శామ్సంగ్ గెలాక్సీ చౌక ఫోన్లు
న్యూఢిల్లీ: గెలాక్సీ సిరీస్లో రెండు కొత్త స్మార్ట్ఫోన్లు గెలాక్సీ స్టార్ ప్రో, గెలాక్సీ ట్రెండ్లను శామ్సంగ్ కంపెనీ గురువారం మార్కెట్లోకి తెచ్చింది. వీటి ధరలను రూ.6,750, రూ.8,290గా నిర్ణయించామని శామ్సంగ్ మొబైల్స్ అండ్ ఐటీ కంట్రీ హెడ్ వినీత్ తనేజా చెప్పారు. తెలుగు, తమిళం, హిందీ, బెంగాలీ, పంజాబీ, మరాఠీ, గుజరాతీ, కన్నడ, మలయాళం.. ఈ 9 భాషలు ప్రి లోడెడ్గా ఈ ఫోన్లను అందిస్తున్నామని వివరించారు. వినియోగదారులు ఈ భాషల్లో ఎస్ఎంఎస్లు పంపుకోవచ్చని, ఇంటర్నెట్ బ్రౌజ్ చేయవచ్చని, ఫోన్ ఇంటర్ఫేస్ను కూడా నచ్చిన భాషలో వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు.
వివిధ యాప్లను ఈ భాషల్లో యాక్సెస్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రాంతీయ భాషల్లో స్మార్ట్ఫోన్ సౌకర్యాలను పొందవచ్చని వివరించారు. ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఓఎస్పై పనిచేసే ఈ రెండు ఫోన్లలో డ్యుయల్ సిమ్, 1 గిగా హెర్ట్స్ సింగిల్ కోర్ ప్రాసెసర్, 512 ఎంబీ ర్యామ్, 4 జీబీ ఇంటర్నల్ మెమరీ, 32 జీబీ ఎక్స్పాండబుల్ మెమరీ, 4 అంగుళాల డిస్ప్లే వంటి ప్రత్యేకతలున్నాయి. గెలాక్సీ స్టార్ ప్రోలో 2 మెగా పిక్సెల్ కెమెరా, గెలాక్సీ ట్రెండ్లో 3 మెగా పిక్సెల్ కెమెరా ఫీచర్లున్నాయి. గెలాక్సీ సిరీస్లో రూ.10,000 లోపు ధరలో శామ్సంగ్ 4 స్మార్ట్ఫోన్లను అందిస్తోంది.