క్రికెట్కు గుడ్బై చెప్పిన మాజీ కెప్టెన్
హోబార్ట్: దక్షిణాఫ్రికా మాజీ ఆల్రౌండర్ జోహాన్ బోథా క్రికెట్కు గుడ్బై చెప్పేశాడు. ఈ మేరకు అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు సఫారీ జట్టు తాజా మాజీ స్పిన్నర్ ప్రకటించాడు. ఈ ఏడాది బిగ్బాష్ లీగ్(బీబీఎల్)లో భాగంగా హోబార్ట్ హరికేన్స్ కు ప్రాతినిథ్యం వహించిన బోథా.. బుధవారం సిడ్సీ సిక్సర్స్తో మ్యాచ్ తర్వాత తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. ఈ మ్యాచ్లో భోథాకు కనీసం వికెట్ కూడా లభించలేదు. దాంతో క్రికెట్కు వీడ్కోలు చెప్పే సమయం ఆసన్నమైందని భావించిన 36 ఏళ్ల బోథా ఉన్నపళంగా రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు.
2005 నుంచి 2012 వరకూ దక్షిణాఫ్రికా జట్టు ప్రాతినిథ్యం వహించగా, 2016లో ఆస్ట్రేలియా పౌరసత్వం పొందాడు. దక్షిణాఫ్రికా తరఫున 78 వన్డే మ్యాచ్లు, 40 టీ20 మ్యాచ్లు, 5 టెస్టు మ్యాచ్లు ఆడాడు. ఈ క్రమంలోనే 10 వన్డేలకు కెప్టెన్గా వ్యవహరించాడు. 2009లో బోథా నేతృత్వంలోని దక్షిణాఫ్రికా జట్టు నంబర్వన్ ర్యాంకును సొంతం చేసుకుంది. ఆ సిరీస్లో దక్షిణాఫ్రికా 4-1తో ఆసీస్పై గెలిచి టాప్ ర్యాంకును సొంతం చేసుకుంది. ఇదిలా ఉంచితే, పలు సందర్భాల్లో భోథా యాక్షన్పై అనుమానాలు తలెత్తడంతో అతని బౌలింగ్ను సరిచేసుకోవాల్సి వచ్చింది.