అగ్రి గోల్డ్ విలీనం కుదరదు
ఖాతాదారుల నుంచి డబ్బు వసూలు చేసి తిరిగి చెల్లించడంలో విఫలమైన అగ్రి గోల్డ్ గ్రూప్ న్యాన్ బ్యాంకింగ్ వ్యవస్థ కావడంతో.. ఈ సంస్థను పునర్వ్యవస్థీకరించలేమని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రా రావు రాసిన లేఖకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మెగ్వాల్ బుధవారం సమాధానం ఇచ్చారు. అగ్రి గోల్డ్ సంస్థ దివాళా తీయడాన్ని సెబీ, రిజ్వర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీవ్రంగా పరిగణిస్తున్నాయని పేర్కొన్నారు.
బ్యాంకుల క్రమబద్ధీకరణ చట్టం-1949లోని సెక్షన్ 45 ద్వారా బ్యాంకింగ్ సంస్థలను మాత్రమే విలీనం చేయగలమని తెలిపారు. దీని ప్రకారం అగ్రిగోల్డ్ గ్రూప్ పునర్వ్యవస్థీకరణ కుదరదని పేర్కొంది. ఈ సంస్థ కార్యకలాపాలను ఇది వరకే నిలిపేశారని, అగ్రి గోల్డ్ గ్రూప్ డిపాజిట్ల సేకరణ చట్టవ్యతిరేమని సెబీ ఇది వరకే తేల్చిందని పేర్కొన్నారు. ఈ వివాదంలో ఖాతాదారులకు తిరిగి డబ్బు చెల్లించే విషయానికి సంభందించి సదరు సంస్థ ఆస్తుల విక్రయంపై హైదరాబాద్ హైకోర్టులో తెలంగాణ అగ్రిగోల్డ్ ఖాతాదారులు, ఎజెంట్ల సంక్షేమ సంఘం ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసిందని పేర్కొంది. ప్రస్తుతం కేసును కోర్టు పరిశీలిస్తోందని పేర్కొన్నారు.