‘లఖ్వీ స్వరం సాక్ష్యంగా చెల్లదు’
ఇస్లామాబాద్: ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఆపరేషన్స్ కమాండర్, ముంబై దాడుల సూత్రధారి జకీవుర్ రెహ్మన్ లఖ్వీ స్వర నమూనాలు సాక్ష్యంగా చెల్లవని ఆ దాడుల కేసును వాదిస్తున్న పాక్ దర్యాప్తు సంస్థ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ) న్యాయవాది మహ్మద్ అజహర్ చౌదరీ తెలిపారు. ఇలాంటి ఆడియోలను సాక్ష్యం అంగీకరించే చట్టాలు పాక్లో లేవన్నారు. లఖ్వీ స్వర నమూనాలు సాక్ష్యంగా ఉపయోగించలేమని స్పష్టం చేశారు.
బలవంతంగా సేకరించడం కూడా సాధ్యం కాదని, ఆ విధమైన చట్టాలు పాక్లో లేవని చౌదరీ తెలిపారు. భారత్, అమెరికాలో కూడా ఇలాంటి చట్టాలు లేవన్నారు. గత వారంలో రష్యాలోని ఉఫా నగరంలో భారత్, పాక్ ప్రధానులు భేటీ అయి ముంబై దాడులపై అదనపు సమాచారం (లఖ్వీ స్వర నమూనాతో సహా) ఇచ్చిపుచ్చుకోవాలని నిర్ణయించిన నేపథ్యంలో పాక్ దర్యాప్తు సంస్థ న్యాయవాది ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.