కేరళ చర్చ్ అనూహ్య నిర్ణయం
పెద్దనోట్లను రద్దుచేస్తున్నట్టు ప్రధాని నరేంద్రమోదీ చేసిన ఆకస్మిక ప్రకటన దేశమంతటా ప్రకంపనలు సృష్టిస్తోంది. రూ. 500, రూ. వెయ్యినోట్లు ఉన్నవారు వాటిని మార్చుకోవడానికి బ్యాంకులు ముందు నానా కష్టాలు పడుతున్నారు. నాగుపాములా వంకలు తిరిగిన క్యూలలో నిలుచొని ఆపసోపాలు పడుతున్న సంగతి తెలిసిందే.
కేంద్రం అనూహ్య నిర్ణయంతో చెల్లుబాటు అయ్యే డబ్బులేక పేదలు పడే అవస్థలను కేరళలోని ఓ చర్చ్ గుర్తించింది. పేదలకు తనవంతు సాయం చేయాలనుకుంది. అంతే అనుకున్నదే తడవుగా గత ఆదివారం చర్చ్లోని విరాళాల బాక్స్ను తెరిచి పేదలకు డబ్బులు పంచింది. ఎర్నాకుళం జిల్లాలోని సెయింట్ మార్టిన్డీ పొరెస్ చర్చ్ తీసుకున్న ఈ ఉదార నిర్ణయం ప్రజల ప్రశంసలు అందుకుంటోంది.
పెద్దనోట్లు రద్దై.. ఏటీఎంలు కూడా పనిచేయని విపత్కర పరిస్థితుల్లో గత ఆదివారం చర్చ్ తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయం స్థానికంగా ప్రజలకు ఊరట కలిగించింది. ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి మర్నాడు సోమవారం (ఈ నెల 13) సాయంత్రం వరకు తమ చర్చ్లోని విరాళాల బాక్స్ను తెరిచి ఉంచామని, దీంతో ప్రజలు స్వచ్ఛందంగా ఈ బాక్స్ నుంచి డబ్బులు తీసుకున్నారని, ప్రస్తుత నగదు సంక్షోభం ముగిసిన తర్వాత వారు స్వచ్ఛందంగా మళ్లీ విరాళాలు సమర్పించవచ్చునని చర్చ్ మతగురువు జిమ్మి పూచక్కడ్ మీడియాతో తెలిపారు.
చర్చ్ నిర్ణయం వల్ల దాదాపు 200 కుటుంబాలు లబ్ధి పొందాయని తెలుస్తోంది. అయితే, విరాళాల బాక్స్లో ఉన్న రూ. వెయ్యి, రూ. 500 నోట్లను ఎవరూ ముట్టుకోలేదని, తక్కువ విలువ కలిగిన నోట్లనే ప్రజలు తీసుకున్నారని, నగదు తీసుకోవడంపై ఎలాంటి పరిమితి విధించకపోయినా ప్రజలు తమకు అవసరమైన మేర డబ్బును మాత్రమే చాలా క్రమశిక్షణగా తీసుకున్నారని జిమ్మి పూచక్కడ్ వివరించారు.