తేలుకాటుకు గురైన మహిళ మృతి
యాడికి (తాడిపత్రి) : తేటుకాటుకు గురై కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యాడికి మండలం పిన్నేపల్లికి చెందిన లక్ష్మి (28) మృతి చెందింది. స్థానికులు తెలిపిన మేరకు... లక్ష్మి ఆదివారం సాయంత్రం పశువులకు మేత వేయడం కోసం కందిపొట్టు విదిలిస్తుండగా అందులో ఉన్న తేలు కుట్టింది. దీంతో ఆమెను 108 వాహనంలో అనంతపురం ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందింది. ఈమెకు రేచీకటితో బాధపడుతున్న భర్త చితంబరరెడ్డి, ఆరో తరగతి చదువుతున్న కూతురు, నాలుగో తరగతి చదువుతున్న కుమారుడు ఉన్నారు.
నేత్రదానం
భర్త చితంబరరెడ్డి, ఆమె తరపు బంధువులు లక్ష్మి కళ్లను కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు దానం చేయడానికి సమ్మతించారు. దీంతో వారు నేత్రాలను సేకరించారు. వీటిని హైదరాబాద్కు పంపించి కళ్లు అవసరం అయిన వారికి అమర్చేలా చర్యలు తీసుకుంటామని వైద్యులు తెలిపారు.