39 ప్రభుత్వాస్పత్రుల్లో డయాలసిస్ సేవలు
- 268 సింగిల్ యూజ్డ్ డయాలసిస్ యూనిట్ల కొనుగోలు పూర్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కిడ్నీ రోగులకు ఉపశమనం కలిగించే వార్త ఇది. ఇప్పటివరకు రాజధాని, నగర ప్రాంతాల్లోనే ఉన్న రక్తశుద్ధి కేంద్రాలను ఇకపై స్థానికంగానూ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలోని 39 ప్రభుత్వాస్పత్రుల్లో దేశంలోనే తొలిసారిగా 268 సింగిల్ యూజ్డ్ డయాలసిస్ యంత్రాలను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే ఈ పరికరాల కొనుగోలు ప్రక్రియ పూర్తయింది. తెలంగాణ వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసింది.
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానంలో ఈ డయాలసిస్ యూనిట్లను నిర్వహించనున్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద డయాలసిస్ అవసరమైన రోగులందరికీ ఉచితంగా ఈ సేవలను అందించనున్నారు. ఈ పరికరాల నిర్వహణను డి మెడ్ డయలైజ్ హిజ్మెట్లరీ అనే సంస్థ చేపట్టనుంది. ఆరోగ్యశ్రీ నిధుల నుంచి ప్రభుత్వం ఒక్కో డయాలసిస్కు రూ.1,375 చొప్పున చెల్లించనుంది. వారసత్వంతోపాటు నీటి కాలుష్యం, మారిన ఆహార అలవాట్ల వల్ల మూత్రపిండాలు చెడిపోవడం పెరుగుతోంది. ఆరోగ్యశ్రీ కింద రక్తశుద్ధి చేసుకునే రోగులు రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 10 వేల మంది ఉన్నారు. ఏటా 1,500 మంది కిడ్నీ రోగులు కొత్తగా నమోదవుతున్నారు. దీంతో డయాలసిస్ సేవల కేంద్రాల అవసరం పెరుగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లోని ప్రధాన వైద్యశాలల్లో మాత్రమే డయాలసిస్ యూనిట్లు ఉండేవి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత నిజామాబాద్, ఆదిలాబాద్, సిద్దిపేట, మహబూబ్నగర్ ఆస్పత్రుల్లోనూ కొత్తగా డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటికి అదనంగా ఇప్పుడు కొత్తగా 39 ఆస్పత్రులలో 268 యూనిట్లను, ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు.
దేశంలోనే తొలిసారి
దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ వైద్యశాలల్లో సింగిల్ యూజ్డ్ డయాలసిస్ కేంద్రా లను నెలకొల్పుతున్నాం. ఆరో గ్యశ్రీ పరిధిలో ఉన్న రోగులకు ఉచితంగా త్వరలోనే ఈ సేవ లు అందుబాటులోకి వస్తాయి. సింగిల్ యూజ్డ్ డయాలసిస్ వల్ల ఇన్ఫెక్షన్ సమస్యలు ఉండవు.
– సి.లక్ష్మారెడ్డి, వైద్య ఆరోగ్య మంత్రి