Kalapa
-
కలప దోషులపై చర్యలు తీసుకోవాలి
ఆదిలాబాద్: కోట్ల రూపాయల విలువ చేసే కలప పట్టుకున్నా దోషులను పట్టుకోవడంలో వెనుకంజ వేస్తున్నారని, వెంటనే నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గం డ్రత్ సుజాత డిమాండ్ చేశారు. మంగళవారం ఆ దిలాబాద్ పట్టణంలోని అటవీశాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ముందుగా ఆమె ఇంటి నుంచి ర్యాలీగా వచ్చిన కార్యకర్తలను లోపలికి వెళ్లుకుండా పోలీసులు అడ్డుకోవడంతో గేటు బయటే బైఠాయించారు. డీఎఫ్ఓ రావాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో కోట్లు విలువ చేసే కలపను పట్టుకున్న అధికారులు, దానికి సంబంధించిన సరైన వివరాలు వెల్లడించకుండా దాచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై సమాధానం చెప్పాల్సిన మంత్రి సమాధానం దాటవేస్తూ కాంగ్రెస్పై విమర్శలు చేయడం సరైంది కాదని అన్నారు. మంత్రులు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. కాగా, డీఎఫ్ఓ వచ్చే వరకు వెళ్లేది లేదని బైఠాయించడంతో గంట తర్వాత డీఎఫ్ఓ ప్రభాకర్ వచ్చి వినతిపత్రం తీసుకున్నారు. తమకు కలప వివరాలు తెలియజేయాలని, పట్టుకున్న విలువ, దానికి వెనుక ఉన్న దోషులను బయట పెట్టాలని డీఎఫ్ఓతో తెలిపారు. పూర్తి వివరాలు అందిస్తామని ఆయన హామీ ఇవ్వడంతో వారు వెనుదిరిగారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాందాస్ నాట్లే, సైదుల్లాఖాన్, వామన్వాంక్డే, రూప్రావు, గన్శ్యాం, సంజయ్గుండావార్, గిమ్మ సంతోష్, నగేష్, పొచ్చన్న, తదితరులు పాల్గొన్నారు. -
కలప అక్రమ రవాణాను అడ్డుకుంటాం..
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: మహారాష్ట్ర అటవీశాఖ అధికారుల సమన్వయంతో కలప అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తామని అటవీ శాఖ ఆదిలాబాద్ సర్కిల్ కన్జర్వేటర్ టి.పి.తిమ్మారెడ్డి అన్నారు. ఆదిలాబాద్, మహారాష్ట్ర నుంచి ప్రముఖ నగరాలకు నిత్యం సాగుతున్న కలప స్మగ్లింగ్ తీరుపై ‘సాక్షి’ దినపత్రిక ప్రధాన సంచికలో ఆదివారం ‘ఈ బల్లకట్టు.. మాఫియా కనికట్టు’ అనే శీర్షికతో సమగ్ర కథనం ప్రచురితమైంది. అటవీశాఖ వర్గాల్లో ఈ కథనం కలకలం సృష్టించింది. దీనికి స్పందించిన తిమ్మారెడ్డి త్వరలోనే మహారాష్ట్రలోని చంద్రపూర్, యావత్మాల్ అటవీ సర్కిళ్ల అటవీ శాఖ అధికారులతో బోర్డర్ ప్రొటెక్షన్ మీటింగ్ (సరిహద్దు అటవీ పరిరక్షణ సమావేశం) నిర్వహిస్తామని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రాణహిత నదీ పరివాహక ప్రాంతం నుంచి జరుగుతున్న కలప అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. గతంతో పోల్చితే ఈ మధ్య కాలంలో కలప అక్రమ రవాణా చాలా మట్టుకు తగ్గుముఖం పట్టిందని అన్నారు. బెల్లంపల్లిలో డీఎఫ్వోలతో సమావేశం..: జిల్లాలోని అటవీ శాఖ ఉన్నతాధికారులతో కన్జర్వేటర్ ఆదివారం బెల్లంపల్లిలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని టెరిటోరియల్ విభాగాల డీఎఫ్వోలు, కలప రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫ్లయింగ్ స్క్వాడ్ డీఎఫ్వోలు కూడా ఈ ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు. అటవీ శాఖ విభజన ప్రక్రియపై ప్రధానంగా చర్చించిన ఉన్నతాధికారులు ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై ప్రత్యేకంగా చర్చించారు. కలప అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.