భారత్కు రెండో ఓటమి
వరల్డ్ జూనియర్ టెన్నిస్ టోర్నీ
ప్రోస్టెజోవ్ (చెక్ రిపబ్లిక్) : అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) వరల్డ్ జూనియర్ బాలికల టెన్నిస్ ఫైనల్స్ టోర్నమెంట్లో భారత్కు వరుసగా రెండు పరాజయాలు ఎదురయ్యాయి. గ్రూప్ ‘బి’ తొలి మ్యాచ్లో ఆతిథ్య చెక్ రిపబ్లిక్ చేతిలో 1-2తో ఓడిన భారత్... రెండో మ్యాచ్లో 0-3తో ఇటలీ చేతిలో ఓటమి చవిచూసింది. దాంతో భారత్ సెమీఫైనల్ చేరుకునే అవకాశాలకు తెరపడింది. భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ అమ్మాయి అమినేని శివానికి మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. చెక్ రిపబ్లిక్తో జరిగిన తొలి సింగిల్స్ మ్యాచ్లో శివాని 6-4, 6-4తో సిస్కోవాపై గెలి చింది.
అయితే రెండో సింగిల్స్లో మహెక్ జైన్ 4-6, 5-7తో ఇవానా సెబెస్తోవా చేతిలో ఓడింది. నిర్ణాయక డబుల్స్లో శివాని-మహెక్ ద్వయం 2-6, 3-6తో ఇవానా-సిస్కోవా జంట చేతిలో ఓడిపోవడంతో భారత్కు పరాజయం తప్పలేదు. ఇటలీతో జరిగిన పోటీలో తొలి సింగిల్స్లో శివాని 4-6, 1-6తో ఫెడెరికా చేతిలో... రెండో సింగిల్స్లో మహెక్ 4-6, 5-7తో ఎలిజెబెట్టా చేతిలో ఓడారు. డబుల్స్లో శివాని-ప్రింకిల్ ద్వయం 1-6, 4-6తో ఫెడెరికా-ఎలిజెబెట్టా జంట చేతిలో ఓడింది.