శాతకర్ణిలో ఆ సీన్ చూస్తే అదుర్స్
హైదరాబాద్: షూటింగ్ ప్రారంభమైననాటి నుంచే భారీ అంచనాలను పెంచిన సినిమా గౌతమి పుత్రశాతకర్ణి. ఆ అంచనాలకు తగినట్లుగానే భారీ విజయాన్ని అందుకున్నాడు చిత్ర కథానాయకుడు బాలయ్య. వందో చిత్రం విషయంలో ఎంతో టెన్షన పడిన ఆయన తెలుగువారికి పెద్దగా తెలియని, తెలుగువారు బాగా గర్వించాల్సిన శాతకర్ణి చరిత్రతో సినిమా తీసి శత విజయాన్ని అద్భుతంగా అందుకున్నాడు. ఈ చిత్రం చూసిన వాళ్లంతా ఈ కథను ఎంచుకొని బాలకృష్ణ గొప్పపని చేశాడని అంటున్నారు. అలాగే, కేవలం 79 రోజుల్లోనే ఇంత భారీగా సినిమాను తీయడం ఒక్క క్రిష్కు తప్ప మరో దర్శకుడికి సాధ్యం కాదేమో అని కూడా చెబుతున్నారు.
మొత్తానికి బాలకృష్ణ ఈ చిత్రంలో సిసలైన తెలుగువాడిగా, గొప్ప దేశభక్తుడిగా కనిపించడమే కాకుండా యుద్ధ సన్నివేశాల్లో విశ్వరూపాన్ని చూపించాడు. ముఖ్యంగా ఈ చిత్రంలో ఓ సన్నివేశం పరిశీలిస్తే .. ఉత్తరభారతాన్ని పరిపాలించే రాజు నహపాణుడిపైకి యుద్ధానికి వెళ్లిన సమయంలో శాతకర్ణి కుమారుడు పులోమావిని నహపాణుడు బందిస్తాడు. ఆ బాలుడి మెడపై కత్తిపెట్టి శాతకర్ణిని సామంతుడిగా మారుతావా బాలుడిని చంపమంటావా.. సమయం లేదు మిత్రమా అంటూ శాతకర్ణికి సవాల్ విసురుతాడు.
అప్పటికే యుద్ధంలో శత్రువుల రక్తపు మరకలతో ఎర్రటి కళ్లతో గాంభీరంగా కనిపిస్తున్న శాతకర్ణి లొంగిపోతాడు కావొచ్చు అని ప్రేక్షకుడు అనుకునేలోగా కొదమ సింహంలాగా గుర్రంపై నుంచి దూకుతూనే ఓ సైనికుడి చేతిలోని డాలును అందుకొని విసరడంతో అది ఆ బాలుడి మెడపై కత్తి పెట్టిన వాడి తలను తెంపేస్తుంది. ఆ లోగానే నహపాణుడిని తన ఆదీనంలోకి తీసుకుంటాడు శాతకర్ణి. ఈ సీన్లో బాలకృష్ణ చూపించిన విశ్వరూపానికి థియేటర్లు హోరెత్తుతున్నాయి.