లారీ కంటేనర్లో 39 మృతదేహాలు!
లండన్ : ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఓ టీనేజర్ సహా 39 మంది మృతదేహాలు ఓ లారీ కంటేనర్లో దొరికాయి. ఆ లారీ కంటేనర్ను నడుపుతున్న 25 ఏళ్ల యువకుడిని ఎస్సెక్స్ కౌంటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు తెల్లవారు జామున ఈ సంఘటన చోటు చేసుకుంది. బల్గేరియా నుంచి బ్రిటన్కు బయల్దేరిన లారీ కంటేనర్ హోలీ హెడ్ వద్ద బ్రిటన్లోకి ప్రవేశించి లండన్లోని ఎస్సెక్స్ పారిశ్రామిక వాడ వద్దకు వచ్చినప్పుడు ఎస్సెక్స్ కౌంటీ పోలీసులు తనిఖీ చేయగా మృతదేహాలు బయటపడ్డాయి. అరెస్టయిన లారీ డ్రైవర్ ఉత్తర ఐర్లాండ్కు చెందిన వ్యక్తి అని తేలింది.
‘ఇంత మంది ప్రజల ప్రాణాలు పోవడం అత్యంత విషాదకరం. దీనికి బాధ్యులెవరో, అలా ఎందుకు చేశారో తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించాం. వాస్తవాలు తెలియడానికి సమయం పట్టవచ్చు. బల్గేరియా నుంచి బయల్దేరిన ఈ కంటేనర్ శనివారం 19వ తేదీన హోలిహెడ్ వద్ద బ్రిటన్ భూభాగంలోకి ప్రవేశించింది. సరిహద్దుల్లో లారీ కంటేనర్ను కచ్చితంగా తనిఖీ చేస్తారు కనుక, అక్కడే మృత దేహాలు బయటపడాలి. అలా జరగలేదంటే దేశంలోకి ప్రవేశించాకే వారు మరణించి ఉండాలి. కంటేనర్లో మనుషులను అనుమతించరు మరి ఇది ఎలా జరిగిందీ? ముందుగా మృత దేహాలు ఏ దేశస్తులవో కనుగొని సరిహద్దు భద్రతా సిబ్బందిని సంప్రతించి వాస్తవాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాం. అంతవరకు ఇంతకుమించి ఏమీ చెప్పలేం’ అని ఎస్సెక్స్ పోలీసు చీఫ్ సూపరింటెండెంట్ ఆండూ మారినర్ స్థానిక మీడియాకు తెలిపారు.