jogi pet
-
వెట్టి జీవితాలకు విముక్తి
జోగిపేట: పొట్టకూటి కోసం ఉన్న ఊరును, అయిన వారినీ వదిలి వచ్చిన వలస జీవులకు కాంట్రాక్టర్లు కష్టాల జీవితాన్ని కానుకగా ఇచ్చారు. అడిగినన్ని పైసలిస్తామంటూ ఆశ చూపి చివరకు తిండి గింజలు కూడా ఇవ్వకపోవడంతో ఆ వలస జీవులు కన్నీళ్లు తాగి కడుపునింపుకున్నారు. ఇలా పిల్లాపాపలతో నాలుగేళ్లుగా నరకం చూసిన 55 మంది కూలీలు, వారి పిల్లలకు ఎట్టకేలకు గురువారం విముక్తి లభించింది. పది సంవత్సరాల క్రితం మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన 22 కుటుంబాలు రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్ గ్రామంలోని భిక్షపతినగర్ స్థిరపడ్డాయి. స్థానికంగా దొరికే పనులతో కుటుంబాన్ని పోషించుకుంటూ వలస జీవులు జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే నాలుగేళ్ల క్రితం మహారాష్ట్రకే చెందిన చందు అనే లేబర్ కాంట్రాక్టర్ పని కల్పిస్తానంటూ ఈ వలస జీవులకు వల వేశాడు. అడినంత కూలీ చెల్లిస్తానంటూ నమ్మబలికి కుటుంబానికి రూ.2 వేలు చొప్పున అడ్వాన్స్ ఇచ్చాడు. కొన్ని కాగితాల మీద సంతకాలు తీసుకుని రోడ్లు వేసేందుకు ఉపయోగించే కంకరను కొట్టే పనిలో పెట్టాడు. అప్పటి నుంచి వీరికి డబ్బులు ఇవ్వకుండా నానా ఇబ్బందులకు గురిచేశాడు. ఎవరైనా వెళ్లిపోతామంటే తనకు బాకీగా ఉన్న రూ.20 లక్షలు చెల్లించి వెళ్లిపోండంటూ భయపెట్టాడు. తాము ఎప్పుడు డబ్బు తీసుకున్నామంటూ కూలీలు ప్రశ్నించగా వారితో సంతకాలు పెట్టించుకున్న కాగితాలు తీసి చూపించాడు. దీంతో విధిలేని పరిస్థితుల్లో కూలీలంతా అతను ఇచ్చింది తీసుకుని పనులు చేసేవారు. ఒక్కోసారి కనీసం తిండిగింజలకు కూడా డబ్బులివ్వకపోవడంతో చిన్నారులను పోషించుకునేందుకు స్థానికంగా దొరికే వ్యవసాయ పనులకు వెళ్తూ జీవనం వెళ్లదీసేవారు. ఏడాదికాలంగా నయాపైసా లేదు ఏడాదిక్రితం నిజామాబాద్కు చెందిన రవీందర్రెడ్డి అనే కాంట్రాక్టర్ తాడ్మన్నూర్-కొడెకల్ రోడ్డు పనులు దక్కించుకున్నాడు. ఈ రోడ్డు పనులు చేయించేందుకు లేబర్ కాంట్రాక్టర్ చందును సంప్రదించగా, అతను మహారాష్ట్రకు చెందిన 22 కుటుంబాలను మెదక్ జిల్లా నాదులాపూర్కు తరలించాడు. వీరు ఉండేందుకు గాను గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో అడవిలాంటి ప్రాంతంలోని ప్రభుత్వ స్థలంలో తాత్కాలిక గుడిసెలు వేయించాడు. దీంతో వలస జీవులంతా ఇక్కడే ఉంటూ రోడ్డుపనులు చేస్తున్నారు. అయితే లేబర్ కాంట్రాక్టర్ చందు కనీస కూలి కూడా ఇవ్వకపోవడంతో వలస కూలీల తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కనీసం తినేందుకు కూడా డబ్బులేక పస్తులున్నారు. ఈ క్రమంలోనే నాగోరావ్ అనే కూలీ ధైర్యంగా తన పెద్దనాన్న హన్మంతు సాయంతో న్యాయవాది సైదారావ్ ద్వారా కార్మిక శాఖను ఆశ్రయించాడు. జరుగుతున్న అన్యాయాన్ని రాష్ట్ర కార్మిక శాఖ అధికారులకు వివరించారు. దీంతో గురువారం అధికారులు నాదులాపూర్కు వెళ్లి కాంట్రాక్టర్ వద్దనున్న 55 మంది కూలీలు, వారి పిల్లలకు విముక్తి కలిగించారు. అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా కొండాపూర్కు తరలించారు. కూలీల బాధలు విని చలించిన హోం మంత్రి కూలీలకు జరుగుతున్న అన్యాయాన్ని అధికారుల ద్వారా తెలుసుకున్న రాష్ట్ర హోం, కార్మిక శాఖల మంత్రి నాయిని నర్సింహా రెడ్డి గురువారం మధ్యాహ్నం హుటాహుటిన అందోల్ మండలం నాదులాపూర్ గ్రామ శివారులో కూలీలు నివాసముంటున్న ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ కూలీలందరితో మాట్లాడారు. వారి సమస్యలు విని మంత్రి నాయిని చలించిపోయారు. రాళ్లు కొట్టిన చిన్నారుల చేతులను చూసి ఇంత దుర్మార్గమా అంటూ ఆవేదన చెందారు. వెంటనే బాధితులకు తగిన సాయం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సంగారెడ్డిలోనూ విలేకరులతో మాట్లాడిన హోంమంత్రి వలస కూలీల కోరిక మేరకు రంగారెడ్డి జిల్లాలో ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు. ఒకవేళ వారు మహారాష్ట్రకు వెళ్లాలనుకుంటే తగిన సాయం చేస్తామన్నారు. వెళ్లిపోతానంటే చంపేస్తానన్నాడు మాతో ఖాళీ బాండ్పేపర్లపై సంతకాలు తీసుకున్న చందు.. కూలి గిట్టడం లేదు వెళ్లిపోతామంటే చంపేస్తానని బెదిరించాడు. ఎదురుతిరిగి ప్రశ్నించినందుకు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ముక్కేడ్ ప్రాంతంలో ఓ సబ్కాంట్రాక్టర్ ఇంట్లో నాలుగు రోజులు బంధించాడు. కిడ్నీలు తీసేస్తా..నువ్వు పారిపోతే మహారాష్ట్రలోని మీ బంధువులను చంపేస్తానని బెదిరించాడు. అందువల్లే సచ్చినట్లు ఇక్కడే పనిచేస్తున్నా. -నాగోరావ్, మహారాష్ట్రకు చెందిన కూలీ -
‘బోరంచ’.. నిర్లక్ష్యం కొండంత
బోరంచ ఎత్తిపోతల పథకం అధికారుల నిర్లక్ష్యం వల్ల నీరుగారుతోంది. పథకం పనులు పూర్తయి ఐదేళ్లవుతున్నా ఇంకా వినియోగంలోకి రావడంలేదు. రూ.20.21 కోట్లతో నిర్మించిన ఈ ఎత్తిపోతల.. సర్వం లీకేజీల మయంగా మారింది. నాసిరకం పనుల వల్లే ఈ దుస్థితి నెలకొందని రైతులు ఆరోపిస్తున్నారు. జోగిపేట: బీడు భూములను సస్యశ్యామలం చేయాలన్న సదుద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో బోరంచ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. 2,900 ఎకరాలకు నీరందించాలన్నదే ‘ఎత్తిపోతల’ ముఖ్య ఉద్దేశం. కాని ఇప్పటివరకు ఒక్క ఎకరాకు సరిపడా నీటిని కూడా అందించలేకపోతోంది. ఈ పథకం ద్వారా నియోజకవర్గం పరిధిలోని రేగోడ్ మండలం సింధోల్, టి. లింగంపల్లి, తాటిపల్లి, మనూర్ మండలంలోని బోరంచ గ్రామాలలోని భూములకు సాగు నీరందించేందుకు రూపొందించిన ఈ పథకాన్ని అప్పట్లో మంత్రిగా ఉన్న సి. దామోదర రాజనర్సింహ 2009 ఆగస్టు మాసంలో పనులకు శంకుస్థాపన చేశారు. టీ.లింగంపల్లి ప్రాంతంలోని బోరంచ పరీవాహకం నుంచి నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా అందించేందుకు ఈ పథకాన్ని రూపొందించారు. ఈ పనులను సకాలంలో పూర్తిచేసేందుకు అధికారులు, కాంట్రాక్టర్లు సరైన శ్రద్ధ కనబరచలేదన్న ఆరోపణలున్నాయి. ఈ పథకం కోసం ఏర్పాటు చేసిన పైపులు, జరిగిన పనుల్లో నాణ్యత కొరవడటంతో లీకేజీలు ఏర్పడ్డాయి. లీకేజీలకు మరమ్మతులు చేయించడంలో అధికారులు శ్రద్ధ చూపకపోవడం గమనార్హం. ఎన్నికలకు మం దు ఈ పథకాన్ని ట్రయల్న్ ్రచేసేందుకు ఏ ర్పాట్లు చేసినా ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో అప్పట్లో బ్రేక్ పడింది. దీంతో ఈ పథకంపై ఎన్నికల్లో లబ్ధిపొందాలనుకున్న కాంగ్రెస్ పార్టీ ఆశలు అడియాశలయ్యాయి. అప్పట్లో సింగూరు ప్రాజెక్టు వద్ద నిర్వహించిన ట్రయల్ రన్ వల్ల కాలువలు నీటి ప్రవాహనికి దెబ్బతినడంతో కాంగ్రెస్ పార్టీ అప్రతిష్ట పాలైందనే చెప్పవచ్చు. బోరంచ ఎత్తిపోతల పథ కం పనులు సైతం లికేజీలు ఏర్పడటంతో ఆ పార్టీ నేతలు ఇరకాటంలో పడ్డారు. బోరంచ ఎత్తిపోతల పథకం పూర్తయినట్లయితే వందలాది ఎకరాల బీడు భూములు సాగులోకి వచ్చే అవకాశం ఉంది. నియోజకవర్గానికి లక్ష ఎకరాల చొప్పున నీరందిస్తామని చెబుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం బోరంచ ఎత్తిపోతల పథకంపై దృష్టి సారించి మరమ్మతు పనులు పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు కోరుతున్నారు. లీకేజీల మరమ్మతులు చేయాల్సింది కాంట్రాక్టరే లీకేజీల మరమ్మతులు చేయాల్సింది కాంట్రాక్టరే.. రెండేళ్ల వరకు ఎలాంటి మరమ్మతులు చేయాల్సి ఉన్నా వారిదే బాధ్యత ఉంటుంది. లీకేజీలు ఏర్పడిన విషయం వాస్తవమే. పైప్లైన్ ద్వారా లేదా కాలువల ద్వారా నీరందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి. - దిగంబర్ రావు, బోరంచ ఎత్తిపోతల పథకం అధ్యక్షుడు లీకేజీలతో పంటలు పాడయ్యాయి పైప్లైన్లు సక్రమంగా ఏర్పాటు చేయకపోడంతో లీకేజీలు ఏర్పడ్డాయి. దీంతో తమ పంటలు పాడయ్యాయి. లీకేజీలను సరిచేసిన తర్వాతే పథకాన్ని ప్రారంభించాలి. నాణ్యతతో కూడిన పనులు చేపట్టాలి. -మారుతి, తాటిపల్లి రైతు -
అన్నా, మేం కారెక్కుతాం.. మీరూ రండి
జోగిపేట, న్యూస్లైన్: ‘మన పార్టీ పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు.. మేం టీఆర్ఎస్లో చేరాలనుకుంటున్నాం.. మీరు కూడా వస్తే బాగుంటుంది.. వస్తే ఎమ్మెల్యే అయిపోవచ్చు’ అని అందోల్ నియోజకవర్గ తెలుగు దేశం నాయకులు, కార్యకర్తలు మాజీ మంత్రి పి.బాబూమోహన్ను కోరుతున్నారు. నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన ముఖ్య నాయకులు ఆయనతో గత రెండు, మూడు రోజులుగా ఈ విషయమై చర్చిస్తున్నట్టు సమాచారం. టీఆర్ఎస్లో చేరాలని లేకపోతే తమ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనుందని వారు బాబూమోహన్ ఎదుట తమ గోడు వినిపిస్తున్నారు. ‘ఒకానొక దశలో మీరు రాకపోయినా మేం వెళ్లిపోతాం’ అని కరాఖండిగా చెబుతున్నట్టు తెలుస్తోంది. అందోల్ మండల టీడీపీ అధ్యక్షుడు లింగాగౌడ్ ఆధ్వర్యంలో పార్టీ ముఖ్య నాయకులు సోమవారం తాలెల్మ గ్రామంలో సమావేశమయ్యారు. ఇందులో పాల్గొన్న వారంతా టీఆర్ఎస్లో చేరాలని తీర్మానించారు. పుల్కల్ మండలంలోనూ ముఖ్య నాయకులు సోమవారం సమావేశమయ్యారు. టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుకు వెళ్దామని నిర్ణయించినట్టు సమాచారం. మాజీ మంత్రి పి.బాబూమోహన్కు అత్యంత సన్నిహితంగా ఉండే ఓ నాయకుడు టీఆర్ఎస్ తరఫున జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాలని భావించి ప్రయత్నాలు ప్రారంభించినట్టు సమాచారం. అల్లాదుర్గం, రేగోడ్, మునిపల్లి మండలాలకు చెందిన నాయకులు సైతం ఇదే ఆలోచనతో ఉన్నట్టు తెలిసింది. నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తల నుంచి ఒత్తిడి పెరుగుతున్న తరుణంలో బాబూమోహన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.