Guntur District News
-
ప్రతి ఒక్కరు కోవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలి
గుంటూరు మెడికల్: కోవిడ్ కేసులు మళ్లీ నమోదవుతున్న దృష్య్టా గుంటూరు జీజీహెచ్కు వస్తున్న రోగులు, వారి సహాయకులు తప్పని సరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి అన్నారు. శుక్రవారం ఆస్పత్రిలో మీ కోసం మేము కార్యక్రమంలో భాగంగా ఆయన రోగులు, వారి సహాయకులతో సమావేశమై వారి సమస్యలు ఆలకించారు. ఈ సందర్భంగా డాక్టర్ రమణ మాట్లాడుతూ ఆస్పత్రికి వచ్చే ప్రతి ఒక్కరి ప్రాణాలు రక్షించేందుకు వైద్యులు, వైద్య సిబ్బంది తమ ప్రాణాలు పణంగా పెట్టి వైద్య సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఆస్పత్రిలో వాతావరణం పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ ధరించాలన్నారు. ప్రతి ఒక్కరు తరచుగా చేతులు పరిశుభ్రం చేసుకోవాలని, దగ్గు, జలుబు, జ్వరం ఉంటే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలన్నారు. దగ్గు, జ్వరం ఉన్నవారు ఆస్పతిలో తిరగకుండా వార్డులో ఉంచి చికిత్స పొందాలని సూచించారు. మద్యం తాగి ఆస్పత్రికి రావద్దని ఆస్పత్రి ఆవరణంలో సిగరెట్టు తాగి వాతావరణం కలుషితం చేయవద్దని కోరారు. మీ కుటుంబ సభ్యులను మా కుటుంబ సభ్యులుగా భావించి చికిత్స అందిస్తామని, మీరు అభద్రతా భావాన్ని , అపోహలు వదిలి పెట్టలన్నారు. ఏ డాక్టర్, నర్సు తప్పు చేయరని ఆస్పత్రిలో వీడియో కెమెరాలు ఉన్నాయని తెలిపారు. కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రభుత్వం ఉచిత వైద్యం అందిస్తోందన్నారు. గతంలో కోవిడ్ సయమంలో లక్షలు ఖర్చుపెట్టినా కాపాడలేని వారిని గుంటూరు జీజీహెచ్లో ప్రాణాలు పణంగా పెట్టి కాపాడారన్నారు. కోవిడ్ కి సంబంధించి టెస్టులన్నీ ఉచితంగా చేస్తున్నామని, ప్రజలు ఈ వైద్యసేవలను వినియోగించుకోవాలని కోరారు. జనరల్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అనిల్ కుమార్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం కోవిడ్ విస్తరిస్తున్న సమయంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహారపు అలవాట్లు గురించి వివరించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి -
ప్రశాంతంగా మెగా డీఎస్సీ పరీక్షలు
నరసరావుపేట ఈస్ట్: పల్నాడు జిల్లాలో మెగా డీఎస్సీ– 2025 పరీక్షలు శుక్రవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రం నరసరావుపేట పరిధిలో ఏర్పాటు చేసిన 5 కేంద్రాలకు తొలిరోజు 3 చోట్ల పరీక్ష నిర్వహించారు. నరసరావుపేట ఇంజినీరింగ్ కళాశాల, ఎంఏఎం ఇంజినీరింగ్ కళాశాల, ఏఎం రెడ్డి ఇంజినీరింగ్ కళాశాల కేంద్రాలలో 460 మంది అభ్యర్థులకు 404 మంది హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు ఎంఏఎం ఇంజినీరింగ్ కళాశాల కేంద్రాన్ని పరిశీలించారు. వేసవి తీవ్రత దృష్ట్యా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులు అందుబాటులో ఉంచాలని వైద్య సిబ్బందికి సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ, సిబ్బంది ఉన్నారు.చివరి దశకు సాగర్ క్రస్ట్గేట్ల మరమ్మతులువిజయపురి సౌత్: నాగార్జునసాగర్ ప్రాజెక్టు రేడియల్ క్రస్ట్గేట్ల మరమ్మతులు పూర్తి కావచ్చాయి. సాగర్ ప్రాజెక్టు నీటిమట్టం 590 అడుగులు కాగా, 546 అడుగుల వద్ద నుంచి 26 రేడియల్ క్రస్ట్గేట్లు ఉంటాయి. రెండు, మూడు రోజుల్లో మరమ్మతులు పూర్తి చేసి ట్రయల్రన్కు ప్రాజెక్టు అధికారులు సమాయత్తం అవుతున్నారు. ఇప్పటివరకు గేట్లకు పట్టిన తుప్పు వదిలించటంతోపాటు క్రాక్లు, వెల్డింగ్ జాయింట్లను గుర్తించి అవసరమైన మరమ్మతులు చేస్తున్నారు. గత ఏడాది వరద నీరు అధికంగా వచ్చి పలు మార్లు ప్రాజెక్టు రేడియల్ క్రస్ట్గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో రబ్బర్ సీళ్లు బాగా దెబ్బతిన్నాయి. వాటి స్థానంలో కొత్తవి మారుస్తున్నారు. గేట్లకు గ్రీజింగ్, ఆయిలింగ్ పనులు చేస్తున్నారు. విద్యుత్ సరఫరా అయ్యే ప్యానల్ బోర్డులు తనిఖీ చేస్తున్నారు. మరమ్మతులు పూర్తి కాగానే రేడియల్ క్రస్ట్గేట్లకు అధికారులు ట్రయల్ రన్ చేస్తారు.జూలై 5న లోక్ అదాలత్నరసరావుపేట టౌన్: జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఆర్.ఆశీర్వాదం పాల్ అన్నారు. రాష్ట్ర, జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు శుక్రవారం స్థానిక మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. లోక్ అదాలత్లో రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, సివిల్ దావాలు, రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవచ్చని చెప్పారు. కక్షిదారులకు డబ్బు, సమయం ఆదా అవుతాయన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని జూలై 5న నిర్వహించే లోక్ అదాలత్ను విజయవంతం చేయాలన్నారు.వేణుగోపాలస్వామి ఆలయ ప్రతిష్ట మహోత్సవంతాడేపల్లి రూరల్ : మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని మహానాడు 14వ రోడ్డులోని సంతాన వేణుగోపాల స్వామి దేవాలయ ప్రతిష్ట మహోత్సవం, ధ్వజస్తంభ ప్రతిష్ట్ట మహోత్సవాన్ని శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి (డీవీఆర్) ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్న సంతర్పణలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హనుమయ్య, బాలకోటయ్య, చిన్నయ్య, విజయ్, దొడ్డిపాటి వెంకటేశ్వరరావు, జానీ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.వేడుకల్లో యాదవ కార్పొరేషన్ చైర్మన్...సంతాన వేణుగోపాలస్వామి దేవాలయ ప్రతిష్ట మహోత్సవంలో యాదవ కార్పొరేషన్ చైర్మన్ గొల్ల నరసింహయాదవ్ పాల్గొన్నారు. స్వామి వారి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆశిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ తాడిబోయిన భాస్కర్, భారత యాదవ సంఘం చైర్మన్ లాకా వెంగళరావు, యాదవ భక్తులు పాల్గొన్నారు. -
పోలీసులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారు
గుంటూరు మెడికల్: పోలీసులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని పోలీసుల తీరుపై మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం పెద నెమలిపురి గ్రామానికి చెందిన గుత్తా లక్ష్మీనారాయణ పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుని గుంటూరు మార్కెట్ సెంటర్లోని ఓ ప్రైవేట్ వైద్యశాలో చికిత్స పొందుతున్నాడు. ఐసీయూలో చికిత్స పొందుతున్న బాధితుడిని శుక్రవారం రాత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పలువురు పార్టీ నేతలు పరామర్శించారు. లక్ష్మీ నారాయణ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో అంబటి మాట్లాడుతూ తమ పార్టీ గ్రామ నాయకుడు లక్ష్మీనారాయణ ఆత్మహత్యాయత్నానికి ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నారని తెలిపారు. ఆరు నెలలుగా పోలీసులు వేధిస్తున్నారని బాధితుడు వీడియోలో వెల్లడించారన్నారు. సత్తెనపల్లి డీఎస్పీ తనను పిలిపించి వార్నింగ్ ఇచ్చారని వీడియో వాపోయినట్లు పేర్కొన్నారు. పోలీసులకు ఇది ధర్మం కాదని, లక్ష్మీనారాయణ ప్రాణాలకు ఏమైనా అయితే ఆయన కుటుంబం ఏమీ కావాలని అంబటి ప్రశ్నించారు. దీనిపై తక్షణమే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆత్మహత్యాయత్నం చేసిన కార్యకర్త లక్ష్మీనారాయణకు పరామర్శ -
ఇస్తే మాకు అన్యాయమే
ఇంతకు ముందు రాజధానిలో పొలాలు ఇచ్చిన రైతులకు న్యాయం చేయలేదు. మా భూములకు రేట్లు లేకుండా చేశారు. వ్యవసాయం తప్ప వేరే పని తెలియని వాళ్లం. పత్తి, మిరప వంటి పంటలు పండించుకోకుండా పూలింగ్కు ఇస్తే మా జీవనం సాగడం కష్టమే. – షేక్ రహిమాన్, రైతు, లేమల్లె పార్టీలకు అతీతంగా పూలింగ్ను వ్యతిరేకిస్తున్నాం. పొలం పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాం. పనుల కోసం ఎక్కడికో వెళ్లి బతకలేం. సస్యశ్యామలంగా పంటలు పండించుకుంటున్న భూములను ఎవ్వరికీ ఇవ్వబోం. – చిల్కా రమేష్, రైతు, లేమల్లె -
అన్నదాతలను దగా చేసిన చంద్రబాబు ప్రభుత్వం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే రైతులకు ఇప్పటికే అందుతున్న సేవలను తొలగించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలకు కోతలు పెడుతూ వస్తోంది. అన్నదాతలకు భరోసా దూరం చేసి సాగు పేరు చెబితేనే భయపడేలా సర్కార్ వ్యవహరిస్తోంది.సాక్షి ప్రతినిధి, గుంటూరు, కొరిటెపాడు: కూటమి ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను అలంకారప్రాయంగా చేసింది. కియోస్క్ మిషన్లను మూలన పడేసింది. రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అందజేతలో తీవ్ర ఇబ్బందులు పెడుతోంది. ఉచిత పంట బీమాకు ఎసరు పెట్టింది. పంటలు నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీని పరిహాసం చేసింది. మళ్లీ పంటలు వేయాలంటే భయపడేలా వ్యవహరిస్తోంది. ఏటా పెట్టుబడి సాయంగా అన్నదాత సుఖీభవ పేరుతో రూ.20 వేలు ఇస్తామని చెప్పి సర్వేల పేరుతో కాలయాపన చేస్తోంది. కూటమి ప్రభుత్వంలో రైతన్నకు చేసిన దగా చెప్పుకుంటూ పోతే అంతే లేకుండా పోతుంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇంటి ముంగిటకే సేవలు అందేవి. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు ఐదు సంవత్సరాలు వెన్నుదన్నుగా నిలిచారు. రైతు సంక్షేమ క్యాలెండర్ను విడుదల చేసి అన్నదాతకు ఆర్థిక భరోసా ఇచ్చారు. నాడు వ్యవసాయం రైతుకు పండుగలా ఉండేది. నేడు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో సాగు అంటే రైతులు భయపడేలా చేసింది.నాడు సంక్షేమం..వైఎస్సార్సీపీ ప్రభుత్వం విత్తు నుంచి పంట విక్రయం వరకు రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తూ వ్యవసాయాన్ని పండుగలా చేసింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతు ముంగిటకే సేవలను తీసుకొచ్చింది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా సుమారు 1.59 వేల హెక్టార్లలో వ్యవసాయ భూమి ఉంది. ఇందులో వ్యవసాయ, ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు. వెబ్ల్యాండ్లో సుమారు 1.65 లక్షల మంది రైతులు నమోదయ్యారు. వీరిలో లక్ష మందికిపైగా వ్యవసాయమే జీవనాధారంగా ఉన్నారు. వీరిలో 40 వేల మందికిపైగా ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని ప్రభుత్వం గుర్తించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వీరి సేవలకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు.నేడు సంక్షోభానికి నిదర్శనంకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో రైతు భరోసా కేంద్రాల్లో యూరియా, డీఏపీ నిల్వలు శూన్యం. పంటల బీమా లేదు.. పరిహారం అందలేదు. మళ్లీ పంటలు వేయాలంటే రైతులు జంకుతున్నారు. పెట్టుబడి పెట్టే స్థోమత లేక కొందరు అప్పులు చేస్తున్నారు. మరికొందరు బీడు భూములుగా వదిలేస్తున్నారు. ఖరీఫ్ ప్రారంభం అయినా అన్నదాత సుఖీభవ ఇవ్వకపోవడంతో రైతులకు పుట్టెడు దుఃఖమే మిగిల్చింది. రైతుకు ఏటా రూ.20 వేలు ఇస్తామన్నారు. ఏడాదైనా ఆ ఊసే పట్టనట్లు వ్యవహరించడంతో అన్నదాతల్లో ఆందోళన నెలకొంది. ఇంతవరకు ఒక్క రూపాయి కూడా సాయంగా అందించలేదు. గతంలో వ్యవసాయమే దండగ అన్న చంద్రబాబు సర్కారు మరోసారి అదే తీరుగా వ్యవహరిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
బంగారం చోరీ చేసిన వ్యక్తి అరెస్ట్
వెస్ట్ డీఎస్పీ కె.అరవింద్ లక్ష్మీపురం: కల్యాణ మండపంలోని గదిలో పెట్టిన బ్యాగ్లో 8 సవర్ల బంగారం చోరీ చేసిన వ్యక్తిని అరండల్పేట పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ కె.అరవింద్ తెలిపిన వివరాలు.. తాడికొండ మండలం, రావెల గ్రామానికి చెందిన ములుపూరి హనుమంతరావు మే 11వ తేదీన అమరావతి రోడ్డులోని కల్యాణ మండపంలో జరుగుతున్న మేనల్లుడు వివాహానికి కుటుంబ సభ్యులతో కలసి వెళ్లాడు. పెళ్లి వేడుక సమయంలో హనుమంతరావు భార్య కల్యాణ మండపం గదిలో 8 సవర్ల బంగారు నెక్లెస్తో ఉన్న బ్యాగ్ను పెట్టి బయటకు వెళ్లింది. అయితే కొంత సేపటి తరువాత వచ్చి చూడగా బ్యాగ్లో బంగారం ఆభరణాలు కనిపించలేదు. దీంతో చుట్టు పక్కల పరిశీలించి ఈనెల 4వ తేదీన అరండల్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వెస్ట్ డీఎస్పీ అరవింద్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయగా అరండల్పేట సీఐ ఆరోగ్య రాజు దర్యాప్తు ప్రారంభించారు. మండపంలోని సీసీ ఫుటేజ్ను పరిశీలించగా పల్నాడు జిల్లా, దాచేపల్లి గ్రామానికి చెందిన గుంజి గోవింద్పై అనుమానం వ్యక్తం చేశారు. నిందితుడు శుక్రవారం రాత్రి బ్రాడీపేట 4వ లైన్లో ఉన్నట్లు పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు గోవింద్ను అదుపులో తీసుకుని విచారించారు. విచారణలో మండపంలోని బ్యాగ్ను అందులోని 8 సవర్ల బంగారు ఆభరణాన్ని చోరీ చేసినట్లు అంగీకరించాడు. చోరీ చేసి బంగారు ఆభరణాన్ని తాకట్టు పెట్టి వచ్చిన నగదుతో కొత్త సెల్ఫోన్, అలాగే ద్విచక్రవాహనం ఈఎంఐ చెల్లించినట్లు తెలిపారు. మిగిలిన డబ్బుతో జల్సాలు చేసినట్లు తెలియజేయడంతో పోలీసులు తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాన్ని రికవరీ చేసి స్వాధీనం చేసుకుని గోవింద్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. రెండు రోజుల్లో కేసును దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం చేసిన అరండల్పేట పోలీస్ స్టేషన్ సిబ్బందిని జిల్లా ఎస్పీ సతీష్కుమార్, వెస్ట్ డీఎస్పీ కె.అరవింద్ అభినందించారు. -
విశ్వాసానికి త్యాగానికి ప్రతీక
● మానవతా వెలుగుతో ఉదయించాలన్నదే అల్లాహ్ సందేశం ● బక్రీద్–శాంతి సందేశం, మానవతా దీప్తి పండుగ రోజున ఫజర్ నమాజ్ను తమ వీధిలోని మసీదులోనే విధిగా చదవాలి. పరిశుభ్రంగా, మంచి దుస్తులతో అత్తర్, సుర్మా రాసుకుని దారి పొడువునా ‘తక్బీర్’ చదువుతూ తమ ప్రాంతంలోని ఈద్గాకు వెళ్లి మాత్రమే సామూహిక నమాజ్ చేయాలి. ఈద్ నమాజ్ అయ్యే వరకు ఏమీ తినరాదు. ఈద్గా వద్దకు వెళ్లి, వచ్చే మార్గాలు వేర్వేరుగా ఉండాలి. ఈద్ నమాజ్ తర్వాతనే ఖుర్బానీ ప్రక్రియ ప్రారంభించాలి. వాటిని స్వీకరించాలి. – అబ్దుల్ కలీమ్, ముఫ్తీసాబ్ యడ్లపాడు: పవిత్ర రంజాన్ పర్వదినం అనంతరం ముస్లింల జీవితాల్లో మరొక ఆధ్యాత్మిక సందడిని నింపే పండుగ బక్రీద్. ‘బకర్’ అంటే జంతువు, ‘ఈద్’ అంటే పండుగ– రెండింటి కలయికే బక్రీద్. ఇది ఖుర్బానీ (బలిదానం) పండుగ కూడా. అందుకే దీనిని ‘ఈదుల్ ఖుర్బానీ’ లేదా ‘ఈద్ ఉల్ అదా’గా పిలుస్తారు. రంజాన్ తర్వాత 70 రోజులకు వచ్చే ఈ పండుగకు జిల్లాలోని ఈద్గాలు, మసీదులను మత పెద్దలు సిద్ధం చేశారు. శనివారం బక్రీద్ పండుగ జరుపుకోవాలని ప్రకటించారు. బక్రీద్ ముందు రోజు ‘ఆరఫా’ దినంగా భావిస్తారు. ఇది అల్లాహ్ ప్రేమ పొందడానికి అత్యంత శ్రేష్టమైన దినం. నరకం నుంచి విముక్తి కోరుతూ ఆ రోజు ఉపవాసం ఉండటం ద్వారా చిన్నచిన్న పాపాలు కూడా క్షమించబడతాయని ముస్లింల విశ్వాసం. ఇదే రోజున చనిపోయిన తమ పెద్దల్ని స్మరించుకుంటూ పెద్దల పండుగ నిర్వహించుకుంటారు. అంతేకాదు ప్రతి ముస్లిం తన జీవితంలో ఒక్కసారైనా పవిత్ర మక్కా యాత్ర చేయాలన్నది మత విధి. అది ఈ పర్వదినం నాడే చేయడం జరుగుతుంది. ఈ పండుగలోనే హజ్యాత్ర... ఇస్లాం మతంలోని ఐదు మూల స్తంభాల్లో హజ్ యాత్ర ఒకటి. ఈ పర్వదినం ప్రాముఖ్యత, హజ్ యాత్రతో మొదలవుతుంది. ఇస్లాం క్యాలెండరులో చివరి నెల ‘జిల్హిజ్’. ఈ నెల 9వ రోజున హజ్ యాత్ర ప్రారంభమవుతుంది. ఈ యాత్రలో భాగంగా మక్కా, మదీన క్షేత్రాలను దర్శించుకుంటారు. మక్కాలోని కాబా చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణలు, ఆధ్యాత్మిక శుద్ధికి సంకేతం. ఇది కేవలం ఓ యాత్ర మాత్రమే కాదు –ఇది ఆత్మాన్వేషణకు ఆరంభమైన సాధన. తనలోని స్వార్థాన్ని వదిలి, మానవతా మార్గంలో పయనించాలనే సంకల్పంతో చేసే యాత్ర ఇది. ఆ మరుసటి రోజునే బక్రీద్ జరుపుకుంటారు. నిరుపమానమైన త్యాగానికి ప్రతీక– ఖుర్బానీ... మక్కా నగరంలో హజరత్ ఇబ్రహీం ప్రవక్తకు ముదిమి వయసులో కలిగిన ముద్దుల పుత్రుడు ఇస్మాయిల్ను అల్లాహ్కు బలిదానం చేసేందుకు సిద్ధమైన పవిత్ర ఘటనను స్మరిస్తూ బక్రీద్ నిర్వహిస్తారు. చివరికి, అల్లాహ్ ప్రత్యక్షమై, ఇస్మాయిల్ బదులు ఒక పొట్టేలును ఖుర్బానీ చేయాలని ఆదేశించాడు. అప్పటి నుంచి ఈ పండుగను జీవన త్యాగానికి జ్ఞాపకంగా జరుపుకుంటూ వస్తున్నారు. ఈద్ నమాజ్ ఇలా.. ఖుర్బానీ ఎవరు, ఎలా చేయాలి బక్రీద్ పండుగలో ఖుర్బానీ అత్యంత పవిత్రమైన ఆచారం. దానిని ధనంతో కాదు, మనసుతో చేసే త్యాగమే నిజమైన అర్పణ. ఖుర్బానీ ఇచ్చిన పొట్టేలు మాంసం మూడు భాగాలుగా విభజించి పేదలు, బంధువులు, మూడో భాగాన్ని తామే తీసుకోవాలి. చనిపోయిన వారి పేరుతో ఖుర్బానీ చేయాలంటే ఆ మాంసం పూర్తిగా ఇతరులకే పంచాలి. ఇది కేవలం మాంసం పంచడం కాదు, మానవతా భావన పంచడంగా భావిస్తారు. 52 తులాల వెండి లేదా 7.5 తులాల బంగారం కలిగిన ముస్లింలు విధిగా ఖుర్బానీ చేయాలి. -
రాజధానికి భూములిచ్చేదే లేదు
●అమరావతి: తరతరాలుగా అనుభవిస్తున్న భూములను రాజధాని నిర్మాణంలో భాగంగా పూలింగ్కు ఇవ్వటానికి తాము అంగీకరించటం లేదని లేమల్లె గ్రామానికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన సన్న, చిన్నకారు రైతులు స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్తోపాటుగా సత్తెనపల్లి ఆర్డీవో, అమరావతి తహసీల్దార్కు ఈ మేరకు వినతిపత్రాలు సమర్పించారు. మండల పరిధిలోని కర్లపూడి రెవెన్యూ గ్రామంలో భాగమైన లేమల్లెకు చెందిన సుమారు 100 సర్వే నంబర్లలో ఉన్న 500 ఎకరాలకు చెందిన 170 మంది రైతుల సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని రైతులు అధికారులకు సమర్పించారు. ఆ వినతి పత్రంలో... తమకు వ్యవసాయం తప్ప వేరే పని తెలియదని వాపోయారు. పూర్తిగా గ్రామీణ జీవితానికి అలవాటు పడి జీవిస్తున్నామని చెప్పారు. తమకున్న కొద్దిపాటి భూమికి మరికొంత కౌలుకు తీసుకుని కుటుంబాలను పోషించుకుంటున్నామని తెలిపారు. పిల్లల చదువు, వివాహాలకు వ్యవసాయం ద్వారా ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నామని వివరించారు. భూములను పూలింగ్కు ఇవ్వటానికి సిద్ధంగా లేమని తెలిపారు. పంటలు పండించుకుని ఉపాధి పొందుతూ జీవనం సాగించటానికి నిర్ణయించుకున్నామని తెలిపారు. పూలింగ్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న లేమల్లె రైతులు ఉపాధి కల్పిస్తున్న భూమి ఇచ్చి ఏం చేయమంటారని నిలదీత వ్యవసాయం తప్ప వేరే పని తెలియదంటున్న అన్నదాతలు ఈ భూమిపైనే పిల్లల భవిష్యత్ ఆధారపడి ఉందని ఆవేదన రెవెన్యూ ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందజేత -
వివాహేతర సంబంధంతోనే మహిళ హత్య
వేటపాలెం: వివాహేతర సంబంధం నేపథ్యంలోనే మానికల దీపిక అలియాస్ వేటగిరి ప్రమీల (24) ను అదే కాలనీకి చెందిన ఇద్దరు హత్య చేసినట్లు చీరాల డీఎస్పీ మొయిన్ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో మహిళ హత్యకు సంబంధించిన వివరాలను డీఎస్పీ శుక్రవారం వివరించారు. ఈ నెల 2వ తేదీన రామన్నపేట పంచాయతీ పరిధిలోని నాగవరపమ్మ దేవస్థానం వద్ద గుర్తు తెలియని మహిళ మృత దేహం గుర్తించారు. అయితే రామన్నపేట పంచాయతీ వినాయకపురానికి చెందిన మానికల దీపిక అలియాస్ వేటగిరి ప్రమీల నెల రోజుల క్రితం అదృశ్యం అయినట్లు ఆమె అత్త పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో అదే కాలనీకి చెందిన ఈగ వెంకటేశ్వరరావు, సైకం నాగబాబు.. గద్దల గుంటకి చెందిన ఇద్దరు బావ బావమర్దులు. వీరిద్దరే చంపి ఉంటారని కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. వీరిద్దరిని శుక్రవారం అదుపులోకి తీసుకొని విచారించారు. కాగా గుర్తు తెలియని మహిళ విషయం తమకు తెలియదని, తాము దీపికను చంపి గ్రామ శివారులోని తోటలో పూడ్చి పెట్టినట్లు ఒప్పుకున్నారు. మృతురాలి భర్త చనిపోవడంతో వ్యసనాలకు బానిసైన ఆమె అత్త వద్ద ఉంటోంది. ఈ క్రమంలో ఆమె ఇంటి వద్దనే ఉంటున్న ఈగ వెంటేశ్వరరావుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కొంత కాలానికి వెంకటేశ్వరరావు కొమరిగిరి రాములమ్మని వివాహం చేసుకున్నాడు. అనంతరం అదే కాలనీకి చెందిన సైకం నాగబాబుతో వివాహేతర సంబంధం పెట్టుకుని, వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేసింది. లేదంటే విషయం అందరికీ చెబుతానని బెదిరించడం మొదలు పెట్టింది. దీంతో ఈగ వెంకటేశ్వరరావు, సైకం నాగబాబులు ఆమెను చంపాలని నిర్ణయించుకున్నారు. ఏప్రిల్ 30వ తేదీన దీపికను బైక్ పై ఎక్కించుకొని పందిళ్లపల్లి– తిమ్మసముద్రం రోడ్ వరకు వెళ్లారు. అక్కడ ఆమెతో బీరు తాగించారు. అనంతరం బీరు సీసాతో తలపై కొట్టి.. అపస్మారక స్థితిలోకి వెళ్లగా.. మెడకు చున్నీ చుట్టి చంపివేశారు. శవాన్ని మూట కట్టి బైక్పై పెట్టుకొని రామన్నపేట శివారు తోటల్లోకి తీసుకొచ్చి పూడ్చి వేసినట్లు నిందితులు అంగీకరించారు. పూడ్చిపెట్టిన శవాన్ని తహసీల్దార్ సమక్షంలో తవ్వి బయటకు తీసి పోస్టుమార్టం చేయించారు. మోటార్ బైక్, దుస్తులు, మృతురాలి సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కేసును త్వరగా ఛేదించిన చీరాల రూరల్ సీఐ శేషగిరిరావు, ఎస్సై మీసాల వెంకటేశ్వర్లు, ఎస్బీ హెచ్సీ అచ్చయ్య, తన్నీరు శ్రీను, పి.నరసింహారావు, ఎస్కే బాజీత్, పీసీ బాలచంద్రలను డీఎస్పీ అభినందించారు. నిందితులు అరెస్ట్ వివరాలు వెల్లడించిన డీఎస్పీ మొయిన్ -
ప్లేస్మెంట్స్లో సత్తా చాటిన కేఎల్ విద్యార్థులు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): క్యాంపస్ ప్లేస్మెంట్స్లో తమ కళాశాల విద్యార్థులు సత్తా చాటారని యూనివర్సిటీ ప్లేస్మెంట్స్ విభాగం డైరెక్టర్ డాక్టర్ శరవణబాబు తెలిపారు. విజయవాడలోని యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే ఇంజినీరింగ్ విభాగంలో 100 శాతం ప్లేస్మెంట్స్ రికార్డు సాధించామని చెప్పారు. డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల విద్యార్థులు సైతం 155 కు పైగా కంపెనీల్లో ప్లేస్మెంట్స్ సాధించారని పేర్కొన్నారు. 450 కి పైగా జాతీయ కంపెనీలు, 50 కి పైగా అంతర్జాతీయ కంపెనీలు క్యాంపస్ ప్లేస్మెంట్స్ కోసం యూనివర్సిటీకి వచ్చాయని వెల్లడించారు. నైపుణ్యాల అభివృద్ధిలో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు. యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె. శ్రీనివాసరావు, ఎంహెచ్ ఎస్ విభాగం డీన్ డాక్టర్ కిషోర్ బాబు మాట్లాడుతూ కేఎల్ యూనివర్సిటీలో ఏ కోర్సు చదివినా మంచి ప్యాకేజీతో ప్లేస్మెంట్ వచ్చేలా స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నామని తెలిపారు. సమావేశంలో యూనివర్సిటీ ప్లేస్మెంట్స్ విభాగం అసోసియేట్ డీన్ డాక్టర్ చలపతి పాల్గొన్నారు. -
పవర్ లిఫ్టింగ్లో జిల్లాకు చాంపియన్షిప్
సత్తెనపల్లి: రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పల్నాడు జిల్లా క్రీడాకారులు ప్రతిభ చూపి జూనియర్ మెన్ టీం చాంపియన్షిప్ సాధించింది. ఒంగోలు లోని డాక్టర్ పి.ఆనంద్ స్టేడియంలో 12వ రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు గత నెల 31 నుంచి ఈ నెల 2 వరకు మూడు రోజులపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్– బెంచ్ ప్రెస్ సబ్ జూనియర్, జూనియర్, సీనియర్, మాస్టర్స్ మెన్, ఉమెన్ పోటీలు ప్రతిష్టాత్మకంగా జరిగాయి. ఈ పోటీలలో పల్నాడు జిల్లాకు చెందిన 8 మంది క్రీడాకారులు 10 బంగారం, 3 రజత, 2 బ్రొంజ్ పతకాలను మొత్తంగా 15 పతకాలను కై వసం చేసుకొన్నారు. జిల్లా ప్రతిష్టను చాటడమేగాక జిల్లా జూనియర్ మెన్ టీం చాంపియన్ షిప్ మొదటి స్థానం సాధించింది. సబ్ జూనియర్స్లో 47 కేజీల విభాగంలో గురజాలకు చెందిన కె.పల్లవి (సిల్వర్ మెడల్), 66 కేజీల విభాగంలో సత్తెనపల్లికి చెందిన ఎం.వినయ్ వెంకట శివ (సిల్వర్ మెడల్), జూనియర్–సీనియర్ మెన్ విభాగంలో 74 కేజీల విభాగంలో వెన్నా దేవీకి చెందిన శరత్ 2 బంగారు పతకాలు, 74 కేజీ విభాగంలో కంకణాలపల్లికి చెందిన రమేష్ చౌదరి బ్రాంచ్ మెడల్, 83 కిలోల విభాగంలో సత్తెనపల్లికి చెందిన పసుపులేటి వంశీ కృష్ణ 3 బంగారు పతకాలు, ఒక రజిత పతకం, 120 కేజీల విభాగంలో గుడిపూడికి చెందిన లింగిసెట్టి శివ నాగేశ్వరరావు నాలుగు బంగారు పతకాలు, సబ్ జూనియర్ మెన్ బెంచ్ ప్రెస్ విభాగంలో 53 కిలోల విభాగంలో గురజాలకు చెందిన కె కార్తీక్ సిల్వర్ పతకం,74 కిలోల విభాగంలో సత్తెనపల్లికి చెందిన షేక్ మొహిద్దీన్ బంగారు పతకం సాధించారు. శరత్ (వెన్నాదేవీ), పసుపులేటి వంశీకృష్ణ రెండు, మూడవ స్థానాల్లో రాష్ట్రస్థాయిలో జూనియర్ స్ట్రాంగ్ మెన్టైటిల్ సంపాదించారు. ప్రతిభ చూపిన క్రీడాకారులను పల్నాడు జిల్లా అసోసియేషన్ సెక్రటరీ, అంతర్జాతీయ క్రీడాకారుడైన పసుపులేటి సురేష్, పల్నాడు జిల్లా పవర్ లిఫ్టింగ్ ప్రెసిడెంట్ జిమ్రాజు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ మాతంగి సాంబశివ రావు, కత్తి పవన్, మాతంగి రాహూల్ గౌతమ్, జి రమేష్, శాంతయ్య, పట్టణానికి చెందిన ప్రముఖులు శుక్రవారం క్రీడాకారులను అభినందించారు. ప్రతిభ చూపిన జూనియర్ మెన్ క్రీడాకారులు -
అవగాహనతో మలేరియా కట్టడి చేయవచ్చు
గుంటూరు మెడికల్: అవగాహనతో మలేరియాను కట్టడి చేయవచ్చని జిల్లా మలేరియా అధికారి సుబ్బరాయణం అన్నారు. జాతీయ మలేరియా నివారణ మాసోత్సవం సందర్భంగా శుక్రవారం స్థానిక గుండారావుపేట పట్టణ ఆరోగ్య కేంద్రంలో అవగాహన ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీకి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సుబ్బరాయణం మాట్లాడుతూ వర్షాకాలంలో దోమలు వృద్ధి చెంది మలేరియా, డెంగీ, టైఫాయిడ్ లాంటి వ్యాధులు కలుగజేస్తాయన్నారు. దోమలు పెరగకుండా ప్రతి ఒక్కరు తమ చుట్టు పక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించి దోమలు పెరగకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా దోమకాటు నుంచి రక్షణ కోసం ప్రతి ఒక్కరు దోమ తెరలు వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ షేక్. హబీద, సబ్యూనిట్ అధికారి ప్రశాంత్ , సబ్ యూనిట్ సూపర్వైజర్లు కె. యన్.సుకుమార్, సూరి, శ్రీనివాసరావు, నరసింహారావు, సచివాలయ ఏఎన్ఎంలు, ఆశాలు పాల్గొన్నారు. జిల్లా మలేరియా అధికారి సుబ్బరాయణం -
విద్యార్థుల జీవితాలతో కూటమి చెలగాటం
వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సిహెచ్ వినోద్ పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యార్థుల భవిష్యత్తో చెలగాటమాడుతోందని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సిహెచ్.వినోద్కుమార్ విమర్శించారు. పదవ తరగతి మూల్యాంకాన్ని లోపభూయిష్టంగా నిర్వహించిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నగరంపాలెంలోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో డీఈఓ సీవీ రేణుకకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా పదో తరగతి పరీక్షల నిర్వహణలో అటు పాలకులు, అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఎటువంటి ఫీజు లేకుండా కోరిన ప్రతి విద్యార్థి జవాబు పత్రాలను రీవాల్యూయేషన్ చేయించాలని డిమాండ్ చేశారు. తుది ఫలితాలు వచ్చే వరకు అడ్మిషన్లను కొన్ని రోజుల పాటు నిలిపివేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థుల విషయంలో జరిగిన తప్పులకు బాధ్యులైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అధికారులపై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం నేతలు పాల్గొన్నారు. -
● గత ప్రభుత్వంలో వరుసగా నాలుగేళ్లు నిరాటంకంగా అమ్మఒడి అమలు ● తల్లికి వందనం పేరుతో విద్యార్థుల తల్లులను మోసగించిన కూటమి ప్రభుత్వం ● చదువుకునే ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇస్తామని హామీ ● గుంటూరు జిల్లాలోని విద్యార్థులు, తల్లులకు రూ. 540 కోట్లు బకాయి పడిన
నేడు తల్లికి మంగళం! తల్లికి వందనం ద్వారా జిల్లాలో ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న 3.60 లక్షల మంది విద్యార్థులకు రూ.15వేలు చొప్పున ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించాల్సి ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న మూడు లక్షల మంది విద్యార్థులతో పాటు ఇంటర్ చదువుతున్న విద్యార్థులు 60వేల మంది ఉన్నారు. ఈ విధంగా ఒక్కో విద్యార్థికి రూ.15వేలు చొప్పున రూ.540 కోట్లు బకాయి పడింది. గుంటూరు ఎడ్యుకేషన్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకువచ్చిన చదువుల విప్లవంతో పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో నాణ్యమైన విద్యను పొందారు. కార్పొరేట్ స్కూళ్లను తలదన్నే విధంగా డిజిటల్ చదువులను అమల్లోకి తెచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వ పాఠశాలల స్వరూపాన్ని సమూలంగా మార్చివేశారు. తరగతిగదిలో బ్లాక్బోర్డుపై రాసిన పాఠ్యాంశాలను చదువుకునే రోజుల నుంచి చేత్తో తాకే తెరపై ప్రపంచం నలుమూలలా దాగి ఉన్న సమస్త విజ్ఞానాన్ని, సమాచారాన్ని తరగతిగదిలోనే అందుకున్నారు. వైఎస్ జగన్ పాలనలో సువర్ణాధ్యాయంగా నిలిచిన ప్రభుత్వ విద్యావ్యవస్థ కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో తిరోగమనం దిశగా పయనిస్తోంది. వైఎస్ జగన్ పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో పైసా ఖర్చు లేని ఉచిత విద్యకు ఇచ్చిన భరోసా ప్రస్తుతం కనుమరుగైంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలనలో నాడు–నేడు ద్వారా రూ.43 లక్షలతో ఆధునికీకరించిన గుంటూరు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో బ్లాక్బోర్డు స్థానంలో ఏర్పాటు చేసిన ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ (ఐఎఫ్పీ) ద్వారా విద్యార్థులకు ఆధునిక సాంకేతిక విద్య అందుతోందంటే అది వైఎస్ జగన్ చలువే. పేద, బడుగు, బలహీనవర్గాల విద్యార్థులకు కార్పొరేట్కు దీటుగా ఆధునిక వసతులతో తీర్చిదిద్దిన పాఠశాలల్లో అత్యాధునిక సదుపాయాలు నేడు ఉత్తమ ఫలితాలను అందిస్తున్నాయి. గతంలో పాఠశాలల్లో టీవీ ఏర్పాటు చేయడమే గొప్పగా చెప్పుకున్న పరిస్థితుల్లో వందలాదిగా ఐఎఫ్పీలను ఏర్పాటు చేసి, సర్కారు బడుల్లో టెక్నాలజీ విద్యను పేద వర్గాలకు అందుబాటులోకి తెచ్చిన ఘనత వైఎస్ జగన్కే సొంతం. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు ఇచ్చి సబ్జెక్టు పరమైన విజ్ఞానంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించారు. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక వసతులతో తీర్చిదిద్ది, విద్యార్థులతో కళకళలాడే విధంగా చేసిన ఎన్నో గొప్ప పనులు ఘన చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా మిగిలాయి. నేటి కూటమి ప్రభుత్వం వరుసగా వాటన్నిటికి మంగళం పాడుతూ ప్రభుత్వ విద్యావ్యవస్థను తిరోగమనం వైపు నడిపిస్తోంది. గత ప్రభుత్వంలో ఇంజినీరింగ్ కోర్సులకు ఆంక్షలు లేనివిధంగా ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఫీజు రీయిబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో బీటెక్, ఫార్మసీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా నిలిపివేశాయి. ఫలితంగా ఇటు ఉద్యోగాల్లో చేరే వీలు లేక, అటు ఉన్నత విద్యవైపు వెళ్లేందుకు అవకాశం లేకుండా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. – బందెల నాసర్జీ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గుంటూరు ●ఉన్నత చదువులకు ప్రోత్సాహం వైఎస్ జగన్ పాలనలో విద్యాదీవెన, వసతి దీవెనతో ఉన్నత చదువులకు ఆంక్షలు లేని విధంగా ఫీజులను చెల్లించారు. ఇంజినీరింగ్, ఫార్మసీ తదితర కోర్సులకు గత 2019కు ముందు టీడీపీ ప్రభుత్వం షరతులతో అమలు చేసిన ఫీజు రీయింబర్స్మెంట్పై ఆంక్షలు ఎత్తివేశారు. ఈ విధంగా గుంటూరు జిల్లాలో 2019–20 విద్యాసంవత్సరం నుంచి 2022–23 విద్యాసంవత్సరం వరకు 36,962 మంది విద్యార్థుల చదువులకు గత ప్రభుత్వం రూ.625.55 కోట్లు చెల్లించింది. జగనన్న విదేశీ విద్యాదీవెన ద్వారా గతంలో 42 మంది విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత చదువుల కోసం రూ.3.68 కోట్లు చెల్లించారు. 2023–24 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఫీజు బకాయిలు కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా చెల్లింపులకు నోచుకోలేదు. అదే విధంగా విదేశీ చదువులకు సైతం ప్రస్తుత కూటమి ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదు. ప్రభుత్వ పాఠశాలలను బడుగు, బలహీనవర్గాలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన పేద విద్యార్థుల దరికి చేర్చడంలో మాజీ సీఎం వైఎస్ జగన్ విశేష కృషి చేశారు. నాడు – నేడు మొదటి విడతలో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 1,183 పాఠశాలలను రూ.283 కోట్ల వ్యయంతో ఆధునికీకరించారు. జిల్లాల పునర్విభజన అనంతరం రెండో దశలో ఒక్క గుంటూరు జిల్లాలోనే 563 స్కూళ్లలో రూ.202 కోట్లతో పనులు మంజూరు చేశారు. వీటిలో దాదాపు 50 శాతానికి పైగా పనులు పూర్తవగా, కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో మిగిలిన పనులు పూర్తి కాలేదు. నాడు–నేడుతో చదువుల విప్లవం నాడు ‘స్మార్ట్’ బోధన.. నేడు వేదన ఫీజులు చెల్లించకపోవడంతో ఇబ్బందులు గత వైఎస్సార్ సీపీ పాలనలో గుంటూరు జిల్లాలోని 175 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన 624 ఐఎఫ్పీల ద్వారా విద్యార్థులకు ఆధునిక విద్య అందించారు. ప్రతి క్లాస్రూమ్కు ఒకటి చొప్పున ఒక్కో పాఠశాలకు ఐదు నుంచి 10 వరకు ఐఎఫ్ ప్యానెల్స్ ఏర్పాటు చేశారు. రూ.1.26 లక్షల వ్యయం కలిగిన అత్యాధునిక ఐఎఫ్పీలను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పాఠశాలల్లో ఏర్పాటు చేసింది. నేటి కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతో కొన్ని పాఠశాలల్లో నిర్వహణ సరిగా లేక అవి మూలన పడ్డాయి. విద్యార్థులకు ఆండ్రాయిడ్ ట్యాబ్లు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 8వ చదువుతున్న విద్యార్థులకు గత ప్రభుత్వం వరుసగా రెండేళ్ల పాటు 24,608 ఆండ్రాయిడ్ ట్యాబ్లను ఉచితంగా పంపిణీ చేసింది. నేటి కూటమి ప్రభుత్వం వాటి ఊసే ఎత్తడం లేదు. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
పొన్నూరు: పట్టణంలోని ఐలాండ్ సెంటర్లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీహరి తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని ఆలూరు గ్రామానికి చెందిన షేక్ సైదా(30) పొన్నూరులో సెంట్రింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతని కుటుంబంలో విభేదాల కారణంగా మూడేళ్లుగా భార్యకు దూరంగా ఉంటున్నాడు. పట్టణంలో పనులు చేసుకుంటూ రాత్రి వేళల్లో సెంటర్లోని ఓ లాడ్జిలో ఉంటున్నాడు. ఉదయం లాడ్జి కింద గాయాలతో పడి ఉన్నట్లు గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ మేరకు వారు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీహరి తెలిపారు. సైదా లాడ్జి పైనుంచి జారిపడి మరణించాడా.. గొడవ నేపథ్యంలో మృతి చెందాడా అనే అనుమానాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది. అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లిన కారు దుగ్గిరాల: డ్రైవరు మద్యం మత్తులో ఉండగా అదుపు తప్పిన కారు కాలువలోకి దూసుకెళ్లిది. దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలో గురువారం మధ్యాహ్నం చిలువూరు నుంచి కె.ఆర్.కొండూరు గ్రామం వైపు కారు వేగంగా వెళుతోంది. ఈ క్రమంలో అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లిది. స్థానికులు చూసి కారులోని డ్రైవరును బయటకు తీశారు. అతడు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. చిలువూరులో పక్కపక్కనే రెండు మద్యం దుకాణాలు ఉండటం వల్ల కొందరు నిత్యం మద్యం తాగి వేగంగా ద్విచక్రవాహనాలు, కార్లను నడుపుతున్నారని స్థానికులు చెప్పారు. పలువురు ప్రమాదానికి గురవుతున్నారని తెలిపారు. అధికారులకు అనేకసార్లు ఇక్కడ మద్యం దుకాణాలు తొలగించాలని కోరినా స్పందించలేదని పేర్కొన్నారు. -
ఆధునిక వ్యవసాయ విధానంతో అధిక దిగుబడులు
కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వెంకటేశ్వర్లు పెదకూరపాడు: ఆధునిక వ్యవసాయ విధానం ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు సాధించవచ్చని కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వెంకటేశ్వర్లు చెప్పారు. కృషి విజ్ఞాన్ కేంద్రం వారి ఆధ్వర్యంలో వికసిత్ కృషి సంకల్ప యాత్ర పెదకూరపాడులో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక వ్యవసాయ పద్ధతుల గురించి వివరించారు. కృషి విజ్ఞాన కేంద్రం లాంఫాం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎం.గంగాదేవి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వ్యవసాయం, అనుబంధ రంగాల పథకాల గురించి వివరించారు. ఈనామ్ పోర్టల్ వినియోగం, కిసాన్ సారఽథి టోల్ ఫ్రీనెంబరు గురించి వివరించారు. ఉద్యానశాఖలో అమలవుతున్న పండ్ల తోటలు, పూల తోటలకు ఇచ్చే సబ్సిడీల వివరాలను ఉద్యాన శాఖాధికారి యు.శ్రీ నిత్య వివరించారు. పశు సంవర్థకశాఖ పథకాలను గురించి వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ పి.శ్రీదేవి తెలిపారు. వ్యవసాయ శాఖలో అమలవుతున్న పీఎం కిసాన్ మట్టి నమూనాల సేకరణ, 50 శాతం రాయితీపై పచ్చిరొట్టె విత్తనాలు పంపిణీ, వ్యవసాయ యాంత్రీకరణ మొదలైన పథకాల గురించి ఏవో ఐ. శాంతి తెలిపారు. జీవ శిలీంద్రనాశిని అయిన ట్రైకోడెర్మావిరిడి ప్యాకెట్లను కృషి విజ్ఞాన కేంద్రం, లాంఫాం శాస్త్రవేత్తలు రైతులకు ఉచితంగా పంపిచేశారు. కార్యక్రమంలో రైతులు, గ్రామ వ్యవసాయ సహాయకులు బి.జ్యోతి, పి.ధనలక్ష్మీ ,షేక్ హసన్ బాజీ పాల్గొన్నారు. -
పర్యావరణ సమతుల్యతకు మొక్కలు నాటాలి
అదనపు సీనియర్ సివిల్ న్యాయాధికారి ఎం. లావణ్య నరసరావుపేట టౌన్: పర్యావరణ సమతుల్యం కోసం మొక్కలు నాటాలని అదనపు సీనియర్ సివిల్ న్యాయాధికారి ఎం. లావణ్య సూచించారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవ సందర్భంగా గురువారం రాష్ట్ర జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు స్థానిక న్యాయస్థానం ఆవరణలో పర్యావరణ పరిరక్షణపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆమె పాల్గొని ప్రసంగించారు. మొక్కలు నాటి వాటి సంరక్షణ చర్యలు చేపట్టాలనీ, కాలుష్యాన్ని నివారించడం కోసం అందరమూ కృషి చేయాలన్నారు. అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటి సంరక్షించడంతోపాటు ప్లాస్టిక్ బ్యాగ్ల వాడకాన్ని నివారించాలన్నారు. అనంతరం న్యాయస్థాన భవనాల ఆవరణలో న్యాయాధికారి లావణ్య మొక్కలు నాటారు. కార్యక్రమంలో పలువురు సీనియర్, జూనియర్ న్యాయవాదులు, పారా లీగల్ వలంటీర్లు, కోర్ట్ సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం పురస్కరించుకుని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో గురువారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సీఐ ఎం.వి. చరణ్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మొక్కలు ఎంతగానో దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ లోక్నాథ్, ఎస్ఐలు కిషోర్, అశోక్ సిబ్బంది పాల్గొన్నారు. -
పేద్ద మొత్తంలో అవినీతి!
పట్నంబజారు: గుంటూరు నగరంలోని లాలాపేటలో వేంచేసియున్న శ్రీ వేంటేశ్వరస్వామి గ్రూప్ ఆలయాల పరిధిలో నాజ్ సెంటర్లోని శ్రీ అభయాంజనేయస్వామి ఆలయం, శ్రీ జగన్నాథ స్వామి ఆలయాలు ఉన్నాయి. అయితే ఈ ఆలయాలకు సంబంధించి పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) విధానంలో పలు అవకతవకలు జరిగాయని సమాచారం. 2015కు సంబంధించి సిబ్బందికి ఇవ్వాల్సిన పీఆర్సీని 2024లో ఇచ్చారు. అయితే దేవదాయ శాఖకు స్వయంప్రతిపత్తిగా ఉద్యోగులకు జీతాలు ఇచ్చే అవకాశం ఉంది. దీనిలో భాగంగానే పీఆర్సీ కూడా ఇవ్వొచ్చని ఆలయ సిబ్బంది చెబుతున్నారు. ఆలయ అధికారిగా పనిచేసిన ఒక వ్యక్తి అత్యుత్సాహం కారణంగా, మొత్తం గ్రూప్ ఆలయాల్లో 19 మంది సిబ్బందికిగానూ.. ఏడుగురికి ఇవ్వాల్సిన దానికంటే అధిక మొత్తాలను వారి ఖాతాల్లో జమ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సదరు అధికారి సిబ్బందిని భయపెట్టి, తిరిగి ఆ మొత్తాన్ని చెల్లిస్తామని లేఖలు రాయించుకున్నట్లు సమాచారం. ఇదే క్రమంలో ఆలయాలకు సంబంధించి వచ్చిన ఆదాయంలో 28 శాతం కంటే అధికంగా ఉంటే పీఆర్సీలు ఇచ్చేందుకు వీలు లేదని చెబుతున్నారు. 2020 సంవత్సరంలో ఆరుగురు అర్చకుల నుంచి భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడి పెద్ద ఎత్తున పీఆర్సీలు ఇవ్వటంతో గ్రూప్ ఆలయాల ఖర్చు 52 శాతానికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఆలయ అధికారిగా వ్యవహరిస్తున్న అసిస్టెంట్ కమిషనర్ (ఏసీ) అధిక శాతం పీఆర్సీ పడిన వారి నుంచి తిరిగి ఆ మొత్తాన్ని వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేశారని తెలిసింది. నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. గతంలో పనిచేసిన సదరు అధికారి తప్పిదాన్ని ఆడిట్ అధికారులు ఆక్షేపించినట్లు ఆలయ సిబ్బంది చెబుతున్నారు. ఆలయాల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు భక్తులకు మరింత తలనొప్పి తెచ్చి పెడుతోంది. ముఖ్యంగా ఆంజనేయస్వామి ఆలయంలో లడ్డు, ఇతర పూజలకు సంబంధించి టోకెన్లు కొట్టే వ్యక్తి ఉదయం 8 గంటలకు రాకపోవటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారని తెలిసింది. ఈ విషయాన్ని ఆలయంలో సిబ్బందే చెబుతున్నారు. పే రివిజన్ కమిషనర్ విధానంలో అవకతవకలు అధికమొత్తంలో అందుకున్న పలువురు దేవదాయ ఉద్యోగులు తిరిగి ఆ మొత్తాన్ని రికవరీ చేసేందుకు రంగం సిద్ధంనేను ఇంకా చూడలేదు నేను ఇంకా ఈ అంశంపై దృష్టి పెట్టలేదు. స్పష్టంగా మీకు కావాల్సింది పేపరుపై రాసి ఇస్తే.. కావాల్సిన సమాచారం ఇస్తాం. ఆడిట్ ఆక్షేపించిన అంశం నాకు తెలియదు. ప్రస్తుతానికి నోటీసులు వరకు రాలేదు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం బకాయిలు చెల్లించే అంశాన్ని పరిశీలిస్తున్నాం. ఆడిట్ అబ్జక్షన్స్ ఉంటే కచ్చితంగా దానిపై దృష్టి సారిస్తాం. – టి. సుభధ్ర ఏసీ, లాలాపేట గ్రూప్ ఆలయాలు -
నైపుణ్యాన్ని ప్రదర్శించి జిల్లాకు మంచి పేరు తీసుకురండి
సత్తెనపల్లి: క్రీడాకారులు క్రీడానైపుణ్యాన్ని ప్రదర్శించి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మాబు హుస్సేన్ అన్నారు. స్థానిక సుగాలీకాలని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పల్నాడు జిల్లాస్థాయి సబ్ జూనియర్స్, జూనియర్స్ బాలబాలికల ఫుట్బాల్ సెలక్షన్ ట్రయల్స్ గురువారం జరిగాయి. ఈ సెలక్షన్కు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 70 మంది బాలురు, 50 మంది బాలికలు ఫుట్బాల్ క్రీడలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడాకారులు విజయమే లక్ష్యంగా పెట్టుకొని రాణించాలన్నారు. సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీరామ్ రెడ్డి, అచ్చిరెడ్డి, మహబూబ్ సుభాని, నరసింహారావులు మాబు హుస్సేన్ను ఘనంగా సత్కరించారు. పల్నాడు జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కె. సుబ్రహ్మణ్యేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాకు సెలెక్ట్ అయిన ఫుట్బాల్ క్రీడాకారులు త్వరలో జరిగే స్టేట్ మీట్లో పాల్గొంటారన్నారు. అనంతరం అతిథులను ఘనంగా సన్మానించారు. అనంతరం జిల్లా సబ్ జూనియర్స్, జూనియర్స్ బాల, బాలికల జట్లను ప్రకటించారు. -
16 మందికి హెడ్ నర్సులుగా ఉద్యోగోన్నతి
గుంటూరు మెడికల్: ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో స్టాఫ్ నర్సులుగా పని చేస్తున్న 16 మందికి గురువారం కౌన్సెలింగ్ నిర్వహించి హెడ్ నర్సులుగా ప్రమోషన్ ఉత్తర్వులు ఇచ్చారు. గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకుల కార్యాలయంలో జరిగిన కౌన్సెలింగ్కు 17 మంది స్టాఫ్ నర్సులను ప్రమోషన్ కోసం పిలువగా, ఒకరు ప్రమోషన్ వద్దని లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చారు. ప్రమోషన్ ద్వారా గుంటూరు జీజీహెచ్లో ఎనిమిది మంది, ఒంగోలు జీజీహెచ్లో ఐదుగురు, నెల్లూరు జిల్లాలో ముగ్గురు హెడ్ నర్సులుగా చేరారు. సుమారు ఆరు నెలలుగా ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న నర్సింగ్ సిబ్బంది ఎట్టకేలకు కౌన్సెలింగ్ జరగడంతో నర్సింగ్ యూనియన్ నేతలతో కలిసి గురువారం మెడికల్ అండ్ హెల్త్ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ కె.సుచిత్రాదేవిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కౌన్సెలింగ్ ప్రక్రియలో ఆర్డీతోపాటు, డెప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఆఫీస్ సూపరింటెండెంట్ షేక్ నాగూర్ షరీఫ్, సీనియర్ అసిస్టెంట్ సుబ్బారావు పాల్గొన్నారు. ఆర్డీకి కృతజ్ఞతలు తెలిపిన వారిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నర్సుల సంఘం జిల్లా సెక్రటరీ వెల్లంపల్లి పద్మజ, వైస్ ప్రెసిడెంట్ శ్రీదేవి, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు సునీత, అరుణ తదితరులు పాల్గొన్నారు. -
బంగారం కోసమే వృద్ధురాలి హత్య
తెనాలి ముత్తెంశెట్టిపాలెం కేసును ఛేదించిన పోలీసులు తెనాలి రూరల్: తెనాలి మెత్తెంశెట్టిపాలెంలో ఈ నెల 3వ తేదీ తెల్లవారుజామున వృద్ధురాలి హత్య కేసును పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. హత్యకు పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. తెనాలి వన్ టౌన్ పోలీస్స్టేషన్లో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ బి. జనార్దనరావు వివరాలను వెల్లడించారు. ఆయన కథనం ప్రకార.. ముత్తెంశెట్టిపాలెంలో తాడిపత్రి మల్లీశ్వరి టిఫిన్ బండి నిర్వహిస్తూ ఒంటరిగా జీవిస్తోంది. కుమార్తె, కుమారుడికి వివాహాలయ్యాయి. వారు ఇదే ప్రాంతంలో వేర్వేరుగా ఉంటున్నారు. ఒంటరిగా ఉంటున్న మల్లీశ్వరి బంగారు ఆభరణాలను ధరించి ఉండడాన్ని ఆమె ఇంటి పక్కనే నివసిస్తున్న 24 ఏళ్ల నన్నెపాముల తారక జోషి గమనించాడు. ఇతడు గతంలో బాపట్ల జిల్లా నగరం మండలం ధూళిపూడి గ్రామంలో నివసించేవాడు. వివాహమై, చెడు వ్యసనాలతో అప్పులపాలైన అతను ఆ ఆభరణాలను దోచుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు తన తమ్ముడు సతీష్కుమార్ సహాయం తీసుకున్నాడు. 3వ తేదీ తెల్లవారుజామున ఐదు గంటలకు మల్లీశ్వరి నీళ్ల కోసం పంపు వద్దకు రాగా ఆమెను గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకెళ్లి మంచంపై పడుకోబెట్టారు. బంగారు ఆభరణాలను చోరీ చేశారు. ఆ బంగారంలో కొంత తారక జోషి తనకు పరిచయమున్న సంగంజాగర్లమూడి గ్రామానికి చెందిన మహిళ గాజులవర్తి కీర్తికి ఇచ్చాడు. అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను విచారిస్తున్న క్రమంలో చిక్కిన నిందితులు నేరానికి పాల్పడినట్టు గుర్తించారు. ఆ ఆభరణాలను ఆమె తాకట్టు పెట్టిందని, వాటిని స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. కేసును 48 గంటల్లో ఛేదించిన వన్ టౌన్ సీఐ మల్లికార్జునరావు, సిబ్బందిని ఆయన అభినందించారు. -
పర్యావరణ పరిరక్షణకు ప్రతిజ్ఞ
లక్ష్మీపురం: పర్యావరణ పరిరక్షణను ప్రొత్సహించే లక్ష్యంతో గుంటూరు రైల్వే స్టేషన్లో వేడుకలు నిర్వహించామని డీఆర్ఎం సుథేష్ఠ సేన్ అన్నారు. గుంటూరు రైల్వే స్టేషన్లో గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఒకటో ప్లాట్ఫాంపై ప్రయాణికులకు అవగాహన కలిగించారు. ర్యాలీ చేపట్టి, నాటకం ప్రదర్శించారు. డివిజన్ అధికారులు, ప్రయాణికులతో ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. డీఆర్ఎం మాట్లాడుతూ పర్యావరణ అనుకూల అలవాట్లను నేర్చుకోవాలన్నారు. అనంతరం నల్లపాడులోని మొక్కలను నాటారు. కార్యక్రమంలో ఏడీఆర్ఎం కె.సైమన్, సీనియర్ డీఈఎన్ జె.వి. అనూష, సీనియర్ డీఎంఈ ఎం.రవికిరణ్, సీనియన్ డీసీఎం డాక్టర్ సీహెచ్ ప్రదీప్, డీఎస్సీ మధుసూదన రావు, సీనియర్ డీఈఈ జి.సూర్యనారాయణ, పి.రవితేజ తదితరులు పాల్గొన్నారు. లాంఫాంలో వన మహోత్సవం గుంటూరు రూరల్: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నగర శివారులోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానంలో పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ నిషేధంపై గురువారం ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఏడీఆర్ డాక్టర్ దుర్గా ప్రసాద్, శాస్త్రవేత్తలు పరిశోధన స్థానంలో మొక్కలు నాటారు. ఖరీఫ్ సాగుకు రైతులు సన్నద్ధం అవుతున్న తరుణంలో విత్తనం ఎంపిక విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఆయా ప్రాంతాలకు అనువైన విత్తనాలను లైసెన్స్డ్ డీలర్ల వద్ద , లేదా వ్యవసాయ శాఖ, లేదా యూనివర్సిటీ వద్ద మాత్రమే పొందాలన్నారు. ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భాగంగా రైతులకు పరిశీలనలో ఉన్న కంది రకం ఎల్ఆర్జీ 494 ను అందజేశారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
జీడీసీసీబీ పర్సన్ ఇన్చార్జిగా బాధ్యతల స్వీకరణ
నగరంపాలెం: గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (జీడీసీసీబీ) పర్సన్ ఇన్చార్జిగా మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు గురువారం గుంటూరు బ్రాడీపేటలోని జీడీసీసీబీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. మల్లికార్జునరావు మీడియాతో మాట్లాడుతూ రైతులకు రుణాల మంజూరులో సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రైతులకు మేలు చేయాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. వ్యవసాయ శాఖ ద్వారా నల్ల బెర్లీ పొగాకుపై రైతులకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. విత్తనాలు అందించేందుకు ప్రభుత్వ సహకారం ఉంటుందని తెలిపారు. ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, భాష్యం ప్రవీణ్, టీటీడీ సభ్యుడు జంగా కృష్ణమూర్తి, టీడీపీ నాయకులు నన్నపనేని రాజకుమారి, బ్యాంక్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. అయితే మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడే సమయంలో ఒకట్రెండు సార్లు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఆయన మీడియా, సెల్ఫోన్ లైట్ల వెలుగులో మాట్లాడారు. ఆ తర్వాత కూడా పలుమార్లు విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో వచ్చిన వారు ఉక్కపోతతో అవస్థలు పడ్డారు. రైతులకు సేవ చేస్తా.. రైతులకు సేవ చేస్తానని గుంటూరు జిల్లా కో ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ పర్సన్ ఇన్చార్జి వడ్రాణం హరిబాబు అన్నారు. గుంటూరు కన్నవారితోటలోని జీడీసీఎంఎస్ కార్యాలయంలో గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. సొసైటీ ద్వారా రైతులకు ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు అందిస్తామన్నారు. గిట్టుబాట ధర కల్పించేలా చూస్తామని చెప్పారు. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ టీడీపీలో కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుందన్నారు. ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలుకు ఎలక్ట్రికల్ బస్సుల పెంపుదల, అదనపు సిబ్బందిని నియమిస్తామని అన్నారు. అనంతరం హరిబాబుని మంత్రి అచ్చెన్నాయుడు, పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు అభినందించారు. -
పకడ్బందీగా మెగా డీఎస్సీ
● పరీక్ష కేంద్రాల వద్ద మౌలిక వసతులు, బందోబస్తు కల్పించండి ● సమీక్ష చేసిన జిల్లా కలెక్టర్ నరసరావుపేట: జిల్లాలో నేటి నుంచి ఈ నెల 30 వరకు నిర్వహించే మెగా డీఎస్సీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని, పరీక్ష కేంద్రాల వద్ద మౌలికవసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు ఆదేశించారు. గురువారం కార్యాలయంలో పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్ష చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా రెండు షిఫ్ట్లలో సుమారుగా 18,415 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారన్నారు. మారుమూల ప్రాంతాలనుంచి అభ్యర్థులకు అనువుగా బస్సు సర్వీసులు ఏర్పాటు చేయాలని, పరీక్షా కేంద్రాలు తెలిసేలా ప్రధాన కూడళ్లలో సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన కార్డులు అనుమతించడం జరుగుతుందని, పరీక్షకు ఒక గంట ముందుగా అభ్యర్థులు హాజరుకావాలని, నిముషం లేటు అయినా అనుమతించడం జరగదని అన్నారు. అభ్యర్థులు కలర్ ఫొటో అందుబాటులో ఉంచుకోవాలన్నారు. డీఆర్ఓ ఏకా మురళి, అదనపు ఎస్పీ జేవీ సంతోష్, ఆర్డీఓ కె.మధులత, డీఈఓ ఎల్.చంద్రకళ, ఇంజినీరింగ్ కళాశాలల ప్రతినిధులు పాల్గొన్నారు. 8న రెడ్ల సత్రం సిల్వర్ జూబ్లీ వేడుకలు నరసరావుపేట రూరల్: కోటప్పకొండలోని శ్రీ యోగి వేమారెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్, రెడ్ల సత్రం ఏర్పాటై 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు ఈనెల 8వ తేదీ ఉదయం 11గంటలకు నిర్వహిస్తున్నట్టు సత్రం కమిటీ సభ్యులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వేడుకలకు ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి , ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాదరెడ్డి, జూలకంటి బ్రహ్మారెడ్డి, మాజీ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి, గాదె వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్రెడ్డి, యర్రం వెంకటేశ్వరరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, టీజీ కృష్ణారెడ్డి, సత్తెనపల్లి వైఎస్సార్ సీపీ కన్వీనర్ డాక్టర్ గజ్జల సుధీర్భార్గవరెడ్డిలు పాల్గొంటారని తెలిపారు. ఘనంగా రామాలయం వార్షిక వేడుకలు నకరికల్లు: శ్రీరాంపురంలోని శ్రీరాముల వారి ఆలయ వార్షిక వేడుకలు గురువారం వైభవంగా నిర్వహించారు. 21వ వార్షిక వేడుకలు పురస్కరించుకొని ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. వేదపండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. గ్రామస్తులు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. అనంతరం ఆలయం వద్ద ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. 24 మందికి సీనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ గుంటూరు మెడికల్: ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో జూనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న 24 మందికి గురువారం గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకుల కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించి సీనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ ఆర్డర్స్ ఇచ్చారు. ఈ ప్రక్రియలో మెడికల్ అండ్ హెల్త్ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ కె.సుచిత్ర, డెప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఆఫీస్ సూపరింటెండెంట్లు నాగూర్ షరీఫ్, గోపవరపు స్టాన్లీ రాజ్కుమార్, సీనియర్అసిస్టెంట్ బి.శ్యామ్ అనిల్, పాల్గొన్నారు. జూలై 26, 27 తేదీలలో టైప్రైటింగ్ పరీక్షలు రేపల్లె: స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ మంగళగిరి వారి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఇంగ్లిష్, తెలుగు, హిందీ భాషలలో టైప్రైటింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఏపీ టైప్రైటింగ్ అండ్ షార్ట్ హ్యాండ్ ఇనిస్టిట్యూట్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు సీవీ మోహనరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జులై 26, 27 తేదీలలో లోయర్ గ్రేడ్, హయ్యర్ గ్రేడ్ పరీక్షలను, అదనంగా ఇంగ్లిష్ జూనియర్ గ్రేడ్ పరీక్షలు 36 కేంద్రాలలో నిర్వహించనున్నట్టు తెలిపారు. జులై 12, 13 తేదీలలో తెలుగు, ఇంగ్లిష్ షార్ట్ హ్యాండ్ అన్ని గ్రేడ్ల పరీక్షలు 7 కేంద్రాలలో నిర్వహిస్తారు. -
కౌలు రైతులకు రుణాలు పెంచాలి
గుంటూరు వెస్ట్: జిల్లాలో కౌలు రైతులకు ఇవ్వాల్సిన రుణ లక్ష్యాలను ఆశించిన స్థాయిలో బ్యాంకర్లు పూర్తి చేయలేదని, దీన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉందని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్తేజ తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో 2025 త్రైమాసికానికి సంబంధించి డీసీసీ, డీఎల్ఆర్సీ బ్యాంకర్ల సమవేశం జరిగింది. ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ కౌలు రైతులకు రూ. 180 కోట్ల రుణ లక్ష్యం కాగా, రూ. 60 కోట్లు మాత్రమే మంజూరు చేశారన్నారు. దీన్ని మరింత పెంచి పెండింగ్ రుణాలు అందించాలన్నారు. విద్య, గృహ రుణాలు పెంచేందుకు బ్యాంకర్లు, విద్యా సంస్థలు, ఇంజినీరింగ్ కళాశాలలు, తదితర రద్దీ ప్రాంతాల్లో రుణ మేళా నిర్వహించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్న పీఎం సూర్యఘర్ పథకం ద్వారా ప్రతి ఇంటిపైన సోలార్ ప్యానల్ ఏర్పాటు చేసుకునేందుకు ప్రోత్సహించాలన్నారు. దీనిలో భాగంగా కనీసం రూ. 20 వేల మందికి రుణాలు ఇవ్వాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు పీఎం విశ్వకర్మ, పీఎం ఈజీసీఎం, పీఎంఎఫ్ ఎంజీ, ముద్ర రుణ లక్ష్యాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. గత ఆర్థిక సంవత్సరం 2024–25 కు సంబంధించి వ్యవసాయ రంగానికి రూ.13,613 కోట్ల రుణ లక్ష్యం కాగా, రూ.16,266 కోట్లు అంటే 119 శాతం మంజూరు చేశారన్నారు. ఎంఎస్ఎంఈ రంగానికి రూ. 9,495 కోట్లు రుణ లక్ష్యం కాగా, రూ. 10,679 కోట్లు అంటే 112 శాతం మంజూరు చేశారన్నారు. ప్రాధాన్యత రంగానికి సంబంధించి విద్యా రుణాలు రూ.114.5 కోట్లు లక్ష్యం కాగా, రూ.95.87 కోట్లు మంజూరు చేశారన్నారు. గృహ రుణాలు మాత్రం ఆశించిన స్థాయిలో లేవని అసహనం వ్యక్తం చేశారు. దీనిలో రూ.664 కోట్లు లక్ష్యం నిర్ణయిస్తే, రూ.182 కోట్లు అంటే కేవలం 27.5 శాతం మాత్రమే మంజూరు చేశారని తెలిపారు. మొత్తం వార్షిక రుణ లక్ష్యం రూ.34,730 కోట్లకు గాను, రూ.44,918 కోట్లు అంటే రూ.129 కోట్లు మంజూరు చేసి రుణ లక్ష్యాలను దాటినందుకు బ్యాంకర్లను అభినందిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం జిల్లాకు సంబంధించి నాబార్డు పీఎల్పీ 2025 –26 పుస్తకాన్ని ఇన్చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్తేజ, యూడీఐ రీజనల్ హెడ్ జవహర్, జిల్లా లీడ్బ్యాంకు మేనేజర్ మహిపాల్రెడ్డి, నాబార్డు డీడీఎం శరత్, ఏడీఏ వెంకటేశ్వర్లు, ఆర్బీఐ ఎల్డీవో నవీన్లు ఆవిష్కరించారు. జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్తేజ -
యోగాతో సామర్థ్యం మెరుగు
నగరంపాలెం: యోగా, ధ్యానం అభ్యాసం వల్ల మనిషి ఆలోచనా విధానం, సామర్థ్యం మెరుగుపడతాయని జిల్లా ఎస్పీ సతీష్కుమార్ అన్నారు. నాషా ముక్త భారత్ అభియాన్లో భాగంగా బుధవారం పోలీస్ పరేడ్ మైదానంలో యోగా అభ్యాసం నిర్వహించారు. జిల్లా ఎస్పీ సతీష్కుమార్ మాట్లాడుతూ యోగా, ధ్యానం అనేవి శారీరకంగా, మానసికంగా మనిషి స్థితిగతులను మార్చగలిగే అంశాలు అన్నారు. మానసిక స్థిరత్వం, ప్రశాంతత అలవడతాయని చెప్పారు. ఒత్తిళ్లను అధిగమించే శక్తి పెంపొందుతుందని పేర్కొన్నారు. క్రమశిక్షణ అలవాటై, దురలవాట్లకు దూరంగా ఉంటారని అన్నారు. జిల్లా ఏఎస్పీ (ఏఆర్) హనుమంతు, ఏఆర్ డీఎస్పీ ఏడుకొండలురెడ్డి, ఆర్ఐ శ్రీహరిరెడ్డి, పోలీస్ అధికార, సిబ్బంది పాల్గొన్నారు. -
సివిల్స్ ర్యాంకర్కు తెలంగాణ గవర్నర్ సత్కారం
తెనాలి: గత నెలలో వెలువడిన సివిల్ సర్వీసెస్ పరీక్షలో ర్యాంకు సాధించిన తెనాలికి చెందిన దోనేపూడి విజయ్బాబును బుధవారం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సత్కరించారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్–2024 పరీక్షల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన ర్యాంకర్లను తెలంగాణ రాజ్భవన్ దర్బార్ హాలులో ఆ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సత్కరించారు. అందులో భాగంగా విజయ్బాబు సత్కారం అందుకున్నారు. ఆయన గతంలోనే సివిల్స్లో ర్యాంక్ సాధించి, ఐఆర్ఎస్ అధికారిగా సేవలను అందిస్తున్నారు. మెరుగైన ర్యాంకు కోసం మళ్లీ 2024 పరీక్షలు రాశారు. ఆ పరీక్షలోని ర్యాంకర్లకు ఇంకా పోస్టింగులు ఇవ్వాల్సివుంది. ఐపీఎస్ వస్తుందని విజయ్బాబు, ఆయన తల్లిదండ్రులు ఆశిస్తున్నారు. -
పోలీసు జులుం.. మాజీ మంత్రి అంబటిపై కేసు
లక్ష్మీపురం(గుంటూరు ఈస్ట్): మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబుపై గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో బుధవారం రాత్రి కేసు నమోదు చేశారు. వైఎస్సార్సీపీ తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో భాగంగా అంబటి రాంబాబు సిద్ధార్థ్నగర్లోని తన నివాసం నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలతో ర్యాలీగా కలెక్టరేట్కు బయల్దేరగా పోలీసులు అడుగడుగునా అడ్డుకోబోయారు. ర్యాలీ స్థంబాలగరువు, పట్టాభిపురం మీదుగా మూసేసిన జూట్ మిల్లు వద్దనున్న సబ్ స్టేషన్కు చేరుకోగా.. పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు, ఎస్ఐ, సిబ్బంది అడ్డుకునే యత్నం చేశారు. దీంతో అంబటి రాంబాబు స్పందించారు.ట్రాఫిక్కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వెళ్తుంటే అడ్డుకోవడం సరికాదని చెప్పారు. అంతమాత్రానికే సీఐ వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి అయిన అంబటి రాంబాబుతో దురుసుగా ప్రవర్తించారు. ర్యాలీగా వెళ్లడానికి వీల్లేదని, ర్యాలీగా నువ్ ఎలా వెళ్తావో చూస్తా అంటూ మీదమీదకు వెళ్లి గట్టిగా మాట్లాడడం ప్రారంభించారు. ‘మర్యాదగా మాట్లాడు’ అని అంబటి సూచించగా.. ‘నువ్వు పళ్లు కొరుకుతున్నావ్’ అంటూ అంబటికి వేలు చూపించారు. ఏకవచనంతో వాగ్వాదానికి దిగారు. దీంతో సిబ్బంది కలుగజేసుకుని అంబటి, సీఐకి సర్దిచెప్పి పంపించారు. అనంతరం రాంబాబు పార్టీ నాయకులతో కలిసి కంకరగుంట ఓవర్ బ్రిడ్జి మీదుగా కలెక్టరేట్కు చేరుకుని వినతిపత్రం అందజేశారు. కాగా, మాజీ మంత్రి అంబటి పట్ల సీఐ వ్యవహరించిన తీరు సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో స్పష్టంగా కనిపించింది. ఎల్లో మీడియాలో మాత్రం కలెక్టరేట్లోకి అనుమతించలేదని సీఐతో అంబటి దురుసుగా ప్రవర్తించారంటూ దుష్ప్రచారం చేశారు. ఘటన జరిగింది జూట్ మిల్లు వద్ద అయితే కలెక్టరేట్ ముందు అని బురదజల్లాలని చూశారు. చివరకు పోలీసు విధులకు ఆటంకం కలిగించారని, అనుమతి లేకుండా ర్యాలీ తీశారంటూ పలు సెక్షన్లతో అంబటిపై కేసు నమోదు చేయడం గమనార్హం. నిబంధనలను అతిక్రమించిన పోలీస్ అధికారిని వదిలేసి అంబటిపై కేసు పెట్టడాన్ని విశ్లేషకులు తప్పుపడుతున్నారు. -
వెల్లువెత్తిన నిరసన
వెన్నుపోటుపై పట్నంబజారు: వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమాల సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమం బుధవారం జరిగింది. ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, పార్టీ గుంటూరు పార్లమెంటరీ జిల్లా పరిశీలకుడు పోతిన మహేష్ హాజరయ్యారు. కార్యక్రమంలో నేతలు నిమ్మకాయల రాజనారాయణ, ఈమని రాఘవరెడ్డి, కొత్తా చిన్నపరెడ్డి, నందేటి రాజేష్, సీడీ భగవాన్, కొరిటిపాటి ప్రేమ్కుమార్, వాసిమళ్ళ విజయ్, మామిడి రాము, పార్టీ నేతలు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్లో అధికారికి నాయకులు వినతిపత్రం అందించారు. -
బదిలీల కలవరం
కరోనా కలకలం... ● వైద్య ఉద్యోగుల్లో ఆందోళన ● ఐదేళ్లు దాటితే స్థాన చలనం ● యూనియన్లకు ప్రాధాన్యత అంతంతే గుంటూరు మెడికల్: జిల్లాలో ఒక పక్క కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మరోపక్క గుంటూరు జీజీహెచ్లో పనిచేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది కరోనా సోకి ఇబ్బంది పడుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులను కూడా ఈ పరిణామాలు కలవరపెడుతున్నాయి. గతంలో అనేక మంది వైద్య ఉద్యోగులు కరోనా బారిన పడి చికిత్స పొందారు. కొంత మంది ప్రాణాలు కోల్పోయారు. మరోసారి కరోనా కేసులు రావడం ఉద్యోగుల్లో ఆందోళనకు దారి తీసింది. మరోపక్క వైద్య ఉద్యోగుల బదిలీలను ప్రభుత్వం చేపట్టింది. ఈ నెల 19వ తేదీలోపు ఉద్యోగులకు కౌన్సెలింగ్ నిర్వహించి బదిలీలు చేయనున్నారు. ఐదేళ్లు సర్వీసు పూర్తయితే బదిలీ ఒకే చోట ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వైద్యులు, వైద్య సిబ్బందికి తప్పనిసరిగా స్థానచలనం కలిగించనున్నారు. గతంలో దీర్ఘకాలం ఉన్న సిబ్బందిలో 20 శాతం మందిని మాత్రమే బదిలీ చేసేవారు. దీంతో అందరూ ఇబ్బంది పడేవారు కాదు. ఇప్పుడు ఐదేళ్ల సర్వీసు, కొన్ని కేడర్లలో మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరిని బదిలీ చేయాలని నిబంధన పెట్టారు. దీంతో బదిలీల కలవరం ప్రారంభమైంది. ప్రాక్టీస్ వదిలి వెళ్లలేక.. దీర్ఘకాలికంగా ఒకేచోట పనిచేయడం వల్ల గుంటూరు జీజీహెచ్, గుంటూరు వైద్య కళాశాల, జిల్లాలోని పలు ఆసుపత్రుల వైద్యులు ఎక్కువ శాతం మంది సొంత క్లీనిక్లు పెట్టుకున్నారు. గుంటూరులోనే ప్రాక్టీస్ చేస్తున్నారు. జిల్లాలో మరికొన్ని ప్రాంతాల్లో వైద్యులు ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం తప్పనిసరి బదిలీ నిబంధనతో ప్రాక్టీస్ వదిలి వెళ్లేందుకు పలువురు సంశయిస్తున్నారు. వైద్య సిబ్బంది సైతం గుంటూరు చుట్టుపక్కల పిల్లలను చదివించుకుంటూ, గృహాలు నిర్మించుకుని ఇక్కడే స్థిరపడ్డారు. విద్య, వైద్య రంగంలో ఎప్పటి నుంచో గుంటూరు జిల్లాకు పేరుండటంతో అనేక మంది స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. బదిలీల పేరుతో ప్రభుత్వం వేరేచోటకు పంపించేందుకు సిద్ధమడంతో వారు ఆందోళన పడుతున్నారు. జూనియర్ అసిస్టెంట్ల ఆందోళన జీజీహెచ్లో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్లు పదోన్నతులు వదులుకొని సుమారు 20 –30 సంవత్సరాలుగా ఇక్కడే పనిచేస్తున్నారు. ప్రమోషన్ తీసుకుంటే ఇతర జిల్లాలకు బదిలీ చేస్తారన్న భయంతో ఇలా చేశారు. అందులోనూ గుంటూరు జీజీహెచ్లోనే జీవితాంతం పనిచేసేందుకు అన్ని బెన్ఫిట్స్ వదులుకుని పలువురు జూనియర్ అసిస్టెంట్లు విధులు నిర్వహిస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా వారిని సైతం బదిలీ చేస్తారంటూ ఊహాగానాలు వచ్చాయి. దీంతో జీజీహెచ్ మినిస్టీరియల్ ఉద్యోగులంతా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. రాష్ట్రపతి అనుమతి లేకుండా గుంటూరు జీజీహెచ్ యూనిట్ సిబ్బందిని బదిలీ చేసే అధికారం ఎవరికీ లేదనే విషయాలను బయటపెట్టారు. సదరు విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి సైతం పంపించారు. దీంతో ఈ ఏడాదికి జూనియర్ అసిస్టెంట్లకు బదిలీలు లేనట్లేనని వార్తలు వినిపిస్తున్నాయి. యూనియన్లకు ఆంక్షలు గతంలో యూనియన్ పేరుతో ఉద్యోగులు దీర్ఘకాలికంగా ఒకే ప్రాంతంలో ఉండేవారు. నేడు ఒకేచోట లేకుండా పలు మార్గదర్శకాలను సంఘ నాయకులకు ప్రభుత్వం విడుదల చేసింది. యూనియన్లో చేరిన సభ్యత్వాల రశీదులు, ఎన్నికల్లో పాల్గొన్నట్లు జాబితా, యూనియన్ కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు వివరాలు సమర్పించాలని పేర్కొంది. దీంతో నేతలకు సైతం స్థానచలనం తప్పడం లేదు. నగరంలో ఒక చోట నుంచి మరోచోటికి యూనియన్ నేతలు బదిలీ కోరుకునేలా కొంత మినహాయింపు ఇచ్చారు. 20 రోజుల ప్రక్రియ వైద్య ఆరోగ్య శాఖలో బదిలీ ప్రక్రియ 20 రోజులపాటు జరుగనుంది. మే 31 నుంచి జూన్ 19వ తేదీ వరకు నిర్వహిస్తారు. జూన్ 17 – 19 వరకు కౌన్సెలింగ్ ఉంటుంది. తర్వాత బదిలీ ఉత్తర్వులు అందజేస్తారు. ఒకేచోట రెండేళ్లకుపైగా పనిచేస్తున్న వారు రిక్వెస్ట్ బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు. దివ్యాంగులకు, ఉద్యోగులైన భార్యభర్తలకు నిబంధనల ప్రకారం బదిలీలు నిర్వహిస్తారు. గురు, శుక్రవారాల్లో అభ్యర్థులు బదిలీ ఆప్షన్లు ఎంచుకునేందుకు గడువు ఇచ్చారు. గుంటూరు డీఎంహెచ్ఓ కార్యాలయం, గుంటూరు జీజీహెచ్, గుంటూరు వైద్య కళాశాల, గుంటూరు ప్రాంతీయ వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయాల్లో ఉద్యోగులు, అధికారులు కొద్దిరోజులుగా బదిలీల ప్రక్రియ చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. -
యోగాతో మానసిక ఉల్లాసం
విజయపురి సౌత్త్: యోగాతో ఒత్తిడి దూరమై మానసిక ఉల్లాసం కలుగుతుందని పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్బాబు అన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా బుధవారం పల్నాడు జిల్లా మాచర్ల మండలంలో ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన అనుపు వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. ప్రసిద్ధ పర్యాటక కేంద్రంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సుమారు 2000 మంది పాల్గొన్నారన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి మురళి మాట్లాడుతూ.. ఈ నెల 21వ తేదీన కార్యక్రమం భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా మాచర్ల పట్టణానికి చెందిన మెట్టు గోవిందరెడ్డి దాదాపు 200 యోగా మ్యాట్స్ను కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. బెలూన్లను గాలిలోకి వదిలారు. నాగార్జునకొండ క్యూరేటర్ కమల్ హాసన్, పర్యాటక శాఖ రీజినల్ డైరెక్టర్ ప్రసన్న లక్ష్మి, పర్యాటకశాఖ డివిజనల్ మేనేజర్ చైతన్య, ఆర్డీవో మురళీకృష్ణ, జిల్లా మెడికల్ ఆఫీసర్ డా.రవి, ఇరిగేషన్ ఎస్ఈ కృష్ణ మోహన్, ఈఈ రమేష్ ,ఆర్అండ్బీ ఎస్ఈ రాజా నాయక్, డ్వామా పీడీ సిద్ధ లింగమూర్తి, ఐసీడీఎస్ పీడీ ఉమాదేవి, డీఆర్డీఏ పీడీ ఝాన్సీ రాణి, ట్రాన్స్పోర్ట్ అధికారి సంజీవ్ కుమార్, డీఎఫ్ఓ ఫైర్ శ్రీధర్రావు, డీఎల్డీవో గబ్రు నాయక్, హౌసింగ్ ఈఈ రవీంద్ర, డీపీఓ నాగేశ్వర నాయక్ , జిల్లా పర్యాటక శాఖ అధికారి నాయుడమ్మ , జిల్లా మత్స్యశాఖ అధికారి సంజీవరావు, డీసీఓ వెంకటరమణ, ఏపీఎంఐపీ ఆంజనేయులు, ఏపీటీడీసీ డిప్యూటీ మేనేజర్ శివారెడ్డి, గ్రౌండ్ వాటర్ అధికారి శ్రీనివాసరావు, మాచర్ల మున్సిపల్ కమిషనర్ వేణుబాబు, మాచర్ల తహసీల్దార్ కిరణ్ బాబు, తదితరులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్బాబు -
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలన
ఫిరంగిపురం: ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా అమరావతిని నిర్మించనున్నట్లు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ అన్నారు. తుళ్లూరు మండలం అనంతవరం గ్రామంలో వనమహోత్సవం కార్యక్రమానికి గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రానున్నారు. దానికి సంబంధించి ఏర్పాట్లను బుధవారం రాత్రి నారాయణ పరిశీలించారు. ముఖ్యమంత్రి మొక్కలు నాటే ప్రాంతాన్ని పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వనమహోత్సవం సందర్భంగా ఐదు కోట్ల మొక్కలు నాటుతామన్నారు. రాజధాని ప్రాంతాన్ని అత్యున్నత నిర్మాణాలతోపాటు గ్రీన్ అండ్ బ్లూ నగరంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సూచించినట్లు తెలిపారు. పచ్చదనం కోసం ఒకే రకం మొక్కలు కాకుండా సింగపూర్, జపాన్తో సంప్రదించి అక్కడి మాదిరిగా ప్లాంటేషన్ ఉండేలా చూడమని చంద్రబాబు సూచించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే శ్రావణ్కుమార్ మాట్లాడుతూ రాజధాని ప్రాంతాన్ని ఆహ్లాదకరమైన నగరంగా తీర్చిదిద్దేందుకు పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ ఎండీ లక్ష్మీపార్థసారథి, ఇన్చార్జి జిల్లా కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ, ఆర్డీవో శ్రీనివాసులు, తహసీల్దార్ సుజాత, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు. ఫిరంగిపురం(తాడికొండ): తుళ్లూరు మండలం అనంతవరం గ్రామంలో గురువారం పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించే వన మహోత్సవానికి ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం పర్యటన ఏర్పాట్లను ఇన్చార్జి జిల్లా కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ, జిల్లా ఎస్పీ సతీష్కుమార్, రాష్ట్ర ఏపీఎంఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, ఆర్డీవో శ్రీనివాసరావులు పరిశీలించారు. సభా ప్రాంగణం వద్ద ఏర్పాట్లను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎ.భార్గవ్ తేజ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అధికారులు చేపట్టాల్సిన వివిధ పనులపై తగిన సూచనలు అందజేశారు. శానిటేషన్, పార్కింగ్, బ్యారికేడ్ పనులు సజావుగా చేపట్టాలని చెప్పారు. నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలన్నారు. వారి వెంట ఫారెస్ట్ కన్జర్వేటర్ రాజు, అడిషనల్ ఎస్పీ (లా అండ్ ఆర్డర్) రవికుమార్, డీఎస్పీ మురళీకృష్ణ, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ ఎండీ నజీమా బేగం, ఏపీఎంఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బసవేశ్వరరావు, తుళ్లూరు సీఐ శ్రీనివాసరావు, తహసీల్దార్లు సుజాత, వెంకటేశ్వర్లు, పలు శాఖల అధికారులు ఉన్నారు. అత్యుత్తమ నగరంగా అమరావతి నిర్మాణం -
ప్రతి ఇల్లు యోగా కేంద్రం కావాలి
గుంటూరు వెస్ట్: ప్రతి ఇల్లు యోగా కేంద్రంగా మారితే ఆ ఇంట ఆరోగ్య, మానసిక సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయని ఇన్చార్జి జిల్లా కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ తెలిపారు. బుధవారం యోగాంధ్రాలో భాగంగా స్థానిక బృందావన్గార్డెన్స్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయనతోపాటు నగర మేయర్ కోవెలమూడి రవీంద్రనాథ్, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్లా మాధవి, జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు, డీఆర్వో షేక్ ఖాజావలి, ఆర్డీవో కె.శ్రీనివాసరావు, డెప్యూటీ మేయర్ షేక్ షజిల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇన్చార్జి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కొన్ని రోజులుగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. శారీరక, మానసిక ప్రయోజనాలు కలిగించే యోగాపై ప్రజలు విస్తృతంగా అవగాహన పెంచుకోవాలన్నారు. ఎమ్మెల్యే గళ్లా మాధవి మాట్లాడుతూ ప్రతి వ్యక్తి జీవితంలో యోగ ఒక భాగం కావాలన్నారు. అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులు యోగాసనాలు వేశారు. ఇన్చార్జి జిల్లా కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ -
తాళం వేసిన ఇంట్లో నగలు, నగదు చోరీ
బెల్లంకొండ: తాళం వేసిన ఇంట్లోకి చొరబడిన దొంగలు నగలు, నగదు చోరీ చేసిన ఘటన మండలంలోని నాగిరెడ్డి పాలెం గ్రామంలో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక ఎస్సై డి.ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన ఎరబ్రద్దూరి చిన రమణారెడ్డి కుటుంబ సభ్యులతోపాటు గ్రామంలోని మరి కొంతమందితో కలిసి సోమవారం శ్రీశైలం దైవ దర్శనానికి వెళ్లారు. ఈ క్రమంలో రమణారెడ్డి ఇంట్లోకి దొంగలు కిటికీ గుండా చొరబడ్డారు. బీరువా పగలుకొట్టి 23.5 సవర్ల బంగారం, 15 వేల నగదు చోరీ చేశారు. మంగళవారం ఉదయం ఇరుగు పొరుగువారు ఇంటి పరిసర ప్రాంతాల్లో వస్తువులు చెల్లాచెదురుగా ఉండడాన్ని గమనించారు. వెంటనే విషయాన్ని రమణారెడ్డి బంధువులతో చెప్పగా వారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు వచ్చి పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ద్వారా ఆధారాలు సేకరిస్తున్నట్లు పెదకూరపాడు సీఐ సురేష్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. -
దారి పొడవునా అధినేతకు నీరాజనం
మంగళగిరి టౌన్/దుగ్గిరాల: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అడుగడుగునా ప్రజలు, అభిమానులు నీరాజనం పలికారు. పువ్వులు చల్లి ఘన స్వాగతం పలికారు. జై జగన్.. అంటూ నినదించారు. తెనాలిలో ఇటీవల పోలీసులు నడిరోడ్డుపై యువకులను చితకబాదిన సంగతి విదితమే. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన జాన్ విక్టర్ను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించడానికి తాడేపల్లిలోని తన నివాసం నుంచి మంగళవారం ఉదయం తెనాలికి వైఎస్ జగన్ బయలుదేరారు. ఈ క్రమంలో తెనాలి చేరుకునే వరకు ప్రతి ఊరు, ప్రతి ప్రాంతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, చిన్నారులు, మహిళలు రోడ్డుపై వేచి చూశారు. నియోజకవర్గ పరిధిలోని తాడేపల్లి భరతమాత సెంటర్ వద్ద వైఎస్సార్సీపీ తాడేపల్లి పట్టణ అధ్యక్షులు బుర్రముక్కు వేణుగోపాల సోమిరెడ్డి, ఇతర నాయకులు, మాజీ కౌన్సిలర్లు, కార్యకర్తలతో కలిసి స్వాగతం పలికారు. అనంతరం కుంచనపల్లి ప్రాతూరు అండర్ పాస్ వద్ద వైఎస్సార్సీపీ రూరల్ అధ్యక్షులు అమరా నాగయ్య, మాజీ అధ్యక్షులు పాటి బండ్ల కృష్ణమూర్తి, మిరియాల రాంబాబు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికారు. మంగళగిరి నియోజకవర్గ విద్యార్థి విభాగం నాయకులు పులగం సందీప్రెడ్డి, లీగల్ సెల్ అధ్యక్షులు కలకోటి సునీల్ తదితరులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వెంట బైక్లు, కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. మంగళగిరి పట్టణ పరిధిలోని తెనాలి రోడ్డులో వైఎస్సార్సీపీ పట్టణ, రూరల్ అధ్యక్షులు ఆకురాతి రాజేష్, నాలి వెంకటకృష్ణ, బీసీ సెల్ నాయకులు కుంచాల కిషోర్ తదితరులు స్వాగతం పలికారు. మంగళగిరి నుంచి తెనాలి వెళ్లే మార్గంలో పెదవడ్లపూడి పైవంతెన వద్ద వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో చేరుకుని పూలవర్షం కురిపించారు. వైఎస్ జగన్ తన కాన్వాయ్ను ఆపి, ప్రజలకు అభివాదం చేశారు. చుట్టుపక్కల గ్రామస్తులు కూడా అక్కడకు చేరుకుని వైఎస్ జగన్తో కరచాలనం చేసేందుకు ఎగబడ్డారు. తనకోసం వచ్చిన వారందరినీ నవ్వుతూ పలకరించిన ఆయన.. అందరితో కరచాలనం చేశారు. తర్వాత అక్కడి నుంచి ముందుకు కదిలారు. దుగ్గిరాల మండల పరిధిలో మోరంపూడి సర్పంచ్ ఇత్తడి రమేష్, ఇతర గ్రామాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. దుగ్గిరాల లాకుల వద్ద మండల అధ్యక్షులు శివగోపయ్య, పెరికలపూడి సర్పంచ్ గంపల గంగాధర్, సీనియర్ నాయకులు తిమోతి, నాగేశ్వరరావు, రామకోటిరెడ్డి తదితర నాయకులు వైఎస్ జగన్ రాకకోసం వేచి చూశారు. తమ అభిమానాన్ని చాటేందుకు పెద్ద ఎత్తున పూలతో ఘన స్వాగతం పలికారు. అధిక సంఖ్యలో జనం తరలి రావడంతో ఆ కూడలి నుంచి బయటకు రావడానికి వైఎస్ జగన్కు కొన్ని నిమిషాలు సమయం పట్టింది. కార్యకర్తల కోసం కాన్వాయ్ ఆపి మరీ వైఎస్ జగన్ అభివాదం చేయడంతో వారందరూ ఆనందోత్సాహంతో కేరింతలు కొట్టారు. సంతోషం వ్యక్తం చేశారు. అభిమానులు బైక్ ర్యాలీలు, కార్లలో, పలు, ఇతర వాహనాలలో అనుసరించగా.. దుగ్గిరాల నుంచి తెనాలికి జన సందోహం నడుమ వైఎస్ జగన్ వెళ్లారు. -
వృద్ధురాలు అనుమానాస్పద మృతి
తెనాలి రూరల్: తెనాలిలో ఒంటరిగా నివసిస్తున్న వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. లైంగికదాడి తర్వాత హత్య చేసి, ఆభరణాలు చోరీ చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు, స్థానికుల కథనం మేరకు... పట్టణ ముత్తెంశెట్టిపాలెం తూర్పు కాల్వ కట్ట రోడ్డులో కబేళా వంతెన నుంచి వైకుఠపురం వెళ్లే మార్గంలో అయ్యప్పస్వామి గుడి పక్కనే తాడిపత్రి మల్లీశ్వరి (60) ఒంటరిగా నివసిస్తోంది. టిఫిన్ బండి, టీ స్టాల్, కూల్డ్రింక్ దుకాణం నిర్వహిస్తోంది. ప్రతి రోజు తెల్లవారుజామున 4.30 గంటలకు లేచి టిఫిన్ బండి పనులను ప్రారంభిస్తుంటుంది. అదే సమయంలో టీ కూడా విక్రయించడంతో ఉదయాన్నే అక్కడి వారు టీ తాగేందుకు వస్తుంటారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం వచ్చిన వారు మల్లీశ్వరి బయటకు రాలేదని, ఇంటి కిటికీ నుంచి చూశారు. ఇంకా మంచంపైనే ఉంది. పిలిచినా స్పందన లేకపోవడంతో ఇదే ప్రాంతంలో నివసించే ఆమె కుమార్తెకు సమాచారం ఇచ్చారు. ఆమె వచ్చి చూడగా మల్లీశ్వరి మృతి చెంది ఉన్నట్టు గుర్తించింది.మృతురాలి ఒంటిపై బంగారు ఆభరణాలు, బీరువాలోని నగలు చోరీకి గురైనట్టు తెలిసింది. స్థానికుల ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. వన్ టౌన్ సీఐ వి. మల్లికార్జునరావు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని తెనాలి వైద్యశాలకు తరలించారు.మృతిపై అనేక అనుమానాలు..మల్లీశ్వరి మృతిపై స్థానికుల నుంచి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటి తలుపునకు బయట గడి పెట్టి ఉండడం, విగతజీవిగా పడి ఉన్నప్పుడు శరీరంపై దుస్తులు సరిగా లేకపోవడం, ఆభరణాలు మాయమవడంతో ఆమైపె లైంగిక దాడికి పాల్పడి, హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. అనంతరం ఆభరణాలు, నగదు దోచుకెళ్లి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. తెలిసిన వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. మల్లీశ్వరిది అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశామని, దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందని సీఐ తెలిపారు. -
ఎండీయూ వాహనాల ఆపరేటర్ల ప్లకార్డుల ప్రదర్శన
తెనాలి: ఎండీయూ వాహనాల ఆపరేటర్లు తమకు న్యాయం జరిపించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తెనాలి పర్యటనలో ప్లకార్డులు ప్రదర్శించారు. తమకు జరిగిన అన్యాయాన్ని మాజీ సీఎం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఎండీయూ వాహనాల ఆపరేటర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర కోశాధికారి సాంబశివరావు ఆధ్వర్యంలో ఆపరేటర్లు సిద్ధమయ్యారు. తమ డిమాండ్లను తెలియజేసే ప్లకార్డులతో సహా అయితానగర్కు చేరుకున్నారు. ఆయనకు వినతిపత్రం అందజేసి, తమ గోడును విన్నవించుకోవాలని ఆశించారు. కిక్కిరిసిన అభిమానులు, పార్టీ కార్యకర్తలు మాజీ సీఎం కాన్వాయ్ను అనుసరించటంతో సాధ్యపడలేదు. దీనితో స్థానిక లింగారావు సెంటర్లో కారులోంచి బయకొచ్చి అభివాదం చేస్తున్న మాజీ సీఎం దగ్గరకు ప్లకార్డును తీసుకెళ్లారు. ప్లకార్డును పరిశీలించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ ప్లకార్డును తన చేతికి తీసుకుని ప్రదర్శించారు. అయితానగర్లో బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్న సమయంలో అక్కడ జనంలోనూ ఈ ప్లకార్డులను ప్రదర్శించారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని స్వయంగా కలిసి తమ సమస్యలను విన్నవించుకుంటామని ఆపరేటర్లు చెప్పారు. -
రూ.51 కోట్లతో అభివృద్ధి పనులు
నెహ్రూనగర్: గుంటూరు నగరంలో సుమారు రూ.51 కోట్లతో పలు డివిజన్లలో అభివృద్ధి పనులను నిర్వహించడానికి స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపిందని స్టాండింగ్ కమిటీ ఛైర్మన్, నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. మంగళవారం స్టాండింగ్ కమిటీ సమావేశం మేయర్ చాంబర్లో జరిగింది. నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో నగరంలోని ఆయా డివిజన్లకు సంబంధించిన ప్రజా ప్రతినిధులు, నగర పాలక సంస్థ అధికారులు ప్రతిపాదించిన 143 అంశాలకు సంబంధించిన అభివృద్ధి పనులపై సభ్యులు, వివిధ విభాగాధిపతులతో చర్చించి, ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగర శివారు, నగర పాలక సంస్థలో విలీనమైన గ్రామాలలో రోడ్లు, డ్రైయిన్లు, వీధి దీపాలు, తాగు నీటి పైపులైన్లు ఏర్పాటు వంటి పనులకు ఆమోదం తెలిపామన్నారు. నాజ్ సెంటర్, స్వామి థియేటర్ వద్ద, అడవితక్కెళ్ళపాడులలోని షాపింగ్ కాంప్లెక్స్లలో లీజు గడువు పూర్తయిన షాపులకు నిబంధనల ప్రకారం రెన్యూవల్ చేయడానికి ఆమోదించామన్నారు. గుంటూరు నగరంలో వీధి కుక్కల బెడద అధికంగా ఉండటంతో వాటికి శస్త్రచికిత్సలు, యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ వేసేందుకు అదనంగా ముగ్గురు పశువుల డాక్టర్లు, ఆపరేషన్ థియేటర్ సహాయకులను నియమించాలని నిర్ణయించామని తెలిపారు. సమావేశంలో కమిటీ సభ్యులు ఈరంటి వరప్రసాద్, షేక్ మీరావలి, కొమ్మినేని కోటేశ్వర రావు, నూకవరపు బాలాజీ, దాసరి లక్ష్మీదుర్గ, ముప్పవరపు భారతి, నగర పాలక సంస్థ ఎస్ఈ నాగమల్లేశ్వరరావు, సీఎంఓహెచ్ డాక్టర్ అమృతం పాల్గొన్నారు. ఆమోదం తెలిపిన స్టాండింగ్ కమిటీ -
బాలికపై లైంగిక వేధింపులు.. కేసు నమోదు
లక్ష్మీపురం: నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు వెస్ట్ డీఎస్పీ కె.అరవింద్ తెలిపారు. వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఏటీ అగ్రహారం పరిధిలోని ఓ ప్రాంతానికి చెందిన మహిళ ఓ వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి కుమార్తె, కుమారుడు కలిగాక మనస్పర్థలతో విడాకులు తీసుకున్నారు. అదే ప్రాంతానికి చెందిన షేక్ మస్తాన్ అనే వ్యక్తిని ఆమె రెండో వివాహం చేసుకున్నారు. మొబైల్ షాపులో పని చేసుకుంటూ ఆమె జీవనం సాగిస్తున్నారు. మస్తాన్కు రెండో వివాహం చేయాలని ఆయన కుటుంబసభ్యులు సిద్ధం అయ్యారు. దీంతో ఆమె నిలదీయడంతో ఒంటరిగా వదిలేశాడు. ఇటీవల ఆమె కుమార్తె (8) నిద్రలో ఉలిక్కి పడటం, ఏడవడం వంటివి చేస్తుండటంతో ఏమైందని తల్లి ఆరా తీసింది. మస్తాన్ అసభ్యకరంగా ప్రవర్తించాడని చెప్పింది. దీంతో నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నరనారాన నయవంచన
కూటమి ఏడాది పాలనలో అడుగడుగునా దగా, దౌర్జన్యం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ప్రయాణం ప్రచారంతో అందరూ నిజమే అనుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం చెప్పిన ఉగాది పోయింది... దసరా పోయింది. ప్రయాణానికి పంక్చర్ పడుతూనే ఉంది. అమలైతే జిల్లాలో రోజుకు రూ.30 లక్షల చొప్పున ఏడాదికి రూ.109 కోట్ల మేరకు మహిళలకు లబ్ధి కలుగుతుంది. ఈ ఉచితం ఇవ్వకపోవడం వల్ల ఈ మేర జిల్లాకు చెందిన మహిళలు నష్టపోయారు. మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు పథకం అంతా ‘గ్యాస్’ అని తేలిపోయింది. చాలా మందికి తొలి విడత సబ్సిడీనే పడలేదు. రాయితీ డబ్బులు ముందుగానే ఖాతాలకు జమ చేస్తామని డప్పులు కొడుతున్నారు. జిల్లాలో 56 ఏజెన్సీల పరిధిలో 7,55,000 కనెక్షన్లు ఉన్నాయి. ఏడాదికి 187.43 కోట్ల వరకు లబ్ధిదారులకు అందాలి. కానీ అమలు నామమాత్రంగానే ఉంది. సాక్షి ప్రతినిధి, గుంటూరు, ప్రత్తిపాడు: కూటమి నేతలు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఒక్కటంటే ఒక్కటీ ఏడాది గడిచినా అమలు కాలేదు. తల్లికి వందనం కింద సంవత్సరానికి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి రూ. 15,000 ఇచ్చే బాధ్యత తాము తీసుకుంటామన్నారు. ప్రతీ ఇంటికి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తామని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తామని తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే వరకు నెలకు రూ. 3000 భృతి అందజేస్తామన్నారు. ఆడబిడ్డల కోసం మహాశక్తి కార్యక్రమాన్ని తెస్తామని హామీ ఇచ్చారు. ప్రతి మహిళకు నెలకు రూ. 1500 చొప్పున నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమ చేస్తామని పేర్కొన్నారు. అన్నదాతకు ఏడాదికి రూ. 20 వేలు సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇవన్నీ జూన్ నుంచే అమలు చేస్తామన్నారు. ‘బాబు ష్యూరిటీ – భవిష్యత్కు గ్యారెంటీ’ అంటూ ఇంటింటికీ కరపత్రాలు పంచారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారు. ‘‘మనం హామీలిచ్చాం. సూపర్ సిక్స్ చెప్పాం. చూస్తే భయమేస్తోంది. ముందుకు కదల్లేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానీకం కూడా ఆలోచించాలి’’ అంటూ చంద్రబాబు కొత్త రాగం అందుకున్నారు. ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తామన్నారు. 19 – 59 ఏళ్ల వారికని చెప్పినా అతీగతీ లేదు. ఈ పథకం కింద జిల్లాలో 7,28,391 మందికి అర్హత ఉన్నట్లు అంచనా. ఇప్పటికే అక్షరాలా రూ.1311.10 కోట్లు వీరికి అందాలి. ఇంతవరకు ఒక్కపైసా ఇవ్వలేదు.అతివలకు ఉచిత బస్.. తుస్ఉచిత సిలిండర్ల అమలు ‘గ్యాసే’ఎన్నికల హామీలుమహిళలకు సాయం హుళక్కే -
మోసానికి ప్రతిరూపం చంద్రబాబు
పట్నంబజారు: మోసానికి నిలువెత్తు ప్రతిరూపం ఏదైనా ఉంది అంటే.. అది చంద్రబాబే. ప్రజలను నమ్మించి.. వంచించటం ఆయనకు కొత్త ఏమీ కాదు. ఎన్నికల సమయంలో నోటికి వచ్చినట్లు హామీలు గుప్పించి... తీరా గెలిచిన తర్వాత ప్రజలను వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నైజం. అధికారం కోసం ఎంతటి దుర్మార్గానికి వెనకాడని వ్యక్తి చంద్రబాబు. కచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేశారు. సూపర్ సిక్స్ అంటూ అన్ని విధాలుగా ప్రజలను మోసం చేశారు. ఏడాది పాలన అంతా వంచన జరిగిన క్రమంలో బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరగనున్న వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహించనున్నాం. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులతోపాటు అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరు కావాలి. చంద్రబాబు మోసాలను ఎండగట్టేలా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. – షేక్ నూరిఫాతిమా, వైఎస్సార్ సీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు కూటమిది మోసపు పాలన పొన్నూరు: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాది పాలనలో సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా మోసం చేసిన కూటమి ప్రభుత్వం పనితీరుకు నిరసనగా బుధవారం పొన్నూరు నియోజకవర్గ కేంద్రంలో చేపట్టనున్న వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి. ఉదయం 10 గంటలకు పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించనున్నాం. తహసీల్దారు కార్యాలయం వరకు వెళ్లి అధికారులకు వినతిపత్రాలు అందిస్తాం. నియోజకవర్గంలోని జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలి. – అంబటి మురళీకృష్ణ, పొన్నూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త -
వైభవంగా వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు
నగరంపాలెం: స్థానిక కొత్తపేట (పశువుల ఆసుపత్రి)లోని శ్రీజగన్నాథస్వామి వారి దేవస్థానంలో శ్రీరుక్మిణీ సత్యభామ సమేత శ్రీవేణు గోపాల స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామి వారిని పెండ్లి కుమారునిగా, రుక్మిణి, సత్యభామ అమ్మవార్లను పెండ్లి కుమార్తెగా అలకరించారు. రాత్రి 7 గంటలకు అంకురారోపణ, కలశస్థాపన, ధ్వజారోహణ, విశ్వక్సేన పూజ, అఖండ దీపారాధన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి దర్శించుకున్నారు. వారికి నిర్వాహకులు తీర్థ ప్రసాదాలు అందించారు. కార్యక్రమాలను దేవస్థానం ఈవో టి.సుభద్ర పర్యవేక్షించారు. ఆళ్ల నాగేశ్వరరావుకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం తెనాలి: తెనాలికి చెందిన కవి, ఆర్టీసీ కండక్టర్ ఆళ్ల నాగేశ్వరరావు పేరు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదైంది. విజయవాడకు చెందిన ‘తెలుగు కళారత్నాలు’ సాంస్కతిక సేవా సంస్థచే సోమవారం అర్ధరాత్రి వరకు ఏకధాటిగా 10 గంటలపాటు జరిగిన సకల కళాప్రదర్శనలో నాగేశ్వరరావు సాహిత్య ప్రదర్శనకు ఈ గౌరవం లభించింది. సంబంధిత ధ్రువీకరణ పత్రం, పతకాన్ని ఏపీ సచివాలయం ఓఎస్డీ డాక్టర్ ప్రభాకర్, విశ్రాంత ఆదాయ పన్ను అధికారి డాక్టర్ పతంగి చెన్నయ్య, ప్రముఖ రచయిత్రి డాక్టర్ సరికొండ రమాదేవి సమక్షంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు యూవీ రత్నం అందజేశారు. జనాభా నిర్వహణపై క్యూఆర్ కోడ్తో ప్రజాభిప్రాయం నరసరావుపేట: జనాభా నిర్వహణ విధానంపై ప్రజలను భాగస్వాములను చేసేందుకు ఈ నెల 1 నుంచి 20వ తేదీ వరకు క్యూఆర్ కోడ్ విధానం ద్వారా ప్రణాళికా శాఖ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయం సేకరిస్తున్నట్లు జిల్లా అర్ధ గణాంకశాఖ అధికారి మాలతి పేర్కొన్నారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం క్యూఆర్ కోడ్ పోస్టర్ను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు వారి పరిధిలోని కుటుంబాల నుంచి జనాభా నిర్వహణ అభిప్రాయాలను క్యూఆర్ కోడ్ ద్వారా సేకరించాలని ఆదేశించారు. జేసీ సూరజ్ గనోరే, జిల్లా అధికారులు పాల్గొన్నారు. నేడు నాగార్జునసాగర్లో సామూహిక యోగా నరసరావుపేట: జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రదేశం నాగార్జునసాగర్ వద్ద బుధవారం ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు సామూహిక యోగా కార్యక్రమం నిర్వహించనున్నామని పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు మంగళవారం పేర్కొన్నారు. యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహించి యోగా ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నామని పేర్కొన్నారు. మే 28న ఇప్పటికే కోటప్పకొండపై సామూహిక యోగా నిర్వహించామన్నారు. జూన్ 11న కొండవీడు కోట, జూన్ 18న అమరావతి ధ్యానబుద్ధ విగ్రహం వద్ద సామూహిక యోగా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 512.00 అడుగుల వద్ద ఉంది. సాగర్ జలాశయం నుంచి కుడి కాలువకు 4,050 క్యూసెక్కులు విడుదల అవుతోంది. చిట్ఫండ్ యజమానికి బెయిల్ మంజూరు గుంటూరు లీగల్: చిట్ ఫండ్ యజమానికి గుంటూరు జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జి కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. పాలడుగు పుల్లారావు సాయిసాధన చిట్ఫండ్ కంపెనీ నడుపుతూ రూ.కోట్లు స్కామ్ చేసి ప్రజలను మోసం చేశారనే అభియోగంపై అరెస్టయ్యారు. దీనిపై నరసరావు పేట–1 టౌన్ సిట్ సీఐడీ వారు కేసు నమోదు చేశారు. ఇరువురి హామీతో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. -
అరాచకం ఖాకీచకం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రెడ్బుక్ రాజ్యాంగానికి గుంటూరు జిల్లా కేరాఫ్ అడ్రస్గా మారుతోంది. రెడ్బుక్ను ప్రవేశపెట్టిన మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహించే జిల్లా కావడంతో పోలీసులు మరింత అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే పలు పాత కేసులు తిరగదోడి వందల మంది పార్టీ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు. సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులకు అడ్డులేకుండా పోయింది. తెనాలి పోలీసులు ఒక కేసులో నిందితులకు నడిరోడ్డుపై అరికాలి కోటింగ్ ఇచ్చి తమ ప్రతాపం చూపించారు. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా, ఎస్సీ కమిషన్ వివరణ అడిగినా బాధ్యులను ప్రభుత్వం వెనకేసుకొస్తోంది.అక్రమ కేసులు వైఎస్సార్సీపీలో చురుగ్గా ఉండే నేతలను టార్గెట్ చేశారు. పెదనందిపాడు మండలం వరగానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త ముల్లమూరి హరిప్రసాద్ (నాని)పై టీడీపీ నేతలు దాడిచేసి హత్య చేశారు. మాజీ ఎంపీ నందిగం సురేష్పై అక్రమంగా 12 కేసులు పెట్టి జైలులో పెట్టారు. బెయిల్పై విడుదలైన తర్వాత మళ్లీ హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.ఆత్మకూరులోని టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిలో పార్టీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, విజయవాడ పార్లమెంట్ ఇనన్చార్జి దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిలతో పాటు మరో 42 మందిపై కేసులు నమోదు చేశారు. దుగ్గిరాల మండలంలో కౌంటింగ్ రోజు వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా కార్యకర్తపై దాడి చేయడానికి వచ్చిన టీడీపీ కార్యకర్తలను అడ్డుకునే సమయంలో ఓ వ్యక్తి గాయాల పాలై మృతి చెందగా, ఈ కేసులో సోషల్ మీడియా కార్యకర్త కరీమ్తో పాటు జెడ్పీటీసీ భర్త వీరయ్యతో పాటు జాన్సన్, మరో 20 మందిపై హత్య కేసు నమోదు చేశారు. తాజాగా వీరయ్యపై మరో మూడు కేసులు నమోదు చేశారు. ఎన్నికలకు ముందు వైఎస్సార్ సీపీ నాయకుడు వెంకటరెడ్డిని ఉద్దేశపూర్వకంగా బండితో గుద్దడంతో వెంకటరెడ్డి మృతి చెందగా, వైఎస్సార్ సీపీ నాయకులపైనే కేసులు నమోదు చేశారు. దానికి ప్రతీకారంగా ఎన్నికలైన ఆరు నెలల తరువాత వైఎస్సార్ సీపీ నాయకులు మున్నంగి వివేకానందరెడ్డి, జక్కిరెడ్డి కృష్ణారెడ్డి, మేకా వెంకటరామిరెడ్డిపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు.సోషల్ మీడియా రాష్ట్ర కో–ఆర్డినేటర్ మేకా వెంకటరామిరెడ్డిపై 18 కేసులు నమోదు చేశారు. మహిళా నాయకురాలు పాలేటి కృష్ణవేణిపై ఒక కేసు నమోదు చేశారు. మంగళగిరి రూరల్ పరిధిలో జరిగిన చిన్న గొడవలను ఆసరాగా 10 మంది వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త గుంటూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్, అప్పటి వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడిగా పదవి వచ్చిన సమయంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి అనుమతి లేదంటూ కూటమి నేతలు వీఆర్ఓ చేత అక్రమ ఫిర్యాదు చేయించి కేసు నమోదు చేశారు. తాడికొండ మండలం కంతేరు గ్రామంలో రాజకీయ కక్షతో ఎంపీటీసీ, దళిత మహిళ వలపర్ల కల్పనపై అక్రమంగా కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. కంతేరు గ్రామానికి చెందిన జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా పనిచేసిన కళ్లం హరికృష్ణారెడ్డిపై కూడా అక్రమంగా కేసులు బనాయించి జైలుకు పంపించారు. తుళ్లూరు మండలం పెదపరిమి గ్రామంలో దళితులపై దాడులు నిర్వహించి ఇబ్బందులకు గురి చేయడంతో గ్రామంలో 20 మంది ఎస్సీలు గ్రామంలో లేకుండా వేరు ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. ఇప్పటికీ వారు గ్రామానికి రాలేదు. ఫిరంగిపురం మండలం గరుడాచలం పాలెంలో ఎన్నికల అనంతరం కూటమి నేతలు దళితులపై దాడులు చేసి ఎదురు చెప్పిన వారిపై అక్రమ కేసులు నమోదు చేశారు. ఫిరంగిపురం మండలం పొనుగుపాడు గ్రామంలో అగ్రవర్ణాలు కూటమి ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని తమకు రహదారి సౌకర్యం కోసం చర్చి ప్రహరీని వందలాది మంది పోలీసులను మోహరింప చేసి కూల్చి వేశారు. ఎదురించిన వారిపై అక్రమ కేసులు బనాయించారు. వైఎస్సార్ సీపీ వట్టిచెరుకూరు మండలం మండల కన్వీనర్ మన్నవ వీర నారాయణపై అక్రమంగా కూటమి నేతలు కేసులు నమోదు చేశారు.బెదిరించి.. ఆత్మహత్యకు పురిగొల్పి బంగారం షాపులో పనిచేసే వ్యక్తి బంగారంతో పరారు అయ్యాడన్న కేసులో, తెనాలిలో బంగారం బట్టీ నిర్వహించే సిద్దేశ్ అనే వ్యక్తిని పోలీసు స్టేషన్కు పిలిపించి తమదైన శైలిలో మాట్లాడటంతో అదేరోజు రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక కేసులో రిసీవర్గా ఉన్న వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే పోలీసు మాన్యువల్ ప్రకారం పోస్టుమార్టం చేయించాలి. అయితే కుటుంబ సభ్యులు అడిగినందున, ఫిర్యాదు ఏమీ లేనందున పోస్టుమార్టం చేయించలేదని పోలీసులు చెప్పడం గమనార్హం. ఈ కేసు తమకు చుట్టుకుంటుందన్న భయంతో సిద్దేశ్ కుటుంబ సభ్యులు, యూనియన్ సభ్యులపై ఒత్తిడి తీసుకువచ్చి మృతదేహాన్ని వారి స్వస్థలానికి ఆఘమేఘాలపై పంపించేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తెనాలి పోలీసుల పైశాచిక దాడికి గురైన బాధితులను పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం తెనాలి పర్యటనకు వస్తున్నారు. -
ఈ ప్రభుత్వం క్రూరంగా వ్యవహరిస్తోంది...
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వైఎస్సార్సీపీ కార్యకర్తల మీద, సోషల్ మీడియా కార్యకర్తల మీద ఆక్రమ కేసులు బనాయించడంతోపాటు అనేక కేసుల్లో థర్డ్ డిగ్రీలు ప్రయోగిస్తూ క్రూరంగా వ్యవహరిస్తోంది. తెనాలిలో అత్యంత దారుణంగా చట్టాలకు వ్యతిరేకంగా పోలీసులు నడిరోడ్డు మీద నిందితులను కూర్చోబెట్టి థర్డ్డిగ్రీ ప్రయోగించారంటే అది చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యమే. హైకోర్టు, సుప్రీంకోర్టు అలాగే మానవ హక్కుల సంఘానికి సంబంధించి సుమోటోగా కేసు రిజిస్ట్రేషన్ చేసి తక్షణమే దాడికి పాల్పడ్డ సీఐలను, వారికి సహకరించిన వారిని సస్పెండ్ చేయాలి. గురజాలకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎక్కడో హైదరాబాదులో పనిచేసుకుంటూ ఒక ఫంక్షన్లో పాల్గొనేందుకు వచ్చిన హరికృష్ణను తెలుగుదేశం పార్టీ నాయకులకు కారులో ఎత్తుకొని వెళ్లి చిత్రహింసలకు గురిచేసి అతని మీద కూడా థర్డ్ డిగ్రీ ప్రయోగించి నడవలేని విధంగా కొట్టినటువంటి సీఐ భాస్కర్ని కూడా తక్షణమే సస్పెండ్ చేయాలి. మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురక కిషోర్ మీద ఆక్రమ కేసులు బనాయిస్తూ పోతున్నారు . ఇప్పటి వరకు 8 కేసులు కేసులు నమోదు చేశారు. పీడీ యాక్ట్ పెడితే దానికి సంబంధించి హైకోర్టుకు వెళితే పీడీ యాక్ట్ను కొట్టి వేసింది. అయినా మళ్లీ దొంగతనం కేసు పెట్టి లోపల పెట్టడం అన్యాయం. ––పోలూరి వెంకటరెడ్డి, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు -
దివ్యాంగులు అన్నిరంగాల్లో పోటీపడాలి
గుంటూరు వెస్ట్: దివ్యాంగులు అన్ని రంగాల్లోనూ పోటీపడాలని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో ఆరుగురు దివ్యాంగులకు ల్యాప్ట్యాప్లు బహూకరించారు. ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఎం.గంగరాజు, లక్ష్మీకుమారి, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ సువార్త పాల్గొన్నారు. ఇద్దరికి కారుణ్య నియామకపత్రాలు.. ఇద్దరికి ఆయా శాఖల్లో జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ కారుణ్య నియామక పత్రాలు అందజేశారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో తాడిశెట్టి ఎస్ఎస్కే కుమార్కు పోలీసు శాఖలోనూ, బుళ్ల శృతికి రెవెన్యూ శాఖలో ఉద్యోగ నియామక ఉత్తర్వులను ఇన్చార్జి కలెక్టర్ అందజేశారు. కాలుష్య నియంత్రణ సామాజిక బాధ్యత గుంటూరు వెస్ట్: కాలుష్య నియంత్రణను సామాజిక బాధ్యతగా గుర్తించాలని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పోస్టర్లు, గుడ్డ సంచులను ఆవిష్కరించారు. -
ఐఐటీల్లో సీట్లు సాధిస్తాం
జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకర్ల మనోగతం బెంగళూరు ఐఐఎస్సీలో చేరతాను మా స్వస్థలం గుంటూరు. నాన్న కిషోర్ చౌదరి ఆర్వీఆర్ అండ్ జేసీ ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్ అసోసియేట్ ప్రొఫెసర్గా పని చేస్తుండగా, తల్లి పద్మజ ప్రైవేటు ఆస్పత్రిలో అడ్మినిస్ట్రేటర్గా పని చేస్తున్నారు. టెన్త్ ఐసీఎస్ఈ సిలబస్లో 588, ఇంటర్మీడియెట్లో 987 మార్కులు సాధించాను. జేఈఈ మెయిన్స్లో 100 పర్సంటైల్తో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 18వ ర్యాంకు సాధించాను. తాజా ర్యాంకుతో బెంగళూరు ఐఐఎస్సీలో బీటెక్లో మాఽథమాటిక్స్ ఇన్ కంప్యూటర్లో చేరతాను గుత్తికొండ సాయి మనోజ్ఞ, 152వ ర్యాంకు గుంటూరు ఎడ్యుకేషన్: జేఈఈ అడ్వాన్స్డ్–2025 ఫలితాల్లో గుంటూరు జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గుంటూరు నగరంలో చదివిన విద్యార్థుల్లో ఆరుగురు అఖిల భారతస్థాయి ఓపెన్ కేటగిరీలో 200 లోపు ర్యాంకులు సాధించారు. ప్రకాశం జిల్లా పొదిలికి చెందిన సోమిశెట్టి వెంకట సాయిచక్రి అఖిల భారతస్థాయి ఓపెన్ కేటగిరీలో 33వ ర్యాంకు కై వసం చేసుకున్నాడు. రాష్ట్రస్థాయిలోనే ఇది అత్యుత్తమ ర్యాంకు. తండ్రి శ్రీరామమూర్తి వ్యాపారం చేస్తుండగా, తల్లి సుజాత గృహిణి. పదవ తరగతి, ఇంటర్ గుంటూరులోని భాష్యంలో చదివిన సాయి చక్రి టెన్త్లో 572, ఇంటర్లో 965 మార్కులు సాధించాడు. జేఈఈ మెయిన్స్లో 99.96 పర్సంటైల్తో 646వ ర్యాంకు కై వసం చేసుకున్న సాయిచక్రి తాజాగా అడ్వాన్స్లో ఓపెన్ కేటగిరీలో 33వ ర్యాంకు సాధించాడు. ముంబై ఐఐటీలో సీఎస్ఈలో చేరతానని చెబుతున్న సాయిచక్రి సైబర్ టెక్నాలజీ రంగంలో నిపుణుడుగా ఎదగాలనే లక్ష్యంతో ఉన్నాడు. సైబర్క్రైమ్లను నివారించే ఆశయంతో ముందుకు వెళ్లాలనే ఆత్మ విశ్వాసంతో ఉన్నాడు. ముంబై ఐఐటీలో చేరతాను మా స్వస్థలం విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం. నాన్న వీరపునాయుడు లారీ ట్రాన్స్పోర్ట్లో పని చేస్తారు. అమ్మ వసంత గృహిణి. ఆరో తరగతి నుంచే గుంటూరులో చదువుతున్నాను. టెన్త్లో 588, ఇంటర్లో 984 మార్కులు సాధించాను. తాజా ర్యాంకు ఆధారంగా ముంబై ఐఐటీలో సీఎస్ఈలో చేరతాను. బీటెక్ తరువాత ఐఏఎస్కు ప్రిపేర్ కావాలనే లక్ష్యంతో ఉన్నాను. – ఎన్. ఆకాష్, 108వ ర్యాంకు పరిశోధనలు చేయాలనే ఆసక్తి మా స్వస్థలం గుంటూరులోని ఏటీ అగ్రహారం. నాన్న భాను కృష్ణారావు లోకో పైలెట్. అమ్మ పద్మజ గృహిణి. తాజా ర్యాంకు ఆధారంగా బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో మాథమాటిక్స్ ఇన్ కంప్యూటర్స్ కోర్సులో చేరతాను. సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు చేయాలనే లక్ష్యంతో ఉన్నాను. – ఎం. శ్రీకర గణేష్, 104వ ర్యాంకు పర్యావరణ పరిరక్షణ దిశగా పరిశోధనలు చేస్తాను మా స్వస్థలం సత్తెనపల్లి. నాన్న కోటేశ్వరావు ఇనుమెట్ల జెడ్పీ హైస్కూల్లో ఉపాధ్యాయునిగా పని చేస్తున్నారు. అమ్మ కోటేశ్వరమ్మ డీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఐఐటీ ముంబైలో సీఎస్ఈలో చేరతాను. ప్లాస్టిక్ కారణంగా పర్యావరణానికి కలుగుతున్న విఘాతానికి పరిష్కారం చూపేందుకు పర్యావరణ పరిరక్షణ దిశగా పరిశోధనలు చేస్తాను. డి.జస్వంత్ బాలాజీ, 151వ ర్యాంకు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదువుతాను మా స్వస్థలం గుంటూరు. నాన్న టి.పిచ్చయ్య, విజ్ఞాన్ యూనివర్శిటీలో ప్రొఫెసర్. అమ్మ ఇవాంజిలిన్ విజయవాడలోని మేరీ స్టెల్లా కళాశాలలో అధ్యాపకురాలు. కంప్యూటర్ సైన్స్కు భిన్నంగా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేయాలనే లక్ష్యంతోఉన్నాను. ముంబైలో ఈ.ఈ బ్రాంచ్లో చేరతాను. టి.విక్రమ్ లెవీ, 146వ ర్యాంకు పర్యావరణ పరిరక్షణ దిశగా పరిశోధనలు చేస్తాను మా స్వస్థలం సత్తెనపల్లి. నాన్న కోటేశ్వరావు ఇనుమెట్ల జెడ్పీ హైస్కూల్లో ఉపాధ్యాయునిగా పని చేస్తున్నారు. అమ్మ కోటేశ్వరమ్మ డీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఐఐటీ ముంబైలో సీఎస్ఈలో చేరతాను. ప్లాస్టిక్ కారణంగా పర్యావరణానికి కలుగుతున్న విఘాతానికి పరిష్కారం చూపేందుకు పర్యావరణ పరిరక్షణ దిశగా పరిశోధనలు చేస్తాను. డి.జస్వంత్ బాలాజీ, 151వ ర్యాంకు -
ఆత్మరక్షణ కోసం ఆయుధం
గుంటూరు వెస్ట్ (క్రీడలు): ప్రతి చిన్న సమస్యని పెద్దదిగా చూడడం, ఆందోళన చెందడం, క్రమశిక్షణ లోపించడం తదితర అంశాలను నేటిచిన్నారుల్లో తరచూ చూస్తుంటాం. తల్లిదండ్రుల్లో కూడా తమ పిల్లల చదువుకు అధిక ప్రాధాన్యతనిచ్చి పెద్ద కళాశాలల్లో సీట్లు సాధించాలనే తపన ఎక్కువగా కనిపిస్తుంది. అయితే కొందరు మాత్రం తమ పిల్లల్ని విద్యావంతులుగానూ ఆత్మ రక్షణ విద్యలోనూ మేటిగానూ చూడాలనుకుంటున్నారు. దీనికి తగ్గట్లుగా శిక్షణా శిబిరాల్లో చేర్పించి దీటుగా తీర్చిదిద్దుతున్నారు. ఇలా శిక్షణ పొందిన కొందరు చిన్నారులు పోటీల్లోనూ రాణిస్తున్నారు. గుంటూరు విద్యానగర్లోని కాశీనాథ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీలో సుమారు 100 మందికిపైగా మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందుతూ అద్భుతంగా రాణిస్తున్నారు. గత నెల 24 నుంచి 26 వరకు తమిళనాడులోని కోయంబత్తూర్లో జరిగిన 5వ అంతర్జాతీయ కర్రసాము పోటీల్లో 9 బంగారు, 5 రజతాలు 3 కాంస్య పతకాలు సాధించి ఔరా అనిపించారు. అకాడమీ కోచ్ కాశీనాథ్ రెడ్డి ప్రత్యేక శిక్షణలో రాటుదేలుతున్న వీరు కర్రసాముతోపాటు తైక్వాండాలోనూ విశేషంగా రాణిస్తున్నారు. కర్రసాము, తైక్వాండోల్లో రాణిస్తున్న చిన్నారులు అంతర్జాతీయ పోటీల్లో పతకాల పంట మారుతున్న తల్లిదండ్రుల ఆలోచన ధోరణి -
భార్యపై కత్తితో దాడి చేసిన భర్త అరెస్ట్
లక్ష్మీపురం: వ్యసనాలకు అలవాటు పడిన భర్తను వదిలి పుట్టింట్లో ఉంటూ పని చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటున్న మహిళను ఆమె భర్త కత్తి పొడిచి గాయాలపాలు చేశాడు. నిందితుడిని పట్టాభిపురం పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. కోబాల్డ్పేటకు చెందిన మెరిగల రాజేష్, కల్పనకు 2014లో వివాహం అయింది. రాజేష్ పెయింటింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. అయితే కొంతకాలంగా రాజేష్ వ్యసనాలకు అలవాటు పడి మద్యం సేవిస్తూ భార్యను వేధించడం ప్రారంభించాడు. దీంతో భర్త వేధింపులు తట్టుకోలేక కల్పన ఏడాది క్రితం పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. పిల్లలను పోషించేందుకు చంద్రమౌళినగర్లోని సంస్థలో చిరు ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. అయితే రాజేష్ మద్యం సేవించి పిల్లలు కావాలంటూ, కాపురానికి రావాలంటూ భార్య పని చేసే ప్రదేశానికి వెళ్లి వేధిస్తుంటాడు. ఈ నేపథ్యంలో గత నెల 25న రాత్రి ఆమె పనిచేసే ప్రదేశానికి వెళ్లి వాగ్వివాదానికి దిగిన రాజేష్ వెంట తెచ్చుకున్న కత్తితో పొడిచి తీవ్ర గాయాలపాలు చేశాడు. దీన్ని గమనించిన స్థానికులు కల్పనను హుటాహుటిన జీజీహెచ్కు తరలించారు. సమచారం తెలుసుకున్న పట్టాభిపురం పోలీసులు ఘటన జరిగిన ప్రదేశంలో విచారించి, బాధితురాలు కల్పన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాడు. నిందితుడు ఉడాయించడంతో అతనికోసం గాలింపు చేపట్టారు. పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు, ఎస్ఐ తరంగిణిలకు వచ్చిన సమాచారం మేరకు ఆదివారం రాత్రి కోబాల్డ్పేట 7వ లైన్లో నిందితుడు ఉన్నట్లు తెలియడంతో మెరిగల రాజేష్ను అదుపులో తీసుకుని స్టేషన్కు తరలించి సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
వెన్నుపోటుకు పేటెంట్ చంద్రబాబుదే
గుంటూరు రూరల్: వెన్నుపోటు పొడవటంలో చంద్రబాబు సిద్ధహస్తుడని, ఈవిషయంలో పేటెంట్ ఆయనదేనని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. సోమవారం మండలంలోని ఏటుకూరు బైపాస్ నందున్న వైఎస్సార్ సీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ కార్యాలయంలో ఈనెల 4వ తేదీన నిర్వహించనున్న వెన్నుపోటు దినం కార్యక్రమంపై కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ చంద్రబాబు తనకు పిల్లను ఇచ్చిన మామనే వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నాడన్నారు. అదేవిధంగా ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తా.. ఆదాయాన్ని సృష్టిస్తా అని అబద్దాలు చెప్పి గద్దెనెక్కి నేడు రాష్ట్రంలోని ప్రజలకు పథకాలు అమలు చేయకుండా వెన్నుపోటు పొడిచాడన్నారు. సంపద సృష్టి పేరుతో పేదల కష్టం దోపిడీ వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు పోతిన మహేష్ మాట్లాడుతూ చంద్రబాబు సంపద సృష్టిస్తానని చెప్పి విద్యుత్ చార్జీలను పెంచి పేదలు, రైతులను వెన్నుపోటు పొడిచాడన్నారు. సంపద సృష్టి పేరుతో గ్రామాల్లో వీధికి నాలుగు బెల్ట్ షాపులను నిర్వహిస్తూ మద్యాన్ని ఏరులా పారించి పేదల కష్టాన్ని దోచుకుంటున్నాడన్నారు. పార్టీ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు మోదుగుల వేణుగోపాల్రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుకు పేదలు సంతోషంగా ఉంటే నచ్చదని పేదలను అణగదొక్కేందుకు ఎల్లపుడూ చూస్తుంటాడన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది గడుస్తున్నా నేటికి ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేకపోయారన్నారు. దానికితోడు నిత్యం వేల కోట్ల అప్పులు చేసి నేటికి ఆంధ్రరాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చాడన్నారు. నియోజకవర్గ ఇన్చార్జ్ బలసాని కిరణ్కుమార్ మాట్లాడుతూ ఈనెల 4వ తేదీన ఉదయం 10 గంటల నుంచి వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని నియోజకవర్గంలోని పాత మల్లాయపాలెం గ్రామంనందున్న దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహం వద్ద నివాళులర్పించి అక్కడినుంచి ర్యాలీగా వెళ్లి ప్రత్తిపాడు తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేస్తామన్నారు. పొన్నురు నియోజకవర్గ ఇన్చార్జ్ అంబటి మురళీకృష్ణ, నగర అధ్యక్షురాలు, ఈస్ట్ నియోజకవర్గ ఇన్చార్జ్ నూరి ఫాతిమా, మంగళగిరి ఇన్చార్జి దొంతిరెడ్డి వేమారెడ్డి, నిమ్మకాయల రాజనారాయణ, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఏటుకూరులో వెన్నుపోటు దినం పోస్టర్ ఆవిష్కరణ -
మోసపోయాం.. న్యాయం చేయండి
నగరంపాలెం: ఉద్యోగాల పేర్లతోనూ, డ్వాక్రా రుణాలు ఇప్పిస్తామంటూ మోసగించారని బాధితులు వాపోయారు. జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం ప్రజా ఫిర్యాదులు – పరిష్కారాల వ్యవస్థ (పీజీఆర్ఎస్) నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల అర్జీలను జిల్లా ఏఎస్పీలు రమణమూర్తి (పరిపాలన), కె.సుప్రజ (క్రైం), హనుమంతు (ఏఆర్) స్వీకరించారు. సంబంధిత పోలీస్ అధికారులకు మొబైల్ ద్వారా బాధితుల సమస్యలను వివరించారు. త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ట్రాఫిక్ డీఎస్పీ రమేష్ అర్జీలు స్వీకరించారు. పోలీసు పీజీఆర్ఎస్లో బాధితుల మొర ఫిర్యాదులు స్వీకరించిన ఏఎస్పీలు -
వెన్నుపోటు చంద్రబాబుకు అలవాటే..!
నెహ్రూనగర్: వెన్నుపోటు అంటే గుర్తుకువచ్చేది చంద్రబాబే అని నాడు ఎన్టీఆర్ను.. నేడు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వారిని మోసం చేసి చంద్రబాబు ప్రజలను వెన్నుపోటు పొడిచారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు పేర్కొన్నారు. జూన్ 4న జరగనున్న వెన్నుపోటు దినాన్ని జయప్రదం చేసేందుకుగాను సోమవారం పార్టీ గుంటూరు తూర్పు నియోజకవర్గ సన్నాహక సమావేశం స్థానిక బస్టాండ్ ఎదురుగా గల తూర్పు కార్యాలయంలో జరిగింది. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా అధ్యక్షతన వహించారు. అంబటి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడం కోసం అమలుకాని హామీలు ఎన్నో ఇచ్చారన్నారు. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన పథకాలనైనా అమలు చేస్తున్నారా.. అంటే వాటిని కూడా నిలిపివేశారన్నారు. జూన్ 4న జరిగే వెన్నుపోటు దినాన్ని ప్రతి ఒక్కరూ జయప్రదం చేసి చంద్రబాబు మెడలు వంచైనా సరే సంక్షేమ పథకాలను అమలు చేయించుకోవాలని పిలుపునిచ్చారు. తెనాలిలో యువకులను పోలీసులు విచక్షణ రహితంగా కొడితే వారిని పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వస్తుంటే.. గంజాయి, రౌడీషీటర్లను పరామర్శించేందుకు వస్తారా అంటూ హోంమంత్రి మాట్లాడటం బాధాకరమన్నారు. చంద్రబాబు హామీలు నీటిమీద రాతలు గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు పోతిన మహేష్ మాట్లాడుతూ చంద్రబాబు ఇచ్చే హామీలన్నీ నీటి మీద రాతలేనన్నారు. ఆయన హమీలు ఇచ్చారంటే అమలు కావానే అర్థమన్నారు. పార్టీ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా.. వైఎస్సార్ సీపీ నాయకులను అక్రమంగా అరెస్టు చేయిస్తున్నారన్నారు. వైఎస్సార్ సీపీకి రాబోయే కాలంలో మంచి రోజులు వస్తాయని.. కార్యకర్తలకు పెద్ద పీట వేస్తామన్నారు. పార్టీ మంగళగిరి సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, నూరిఫాతిమా మాట్లాడారు. అనంతరం వెన్నుపోటు దినం పోస్టర్లను ఆవిష్కరించారు. కార్పొరేటర్లు పాల్గొన్నారు. నాడు ఎన్టీఆర్కు..నేడు హామీలు అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు బాబు మోసాలను రాష్ట్ర ప్రజానీకానికి తెలియజెప్నేందుకే వెన్నుపోటు దినం కార్యక్రమం ప్రజలంతా పాల్గొని చంద్రబాబు మెడలు వంచైనా ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు -
సుద్ధపల్లిలో వ్యక్తి దారుణహత్య
చేబ్రోలు: వివాహేతర సంబంధం నేపధ్యంలో వ్యక్తి దారుణహత్యకు గురైన సంఘటన సోమవారం సుద్ధపల్లిలో చోటు చేసుకుంది. చేబ్రోలు మండలం సుద్ధపల్లి గ్రామానికి చెందిన కొమ్మూరి గోపయ్య(35)ను గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి హతమార్చారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న చేబ్రోలు సీఐ వై.కోటేశ్వరరావు, ఎస్ఐ డి.వెంకటకృష్ణలు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతుడి తల్లి కొమ్మూరి రమణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ డి.వెంకటకృష్ణ తెలిపారు. మహిళకు ఇద్దరు వ్యక్తులతో ఉన్న వివాహేతర సంబంధం నేపధ్యంలో ఇరువురి మద్య చోటు చేసుకున్న వివాదం కారణంగానే ఈ హత్య జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. -
జెడ్పీలో ఉద్యోగుల బదిలీలు
కౌన్సెలింగ్ ద్వారా 91 మందికి స్థాన చలనం గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ పరిధిలో 91 మంది ఉద్యోగులు వేర్వేరు ప్రాంతాలకు బదిలీ అయ్యారు. సోమవారం జెడ్పీ సమావేశ మందిరంలో సీఈఓ వి.జ్యోతిబసు బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా మాట్లాడుతూ నిబంధనలకు అనుగుణంగా బదిలీలను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. సీఈఓ జ్యోతిబసు మాట్లాడుతూ ఒక చోట ఐదేళ్లు విధులు నిర్వహించిన వారిని ఇతర ప్రాంతాలకు తప్పనిసరిగా బదిలీ చేస్తున్నామని, ఖాళీగా ఉన్న ప్రాంతాలకు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బదిలీల్లో భాగంగా ఏడుగురు పరిపాలనాధికారులతో పాటు ఎనిమిది మంది సీనియర్ అసిస్టెంట్లు, 17 మంది జూనియర్ అసిస్టెంట్లు, తొమ్మిది మంది టైపిస్టులు, ఇద్దరు ల్యాబ్ అసిస్టెంట్లు, 39 మంది ఆఫీస్ సబార్డినేట్లు, ఒక నైట్ వాచ్మెన్ బదిలీ అయ్యారు. కౌన్సెలింగ్ ప్రక్రియలో డిప్యూటీ సీఈఓ సీహెచ్ కృష్ణ, అకౌంట్స్ అధికారి శామ్యూల్ పాల్, ఏఓ రాజారత్నం పాల్గొన్నారు. -
‘వెన్నుపోటు దినం‘ విజయవంతం చేయాలి
పొన్నూరు: అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చకుండా మోసగించిన కూటమి ప్రభుత్వం తీరును నిరసిస్తూ వైఎస్సార్సీపీ పిలుపు మేరకు జూన్ 4న నిర్వహించనున్న ’వెన్నుపోటు దినం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు, గుంటూరు పార్లమెంటు పరిశీలకుడు పోతిన మహేష్లు పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, తాడికొండ, గుంటూరు తూర్పు, మంగళగిరి, ప్రత్తిపాడు నియోజకవర్గాల సమన్వయకర్తలు వనమా బాల వజ్రబాబు, షేక్ నూరి ఫాతిమా, దొంతిరెడ్డి వేమారెడ్డి, బలసాని కిరణ్కుమార్లతో కలిసి నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సభకు పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ అధ్యక్షత వహించారు. తొలుత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.హామీలు నెరవేర్చని చంద్రబాబుఅనంతరం అంబటి రాంబాబు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. ప్రజలు ఇప్పటికే చంద్రబాబుకు ఓటెందుకు వేశామా అనే ఆలోచనలో పడ్డారని అన్నారు. రాష్ట్రంలో ప్రజల అవసరాలు గుర్తెరిగి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి డీబీటీ రూపంలో నేరుగా ప్రజల ఖాతాల్లో నగదు జమ చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్ర సృష్టించారన్నారు. చంద్రబాబు అంటే మోసం, దగా, వెన్నుపోటు, అబద్ధాలే గుర్తుకు వస్తాయన్నారు. ఎన్నికల ముందు చదువుకునే ప్రతి ఒక్కరికీ తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం వంటి ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. ఒక్క హామీ అరకొరగా ఇచ్చి అన్నీ ఇచ్చినట్లు ప్రచారం చేయడంలో దిట్ట చంద్రబాబని విమర్శించారు. పైగా వలంటీర్లు, రేషన్ వాహనాల డ్రైవర్లు, సిబ్బంది ఉద్యోగాలను తొలగించడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వ అరాచకాలను ప్రతి ఒక్కరూ రాసుకుంటున్నారని, సరైన సమయంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. చంద్రబాబు దుష్టపాలనకు నిరసనగా ఈ నెల 4వ తేదీన నిర్వహించనున్న వెన్నుపోటు దినాన్ని రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలతో పాటు పొన్నూరులో కూడా ప్రజల భాగస్వామ్యంతో నిర్వహిస్తామన్నారు. ర్యాలీలు చేపట్టి, అధికారులకు వినతి పత్రాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.అన్నివర్గాలకు అన్యాయంపార్టీ గుంటూరు పార్లమెంటు పరిశీలకుడు పోతిన మహేష్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ఏడాదికే కూటమి ప్రభుత్వం ప్రజలతో ఛీ అనిపించుకుంటోందని విమర్శించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు అబద్ధపు హామీలిచ్చి మోసం చేశారని అన్నారు. సంక్షేమాన్ని అందించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. గతంలో ఉన్న విద్యావ్యవస్థలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమూల మార్పులు తీసుకువచ్చి ఆ రంగాన్ని అభివృద్ధి చేశారన్నారు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు టాబ్లు ఇస్తే చెడిపోతారని చెప్పడం దుర్మార్గం అన్నారు. సంపద సృష్టిస్తా, పేదలను ధనవంతులుగా చేస్తా, అభివృద్ధిని అందలం ఎక్కిస్తానంటూ కాకమ్మ కబుర్లు చెప్పిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక కరెంటు బిల్లులు విపరీతంగా పెంచారని దుయ్యబట్టారు. నవంబరు నుంచి పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యకర్తలకు లబ్ధితోపాటు అన్ని విధాలుగా అండగా ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. వ్యవస్థలో ఎలాంటి మార్పు తీసుకురావాలన్నా అది వైఎస్ జగన్తోనే సాధ్యమని పేర్కొన్నారు. ఆయనను మళ్లీ సీఎం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అనంతరం వెన్నుపోటు దినం కరపత్రాలను ఆవిష్కరించారు. మైనారిటీ కమిషన్ సభ్యులు షేక్ సైఫుల్లా, ఎంపీపీ భవనం పద్మలీల, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ నల్లమోతు రూత్ రాణి, నియోజకవర్గ నాయకులు ఆకుల వెంకటేశ్వరరావు, అంబటి వెంకటేశ్వరరావు, షేక్ నాజర్, బొనిగల వేణుప్రసాద్, చింతలపూడి మురళీకృష్ణ, ఎందేటి వెంకట సుబ్బయ్య, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
అండర్పాస్లో ఇరుక్కుపోయిన లారీ
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని ఎన్టీఆర్ కరకట్ట నుంచి సీతానగరం వచ్చే మార్గంలో బకింగ్హామ్ కెనాల్ వద్ద ఉన్న రైల్వే అండర్పాస్లో మరోసారి భారీ వాహనం ఆదివారం ఇరుక్కుపోయింది. సీతానగరం నుంచి ఎన్టీఆర్ కరకట్ట వైపు వెళుతున్న లారీ రైల్వేబ్రిడ్జి సేఫ్టీ కోసం ఏర్పాటు చేసిన గడ్డర్ను దాటి ముందుకు వచ్చేసింది. బ్రిడ్జి కిందకు రాగానే లారీపై ఉన్న లోడ్ బ్రిడ్జికి తగిలి ఇరుక్కుపోవడంలో లారీ డ్రైవర్ లారీని నిలిపివేశాడు. చివరకు టైర్లలో గాలి తీసి ఆ లారీని ముందుకు తీసుకువెళ్లారు. ఈ రైల్వే బ్రిడ్జి కింద తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతుండడంతో పెను ప్రమాదం జరిగే అవకాశముందని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. రైల్వే అధికారులు స్పందించి రైల్వే బ్రిడ్జికి ప్రమాదం కలగకుండా బ్రిడ్జికి సమాంతరంగా గడ్డర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. జరిగిన ఈ సంఘటనపై తెనాలి రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. -
సంక్షేమం సున్నా!
పాలనకు ఏడాదైనా.. కూటమి ఏడాది పాలనలో అన్నివర్గాలకు తీరని అన్యాయం క్ర.సం. పథకం పేరు లబ్ధిదారుల సంఖ్య లబ్ధి మొత్తం(రూ.కోట్లలో) 1. వైఎస్సార్ ఆసరా 2,90,994 808.60 2. జగనన్న అమ్మ ఒడి 2,01,590 657.39 3. జగనన్న అమ్మ ఒడి (అదర్స్) 1,87,574 47.32 4. అర్చకుల గౌరవ వేతనం 1,051 0.53 5. జగనన్న చేదోడు 11,397 32.59 6. వైఎస్సార్ ఉచిత పంటల బీమా 57,207 74.47 7. వైఎస్సార్ ఈబీసీ నేస్తం 25,401 67.72 8. నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు 45,615 543.66 9. ఇమామ్లు, మౌజన్లకు వేతనం 120 0.06 10. వైఎస్సార్ రైతులకు ఇన్పుట్ సబ్సిడీ 65,758 78.10 11. జగనన్న తోడు (వడ్డీ) 33,485 1.47 12. జగనన్న తోడు (రుణాలు) 68,163 108.32 13. జగనన్న వసతి దీవెన 1,05,471 115.86 14. జగనన్న విద్యా దీవెన 1,15,392 364.94 15. వైఎస్సార్ కల్యాణమస్తు 1,297 11.65 16. వైఎస్సార్ కాపు నేస్తం 21,502 97.71 17. వైఎస్సార్ లా నేస్తం 243 3.04 18. వైఎస్సార్ మత్స్యకార భరోసా 269 0.58 19. వైఎస్సార్ నేతన్న నేస్తం 940 7.30 20. పాస్టర్ల గౌరవ వేతనం 1,823 0.91 21. వైఎస్సార్ రైతు భరోసా 1,77,545 885.97 22. వైఎస్సార్ సున్నావడ్డీ పంట రుణం 48,397 13.61 23. వైఎస్సార్ సున్నావడ్డీ (ఎస్హెచ్జీఎస్) 3,77,515 100.73 24. వైఎస్సార్ వాహన మిత్ర 17,574 61.16 25. వైఎస్సార్ ఆరోగ్య ఆసరా 54,315 42.26 26. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ 86,931 394.80 27. వైఎస్సార్ బీమా 5,324 79.33 28. వైఎస్సార్ చేయూత 1,14,844 503.93 29. వైఎస్సార్ పెన్షన్ కానుక 2,96,952 2847.82 30. జగనన్న విదేశీ విద్యా దీవెన 42 3.68 31. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం 4 0.04 మొత్తం 24,14,735 7,955.54 సాక్షి ప్రతినిధి, గుంటూరు, నెహ్రూనగర్: కూటమి ప్రభుత్వం వచ్చాక సంక్షేమం మాటలకే పరిమితం అయింది. దీంతో ప్రజలకు ఆర్థికంగా చేయూత లేకపోవడంతో కొనుగోలు శక్తి క్షీణించింది. మార్కెట్లో వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రాజధాని పేరుతో చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం మినహా మిగతావి ముందుకు సాగడం లేదు. దీంతో ఏడాది కూడా గడవకముందే కూటమి పాలనపై ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది. పింఛన్ల తనిఖీ పేరుతో రద్దు సంక్షేమంపై ఏ మాత్రం దృష్టి పెట్టని చంద్రబాబు ప్రభుత్వం పేదల నోటి దగ్గర కూడు కూడా లాక్కొనేందుకు సన్నద్ధం అవుతోంది. పండుటాకులపై తన ప్రతాపం చూపిస్తోంది. దీనిలో భాగంగా పింఛన్ల తనిఖీ పేరుతో ఉన్న వాటినీ తొలగిస్తోంది. ఇప్పటి వరకు 6,798 మందికి వివిధ సాకులతో పింఛను రద్దు చేశారు. తాజాగా పైలెట్ వెరిఫికేషన్ పేరుతో ప్రతి జిల్లాలో ఒక సచివాలయం పరిధిలో తనిఖీ చేశారు. పింఛన్దారుల పూర్తి వివరాలు ప్రభుత్వం వద్ద ఉన్నప్పటికీ మరోసారి వారి వివరాలు సేకరించి యాప్లో నమోదు చేశారు. ఆరు అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ వివరాలు సేకరించారు. వీటిలో తేడాలు ఉన్నాయంటూ రద్దు ఆదేశాలు ఇచ్చారు. ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో తాత్కాలికంగా ఆ నిర్ణయాన్ని వాయిదా వేశారు. అమలుకాని హామీలు ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు జిల్లాలో పర్యటించి పలు హామీలు ఇచ్చారు. వాటిలో కనీసం ఒక్కటి కూడా ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు. ముస్లింలకు మొండిచేయి ‘ముస్లింలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తాం. ముఖ్య పట్టణాల్లో ఈద్గాలకు, ఖబరస్తాన్లకు స్థలాలు కేటాయిస్తాం. హజ్ యాత్రకు రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తాం. నూర్బాషా కార్పొరేషన్ పెట్టి ఏడాదికి రూ.వంద కోట్లు ఆర్థిక సాయం చేస్తాం. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ల ద్వారా రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చే బాధ్యత నాది’ అంటూ గతంలో గుంటూరు పర్యటనలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు. పైగా ఉన్న వక్ఫ్ భూములను బయట వ్యక్తులకు కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వం తెగించింది. గుంటూరులోనే ఐటీ టవర్లు కట్టి వర్క్ ఫ్రం హోం విధానం తీసుకొస్తామని చెప్పారు. ఎన్నికల తర్వాత ఆ ఊసు మర్చిపోయారు. రూ.7,955.54 కోట్ల మేరకు లబ్ధి వైఎస్సార్సీపీ పాలనలో జిల్లాలో సంక్షేమ పథకాలకు మొత్తం రూ.7,955.54 కోట్లు ఖర్చు చేశారు. జిల్లాలో 2019–24 కాలంలో 24,14,735 లక్షల మందికి రూ.7,955.54 కోట్ల మేరకు లబ్ధి చేకూరింది. ఇందులో అత్యధికంగా వైఎస్సార్ ఆసరా కింద 2,90,994 మందికి రూ.808.60 కోట్లు, వైఎస్సార్ రైతు భరోసా కింద 1,77,545 మందికి రూ.885.97 కోట్లు, జగనన్న అమ్మ ఒడి ద్వారా 2,01,590 మంది లబ్ధిదారులకు రూ.657.30 కోట్లు, పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం ద్వారా 45,615 మందికి రూ.543.66 కోట్లు లబ్ధి చేకూరింది. అన్నీ మాటలకే పరిమితం ఏడాదైనా ఇంకా అదే తీరు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత హామీలను అమలు చేయలేదు. ప్రతి మహిళకు రూ.1500 ఇస్తామన్నారు. దాని ఊసే లేదు. యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి, ఏటా రైతుకు రూ.20,000 ఆర్థిక సాయం ఇస్తామని చెప్పినా ఏడాది గడిచినప్పటికీ వాటి ప్రస్తావనే లేదు. ఇప్పటికీ ప్రజలకు మాటలతో కూటమి ప్రభుత్వం మోసగిస్తూనే ఉంది. కార్యాలయాల వద్ద పడిగాపులు గత ప్రభుత్వంలో ఇంటి వద్దకే అన్ని సేవలు అందేవి. కూటమి అధికారంలోకి వచ్చాక అన్నీ ఆగిపోయాయి. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. గంటల తరబడి పడిగాపులు తప్పడం లేదు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన హామీలన్నింటినీ కూటమి ప్రభుత్వం నెరవేర్చాలి. – స్వాతి, గుంటూరు అధికారం కోసం అబద్ధాలు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు ఎన్నో పొందాం. కూటమి సర్కారు ఏర్పడితే ఏవేవో ఇస్తామని హామీలు ఇచ్చారు. కానీ ఒక్కటీ అమలు చేయకపోవడం బాధాకరం. కేవలం అఽధికారం కోసమే అబద్ధపు మాటలు చెప్పారు. ఏడాదైనా సంక్షేమ పథకాల ఊసే లేదు. – లలితమ్మ, గుంటూరు వైఎస్సార్సీపీ హయాంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు విద్యార్థుల చదువులకు ఇబ్బంది ఉండేది కాదు ఇళ్లు లేని పేద ప్రజలకు స్థలాలు ఇచ్చి కట్టించిన వైనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినా ఒక్కటీ అమలు కాని సంక్షేమ పథకాలు అసలు ఆ ఊసే వినిపించకపోవడంతో బాబు పాలనపై అన్ని వర్గాలు ఆగ్రహం ప్రకటనలకే పరిమితమవుతున్న కూటమి పాలకులు మోసపు మాటలతో అధికారంలోకి వచ్చి అదే బూటకపు ముచ్చట్లు నమ్మించి నట్టేట ముంచిన పాలకులు ఉన్న సంక్షేమ పథకాలు కూడా కోల్పోయిన ఆవేదనలో ప్రజలు నిరుద్యోగ భృతితల్లికి వందనంగా ఏటా రూ.15,000 ఇస్తాం. నిరుద్యోగులకు భృతిగా నెలకు రూ.3000 చొప్పున ఇస్తాం. ఏటా అన్నదాతలకు రూ.20,000 వేలు ఇచ్చి ఆదుకుంటాం. ఆడబిడ్డకు నిధిగా ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తాం.. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అంటూ ఊరించినా ఒక్కటి కూడా అమలు చేయలేదు. గుంటూరులో భూగర్భ డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేస్తానని చెప్పారు. ఇప్పటివరకూ దీనిపై చంద్రబాబు సమీక్షించిన పాపాన పోలేదు. ఇటీవల కలెక్టర్ల సమావేశంలో కూడా దీనిపై నిర్ణయం తీసుకోలేదు. గుంటూరు అమరావతి రాజధానిలో భాగం. ‘హైదరాబాద్, సికింద్రాబాద్లకు తోడుగా సైబరాబాద్ నిర్మించి ఒక మహానగరానికి శ్రీకారం చుట్టాను. హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డు కేవలం 163 కి.మీ మాత్రమే... కానీ, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు 180 కి.మీ.తో ఏర్పాటు చేస్తానని’ చంద్రబాబు చెప్పారు. ఈ ప్రక్రియ కూడా నత్తనడకన సాగుతోంది. -
చిన్నారులతో మైదానాలు కళకళలాడాలి
గుంటూరు వెస్ట్ (క్రీడలు): చిన్నారులతో క్రీడా మైదానాలు కళకళలాడాలని, ఆ విధంగా స్టేడియంను తీర్చిదిద్దుతామని తూర్పు శాసన సభ్యుడు మొహమ్మద్ నసీర్ అహ్మద్ తెలిపారు. గత మూడు రోజల నుంచి స్థానిక బీఆర్ స్టేడియంలో జరుగుతున్న అండర్–16 బాల బాలికల ఓపెన్ టెన్నిస్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడుతూ రూ.100 కోట్లతో స్టేడియంను అభివృద్ధి చేస్తామన్నారు. పోటీల నిర్వహకుడు, టెన్నిస్ కోచ్ షేక్ అహ్మద్ మాట్లాడుతూ అండర్–16 బాలుర విజేతగా కె.విన్సెంట్ నిలవగా రన్నర్గా జయ సాయి కుమార్ నిలిచాడన్నారు. బాలికల్లో గోలి జోషిత విజేత కాగా తనిక్ష రెడ్డి రన్నర్గా నిలిచిందని చెప్పారు. విజేతలకు బహుమతులను నసీర్ అహ్మద్, టోర్నమెంట్ స్పాన్సర్ డాక్టర్ రామకృష్ణ, రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వెంకటేశ్వరరావు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.నరసింహారెడ్డి, జీవిఎస్ ప్రసాద్, సుబ్బారావు, జాగర్లమూడి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ముగిసిన అండర్–16 టెన్నిస్ పోటీలు -
గుంటూరు
సోమవారం శ్రీ 2 శ్రీ జూన్ శ్రీ 2025వైఎస్సార్సీపీ పాలనలో జిల్లాలో సంక్షేమ పథకాల కింద అందించిన మొత్తం వివరాలు.. నేడు వల్లభేశ్వరుడి వార్షికోత్సవం రొంపిచర్ల: మండలంలోని విప్పర్లలో గల వల్లభేశ్వరస్వామి ఆలయ ఏడో వార్షికోత్సవం సోమవారం నిర్వహించనున్నారు. ఉదయం నుంచి విశేష పూజలు, హోమాలు జరుగుతాయి. అలరించిన వేణుగాన కచేరీ నగరంపాలెం: బృందావన్ గార్డెన్స్ వేంకటేశ్వర స్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై ఆదివారం వల్లూరు కృష్ణకిషోర్, ఆర్.శశాంక్, జనార్దన్ల వేణుగాన కచేరీ అలరించింది.సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 512.30 అడుగుల వద్ద ఉంది. కుడి కాలువకు 5,598 క్యూసెక్కులు విడుదలవుతోంది. కూటమి పాలన సంక్షోభం వైపు వెళ్తోంది. గత ఐదేళ్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలందరికీ కులమతాలకు అతీతంగా అర్హత ఉంటే చాలు సంక్షేమ పథకాలు నిరాటంకంగా అందాయి. తర్వాత మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి.. సంక్షేమం మాటే మరిచిపోయింది. పింఛను నామమాత్రంగా పెంచి, ఉన్న లబ్ధిదారుల సంఖ్యను భారీగా తగ్గించడం మినహా ఒక్క పథకాన్నీ అమలు చేయలేదు. సరికదా.. ఇప్పటికే ఉన్న అన్ని పథకాలకూ తిలోదకాలు ఇచ్చింది. ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు, రెడ్బుక్ రాజ్యాంగం అమలు, సామాన్యులపై దౌర్జన్యాలు చేయడంపైనే పాలకులు దృష్టి పెట్టారు. ప్రజా సంక్షేమం గాలికొదిలేశారు. 7న్యూస్రీల్ -
చెస్ టోర్నీ విజేతగా ధృవేష్
విజయవాడస్పోర్ట్స్: రాష్ట్రస్థాయి చదరంగం పోటీల విన్నర్ ట్రోఫిని గుంటూరుకు చెందిన డి.ధృవేష్ కై వసం చేసుకున్నాడు. విజయవాడ శివారు కానూరులోని స్కాట్స్పైన్ స్కూల్లో ఆదివారం రాష్ట్రస్థాయి చెస్ ఓపెన్ టోర్నమెంట్ జరిగింది. చెస్ వేసవి శిక్షణ శిబిరం ముగింపు సందర్భంగా కృష్ణాజిల్లా చెస్ అసోసియేషన్, స్కాట్స్పైన్ స్కూల్, ఆంధ్ర చెస్ అసోసియేషన్ నిర్వహించిన ఈ పోటీల్లో 178 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఏడు రౌండ్లపాటు సాగిన ఈ పోటీల్లో గుంటూరుకు చెందిన ధృవేష్ విన్నర్గా నిలువగా, విజయవాడకు చెందిన పి.జయసాకేత్ రన్నర్ ట్రోఫీని అందుకున్నాడు. విజేతలకు చెస్ సీనియర్ కోచ్లు డి.లక్ష్మణరావు, జె.మల్లేశ్వరరావు, స్కూల్ ఫిజికల్ డైరక్టర్ ఎన్.శివ ట్రోఫీలను అందజేశారు. -
దుర్గమ్మ సన్నిధిలో భక్తుల తాకిడి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై ఆదివారం భక్తుల రద్దీ కొనసాగింది. వేసవి సెలవులు ముగియ నుండటంతో, వివాహ ముహుర్తాల నేపథ్యంలో నూత న వధూవరులు, భక్తులు, యాత్రికులతో ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం కనిపించింది. తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి కనిపించగా, భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా దేవస్థాన అధికారులు ఏర్పాట్లు చేశారు. పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు దేవస్థాన కేశకండనశాలలో తలనీలాలు సమర్పించారు. ఘాట్రోడ్డు, మహామండపం లిప్టు, మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకున్నారు. సర్వదర్శనంతో పాటు రూ. 100, రూ. 300, రూ. 500 టికెట్ల క్యూలైన్ ద్వారా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సర్వదర్శనం క్యూలైన్లో అమ్మవారి దర్శనానికి రెండున్నర గంటలు, రూ.100, రూ.300 టికెట్పై దర్శనానికి గంటన్నరకు పైగా సమయం పట్టింది. వీఐపీ దర్శనాలను బ్రేక్ ఉదయం 11–30 గంటల నుంచి మధ్యాహ్నం 1–30 గంట వరకు వీఐపీ దర్శనాలను దేవస్థాన అధికారులు నిలిపివేశారు. అమ్మవారికి మహానివేదన నిమిత్తం ఉ దయం 11–45 గంటల నుంచి 12–15 గంటల వరకు అన్ని దర్శనాలు నిలిపివేశారు. దీంతో అన్ని క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. మహానివేదన అనంతరం రూ. 500టికెట్ల విక్రయాలను నిలిపివేసి, రూ. 300 టి కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు బంగారువాకిలి దర్శ నం కల్పించారు. మధ్యాహ్నం 2గంటలవరకు ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ, పల్లకీసేవలో పలువు రు ఉభయదాతలు, భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం ఏడు గంటలనుంచి భక్తుల తాకిడి కనిపించింది. మహానివేదన తర్వాత వీఐపీ దర్శనాలకు బ్రేక్.. అంతరాలయ దర్శనం రద్దు -
రాష్ట్రస్థాయి ఈత పోటీలు ప్రారంభం
నరసరావుపేట ఈస్ట్: ఈత అత్యుత్తమ వ్యాయామమని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అమెచ్యూర్ ఆక్వాటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల స్విమ్మింగ్ పూల్లో 11వ సీనియర్ అంతర్ జిల్లాల స్విమింగ్ ఛాంపియన్షిప్– 2025 పోటీలను నిర్వహించారు. పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ అరవిందబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించేందుకు పలు ప్రణాళికలు రూపొందించిందని వివరించారు. రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి 105 మంది క్రీడాకారులు పోటీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు కపలవాయి విజయకుమార్, ఆంధ్రప్రదేశ్ అమెచ్యూర్ ఆక్వాటిక్ అసోసియేషన్ ఛైర్మన్ డాక్టర్ కె.రవికాంత్, అధ్యక్షుడు ఓబుల్రెడ్డి, కార్యదర్శి మోహనవెంకటరామ్, కోశాధికారి రమేష్, పల్నాడుజిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి వై.వి.సుబ్బారెడ్డి, జాయింట్ సెక్రటరీ సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ రేషన్ కష్టాలు
గుంటూరు వెస్ట్: రేషన్ సరుకుల పంపిణీ తొలిరోజు దారుణంగా విఫలమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఎండీయూ వాహనాలను కాదని రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ ప్రారంభించింది. దీని కోసం నాయకులతోపాటు కార్యకర్తలను దుకాణాలకు పంపి హడావుడి చేసింది. ప్రజలు చాలా వరకు ఇళ్లకే పరిమితమయ్యారు. చాలా చోట్ల ఈ –పోస్ మిషన్లు పనిచేయక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గళ్ళా మాధవి స్థానిక ఏటీ అగ్రహారంలో నెంబర్ 0781174 రేషన్ దుకాణాన్ని ప్రారంభించారు. కొద్ది సేపటికే అక్కడ ఈ –పోస్ మిషన్ మొరాయించింది. జిల్లాలో మొత్తం 972 రేషన్ దుకాణాలున్నాయి. 5,99,511 మందికి సుమారు 9 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేయాల్సి ఉంది. తొలి రోజు పెద్దగా స్పందన లేదు. గత ప్రభుత్వ హయాంలో ఇంటింటికీ ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ పంపిణీ చేసేటప్పుడు పేదలకు ఎంతో సౌలభ్యంగా ఉండేది. ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నామని కార్డుదారులు వాపోతున్నారు. తప్పని సమస్యలు చాలా దుకాణాల్లో సర్వర్ మొరాయించింది. కొన్ని చోట్ల నెమ్మదించింది. ఈ పోస్ మిషన్లు, వేయింగ్ మిషన్లు చాలా వరకు పాడైపోయాయి. కొన్ని చోట్ల లైన్లు కనబడగా, మరికొన్ని చోట్ల ఎవ్వరూ రాలేదు. మిషన్లు పనిచేయకపోవడంతో ప్రజలు తిరిగి వెళ్లిపోయారు. తొలిరోజు సరుకుల పంపిణీలో తీవ్ర ఇబ్బందులు పలుచోట్ల ఈ– పోస్ మిషన్లు మొరాయింపుతో సమస్యలు ఎమ్మెల్యే మాధవి ప్రారంభించిన దుకాణంలోనూ పనిచేయని వైనం ఇంటి వద్దకే సరుకులు ఇచ్చే వ్యవస్థను నాశనం చేసిన కూటమి ప్రభుత్వం పాలకుల తీరుపై ప్రజల తీవ్ర ఆగ్రహం -
నిర్బంధ బదిలీల ఆదేశాలు ఉపసంహరించుకోవాలి
గుంటూరు ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ బదిలీల్లో భాగంగా స్కూల్ అసిస్టెంట్ కేడర్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ప్రాథమిక పాఠశాలల హెచ్ఎంలుగా నిర్భంద బదిలీ చేయాలని ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవాలని ఏఐఎస్టీఎఫ్ జాతీయ ఆర్థిక కార్యదర్శి సీహెచ్ జోసఫ్ సుధీర్బాబు డిమాండ్ చేశారు. ఆదివారం పాఠశాల విద్య ఆర్జేడీ బి.లింగేశ్వరరెడ్డిని ఆర్జేడీ కార్యాలయంలో కలిసి ఉపాధ్యాయుల సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. లాంగ్ స్టాండింగ్లో లేకున్నప్పటికీ ప్రాథమిక పాఠశాలల హెచ్ఎంలుగా వెళ్లాల్సిందేనని ఒత్తిడి తీసుకువచ్చి, నిర్బంధ బదిలీపై పంపాలనే నిర్ణయాన్ని ఎస్టీయూ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని అన్నారు. జిల్లా అధ్యక్షుడు డి.పెదబాబు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సర్వీసులో సీనియార్టీని పరిగణలోకి తీసుకుని, మెరిట్ జాబితా సిద్ధం చేయాల్సి ఉండగా, పుట్టిన తేదీ ఆధారంగా జాబితాలను తయారు చేయడం నిబంధలకు విరుద్ధమన్నారు. తక్షణమే వాటిని సరిచేసి మెరిట్ ప్రకారం జాబితాలు తయారు చేయాలని కోరారు. రీ అప్పోర్షన్కు గురైన ఉపాధ్యాయులకు ఓల్డ్ స్టేషన్ పాయింట్స్తో పాటు జత చేసిన రీ అప్పోర్షన్ పాయింట్లను తొలగించాలన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవోలకు వ్యతిరేకంగా తీసుకుంటున్న చర్యలను ఉపసంహరించుకోవాలన్నారు. ఆర్జేడీని కలిసిన వారిలో ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.సుబ్బారెడ్డి, నాయకులు శ్యామ్, దిబ్బయ్య, బాజీ, వెంకట్రావు ఉన్నారు. ఏఐఎస్టీఎఫ్ జాతీయ ఆర్థిక కార్యదర్శి సీహెచ్ జోసఫ్ సుధీర్బాబు -
ప్రైమరీ స్కూల్ హెచ్ఎం పోస్టులు ఎస్జీటీలతో భర్తీ చేయాలి
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రైమరీ స్కూల్ హెచ్ఎం పోస్టులను ఎస్జీటీలకు ప్రమోషన్లు కల్పించడం ద్వారా భర్తీ చేయాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖర్ రావు, ఎం.కళాధర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 219 మంది జూనియర్ స్కూల్ అసిస్టెంట్ టీచర్లను నిర్భందంగా బదిలీ చేయడాన్ని ఆపాలని కోరుతూ జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుకను ఆదివారం నగరంపాలెంలోని స్టాల్ గర్ల్స్ హైస్కూల్లో కలిసిన యూటీఎఫ్ జిల్లా ప్రతినిధులు ఆమెకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైమరీ స్కూల్ హెచ్ఎం పోస్ట్లలో స్కూల్ అసిస్టెంట్లకు మ్యాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని కోరారు. విద్యాశాఖ అధికారులు హడావుడి నిర్ణయాలు మానుకోవాలని తెలిపారు. డీఈఓను కలిసిన వారిలో జిల్లా సహాధ్యక్షుడు జి.వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శులు సీహెచ్ ఆదినారాయణ, ఎండీ షకీలా బేగం, కె.రంగారావు, బెల్లంకొండ ప్రసాదు, ఎం.కోటిరెడ్డి, సీనియర్ నాయకులు పి.హనుమంతరావు, చెన్నకేశవరావు, గఫ్ఫార్, వినోద్ తదితరులు పాల్గొన్నారు -
వెన్నుపోటు దినం విజయవంతం చేద్దాం
మంగళగిరి: ఈ నెల 4వ తేదీన వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న వెన్నుపోటు దినంలో నియోజకవర్గంలోని ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావులు పిలుపునిచ్చారు. మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆత్మకూరు జాతీయ రహదారి వెంట కల పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఆదివారం వెన్నుపోటు దినం వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. వేమారెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు అనేక మోసపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏడాది పాలనలో ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచారన్నారు. నియోజకవర్గంలో నివాసముంటన్న చంద్రబాబు, లోకేష్ల కళ్లు తెరిపించేలా వెన్నుపోటు దినాన్ని ప్రజలు విజయవంతం చేయాలన్నారు. ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోని ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేయడం చరిత్రలో ఎన్నడూ జరగలేదని, చంద్రబాబుకు ఆ ఘనత దక్కిందన్నారు. చంద్రబాబు, లోకేష్ల కళ్లు తెరిపించాలి.. ఎమ్మెల్సీ హనుమంతరావు మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న వెన్ను పోటు దినంలో ప్రజలంతా ఐక్యంగా పాల్గొనాలన్నారు. ప్రజలకు చేసిన మోసాన్ని చంద్రబాబుకు తెలిసేలా వెన్ను పోటు దినంను విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలను సూపర్ సిక్స్ పేరుతో మోసం చేసిన చంద్రబాబును ప్రజలు నిలదీయాలన్నారు. వైఎస్సార్ సీపీ పాలనలో ఇచ్చిన ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిలిపేసిన చంద్రబాబు తన పాలనలో ఒక్క సంక్షేమ పథకం అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని, ప్రజలంతా వెన్నుపోటు దినంలో పాల్గొని చంద్రబాబు, లోకేష్లు కళ్లు తెరిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ మంగళగిరి, తాడేపల్లి పట్టణ, మండల, దుగ్గిరాల అధ్యక్షులు నాలి వెంకట కృష్ణ, బుర్రముక్కు వేణుగోపాలస్వామి రెడ్డి, అమరా నాగయ్య, తాడిబోయిన శివగోపయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదులమూడి డేవిడ్ రాజు, సీనియర్ నాయకుడు పాటిబండ్ల కృష్ణమూర్తి, మాజీ ఎంపీపీ పచ్చల రత్నకుమారి, అనుబంధ సంఘాల అధ్యక్షులు కట్టెపోగు భూషణం, బందాపు రుక్మాంగరెడ్డి, యర్రకోటి మల్లిఖార్జునరెడ్డి, రత్నాకరం శ్రీనివాసరాజు,సయ్యద్ గౌస్ మొహిద్దీన్, ఈపూరి ఆదామ్, తిరుమల శెట్టి సురేంద్ర,కలకోటి సునీల్కుమార్, షేక్ జానీ బాషా, చిలువూరి ఫిలోమినా, జంగా నాగిరెడ్డి, భీమిరెడ్డి శ్రవణ్ కుమార్ రెడ్డి, మాదాల గోపీ కృష్ణ, నందిగం ఆకాష్, లేళ్ళ సురేష్, షేక్ సర్ధార్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు, లోకేష్ల కళ్లు తెరిపించేలా నియోజకవర్గంలో కార్యక్రమం నిర్వహిస్తాం వాల్ పోస్టర్ల ఆవిష్కరణలో వైఎస్సార్ సీపీ మంగళగిరి సమన్వయకర్త వేమారెడ్డి, ఎమ్మెల్సీ హనుమంతరావు -
ఉద్యోగ విరమణ పొందిన సిబ్బందికి సత్కారం
నగరంపాలెం: ఉద్యోగ విరమణ పొంది ప్రతిఒక్కరూ తమ భావి జీవితాన్ని సుఖసంతోషాలతో జీవించాలని జిల్లా ఎస్పీ సతీష్కుమార్ అన్నారు. ఎస్ఐలు రంగారావు (అరండల్పేట పీఎస్) పి.నాగేశ్వరరావు (చేబ్రోలు పీఎస్), బి.వెంకటేశ్వరరావు (ఏఆర్), ఏఎస్ఐ ఎంవీ.కృష్ణారావు (పట్టాభిపురం పీఎస్), హెడ్ కానిస్టేబుల్ సీహెచ్.కృష్ణారావు (పట్టాభిపురం పీఎస్), జి.నాగేశ్వర రావు (తాడికొండ పీఎస్),షేక్ మహమ్మద్షరీఫ్ (డీపీఓ సీనియర్ సహాయకుడు)లు ఉద్యోగ విరమణ పొందారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాల్లో వారిని సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా ఏఎస్పీలు రమణమూర్తి (పరిపాలన), హనుమంతు (ఏఆర్), ఏఆర్ డీఎస్పీ ఏడుకొండలరెడ్డి గారు, ఎస్బీ సీఐ అళహరి శ్రీనివాస్, ఆర్ఐలు శివరామకృష్ణ, జిల్లా పోలీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు మైలా సాంబశివరావు, కార్యదర్శి లక్ష్మణ్, కోశాధికారి హుస్సేన్ పాల్గొన్నారు. -
క్రీడాకారులను తీర్చిదిద్దడం గొప్ప విషయం
చినగంజాం: క్రీడాకారులను ప్రతిభావంతులుగా తీర్చి దిద్దడం గొప్ప విషయం అని హైదరాబాద్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అన్ను వేణుగోపాల్ అన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక ఎంఎస్ఆర్ జూనియర్ కాలేజీ ఆవరణలో 40 రోజులుగా నిర్వహిస్తున్న వేసవి కబడ్డీ శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వేసవి శిక్షణ శిబిరానికి శిక్షకుడుగా అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారులు గిరిబాబు వ్యవహరించి ప్రతి రోజూ శిక్షణ అందించారని, అనేక మంది యువ క్రీడాకారులు ప్రేరణ పొందారన్నారు. ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు కుర్రా భాస్కరరావు మాట్లాడుతూ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 20 నుంచి జూన్ 1వ తేదీ వరకు గ్రామీణ యువతకు కబడ్డీపై శిక్షణ ఇచ్చే కార్యక్రమం నిర్వహించామని.. శిబిరం విజయవంతంగా ముగిసిందన్నారు. కోచ్ గిరిబాబు మాట్లాడుతూ శిబిరంలో మొత్తం 150 మంది బాలలకు శిక్షణ ఇచ్చామని, శిక్షణ శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు డాక్టర్ నల్లూరి సుబ్బారావు రూ.లక్ష విరాళంగా అందజేశారని తెలిపారు. దీంతో క్రీడాకారులకు పౌష్టికాహారం, కబడ్డీ కిట్లు అందజేశామన్నారు. శిబిరంలో సీనియర్ క్రీడాకారులు బి.నాగాంజనేయులు, వెంకటేశ్, కె.సతీష్రెడ్డి, బి.శివారెడ్డి, డి.సుబ్బారెడ్డి, వి. వెంకటేశ్, జీటీ అంకిరెడ్డి, ఎం.భాను ప్రకాష్రెడ్డి తదిరులు పాల్గొనగా వారి సలహాలు సూచనల మేరకు శిక్షణ పూర్తి చేసినట్లు తెలిపారు. ముగింపు కార్యక్రమానికి క్రీడాకారులకు భోజన వసతి కల్పించేందుకు అన్ను వేణుగోపాల్ రూ.40 వేలు ఆర్థిక సాయమందించినట్లు తెలిపారు. మచిలీపట్నం జిల్లా అదనపు పోలీస్ అధికారి సత్యం, ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ దాత డాక్టర్ నల్లూరి సుబ్బారావు, అసోసియేషన్ చైర్మన్ చంద్రమోహనరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
క్రాప్ హాలిడే ప్రకటిస్తేనే..
వచ్చే ఏడాది పొగాకు సాగు చెయ్యకుండా క్రాప్ హాలిడే ప్రకటిస్తేనే పొగాకు రైతులకు న్యాయం జరుగుతుంది. గత ఏడాది ధర బాగుంది కదా అని ఎనిమిది ఎకరాలు కౌలుకు తీసుకుని నల్ల బర్లీ సాగు చేశాను. తీరా ఇప్పుడు చూస్తే అసలు కొనేవారే లేరు. ఒకవేళ ఎవరన్నా కొనేందుకు ముందుకు వచ్చినా బాగా ధర తగ్గించి అడుగుతున్నారు. అందుచేత వచ్చే ఏడాది క్రాప్ హాలిడే ప్రకటిస్తేనే మేలు జరుగుతుంది. – కంచర్ల సాల్ బాబు, పొగాకు రైతు, తిమ్మాపురం ధాన్యం కొనేవారే లేరు నాకున్న అర ఎకరం సొంత పొలంతో పాటు 5 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని వరి పంట పండించాను. కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని కొనేవారు కరువయ్యారు. ఇప్పటికీ ధాన్యం 300 బస్తాల వరకు నిల్వ ఉంది. గత ఏడాది ఖరీఫ్, ఈ ఏడాది ఖరీఫ్లో పండించిన ధాన్యం ప్రస్తుతం రూ. 2 వేల నుంచి రూ. 2400 ధర ఉండాల్సి ఉండగా, పాత ధాన్యాన్ని కూడా ఇప్పటికీ దళారులు రూ. 1400కే అడుగుతున్నారు. చివరి గింజ వరకు కొంటామని ప్రభుత్వం చెప్పిన మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. గ్రామాల్లోకి అధికారులు వచ్చి సమావేశాలు నిర్వహించి, ధాన్యం కొనుగోలు చేసిన దాఖలాలు కనిపించలేదు. ధాన్యం ధర ఈ విధంగా పతనమైన రోజులు గతంలో చూడలేదు. – నాగిశెట్టి రమేష్, కౌలు రైతు, కసుకర్రు -
కూటమి ప్రభుత్వ మోసాలను గుర్తించిన ప్రజలు
మంగళగిరి: కూటమి ప్రభుత్వం అధికారం కోసం ఎన్నో హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసిందని, ఆ విషయాన్ని ప్రజలు ఇప్పటికే గుర్తించారని వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంట్ జిల్లా పరిశీలకుడు పోతిన మహేష్ అన్నారు. జూన్ 4వ తేదిన జరగనున్న వెన్ను పోటు దినాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఆత్మకూరు జాతీయ రహదారి వెంట ఉన్న వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శుక్రవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. మహేష్ మాట్లాడుతూ ప్రజలను మభ్య పెట్టడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలను ప్రజలు నమ్మడం లేదన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలనే కాక ఇవ్వని హామీలను కూడా నెరవేర్చారని, దీనిని ప్రజలు గుర్తించారని, కూటమి ప్రభుత్వాన్ని సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. పవన్ కల్యాణ్ పార్టీ కార్యాలయం 15 ఎకరాలలో ఉందని, కొత్త ఇంటిని కోట్లాది రూపాయలతో నిర్మిస్తున్న చంద్రబాబు ఎన్ని ఎకరాలలో ఇళ్లు కడుతున్నారని ప్రశ్నించారు. చేతిలో మీడియా ఉందని దుష్పచారం చేస్తే ప్రజలు నమ్మే రోజులు పోయాయని గుర్తించుకోవాలని హితవు పలికారు. ప్రజలు తిరగబడే రోజులు దగ్గరకు వచ్చాయి ప్రజలకు ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చని టీడీపీ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకే వెన్నుపోటు కార్యక్రమం నిర్వహిస్తున్నామని, నియోజకవర్గం నుంచి ప్రజలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలంతా వెన్నుపోటు దినోత్సవంలో పాల్గొని తెలియజేయాలని కోరారు. పార్టీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి మాట్లాడుతూ జూన్ 4వ తేదీన జరగనున్న వెన్నుపోటు దినోత్సవంలో నియోజకవర్గం నుంచి ప్రజలు భారీగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం ప్రజలను చేసిన మోసాల్ని ఎండగట్టడమే వెన్నుపోటు దినోత్సవ లక్ష్యమన్నారు. ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాన్ని నమ్మి రాష్ట్ర ప్రజలంతా మోసపోయారన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఒక్కటీ నెరవేర్చని కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీయాలన్నారు. పేదలకు సొంతింటి కల నెరవేర్చకుండా ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. సమావేశంలో గుంటూరు తూర్పు, పొన్నూరు, తాడికొండ, ప్రత్తిపాడు నియోజకవర్గాల సమన్వయకర్తలు నూరి ఫాతిమా, అంబటి మురళీకృష్ణ, వనమా బాల వజ్రబాబు, బలసాని కిరణ్ కుమార్, రాష్ట్ర ప్రచార విభాగం ఉపాధ్యక్షుడు బొమ్ము తాతిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షురాలు పచ్చల రత్నకుమారి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదులమూడి డేవిడ్రాజు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ దామర్ల కుబేరస్వామి, జిల్లా యాక్టివిటీ కార్యదర్శి మల్లవరపు సుధారాణి, జిల్లా చేనేత విభాగం అధ్యక్షుడు ఊట్ల పాలశ్రీనివాసరావు, ఆప్కో మాజీ చైర్మన్ చిల్లపల్లి మోహనరావు, మంగళగిరి మండల, పట్టణ అధ్యక్షులు నాలి వెంకటకృష్ణ, ఆకురాతి రాజేష్, తాడేపల్లి పట్టణ, రూరల్, దుగ్గిరాల మండల అధ్యక్షులు బుర్రముక్క వేణుగోపాలస్వామిరెడ్డి, అమరా నాగయ్య, తాడిబోయిన శివగోపయ్య, పట్టణ అధ్యక్షురాలు సంకె సునీత, నియోజకవర్గ ప్రతినిధి కాశినీడు బాజి గంగాధర్, జిల్లా సెక్రటరీ అహ్మద్ బాజీ సాహిద్, దివ్యాంగుల అధ్యక్షుడు బొక్కా అగస్టీన్, ఎస్టీ అధ్యక్షుడు మేడా వెంకటేశ్వరరావు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంట్ జిల్లా పరిశీలకుడు పోతిన మహేష్ జూన్ 4న జరిగే వెన్నుపోటు దినాన్ని విజయంతం చేయాలి మంగళగిరి నియోజకవర్గ సమావేశంలో పాల్గొన్న పార్టీ నేతలు -
ఎకరాకు రూ.1.50 లక్షలు నష్టం
నాలుగు ఎకరాల్లో తేజ రకం మిర్చి పంట సాగు చేశాను. గత ఏడాది ఎకరాకు సుమారు 25 క్వింటాళ్లు దిగుబడి వచ్చింది. ఈ ఏడాది మిర్చి పంటకు రక రకాల తెగుళ్లు వ్యాపించడంతో పాటు వాతావరణంలో మార్పుల కారణంగా 10 క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితులు లేవు. అందులో సగానికి పైగా తాలు వచ్చింది. ఎకరాకు ఇప్పటివరకు విత్తనం మొదలు, పురుగు మందులు, కోత కూలీలు, తొక్కుడు, బాడుగ, కౌలు కలుపుకొని రూ.2.50 లక్షలు వరకు ఖర్చు వచ్చింది. అంటే మొత్తం నాలుగు ఎకరాలకు రూ.10 లక్షల వరకు ఖర్చు వచ్చింది. గత ఏడాది క్వింటా రూ.23 వేలు నుంచి రూ.28 వేలు వరకు పలికిన తేజ రకం ఎరుపు కాయలకు ఈ ఏడాది రూ.9 వేలు నుంచి రూ.10 వేలు పలుకుతోంది. జనవరిలో 25 బస్తాలు గుంటూరు యార్డుకు తీసుకువచ్చాను. క్వింటాకు రూ.13,500 ధర వచ్చింది. మార్చి నెలలో మరో 20 బస్తాలు తీసుకువెళ్తే క్వింటా రూ.9 వేలకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇక తాలు రకం గత ఏడాది క్వింటాకు రూ.16 వేలు ధర ఉంటే ఈ ఏడాది రూ.4,500 వేలు కూడా ధర దక్కడం లేదు. ఈ ఏడాది మొత్తం మీద ఎకరాకు సుమారు రూ.1.50 లక్షల చొప్పున మొత్తం రూ.6 లక్షల వరకు నష్టం రావడం ఖాయం. – దారం ఎలీసారెడ్డి, దారంవారిపాలెం గ్రామం -
సేవల్లో ‘ఫ్లోరెన్స్ నైటింగేల్’
తెనాలి: పవిత్రమైన వైద్యవృత్తిలో నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తే వృత్తిజీవితంలో సంతృప్తినే కాదు... ఏకంగా రాష్ట్ర, జాతీయ అవార్డులు కూడా వరిస్తాయి. దేశ రాజధాని ఢిల్లీలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా శుక్రవారం జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డును స్వీకరించిన వలివేటి శుభావతి ఇందుకు చక్కని నిదర్శనం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్నుంచి ఈ అవార్డును అందుకున్న ఏకై క మహిళ కూడా శుభావతినే. ఏఎన్ఎం విధుల్లో వైద్యవృత్తి ప్రాధాన్యతను గుర్తెరిగి, అంకితభావంతో నిర్వహిస్తూనే ఉన్నత కోర్సులు చేస్తూ, వరుస పదోన్నతులతో మేనేజ్మెంట్ ఇన్స్ట్రక్టర్ హోదాకు ఎదిగారు. ఇప్పుడు ఏకంగా జాతీయ అవార్డునే దక్కించుకున్నారు. సంగం జాగర్లమూడి స్వస్థలం తెనాలి రూరల్ మండల గ్రామం సంగంజాగర్లమూడి వలివేటి శుభావతి స్వస్థలం. తల్లిదండ్రులు సీతారావమ్మ, సుబ్రహ్మణ్యం. వైద్యరంగంలో తొలిగా ఉమ్మడి గుంటూరు జిల్లా నాదెండ్ల పీహెచ్సీ పరిధిలోని చందవరం సబ్సెంటర్లో ఏఎన్ఎంగా శుభావతి వృత్తిజీవితం ఆరంభమైంది. ఉద్యోగ బాధ్యతల్లో ఉంటూనే పీజీ కోర్సులు చేస్తూ వచ్చారు. 13 ఏళ్ల సర్వీసులో మూడు పీజీలు చేశారు. ఫలితంగా పదోన్నతిపై ఇదే జిల్లాలోని నకిరేకల్లో హెల్త్ ఎడ్యుకేటర్గా నియమితులయ్యారు. అక్కడ 12 ఏళ్లపాటు పనిచేశారు. కర్నూలులోని రీజినల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ట్రైనింగ్ సెంటర్ (మేల్)కు మేనేజ్మెంట్ ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తూ గత జనవరిలో ఉద్యోగ విరమణ చేశారు. పేద రోగులకు సేవలు వైద్యరంగంలో తన 39 ఏళ్ల సర్వీసులో శుభావతి పేద ప్రజలు, అవసరమైన వారికి తగిన సేవలను అందిస్తూ వచ్చారు. తన సమర్థత, నిబద్ధతను గుర్తించిన ఉన్నతాధికారులు అప్పగించిన అన్ని బాధ్యతలను ఆమె సక్రమంగా నిర్వర్తించారు. అనేక అవార్డులను అందుకున్నారు. నకిరేకల్లో ఉండగా, హెచ్ఐవీ ప్రాజెక్టుపై శుభావతిని నాటి కలెక్టర్ ప్రత్యేక శిక్షణకని ఢిల్లీ పంపారు. అదే ప్రాజెక్టుపై జిల్లాలోని ఆర్ఎంపీ/పీఎంపీలతో సహా ప్రభుత్వ యంత్రాంగంలోని అన్ని డిపార్టుమెంటు ఉద్యోగులకు శుభావతి హెచ్ఐవీపై అవగాహన కల్పించారు. ఆ కృషికి గుర్తింపుగా అప్పటి మంత్రి కొణిజేటి రోశయ్య నుంచి అవార్డును అందుకున్నానని శుభావతి చెప్పారు. నాతోటి సిబ్బంది, ప్రజలు ఎంతో ప్రేమను చూపటం గుర్తుండి పోతుందని అంటారు శుభావతి, ‘ఎంతో కష్టపడి పనిచేశాను. అందరి మన్ననలు పొందాను. స్వచ్ఛందంగా బాధ్యతలను నిర్వర్తించాను. ఇప్పుడు జాతీయ అవార్డు లభించిందంటే నా వృత్తి జీవితం మొత్తానికి అందిన గౌరవంగా భావిస్తున్నాను అన్నారు శుభావతి. భారత రాష్ట్రపతి చేతులమీదుగా జాతీయస్థాయి ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు అందుకున్న వలివేటి శుభావతి ఉభయ తెలుగు రాష్ట్రాల్నుంచి అవార్డు దక్కించుకున్న ఏకై క మహిళగా గుర్తింపు ఎన్నో అవార్డులు.. రివార్డులు ఆకాశవాణి, విజయవాడ కేంద్రం ఆహ్వానంపై బాల్య వివాహాలు, మాతాశిశు మరణాలు, బాలికా శిశు సంరక్షణ వంటి కార్యక్రమాలపై ప్రత్యేక ప్రసంగాలు చేశారు. గుంటూరు జిల్లాలో బాల్య వివాహాల నిరోధంపై రిసోర్స్ పర్సన్గానూ వ్యవహరించారు. దీనిపై పలు పాటలు రాసి, స్వయంగా గానం చేశారు. అప్పట్లో నెల్లూరు జిల్లా కలెక్టర్లనుంచి అవార్డులను అందుకున్నారు. 2014 ఎన్నికల్లో నెల్లూరు జిల్లా కలెక్టర్ సూచనపై ఓటరు అవగాహనపై పాట రాశారు. చైన్నెలో సినీ సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్తో స్వరకల్పన చేయించారు. ఈ సందర్భంగా నాటి కలెక్టర్ రేఖారాణి ప్రశంసాపత్రం అందించారు. రక్తహీనతపై అవగాహన కోసం పాట రాశారు. శ్రీకాకుళంలో కోవిడ్ విపత్కర పరిస్థితుల్లోనూ నిర్వహించిన సేవలకు అవార్డులు దక్కాయి. గత ప్రభుత్వ హయాంలో శానిటేషన్, న్యూట్రిషన్పై శుభావతి రాసిన పాట పాపులరైంది. ప్రతి అర్బన్ హెల్త్ సెంటర్లోనూ ఏఎన్ఎంల పుస్తకంలో తొలి పేజీలోనే ఆ పాటను ముద్రింపజేశారు. ఏపీ కల్చరల్ అవేర్నెస్ రాష్ట్రస్థాయి ఉత్తమ పౌరురాలి అవార్డు, శ్రీకాకుళంలో ఆంధ్రరత్న అవార్డు వంటివెన్నో తనకు అలంకారాలుగా మారాయి. భర్త ప్రైవేటు ఉద్యోగి, ఏకై క కుమారుడు హైదరాబాద్లోని ప్రముఖ కార్పొరేట్ హాస్పటల్లో పని చేస్తున్నారు. రిటైరయ్యాక సొంత జిల్లా గుంటూరులోనే స్థిరపడ్డారు. -
నేటి నుంచి రైల్వే గేటు మూసివేత
ఫిరంగిపురం: ఫిరంగిపురం నుంచి సత్తెనపల్లి వెళ్లే మార్గంలోని అల్లంవారిపాలెం వద్ద ఉన్న రైల్వేగేటు ఎల్సీ 298కి శనివారం నుంచి అత్యవసర మరమ్మతులు నిర్వహించనున్నట్లు రైల్వే శాఖ నల్లపాడు సీనియర్ సెక్షన్ ఇంజినీర్ పి. ఉమామహేశ్వరరావు శుక్రవారం ఒక ప్రటనలో పేర్కొన్నారు. మరమ్మతు పనుల్లో భాగంగా శనివారం నుంచి జూన్ మూడో తేదీ వరకు గేటు మూసివేస్తామన్నారు. ప్రత్యామ్నాయంగా ఆరోగ్యనగర్ వద్ద ఉన్న అండర్ పాస్ను వాహనదారులు వినియోగించుకోవాలని సూచించారు.రైల్వే గడ్డర్ను ఢీకొన్న భారీ వాహనంతాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం రైల్వే ట్రాక్ వద్ద ఏర్పాటుచేసిన రైల్వే గడ్డర్ను ఓ భారీ వాహనం ఢీకొట్టిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం రైల్వేట్రాక్ అండర్పాస్ వద్ద భారీ వాహనాల రాకపోకల నిషేధానికి ఏర్పాటు చేసిన రైల్వే గడ్డర్ను చూసుకోకుండా వాహన డ్రైవర్ ఢీకొట్టాడు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.యోగాతో సంపూర్ణ ఆరోగ్యంవీసీ ఆచార్య కె.గంగాధరరావుఏఎన్యూ: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందని వీసీ ఆచార్య కె గంగాధరరావు అన్నారు. యోగాంధ్రలో భాగంగా శుక్రవారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అధికారులు, సిబ్బంది, పరిశోధకులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం యూనివర్సిటీ యోగా సెంటర్లో యోగా సాధన చేశారు. వీసీ ఆచార్య కె గంగాధరరావు యోగా ఆవశ్యకతను తెలియజేశారు. ప్రతి ఒక్కరూ యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. యోగా ఆవశ్యకతను మనం గుర్తించడంతోపాటు, సమాజానికి అవగాహన కల్పించాలని సూచించారు. రిజిస్ట్రార్ ఆచార్య జి.సింహాచలం, ప్రిన్సిపాల్స్ ఆచార్య పీపీఎస్ పాల్ కుమార్, ఆచార్య పి సిద్దయ్య, దూరవిద్యా కేంద్రం డైరెక్టర్ ఆచార్య వి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
జీజీహెచ్లో అరుదైన శస్త్రచికిత్స
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్లో అరుదైన శస్త్రచికిత్స చేసి వృద్ధుడి ప్రాణాలు కాపాడినట్లు జనరల్ సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ ఏకుల కిరణ్కుమార్ చెప్పారు. శుక్రవారం జీజీహెచ్ జనరల్ సర్జరీ విభాగంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం మాదారం గ్రామానికి చెందిన పాలిపోగు ప్రసాద్ (62) రెండు నెలలుగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. తీవ్రమైన కడుపునొప్పి, కామెర్లు, చలిజ్వరం రావడంతో ఒంగోలులో 25 రోజులు చికిత్స తర్వాత గుంటూరు జీజీహెచ్కు వచ్చాడు. హైడాటిడ్ సిస్ట్ వ్యాధి (కాలేయంలో నీటిబుడ్డ)తో బాధపడుతున్నట్లు నిర్ధారించామన్నారు. కుక్కల వల్ల, కలుషిత నీటిని తాగడం వల్ల వ్యాధి వస్తుందన్నారు. కొన్నిసార్లు మాంసం పూర్తిగా ఉడకకుండా తినడం వల్ల కూడా వస్తుందని చెప్పారు. ప్రసాద్ కాలేయం, ఇతర అవయవాలకు ఇబ్బంది ఉండటంతో సర్జరీ చేశామని, దీనికి నాలుగు గంటల సమయం పట్టిందన్నారు. సుమారు 40 రోజులపాటు వార్డులో చికిత్స అందించి డిశ్చార్జి చేశామన్నారు. సుమారు రూ.10 లక్షల ఖరీదైన ఆపరేషన్ను ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా ఉచితంగా చేశామని తెలిపారు. ఆపరేషన్ ప్రక్రియలో వైద్యులు నాగ సంతోష్కుమార్, సాదిక్ బాషా, వేణుగోపాల్, మేఘన, అవిన్, హరి, పోలయ్య, శ్యాంసన్, శ్వేత, ప్రసాద్, హనుమంతరావు, నర్సింగ్ సిబ్బంది రాజ్యలక్ష్మి, స్రవంతి, అనిత, ఉష, నంద పాల్గొన్నట్లు వెల్లడించారు. వృద్ధుడి ప్రాణాలు కాపాడిన వైద్య బృందాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వీ రమణ అభినందించారు. -
ఎమ్మెల్సీ కార్యాలయంలో కారు చోరీ చేసిన దొంగ అరెస్టు
లక్ష్మీపురం: ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ కార్యాలయంలో కారు చోరీ చేసి పరారైన ఘటనలో వ్యక్తిని అరెస్ట్ చేసి కారును స్వాధీనం చేసుకున్నట్టు వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ కె.అరవింద్ తెలిపారు. వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ కె.అరవింద్ శుక్రవారం రాత్రి తెలిపిన వివరాల ప్రకారం... ఈనెల 28వ తేదీన కడప జిల్లా కలసపాడు మండలం ఎగువ రామాపురం గ్రామానికి చెందిన పనకనపల్లి రాంప్రసాద్ రెడ్డి 2009–2014 వరకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్కు చెందిన ఎన్ఆర్ఐ అగ్రిటెక్ కార్యాలయంలో డ్రైవర్గా పనిచేశాడు. అక్కడ నుంచి హైదరాబాద్లో ఓలా క్యాబ్, అలాగే మరి కొన్ని చోట్ల డ్రైవర్గా పనిచేసుకుంటూ జీవనం సాగించాడు. ఆర్థిక పరిస్ధితులు అనుకూలంగా లేని కారణంగా మరలా తిరిగి ఆలపాటి రాజేంద్రప్రసాద్ వద్ద పనిచేసేందుకు ఈనెల 28వ తేదీన గుంటూరు విద్యానగర్లోని రాజేంద్రప్రసాద్కు చెందిన ఎన్ఆర్ఐ అగ్రిటెక్ సంస్థకు చెందిన వైస్ చైర్మన్ సాంబశివరావు వద్దకు వచ్చి పని కావాలని అడిగాడు. ప్రస్తుతం పనిలేదని ఆయన చెప్పాడు. కొద్ది రోజుల తరువాత చూద్దాం అని చెప్పడంతో కడప నుంచి వచ్చానని, రెండు రోజుల ఇక్కడే ఉండి వెళ్తానని చెప్పాడు. గతంలో ఉన్న పరిచయాల వల్ల ఆఫీస్ వద్దనే ఉన్నాడు. అయితే అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో ఆలపాటి రాజేంద్రప్రసాద్ డ్రైవర్గా పని చేసే సంతవరపు నాగార్జున ఏపీ 07జెడ్ 2137 నంబర్ గల కారును కార్యాలయం వద్ద పార్కింగ్ ప్రదేశంలో పెట్టి తాళాలు కార్యాలయంలో పెట్టి వాచ్మెన్కు చెప్పి వెళ్లిపోయాడు. తరువాత రాత్రి ఒంటి గంట సమయంలో హైదరాబాద్ ఉన్న రాంప్రసాద్రెడ్డి కారును, వాచ్మన్ సెల్ఫోన్ను చోరీ చేసి పరారైయ్యాడు. దీంతో కారు డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ కె.అరవింద్, సీఐ గంగా వెంకటేశ్వర్లు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్న నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు గుజ్జనగుండ్ల సెంటర్ వద్ద వాహనాలు తనిఖీలు చేస్తున్న క్రమంలో చోరీ చేసిను కారులో ఉన్న రాంప్రసాద్రెడ్డి కారును ఆపి పారిపోయే ప్రయత్నం చేస్తున్న క్రమంలో పోలీసులు రాంప్రసాద్రెడ్డిని అదుపులోకి తీసుకుని కారును స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. హైదరాబాద్లోని అబ్దుల్లాపూర్ మెట్లో ఉన్న ప్రియురాలిని కలసి, కారు తిరిగిద్దామని వస్తున్న సమయంలో పోలీసులు పట్టుకున్నట్లు అంగీకరించాడు. పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు, క్రైం సిబ్బంది ఆంజనేయులు, ప్రసాదరావు, శ్రీనివాసరావును జిల్లా ఎస్పీ అభినందించారు. వివరాలు వెల్లడించిన వెస్ట్ డీఎస్పీ కె.అరవింద్ -
వైఎస్సార్ సీపీలో పదవుల నియామకం
పట్నంబజారు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురుని పలు పదవుల్లో నియమిస్తూ.. ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు శుక్రవారం కేంద్ర పార్టీ కార్యాలయం నుండి ఉత్తర్వులు జారీ అయ్యాయి. వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం జోనల్ అధ్యక్షుడిగా తాడికొండ నియోజకవర్గానికి చెందిన కళ్లం హరికృష్ణారెడ్డిని, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శిగా గుంటూరు తూర్పు నియోజకవర్గానికి చెందిన వేలూరి అనిల్రెడ్డి, చేనేత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మంగళగిరి నియోజకవర్గానికి చెందిన గంజి షణ్ముఖ్ (నాని)లను నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ప్రధానోపాధ్యాయులకు ఉద్యోగోన్నతి ధ్రువపత్రాలు అందజేత గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లాలోని జెడ్పీ, మున్సిపల్, నగరపాలకసంస్థ పాఠశాలల్లో ఉద్యోగోన్నతులపై నియమితులైన ప్రధానోపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక ధ్రువపత్రాలు అందజేశారు. శుక్రవారం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ నుంచి జనరేట్ అయిన ఉద్యోగోన్నతుల ధ్రువపత్రాలను హెచ్ఎంలకు అందజేశారు. కార్యక్రమంలో సీనియర్ హెచ్ఎం ఏ.తిరుమ లేష్, హెచ్ఎంగా ఉద్యోగోన్నతి పొందిన షేక్ మొహ్మద్ ఖాసిం పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో ఇరువురికి గాయాలు చెరుకుపల్లి: లారీ, బొలెరో వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. మోరవాగుపాలెం నుంచి చందోలు వైపు లారీ వస్తోంది. అదే సమయంలో మచిలీపట్నం నుంచి నెల్లూరు వైపునకు వెళ్తున్న బొలెరో చందోలు ఎన్ఎస్ఎల్ టెక్స్టైల్ సమీపంలోకి వచ్చింది. రెండూ ఎదురెదురుగా ఢీకొన్నాయి. బొలెరోలో ఉన్న డ్రైవర్ దుర్గారావుకు తీవ్రగాయాలు అయ్యాయి. క్లీనర్ చంద్రమౌళి స్వల్పగాయాలతో బయటపడ్డారు. -
తోడికోడళ్లకు మంత్రి మనోహర్ నివాళి
తెనాలిరూరల్: బాపట్ల జిల్లా కొరిశపాడు మండలంలోని మేదరమెట్ల సమీపంలోని జాతీయ రహదారిపై గురువారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో పట్టణానికి చెందిన తోడికోడళ్లు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. కన్నెగంటి సూర్యకుమారి, కన్నెగంటి సరస్వతి కుమారి, కన్నెగంటి ఝాన్సీరాణిల మృతదేహాలు శుక్రవారం సాయంత్రం తెనాలికి చేరుకున్నాయి. నందులపేటలోని కవిరాజ పార్కు రోడ్డులో అక్షరగీత విద్యానికేతన్ వద్ద బంధువుల సందర్శనార్ధం మృతదేహాలను ఉంచారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మృతదేహాలకు నివాళులర్పించి, కుటుంబసభ్యులను పరామర్శించారు. -
తల్లిదండ్రుల చేతుల్లోనే పిల్లల ఆరోగ్యం
● ఏసీబీ డైరెక్టర్ జయలక్ష్మి ● అండర్–16 టెన్నిస్ పోటీలు ప్రారంభం గుంటూరు వెస్ట్ (క్రీడలు): పిల్లలు శారీరకంగా, ఽమానసికంగా ధృఢంగా ఉండాలంటే క్రీడా సాధన ఎంతో కీలకమని ఏసీబీ డైరెక్టర్ ఆర్.జయలక్ష్మి తెలిపారు. ఇది పూర్తిగా తల్లిదండ్రుల చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక బీఆర్ స్టేడియం సింథటిక్ కోర్టులో అండర్–16 ఓపెన్ బాలబాలికల టెన్నిస్ పోటీలు ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జయలక్ష్మి మాట్లాడుతూ కొందరు తల్లిదండ్రులు చదువులకిచ్చే ప్రాధాన్యత పిల్లల ఆరోగ్యానికి ఇవ్వడం లేదన్నారు. దీంతో పిల్లల్లో అధిక శాతం ఊబకాయ సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. జంక్ ఫుడ్తోపాటు మొబైల్స్, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వీలైనంత వరకు వారికి దూరంగా ఉంచాలని సూచించారు. టెన్నిస్ విలువ తెలిసిన సీనియర్ ఆటగాడు ఎస్.రామకృష్ణ ఈ టోర్నమెంట్ను స్పాన్సర్ చేయడం అభినందనీయం అన్నారు. పోటీల నిర్వాహకుడు షేక్ అహ్మద్ మాట్లాడుతూ పోటీలు మూడు రోజులపాటు జరుగుతాయన్నారు. మొత్తం 36 మంది చిన్నారులు పాల్గొంటున్నట్లు తెలిపారు. అనంతరం పోటీలను జయలక్ష్మి,, రామకృష్ణ ప్రారంభించారు. కార్యక్రమంలో చీఫ్ కన్సర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ బీఎన్ఎన్ మూర్తి, రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ పి.శామ్యూల్ జొనాథన్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.నరసింహారెడ్డి, ఎన్.సాంబశివరావు, జీవీఎస్ ప్రసాద్ పాల్గొన్నారు. -
పొగాకు.. ఆరోగ్యానికి చేటు
● నేడు నో టుబాకో డే ● బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధం ● పొగాకు వినియోగంతో అనేక నష్టాలు ప్రకృతి వనరులను కాపాడుకోవాలి గుంటూరు మెడికల్: యవ్వనంలో సరదా కోసం మొదలుపెట్టే ధూమపానం చివరకు ప్రాణాలనే హరిస్తుంది. సిగరెట్, బీడీ, చుట్ట తాగే అలవాటు వ్యసనంలా మారి మనిషిని బానిసను చేసుకుంటుంది. స్మోకింగ్, పొగాకు ఉత్పత్తుల మోజులో పడి యువత భవిష్యత్తును అంధకారం చేసుకుంటోంది. క్యాన్సర్ వ్యాధిగ్రస్తులలో 40 శాతం మంది పొగతాగటం, పొగాకు ఉత్పత్తులు వాడటం ద్వారానే వ్యాధి బారిన పడి మరణిస్తున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. ధూమపానంతో కలిగే అనర్థాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని ప్రపంచ వ్యాప్తంగా మే 31వ తేదీన నో టుబాకో డేను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా‘ సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది. జిల్లాలో బాధితులు అధికమే... జిల్లా వైద్య ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం 35 శాతం మంది యువత ధూమపానం చేస్తున్నారు. వివిధ రోగాలతో 30 – 39 ఏళ్ల వయస్సు వారిలో చనిపోతున్న ప్రతి ఐదుగిరిలో ఒకరు పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్లేనని తేలింది. గుంటూరు జీజీహెచ్లో ప్రతి నెలా 1,200 మంది పురుషులు, 2 వేల మంది మహిళలు వివిధ రకాల క్యాన్సర్లతో చికిత్స పొందుతున్నారు. వీరిలో 40 శాతం మంది కేవలం పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల క్యాన్సర్ బారిన పడ్డారు. జిల్లాలో క్యాన్సర్ రోగులకు వైద్యసేవలు అందించేందుకు 15 ఆస్పత్రులు, క్లీనిక్లు ఉన్నాయి. వీటిల్లో రోజూ 400 మంది వరకు క్యాన్సర్ చికిత్స పొందుతున్నారు. చట్టం ఏం చెబుతోందంటే.. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధిస్తూ ప్రభుత్వం చట్టం చేసింది. ఈ చట్ట ప్రకారం రైల్వే స్టేషన్లు, సినిమా హాల్స్, బస్ స్టేషన్లు, జనసంచారం ఉండే మార్కెట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రాంతాల్లో ధూమపానం చేయకూడదు. ముఖ్యంగా పాఠశాలలు, గుడులకు సమీపంలో పొగాకు ఉత్పత్తులు అమ్మటం చట్టరీత్యా నేరం. 18 ఏళ్లలోపు పిల్లలకు పొగాకు ఉత్పత్తులు చట్టరీత్యా విక్రయించకూడదు. చట్టాన్ని అతిక్రమించిన వారికి జరిమానా విధిస్తారు. ప్రత్యేకంగా స్మోకింగ్ జోన్ ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల్లో మాత్రమే ధూమపానం చేసేందుకు అనుమతించాలి. పొగాకు వినియోగంతో క్యాన్సర్ క్యాన్సర్ చికిత్స కోసం వచ్చే వారిలో 40 శాతం మంది పొగాకు, దాని ఉత్పత్తుల వాడకం వల్ల క్యాన్సర్కు గురవుతున్నవారే. పొగతాగటం, పొగాకు ఉత్పత్తులైన ఖైనీ, గుట్కా, పాన్పరాగ్ వంటి వాటిని వినియోగించటం వల్ల నోరు, గొంతు, అన్నవాహిక, ఊపిరితిత్తులు, జీర్ణాశయం, మూత్రాశయ క్యాన్సర్ల బారిన పడుతున్నారు. ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు నేడు ఆధునిక వైద్య పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. చికిత్స తీసుకుని త్వరితగతిన వ్యాధి నుంచి కోలుకోవచ్చు. – డాక్టర్ ఎం.జి.నాగకిషోర్, సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్, గుంటూరు ధూమపానంతో గుండెజబ్బులు పొగతాగే వారిలో రక్తపోటు, గుండెపోటు, పక్షవాతం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పొగాకులో 400 రకాల విషపదార్థాలు ఉంటాయి. కార్బన్ మోనాకై ్సడ్ వల్ల గుండెపోటు, టార్ వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుంది. నపుంసకత్వం, పక్షవాతం పొగరాయుళ్లను వదలవు. పొగతాగే వారికి చుట్టుపక్కల ఉన్నవారిపై కూడా పొగాకు ప్రభావం ఉంటుంది. గుండె జబ్బులతో బాధపడుతూ వైద్యం కోసం వచ్చే వారిలో 70 శాతం మంది ధూమపానం చేసేవారే. – డాక్టర్ బొర్రా విజయ్చైతన్య, ఇంట్రవెన్షనల్ కార్డియాలజిస్ట్, గుంటూరు జీజీహెచ్ జీజీహెచ్లో ఉచిత కౌన్సెలింగ్ గుంటూరు జీజీహెచ్ మానసిక వ్యాధుల వైద్య విభాగంలో పొగాకు ఉత్పత్తుల అలవాటు మానేయాలనుకునే వారికి ఉచితంగా కౌన్సెలింగ్ చేసి, ఔషధాలు ఇస్తున్నారు. 2019 నుంచి డీ అడిక్షన్ సెంటర్లో చికిత్స అందిస్తున్నారు. గత ఏడాది 1,263 మందికి చికిత్స అందించడం ద్వారా కొంత మంది స్మోకింగ్ అలవాటు మానేశారు. స్మోకింగ్ అలవాటు ఉన్నవారికి ఛాతీ ముందు భాగంలో, భుజానికి, తొడకు.. ఇలా ఏదైనా ఒక ప్రదేశంలో వెంట్రుకలు లేని చోట నికోటిన్ ట్రాన్స్థర్మల్ ప్యాచ్ను అంటిస్తారు. ఈ ప్యాచ్ అంటించి కౌన్సెలింగ్ చేయడం ద్వారా ప్రతి నెలా పది మందికి పైగా పొగాకు వినియోగాన్ని పూర్తిగా మానివేస్తున్నట్లు గుర్తించామని సెంటర్ ఇన్చార్జి డాక్టర్ వడ్డాది వెంకట కిరణ్ తెలిపారు. -
ఏడాదిలోనే ప్రజావ్యతిరేకత
● జూన్ 4న ‘వెన్నుపోటు దినం’లో ప్రజలకు చేసిన మోసం బహిర్గతం చేయాలి ● నియోజకవర్గ ముఖ్యనేతల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు తెనాలి: రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంపై ఏడాదికాలంలోనే వ్యతిరేకత పెరుగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమం కన్నా అధికంగా ఇస్తామని చంద్రబాబు నాయుడు హామీనిచ్చారని, పవన్కల్యాణ్ భరోసానిచ్చారని గుర్తుచేశారు. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేదన్న భావనకు ప్రజలు వచ్చారని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాన్నీ, హామీలనిచ్చి మోసగించిన తప్పిదాన్ని ప్రతిపక్ష పార్టీగా వైఎస్సార్ సీపీ బహిర్గతం చేయాల్సి ఉందన్నారు. ఇందుకోసం పార్టీ పిలుపు మేరకు జూన్ 4న ‘వెన్నుపోటు దినం’ను విజయవంతం చేయాలని సూచించారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో జూన్ 4న జరగనున్న ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమంపై శుక్రవారం సాయంత్రం స్థానిక గంగానమ్మపేటలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటైన పార్టీ ముఖ్యనేతల సమావేశానికి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అధ్యక్షత వహించారు. ‘వెన్నుపోటు దినం’ పోస్టరును ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో 184 హామీలను ఇచ్చారనీ, పైగా ఇంకా సూపర్సిక్స్ ఉన్నాయని గుర్తుచేశారు. ‘బాబు ష్యూరిటీ–భవిష్యత్కు గ్యారెంటీ’ అన్నారని చెప్పారు. ఏ పథకాన్నీ అమలు చేయలేదని చెబుతూ అదేమంటే రూ.4 వేల పింఛను ఇస్తున్నామని వారే చెబుతున్నారని రాంబాబు అన్నారు. గ్యాస్బండకు డబ్బులు ఇచ్చామంటున్నా 1.49 కోట్ల కనెక్షన్లు ఉంటే 30–40 వేలకు మించి ఇవ్వలేదన్నారు. కార్యకర్తల నుండి పెద్ద నాయకుల వరకు అందరిపైనా కేసులు పెట్టటం, జైళ్లకు పంపటం, బెయిలు రాకుండా చేస్తూ భయపెట్టాలని చూడటం మినహా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు. చంద్రబాబునాయుడు గతంలో ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిస్తే, ఇప్పుడు మరో రెండు పార్టీలతో కలిసి ప్రజలకు వెన్నుపోటు పొడిచారని వ్యాఖ్యానించారు. అమ్మ ఒడికి పేరు మార్చి తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఏటా రూ.15 వేలు ఇస్తామన్నారని, రైతుభరోసా కూడా లేదన్నారు. ఏ పంటకూ గిట్టుబాటు ధరలు లేవన్నారు. విజయవంతానికి కార్యాచరణ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ తెనాలిలో జూన్ 4న ఉదయం 10 గంటలకు మార్కెట్ సెంటర్ నుంచి సబ్కలెక్టర్ కార్యాలయం వరకు వెన్నుపోటు దినం నిరసన ప్రదర్శన జరుగుతుందని చెప్పారు. విజయవంతానికి కార్యాచరణను రూపొందిస్తున్నామని తెలిపారు. పార్టీ గుంటూరు పార్లమెంటు పరిశీలకుడు పోతిన మహేష్ మాట్లాడుతూ చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పాలనలో ఏవిధంగా మోసపోయామన్న భావన ప్రజల్లో ఉందని చెప్పారు. జగన్మోహన్రెడ్డి పాలనలో ఎటువంటి లబ్ధి కలిగిందీ, ఎలా జీవనప్రమాణాలు పెరిగాయి? చంద్రబాబు హామీలను అమలుచేయకుండా ఏవిధంగా మోసం చేసిందీ స్పష్టంగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. మున్సిపల్ చైర్పర్సన్ అత్తోట నాగవేణి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లిముంత పోతురాజు, గుంటూరు జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు గెడ్డటి సురేంద్ర, అధికార ప్రతినిధి కొడాలి క్రాంతి, తెనాలి పట్టణ, రూరల్ మండల, కొల్లిపర మండలాల అధ్యక్షులు దేసు శ్రీనివాసరావు, చెన్నుబోయిన శ్రీనివాసరావు, కల్లం వెంకటప్పారెడ్డి, కొర్ర యశోద, మైనారిటీ విభాగం అధ్యక్షుడు షేక్ దుబాయ్బాబు మాట్లాడారు. ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, పార్టీ సీనియర్ నేతలు మర్రెడ్డి బ్రహ్మారెడ్డి, భీమవరపు సంజీవరెడ్డి, తాడిబోయిన రమేష్, జొన్నల శివారెడ్డి, బొంతు నరేంద్రరెడ్డి, బూరెల దుర్గాప్రసాద్, పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆళ్ల ఉత్తేజ్రెడ్డి, ఈద యశ్వంత్రెడ్డి, కుర్రా జస్వంత్, బండ్లమూడి నాని, తదితరులు పాల్గొన్నారు. అక్కిదాసు కిరణ్ స్వాగతం పలికారు. ఆయా కమిటీల పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంపై -
బిల్లుల్లోనూ పచ్చపాతం
నెహ్రూనగర్: జనవరి 10వ తేదీన గుంటూరులో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు వచ్చారు. ఆయన పర్యటించే ప్రాంతం ఇన్నర్ రింగ్ రోడ్డు నుంచి చేబ్రోలు హనుమయ్య కంపెనీ వరకు రోడ్లు అందంగా కనిపించేందుకు షో మొక్కలు తూర్పుగోదావరి జిల్లా కడియం నుంచి రూ.35 లక్షలు వెచ్చించి తెప్పించారు. ఎన్ని తెప్పించారో.. ఎన్ని ఉన్నాయో నేటికీ నగరపాలక సంస్థ అధికారుల వద్ద లెక్క లేదు. అధికారులు చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ మొక్కలు ఎక్కడున్నాయో ఎవరికి తెలియదు. కొన్ని మొక్కలు ఎండిపోయాయి. దీనిపై సాక్షిలో ఏప్రిల్ 13వ తేదీన ‘ఎండిన మొక్కలు..తేలని లెక్కలు’ పేరిట కథనం ప్రచురితమైంది. సోషల్ మీడియాలో కూడా ఈ విషయం వైరల్గా మారింది. దీంతో ఎక్కడ ఈ బిల్లు ఆపితే ఎటువంటి ఇబ్బందులు వస్తాయో అని అప్పుడు ఏడీహెచ్గా పనిచేసిన శ్రీనివాస్ను సరెండర్ చేసి మరీ సదరు బిల్లు రూ.35 లక్షలు ప్రాసెస్ చేసినట్లు సమాచారం. ఖర్చుల బిల్లు వస్తే ఒట్టు 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎలక్షన్ రోజు పోలింగ్, తర్వాత కౌంటింగ్ కేంద్రాల వద్ద టెంట్లు, బ్యారికేడింగ్, డిపార్ట్మెంట్ సిబ్బందికి సంబంధించిన భోజనాలు, టీ, కాఫీలు, స్నాక్స్, ఇతర స్టేషనరీ వంటి పనులు కాంట్రాక్టర్లు సుమారు 1.50 కోట్ల వర్కులు ఇంజినీరింగ్ అధికారుల హాహీతో చేపట్టారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ బిల్లులను అధికారులు ప్రాసెస్ చేయకుండా పక్కన పెట్టారని పలువురు కాంట్రాక్టర్లు వాపోతున్నారు. వడ్డీలకు తీసుకొచ్చి... కొంతమంది కాంట్రాక్టర్లు బ్యాంకుల్లో స్థలాలు, ఇళ్లు తనాఖాలు పెట్టి పనులు చేశారు. ఆ వర్కులకు బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో బ్యాంకుల్లో తీసుకున్న రుణానికి వడ్డీ పడుతోంది. మరికొంత మంది కాంట్రాక్టర్లు బయట వ్యక్తుల వద్ద నుంచి వడ్డీ కట్టాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. దీని వలన తాము అప్పుల్లో కూరుకుపోతున్నామని బహిరంగంగానే వాపోతున్నారు. ఏదో విధంగా బిల్లు ప్రాసెస్ చేయించాలని ఇంజినీరింగ్ అధికారులను వేడుకుంటున్నారు. సిఫార్సులు.. పర్సంటేజీలు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత సర్కారు హయాంలో చేసిన వర్కుల బిల్లులు ప్రాసెస్ చేయడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత చేసిన వర్కులకు మాత్రమే బిల్లులు ప్రాసెస్ అవుతున్నట్లు కాంట్రాక్టర్లు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఎవరైపా వడ్డీలు కట్టుకోలేక ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఎంతకొంత ముట్టజెప్పి సిఫార్సు చేయించుకుంటున్నారు. ఇక్కడ నగరపాలక సంస్థ అధికారులు కూడా పర్సంటేజీ ఇస్తేనే బిల్లు ప్రాసెస్ చేస్తామని చెబుతున్నారు. చేసేదేమీ లేక అధికారులు అడిగినంత ఇచ్చుకుని ప్రాసెస్ చేయించుకుంటున్నారు కాంట్రాక్టర్లు. బిల్లుల ప్రాసెసింగ్లో మున్సిపల్ అధికారుల తీరిది తమ అనుకునే వారికి మాత్రమే అత్యధిక ప్రాధాన్యత అవసరం లేదనుకున్న వారికై తే నెలల తరబడి పెండింగ్ ఇటీవల సీఎం పర్యటనకు రూ.35 లక్షల విలువైన మొక్కలు ఎక్కడున్నాయో.. ఏమైపోయాయో కూడా తెలియని దుస్థితి రూ.35 లక్షల బిల్లు ఆగమేఘాలపై ప్రాసెస్ పూర్తి ఇంకా పెండింగ్లోనే ఏడాది క్రితం ఎన్నికల ఖర్చు బిల్లులు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల్లో ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారు. తమ అనుకునే కాంట్రాక్టర్ల బిల్లు ప్రాసెస్ చేయడంలో చూపుతున్న ఉత్సాహం మాటల్లో చెప్పలేనిది. మిగతా కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపుల్లో మొండి చేయి చూపుతున్నారనేది జగమెరిగిన సత్యం. గత ప్రభుత్వంలో రూ.కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లలో కొంత మందికి బిల్లులు చెల్లింపులు జరపకుండా తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులకు పర్సంటేజ్ రూపంలో ముడుపులు సమర్పించుకుంటే ఎప్పటి బిల్లు అయినా ప్రాసెస్ చేస్తున్నారని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. కమిషనర్ ఆదేశాల మేరకే చెల్లింపులు ఎవరైనా కాంట్రాక్టర్ అత్యవసరం అని అడిగితే సదరు బిల్లుల చెల్లింపులు కమిషనర్ ఆదేశాల మేరకు ప్రాసెస్ చేస్తున్నాం. – నమ్రత్కుమార్, అకౌంటెంట్ -
ఉచిత మోడల్ లాసెట్ పోస్టర్ ఆవిష్కరణ
నగరంపాలెం: లాసెట్ అభ్యర్థులకు ఉచిత మోడల్ లాసెట్ ఎంతగానో ఉపయోగకరమని డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రొసిక్యూషన్ ఎండీ.బర్కత్ అలీ అన్నారు. ఏపీ బీసీ అడ్వకేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఉచిత మోడల్ లాసెట్ పోస్టర్ను గురువా రం నగరంపాలెంలోని ఆయన కార్యాలయంలో అడిషనల్ పబ్లిక్ ప్రాసెక్యూటర్స్ పల్లపు కృష్ణ, బి.కోటేశ్వరరావు, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు, స్పాట్స్ అండ్ కల్చరల్ కార్యదర్శి ఎ.శేషగిరిరావులు ఆవిష్కరించారు. శేషగిరిరావు మాట్లాడుతూ ఈ పరీక్షను జూన్ ఒకటిన గుంటూరు శ్యామలానగర్ ఒకటో వీధిలోని మాంటిస్సోరి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నిర్వహిస్తామని అన్నా రు. ఉదయం పది గంటలకు పరీక్ష మొదలువుతుందని, మరిన్ని వివరాలకు 8297483785 నంబర్కు సంప్రదించాలని తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు కొండవీటి శ్రీనివాసరావు, కె.వీరభాస్కర్, న్యాయవాదులు కె.నారాయణ చిన్న, జి.కోటేశ్వరరావు పాల్గొన్నారు. హత్య కేసులో రిమాండ్ బల్లికురవ: మండలంలోని కొమ్మినేనివారి పాలెంలో గత ఏడాది అక్టోబర్ 4న జరిగిన హత్య కేసులో నిందితుడు పి. నారాయణరెడ్డికి అద్దంకి కోర్టు న్యాయమూర్తి బుధవారం 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్సై వై. నాగరాజు తెలిపారు. -
గోళ్లమూడి చెరువును మోడల్గా అభివృద్ధి చేయాలి
పెదకాకాని: గోళ్లమూడి తాగునీటి చెరువును మోడల్గా అభివృద్ధి చేయాలని ఉపాధి హామీ పథకం రాష్ట్ర సంచాలకులు వైవీ షణ్ముఖకుమార్ అన్నారు. పెదకాకాని మండలం గోళ్లమూడి, ఉప్పలపాడు గ్రామాల్లో ఎన్ఆర్ఈజీఎస్ పథకం నిర్వహణ పరిశీలన కోసం గురువారం రాష్ట్ర బృందం పర్యటించింది. ఆయన మాట్లాడుతూ గోళ్లమూడిలోని తాగు నీటి చెరువును పల్లె పుష్కరిణి కింద చేపట్టి అభివృద్ధి చేయాలని సూచించారు. తాగునీటి అవసరాలపై గ్రామస్తులతో మాట్లాడారు. అనంతరం ఉప్పలపాడులో పంట కుంట(ఫాం పాంట్స్) తవ్వుతున్న తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. శ్రామికులకు రోజువారి వేతనం కనీసం రూ.290 ఉండేలా చూ డాలన్నారు. పంట కుంట నిర్మాణం చేపట్టిన రైతులతో మాట్లాడి సూచన చేశారు. కుంట కట్టలపై పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు పెంచడం ద్వారా ఆదాయాన్ని పొందవచ్చన్నారు. చేపల పెంపకం కూడా చేపట్టవచ్చన్నారు. అనంతరం లాలుపురం గ్రామంలో పర్యటించారు. ఉపాధి హామీ పథకం రాష్ట్ర సంచాలకులు షణ్ముఖకుమార్ గోళ్లమూడి, ఉప్పలపాడు గ్రామాలు సందర్శన -
జీఎస్టీతో వేగంగా ఆర్థికాభివృద్ధి
లక్ష్మీపురం: వస్తు సేవల పన్నుతో దేశం వేగంగా ఆర్థికంగా ముందుకు వెళుతుందని, పన్ను వ్యవస్థ పూర్తిగా చక్కబడిందని సెంట్రల్ జీఎస్టీ కమిషనర్ సుజిత్ మల్లిక్ అన్నారు. గురువారం గుంటూరు కన్నవారితోటలోని జీఎస్టీ భవన్లో ప్రీ జీఎస్టీ డే వేడుక నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ జీఎస్టీతో పన్నులను అంగీకరించే సమాజం ఏర్పడిందన్నారు. పన్ను చట్టాల్లో పారదర్శకత పెరగటమే కాకుండా, పన్ను అధికారులకు, పన్ను చెల్లింపుదారుల మధ్య స్నేహభావం ఏర్పడిందన్నారు. ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడం, పన్ను చెల్లింపులు పెంచడం వంటి అంశాలలో జీఎస్టీ ప్రాధాన్యతను వివరించారు. జీఎస్టీ విజయవంతంగా అమలు కావడంలో పరిశ్రమ భాగస్వాముల సహకారాన్ని అభినందించారు. జీఎస్టీ అడిషనల్ కమిషనర్ బి.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ జీఎస్టీ ప్రయాణాన్ని గుర్తుచేసే ఒక ముఖ్యమైన కార్యక్రమంగా ఈ వేడుక నిర్వహిస్తున్నామన్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర అధ్యక్షుడు భాస్కరరావు మాట్లాడుతూ జీఎస్టీ ప్రారంభంలో తెలియక చాలా మంది వ్యాపారులు తమ రిటన్స్లో తప్పుడు వివరాలు నమోదు చేశారని, ప్రస్తుతం జీఎస్టీ ఆడిట్లో అవన్నీ పట్టుబడుతున్నాయన్నారు. అవి కావాలని చేసిన తప్పులు కావన్నారు. నేషనల్ కనూ్స్య్మర్స్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు చదలవాడ హరిబాబు మాట్లాడుతూ ప్రాణ రక్షణ కోసం వాడే మందులపై జీఎస్టీని తక్షణమే తీసివేయాలన్నారు. చేనేత మగ్గాలపై విధించే ఐదు శాతం పన్నును కూడా రద్దు చేయాలన్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అధ్యక్షుడు యేల్చూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జీఎస్టీపై వ్యాపారుల ఇబ్బందులను ప్రతి మూడు నెలలకొకసారి అధికారులు సమీక్ష చేయాలన్నారు. ఇండియన్ టెక్స్టైల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి మాట్లాడుతూ జీఎస్టీ రేట్లలో రెండు స్లాబులే ఉండాలని సూచించారు. పలువురు పరిశ్రమ ప్రతినిధులు జీఎస్టీ అంశాలపై తమ అభిప్రాయాలను తెలిపారు. కమిషనర్ సుజిత్ మల్లిక్ను ట్రేడ్ వర్గాల వారు సన్మానించారు. కార్యక్రమంలో జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్లు ఎం.నాగరాజు, బి.రవికుమార్, వి. వెంకటేశ్వరరావు, మనోజ్ కుమార్, మరియదాసు, రాయలు, ఆనందరావు, చాంబర్ మాజీ అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ జీఎస్టీ కమిషనర్ సుజిత్ మల్లిక్ -
తప్పిపోయిన చిన్నారి
మంగళగిరి టౌన్ ః ఇంటి వద్ద ఆడుకుంటూ తప్పిపోయిన ఓ చిన్నారిని కేవలం గంట వ్యవధిలోనే తల్లిదండ్రులకు అప్పగించిన ఘటన మంగళగిరిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంగళగిరి అజయ్నగర్కు చెందిన తేజస్విని అనే పాప ఇంటి వద్ద ఆడుకుంటూ తప్పిపోయి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఏడుస్తూ కనిపించింది. అదే సమయంలో విధుల్లో ఉన్న సీఐ వినోద్ కుమార్ కంటపడింది. వెంటనే చిన్నారి వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. అజయ్నగర్ అని, తండ్రి పేరు విజయ్ అని చెప్పడంతో ఆ చిన్నారిని తీసుకుని అజయ్నగర్లోని పాప నివాసానికి వెళ్లి తేజస్విని తండ్రికి అప్పగించారు. తప్పిపోయిన చిన్నారి సురక్షితంగా ఇంటికి రావడంతో సిఐ వినోద్కుమార్కు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. గంట వ్యవధిలో తల్లిదండ్రులకు అప్పగింత -
పవిత్ర పూజాక్షేత్రంగా ఓంకారాశ్రమం
తెనాలి: ఆంధ్యా ప్యారిస్ తెనాలిలోని బుర్రిపాలెంరోడ్డులో తొమ్మిది దశాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన ఓంకారాశ్రమం ఇప్పుడు పవిత్ర పూజాక్షేత్రంగా భక్తులకు అందుబాటులోకి వచ్చింది. రూ.కోట్ల విలువైన ఆస్తులున్నా స్వార్థపరుల కారణంగా కునారిల్లుతూ వచ్చిన ఆశ్రమమిది. ఆశ్రమ స్థలాన్ని పవిత్ర సందర్శనీయ స్థలంగా చేయాలని గత ప్రభుత్వ హయాంలో దేవదాయశాఖ సంకల్పించింది. అప్పటి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చొరవతో నిధులు మంజూరయ్యాయి. ఫలితంగానే ఇప్పుడు ఆశ్రమ స్థలంలో పరివార దేవతా, శిఖర, ధ్వజస్తంభ, శ్రీశరభ సాళ్వేశ్వరస్వామి, శ్రీపార్వతీ సమేత శ్రీఓంకారేశ్వరస్వామి వార్ల ఆలయం నిర్మించారు. ప్రతిష్టా మహోత్సవాలు గురువారం నుంచి ఆరంభించారు. తెనాలి బుర్రిపాలెంరోడ్డులోని ఓంకారాశ్రమం 1932లో ఏర్పాటైంది. కాకుమాను శ్రీరాములు అనే ఆధ్యాత్మిక చింతనాపరుడు ఆశ్రమాన్ని స్థాపించారు. సాధువులు ధ్యానం చేసుకునేందుకు, వారి పోషణ కోసమనే భావనతో ఏర్పాటైన ఆశ్రమానికి అప్పట్లో శ్రీవ్యాస ఆశ్రమ నిర్వాహకుడు మలయాళస్వామి శంకుస్థాపన చేశారు. ఆశ్రమం తరపున పేదలకు వైద్యం, విద్యార్థులకు విద్య కోసమని దాతలు 12.83 ఎకరాల మాగాణి భూమిని సమకూర్చారు. దాతల లక్ష్యం నిర్విఘ్నంగా నెరవేరింది. యజ్ఞయాగాది క్రతువులు వైభవంగా జరిగాయి. అప్పట్లో ఆశ్రమానికి స్వామీజీలు ట్రస్టీలుగా ఉండేవారు. 1947–1963 మధ్య ఆశ్రమానికి గల మాగాణి భూమిని విక్రయించారు. ఆ డబ్బుతో గంగానమ్మపేటలో ఉన్న శ్రీవేణుగోపాలస్వామి గుడి వీధిలో రెండు ఇళ్లు, చెంచుపేటలోని గోడౌన్ కొనుగోలు చేశారు. ట్రస్టీల వ్యవహారంలో వివాదాలు మలయాళస్వామి మరణంతో ఆశ్రమ ట్రస్టీల వ్యవహారంలో వివాదాలు మొదలయ్యాయి. 1980 వరకు పరంపరగా సాగాయి. అనంతరం ట్రస్టీలు ఏర్పాటైనా 1996లో ఆశ్రమ నిర్వహణ దేవదాయ, ధర్మదాయశాఖ పరిధిలోకి వెళ్లింది. అప్పట్నుంచి అభివృద్ధి శూన్యమైంది. పైగా 1983లో ఆశ్రమంలో గల ధ్యానమందిరాన్ని కూల్చారు. 1998లో ఆశ్రమ స్థలంలోని 80 సెంట్ల స్థలాన్ని ఓ ప్రైవేటు విద్యాసంస్థకు లీజుకిచ్చారు. కోర్టు వివాదంతో ప్రైవేటు విద్యాసంస్థకు లీజు ఆగిపోయింది. లాడ్జికి అద్దెకు ఇచ్చిన భవనం శ్రీవేణుగోపాలస్వామి గుడి వీధిలోని భవనాన్ని గతంలో కొంతకాలం లాడ్జికి అద్దెకిచ్చారు. కొన్ని నెలలు రిక్రియేషన్ క్లబ్ కూడా నడిచింది. దేవదాయశాఖ చర్యలతో ఏడాదికి రూ.5.23 లక్షల వరకు ఆదాయం సమకూరుతోంది. ఆశ్రమానికి 2022లో అవుతు శ్రీనివాసరెడ్డి ఈవోగా వచ్చారు. వేలం ఆదాయం పెరిగేలా చూశారు. అప్పట్నుంచి ఏడాదికి రూ.7 లక్షలకు పైగా ఆదాయం లభిస్తోంది. నిరుపయోగంగా ఉన్న ఆశ్రమ స్థలాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చేందుకు చేసిన కృషి ఫలించింది. 1.40 ఎకరాల ఆశ్రమం స్థలం ముందుభాగంలో ఆలయం నిర్మాణానికి 2023 డిసెంబరులో శంకుస్థాపన చేశారు. దేవదాయశాఖ రూ.26.66 లక్షలు, ఆశ్రమ నిధులు రూ.13.34 లక్షలు, దాతల సహకారంతో నిర్మాణం పూర్తయింది. రేపు ప్రతిష్టా మహోత్సవం ఈనెల 31వ తేదీన ఉదయం 8.19 గంటలకు ప్రతిష్టా మహోత్సవం జరగనుంది. గురువారం వేదస్వస్తి పూర్వకంగా యాగశాల ప్రవేశం చేసి, సంప్రదాయ పూజలను ఆరంభించారు. రెండురోజుల పూజల అనంతరం 31న యంత్రబింబ, ధ్వజ ప్రతిష్టలు, కళాన్యాసము, ప్రాణప్రతిష్ట జరుగుతాయి. ప్రతిష్టా కార్యక్రమాల్లో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, దేవదాయశాఖ డీసీ కె.బసవ శ్రీనివాసరావు పాల్గొంటారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ ఉంటుందని ఈఓ అవుతు శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆశ్రమంలో ఓంకారేశ్వరస్వామి ఆలయం ఆరంభమైన ప్రతిష్టా మహోత్సవాలు -
రహదారి విస్తరణకు సర్వే ప్రారంభించాలి
ఇన్చార్జి జిల్లా కలెక్టర్ ఎ.భార్గవ్తేజ గుంటూరు వెస్ట్: జాతీయ రహదారి 544ని వినుకొండ నుంచి గుంటూరు వరకు నాలుగు లైన్లుగా విస్తరించేందుకు జిల్లా పరిధిలోని జాయింట్ మేనేజ్మెంట్ సర్వేను వెంటనే ప్రారంభించాలని ఇన్చార్జి జిల్లా కలెక్టర్ ఎ.భార్గవ్తేజ అన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో నిర్వహించిన అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాకు సంబంధించి మేడికొండూరు, ఫిరంగిపురం మండలాల పరిధిలో ఈ రోడ్డు 18 కిలో మీటర్ల వరకు ఉంటుందన్నారు. రహదారి విస్తరణకు సంబంధించి ఇప్పటికే భూ సేకరణకు నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. దీనిపై వచ్చిన రెండు అభ్యంతరాలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూ సేకరణ పరిధిలో ఉన్న విద్యుత్ స్తంభాలు పక్కకు జరపడంతోపాటు పైపులైనులు, కాలువలకు అంచనాలు తయారు చేయాలని పేర్కొన్నారు. డీఆర్వో షేక్ ఖాజావలి, ఆర్డీవో కె.శ్రీనివాసరావు, ఎన్హెచ్ పీడీ పార్వతీశం పాల్గొన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సహించండి జిల్లాలోని పారిశ్రామికవేత్తలను ప్రొత్సహించేందుకు ప్రతి నియోజకవర్గంలోనూ ఎంఎస్ఎంఈ క్లస్టర్ డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఇన్చార్జి జిల్లా కలెక్టర్ ఎ.భార్గవ్తేజ తెలిపారు. గురువారం స్థానిక కలెక్టర్ డీఆర్సీ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా ఇండస్ట్రియల్, ఎక్స్పోర్టు ప్రమోషన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. -
తోడికోడళ్ల మృతితో తెనాలిలో విషాదం
తెనాలి రూరల్: అరుణాచలేశ్వరుని దర్శనం కోసం బయలుదేరిన తోడికోడళ్లు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తెనాలిలో విషాదం అలుముకుంది. ఎంతో ఆప్యాయంగా ఉండే తోడికోడళ్ల బంధం మరణంలోనూ వీడలేదు. పట్టణానికి చెందిన కన్నెగంటి సూర్యకుమారి, కన్నెగంటి సరస్వతి కుమారి, కన్నెగంటి ఝాన్సీరాణిలు తోడికోడళ్లు. ఝాన్సీరాణి కుమారుడు నాగార్జున, ఆడపడుచు పార్వతితో కలిసి వీరు ముగ్గురు గురువారం అరుణాచలానికి కారులో పయనమయ్యారు. బాపట్ల జిల్లా కొరిశపాడు మండలంలోని మేదరమెట్ల సమీపంలోని జాతీయ రహదారిపై వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురవడంతో ఝాన్సీరాణి అక్కడికక్కడే మృతి చెందింది. గాయాలపాలైన నలుగురిని ఒంగోలు వైద్యశాలకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ సూర్యకుమారి, సరస్వతికుమారి కూడా ప్రాణాలు కోల్పోయారు. సూర్యకుమారి తన భర్త నరసింహారావుతో కలిసి ఇక్కడి కవిరాజపార్కు రోడ్డులో అక్షర గీత విద్యానికేతన్ను స్థాపించారు. సరస్వతికుమారి భర్త వెంకటేశ్వరరావు ఆర్మీలో పని చేసి రిటైరై తెనాలిలో రెడీమేడ్ దుస్తుల వ్యాపారం ప్రారంభించారు. ఝాన్సీరాణి భర్త నాగేశ్వరరావు గాంధీచౌక్లో పారగాన్ వాచ్ కంపెనీ నిర్వహించేవారు. ముగ్గురు అన్నదమ్ములు గతంలోనే మృతి చెందారు. ఆప్యాయంగా ఉండే తోడి కోడళ్లు అరుణాచలం దర్శనం కోసం వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తమ ఆడపడుచు పార్వతిని వెంటబెట్టుకుని ఝాన్సీరాణి కుమారుడు నాగార్జునతో కలిసి తమకు తెలిసిన వారి కారు తీసుకుని బయలుదేరారు. రోడ్డుప్రమాదం రూపంలో వీరి కుటుంబాలను మృత్యువు కబళించింది. సూర్యకుమారికి ఇద్దరు కుమారులు ఉండగా. తెనాలి ప్రభుత్వ వైద్యశాల సమీపంలో తన కుటుంబంతో నివాసం ఉంటోంది. సరస్వతికుమారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కవిరాజపార్కు రోడ్డులో నివసిస్తున్నారు. ఝాన్సీరాణి పెద్దకుమారుడు గతంలో మృతి చెందగా, ప్రస్తుతం సుల్తానాబాద్ ఆలపాటి నగర్లోని సాయిబాబా ఆలయం వద్ద సాయి పథం అపార్ట్మెంట్లో చిన్న కుమారుడు నాగార్జున కుటుంబంతో కలసి నివసిస్తున్నారు. బాపట్ల జిల్లాలో కారు ప్రమాదం ముగ్గురు మృత్యువాత -
కార్మికులంటే అలుసు
చంద్రబాబునాయుడు ఏ రోజూ కార్మికులకు మేలు చేసింది లేదు. కార్మికులంటే ఆయనకు ఎప్పుడూ అలుసే. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏడాది గడస్తున్నా.. ఒక్కటి కూడా అమలు చేయలేదు. పైగా ఫైన్లు పెరిగిపోవటం, చలనాలు, జరిమానాలు కట్టలేక ఇబ్బందులకు గురవుతున్నాం. మా సంక్షేమం కోసం ఏ రోజూ ఆలోచించలేదు. ఎన్నికల సమయంలో చెప్పినట్లుఏటా రూ.15 వేల ఆర్థిక సాయం, 21, 31 జీవోల రద్దు, పీఎఫ్, ఈఎస్ఐతో కూడిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. – మొగిలి పుల్లారావు (డ్రైవర్) -
వైఎస్సార్ వాహన మిత్ర పథకాన్ని గాలికొదిలేసిన కూటమి సర్కార్
పట్నంబజారు: గుంటూరు జిల్లా వ్యాప్తంగా సుమారు 25 వేల ఆటోలు, 10 వేల వరకు కార్లు (ట్యాక్సీ ప్లేట్) ఉన్నాయి. 2019–24 మధ్య ఈ కార్మికులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంతో అండగా నిలిచింది. ప్రతి ఆటో, ట్యాక్సీ, క్యాబ్, మాక్సీ డ్రైవర్లకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించింది. వారిని అన్ని విధాలుగా ఆదుకుంది. వైఎస్సార్లో... ఎస్ అనే అక్షరాన్ని శ్రామికులకు అంకితం చేసిన ఘనత వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కుతుంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కార్మికులకు అండగా తాను ఉంటూ భరోసా కల్పించారు. రూ.10 వేలు ఏటా అందజేసి కార్మిక కుటుంబాలకు అండగా నిలబడ్డారు. వైఎస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా డ్రైవరన్న సంక్షేమానికి తోడ్పాటు అందించారు. ఏడాదికి రూ.10 వేలు అందించటం ద్వారా ఆటోడ్రైవర్లు, కార్ డ్రైవర్లకు ఫిట్నెస్ సర్టిఫికెట్ (ఎఫ్పీ), ఇన్సూరెన్స్, ఇతరత్రా అవసరాలకు ఎంతగానో ఉపయోపడేది. దీంతో పాటుగా నవరత్నాలకు సంబంధించి అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రీయంబర్స్మెంట్తోపాటు అనేక సంక్షేమ పథకాలు ప్రతి డ్రైవరన్న ఇంటి ముంగిటకు తీసుకెళ్లిన ఘనత వైఎస్సార్ సీపీ ప్రభుత్వానిదే. 2024 ఎన్నికల్లో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లతోపాటు హెవీ, టిప్పర్ లైసెన్స్లు ఉన్న వారికి రూ ఏడాది రూ.15వేలు ఇస్తామని చంద్రబాబు ఎన్నికల్లో చెప్పారు. కూటమి పాలన ఏడాది పూర్తి కావస్తున్నా కనీసం ఒక్క రూపాయి కూడా ఏ ఒక్కరికీ అందజేసిన పాపాన పోలేదు. చాలామంది ఉద్యోగాలు లేక స్వయం ఉపాధి కింద ఆటోలు, వ్యాన్లు, కార్లు, జీపులు వంటి వాహనాలను ప్రైవేట్ ఫైనాన్స్ల నుంచి అప్పు చేసి మరీ తీసుకుని నడుపుతున్నారు. ఇలా ప్రభుత్వానికి రూ.కోట్లు పన్నులు చెల్లిస్తూ తమ కుటుంబాలను పోషించుకుంటున్న డ్రైవర్ల సంక్షేమాన్ని విస్మరించిన చంద్రబాబు ప్రభుత్వంపై వారు మండిపడుతున్నారు. ఒకవైపు భారీగా పెరిగిన నిత్యావసర సరకుల ధరలు, మరోవైపు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా మారింది. ఎన్నికల సమయంలో జీవో నెంబర్ 21 రద్దు చేసి, వాహనదారులపై పడుతున్న గ్రీన్ ట్యాక్స్ను కూడా తగ్గిస్తామని కూటమి చెప్పింది. అధికారంలో వచ్చిన తరువాత కూడా 21, 31 నంబరు జీవోలతో భారీ జరిమానాలతో తమకు వస్తున్న అంతంత మాత్రం ఆదాయంలో చాలా వరకు నష్టపోతున్నామని డ్రైవర్లు, మోటారు వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.భారీగా జరిమానాకేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్రంలో అమలు చేస్తున్న జీవో నంబరు 21తో డ్రైవర్లపై భారీ జరిమానాలు విధిస్తూ ఆర్థికంగా నడ్డి విరుస్తున్నారు. గతంలో డ్రైవింగ్ లైసెన్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్, పాల్యూషన్, ఇన్సూరెన్స్ లేకపోతే రూ.500 నుంచి రూ.750 వరకు జరిమానాలు విధించేవారు. ప్రస్తుతం జీవో నంబరు 21 వచ్చాక డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే రూ.5 వేలు, పర్మిట్ లేకపోతే రూ.10 వేలు, ఇన్సూరెన్సు లేకుంటే రూ.3 వేల నుంచి రూ.5 వేలు, పొల్యూషన్ సర్టిఫికెట్ లేకపోతే రూ.3 వేల నుంచి రూ.5 వేలు, ఫిట్నెస్ లేకపోతే రూ.5 వేలు జరిమానా విధిస్తున్నారు. దీంతో రవాణా రంగంతోపాటు, డ్రైవర్లపైనా పెనుభారం పడుతోంది.వైఎస్సార్ సీపీ హయాంలో......వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఐదేళ్లపాటు కార్మికులకు ప్రభుత్వం అండగా నిలిచింది. వైఎస్సార్ వాహన మిత్ర ద్వారా జిల్లా వ్యాప్తంగా అర్హత గల ట్యాక్సీ, ఆటో, మ్యాక్సీ క్యాబ్తోపాటు పలు వాహనాల డ్రైవర్లకు రూ.10 వేలు చొప్పున అందజేశారు. తాను కార్మికుల పక్షపాతినని ఆయన చాటి చెప్పారు. డ్రైవర్లకు అందించిన సాయాన్ని పట్టికలో చూడొచ్చు.ఇవన్నీ ఎంతో కీలకండీజిల్, పెట్రోల్ ధరలు, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, ఆటో విడి భాగాల ధరలు జీఎస్టీ పరిధిలోకి తేవాలి. ఆటో డ్రైవర్ల ఆదాయానికి నష్టం కలిగించే ఆన్లైన్ యాప్స్ రద్దు చేయాలి. పాత ఈ– చలానాలు రద్దు చేయాలి. డ్రైవర్లకు వ్యక్తిగత బీమా రూ.10 లక్షలు అమలు చేయాలి. కేంద్రం విడుదల చేసిన 894 గెజిట్ రద్దు చేయాలి. ప్రమాదాల నివారణ పేరుతో డ్రైవర్లకు ఏడేళ్ల జైలు, రూ.10 లక్షల జరిమానా విధించే యాక్టు 106(1) (2) ప్రమాదకరం. జీవో 21, 31 రద్దు చేస్తే డ్రైవర్లకు మేలు జరుగుతుంది.వీటి సంగతి ఏంటో..బ్యాడ్జి కలిగిన అన్ని వాహనాల డ్రైవర్లకు ఏటా రూ.15 వేలు ఆర్థిక సాయంభారీ జరిమానాలకు కారణమవుతున్న జీవో సంబరు 21, 31ల రద్దుడీజీల్, పెట్రోల్ ధరల తగ్గింపుటాటా మ్యాజిక్ వ్యాన్లు, జీపులు, కార్లకు గ్రీన్ టాక్స్, లేబర్ టాక్స్, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, టోల్ గేట్ ఫీజుల తగ్గింపుడ్రైవర్ల సాధికార సంస్థ ఏర్పాటు చేసి ప్రమాద బీమా, హెల్త్ ఇన్సూరెన్స్, విద్యా రుణాలు మంజూరుచంద్రన్న బీమా ద్వారా బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయంరవాణా రంగంలోకి ఆన్లైన్ యాప్స్ వచ్చాక ఆటో డ్రైవర్లు బేరాలు లేక నష్టపోతున్న పరిస్థితి. రోజంతా తిరిగితే రూ.500 నుంచి రూ.800 వరకు వస్తోంది. డీజిల్, ఇతర ఖర్చులు పోనూ మిగిలే రూ.200తో కుటుంబాన్ని నెట్టుకురావాలి. ఇటువంటి దయనీయ పరిస్థితిలో కొత్త జీవోలతో భారీ జరిమానాలు చెల్లించలేక అప్పులపాలవుతున్నాం. గత ప్రభుత్వం ఏటా రూ.10 వేలు వాహనమిత్ర ఇచ్చేది. ఆటోల మరమ్మతులు వంటి వాటికి ఉపయోగపడేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.– వరగాని ప్రవీణ్కుమార్, ఆటోడ్రైవర్వైఎస్సార్సీపీ హయాంలో అందిన సహాయంసంవత్సరం లబ్ధిదారుల అందించిన సాయంసంఖ్య (రూ.కోట్లలో)2019–20 20,594 20.952020–21 25,177 25.182021–22 23,837 23.842022–23 12,137 12. 132023–24 12,540 12.54మొత్తం 94,645 94.64 -
అధైర్య పడొద్దు .. అండగా ఉంటాం
సత్తెనపల్లి: ‘‘ మీరేమీ ఇబ్బంది పడవద్దు, భయపడ వద్దు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీకు అండగా ఉన్నారు. మేమందరం మీకు తోడుగా ఉన్నాం..’’ అంటూ ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, లేళ్ళ అప్పిరెడ్డి, మాజీ మంత్రి విడుదల రజిని, నరసరావుపేట మాజీ శాసనసభ్యుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవ్రెడ్డి అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ళ గ్రామంలో వారు గురువారం పర్యటించారు. ఏడాది క్రితం టీడీపీ, జనసేన నేతల దాడులు, పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న రెంటపాళ్ళ ఉపసర్పంచ్, వైఎస్సార్ సీపీ క్రీయాశీలక నాయకుడు కొర్లకుంట శివ నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ధైర్యాన్ని కలిగించారు. మృతుడు తండ్రి, పాకాలపాడు పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు కొర్లకుంట వెంకటేశ్వర్లుతో మాట్లాడారు. అనంతరం వారు మాట్లాడుతూ.. జూన్ 3న మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెంటపాళ్ళ గ్రామాన్ని సందర్శిస్తారని చెప్పారు. కొర్లకుంట శివనాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించి, నివాళులర్పిస్తారన్నారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారని పేర్కొన్నారు. ఈ క్రమంలో రూట్ మ్యాప్ను పరిశీలించారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు పడాల శివారెడ్డి, డాక్టర్ గజ్జల నాగభూషణ్ రెడ్డి, డీఆర్యూసీసీ మెంబర్ చల్లంచర్ల సాంబశివరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ నాగుర్ మీరాన్, సత్తెనపల్లి మండల పార్టీ అధ్యక్షుడు రాయపాటి పురుషోత్తమరావు, ఎంజే ఎం రామలింగారెడ్డి, రెండెద్దుల వెంకటేశ్వర రెడ్డి, ఇందూరి నరసింహారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు షేక్ మౌలాలి(సత్తెనపల్లి టౌన్), వేపూరి శ్రీనివాసరావు (రాజు పాలెం), భవనం రాఘవరెడ్డి (నకరికల్లు), నక్కా శ్రీను(ముప్పాళ్ళ), వైఎస్సార్ సీపీ నాయకులు బండి కోటినాగిరెడ్డి, ఏకుల మత్తయ్య, పల్లె గాబ్రియేలు, కోట ఆంజనేయులు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, లేళ్ళ అప్పిరెడ్డి, నేతల బృందం రెంటపాళ్ళ ఉపసర్పంచ్ నాగమల్లేశ్వరరావు కుటుంబానికి పరామర్శ జూన్ 3న రెంటపాళ్ళకు వైఎస్ జగన్ రాక నేపథ్యంలో రూట్మ్యాప్ పరిశీలన -
కౌన్సెలింగ్లో ఉపాధ్యాయులకు ముప్పుతిప్పలు
గుంటూరు ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ ఉద్యోగోన్నతుల కౌన్సెలింగ్ నిర్వహణలో విద్యాశాఖ దారుణంగా విఫలమైంది. గుంటూరు జోన్–3 పరిధిలోని గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 17 హెచ్ఎం పోస్టులతోపాటు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని జెడ్పీ, నగరపాలక సంస్థ, మున్సిపల్ పాఠశాలల పరిధిలో మరో 56 గ్రేడ్–2 హెచ్ఎం పోస్టులను ఉద్యోగోన్నతుల ద్వారా భర్తీ చేసేందుకు గురువారం కౌన్సెలింగ్కు ఏర్పాట్లు చేశారు. ఒక్కో పోస్టుకు ముగ్గురేసి చొప్పున పిలిచారు. గుంటూరులోని భారతీయ విద్యాభవన్లో గురువారం ఉదయం 8 గంటలకల్లా ఉండాలని స్పష్టం చేశారు. గుంటూరుతోపాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి సైతం ఉపాధ్యాయులు తరలివచ్చారు. ప్రభుత్వ హైస్కూళ్లలో హెచ్ఎం పోస్టులకు గుంటూరులోని ఆర్జేడీ కార్యాలయంలో కౌన్సెలింగ్కు ఏర్పాట్లు చేసిన అధికారులు ఇదిగో, అదిగో అంటూ సాయంత్రం 6 గంటల వరకు ఎటూ తేల్చకుండా ఉండిపోయారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం బదిలీల అనంతరం ఏర్పడే ఖాళీలతో ఈ నెల 30న ప్రమోషన్ల కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉంది. కానీ రెండు రోజుల ముందుగానే 28న నిర్వహించేందుకు ప్రయత్నించి విఫలమైన విద్యాశాఖాధికారులు గురువారం మరోసారి అదే తీరును కొనసాగించారు. విద్యాశాఖ తీరుతో విసుగెత్తిపోయిన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆందోళనకు దిగడంతో సాయంత్రం 6.30 గంటలకు గుంటూరు, పల్నాడు డీఈవోలు సీవీ రేణుక, చంద్రకళ వచ్చి మాన్యువల్ విధానంలో కౌన్సెలింగ్ ప్రారంభించారు. ఉద్యోగోన్నతుల పేరుతో రెండు రోజులపాటు నరకం గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ఉపాధ్యాయులకు కష్టాలు ఉదయం రావాలని పిలిచి సాయంత్రం వరకు ఎటూ తేల్చని అధికారులు -
సుబ్రహ్మణ్యేశ్వరుడికి రజత కవచం
అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేతమైన అమరావతి అమరేశ్వరాలయంలో సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి బుధవారం దాతలు రజత కవచం సమ ర్పించారు. మండల పరిధిలోని ధరణికోటకు చెందిన కామని వీరయ్య, సామ్రాజ్యం దంపతులు సుమారు రెండుకిలోల 395 గ్రాముల బరువుతో రూ.3లక్షల విలువైన రజత కవచానికి ఆలయంలో సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించి ఈఓ రేఖకు అప్పగించారు. అనంతరం అర్చకులద్వారా సుబ్రహ్మణ్యేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కవచాన్ని అలంకరించారు. తొలుత దాతలు అమరేశ్వరునికి అభిషేకం, బాలచాముండేశ్వరి, అమ్మవార్లకు కుంకుమపూజలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారునేడు జెడ్పీ గ్రేడ్–2 హెచ్ఎం పోస్టులకు కౌన్సెలింగ్గుంటూరు ఎడ్యుకేషన్ : ఉమ్మడి గుంటూరు జిల్లాలోని జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయ పోస్టులను ఉద్యోగోన్నతులతో భర్తీ చేసేందుకు గురువారం కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లుగా పని చేస్తూ గ్రేడ్–2 హెచ్ఎం ఉద్యోగోన్నతుల కోసం సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు గురువారం ఉదయం 8 గంటలకు జెడ్పీ కార్యాలయ రోడ్డులోని భారతీయ విద్యాభవన్లో హాజరు కావాలని సూచించారు.శివాలయంలో అవినీతిపై విచారణమంగళగిరి : మంగళాద్రిలో వేంచేసిఉన్న శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానం(శివాలయం)లో జరిగిన అవినీతిపై దేవదాయ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. దేవస్థాన అభివృద్ధికి దాతలు అందించిన నగదును రికార్డులలో నమోదు చేయకపోవడంతో అభివృద్ధి పనులలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దేవదాయ శాఖ ఉన్నతాధికారులకు భక్తులు ఫిర్యాదు చేశారు. అధికారులు బుధవారం ఆలయానికి చేరుకుని ఈవో కార్యాలయంలో పలు ఫైళ్ళును స్వాధీనం చేసుకున్నారు.పునఃప్రారంభమైన సదరం క్యాంప్తెనాలిఅర్బన్: వికలాంగుల ధృవ పత్రాలను పునః పరిశీలన జరిపే కార్యక్రమంలో భాగంగా తెనాలిలోని జిల్లా వైద్యశాలలో బుధవారం ప్రత్యేక సదరం క్యాంప్ నిర్వహించారు. ఆర్థో, ఈఎన్టీ, సెక్రాటిక్ విభాగాలకు చెందిన వికలాంగులు వైద్యశాలకు వచ్చి పరీక్షలు చేయించుకున్నారు. గురు, శుక్రవారాలలో కూడా క్యాంప్ జరుగుతుందని వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి తెలిపారు.31న అయ్యప్ప స్వామి దేవస్థాన వార్షికోత్సవంచిలకలూరిపేట: ఓగేరు వాగుకు దక్షిణాన ఉన్న అయ్యప్పస్వామి దేవస్థానం 16వ వార్షికోత్సవం ఈ నెల 31వ తేదీన వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ వెల్లంపల్లి రవిశంకర్ తెలిపారు. ఆలయ ప్రాంగణంలో బుధవారం దేవస్థాన వార్షికోత్సవ కరపత్రాలను కమిటీ సభ్యులతో కలసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ వార్షికోత్సవానికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక పూజలు, అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. కమిటీ సభ్యులు తవ్వా నాగమల్లేశ్వరరావు, సత్యనారాయణ, భవిరిశెట్టి మణి పాల్గొన్నారు. -
అక్కడ అధికారంలోకి రాగానే...
ఎన్నికల వేళ కూటమి హామీ.. ఇప్పుడు అడిగితే కస్సు‘బస్సు’ పట్నంబజారు (గుంటూరు ఈస్ట్) : కూటమి గద్దెనెక్కిన తరువాత తొలుత గత ఏడాది ఆగస్టు 15వ తేదీ నాటికి ఉచిత బస్సు హామీ అమలు చేస్తామని నేతలు చెప్పారు. అనంతరం దసరా ధమాకా... దీపావళికి టపాసులు పేలాస్తామంటూ.... ప్రేలాపనలు పలికారు. సంక్రాంతికి ఉచిత ప్రయాణం అని చెప్పిన సర్కార్ మాట విన్న మహిళలు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూశారు. తిరిగి ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన అమలు చేస్తామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. ఇలా ఏడాదిగా పూటకో మాట చెబుతూ ప్రకటనలు చేయడంపై మహిళలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం అంటూ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి ప్రకటించగా.. ఇంకో అమాత్యుడు నారా లోకేష్ రోడ్ మ్యాప్ వేద్దాం.. వచ్చే ఏడాది నుంచి పథకాల అమలుపై దృష్టి సారిద్దామని చెప్పి మ్యాప్ గీస్తూనే ఉన్నారా... అని సామాజిక మాధ్యమాల్లో పలువురు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఏకంగా సీఎం చంద్రబాబే అసెంబ్లీ సాక్షిగా ‘పథకాలు అమలు చేయాలంటే భయమేస్తోందని’ చెప్పటంపై ప్రజలు, మహిళలు ప్రభుత్వాన్ని చీదరించుకుంటున్నారు. ఇక ఉచిత ప్రయాణం లేనట్టేనా? అని మహిళలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో భారీగా మహిళా ప్రయాణికులు గుంటూరు జిల్లాకు సంబంధించి నిత్యం లక్ష మంది ప్రయాణికులు ఆర్టీసీ సేవలను వినియోగించుకుంటున్నారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో 60 శాతం మంది మహిళలే ఉన్నారు. గుంటూరు కేంద్రంగా నిత్యం అనేక ప్రాంతాలకు మహిళా ఉద్యోగులు, ఆయా పనులు చేసుకునే వారు, వ్యాపారం చేసే మహిళలు, విద్యార్థులు, ఇతర పనులపై వచ్చే యువతులు రాకపోకలు సాగిస్తున్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గానికి సంబంధించి మహిళలు 1.50 లక్షలు, పశ్చిమ నియోజకవర్గంలో 1.30 లక్షలు, తెనాలిలో 1.41 లక్షలు, పొన్నూరులో 1.15 లక్షలు, తాడికొండలో 1.60 లక్షలు, మంగళగిరిలో 2.03 లక్షలు, ప్రత్తిపాడు నియోజకవర్గంలో 1.45 లక్షలమందికిపైగా ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలో గుంటూరు 1, 2, తెనాలి, పొన్నూరు, మంగళగిరి డిపోలు ఉన్నాయి. రీజియన్ పరిధిలో 345 బస్సులు సేవలు అందిస్తున్నాయి. అధికంగా మహిళలు గుంటూరు 1, 2 డిపోలు, మంగళగిరి ప్రాంతాల నుంచి హైకోర్టు, సచివాలయం, ఇతరత్రా ఉద్యోగాలకు నెలవారీ పాస్లు తీసుకుని ప్రయాణిస్తున్నారని తెలుస్తోంది. నిత్యం ఆర్టీసీ ఆదాయం రూ.1.20 కోట్లకుపైగా ఉంటుంది. మహిళలకు ఉచిత ప్రయాణం అంటే 50 శాతం అనుకున్నా... రూ.60 లక్షల మేర ప్రభుత్వం ఆర్టీసీకీ చెల్లించాల్సి ఉంటుంది. అసలే డబ్బుల్లేవ్ అని చెబుతున్న చంద్రబాబు ఉచిత ప్రయాణ హామీని ఏ రకంగా అమలు చేస్తారని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ విశ్లేషకులూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం మాట మరిచిన కూటమి సర్కారు రోజుకో అబద్ధం చెబుతూ హామీ అమలు దాటవేత అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా చిత్తశుద్ధి కరువు కూటమిని నమ్మి మోసపోయామని వాపోతున్న మహిళలు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం హామీని అమలు చేశాయి. తమిళనాడు రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుంచో అమలులో ఉంది. అయితే ఏపీలో మాత్రం ఈ సదుపాయం అందని ద్రాక్షగా మారింది. ఏపీలో కూటమి ఎన్నికల సమయంలో ఉచిత బస్సు అంటూ జోరుగా ప్రచారం చేసింది. అధికారంలోకి వచ్చాక ఆ ఊసే లేకుండా పోయింది. -
మాయమాటల్లో సీఎం దిట్ట
ఎన్నికల్లో అసత్య ప్రచారాలు, మాయమాటలు చెప్పటంలో చంద్రబాబు దిట్ట. మహిళలకు ఉచిత ప్రయాణం, ఉచిత గ్యాస్, అమ్మ ఒడితోపాటు అనేక సంక్షేమ పథకాలు అందజేస్తామని చెప్పి వంచించారు. పూట గడిస్తే చాలన్నట్లు కూటమి పరిపాలన ఉంది. ఇచ్చిన హామీల్లో ఏడాది కాలంలో ఏ ఒక్కటీ అమలు చేయని ప్రభుత్వం ప్రపంచంలోనే కూటమి సర్కార్ మాత్రమే. 2014 –19 వరకు జరిగిన గ్రాఫిక్స్ పాలనే ఇప్పుడు కొనసాగుతోంది. – షేక్ నూరిఫాతిమా, నగర అధ్యక్షురాలు, వైఎస్సార్సీపీ -
జిల్లా వినియోగదారుల ఫోరం చైర్మన్గా విజయలక్ష్మి
గుంటూరు లీగల్: గుంటూరు జిల్లా వినియోగదారుల ఫోరం చైర్మన్గా కుమ్మమూరు విజయలక్ష్మి నియమితులయ్యారు. విజయలక్ష్మి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బీకాం చేశారు. గుల్బర్గా యూనివర్సిటీలో 1991లో న్యాయ శాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు. 1992లో న్యాయవాదిగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఎన్రోల్ అయ్యారు. సోదరుడు కృష్ణకిషోర్ వద్ద న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. బుధవారం గుంటూరు జిల్లా కన్జ్యూమర్ ఫోరం చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు అభినందనలు తెలిపారు. ఒకటిన జిల్లా క్రికెట్ జట్లు ఎంపిక గుంటూరు వెస్ట్ ( క్రీడలు ): జిల్లా క్రికెట్ సంఘం త్రీమెన్ కమిటీ ఆధ్వర్యంలో జూన్ 1వ తేదీన స్థానిక అరండల్పేటలోని పిచ్చుకులగుంటలో జిల్లా జట్ల ఎంపిక నిర్వహిస్తామని సభ్యులు యు.మహతి శంకర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–19 యువకులు జట్టుకు ఉదయం 8 గంటలకు, అండర్–19 యువతులకు మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహిస్తారు. నవంబర్ 1,2006 తర్వాత జన్మించినవారై ఉండాలి. అండర్–15 బాలికలకు మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహిస్తారు. నవంబర్ 1, 2010 తర్వాత జన్మించిన వారై ఉండాలి. అండర్–23 ఉమెన్స్కు మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహిస్తారు. వీరు నవంబర్ 1,2001 తర్వాత జన్మించినవారై ఉండాలి. పోటీలకు హాజరయ్యే క్రికెటర్లు వైట్ డ్రెస్తోపాటు సొంత కిట్ కలిగి ఉండాలి. వయస్సు ధ్రువీకరణ పత్రంతోపాటు ఆధార్ను తీసుకురావాలన్నారు. వివరాలకు మహతి శంకర్ను 98491 50249 లో సంప్రదించాలన్నారు. నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష గుంటూరు లీగల్: అత్యాచార యత్నం కేసులో నిందితుడికి జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. 86 సంవత్సరాల వృద్ధురాలిపై లైంగిక దాడికి యత్నించిన పాలపర్తి మంజు అనే 21 సంవత్సరాల యువకుడిపై పెదనందిపాడు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ఈ మేరకు తీర్పు వచ్చింది. నిందితుడికి ఐదు సంవత్సరాలు జైలు శిక్ష, రూ. 5 వేలు జరిమానా విధిస్తూ గుంటూరు ఐదో జిల్లా కోర్టు న్యాయమూర్తి బుధవారం తీర్పు వెలువరించారు. బాధితురాలి తరఫున ప్రాసిక్యూషన్ న్యాయవాదిగా పల్లపు కృష్ణ వాదనలు వినిపించారు. -
పచ్చిరొట్ట పైరుతో ఎన్నో ప్రయోజనాలు
వ్యవసాయ శాఖ రాష్ట్ర సంచాలకులు తెనాలి టౌన్: ఖరీఫ్ సాగుకు ముందు పచ్చిరొట్ట పైరు సాగు చేసుకోవాలని వ్యవసాయశాఖ రాష్ట్ర సంచాలకులు ఎస్.ఢిల్లీరావు రైతులకు సూచించారు. రూరల్ మండలం ఎరుకలపూడి గ్రామంలో రైతు ముళ్ళపూడి రంగయ్య ప్రయోగాత్మకంగా చేపట్టిన పీఎండీఎస్ క్షేత్రాన్ని బుధవారం పలువురు అధికారులతో కలిసి ఎస్.ఢిల్లీరావు పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ సంస్థ ఎన్నో సంవత్సరాలు పరిశోధించి 32 రకాల పచ్చిరొట్ట విత్తనాలను రైతులకు అందిస్తున్నట్లు చెప్పారు. వీటిని సాగు చేయడం వలన సేంద్రియ కర్బనం భూమిలో పెరుగుతుందని తెలిపారు. ఎరువుల వినియోగం కూడా తగ్గించుకోవచ్చని వివరించారు. జనుము, జీలుగ, పిల్లి పెసర విత్తనాలను వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతులకు సబ్సిడీపై పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ఈ విధానం వలన కాంప్లెక్స్ ఎరువులు, పురుగు మందుల ఖర్చు భారీగా తగ్గించుకోవచ్చని అన్నారు. భూమి గుల్లబారి ఆరోగ్యంగా ఉంటుందని, సూక్ష్మపోషకాలు త్వరగా పంటకు అందుతాయని తెలిపారు. ప్రతి రైతును చైతన్యపరచాలని, గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా వ్యవసాయాధికారి ఎన్.వెంకటేశ్వర్లు, జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె.రాజకుమారి, ఏడీఏ ఎన్.ఉషారాణి, ఏవో జి.ప్రేమ్సాగర్, ఏఈవోలు, వీఏఏలు, పలువురు రైతులు పాల్గొన్నారు. -
రైతులు రోడ్డెక్కితే రాష్ట్రం స్తంభిస్తుంది
చిలకలూరిపేట: బర్లీ పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు రోడ్ల మీదకు వస్తే రాష్ట్రం స్తంభించి పోతుందని నల్లమడ రైతు సంఘం కన్వీనర్ డాక్టర్ కొల్లా రాజమోహనరావు చెప్పారు. బర్లీ పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో ఐటీసీ కంపెనీ ముందు నిర్వహిస్తున్న నిరసన దీక్ష బుధవారం రెండోరోజు కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాది రైతాంగ ఉద్యమాలను ఆదర్శంగా తీసుకొని రైతులు పోరాటానికి సిద్ధం కావాలన్నారు. బర్లీ పొగాకు కలపకుండా ప్రపంచంలో ఏ దేశంలోనూ సిగరెట్లు తయారు కావన్నారు. సువాసన కోసం బర్లీ పొగాకును విదేశాలు సిగరెట్లలో ఉపయోగిస్తాయని తెలిపారు. పొగాకు కంపెనీలు కుట్రపూరితంగా ఏకమై ధరలను పతనం చేసేందుకు బర్లీ పొగాకు కొనుగోళ్లను నిలిపివేశాయని ఆరోపించారు. ఆ చర్చలకు విలువ లేదా? రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళితే చర్చలతో సరిపెడుతున్నారని, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో జరిగిన చర్చలకు సైతం విలువలేకుండా పోయిందని వెల్లడించారు. పొగాకు కంపెనీలు రైతుల జీవితాలతో చెలగాటమాడుతుంటే, ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది బర్లీ పొగాకు క్వింటా రూ. 18 వేల వరకు కొన్నారని, ఈ ఏడాది కనీసం రూ. 15 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంతో చర్చలు జరిపినప్పుడెల్లా కొనుగోళ్లు చేస్తాం అనడం తప్పించి, అడుగు ముందుకు పడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరాటాలకు రైతులు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. రైతు సంఘాల నాయకులు తాళ్లూరి బాబురావు, దాసరి వరహాలు, పేలూరి రామారావు, షేక్ సుభాని, ఇంటూరి భవాని వెంకటేష్, దోమల మరియదాసు, రెడ్డమ్మ నరిసిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఎం.రాధాకృష్ణ, లోక్ సత్తా మాదాసు భానుప్రసాద్ పాల్గొన్నారు. నల్లమడ రైతు సంఘం కన్వీనర్ డాక్టర్ కొల్లా రాజమోహనరావు బర్లీ పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలని నిరసన దీక్ష -
లోక్ అదాలత్లో ఎక్కువ కేసుల పరిష్కారానికి కృషి
గుంటూరు లీగల్: లోక్ అదాలత్లో ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యేలా చూడాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయికళ్యాణ్చక్రవర్తి పేర్కొన్నారు. ఈ నెల 28 నుంచి జూన్ 7వ తేదీ వరకు జరుగనున్న లోక్ అదాలత్పై బుధవారం కోర్టు ప్రాంగణంలో కంపెనీ సభ్యులు, కౌన్సిలర్లు, ఇన్సూరెన్స్ కంపెనీల న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ కేసుల సత్వర పరిష్కారానికి చర్యల గురించి వివరించారు. అందరూ సహకరించాలని సూచించారు. ఒకటో అదనపు జిల్లా జడ్జి వి.ఎ.ఎల్.సత్యవతి, గుంటూరు ఫ్యామిలీ కోర్టు జడ్జి జి. చక్రపాణి, నాలుగో అదనపు జిల్లా జడ్జి ఆర్. శరత్ బాబు, ఐదో అదనపు జిల్లా జడ్జి కె. నీలిమ, మూడో అదనపు జిల్లా జడ్జి సి.హెచ్.వి.ఎన్. శ్రీనివాసరావు, పోక్సో కోర్ట్ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి షమీ పర్వీన్ సుల్తానా బేగం, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ సయ్యద్ జియావుద్దీన్, బార్ అధ్యక్షుడు వై.సూర్య నారాయణ పాల్గొన్నారు. -
కేశవకుమార్ సాహిత్యంలో ధిక్కార స్వరం
కవితా సంపుటాల ఆవిష్కరణలో వక్తలు తెనాలి: గత మూడున్నర దశాబ్దాల తెలుగు కవిత్వంలో కేశవకుమార్ది ముఖ్యమైన గొంతుక అని, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విప్లవాత్మక భావజాలం ద్వారా ప్రేరణ పొందిన కవి అని ప్రముఖ సాహితీ విమర్శకుడు, ప్రొఫెసర్ బి.తిరుపతిరావు ప్రశంసించారు. ఆయన కవిత్వం సామాజిక– రాజకీయ విమర్శ, తాత్విక అన్వేషణల శక్తిమంతమైన సమ్మేళనాన్ని సూచిస్తుందని అన్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం తత్వశాస్త్ర ప్రొఫెసర్, తెనాలి సమీపంలోని మండల కేంద్రం అమృతలూరుకు చెందిన కేశవకుమార్ రచించిన కవితలతో తీసుకొచ్చిన రెండు కవితా సంపుటాలను బుధవారం సాయంత్రం హోటల్ గౌతమ్ గ్రాండ్ హోటల్లో ఆవిష్కరించారు. ‘భిన్నస్వరాలు’ ఆధ్వర్యంలో ఏర్పాటైన సభకు జీఎస్ నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. కేశవకుమార్ కవితా సంపుటి ‘ఆదిమ పౌరుడు’ను బి.తిరుపతిరావు, ‘ఎగిరే పళ్లెం నడిచే మంచం ఓ కూనిరాగం’ సంపుటిని ప్రముఖ కవి సీతారాం ఆవిష్కరించారు. తిరుపతిరావు మాట్లాడుతూ అమృతలూరులో పుట్టి, దళిత ఉద్యమాలు, దళితుల ఆర్థిక, సామాజిక, రాజకీయ ఎదుగుదలను చూస్తూ పెరిగిన క్రమంలో కేశవకుమార్ వాటిని సొంతం చేసుకున్నారని చెప్పారు. ఆయన భావాలన్నీ అంబేడ్కర్ ఆలోచనల చుట్టూ తిరుగుతుంటాయన్నారు. రాడికల్గా సమీక్షించటం, విమర్శించటం ఆయన రచనల్లో గోచరిస్తుందని చెప్పారు. విస్తృతంగా రాస్తున్న కవితలు, వ్యాసాల్లో వ్యంగ్యాన్ని జోడించి విమర్శనాత్మకంగా రాయటం కేశవకుమార్ శైలి అన్నారు. సమకాలీన విషయాలపై తక్షణం స్పందించి రాయటం ఆయన ప్రత్యేకతగా చెప్పారు. కవి సీతారాం మాట్లాడుతూ, సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన విద్యార్థుల ప్రతిఘటన, నిరసన ఉద్యమాల్లో కేశవకుమార్ ముందుండి గొంతెత్తారని చెప్పారు. అంబేడ్కర్, పూలే భావధారలో తనను తాను రూపుదిద్దుకున్న కేశవకుమార్ రచనలు, తెలుగునాట దళితవాద సాహిత్యానికి ప్రోత్సాహాన్ని, ప్రేరణను ఇస్తాయని చెప్పారు. ప్రముఖ దళిత సీ్త్రవాద రచయిత్రి చల్లపల్లి స్వరూపరాణి తన ప్రసంగంలో విప్లవ సాహిత్యానికి కేంద్రబిందువుగా ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ నుంచి వచ్చిన కేశవకుమార్ కవితా సంపుటాల్లో దళిత, బహుజన సాహిత్యంలో వచ్చిన ధోరణులు ప్రతిబింబిస్తాయని చెప్పారు. కత్తి కళ్యాణ్ మాట్లాడుతూ కేశవకుమార్ కవిత్వంలో నిరసన, ధిక్కారం, వ్యంగ్యం ప్రదర్శిస్తూ సమాజానికి అనేక ప్రశ్నలు సంధించారని చెప్పారు. సభలో శిఖా–ఆకాష్, నూకతోటి రవికుమార్, ఎన్జే విద్యాసాగర్, శ్రీశ్రీ ప్రింటర్స్ విశ్వేశ్వరరావు, తంగిరాల సోని మాట్లాడారు. కేశవకుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు. భిన్నస్వరాలు బాధ్యులు జుగాష్విలి, ఉమ తదితరులు పాల్గొన్నారు. -
ఐటీఐ విద్యార్థి ఆత్మహత్య
ప్రత్తిపాడు: ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఐటీఐ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ప్రత్తిపాడుకు చెందిన మన్నవ జేమ్స్, ఏసుకుమారిలకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు మన్నవ స్టాలిన్ (17) గుంటూరు రూరల్ మండలంలోని అడవితక్కెళ్లపాడులోని ఎంజీఎస్ కళాశాలలో ఐటీఐ ఎలక్ట్రికల్ కోర్సు చదువుతున్నాడు. ఒక్కడే కొడుకు కావడంతో తల్లిదండ్రులు స్టాలిన్ను గారాబంగా పెంచుకున్నారు. ఏం జరిగిందో ఏమో తెలియదుగానీ 27వ తేదీ రాత్రి ఏసుకుమారి పనిపై బయటకు వచ్చింది. తిరిగి ఇంటికి వెళ్లి చూసేసరికి స్టాలిన్ ఇంటి వరండాలోని సీలింగ్ ఫ్యాన్కు తాడుతో ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. దీంతో తల్లి పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి స్టాలిన్ను కిందకు దింపి తండ్రికి సమాచారం అందించారు. అపస్మారక స్థితిలోనికి వెళ్లిన స్టాలిన్ను తీసుకుని తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే స్టాలిన్ మృతి చెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోసుమార్టం నిమిత్తం గుంటూరు జీజీహెచ్కు తరలించారు. జేమ్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కె. నాగేంద్ర తెలిపారు. విద్యార్థి మృతికి కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. -
కృష్ణానదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం
తాడేపల్లి రూరల్: ప్రకాశం బ్యారేజ్ కృష్ణానది దిగువ ప్రాంతంలో కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం ఉన్నట్లు మత్స్యకారులు బుధవారం తాడేపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి వెళ్లిన ఎస్ఐ శ్రీనివాసరావు కృష్ణానది దిగువ ప్రాంతంలోని లాకుల వెంబడి ఉన్న మృతదేహాన్ని బయటకు తీయించారు. అతని వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉంది. మృతుడి ఒంటిపై నల్లని హాఫ్ నిక్కర్ మాత్రమే ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు. వయస్సు 30 సంవత్సరాలు ఉండవచ్చని భావిస్తున్నారు. ఎవరికై నా వివరాలు తెలిస్తే 08645272186 ఫోను నెంబరుకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. -
ప్రజా పాలనపై ఎన్టీఆర్ చెరగని ముద్ర
గుంటూరు వెస్ట్: సంక్షేమ పాలనతో ప్రజల మనస్సుల్లో చెరగని ముద్ర వేసిన మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావును ఎప్పటికీ మరచిపోలేమని ఇన్చార్జి జిల్లా కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ కొనియాడారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో ఇన్చార్జి కలెక్టర్తోపాటు శాసన మండలి సభ్యులు చంద్రగిరి ఏసురత్నం, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ, జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు, డీఆర్వో షేక్ ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా ఎ.భార్గవ్ తేజ మాట్లాడుతూ ప్రభుత్వ పాలనలో విప్లవాత్మకమైన మార్పులకు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారన్నారు. ఎన్టీఆర్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో స్టెప్ సీఈఓ చంద్రముని, మెప్మా పీడీ విజయలక్ష్మి, కలెక్టరేట్ ఏఓ పూర్ణచంద్రరావు, కార్పొరేటర్లు స్మిత పద్మజ, వెంకట రమణ, చిష్టీ, మీరావలి, పాల్గొన్నారు. తెలుగు వారి ఖ్యాతి చాటిన ఎన్టీఆర్ నగరంపాలెం: తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు అని జిల్లా ఎస్పీ సతీష్కుమార్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో బుధవారం దివంగత సీఎం నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు రాజకీయాల్లో అరంగేట్రం చేసి సీఎంగా పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఏఎస్పీ (పరిపాలన) రమణమూర్తి, ఏఆర్ డీఎస్పీ ఏడుకొండలురెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఎకై ్సజ్ కార్యాలయంలో... నెహ్రూనగర్: ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బుధవారం గుంటూరు జిల్లా ఎకై ్సజ్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎకై ్సజ్ శాఖ డెప్యూటీ కమిషనర్ డాక్టర్ కె. శ్రీనివాసులు, అసిస్టెంట్ కమిషనర్ రవికుమార్రెడ్డి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ అరుణకుమారి, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఇ.మారయ్య బాబు పాల్గొన్నారు. ఇన్చార్జి జిల్లా కలెక్టర్ -
జీజీహెచ్లో కరోనా వైద్య సేవలు
గుంటూరు మెడికల్: కొన్నేళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ మరోసారి ప్రభావం చూపుతోంది. పలువురు బాధితులు కరోనాతో బాధపడుతుండటంతో గుంటూరు జీజీహెచ్లో వారి కోసం ప్రత్యేకంగా 15 పడకలతో వార్డు ఏర్పాటు చేశారు. ఇన్పేషెంట్ విభాగంలో బీ క్లాస్ రూములో కూడా బాధితుల కోసం సిద్ధం చేసి ఉంచారు. అత్యవసర విభాగం వల్ల నూతనంగా నిర్మించిన స్టెప్ డౌన్ ఐసీయూ గదిని కరోనా బాధితుల కోసం ఏర్పాటు చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ తెలిపారు. ఇప్పటికే కరోనా అనుమానంతో వచ్చిన ఐదుగురికి వైద్య పరీక్షలు చేశామని, రిపోర్టు నెగిటివ్ వచ్చిందని వెల్లడించారు. జీజీహెచ్లో కరోనా బాధితులకు ప్రత్యేకంగా ఓపీని ప్రారంభించామన్నారు. ఆక్సిజన్ కాన్సెట్రేటర్లు, సీక్యాప్ మిషన్లు, వెంటిలేటర్లు అందుబాటులో ఉంచామన్నారు. జనరల్ మెడిసిన్ వైద్యులు ప్రత్యేకంగా బృందాలుగా ఏర్పడి కరోనా బాధితులకు వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. వైద్య సేవలకు సిద్ధంగా ఉండండి రాష్ట్రవ్యాప్తంగా బోధన ఆసుపత్రుల్లో కరోనా వైద్య సేవలు అందించేందుకు ఆయా టీచింగ్ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు సిద్ధంగా ఉండాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) ఆదేశించారు. ఈ మేరకు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా టీచింగ్ ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో జూమ్ కాన్ఫరెన్సు నిర్వహించారు. సమావేశంలో డీఎంఈ డాక్టర్ నరసింహం మాట్లాడుతూ గుంటూరు జీజీహెచ్లో ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో ఎక్కువ మంది చికిత్స పొందేలా చూడాలన్నారు. ఈ – హాస్పిటల్ వైద్య సేవలు పెంచాలని సూచించారు. సమావేశానికి హాజరు కాని జీజీహెచ్ వైద్యులకు మెమో జారీ చేయాలని ఆదేశించారు. సమీక్షలో గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణతోపాటు పలు వైద్య విభాగాధిపతులు, ఆయా టీచింగ్ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. -
యోగాపై ప్రజలకు అవగాహన
నెహ్రూ నగర్: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రజలకు నెల రోజుల పాటు అవగాహన కల్పించనుందని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం బృందావన్ గార్డెన్స్ ఎన్టీఆర్ మునిసిపల్ స్టేడియం నుంచి లక్ష్మీపురం మదర్ థెరిస్సా విగ్రహం వరకు యోగాపై నిర్వహించిన అవగాహన ర్యాలీలో గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 21 నుంచి జూన్ 21వ తేదీ వరకు చేపట్టిన యోగాంధ్రలో గుంటూరు జిల్లా, నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పర్యాటక ప్రాంతాలైన ఉండవల్లి గుహలు, మంగళగిరి ఎకో పార్క్లలో కూడా పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రజలు పాల్గొనేలా చేయడమే కార్యక్రమాల ఉద్దేశం అన్నారు. గుంటూరు నగపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ బుధవారం నుంచి నగరంలో వివిధ ప్రాంతాల్లో యోగాపై అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు. వైజాగ్, గుంటూరులో పాల్గొనాలనే ఆసక్తి కలిగిన వారు యోగాంధ్ర వెబ్ సైట్లో పేర్లు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, డీపీఓ డా.సైమన్, డీపీఎం(ఇన్చార్జి) డా.జయరామ్ కృష్ణ, డెమో జయ ప్రసాద్, డిప్యూటీ డెమో ఎన్.వెంకటేశ్వర్లు, మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. తాడేపల్లి రూరల్: మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలోని ఉండవల్లి గుహల వద్ద బుధవారం యోగాపై అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం గుంటూరు ఇన్చార్జి జిల్లా కలెక్టర్ భార్గవ్ తేజ పలువురు అధికారులతో కలిసి గుహలను పరిశీలించారు. -
యువకులపై టీడీపీ నాయకుడి దాడి
అనుచరులతోనూ దాడి చేయించి గాయపరిచినవైనం సాక్షి టాస్క్ఫోర్స్: యువకులపై టీడీపీ నేత దాడి చేసి, అనంతరం అనుచరులతో కూడా తీవ్రంగా కొట్టించి గాయపరిచిన సంఘటన గుంటూరు నగరంలో వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... టీడీపీ గుంటూరు నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్కు సంబంధించి సెవెన్ హిల్స్ మెడికల్ షాపు కొత్తపేటలోని మెడికల్ కాంప్లెక్సు వద్ద ఉంది. ఈ షాపులో పనిచేస్తున్న ఓ యువకుడు కొన్ని నెలల కిందట అక్కడ మానేసి వేరే షాపులో చేరాడు. హోల్సేల్ మెడికల్ షాపు నుంచి అతడు సరకు తీసుకొస్తున్న సమయంలో వాటికి సంబంధించిన బిల్లులను సెవెన్హిల్స్ షాపునకు హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్ పంపారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఆ యువకుడిని షాపు వద్దకు పిలిపించారు. డేగల ప్రభాకర్తోపాటు కొంత మంది వ్యక్తులు ప్రశ్నించడంతోపాటు కొట్టినట్లు సమాచారం. దాడికి గురైన యువకుడు తన బంధువులు తదితరులతో కలిసి మంగళవారం ఉదయం షాపు వద్దకు వెళ్లారు. మమ్మల్నే ప్రశ్నిస్తారా అంటూ డేగల ప్రభాకర్, అతని అనుచరులు మరోమారు దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు తెలిసింది. టీడీపీ నేత కొత్తపేట పోలీసులకు ఫోన్ చేయగా, గాయపడిన యువకుడిని పోలీసులు స్టేషన్కు తరలించినట్లు సమాచారం. యువకుడిని బెదిరించి కేసు రాజీ చేసినట్లు తెలిసింది. గాయపడిన యువకుల పేర్లు, వివరాలు తెలియరాలేదు. దీనిపై కొత్తపేట పోలీసు స్టేషన్ ఎస్హెచ్ఓ ఎం.వీరయ్యచౌదరిని వివరణ కోరగా గొడవ జరిగిన మాట వాస్తవమేనని చెప్పారు. -
నైపుణ్యాభివృద్ధి తరగతులు ప్రారంభం
తాడికొండ: మహిళలు, యువతకు నైపుణ్యాభివృద్ధి, సెన్సిటైజేషనుకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాల ద్వారా సాధికారత సాధించవచ్చని ఏపీ సీఆర్డీఏ నైపుణ్యాభివృద్ధి అధికారులు తెలిపారు. అమరావతి ప్రాంతంలో మహిళలకు సాధికారత కల్పించడం, యువతకు నైపుణ్యాలను అందించేందుకు తుళ్ళూరులో ఈ కార్యక్రమాలను ప్రారంభించామన్నారు. నిర్మాణ స్థలాల వద్ద కార్మికుల రాకను దృష్టిలో ఉంచుకొని జెండర్ కమిటీల సభ్యులైన 368 స్వయం సహాయక బృంద మహిళలకు లింగ ఆధారిత హింసపై సెన్సిటైజేషన్ శిక్షణ ఇస్తున్నారు. వీరు సంబంధిత ఫిర్యాదులపై పని చేస్తారని అధికారులు తెలిపారు. ఏపీ సీఆర్డీఏ స్కిల్ హబ్ తుళ్ళూరులో పెయింటింగ్ కోర్సులో 22 మంది, డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సు 30 మంది, ఫ్రంట్ ఆఫీస్ మేనేజ్మెంట్ కోర్సులో 29 మందికి శిక్షణ ప్రారంభమైందన్నారు. -
కర్రసాములో జిల్లా క్రీడాకారుల ప్రతిభ
గుంటూరు వెస్ట్ (క్రీడలు): కర్రసాము అంతర్జాతీయ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరిచినట్లు కాశీనాథ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ నిర్వాహకుడు కాశీనాథ్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు తమిళనాడులోని కోయంబత్తూరులో నిర్వహించిన పోటీల్లో వారు ప్రతిభ చూపారన్నారు. అంతర్జాతీయ కర్రసాము సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో 9 బంగారు, 5 రజత, 3 కాంస్య పతకాలు సహా మొత్తం 17 పతకాలను క్రీడాకారులు సాధించారని పేర్కొన్నారు. సాయి సుబ్రహ్మణ్యం, విజయ్ శిక్షణలో క్రీడాకారులు ఈ ఘన విజయం సాధించారని తెలిపారు. -
● ఉమ్మడి గుంటూరు జిల్లాలో 39,693 మంది విద్యార్థులు హాజరు
ముగిసిన ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు గుంటూరు ఎడ్యుకేషన్ ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఏపీ ఈఏపీసెట్–2025 ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్టులు (సీబీటీ) మంగళవారంతో ముగిశాయి. ఈ నెల 19న ప్రారంభమైన పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా జరిగాయి. ఈ నెల 19, 20వ తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. 21 నుంచి 27వ తేదీ వరకు ఇంజినీరింగ్ కోర్సుల ప్రవేశ పరీక్షలకు విద్యార్థులు హాజరయ్యారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 22 కేంద్రాల పరిధిలో అగ్రికల్చర్, ఫార్మసీ, ఇంజినీరింగ్ పరీక్షలకు దరఖాస్తు చేసిన 41,384 మంది విద్యార్థుల్లో 39,693 మంది హాజరయ్యారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే... ● గుంటూరు జిల్లాలోని 15 కేంద్రాల పరిధిలో దరఖాస్తు చేసుకున్న 25,731 మందిలో 24,607 మంది హాజరయ్యారు. ఇంజినీరింగ్ పరీక్షకు 21,590 మందికిగాను 20,765; అగ్రిల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశ పరీక్షకు 4,141 మందికిగాను 3,842 మంది హాజరయ్యారు. ● పల్నాడు జిల్లాలోని 5 కేంద్రాల పరిధిలో దరఖాస్తు చేసిన 11,142 మందికిగాను 10,746 మంది హాజరయ్యారు. వీరిలో ఇంజినీరింగ్కు 9,214 మందికిగాను 8,944 మంది; అగ్రిల్చర్, ఫార్మసీ పరీక్షకు 1,928 మందికిగాను 1,802 మంది హాజరయ్యారు. ● బాపట్ల జిల్లాలో బాపట్ల, చీరాలలో ఏర్పాటు చేసిన 2 కేంద్రాల పరిధిలో దరఖాస్తు చేసుకున్న 4,511 మందికిగాను 4,340 మంది హాజరయ్యారు. వీరిలో ఇంజినీరింగ్కు 3,409 మందికిగాను 3,304; అగ్రిల్చర్, ఫార్మసీ పరీక్షకు 1,102 మందికిగాను 1,036 చొప్పున హాజరయ్యారు. -
ఉద్యోగోన్నతులకు ధ్రువపత్రాల పరిశీలన
గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ఉపాధ్యాయులు హాజరు గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు జోన్–3 పరిధిలోని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్, తత్సమాన కేడర్లలో పని చేస్తున్న ఉపాధ్యాయులకు గ్రేడ్–2 హెచ్ఎంలుగా ఉద్యోగోన్నతి కల్పించేందుకు మంగళవారం గుంటూరులోని ఆర్జేడీ కార్యాలయంలో ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ నిర్వహించారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లాలో ఆరు, ప్రకాశం జిల్లాలో ఏడు, నెల్లూరు జిల్లాలో నాలుగు హెచ్ఎం పోస్టులను భర్తీ చేసేందుకు ఒక్కో పోస్టుకు ముగ్గురేసి చొప్పున స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులను పిలిచారు. సీనియార్టీ జాబితాలో పొందుపర్చిన ఉపాధ్యాయులు తమ ధ్రువపత్రాలతో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్జేడీ బి.లింగేశ్వరరెడ్డి పర్యవేక్షణలో సీనియర్ హెచ్ఎంలు, ఉద్యోగులు ధ్రువపత్రాలను పరిశీలించారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలోని ప్రభుత్వ స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు సర్వీసు రిజిస్టర్, సామాజిక ధ్రువీకరణ పత్రం ఒరిజినల్, విద్యార్హతల సర్టిఫికెట్లను పరిశీలించారు. ఉపాధ్యాయ బదిలీలతో ఏర్పడే ఖాళీల్లో సంబంధిత స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతులు కల్పించనున్నారు. అర్హత లేని వారికి ప్రాధాన్యం గ్రేడ్–2 హెచ్ఎం పోస్టుల్లో ఉద్యోగోన్నతులు కల్పించేందుకు రూపొందించిన సీనియార్టీ జాబితాలో అర్హత లేని వారికి ముందు వరుసలో స్థానం కల్పించినట్లు పలువురు ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. మెరిట్, రోస్టర్ను పాటించకుండా యథేచ్ఛగా అర్హత లేని వారికి ప్రాధాన్యతను ఇచ్చి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఉపాధ్యాయులు విమర్శిస్తున్నారు. తద్వారా అర్హులైన ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతోందని, ఆర్జేడీ కార్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. జెడ్పీ, మున్సిపల్ హెచ్ఎం పోస్టులకు... గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లాలోని జెడ్పీ, నగరపాలక సంస్థ, మున్సిపల్ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయ పోస్టులకు అర్హులైన స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ మంగళవారం పాత బస్టాండ్ సెంటర్లోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలోని జిల్లా పరీక్షా భవన్లో నిర్వహించారు. జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక పర్యవేక్షణలో సీనియార్టీ జాబితాలో పొందుపర్చిన ఉపాధ్యాయులు విద్యార్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలను పరిశీలించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉద్యోగోన్నతుల ద్వారా భర్తీ చేయనున్న హెచ్ఎం పోస్టుల్లో జెడ్పీ–59, మున్సిపల్–8, కార్పొరేషన్–9 చొప్పున ఉన్నాయి. ఆయా పోస్టుల వారీగా అర్హులైన ఉపాధ్యాయులను ఒక్కో పోస్టుకు ముగ్గురేసి చొప్పున సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచారు. బదిలీల ప్రక్రియ అనంతరం ఖాళీల ఆధారంగా సంబంధిత స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులకు హెచ్ఎంలుగా ఉద్యోగోన్నతి కల్పించనున్నారు. సీనియర్ హెచ్ఎంలు, ఉద్యోగులు ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియలో పాల్గొన్నారు. -
విద్యుత్ ఉద్యోగుల అభ్యున్నతికి కృషి చేయాలి
తెనాలి టౌన్: విద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేయాలని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఏపీసీపీడీసీఎల్ టెక్నికల్ డైరెక్టర్ ఆవుల మురళీకృష్ణ యాదవ్ను ఎనర్జీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అందె రాజేష్ కోరారు. మంగళవారం విజయవాడ రాష్ట్ర కార్యాలయంలో సీఎండీ పుల్లారెడ్డి, టెక్నికల్ డైరెక్టర్ ఆవుల మురళీకృష్ణ యాదవ్ను యూనియన్ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. యూనియన్ సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. సర్వీసు కండీషన్లు, పదోన్నతులపై చర్చించినట్లు రాజేష్ తెలిపారు. అలవెన్స్ ఆర్డర్ కాపీ ఇవ్వాలని కోరారు. లీవ్ ఎన్క్యాష్మెంట్కు సంబంధించిన ఆర్డర్ను కూడా త్వరలో ఇస్తామని డైరెక్టర్ చెప్పినట్లు వివరించారు. కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్వలీ, ఎగ్జిక్యూటివ్ మెంబరు బీటీ కృష్ణ తదితరులు ఉన్నారు. -
సహకార సంఘాల అభివృద్ధికి కృషి ముఖ్యం
జిల్లా సహకార అధికారి వెంకటరమణ నరసరావుపేట: సహకార సంఘాల సమగ్రాభివృద్ధికి కమిటీ సభ్యులు, సీఈఓలు తమ వంతు పాత్ర పోషించాలని జిల్లా సహకార అధికారి ఎం.వెంకటరమణ పేర్కొన్నారు. అంతర్జాతీయ సహకార సంవత్సరం సందర్భంగా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల కమిటీ సభ్యులు, కార్యనిర్వాహక కార్యదర్శులకు సామర్ధ్య నిర్మాణం – సుపరిపాలనపై ఏపీ రాష్ట్ర సహకార యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం జీడీసీసీ బ్యాంకులో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. దీనిలో వెంకటరమణ పాల్గొని మాట్లాడుతూ సహకార సంఘాల కమిటీ సభ్యులు, సీఈఓలు సహకార సంఘాలు అభివృద్ధిలో ముఖ్యపాత్ర వహిస్తున్నారని అన్నారు. విజయవాడ సహకార శిక్షణా కేంద్ర వైస్ ప్రిన్సిపాల్ వేదాంతరెడ్డి మాట్లాడుతూ సంఘ కార్యకలాపాల పర్యవేక్షణ, సరైన పాలనకు మార్గనిర్దేశం చేయడం కమిటీ సభ్యుల ముఖ్యవిధి అన్నారు. జిల్లాలో అన్ని సహకార సంఘాలను ఈ–పీఏసీఎస్గా మార్చి సభ్యులకు డిజిటల్ సేవలు అందిస్తున్నామని, దీనివల్ల సంఘాల్లో పారదర్శకత పెరుగుతుందని ఆయన చెప్పారు. కంప్యూటీకరణ మూలంగా సంఘాల ఆడిట్ సులభం అవుతుందని అన్నారు. శిక్షణలో సహకార సంఘాల పర్సన్ ఇన్ చార్జీలు, సంఘాల సీఇఓలు పాల్గొన్నారు. -
వైద్య విద్యార్థులకు ఉపకారవేతనాలు పంపిణీ
గుంటూరు మెడికల్: గుంటూరు వైద్య కళాశాలలో ప్రతిభ ఉన్న పేద వైద్య విద్యార్థులకు మంగళవారం స్కాలర్షిప్పులు పంపిణీ చేశారు. కళాశాల 1972 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు కలిసి రూ. 15 వేల చొప్పున ఏడుగురికి స్కాలర్షిప్పుగా అందించడానికి ముందుకొచ్చారు. ఈ మేరకు వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నాగార్జునకొండ వెంకట సుందరాచారి వాటిని అందజేశారు. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థానంలోకి వెళ్లాలని ఆయన ఆకాంక్షించారు. మరొకరికి చదువుకునేందుకు సాయం చేయాలని సూచించారు. దాతలకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ప్రభాకర్, జింకానా కో ఆర్డినేటర్ డాక్టర్ పి.వి.హనుమంతరావు, డాక్టర్ కె.ఎల్.ప్రసాద్, డాక్టర్ దక్షిణామూర్తి, పలువురు వైద్యులు పాల్గొన్నారు. -
చట్టవిరుద్ధంగా వ్యవహరించిన పోలీసులు
తెనాలి: నిందితుల అరెస్టు విషయంలో తెనాలి పోలీసులు చట్టవిరుద్ధంగా, అమానుషంగా వ్యవహరించారని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వై.నేతాజీ పేర్కొన్నారు. వారిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కానిస్టేబుల్పై దాడి ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసే క్రమంలో నడిరోడ్డుపై లాఠీలతో జులుం ప్రదర్శించటాన్ని ఖండించారు. బాధిత కుటుంబాన్ని ఈ మేరకు మంగళవారం సీపీఎం జిల్లా కమిటీ పరామర్శించింది. అయితానగర్కు చెందిన నిందితుల్లో ఒకరైన దోమ రాకేష్ నివాసానికి వెళ్లి, ఆయన తండ్రిని కలిసింది. కుటుంబ నేపథ్యాన్ని, ఘటన వివరాలను సభ్యులు తెలుసుకున్నారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. అనంతరం చెంచుపేటలోని ప్రజాసంఘాల కార్యాలయంలో నేతాజీ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెనాలిలో పోలీసులు వ్యవహరించిన తీరు దారుణమన్నారు. పోలీసుల వైఖరిని ఖండిస్తున్నామని చెప్పారు. గత నెల 24వ తేదీన రాత్రి వేళలో కానిస్టేబుల్ కన్నా చిరంజీవిపై నిందితులు దాడి చేశారని, ఆ క్రమంలో దాడికి గురైన కానిస్టేబుల్ను వెంటపెట్టుకొని పోలీసులు 25న నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. 27న మధ్యాహ్నం వరకు పోలీస్ కస్టడీలో ఉన్న నిందితులను చిత్రహింసలకు గురి చేశారని బాధిత కుటుంబికులు చెప్పారని తెలిపారు. దానికి తోడు బహిరంగంగా నిందితులపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడిన వీడియో వారి నిరంకుశ ధోరణికి అద్దం పడుతోందన్నారు. దళితులు, మైనారిటీలు అనే కోణంలోనే పోలీసులు దాడి చేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. నిందితులపై విచక్షణారహితంగా దాడి చేయాలని ఏ చట్టంలోనూ చెప్పలేదన్నారు. అయినా పోలీసులు చట్ట విరుద్ధంగా వ్యవహరించారని, ఇలాంటి చర్యలతో ప్రజాస్వామ్యంలో పోలీస్ వ్యవస్థ పై నమ్మకం సన్నగిల్లుతుందన్నారు. కానిస్టేబుల్పై యువకులు దాడికి పాల్పడిన ఘటన వెనుకనున్న ఆంతర్యాన్ని పోలీస్ ఉన్నతాధికారులు వెలికితీయాలన్నారు. కానిస్టేబుల్ కన్నా చిరంజీవి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పలు అభియోగాలు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, అమానుషంగా వ్యవహరించిన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు భావన్నారాయణ, తెనాలి ఏరియా కార్యదర్శి కె. బాబుప్రసాద్, ములకా శివసాంబిరెడ్డి పాల్గొన్నారు. పోలీసుల తీరుకు బీఎస్పీ ఖండన తెనాలి: ఒక కేసులోని ముద్దాయిలను తెనాలి పోలీసులు అత్యుత్సాహంతో బహిరంగంగా హింసించటాన్ని బీఎస్పీ నాయకులు ఖండించారు. స్థానిక అయితానగర్లోని పొట్టి శ్రీరాములు పార్కులో మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఎస్పీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు కూరపాటి సుబ్బారావు, గుంటూరు జిల్లా పార్లమెంటు ఇన్చార్జి తెనాలి ప్రకాష్, జిల్లా నాయకులు గూడవల్లి. మణికుమారి, చిరుతనగండ్ల వాసు, తెనాలి బాధ్యుడు కారుమంచి సునీల్ సందీప్ మాట్లాడారు. నిందితులను చిత్రహింసలకు గురిచేయడం దారుణం కానిస్టేబుల్ చిరంజీవిపైనా ఇప్పటికే పలు అభియోగాలు సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ బాధిత కుటుంబానికి పార్టీ జిల్లా కమిటీ నేతల పరామర్శ -
దురాచారాల నిర్మూలనలో పరిషత్ల కృషి భేష్
నాదెండ్ల: నేటి సమాజంలో సాంఘిక దురాచారాలను నిర్మూలించేందుకు నాటికల ద్వారా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసేందుకు కళాపరిషత్లు చేస్తున్న కృషి అభినందనీయమని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు చెప్పారు. నాదెండ్ల మండలం సాతులూరు గ్రామంలో ఎన్టీఆర్ కళాపరిషత్ తృతీయ జాతీయస్థాయి నాటికల పోటీలు నాలుగోరోజు మంగళవారం కొనసాగాయి. సభాధ్యక్షులుగా హైకోర్టు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు వ్యవహరించారు. అతిథులుగా అనంతవరం ఎన్టీఆర్ కళాపరిషత్ అధ్యక్షుడు గూదే పాండురంగారావు, సినీ హీరో సందేశ్ హాజరయ్యారు. ముఖ్యఅతిథిగా హాజరైన ముప్పాళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఏటా రాష్ట్రంలో వేల కళాపరిషత్ నాటికలు సమాజంలో నెలకొన్న దురాచారాలు, మూఢ నమ్మకాల నిర్మూలనకు విశేష కృషి చేస్తున్నాయన్నారు. అనంతరం దర్శకుడు, రచయిత సుంకర కోటేశ్వరరావు, నాటక రూపశిల్పి కె.థామస్లను కళాపరిషత్ సభ్యులు శాలువాలు, మెమొంటోలతో సత్కరించారు. కార్యక్రమాలను కళాపరిషత్ అధ్యక్షుడు నడింపల్లి వెంకటేశ్వరరావు పర్యవేక్షించారు. ఆకట్టుకున్న ప్రదర్శనలు... హైదరాబాద్ గోవాడ క్రియేషన్స్ వారి జ్యోతిరాజ్ రచనలో, వెంకట గోవాడ దర్శకత్వం వహించిన ‘అమ్మచెక్కిన బొమ్మ’ నాటిక ఆకట్టుకుంది. న్యూఢిల్లీ వారి అనశ్వరం నాటిక, చిలకలూరిపేట మద్దుకూరి ఆర్ట్స్ వారి ‘మా ఇంట్లో మహాభారతం’ నాటికలు ఆకట్టుకున్నాయి. నేటి ప్రదర్శనలు... తాడేపల్లి అరవింద ఆర్ట్స్ ‘విడాకులు కావాలి’, తెనాలి అద్దేపల్లి ఆరాధ్యుల ఆర్ట్స్ ‘ఎవరు’, కాట్రపాడు ఉషోదయ కళానికేతన్ ‘కిడ్నాప్’ నాటికలు బుధవారం ప్రదర్శించనున్నారు.కొనసాగుతున్న జాతీయస్థాయి నాటిక పోటీలు -
నేడూ పొగాకు రైతుల నిరసన
చిలకలూరిపేట: నల్లబర్లీ పొగాకును వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ చిలకలూరిపేటలోని ఐటీసీ కంపెనీ వద్ద పొగాకు రైతులు చేపట్టిన నిరసన దీక్షలు బుధవారం కూడా కొనసాగనున్నాయి. ఈ మేరకు రైతు సంఘాల సమన్వయ సమితి సభ్యులు తెలిపారు. క్వింటా ధర రూ.15వేలకు తక్కువ కాకుండా బర్లీ పొగాకును కంపెనీల చేత ప్రభుత్వం కొనిపించాలని కోరారు. దీక్షకు రైతులు, రైతు సంఘాల నాయకులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.నేడు కోటప్పకొండలో యోగాంధ్రనరసరావుపేట: కోటప్పకొండ శైవక్షేత్రం వద్ద యోగాంధ్ర కార్యక్రమం బుధవారం ఉదయం 6 గంటలకు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పి.అరుణ్బాబు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, ఎస్పీ కంచి శ్రీనివాసరావు పాల్గొంటారని తెలిపారు.విజయకీలాద్రిపై సుదర్శన హోమంతాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై మంగళవారం సుదర్శన హోమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్స్వామి వారి మంగళాశాసనాలతో అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం 9 గంటల నుంచి సర్వ రక్షాకర సుదర్శన హోమాన్ని నిర్వహించామని తెలిపారు. అమావాస్య రోజున హోమం, పారాయణం, శాంతులు, దానాలు చేయడం ఎంతో ఉన్నత ఫలితాలను ఇస్తాయని వివరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని ఆయన తెలిపారు.గోవుల అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలుపట్నంబజారు(గుంటూరుఈస్ట్) : బక్రీదు పండుగను పురస్కరించుకుని గోవుల అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఉప రవాణా కమిషనర్ కె.సీతారామిరెడ్డి హెచ్చరించారు. జూన్ 7న జరిగే బక్రీదు పండుగ సందర్భంగా గేదెలు, ఇతర పశువులను అధిక సంఖ్యలో వాహనాల్లో తరలించి వధకు పాల్పడితే వారిపై ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహించి కేసు నమోదు చేయడంతోపాటు, వాహనాలు సీజ్ చేస్తామన్నారు. వాహనాల్లో పశువులను తరలించే వారు ఎంవీఐ యాక్ట్ 1989, రూల్ 253 ప్రకారం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకోవాలని, అనంతరం తరలించాలని సూచించారు.శని జయంతి పూజలుమంగళగిరి టౌన్: శ్రీశనైశ్చర స్వామి జయంతిని పురస్కరించుకుని మంగళగిరిలోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వారి దేవస్థానం ప్రాంగణంలోని నవగ్రహ మండపంలో మంగళవారం శనిజయంతి పూజలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారికి తైలాభిషేకం, అర్చనలు, జపాలు, పూజలు నిర్వహించి పురోహితులకు నువ్వులు దానాలు ఇచ్చారు. దేవస్థానంలోని మల్లేశ్వరునికి అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా దేవస్థాన కార్యనిర్వహణాధికారి జేవీ నారాయణ తగు ఏర్పాట్లు చేసి పర్యవేక్షించారు.ఎంపీహెచ్ఏలకు బదిలీగుంటూరు మెడికల్: గుంటూరు జిల్లాలో వివిధ ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ మేల్ కేడర్కు చెందిన 172 మందికి డీఎంహెచ్ఓ కార్యాలయంలో మంగళవారం కౌన్సెలింగ్ నిర్వహించి మలేరియా, డెంగీ, చికున్ గున్యా ప్రబలి ఉన్న పలు ఆరోగ్య కేంద్రాలకు బదిలీ చేశారు. ఈ ప్రక్రియలో డీఎంహెచ్ఓతోపాటు, పరిపాలన అధికారి లక్ష్మీకుమారి, జిల్లా మలేరియా అధికారి సుబ్బరాయణం, ఆఫీస్ సూపరింటెండెంట్లు సత్యం, భక్తవత్సలం, సీనియర్ అసిస్టెంట్లు కిరణ్, రహీం పాల్గొన్నారు. -
మళ్లీ కరోనా కలవరం
జిల్లాలో ఇప్పటివరకు మూడు కేసులు నమోదు కరోనా పేరు చెబితేనే ప్రతి ఒక్కరి గుండెల్లో రైళ్లు పరుగెడతాయి. మళ్లీ ఇటీవల దేశ వ్యాప్తంగా కేసులు నమోదవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో కూడా మూడు కరోనా కేసులు వెలుగు చూడటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఇప్పటికే వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి నూతనంగా కరోనా వైరస్ కేసులు నమోదవుతున్న దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ ముందస్తుగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఇళ్లల్లోనే ఉండాలి. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు. బయటకు వచ్చేవారు తప్పనిసరిగా మాస్క్ ధరించండి. జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో, మార్కెట్, బస్టాండ్, రైల్వే స్టేషన్, తదితర ప్రదేశాల్లోకి వెళ్లకుండా దూరంగా ఉండండి. ఏదైనా అనుమానం ఉంటే గుంటూరు జీజీహెచ్లో ఉచితంగా కరోనా పరీక్షలు చేయించుకోవాలి. – డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, డీఎంహెచ్ఓ గుంటూరు మెడికల్ కరోనా వ్యాప్తి చెందకుండా తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కొవిడ్–19 నాటి నిబంధనలు పాటించేలా చూడాలని ఆదేశాల్లో ఉన్నతాధికారులు పేర్కొన్నారు. వ్యాధి వ్యాప్తి పెరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడమే ఉత్తమమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సైతం అప్రమత్తం అయ్యారు. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. నూతన కరోనా వైరస్ సైతం ఊపిరితిత్తులపైనే ప్రభావం చూపిస్తుండటంతో అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. తెనాలిలో ఫీవర్ సర్వే జిల్లాలో తెనాలికి చెందిన వృద్ధుడికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో తెనాలిలో ఫీవర్ సర్వే చేయిస్తున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి తెలిపారు. ప్రస్తుతం కరోనా సోకిన వృద్ధుడు మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. ఏలూరుకు చెందిన మరో ఇరువురు సైతం మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. లక్షణాలు ఇవీ... చిన్న పిల్లలు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగిన వ్యక్తులకు ప్రమాదం ఎక్కువగా కనిపిస్తోంది. తుమ్ములు, దగ్గుతో వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉంది. జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస సమస్యలు, ఆయాసం, ఛాతీ పట్టివేయడం వంటివి కరోనా వ్యాధి బాధితుల్లో కనిపిస్తున్నాయి. వారం దాటితే వైద్యులను సంప్రదించాలి నార్మల్ ఫ్లూ మాదిరిగానే ఈ వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. వారానికి మించి లక్షణాలు ఉంటే తప్పనిసరిగా పల్మనాలజిస్టులను సంప్రదించి, వారి సూచనల మేరకు చికిత్స తీసుకోవాలి. పదేళ్లలోపు పిల్లలు ఎక్కువ ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆస్తమా, డయాలసిస్, షుగర్, బీపీ, కిడ్నీ, గుండె జబ్బు లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఎక్కువ ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. మాస్క్లు ధరించడం, తగినంత నీటిని తీసుకోవడం ఉత్తమం. – డాక్టర్ బి.దుర్గాప్రసాద్, పల్మనాలజిస్ట్, గుంటూరు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులకు ఆదేశాలు ప్రజలు తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నతాధికారుల సూచన వ్యాధి బాధితులకు గుంటూరు జీజీహెచ్లో నిర్ధారణ పరీక్షలు జాగ్రత్తలు తీసుకుంటే మేలు.. దగ్గినా, తుమ్మినా తప్పనిసరిగా ముఖానికి చేతిరుమాలు అడ్డుపెట్టుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయకూడదు. చేతులను తరచుగా సబ్బుతో, శానిటైజర్తో మంచిగా శుభ్రం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలి. సరిపడా నీరు తాగాలి. కనీసం మూడు నుంచి ఐదు లీటర్ల వరకు నిత్యం తాగడం మంచిది. తగినంత నిద్రించాలి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి దూరంగా ఉండాలి. వైద్యుల సలహాలు లేకుండా సొంతంగా ఔషధాలు వేసుకోవద్దు. -
జంట హత్యలపై కట్టు కథలు
సాక్షి, టాస్క్ఫోర్స్: పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం గుండ్లపాడులో జరిగిన జంట హత్యలపై ప్రభుత్వం, పోలీసులు కట్టు కథ అల్లారు. కేసు ఎఫ్ఐఆర్ను పరిశీలిస్తే అందుకు బలం చేకూరుస్తున్నాయి. టీడీపీలో ఆధిపత్య పోరుతో జరిగిన హత్యలను ఎలాగైనా వైఎస్సార్ సీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిలపై నెట్టాలన్న దురుద్దేశంతో పెట్టిన అక్రమ కేసుగా స్పష్టమవుతోంది. హత్యలపై మృతుల అల్లుడు, టీడీపీ నేత తోట ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదులో హత్యకు గల కారణం గ్రామ తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరుతోనే జరిగిందని తన తొలి మాటల్లోనే తెలిపాడు. మృతుడు జెవిశెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ మొద్దయ్యను హతమారిస్తే టీడీపీలో నాకు ఎదురు ఉండదన్న కారణంతోనే నిందితుడు తోట వెంకట్రామయ్య హత్య చేశాడని స్పష్టం చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఎలాగైనా పిన్నెల్లి సోదరులను కేసులో ఇరికించాలన్న దుర్బుద్ధితో ఓ కట్టుకథకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా హత్యలో పాల్గొన్న నిందితులు జెవిశెట్టి శ్రీను, తోట వెంకట్రామయ్య, తోట గురవయ్య, దొంగరి నాగరాజులు హత్య చేసిన అనంతరం ప్రత్యక్ష సాక్షి తోట ఆంజనేయులును చూసి కారులోని కత్తులు తీసి బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే నిజంగా కారులో కత్తులే ఉంటే బండరాళ్లతో ఎందుకు మోది చంపుతారు, కత్తులే వాడే వారు కదా అనే ప్రశ్నలు తలెత్తుతు న్నాయి. పోలీసుల ఎఫ్ఐఆర్, ప్రభుత్వ వైద్యుల పంచనామాలో ఎక్కడా కత్తులు వాడినట్టు పేర్కొనలేదు. పోతూ పోతూ ‘‘ నా కొ..రా వచ్చేది మా వైఎస్సార్ ప్రభుత్వమే. మిమ్మల్ని బతకనివ్వం, మాతో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకట్రామరెడ్డిలు చెబితేనే మేము చేస్తున్నాం. మాకు ఏమైనా ఆపద వస్తే వాళ్లు చూసుకుంటారు.’’ అంటూ కత్తులు చూపి బెదిరిస్తూ పోయారని ఫిర్యాదు లో పేర్కొన్నారు. నిజంగా హత్యకు పిన్నెల్లి సోదరు లు కుట్ర పన్ని ఉంటే ఎవరైనా ఇలా చెబుతారా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. ఇది కేవలం పిన్నెల్లి సోదరులను కేసులో అక్రమంగా చేర్చడానికి ప్రభుత్వం, పోలీసుల కుట్రగా అర్థమవుతోంది. మరోవైపు హత్య జరిగిన వెంటనే ఫిర్యాదుదారుడైన తోట ఆంజనేయులు మీడియాతో మాట్లాడిన వీడియోలో మేము రావడం చూసి పారిపోయారని చెప్పాడు తప్ప నిలబడి బెదిరించారని ఎక్కడా చెప్పలేదు. ఎమ్మెల్యే ఒత్తిడితో మరుసటి రోజు ఫిర్యాదు సమయానికి మాట మార్చాడని అర్థమవుతోంది. నిందితులు పోతూపోతూ అన్నారని చెబుతున్న కట్టుకథలు తప్ప పన్నెల్లి సోదరుల పాత్రపై ఆధారాలు దొరకలేదు. హత్య జరిగిన ప్రదేశంలో జేబీఆర్ అని పసుపు పచ్చ రంగులో స్టిక్కర్ ఉన్న టీడీపీ నేత తోట వెంక్రటామయ్య కారు దొరికింది. ఆధిపత్య పోరు కారణంగానే హత్యలు జరిగినట్లు ఎస్పీ ప్రకటించారు. ప్రత్యక్ష సాక్షి హత్యలో పాల్గొన్న వారంతా టీడీపీ నేతలే అని స్పష్టం చేశాడు. ఇన్ని ప్రాథమిక ఆధారాలున్నా రాజకీయ కక్షతోనే పిన్నెలి సోదరులపై కేసు నమోదు చేసినట్టు అర్థమవుతోంది. ఎస్పీపై ఆగ్రహం పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావుపై పలు రకాలుగా ఒత్తిళ్లు తీసుకువచ్చినట్లు సమాచారం. ఇది టీడీపీ నేతల మధ్య జరిగిన హత్య అని ప్రాథమిక విచారణ తర్వాత ఎస్పీ తెలిపారు. దీంతో టీడీపీ అనుకూల మీడియాలో ఎస్పీపై వ్యతిరేక కథనాలు రాయించి బెదిరించే ధోరణిని ఎమ్మెల్యే జూలకంటి అవలంబించాడు. వైఎస్సార్ సీపీ నేతలపై తాను చెప్పినట్టు కేసులు నమోదు చేయకపోవడం వల్లే హత్యలు జరిగాయంటూ ఆరోపించారు. ఎస్పీపై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తానంటూ మీడియాలో లీక్లు ఇచ్చి బెదిరించి పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసు బనాయించినట్టు తెలుస్తోంది. ఇది టీడీపీ నేతల మధ్య జరిగిన హత్య అంటూ తేల్చిన పల్నాడు ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఎవరి ఒత్తిడితో మాట మార్చారో చెప్పాలని వైఎస్సార్ సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. జూలకంటి అసమర్థతే కారణం మా వెంట పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నాడంటూ హంతకుల బెదిరింపు మేము రావడం చూసి హంతకులు పారిపోయారంటూ చెప్పిన ప్రత్యక్ష సాక్షి మరుసటి రోజు మాట మార్చి తప్పుడు ఫిర్యాదు టీడీపీలో ఆధిపత్య పోరుతోనే జెవిశెట్టి సోదరుల హత్య అంటూ ఎఫ్ఐఆర్లో ప్రస్తావన జెవిశెట్టి వెంకటేశ్వర్లుకే ప్రాధాన్యత ఇస్తూ వచ్చిన ఎమ్మెల్యే జూలకంటి తోట వెంకట్రామయ్య వర్గానికి చెందిన వ్యక్తికి రెండు కాళ్లు విరగొట్టినా పట్టించుకోని ఎమ్మెల్యే దీంతో హత్య చేసేందుకు సిద్ధపడిన తోట వెంకట్రామయ్య ఇరువర్గాల మధ్య రాజీ చేయడంలో ఎమ్మెల్యే విఫలమయ్యారంటూ తెలుగు తమ్ముళ్ల ఆరోపణ తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు పిన్నెల్లి సోదరులపై కుట్ర గుండ్లపాడు టీడీపీ నాయకుల హత్యకు స్థానిక ఎమ్మెల్యే అసమర్థతే కారణమని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. కొంత కాలంగా గుండ్లపాడు పార్టీలో తారస్థాయికి చేరిన వర్గపోరును జూలకంటి పరిష్కరించి ఉంటే దశాబ్దకాలంగా పార్టీకి అండగా నిలిచిన కార్యకర్తలు హత్యకు గురయ్యేవారు కాదంటున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వెంకటేశ్వర్లు అలియాస్ మొద్దయ్య వర్గానికి, తోట వెంకట్రామయ్య వర్గానికి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. రెండు నెలలుగా అది ముదిరి దాడుల వరకు దారి తీసింది. అందులో భాగంగా గత నెల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వివాదమే హత్యకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇందులో తోట వెంకట్రామయ్య వర్గానికి చెందిన ఉప్పుతోళ్ల శ్రీనుపై హత్యకు గురైన జెవిశెట్టి మొద్దయ్య వర్గీయులు దాడి చేసి రెండు కాళ్లు విరిగగొట్టారు. అయినా మొద్దయ్యను ఎమ్మెల్యే ఏమనకపోవడం, పోలీసులు ఎటువంటి కఠిన చర్యలు తీసుకోకుండా అడ్డుకున్నాడన్న బాధ తోట వెంకట్రామయ్య వర్గంలో బలంగా నాటుకుపోయింది. మరోవైపు తాను ఫోన్ చేస్తే ఎమ్మెల్యే లిఫ్ట్ చేయడం లేదని, మొద్దయ్య మాటకే విలువిస్తున్నాడని వెంకట్రామయ్య ఒకరిద్దరు టీడీపీ స్థానిక నేతల వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తోంది. -
అవగాహనతోనే నకిలీలకు అడ్డుకట్ట
కొరిటెపాడు(గుంటూరు): ఖరీఫ్ సీజన్ సమీపిస్తుండటంతో రైతులు పొలం పనులకు సమాయత్తమవుతున్నారు. జూన్ నెల నుంచి ఖరీఫ్ సీజన్ విత్తనాలు చల్లే పనులు ప్రారంభం అవుతాయి. రైతుల అవసరాన్ని ఆసరాగా తీసుకుని కొందరు వ్యాపారులు నకిలీ విత్తనాలు అంటగట్టి అందినంత దోచుకునేందుకు అదునుగా ఎదురుచూస్తున్నారు. వీరి బారిన పడకుండా ఉండాలంటే రైతులు అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే వ్యాపారులు చేస్తున్న అక్రమాలను గుర్తించి ప్రశ్నించగలరని అధికారులు చెబుతున్నారు. అన్నింటా మోసం.. విత్తనాలు కొనుగోలు చేసి పొలంలో వేసుకున్న తర్వాత మొలకలు పూర్తిగా రాకపోవడం, తక్కువ శాతం మొలకలు రావడం జరిగితే నాశిరకం విత్తనాలు ఇచ్చి వ్యాపారి తమను మోసం చేశారని రైతులు అనుకుంటారు. ఒక్క విత్తనాలు అనుకుంటే పొరపాటే. విత్తనాలతో పాటు ఎరువులు, పురుగు మందులు.. ఇలా ప్రతి వ్యాపారంలోనూ మోసాలు జరుగుతుంటాయి. పరిశీలన తప్పనిసరి.. ప్రభుత్వ అనుమతి పొంది వ్యాపారం చేస్తున్న డీలర్ వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలి. రశీదులు(బిల్లులు) ఇవ్వని దుకాణాల్లో విత్తనాలు కొనుగోలు చేయకపోవడమే మంచిది. కొనుగోలు చేసిన విత్తనాల సంచుల(బ్యాగ్)కు సీల్ వేసి ఉన్నాయో? లేదో? చూసుకోవాలి. సీల్ వేసి ఉన్న సంచులనే కొనుగోలు చేయాలి. సంచులపై కంపెనీ పేరు, తయారీ, గడువు తేదీలు, నికర బరువు, విత్తన రకం, తేమ శాతం.. తదితర అంశాలను సరిచూసుకోవాలి. పొలంలో విత్తనాలు వేసుకున్న తర్వాత సంచులను, రశీదులను, సంచులపై ఉన్న సమగ్ర వివరాలను తెలియజేసే పత్రాలను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. విత్తనాలు కొనుగోలు సమయంలో మోసం జరిగితే వినియోగదారుల చట్టం ప్రకారం పరిహారం పొందేందుకు ఇవే కీలకమవుతాయి. విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలి కొనుగోలు సమయంలో రశీదు తప్పనిసరి నకిలీలను గుర్తిస్తే.. పొలంలో వేసిన విత్తనాలకు మొలకలు రాకపోతే నకిలీ విత్తనాలుగా భావిస్తారు. దిగుబడి పూర్తిగా రాకపోయినా నకిలీ విత్తనాలుగానే భావించవచ్చు. వెంటనే వ్యవసాయశాఖ ఏఓ, ఏడీఏ, డీఏఓ, పోలీసులకు అన్ని రకాల రశీదులతో రైతుకు జరిగిన నష్టాన్ని, విత్తనాలు ఎక్కడ కొనుగోలు చేశారో తెలియజేస్తూ ఫిర్యాదు చేసి రశీదు ఉంచుకోవాలి. ధ్రువీకరించేందుకు శాస్త్రవేత్తలను అధికారులు తీసుకువస్తారు. పోలీసులు, వ్యవసాయాధికారులు ఇచ్చిన నివేదికల ఆధారంగా వినియోగదారుల ఫోరంలో కేసు వేస్తే రైతులకు న్యాయం జరుగుతుంది. –నున్నా వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ అధికారి, గుంటూరు -
ప్రారంభం కాకుండానే పగుళ్లు
● నాసిరకంగా ప్రత్తిపాడు పీహెచ్సీ నిర్మాణ పనులు ● రూ.6కోట్లతో నిర్మాణం ● నెర్రెలిచ్చిన గోడలు, పిల్లర్లు.. పగిలిన ప్రహరీ ● చెమ్మగిల్లుతున్న గోడలు ప్రత్తిపాడు: ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణ లోపం, కాంట్రాక్టరు ఇష్టారాజ్యం.. వెరసి రూ.6 కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ఆస్పత్రి భవనం పగుళ్లిస్తుంది. 2022లో ప్రత్తిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రం ఆధునికీకరణకు రూ.6కోట్లు నాబార్డు నిధులు మంజూరు చేశారు. శిథిల భవనం స్థానంలో పెద్ద నూతన భవనం నిర్మించడంతో పాటు పక్కనే ఉన్న మరో భవనంపై రెండవ అంతస్తును కూడా నిర్మించారు. ఇంకా భవన నిర్మాణ పనులు పూర్తికాలేదు. చివరి దశలో ఉన్న ఈ నిర్మాణ పనుల్లో ఇంజినీరింగ్ అధికారుల వైఫల్యం బయట పడుతుంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు రెండు భవనాలను జాయింట్ చేసిన చోట నుంచి వాటర్ లీక్ అవుతుంది. వాననీరు ఆస్పత్రి గదుల్లోకి చేరుతుంది. అంతేకాకుండా అనేక గదుల్లో గోడలు పగిలిపోయి, చెమ్మగిల్లి పెయింట్లు పెచ్చులూడి కనిపిస్తుంది. కాగా ఓ చోట ఏకంగా పిల్లరు పగుళ్లిచ్చింది. మరో చోట పిట్టగోడ పగిలిపోయి దర్శనమిస్తుంది. కేవలం ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణ లోపం వలనే పగుళ్లు, చెమ్మలు వస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంకా భవనం ప్రారంభం కాకముందే ఇన్ని లోపాలు బయటపడుతుండటంతో భవనం నాణ్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
ముస్లింల చైతన్యానికి రాజకీయ వేదిక
ఉమ్మడి గుంటూరు జిల్లా ఎంయూఎఫ్ ముఖ్యనేతల నిర్ణయం తెనాలి: ప్రస్తుత పరిస్థితుల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ (ఎంయూఎఫ్)ను బలోపేతం చేసుకుంటూ అనుబంధంగా రాజకీయ చైతన్య వేదికను ఏర్పాటు చేయాలని ఎంయూఎఫ్ ముఖ్యనేతల సమావేశం తీర్మానించింది. ఉమ్మడి గుంటూరు జిల్లా ఎంయూఎఫ్ ముఖ్యనేతల సమావేశం ఆదివారం స్థానిక చినరావూరులోని సీనియర్ నేత షేక్ ఖలీల్ అధ్యక్షతన జరిగింది. ప్రస్తుత రోజుల్లో ఎంయూఎఫ్ ఆవశ్యకత అనే అంశంపై జరిగిన సమావేశానికి ఆ సంస్థ అధ్యక్షుడు ఎండీ కలీం ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ గత 28 ఏళ్లుగా పార్లమెంట్ వ్యవస్థను విశ్వసిస్తూ, ప్రజాస్వామ్య లౌకికవాద విధానాలను అవలంభిస్తూ, ఎన్నో కార్యక్రమాలతో ముస్లింల న్యాయమైన హక్కులను సాధించేందుకు కృషిచేసినట్టు గుర్తుచేశారు. అధ్యక్షత వహించిన షేక్ ఖలీల్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఎంయూఎఫ్ను గుంటూరు ఉమ్మడిజిల్లాలో బలోపేతం చేసేందుకు 17 నియోజకవర్గాల్లో కమిటీల ఏర్పాటుకు ముఖ్యనేతలంతా కృషిచేయాలని కోరారు. ముస్లింలను రాజకీయంగా చైతన్యపరచాల్సిన అవసరం ఉన్నందున ముస్లిం యునైటెడ్ ఫ్రంట్కు అనుబంధంగా రాజకీయ చైతన్య వేదిక ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను సమావేశంలో ప్రవేశపెట్టారు. సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించటంతో తీర్మానం చేశారు. అన్ని నియోజకవర్గాల్లో ముఖ్య నాయకులు పర్యటించి నియోజకవర్గస్థాయి సమావేశాల నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో గుంటూరు జిల్లా ముఖ్య నాయకులు షేక్ కరీముల్లా (ప్రత్తిపాడు), ఎంఏ సాలార్ (వినుకొండ), షేక్ ఇబ్రహీం (పెదకూరపాడు), మెమన్ భాష, సయ్యద్ జాఫర్ (పొన్నూరు), సయ్యద్ జాకీర్ హుస్సేన్ (తాడికొండ ), సయ్యద్ ఆదమ్ సాహెబ్ (గుంటూరు వెస్ట్), సయ్యద్ గౌస్ బాషా, షేక్ వహీద్ (గుంటూరు ఈస్ట్)తోపాటు తెనాలి నియోజవర్గంలోని మండలాల నాయకులు పాల్గొన్నారు. -
కీటక జనిత వ్యాధులపై అప్రమత్తత అవసరం
డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి గుంటూరు మెడికల్: వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో దోమలు వృద్ధి చెంది వ్యాధులు వ్యాప్తి చెందకుండా అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి సూచించారు. డీఎంహెచ్ఓ కార్యాలయంలో సోమవారం మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్, అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్లతో కీటక జనిత వ్యాధుల నివారణపై సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డీఎంహెచ్ఓ మాట్లాడుతూ దోమలు వృద్ధి చెందకుండా యాంటీ లార్వా మెజర్స్ అమలు చేయాలన్నారు. అడల్డ్ మస్కిటో మెజర్స్పై అప్రమత్తంగా ఉండాలన్నారు. డెంగీ, మలేరియా వంటి దోమ కాటు వ్యాధులను గణనీయంగా తగ్గించేలా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలన్నారు. పరిసరాల పరిశుభ్రత వల్ల దోమలు దరిచేరవని, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతోపాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునేలా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి సుబ్బరాయణం, అసిస్టెంట్ మలేరియా అధికారి రాజునాయక్, ఏఎంఓ ప్రభాకర్రెడ్డి, ఘంటసాల శ్రీనివాసరావు, నరేంద్రబాబు, ప్రశాంత్, సబ్ యూనిట్ ఆఫీసర్లు శేషగిరిరాజు, శ్రీమన్నారాయణ, శిగణేష్ పాల్గొన్నారు. -
డల్లాస్లో వైఎస్సార్ సీపీ కార్యకర్తల సమావేశం
గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోనే అన్ని వర్గాల ప్రజలకు సుపరిపాలన, సంక్షేమం దక్కాయని అవర్ స్టేట్.. అవర్ లీడర్ సభ్యుడు అప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. యూఎస్ఏ పర్యటనలో ఉన్న కిరణ్కుమార్ రెడ్డి సోమవారం డల్లాస్లో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, అభిమానులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్ ప్రజల్లో విశ్వసనీయత, ఆదరాభిమానాలు పొందారని అన్నారు. ప్రజా సంక్షేమంతో పాటు వారి కుటుంబాలు, పిల్లల అభివృద్ధిని తన ఆనందంగా భావించి, ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎదగాలని ఆశించారని అన్నారు. యుఎస్ఏలోని అవర్ స్టేట్ – అవర్ లీడర్ సభ్యుడు శివ అన్నపురెడ్డి మాట్లాడుతూ ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని, సంక్షేమ కార్యక్రమాలను నిర్విరామంగా అమలు చేసేందుకు కోవిడ్ ప్రభావంతో రెండేళ్ల పాటు ఎన్నో ఆర్థికపరమైన సవాళ్ళను ఎదుర్కొన్నారని తెలిపారు. సంతమాగులూరు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్ష సాధింపు చర్యలు, అరెస్టుల పర్వం మినహా ప్రజా సంక్షేమం, ఆర్థికాభివృద్ధి సాధించాలనే ఆలోచన లేకుండా పోయిందన్నారు. ఈసందర్భంగా అవర్ స్టేట్ – అవర్ లీడర్, ఇంటలెక్చువల్ ఫోరమ్ వ్యవస్థాపక అధ్యక్షుడు జి.శాంతమూర్తి మాట్లాడుతూ గ్రూపునకు చెందిన 700కు పైగా సభ్యులు రాష్ట్రంతో పాటు వివిధ రాష్ట్రాలు, దేశాల్లో వైఎస్ జగన్ నాయకత్వాన్ని బలపర్చేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో రమణారెడ్డి, డాక్టర్ రామిరెడ్డి, ప్రసాద్ భీమవరపు, సాంబిరెడ్డి, పాల్ రెడ్డి, దుర్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అ‘పూర్వ’ సమ్మేళనం
● తెనాలి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మెమోరియల్ జూనియర్ కాలేజీ 1995–97 బ్యాచ్ ఇంటర్ పూర్వ విద్యార్థుల సమావేశం ● 28 సంవత్సరాల తర్వాత కలుసుకున్న మిత్రులు గుంటూరు మెడికల్: తెనాలి డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ మెమోరియల్ జూనియర్ కాలేజ్లో 1995–97 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ చదివిన పూర్వ విద్యార్థులు సోమవారం మంగళగిరిలోని ఓ ఫంక్షన్ హాల్లో కలుసుకున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో, ఇతర రాష్ట్రాల్లో వివిధ వృత్తుల్లో, హోదాల్లో స్థిరపడిన మిత్రులంతా 28 సంవత్సరాల అపూర్వ వేడుకలకు హాజరై ఆనందాన్ని పంచుకున్నారు. పలువురు తమ కుటుంబ సభ్యులతో హాజరై కాలేజీ రోజుల్లో చేసిన చిలిపి పనులు గుర్తు చేసుకుని నాటి జ్ఞాపకాల్లో విహరించారు. సీఐలు రాంబాబు, రమేష్, ఎస్ఐ రాజారావు, కానిస్టేబుళ్లు సుబ్బారావు, ఆనంద్, బాబూరావు, కోటి, సుబ్బు, సీఆర్పీఎఫ్కు చెందిన అనిల్, పలువురు వైద్య సిబ్బంది వేడుకల్లో పాల్గొన్నారు. -
‘సాతి’పై అవగాహన కార్యక్రమం
గుంటూరు లీగల్: హైకోర్ట్ ఆదేశాల మేరకు నాల్గో అదనపు జిల్లా జడ్జి ఆర్.శరత్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం స్టేక్ హోల్డర్స్కు ‘సాతి’ (సర్వే ఫర్ ఆధార్ అండ్ యాక్సిస్ త్రూ ట్రాకింగ్, హాలిస్టిక్ ఇంక్లూషన్) పై ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ పాల్గొని సాతి డిస్ట్రిక్ట్ కమిటీ విధి, విధానాల గురించి వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు, ఆధార్ నమోదు, న్యాయ సహాయం, సంక్షేమ పథకాలతో అనుసంధానం ద్వారా అనాథ పిల్లలను గుర్తించి, వారికి సహాయం చేయడానికి సాతి కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఏ ఒక్క బిడ్డ గుర్తింపు లేకుండా, వారి హక్కులు, అర్హతలకు దూరంగా ఉండకుండా చూసు కోవడమే దీని ప్రధాన లక్ష్యమన్నారు. వీధి బాలలు, అనాథలు, రక్షించబడిన పిల్లలు వంటి 18 సంవత్సరాల లోపు నిరాశ్రయులైన పిల్లలందరికీ చట్టపరమైన గుర్తింపును అందించడం, వారికి ప్రభుత్వ పథకాలు, విద్య, ఆరోగ్యం, రక్షణ సేవలను అందించడం జరుగుతుందన్నారు. ఈ కమిటీలో సెక్రటరీ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, చైర్ పర్సన్, జిల్లా బాలల పరిరక్షణ అధికారి యూఐడీఏఐ ప్రతినిధి, ప్రతి తాలూకా తహసీల్దార్లు, జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా ఆరోగ్య అధికారి, సివిల్ సర్జన్, జిల్లా శిశు అభివృద్ధిశాఖ అధికారి, జువైనెల్ యూనిట్ నుంచి పోలీస్ అధికారి, అనాధ శరణాలయాలు, బాలల సంరక్షణ సంస్థల ప్రతినిధులు ఐదుగురు, ప్యానల్ లాయర్లు నలుగురు, పారా లీగల్ వలంటీర్లు నలుగురు సభ్యులుగా ఉంటారన్నారు. -
పొగాకు రైతుకు అండగా వైఎస్సార్ సీపీ
అద్దంకి: పొగాకు రైతుకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని ఆ పార్టీ అద్దంకి నియోజకవర్గ ఇన్చార్జి పానెం చిన హనిమిరెడ్డి చెప్పారు. మాజీ ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 28న పొగాకు రైతుల సమస్యలు తెలుసుకోవడం కోసం పొదిలి వస్తున్నారని చెప్పారు. దీనికి సంబంధించి బాపట్ల జిల్లాలోని స్థానిక పార్టీ కార్యాలయంలో సోమవారం పోరుబాట పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న రైతు లు, నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం నల్ల బర్లీ సాగు చేసిన రైతు పరిస్థితి జీవన్మరణ స్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వైపు దిగుబడులు పడిపోవడం, మరో వైపు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించకపోవడం రైతుల పట్ల ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తోందన్నారు. ఆదుకోవాలని ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా స్పందించలేదన్నారు. అందుకే పొగాకు రైతుల తరఫున పోరాటం చేసేందుకు, వారికి ధైర్యం కల్పించేందుకు వైఎస్ జగన్ పొదిలి రాను న్నట్లు చెప్పారు. అయితే టీడీపీ నాయకులు, అక్కడ హడావుడి చేసే పరిస్థితి కనిపిస్తోందన్నారు. కానీ తమ నేత అనుకున్న కార్యక్రమం పూర్తి చేస్తా రని స్పష్టం చేశారు. చేతనైతే రైతులకు సాయం చేసే విధంగా ఉండాలే తప్ప వారికి మేలు జరిగే పనిని అడ్డుకోవాలనుకుంటే ప్రజలు బుద్ధి చెప్పి తీరుతారన్నారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు జ్యోతి హనుమంతరావు, పట్టణ అధ్యక్షుడు కాకాని రాధాకృష్ణమూర్తి, రాష్ట్ర బూత్ కమిటీ జాయింట్ సెక్రటరీ పులికం కోటిరెడ్డి, ప్రచార కమిటీ జాయింట్ సెక్రటరీ కోయి అంకారావు, వాణిజ్య విభాగం అధ్యక్షుడు జి.రఘురామగుప్తా తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారమే లక్ష్యం
లక్ష్మీపురం: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, వాటిని సత్వరం పరిష్కరించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్ర శేఖర్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్ తేజతో కలిసి కేంద్ర మంత్రి అర్జీలు స్వీకరించారు. ప్రజల నుంచి మొత్తం 222 అర్జీలు వచ్చాయి. అర్జీల స్వీకరణ అనంతరం పెమ్మసాని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తుందన్నారు. ఎక్కువగా భూ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు వస్తున్నాయని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఇకపై గోల్డెన్ డే గా నిర్వహించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. కార్యక్రమంలో భాగంగా కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని కొందరు దివ్యాంగుల వద్దకు స్వయంగా వెళ్లి అర్జీలు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. డిప్యూటీ కలెక్టర్లు గంగరాజు, లక్ష్మీకుమారి, డీఆర్ఓ ఎన్ఎస్కే ఖాజావలి, స్టెప్ సీఈఓ ఆర్.చంద్రముని, ఆర్డీఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు. సబ్సిడీతో విత్తనాలు, పరికరాలు ఇవ్వాలి ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి మరికొన్ని రోజులు మాత్రమే ఉన్నా, జిల్లాలో ఇప్పటికీ విత్తనాల పంపిణీ, కౌలురైతుల గుర్తింపు, గ్రామసభల నిర్వహణ వంటి ప్రక్రియలు చేపట్టలేదు. రైతులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. వెంటనే 90 శాతం సబ్సిడీతో విత్తనాలు, పరికరాలు రైతులకు అందజేయాలి. – కొల్లి రంగారెడ్డి, పచ్చల శివాజీయానిమేటర్ పై చర్యలు తీసుకోవాలి డ్వాక్రా గ్రూపుల నుంచి ప్రతి నెల బ్యాంక్లో జమ చేయాల్సిన నగదును, శ్రీనిధి, ఉన్నతి వంటి బ్యాంక్ రుణాలకు సంబంధించి కొన్ని నెలలుగా కట్టాల్సిన రూ.15లక్షలను మా గ్రూపు నుంచి వసూలు చేసుకున్న యానిమేటర్ బి.శ్యామల వాటిని బ్యాంకులో జమచేయలేదు. బ్యాంక్లో మళ్లీ రుణం పొందేందుకు వెళ్లిన మాకు బ్యాంకు వారు విషయం చెప్పడంతో ఆమెను నిలదీస్తే అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేసింది. తీరా ఇప్పుడు పరారీలో ఉంది. కాకుమాను పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేస్తే సదరు యానిమేటర్ ఎక్కడుందో మమ్మల్నే వెతికి సమాచారం చెప్పాలని బదులు చెబుతున్నారు. అధికారుల వద్దకు వెళ్లితే కేసు పెట్టుకోమని చెబుతున్నారు. యానిమేటర్ను పట్టుకుని, మాకు న్యాయం చేయాలి. – ప్రశాంతి డ్వాక్రా గ్రూపు, శ్రీ సత్యన్నారాయణ గ్రూపు సభ్యులు, గరికపాడు, కాకుమాను మండలం కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పీజీఆర్ఎస్లో జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్తో కలిసి అర్జీలు స్వీకరణదివ్యాంగుల వసతి గృహాన్ని తనిఖీ చేయాలి స్థానిక బృందావన్ గార్డెన్స్లో వున్న దివ్యాంగుల వసతి గృహాన్ని తనిఖీ చేయాలి. అంధులు, దివ్యాంగులను వసతి గృహాంలోకి రానివ్వకుండా మనోవేదనకు గురి చేస్తున్నారు. విచారించి, వారిపై చర్యలు తీసుకోవాలి. జిల్లా లో 2016 వికలాంగుల చట్టం అమలు కావడం లేదు. చట్టం అమలు అయ్యేలా చూడాలి. విభిన్న ప్రతిభావంతులకు అన్ని కార్యాలయాల్లో స్పెషల్ గ్రీవెన్స్ ఏర్పాటు చేయాలి. – విభిన్న ప్రతిభావంతుల ఆదరణ సేవా సంస్థ ప్రతినిధులు -
స్టాక్ పాయింట్లలో ఇసుక నిల్వ చేయండి
లక్ష్మీపురం: జిల్లాలో వర్షాకాలంలో ఇసుక సరఫరాకు ఇబ్బందులు లేకుండా ముందస్తుగా అవసరమైన ఇసుకను స్టాక్ పాయింట్లలో నిల్వ చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో సోమవారం జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జరిగింది. ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం నుంచి వైకుంఠపురం వరకు నావిగేషన్ ఛానల్–4లో ఇసుక తవ్వకాలకు సంబంధించి సర్వే పూర్తి అయిన వెంటనే పెనుమాక, రాయపూడి, వెంకటాయపాలెం, లింగాయపాలెం, బోరుపాలెం, అబ్బురాజుపాలెంలో ఇసుక పూడికతీతకు బోట్స్మెన్ సొసైటీకి కేటాయింపుపై సాంకేతిక నివేదికను వారంలో అందించాలని జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. లింగాయపాలెం స్టాక్ పాయింట్ను నిర్వహించిన స్వయం సహాయక సంఘాలకు పెండింగ్లో ఉన్న ఇసుక లిఫ్టింగ్ చార్జీలను తహసీల్దారు నుంచి నివేదిక అందించిన వెంటనే మంజూరు చేయాలన్నారు. పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలకు అవసరమైన అనుమతులు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. లబ్ధిదారుల సర్వే పూర్తి చేయాలి రాష్ట్ర సచివాలయం నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీసీఎల్ఏ జయలక్ష్మి అందరికీ ఇళ్లు పథకం సర్వేపై సోమవారం నిర్వహించిన జిల్లా కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీసీఎల్ఏ జయలక్ష్మి మాట్లాడుతూ అందరికీ ఇళ్లు పథకంలో స్థలాలు మంజూరైన లబ్ధిదారుల సర్వేను పూర్తి చేసేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ భార్గవ్ తేజ, డీఆర్ఓ ఎన్ఎస్కే ఖాజావలి పాల్గొన్నారు. కౌలు రైతు గుర్తింపు కార్డులపై వీడియో కాన్ఫరెన్స్ రాష్ట్ర సచివాలయం నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీసీఎల్ఏ జయలక్ష్మి, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ కౌలు రైతు గుర్తింపు కార్డులు మంజూరు, అన్నదాత సుఖీభవ పథకంపై జిల్లా కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం సమీక్షించారు. జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ, డీఏఓ నున్నా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. డీఆర్సీ సమావేశంలో ఇన్చార్జ్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ -
ఏపీ రెసిడెన్షియల్ కళాశాలల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్
గుంటూరు ఎడ్యుకేషన్ : ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని జూనియర్ కళాశాలల్లో సీట్ల భర్తీకి సోమవారం పాత బస్టాండ్ సెంటర్లోని జిల్లా పరీక్షా భవన్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఏపీఆర్జేసీ సెట్–2025లో అర్హత సాధించిన విద్యార్థులకు సంస్థ కార్యదర్శి బీఎన్ మస్తానయ్య ఆదేశాల మేరకు ఆంధ్ర రీజియన్లోని ఏపీఆర్ జూనియర్ కళాశాలల్లో సీట్ల కేటాయింపు ప్రక్రియను ఏపీఆర్జేసీ సెట్ కన్వీనర్ హెచ్ఎండీ ఉబేదుల్లా పర్యవేక్షించారు. ఆంధ్ర రీజియన్ పరిధిలోని తాటిపూడి బాలికల కళాశాల, నిమ్మకూరులోని కో–ఎడ్యుకేషన్, నాగార్జునసాగర్లోని బాలుర కళాశాల, గుంటూరు, వెంకటగిరిలోని బాలుర జూనియర్ కళాశాలల్లో సీట్లను భర్తీ చేసేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల ద్వారా విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. 299 సీట్లకు 1:5 నిష్పత్తిలో 1,328 మంది విద్యార్థులను కౌన్సెలింగ్కు పిలువగా, వారిలో మొదటి రోజు ఎంపీసీ, ఐఐటీ కోర్సులకు 131 బాలురు, 33 మంది బాలికలు హాజరై ఆయా కళాశాలల్లో సీట్లను కోరుకున్నారు. కాగా మంగళవారం బైపీసీ, బుధవారం ఎంఈసీ, సీఈసీ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు కన్వీనర్ ఉబేదుల్లా తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రులకు భోజన, తాగునీటి వసతులు కల్పించారు. తుళ్లూరులో 28.8 మి.మీ వర్షం కొరిటెపాడు(గుంటూరు): జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు ఏడు మండలాల్లో వర్షం పడింది. అత్యధికంగా తుళ్లూరు మండలంలో 28.8 మిల్లీ మీటర్లు వర్షం పడగా, అత్యల్పంగా తాడేపల్లిలో 0.6 మి.మీ వర్షం పడింది. సగటున 3.5 మి.మీ వర్షపాతం నమోదైంది. ఫిరంగిపురం మండలంలో 17.4 మి.మీ., తాడికొండ 8.2, ప్రత్తిపాడు 5.8, గుంటూరు తూర్పు 1.2, గుంటూరు పశ్చిమలో 1 మి.మీ చొప్పున వర్షం పడింది. -
విద్యాశాఖ బదిలీలలు
గుంటూరు ఎడ్యుకేషన్: బదిలీలకు తెరలేచిందనే ఆనందం ఉపాధ్యాయుల్లో ఎక్కువ కాలం నిలిచేలా లేదు. ఎందుకంటే బదిలీకి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ప్రభుత్వం విధించిన కఠిన నిబంధనలతో కోరుకున్న పాఠశాలకు వెళ్లడం గగనమవుతోంది. ఒకవైపు బదిలీలు చేపడుతున్నామంటూనే మరోవైపు గతంలో ఎన్నడూ లేని రీతిలో విధించిన నిబంధనలతో ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో భాగంగా ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ మంగళవారం ముగియనుంది. ఇందుకు సంబంధించి జీఓ 22 ద్వారా విడుదల చేసిన మార్గదర్శకాలతో ఉపాధ్యాయులు బెంబేలెత్తుతున్నారు. పుట్టుకతో శారీరక వైకల్యానికి గురైన ఉపాధ్యాయులకు ప్రిఫరెన్షియల్ కేటగిరీ ద్వారా వారు కోరుకున్న పాఠశాలకు వెళ్లే సదుపాయంపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. శారీరక వైకల్యం 70 శాతం లోపు ఉంటే ప్రాధాన్యత క్రమంలో పాయింట్లు, 70 శాతానికి పైగా ఉంటే ఎటువంటి ఆంక్షలు లేకుండా ప్రిఫరెన్షియల్ కేటగిరీలో సంబంధిత ఉపాధ్యాయులు వారు పని చేస్తున్న పాఠశాలలకు బదిలీపై వెళ్లవచ్చు. గత 25 ఏళ్లకు పైగా అమల్లో ఉన్న ఈ విధానాన్ని మార్చివేసి ఎస్జీటీలకు 40 శాతం, స్కూల్ అసిస్టెంట్లకు 50 శాతం సీలింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. కక్షపూరితంగానే..! శారీరక వైకల్యంతో బాధపడుతున్న వారిపై కనీస మానవత్వం లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. బదిలీల ప్రక్రియలో భాగంగా ఒకే పాఠశాలలు ఐదు విద్యాసంవత్సరాలు పూర్తి చేసుకున్న గ్రేడ్–2 హెచ్ఎం, ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులకు బదిలీ తప్పనిసరి. ● ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం ఒకరు లేక ఇద్దరు ఎస్జీటీలు ఉన్న ప్రాథమిక పాఠశాలలకు లాంగ్ స్టాండింగ్ విధానంలో బదిలీపై వెళ్లేందుకు పీహెచ్ కేటగిరీ ఉపాధ్యాయులకు అవకాశం లేదు. ముగ్గురి కంటే ఎక్కువ ఉపాధ్యాయులు ఉంటేనే సదరు పాఠశాలలను కోరుకోవాలని లేకుంటే మరో పాఠశాలకు వెళ్లాలంటూ ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వం, సీలింగ్ పరిధికి మించిన పాఠశాలలను బ్లాక్ చేసింది. ● పుట్టుకతో అంధత్వం, వినికిడి లోపంతో పాటు నడవలేని స్థితిలో ఉన్న ఉపాధ్యాయులకు గతంలో తాము పని చేస్తున్న పాఠశాలల్లోనే బదిలీ కాకుండా ఉండటంతో పాటు కోరుకున్న చోటకు బదిలీపై వెళ్లే అవకాశం ఉండేది. అయితే ప్రస్తుతం ఈ సదుపాయం లేకుండా ప్రిఫరెన్షియల్ కేటగిరీకి ప్రభుత్వం కొత్త భాష్యం చెబుతోంది. ● శారీరక వైకల్యంతోపాటు దీర్ఘకాలిక జబ్బులు, కేన్సర్, గుండె జబ్బులతో బాధపడుతున్న ఉపాధ్యాయులు హైస్కూళ్లలో సింగిల్ సబ్జెక్టు టీచర్లుగా బదిలీపై వెళ్లేందుకు అవకాశం లేకుండా చేశారు. బ్లైండ్, వినికిడి లోపం, నడవలేని స్థితిలో ఉన్నవారికి సైతం కోరుకున్న పాఠశాలలకు వెళ్లే అవకాశం లేకుండా కఠిన నిబంధనలు విధించారు. ప్రతి మండలంలో 15 వరకు ఖాళీలు ఉండగా, వాటిలో కేవలం ఐదు స్థానాలు మాత్రమే కోరుకునే విధంగా ఉంచి, మిగిలిన వాటిని బ్లాక్ చేశారు. ● దూరప్రాంతాల్లో మగ్గుతూ వైద్య సదుపాయాల కోసం పట్టణ ప్రాంతాలకు వెళ్లాలని ఆశపడుతున్న టీచర్లకు మొండిచెయ్యి చూపారు. భర్త చనిపోయిన మహిళా ఉపాధ్యాయులకు విడాకులు తీసుకున్న ఉపాధ్యాయినులకు సైతం నిరాశే ఎదురవుతోంది. అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలు ఉన్న ఉపాధ్యాయులకు సైతం అన్యాయానికి గురవుతున్నారని ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళన నెలకొంది. ఆర్థికంగా భారం లేని బదిలీల ప్రక్రియపై ప్రభుత్వం ఎందుకింద కఠినంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంఘాలతో జరిపిన చర్చలకు, మార్గదర్శకాలకు పొంతన లేదని ఉపాధ్యాయ సంఘాల నాయకులు బహిరంగంగా విమర్శిస్తున్నారు. బదిలీలకు అవకాశం ఇచ్చి.. కఠిన నిబంధనలతో మోకాలొడ్డి.. శారీరక వైకల్యంతో బాధపడుతున్న వారిపై కనీస మానవత్వం కరవు 25 ఏళ్లుగా అమలులో ఉన్న ప్రిఫరెన్షియల్ కేటగిరీపై ఆంక్షలు ఉపాధ్యాయ బదిలీలకు నేటితో ముగియనున్న గడువు ఉమ్మడి గుంటూరు జిల్లాలో దాఖలైన దరఖాస్తులు 6,870 లాంగ్ స్టాండింగ్లో తప్పనిసరి బదిలీ కావాల్సిన హెచ్ఎంలు, టీచర్లు 4,143 మంది ఉమ్మడి జిల్లాలో 6,870 దరఖాస్తులు ఉపాధ్యాయ బదిలీల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మంగళవారం ముగియనుండగా, సోమవారం నాటికి ఉమ్మడి గుంటూరు జిల్లాలో 6,870 మంది ఉపాధ్యాయులకు బదిలీలకు దరఖాస్తు చేశారు. వీరిలో లాంగ్ స్టాండింగ్లో తప్పనిసరి బదిలీ కావాల్సిన హెచ్ఎంలు, టీచర్లు 4,143 మంది ఉన్నారు. మానవత్వం లేకుండా మార్గదర్శకాలు బదిలీల మార్గదర్శకాల్లో విద్యాశాఖాధికారులు ఇష్టారాజ్యంగా నిబంధనలు విధించారు. పీహెచ్ కేటగిరీతో పాటు ప్రిఫరెన్షియల్ కేటగిరీకి చెందిన ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం చేస్తూ పాఠశాలల్లో ఖాళీలను బ్లాక్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పీడబ్ల్యూడీ చట్టానికి వ్యతిరేకంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. వైకల్యాన్ని అధిగమించి, ఎంతో కష్టపడి చదువుకుని ఉద్యోగం పొందిన వారిపై మానవత్వంతో వ్యవహరించాల్సినది పోయి ఈ విధంగా కఠిన నిబంధనలు విధించడం దారుణం. – కె.బసవలింగారావు, ఏపీటీఎఫ్, గుంటూరు జిల్లా అధ్యక్షుడువైకల్యంతో పుట్టడం మా తప్పా ? నేను గుంటూరు రూరల్ ఓబులనాయుడుపాలెంలోని ఎంపీయూపీఎస్లో పని చేస్తున్నాను. 70 శాతానికి పైగా శారీరక వైకల్యానికి గురైన నేను బదిలీల్లో గుంటూరుకు సమీపంలోని పాఠశాలలకు వెళ్లేందుకు అవకాశం లేకుండా చేశారు. ఉపాధ్యాయ బదిలీల చట్టంలో లేని విధంగా జీఓలో అనేక కఠిన నిబంధనలు విధించారు. శారీరక వైకల్యంతో జన్మించడం నా తప్పా ? మానవత్వాన్ని చూపాల్సిన ప్రభుత్వం, అధికారులు ఈ విధంగా నిబంధనలు విధించి పీహెచ్ కేటగిరీ ఉపాధ్యాయులకు అన్యాయం చేయడం తగదు. – పి.నాగశివన్నారాయణ, ఎస్జీటీ, గుంటూరు -
ముగిసిన ప్రసన్నాంజనేయుడి జయంత్యుత్సవాలు
బెల్లంకొండ: మండలంలోని బెల్లంకొండ క్రాస్ రోడ్ వద్ద గల శ్రీ కోళ్లూరు ప్రసన్నాంజనేయ స్వామి జయంతి, కల్యాణ ఉత్సవాలు ఆదివారం వైభవంగా ముగిశాయి. చివరి రోజు స్వామికి విశేష పూజలు జరిగాయి. ఉదయాన్నే ఆలయ ప్రధాన అర్చకులు బొర్రా వెంకట అనంతాచార్యులు స్వామికి సుప్రభాత సేవలతో పూజలు ప్రారంభించారు. అనంతరం లక్ష మల్లె పూలతో విశేష పూజలను నిర్వహించారు. చివరి రోజు భక్తులు పెద్దఎత్తున హాజరై స్వామికి పొంగళ్లు చేసి, నైవేద్యాలను సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. రాత్రి రాజుపాలెం గ్రామానికి చెందిన శ్రీ అంకమ్మ తల్లి కళా నాట్యమండలి వారి శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి పౌరాణిక నాటకాన్ని ప్రదర్శించారు. ఆదివారం ఆలయంలో హుండీని లెక్కించగా జనవరి నుంచి ఈ నెల 25 వరకూ హుండీ ద్వారా రూ. 3,28,366 ఆదాయం వచ్చినట్లు ఈవో పేర్కొన్నారు. ఐదు రోజుల పాటు ఉత్సవాల నిర్వహణకు సహకరించిన అందరికీ ఆలయ కమిటీ సభ్యులు ధన్యవాదాలు తలిపారు. ఉత్సవాల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. చివరి రోజు లక్ష మల్లెలతో స్వామికి అభిషేకం -
నాలుగు పర్యాటక ప్రదేశాల్లో యోగా ప్రదర్శన
నరసరావుపేట: యోగాంధ్ర కార్యక్రమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ప్రతి ఒక్కరికీ యోగా గొప్పతనాన్ని వివరించి వారితో ఆసనాలను వేయించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా ఇప్పటికే జిల్లాలో ఎంపిక చేసిన మాస్టర్ ట్రైనీలు, టీఓటీలకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రెండో రోజు ఆదివారం కూడా శిక్షణ కొనసాగింది. ఆన్లైన్ ద్వారా జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిర్వహించారు. ఇందులో యోగా గురువులు, టీఓటీలు ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లాలో నాలుగు పర్యాటక ప్రాంతాల్లో భారీస్థాయిలో యోగా ప్రదర్శించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించింది. దీని ప్రకారం ఈనెల 28న కోటప్పకొండ, జూన్ 5న నాగార్జునసాగర్, 11న కొండవీడు కోట, 18న అమరావతి వద్ద ప్రదర్శనలు నిర్వహించనున్నారు. అంశాల ప్రాతిపదికగా ప్రతి జిల్లాకు ఒక థీమ్ను ప్రభుత్వం కేటాయించింది. దీనిలో భాగంగా జిల్లాలో వేలాది మంది ఏఎన్ఎం, ఆశా వర్కర్లు వర్కర్లతో జూన్ ఐదున యోగా ప్రదర్శనను నిర్వహించడానికి అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. శిక్షణ పొందినవారితో బాటు, సామాన్య ప్రజలు సైతం ఈ యోగా స్ట్రీట్కి వచ్చి ఆసనాలను అభ్యాసం చెయ్యవచ్చు. పోలీసు శాఖ అధ్వర్యంలో సోమవారం ఉదయం నరసరావుపేటలోని కలెక్టర్ బంగ్లా రోడ్డు వద్ద ప్రధాన రహదారిపై యోగా ప్రదర్శన నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఐదున రాష్ట్ర స్థాయి కార్యక్రమం కొనసాగుతున్న శిక్షణ -
ద్విచక్ర వాహనం ఢీకొని మహిళ మృతి
మాచవరం: ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ఓ మహిళ మృతి చెందగా, మరో మహిళకు తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని పిల్లుట్లలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పిల్లుట్ల గ్రామానికి చెందిన కాండ్రకుంట ఐశ్వర్య (33), కామినేటి సుజాతలతో పాటు మరి కొంత మహిళలు పొలం పనుల నిమిత్తం రోడ్డు దాటుతున్నారు. ఈ క్రమంలో నర్రా బాలు పిడుగురాళ్ల వైపు నుంచి ద్విచక్ర వాహనంపై అతి వేగంగా వస్తూ వారిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం పిడుగురాళ్ల ఆసుపత్రికి తరలిస్తుండగా కాండ్రకుంట ఐశ్వర్య (33) మృతి చెందింది. తీవ్ర గాయాలైన సుజాతను పిడుగురాళ్ల ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆమె ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఎం.రోశయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.కృష్ణా నదిలో వ్యక్తి గల్లంతు.. పోలీసుల ముమ్మర గాలింపుఅచ్చంపేట: కృష్ణా నదిలో వ్యక్తి గల్లంతైన ఘటన మండలంలోని గింజుపల్లి వద్ద ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పల్నాడు జిల్లా, నకరికల్లు మండలం, చాగళ్లు గ్రామానికి చెందిన ఆలపరి సైదారావు(43) మరికొంత మందితో ఆదివారం ఉదయం ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసుకుని మాదిపాడు పంచాయతీ పరిధిలోని సత్తెమ్మ తల్లి దేవాలయానికి వచ్చారు. మధ్యాహ్నం వరకు అమ్మవారికి మొక్కుబడులు తీర్చుకుని, కానుకలు సమర్పించి అక్కడే భోజనాలు వండుకుని తిన్నారు. సుమారు మూడు గంటల సమయంలో సమీపంలోని గింజపల్లి వద్ద కృష్ణానదిలో సరదాగా ఈత కొట్టేందుకు మరో 10మందితో దిగాడు. సైదారావు నది లోతుల్లోకి వెళ్లిపోగా దగ్గరలో ఉన్నవారు రక్షించే ప్రయత్నం చేసినా ఫలించ లేదు. విషయం తెలుసుకున్న అచ్చంపేట సీఐ శ్రీనివాసరావు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈతగాళ్ల సహాయంతో చేపల పడవల ద్వారా ఆదివారం రాత్రి 7గంటల వరకు గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఫలితం లేకపోయింది. మృతుడు కూలి పనే వృత్తిగా జీవిస్తుంటాడు. సైదారావుకు భార్య, బీటెక్ చదివే కుమారైలు ఇద్దరు ఉన్నారు.సంపులో పడి బాలుడి మృతిలక్ష్మీపురం: సంపులో పడి బాలుడు మృతి చెందిన ఘటన శనివారం జరిగింది. గుంటూరు కొత్తకాలనీకి చెందిన ఒడిశా వాసుల కుమారుడు రాఘవకుమార్ (5) ఆడుకుంటూ ఓ సంపులో పడి ప్రాణాలు కోల్పోయాడు. నీటి కోసం తవ్విన సంపుకు ఎటువంటి రక్షణ ఏర్పాట్లు లేకపోవడంతో ప్రమాదవశాత్తు అందులో జారి పడ్డాడు. అయితే కుటుంబ సభ్యులుకు బాలుడు కనిపించకపోవడంతో చుట్టు పక్కల ప్రాంతాలలో గాలింపు ప్రారంభించారు. తీరా సంపులో పరిశీలించగా రాఘవకుమార్ అందులో పడి ఉన్నాడు. దీంతో హుటాహుటిన ప్రభుత్వ సమగ్రాసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఈ విషయం తెలుసుకున్న నగరంపాలెం పోలీసులు బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కుటుంబ సభ్యులు ఎలాంటి ఫిర్యాదులు చేయబోమని, పోస్ట్మార్టం అవసరం లేదని చెప్పి బాలుడి మృతదేహాన్ని తీసుకువెళ్లారు. -
తిరునాళ్లలో మైక్ అనుమతికి నిరాకరణ
చెరుకుపల్లి: పొన్నపల్లి గ్రామంలో వేంచేసియున్న శ్రీ కార్మూరమ్మ తిరునాళ్లకు మైక్ అనుమతి ఇవ్వకుండా స్థానిక పోలీసులు అడ్డుకున్న ఘటన ఆదివారం చోటుచేసుకుంది. మండలంలోని పొన్నపల్లి గ్రామంలో ఎక్కువ శాతం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. 95 శాతం మంది వైఎస్సార్ సీపీ సానుభూతిపరులు ఉన్నారు. పది రోజులు క్రితం మైక్ అనుమతి కోసం గ్రామ పెద్దలు మీ–సేవ ద్వారా చలానా తీశారు. స్థానిక ఎస్ఐ అనిల్కుమార్ను నాలుగు రోజులుగా పొన్నపల్లి గ్రామస్తులు సంప్రదిస్తూనే ఉన్నారు. గ్రామంలో గొడవలు జరుగుతాయనే సమాచారం ఉందని, అందుకే మైక్ పర్మిషన్ ఇవ్వలేమని చెప్పడం గమనార్హం. దీంతో ఆదివారం వైఎస్సార్సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఈవూరి గణేష్ నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లారు. రేపల్లె రూరల్ సీఐ సురేష్బాబును, ఎస్ఐ అనిల్ కుమార్ను దీనిపై సంప్రదించినా అనుమతికి ససేమిరా అన్నారు. వైఎస్సార్ సీపీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్బాబు, డాక్టర్ ఈవూరి గణేష్ తదితరులు గ్రామస్తులతో కలిసి రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు. దీంతో కొంతసేపు పోలీసులకు, నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ ఈవూరి గణేష్ మాట్లాడుతూ.. గ్రామంలోని వారు వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్నారని, కూటమి నేతల ఆదేశాల మేరకే స్థానిక పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారని తెలిపారు. ఇది మంచి సంప్రదాయం కాదన్నారు. ఇప్పటికై నా పోలీసు అధికారులు స్పందించి తిరునాళ్ల సంతోషంగా జరుపుకోవటానికి మైక్ అనుమతి ఇవ్వాలని కోరారు. సమాచారం తెలుసుకున్న రేపల్లె డీఎస్పీ అవల శ్రీనివాసరావు వచ్చి డాక్టర్ ఈవూరి గణేష్తో చర్చించారు. దీంతో మైక్ పర్మిషన్ వచ్చింది. దీనిపై గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం వరుకూటి అశోక్బాబు, డాక్టర్ ఈవూరి గణేష్లు అమ్మవారిని కార్యకర్తలతో కలిసి దర్శించుకున్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ దుండి వెంకటరామిరెడ్డి, నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు. వెఎస్సార్సీపీకి గ్రామస్తులు అనుకూలమని పక్షపాతం రేపల్లె రూరల్ పోలీసుల అత్యుత్సాహం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఈవూరి గణేష్ ఆగ్రహం ఎట్టకేలకు డీఎస్పీ ఆదేశాలతో మైక్ అనుమతి -
విశ్రాంత జడ్జిని బెదిరించిన వ్యక్తిపై కేసు
లక్ష్మీపురం: విశ్రాంత జడ్జి స్థలాన్ని ఆక్రమించుకుని బెదిరింపులకు దిగుతున్న వ్యక్తిపై కేసు నమోదు చేశారు. నగరంపాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంపాలెం స్టార్ గరల్స్ హైస్కూల్లో నివాసం ఉంటున్న విశ్రాంత జడ్జి జోసఫ్ స్థలాన్ని నగరంపాలెం ప్రాంతానికి చెందిన అంబేడ్కర్ ఆక్రమించుకుని బెదిరింపులకు దిగుతున్నాడు. దీంతో జోసఫ్ నగరంపాలెం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వర్షం ●ప్రత్తిపాడులో 27.4 మి.మీ. వర్షం ●సగటున 17.9 మి.మీ. వర్షపాతం కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాలో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు అత్యధికంగా ప్రత్తిపాడు మండలంలో 27.4 మిల్లీ మీటర్లు వర్షం కురవగా, అత్యల్పంగా మంగళగిరి మండలంలో 9.6 మి.మీ . కురిసింది. సగటున 17.9 మి.మీ. వర్షపాతం నమోదైంది. మే నెల 25వ తేదీ వరకు జిల్లా సాధారణ వర్షపాతం 48.2 మి.మీ. పడాల్సి ఉండగా, ఇప్పటి వరకు 184.7 మి.మీ. నమోదైంది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు.. గుంటూరు తూర్పు 26.4 మి.మీ., ఫిరంగిపురం 25.2, గుంటూరు పశ్చిమ 24.2, దుగ్గిరాల 22.6, తెనాలి 22.4, పెదకాకాని 21.4, పొన్నూరు 20.6, కొల్లిపర 17.4, పెదనందిపాడు 15.6, చేబ్రోలు 15.4, వట్టిచెరుకూరు 14, కాకుమాను 13.8, తాడికొండ 12.6, మేడికొండూరు 11.4, తాడేపల్లి 11.4, తుళ్లూరు మండలంలో 10.8 మి.మీ. చొప్పున కురిసింది. సందడిగా మీరక్ వసంతం నగరంపాలెం: స్థానిక రింగ్రోడ్డు శుభం కల్యాణ మండపంలో ఆదివారం రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు ఆదర్శ్ ఆధ్వర్యంలో మీరాక్ వసంతం వైభవంగా నిర్వహించారు. తంబోలా, టేబుల్గేమ్స్, ఫ్యాషన్ షో, పాటలు పోటీలు, కుర్చీలాట, అభరణాల ప్రదర్శన చేపట్టారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఆయా పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఆదర్శ అధ్యక్షురాలు పోలిశెట్టి రత్నప్రియ, కార్యదర్శి వల్లూరి హిమబిందు, కన్వీనర్ మట్ట ప్రియ, మట్టుపల్లి సునీత పాల్గొన్నారు. మీరక్ వసంతం ద్వారా సేకరించిన నిధులు సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామని నిర్వాహకులు తెలిపారు. -
కళల తెనాలికి ఆభరణం కాటూరి శిల్పకళ
తెనాలి: వంశపారంపర్యంగా వస్తున్న శిల్పకళను కొనసాగిస్తూ ఆరు, ఏడు తరాల్లో ఆ కళకు జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకొస్తున్న శిల్పకళాకారులు కాటూరి వెంకటేశ్వరరావు, ఆయన కుమారులు రవిచంద్ర, శ్రీహర్షలు కళల తెనాలికి గర్వకారణమని పలువురు వక్తలు అభినందించారు. ప్రముఖ స్వచ్ఛంద సేవాసంస్థ మానవత తెనాలి శాఖ సర్వసభ్య సమావేశం ఆదివారం స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ లైబ్రరీ హాలులో జరిగింది. సంస్థ తెనాలి చైర్మన్ డాక్టర్ కొలసాని రామ్చంద్ అధ్యక్షత వహించారు. రాష్ట్రప్రభుత్వ ‘కళారత్న’ అవార్డు గ్రహీత కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర, శ్రీహర్షను ఈ వేదికపై సత్కరించారు. తెనాలిలో తొలిసారిగా శిల్పకళపై నిర్వహిస్తున్న కాటూరి ఆర్ట్ గ్యాలరీ, తండ్రీకొడుకుల శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనమని డాక్టర్ రామ్చంద్ అన్నారు. సత్కారగ్రహీత కాటూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తండ్రీకొడుకులు ముగ్గురికీ ఒకే వేదికపై అభినందన గౌరవం మరచిపోలేనిదని చెప్పారు. తండ్రి కోటేశ్వరరావు నుంచి వచ్చిన శిల్పకళను గురువు అంచే రాధాకృష్ణమూర్తి శిక్షణలో మెరుగుపరచుకున్నట్టు చెప్పారు. బీఎఫ్ఏలో పీజీ చేసిన రవిచంద్ర ఇనుప వ్యర్థాలకు శిల్పకళా సోయగాలు కల్పిస్తుంటే, శ్రీహర్ష త్రీడీ, ఏఐ టెక్నాలజీని జోడిస్తూ కళాత్మక ఉట్టిపడేలా చేస్తుండటం తమ అదృష్టమన్నారు. సభకు ముందు ‘ఆపరేషన్ సిందూర’ స్ఫూర్తితో ఎన్ఎస్ఎస్ మున్సిపల్ హైస్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయుడు బెల్లంకొండ వెంకట్ నేతృత్వంలో ప్రదర్శించిన ‘తల్లికి వందనం’ సాంస్కృతిక కార్యక్రమం ప్రశంసలను అందుకుంది. ఎగ్జిక్యూటివ్ అధ్యక్షుడు ఓంకార్ ప్రసాద్, కార్యదర్శి పి.వెంకట్, డీవీ సోమయ్యశాస్త్రి, కూరపాటి కల్యాణి, మొవ్వా సత్యనారాయణ పాల్గొన్నారు. సత్కార సభలో ప్రముఖుల అభినందన -
మదిని దోచిన సంగీత, నాట్య కళారూపాలు
చిలకలూరిపేట: కన్నుల పండువగా సంప్రదాయ నృత్యాలు, వీనుల విందుగా సుమధుర సంగీత కీర్తనలు, నాట్య కళాకారుల ఉత్సాహపూరిత ప్ర దర్శనల మధ్య కళా నిలయం 40వ జాతీయ స్థా యి నవరస శాసీ్త్రయ, జానపద, సంగీత నాట్య కళా రూపాల పోటీలు ఆదివారం రెండో రోజు కొనసాగాయి. పోటీలకు వేదికై న పట్టణంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆర్యవైశ్య కల్యాణ మండపంలో భరతనాట్యం, కూచిపూడి పోటీలు సూర్య, చంద్ర విభాగాల్లో రసవత్తరంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు కాళ్లకు గజ్జెలు కట్టి ,చక్కటి హావభావాలతో నాట్యకళ ప్రదర్శించి, నటరాజ వారసులమని నిరూపించారు. కీర్తన, మూషిక వాహన, గణపతి కౌతం, వినాయక కౌతం, ముద్దుగారే యశోద, బాలగోపాల తరంగం, బ్రహ్మాంజలి, దశావతార శబ్దం,జనుత శబ్దం,కొండలలో నెలకొన్న, భామాకలాపం, నరసింహ వైభవం, హిమగిరి తనయ, అలవేల్ మంగ వంటి కీర్తనలకు లయబద్ధంగా నర్తించారు. రసజ్ఞులైన ప్రేక్షకులను రంజింపచేసి వారి ప్రశంసలను అందుకున్నారు. ఒకవైపు పోటీలు కొనసాగిస్తూనే మరోవైపు నాట్యకళ బోధించిన నాట్యాచార్యులకు సన్మానాలు నిర్వహించి వారి ఆశీస్సులు పొందారు. ముందుగా కళానిలయం నిర్వాహకుడు ప్రగడ రాజమోహనరావు సతీమణి శివసత్యనారాయణమ్మ జ్యోతి ప్రజ్వలన చేసి పూజ నిర్వహించారు. నేటి కార్యక్రమాలు సూర్య, చంద్ర విభాగాల్లో జానపద నృత్య పోటీలతో పాటు శాసీ్త్రయ జంట నాట్యాలు, అశాసీ్త్రయం జంట నాట్యాలు, శాసీ్త్రయ బృంద నాట్యాలు, అశాసీ్త్రయ బృంద నాట్యాలు, శాసీ్త్రయ నృత్యనాటికల పోటీలు సోమవారం నిర్వహిస్తారు. వీటితో పాటు నాట్యాచార్యులకు సన్మానాలు ఉంటాయి. రెండో రోజు ఆకట్టుకున్న నాటికలు నాదెండ్ల: మండలంలోని సాతులూరులో నటరత్న ఎన్టీఆర్ కళాపరిషత్ తృతీయ జాతీయ నాటికల పోటీలు ఆదివారం రెండో రోజు ప్రారంభమయ్యాయి. శనివారం రాత్రి కురిసిన వర్షంతో గుంటూరు ఆరాధన ఆర్ట్స్ ఆధ్వర్యంలో జరగాల్సిన ‘మరీ అంతొద్దు’ నాటిక ప్రదర్శన నిలిచిపోయింది. ఆదివారం తొలిగా ప్రదర్శించారు. అనంతరం కొలకలూరి శ్రీసాయి ఆర్ట్స్ ఆధ్వర్యంలో ‘జనరల్ బోగీలు’ నాటికను ప్రదర్శించారు. పీటీ మాధవ్ రచనకు గోపరాజు విజయ్ దర్శకత్వం వహించారు. విశాఖపట్నం భద్రం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘దొందూ దొందే’ నాటిక ప్రదర్శించారు. రచనా దర్శకత్వం డేవిడ్రాజు వహించారు. ఏలూరు హేలాపురి కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘సారీ రాంగ్ నంబర్’ నాటికకు రచయితగా చింతల మల్లేశ్వరరావు, దర్శకుడిగా మహమ్మద్ ఖాజావలి వ్యవహరించారు. సామాజిక రుగ్మతలు, సందేశాలను నాటికలు ప్రస్ఫుటించాయి. జ్యోతి ప్రజ్వలన బండారుపల్లి మస్తాన్రావు, సభా పరిచయం నడింపల్లి వెంకటేశ్వరరావు చేయగా, సభాధ్యక్షత గరికపాటి వెంకట రామారావు వహించారు. నేటి ప్రదర్శనలు : బాపట్ల సహృదయ ద్రోణాదుల వారి ‘వర్క్ఫ్రం హోమ్’, సాతులూరు వజ్జా రామనాథం ఆర్ట్స్ ‘రారాజు సుయోధన’, వరంగల్ జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక ‘ఏకాకి’ ప్రదర్శనలు నిర్వహించనున్నారు. రెండో రోజు కొనసాగిన కళానిలయం జాతీయ స్థాయి పోటీలు -
జిల్లాస్థాయి ఫుట్బాల్ జట్ల ఎంపిక
చీరాల రూరల్: బాపట్ల జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఎన్ఆర్ అండ్ పీఎంఏ హైస్కూలు క్రీడా మైదానంలో సబ్ జూనియర్స్, జూనియర్స్ విభాగాలలో జిల్లా స్థాయి జట్లను ఎంపిక చేశారు. ప్రతిభభ ఆధారంగా వీరిని ఎంపిక చేసినట్లు బాపట్ల జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు వి. విజయకుమార్, కోఆర్డినేటర్ ఎన్. దేవదాసు, సమ్మర్ క్యాంప్ ఇన్చార్జి బి.ప్రేమయ్య, కోచ్ ప్రసన్నకుమార్ తెలిపారు. బాలురకు సంబంధించి అండర్–13, అండర్–15లలో 22 మంది చొప్పున ఎంపికై నట్లు పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారని చెప్పారు. సీనియర్ క్రీడాకారుడు ఎన్. నరేష్, రమ్మికుమార్, ఎన్.బాలశౌరి, క్రీడాకారులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా‘ కారుమూరు’
వేమూరు: వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గానికి చెందిన కారుమూరు వెంకట రెడ్డిని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించినట్లు కేంద్ర పార్టీ కార్యాలయం ఆదివారం ప్రకటన జారీ చేసింది. చుండూరు మండలంలోని కారుమూరు పాలెం గ్రామానికి చెందిన కారుమూరు వెంకట రెడ్డి డిబేట్స్ విశ్లేషకులుగా, పార్టీలోనూ అనేక పదవులు చేపట్టారు. వైఎస్సార్సీపీ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పని చేశారు. నియోజకవర్గంలో కేవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కారుమూరు వెంకట రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్బాబు ప్రోత్సాహంతో తనకు పదవి లభించిందని తెలిపారు. ట్రాక్టర్ కింద పడి వ్యక్తి మృతి వేటపాలెం: ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని దేశాయిపేట పంచాయతీ పరిధి విఘ్నేశ్వర కాలనీ దగ్గర ఇసుక క్వారీలో ఆదివారం చోటు చేసుకుంది. కొత్తపేటలోని మూడు రోడ్లు దగ్గలో నివాసం ఉండే పిగిలి వాసు (38) తన ట్రాక్టర్తో ఇసుక క్వారీ వద్దకు వెళ్లాడు. ట్రాక్టర్ను క్వారీ వద్ద నిలిపి ఇసుక లోడ్ చేసుకునే సమయంలో కిందికి దిగాడు. ట్రాక్టర్ ఓ కుప్ప నుంచి ముందుకు దొర్లుకుంటూ పోతుండటంతో వాసు ట్రాక్టర్పైకి ఎక్కి దానిని ఆపేందుకు ప్రయత్నించాడు. ప్రమాదవ శాత్తు జారి ట్రాక్టర్ టైరు కింద పడిపోయాడు. వెంటనే అక్కడ ఉన్న వారు గమనించి చీరాల ఏరియా వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై వెంకటేశ్వర్లు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అమ్మసన్నిధి.. భక్తజన సందడి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వేసవి సెలవులు, పెద్ద సంఖ్యలో వివాహాల నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగింది. ఆదివారం తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన భక్తులు రద్దీ సాయంత్రం వరకు కొనసాగింది. దీంతో క్యూలు కిటకిటలాడుతూ కనిపించాయి. మహా మండపం రెండో అంతస్తులో దేవస్థానం ఏర్పాటు చేసిన అన్న ప్రసాదాన్ని భక్తులు స్వీకరించారు. ఉదయం 11 గంటల నుంచి భక్తుల రద్దీ మరింత పెరగడంతో ఘాట్రోడ్డు పైకి కార్లను అనుమతించలేదు. మధ్యాహ్నం మహా నివేదన నిమిత్తం 11.40 నుంచి 12.15 గంటల వరకు అన్ని దర్శనాలు నిలిపివేశారు. భక్తుల రద్దీ ఉండే సమయాల్లో వీఐపీ దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో శీనానాయక్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యలో ఆదివారం ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు వీఐపీ దర్శనాలు నిలివేశారు. ప్రముఖులు, అధికారుల పేరిట వచ్చిన వారికి ఈవో ఆదేశాలను వివరించారు. మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత వీఐపీ దర్శనాలకు అనుమతించారు. టికెటు ఉంటేనే అంతరాలయ దర్శనం రూ. 500 టికెటు ఉన్న వారికి మాత్రమే అంతరాలయంలోకి అనుమతించారు. ఆదివారం ఉదయం ఈవో శీనానాయక్ పలుమార్లు టికెట్ల స్కానింగ్, చెకింగ్ పాయింట్లను తనిఖీ చేశారు. ప్రముఖుల సిఫార్సులతో దర్శనానికి విచ్చేసిన వారిని ప్రొటోకాల్ కార్యాలయానికి వెళ్లి టికెట్లు కొనుగోలు చేసుకోవాలని సూచించారు. రద్దీ నేపథ్యంలో వృద్ధులు, వికలాంగులు, చిన్న పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక సమయం కేటాయింపు దిశగా ఈవో చర్యలు చేపట్టారు. అమ్మవారి దర్శనం పూర్తయిన భక్తులు నటరాజ స్వామి ఆలయం, సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం వద్ద సేద తీరగా ఈవో శీనానాయక్ వారిని కలిసి మాట్లాడారు. దుర్గగుడిలో ఉదయం 11.30 నుంచి వీఐపీ దర్శనాలు నిలిపివేత -
మాటల్లోనే ఇంపు.. ఊరంతా కంపు
కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో అధ్వానంగా పారిశుద్ధ్యం నెహ్రూనగర్: నగరంలో ఎక్కడా గార్బేజ్ పాయింట్లు ఉండటానికి వీల్లేదని.. అవి కనిపిస్తే సంబంధిత శానిటరీ ఇన్స్పెక్టర్, సెక్రటరీలే బాధ్యత వహించాలని కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు. కానీ నగరంలోని పలు చోట్ల గార్బేజ్ పాయింట్లు కనిపిస్తూనే ఉన్నాయి. సకాలంలో ఇంటింటి చెత్త సేకరణ జరగకపోవడంతోపాటు పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానం ఉంది. ఎక్కడ చూసినా వ్యర్థాల కుప్పలే దర్శనమిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో చెత్తను రోడ్లపై వేయకుండా గ్రీన్ పట్టాలు కట్టించారు. దీనివల్ల కూడా ఉపయోగం కనిపించడం లేదు. ఫిర్యాదులు రావడంతో కమిషనర్ పులి శ్రీనివాసులు చెత్త వేసే వారిని గుర్తించి వారికి జరిమానా విధించాలని ఆదేశించారు. పేరుకుపోయిన చెత్తను మాత్రం తొలగించే మార్గాలు అన్వేషించడం లేదు. నామమాత్రంగా పర్యవేక్షణ నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగు కోసం ప్రత్యేకంగా అధికారులను కేటాయించారు. శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ సెక్రటరీలతోపాటు ఇంజినీరింగ్, ఇతర విభాగాల అధికారులను నోడల్ ఆఫీసర్లుగా నియమించారు. ఇంత చేసినా ఆశించిన స్థాయిలో పారిశుద్ధ్యం మెరుగు పడటం లేదు. పర్యవేక్షణ నామమాత్రంగా మారడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం సుమారు 2 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. నెల రోజుల క్రితం అప్కాస్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న కార్మికుల వయస్సు 60 ఏళ్లు దాటిందనే సాకుతో వారిని విధుల నుంచి తొలగించారు. వారి స్థానంలో కొత్త వారిని తీసుకోకపోవడంతో మిగిలిన వారిపై పని భారం పడుతోంది. దీంతో పారిశుద్ధ్యం ఆశించిన స్థాయిలో లేదు. స్వచ్ఛభారత్ – స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్లో నగరానికి మెరుగైన స్థానం సాధించేందుకు డంపర్ బిన్లను తొలగించిన విషయం తెలిసిందే. దీంతో చెత్తను సకాలంలో తరలించేందుకు నగర పరిధిలో 39 ట్రాక్టర్లు, 18 కంప్యాక్టర్ బిన్లను వినియోగిస్తున్నారు. అవసరం పేరుతో అదనంగా కొన్ని ట్రాక్టర్లు అద్దెకు కూడా తీసుకున్నారు. నగరంలో ఉత్పన్నమయ్యే చెత్తను రోడ్ల మీద వేయకుండా ఎప్పటికప్పుడు తరలించాలని కమిషనర్ ఆదేశాలకే పరిమితం అయ్యారు. చెత్త మాత్రం రోడ్డు మీద కనిపిస్తూనే ఉంది. దీనిపై ప్రజారోగ్యధికారులు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. శాశ్వత చర్యలు తీసుకుంటేనే.. 2011 లెక్కల ప్రకారం నగరంలోని 7.50 లక్షల జనాభాకు అనుగుణంగా ప్రస్తుతం కార్మికులు పనిచేస్తున్నారు. 2012లో 10 గ్రామ పంచాయతీలను నగరపాలక సంస్థలో విలీనం చేశారు. దీంతో జనాభా మరింత పెరిగింది. ఇప్పుడు నగరంలో సుమారు 11 లక్షల మంది ఉన్నారని అంచనా. ఇళ్ల సంఖ్య సుమారు 3 లక్షల వరకు ఉంది. 2011 జనాభాకు తగ్గట్లుగా 2 వేల మంది మాత్రమే కార్మికులు ప్రస్తుతం పనిచేస్తున్నారు. గతంలో నగరంలో రోజుకు 400 మెట్రిక్ టన్నుల చెత్త వచ్చేది. ప్రస్తుతం 470 మెట్రిక్ టన్నులకు ఇది పెరిగింది. ఇంత చెత్తను బయటకు తీసుకెళ్లేందుకు కార్మికులు చాలా అవస్థలు పడాల్సి వస్తోంది. ప్రజల నుంచి చెత్త సమస్యలపై తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి. కమిషనర్ పులి శ్రీనివాసులు అదనంగా 225 మంది కార్మికులను నిత్యం రూ.500 చొప్పున ఇచ్చేలా నియమించారు. వీరిలో ఎక్కువమంది నామమాత్రంగా పనులు చేసుకుంటూ వెళ్లిపోతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ప్రధానమైన ప్రాంతాల్లోనే పారిశుద్ధ్యం మెరుగ్గా చూపించి, ఇతర కాలనీల్లో గాలికొదిలేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించేలా చూడకుండా ౖపైపెన అధికారుల స్థాయిలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ప్రయోజనం కనిపించదని నగరవాసులు పేర్కొంటున్నారు. తగినంతమంది సిబ్బందిని నియమించి, పర్యవేక్షణ సక్రమంగా చేస్తేనే చెత్త సమస్యల నుంచి ప్రజలకు ఉపశమనం లభించే అవకాశం ఉంది.గృహాల సంఖ్య : సుమారు 3 లక్షలు శానిటరీ డివిజన్లు : 32 మైక్రో ప్యాకెట్లు : 802 నిత్యం వచ్చే చెత్త : 470 మెట్రిక్ టన్నులు వార్డు సచివాలయాలు : 207 పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య : 2,000 ట్రాక్టర్లు : 39 చెత్త తొలగింపులో మున్సిపల్ యంత్రాంగం దారుణంగా విఫలం అదనంగా కార్మికులను పెట్టామని చెబుతున్నా ఫలితం అంతంతే ఎక్కడ చూసినా గుట్టలుగా పేరుకుపోతున్న వ్యర్థాలతో ప్రజలకు నానా కష్టాలు రోజుకు రూ.లక్షలు ఖర్చు చేస్తున్నామని చెబుతున్నా మెరుగుపడని పరిస్థితి ప్రజారోగ్యంపై ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతో రోజురోజుకూ పెరుగుతున్న చెత్త సమస్యగుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్యం పడకేసింది. పాలకుల మాటలు చూస్తే ఎంతో ఇంపుగా ఉంటున్నాయి. ఆచరణలో చూస్తే మాత్రం నగరమంతా దుర్వాసన వచ్చేలా ఎక్కడి చెత్త అక్కడే కుప్పలుగా కనిపిస్తోంది. అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా ఫలితం మాత్రం దక్కడం లేదు. ప్రజల ఇబ్బందులు తొలగించాలనే ఆలోచన నిజంగానే ఉంటే శాశ్వత చర్యలు తీసుకుంటేనే సమస్య పరిష్కారం అయ్యే వీలుంటుందని నగరవాసులు పేర్కొంటున్నారు. గుంటూరు నగరపాలక సంస్థ సమాచారం -
నృసింహస్వామి సేవలో దేవదాయ శాఖ కమిషనర్
మంగళగిరి: మంగళాద్రిలో వేంచేసియున్న శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ దంపతులు దర్శించుకున్నారు. ఆదివారం ఆలయానికి విచ్చేసిన కమిషనర్ దంపతులకు ఈవో అన్నపురెడ్డి రామకోటిరెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం స్వామి వారి చిత్రపటాన్ని బహూకరించారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆశ్వీరచనాలు అందజేశారు. ముగిసిన హనుమాన్ దీక్షలు నగరంపాలెం: స్థానిక మారుతీనగర్లోని శ్రీ కంచి కామకోటి పీఠ శ్రీమారుతీ దేవాలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న హనుమజ్జయంతి మహోత్సవాల్లో భాగంగా హనుమాన్ మండల వ్రత దీక్షలు ఆదివారంతో ముగిశాయి. హనుమత్ హవనము మన్యుసూక్త హోమం, గణపతి హోమం నిర్వహించారు. దీక్షాధారులు ఇరుముడులు ధరించి ఆలయ ప్రదక్షిణలు అనంతరం మాల విరమణ చేశారు. సాయంత్రం కార్యక్రమాల్లో భాగంగా మాస శివరాత్రి గంగా గౌరీ సమేత శంకరునికి ప్రదోషకాల అభిషేకం, కల్యాణ వేడుక నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ పాలకమండలి సభ్యులు కొరపాటి రామారావు, ఆలయ కార్యదర్శి తంగిరాల శ్రీనివాస్, జిల్లా దేవాలయ పరిరక్షణ సమితి కార్యదర్శి నరేంద్రగౌతమ్, తదితరులు పాల్గొన్నారు. వైభవంగా శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణం తెనాలి: పట్టణ నాజరుపేటలో వేంచేసియున్న శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి వార్షిక కల్యాణోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు. శ్రీ శృంగేరీ శ్రీవిరూపాక్ష శ్రీపీఠం శ్రీసదనం శ్రీపరశివానంద భారతీస్వామి ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ కె.చంద్రశేఖరరెడ్డి పర్యవేక్షణలో స్వామివారి కార్యక్రమాన్ని నిర్వహించారు. వేడుక అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. గేట్ మేన్పై సస్పెన్షన్ వేటు నాదెండ్ల: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సాతులూరు రైల్వే గేట్మేన్పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ నెల 23న ఉదయం 5 గంటల సమయంలో గుంటూరు నుంచి హుబ్లీ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు 15 నిమిషాలు ఆలస్యమైంది. సాతులూరు సమీపంలో మూడు రైల్వే గేట్లుండగా, 290–291 చందవరం–బుక్కాపురం రోడ్డు వద్ద గేట్లు వేశారు. 289 కనపర్రు రోడ్డు వద్ద వేయకపోవడంతో గూడ్స్ రైలు 15 నిమిషాలు నిలిచిపోయింది. గేట్మేన్ నిర్లక్ష్యంపై లోకో పైలట్ గుంటూరు స్టేషన్ మాస్టర్కు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు గేట్మేన్ ఆర్. కోటేశ్వరరావును రైల్వే అధికారులు సస్పెండ్ చేశారు. దీనిపై ముగ్గురు సభ్యుల కమిటీని విచారణకు నియమించారు. తిరుపతమ్మ ఆలయంలో రద్దీ పెనుగంచిప్రోలు: గ్రామంలోని శ్రీతిరుపతమ్మ దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు ముగుస్తుండటంతో పాటు శుభకార్యాలు ఉండటంతో అమ్మవారి దర్శనానికి వివిధ జిల్లాల నుంచి భక్తులు తరలి వచ్చారు. దీంతో ఆలయ క్యూలు, పరిసరాలు కిక్కిరిశాయి. తెలంగాణ నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. తెల్లవారు జాము నుంచి సాయంత్రం వరకు వాహనాల రద్దీ కొనసాగింది. కొందరు భక్తులు మునేరు అవతల మామిడి తోటల్లో సందడి చేస్తూ వంటలు వండుకొని భోజనాలు తిన్నారు. -
ఏటా నష్టాలు.. అప్పులే..
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు రూరల్ మండలానికి చెందిన వెంకటేశ్వరరెడ్డి అనే రైతు 2021లో బ్యాంకులో బంగారు ఆభరణాలు పెట్టి రూ.80 వేలు రుణం తీసుకున్నారు. మూడు రోజుల క్రితం రెన్యూవల్ కోసం బ్యాంకుకు వెళ్లగా మొత్తం డబ్బు చెల్లించి రెన్యూవల్ చేసుకోవాలని చెప్పారు. దీంతో చేసేదేమీ లేక అప్పు చేసి రూ.1.20 లక్షలు చెల్లించారు. లక్షల మంది అన్నదాతల సమస్య ఇదే. వ్యవసాయం, బంగారు ఆభరణాల పేరుతో తీసుకున్న రుణాలకు రెన్యూవల్ కష్టాలు తప్పడం లేదు. రుణాల చెల్లింపు విషయంలోనైనా కూటమి ప్రభుత్వం స్పందించి మినహాయింపులు ఇవ్వాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. బ్యాంకర్లు అనేక కొర్రీలు పెడుతున్నారని వాపోతున్నారు. బ్యాంకుల్లో తీసుకొన్న అసలు, వడ్డీ కలిపి చెల్లిస్తేనే రెన్యూవల్ అంటూ మెలిక పెడుతున్నారని పేర్కొంటున్నారు. జిల్లాలో వివిధ బ్యాంకులకు చెందిన 529 బ్రాంచ్లు ఉంటే.. వీటిలో 16 లక్షలకుపైగా ఖాతాలు ఉన్నాయి. ఇందులో ఐదు లక్షల ఖాతాలు పంట రుణాలు తీసుకునే రైతులవి. వ్యవసాయ ఆధారిత రుణాల విషయంలో బ్యాంకర్లు చిన్నచూపు చూస్తున్నారు. రెన్యూవల్ పేరుతో రైతులను వేధిస్తున్నారు.మొత్తం చెల్లిస్తేనే ...పది శాతం బ్యాంకులు మినహా.. మిగిలినవి రెన్యూవల్ విషయంలో రుణగ్రహీతలను ముప్పుతిప్పలు పెట్టి వేధిస్తున్నాయి. తీసుకున్న రుణానికి ఏడాది గడువు తీరిందని మెసేజ్లు రావడంతో బ్యాంకులకు రుణగ్రహీతలు పరుగులు పెడుతున్నారు. అక్కడికి వెళ్లాక రెన్యూవల్ చేసుకోవాలంటే తీసుకున్న మొత్తం డబ్బులు చెల్లించాలని చావు కబురు చల్లగా చెబుతున్నారు. అప్పుడే రెన్యూవల్ చేస్తామని మెలిక పెడుతున్నారు. చాలా మంది అష్టకష్టాలు పడి మొత్తం చెల్లించి రెన్యూవల్ చేయించుకుంటున్నారు. కొన్ని బ్యాంకులు తీసుకున్న రుణాలను పూర్తి స్థాయిలో చెల్లించినా.. మళ్లీ తిరిగి రుణాలు ఇవ్వడంలో రైతులు, రుణగ్రహీతలను ఇబ్బందులు పెడుతున్నాయి. ఎప్పుడెళ్లినా రేపు రమ్మని చెప్పి తప్పించుకుంటున్నాయి. సీ–బిల్, ఈకేవైసీ, ఇతర వివరాలను సాకు చూపి జాప్యం చేస్తున్నాయి.వ్యాపార లావాదేవీలు, వ్యవసాయం పేరుతో తక్కువ వడ్డీకి బ్యాంకు రుణాలు తీసుకుని వడ్డీ వ్యాపారాలు చేసుకునే వారు 30 శాతం మంది ఉన్నారని అంచనా. అలాగే 70 శాతం మంది మాత్రం వ్యవసాయ పనులు నిమిత్తం, బతుకుతెరువు కోసం పట్టాదారు పాసుపుస్తకాలు, బంగారు ఆభరణాలు బ్యాంకుల్లో కుదువపెట్టి రుణాలు తీసుకుంటున్నారు. ఆ రుణాల ద్వారా వ్యవసాయం వృద్ధి చేసుకుంటున్నారు. బోర్లు వేసుకోవడం, కొత్త రకం పంటలు పండించడం, వివిధ రకాల పంటల సాగుకు అవసరమయ్యే ఖర్చులను భరించేందుకు బ్యాంకుల్లో అప్పులు చేస్తున్నారు. ఆపై వాటిని విడిపించేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. పంట బాగా పండి.. మంచి ధర ఉంటే రైతు వాటిని విడిపించుకునేందుకు వెనకడుగు వేయడం లేదు. ప్రకృతి కాటేయడంతో ఏటా కష్టాలు.. కన్నీళ్లు తప్పడం లేదు. అటు కూటమి ప్రభుత్వం కూడా పెట్టుబడి సాయం అందించడం లేదు. మరోవైపు పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలోనూ తీవ్ర వైఫల్యం చెందింది. ఇకనైనా దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఆదుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు.గతంలో రెన్యూవల్ ఇలా..గతంలో బ్యాంకుల్లో వ్యవసాయ, బంగారు రుణాలకు రెన్యూవల్కు వెళ్తే ఇబ్బందులు పెట్టేవారు కాదు. వడ్డీ వరకు చెల్లించుకుని రెన్యూవల్ చేసేవారు. లేకుంటే భూ విలువ, బంగారం విలువ ప్రకారం తీసుకున్న బ్యాంకు రుణానికి ఏటా 5 నుంచి 10 శాతం వరకు పెంచుతూ వడ్డీ జమ చేసుకునే వారు.మినహాయింపు ఇవ్వాలిఆటో కొనుగోలు చేసేందుకు గతేడాది గుంటూరు నగరంలోని ఓ బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి రూ.లక్ష వరకు రుణం తీసుకున్నా. రెన్యూవల్కు సంబంధించి మెసేజ్ రావడంతో బ్యాంకు వద్దకు వెళ్లా. అక్కడ మొత్తం చెల్లించాలన్నారు. అవస్థలు పడి మొత్తం డబ్బులు చెల్లించి, 15వ తేదీన రెన్యూవల్ చేయించా. ఈ నిబంధన నుంచి మినహాయించాలి. –ఎం.నరేంద్ర, గుంటూరువ్యవసాయ రుణ వివరాలు ఇలా..వ్యవసాయ, బంగారు నగలపై రుణాలకు రెన్యూవల్ కష్టాలు పూర్తిగా డబ్బులు చెల్లించాలంటూ మెలిక పెడుతున్న బ్యాంకు సిబ్బంది గతంలో వడ్డీ చెల్లిస్తే చాలు రెన్యూవల్ పెట్టుబడి సాయం అందక, గిట్టుబాటు ధరలు లేక ఇప్పటికే రైతులకు కష్టాలు కూటమి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అన్నదాతలుకొత్త విధానం అమల్లో ఉందికొత్త విధానం గతేడాది సెప్టెంబర్ నుంచి అమల్లోకి వచ్చింది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఇకపై పూర్తి నగదు చెల్లించి రెన్యూవల్ చేయించుకోవాలి. ప్రస్తుతం వడ్డీ మాత్రమే చెల్లించి రెన్యూవల్ చేయించుకునే పద్ధతి లేదు. దీనికి సంబంధించి పలు సమస్యలు వస్తున్నాయి.– గూడెం మహిపాల్రెడ్డి, ఎల్డీఎం, గుంటూరు జిల్లా -
ప్రసన్నాంజనేయునికి విశేష పూజలు
బెల్లంకొండ: మండలంలోని బెల్లంకొండ క్రాస్ రోడ్ వద్ద గల శ్రీ కోళ్లూరు ప్రసన్నాంజనేయ స్వామి వారి జయంతి, కల్యాణ ఉత్సవాలలో భాగంగా నాలుగో రోజు స్వామి వారికి విశేష పూజలను నిర్వహించారు. శనివారం ఉదయం ఆలయ ప్రధాన అర్చకులు బొర్రా వెంకట అనంతాచార్యులు స్వామి వారికి సుప్రభాత సేవ, పంచామృతాలతో అభిషేక పూజ చేశారు. అనంతరం 1,008 అరటి పండ్లతో విశేష పూజలను నిర్వహించారు. స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు పొంగళ్లు చేసి, నైవేద్యాలను సమర్పించారు. మొక్కుబడులు చెల్లించుకున్నారు. మండల దేవదాయ శాఖ ఈవో అవుడూరి వెంకటేశ్వరరెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. రాత్రికి గుంటూరు శ్రీ స్రవంతి సంగీత కళాశాల వారి శ్రీరామాంజనే యుధ్ధం, శ్రీకృష్ణ రాయబారం పౌరాణిక నాటికలను ప్రదర్శించారు. ఉత్సవాల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా స్థానిక పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. 1,008 అరటిపండ్లతో విశేష పూజా కార్యక్రమం -
27వ రోజుకు సీహెచ్ఓల సమ్మె
లక్ష్మీపురం(గుంటూరు పశ్చిమ): వైద్య ఆరోగ్య శాఖ ఎన్హెచ్ఎంలో ఆరేళ్లుగా సీహెచ్ఓలుగా గ్రామీణ ప్రాంతాలలో వైద్య సేవలు అందిస్తున్నామని, రెండేళ్లుగా మా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో నిరవధిక సమ్మె చేస్తున్నామని గుంటూరు జిల్లా జనరల్ సెక్రటరీ పల్లపాటి లింగరాజు, జిల్లా ఉపాధక్షరాలు జి.వనజ అన్నారు. గుంటూరు జిల్లా కలెక్టరేట్ వద్ద డీఎంఅండ్ హెచ్ఓ కార్యాలయం వద్ద సీహెచ్ఓలు చేస్తున్న సమ్మె శనివారం నాటికి 27వ రోజుకు చేరింది. వారు మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ నిబంధనలు ప్రకారం ఉద్యోగ భద్రత కలిపించాలని, ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23శాతం వేతన సవరణ చేయాలన్నారు. అసోసియేషన్ నాయకులతో త్వరితగతిన చర్చలు జరిపి స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షరాలు టీ ప్రవళిక, జిల్లా నాయకురాలు జోత్స్న మాట్లాడుతూ ఇన్ని రోజులుగా తీవ్రమైన ఎండలలో కూడా నిరవధిక సమ్మె చేస్తున్న సీహెచ్ఓలను పట్టించుకోకుండా, జీతాలు వేయకుండా, ఇన్సెంటివ్లు వేయకుండా తీవ్ర మనోవేదనకు కూటమి ప్రభుత్వ అధికారులను గురి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షరాలు జి.వనజ, జిల్లా నాయకులు సంధ్య, దీక్షిత, రవితేజ, జీవనజ్యోతి, కె లక్ష్మి, రత్నకుమారి, క్వీన్, స్వప్న, కె.లక్ష్మి, శివ నాగేంద్రమ్మ, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ పాల్గొన్నారు. స్పందించని కూటమి ప్రభుత్వం -
నాటికల పోటీలు ప్రారంభం
నాదెండ్ల: పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం సాతులూరు గ్రామంలో నటరత్న ఎన్టీఆర్ కళాపరిషత్ తృతీయ జాతీయస్థాయి నాటిక పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 28వ తేదీ వరకు జరగనున్నాయి. పశువుల ఆసుపత్రి సమీపంలో భారతీయ కళావేదిక వద్ద పోటీలు జరగనున్నట్లు పరిషత్ కమిటీ సభ్యులు తెలిపారు. పోటీలను జీబీఆర్ హ్యాచరీస్ చైర్మన్ గడ్డం బుచ్చారావు, ఈదర పెద్దబ్బాయి ప్రారంభించారు. తొలిరోజు విశాఖపట్నం కళాభినయ బృందం ఆధ్వర్యంలో ‘ఓ కాశీవాస రావయ్య’ నాటిక ప్రదర్శించారు. రచయితగా పీటీ మాధవ్, దర్శకుడిగా శ్రీకవి ప్రసాద్ వ్యవహరించారు. గుంటూరు ఆరాధన ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ‘మరీ అంతొద్దు’ నాటిక ప్రదర్శించారు. రచయితగా ఆకురాతి భాస్కర్చంద్ర, దర్శకుడిగా నడింపల్లి వెంకటేశ్వరరావు వ్యవహరించారు. సామాజిక దృక్పథానికి అద్దం పట్టేలా రెండు నాటికలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పరిషత్ పర్యవేక్షకులుగా జరుగుల రామారావు వ్యవహరించారు. కార్యక్రమాలను మువ్వా సురేష్, బండారుపల్లి సత్యనారాయణ, ఆలోకం పెద్దబ్బాయి, బండ్ల రాంచంద్, చెరుకూరి ఫణికుమార్, శాఖమూరి బాజిబాబు, బొల్లు వెంకటకృష్ణారావు పాల్గొన్నారు. అనంతరం ఈతరం ఉన్నత పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. నలుగురు సెల్ఫోన్ దొంగలు అరెస్టు గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): గవర్నర్పేట పోలీసుస్టేషన్ పరిధిలో సెల్ఫోన్ చోరీలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా పూసుగూడేనికి చెందిన బత్తుల రాజు, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజకు చెందిన బండారి లక్ష్మీనారాయణ, నరసరావుపేట సంజీవయ్య కాలనీకి చెందిన ఉప్పు ఎల్లయ్య, గుంటూరు శివనాగరాజు కాలనీకి చెందిన తిరుపతి వెంకట దుర్గారావులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. వీరంతా పోలీసు కంట్రోల్ రూం సమీపంలో నడిచి వెళ్లే ప్రయాణికులను బెదిరించి సెల్ఫోన్లు లాక్కుని వెళ్లి పోతుంటారని సీఐ అడపా నాగమురళి తెలిపారు. -
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం
పట్నంబజారు: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ముందుకు సాగుతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పార్లమెంట్ జిల్లా పరిశీలకులు పోతిన మహేష్ చెప్పారు. బృందావన్ గార్డెన్స్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం పార్టీ పార్లమెంట్ నియోజకవర్గాల ముఖ్య నేతల సమావేశం జరిగింది. పార్టీ జిల్లా పరిశీలకులుగా నియమితులై తొలిసారి గుంటూరు వచ్చిన పోతిన మహేష్కు నేతలు ఘన స్వాగతం పలికారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అధ్యక్షతన జరిగిన సమావేశానికి గుంటూరు, నరసరావుపేట పార్లమెంట్ జిల్లాల పరిశీలకులు మోదుగుల వేణు గోపాలరెడ్డి, విజయవాడ పార్లమెంట్ జిల్లా పరిశీలకులు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, పార్టీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా, తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు (డైమండ్ బాబు), అనుబంధ విభాగాల అధ్యక్షులు హాజరయ్యారు. జిల్లా పరిధిలోని పలు అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో చర్చించారు. పార్టీని బలోపేతం చేసే దిశగా జిల్లా, నగర, నియోజకవర్గాల కమిటీల నియామకం త్వరితగతిన పూర్తి చేసేలా చర్చించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ గుంటూరు జిల్లా పరిశీలకులుగా తనపై నమ్మకంతో నియమించిన వైఎస్సార్సీపీ అధ్యక్షులు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి, కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యులు వై.వి.సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేసుకునేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతామన్నారు. జూన్ 4న జరిగే వెన్నుపోటు దినోత్సవానికి సంబంధించి మంగళగిరిలోని నియోజకవర్గంలో తొలి సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ కూటమి సర్కార్ సంవత్సర పాలనలో చంద్రబాబు ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారని విమర్శించారు. గతంలో ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నారని, ఇప్పుడు ప్రజలను వెన్నుపోటు పొడుస్తున్నారని మండి పడ్డారు. ఈ ఏడాది కాలంలో కేవలం రాజకీయ కక్షలు, కార్పణ్యాలతో పాలన కొనసాగించారని పేర్కొన్నారు. జూన్ 4న వెన్నుపోటు దినోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. రైతులు, కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే కార్యక్రమానికి హాజరు కావాలని పిలుపునిచ్చారు. దానిలో భాగంగా ఈ నెల 30 నుంచి జూన్ 3వ తేదీ వరకు గుంటూరు జిల్లా పరిధిలోని గుంటూరు– 1 , 2, మంగళగిరి, తెనాలి, పొన్నూరు, తాడికొండ, ప్రత్తిపాడు నియోజకవర్గ కేంద్రాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని సన్నద్ధం చేస్తామని తెలిపారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తామని తిరిగి హామీ ఇచ్చిన ఏకై క సీఎం చంద్రబాబేనని ఎద్దేవా చేశారు. మిర్చి, పొగాకు, పత్తి రైతులను నట్టేట ముంచారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు నిమ్మకాయల రాజనారాయణ, సీడీ భగవాన్, ఈమని రాఘవరెడ్డి, మెట్టు వెంకటప్పారెడ్డి, తాడిబోయిన వేణు, విజయ్, నందేటి రాజేష్, మామిడి రాము, శేషగిరి పవన్కుమార్, బైరెడ్డి రవీంద్రారెడ్డి, కొరిటెపాటి ప్రేమ్కుమార్, వినోద్, తదితరులు పాల్గొన్నారు. -
పిల్లలను సురక్షితంగా ఉంచే బాధ్యత తల్లిదండ్రులదే
గుంటూరు లీగల్: పిల్లలను సురక్షితంగా ఉంచే బాధ్యత తల్లిదండ్రులదేనని, సమాజంలో పౌరులుగా మనందరి బాధ్యత కూడా అని న్యాయ సేవా సదన్ సెక్రెటరీ సయ్యద్ జియావుద్దీన్ అన్నారు. పిల్లలు జాగ్రత్తగా ఉండేందుకు తీసుకోవాల్సిన సలహాలు, సూచనలు చేశారు. క్యాలెండరు యాక్టివిటీస్లో భాగంగా జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి ఆదేశాల మేరకు శనివారం అంతర్జాతీయ తప్పిపోయిన బాలల దినోత్సవం సందర్భంగా అవగాహనా సదస్సు నిర్వహించారు. సదస్సుకు జియావుద్దీన్ అధ్యక్షత వహించి, మాట్లాడారు. పిల్లలు తప్పిపోవడం అనేది తల్లిదండ్రులు, సమాజానికి పెద్ద సవాలుగా మారిందన్నారు. ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో పిల్లలు కనిపించకుండా పోతున్నారని, వారిలో కొంతమంది తిరిగి వచ్చినా చాలా మంది జాడ తెలియయరాలేదని తెలిపారు. అధికారిక గణాంకాల ప్రకారం మూడు సంవత్సరాలలో 10వేలకుపైగా మిస్సింగ్ కేసులు నమోదయ్యాయన్నారు. 2022లో 83,350 మంది చిన్నారులలో 62,946 మంది బాలికలు ఉన్నారని, ప్రతి నలుగురు పిల్లలలో ముగ్గురు బాలికలున్నారని వెల్లడించారు. ప్యానల్ అడ్వకేట్ కె.కాళిదాసు మాట్లాడుతూ ప్రామాణిక ఆపరేటింగ్ ప్రొసిజర్ పోలీస్ యూనిట్ ఎలా పనిచేస్తుంది, పిల్లలు తప్పిపోతే ఎఫ్ఐఆర్ ఎలా నమోదు చేయాలి, పిల్లలు ట్రేస్ కాకపోతే ఆ కేసును సీఐడీకి ఎలా బదిలీ చేయాలో వివరించారు. జిల్లా పంచాయత్ ఆఫీసర్ సాయికుమార్, డీపీఓ, శిశు సంక్షేమ శాఖ విజయ్కుమార్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ హనుమాన్ సాయి మాట్లాడుతూ తప్పిపోయిన పిల్లలను కాలయాపన లేకుండా ఎలా ట్రేస్ చేయగలమో వివరించారు. బాల కార్మికులుగా పనిచేసే పిల్లలను గుర్తించి వారికి రక్షణ కల్పించి, వారి భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దవచ్చునో వివరించారు. కార్యక్రమలో అన్ని రంగాలకు చెందిన ప్రభుత్వ అధికారులు, ప్యానల్ అడ్వకేట్లు, పారా లీగల్ వలంటీర్స్ పాల్గొన్నారు. న్యాయ సేవా సదన్ సెక్రెటరీ సయ్యద్ జియావుద్దీన్ -
దుగ్గిరాలలో 58.6 మి.మీ. వర్షపాతం
– సగటున 25.3 మి.మీ. వర్షపాతం కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాలో శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు అత్యధికంగా దుగ్గిరాల మండలంలో 58.6 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా పొన్నూరు మండలంలో 8.6 మి.మీ. పడింది. సగటున 25.3 మి.మీ.గా నమోదైంది. మే నెల 24వ తేదీ వరకు జిల్లా సాధారణ వర్షపాతం 48.2 మి.మీ. కాగా.. ఇప్పటి వరకు 166.8 మి.మీ. పడింది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.. చేబ్రోలు మండలంలో 52.2, తుళ్ళూరు 40.6, మేడికొండూరు 38.4, ప్రత్తిపాడు 35.2, కాకుమాను 30.2, కొల్లిపర 27.4, తాడికొండ 26.8, మంగళగిరి 23.6, తాడేపల్లి 21.6, ఫిరంగిపురం 19.8, వట్టిచెరుకూరు 19, పెదకాకాని 17.2, గుంటూరు తూర్పు 14.2, గుంటూరు పశ్చిమ 12.2, తెనాలి మండలంలో 9.8 మి.మీ. చొప్పున వర్షపాతం పడింది. రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య నరసరావుపేటటౌన్: గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్ఐ శ్రీనివాసరావు నాయక్ శనివారం తెలిపారు. నరసరావుపేట రైల్వేస్టేషన్ వద్ద కొండవీడు ఎక్స్ప్రెస్ రైలు క్రింద శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. స్టేషన్ మాస్టర్ ఇచ్చిన ఫిర్యాదుతో సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించామన్నారు. మృతుడు పింక్ కలర్ చొక్కా, నలుపు రంగు ఫ్యాంట్ ధరించి ఉన్నాడు. మృతుడి ఆనవాళ్లు తెలిసిన వారు నరసరావుపేట రైల్వే పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని రైల్వే ఎస్ఐ కోరారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం నాదెండ్ల: కారు, బైకు ఢీకొన్న ఘటనలో యువకుడు దుర్మరణం పాలైన సంఘటన శనివారం చోటు చేసుకుంది. ఎస్సై జి. పుల్లారావు తెలిపిన వివరాల మేరకు... గుంటూరు–కర్నూలు జాతీయ రహదారిపై గొరిజవోలు గ్రామ పరిధిలోని నుదురుపాడు పైవంతెన వద్ద ప్రమాదం జరిగింది. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామానికి చెందిన తరిమెళ్ళ బోయేసు (30) తన ద్విచక్రవాహనంపై గుంటూరు నుంచి నరసరావుపేట వైపు వెళ్తున్నాడు. నుదురుపాడు పైవంతెన సమీపంలో బైకు, కారు ఢీకొన్నాయి. బోయేసు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోలీసులు నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రచార విభాగం ఉపాధ్యక్షులుగా బొమ్ము
తాడేపల్లి రూరల్ : వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర ప్రచార విభాగానికి నూతన ఉపాధ్యక్షులను నియమించారు. పార్టీ ప్రచార విభాగం ఉపాధ్యక్షులుగా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కాజ గ్రామానికి చెందిన బొమ్ము వెంకటేశ్వరరెడ్డి (తాతిరెడ్డి)ని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. తనపై నమ్మకం ఉంచి నియమించినందుకు పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, సహకరించిన జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబుకి, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
దేశంలో నరహంతక పాలన
లక్ష్మీపురం: దేశంలో బీజేపీ నరహంతక పాలన కొనసాగిస్తోందని, మతాల మధ్య చిచ్చు పెడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. బీజేపీ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. గుంటూరు కొత్తపేటలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో మల్లయ్య లింగం భవన్లో శనివారం ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర స్థాయి పాటలు, కళా రూపాల శిక్షణ శిబిరం శనివారం రెండో రోజు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ రంగాలకు అన్నీ అప్పగిస్తోందన్నారు. కమ్యూనిస్టు భావజాలాన్ని అంతం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని ఆరోపించారు. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులతోపాటు ఆదివాసీలను దారుణంగా హతమార్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చలకు వస్తామని చెప్పినప్పటికీ కేంద్రం వారిని చంపే కార్యక్రమం చేయడం సరికాదన్నారు. తక్షణమే ఆపరేషన్ కగార్ను కేంద్రం ఆపాలని డిమాండ్ చేశారు. ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఆపరేషన్ సిందూర్ పేరుతో సరికొత్త నాటకానికి ప్రధాని నరేంద్ర మోదీ తెర తీశారన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు భయపడి మోదీ పాక్పై యుద్ధాన్ని ఆపేశారని తెలిపారు. విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి ప్రజా సమస్యలపై పోరాటానికి సన్నద్ధం అవుతామన్నారు. మహాసభలకు ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీలను, మావోయిస్టులను హతమార్చుతున్న కేంద్రం విలేకరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ