చీటింగ్ కేసులో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్
హైదరాబాద్: ఫ్రెషర్లకు శిక్షణ ఇస్తానంటూ మోసం చేసిన కేసులో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ను పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరుకు చెందిన ఎం.శ్రీకాంత్ గతంలో ఐబీఎం, డెల్లాయిట్, ఎరిక్సన్ సంస్థల్లో పని చేశాడు. ఆపై మహారాష్ట్రలోని పుణే చిరునామాతో 4వీస్ కన్సల్టింగ్ అండ్ ట్రైనింగ్ పేరుతో సంస్థను ఏర్పాటు చేశాడు.
సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు ట్రైనింగ్ ఇస్తానంటూ వివిధ జాబ్ పోర్టల్స్లో ప్రచారం చేసుకున్నాడు. వీటిలో శ్రీకాంత్ ప్రొఫైల్ చూసిన దోమలగూడలోని ఎలాంత్ర కన్సల్టెన్సీస్ సంస్థ సంప్రదించింది. 16 మంది ట్రైనీలకు శిక్షణ ఇవ్వడానికి అంగీకరించిన శ్రీకాంత్ రూ.2.79 లక్షలు తీసుకుని మోసం చేశాడు. ఎలాంత్ర కన్సల్టెన్సీస్ నిర్వాహకుడు అషీత్ రాజ్ సక్సేనా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్క్రైం పోలీసులు గురువారం శ్రీకాంత్ను అరెస్టు చేశారు.