'స్వర్ణ బార్ మల్లాది విష్ణుదే'
హైదరాబాద్ : విజయవాడ నగరంలో స్వర్ణ బార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి చెందినదని ఉన్నతాధికారుల విచారణలో తెలిందని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. కల్తీ మద్యం ఘటనపై మంగళవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మంత్రి రవీంద్ర ఓ ప్రకటన చేశారు. ఈ ఘటనలో మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం రూ. 5 లక్షల పరిహారం అందజేసినట్లు రవీంద్ర తెలిపారు.
విజయవాడలోని స్వర్ణబార్లో కల్తీ మద్యం సేవించి ఎనిమిది మంది మృతి చెందగా... మరో 13 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ బార్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నాయకుడు మల్లాది విష్ణుదని టీడీపీ నాయకులు ఆరోపించారు. మల్లాది విష్ణు బంధువులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. కల్తీ మద్యంపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు డీజీపీ రాముడు ప్రకటించారు. అలాగే ఈ ఘటనపై విచారణాధికారిగా విజయవాడ సబ్ కలెక్టర్ జి సృజనను ప్రభుత్వం నియమించింది.