frod
-
చేపల పేరు.. బ్యాంక్ను ముంచేశారు
భీమవరం : పేదోళ్లకు రూ.10 వేలు రుణం ఇవ్వాలంటే సవాలక్ష ఆంక్షలు విధించి.. పూచీకత్తులు అడిగే బ్యాంకులు బడాబాబులు, మోసగాళ్లకు మాత్రం కోట్లాది రూపాయల్ని దోచిపెడుతున్నాయి. భీమవరంలో ఇలాంటి వ్యవహారమే వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. టౌటూన్ ప్రాంతంలోన రూ.3 కోట్ల విలువైన ఒక లాడ్జిని బ్యాంకులో కుదువబెట్టి.. చేపల పెంపకానికంటూ ఓ ఆసామి 2009లో ఏకంగా రూ.11 కోట్లను రుణంగా పొందాడు. అప్పటినుంచి పైసాకూడా చెల్లించకపోవడంతో బ్యాంక్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో ఈ వ్యవహారంపై విచారణ జరపగా, విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. మోసపోయామని తెలుసుకున్న బ్యాంక్ అధికారులు చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టుగా రూ.3 కోట్ల విలువైన సదరు ఆస్తిని స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో బ్యాంక్కు టోకరా వేసిన వ్యక్తి తరఫున అధికార పార్టీకి చెందిన నాయకులు రంగంలోకి దిగారు. ఆ ఆస్తిని బ్యాంక్కు ఇచ్చేది లేదని, ఎంతోకొంత సొమ్ము కట్టించుకుని సెటిల్మెంట్ చేసుకోవాలంటూ ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. దీంతో ఏం చేయాలో తెలియక బ్యాంక్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఊరుపేరూ లేకపోయినా.. రుణాలిచ్చే సందర్భంలో బ్యాంకులు కచ్చితమైన నిబంధనలు పాటిస్తాయి. హామీగా పెట్టే ఆస్తిపాస్తుల వివరాలను ఒకటికి రెండుసార్లు సరిచూసుకుంటాయి. కానీ.. ఈ వ్యవహారంలో బ్యాంక్ అధికారులు కనీస ప్రమాణాలు కూడా పాటించలేదనే విషయం రూఢీ అవుతోంది. ఓ ఆసామికి చెందిన లాడ్జిని హామీగా పెట్టుకుని 12మంది పేరిట రూ.11 కోట్ల రుణం మంజూరు చేశారు. రుణగ్రస్తులు ఏ ఊరు వారు, వారి తల్లిదండ్రులెవరనే వివరాలు లేకుండానే రుణం ఇవ్వడం, ఆ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాలకు జమ చేయకుండా ఒకే వ్యక్తికి ఇవ్వడం వెనుక బ్యాంక్ అధికారుల హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విచిత్రం ఏమిటంటే.. బ్యాంక్కు కుదువబెట్టిన 18 సెంట్ల స్థలం, అందులో నిర్మించిన మూడు అంతస్తుల లాడ్జి విలువ రుణం పొందేనాటికి రూ.3 కోట్లు. అయితే, టోకరా వేసిన వ్యక్తి, బ్యాంక్ అధికారులు, కుమ్మక్కై దాని విలువను రూ. 17 కోట్లుగా చూపించారు. రుణం కాల పరిమితి మించిపోవడంతో 2013 డిసెంబర్ 5న నోటీసులు ఇచ్చినట్టు రికార్డుల్లో చూపిస్తున్నా.. రుణగ్రహీతలకు 2016 ఆగస్టులో నోటీలు ఇవ్వడం వెనుక మతలబు ఏమిటనేది చర్చనీయాంశమైంది. బ్యాంకు నుంచి తీసుకున్న రుణం, వడ్డీ కలిపి 2013 జూన్ నాటికి రూ.14 కోట్లకు చేరగా, మూడున్నరేళ్లతో ఆ మొత్తం దాదాపు రూ.20 కోట్లకు చేరింది. మరోవైపు చేపలు పెంచుతున్నామంటూ చూపించిన చెరువుల పత్రాలు కూడా అసలైనవి కావని సమాచారం. ఇదిలావుంటే.. లాడ్జిని బ్యాంకులో కుదువపెట్టిన ఆస్తికి సంబంధించి భీమవరం మునిసిపాల్టీకి 2008 నుంచి ఇప్పటివరకు సుమారు రూ.23 లక్షల పన్ను చెల్లించలేదు. బ్యాంక్ నుంచి రుణం పొందే ఆస్తిపై పన్నుల చెల్లింపునకు సంబంధించి విధిగా ’నో డ్యూస్’ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. లక్షలాది రూపాయల పన్ను బకాయి ఉన్నా మునిసిపాలిటీ నుంచి సదరు పత్రాలు పొందటం వెనుక పెద్దల హస్తం ఉందని చెబుతున్నారు. వాస్తవాలను గమనించిన బ్యాంక్ అధికారులు ఈ వ్యవహారంపై దృష్టి సారించడంతో రాజకీయ పెద్దలు రంగంలోకి దిగారు. కొద్దిమొత్తంలో బకాయి చెల్లించి.. వసూలు కాని బకాయిల జాబితాలో చేర్చడం ద్వారా రుణాన్ని ఎగవేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెరవెనుక ఓ ఉన్నతస్థాయి ప్రజాప్రతినిధి పావులు కదుపుతుండటంతో ఆస్తి స్వాధీనానికి ఉత్తర్వులు జారీ చేసినా.. బ్యాంక్ అధికారులు బకాయి రాబట్టుకునే విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. -
బంపర్ ఆఫర్ పేరిట మోసం
భైంసాలో బాధితుల ఆందోళన పోలీస్స్టేషన్లో కేసు నమోదు భైంసా : శ్రీవరలక్ష్మీ మార్కెటింగ్ పేరిట రంగుల బ్రోచర్లను ముద్రించి బంపర్ ఆఫర్ అంటూ ఆశ చూపి నిరక్షరాస్యులను, గ్రామీణ ప్రాంత వాసులను నిలువుగా ముంచేశారు. మోసపోయామని గ్రహించిన బాధితులు సదరు దుకాణం వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులను ఆశ్రయించారు. భైంసా పట్టణ ఎస్సై మహేందర్ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఇదీ జరిగింది... భైంసా డివిజన్లోని చుట్టుపక్కల ప్రాంతాల్లో, పట్టణంలోని పలు కాలనీల్లో గుర్తుతెలియని కొంతమంది శ్రీవరలక్ష్మీ మార్కెటింగ్ బంపర్ ఆఫర్ టికెట్లను విక్రయించారు. ఒక్కో టికెట్ రూ.2వేలకు అమ్మారు. కార్డు తీసుకుని కస్టమర్లు డబ్బులు ఇవ్వగానే వారికి అదే రోజు స్క్రాచ్ కార్డులను కూడా అందించారు. బ్రోచర్లో వాషింగ్మిషన్, 21 ఇంచుల ఎల్సీడీ టీవీ, 10 గ్రాముల బంగారం, ల్యాప్టాప్, రిఫ్రిజిరేటర్, డీవీడీ ప్లేయర్, హోంథియేటర్, 10 లీటర్ల ప్రెషర్ కుక్కర్, స్టాండింగ్ ఫ్యాన్, ఇండక్షన్ స్టౌ, రైస్కుక్కర్, మిక్సర్గ్రైండర్ లక్కీగా ఇస్తామని చెప్పారు. ఈ నెల 30న భైంసాలో లక్కీ స్కీం ఉంటుందని ప్రకటించారు. కార్డులు కొనుగోలు చేసిన బాధితులంతా శనివారం భైంసా చేరుకున్నారు. సదరు దుకాణం ముందుకు చేరుకోగానే కార్డులు అందించిన వారంతా పత్తాలేకుండా పోయారని తెలుసుకున్నారు. తాము మోసపోయామంటూ కొనుగోలుచేసిన కార్డులు, టికెట్లు చేతపట్టుకుని భైంసా–నిర్మల్ 61వ జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పట్టణ పోలీసులు 60 టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఎక్కువగానే ముంచారు వరలక్ష్మీ బంపర్ స్కీం పేరిట గుర్తుతెలియని వ్యక్తులు పెద్ద సంఖ్యలోనే కార్డులు విక్రయించినట్లు తెలుస్తోంది. నిర్మల్ డివిజన్ అంతా ఈ కార్డులు విక్రయించినట్లు సమాచారం. వందల సంఖ్యల్లోనే కార్డులన్నీ లక్షల రూపాయలతో ఉడాయించిన ఈ ముఠాపై దష్టిసారించాల్సిన అవసరం ఉంది. మరో రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో బాధితుల సంఖ్య తేలనుంది. ఇలాంటివాటిని నమ్మవద్దు : మహేందర్, పట్టణ ఎస్సై లక్కీ స్కీం, బంపర్ ఆఫర్లపేరిట గుర్తుతెలియని వ్యక్తులు చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దు. ఇలాంటి వారి ఆచూకీ తెలిస్తే మాకు సమాచారం ఇవ్వండి. అనుమతులు లేకుండా, నిబంధనలు పాటించకుండా ఇలాంటి వ్యాపారం చేసేవారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం.