సింధుకు నిరాశ
టోక్యో: జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత స్టార్ షట్లర్ పివి సింధు పోరాటం ముగిసింది. ఇటీవల కొరియా ఓపెన్ సిరీస్ టైటిల్ గెలిచి మంచి ఊపుమీద కనిపించిన సింధు.. జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ నుంచి ఆదిలోనే నిష్ర్కమించారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు 18-21,8-21 తేడాతో నొజోమి ఒకుహారా(జపాన్) చేతిలో ఓటమి పాలై టోర్నీ నుంచి భారంగా వైదొలిగారు. దాంతో కొరియా ఓపెన్ ఫైనల్లో సింధు చేతిలో ఎదురైన ఓటమికి ఒకుహారా ప్రతీకారం తీర్చుకున్నట్లయ్యింది.
తొలి గేమ్ ను పోరాడి కోల్పోయిన సింధు, రెండో గేమ్ లో మాత్రం ఒకుహారాకు కనీసం పోటీనివ్వలేకపోయారు. రెండో గేమ్ లో ఒకుహారా11-4 తేడాతో స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోయారు. దాన్ని కడవరకూ కాపాడుకున్న ఒకుహారా రెండో గేమ్ తో పాటు మ్యాచ్ ను కూడా సొంతం చేసుకుని క్వార్టర్స్ లోకి ప్రవేశించారు. ప్రధానంగా రెండో గేమ్ లో సింధు అనవసర తప్పిదాలు ఎక్కువ చేయడంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.