justice bhushan ramkrishna gavai
-
అంబేడ్కర్ కలలు సాకారం: జస్టిస్ గవాయ్
లండన్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఆశయాలు ఆచరణలోకి వస్తున్నాయని, భారత్లో నిమ్నవర్గాల ప్రజలు కూడా అత్యున్నత రాజ్యాంగ పదవులు అధిరోహిస్తున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ చెప్పారు. భారత రాజ్యాంగానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లండన్లోని చరిత్రాత్మక గ్రేస్ ఇన్లో గురువారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని అంబేడ్కర్ బోధించారని గుర్తుచేశారు. బడుగు వర్గాల ప్రజలు కూడా ఉన్నత పదవులు చేపట్టాలని ఆయన కలలుగన్నారని తెలిపారు. అంబేడ్కర్ కలలు సాకారం అవుతుండడం సంతోషంగా ఉందన్నారు. అంబేడ్కర్ సూచించిన దారితో తాము నడుస్తున్నామని తెలిపారు. తాను దళిత వర్గం నుంచే వచ్చినట్లు జస్టిస్ గవాయ్ గుర్తుచేశారు. గిరిజన మహిళ ద్రౌపది ముర్ము భారత రాష్ట్రపతి అయ్యారని పేర్కొన్నారు. ఇది నిజంగా గర్వకారణమని వ్యాఖ్యానించారు. ఇండియాలో అన్ని రంగాల్లో బడుగు బలహీన వర్గాల ప్రాతినిధ్యం పెరుగుతోందన్నారు. -
న్యాయ బంధం బలోపేతం
లండన్: భారత్, యునైటెడ్ కింగ్డమ్(యూకే) మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్టీఏ)తో రెండు దేశాల నడుమ న్యాయ బంధం సైతం మరింత బలోపేతం అవుతుందని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ చెప్పారు. ఉమ్మడి న్యాయ సూత్రాల ఆధారంగా ఇరు దేశాలు ఘనమైన న్యాయ చరిత్రను పంచుకుంటున్నాయని వివరించారు. గురువారం యూకే రాజధాని లండన్లో ఇండో–యూకే వాణిజ్య వివాదాల మధ్యవర్తిత్వంపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో జస్టిస్ గవాయ్ ప్రసంగించారు. న్యాయ రంగంలో పరస్పర సహకారం ద్వారా భారత్, యూకేలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. 2018 జూలైలో ఇండియా–యూకే మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందాన్ని ప్రస్తావించారు. దీనివల్ల ఇరు దేశాల నడుమ చట్ట, న్యాయ బంధం మరింత పెరిగిందని తెలిపారు. వివాదాల పరిష్కారం, శిక్షణతోపాటు న్యాయ సేవల్లో రెండు దేశాలు కలిసి పని చేయడానికి ఈ ఒప్పందం దోహదపడుతోందని జస్టిస్ గవాయ్ వివరించారు. ఈ కార్యక్రమంలో భారత న్యాయ శాఖ మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ సైతం ప్రసంగించారు. సింగపూర్, లండన్ తరహాలో భారత్ సైతం మేజర్ ఇంటర్నేషన్ ఆర్బిట్రేషన్ హబ్గా మారుతోందని చెప్పారు. మరోవైపు ‘బ్రిటిష్ ఇన్స్టి్టట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ కంపేరేటివ్ లా’లో జరిగిన మరో కార్యక్రమంలోనూ జస్టిస్ గవాయ్ మాట్లాడారు. న్యాయ వ్యవస్థలో టెక్నాలజీకి అధిక ప్రాధాన్యం ఇవ్వడం సరైంది కాదన్నారు. దీనివల్ల న్యాయ వ్యవస్థపై ప్రజల విశ్వాసం తగ్గిపోతుందని పేర్కొన్నారు. కక్షిదారులకు న్యాయం చేకూర్చడానికి టెక్నాలజీని తగిన రీతిలో వాడుకోవాలి తప్ప దానికే పెద్దపీట వేయొద్దని సూచించారు. పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానమే న్యాయ వ్యవస్థను ముందుకు నడిపించే పరిస్థితి రాకూడదని పేర్కొన్నారు. -
న్యాయ వ్యవస్థలో అవినీతి అరికట్టాలి!
న్యూఢిల్లీ: న్యాయ వ్యవస్థలో అవినీతి, దుష్ప్రవర్తన వంటివి ప్రజల విశ్వాసంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ చెప్పారు. అంతిమంగా న్యాయ వ్యవస్థలో నిజాయతీ, సమగ్రతపై ప్రజలు నమ్మకం కోల్పోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. యునైటెడ్ కింగ్డమ్ సుప్రీంకోర్టులో ‘న్యాయ వ్యవస్థ సమగ్రత, ప్రజల విశ్వాసం కొనసాగింపు’ అనే అంశంపై తాజాగా జరిగిన రౌండ్టేబుల్ సమావేశంలో జస్టిస్ గవాయ్ మాట్లాడారు. న్యాయమూర్తులు పదవీ విరమణ చేసిన వెంటనే ఎన్నికల్లో పోటీ చేయడాన్ని, ప్రభుత్వ పదవులు స్వీకరించడాన్ని తప్పుపట్టారు. ఇది నైతికతకు సంబంధించిన అంశమని, ప్రజల పరీక్షకు గురి కావాల్సి ఉంటుందని చెప్పారు. భవిష్యత్తులో దక్కబోయే పదవులను దృష్టిలో పెట్టుకొని జడ్జీలు తీర్పు లు ఇస్తారని ప్రజలు భావించే ప్రమాదం ఉందన్నారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రత, నిష్పక్షపాతంపై సందేహాలు తలెత్తుతా య న్నారు. పదవీ విరమణ తర్వాత ఎలాంటి పదవు లు స్వీకరించబోమంటూ తనతోపాటు మరికొందరు సహచరులు ప్రమాణం చేసినట్లు వెల్లడించారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రత, విశ్వసనీయతను పరిరక్షించాలన్న ధ్యేయంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టంచేశారు. అలాగే న్యాయ వ్యవస్థలో అవినీతి, దుష్ప్రవర్తన వెలుగులోకి వచ్చినప్పుడు సుప్రీంకోర్టు జాప్యం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రభుత్వ జోక్యం వద్దు...కోర్టుల్లో న్యాయమూర్తుల నియామకంలో రాజకీ య, ప్రభుత్వ జోక్యం ఉండరాదని జస్టిస్ గవాయ్ అభిప్రాయపడ్డారు. కొలీజియం వ్యవస్థను ఆయన సమర్థించారు. ఈ వ్యవస్థలో పారదర్శకత, జవాబు దారీతనం ఉండడం లేదన్న వాదనను ఖండించారు. రాజ్యాంగ పరిరక్షణ విషయంలో న్యాయ మూర్తుల స్వతంత్రత అనేది అత్యంత కీలకమని స్పష్టంచేశారు. శాసన లేదా కార్యనిర్వాహక వ్యవ స్థల చట్టబద్ధత బ్యాలెట్ ద్వారా ఏర్పడుతుందని గుర్తుచేశారు. కానీ, జ్యుడీషియరీ చట్టబద్ధత రాజ్యాంగ విలువల పరిరక్షణతో అనుసంధానమై ఉంటుందన్నారు. -
రాజ్యాంగం వల్లే దృఢమైన భారత్
ప్రయాగ్రాజ్: సంక్షోభ సమయాల్లోనూ దేశాన్ని ఐక్యంగా, బలంగా నిలబెట్టిన ఘనత మన రాజ్యాంగానిదే అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ చెప్పారు. ఎన్నో విపత్కర పరిస్థితులు, సమస్యలు ఎదురైనప్పటికీ దేశం స్థిరంగా నిలిచి ఉందని, ఆ క్రెడిట్ రాజ్యాంగానికే దక్కుతుందని స్పష్టంచేశారు. శనివారం ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ హైకోర్టులో అడ్వొకేట్ చాంబర్స్, మల్టి–లెవెల్ పార్కింగ్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయవాదులను ఉద్దేశించి ప్రసంగించారు. 75 ఏళ్ల క్రితం రాజ్యాంగాన్ని రూపొందించి, తుది ముసాయిదాను రాజ్యాంగ సభకు సమరి్పంచిన సమయంలో దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని గుర్తుచేశారు. రాజ్యాంగంలో సమాఖ్య లక్షణాలు అధికంగా ఉన్నాయని కొందరు, ఏకీకృతంగా ఉందని మరికొందరు చెప్పారని వెల్లడించారు. రాజ్యాంగం పూర్తి సమాఖ్యం కాదు, పూర్తి ఏకీకృతం కాదని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ బదులిచ్చినట్లు తెలిపారు. యుద్ధం, శాంతితోపాటు ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేశాన్ని ఐక్యంగా, దృఢంగా ఉంచే రాజ్యాంగం మనకు లభించిందని హర్షం వ్యక్తం చేశారు. రాజ్యాంగ స్వర్ణ రథానికి రెండు చక్రాలు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మన దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందంటే అందుకు కారణం రాజ్యాంగమేనని జస్టిస్ గవాయ్ స్పష్టం చేశారు. పొరుగు దేశాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూస్తూనే ఉన్నామని చెప్పారు. ఈ 75 ఏళ్ల రాజ్యాంగ ప్రయాణంలో దేశంలో సామాజిక, ఆర్థిక సమనత్వాన్ని తీసుకురావడానికి శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు ఎంతగానో కృషి చేశాయని ఉద్ఘాటించారు. సమాజంలో చిట్టచివరి వ్యక్తికి సైతం న్యాయం చేకూర్చడం మన ప్రాథమిక విధి అని న్యాయమూర్తులు, న్యాయవాదులకు పిలుపునిచ్చారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు ఆ ఆఖరి వ్యక్తిదాకా చేరుకోవాలని సూచించారు. భూసంస్కరణలతో ఎంతోమందికి మేలు జరిగిందని జస్టిస్ గవాయ్ తెలిపారు. భూస్వాముల నుంచి భూములు పేదలకు బదిలీ అయ్యాయని పేర్కొన్నారు. భూసంస్కరణ చట్టాలను ఎంతోమంది కోర్టుల్లో సవాలు చేశారని వెల్లడించారు. ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కుల మధ్య ఘర్షణ జరిగితే.. ప్రాథమిక హక్కులదే పైచేయి అవుతుందని సుప్రీంకోర్టు తేల్చిచెప్పినట్లు గుర్తుచేశారు. రాజ్యాంగాన్ని సవరించే హక్కు పార్లమెంట్కు ఉన్నప్పటికీ.. దాని మౌలిక స్వరూపాన్ని మార్చే హక్కు లేదని 1973లో అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు ఇచ్చినట్లు చెప్పారు. భారత రాజ్యాంగానికి ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలే ఆత్మ అని పేర్కొంటూ, రాజ్యాంగ స్వర్ణ రథానికి ఇవి రెండు చక్రాలు అని వ్యాఖ్యానించారు. ఒక్క చక్రాన్ని ఆపినా మొత్తం రథం ఆగిపోతుందన్నారు. బార్, బెంచ్ అనేవి ఒకే నాణేనికి రెండు ముఖాలు అని జస్టిస్ గవాయ్ స్పష్టంచేశారు. బార్, బెంచ్ కలిసికట్టుగా పనిచేయకపోతే రాజ్యాంగ రథం ముందకు సాగదని చెప్పారు. -
యూట్యూబర్పై సుప్రీం ధిక్కార చర్యలు
న్యూఢిల్లీ: అత్యున్నత న్యాయస్థానంలోని జడ్జీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పంజాబ్ యూట్యూబర్ అజయ్ శుక్లాపై సుప్రీంకోర్టు మండిపడింది. సుప్రీం జడ్జీలపై అతడు చేసిన వ్యాఖ్యలు అవమానకరంగా, ప్రతిష్టకు భంగం కలిగించేలా, ధిక్కార పూరితంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. సుమోటోగా అతడిపై ధిక్కార చర్యలు చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఆగస్టీన్ జార్జి మసీహ్, జస్టిస్ ఏఎస్ చందూర్కర్ల ధర్మాసనం శుక్రవారం..తక్షణమే శుక్లా వ్యాఖ్యలున్న వీడియోను తొలగించాలని, మరోసారి అదే వీడియోను కానీ, అలాంటి వీడియోను కానీ ప్రసారం చేయరాదంటూ అతడి వరప్రద్ మీడియా చానల్ను ఆదేశించింది. శుక్లా వ్యాఖ్యలు తీవ్రమైనవని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన వాక్ స్వాతంత్య్రం, పత్రికా స్వేచ్ఛకు కొన్ని పరిమితులున్నాయని ధర్మాసనం తెలిపింది. ఈ స్వేచ్ఛను అడ్డుపెట్టుకుని సుప్రీంకోర్టులోని న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని అనుమతించబోమని స్పష్టం చేసింది. శుక్లాపై ధిక్కారం కేసు నమోదు చేయాలని ఆదేశించింది. రిటైర్డు జస్టిస్ బేలా ఎం త్రివేదిపై వ్యాఖ్యలతో కూడిన వీడియోను శుక్లా తన యూట్యూబ్ చానల్లో ఇటీవల అప్లోడ్ చేశాడు. -
మతాలన్నింటి సారం ఒక్కటే
న్యూఢిల్లీ: వక్ఫ్(సవరణ) చట్టం–2025 రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో మూడు రోజులపాటు జరిగిన వాదనలు గురువారం ముగిశాయి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్, న్యాయమూర్తి జస్టిస్ అగస్టీన్ జార్జి మాసిహ్తో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అంతకుముందు కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, పిటిషనర్ల తరఫున కపిల్ సిబల్, రాజీవ్ ధావన్, అభిషేక్ సింఘ్వీ సుప్రీంకోర్టు ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించారు. వక్ఫ్ అనేది కేవలం ఒక సేవా కార్యక్రమం అని, అది ఇస్లాంలో తప్పనిసరి భాగం కాదని తుషార్ మెహతా పేర్కొనగా, కపిల్ సిబల్ స్పందిస్తూ... మరణానంతర జీవితం కోసం దేవుడికి, సమాజానికి సేవ చేయడమే వక్ఫ్ అని తేల్చిచెప్పారు. ఆధ్యాత్మిక ప్రయోజనం కోసం భగవంతుడికి అంకితంకావడం వక్ఫ్ అని వివరించారు. సీజేఐ జస్టిస్ గవాయ్ మాట్లాడుతూ.. హిందూ మతస్తుల్లో మోక్షం అనే భావన ఉందని గుర్తుచేశారు. జస్టిస్ అగస్టీన్ జార్జి స్పందిస్తూ.. క్రైస్తవ మతంలోనూ అలాంటి భావనే ఉందన్నారు. స్వర్గానికి చేరుకోవడానికి క్రైస్తవులు ఆరాటపడుతుంటారని తెలిపారు. అనంతరం రాజీవ్ ధావన్ మాట్లాడుతూ కేంద్రం వాదనను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. వేదాల ప్రకారం చూస్తే హిందూ మతంలో దేవాలయాలు తప్పనిసరి భాగం కాదని చెప్పారు. ప్రకృతిని ఆరాధించే ఆచారం హిందూ మతంలో ఉందన్నారు. అగ్ని, నీరు, వర్షం, పర్వతాలు, సముద్రాలను దేవుళ్లుగా పూజిస్తుంటారని గుర్తుచేశారు. దాదాపు అన్ని మతాల్లో సేవా భావన ఉందని జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు. మతాల్లో అదొక ప్రాథమిక సూత్రమని వెల్లడించారు. సేవా కార్యక్రమాల విషయంలో మతాలన్నింటి సారం ఒక్కటేనని, వాటి మధ్య భేదం లేదని పరోక్షంగా తెలియజేశారు. మరోవైపు వక్ఫ్(సవరణ) చట్టాన్ని చట్టబద్ధంగానే తీసుకొచ్చారని, ఇది చట్టవిరుద్ధమని సాక్ష్యాధారాలతో సహా నిరూపించాల్సిన బాధ్యత పిటిషనర్లదేనని సీజేఐ సూచించారు. పార్లమెంట్ ఆమోదంతో తీసుకొచి్చన చట్టంపై స్టే ఇవ్వొద్దని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టును కోరారు. వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులు ఎందుకు? సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, స్టేట్ వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులను కూడా సభ్యులుగా నియమించాలన్న నిబంధనను చట్టంలో చేర్చడాన్ని కపిల్ సిబల్ తప్పుపట్టారు. హిందూ ధార్మిక సంస్థల్లో హిందూయేతరులకు ప్రవేశం ఉండదని తెలిపారు. అలాంటప్పుడు వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులను నియమించడంలో ఔచిత్యం ఏమిటని ప్రశ్నించారు. వక్ఫ్(సవరణ) చట్టంపై సుప్రీంకోర్టు ఉత్తర్వు శుక్రవారం వెలువడే అవకాశం ఉంది. -
సెలవుల్లో పని చేయడానికి లాయర్లు ఇష్టపడడం లేదు
న్యూఢిల్లీ: సెలవు రోజుల్లో పని చేయడానికి న్యాయవాదులు ఇష్టపడడం లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. మరోవైపు పెండింగ్ కేసులు పరిష్కరించడం లేదంటూ న్యాయ వ్యవస్థపై విమర్శలు వస్తున్నాయని పేర్కొంది. తమ పిటిషన్పై విచారణను వేసవి సెలవుల తర్వాత ప్రారంభించాలని కోరిన ఓ న్యాయవాది పట్ల ధర్మాసనం బుధవారం అసంతృప్తి వ్యక్తంచేసింది. సుప్రీంకోర్టులో మొదటి ఐదుగురు న్యాయమూర్తులు వేసవి సెలవుల్లోనూ విధులు నిర్వర్తిస్తారని తెలియజేసింది. అయినప్పటికీ బ్యాక్లాగ్ కేసుల విషయంలో తమపై నిందలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తంచేసింది. వాస్తవానికి వేసవి సెలవుల్లో పని చేయడం లాయర్లకు ఎంతమాత్రం ఇష్టం లేదని ఆక్షేపించింది. సుప్రీంకోర్టుకు ఈ నెల 26 నుంచి జూలై 13 వరకు వేసవి సెలవులు ప్రకటించారు. ఈ మేరకు న్యాయస్థానం నోటిఫికేషన్ జారీ చేసింది. సెలవుల సమయంలోనూ ధర్మాసనాలు పాక్షికంగా పని చేయాలని సూచించింది. రెండు నుంచి ఐదు వెకేషన్ బెంచ్లు పని చేయాలని నిర్దేశించింది. సీజేఐ సహా ఐదుగురు న్యాయమూర్తులు విధులకు హాజరవుతారు. గతంలో వేసవి సెలవుల్లో కేవలం రెండు వెకేషన్ బెంచ్లు పనిచేసేవి. సీనియర్ న్యాయమూర్తులు విధులు నిర్వర్తించాలన్న నిబంధన ఉండేది కాదు. కానీ, ఈ నిబంధనల్లో సుప్రీంకోర్టు తాజాగా మార్పులు చేసింది. ఈ నెల 26 నుంచి ఐదు ధర్మాసనాలకు జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రంనాథ్, జస్టిస్ జె.కె.మహేశ్వరి, జస్టిస్ బి.బి.నాగరత్న నేతృత్వం వహిస్తారు. అలాగే సుప్రీంకోర్టు రిజిస్ట్రీ అన్ని పనిదినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా తెరిచి ఉంటుంది. -
రాజ్యాంగం, ‘సుప్రీం’ మధ్య విడదీయరాని బంధం
న్యూఢిల్లీ: దేశంలో ప్రాథమిక హక్కుల పరిధిని మరింత విస్తరింపజేయడంలో సుప్రీంకోర్టు కీలక పాత్ర పోషిస్తోందని సీజేఐ జస్టిస్ బి.ఆర్.గవాయ్ చెప్పారు. 75 ఏళ్ల సుప్రీంకోర్టు ప్రయాణాన్ని భారత రాజ్యాంగం నుంచి విడదీసి చూడలేమని అన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మధ్యవర్తిత్వం, ఎన్నికల ప్రక్రియ వంటి ముఖ్యమైన అంశాల్లో మారుతున్న సామాజిక అవసరాలకు అనుగుణంగా న్యాయస్థానం తీర్పులు ఇస్తున్నట్లు వివరించారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యాల ద్వారా సమాజంలో అట్టడుగు వర్గాలకు న్యాయం చేకూరుస్తున్నట్లు తెలిపారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్ బి.ఆర్.గవాయ్ ప్రసంగించారు. సుప్రీంకోర్టు 75 ఏళ్ల స్మారక పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ ఏడాది మన రాజ్యాంగం, సుప్రీంకోర్టు 75 ఏళ్లు పూర్తి చేసుకున్నాయని, ఇది చరిత్రాత్మక సందర్భమని వ్యాఖ్యానించారు. రెండింటి మధ్య విడదీయరాని బంధం కొనసాగుతున్నట్లు స్పష్టంచేశారు. ఇవి ఒకే నాణేనికి రెండు ముఖాలు అని పేర్కొన్నారు. సుప్రీంకోర్టును రాజ్యాంగమే సృష్టించిందని, రాజ్యాంగ ఆదేశాల ప్రకారమే సుప్రీంకోర్టు పనిచేస్తోందని ఉద్ఘాటించారు. అదేసమయంలో రాజ్యాంగానికి సుప్రీంకోర్టు అత్యుత్తమ రక్షణ కవచంగా వ్యవహరిస్తోందని జస్టిస్ గవాయ్ వివరించారు. జస్టిస్ ఓకా పని రాక్షసుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభయ్ ఎస్.ఓకా తనకు మంచి మిత్రుడు, పని రాక్షసుడు జస్టిస్ బి.ఆర్.గవాయ్ చెప్పారు. జస్టిస్ ఓకా ఈ నెల 24న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో బుధవారం సుప్రీంకోర్టు అడ్వొకేట్–ఆన్–రికార్డు అసోసియేషన్ ఆధ్వర్యంలో వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ గవాయ్ మాట్లాడారు. జస్టిస్ ఓకాతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. న్యాయ వ్యవస్థకు ఆయన అందించిన సేవలను ప్రశంసించారు. జస్టిస్ ఓకా మాట్లాడుతూ.. జస్టిస్ గవాయ్ అసలైన ప్రజాస్వామ్యవాది అని కొనియాడారు. -
సీజేఐకి ఇచ్చే గౌరవం ఇదేనా?
ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టాక ఆదివారం ఆయన తొలిసారి తన సొంత రాష్ట్రం మహారాష్ట్రలో పర్యటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రొటోకాల్ పాటించకపోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. సీజేఐ తొలిసారి అధికారిక పర్యటనకు వస్తే ప్రొటోకాల్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు డీజీపీ లేదా నగర పోలీసు కమిషనర్ స్వాగతం పలకాల్సి ఉంటుంది. ఈ నెల 14న సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ గవాయ్ని మహారాష్ట్ర, గోవా బార్ కౌన్సిల్ సన్మానించింది. ఆ కార్యక్రమం నిమిత్తం ఆయన ఆదివారం ముంబై చేరుకున్నారు. సీఎస్, డీజీపీ, పోలీసు కమిషనర్ స్వాగతం పలకకపోవడం చర్చనీయాంశంగా మారింది. అనంతరం సన్మాన కార్యక్రమంలో జస్టిస్ గవాయ్ దీన్ని ఎత్తి చూపారు. ‘‘నేను మహారాష్ట్రలోనే పుట్టి పెరిగా. సీజేఐ హోదాలో తొలిసారి సొంత రాష్ట్రానికి వస్తే ప్రొటోకాల్ ప్రకారం ఆహ్వానించకపోవడం ఏ మేరకు సబబో సీఎస్, డీజీపీ ఆలోచించుకోవాలి. నేనేమీ ప్రొటోకాల్ కోసం బలవంతం చేయడం లేదు. ఇలాంటి చిన్నచిన్న విషయాలు పట్టించుకోను. కాకపోతే ప్రజాస్వామ్యంలో ఒక వ్యవస్థ మరో వ్యవస్థకు ఇవ్వాల్సిన గౌరవం గురించి మాత్రమే మాట్లాడుతున్నా. ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతోనే దీన్ని ప్రస్తావిస్తున్నా’’ అని వివరించారు. ‘‘ఇక్కడ నా స్థానంలో మరొకరు ఉండి ఉంటే రాజ్యాంగంలోని ఆరి్టకల్ 142ను ప్రయోగించేవారు’’ అని జస్టిస్ గవాయ్ సరదాగా వ్యాఖ్యానించారు.రాజ్యాంగమే అత్యున్నతం ప్రజాస్వామ్యంలో రాజ్యాంగమే అత్యున్నతమని సీజేఐ గవాయ్ స్పష్టం చేశారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు కలిసికట్టుగా పనిచేయాలని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంట్కు ఉన్నప్పటికీ రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని మాత్రం అది మార్చలేదని తేల్చిచెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థ గొప్పతనం ఇదేనన్నారు. తాను వెలువరించిన 50 కీలక తీర్పులతో కూడిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. నేరగాళ్ల ఇళ్లను కూల్చడం (బుల్డోజర్ న్యాయం) కూడదంటూ తానిచి్చన తీర్పు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. -
అంబేడ్కర్ భావజాలమే ఆదర్శం
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ భావజాలమే నాకు ఆదర్శం. ఆయన మార్గమే నన్ను సీజేఐగా నిలబెట్టింది’’అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భూషణ్ రామకృష్ణ గవాయ్ తెలిపారు. సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయనను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) శనివారం ఘనంగా సన్మానించింది. యువ న్యాయవాది నుంచి అత్యున్నత స్థానానికి ఎదిగేదాకా తన న్యాయ ప్రస్థానంలోని ఆసక్తికరమైన విషయాలను సీజేఐ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ‘‘చిన్నతనంలో నాకు ఆర్కిటెక్ట్ కావాలనే కోరిక ఉండేది. కానీ అంబేడ్కర్ ఆశయ సాధన, ఆయన అడుగుజాడల్లో నడవాల్సిన ఆవశ్యకతను తండ్రి సూచించడంతో న్యాయ వృత్తిని ఎన్నుకున్నా. న్యాయమూర్తిగా అవకాశం వచి్చనప్పుడు స్వీకరించాలా వద్దా అన్న మీమాంసలో పడ్డా. న్యాయవాదిగానే కొనసాగితే ఎంతో డబ్బు సంపాదించవచ్చని చాలామంది సలహా ఇచ్చారు. అది నిజమే అయినా న్యాయమూర్తిగా అంబేడ్కర్ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లి సామాజిక, ఆర్థిక న్యాయ సాధనకు కృషి చేయొచ్చని నాన్న ఎప్పుడూ చెప్పేవారు. ఆయన మాటలకు కట్టుబడి న్యాయమూర్తిగా మారాను. ఆ నిర్ణయం తీసుకున్నందుకు ఇప్పుడెంతో సంతోషిస్తున్నా’’అని చెప్పారు. ఖాళీలను భర్తీ చేయాలి న్యాయ నియామకాల్లో వైవిధ్యం పెరగాల్సిన అవసరాన్ని జస్టిస్ గవాయ్ నొక్కిచెప్పారు. ఆ పదవులకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల నుంచి మహిళలను వీలైనంత ఎక్కువగా సిఫార్సు చేయాలని హైకోర్టులకు సూచించారు.‘‘ఈ విషయమై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో కూడా మాట్లాడాను. జడ్జి నియామకాలకు అర్హులైన మహిళా అభ్యర్థులు వారి హైకోర్టుల్లో లేని పక్షంలో సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న ప్రతిభావంతుల నుంచి ఎంపిక చేసుకోవాలని సూచించాను. ఈ విషయంలో కొంతమేరకు సఫలీకృతమయ్యాం కూడా’’అని వెల్లడించడంతో ఆహూతులు చప్పట్లతో అభినందించారు. వాగ్దానాలు నా నైజం కాదు సీజేఐ అయ్యాక చాలా మీడియా సంస్థలు తన ఇంటర్వ్యూ అడుగుతున్నట్టు జస్టిస్ గవాయ్ చెప్పారు. ‘‘కానీ ఇవ్వలేకపోతున్నాను. ఇప్పుడే కాదు, బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పటి నుంచీ మీడియాకు దూరంగానే ఉండేవాడిని. మీడియా అంటే నాకేమీ భయం లేదు. కానీ నాకు సిగ్గు చాలా ఎక్కువ’’అని చెప్పి నవ్వులు పూయించారు. ‘‘అదీగాక ముందుగానే వాగ్దానాలు చేయడం నాకిష్టముండదు. అప్పట్లో ఇంటర్వ్యూల్లో అన్ని చెప్పాడు, చివరికి వాటిలో ఒక్కటీ చేయలేదని మీడియా మిత్రులే విమర్శించే ప్రమాదముంది. కనుక ఇంటర్వ్యూలు ఇవ్వనందుకు నన్ను వాళ్లు క్షమిస్తారనే ఆశిస్తున్నా’’అంటూ చమత్కరించారు.ప్రొటోకాల్ పక్కన పెట్టి మరీ జస్టిస్ త్రివేదికి సీజేఐ వీడ్కోలు → చాంబర్కు వెళ్లి మరీ తోడ్కొని వచ్చారు → వెల్లడించిన జస్టిస్ విశ్వనాథన్ జస్టిస్ గవాయ్ వినమ్రత, నాయకత్వ లక్షణాలు సాటిలేనివని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.వి.విశ్వనాథన్ అన్నారు. శుక్రవారం రిటైరైన సహచర న్యాయమూర్తి జస్టిస్ బేలా ఎం.త్రివేదికి ప్రొటోకాల్ను పక్కన పెట్టిన మరీ ఘనంగా వీడ్కోలు పలికిన తీరే అందుకు గొప్ప నిదర్శనమన్నారు. ‘‘ప్రొటోకాల్ ప్రకారం ధర్మాసనం కార్యకలాపాలు ముగిశాక మధ్యాహ్నం 1.30 సమయంలో ఇతర న్యాయమూర్తులంతా సుప్రీంకోర్టు ఆవరణలోకి వచ్చి రిటైరయ్యే న్యాయమూర్తికి సాదరంగా వీడ్కోలు పలుకుతారు. జస్టిస్ త్రివేది విషయంలో మాత్రం సీజేఐ ఎవరూ ఊహించని పని చేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న తన చాంబర్ నుంచి రెండు అంతస్తులు ఎక్కి మరీ స్వయంగా జస్టిస్ త్రివేది చాంబర్లోకి వెళ్లి మమ్మల్ని ఆశ్చర్యపరిచారు. దాంతో మేం కూడా ఆయన్ను అనుసరించాం. సీజేఐ సారథ్యంలో అందరమూ కలిసి ఆమెను కోర్టు ప్రాంగణం దాకా సాదరంగా తోడ్కొని వచ్చాం. గార్డ్ ఆఫ్ ఆనర్తో ఘనంగా వీడ్కోలు పలికాం. ఇది నా దృష్టిలో అత్యంత అర్థవంతమైన వీడ్కోలు’’అని చెబుతూ జస్టిస్ విశ్వనాథన్ భావోద్వేగానికి లోనయ్యారు. -
బార్ తీరుపై సీజేఐ ఆక్షేపణ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్సీబీఏ) తీరును భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ తీవ్రంగా ఆక్షేపించారు. శుక్రవారం పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బేలా మాధుర్య త్రివేదికి వీడ్కోలు పలకరాదన్న ఎస్సీబీఏ నిర్ణయాన్ని తప్పుబట్టారు. జస్టిస్ త్రివేదికి వీడ్కోలు పలికేందుకు తన సారథ్యంలో కొలువుదీరిన లాంఛన ధర్మాసనం నుంచే ఈ మేరకు ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘న్యాయమూర్తి రిటైరవుతున్న సందర్భంలో బార్ అలాంటి వైఖరి తీసుకోకుండా ఉండాల్సింది. దాని తీరుతో బాహాటంగా విభేదిస్తున్నా. నేను ఉన్నదున్నట్టుగా మాట్లాడే వ్యక్తిని. కనుక ఈ విషయాన్ని ఇలా స్పష్టం చేయడం చాలా అవసరమని కూడా భావిస్తున్నా’’ అని ఎస్సీబీఏ అధ్యక్ష, ఉపాధ్యక్షులు కపిల్ సిబర్, రచనా శ్రీవాత్సవ సమక్షంలోనే వ్యాఖ్యానించారు. అయితే లాంఛన ధర్మాసన కార్యక్రమంలో వారిద్దరూ పాల్గొనడాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. ‘‘బెంచ్ మరోలా తీర్మానించినా వచ్చి పాల్గొన్నందుకు వారిద్దరికీ కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు. న్యాయమూర్తిగా జస్టిస్ త్రివేది ఎంత సమర్థురాలో చెప్పేందుకు ఇంతకంటే నిదర్శనం అవసరం లేదు. న్యాయమూర్తుల్లో కొందరి నుంచి ఆశించిన తీర్పులు రావు. వారికి దక్కాల్సిన వాటిని నిరాకరించేందుకు అది కారణం కారాదు’’ అన్నారు.జస్టిస్ త్రివేది న్యాయవ్యవస్థకే ఆభరణంజస్టిస్ త్రివేదీ న్యాయవ్యవస్థకే ఆభరణమంటూ సీజేఐ జస్టిస్ గవాయ్ కొనియాడారు. ట్రయల్ కోర్టు జడ్జిగా ప్రస్థానం ప్రారంభించి సుప్రీంకోర్టు దాకా ఎదిగిన తొలి న్యాయమూర్తి ఆమేనని గుర్తు చేశారు. గుజరాత్ నేషనల్ లా వర్సిటీ ఏర్పాటు వంటివాటిలోనూ ఆమె కీలక పాత్ర పోషించారన్నారు. ‘‘ఎస్సీ కోటాలో ఉప వర్గీకరణపై ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం సభ్యురాలిగా మెజారిటీ తీర్పుతో జస్టిస్ త్రివేది విభేదించారు. తద్వారా స్వతంత్ర ఆలోచనకు, స్థైర్యానికి ప్రతీకగా నిలిచారు. వ్యక్తిగత జీవిత సవాళ్లు తన ఉద్యోగ ధర్మాన్ని ఏనాడూ ప్రభావితం చేయనివ్వలేదు. ఆరోగ్యం బాగాలేని తండ్రిని చూసుకునేందుకు వారాంతాల్లో అహ్మదాబాద్ వెళ్లి, ఎంత కష్టమైనా సోమవారాకల్లా కోర్టుకు హాజరయ్యేవారు’’ అని చెప్పుకొచ్చారు. ‘‘జస్టిస్ త్రివేదీ! నిజాయతీకి, నిష్పాక్షికతకు, శ్రమించే తత్వానికి మీరు మారుపేరు. జీవిత ప్రయాణంలో నూతన అధ్యాయానికి తెర తీస్తున్న సందర్భంగా అభినందనలు’’ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాతో పాటు బార్ సభ్యులు తదితరులు జస్టిస్ త్రివేది సేవలను కొనియాడారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు రిటైరైనప్పుడు ఎన్సీబీఏ వీడ్కోలు సమావేశం నిర్వహించడం ఆనవాయితీ.నా తీర్పులే మాట్లాడాయి: జస్టిస్ త్రివేదితానేమిటో చెప్పేందుకు 30 ఏళ్లుగా తానిచ్చిన తీర్పులే నిదర్శనమని జస్టిస్ బేలా త్రివేది అభిప్రాయపడ్డారు. ‘‘ప్రతి తీర్పులోనూ ఆత్మ ప్రబోధానుసారమే నడుచుకున్నా. సివిల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా విధ్యుక్త ధర్మాన్ని నిబద్ధతతో, నిజాయతీతో నెరవేర్చిన తృప్తితోనే సెలవు తీసుకుంటున్నా’’ అని చెప్పారు.11వ మహిళా న్యాయమూర్తి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలందించిన 11వ మహిళగా జస్టిస్ త్రివేది నిలిచారు. పలు చరిత్రాత్మక తీర్పుల్లో భాగస్వామి అయ్యారు. ఆమె జూన్ 9న రిటైరవాల్సి ఉంది. వ్యక్తిగత కారణాలతో శుక్రవారమే పదవీ విరమణ చేశారు. ఆమె 2021 ఆగస్టు 31న సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యారు. అదే రోజు ఆమెతో పాటు మరో ఇద్దరు మహిళలు సహా రికార్డు స్థాయిలో మొత్తం 9 మంది బాధ్యతలు స్వీకరించారు. జస్టిస్ త్రివేది సిటీ సివిల్ కోర్టు జడ్జిగా నియుక్తురాలైన సమయంలో ఆమె తండ్రి కూడా అదే హోదాలో ఉండటం విశేషం! -
సీజేఐగా జస్టిస్ గవాయ్
న్యూఢిల్లీ: భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. ఉదయం రాష్ట్రపతి భవన్లోని గణతంత్ర మండపంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ధన్ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, గవర్నర్లు తదితరులు పాల్గొన్నారు. జస్టిస్ గవాయ్ హిందీలో ప్రమాణస్వీకారం చేశారు. ఆయన సుప్రీంకోర్టుకు తొలి బౌద్ధ ప్రధాన న్యాయమూర్తి. జస్టిస్ కేజీ బాలకృష్ణన్ తర్వాత రెండో దళిత సీజేఐ. ప్రమాణస్వీకారం తర్వాత తల్లి కమల్ తాయ్ పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం సుప్రీంకోర్టు ప్రాంగణంలో గాం«దీ, అంబేడ్కర్ విగ్రహాల వద్ద నివాళులర్పించారు. న్యాయవాదులు తదితరులు తనకు శుభాకాంక్షలు తెలపగా ‘జై భీమ్’ అంటూ నినదించారు. న్యాయవ్యవస్థలోని అత్యున్నత స్థానం నుంచి సామాజిక న్యాయం తాలూకు శక్తిమంతమైన ప్రకటనకు ఆ నినాదం ప్రతీక అని సుప్రీంకోర్టు బార్ పేర్కొంది. జస్టిస్ గవాయ్ ప్రమాణస్వీకార ఫొటోలను మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆయనతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తదితరులు జస్టిస్ గవాయ్కి శుభాకాంక్షలు తెలిపారు. 64 ఏళ్ల జస్టిస్ గవాయ్ మహారాష్ట్ర నుంచి సీజేఐ పదవి చేపట్టిన ఆరో వ్యక్తి. మంగళవారం రిటైరైన సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా స్థానంలో బాధ్యతలు స్వీకరించారు. ఆర్నెల్ల పాటు, అంటే నవంబర్ 23 దాకా విధులు నిర్వర్తిస్తారు. ప్రజా పక్షపాతి జస్టిస్ గవాయ్ది అతి సాధారణ కుటుంబంలో జన్మించి అత్యున్నత స్థానానికి చేరిన అత్యంత స్ఫూర్తిదాయక నేపథ్యం. ఆయన 1960 నవంబర్ 24న మహారాష్ట్రలో అవరావతి జిల్లాలోని ఓ కుగ్రామంలో జని్మంచారు. ఆయన తండ్రి ఆర్ఎస్ గవాయ్ రాజకీయ నాయకుడు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (గవాయ్)ని స్థాపించారు. జస్టిస్ గవాయ్ న్యాయప్రస్థానం 1985లో న్యాయవాదిగా మొదలైంది. నాగపూర్, అమరావతి కార్పొరేషన్ల స్టాండింగ్ కౌన్సిల్గా వ్యవహరించారు. 1993లో బాంబే హైకోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్గా, ఏడాదికి అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా, 2000లో నాగపూర్ బెంచ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమితులయ్యారు. 2003లో బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తి, రెండేళ్లకు శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. చరిత్రాత్మక తీర్పులు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ 700కు పైగా ధర్మాసనాల్లో సభ్యునిగా, సారథిగా ఉన్నారు. 300కు పైగా తీర్పులు వెలువరించారు. రాజ్యాంగపరమైన అంశాలు, పౌర హక్కులకు సంబంధించిన పలు కీలక తీర్పులు వాటిలో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు బుల్డోజర్లతో ఇళ్లు కూల్చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనానికి జస్టిస్ గవాయ్ నాయకత్వం వహించారు. కూల్చివేతలను తీవ్రంగా తప్పుబట్టడమే గాక వాటికి అడ్డుకట్ట వేస్తూ కఠిన నిబంధనలు రూపొందించారు. జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే ఆరి్టకల్ 370ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం సబబేనని తీర్పు వెలువరించిన, పారీ్టలకు విరాళాలిచ్చే ఎన్నికల బాండ్లను రద్దు చేసిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనాల్లో ఆయన సభ్యులు. పెద్ద నోట్ల రద్దు సబబేనని 4:1 మెజారిటీతో తీర్పు వెలువరించిన, ఎస్సీల్లో ఉప వర్గీకరణ చేసే అధికారాన్ని రాజ్యాంగం రాష్ట్రాలకు కల్పించిందంటూ 6:1తో తీర్పిచ్చిన రాజ్యాంగ ధర్మాసనాల్లో కూడా జస్టిస్ గవాయ్ ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో క్రీమీలేయర్ నిబంధనను ప్రవేశపెట్టాలని ఈ కేసులో భాగంగానే తీర్పు వచ్చింది. మహిళల ఛాతీ పట్టుకోవడం, పైజామా లాగడం అత్యాచార యత్నం పరిధిలోకి రాబోవన్న అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యలను జస్టిస్ గవాయ్ ధర్మాసనం తీవ్రంగా తప్పుబట్టడమే గాక ఆ తీర్పుపై స్టే విధించింది. పలు రాజ్యాంగ, పర్యావరణ సంబంధ అంశాలపై కొలంబియా, హార్వర్డ్ తదితర ప్రపంచ ప్రఖ్యాత వర్సిటీల్లో జస్టిస్ గవాయ్ ప్రసంగాలిచ్చారు. దేశవ్యాప్త సంచలనానికి కారణమైన వక్ఫ్ చట్టం రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన కేసులను ఆయన ధర్మాసనమే విచారించాల్సి ఉంది. -
రాజ్యాంగమే అత్యున్నతం
న్యూఢిల్లీ: దేశంలో అన్నింటి కంటే అత్యున్నతం పార్లమెంట్ లేదా న్యాయ వ్యవస్థ కాదని.. రాజ్యాంగమే అత్యున్నతమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ తేల్చిచెప్పారు. పదవీ విరమణ పొందిన తర్వాత ఇతర పదవులు చేపట్టాలన్న ఉద్దేశం తనకు లేదని అన్నారు. జస్టిస్ గవాయ్ ఈ నెల 14న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. తొలి బౌద్ధ మతస్తుడైన సీజేఐగా ఆయన రికార్డుకెక్కబోతున్నారు. ఈ నేపథ్యంలో జస్టిస్ గవాయ్ ఆదివారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. పహల్గాం ఉగ్రవాద దాడి గురించి తెలిసి తాము దిగ్భ్రాంతికి గురయ్యారని చెప్పారు. ఈ దాడిలో మృతిచెందిన వారికి సుప్రీంకోర్టు తరఫున నివాళులర్పించామమని, ముష్కరుల దుశ్చర్యను ఖండించామని అన్నారు. దేశం మొత్తం ఆందోళన, సంక్షోభంలో ఉన్న సమయంలో తాము మౌనంగా ఉండలేమని పేర్కొ న్నారు. దేశంలో తాము కూడా భాగమేనని వ్యాఖ్యానించారు. ఎవరు అత్యున్నతం అనేదానిపై రాజకీయ నేతలు లేవనెత్తుతున్న ప్రశ్నలపై జసిŠట్స్ గవాయ్ స్పందించారు. రాజ్యాంగమే అత్యున్నతం అని కేశవానంద భారతి కేసులో 13 మంది సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పిందని గుర్తుచేశారు. తనకు ఎలాంటి రాజకీయ ఆకాంక్షలు లేవని, రిటైర్మెంట్ తర్వాత గవర్నర్ వంటి పదవులు తీసుకోనని స్పష్టంచేశారు. న్యాయమూర్తులు రాజకీయ నాయకులను, ఇతర రంగాల ప్రముఖులను కలిసి మాట్లాడ డంలో తప్పేమీ లేదని అభిప్రాయపడ్డారు. ఇతరులను కలవకపోతే ప్రజల సమస్యలు, కొత్త విషయాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. భారత్–పాకిస్తాన్ మధ్య దాడులు ఆగిపోవడం మంచి పరిణామం అని చెప్పారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఆ రెండు దేశాలకు నష్టమే తప్ప ప్రయోజనం చేకూరలేదని అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టులో 33 మంది న్యాయమూర్తులు ఉండగా, వీరిలో ఇప్పటిదాకా 21 మంది తమ ఆస్తుల వివరాలు ప్రకటించారని జస్టిస్ గవాయ్ తెలిపారు. మిగిలినవారు కూడా త్వరలో ఆస్తుల వివరాలు వెల్లడిస్తారని స్పష్టంచేశారు. ఆస్తుల సమాచారం బహిర్గతం చేసే సంప్రదాయాన్ని హైకోర్టు న్యాయమూర్తులు కూడా పాటిస్తే బాగుంటుందని సూచించారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తులను నియమించే విషయంలో కొలీజియం చేసిన కొన్ని సిఫార్సులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలకపోవడంపై మాట్లాడేందుకు జస్టిస్ గవాయ్ నిరాకరించారు. న్యాయ వ్యవస్థలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల ప్రాతినిధ్యం తగినంతగా ఎందుకు లేదని ప్రశ్నించగా... రాజ్యాంగబద్ధమైన పదవుల్లో నియామకాలకు రిజర్వేషన్లు లేవని బదులిచ్చారు. -
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయి
ఢిల్లీ: సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయి నియమితులయ్యారు. సీజేఐగా ఆయన నియామకానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. మే 14న జస్టిస్ గవాయి బాధ్యతలు స్వీకరించనున్నారు.కాగా, మహారాష్ట్రలోని అమరావతికి చెందిన జస్టిస్ గవాయ్ 1985లో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. ప్రముఖ న్యాయవాది, మహారాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి రాజా భోన్సాలేతో కలిసి పనిచేశారు. 1987 నుండి 1990 వరకు ముంబై హైకోర్టులో స్వతంత్ర న్యాయవాదిగా పని చేశారు. 1992లో నాగ్పూర్ బెంచ్లో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్గా, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమితులయ్యారు.2000లో ప్రభుత్వ న్యాయవాది, పబ్లిక్ ప్రాసిక్యూటర్గా వ్యవహరించారు. 2003లో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ నియమితులయ్యారు. 2005లో శాశ్వత న్యాయమూర్తిగా ప్రమోషన్ పొందారు. 2019లో సుప్రీంకోర్టుకు ప్రమోట్ అయ్యారు. జస్టిస్ గవాయ్ సుమారు ఆరు నెలలు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగనున్నారు. ఆయన నవంబరులో పదవీవిరమణ చేయనున్నారు. 2007లో భారత అత్యున్నత న్యాయస్థాన పదవిని చేపట్టిన జస్టిస్ కేజీ బాలకృష్ణన్ తర్వాత, ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే రెండో దళితుడు జస్టిస్ గవాయ్. -
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బీఆర్ గవాయ్.. కొలీజియం సిఫార్సు
ఢిల్లీ: సుప్రీంకోర్టు (Supreme Court) తదుపరి చీఫ్ జస్టిస్గా భూషణ్ రామకృష్ణ గవాయ్ (justice Bhushan Ramkrishna Gavai) బాధ్యతలు చేపట్టనున్నారు. మే13న కానున్న ప్రస్తుత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా రిటైర్ కానున్నారు. తదుపరి సీజేఐగా జస్జిస్ గవాయ్ పేరును కొలీజియం సిఫార్సు చేసింది. అనంతరం, కొలీజియం తన ప్రతిపాదనను కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేసింది. కొలీజియం సిఫార్సుకు అనుగుణంగా కేంద్రం జస్టిస్ గవాయిని తదుపరి సీజేఐగా ((Chief Justice of India) నియమించింది. దీంతో సీజేఐ సంజీవ్ ఖన్నా పదవీ విరమణ అనంతరం సుప్రీం తదుపరి సీజేఐ జస్జిస్ గవాయ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆరు నెలల పాటు సుప్రీం సీజేఐగా జస్జిస్ గవాయ్కేంద్రం నిర్ణయంతో జస్టిస్ గవాయ్ సుమారు ఆరు నెలలు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగనున్నారు. ఆయన నవంబరులో పదవీవిరమణ చేయనున్నారు. 2007లో భారత అత్యున్నత న్యాయస్థాన పదవిని చేపట్టిన జస్టిస్ కేజీ బాలకృష్ణన్ తర్వాత, ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే రెండో దళితుడు జస్టిస్ గవాయ్.జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రస్థానంమహారాష్ట్రలోని అమరావతికి చెందిన జస్టిస్ గవాయ్ 1985లో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. ప్రముఖ న్యాయవాది, మహారాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి రాజా భోన్సాలేతో కలిసి పనిచేశారు. 1987 నుండి 1990 వరకు ముంబై హైకోర్టులో స్వతంత్ర న్యాయవాదిగా పని చేశారు.1992లో నాగ్పూర్ బెంచ్లో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్గా, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమితులయ్యారు. 2000లో ప్రభుత్వ న్యాయవాది, పబ్లిక్ ప్రాసిక్యూటర్గా వ్యవహరించారు. 2003లో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ నియమితులయ్యారు. 2005లో శాశ్వత న్యాయమూర్తిగా ప్రమోషన్ పొందారు. 2019లో సుప్రీంకోర్టుకు ప్రమోట్ అయ్యారు. త్వరలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బీఆర్ గవాయ్ బాధ్యతలు స్వీకరించనున్నారు.