ధరణి నగర్ను ముంచెత్తిన కాలుష్యపు నురగ
హైదరాబాద్: నగరంలో నిన్న కురిసిన భారీ వర్షానికి నగరవాసుల జీవనం అతలాకుతలమైంది. కూకట్పల్లి అల్విన్ కాలనీ, ధరణి నగర్ను కాలుష్యపు నురగ ముంచెత్తింది. ధరణి నగర్లోని పరికి చెరువు నుంచి రసాయన నురుగు వచ్చి ఇళ్లోలోకి చేరింది. ఈ నురగతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
దీంతో స్థానికులు ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. తెల్లగా, మంచు గుట్టలా పేరుకుపోయిన నురుగును తొలగించుకోవడానికి స్థానికులు నానా అవస్థలు పడుతున్నారు. మంచు కొండలను తలపిస్తున్న నురగను చూసి స్థానికులు భయపడుతున్నారు. గత మూడు సంవత్సారాల నుంచి ఈ పరిస్థితి నెలకొందని, అయితే అధికారులు మాత్రం ప్రతిసారి తాత్కలిక పరిష్కారం చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు.
ఎన్నికలప్పుడు మాత్రం ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ కాలనీలకు వచ్చి వెళుతున్నారని, అయితే ఈ సమస్యను మాత్రం ఎవరూ పట్టించుకోవట్లేదని తెలిపారు. దీనికోసం ప్రభుత్వం రూ. 570 లక్షలు కేటాయించిన ఇంతవరకూ పరిష్కారం చూపలేదని వారు పేర్కొన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల విషపు నురగతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు.