పాపం.. పాలబుగ్గల పసివాళ్లు!
వాళ్లంతా పట్టుమని పదేళ్లు కూడా లేని పిల్లలు. మండుటెండలో, రోడ్డు కూడా దాటలేనంత ట్రాఫిక్ మధ్య .. ఒక చేతిలో బ్రోచర్, మరో చేతిలో డబ్బాతో ఒక్కొక్కరి దగ్గర డబ్బులు అడుగుతూ ప్రత్యక్షమయ్యారు. చిన్నారులను చూసి చలించిపోయిన కొందరు మానవతామూర్తులు, వాళ్లంతా ఎందుకిలా చేస్తున్నారో అని ఆరా తీయగా .. వాడిపోయిన మోములతో, రోజూ తమను డబ్బులు అడుక్కు రమ్మని ఆటోలో పంపిస్తున్నారని చెప్పారు. వాళ్లంతా ఒక అనాథాశ్రమంలో ఉండే చిన్నారులు.
పిల్లలను రోడ్డుపై వదిలేయడంపై ఒక వంటమనిషి సాయంతో ఆశ్రమ నిర్వాహకురాలు క్రిష్ణమ్మను నిలదీయగా, ఇష్టమున్న చోట ఫిర్యాదు చేసుకోండని ఆమె దురుసుగా సమాధానమిచ్చింది. దీంతో హైదరాబాద్ కర్మన్ఘాట్ గ్రీన్పార్క్ కాలనీలోని అనాథాశ్రమానికి చెందిన రవికుమార్, రాహుల్, నితిన్, సాయితో పాటు మరో అమ్మాయిని వారు సైదాబాద్ పోలీసులకు అప్పగించారు. ఆశ్రమంలోని మరో 30 మంది విద్యార్థులు కూడా మరికొన్ని ప్రాంతాల్లో ఇలా నిధులు సేకరిస్తున్నారని ఈ పిల్లలు చెప్పడంతో, వెంటనే ఆశ్రమంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.