Gods land
-
శ్రీకృష్ణుడికే పంగనామాలు
ఓజిలి : ఆలయ పూజారి తాను పూజించే శ్రీకృష్ణుడికే పంగనామాలు పెట్టి దేవుడి మాన్యం భూములను గుటకాయాస్వాహా చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. మొత్తం 7.55 ఎకరాల భూమిలో వచ్చే ఫలసాయాన్ని పూజారి ఎన్నో ఏళ్లుగా అనుభవిస్తూ ఆ భూములను రెవెన్యూ రికార్డుల్లో పేర్లు తారుమారు చేసి విక్రయించేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నా దేవదాయశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వివరాలు.. ఓజిలి మండల పరిధిలోని ముమ్మాయపాళెం గ్రామంలో 1947 సంవత్సరంలో శ్రీకృష్ణ మందిరాన్ని గ్రామస్తులు నిర్మించుకున్నారు. అప్పట్లో సర్వేనంబర్ 239–2, 246–2లలో 1.66 ఎకరాలు మాగాణి పొలాన్ని గ్రామస్తులు విరాళంగా ఇవ్వగా, ప్రభుత్వం 305–2లో5.89 ఎకరాల మెట్ట భూమిని దేవాలయానికి కేటాయించింది. అప్పటి నుంచి మందిరంలో ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తుండేవారు. ఈ భూములను ఆలయ పూజారికి గ్రామస్తులు అప్పగించారు. భూముల్లో వచ్చే ఫలసాయంతో దేవునికి దీపారాధన జరుగుతుండేది. ఈ క్రమంలో 1995లో మందిరం గాలివానలకు కూలిపోయింది. అప్పటి నుంచి మందిరం మొండిగోడలకు పరిమితమైంది. దేవుడి భూములు మొత్తం శ్రీకృష్ణ మందిరం పేరుతో రెవెన్యూ రికార్డుల్లో నమోదై ఉన్నాయి. గతంలో దేవుడి మాన్యంలో గంగ కాలువ వెళ్లడంతో ప్రభుత్వం రూ.28,500 నగదును పూజారి, కమిటీ పేరుతో మంజూరు చేసింది. అప్పట్లో ఈ నగదును స్వాహా చేశారని గ్రామస్తులు చెబుతున్నారు. మందిరం భూములపై పూజారి కన్నుపడి అనుకున్నదే తడవుగా గతంలో పనిచేసిన రెవెన్యూ అధికారులకు కాసులు ముట్టజెప్పి రికార్డులను పూజారి పేరుతో మార్పుచేశారు. దీంతో ఈ భూములను హైదరాబాద్ నగరానికి చెందిన ఓ వ్యక్తి సుమారుగా రూ.80 లక్షలకు విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయం గ్రామంలో తెలియడంతో పూజారి పొలంపై స్టే తెచ్చేందుకు హైదరాబాద్కు వెళ్లిన్నట్లు సమాచారం. ఆలయ భూములను పరిరక్షించాల్సిన దేవాదాయశాఖ అధికారులు మిన్నకుండిపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామస్తులు ఆర్డీఓ శీనానాయక్, తహసీల్దార్ సత్యవతిలకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా దేవాదాయశాఖ అధికారులు స్పందించి ఆలయభూములను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. రికార్డులు పరిశీలించి చర్యలు శ్రీకృష్ణుడి భూముల రికార్డులు తారుమారు జరిగిన విషయం నాదృష్టికి వచ్చింది. గ్రామస్తులు భూముల విషయాన్ని ఫిర్యాదు చేశారు. రెవెన్యూ పత్రాలను పరిశీలించి రికార్డులు తారుమారు చేసిన వారిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటాం. – సత్యవతి, తహసీల్దార్, ఓజిలి భూములు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారు శ్రీకృష్ణ మందిరానికి చెందిన 7.55 ఎకరాల భూములను ఆలయ పూజారి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నాడు. రెవెన్యూ రికార్డుల్లో శ్రీకృష్ణ మందిరం పేర్లు తొలగించి పూజారి పేరు నమోదు చేసుకున్నారు. 1995 నుంచి ఇప్పటి వరకు ఆలయం శిథిలావస్థలో ఉంది. ధూప దీప నైవేద్యాలు లేవు. భూములను రూ.80 లక్షలకు విక్రయించేందుకు పూజారి ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నాడు. అధికారులు స్పందించి దేవుడి భూములను కాపాడాలి. – మామిడి భక్తవత్సలరావు, సర్పంచ్, ముమ్మాయపాళెం నా దృష్టికి రాలేదు కృష్ణ మందిరం భూముల విషయం నాదృష్టికి రాలేదు. మందిరం భూముల విషయాన్ని గ్రామస్తులు ఫిర్యాదు చేస్తే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటాం. భూములు విక్రయించకుండా చర్యలు చేపడుతాం. – రమణారెడ్డి, దేవదాయశాఖ ఈఓ, ఓజిలి -
దేవుడికీ రాజకీయ సెగ
ప్రభుత్వం వరమిచ్చింది. అర్చకులు దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. తమ పరపతిని పెట్టుబడిగా పెట్టి అసలుకే ఎసరు పెడుతున్నారు. దైవారాధనే నిత్యకృత్యమైన అర్చకులకు జీవన భృతి కల్పించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం వారికిస్తున్న దేవాలయ భూములు ప్రైవేట్ వ్యక్తుల పరమవుతున్నాయి. లక్షలకు లక్షలు ఆర్జించి పెడుతున్నాయి. అరసవల్లి ఆదిత్యునికి చెందిన భూములూ దీనికి మినహాయింపు కాదు. అధికారులు సైతం చూసీచూడనట్లు పోతుండటం.. రాజకీయ ఒత్తిళ్లు తోడుకావడంతో దేవస్థానానికి చెందిన విలువైన స్థలంలో ప్రైవేట్ వ్యక్తులు పాగా వేశారు. అరసవల్లి:దేవుడి భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. శ్రీకాకుళం పట్టణంలోని అరసవల్లి రోడ్డులో సర్వే నెంబర్ 503/2లో ఉన్న 16 సెంట్ల అరసవల్లి దేవస్థానం భూమిని బయటి వ్యక్తులు ఆక్రమించి వ్యాపారం చేసుకుంటున్నారు. మెయిన్ రోడ్డును ఆనుకొనే ఈ భూమి ఉంది. ఆలయ ఈవో, సిబ్బంది, దేవాదాయశాఖ అధికారులు నిత్యం ఈ మార్గంలోనే రాకపోకలు సాగిస్తున్నా.తమకు సంబంధం లేనట్లు వ్యవహరించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిన్న చిన్న తప్పులు జరిగినప్పుడు వెంటనే సిబ్బందిపై విరుచుకుపడి మెమోలు, సస్పెన్షన్లు వంటి చర్యలు చేపడుతున్న అధికారులు దేవుడి భూమిలో ప్రైవేట్ వ్యాపారం విషయంలో మాత్రం మౌనం పాటిస్తున్నారు. వాస్తవానికి ఈ భూమిని జీవన భృతి కోసం దేవస్థానం అర్చకులకు ఇచ్చారు. వారు దీన్ని అన్యాక్రాంతం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. సుమారు రూ.80 లక్షల విలువైన ఈ భూమిని నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తులకు లీజుకు ఇచ్చేసిన విషయం దేవస్థానం ఇన్చార్జి ఈవో ఆర్.పుష్పనాథానికి గతంలో తెలిసింది. అయితే ఆయన పెద్దగా పట్టించుకోకుండా ప్రధాన అర్చకుడికి మెమో ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. మిగిలిన సిబ్బంది దీన్ని తప్పు పడుతున్నారు. అదే ఇతరులెవరైనా దేవుడి మాన్యాన్ని ఆక్రమించి సొంత వ్యాపారాలు పెట్టుకుంటే కఠిన చర్యలకు దిగుతారని.. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నిస్తున్నారు. చట్టం చట్టుబండలే..అర్చకులకు ఇచ్చే మాన్యాల్లో పండించే ఫలసాయాన్ని అనుభవించడమే తప్ప భూములను ఇతరులకు ఎట్టి పరిస్థితుల్లోనూ లీజుకు ఇవ్వరాదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. లీజుకు ఇచ్చినా, భూములను ఎవరైనా ఆక్రమించినా కఠిన చర్యలు తీసుకునే అధికారం కూడా కల్పించాయి. అయితే ఈ 16 సెంట్ల భూమి విషయంలో రాజకీయ ఒత్తిళ్లు బాగా పనిచేస్తున్నట్లు తెలిసింది. అందువల్లే ఈవో సహా ఇతర అధికారులు దాని జోలికి వెళ్లడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘కేశవరెడ్డి స్కూల్ ఎదురుగా ఉన్న స్థలంలో మావాడే ఉంటున్నాడు.. చూసి చూడనట్లు వదిలేయండి’ అంటూ దేవస్థానం ఇన్చార్జి ఈవోకు జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి హుకుం జారీ చేసినట్లు తెలిసింది. ప్రజాప్రతినిధులే ఇలా ఆక్రమణదారులను వెనకేసుకొస్తూ.. ఆక్రమణలను ప్రోత్సహిస్తుంటే ఇక దేవుడి మాన్యాలకు దిక్కెవరన్న ప్రశ్న తలెత్తుతోంది. చేతులు మారిన లక్షలు మొయిన్ రోడ్డును ఆనుకొని ఉన్న ఈ స్థలంలో అక్రమ లీజు విషయంలో లక్షలాది రుపాయలు చేతులు మారాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆలయ అధికారులకు కూడా ముడుపులు అందడం వల్లే వారు నోరు మెదపడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పొట్ట కూటికి రోడ్డు పక్కన చిన్న బడ్డీ పెట్టుకుంటేనే నానా యాగీ చేసే అధికారులు రూ.లక్షల విలువైన దేవస్థానం భూమిలో పాగా వేసి యథేచ్ఛగా వ్యాపారం చేసుకుంటున్నా తమకు సంబంధం లేనట్లు మిన్నకుండటం విడ్డూరమే. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాం శ్రీసూర్యనారాయణస్వామి దేవస్థానానికి చెందిన సర్వే నెంబరు 503/2లోని 16 సెంట్ల భూమిలో ప్రైవేటు వ్యక్తులు వ్యాపారం చేస్తున్నారన్న విషయం మా దృష్టికి వచ్చింది. దీనిపై ఈ ఏడాది జూన్ 19న ఆర్సీ నెంబర్42/4 మెమో జారీ చేశాం. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తదుపరి చర్యలు తీసుకుంటాం. - ఆర్.పుష్ఫనాథం, ఇన్చార్జి ఈవో