భక్తులతో పోటెత్తిన శైవక్షేత్రాలు
హైదరాబాద్: కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో వేకువజాము నుంచే శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తుతున్నారు. తెలుగు రాష్ట్రాలలోని పలు ఆలయాల్లో భక్తులు దీపోత్సవాలు నిర్వహిస్తున్నారు.
కార్తీక మాసం చివరి సోమవారం, ఏకాదశి కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు ఆరాధ్యదైవం శివుడికి అభిషేకాలు నిర్వహిస్తున్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ కాశీచింతల దేవాలయానికి భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. పంచారామాలు భక్త జనసందోహంతో సందడి వాతావరణం నెలకొంది.
ఇంద్రకీలాద్రి: విజయవాడలోని కృష్ణానది తీరం భక్తులతో నిండిపోయింది. అన్ని ఘాట్లలో తెల్లవారుజామున 2 గంటల నుంచే వేల సంఖ్యలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. పాత శివాలయం, విజయేశ్వరాలయం, ఇంద్రకీలాద్రిపై కొలువైన మల్లేశ్వరస్వామి వార్లను భక్తులు దర్శించుకుని ప్రత్యేకపూజలు చేస్తున్నారు.