వస్తున్న ఆ యువకుడిపై మృత్యువు కన్నెర్ర చేసింది. గండేపల్లి మండలం మల్లేపల్లికి చెందిన చిక్కాల కాటమస్వామి, సావిత్రి దంపతులకు కుమార్తె, కుమారుడు చిక్కాల శ్రీను (28) ఉన్నారు. కుమార్తెకు గతంలోనే వివాహం చేశారు. శ్రీను ట్రాక్టర్ డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. తండ్రి కాటమ స్వామి వ్యవసాయం చేస్తున్నారు. శ్రీనుకు గోకవరం మండలం మల్లవరానికి చెందిన అమ్మాయితో ఈ నెల 20న వివాహం చేయాలని నిశ్చయించారు. శనివారం శ్రీను పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో పుట్టిన రోజు, పెళ్లి వేడుకలకు దుస్తులు కొనుగోలు చేసేందుకు స్నేహితుడితో కలిసి, శ్రీను మోటార్ సైకిల్పై శుక్రవారం పెద్దాపురం వెళ్లాడు. అక్కడ మిత్రులిద్దరూ కొత్త దుస్తులు కొనుకున్నారు. సాయంత్రం ఆనందంగా ఇంటికి తిరిగి వస్తూండగా, వారి బైక్ను జగ్గంపేట మండలం కాట్రావులపల్లి పెట్రోల్ బంకు వద్ద వెనుక నుంచి వస్తున్న లారీ వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో శ్రీను (28) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. మోటార్ సైకిల్పై ఉన్న స్నేహితుడు స్వల్పంగా గాయపడ్డాడు. పెళ్లి సమీపిస్తున్న వేళ.. పుట్టిన రోజుకు ఒక రోజు ముందు శ్రీను రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ ఇంట్లో విషాదం నెలకొంది. -
విచిత్రకళా ప్రదర్శన
ప్రదర్శనలో కానరాని జనం● పేలవంగా ముగిసిన కార్యక్రమం ● తమకు ఒరిగిందేమీ లేదని చిత్రకారుల ఆవేదన సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ‘అమరావతి వీధి చిత్రకళా ప్రదర్శన’ పేరిట సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంలో శుక్రవారం అట్టహాసంగా నిర్వహించిన కార్యక్రమం నగర వాసులను నిరాశకు గురి చేసింది. నగరంలోని జైలు రోడ్డులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దేశంలోని 500 మంది చిత్రకారులు పాల్గొంటారని, అనేక చిత్రాలు ప్రదర్శిస్తారని చెప్పారు. తీరా చూస్తే కూటమి నాయకుల ఆర్భాటమే కనిపించింది. చిత్రకారులను ప్రోత్సహించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని కనీసం మూడు రోజులైనా నిర్వహించి ఉంటే నగర ప్రజలకు తెలిసి ఉండేది. కేవలం ఒక్క రోజు మాత్రమే నిర్వహించడంతో అసలు ఈ ప్రదర్శన ఉందనే విషయమే చాలా మందికి తెలియలేదు. దీంతో ఆశించిన స్థాయిలో జనం రాక ప్రదర్శన వెలవెలబోయింది. చివరకు స్కూల్ పిల్లలను తీసుకుని వచ్చి, మమ అనిపించారు. మధ్యాహ్నం నుంచి ఎండ వేడి, ఉక్కపోతతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరయ్యారు. సాయంత్రం కాస్త చల్లబడిన తరువాత కొద్ది మంది ఈ చిత్ర కళా ప్రదర్శనను వీక్షించడానికి వచ్చారు. కొంతమంది మెహందీ పెట్టించుకొని వెళ్లిపోయారు. ఈ ప్రదర్శనలో ఆశించిన స్థాయిలో విక్రయాలు లేవని స్టాల్స్ వద్ద చిత్రాలు పెట్టిన చిత్రకారులు ఆవేదన చెందుతున్నారు. అనేక వ్యయ ప్రయాసలతో ఎక్కడెక్కడి నుంచో వచ్చామని, తీరా చూస్తే ఇక్కడ కొనుగోళ్లు నిరాశపరిచాయని చెప్పారు. ట్రాఫిక్ మళ్లింపుతో ఇబ్బందులు నగరంలోని సెంట్రల్ జైలు రోడ్డు చాలా రద్దీగా ఉంటుంది. ఇటువంటి రోడ్డుకు ఇరువైపులా చిత్రకళా ప్రదర్శన స్టాల్స్ ఏర్పాటు చేశారు. దీనికోసం ఈ మార్గంలో వాహనాల రాకపోకలను నియంత్రించారు. లాలాచెరువు మీదుగా వచ్చే వాహనాలను లాలాచెరువు హైవే నుంచి మోరంపూడి సెంటర్ మీదుగా మళ్లించారు. అలాగే, కంబాలచెరువు నుంచి వచ్చే వాహనాలను కోరుకొండ రోడ్డు మీదుగా మళ్లించారు. దీంతో ప్రజలు నానా అవస్థలూ పడ్డారు. కార్యక్రమంలో శాసన సభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు, రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ పి.ప్రశాంతి, ఎస్పీ నరసింహ కిషోర్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత, ఏపీ స్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ చైర్పర్సన్ తేజస్వి, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాసు, బత్తుల బలరామకృష్ణ, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్జైన్, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.ఇదో వి‘చిత్రం?’ సీఎం చంద్రబాబు స్వయంగా గీశారంటూ చెబుతున్న ఓ చిత్రాన్ని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు రూ.1,01,116కు ఈ చిత్రకళా ప్రదర్శనలో కొనుగోలు చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. చంద్రబాబు అత్యద్భుతంగా గీసినదంటూ బుద్ధుడి చిత్రపటాన్ని ఈ ప్రదర్శనలో ఉంచగా.. దానిని డిప్యూటీ స్పీకర్ కొనుగోలు చేశారు. వాస్తవానికి ఆ చిత్రాన్ని కర్నూలుకు చెందిన వేరే చిత్రకారుడు గీశాడు. దానిపై చంద్రబాబు సంతకం చేసినందుకుగానూ డిప్యూటీ స్పీకర్ రూ.లక్షకు పైగా వెచ్చించి కొనుగోలు చేయడం సందర్శకులను నివ్వెరపరచింది. -
వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధం
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): వక్ఫ్ సవరణ బిల్లు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని ఏపీ మైనార్టీ, ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ షేక్ నిజాం గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ బిల్లుకు టీడీపీ, జనసేన మద్దతిచ్చి, చేయాల్సిందంతా చేసేసి, ముస్లిం సమాజానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారని పేర్కొన్నారు. వక్ఫ్ కమిటీల్లో అన్య మతస్తులకు కూడా చోటు కల్పించారన్నారు. కలెక్టర్లకు తుది నిర్ణయం ఉండదని చెబుతూనే ఉన్నత స్థాయి అధికారులను నియమిస్తామనడంలో మతలబు ఏమిటని ప్రశ్నించారు. ఉన్నతాధికారులు కూడా ఆయా ప్రభుత్వాల చెప్పుచేతల్లో ఉంటారని, వారి కనుసైగల్లోనే విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఇలాంటి అంశాలను టీడీపీ మైనారిటీ నాయకులు, ఎమ్మెల్యేలు సమర్ధించడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. అల్లాహ్ పట్ల భయం ఉంటే టీడీపీలోని ముస్లిం నాయకులు వెంటనే ఆ పార్టీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు బీజేపీతో జత కట్టడాన్ని నిరసిస్తూ 1997లో బషీరుద్దీన్ బాబూఖాన్ తన పదవికి రాజీనామా చేశారని గుర్తు చేశారు. అదే విధంగా మైనారిటీ మంత్రి ఫరూక్, ప్రభుత్వ సలహాదారు షరీఫ్, ఎమ్మెల్యేలు, చైర్మన్లు, ఇతర నాయకులు తమ పదవులకు రాజీనామా చేయాలని నిజాం డిమాండ్ చేశారు. లంచం అడిగితే సమాచారం ఇవ్వండి కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రభుత్వాధికారులు లంచం అడిగినట్లు, అవినీతికి పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని ఆ శాఖ రాజమహేంద్రవరం రేంజ్ డీఎస్పీ ఎం.కిశోర్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తనకు 9440 44 6161, జిల్లా ఏసీబీ ఇన్స్పెక్టర్ ఎన్వీ భాస్కరరావుకు 9440 44 6160, కాకినాడ జిల్లా ఇన్స్పెక్టర్ డి.వాసుకు 83329 71041, కోనసీమ జిల్లా ఇన్స్పెక్టర్ వై.సతీష్కు 9440 44 6163, ఏసీబీ రాజమహేంద్రవరం రేంజ్ కార్యాలయానికి 0883–2467833 ఫోన్ నంబర్లలో సమాచారం ఇవ్వవచ్చని వివరించారు. 9వ తేదీ వరకూ అభ్యంతరాల స్వీకరణ కంబాలచెరువు: ఉపాధ్యాయుల సాధారణ సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలను ఈ నెల 9వ తేదీ సాయంత్రం వరకూ స్వీకరిస్తామని డీఈవో కె.వాసుదేవరావు గురువారం తెలిపారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లా పాఠశాల విద్యాశాఖ పరిధిలో ప్రభుత్వ జిల్లా పరిషత్, మండల పరిషత్ మునిసిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సాధారణ సీనియారిటీ జాబిత ఉపాధ్యాయ సమాచార వ్యవస్థ ఆధారంగా రూపొందించామన్నారు. ఈ జాబితాల వివరాలు సంబంధిత పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లా పాఠశాల విద్యాశాఖ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.డీఈవోఏలూరు.ఆర్గ్ వెబ్సైట్, నోటీసు బోర్డులో ఈ నెల 3వ తేదీ నుంచి ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో అభ్యంతరాలను 9వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు ఏలూరులోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలన్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 15,500 గటగట (వెయ్యి) 14,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 14,500 గటగట (వెయ్యి) 13,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
గందరగోళంగా టెన్త్ మూల్యాంకనం
● తాగునీరు కూడా లేదని ఆరోపణ ● సరిపడా సబ్జెక్టు టీచర్లు లేక ఆగిన ప్రక్రియ కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లావ్యాప్తంగా పదో తరగతి మూల్యాంకనం రాజమహేంద్రవరం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం ప్రారంభమైంది. ఈ ప్రక్రియలో తొలి రోజే గందరగోళం నెలకొంది. సౌకర్యాల లేమి కొట్టొచ్చినట్లు కనిపించింది. మూల్యాంకనానికి 101 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 630 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 200 మంది ప్రత్యేక సిబ్బందిని నియమించారు. అయితే హిందీ, సోషల్ విభాగంలో సబ్జెక్టు టీచర్లు పూర్తి స్థాయిలో రాలేదు. దీంతో, ఆ పేపర్ల మూల్యాంకనం అంతంత మాత్రంగానే జరిగింది. మ్యాథ్స్, పీఎస్, ఎన్ఎస్ టీచర్లు సరిపడా స్థాయిలో రిపోర్టు చేసినా, మిగిలిన టీచర్లను సాయంత్రం వరకూ రిలీవ్ చేయలేదు. దీంతో వారు నిరసన తెలిపారు. మూల్యాంకనానికి వచ్చిన ఉపాధ్యాయులు వసతులు లేక నానా అవస్థలూ పడ్డారు. మహిళా ఉపాధ్యాయుల పరిస్థితి అయితే ఇక చెప్పక్కరనేలేదు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని ఉపాధ్యాయులు ఆరోపించారు. అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు హాజరైనా వారందరికీ ఒకే టెంట్ వేశారు. అది చాలకపోవడంతో చాలా మంది చెట్ల కింద, ఇతర ప్రాంతాల్లోను గడిపారు. తాగేందుకు మంచినీరు సైతం ఏర్పాటు చేయలేదు. శ్రీరామ నవమి వేడుకలకు శ్రీకారంఅన్నవరం: రత్నగిరి క్షేత్ర పాలకుడు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి శ్రీరామ నవమి వేడుకలకు శ్రీకారం చుట్టారు. రత్నగిరిపై రామాలయం వద్ద గురువారం ఉదయం పండితులు పందిరి రాట వేశారు. తొలుత పందిరి రాటకు పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, పూలతో అలంకరించి, పూజలు చేశారు. అనంతరం సుస్వర వేద మంత్రోచ్చారణ నడుమ రాట వేశారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు, అసిస్టెంట్ కమిషనర్ రామ్మోహనరావు తదితరులు పందిరి రాటకు పూజలు చేశారు. కార్యక్రమంలో వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠి, సత్యదేవుని ఆలయ ప్రధానార్చకుడు ఇంద్రగంటి నరసింహమూర్తి, రామాలయ అర్చకుడు దేవులపల్లి వరప్రసాద్, స్పెషల్ గ్రేడ్ వ్రత పురోహితుడు చామర్తి కన్నబాబు, పురోహితుడు పాలంకి పట్టాభి తదితరులు పాల్గొన్నారు. రేపటి నుంచి శ్రీరామ నవమి వేడుకలు ఈ నెల ఐదో తేదీ నుంచి 13వ తేదీ వరకూ తొమ్మిది రోజుల పాటు శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. సీతారాముల కల్యాణ మహోత్సవాలను సాక్షాత్తూ సత్యదేవుడు, అమ్మవారు పెళ్లిపెద్దలుగా వ్యవహరించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నెల 5వ తేదీ సాయంత్రం 4 గంటలకు సీతాదేవి, శ్రీరామచంద్రమూర్తిని వధూవరులుగా అలంకరించడంతో శ్రీరామ నవమి వేడుకలు ప్రారంభమవుతాయి. శ్రీరామ నవమి సందర్భంగా ఆరో తేదీ ఉదయం 10 గంటల నుంచి సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహిస్తారు. 7న ప్రత్యేక పూజలు, 8న పండిత సదస్యం, 9, 10 తేదీల్లో సీతారాములకు ప్రత్యేక పూజలు, 11న సీతారాముల వనవిహారోత్సవం, 12న శ్రీచక్రస్నానం, దండియాడింపు నిర్వహిస్తారు. 13వ తేదీ రాత్రి రామాలయంలో నిర్వహించే శ్రీపుష్పయాగంతో కార్యక్రమాలు ముగుస్తాయి. -
వ్యాపారులకే ధాన్యం
సాక్షి, రాజమహేంద్రవరం: జిల్లావ్యాప్తంగా రబీ వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం ఈ నెల 2వ తేదీ నాటికి 3,046 హెక్టార్లలో పూర్తయి 5 శాతం పైగా లక్ష్యాన్ని అధిగమించాయి. గురువారం నాటికి సుమారు 5 వేల హెక్టార్లలో కోతలు పూర్తయినట్లు సమాచారం. మరో వారం, పది రోజుల్లో వరి కోతలు మరింతగా పుంజుకునే అవకాశం ఉంది. ఇటువంటి తరుణంలో రైతులకు అండగా ఉండాల్సిన కూటమి ప్రభుత్వం.. ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదు. పైగా ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయో కూడా తెలియని పరిస్థితి తలెత్తింది. మరోవైపు ధాన్యానికి గిట్టుబాటు ధర సైతం ప్రకటించ లేదు. 58,586 హెక్టార్లలో.. జిల్లా వ్యాప్తంగా రబీలో వరి సాధారణ విస్తీర్ణం 60,042 హెక్టార్లు. రైతులు ఈ ఏడాది 58,586 హెక్టార్లలో సాగు చేశారు. గత ఏడాది ఎకరాకు 50 బస్తాల (బస్తాకు 75 కిలోలు) ధాన్యం చొప్పున 4.60 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. ప్రస్తుతం దిగుబడి తగ్గే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. సాగునీటి ఎద్దడి, తెగుళ్లు తదితర విపత్తుల కారణంగా ఎకరానికి 40 నుంచి 45 బస్తాల వరకూ మాత్రమే దిగుబడి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. సాగు పెట్టుబడులు పెరగడం.. దిగుబడి తగ్గడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. వ్యాపారుల పాగా ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాకపోవడంతో దళారులు, ప్రైవేటు వ్యాపారులు రంగప్రవేశం చేస్తున్నారు. కోతలు పూర్తి చేసిన రైతుల పొలాల వద్దకు నేరుగా వెళ్లి.. వారి నుంచి వారు తక్కువ ధరకే ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. అక్కడి నుంచే మిల్లులకు తరలించేస్తున్నారు. ఈ క్రమంలో దళారులు, వ్యాపారులు నిర్ణయించిన ధరకే అమ్ముకోవాల్సి రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో ధర తక్కువని తెలిసినా గత్యంతరం లేక వాళ్లకే విక్రయిస్తున్నారు. యంత్రాలతో కోతలు జిల్లా వ్యాప్తంగా సీతానగరం, రాజమహేంద్రవరం రూరల్, రంగంపేట, కోరుకొండ, రాజానగరం, గోకవరం, గోపాలపురం మండలాల్లో వరి కోతలు వేగవంతంగా సాగుతున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో సైతం ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కూలీల రేట్లు అధికంగా ఉండటంతో ఎక్కువ మంది రైతులు వరి కోత యంత్రాల పైనే ఆధారపడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 75 నుంచి 80 శాతం రైతులు యంత్రాల ద్వారానే కోతలు చేపడుతున్నారు. ధాన్యం వేగంగా ఇంటికి చేర్చుకునేందుకు యంత్రాలు దోహదపడుతూండటంతో అధిక శాతం రైతులు వీటి వైపు మొగ్గు చూపుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో కోతల వెంటే కొనుగోళ్లు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యం కల్పించారు. సార్వత్రిక ఎన్నికల హడావుడి ఉన్నా.. రైతులకు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా ఏప్రిల్ 1వ తేదీ నాటికే రైతు భరోసా కేంద్రాల్లో 231 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిని ప్రారంభించిన వెంటనే కొనుగోళ్లకు నాంది పలికారు. ఈ ప్రక్రియకు ముందుగానే ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. క్వింటాల్కు రూ.143 పెంచింది. కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేసింది. జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా వరి కోతలు ఇప్పటికే 5 వేల హెక్టార్లలో పూర్తి నేటికీ ప్రారంభం కాని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు మరో 10 రోజులు పట్టే అవకాశం గిట్టుబాటు ధర సైతం ప్రకటించని సర్కారు ప్రణాళికేదీ..? రబీ కోతలు విస్తృతంగా సాగుతున్నా.. ధాన్యం కొనుగోలు దిశగా ప్రణాళికలు రూపొందించడంలో ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుత రబీలో జిల్లావ్యాప్తంగా 4 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికార యంత్రాంగం చెబుతోంది. ప్రైవేటు అవసరాలకు పోనూ.. 216 ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే, మద్దతు ధరపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టతా రాకపోవడంతో కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ప్రారంభించాలనే విషయం అంతుచిక్కని ప్రశ్నగా మారుతోంది. మద్దతు ధర ప్రకటించడం, కేంద్రాలు సిద్ధం చేయడం, తేమ శాతం కొలిచే యంత్రాలు, గోనెసంచులు ఏర్పాటు చేసుకోవాలంటే మరో 10 నుంచి 15 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటికి జిల్లాలో 25 శాతం పైగా కోతలు పూర్తయ్యే అవకాశాలున్నాయి. దీనినిబట్టి ఎక్కువ మొత్తంలో ధాన్యాన్ని దళారులు, వ్యాపారులు కొనుగోలు చేస్తే.. ప్రభుత్వం ఏం కొంటుందనే ప్రశ్న తలెత్తుతోంది.జిల్లాలో వరి కోతల విస్తీర్ణం (హెక్టార్లలో) మండలం వరి సాగు కోతలు శాతం సాధారణ విస్తీర్ణం సాగు రాజమహేంద్రవరం రూరల్ 1,170 1,299 720 55.4 రాజానగరం 3,549 3,229 320 9.9 కోరుకొండ 2,167 2,251 325 14.4 గోకవరం 1,840 1,989 30 1.5 సీతానగరం 2,891 4,443 1,600 36.0 రంగంపేట 980 849 38 4.5 గోపాలపురం 2,072 2,221 10 0.5 తాళ్లపూడి 3,546 3,602 2 0.1 -
అవగాహన సదస్సుకు అనూహ్య స్పందన
తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు రాజమహేంద్రవరం రూరల్: కాతేరులో తిరుమల విద్యాసంస్థల ప్రాంగణంలో గురువారం జరిగిన అవగాహన సదస్సుకు విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి అనూహ్య స్పందన లభించిందని తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు అన్నారు. ఈ సదస్సుకు 18 వేలమంది హాజరయ్యారని ఆయన తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా దృఢంగా ఉండేలా సన్నద్ధం చేయాలని, అప్పుడే వారు వృద్దులోకి వస్తారన్నారు. జాతీయస్థాయి పరీక్షలైన జేఈఈ (మెయిన్), జేఈఈ (అడ్వాన్స్డ్) అండ్ నీట్లలో తరచుగా విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రస్తుత సమాజంలో పిల్లలు పుస్తకాలకన్నా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్కి ఎక్కువగా అలవాటు పడ్డారని, మొబైల్తో ఎక్కువ సమయం గడిపితే జరిగే నష్టం గురించి తల్లిదండ్రులు వివరించాలని తెలిపారు. పిల్లలకు ఇచ్చే ఆస్తి కేవలం విద్య మాత్రమేనని, తల్లిదండ్రులు ఎంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో దేశవ్యాప్తంగా జరిగే ఇంజినీరింగ్ (జేఈఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్)పరీక్షలలో 25మంది పరీక్ష రాస్తే కేవలం ఒక్కరికి మాత్రమే సీటు దొరుకుతుందని అదే తిరుమలలో ప్రతి నలుగురిలో ఒకరికి సీటు లభిస్తోందని చెప్పారు. మెడికల్లో దేశవ్యాప్తంగా జరిగే నీట్ పరీక్షల ప్రకారం 16మంది పరీక్ష రాస్తే కేవలం ఒకరికి సీటు లభిస్తుందని, అదే తిరుమలలో ప్రతి ముగ్గురిలో ఒకరికి మెడికల్ సీటు వస్తుందన్నారు. తిరుమల విద్యాసంస్థల డైరెక్టర్ నున్న సరోజినిదేవి మాట్లాడుతూ పిల్లలకు తల్లిదండ్రులే మొదటి గురువులని వారిని చూసే ఎక్కువగా నేర్చుకుంటారని, కాబట్టి పిల్లల నడవడికను చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు తీర్చిదిద్దాలని అన్నారు. విజ్ఞానభారతి నేషనల్ సెక్రటరీ కొంపెల్ల సుబ్బరాయశాస్త్రి మాట్లాడుతూ పిల్లలు పుస్తకాలను ఎక్కువగా చదవాలని అప్పుడే వారికి జ్ఞాన సముపార్జన లభిస్తుందని అన్నారు. అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరి పాల్గొన్నారు. -
సాంకేతిక లోపంతో ఇసుక రవాణాకు బ్రేక్
కొవ్వూరు: ఇసుక రవాణాలో బిల్లులు ఇచ్చే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం గురువారం నుంచి కొత్తగా ప్రారంభించింది. దీనికి సంబంధించిన పరికరాలు మధ్యాహ్నం వరకూ పని చేయకపోవడంతో ఇసుక రవాణాకు బ్రేక్ పడింది. ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ పరికరాలు పని చేయలేదు. దీంతో ఇసుక రవాణాకు వచ్చిన వాహనాలన్నీ ర్యాంపుల్లోనే నిలిచిపోయాయి. కొత్త విధానం ప్రకారం ఇసుక రవాణాకు వచ్చే వాహనానికి ముందుగా ఫొటో తీసి, వివరాలు రిజిస్ట్రేషన్ చేయాలి. లోడింగ్ అనంతరం మరోసారి ఫొటో తీసి అప్లోడ్ చేయాలి. అనంతరం బిల్లు జనరేట్ చేయాలి. వాడపల్లి ర్యాంపులో ఈ విధంగా మొదటి బిల్లు తీసిన తరువాత రెండో బిల్లు రాలేదు. దీంతో ఇసుక రవాణాకు వచ్చిన వాహనాలన్నీ వెనుతిరిగి వెళ్లిపోయాయి. కుమారదేవం ఓపెన్ రీచ్లో సాయంత్రం వరకూ బిల్లులు రాలేదు. ఔరంగబాద్, ఏరినమ్మ, ఔరంగబాద్–2, కొవ్వూరు, ఆరికిరేవుల, దండగుండరేవుల ర్యాంపుల్లోనూ ఇదే సమస్య ఎదురైంది. దీంతో దూర ప్రాంతాల నుంచి ఇసుక కోసం వచ్చిన వాహనదారులు వెనుతిరిగారు. వాడపల్లి, కుమారదేవం ర్యాంపుల వద్ద లారీలు భారీగా బారులు తీరాయి. కొన్ని ర్యాంపుల్లో ఇసుక లోడింగ్ చేసుకుని బిల్లుల కోసం కొద్దిసేపు నిరీక్షించారు. చివరకు పరికరంలో సాంకేతిక లోపాల కారణంగా బిల్లులు రాకపోవడంతో ఇసుక రవాణాకు బ్రేక్ పడింది. నూతన పాలసీలో వీఆర్ఓ లాగిన్ కావాల్సి ఉంటుందని చెబుతున్నారు. శుక్రవారం నుంచి కొత్త విధానం పని చేయవచ్చునని అధికారులు చెప్పారు. -
రూ.171.33 కోట్లతో అన్నవరం దేవస్థానం బడ్జెట్
అన్నవరం: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గానూ అన్నవరం వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి రూ.171.33 కోట్లతో వార్షిక బడ్జెట్ను ఆమోదిస్తూ రాష్ట్ర దేవదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఇందులో నిర్వహణ వ్యయం కింద రూ.46.25 కోట్లు, వివిధ కొనుగోళ్లకు రూ.31.20 కోట్లు, సీజీఎఫ్, ఆడిట్ ఫీజు ఇతర చెల్లింపులకు రూ.23 కోట్లు, భక్తుల సదుపాయాలకు రూ.7.64 కోట్లు, స్వామివారి కల్యాణ, ఇతర ఉత్సవాలకు రూ.1.5 కోట్ల చొప్పున కేటాయించారు. కేటాయింపులు ఇలా.. ● సిబ్బంది జీతాలకు రూ.18 కోట్లు, అర్చకులు, వేద పండితుల జీతాలకు రూ.6 కోట్లు, విశ్రాంత ఉద్యోగుల పెన్షన్లకు రూ.13.50 కోట్లు, కాంట్రాక్ట్, కన్సాలిడేటెడ్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలకు రూ.9 కోట్లు. ● ప్రసాదం తయారీలో వాడే నెయ్యి, పంచదార, గోధుమ నూక, వంట గ్యాస్ తదితర కొనుగోళ్లకు రూ.25 కోట్లు, వ్రతాలు, ఇతర ఆర్జిత సేవలకు అవసరమయ్యే సరకుల కొనుగోళ్లకు రూ.5 కోట్లు, ఇతర పూజా సామగ్రి కొనుగోళ్లకు రూ.1.15 కోట్లు. ● వ్రత పురోహితులకు చెల్లించే పారితోషికాలకు రూ.16 కోట్లు, ప్రసాదం ప్యాకర్లకు రూ.2.10 కోట్లు, నాయీబ్రాహ్మణులకు రూ.1.60 కోట్లు. ● దేవస్థానంలో శానిటేషన్కు రూ.7.50 కోట్లు, షామియానా, పందిళ్లకు రూ.14 లక్షలు. ● ఎలక్ట్రికల్ వర్క్స్, వాటర్ సప్లై తదితర వాటికి రూ.1.55 కోట్లు, సోలార్ ప్లాంట్ నిర్వహణకు రూ.10 లక్షలు. ● దేవస్థానం నిర్వహిస్తున్న విద్యాసంస్థలకు రూ.3.75 కోట్లు, దత్తత ఆలయాల నిర్వహణకు రూ.90 లక్షలు, ఆగమ పాఠశాలకు రూ.30 లక్షలు, దేవస్థానం ఆసుపత్రి నిర్వహణ, మందుల కొనుగోలుకు రూ.8 లక్షలు. ● స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్కు రూ.2.25 కోట్లు, సెక్యూరిటీ గార్డులకు రూ.2 కోట్లు, హోం గార్డులకు రూ.1.10 కోట్లు. ● సీజీఎఫ్ తదితర చెల్లింపులకు రూ.7.20 కోట్లు, సెక్షన్–65 ఈఏఎఫ్ కింద రూ.10 కోట్లు, ఆడిట్ ఫీజు రూ.1.20 కోట్లు, అర్చక సంక్షేమ నిధికి రూ.2.4 కోట్లు, ప్రభుత్వ ట్యాక్స్లకు రూ.2.5 కోట్లు. ● ఇంజినీరింగ్ పనులకు రూ.4 కోట్లు, ఎలక్ట్రికల్ సామగ్రి కొనుగోళ్లకు రూ.కోటి, కొత్త వాహనాల కొనుగోలుకు రూ.కోటి. ● సిబ్బందికి వివిధ అడ్వాన్స్లు, రుణాలకు రూ.70 లక్షలు. ● కొత్త డిపాజిట్లు రూ.3 కోట్లు. మెచ్యూర్ అయిన డిపాజిట్లు తిరిగి జమ చేయడానికి రూ.కోటి, ఈఎండీ చెల్లింపులు రూ.కోటి. -
5, 6 తేదీల్లో రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలు
రాజమహేంద్రవరం సిటీ: ఆంధ్రప్రదేశ్ అమెచ్యుర్ రెజ్లింగ్ అసోసియేషన్ సహకారంతో రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ ఆధ్వర్యంలో ఈ నెల 5,6 తేదీల్లో రాష్ట్రస్థాయి కుస్తీ పోటీలు నిర్వహిస్తున్నట్లు రాజమహేంద్రవరం చార్టర్ అధ్యక్షుడు తీగెల రాజా, ఐకాన్స్ క్లబ్ అధ్యక్షుడు ఇమ్మణి వెంకట్ చెప్పారు. గురువారం రాజమహేంద్రవరం క్లబ్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాదిలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ కుస్తీ పోటీలను తమ క్లబ్ తరఫున రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్నామన్నారు. ఈ కుస్తీ పోటీలను దక్షిణాదిలో కూడా పరిచయం చేయాలనే ఆశయంతో ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరంలో తొలిసారిగా నిర్వహిస్తున్నామన్నారు. అండర్–15 బాలబాలికలకు, అండర్–20 పురుషులు, మహిళలకు రాష్ట్ర స్థాయిలో రెజ్లింగ్ పోటీలు ఏర్పాటు చేశామన్నారు. సుమారు 300 మంది రెజ్లర్స్ హాజరవుతారని చెప్పారు. ఈ పోటీల విజేతలు ఈ నెల 23న రాజస్థాన్లోని కోటాలో జరిగే జాతీయ స్థాయి కుస్తీ పోటీలకు అర్హత సాధిస్తారని తెలిపారు. క్లబ్ స్పోర్ట్స్ చైర్మన్ మద్దూరి శంకర్ మాట్లాడుతూ రెండు రోజుల పాటు ఈ రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలు దివాన్చెరువు ఎస్వీబీసీ కల్యాణ మండపంలో జరుగుతాయన్నారు. రెజ్లర్లకు ఉచిత భోజన వసతి సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో క్లబ్ కార్యదర్శి ఉదయగిరి సురేష్, కోశాధికారి కామేశ్వరిదేవి, స్పోర్ట్స్ డైరెక్టర్ పి.హెచ్.ఎస్.కార్తీక్, సంయుక్త కార్యదర్శి వంశీ పాల్గొన్నారు. -
చికిత్స పొందుతూ ఎంపీటీసీ సభ్యురాలి భర్త మృతి
ఏలేశ్వరం: గత నెల 20న మండల పరిధిలోని తిరుమాలిలో జరిగిన రోడ్డుప్రమాదంలో గెద్దనాపల్లి ఎంపీటీసీ సభ్యురాలు బొడ్డేటి నాగలక్ష్మి భర్త గోవిందు(39) గురువారం చికిత్స పొందుతూ మృతిచెందారు. పోలీసుల వివరాల ప్రకారం కిర్లంపూడి మండలం గెద్దనాపల్లికి చెందిన గోవింద్ బెల్లం వ్యాపారం కోసం గత నెల 20న మోటారుబైక్పై ఏలేశ్వరం వస్తుండగా మార్గమధ్యలో తిరుమాలి వద్ద ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. చోరీ కేసులో నిందితుడి అరెస్ట్ రాయవరం: ఇటీవల రాయవరం ఆలయంలో పట్టపగలు జరిగిన చోరీ ఘటనలో నిందితుడిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వివరాలను రాయవరం ఎస్సై డి.సురేష్బాబు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. రాయవరం అన్నపూర్ణ సమేత కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారి మెడలో మంగళసూత్రాలు చోరీ చేసిన నిందితుడు తోరాటి సాయివరప్రసాద్ను అరెస్ట్ చేశామన్నారు. రంగంపేట మండలం నల్లమిల్లికి చెందిన సాయివరప్రసాద్ మహేంద్రవాడ్ రోడ్డులో పాత హెచ్పీ గొడౌన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా, నిందితుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుడు సాయివరప్రసాద్ను విచారించగా, నేరం అంగీకరించాడన్నారు. నిందితుడి వద్ద నుంచి బంగారు మంగళసూత్రంతో పాటుగా, బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో చోరీ చేసిన వెండి కిరీటం, వెండి చెవులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై సురేష్బాబు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి అనపర్తి జేఎఫ్సీఎం కోర్టులో హాజరు పర్చగా న్యాయమూర్తి రిమాండ్ విధించారన్నారు. నేరం జరిగిన 48 గంటల్లో కేసును ఛేదించి, నిందితుడిని అరెస్ట్ చేసిన సీఐ దొరరాజు, ఎస్సై సురేష్బాబు, పీసీ జీవీ కుమార్ను జిల్లా ఎస్పీ అభినందించారు. -
అనుమతుల్లేని క్వారీలో యంత్రాల సీజ్
రౌతులపూడి: మండలంలోని ములగపూడిలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న నల్లరాయి క్వారీల్లో మైనింగ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో సర్వే నంబరు–1లో ప్రభుత్వ అనుమతులు పొందకుండా నిర్వహిస్తున్న నల్లరాయిని అధికారులు గుర్తించారు. ఈ క్వారీలో పనిచేస్తున్న ఒక కంప్రెసర్, డ్రిల్లింగ్ మెషీన్, 323 పొక్లెయిన్ను సీజ్చేసి స్వాధీనం చేసుకున్నట్లు మైనింగ్ ఆర్ఐ మురళీకృష్ణ తెలిపారు. స్వాధీనం చేసుకున్న యంత్రాలను స్థానిక రెవెన్యూ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేశామని చెఆప్పరు. ఆర్ఐ పట్నాయక్, వీఆర్ఓ శ్రీను, మైనింగ్ సిబ్బంది పాల్గొన్నారు. -
టోల్ ఎగ్గొట్టేందుకు అడ్డదారులు
కిర్లంపూడి: టోల్ ఫీజులు ఎగ్గొట్టేందుకు అడ్డదారుల్లో గ్రామాల మధ్యలోంచి వెళ్లేందుకు భారీ వాహనాల డ్రైవర్లు వెనుకాడడంలేదు. మండల పరిధి కృష్ణవరంలోని టోల్గేట్ వద్ద ఫీజు ఎగ్గొట్టేందుకు బూరుగుపూడి ఊరు శివారున పొలవరం కాలువ గట్టు మీదుగా కృష్ణవరం ఊరు మధ్యలో నుంచి సుమారు 60–65 టన్నుల ఇసుక లోడుతో నిత్యం వందల సంఖ్యలో భారీ వాహనాలు వెళుతున్నాయి. దీంతో కృష్ణవరంలోని గ్రామస్తులు గురువారం లారీలను అడ్డుకున్నారు. భారీ ఇసుక లారీలు గ్రామం మధ్యలో నుంచి వేగంగా వెళ్లడంతో ఏ సమయాన ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే మార్గంలో ఎంపీపీ ప్రభుత్వ పాఠశాల ఉండడంతో విద్యార్థులకు ఏ ముప్పు వాటిల్లుతుందోనని పలువురు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు సామర్థ్యాన్ని మించి ఇసుక లోడులు వెళ్లడం వల్ల సీసీ రోడ్డు పాడైపోతుందన్నారు. దీంతో పాటు ఇళ్లల్లోకి దుమ్ముధూళీ రావడంతో పాటు ఇళ్ల గోడలు బీటలు వారుతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామాల్లోంచి లారీల రవాణాను ఆపకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. -
బెల్లపు బట్టీలపై విజిలెన్స్ దాడులు
రూ.38 లక్షల విలువైన నాసిరకం బెల్లం, పంచదార స్వాధీనం కొవ్వూరు: వాడపల్లి గ్రామంలో బెల్లం బట్టీలపై విజిలెన్స్ అండ్ ఎన్పోర్సుమెంటు అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. విజిలెన్స్ డీఎస్పీ టి.తాతారావు పర్యవేక్షణలో రెండు బృందాలుగా దాడులు నిర్వహించారు.వాడపల్లి, బంగారమ్మపేట గ్రామాల్లో సుమారు రూ.38లక్షల విలువైన పంచదార కలిపిన నాసిరకం బెల్లం స్వాధీనం చేసుకున్నామన్నారు. వాడపల్లిలో రామాంజనేయ బెల్లం బట్టీ వద్ద బండి శ్రీనివాసరావుకు చెందిన 36,500 కేజీల పంచదార, 2324 కేజీల నాసిరకం బెల్లం స్వాధీనం చేసుకున్నామని సీఐ టి.నాగ వెంకటరాజు తెలిపారు. బంగారమ్మపేటలో ఆనందరావు అనే వ్యక్తి చెందిన బెల్లం బట్టీలో 2,800 కేజీల పంచాదార486 కిలోల నాసిరకం బెల్లం స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. సీఐ మధుబాబు ఈ బృందానికి సారధ్యం వహించారన్నారు. పుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ రుక్కయ్య, లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ ప్రసాద్ ఈ దాడుల్లో పాల్గొన్నారని తెలిపారు. -
మీరు ఏదో మంచి చేస్తారని గెలిపించాం
మలికిపురం: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లు ఏదో చేస్తారని.. రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారనుకుని.. మీరు చేసినా చేయకపోయినా మీ వెనుక ఉండి పార్టీని గ్రామాల్లో అభివృద్ధి పథంలో నడిపే వాళ్లమని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జిల్లా కేశనపల్లి సర్పంచ్, మలికిపురం మండల సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షుడు యెనుముల వీర వెంకట సత్య నాగేంద్రప్రసాద్ (నాగు) అన్నారు. ఈ మేరకు కాపు, బీసీ కార్పొరేషన్ రుణాల సమస్యలను వివరిస్తూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లను ఉద్దేశిస్తూ గురువారం ఆయన సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో హాట్ టాపిక్గా మారింది. మలికిపురం మండలంలోని 21 గ్రామాల్లో కాపు కార్పొరేషన్కు రుణాల కోసం 1,060 మంది దరఖాస్తు చేస్తే 44 మందికి మాత్రమే ఇచ్చారని, ఇది చాలా అన్యాయమని ఆ వీడియోలో పేర్కొన్నారు. కేశనపల్లిలో కాపు కార్పొరేషన్ రుణాల కోసం 70 మంది దరఖాస్తు చేసుకుంటే ఇద్దరికి మాత్రమే ఇవ్వడం దారుణమన్నారు. ‘కార్పొరేషన్ లోన్ల గురించి మీరు చెబుతున్నారు. మేమే చెప్పు దెబ్బలు తింటున్నాం’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గ్రామాల్లో కార్పొరేషన్ లోన్లు చాలా తక్కువగా ఇచ్చారనే బాధ ఉందని, రెండు కార్పొరేషన్ లోన్లు ఇచ్చిన మీరు 70 మందితో మమ్మల్ని తిట్టిస్తున్నారని దుయ్యబట్టారు. కార్పొరేషన్ లోన్ల విషయాన్ని చంద్రబాబు, పవన్ కల్యాణ్ పరిశీలించాలన్నారు. బీసీ కార్పొరేషన్ రుణాలకు 484 మంది దరఖాస్తులు పెట్టుకుంటే మండలంలో 65 మందికి ఇస్తామని చెబుతున్నారని, ఈ విషయాన్ని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్కు వివరిస్తే.. ఈ సమస్య తన పరిధిలో లేదని చెబుతున్నారన్నారు. 1994 నుంచి టీడీపీలో ఉన్నామని, గ్రామంలో పార్టీ నిర్వీర్యం కాకుండా కాపాడుకుంటూ వచ్చామని తెలిపారు. కార్పొరేషన్ రుణాల విషయంపై పునరాలోచన చేసి, సర్పంచ్లు తలెత్తుకుని తిరిగేలా చేయాలని కోరారు. కేశనపల్లిలో రెండు కాపు కార్పొరేషన్ రుణాలు, ఒక బీసీ కార్పొరేషన్ రుణం ఇస్తే మిగిలిన దరఖాస్తుదారులకు ఏం చెప్పాలో తెలియని పరిస్థితి నెలకొందని నాగు అన్నారు. రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారనుకున్నాం కేశనపల్లి సర్పంచ్ యెనుముల నాగు కార్పొరేషన్ లోన్లతో గ్రామాల్లో తలెత్తుకోలేని పరిస్థితి సీఎం, డిప్యూటీ సీఎంకు వీడియో సందేశం -
ప్రకృతి సాగును లక్ష ఎకరాలకు పెంచాలి
దేవరపల్లి: ప్రకృతి వ్యవసాయ విభాగం ద్వారా జిల్లావ్యాప్తంగా ఖరీఫ్లో 47 వేల ఎకరాల్లో పంటలు పండిస్తున్నారని, దీనిని 2029 నాటికి లక్ష ఎకరాలకు పెంచాలని జిల్లా వ్యవసాయాధికారి ఎస్.మాధవరావు అన్నారు. ఖరీఫ్ కార్యాచరణ ప్రణాళికపై రైతులకు, ప్రకృతి వ్యవసాయ విభాగం, సెర్ప్ సిబ్బందికి స్థానిక పొగాకు బోర్డు కార్యాలయం వద్ద గురువారం నిర్వహించిన డివిజన్ స్థాయి శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సహజసిద్ధమైన పంటలు పండించి, ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులు అందించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఎరువులు, పురుగు మందుల వల్ల ఆహారం కలుషితమవుతోందని తెలిపారు. వేసవిలో పచ్చిరొట్ట పంటలుగా మినుము, పెసర, జీలుగ, జనుము సాగు చేసి, భూసారాన్ని పెంచుకోవాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయ విభాగం ద్వారా 30 రకాల నవధాన్యాల విత్తనాలను 13 కిలోల కిట్లుగా అందజేస్తున్నామన్నారు. జిల్లాలో 85 వేల హెక్టార్ల సాగు భూములుండగా, వేసవిలో 30 వేల హెక్టార్లలో పంటలు వేయాలని సూచించారు. ఇందులో 5 వేల హెక్టార్లలో పెసర, మినుము, 6 వేల హెక్టార్లలో ఇతర పంటలు వేయాలని అన్నారు. పొలం గట్లపై కూరగాయల పంటలు, పాదులు పెట్టాలని రైతులకు మాధవరావు సూచించారు. ప్రకృతి వ్యవసాయ విభాగం జిల్లా ప్రాజెక్టు మేనేజరు బొర్రా తాతారావు మాట్లాడుతూ, దేవరపల్లి, గోపాలపురం, నల్లజర్ల మండలాల్లో కిచెన్ గార్డెన్లు ఎక్కువగా వేశామని తెలిపారు. జిల్లావ్యాప్తంగా 1.20 లక్షల మంది కిచెన్ గార్డెన్లు వేశారన్నారు. మండల సమాఖ్య అధ్యక్షురాలు గద్దే రమాదేవి మాట్లాడుతూ, ప్రతి మండల కేంద్రంలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్స్ ఏర్పాటు చేసి, విక్రయాలు జరపాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ప్రకృతి వ్యవసాయ విభాగం ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సి.చంద్రశేఖర్, ఏడీపీఎం వల్లీ, మూడు మండలాల వ్యవసాయాధికారులు కె.విజయ్, కె.కమల్రాజ్, బి.రాజారావు పాల్గొన్నారు. -
వెంకన్న కల్యాణోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
కొత్తపేట: వాడపల్లి వేంకటేశ్వరస్వామి వారి కల్యాణోత్సవాలకు తరలివచ్చే భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాట్లు చేసి, ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించాలని కోనసీమ జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్ దేవదాయ శాఖ అధికారులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు సూచించారు. ఈ నెల 7 నుంచి 13 వరకు కళ్యాణోత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై గురువారం ఆలయ ఆవరణలో ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. దేవదాయ – ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కలెక్టర్ మహేష్కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఏడు రోజుల పాటు జరిగే అన్ని కార్యక్రమాలు ప్రధానంగా 8వ తేదీన జరిగే రథోత్సవం, రాత్రి జరిగే కల్యాణోత్సవం తిలకించడానికి లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ ఆలయం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నత శాఖల అధికారులతో చర్చించి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఎస్పీ కృష్ణారావు మాట్లాడుతూ బందోబస్తుకు అవసరమైన సిబ్బంది జాబితా సిద్ధం చేయాలని సబ్ డివిజన్ అధికారులకు సూచించారు. జాయింట్ కలెక్టర్ నిషాంతి, ఆర్డీఓ పి.శ్రీకర్, డీఎస్పీ సుంకర మురళీమోహన్ మాట్లాడుతూ తమ పరిధిలో తీసుకునే ఏర్పాట్లను, ముందస్తు చర్యలను వివరించారు. తహసీల్దార్ టి.రాజరాజేశ్వరరావు, ఎంపీడీవో బీకేఎస్ఎస్వీ రామన్, రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్, ఎస్సై ఎస్.రాము, ఆర్ అండ్ బీ శాఖ డీఈఈ రాజేంద్ర, ఏఈ మణికుమార్, ఎలక్ట్రికల్ ఇంజినీర్ అశోక్, వాడపల్లి ఉప సర్పంచ్ పోచిరాజు బాబురావు, లొల్ల సర్పంచ్ కాయల జగన్నాథం, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. -
టీడీపీ విమర్శలు భావ్యం కాదు
రాజమహేంద్రవరం సిటీ: మృత్యువుతో పోరాడుతున్న ఫార్మసీ విద్యార్థినికి, వారి కుటుంబానికి న్యాయం జరగాలన్న తపనతో మాజీ ఎంపి మార్గాని భరత్రామ్ పోరాడుతున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళ నాయకురాలు మార్తి లక్ష్మి పేర్కొన్నారు. బుధవారం స్థానిక ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ విద్యార్థిని కుటుంబానికి అండగా నిలిచి తమ పార్టీ నాయకులు పోరాడుతుంటే శవ రాజకీయాలంటూ తెలుగు మహిళలు విమర్శించడం భావ్యం కాదన్నారు. శవ రాజకీయాలు అంటూ వ్యాఖ్యానిస్తున్నారంటే విద్యార్థి చనిపోయిందనే భావనలో తెలుగు మహిళలు ఉన్నారా అని నిలదీశారు. తమ నాయకుడు మార్గాని భరత్రామ్ ఆసుపత్రి వద్దకు వెళ్ళి ఆందోళనకు దిగితే తప్ప పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం స్పందించలేదని అన్నారు. సిటీ ఎమ్మెల్యే ముందుగానే స్పందించి, న్యాయం చేస్తామని ప్రకటించక పోవడం దారుణమన్నారు. ఈ కేసులో ఎన్నో అనుమానాలు ఉన్నాయని, ఇంజెక్షన్్ ఆమె చేసుకుందా? ఇంకెవరైనా చేశారా అన్నది తెలియాలంటే ఆసుపత్రిలో సీసీ పుటేజ్ ఇవ్వాలని తమ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారన్నారు. దీపక్ను ఎమ్మెల్యే దగ్గరుండి అరెస్ట్ చేయించినట్లు మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. మహిళలకు అన్యాయం జరిగితే తాట తీస్తామన్న పవన్కళ్యాణ్ ఈ ఘటనపై ఎందుకు స్పందించలేదన్నారు. ఈ ఘటనపై ఇప్పటి వరకు మహిళా హోం మంత్రి స్పందించకపోవడం శోచనీయమన్నారు. మహిళా నేతలు అనుయాదవ్, మార్గాని సుశీల, అర్సాభట్టు అనంతలక్ష్మి, రమణమ్మ, చిన్నారి పాల్గొన్నారు. ఫార్మసీ విద్యార్థినికి న్యాయం జరగాలన్నదే మా తపన వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళ నాయకురాలు లక్ష్మి -
లక్ష్యానికి చేరువగా సెస్ వసూళ్లు
రాజమహేంద్రవరం రూరల్: వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ)ల ఆధ్వర్యాన వ్యవసాయ ఉత్పత్తులపై సెస్, మార్కెట్ ఫీజు వసూళ్లలో జిల్లా నూరు శాతం లక్ష్యం చేరుకోలేదు. ప్రస్తుతం 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.30.83 కోట్లు లక్ష్యంకాగా మార్చినెలాఖరు నాటికి రూ. 29.09 కోట్లు మేర వసూళ్లు జరిగాయి. జిల్లావ్యాప్తంగా 94.37శాతం మార్కెటింగ్ ఫీజులు వసూలయ్యాయి. వ్యవసాయ ఉత్పత్తులు, పశుగణాలపై ఒక శాతం సెస్ వసూలు చేస్తున్నారు. వీటితోపాటు వ్యాపారుల (ట్రేడర్ల) నుంచి ఒక శాతం, చేపలు, రొయ్యలపై 0.25 శాతం చొప్పున సెస్ వసూలు చేస్తున్నారు. నిడదవోలు ఏఎంసీ రూ.1.50 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా ఏకంగా రూ.1.79 కోట్లు వసూలు చేసి ముందంజలో ఉంది. నిడదవోలు ఏఎంసీ పరిధిలో ప్యాడీతో పాటు సెస్ వసూళ్లు బాగా చేయడంతో ముందంజలో నిలిచింది. కొవ్వూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ సెస్ 62.03 శాతం వసూలు చేసి వెనుకంజలో ఉంది. నాలుగు ఏఎంసీలు వందశాతం పైనే జిల్లాలో ఆరు ఏఎంసీల్లో నాలుగు ఏఎంసీల్లో నిడదవోలు 119.62 శాతం వసూళ్లతో ప్రథమ స్థానంలో ఉండగా, గోపాలపురం ఏఎంసీ 110.11 శాతం వసూళ్లతో ద్వితీయ స్థానం, రాజానగరం ఏఎంసీ 109.76 శాతం వసూళ్లతో తృతీయ స్థానం, అనపర్తి ఏఎంసీ 100.86 శాతం వసూళ్లతో నాలుగో స్థానంలోను, నిలిచాయి. రాజమహేంద్రవరం మార్కెట్ కమిటీ 78.98 శాతం వసూళ్లతో ఐదవ స్థానంలో కొవ్వూరు ఏఎంసీ 62.04 శాతం వసూళ్లతో చివరి స్థానంలో నిలిచింది. పక్కా ప్రణాళికతో... మార్కెటింగ్శాఖ ఉన్నతాధికారులు మార్కెట్ ఫీజు, సెస్ వసూళ్లపై మార్కెట్ కమిటీ సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ లక్ష్యాలను అధిగమించేలా చర్యలు చేపట్టారు. జిల్లాలోని ఆరు మార్కెట్ కమిటీల పరిధిలో 14 చెక్ పోస్టుల ద్వారా మార్కెట్ ఫీజు, సెస్ వసూళ్లను 94.37 శాతం వసూలు చేశారు. సివిల్ సప్లయిస్ బకాయిలు, ఏఏంసీకి రావలసిన బకాయిలు సుమారు రూ.70 కోట్లు రాకపోవడంతో లక్ష్యాలను అధిగమించలేకపోయాయి. రెండు ఏఎంసీలు వెనుకబడ్డాయి జిల్లాలో అగ్రికల్చర్ మార్కెట్కమిటీల పరిధిలో మార్కెట్ ఫీజు, సెస్ వసూళ్లు 94.37 శాతం వసూలు చేశాం. మార్కెటింగ్శాఖ కమిషనర్, రీజనల్ డైరెక్టర్ మోటేవేషన్తో నాలుగు ఏఎంసీలు వందశాతం పూర్తిచేయగా, రెండు ఏఎంసీలు వెనుకబడ్డాయి. సివిల్ సప్లయిస్ బకాయిలు సుమారు రూ.73 కోట్లు ఏఎంసీలకు రావాల్సి ఉంది. మార్కెట్ కమిటీ కార్యదర్శులు, సిబ్బంది సమష్టి కృషితో లక్ష్యానికి చేరువయ్యాం. జిల్లాలో వెనుకబడిన కొవ్వూరు, రాజమహేంద్రవరం మార్కెట్ కమిటీలు నూరుశాతం లక్ష్యం సాధించేలా కృషిచేస్తాం. – ఎం.సునీల్వినయ్, జిల్లా అగ్రిట్రేడ్ అండ్ మార్కెటింగ్ అధికారి, తూర్పుగోదావరిజిల్లా 02ఆర్జేసి201ఎ–270080:ఎం.సునీల్వినయ్ 2024–25లో 94.37 శాతం వసూలు నిడదవోలు ఏఎంసీలో రికార్డు స్థాయిలో 119.62 శాతం వెనుకంజలో 62.03 శాతంతో కొవ్వూరు ఏఎంసీ 2024–25 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ ఫీజు,సెస్ వసూళ్ల వివరాలు (రూ.కోట్లలో) వ్యవసాయ మార్కెట్ కమిటీ లక్ష్యం వసూలు పర్సంటేజీ నిడదవోలు 1.50 కోట్లు 1.79 కోట్లు 119.62 గోపాలపురం 3.47 కోట్లు 3.82 కోట్లు 110.11 రాజానగరం 3.13 కోట్లు 3.43 కోట్లు 109.76 అనపర్తి 13.47 కోట్లు 13.58క ోట్లు 100.86 రాజమహేంద్రవరం 4.21కోట్లు 3.32 కోట్లు 78.98 కొవ్వూరు 5.05 కోట్లు 3.13కోట్లు 62.03 మొత్తం రూ.30.83 కోట్లు రూ.29.09కోట్లు 94.37 -
పట్టణాలకు పన్నుపోటు
సాక్షి, రాజమహేంద్రవరం: ‘ఏరుదాటే వరకు ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న’ అన్న చందంగా తయారైంది కూటమి నేతలు, ప్రభుత్వం తీరు. సార్వత్రిక ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చేందుకు ఏటా పెంచే 15 శాతం పన్ను తాము అధికారంలోకి వస్తే తగ్గిస్తామని హామీలు గుప్పించారు కూటమి నేతలు. అధికార పగ్గాలు చేపట్టాక అమలు మరిచారు. వెరసి పట్టణాల్లో పన్నుభారంతో ప్రజలు సతమతం అవుతున్నారు. దీనికితోడు పన్నులు చెల్లించే ప్రజలకు 100 శాతం వడ్డీ రాయితీ అమలు చేయాల్సి ఉన్నా.. కేవలం 50 శాతానికి మాత్రమే పరిమితం చేసింది. అది కూడా చెల్లింపుల గడువు ముగిసే చివరి ఐదు రోజులు మాత్రమే అవకాశం కల్పించడంతో పన్నుల వసూళ్లలో మందగమనం ఏర్పడింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 50 శాతం మాత్రమే పన్నులు వసూలయ్యాయి. ఇదీ సంగతి ఇంటి, కుళాయి, ఖాళీ స్థలాలు తదితర పన్నుల వసూళ్లపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో నగరపాలక సంస్థ అధికారులతో విస్తృత ప్రచారం చేపట్టింది. పన్నులు చెల్లించకపోతే కుళాయి కనెక్షన్లు కట్ చేస్తామని హెచ్చరికలు సైతం జారీ చేసింది. పన్నుల వసూళ్లకు ప్రత్యేకంగా అధికారులను నియమించారు. వారిని ఇళ్ల వద్దకు పంపి దాదాగిరీ చేసే విధానానికి తెర తీసింది. అప్పటికీ వసూళ్లలో వేగం పుంజకోకపోవడంతో సరికొత్త ఆలోచనకు నాంది పలికింది. పన్నులు చెల్లించిన వారికి 50 శాతం వడ్డీ రాయితీ కల్పిస్తామని ప్రకటనలు చేసింది. అది కూడా పూర్తిగా అమలు చేయలేదు. పన్నుల వసూళ్ల గడువు కేవలం ఐదు రోజులు ఉందనగా ప్రకటించారు. ఈ ఆఫర్ ఉందని ప్రజలు తెలుసుకునేలోపే సమయం ముగియడంతో రాయితీతో పెద్దగా ప్రయోజనం కలిగిన దాఖలాలు లేవు. రాయితీ సైతం మొత్తం బకాయిలు చెల్లించిన వారికే వర్తింపజేయడంతో పన్నుల చెల్లింపులపై పట్టణ ప్రజలు ఆసక్తి చూపలేదు. వెరసి పన్ను వసూళ్లు 50 శాతం మాత్రమే జరిగినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. కుళాయి పన్నులపై తీవ్ర ఒత్తిడి కుళాయి పన్నులపై మున్సిపల్ అధికారులు ప్రజలపై తీవ్ర ఒత్తిడి పెంచారు. ఒకటి, రెండు కాదు పదేళ్ల కుళాయి పన్ను చెల్లింపునకు ఒకేసారి డిమాండ్ నోటీసులు ఇచ్చారు. గతంలో ఎన్నడూ లేని సంప్రదాయానికి తెర తీశారని జనం వాపోతున్నారు. కుళాయిలకు ప్రతి నెలా రూ.100 నీటి చార్జీలు మున్సిపాలిటీ, కార్పొరేషన్లు వసూలు చేస్తున్నాయి. ఏడాదికి రూ.1,200 ఇంటి పన్నుతో పాటు చెల్లించాల్సి ఉంది. కేవలం ఇంటి పన్ను వసూళ్లపై మాత్రమే దృష్టి సారించిన మున్సిపల్ అధికారులు కుళాయి పన్నులను పట్టించుకోలేదు. దీంతో ఆ బకాయిలు పేరుపోవడం.. ఒక్కసారి పదేళ్ల కుళాయి పన్ను చెల్లించాలని చెప్పడంతో ప్రజలు అవాక్కవుతున్నారు. ఒక్కసారిగా అంతమొత్తం చెల్లించాలంటే ఎలాగని ప్రశ్నించినా పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. పైగా కుళాయి కనెక్షన్లు కట్ చేయడంతో తాగునీటి కోసం తాము ఎక్కడికి వెళ్లాలని ఆందోళన చెందుతున్నారు. కట్టకపోతే కేసులు బనాయిస్తామని బెదిరించిన సందర్భాలు సైతం లేకపోలేదు. కుళాయిలున్న కుటుంబాలో అత్యధిక శాతం పేద, మధ్య తరగతి ప్రజలే ఉన్నారు. ఒక్కసారిగా అంత మొత్తం చెల్లించాలంటే కష్టం. గత ప్రభుత్వ హయాంలో 100 శాతం రాయితీ కార్పొరేషన్, మున్సిపాలిటీల అభివృద్ధికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కృషి చేసింది. రూ.కోట్లతో అభివృద్ధి పనులకు నాంది పలికింది. కార్పొరేషన్లు, మున్సిపాటిలీల్లో పన్ను బకాయిల వసూళ్లలో ప్రజలు ఆర్థిక ఇబ్బందులను దూరం చేసేందుకు 100 శాతం వడ్డీ రాయితీ కల్పించింది. ప్రస్తుత ప్రభుత్వంలా కేవలం 5 రోజుల సమయం మాత్రమే ఇవ్వకుండా నెల రోజుల పాటు రాయితీ ద్వారా పన్నులు చెల్లించేందుకు అవకాశం కల్పించేవారు. ప్రభుత్వ చర్యలతో ప్రతి ఏటా 90 శాతానికి పైగా పన్నులు వసూలయ్యేవి. ప్రజలకు వడ్డీ భారం తగ్గి ఊరట కలిగేది. మున్సిపాలిటీలకు సైతం ఆదాయం సమకూరడంతో అభివృద్ధి పనులు వేగంగా జరిగేవి. పన్నుల వసూళ్లు ఇలా.. ఏటా పన్ను వసూళ్లు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్, అక్టోబర్ నుంచి మార్చి వరకు రెండు దఫాలుగా పరిగణించి చేపడతారు. నిర్దేశించిన సమయంలో చెల్లించకపోతే రూ.100కు రూ.2 చొప్పున వడ్డీ వసూలు చేస్తారు. మున్సిపాలిటీ డిమాండ్ వసూళ్లు వసూలైన (రూ.కోట్లలో) (రూ.కోట్లల్లో) శాతంకాకినాడ 110.99 52.97 47.72 పిఠాపురం 10.17 4.97 48.90 సామర్లకోట 8.78 4.47 50.93 రాజమహేంద్రవరం 132.32 71.09 53.73 నిడదవోలు 8.47 4.72 55.72 ఏలేశ్వరం 2.61 1.49 57.12 అమలాపురం 14.72 9.01 61.19 రామచంద్రాపురం 7.65 4.93 64.46 పెద్దాపురం 7.18 4.72 65.81 కొవ్వూరు 4.56 3.69 81.04 ఎన్నికల సమయంలో మున్సిపాలిటీల్లో పన్ను తగ్గిస్తామన్న కూటమి నేతలు అధికారంలోకి వచ్చాక 15 శాతం పెంచుతూ నిర్ణయం వడ్డీ రాయితీ 50 శాతమే వర్తింపు వెరసి పన్ను వసూళ్లలో మందగమనం 50 శాతానికి మించి వసూలు కాని వైనం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 100 శాతం రాయితీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పన్నుల వసూళ్లు ఇలా... ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా రాజమహేంద్రవరం, కాకినాడ కార్పొరేషన్లు ఉండగా.. 9 మున్సిపాలిటీలు, 3 నగర పంచాయతీలు ఉన్నాయి. పన్నుల వసూళ్లలో ఒక్క కొవ్వూరు మున్సిపాలిటీ మినహా మిగిలిన వాటిల్లో పన్నుల వసూళ్లలో మందగమనం కనిపిస్తోంది. రాజమహేంద్రవరంలో అత్యధిక శాతం రూ.132.32 కోట్ల డిమాండ్ ఉంటే.. రూ.71.09 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. -
రిజిస్ట్రేషన్కు రేపటి నుంచి స్లాట్ బుకింగ్
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ (డీక్యూఎంఎస్) ద్వారా రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుకింగ్ శుక్రవారం నుంచి అందుబాటులోకి రానున్నట్లు జిల్లా రిజిస్ట్రార్ ఆర్ సత్యనారాయణ బుధవారం ఓప్రకటనలో తెలిపారు. రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ రాష్ట్రంలో డైనమిక్ క్యూ మేనేజ్ మెంట్ సిస్టమ్ ద్వారా రిజిస్ట్రేషన్ సేవలు అనగా దస్తావేజు దాఖలు చేసుకోవడానికి కక్షిదారులు అనుకూలమైన సమయం ఎంచుకొని ఆ సమయములో రిజిస్ట్రేషన్ సేవలు పొందవచ్చన్నారు. ఈ సేవలను ఈనెల 4వతేదీ నుంచి జిల్లాలో రాజమహేంద్రవరం ప్రధాన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అమలు చేస్తామన్నారు. స్లాట్ బుకింగ్ను పబ్లిక్ డేటా ఎంట్రీ విధానం ద్వారా గానీ, అధికారిక వెబ్ సైట్ రిజిస్ట్రేషన్.ఏపీ.జీవోవీ.ఇన్ స్లాట్ బుకింగ్ మాడ్యూల్ ద్వారా, క్యూర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా చేసుకోవచ్చన్నారు. రిజిస్ట్రేషన్కు స్లాట్ బుకింగ్ ద్వారా వేచి ఉండే సమయం తగ్గడంతో పాటు, సౌకర్యవంతమైన ప్రణాళిక, పారదర్శకతకు వీలవుతుందన్నారు. సిబ్బంది నిర్వహణ సులభతరం చేస్తూ దస్తావేజుల ముందస్తు పరిశీలనతో పాటు, మధ్యవర్తుల ప్రభావం తగ్గుతుందన్నారు. -
టిడ్కో ఇళ్లు ఇవ్వడంలో జాప్యం ఎందుకు?
సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధురాజమహేంద్రవరం రూరల్: బొమ్మూరు–2లో 1,200 టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ లబ్ధిదారులకు ఇవ్వడంలో జాప్యం ఎందుకు చేస్తున్నారని సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మించిన ఇళ్లు పాడవుతున్నాయని ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం అవుతోందన్నారు. బుధవారం సీపీఐ రాజకీయ ప్రచార జాత 8వ రోజు లో భాగంగా బొమ్మూరు 2 లో టిడ్కో గృహాలను పరిశీలించారు. ఆనంతరం టిడ్కో ఏఈ అనంతలక్ష్మితో మాట్లాడి ఇళ్ల లబ్ధిదారులు ఇబ్బందులపై చర్చించారు. అనంతరం ఫేజ్– 1 లో ఉన్న టిడ్కో గృహాలు, బొమ్మూరు సెంటర్ మార్కెట్ తదితర ప్రాంతాల్లో ప్రచార జాత నిర్వహించారు. మధు మాట్లాడుతూ బొమ్మూరు ఫేజ్–1 లో 2,528 గృహాలు నిర్మించారని కానీ 75శాతం మాత్రమే నివసిస్తున్నారని, ఫేజ్–2 లో 1,200 గృహాలు నిర్మించి ఆరు సంవత్సరాలు అవుతున్నా లబ్ధిదారులకి అందజేయకపోవడం దారుణం అన్నారు. బ్యాంకులకు రుణం సొమ్ము కడుతూ, ఇల్లు అందక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేయాలని లేని పక్షంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ నాయకత్వంలో మేమే వారికి అందజేస్తామని మధు తెలిపారు. ఏఐటీయూసీ జిల్లా కన్వీనర్ జట్లు లేబర్ యూనియన్ అధ్యక్షుడు కుండ్రపు రాంబాబు, సీపీఐ నగర కార్యదర్శి వి.కొండలరావు, నగర సహాయ కార్యదర్శి సప్ప రమణ, టౌన్ కమిటీ సభ్యులు పి.లావణ్య, టి నాగేశ్వరరావు, టీ త్రిమూర్తులు, జట్టు సంఘం అధికారి బాడీ సభ్యులు అప్పలనాయుడు, బాలకృష్ణ, వెంకట్రావు పాల్గొన్నారు. -
మానవుల శ్రేయస్సు కోసమే యాగాలు
అల్లవరం: యజ్ఞయాగాల పరమార్థం సర్వమానవాళి శ్రేయస్సు అని భీమవరం మావుళ్లమ్మ అమ్మవారి ఆలయ వేద ఉపవాచకులు ఈవని శ్రీరామచంద్ర సోమయాజులు అన్నారు. అల్లవరం మండలం దేవగుప్తం గ్రామంలో వేద పండితుడు మరువాడ వెంకటేశ్వరశర్మ పర్వవేక్షణలో పోచినపెద్ది శ్యామ్ శర్మ ఆధర్యంలో జరుగుతున్న నక్షత్ర పూర్వక నవగ్రహ శివ పంచాయతన యాగానికి ఆయన బుధవారం ముఖ్యఅతిథిగా విచ్చేశారు. తొలుత శివ పంచాయతన యాగం మూడో రోజున ఉమాపార్వతీ మల్లేశ్వర స్వామివారికి అన్నాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు అమ్మవారికి కుంకుమ పూజ చేశారు. అనంతరం 27 నక్షత్రాలకు నవగ్రహ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సోమయాజులు మాట్లాడుతూ శివ పంచాయత యాగం విశిష్టతను తెలిపారు. హైందవ జాతిని ఉద్ధరించడానికి జగద్గురు ఆది శంకరాచార్యులు ఉద్భవించారని, ఆయనతోనే ఈ జాతి మనుగడ సాగుతోందన్నారు. అనంతరం భక్తులు ఆయన ఆశీస్సులు పొందారు. -
నేడు సమ్మర్ స్పెషల్ ఎక్స్ప్రెస్
రాజమహేంద్రవరం సిటీ: జిల్లా మీదుగా గురువారం వన్వే సమ్మర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ రైలు నడిపేందుకు చర్యలు చేపట్టినట్టు రైల్వే అధికారులు బుధవారం ప్రకటించారు. 07011 చర్లపల్లి– విశాఖపట్నం మధ్య నడిచే ఈ రైలు గురువారం చర్లపల్లిలో బయలుదేరి శుక్రవరం విశాఖపట్నం చేరుకుంటుందని అధికారులు ప్రకటించారు. ఈ రైలు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం, సామర్లకోట, అన్నవరం, తుని రైల్వే స్టేషన్లో ఆగనుందని తెలిపారు. నేటి నుంచి పదవ తరగతి స్పాట్ కంబాలచెరువు (రాజమహేంద్రవరం): పదో తరగతి పరీక్షల మూల్యాంకనం జిల్లాలో గురువారం నుంచి జరగనుంది. ఆ వివరాలను డీఈవో కె.వాసుదేవరావు బుధవారం తెలిపారు. స్థానిక ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో పదవ తరగతి మూల్యాంకనం ప్రారంభమవుతుంది. అందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. చీఫ్ ఎగ్జామినర్స్ 101 మంది, అసిస్టెంట్ ఎగ్జామినర్స్ 630 మంది, స్పెషల్ అసిస్టెంట్స్ 201 మంది పనిచేయనున్నారు. ఫార్మసీ విద్యార్థి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ కంబాలచెరువు(రాజమహేంద్రవరం): ఫార్మసీ విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని ప్రభుత్వాసుపత్రి వైద్య బృందం తెలిపింది. ఆమె ఆరోగ్య పరిస్ధితిపై ప్రభుత్వ వైద్య బృందం బుధవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. రోగి అపస్మారక స్థితికి వచ్చిందని, ఈ కారణంగా ఐసీయూలో వెంటిలేటర్ ద్వారా చికిత్స అందుతోందన్నారు. రక్తపోటు, పల్స్, శ్వాసక్రియ తక్కువగా ఉన్నాయన్నారు. ఏసీఎల్ఎస్ మార్గ్గదర్శకాల ప్రకారం కార్డియోపల్మనరీ రెసుసిటేషన్ సీపీఆర్ ఇచ్చారన్నారు. సుదీర్ఘ చికిత్స తర్వాత స్వల్పంగా శరీర స్పందన తిరిగి వచ్చిందన్నారు. చికిత్సలో భాగంగా ఎమ్ఆర్ఐ, సిటీ స్కాన్, ఈఈజీ, కార్డియాలజీ, న్యూరాలజీ పరీక్షలు చేశారన్నారు. మెదడు తీవ్రంగా పాడైపోయిందన్నారు. పంచాయతీ కార్యదర్శిపై 9న విచారణ బోట్క్లబ్ (కాకినాడ సిటీ): పంచాయతీ కార్యదర్శి మహమ్మద్ ఉన్నీసాబీబీపై జిల్లా పంచాయతీ కార్యాలయంలో విచారణ చేపట్టనున్నారు. కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామ పంచాయతీలో పనిచేసిన సమయంలో ఒక ఇంటి పన్ను మార్పులపై ఆమైపె వచ్చిన అవినీతి అభియోగాలపై ఏసీబీ, జిల్లా పంచాయతీ అధికారులు సంయుక్తంగా ఈ నెల 9న ఉదయం 11 గంటలకు ఈ విచారణ చేపట్టనున్నారు. జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్, ఏసీబీ సీఐ ఈ విచారణ చేపట్టనున్నారు. గతంలో ఆమైపె వచ్చిన అవినీతి ఆరోపణలపై నిజనిర్ధారణ కోసం ఈ విచారణ సాగనుంది. ఈ విచారణలో ఆమైపె వచ్చిన అవినీతి ఆరోపణలు నిజమైతే ఆమైపె శాఖపరమైన చర్యలు తీసుకోనున్నారు. ప్రస్తుతం మహహ్మద్ ఉన్నీసాబీబీ సామర్లకోట మండలం నవర పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. సామర్లకోట చైర్పర్సన్పై అవిశ్వాసానికి రంగం సిద్ధం సామర్లకోట: పట్టణ మున్సిపల్ కౌన్సిల్లో బలనిరూపణకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని వైఎస్సార్ సీపీకి చెందిన కౌన్సిలర్లు బుధవారం జిల్లా కలెక్టన్ షన్మోహన్ సగిలి, మున్సిపల్ కమిషనర్ ఎ.శ్రీవిద్యకు వినతి పత్రాలు అందజేశారు. కొంత కాలంగా చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణ తీరుపై అదే పార్టీకి చెందిన కౌన్సిలర్లు అసంపూర్తితో ఉన్నారు. దాంతో 31 మంది సభ్యులు ఉన్న కౌన్సిల్ సభ్యులలో 22 మంది సంతకాలు చేసి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని వినతి పత్రాలు అందజేశారు. మున్సిపల్ కమిషనర్ ఎ.శ్రీవిద్య విలేకర్లతో మాట్లాడుతూ సగానికి మించి సభ్యులు బల నిరూపణ కోసం వినతి పత్రం అందజేస్తే దానిపై నిర్ణయం తీసుకోవలసి ఉంటుందన్నారు. బలనిరూపణ సమావేశం ఏర్పాటుకు కలెక్టరు నుంచి ఆదేశాలు రావలసి ఉందన్నారు. వినతి పత్రంలో సంతకాలు చేసిన వారి నుంచి సమాచారం సేకరించి తదుపరి నిర్ణయం తీసుకొంటారన్నారు. వైస్చైర్మన్ ఉబా జాన్మోజెస్, కౌన్సిలర్లు ఆవాల లక్ష్మీసత్యనారాయణ, పాగా సురేష్కుమార్, నేతల హరిబాబు, యార్లగడ్డ జగదీష్, వైఎస్సార్ సీపీ నాయకుడు రెడ్నం దొరబాబు పాల్గొన్నారు. -
వ్యర్థాలతో రిలయన్స్ బయో ఎనర్జీ ప్లాంట్
సామర్లకోట: స్థానిక ఏడీబీ రోడ్డులోని రిలయన్స్ పవర్ ప్లాంటు సమీపంలో రిలయన్స్ బయో ఎనర్టీ ప్లాంట్ను బుధవారం ఆన్లైన్ (వర్చువల్ విధానంలో)లో ప్రారంభించారు. డ్రోన్ కెమెరా ద్వారా ఫ్యాకర్టీ పరిసరాలను రిలయన్స్ అధినేతలు, మంత్రి లోకేశ్ తిలకించే విధంగా ఏర్పాట్లు చేశారు. సుమారు రూ.375 కోట్ల వ్యయంతో నిర్మించే ప్లాంటులో వరి, చెరకు, మొక్కజోన్న, ఆయిల్పామ్, పూలతోటలు, ఆక్వా సముదాయాల నుంచి వచ్చే వ్యర్థాలు, పశువుల పేడతో ‘కంప్రెస్డ్ బయో గ్యాస్’ ఉత్పత్తి చేయడానికి ఈ యూనిట్ ఏర్పాటు చేశారు. సుమారు 60 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే మూడు యూనిట్ల ద్వారా రోజుకు 67.53 టన్నుల గ్యాస్ ఉత్పత్తి చేయనున్నట్లు రిలయన్స్ బయో ఎనర్జీ ప్లాంట్ ప్రతినిధులు తెలిపారు. బయో ఎనర్జీ మొదటి యూనిట్ ప్లాంటుకు రూ.114.20 ఖర్చు చేసినట్టు ఫ్యాక్టరీ ప్రతినిధులు చెప్పారు. మిగిలిన రెండు యూనిట్లు ఆగస్టు నాటికి ఉత్పత్తిని ప్రారంభిస్తాయని తెలిపారు.వర్చువల్ విధానంలో ప్రారంభించిన మంత్రి లోకేశ్ -
గంజాయి కేసులో ఎమ్మెల్యే అనుచరుడు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: తాము అధికారంలో వస్తే గంజాయిని సమూలంగా నిర్మూలిస్తామనే కూటమి నేతల ఊకదంపుడు ప్రసంగాలు ఆచరణలోకి రాలేదు. దాదాపు పది నెలల ప్రభుత్వ పాలనలో ఎక్కడ చూసినా గంజాయి కేసులే కనిపిస్తున్నాయి. కూటమి నేతల అనుచరులు ఈ కేసులో పట్టుబడుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో గంజాయి అక్రమ రవాణాతో పాటు కాకినాడ, రాజమహేంద్రవరం వంటి నగరాలతో పాటు పట్టణాలు, పల్లెల్లో గంజాయి విక్రయాలు జరుగుతున్నా అడ్డుకట్ట మాత్రం పడడం లేదు. అనపర్తి నియోజకవర్గ పరిధిలో బీజేపీకి చెందిన ఎమ్మెల్యే అనుచరుడు దాసి గణేష్ గంజాయి కేసులో పోలీసులకు చిక్కడం చర్చనీయాంశంగా మారింది. పోలీసుల దాడి పెదపూడిలో గంజాయిని విక్రయిస్తున్న పది మందిని అరెస్ట్ చేసినట్టు పెదపూడి ఎస్సై కె.రామారావు బుధవారం తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల ఒకటో తేదీన పెదపూడిలోని కై కవోలు సెంటర్లో ఉన్న ఒక షెడ్డు వద్ద గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం వచ్చింది. కాకినాడ రూరల్ సీఐ డీఎస్ చైతన్య కృష్ణ, కాకినాడ సీసీఎస్ ఇన్స్పెక్టర్ వి.కృష్ణ, ఎస్సైలు వినయ్ ప్రతాప్, కె.రామారావు, సిబ్బంది సహకారంతో దాడి చేశారు. ఈ దాడిలో గంజాయి విక్రయిస్తున్న 10 మంది ముఠా సభ్యులను పట్టుకున్నారు. వారి నుంచి 5.265 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ పది మందిలో ఒకడు మైనర్. మిగిలిన వారిలో గండ్రేడుకు చెందిన అయినవిల్లి అశోక్, ఎన్.వెంకట సురేష్, కై కవోలుకు చెందిన ఎస్.రాహుల్, దాసి గణేష్, ఎల్లే ఎం.కుమార్, కరకుదురుకు చెందిన పిల్లి ప్రశాంత్, పెదపూడికి చెందిన కేవీ రాఘవేంద్ర, జి.మామిడాడకు చెందిన వి.విజయకుమార్, యు.శ్రీనివాస్కుమార్ తదితరులు ఉన్నారు. నిందితుల్లో నలుగురి నుంచి తుని, నక్కపల్లి, కోరుకొండ, బొమ్మూరు, ధవళేశ్వరం, పెనుగొండ, ద్రాక్షారామ, తణుకు తదితర ప్రాంతాల్లో దొంగలించిన పది మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేయగా సీఐ దర్యాప్తు చేసినట్లు తెలిపారు. అలాగా వారిపై రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని ఎస్సై తెలిపారు. పెదపూడిలో 10 మంది అరెస్ట్ 5.265 కేజీల గంజాయి స్వాధీనం -
ఫ్యాక్టరీ ప్రారంభం రోజునే కార్మికుడి మృతి
సామర్లకోట: స్థానిక ఏడీబీ రోడ్డులోని రిలయన్స్ బయో ఎనర్జీ ప్లాంట్లో బుధవారం కార్మికుడు మృతి చెందాడు. ఫాక్టరీ ప్రారంభమైన రోజునే ఈ ఘటన జరగడంతో అంతటా విషాదం నెలకొంది. ఫ్యాక్టరీలో పనులు చేస్తున్న సమయంలో పైనుంచి పడి రంగనాథం నాగబాబు (40) అక్కడిక్కడే మృతి చెందాడు. మృతదేహన్ని పెద్దాపురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పెద్దాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.డ్రైన్లో స్నానానికి దిగి వృద్ధుడు..మామిడికుదురు: ఆదుర్రు గ్రామంలోని డ్రైన్లో మంగళవారం స్నానానికి దిగి కొమరాడలంకకు చెందిన బిరుదుగంటి నాగేశ్వరరావు (64) మృతి చెందాడు. ఈ విషయాన్ని నగరం ఎస్సై ఎ.చైతన్యకుమార్ బుధవారం విలేకరులకు తెలిపారు. అతడి కుమారుడు దుర్గాప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతదేహానికి రాజోలు ప్రభుత్వాస్పత్రితో పోస్టుమార్టం నిర్వహించారన్నారు.రోడ్డు ప్రమాదంలో యువకుడు..తుని: స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఎదుట మోటారు సైకిల్పై వెళుతున్న యువకుడిని ఎదురుగా వస్తున్న బోలోరా వాహనం ఢీకొట్టడంతో మృతి చెందాడని తుని పట్టణ సీఐ ఎం.గీతారామకృష్ణ తెలిపారు. బుధవారం జరిగిన సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం. పాయకరావుపేట మండలం నామవరం గ్రామానికి చెందిన చందక శివ శంకర నారాయణ (29) ఎస్.అన్నవరం రోడ్డులో బైక్పై వెళుతున్నాడు. అతడిని తొండంగి మండలం నుంచి వస్తున్న బోలోరా వాహనం ఢీకొంది. ఈ ఘటనలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. రాంగ్ రూట్ వచ్చి యువకుడి ప్రాణాలను తీసిన బోలోరా వాహనం డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శివ శంకర నారాయణ తుని పట్టణంలోని ఎకై ్సల్ బ్రాడ్ బ్యాండ్లో టెక్నిషియన్గా పని చేస్తున్నాడు. అతడిని ఇటీవలే వివాహం జరిగింది. -
చందువ చేప సాగు ఎంతో లాభదాయకం
తొండంగి: చందువ చేపల పెంపకం ఎంతో లాభదాయకమని సెంట్రల్ మైరెన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎంఎఫ్ఆర్ఐ) ప్రధాన శాస్త్రవేత్త జోకే కిజహకూడన్ అన్నారు. దానవాయిపేట వద్ద వైభవ్ హెచరీస్ (ఇండియా) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చందువ చేప విత్తనోత్పత్తి కేంద్రాన్ని బుధవారం మండలంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చందువ చేపకు దేశ, విదేశాల్లో డిమాండ్ ఉందని, దీన్ని పెంచడానికి రైతులు ముందుకు రావాలని కోరారు. వైభవ్ హెచరీస్ మేనేజింగ్ డైరెక్టర్ బేటే చంద్రశేఖర్ మాట్లాడుతూ విశాఖపట్నంలోని ఐకార్ – సెంట్రల్ మైరెన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎంఎఫ్ఆర్ఐ) సుమారు 13 ఏళ్ల పాటు పరిశోధన చేసిన తర్వాత ఇండియన్ పొంపానో (చందువ చేప) పెంపకాన్ని దేశంలో అభివృద్ధి చేయాలని నిర్ణయించుకుందన్నారు. ఈ మేరకు తమతో సంప్రదించగా చందువ చేప విత్తనోత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించడానికి ముందుకొచ్చామన్నా రు. శాస్త్రవేత్త జాయల్ మాట్లాడుతూ దేశంలోనే మొదటిసారిగా చందువ చేప విత్తనోత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించామన్నారు. వీటిని చెరువులోనే కాకుండా కాలువలు, నదులు, సముద్రంలో కూడా పెంచవచ్చన్నారు. కార్యక్రమంలో వైభవ్ హెచరీస్ (ఇండియా) డైరెక్టర్లు బేటే సాయి కపిల్ త్రిలోక్, బేటే సాయి కపిల్ విఖ్యాత్, శాస్త్ర వేత్తలు డాక్టర్ బీజీ జీవీఆర్, డాక్టర్ జయశ్రీ లోక, డాక్టర్ రితీష్ రంజన్, డాక్టర్ శేఖర్ మహాజన్, తొండంగి మండల మత్స్యకార సంఘం నాయకుడు రమణ, జి.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. సీఎంఎఫ్ఆర్ఐ ప్రధాన శాస్త్రవేత్త జోకే కిజహకూడన్ దానవాయిపేటలో విత్తనోత్పత్తి యూనిట్ ప్రారంభం -
స్నానానికి దిగి మృత్యు ఒడికి..
కాండ్రకోట నూకాలమ్మ అమ్మవారి దర్శనానికి వచ్చిన ఓ కుటుంబానికి చెందిన బాలుడు, యువకుడు స్థానిక ఏలేరు నదిలో మునిగి మృతి చెందిన సంఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. యానానికి చెందిన కొప్పాడ సత్తిబాబు, తిరమాడి రాజు కుటుంబాలు ఈ నెల ఒకటిన అమ్మవారి దర్శనానికి వచ్చాయి. దర్శనం అనంతరం సమీపంలోని ఓ తోటలో వంటలు చేసుకుని, ఆనందంగా గడిపారు. ఈలోపు కొప్పాడ బాలు (20), అతడి మేనల్లుడు తిరమాడి నాగ విశాల వర్మ (8) ఏలేరు నదిలోకి స్నానానికి వెళ్లారు. అయితే సాయంత్రం అయినా వారిద్దరూ తిరిగిరాలేదు. దీంతో ఈ విషయాన్ని ఆ గ్రామ పెద్దలు, పెద్దాపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాత్రి పది గంటలు కావడంతో తర్వాత రోజు ఉదయాన్నే ఎస్ఐ మౌనిక, అగ్నిమాపక సిబ్బంది ఆధ్వర్యంలో గజ ఈతగాళ్లతో ఏలేరు నదిలో గాలింపు చర్యలు మొదలుపెట్టారు.మృతదేహాల లభ్యంముందుగా ఉదయం బాలుడు వర్మ మృతదేహం లభ్యమైంది. బాలు మృతదేహం సాయంత్రానికి నీటిపై తేలింది. దీంతో రెండు మృతదేహాలను పెద్దాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. దీనిపై పెద్దాపురం పోలీసలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలుకు తల్లీతండ్రితో పాటు చెల్లి హారిక ఉంది. రైల్వే డిపార్ట్మెంట్లో చిరు ఉద్యోగంతో జీవనం సాగిస్తున్నాడు. వర్మ నాలుగో తరగతి చదువుతున్నాడు.ఏలేశ్వరం/పెద్దాపురం: ఏలేరు కాలువలో స్నానానికి దిగి నలుగురు మృత్యువాత పడ్డారు. అప్పటి వరకూ స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడిపిన వారు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. పని కోసం వచ్చిన ఇద్దరు స్నేహితులు, అమ్మవారి దర్శనానికి వచ్చిన మేనమామ, మేనల్లుడు ఏలేరు కాలువలో మునిగిపోయారు. పెద్దనాపల్లి, కాండ్రకోట గ్రామాల్లో ఈ విషాద ఘటనలు జరిగాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగ్గంపేట గ్రామానికి చెందిన దేవర జీవన్ కుమార్ (19), మొల్లి వీర వెంకట దుర్గ (తరుణ్) (19), నీలాద్రి జగన్ కుమార్, దేవర దేవిశ్రీ ప్రసాద్, కొల్లిపోయిన విజయ్కుమార్, పర్రి సునీల్, వైభోగుల నారాయణమూర్తి బుధవారం కిర్లంపూడి మండలం ఎస్.తిమ్మాపురానికి తాపీపనికి వెళ్లారు. మధ్యాహ్న సమయంలో చల్లగా ఉంటుందని సమీపంలోని ఏలేశ్వరం మండల పరిధి పెద్దనాపల్లిలో ఉన్న ఏలేరు కాలువలో స్నానానికి దిగారు. అయితే ప్రమాదవశాత్తూ దేవర జీవన్ కుమార్, మొల్లి వీర వెంకట దుర్గ మునిగిపోయారు. మిగిలిన వారు సురక్షితంగా బయటపడి జగ్గంపేట పోలీసులకు సమాచారం అందించారు. ఏలేశ్వరం మండల పరిధి కావడంతో ఎస్సై రామలింగేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.కోనేటి వీధిలో విషాద ఛాయలుజగ్గంపేట: పెద్దనాపల్లి వద్ద ఏలేరు కాలువలో మునిగి చనిపోయిన ఇద్దరు యువకులు జగ్గంపేటలోని కోనేటి వీధికి చెందిన వారు కావడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి. మొల్లి వీర వెంకట దుర్గ తాపీ మేస్త్రిగా పనిచేస్తున్నాడు. దేవాలయాలపై సిమెంట్తో దేవుళ్ల బొమ్మలను రూపొందించడంతో ఎంతో నైపుణ్యం ఉంది. అతడి తండ్రి రాంబాబు కొన్ని కారణాలతో కొంతకాలం క్రితం ఇల్లు విడిచి ఎక్కడికో వెళ్లిపోయాడు. దీంతో ఆ కుటుంబ భారాన్ని దుర్గ మోస్తున్నాడు. తల్లి రాజులు, చెల్లి గాయత్రిల బాగోగులు చూసుకొంటున్నాడు. ఇప్పడు దుర్గ మృతి చెందడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది.ఇంటర్ పరీక్షలు రాసి..దేవర జీవన్ కుమార్ ఇటీవలే ఇంటర్మీడియెట్ పరీక్షలు రాశాడు. ప్రస్తుతం సెలవులు కావడంతో తాపీ పనికి వెళుతున్నాడు. అతడి తండ్రి వాసు తాపీమేస్త్రిగా పనిచేస్తున్నాడు. ఆయనకు ఇద్దరి కుమారులు. వారిలో జీవన్ చిన్నవాడు. బుధవారం మధ్యాహ్నం వరకు తాపీపని చేసిన జీవన్ తన స్నేహితులతో కలిసి ఏలేరు కాలువలో స్నానానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. -
కారు ఢీకొన్న ఘటనలో బాధితుడి మృతి
సామర్లకోట: హుస్సేన్పురంలోని వెంకట్రామ ఆయిల్ ఫ్యాక్టరీలో పని చేస్తున్న గద్దె లక్ష్మణరావు (35) కాకినాడలోని ట్రస్టు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మైనర్లు కారు డ్రైవింగ్ చేయడంతో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మోటారు సైకిల్పై వేట్లపాలెం నుంచి కాకినాడ వెళుతున్న భార్యభర్తలు తీవ్రంగా గాయపడిన విషయం విధితమే. క్షతగాత్రులు గద్దె లక్ష్మణరావు, శిరీషలను కాకినాడ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ లక్ష్మణరావు మృతి చెందాడు. శిరీష పరిస్థితి కూడా విషమంగా ఉందని బంధువులు చెబుతున్నారు. లక్ష్మణరావు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పెద్దాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. లక్ష్మణరావు మృతితో వేట్లపాలెం గాంధీనగర్లో విషాదఛాయలు అలముకున్నాయి. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. భార్య పరిస్థితి విషమం వేట్లపాలెంలో విషాదఛాయలు -
ఓడలరేవు సొసైటీ సీఈవో మృతి
అమలాపురం టౌన్: అల్లవరం మండలం ఓడలరేవు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (సొసైటీ) సీఈవో సత్తి వెంకటేశ్వరరావు (60) కాకినాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. ఆయన ఓ మహిళ ట్రాప్లో పడి నగదు, బంగారం పోగొట్టుకుని, గడ్డి మందు కలిపిన మద్యాన్ని తాగడంతో తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ మేరకు అమలాపురం పట్టణ సీఐ పి.వీరబాబు బుధవారం మాట్లాడుతూ వెంకటేశ్వరరావు మృతి చెందారని మధ్యాహ్నం 2 గంటలకు సమాచారం వచ్చిందన్నారు. ఆయనపై హత్యాయత్నం చేశారన్న అభియోగంపై ట్రాప్ చేసిన మహిళను, సహకరించిన మరో ఇద్దరిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపర్చామన్నారు. ఇప్పుడు వెంకటేశ్వరరావు మృతి చెందడంతో హత్యాయత్నం కేసును హత్యగా మార్చినట్టు వెల్లడించారు. కాగా..వెంకటేశ్వరరావుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చికిత్స పొందుతూ మృత్యువాత హత్యగా మారిన హత్యాయత్నం కేసు -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 15,500 గటగట (వెయ్యి) 14,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 14,500 గటగట (వెయ్యి) 13,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
బాలికా విద్యకు భరోసా
ముఖ్యమైన తేదీలు దరఖాస్తుల ప్రారంభం : 22 – 03 – 2025 స్వీకరణకు చివరి తేదీ : 11 – 04 – 2025 ప్రిపరేషన్ ఆఫ్ సెలక్షన్ జాబితా : ఏప్రిల్ 16 వెరిఫికేషన్ : ఏప్రిల్ 16 నుంచి 18 వరకూ.. 6, 11 తరగతులకు ఎంపికై న విద్యార్థుల జాబితా: ఏప్రిల్ 21 ఎంపికై న వారి సర్టిఫికెట్ల వెరిఫికేషన్: ఏప్రిల్ 21 నుంచి 25 వరకూ..రాయవరం: పేద, అనాథ బాలికల కోసం ఏర్పాటు చేసిన కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ) వారి విద్యకు భరోసాగా నిలుస్తున్నాయి. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా బోధన చేస్తున్నాయి. వీటిలో ప్రవేశాలకు ఏటేటా డిమాండ్ పెరుగుతోంది. సాధారణ విద్యతో పాటు ఒకేషనల్, కంప్యూటర్ విద్యను సైతం ఇక్కడ అందిస్తున్నారు. ఆంగ్ల బోధనతో పాటు ఉచిత భోజనం, వసతి, పుస్తకాలు, యూనిఫాం తదితర సౌకర్యాలు అందిస్తున్నారు. ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం కాకినాడ జిల్లాలోని నాలుగు కేజీబీవీల్లో ప్రవేశానికి విద్యార్థినులకు అవకాశం ఉంది.వీటిలో 6వ తరగతిలో ప్రవేశానికి మార్చి 27 నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. ప్రతి పాఠశాలలో 6వ తరగతికి 40 సీట్లు ఉన్నాయి. అలాగే ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు 160 సీట్లు కేటాయించారు. వీటికి ఉమ్మడి జిల్లా పరిధిలో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కేజీబీవీల వివరాలు జిల్లా సమగ్ర శిక్షా ప్రాజెక్టు కింద మైదాన ప్రాంతంలో తుని, కోటనందూరు, శంఖవరం, తొండంగిలలో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలున్నాయి. గతంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మైదాన ప్రాంతంలోని నాలుగు కేజీబీవీలతో పాటుగా రంపచోడవరం, మారేడుమిల్లి, గంగవరం, వై.రామవరం, ఎటపాక, కూనవరం, వీఆర్పురం, చింతూరులో కేజీబీవీలు ఉండేవి. జిల్లాల విభజన అనంతరం ఏజెన్సీ కేజీబీవీలు అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోకి వెళ్లాయి. ఇప్పుడు కేవలం కాకినాడ జిల్లా పరిధిలోని నాలుగు కేజీబీవీల్లో కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలోని విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశముంది. ఏటా 40 మందికి అవకాశం కేజీబీవీలలో ఏడాదికి 40 మంది వంతున 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 7, 8 తరగతుల్లో ఖాళీలను బట్టి సీట్లు కేటాయిస్తారు. జిల్లాలోని నాలుగు కేజీబీవీలో ఇంటర్ విద్యను ప్రవేశ పెట్టారు. శంఖవరం కేజీబీవీలో ఎంపీసీ, తుని, తొండంగి కేజీబీవీల్లో బైపీసీ, కోటనందూరు కేజీబీవీలో ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సులున్నాయి. వీరికి తొలి ప్రాధాన్యం అనాథ బాలికలు, సింగిల్ పేరెంట్, పేద పిల్లలతో పాటు బడి బయట ఉన్న పిల్లలు, బడి మానేసిన వారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న బాలికలకు తొలి ప్రాధాన్యత కింద కేజీబీవీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. వలస కూలీల చిన్నారులు, కార్మిక శాఖ అధికారులు సిఫారసు చేసిన వారికీ ప్రవేశాల్లో ప్రాధాన్యం ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు. రాష్ట్ర స్థాయిలో స్క్రూట్నీ అనంతరం ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఎంపికై న విద్యార్థి మొబైల్కు ఎంపికై నట్లుగా సమాచారం వస్తుంది. 2018 నుంచి కేజీబీవీల్లో ఇంటర్ విద్యనూ అందుబాటులోకి తీసుకువచ్చారు. ఫిమేల్ లిటరసీ రేటు ఆధారం ఫిమేల్ లిటరసీ రేటు తక్కువుగా ఉన్న మండలాలకు చెందిన విద్యార్థినులకు తొలి ప్రాధాన్యత ఇస్తారు. దాని ప్రకారం కాకినాడ జిల్లాలోని ఫిమేల్ లిటరసీ తక్కువుగా ఉన్న మండలాల విద్యార్థినులకు అవకాశం ఉంటుంది. సీట్లు భర్తీ కాకపోతే కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలోని ఫిమేల్ లిటరసీ తక్కువుగా ఉన్న మండలాల విద్యార్థినులతో భర్తీ చేస్తారు. గుణాత్మక విద్యాబోధన కేజీబీవీల్లో బాలికలకు క్వాలిఫైడ్ ఉపాధ్యాయులతో గుణాత్మక విద్యను అందిస్తున్నారు. వీటితో పాటు ఆంగ్ల మాధ్యమం కూడా బోధిస్తున్నారు. కార్పొరేట్ పాఠశాలలకు ఏ మాత్రం తీసిపోని విధంగా బోధన చేస్తున్నారు. రెగ్యులర్ పాఠ్యాంశాల బోధనతో పాటు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు, కంప్యూటర్ విద్య, క్రీడల్లో శిక్షణ ఇస్తున్నారు. విద్యతో పాటు కుట్లు, అల్లికలు, టైలరింగ్, బొమ్మల తయారీ, పేపర్లతో వివిధ రకాల నమూనాలు తయారు చేయడం నేర్పుతున్నారు. కబడ్డీ, టెన్నిస్, వాలీబాల్, సాఫ్ట్బాల్, హాకీ, టెన్నికాయిట్ తదితర క్రీడల్లో శిక్షణనిస్తున్నారు. నాలుగు కేజీబీవీల్లో ఒకేషనల్ కోర్సును 2023–24 నుంచి అందుబాటులోకి తీసుకుని వచ్చారు. 2024–25 నుంచి పాల్ ల్యాబ్స్ అందుబాటులోకి రాగా, ల్యాబ్లు, లైబ్రరీ రూమ్లను సిద్ధం చేస్తున్నారు. కేజీబీవీలలో చక్కని విద్యాబోధన 6వ తరగతి నుంచి ఇంటర్ వరకూ అవకాశం ప్రవేశాలకు మొదలైన దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 11 వరకూ గడువుఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ప్రతి కేజీబీవీల్లో 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తుదారులు నేరుగా కాకుండా ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల గడువు ముగియగానే పరిశీలన చేసి ప్రవేశాన్ని నిర్ణయిస్తాం. పేద విద్యార్థినులకు కేజీబీవీలో ప్రవేశం ఒక సువర్ణావకాశం. చదువు, ఆటపాటల్లో కేజీబీవీ విద్యార్థులు మెరుగైన ఫలితాలను సాధిస్తున్నారు. – జి.నాగమణి, ఆర్జేడీ, పాఠశాల విద్యాశాఖ, కాకినాడ ఆహ్లాదకర వాతావరణం కేజీబీవీల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. నిత్యం వైద్య సిబ్బంది పర్యవేక్షణలో విద్యార్థులు ఉంటారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఉపాధ్యాయుల పర్యవేక్షణలో స్టడీ అవర్లు జరుగుతాయి. ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ చూపిస్తారు. – పి.ఉమామహేశ్వరి, జీసీడీవో, ఏపీ సమగ్ర శిక్షా, కాకినాడ -
కొండెక్కుతున్న కోడిమాంసం ధరలు
సాక్షి, అమలాపురం: బర్డ్ ఫ్లూతో విలవిలలాడిన కోడి కోలుకుంటోంది. సంక్రాంతి తరువాత మొదలైన పౌల్ట్రీ రైతుల కష్టాలు.. ఇంచుమించు తెలుగు సంవత్సరాది వరకు కొనసాగాయి. గత వారం రోజుల నుంచి కోడి ధర క్రమేపీ పెరుగుతూ ఇప్పుడు కొండెక్కింది. బర్డ్ ఫ్లూ దెబ్బకు కోళ్ల పెంపకాన్ని రైతులు తగ్గించి వేయడంతో... డిమాండ్లో సగం కూడా కోళ్లు మార్కెట్కు రాకపోవడంతో వాటి ధర అంచనాలకు మించి పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. పౌల్ట్రీలపై బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తూర్పు గోదావరి జిల్లాలో 2.50 కోట్ల వరకు గుడ్లు పెట్టే కోళ్లు, నాలుగు లక్షల వరకు బ్రాయిలర్ కోళ్ల పెంపకం జరుగుతోంది. ఈ జిల్లాలో ప్రతి రోజూ 80 లక్షల కోడిగుడ్ల ఉత్పత్తి అవుతుండగా 48 లక్షల గుడ్లు ఒడిశా, బిహార్, కోల్కతాలకు ఎగుమతవుతున్నాయి. కాకినాడ జిల్లాలో ఐదు లక్షల లేయర్ కోళ్లు పెరుగుతున్నాయి. లక్షకు పైగా నాటు కోళ్ల పెంపకం జరుగుతోంది. మరో మూడు లక్షల వరకు బ్రాయిలర్ కోళ్ల పెంపకం సాగుతోందని అంచనా. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ జిల్లాలో 18 కమర్షియల్ పౌల్ట్రీ ఫామ్లు ఉండగా వీటిలో సుమారు 57 లక్షలకు పైగా కోళ్లు ఉన్నాయని పశు సంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. వీటిలో 5 లక్షల వరకు బ్రాయిలర్ ఫామ్లు కాగా, మిగిలిన లేయర్ (కోడి గుడ్డు పెట్టే) కోళ్లు. మూడు జిల్లాల్లో రోజుకు 100 టన్నుల వరకు కోడి మాంసం విక్రయాలు చేసేవారు. అదే ఆదివారం, ఇతర పండగల సమయంలో 150 టన్నుల వరకు విక్రయాలు ఉంటాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. గత ఫిబ్రవరిలో తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం కానూరి అగ్రహారంలో లక్షలాది కోళ్లు మృతి చెందడంతో ఆ ప్రభావం మూడు జిల్లాల పౌల్ట్రీలపై పడింది. బర్డ్ ఫ్లూకు ముందు కిలో చికెన్ ధర రూ.240 నుంచి రూ.260 వరకూ ఉండేది. బర్డ్ ఫ్లూ భయంతో నాలుగైదు రోజులలో అది కాస్తా కేజీ రూ.150కి పడిపోయింది. తరువాత కేజీ రూ.120కి చేరింది. ధర తగ్గడం అటుంచి వారం రోజుల పాటు ప్రభుత్వ అధికారులే కోడి మాంసం విక్రయాలను అడ్డుకున్నారు. తరువాత అమ్మకాలకు అనుమతి ఇచ్చినా నెల రోజుల పాటు చికెన్ అమ్మకాలు మూడు జిల్లాలలో దాదాపు నిలిచిపోయాయి. కేవలం మాంసం, చేపలు, రొయ్యల అమ్మకాలు మాత్రమే సాగాయి. పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాల్లోనూ, రెస్టారెంట్లు ఇలా ప్రతిచోటా చికెన్ తప్ప మిగిలిన మాంసాహారాలు మాత్రమే అందుబాటులో ఉండేవి. సంక్రాంతి నుంచి పౌల్ట్రీ పరిశ్రమ కోలుకుంటున్న సమయంలో బర్డ్ ఫ్లూ చావు దెబ్బతీసింది. జిల్లా సరిహద్దును ఆనుకుని తూర్పు గోదావరి జిల్లాలో మొదలైన బర్డ్ ఫ్లూ వైరస్ దెబ్బ కోనసీమ జిల్లా పౌల్ట్రీని కుదేలు చేసింది. ఈ జిల్లాలో వైరస్ జాడ లేకున్నా అమ్మకాలపై ప్రభావం చూపుతోంది. కోడి మాంసం, కోడి గుడ్డు అమ్మకాలను అధికారులు నిషేధించడంతో ధర పడిపోయి రైతులు.. అమ్మకాలు లేక వ్యాపారులు ఆందోళన చెందారు. ధర పెరిగినా రైతుకు ఒరిగిందేమీ లేదు పౌల్ట్రీ వ్యాపారంలో గత మూడు నెలల నుంచి తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం. బర్డ్ ప్లూ వైరస్ వదంతులతో పెంచిన కోళ్లను ఇంకా మేపలేక దశల వారీగా విక్రయించుకుని తీవ్రమైన నష్టాలను చవిచూశాం. ఇటీవల ఉగాది, రంజాన్ సందర్భంగా బాయిలర్ ధరల పెరిగినా రైతులకు ఒరిగిందేమీ లేదు. ప్రస్తుతం బాయిలర్ కోళ్లు రైతుల వద్ద లేకపోవడంతో కంపెనీల నుంచి దిగుమతి చేసుకోవడంతో ఆ లాభాలు వాళ్లకే వెళ్లిపోతున్నాయి. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పెరిగిన ధర నిలకడగా ఉండే అవకాశం కూడా లేదు. – బొబ్బా వెంకన్న, పౌల్ట్రీ రైతు,పెదపళ్ల, ఆలమూరు మండలం, కోనసీమ జిల్లా బర్డ్ఫ్లూ నుంచి కోలుకుంటున్న కోడి భారీగా పెరిగిన బ్రాయిలర్.. లేయర్ కోడి ధరలు బ్రాయిలర్ రైతు వద్ద కేజీ రూ.152, రిటైల్ రూ.175 లేయర్ లైవ్ రైతు వద్ద కేజీ రూ.125 బ్రాయిలర్ మాంసం కేజీ రూ.300.. లేయర్ మాంసం కేజీ రూ.200 డిమాండ్లో మూడు వంతులు మాత్రమే మార్కెట్కు బర్డ్ ఫ్లూతో ఇంచుమించు నెలన్నర రోజులు అతలాకుతలమైన పౌల్ట్రీ పరిశ్రమ పది రోజులుగా కోలుకుంటోంది. కోడి మాంసం ధరలు క్రమేపీ పెరుగుతున్నాయి. బ్రాయిలర్ లైవ్ రైతు వారీ కేజీ ధర రూ.152 వరకు ఉండగా షాపుల వద్ద లైవ్ రిటైల్ ధర కేజీ రూ.175 నుంచి రూ.180 వరకు ఉంది. కేజీ మాంసం ధర రూ.300కు పైబడి ఉంది. ఇక లేయర్ రిటైల్ ధర కేజీ రూ.125 నుంచి రూ.130 వరకు ఉండగా, మాంసం ధర కేజీ రూ.200 వరకు ఉంది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితి చూస్తే బ్రాయిలర్, లేయర్ మాంసం ధరలు మరింత పెరిగే అవకాశముందని రైతులు, వ్యాపారులు అంచనా వేస్తున్నారు. బర్డ్ఫ్లూ ప్రచారం వల్ల బ్రాయిలర్ ఫిబ్రవరి 15 నుంచి మార్చి మొదటి వారం వరకు కొత్త బ్యాచ్లు (కోళ్లు పెంచడాన్ని) తగ్గించారు. దీనివల్ల మార్కెట్కు డిమాండ్కు తగిన కోళ్లు రావడం లేదు. ఇప్పుడున్న అవసరాలలో మూడవ వంతు కూడా కోళ్ల లభ్యత లేదని అమలాపురానికి చెందిన కోడి మాంసం విక్రయదారుడు యేసు సాక్షికి తెలిపాడు. ఈ కారణంగానే కోడి మాంసం ధరలకు రెక్కలు వచ్చాయి. -
157 నీటితొట్టెల నిర్మాణం
పెరవలి: వేసవిలో పశువుల దాహార్తిని తీర్చేందుకు జిల్లాలోని 15 మండలాల్లో 157 నీటితొట్టెలు నిర్మించనున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. పెరవలి మండలం ముక్కామలలో నీటితొట్టెల నిర్మాణానికి మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, ఈ నీటితొట్టెలను ఆయా పంచాయతీలు నిర్వహిస్తాయని చెప్పారు. కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకం కింద జిల్లావ్యాప్తంగా 157 గ్రామాల్లో నీటితొట్టెల నిర్మాణానికి రూ.50.24 లక్షలు కేటాయించామని తెలిపారు. ఈ పనులు ఏప్రిల్ 10 నాటికి పూర్తి చేస్తామన్నారు. పెరవలి మండలంలో 18, చాగల్లు 10, దేవరపల్లి 10, గోపాలపురం 4, కొవ్వూరు 8, నల్లజర్ల 5, రాజానగరం 44, రంగంపేట 15, తాళ్లపూడి 5, నిడదవోలు 23, ఉండ్రాజవరంలో 15 చొప్పున నీటితొట్టెలు నిర్మిస్తామని వివరించారు. కార్యక్రమంలో డ్వామా పీడీ ఎం.నాగమల్లేశ్వరరావు, డీఆర్డీఏ పీడీ ఎన్వీవీఎస్ మూర్తి, ఎంపీడీఓ సీహెచ్ వెంకటరమణ, తహసీల్దార్ డి.అచ్యుత కుమారి, పశువైద్యాధికారి చరణ్ తదితరులు పాల్గొన్నారు. 2.35 లక్షల మందికి పింఛన్లు పెరవలి: జిల్లావ్యాప్తంగా ప్రతి నెలా 2,35,076 మందికి రూ.102.28 కోట్ల మేర ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. పెరవలి మండలం ముక్కామలలో ఆయన, కలెక్టర్ పి.ప్రశాంతి మంగళవారం పింఛన్లు పంపిణీ చేశారు. గ్రామంలో ఇద్దరికి కొత్తగా మంజూరైన పింఛన్లను అందజేశారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ ఎన్వీవీఎస్ మూర్తి, ఎంపీడీఓ సీహెచ్ వెంకట రమణ, తహసీల్దార్ డి.అచ్యుత కుమారి తదితరులు పాల్గొన్నారు. ముగిసిన ‘పది’ పరీక్షలు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మంగళవారంతో ప్రశాంతంగా ముగిశాయి. మార్చి నెల 17వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ పరీక్షలను జిల్లా వ్యాప్తంగా 134 కేంద్రాల్లో నిర్వహించారు. చివరి రోజు సోషల్ పరీక్ష జరిగింది. దీనికి 23,846 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, 23,440 మంది రాశారు. డీఈవో మూడు పరీక్షా కేంద్రాలను, తనిఖీ అధికారులు 42 పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. -
మహాప్రభో.. మా కులమేదో చెప్పండి!
పెరవలి: ఊరూరా తిరుగుతూ.. బుర్ర కథలు చెబుతూ.. పగటి వేషాలు వేస్తూ.. ప్రజలకు వినోదాన్ని పంచుతూ.. చైతన్యాన్ని నింపే సంచార జీవులు బేడ బుడగ జంగాలవారు. దేవుని భక్తిని, దేశభక్తిని నింపుతూ.. చారిత్రక గాథలను పాటలుగా ఆలపిస్తూ.. కథలుగా చెబుతూ జీవనం సాగించేవారు. కొంత మంది వ్యవసాయం, కూలి పనులు చేసుకుంటే జీవించేవారు. కాలం సమాజంలో ఎన్నో మార్పులు తెచ్చింది. వీరి జీవితంలో కూడా మార్పులు వచ్చాయి. కొంత మంది ఇప్పటికీ కుల వృత్తిని కొనసాగిస్తూండగా.. మరి కొంత మంది జీవితంలో ఓ మెట్టు పైకెక్కాలనే ఆకాంక్షతో ఉన్నత చదువులు చదువుకున్నారు.. చదువుకుంటున్నారు. అయితే, కొన్నేళ్లుగా వీరి కులమేమిటో ప్రభుత్వం ధ్రువీకరించకపోవడంతో ఇటు ప్రభుత్వ పథకాలు, అటు ఉద్యోగాల వంటి వాటికి దూరమవుతున్నారు. ప్రభుత్వం చిన్నచూపు చూస్తూండటంతో తాము ఎంతో నష్టపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. ఏం జరిగిందంటే.. రాజ్యాంగం 341 షెడ్యూలు, 1950లో రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం బేడ బుడగ జంగాల వారిని షెడ్యూల్డ్ కులానికి చెందిన వారిగా పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం ఎస్సీ కేటగిరీలో 59 కులాలు ఉండగా.. అందులో తొమ్మిదో కులంగా బుడగ జంగాలు ఉన్నారు. అప్పటి నుంచి వారు ఎస్సీలుగానే కొనసాగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2008లో కొంత మంది తెలంగాణ నాయకులు ఆంధ్ర ప్రాంతంలో బుడగ జంగాలు లేరని చెప్పి, జీఓ 144 తీసుకువచ్చారు. దీని ఫలితంగా మన రాష్ట్రంలో వీరికి ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాల జారీని నిలిపివేశారు. దీంతో వీరు కేవలం ఓటర్లుగానే ఉన్నారు తప్ప, కుల ధ్రువీకరణ లేక ప్రభుత్వ పరంగా అందాల్సిన పథకాలు, సబ్సిడీ రుణాలు, ఇతర సౌకర్యాలకు దూరమయ్యారు. వ్యాపారం చేద్దామంటే బ్యాంకులు అప్పులు ఇవ్వని దుస్థితి. గత్యంతరం లేక రెక్కల కష్టం పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. తమ బతుకుల్ని చిందరవందర చేసిన 144 జీఓను రద్దు చేయాలని పదహారేళ్లుగా బుడగ జంగాలు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. జిల్లాలో 5 వేల మందికి ఇక్కట్లు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4 లక్షల మంది బుడగ జంగాల వారు ఉండగా.. జిల్లాలో వీరి జనాభా సుమారు 5 వేలు. వీరిలో చదువుకున్న వారు సుమారు 2 వేల మంది ఉన్నారు. డిగ్రీ చదివి, కేవలం కుల ధ్రువీకరణ లేక.. ఉద్యోగాలు పొందలేక అనేక మంది నానా ఇబ్బందులు పడుతున్నారు. గత్యంతరం లేక దువ్వెనలు, పిన్నీసులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. మండల కేంద్రమైన పెరవలిలో సుమారు 500 మంది బుడగ జంగాల వారున్నారు. గతంలో ఎస్సీ గుర్తింపు ఉన్న సమయంలో పిల్లలను హాస్టళ్లలో వేసి చదువు చెప్పించేవారు. 144 జీఓ వచ్చిన తరువాత హాస్టల్ సదుపాయాన్ని కోల్పోయారు. అంతే కాదు.. చదువులు, ఇతరత్రా పథకాలకు ప్రభుత్వ సహాయం లభించని దుస్థితి. ఫలితంగా బుడగజంగాల్లో చదువుకున్న పిల్లలకు సైతం ఉద్యోగాలు దూరమయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తే బుడగ జంగాలకు బీసీ ధ్రువీకరణ పత్రం ఇస్తామంటున్నారని, అది కూడా మాటలే తప్ప అధికారకంగా ఏమీ లేదని వారు వాపోతున్నారు. తమకు అన్నివిధాలా నష్టదాయకంగా మారిన జీఓ 144ను వెంటనే రద్దు చేసి, బంగారు భవిష్యత్తును అందుకునే అవకాశాన్ని తమ పిల్లలకు కల్పించాలని కనపడిన నాయకులను, అధికారులను వారు వేడుకుంటూనే ఉన్నారు. గాల్లో కలిసిన చంద్రన్న హామీలు జీఓ రద్దు కోసం పదహారేళ్లుగా బుడగ జంగాల వారు అనేక రూపాల్లో ఉద్యమించారు. 2014 ఎన్నికల సమయంలో పాదయాత్ర చేస్తున్న ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెరవలి మండలంలో తీపర్రులో సభ నిర్వహించారు. తాను అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో బుడగ జంగాలను ఎస్సీలుగా మారుస్తానని ఆ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆయన అధికార పగ్గాలు చేపట్టారు కానీ, ఇచ్చిన హామీ మాత్రం నెరవేర్చలేదు. 2018 మార్చి 20న బుడగ జంగాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యలమర్తి మధు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. అప్పట్లో టీడీపీ మంత్రుల బృందం వచ్చి మధు దీక్షను విరమింపజేశారు. ప్రభుత్వం జేసీ శర్మ కమిటీ వేసిందని, 3 నెలల్లో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీకి కూడా నేటికీ అతీగతీ లేదు. ఇదిలా ఉండగా ఎస్సీ వర్గీకరణపై 2024 ఆగస్టులో ఇచ్చిన తీర్పు ప్రకారం బుడగ జంగాలను ఎస్సీల్లో 9వ కులంగా, కేటగిరీ–1ఎగా గుర్తించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు కూడా ఇచ్చింది. ఇది కూడా ఇప్పటి వరకూ అమలుకు నోచుకోలేదు. బుడగ జంగాలను ఎస్సీ కేటగిరీ–1ఎలో చేరుస్తూ తాజాగా రాష్ల్ర అసెంబ్లీ మరోసారి తీర్మానం చేసింది. దీనిని కేంద్రానికి పంపించాలని నిర్ణయించింది. అయితే, గతంలో కూడా ఇదేవిధంగా తీర్మానాలు చేసి, పంపించినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈసారి ఏం జరుగుతుందోనని బుడగ జంగాల వారు ఎదురు చూస్తున్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో..కుల ధ్రువీకరణకు దూరమై, దైన్యంగా జీవితాలు గడుపుతున్న బుడగ జంగాల వారి ఇబ్బందులను గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం గుర్తించింది. ఎస్సీల్లో చేర్చాలంటూ చేసిన తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించేంత వరకూ ఈ వర్గం వారు నష్టపోకూడదని భావించింది. ఈ మేరకు వీరికి ఎటువంటి కుల ధ్రువీకరణ పత్రం లేకుండానే, సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా ప్రభుత్వ పథకాలు అందించింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వారికి ఈ సౌకర్యం దూరమైంది. ఫ 16 ఏళ్లుగా కుల ధ్రువీకరణకు నోచుకోని బేడ బుడగ జంగాలు ఫ 6 నెలల్లో ఎస్సీల్లో చేరుస్తామని 2013లో చంద్రబాబు హామీ ఫ 3 నెలల్లో అని 2018లో మరోసారి వాగ్దానం ఫ కుల నిర్ధారణ లేక అందని ప్రభుత్వ పథకాలు పిల్లల బతుకులైనా బాగుండాలి జీఓ 144ను రద్దు చేసి మా పిల్లలకు చదువుకునే అవకాశం కల్పించాలి. దీనికోసమే మా పోరాటం. మా బతుకులు ఎలాగూ తెల్లారిపోయాయి. మా పిల్లల బతుకులైనా బాగుండాలి. – పస్తాల రాధాకృష్ణ, పెరవలి మైక్రో బయాలజీ చదివినా.. నేను డిగ్రీలో మైక్రోబయాలజీ చదివాను. కానీ ఏమీ ఫలితం లేకుండా పోయింది. కుల ధ్రువీకరణ లేక.. ఉద్యోగం రాక.. బతకటానికి బోర్లు వేస్తున్నాను. కొత్తగా మాకు ఏమీ కల్పించవద్దు. 2008 వరకూ మాకున్న సౌకర్యాలు అలాగే ఇస్తే చాలు. 144 జీఓ రద్దు చేసి, మమ్మల్ని గతంలో మాదిరిగానే ఎస్సీలుగా కొనసాగించాలి. – పేర్ల చిరంజీవి, పెరవలి రేషన్ కార్డు కూడా ఇవ్వడం లేదు కుల ధ్రువీకరణ లేక మాకు రేషన్ కార్డు కూడా ఇవ్వడం లేదు. అసలే పనుల్లేక ఊరూరా తిరుగుతూ పిన్నీసులు, రబ్బర్ బ్యాండ్లు అమ్మి బతుకుతున్నాం. ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం పొందలేకపోతున్నాం. – పస్తం వెంకట దుర్గమ్మ, పెరవలి అన్ని విధాలా నష్టం జీఓ 144 వలన అన్ని విధాలా నష్టపోతున్నాం. చదువు, ఉద్యోగాల్లో అవకాశాలు కోల్పోతున్నాం. ప్రభుత్వాలు మా జీవితాలతో ఆడుకుంటున్నాయి. జీఓ 144 రద్దు కోసం ఎన్నో పోరాటాలు చేశాం. నాయకులు హామీలిచ్చారు కానీ అమలు చేయడం లేదు. అయినా పోరాడతాం. మా పిల్లల కోసం తప్పదు కదా! – పేర్ల నాగులు, జిల్లా ఉపాధ్యక్షుడు, బేడ బుడగ జంగాల హక్కుల పోరాట సమితి, పెరవలి