ఇన్చార్జి ఈఓ గా జగన్నాథరావు నేడు బాధ్యతల స్వీకరణ
అన్నవరం (ప్రత్తిపాడు) :
అన్నవరం దేవస్థానం ఇన్చార్జి ఈఓగా నియమితులైన ఈరంకి వేంకట జగన్నాథరావు బాధ్యతల స్వీకరణ ఆదివారానికి వాయిదా పడింది. శనివారమే బాధ్యతలు స్వీకరించాల్సి ఉన్నా అష్టమి తిథి మంచిది కాకపోవడంతో ఆయనకు ఈఓ నాగేశ్వరరావు బాధ్యతలు అప్పగించలేదు. కాగా బదిలీ అయిన దేవస్థానం ఈఓలను రెండు మూడు రోజుల వ్యవధిలో రిలీవ్ చేయడం ఇప్పటివరకూ జరిగింది. ఈసారి ఏకంగా ఈ ప్రక్రియకు పది రోజులు సమయం పట్టింది. ఈ నెల ఎనిమిదో తేదీన ఈఓ నాగేశ్వరరావును విజయనగరం జేసీ–2గా బదిలీ చేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ఇక్కడ రిలీవ్ అయి అక్కడ జాయిన్ కావడానికి ఆయన మూడు ముహూర్తాలు పెట్టుకున్నారు. అయినా ఈఓ గా ఎవరినీ నియమించకపోవడంతో ఆ ముహూర్తాలు దాటిపోయాయి. తాజాగా ఇన్చార్జి ఈఓ ను నియమించినా అష్టమి, నవమి కారణంగా బాధ్యతలు అప్పగించడం కుదరలేదు. ఇదంతా దేవాదాయశాఖ ఉన్నతాధికారుల పనితీరుకు నిదర్శనంగా చెప్పవచ్చు.