కేజ్రీవాల్కు ఈసీ మందలింపు
ఓటుకు ‘లంచం’వ్యాఖ్యలపై మండిపాటు
న్యూఢిల్లీ: గోవా ఎన్నికల ప్రచారంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చేసిన ఓటుకు లంచం వ్యాఖ్యలను ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. మరోసారి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే ఆప్ గుర్తింపు రద్దుతో పాటు ఎలాంటి చర్యలకైనా వెనకాడబోమని హెచ్చరించింది. ‘కాంగ్రెస్, బీజేపీలు వచ్చి డబ్బులు పంచుతాయి. వాటిని తీసుకోండి. ఓటు మాత్రం ఆప్కే వేయండి’ అని గోవాలో ఎన్నికల ర్యాలీలో కేజ్రీవాల్ గతంలో అన్నారు. దీనిపై ఈసీ 16న షోకాజ్ నోటీసు జారీ చేసింది.
ఈసీ ఆదేశాలను కేజ్రీవాల్ తప్పుపట్టారు. దీనిపై కోర్టులో సవాలు చేస్తానన్నారు. ‘కింది కోర్టు నాకు అనుకూలంగా తీర్పునిచ్చింది. కానీ ఈసీ దాన్ని పట్టించుకోలేదు’అంటూ ఢిల్లీ సీఎం ట్వీట్ చేశారు. ఈసీకి ఇచ్చిన సమాధానంలో కూడా కేజ్రీవాల్ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. తానే ఓటరుకీ లంచం ఇవ్వజూపలేదని, ఆ దిశగా ఎవరినీ ప్రోత్సహించలేదని పేర్కొన్నారు.