దూసుకుపోతున్న బంగారం, వెండి
ముంబై: డాలర్ బలహీనతతో అటు ఆసియా మార్కెట్లు జోరుమీద ఉండగా, ఇటు విలువైనమెటల్ ధరలు కూడా సానుకూల ట్రెండ్ ను కొనసాగిస్తున్నాయి. డాలర్ రికార్డు పతనంతో బంగారం,వెండి,ప్లాటినం, ధరలు లాభాల బాటలో పయనిస్తున్నాయి. జపాన్ యెన్ తో పోలిస్తే డాలర్ ధర మరింత బలహీనంగా ట్రేడవుతూ వుండటం బులియన్ మార్కెట్ కు ఉత్సాహాన్నిచ్చింది. ఈ నేపథ్యంలోనే గత ఏడాది స్తబ్దుగా వున్న బంగారం ధరలు ఊపందుకున్నాయి. మంగళవారం స్వల్ప నష్టాలను నమోదు చేసినా 15 నెలల గరిష్టానిక చేరువలో ఉంది. అటు వెండి ధరలు కూడా నలభైవేల స్థాయికి పైన స్థిరంగా ట్రేడవుతున్నాయి.
అమెరికా డాలర్ బలహీనతతో బులియన్ మార్కెట్ లో పాజిటివ్ ట్రెండ్ నెలకొందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రభావంతో పసిడి ధరలు ముప్పయివేలకు పైన నిలదొక్కుకొని ఇన్వెస్టర్లకు సానుకూల సంకేతాలను అందించింది. అటు సిల్వర్ ధరలుకూడా 15 నెలల గరిష్టానికి చేరువలో ఉన్నాయి. వెండి ధరలు 41, వేలకు పైన స్థిరంగా కొనసాగుతున్నాయి. బంగారం 10. గ్రా.30285 రూ. లు వుండగా, వెండి కిలో 41, 217రూ. లుగా నమోదైంది. బ్యాంక్ ఆఫ్ జపాన్ గత వారం ప్రకటించిన విధానంతో జపాన్ కరెన్సీ యెన్ విలువ భారీగా పెరిగింది. దీని ప్రభావం అమెరికా డాలర్ పైపడడంతో బులియన్ ధరలు 15 నెలల గరిష్టానికి చేరుకోనున్నాయి. అలాగే బులియన్ ఫండ్ వాల్యూ బాగా పెరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఫండమెంటల్స్ పాజిటివ్ గా ఉన్నాయని అంచనావేస్తున్నారు. గత రెండేళ్లతో పోల్చితే ఈ ఫండ్స్ అత్యధికంగా పెరిగాయంటున్నారు. అటు భారత ఈక్విటీ మార్కెట్లు లాభాలతో మొదలై స్థిరంగా ట్రేడవుతున్నాయి.
పసిడి నికర లాంగ్ పొజిషన్స్ ఏప్రిల్ తో పోలిస్తే కొద్దిగా తగ్గినప్పటికీ, స్పెక్యులేటివ్ ఆర్థిక పెట్టుబడిదారులు బంగారంవైపు మొగ్గు చూపునున్నారని కామర్స్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదే ట్రెండ్ వెండి, ప్లాటినం, పల్లాడియంకు వర్తిస్తుందని తెలిపింది. స్పెక్యులేటర్ల రికార్డు స్థాయి కొనుగోళ్లతో వెండి ధరలు వరుసగా మూడు వారాలు లాభాల్లో కొనసాగాయని, ఈ బుల్లిష్ ట్రెండ్ ఇకముందు కూడా కొనసాగునుందని పేర్కొంది. అటు వెంటి నాణాలకు కూడా బాగా డిమాండ్ పెరిగినట్టు సమాచారం.
మరో విలువైన మెటల్ ప్లాటినంకూడా తన హవాను కొనసాగిస్తోంది. 10 నెలల గరిష్టాన్ని అధిగమించి దూసుకుపోతోంది. ఔన్స్ ధర 1076రూ. పల్లాడియం ఔన్సు దర 617.47 దగ్గర ట్రేడవుతూ పాజిటివ్ ట్రెండ్ తో మార్కెట్ లో మెరుపులు మెరిపిస్తున్నాయి.