Hostel workers
-
‘సంక్షేమం’లో అక్రమాలు !
బదిలీ చేసినా విధుల్లో చేరని ఉద్యోగులు సంవత్సర కాలంగా పొందుతున్న వేతనాలు వర్కర్ల జీతాల్లో అధికారులకు వాటాలు అంతా ఓకే అంటున్న డీడీ... ఇదీ దళిత సంక్షేమ శాఖ పరిస్థితి హన్మకొండ అర్బన్ : అక్రమాలకు పాల్పడితే ఎలాగైనా సంపాదింవచ్చనడానికి జిల్లా సాఘిక సంక్షేమ శాఖ ఉదాహరణగా నిలిచింది. ఈ శాఖలో అధికారుల చేయి తడిపితే.. కిందిస్థాయి వార్డెన్లు ఆడింది ఆట... పాడింది పాట అన్నట్లుగా ఉంది వ్యవహారం. జిల్లాలోని కొన్ని హాస్టళ్లలో గత ఏడాదిన్నరగా పని చేయకున్నా వర్కర్లకు వేతనాలు ఇస్తున్నారు. ఇందుకు గాను ఒక్కొక్కరి నుంచి ఉన్నతాధికారులు ముందుగానే నెలకు రూ.ఐదు వేల చొప్పున వసూలు చేస్తున్నారు. వార్డెన్ల విషయంలోనూ ఇదే తంతు. అయితే ఉన్నతాధికారులు మాత్రం అలాంటిది ఏమీ లేదని, ఆంతా ఓకే అని చెప్పడం గమనార్హం. పిల్లలు లేక మూతపడిన హాస్టళ్లు.. సాంఘిక సంక్షేమ శాఖ స్టేషన్ఘన్పూర్ ఏఎస్డబ్ల్యూఓ పరిధిలోని తాటికొండ, మల్కాపూర్, స్టేషన్ఘన్పూర్, వేలేరు, ధర్మసాగర్ హాస్టళ్లను పిల్లలు లేరనే కారణంతో గత విద్యాసంవత్సరం మూసివేశారు. ఆయా హాస్లళ్లలో ఒక్కో వార్డెన్, ముగ్గురు వర్కర్ల చొప్పున ఉన్నారు. వీరందరినీ ఖాళీ ఉన్న ప్రాంతాల్లో సర్దుబాటు చేశారు. వాచ్మెన్లను మాత్రం మూసేసిన హాస్టళ్లకు రక్షణగా ఉంచి మిగతా వారిని ఇతర ప్రదేశాలకు బదిలీ చేశారు. ఇక్కడే కథ మొదలైంది.. దూర ప్రాంతాలకు బదిలీ చేయడంతో వారు విధుల్లో చేరలేదు. అయితే నెల వచ్చే సరికి జీతాల సమస్య ఏర్పడడంతో వార్డెన్లు, వర్కర్లు కలిసి ఒక అవగాహనకు వచ్చారు. కొత్త స్థానాల్లో చేరకుండానే ప్రతినెలా వేతనాలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. ఇందుకు ప్రతిఫలంగా ఒక్కో వర్కర్ నుంచి వార్డెన్లు నెలకు రూ.5 వేలు వసూలు చేస్తున్నారని, ఇందులో కొంత మెుత్తం ఉన్నతాధికారులకు సైతం అందుతోందని సమాచారం. ఇలా పనిచేయకుండానే మూడు హాస్టళ్లలోని ఆరుగురు వర్కర్లు ఏడాదిన్నరగా వేతనాలు తీసుకుంటున్నారు. వార్డెన్లదీ అదే పరిస్థితి... స్టేషన్ఘన్పూర్ ఏఎస్డబ్ల్యూఓ పరిధిలో మూతపడిన మల్కాపూర్, వేలేరు, ధర్మసాగర్ హాస్టళ్ల వార్డెన్లు ఖాళీగానే ఉంటున్నా ఇంతకాలం కూర్చోబెట్టి వేతనాలు ఇచ్చారు. ఇంకా ఎక్కువ కాలం అలాగే చెల్లిస్తే బాగుండదనుకున్నారో ఏమో.. నగరంలో ఇటీవలే ఏర్పాటు చేసిన కాలేజీయేట్ హాస్టళ్లలో వారికి బాధ్యతలు అప్పగించారు. ఇక స్టేషన్ఘన్పూర్లో మూసేసిన ఎస్సీ హాస్టల్ వార్డెన్దీ ఇదే పరిస్థితి. ఈయనను కూడా నగరంలోని ఓ హాస్టల్లో కేటాయించారు. నవాబ్పేట వార్డెన్కు ఇంతకాలం ఏపనీ లేకున్నా బీసీ సంక్షేమ శాఖ హాస్టల్కు ఇన్చార్జ్గా ఉన్నారని చూపిస్తూ ఎస్సీ సంక్షేమ శాఖ వేతనం ఇస్తోంది. తాజాగా ఆయనకు కూడా నగరంలో ఒక కాలేజీ హాస్టల్ అప్పగించారు. వాటాల్లో తేడాలతో వెలుగులోకి.. వర్కర్లు పని చేయకుండానే వేతనం తీసుకున్న సమయంలో ఉన్నతాధికారులకు అందులో వాటా అందింది. తాజాగా వేతనాల్లో వాటా విషంయలో వర్కర్లు, అధికారులకు మధ్య తేడాలు రావడంతో వ్యవహారం ఓ మధ్యవర్తి వద్దకు చేరింది. ఈ దందా మొత్తం బయట పడితే అసలుకే ఎసరొస్తుందని భావించిన అధికారులు.. ఆంతా కలిసి ఓ అంగీకారానికి రావాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం గత శుక్రవారం కలెక్టరేట్లోని శాఖ కార్యాలయంలో అధికారుల సమక్షంలో పంచాయితీ తీర్మానం చేసుకోవాలనుకున్నారు. అయితే అంతలోనే అధికారికి, వర్కర్లకు మధ్య నెలవారీ చెల్లింపుల విషయంలో గొడవ తీవ్రం కావడంతో విషయం రచ్చకెక్కింది. ఎక్కడివారు అక్కడే పనిచేస్తున్నారు – అంకం శంకర్, ఎస్సీ వెల్ఫేర్ డీడీ స్టేషన్ఘన్పూర్ పరిధిలోని కొన్ని హాస్టళ్లు గత సంవత్సరం మూతపడ్డాయి. వాటిలో పనిచేసే వర్కర్లను వెంటనే ఇతర ప్రాంతాల్లో ఖాళీలు ఉన్నచోటకు సర్దుబాటు చేశాం. వారంతా కొత్త ప్రదేశాల్లో చక్కగా పనిచేస్తున్నారు. ఒకరిద్దరు చేరకపోతే మెమోలు కూడా ఇచ్చినట్లు గుర్తుంది. ప్రస్తుతం ఆంతా బాగానే ఉంది. -
కదం తొక్కిన కార్మికులు
పాడేరులో భారీ ర్యాలీ ఐటీడీఏ ముట్టడిని అడ్డుకున్న పోలీసులు 2 గంటలు రోడ్డుపై ధర్నా ప్రభుత్వ పోకడలకు నిరసనగా కార్మికులు గురువారం పాడేరులో కదం తొక్కారు. ఏజెన్సీలోని పలు ప్రభు త్వ సంస్థల్లో పని చేస్తున్న ఆశ కార్యకర్తలు, హాస్టల్ వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, వైద్య ఆరోగ్య శాఖలో ని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు, వెలుగు యాని మేటర్లు సీఐటీయూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. అనంతరం ఐటీడీఏను ముట్టడించారు. కార్యాలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో రెండు గంటలపాటు బైఠాయించి ధర్నా చేపట్టారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాడేరు: ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, కక్షసాధింపు చర్యలకు నిరసనగా ఏజెన్సీలోని పలు ప్రభుత్వ సంస్థల్లో పని చేస్తున్న కార్మికులు గురువారం ఐటీడీఏను ముట్టడించారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ పాడేరులో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మన్యంలోని 11 మండలాల్లో పని చేస్తున్న ఆశ కార్యకర్తలు, హాస్టల్ వర్కర్లు, అంగన్ వాడీ కార్యకర్తలు, వైద్య ఆరోగ్య శాఖలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు, వెలుగు యానిమేటర్లు సీఐటీయూ ఆధ్వర్యంలో తొలుత భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఐటీడీఏను ముట్టడించారు. కార్యాలయం లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించగా పోలీసులు గేట్లు మూసివేసి అడ్డుకున్నారు. శాంతియుతంగానే ఆందోళన చేపడతామని పోలీసు అధికారులకు చెప్పినా ఫలితం లేకపోయింది. సీఐ ఎన్.సాయి, ఎస్ఐలు ధనుంజయ్, సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో పోలీసులు గేటు వద్ద అడ్డుకోవడంతో కార్మికులు ఐటీడీఏ ఎదుట బైఠాయించారు. వేలాదిమందితో ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. కాంప్లెక్స్ రోడ్డుపై కూడా కార్మికులు కూర్చొని సుమారు 2 గంటలపాటు ధర్నా చేపట్టారు. నినాదాలతో ఐటీడీఏ దద్దరిల్లింది. కార్మికులకు అన్యాయం ప్రభుత్వం కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తున్నదని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జి.కోటేశ్వరరావు ఆరోపించారు. ఆందోళనకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ అతి తక్కువ రూ.400 వేతనంతో వెట్టి చాకిరీ చేస్తున్న ఆశ కార్యకర్తలకు 14 నెలలుగా జీతాలివ్వకపోవడం దుర్మార్గం అన్నారు.అంగన్వాడీ కార్యకర్తలకు ఉద్యోగ భద్రత కరువైందన్నారు. డ్వాక్రా సంఘాల నిర్మాణానికి అహర్నిశలు కృషి చేస్తున్న వెలుగు యానిమేటర్లకు కూడా బకాయి వేతనాలు చెల్లించకుండా ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తున్నదన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులపై కూడా టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజకీయ వేధింపులు అధికమయ్యాయన్నారు. ఉపాధి హామీ పథకం ఫీల్డ్ సిబ్బంది, హౌసింగ్లోని వర్క్ఇన్స్పెక్టర్లను కూడా అకారణంగా తొలగిస్తున్నారన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే రాష్ట్రస్థాయిలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఐటీడీఏ ఏపీవో పీవీఎస్ నాయుడుకు ఇచ్చారు. వారం రోజుల్లో ఆశ కార్యకర్తల14 నెలల బకాయిలు చెల్లిస్తామని, ఇతర కార్మికుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వె ళతామని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ నేతలు ఉమా మహేశ్వరరావు, శంకరరావు, ఎల్.సుందరరావు, సీపీఎం నేత కె.సురేంద్ర, గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్సయ్య, అంగన్వాడీ వర్కర్ల సంఘం ప్రతినిధులు అంబాలమ్మ, వి.భాగ్యలక్ష్మి, అన్నపూర్ణ, కళావతి, ఆశ కార్యకర్తల సంఘం ప్రతినిధులు వై.మంగమ్మ, శ్రీదేవి, మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం ప్రతినిధులు పి.లక్ష్మి, ఎస్.హైమావతి, వీఆర్పీల సంఘం నేతలు రామస్వామి, కోటేశ్వరరావు, యానిమేటర్ల సంఘం ప్రతినిధులు ప్రకాష్, భాను పాల్గొన్నారు.