‘వావ్’ అంజలి...
బాపట్ల: బాపట్ల పట్టణంలో కూచిపూడి వంటల ఘుమఘుమలతో ఏర్పాటు చేసిన కోన అండ్ కూచిపూడి రెస్టారెంట్ శుక్రవారం ప్రారంభమైంది. సినీనటి అంజలి, ఎమ్మెల్యే కోన రఘుపతి, మాటల రచయిత కోన వెంకట్, కూచిపూడి వెంకట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. రెస్టారెంట్ బ్రోచర్ను విడుదల చేశారు. అంజలి వంటకాలను రుచిచూశారు. అభిమానులతో కొద్దిసేపు సందడి చేశారు. అంజలి మాట్లాడుతూ తెలుగంటే ఇష్టమని, తెలుగు వంటలంటే ప్రాణం.. అని చెప్పారు.
చక్కటి చిత్రాలను అభిమానులకు అందించటమే తన డ్రీమ్గా పేర్కొన్నారు. గీతాంజలి వంటి సినిమాలు చేసేందుకు అవకాశం కల్పించిన కోన వెంకట్ వంటి వారిని ఎప్పటికి మరిచిపోనన్నారు. కోన వెంకట్ మాట్లాడుతూ ఆంధ్రా పుడ్ ఫ్రైండ్స్ పేరుతో పది నగరాల్లో కోన అండ్ కూచిపూడి వంటకాలు రుచి చూపేందుకు రెస్టారెంట్లును ప్రారంభిస్తామని చెప్పారు. ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ సినీ రంగంలో అగ్రభాగంలో ఉన్న కోన వెంకట్ వంటి వారు స్వగ్రామానికి ఎదో చేయాలనే సంకల్పంతో రెస్టారెంట్ను ప్రారంభించటం అభినందనీయమన్నారు.
ఇదే రెస్టారెంట్ మెగా సీటీల్లో ఏర్పాటు చేస్తే ఎన్నో లాభాలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ స్వస్థలాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. పర్యాటక రంగం అభివృద్ధికి తమ వంతు కృషిగా ఈ రెస్టారెంట్ నెలకొల్పినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చీరాల గోవర్ధన్రెడ్డి, కోన రమాదేవి, కోన నీరజ, కోన నిఖిల్, మున్సిపల్ మాజీ చైర్మన్ నరాలశెట్టి ప్రకాశరరావు, పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.