పనులు గిట్లిస్తే... మా ఖర్చులెట్లెల్లాలె సారూ!
మంత్రి హరీశ్ ఎదుట మాచారెడ్డి జెడ్పీటీసీ
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: అరమరికలు, దాపరికం లేకుండా మనసులో మాట బయటపెట్టింది నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి జెడ్పీటీసీ సభ్యురాలు గ్యార పెద్ద లక్ష్మి. అమాయకంగా మంత్రి హరీశ్తో ‘చెరువుల పనులన్నీ గిట్ల టెండర్లతోని ఇస్తే మరి మా ఖర్చులెట్లెల్లాలే, పెట్టుబడులు ఎట్ల సారు’ అంటూ ఉన్నదున్నట్లుగా మాట్లాడిన ఆమె అందరినీ ఆశ్చర్యపరిచింది. ‘మిషన్ కాకతీయ’లో భాగంగా శుక్రవారం నిజామాబాద్ జిల్లా పరిషత్లో చెరువుల పునరుద్దరణపై అవగాహన సదస్సు నడుస్తోంది.
ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ పునరుద్ధరణ పనులలో అక్రమాలకు తావులేకుండా అధికారులు వ్యవహరించాలని, ఈ-టెండర్ల ద్వారానే పనులు అప్పగించాలని సూచించారు. ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తలొగ్గరాదన్నారు. ఇంతలో మాచారెడ్డి జెడ్పీటీసీ లక్ష్మి ‘దళిత మహిళా జెడ్పీటీసీ హక్కులను కాపాడండి’ అని రాసిన ఫ్లకార్డును చేతితో పట్టుకుని లేచి నిలబడింది.
ఆమె ఏదో సమస్య గురించి వివరిస్తుందని అనుకున్నారు. కానీ, ‘‘ప్రస్తుతం మండలాల్లో, గ్రామాలలో పనులు లేవు, గీ చెరువుల పనులేమో టెండర్లంటున్నరు.. గిట్లయితే పెట్టుబడెట్లెల్లాలే సారు’’ అంటూ అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనికి స్పందించిన మంత్రి హరీష్ ‘‘ ఏం పెట్టుబడి పెట్టావమ్మా.. ఖర్చులు దేనికైనయ్’’ అని అడగగా, ఆమె అమాయకంగా ‘‘జెడ్పీటీసీగా పోటీ చేసి చాలా ఖర్చు చేశాం. ఖర్చులు తీయడానికి ఏదైనా మార్గం చూపించండి సారు’’ అనడంతో మంత్రితో సహా అందరూ ఒక్కసారిగా నవ్వారు.