ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
కొత్తపెంట,ఎం.ఫణుకువలస(బొబ్బిలి రూరల్) : రైతులు, ప్రజల సమస్యల పరిష్కారానికి శక్తి వంచనలేకుండా పని చేస్తున్నామని బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్వీ సుజయ్కృష్ణరంగారావు తెలిపారు. ఆదివారం మండలంలోని కొత్తపెంట, ఎం.పణుకువలస గ్రామాల్లో ఆయన పర్యటించారు. సమస్యలపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చించారు. కొత్తపెంట గ్రామం వద్ద వేగావతి నదికి ఇరువైపులా ఉన్న రహదారిని పరిశీలించారు. ప్రజలు, విద్యార్థులు ఈ రోడ్డుపై ప్రయాణించడానికి ఇబ్బంది పడుతున్నారని స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేకు వివరించారు. అనంతరం కొత్తపెంట పారాధి ఛానల్ను ఆయన పరిశీలించారు. స్వయంగా సమస్యలను తెలుసుకుని, అధికారులకు లేఖలు రాసి వాటి పరిష్కారానికి కృషిచేద్దామని భావిస్తున్నామన్నారు.
10 గ్రామాల ప్రజలు గొల్లాది-కొత్తపెంటల మధ్య రాకపోకలు సాగిస్తున్నారని, వర్షం పడితే రాకపోకలు బంద్ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పారాది ఆనకట్ట, ఛానల్లో గ్రామపరిధిలో బాగుచేసినా పూర్తిస్థాయిలో నిధులు రాకపోవడంతో పనులు పూర్తి కాలేదని తెలిపారు. తుపానులు వస్తే తప్ప తమకు నిధులు రావడంలేదని రైతులు ఆవేదన చెందుతున్నట్లు చెప్పారు. అనంతరం ఎం.పణుకువలస గ్రామంలో బడివానిచెరువును పరిశీలించారు. గ్రామానికి ఎగువన, గ్రోత్సెంటర్ వెనుక ఉన్న బడివానిచెరువునీరు క్వారీ ద్వారా పంటపొలాలకు అందించే అవకాశాన్ని పరిశీలించారు. స్థానిక ప్రజాప్రతినిధులు బేతనపల్లి శ్రీరాములు, సింగనాపల్లి ఈశ్వరరావు తదితరులు చెరువునీటిని ఎలా క్వారీ నుంచి తరలించవచ్చో వివరించారు.