Mahabubnagar District Latest News
-
చివరి దశకు సహాయక చర్యలు
అచ్చంపేట: దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగం పైకప్పు కూలిన ప్రదేశంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 62వ రోజు గురువారం డీ2 ప్రదేశం చివరన సహాయక సిబ్బంది శిథిలాలు తొలగించి కన్వేయర్ బెల్టు ద్వారా బయటకు తరలించారు. నిషేధిత ప్రదేశం అతి సమీపంలో దక్షిణ మధ్య రైల్వే సిబ్బంది థర్మల్ గ్యాస్కట్టర్ సాయంతో టీబీఎం ప్లాట్ఫామ్ను కత్తిరించి స్టీల్ను లోకో ట్రైన్ ద్వారా సొరంగం బయటకు తీసుకొచ్చారు. మిగిలిన మరో మూడు మీటర్ల శిథిలాల తొలగింపు పనులు శుక్ర, శనివారం ముగుస్తాయని సహాయక సిబ్బంది చెబుతున్నారు. డీ2 ప్రదేశం వరకు శిథిలాలు పూర్తిగా తొలగించినా కార్మికుల జాడ కనిపించలేదు. నిషేధిత 43 మీటర్ల ప్రదేశంలో 30 అడుగుల మేర నిండుకున్న శిథిలాల కింద కార్మికులు ఉండవచ్చని అనుమానిస్తున్నారు. డీ1 ప్రదేశంలో బలహీనంగా ఉన్న కాంక్రీట్ సెగ్మెంట్లకు సపోర్టుగా సింగరేణి మైన్స్ రెస్క్యూ బృందం టైగర్ కాక్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ తవ్వకాలు చేపడితే ప్రమాదం జరిగే ప్రమాదం ఉండటంతో నిషేధిత ప్రదేశంగా గుర్తించి కంచె ఏర్పాటు చేశారు. ఆ ప్రదేశంలో శిథిలాలను పూర్తిగా తొలగిస్తే కార్మికుల ఆచూకీ లభించే అవకాశం ఉందని చెబుతున్నారు. 150 హెచ్పీ సామర్థ్యం గల 5 భారీ మోటార్లతో నీటి ఊటను కృష్ణానదిలోకి పంపింగ్ చేస్తున్నారు. డీ1పైనే అందరి దృష్టి.. ఇప్పుడు అందరి దృష్టి నిషేధిత ప్రదేశం డీ1పైనే ఉంది. ఈ ప్రదేశంలో సహాయక చర్యలు కొనసాగిస్తారా! లేక నిలిపివేస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిషేధిత ప్రదేశం నుంచి సొరంగం తవ్వకాలు చేపట్టడం అంత శ్రేయస్కరం కాదని ఇప్పటికే జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిపుణులు హెచ్చరించిన నేపథ్యంలో సొరంగ మార్గం మళ్లించే అవకాశాలు ఉన్నట్లు సహాయక సిబ్బంది చెబుతున్నారు. అందుకే కంచె ఏర్పాటు చేసిన ప్రదేశం వరకు పూర్తిగా శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. తవ్వకాలు కొనసాగిస్తారా లేదా అనే దానిపై రేపటిలోగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నేటితో పూర్తికానున్న శిథిలాల తొలగింపు 62 రోజలైనా దొరకని ఆరుగురి ఆచూకీ -
నీటి గుంతలో పడి మహిళ మృతి
బిజినేపల్లి: మండల కేంద్రానికి చెందిన జుంపాల లక్ష్మమ్మ (55) పాటు కాల్వ నీటి గుంతలో పడి మృతిచెందినట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. ఆయన కథనం మేరకు.. లక్ష్మమ్మ తోటి కూలీలతో కలిసి బుధవారం ఉపాధి పనులకు బయలుదేరింది. మార్గమధ్యంలో ప్రమాదవశాత్తు పాటు కాల్వ గుంతలో పడిపోయింది. సాయంత్రం ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పలుచోట్ల వెదికారు. గురువారం కాల్వలో మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. లక్ష్మమ్మకు భర్త వెంకటయ్య, ముగ్గురు సంతానం ఉన్నారు. పూడూరులో వృద్ధురాలు.. గద్వాల క్రైం: ప్రమాదవశాత్తు కాల్వలో పడి ఓ వృద్ధురాలు మృతి చెందినట్లు పట్టణ ఎస్ఐ కళ్యాణ్కుమార్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. మండలంలోని పూడూరుకు చెందిన బోయ రత్నమ్మ (75) బుధవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లింది. రాత్రి వరకు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఎక్కడ వాకాబు చేసినా ఫలితం లేకపోయింది. గురువారం ఉదయం కృష్ణ అగ్రహారం సమీపంలోని కాల్వలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుమారుడు రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వివరించారు. వ్యక్తి బలవన్మరణం ఉండవెల్లి: మండలంలోని బొంకూరుకు చెందిన కుర్వ మధు (34) పురుగు మందు తాగి కర్నూలు జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ మహేశ్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. గ్రామానికి చెందిన మధు బుధవారం రాత్రి పొలం వద్ద పురుగుమందు తాగి రాముడుకు ఫోన్ చేశాడు. తాతాల ఆస్తి దక్కడం లేదని.. అందుకు పొలం వద్ద పురుగు మందు తాగానని చెప్పాడు. దీంతో రాముడు ఘటన స్థలానికి చేరుకొని చూడగా అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. కుళ్లిన మృతదేహం లభ్యం అడ్డాకుల: మండల కేంద్రంలోని ఓ ఇంటిపై ఓ యువకుడి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో లభ్యమైనట్లు గ్రామస్తులు తెలిపారు. వారి కథనం మేరకు.. గ్రామానికి చెందిన షేక్బాలీ కుమారుడు ముస్తాక్ (37) మానసిక స్థితి బాగోలేక మద్యానికి బానిసై రోజుల తరబడి ఇంటికి దూరంగా ఉండేవాడు. కొన్నాళ్లుగా ఇంటికి కొంతదూరంలో నిర్మాణంలో ఉన్న ఇంటిపై రాత్రిళ్లు పడుకుంటుండేవాడు. గురువారం సాయంత్రం ఓ కుక్క మనిషి చేతిని నోట కురుచుకొని గ్రామంలోని ప్రధాన రహదారిపైకి వచ్చింది. గుర్తించిన స్థానికులు చుట్టుపక్కల వెదకగా.. ఇంటిపై కుళ్లిన స్థితిలో మృతదేహం కనిపించగా ముస్తాక్గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కుటుంబ సభ్యులతో వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని అక్కడి నుంచి తీసేసే ప్రక్రియ చేపట్టారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది. వ్యక్తి హఠాన్మరణం.. కేసు నమోదు రాజాపూర్ (బాలానగర్): పొట్టకూటి కోసం వచ్చి కూలీ పనులు చేసే ఓ వ్యక్తి హఠాత్తుగా మృతిచెందిన ఘటన గురువారం బాలానగర్ మండలం నేలబండతండాలో చోటు చేసుకుంది. ఎస్ఐ లెనిన్గౌడ్ కథనం మేరకు.. ఒడిస్సా రాష్ట్రం అతిబంధ చర్యాలనుపాడకు చెందిన త్రినాథబోయి (55) 5 నెలల కిందట నేలబండతండాలో రామావత్ రాజు దగ్గర ఇటుకబట్టిలో పనిచేసేందుకు వచ్చాడు. బుధవారం త్రినాథబోయికి ఛాతిలో నొప్పి వస్తుండటంతో ఆటోలో బాలానగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. గురువారం బంధువుల ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించి కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ వివరించారు. చికిత్స పొందుతూ యువకుడు మృతి హన్వాడ: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ యువకుడు హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందినట్లు ఎస్ఐ వెంకటేశ్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. మహమ్మదాబాద్ మండలం షేక్పల్లికి చెందిన సందీప్ (20) బైక్పై కోయిల్కొండలోని బంధువుల ఇంటికి బయలుదేరాడు. మండలంలోని హనుమాన్ టెంపుల్తండా సమీపంలోకి చేరుకోగానే ఎదురుగా వచ్చిన ఓ కారు బైక్ను బలంగా ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని వెంటనే 108 వాహనంలో జిల్లాకేంద్రంలోని ఆస్పత్రికి అటు నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. తల్లి సుభద్రమ్మ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు ఎస్ఐ వివరించారు. -
వరప్రదాయిని కోయిల్సాగర్
దేవరకద్ర: కోయిల్సాగర్ జలాశయాన్ని తాగునీటి అవసరాలకు వినియోగించుకోవడానికి మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ అధికారులు సిద్ధమయ్యారు. వానాకాలం, యాసంగి పంటలకు సాగునీటిని అందించిన ప్రాజెక్టు ఇప్పుడు 340 గ్రామాల ప్రజలకు నాలుగు నెలల పాటు తాగునీటిని అందించనుంది. ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉన్న మూడు పంప్హౌజ్ల నుంచి రోజు తాగునీటిని సరఫరా చేయనున్నారు. దేవరకద్ర వైపు ఉన్న పంప్హౌజ్ నుంచి మహబూబ్నగర్, దేవరకద్ర, మరికల్, ధన్వాడ, నారాయణపేట, మక్తల్ మండలాలకు.. కోయిల్కొండ వైపు ఉన్న రెండు పంప్హౌజ్ల నుంచి కొడంగల్, కోస్గి, కోయిలకొండ తదితర ప్రాంతాలకు తాగునీటిని అందించనున్నారు. ఏడాది మొత్తం శ్రీశైలం నుంచి వచ్చే కృష్ణా జలాలను మిషన్ భగీరథ పథకం ద్వారా సరఫరా చేస్తుండగా.. వేసవిలో నీటి ఎద్దడి తలెత్తినప్పుడు కోయిల్సాగర్ను ఉపయోగించుకుంటారు. వానాకాలం సీజన్లో.. 2.27 టీఎంసీల సామర్థ్యం ఉన్న కోయిల్సాగర్ జలాశయం నుంచి వానాకాలం సీజన్లో సుమారు 35 వేల ఎకరాల పైచిలుకు విస్తీర్ణానికి సాగునీటిని అందించారు. వానాకాలంలో ప్రాజెక్టులోకి వస్తున్న నీటికి సమానంగా కాల్వలకు మూడునెలల పాటు నిరంతరంగా నీటిని వదలడంతో ఇది సాధ్యమైంది. అలాగే గొలుసు కట్టు చెరువులను కూడా నింపడానికి ప్రాజెక్టు ఉపయోగపడింది. ఇక జూరాల నుంచి ఎత్తిపోతల ద్వారా వచ్చే నీటిని లింక్ కెనాల్స్ ద్వారా పంటలకు వదలడంతో సాగు విస్తీర్ణం పెరగడానికి ఉపయోగపడింది. ఇక యాసంగిలో ప్రాజెక్టులోని నిల్వ నీటిని విడతల వారీగా పంటలకు వదలడంతో నీటిమట్టం 13.3 అడుగులకు పడిపోయింది. యాసంగి సీజన్లో పాత ఆయకట్టు కింద ఉన్న 12 వేల ఎకరాలకు సాగునీరు అందించారు. తాగునీటికి 0.28 టీఎంసీలు.. ప్రాజెక్టులోని సగం నీరు నాలుగు నెలల పాటు 340 గ్రామాలకు సరఫరా చేసేలా ప్రణాళిక సిద్ధం చేశాం. ప్రస్తుతం ప్రాజెక్టులో 13.3 అడుగులు అంటే 0.55 టీఎంసీలు ఉంది. ఇందులో 0.27 టీఎంసీల నీటిని చేపల కోసం ప్రాజెక్టులో నిల్వ చేసి మిగతా 0.28 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాలకు వినియోగిస్తాం. రోజు పంపుల ద్వారా ఏ మేరకు నీటిని సరఫరా చేస్తున్నామని లెక్కించి నాలుగు నెలల పాటు తాగునీటిని అందించేందుకు నిర్ణయించాం. – ప్రతాప్సింగ్, ఈఈ, కోయిల్సాగర్ జలాశయం వేసవిలో ప్రాజెక్టు నుంచి తాగునీటి సరఫరా ప్రస్తుతం 13.3 అడుగుల నీటిమట్టం 340 గ్రామాలకు.. నాలుగు నెలల పాటు -
ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీ
పాలమూరు: మహబూబ్నగర్లో రోడ్డు వెంట కొనసాగుతున్న టిఫిన్ సెంటర్లలో గురువారం ఫుడ్ ఇన్స్పెక్టర్ మనోజ్కుమార్ విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. పద్మావతికాలనీ, జనరల్ ఆస్పత్రి ఎదుట, న్యూటౌన్ ప్రాంతాల్లో కొనసాగుతున్న టిఫిన్ సెంటర్స్లో ఉపయోగిస్తున్న వంట నూనె, ఇతర సామగ్రిని పరిశీలించారు. నూనె సక్రమంగా లేదని.. ఎక్కువసార్లు వినియోగించినట్లు గుర్తించి పారబోశారు. వంట పాత్రలు శుభ్రంగా లేకపోవడంతో పాటు అనుమతి లేకుండా కొనసాగుతున్న రెండింటికి నోటీసులు జారీ చేశారు. మరో దగ్గర నిల్వ చేసిన పిండిని పారబోసి నమూనాలు సేకరించారు. టిఫిన్ సెంటర్లలో నమూనాలు సేకరించి, నోటీసులు జారీ -
ఆలయ అర్చకుడిపై వేటు
అలంపూర్: అలంపూర్ క్షేత్ర ఆలయ అర్చకుడిపై ఆ శాఖ అధికారులు వేటు వేశారు. దేవదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఆలయ ఉప ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మపై సస్పెన్షన్ వేటు వేసినట్లు ఆలయ ఈఓ పురేందర్ కుమార్ గురువారం తెలిపారు. శ్రీజోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయంలో ఉప ప్రధాన అర్చకుడిగా విధులు నిర్వహిస్తున్న ఆనంద్ ర్మపై కొద్ది రోజులుగా పలు ఆరోపణలు వచ్చినట్లు తెలిపారు. ఆ ఆరోపణలపై దేవదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారులు విచారణ చేసినట్లు పేర్కొన్నారు. విచారణ అనంతరం ఆనంద్ శర్మపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇంకా విచారణ కొనసాగుతోందని, ఆరోపణల అంశాలను నిర్ణీత సమయంలో వెల్లడిస్తామని తెలిపారు. క్లినిక్ సీజ్ పాలమూరు: మహబూబ్నగర్ రాంమందిర్ చౌరస్తాలో శ్రీరామ్ అనే వ్యక్తి 16 ఏళ్లుగా శ్రీరామ్ క్లినిక్ పేరుతో అక్రమంగా ఆస్పత్రి నడుపుతున్నారు. నిబంధనలు అతిక్రమించి రోగులకు ఇంజక్షన్లు ఇవ్వడం, సెలెన్స్ పెట్టడం, యాంటీబాయిటిక్స్ ఇవ్వడం చేస్తున్నారు. దీంతో గురువారం జిల్లా మాస్మీడియా అధికారి మంజుల ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి సీజ్ చేయడంతో పాటు పోలీసు కేసు కూడా నమోదు చేశారు. -
హనుమకొండ ఆర్ట్స్ కాలేజీలో పాలమూరు సాహితీవేత్తలు
కేయూ క్యాంపస్: మహబూబ్నగర్పాలమూరు జిల్లాకు చెందిన 22 మంది తెలుగు సాహితీవేత్తలు గురువారం హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీని సందర్శించారు. వరంగల్లోని ప్రముఖ సాహిత్యకారుల జన్మస్థలాలు, నివాసస్థలాల సందర్శనలో భాగంగా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మొదటి ప్రిన్సిపాల్, ప్రముఖ సాహితీవేత్త ఆచార్య రాయపోలు సుబ్బారావు పనిచేసిన చోటును సందర్శించినట్లు వారు తెలిపారు. సాహిత్యకారుల వెంట కళాశాల మాజీ ప్రిన్సిపాల్, రిటైర్డ్ ఆచార్యులు బన్న అయిలయ్య, సాహితీవేత్తలు రామశాస్త్రి, వీఆర్ విద్యార్థి, ఉన్నారు. ఆర్ట్స్ కాలేజీ గొప్పతనాన్ని బన్న అయిలయ్య వారికి వివరించారు. ఉత్తర తెలంగాణలోనే మొట్టమొదటి విద్యాకేంద్రమైన ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల 100 సంవత్సరాల చరిత్ర కలిగి ఉందన్నారు. అంతకుముందు పాలమూరు సాహితీవేత్తలకు కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్ స్వాగతం పలికారు. కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ గిరిప్రసాద్, డాక్టర్ ఆదిరెడ్డి, డాక్టర్ హరికుమార్ తదితరులు ఉన్నారు. -
పనులు త్వరగా పూర్తి చేయాలి
ఉండవెల్లి: జోగుళాంబ రైల్వే హాల్ట్ నిర్మాణ పనులను గురువారం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ పరిశీలించారు. పనుల్లో నాణ్యత లోపించకుండా జాగ్రత్తలు పాటించాలని కాంట్రాక్టర్, అధికారులకు సూచించారు. హై లేవల్ ప్లాట్ఫాం, విశ్రాంతి గదుల నిర్మాణాలు, ఆలయ ఆకృతిలో ఉన్న పలురకాల డిజైన్ల గురించి అధికారులతో చర్చించి నమూనాలను పరిశీలించారు. టికెట్ బుకింగ్ కౌంటర్ గదులు, మాస్టర్ ప్లాన్ నమూనా, పార్కింగ్ స్థలాలను చూశారు. జోగుళాంబ హాల్ట్ నిర్మాణానికి రూ.6 కోట్లు మంజూరుకావడంతో పనులు చివరి దశకు చేరినట్లు కాంట్రాక్టర్ బీవీఎన్ రెడ్డి తెలిపారు. జూన్ చివరిలోపు పనులు పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయనున్నట్లు వివరించారు. ఆయన వెంట రైల్వే అధికారులు ఉన్నారు. గద్వాల రైల్వేస్టేషన్లో.. గద్వాల: జిల్లాకేంద్రంలోని రైల్వేస్టేషన్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు నాణ్యతగా చేపట్టాలని సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన అమృత్ భారత్ పథకంలో భాగంగా స్టేషన్లో కొనసాగుతున్న పనులను పరిశీలించారు. జోగుళాంబ హాల్ట్ను పరిశీలించిన జీఎం అరుణ్కుమార్ జైన్ -
108, 102 వాహనాల తనిఖీ
పాలమూరు/జడ్చర్ల: మహబూబ్నగర్, జడ్చర్లలోని 108, 102 వాహనాలను గురువారం ఆ శాఖ రాష్ట్ర అధికారి గిరీష్బాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహనాల్లోని రికార్డులు, పరికరాల పనితీరు, నిర్వహణను పరిశీలించారు. క్షతగాత్రులు, రోగులను ఆస్పత్రులకు తరలించే సమయంలో తీసుకుంటున్న జాగ్రత్తలు, అందిస్తున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. సమయ పాలన, నిర్వహణ తదితర అంశాలపై ఆరా తీశారు. అదేవిధంగా 102 అమ్మ ఒడి వాహనాల నిర్వాహకులకు పలు సూచలు చేశారు. గర్భిణులను సకాలంలో ఆస్పత్రులకు తరలించేందుకు సిద్ధంగా, శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. నిర్వహణలో ఎక్కడా నిర్లక్షం కనిపించరాదని తెలిపారు. ఆయన వెంట ప్రోగ్రామ్ మేనేజర్ రవికుమార్, జిల్లా కో–ఆర్డినేటర్ ఉదయ్ తదితరులు ఉన్నారు. -
మల్లమ్మకుంట మర్చిపోవాల్సిందేనా?
● రిజర్వాయర్ రద్దు చేయాలంటూ కలెక్టర్కు లేఖ రాసిన ఎంపీ ● నీటిపారుదలశాఖ అధికారులకు సిఫారస్ చేసిన కలెక్టర్ ● సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కలెక్టర్ లేఖ ● ఎంపీ తీరుపై సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు శాంతినగర్: మల్లమ్మకుంట రిజర్వాయర్పై మళ్లీ రగడ మొదలైంది. అధికార పార్టీ ఎంపీ మల్లు రవి రిజర్వాయర్ను రద్దు చేయాలంటూ కలెక్టర్కు సూచించడంతో ఆశలు నిరాశలయ్యే అవకాశాలు లేకపోలేదు. మల్లమ్మకుంట రిజర్వాయర్ రద్దు చేయాలంటూ కలెక్టర్ నీటి పారుదలశాఖ అధికారులకు రాసిన లేఖ గురువారం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. వివరాల్లోకి వెళ్తే.. ఆర్డీఎస్ ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందించి రైతులను ఆదుకోవాలనే లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తుమ్మిళ్ల ఎత్తిపోతల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. తుమ్మిళ్ల లిఫ్ట్తో పాటు వడ్డేపల్లి మండలం తనగల సమీపంలో మల్లమ్మకుంట, జూలకల్ సమీపంలో రిజర్వాయర్, ఇటిక్యాల మండలం వల్లూరు సమీపంలో రిజర్వాయర్ నిర్మాణానికి గత ప్రభుత్వం రూ.783 కోట్లు అవసరమని జీఓ పాస్ చేసింది. అందులో భాగంగా మొదటి విడతలో రూ.162 కోట్లతో తుమ్మిళ్ల ఎత్తిపోతలను నిర్మించి ఆర్డీఎస్కు అనుసంధానం చేసి తనగల వద్ద నీటిని పంపింగ్ చేస్తూ కొంత మేర సాగునీటి సమస్య తీర్చగలిగారు. రెండో దశలో మూడు రిజర్వాయర్ల నిర్మాణాలు చేపట్టాలని రైతుల నుంచి డిమాండ్ రావడంతో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణానికి ముందుకొచ్చి గతేడాది సర్వే పనులు చేపట్టారు. అప్పట్లో తనగల రైతులు సర్వే అధికారులను అడ్డుకొని నష్ట పరిహారం ఎక్కువ ఇవ్వాలని లేదంటే వేరే చోట భూమి ఇచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వారికి సర్దిచెప్పి రిజర్వాయర్ నిర్మాణం చేపట్టేందుకు అధికారులు ప్రణాళికలు చేపట్టారు. పనులు ప్రారంభిస్తారని ఎదురుచూస్తున్న తరుణంలో గురువారం కలెక్టర్ నీటిపారుదలశాఖ అధికారులకు రాసిన లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీంతో ఆయకట్టు రైతులనుంచేగాక సొంతపార్టీ నాయకుల నుంచి ఎంపీ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. 250 మంది దళిత రైతులు 567 ఎకరాల భూమి కోల్పోతారని.. 100 గ్రామాల రైతులు, వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే మల్లమ్మకుంట రిజర్వాయర్ను రద్దు చేయాలని ఆదేశాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఇది ప్రభుత్వం చేతగానితనమే అంటూ పెదవి విరుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మల్లమ్మకుంట రిజర్వాయర్ రద్దు విషయమై పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలని అలంపూర్ నియోజకవర్గ రైతులు కోరుతున్నారు. లేనిపక్షంలో ఆందోళనలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. -
గుర్తుతెలియని ద్రావణం తాగి..
అమరచింత: అప్పటి వరకు ఇంటి ముంగిట సరదాగా ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు గుర్తు తెలియని ద్రావణం తాగి ఒకరు హఠాత్తుగా మృతిచెందగా.. మరో బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఘటన గురువారం పట్టణంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. పట్టణానికి చెందిన తెలుగు వంశీ, గాయత్రి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి మూడేళ్ల వయసున్న మణికంఠ, ఏడాదిన్నర వయసున్న ఆర్తిక సంతానం. వీరిద్దరూ కూలీపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇదే క్రమంలో గురువారం తమ ఇంటి మట్టి మిద్దైపె కుటుంబ సభ్యులతో కలిసి చౌడు వేస్తున్నారు. చిన్నారులు ఇద్దరూ ఇంటి బయట ఆడుకుంటూ రోడ్డుపై పారవేసిన సీసాను చేతితో తీసుకుని మూత తెరిచి అందులోని ద్రావణం తాగారు. కాసేపటికి ఆర్తిక నోటి నుంచి నురుగులు రావడంతో కంగారుపడ్డ తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కుమారుడు మణికంఠకు మాటలు రాకపోవడంతో ఏం తాగారో తెలియదని, అబ్బాయి శరీరంపై బొబ్బలు వస్తుండటంతో మహబూబ్నగర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనలతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటగా.. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఏడాదిన్నర చిన్నారి మృతి.. అపస్మారకస్థితిలో మరో బాలుడు... అమరచింతలో విషాద ఘటన -
ప్రశాంత్రెడ్డి హత్య కుట్ర కేసులో ఇద్దరి అరెస్ట్
భూత్పూర్: దేవరకద్ర బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జ్ కొండా ప్రశాంత్రెడ్డి హత్య కుట్ర కేసులో ఇద్దరు నిందితులను బుధవారం అరెస్ట్ చేసినట్లు మహబూబ్నగర్ ఎస్పీ జానకి తెలిపారు. ఈ కేసులో ఉన్న మరో నిందితుడు శ్రీకాంత్ పరారీలో ఉన్నారని.. అనుమానితులుగా ఉన్న రాఘవేందర్రెడ్డి అలియాస్ చిన్న, శ్రీకాంత్యాదవ్పై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. బుధవారం పట్టణంలోని సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ రామకృష్ణతో కలిసి వివరాలు వెల్లడించారు. అరుణాచలం నవీన్కుమార్ తండ్రి హత్య కేసులో కొండా ప్రశాంత్రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నాడని, అలాగే తిమ్మసానిపల్లికి చెందిన రూప్సింగ్ తండ్రి వద్ద ఇటుకలు కొనుగోలు చేసి రూ.40 వేలు ఇవ్వకుండా ప్రశాంత్రెడ్డి బెదిరించారని తెలిపారు. రూప్సింగ్ తనకు జరిగిన అన్యాయాన్ని అరుణాచలం నవీన్కుమార్ను కలిసి చెప్పగా తనకు రూ.5 లక్షలిస్తే కొండా ప్రశాంత్రెడ్డిని చంపుతానని తెలుపగా, రూ.లక్ష ఉన్నాయని, చంపాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. అనంతరం అరుణాచలం నవీన్ తన స్నేహితుడు కర్ణాటకలోని పుట్పాక్కు చెందిన శ్రీకాంత్తో ప్రశాంత్రెడ్డిని హత్య చేయించడానికి రెండు నెలలుగా మాటు వేసుకుని ఉన్నారు. అయితే అరుణాచలం నవీన్ తండ్రి హత్య కేసులో ఏ–2గా ఉన్న కుమ్మరి నర్సింహ విషయం తెలుసుకోవడానికి రూప్సింగ్కు ఫోన్ చేయగా కొండా ప్రశాంత్రెడ్డిని హత్య చేయడానికి చేసిన కుట్ర వివరాలు వెల్లడించారని.. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణను ఫోన్లో రికార్డు చేసి విషయాన్ని కొండా ప్రశాంత్రెడ్డి తెలిపారని వివరించారు. దీంతో కొండా ప్రశాంత్రెడ్డి దేవరకద్ర పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా అరుణాచలం నవీన్, రూప్సింగ్ను పట్టుకొని విచారించగా నేరం అంగీకరించారని ఎస్పీ వెల్లడించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కోర్టులో రిమాండ్ చేయగా మరో నిందితుడు శ్రీకాంత్ కోసం గాలిస్తున్నామని తెలిపారు. వివరాలు వెల్లడించిన మహబూబ్నగర్ ఎస్పీ జానకి -
పాలమూరులో 9 మంది జీహెచ్ఎంలకు నోటీసులు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ స్పౌజ్ బదిలీల్లో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న 9మంది జీహెచ్ఎంలకు ఆర్జేడీ కార్యాలయం నుంచి నోటీసులు జారీ అయ్యాయి. బదిలీల్లో తమ స్పౌజ్ ఆప్షన్ పెట్టుకునేందుకు అవకాశం ఉండగా.. స్పౌజ్ పనిచేస్తున్న పాఠశాల సమీపంలో ఆప్షన్ పెట్టుకోకుండా హెచ్ఆర్ఏ పాఠశాలలకు ఆప్షన్ పెట్టుకున్నారని ‘సాక్షి’లో సైతం పలుమార్లు కథనాలు వెలువడ్డాయి. అప్పట్లో నోటీసులు జారీ చేసిన అధికారులు విచారణ పూర్తిచేశారు. అనంతరం జిల్లాలోని వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న 9మంది జీహెచ్ఎంలపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని మరోమారు నోటీసులు ఇచ్చినట్లు డీఈఓ ప్రవీణ్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిర్ణీత గడువులోగా సదరు జీహెచ్ఎంలు నోటీసులకు స్పందించి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంలపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం ఉందని.. వీరిపై త్వరలో అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాల్లో చర్చ సాగుతోంది. తండ్రిని హత్య చేసిన తనయుడికి రిమాండ్ బల్మూర్: మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని తనయుడే తండ్రిని కొట్టి చంపిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అచ్చంపేట సీఐ రవీందర్ తెలిపిన వివరాలు.. బల్మూర్ మండలం కొండనాగులలో ఈనెల 12న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఎర్రం శ్రీను(60) ఘటనలో మృతుని భార్య ఉశమ్మ ఫిర్యాదు మేరకు విచారణలో అనుమానితుడైన కుమారుడు రాంప్రసాద్ను అదుపులోకి తీసుకోని విచారించగా మద్యానికి డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో కొట్టడంతోనే మృతి చెందినట్లు ఒప్పుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి కల్వకుర్తి మేజిసే్ట్రట్ ఎదుట హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధిచినట్లు పేర్కొన్నారు. -
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
వీపనగండ్ల: విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన వీపనగండ్ల మండలం కల్వరాలలో చోటు చేసుకుంది. ఎస్ఐ కె.రాణి వివరాల మేరకు.. కల్వరాలకు చెందిన రామన్గౌడ్ (51) మంగళవారం రాత్రి తన ఇంట్లోని బాత్రూంలో నీళ్లు పట్టేందుకు విద్యుత్ మోటారు ఆన్ చేశాడు. నీళ్లు పడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య రజిని, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో కుటుంబ సభ్యులు ఎవరూ లేరని.. చుట్టుపక్కల వారు గమనించి వారికి సమాచారం ఇచ్చినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. రామన్గౌడ్ మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది. ఆటో ఢీకొని యువకుడి దుర్మరణం మరికల్: ఆటో ఢీకొట్టిన ఘటనలో యువకుడు మృతి చెందిన ఘటన పస్పుల స్టేజీ సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మరికల్కు చెందిన టంకర శివ(23) పస్పులలో మోటార్ మరమ్మతు చేసి రాత్రి బైక్పై మరికల్కు తిరిగి వస్తుండగా పస్పుల స్టేజీ వద్ద ఎదురుగా వస్తున్న పాల ఆటో వేగంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ ఎల్లయ్య, మసుద్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. బైక్ను ఢీకొట్టిన కారు ● ఒకరి మృతి మహబూబ్నగర్ క్రైం: ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి కారు వేగంగా ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. రూరల్ ఎస్ఐ విజయ్కుమార్ కథనం ప్రకారం.. జిల్లాకేంద్రానికి చెందిన గార్లపాడ్ రమేష్(55) బుధవారం ఉదయం 8.30 ప్రాంతంలో మహబూబ్నగర్ నుంచి జడ్చర్ల వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తుంటే మార్గమధ్యలోని అప్పన్నపల్లి మారుతీ షోరూం సమీపంలో వెనుక నుంచి వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. రమేష్ తలకు తీవ్ర గాయాలు కాగా వెంటనే జనరల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య భాగ్యలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. శుభకార్యానికి వెళ్లివస్తుండగా.. నాగర్కర్నూల్ క్రైం: ప్రమాదవశాత్తు బైక్ పైనుంచి పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మున్సిపాలిటీ పరిధిలోని నాగనూలు సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ గోవర్ధన్ తెలిపిన వివరాలు.. రేవల్లి మండలం నాగపూర్ గ్రామానికి చెందిన మల్లయ్య (52) బైక్పై జిల్లా కేంద్రంలో ఓ శుభకార్యానికి వస్తుండగా ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించబోయి ప్రమాదవశాత్తు కింద పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనరల్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుమారుడు నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి కొత్తకోట రూరల్: అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతిచెందిన ఘటన కొత్తకోట మండలం కానాయపల్లి సమీపంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. ఏదుల మండలం ముత్తిరెడ్డిపల్లికి చెందిన చెన్నమ్మ, కుర్మయ్య దంపతులు కొన్నేళ్లుగా వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామంలో నివాసముంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి రెండవ కుమార్తె బాలమణి (28) భర్త కొన్నేళ్ల క్రితం మృతి చెందాడు. ఆమె ఆరేళ్లుగా కొత్తకోట మండలం కానాయపల్లి శివారులోని బుచ్చారెడ్డి ఇంట్లో పనిమనిషిగా పనులు చేస్తుండేది. అతడి ఇంట్లో బాలమణికి కేటాయించిన గదిలోనే ఆమె అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. మృతురాలి తల్లి చెన్నమ్మ ఫిర్యాదు మేరకు బుచ్చారెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. చికిత్స పొందుతూ వృద్ధుడి మృతి కొత్తకోట రూరల్: ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన వృద్ధుడు చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. ఎస్ఐ ఆనంద్ వివరాల మేరకు.. మండలంలోని అమడబాకులకు చెందిన గొల్ల బండలయ్య (80) గత నెల 26న కొత్తకోటలో నడుచుకుంటూ వెళ్తుండగా.. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో బండలయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్లో వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
మెరిసిన పేదింటి విద్యాకుసుమం
గట్టు: ఇంటర్ ఫలితాల్లో పేదింటి విద్యాకుసుమం మెరిసింది. పుట్టింది పూరి గుడిసెలో అయినా చదువులో మాత్రం ఏకంగా రాష్ట్రస్థాయిలో సత్తా చాటింది. గట్టు మండలం రాయాపురం గ్రామానికి చెందిన లావణ్య ఇంటర్ మొదటి సంవత్సరం బైపీసీలో 439/440 మార్కులతో రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకు సాధించింది. సామాన్య రైతు కుటుంబం అయిన బోయ నర్సమ్మ, ఆటో లక్ష్మణ్కు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె లావణ్య 1, 2 తరగతులు బల్గెరలో, 3 నుంచి 5 తరగతులు ఆలూరులో, 6 నుంచి 10వ తరగతి వరకు కేటిదొడ్డి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో చదువుకుంది. 10వ తరగతిలో 9.8 గ్రేడ్తో ఉత్తీర్ణత సాధించిన లావణ్య.. ఇంటర్ బాలానగర్ గురుకులంలో చదువుతుంది. మొదటి సంవత్సరం బైపీసీలో అత్యధికంగా 439/440 మార్కులు సాధించి రాష్ట్ర టాపర్గా నిలిచింది. గ్రామీణ పేదింటి విద్యార్థిని రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు రాజుసాగర్, శ్రీనివాసులు, వీరేష్, రంగస్వామితో పాటు బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి బల్గెర హనుమంతు నాయుడు బుధవారం విద్యార్థిని లావణ్యను సన్మానించి అభినందించారు. ఇంటర్లో మొదటి ర్యాంకు సాధించిన రాయాపురం లావణ్య -
ఏసీబీ వలలో విద్యుత్ ఏఈ
వనపర్తి: లంచం తీసుకుంటూ విద్యుత్శాఖ ఏఈ ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా పట్టుబడిన ఘటన వనపర్తి జిల్లా కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ వివరాల మేరకు.. ఖిల్లాఘనపురం మండలం మల్కాపురం గ్రామ శివారులో నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తిరుమల ఆగ్రో ఇండస్ట్రీస్ పేరిట రైస్మిల్లు నిర్మాణం చేపట్టాడు. ఈ రైస్మిల్లుకు విద్యుత్ సౌకర్యం కోసం టీజీఎస్పీడీఎల్కు డీడీ చెల్లించారు. విద్యుత్శాఖ అధికారులు టెండర్ ప్రక్రియ పూర్తిచేసి.. ఆ పనులను సలీం అనే కాంట్రాక్టర్కు అప్పగించారు. పనులు పూర్తయిన తర్వాత విద్యుత్ కనెక్షన్ ఇవ్వాల్సిందిగా సదరు కాంట్రాక్టర్ విద్యుత్శాఖ ఏఈ కొండయ్యను కోరగా.. రూ. 20వేలు డిమాండ్ చేశాడు. పనులు కొనసాగుతున్న సమయంలోనే సదరు ఏఈ కొంత మొత్తం (రూ. 30వేలు) లంచంగా తీసుకున్నాడు. విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు మరో రూ. 20వేలు డిమాండ్ చేయడంతో కాంట్రాక్టర్ సలీం ఏసీబీని ఆశ్రయించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎస్ఈ కార్యాలయం వద్ద ఉన్న సదరు కాంట్రాక్టర్ను డబ్బులు ఇవ్వాల్సిందిగా ఏఈ డిమాండ్ చేశాడు. అయితే అప్పటికే ఏసీబీ అధికారులతో టచ్లో ఉన్న కాంట్రాక్టర్.. వారిచ్చిన డబ్బును ఏఈకి ఇచ్చారు. వాటిని తీసుకుని ప్యాంటు జేబులో పెట్టుకున్న వెంటనే ఏసీబీ అధికారులు పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. ఏఈ కొండయ్యపై కేసు నమోదుచేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. అవినీతికి అడ్డుకట్ట ఏది? గతేడాది మే 31న విద్యుత్శాఖలో ముగ్గురు అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఈ నేపథ్యంలో విద్యుత్శాఖ అధికారులు లంచం అడిగితే తమకు సమాచారం ఇవ్వాలంటూ కార్యాలయంలో పలు చోట్ల స్టిక్కర్లు అంటించారు. అయితే ఎస్ఈ, డీఈఈ, ఏఈ స్థాయి అధికారులు ఒకేసారి ఏసీబీకి పట్టుబడిన 11 నెలల వ్యవధిలోనే మరో అధికారి ఏసీబీకి చిక్కడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ వరుస ఘటనలతో విద్యుత్శాఖలో ఏమేర అవినీతి జరుగుతుందనే విషయం సామాన్యులు సైతం అంచనా వేసే స్థితికి వచ్చిందంటూ స్థానికుల్లో చర్చ వినిపిస్తోంది. రైస్మిల్లుకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు రూ. 20వేలు డిమాండ్ కాంట్రాక్టర్ నుంచి రూ.10వేలు తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ -
కొనసాగుతున్న రైల్వే వంతెన పనులు
జడ్చర్ల టౌన్: పట్టణంలోని సిగ్నల్గడ్డ వద్ద రైల్వే వంతెన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మంగళవారం ట్రయల్ రన్ విజయవంతం కావడంతో బుధవారం మూడు గడ్డర్లను బిగించగా.. మరో రెండు గడ్డర్లను గురువారం బిగించనున్నారు. దీంతో వంతెనకు సంబంధించి కీలక ఘట్టం ముగిసినట్లవుతుంది. రైల్వే అధికారులు మధ్యాహ్నం 1.15 గంటలకు రైళ్ల రాకపోకలు నిలిపివేయగా భారీ క్రేన్ సాయంతో మొదటి గడ్డర్ను వంతెన గోడలపై ఏర్పాటుచేసి ప్లేట్లపై అమర్చారు. తర్వాత రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. తిరిగి మధ్యాహ్నం 2.45 గంటలకు రైల్వే అధికారులు మరోమారు రైళ్ల రాకపోకలు నిలిపివేయడంతో రెండు గడ్డర్లను అమర్చారు. జాతీయ రహదారులశాఖ ఈఈ నాగేందర్, డీఈ రాజేందర్, ఏఈ రవికుమార్ పనులను పర్యవేక్షించారు. గురువారం మధ్యాహ్నం 1.15 గంటలకు తిరిగి గడ్డర్ల బిగింపు కార్యక్రమం కొనసాగనుంది. ఈ సందర్భంగా జాతీయ రహదారులశాఖ అధికారులు మాట్లాడుతూ.. వంతెన పనుల్లో కీలక ఘట్టం పూర్తి కావచ్చిందని, గడ్డర్లు, ఇంటర్నల్, ఎండ్ డయాప్రేమ్స్ బిగించిన తర్వాత స్లాబ్ నిర్మాణం ప్రారంభిస్తామని చెప్పారు. జూన్ చివరి వారం లేదా జులై మొదటి వారంలో వంతెనపై రాకపోకలు కొనసాగుతాయని తెలిపారు. -
నిషేధిత ప్రదేశంలో తవ్వకాలు సాధ్యమేనా?
అచ్చంపేట: ఎస్ఎల్బీసీ సొరంగంలో గుర్తించిన నిషేధిత ప్రదేశంలో తవ్వకాలు చేపట్టడం ప్రభుత్వానికి సవాల్గా మారింది. సొరంగం ప్రమాదం జరిగి బుధవారం నాటికి 61 రోజులు అవుతుంది. నాటి నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నా.. గల్లంతైన ఆరుగురి కార్మికుల ఆచూకీ మాత్రం లభించడం లేదు. సొరంగం పైకప్పు కుప్పకూలిన 13.936 కి.మీ. నుంచి ఇన్లేట్ వైపు 324 మీటర్ల వరకు మట్టి, బురద, పెద్దపెద్ద బండరాళ్ల, టీబీఎం మిషన్ ప్లాట్ఫాం శిథిలాలు భారీగా పేరుకుపోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 12 విభాగాల ఉన్నతాధికారులు ప్రమాద ప్రదేశాన్ని డీ–2, డీ–1గా గుర్తించారు. సొరంగం పైకప్పు కూలిన 43 మీటర్ల ప్రదేశాన్ని డీ–1 డేంజన్ జోన్గా గుర్తించారు. భారీగా ఉబ్బికి వస్తున్న నీటి ఊట కారణంగా ఇక్కడ ఎలాంటి తవ్వకాలు చేపట్టినా మరింత ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. దీంతో ఈ ప్రదేశంలో కంచె ఏర్పాటు చేశారు. ప్రమాదం జరిగిన చోట చివర కాంక్రీట్ సెగ్మెంట్లు కూలే ప్రమాదం ఉందని గుర్తించి.. రక్షణ కోసం సింగరేణి మైన్స్ రెస్క్యూ బృందాలు టైగర్ టింబర్ ఉడెన్ కాగ్స్ సపోర్టు ఏర్పాటుచేశారు. నిషేధిత ప్రదేశం మినహా డీ–2 ప్రాంతంలో 281 మీటర్ల మేర పేరుకుపోయిన మట్టి, బురద, టీబీఎం భాగాలు, రాళ్లను తొలగించే పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. చివరగా సొరంగం ఇరువైపులా ఆరు మీటర్ల మేర ఉన్న టీబీఎం ప్లాట్ఫాం భాగాలను దక్షిణమధ్య రైల్వే సిబ్బంది ప్లాస్మా కట్టర్తో కట్ చేసి లోకో ట్రైన్ ద్వారా సొరంగం బయటకు తరలిస్తున్నారు. ఉబ్చికి వస్తున్న నీటిని సొరంగం మధ్య గుండా దారి ఏర్పాటుచేసి.. భారీ మోటార్ల సాయంతో కృష్ణానదిలోకి పంపింగ్ చేస్తున్నారు. సహాయక చర్యలు మరో రెండు రోజుల్లో పూర్తి అవుతాయని రెస్క్యూ సిబ్బంది చెబుతున్నారు. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి మైన్స్ రెస్క్యూ, హైడ్రా, దక్షిణమధ్య రైల్వే, ఆర్మీ, ర్యాట్ హోల్ మైనర్స్ తదితర బృందాల సిబ్బంది నిషేధిత ప్రదేశం వరకు శిథిలాలను తొలగిస్తున్నారు. డీ–2 ప్రదేశం వరకు శిథిలాలను తొలగించినా ఆరుగురి కార్మికుల జాడ లభించలేదు. నిషేధిత ప్రదేశంలో ఉండి ఉండవచ్చని సహాయక సిబ్బంది భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం దోమలపెంట ఎస్ఎల్బీసీ ఇన్లేట్ జేపీ కార్యాలయం వద్ద ప్రత్యేకాధికారి శివశంకర్ లోతేటి ఆధ్వర్యంలో టెక్నికల్ కమిటీ సమావేశం కానుంది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, చేపట్టాల్సిన సహాయక చర్యలపై ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు. టెక్నికల్ కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిషేధిత ప్రదేశంలో తవ్వకాలు చేపట్టాలా లేదా అనే దానిపై నిర్ణయం తీసుకోనుంది. ఎస్ఎల్బీసీ సొరంగంలో లభించని ఆరుగురు కార్మికుల ఆచూకీ మరో రెండు రోజుల్లో ముగియనున్న సహాయక చర్యలు నేడు ప్రత్యేకాధికారితో టెక్నికల్ కమిటీ సమావేశం -
విజయ డెయిరీ అభివృద్ధికి సహకరించాలి
కల్వకుర్తి రూరల్: విజయ డెయిరీ లాభాల బాటలో నడవాలంటే రైతులే ప్రచారకర్తలుగా మారాలని విజయ డెయిరీ చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం పట్టణంలోని పాలశీతలీకరణ కేంద్రం ఆవరణలో జిల్లా అధికారి ధనరాజ్ అధ్యక్షతన డివిజన్ పరిధిలోని పాడి రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం చేసిన పొరపాట్లు పాడి రైతులకు గుదిబండగా మారాయని.. ఇతర ప్రాంతాల్లో పాల విక్రయం అధికంగా ఉండటంతో రాష్ట్రంలో పాల సేకరణ పెంచాలనే లక్ష్యంతో ధర పెంచిందన్నారు. దీంతో రోజు 2.25 లక్షల లీటర్ల పాల సేకరణ ఉండగా.. అది ఒక్కసారిగా 4.50 లక్షల లీటర్లకు పెరిగిందని, ప్రైవేట్ డెయిరీలు పక్క రాష్ట్రాల్లో పాలను కొనుగోలు చేయడంతో విజయ డెయిరీ నష్టాల్లో కూరుకుపోయిందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహకారంతో 15 నెలలుగా అనేక సందర్భాల్లో చర్చించి రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టామని వివరించారు. విజయ డెయిరీ అభివృద్ధికి ప్రతి ఒక్క రైతు కృషి చేయాలని.. గేదె పాలు అధికంగా సేకరించాలన్నారు. మార్కెట్లో పాల ధరను నిర్ణయించే శక్తి విజయ డెయిరీకే ఉందని చెప్పారు. రోజు రెండు లక్షల లీటర్ల పాలు మిగిలిపోతున్నాయని.. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో గురుకులాలు, అంగన్వాడీలు, దేవాదాయశాఖకు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా పార్లర్లు.. రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి పార్లర్లు ఏర్పాటు చేస్తున్నామని.. హైదరాబాద్లోనే 500 ఉండనున్నాయని, వీటిలో అన్నిరకాల పదార్థాలు విక్రయిస్తామని అమిత్రెడ్డి తెలిపారు. వ్యవసాయ కమిషన్ సభ్యుడు కేవీఎన్ రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే ఆరు నెలల్లో పాడి రైతుల సమస్యలు పరిష్కారం అయ్యేలా చూడాలని కోరారు. పలువురు రైతులు సమావేశంలో పాల ధరపై తమ అభిప్రాయాలు తెలిపారు. రాయితీ విత్తనాలను అన్నదాతలకు చైర్మన్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు రాచమళ్ల శ్రీనివాస్, జనరల్ మేనేజర్ మధుసూదన్రావు తదితరులు పాల్గొన్నారు. పాడి రైతులకు అండగా ప్రభుత్వం వంగూరు: పాడి రైతులను ఆదుకునేందుకు విజయ డెయిరీ తో పాటు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని విజయ డెయిరీ చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని కొండారెడ్డిపల్లిలో నిర్మిస్తున్న బల్క్ మిల్క్ సెంటర్ను పరిశీలించిన అనంతరం పాడి రైతులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రైతులకు దాదాపుగా బకాయి బిల్లులు చెల్లించామని.. రానున్న రోజుల్లో ఎప్పటి బిల్లులు అప్పుడే ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో పాల ఉత్పత్తి అధికమని.. అందుకే బల్క్ కూలింగ్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నెలరోజుల్లో పనులు పూర్తిచేసి పాల సేకరణ జరగాలన్నారు. అనంతరం గ్రామంలో కొనసాగుతున్న కంటి వైద్య శిబిరాన్ని పరిశీలించారు. గ్రామస్తులు వేమారెడ్డి, రాజశేఖర్రెడ్డి, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాడి రైతులే బ్రాండ్ అంబాసిడర్లు విజయ డెయిరీ చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి -
పోటెత్తిన ఉల్లి
మార్కెట్కు దేవరకద్ర: దేవరకద్ర మార్కెట్ యార్డులో సీజన్ కావడంతో బుధవారం పెద్ద ఎత్తున ఉల్లి విక్రయాలు జరిగాయి. మార్కెట్లో ఉదయం పది గంటలకు ఉల్లి వేలం ప్రారంభమై మధ్యాహ్నం వరకు సాగింది. పలు ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు, స్థానిక వ్యాపారులు ఉల్లి విక్రయించేందుకు పోటీపడ్డారు. ఉల్లి నిల్వ సామర్థ్యం అధికంగా ఉండటంతో వినియోగదారులు మార్కెట్కు పెద్దఎత్తున తరలించారు. మార్కెట్ బయట కూడా రైతులు ఉల్లి విక్రయాలు జరిపారు. బస్తా ధర రూ.800 మార్కెట్లో ఉల్లి బహిరంగ వేలంలో గరిష్టంగా రూ.1,600, కనిష్టంగా రూ.1,000 వరకు ధర పలికింది. 50 కేజీల ఉల్లి బస్తా గరిష్టంగా రూ.800, కనిష్టంగా రూ.500కు విక్రయించారు. మార్కెట్కు దాదాపు మూడు వేల బస్తాల ఉల్లి విక్రయానికి రాగా, మార్కెట్ బయట మరో రెండు వేల బస్తాలు అమ్మకాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఆర్ఎన్ఆర్ ధర రూ. 2209... బుధవారం మధ్యాహ్నం జరిగిన టెండర్లలో ఆర్ఎన్ఆర్ ధాన్యం ధర క్వింటాల్కు గరిష్టంగా రూ.2,209, కనిష్టంగా రూ.1,700గా నమోదైంది. హంస ధాన్యం ధర గరిష్టంగా రూ.1,913, కనిష్టంగా రూ.1,622, అముదాలకు గరిష్టంగా రూ.6000 ధర లభించింది. మార్కెట్కు దాదాపు రెండు వేల బస్తాల ధాన్యం వచ్చినట్లు మార్కెట్ అధికారులు పేర్కొన్నారు. -
వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలు చేపట్టాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాలో భూగర్భజలాలు పెంచేందుకు వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలు చేపట్టాలని కలెక్టర్ విజయేందిర అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో నీటివాడకం నియంత్రణ, సంరక్షణపై జిల్లా పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలననుసరించి నీటి వాడకం, సంరక్షణపై జిల్లాస్థాయి పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో 200 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న గృహాల్లో వర్షం నీటి సంరక్షణ, ఇంకుడుగుంతల నిర్మాణాలపై సర్వే చేసి డేటా తయారు చేయాలని మున్సిపల్, పంచాయతీ అధికారులను ఆదేశించారు. కొత్తగా నిర్మించే గృహాలకు అనుమతి మంజూరు చేసినప్పుడు పంచాయతీ, మున్సిపల్ అధికారులు తప్పనిసరిగా వర్షపు నీరు సంరక్షించే ఇంకుడుగుంతల నిర్మాణం చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొత్త బోర్లు వేసేప్పుడు సంబంధిత అధికారుల వద్ద రిజిస్టర్ చేసుకోవాలని, బోర్లు తవ్వినప్పుడు వాల్టా చట్టం నిబంధనలు అమలుకు చర్యలు చేపట్టాలన్నారు. భవిష్యత్లో నీటి సంరక్షణ, భూగర్భ జలాలు పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అటవీ శాఖ, ఇరిగేషన్, డీఆర్డీఏ, వ్యవసాయ శాఖలు, భూగర్భజలాల శాఖలు కార్యాచరణ ప్రణాళికను సమర్పించాలని ఆదేశించారు. సమావేశంలో స్థానిక సంస్థలు కలెక్టర్ శివేంద్రప్రతాప్, డీఆర్డీఓ నరసింహులు, మిషన్ భగీరథ ఎస్ఈ జగన్మోహన్, డీపీఓ పార్థసారథి, నగరపాలక సంస్థ కమిషనర్ మహేశ్వర్రెడ్డి, వ్యవసాయ శాఖ, భూగర్భ జలాల శాఖ అధికారులు పాల్గొన్నారు. -
అన్ని హంగులతో విజ్ఞాన కేంద్రం
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: జిల్లాకేంద్రంలోని ఆర్అండ్బీ గెస్ట్హౌస్ ప్రాంగణంలో అన్ని హంగులతో పూలే అంబేడ్కర్ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంగణంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం వెజ్, నాన్–వెజ్ మార్కెట్ను రూ.4.50 కోట్లతో చేపట్టి మధ్యలోనే ఆపేసిందన్నారు. దీనిని తాజాగా అధునాతన నాలెడ్జ్ సెంటర్గా మార్పు చేయించి మొత్తం రూ.17.31 కోట్లను కేటాయించామన్నారు. ఈ మేరకు సీడీఎంఏ నుంచి జీఓ జారీ అయిందని, ముందుగా రూ.పది కోట్లు మంజూరయ్యాయన్నారు. ఈ నిధులతో అంతర్జాతీయ స్థాయిలో లైబ్రరీ స్థాపించి కనీసం లక్ష పుస్తకాలు అందుబాటులో ఉంచుతామన్నారు. అలాగే సెమినార్ హాల్స్, రీడింగ్ రూమ్స్, డిజిటల్ హాల్స్, క్లాస్ రూంలతో ప్రజలందరూ గర్వపడేలా ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామన్నారు. అలాగే మెట్టుగడ్డలోని డైట్ కళాశాల ప్రాంగణంలో మరో వెజ్, నాన్–వెజ్ మార్కెట్ పేరిట అప్పటి ప్రభుత్వం నిర్మాణం చేపట్టి అర్ధాంతరంగా నిలిపివేసిందన్నారు. దీనిని కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా మార్పు చేయిస్తున్నామన్నారు. అనంతరం ఆర్అండ్బీ గెస్ట్హౌస్ ప్రాంగణంలో పిల్లర్లకే పరిమితమైన వెజ్, నాన్–వెజ్ మార్కెట్ భవన నిర్మాణాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ఖాద్రీ, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్యాదవ్, గుండా మనో హర్, రాజుగౌడ్, దేవేందర్నాయక్ పాల్గొన్నారు. సీడీఎంఏ నుంచి రూ.17.31 కోట్లు మంజూరు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి -
సన్న బువ్వ.. సంబురం
మహబూబ్నగర్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్న సన్నబియ్యానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈనెల 1 నుంచి చౌకధర దుకాణాల ద్వారా బియ్యం పంపిణీని ప్రారంభించగా, కార్డుదారులు దుకాణాల వద్ద బారులు తీరి బియ్యం తీసుకున్నారు. దొడ్డు బియ్యం పంపిణీ సమయంలో చాలామంది లబ్ధిదారులు అదే రేషన్ దుకాణంలో కిలో రూ.10లకు చొప్పున విక్రయించి.. డబ్బులు తీసుకునేవారు. కానీ ఈ నెలలో తొలి వారంలోనే 80 శాతం మంది బియ్యం తీసుకెళ్లడం గమనార్హం. మార్చితో పోలిస్తే ఏప్రిల్లో 185 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ ఎక్కువగా జరిగింది. ● చౌకధర దుకాణాల ద్వారా ప్రతినెలా 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు బియ్యం పంపిణీ కొనసాగుతుంది. దొడ్డు బియ్యం పంపిణీ సమయంలో కొందరు ఆ బియ్యం తినలేక దళారులకే విక్రయించేవారు. కార్యక్రమ ఉద్దేశం నెరవేరడం లేదని భావించిన ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది. గతంలో తరచూ దొడ్డు బియ్యం అక్రమంగా తరలిస్తున్న ఘటనలు చోటు చేసుకునేవి. ఈసారి అలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించలేదు. అధికార వర్గాల్లోనూ కార్యక్రమ అమలు విజయవంతమైందన్న అభిప్రాయం వ్యక్తమైంది. పట్టణ, పల్లె తేడా లేకుండా జిల్లావ్యాప్తంగా అన్ని రేషన్ దుకాణాల ఎదుట బారులు తీరి మరీ బియ్యం తీసుకెళ్లారు. 20 రోజుల్లో 88.04 శాతం బియ్యం పంపిణీ పూర్తవడం గమనార్హం. అక్కడక్కడ భిన్నాభిప్రాయాలు మొదటి కోటా కింద చౌకధర దుకాణాలకు పంపిణీ చేసిన సన్న బియ్యం నాణ్యత మెరుగ్గా ఉందని లబ్ధిదారులు తెలిపారు. కానీ రెండో కోటా కింద నాణ్యత అంత బాగాలేదన్నారు. మొదటి దఫాలో సన్నరకంతో పాటు నూక తక్కువ ఉందని, రెండో దఫాలు మధ్యస్థ రకంతో పాటు నూక ఎక్కువ ఉందని పేర్కొన్నారు. నాణ్యమైనవి పంపిణీ చేయాలని కోరుతున్నారు. మెజారిటీ లబ్ధిదారులు సన్న బువ్వపై సంతృప్తి వ్యక్తం చేయగా.. కొంతమంది మాత్రం వేడిగా ఉన్నప్పుడు మెత్తగా, చల్లారితే గట్టిగా అవుతుందని పేర్కొంటున్నారు. కార్డు ఉంటే ఎక్కడైనా బియ్యం ప్రస్తుతం సన్న బియ్యం ఇస్తుండటంతో రేషన్కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ బియ్యం తీసుకుంటున్నారు. పైగా పోర్టబిలిటీ సదుపాయం అందుబాటులో ఉండటంతో కార్డుదారులకు తమకు అందుబాటులో ఉన్న చౌకధర దుకాణం వద్దకు వెళ్లి మరీ తీసుకుంటున్నారు. రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్న లబ్ధిదారులు ఎక్కడైనా రేషన్ తీసుకునేలా గతంలోనే చర్యలు చేపట్టినా, దొడ్డు బియ్యం పెద్దగా తీసుకునే వారు కాదు. ఇప్పుడు సన్నబియ్యం కావడంతో కార్డుదారులు ముందుగానే వచ్చి తీసుకెళ్తున్నట్లు రేషన్డీలర్లు పేర్కొంటున్నారు. దీంతో ఇకపై చౌకధర దుకాణాల్లో బియ్యం మిగిలే అవకాశాలు లేదు. గతంలో దొడ్డు బియ్యం కావడంతో కొంతమేర డీలర్ల వద్ద మిగిలి ఉండేది. మరుసటి నెలలో దానిని సర్దుబాటు చేసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. బియ్యం బాగున్నాయి ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యం బాగున్నాయి. అందులో ఎలాంటి నూకలు, తవుడు కూడా లేదు. మార్కెట్లో వేలాది రూపాయలు వెచ్చించి బియ్యం కొనుగోలు చేయలేని మా లాంటి వారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. ఈ బియ్యంతో వండిన బువ్వ కూడా రుచికరంగా ఉంది. – ఎంగగళ్ల నాగరాజు, పాతపాలమూరు, మహబూబ్నగర్ నూకలు వస్తున్నాయి.. మా కుటుంబానికి 30 కిలోల సన్న బియ్యం ఇచ్చిండ్రు. అందులో 5 కిలోల నూకలు వచ్చినయి. మిగతా బియ్యం మంచిగనే ఉన్నయ్. ఇవే మాకు ఆధారం. ప్రతినెలా సన్న బియ్యం ఇస్తే మాకు ఎంతో ఆసరాగా ఉంటుంది. – మద్దెల నాగమణి, గృహిణి, రామచంద్రాపూర్ ప్రజల్లో సంతృప్తి.. జిల్లాకు ప్రభుత్వం కేటాయించిన కోటా బియ్యం వందశాతం చౌకధరల దుకాణాలకు చేరాయి. గతంలో బియ్యం పంపిణీ ప్రారంభించిన పదిరోజుల్లో సగం బియ్యం కూడా కార్డుదారులు తీసుకెళ్లేవారు కాదు. ప్రస్తుతం 4,290 మెట్రిక్ టన్నులు పంపిణీ చేశాం. ప్రతి కార్డుదారు బియ్యంను తీసుకెళ్తున్నారు. వాటిని వండుకుని తింటున్నారు. మేము ప్రత్యక్షంగా కొంతమంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పరిశీలించగా బువ్వ నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. – అశోక్ సోఫీ, ఇన్చార్జి డీఎస్ఓ సన్నబియ్యం పంపిణీపై సంతృప్తి వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు ఆర్థిక భారం తప్పిందంటున్న జనం గత నెల కంటే 185 మెట్రిక్ టన్నుల ఎక్కువ బియ్యం పంపిణీ -
పీసీసీ అబ్జర్వర్ల నియామకం
సాక్షి, నాగర్కర్నూల్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జిల్లాల వారీగా అబ్జర్వర్లను నియమించింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఒక్కో జిల్లాకు ఇద్దరు చొప్పున పార్టీ అబ్జర్వర్ల జాబితాను ప్రకటించారు. మహబూబ్నగర్ జిల్లాకు దొమ్మటి సాంబయ్య, గజ్జి భాస్కర్ యాదవ్, నాగర్కర్నూల్కు టి.బెల్లయ్య నాయక్, దర్పల్లి రాజశేఖర్రెడ్డి, వనపర్తికి ఎ.సంజీవ్ యాదవ్, గౌరి సతీశ్, జోగుళాంబ గద్వాలకు దీపక్ జైన్, బి.వెంకటేశ్ ముదిరాజ్, నారాయణపేటకు ఎం.వేణుగౌడ్, బొజ్జ సంధ్యారెడ్డి పార్టీ అబ్జర్వర్లుగా కొనసాగనున్నారు. వీరు పార్టీ తరఫున ఆయా జిల్లాల్లో పార్టీ అధ్యక్షులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీకి చెందిన వివిధ విభాగాల ప్రతినిధులతో సమన్వయం చేయనున్నారు. ఎప్పటికప్పుడు పార్టీ నాయకుల పనితీరును అధిష్టానానికి నివేదించనున్నారు. స్పౌజ్ ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ ప్రారంభం మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లా నుంచి వివిధ జిల్లాలకు ఇప్పటికే 8 మంది స్పౌజ్ ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లగా, వివిధ జిల్లాల నుంచి మహబూబ్నగర్ జిల్లాకు 21 మంది ఉపాధ్యాయులు బదిలీపై రానున్నారు. ఇందుకు సంబంధించి బుధవారం 20 మంది ఉపాధ్యాయులు డీఈఓ కార్యాలయంలో రిపోర్టు చేయగా.. ఒక ఉపాధ్యాయుడు రాలేదని డీఈఓ ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు. కాగా.. బదిలీపై వచ్చిన ఉపాధ్యాయులు వివిధ సర్టిఫికెట్లు, సర్వీస్ బుక్కులు, స్పౌజ్ సర్వీస్ బుక్లను పరిశీలన కమిటీ తనిఖీ చేసింది. అనంతరం గురువారం సాయంత్రం నాటికి వీరి బదిలీకి సంబంధించిన ఆర్డర్స్ కాపీలను అందజేయనున్నారు. ఈ ప్రక్రియను డీఈఓ ప్రవీణ్కుమార్, సూపరిటెండెంట్ శంబూప్రసాద్ పర్యవేక్షించారు. చెంచుల స్థితిగతులపై అధ్యయనం మన్ననూర్: నల్లమల అటవీ లోతట్టు ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆదివాసీ చెంచుల జీవన స్థితిగతులపై బుధవారం రాష్ట్ర అధికారులు అధ్యయనం చేశారు. రాష్ట్ర గవర్నర్ ఆదేశాల మేరకు అధికారుల బృందం అప్పాపూర్, భౌరాపూర్ చెంచు పెంటల్లో చెంచులతో సమావేశమై ఇష్టాగోష్టిగా మాట్లాడారు. చెంచుల జోవనోపాదులతో పాటు జీవన భృతి తదితర అంశాల గురించి చర్చించారు. చెంచు పెంటల్లో తాగునీరు, రవాణా, రోడ్లు, చెక్డ్యాంలు తదితర సౌకర్యాల కల్పనతో పాటు నేచర్ గైడ్ల శిక్షణ కోసం రూ. 1.2కోట్లు మంజూరు చేస్తున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో గవర్నర్ కార్యాలయ జాయింట్ సెక్రెటరీ భవానీ శంకర్, పవన్సింగ్, ఫైనాన్స్ అధికారి శ్రీనివాస్, ట్రైబల్ డెవలప్మెంట్ కౌన్సిల్, ఇస్కాన్ సభ్యులు, మిషన్ భగీరథ డీఈ హేమలత, రెడ్క్రాస్ సొసైటీ కార్యదర్శి రమేశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉగ్రదాడి హేయమైన చర్య
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: కశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి జరిపి 28 మందిని కాల్చి చంపడం హేయమైన చర్య అని సీనియర్ సిటిజన్స్ ఫోరం అధ్యక్షుడు జగపతిరావు అన్నారు. ఈ ఘటనను నిరసిస్తూ బుధవారం రాత్రం స్థానిక అంబేడ్కర్చౌరస్తా వద్ద కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమాయకులను లక్ష్యంగా చేసుకుని వారి ప్రాణాలను తీయడం లాంటి పిరికితనం మరొకటి లేదన్నారు. ఈ దాడులకు పాల్పడిన ఉగ్రవాదులను వెంటాడి మట్టుబెట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ‘ఫోరం’ ప్రధాన కార్యదర్శి నస్కంటి నాగభూషణం, సభ్యులు రాజసింహుడు, లక్ష్మణ్గౌడ్, సురేష్బాబు, రాములు, బుచ్చన్న, హన్మంత్రెడ్డి, గంగాధర్, కోటేశ్వరరెడ్డి, సురేష్బాబు పాల్గొన్నారు. ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలి కశ్మీర్లో పర్యాటకులపై దాడులకు పాల్పడిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని బీజేపీ జిల్లా అద్యక్షుడు శ్రీనివాస్రెడ్డి కోరారు. బుధవారం రాత్రి బీజేపీ కార్యాలయం నుంచి తెలంగాణ చౌరస్తా వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పాండురంగారెడ్డి, రమేష్, అంజయ్య, సంపత్, శివ, గంగన్న పాల్గొన్నారు. -
కల్తీ కల్లు బాధితులే ఎక్కువ..
జనరల్ ఆస్పత్రిలోని మెడికల్ హెల్త్ సెంటర్కు కల్తీ కల్లు బాధితులు ఎక్కువగా వస్తున్నారు. కల్లులో మత్తుకోసం క్లోరో, ఆల్ఫ్రాజోలం, యాంటీ సైకోటిక్ పదార్థాలను కలుపుతుండటంతో తీవ్రమైన అనారోగ్యానికి గురవుతున్నారు. నిత్యం కల్తీకల్లు సేవించడం వల్ల బ్రెయిన్, లివర్, నాడీ సంబంధ సమస్యలకు లోనవుతున్నారు. చివరికి నోట మాటరాని పరిస్థితి ఎదురవుతోంది. – డాక్టర్ అంబుజ, సైకియాట్రిస్ట్, జిల్లా మెడికల్ హెల్త్ సెంటర్, నాగర్కర్నూల్ కౌన్సెలింగ్ ద్వారా చికిత్స.. కల్తీకల్లు వినియోగంతో నరాల బలహీనత, ఫిట్స్, తిమ్మిర్లు రావడం, చేతులు, కళ్లలో మంటలతో ఆస్పత్రులకు వస్తున్నారు. వారికి కౌన్సెలింగ్, మందులు ఇచ్చి పంపిస్తున్నాం. తీవ్రమైన కేసులు ఉన్నవారిని హైదరాబాద్కు పంపుతున్నాం. – డాక్టర్ రఘు, సూపరింటెండెంట్, జనరల్ ఆస్పత్రి, నాగర్కర్నూల్● -
‘ప్రతిభ’ విద్యార్థుల విజయఢంకా
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని ప్రతిభ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయఢంకా మోగించారు. మొదటి సంవత్సరం ఎంపీసీలో వైష్ణవి 468, ఉపేంద్ర 468, విజయలక్ష్మి 467, గణేశ్ 467, అక్షితారెడ్డి 467, సాయిచరణ్ 467, కీర్తి 466, భవనేష్ 466, అయిసా తహరీన్ 466, హర్షిత 466, వర్షిణి 466, హూరియా రశీద్ 466, విశాల్ 466, శోభారాణి 466, నవీన్కుమార్ 466, శ్రీనితీన్ 466, త్రిష 466 మార్కులు సాధించారు. బైపీసీ విభాగంలో నెక్కొండ హాసి 436, వైష్ణవి 436, సుప్రజ 435 మార్కులతో ప్రతిభ చాటారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో అక్షిత 994, అమోఘ్ 993, భవిత 992, శివజ్యోతిక 992, అమిమ ఫాతిమా 992, వర్షిత్గౌడ్ 992 మార్కులు సాధించగా.. బైపీసీ విభాగంలో అక్షిత 994, అజీం కౌసర్ 991, జైన్బిన్ మొహమ్మద్ 990, భూమిక 990 మార్కులు సాధించారు. మొదటి సంవత్సరంలో 400 పైగా 514మంది, ద్వితీయ సంవత్సరంలో 900 మార్కులకు పైగా 432 మంది సాధించినట్లు యాజమాన్యం పేర్కొంది. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను గౌరవ సలహాదారు మంజూలాదేవి, లక్ష్మారెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి, రఘువర్ధన్రెడ్డి, జనార్దన్రెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి అభినందించారు. -
సివిల్స్లో మెరిసిన పాలమూరు బిడ్డలు
సాక్షి, నాగర్కర్నూల్/వెల్దండ/వంగూరు/అడ్డాకుల: యూపీఎస్సీ ఫలితాల్లో పాలమూరు బిడ్డలు సత్తా చాటారు. నల్లమలలోని అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామానికి చెందిన మండలి సాయికిరణ్ మంగళవారం విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో ఆలిండియా 298 ర్యాంకు సాధించారు. హైదరాబాద్లోని ప్రైవేటు కళాశాలలో డిగ్రీ, ఎంబీఏ పూర్తిచేసిన సాయికిరణ్.. తొలి ప్రయత్నంలోనే సివిల్స్ సాధించడం విశేషం. సాయికిరణ్ తల్లి పుష్పమ్మ గృహిణి కాగా.. తండ్రి మండలి లింగమయ్య ప్రస్తుతం పెద్దకొత్తపల్లి మండలంలో ఎంపీఓగా పనిచేస్తున్నారు. ● వెల్దండ మండలం పోచమ్మగడ్డ తండాకు చెందిన వడ్యావత్ యశ్వంత్ నాయక్ సివిల్స్ ఫలితాల్లో 432వ ర్యాంకు సాధించారు. ఆయన గతేడాది యూపీఎస్సీ ఫలితాల్లో 627వ ర్యాంక్ సాధించి ఐపీఎస్గా మహారాష్ట్రకు ఎంపికయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్లోని నేషనల్ పోలీసు అకాడమీలో ఐపీఎస్ శిక్షణ పొందుతున్నారు. ఐఏఎస్ లక్ష్యంగా మరోసారి యూపీఎస్సీ పరీక్ష రాసి.. మెరుగైన 432వ ర్యాంక్ సాధించారు. ఐఏఎస్ కావడమే తన లక్ష్యమని యశ్వంత్ నాయక్ చెప్పారు. కాగా, యశ్వంత్ తండ్రి ఉమాపతి హైదరాబాద్లో ఎస్పీఐ ఏజీఎంగా విధులు నిర్వర్తిస్తున్నారు. నారాయణ కళాశాలలో ఇంటర్మీడియట్, ఐఐటీ మద్రాస్లో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు. ● వంగూరు మండలం తిప్పారెడ్డిపల్లికి చెందిన గోకమొల్ల ఆంజనేయులు పట్టుదలతో చదివి ఆలిండియా 934వ ర్యాంకు సాధించారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆంజనేయులు.. 1నుంచి 7వ తరగతి వరకు స్వగ్రామమైన తిప్పారెడ్డిపల్లిలో.. 8నుంచి 10వ తరగతి వరకు గాజరలోని ప్రభుత్వ పాఠశాలలో చదివారు. ఇంటర్, ఐఐటీని కడప జిల్లా ఇడుపులపాయలో పూర్తిచేశారు. అనంతరం హైదరాబాద్లో సివిల్స్ కోచింగ్ తీసుకున్నారు. సివిల్స్లో అత్యుత్తమ ప్రతిభ చాటడంతో ఆయన తల్లిదండ్రులు శ్రీనివాసులు, కృష్ణమ్మతో పాటు గ్రామస్తులు హర్షం వ్యక్తంచేశారు. ఆన్లైన్లో శిక్షణ తీసుకున్నా.. నాకు చిన్నప్పటి నుంచి సివిల్స్ సాధించాలని లక్ష్యం ఉండేది. హైదరాబాద్లో డిగ్రీ పూర్తి చేశాక.. ఎంబీఏ చేస్తూనే సివిల్స్కు సన్నద్ధం అయ్యాను. ఏడాదిపాటు ఆన్లైన్లో శిక్షణ తీసుకుని ఇంటి వద్దే ఉండి ప్రిపేర్ అయ్యాను. నా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తొలి ప్రయత్నంలోనే విజయం సాధించడం ఆనందంగా ఉంది. – సాయికిరణ్, మన్ననూర్ ●● మూసాపేట మండలం నిజాలాపూర్కు చెందిన మునుగల్చేడ్ సత్యయ్య, యశోద దంపతుల కుమారుడు ఎం.వెంకటేశ్ ప్రసాద్ సాగర్ జాతీయ స్థాయిలో 700 ర్యాంకు సాధించారు. గత మార్చి 30న విడుదలైన గ్రూప్–1 ఫలితాల్లో 27వ ర్యాంకు సాధించిన అతడు.. ఈసారి యూపీఎస్సీ ఫలితాల్లోనూ సత్తా చాటారు. ఆయన అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని శ్రీసత్యసాయి విద్యా సంస్థల్లో ఇంటర్(ఎంపీసీ), డిగ్రీ(బీఎస్సీ ఫిజిక్స్), పీజీ పూర్తి చేశారు. మొదటిసారి యూపీఎస్సీ పరీక్ష రాసి 700 ర్యాంకు సాధించారు. ఇదిలా ఉంటే, వెంకటేశ్ ప్రసాద్ తండ్రి సత్యయ్య ప్రస్తుతం కోయిలకొండ మండలంలో ఎలక్ట్రికల్ ఏఈగా పనిచేస్తుండగా.. తల్లి యశోద గృహిణి. పదేళ్లుగా సత్యయ్య కుటుంబంతో కలిసి మహబూబ్నగర్లోని శేషాద్రినగర్లో నివాసముంటున్నారు. ఐఏఎస్ కావడమే లక్ష్యం.. అమ్మా, నాన్న పోత్సాహంతో చదువులో రాణించాను. దూర ప్రాంతాల్లో నా విద్యాభ్యాసం పూర్తిచేశాను. యూపీఎస్సీ పరీక్ష కోసం ఢిల్లీలోని వాజీరాం కోచింగ్ సెంటర్ ద్వారా ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నా. 15 నెలలపాటు కోచింగ్ తీసుకుని పరీక్ష రాస్తే 700 ర్యాంకు వచ్చింది. ఐఏఎస్ కావడమే నా లక్ష్యం. ఇందుకోసం మరోసారి ప్రయత్నం చేస్తాను. – ఎం.వెంకటేశ్ ప్రసాద్ సాగర్ ,నిజాలాపూర్ -
ఇంటర్ ఫలితాల్లో ‘రిషి’ సంచలనం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రంలోని రిషి జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ పరీక్ష ఫలితాల్లో సంచలనం సృష్టించారు. రాష్ట్రస్థాయిలో సత్తా చాటినట్లు కళాశాల చైర్పర్సన్ చంద్రకళా వెంకటయ్య తెలిపారు. మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో భావన 468 మార్కులు సాధించగా.. మరో ఏడుగురు విద్యార్థులు 467 మార్కులతో ప్రతిభ చాటారు. బైపీసీలో మలిహా కహేకశ 438 మార్కులు సాధించగా.. ముగ్గురు 437, మరో ముగ్గురు 436 మార్కులు సాధించారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో మేఘన 993తో పాటు మరో ఐదుగురు 990 మార్కులు సాధించారు. బైపీసీలో మలిహ తహనీయత్ 992 మార్కులు, మరో ఐదుగురు 990 మార్కులు సాధించారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను మంగళవారం కళాశాల యాజమాన్యం అభినందించింది. కార్యక్రమంలో కళాశాల అడ్వైజర్ వెంకటయ్య, అకాడమిక్ డీన్ లక్ష్మారెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ డీన్ భూపాల్రెడ్డి, ప్రిన్సిపాల్ ప్రసన్నలక్ష్మి, రాఘవేందర్రావు తదితరులు పాల్గొన్నారు. -
అనవసర భయం విద్యార్థి ప్రాణం తీసింది..
● ఇంటర్ ఫస్టియర్లో ఉత్తీర్ణత సాధించిన మల్లెందొడ్డి విద్యార్థి మల్దకల్: ఇంటర్లో ఫెయిల్ అవుతానేమోనన్న భయంతో మల్దకల్ మండలంలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. అయితే సదరు విద్యార్థి మంగళవారం విడుదలైన ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించాడు. వివరాల్లోకి వెళ్తే.. మల్దకల్ మండలం మల్లెందొడ్డి గ్రామానికి చెందిన వినోద్ జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇంటర్ వార్షిక పరీక్షల అనంతరం విద్యార్థి తాను రాసిన పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో ఆందోళనకు గురయ్యాడు. ఈ క్రమంలో 10 రోజుల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతిచెందాడు. మంగళవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో వినోద్ పాస్ కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. అనవసర భయమే తమ బిడ్డ ప్రాణం తీసిందని వాపోయారు. తాటిచెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి రాజోళి: తాటిచెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతిచెందిన ఘటన రాజోళి మండలం మాన్దొడ్డి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. మాన్దొడ్డికి చెందిన నడిపి ఆంజనేయులు (52) కూలీ పనులు చేసుకుని జీవనం సాగించే వాడు. ప్రస్తుతం తాటిముంజల సీజన్ కావడంతో, వాటిని విక్రయించి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో రోజు మాదిరిగానే గ్రామ సమీపంలో తాటికాయలు తెంచేందుకు చెట్టుపైకి ఎక్కిన ఆయన.. ప్రమాదవశాత్తు కిందపడటంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. -
‘పాలమూరు’ పనుల పరిశీలన
కొల్లాపూర్ రూరల్: మండలంలోని ఎల్లూరు సమీపంలో చేపట్టిన పాలమూరు ప్రాజెక్టు మొదటి లిఫ్ట్ పనులను ఈఎన్సీ అనిల్ కుమార్తో పాటు ఇరిగేషన్శాఖ ఉన్నతాధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా 1, 2, 3 ప్యాకేజీల పనుల పురోగతిని తెలుసుకున్నారు. 3వ ప్యాకేజీ పనులను డ్రోన్ కెమెరాలతో పరిశీలించి.. అధికారులకు పలు సూచనలు చేశారు. నిర్మాణ పనులను వేగంగా పూర్తిచేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం నార్లాపూర్ రిజర్వాయర్ నిర్మాణంతో పాటు ప్రధాన కాల్వ పనులను పరిశీలించారు. పంప్హౌజ్, ప్రధాన కాల్వ హెడ్ రెగ్యులెటరీ పనుల పురోగతిని తెలుసుకున్నారు. అనంతరం కేఎల్ఐ మొదటి లిఫ్ట్ను సందర్శించి.. పంప్హౌజ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈఎన్సీ మాట్లాడుతూ.. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 817 అడుగుల నీటిమట్టం ఉందన్నారు. వేసవిలో తాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. కరివెన, వట్టెం రిజర్వాయర్ల పనులను త్వరగా పూర్తిచేసి.. 50 టీఎంసీల నీరు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సీఈ సత్యనారాయణ రెడ్డి, ఈఈ శ్రీనివాసరెడ్డి, డీఈలు, జేఈలు పాల్గొన్నారు. -
వాగ్దేవి విద్యార్థుల విజయ దుందుభి
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని వాగ్దేవి కళాశాల విద్యార్థులు విజయ దుందుభి మోగించారని కళాశాల కరస్పాండెంట్ విజేత వెంకట్రెడ్డి తెలిపారు. మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో అమీనా 468, అక్షయశ్రీ 466, అమృత వర్షిణి 465, వైశాలి 465 మార్కులు సాధించగా.. బైపీసీ విభాగంలో సంజన 436, అలానే ఫరీహ 435, పాయల్ సింగ్ 435, మదియా తరహా 435 మార్కులు సాధించారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో నవనీత్గౌడ్ 992, బైపీసీ విభాగంలో రబ్షా 991, సఫూరా 989 మార్కులతో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని ఆయన పేర్కొన్నారు. కళాశాలలో ఇన్నోవేటివ్ సైంటిఫిక్ టీచింగ్ అప్రొచ్ కార్యక్రమం ద్వారా విద్యార్థులు మంచి మార్కులు సాధించారన్నారు. ఇంతటి ఘనవిజయం సాధించేందుకు సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులు, అధ్యాపకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ గీతాదేవి, అకాడమిక్ ఇన్చార్జి పావని, కోట్ల శివకుమార్, రాఘవేందర్రావు, నాగేందర్, సతీశ్రెడ్డి, బాబుల్రెడ్డి, రఘువర్ధన్రెడ్డి, జ్యోతినందన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సివిల్స్లో మెరిసిన పాలమూరు బిడ్డలు
● నాగర్కర్నూల్ జిల్లా నుంచి ముగ్గురికి మెరుగైన ర్యాంకులు ● మూసాపేట మండలం నిజాలాపూర్కు చెందిన మరో యువకుడి ప్రతిభ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి నలుగురు యువకులు సివిల్స్లో సత్తాచాటారు. మంగళవారం విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరుకు చెందిన మండలి సాయికిరణ్ ఆలిండియా 298వ ర్యాంక్ సాధించారు. అలాగే వెంకటేష్ప్రసాద్ (700ర్యాంక్), యశ్వంత్నాయక్ (432 ర్యాంక్), ఆంజనేయులు (934 ర్యాంక్) సాధించారు. – సాక్షి నెట్వర్క్ – వివరాలు 10లో.. -
ఆ తర్వాత వేరే చోట..
తొలుత మట్టి రోడ్డు వేసి బెంజ్ వంటి వాహనాల్లో ఇసుక తరలించడంపై పలువురు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో రెవెన్యూ, పోలీస్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇసుక తరలిస్తున్న వాహనాలపై పోలీసులు తూతూమంత్రంగా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. ఆ తర్వాత ఎవరు కూడా అటు వైపు చూడకపోవడంతో ఇసుక మాఫియా రాత్రిళ్లూ యథేచ్ఛగా దందా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో అదే ఆశ్రమం నుంచి కొద్దిదూరంలో వేరే చోట మట్టి రోడ్డు వేసి.. భారీ ఎత్తున తవ్వకాలు చేపడుతోంది. రోజుకు వందలాది ట్రిప్పుల చొప్పున ఇసుకను కర్ణాటకలోని తదితర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటోంది. బెంజ్ ఇసుకను రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. -
హోంగార్డుల విధులపై ప్రత్యేక దృష్టి
మహబూబ్నగర్ క్రైం: పోలీస్శాఖలో పనిచేసే క్రమంలో హోంగార్డులు క్రమశిక్షణతో పాటు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందాలని ఎస్పీ డి.జానకి అన్నారు. నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాల నుంచి రొటేషన్ పద్ధతిలో జిల్లాకు కేటాయించిన 110 మంది హోంగార్డులతో సోమవారం పరేడ్ మైదానంలో ఎస్పీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న హోంగార్డుల సంక్షేమం కోసం పోలీస్శాఖ ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని, ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు రావాలన్నారు. రోజు వారి విధుల పట్ల అప్రమత్తంగా ఉండటంతో పాటు ఆరోగ్యంపై కూడా దృష్టి సారించాలన్నారు. హోంగార్డులను ఎంటీ సెక్షన్, జనరల్ డ్యూటీ, బ్లూకోల్ట్స్, ట్రాఫిక్, తప్పాల్ వంటి విభాగాల్లో నియమించనున్నట్లు తెలిపారు. వారికి కేటాయించిన విభాగాల్లో నైపుణ్యం మెరుగుపరుచుకోవాలని సూచించారు. సమావేశంలో ఏఆర్ ఏఎస్పీ సురేష్కుమార్, డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్ఐలు కృష్ణయ్య, నగేష్, రవి, తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి
స్టేషన్ మహబూబ్నగర్: ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల బకాయిలు చెల్లించి ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ ఫోరం జిల్లా అధ్యక్షుడు ఎ.రాజసింహుడు అన్నారు. జిల్లాకేంద్రంలోని ఫోరం కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రధానంగా గత 2022 ఏప్రిల్ నుంచి రిటైర్డ్ అయిన కార్మికులకు రావాల్సిన లీవ్ ఎన్క్యాష్మెంట్, 2017 పీఆర్సీకి సంబంధించిన ఏరియర్స్, ప్రతి నెలా 10వ తేదీ లోపు చెల్లించాల్సిన ఎస్ఆర్బీఎస్ డబ్బులను అందజేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యక్షులు జీబీ పాల్, ఆర్.నారాయణ మాట్లాడుతూ రిటైర్డ్ ఉద్యోగులకు 10వ తేదీలోగా చెల్లించాల్సిన ఎస్ఆర్బీఎస్ డబ్బులు ఇంతవరకు చెల్లించలేదన్నారు. ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉద్యోగుల జీతభత్యాలకే విడతల వారీగా ఈ నెల 16వరకు చెల్లించారని, ఇంకా డీఏలు, 2021 పీఆర్సీ ఇవ్వాల్సిఉందని, అలాగే పీఎఫ్, సీపీఎస్లకు చెల్లించాల్సిన బకాయిలను కూడా చెల్లించకుండా నియామకాలను ఎలా చేపడుతారని ప్రశ్నించారు. సమావేశంలో నాగాంజనేయులు, లలితమ్మ, నర్సింలు, మనోహర్, బుచ్చన్న, రియాజుద్దీన్, తదితరుల పాల్గొన్నారు. -
అధికారులు పట్టించుకోవాలి..
కృష్ణా నది నుంచి ఇసుక తరలించడం మూలంగా సాగు నీటికి ఇబ్బందులు ఏర్పడుతాయి. దీంతోపాటు నదిలో రోడ్లు వేయడం వల్ల దిగువకు నీళ్లు రాకుండా పోతున్నాయి. ఉన్న కాస్త నీరు అక్కడే నిలుస్తోంది. పరిస్థితి ఇలా ఉంటే వేసవి చివరలో నీటి కొరత తీవ్రమయ్యే అవకాశం ఉంది. అధికారులు పట్టించుకోవాలి. – అంబ్రెష్. మాజీ సర్పంచ్, గుడెబల్లూరు, కృష్ణా నా దృష్టికి రాలేదు.. నది రోడ్లు వేసినట్లు నా దృష్టికి రాలేదు. త్వరలో ఆకస్మిక తనిఖీలు చేపడతాం. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు చేపట్టినా.. అనుమతుల్లేకుండా తరలిస్తున్నా.. చర్యలు తప్పవు. – వెంకటేష్. తహసీల్దార్, కృష్ణా ఇరిగేషన్ శాఖ దృష్టికి తీసుకెళ్లా.. మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాలో మైనింగ్ సిబ్బంది కొరత ఉంది. అయినా నదిలో రోడ్డు వేసినట్లు మా దృష్టికి వచ్చిన వెంటనే.. పరిశీలించాలని సిబ్బందిని పంపించా. నీటిని మళ్లించేందుకు రైతులు వేసుకున్నట్లు చెప్పారు. ఈ అంశాన్ని ఇరిగేషన్ శాఖ దృష్టికి తీసుకెళ్లా. చర్యలు తీసుకోవాల్సింది వారు. – సంజయ్, ఏడీ, మైనింగ్ శాఖ, మహబూబ్నగర్ ● -
ప్రైవేట్లో కత్తెర కాన్పులే
ప్రైవేట్లో కత్తెర కాన్పులే ● జిల్లాలో ఉన్న చాలా వరకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ధరల పట్టికలు కన్పించకపోవడంతో పాటు కనీస సౌకర్యాలు ఉండవు. ఇక పని చేసే నర్సింగ్ సిబ్బందితో పాటు టెక్నీషియన్లు సైతం అర్హత కలిగిన వారు చాలా తక్కువగా ఉంటారు. సరైన చదువు, శిక్షణ లేని వారితో విధులు నిర్వహిస్తుంటారు. సరైన పరిజ్ఞానం లేని సిబ్బంది చికిత్స కోసం వచ్చిన వారి ప్రాణాలతో చెలగాటం అడుతుంటారు. కొన్ని ఆస్పత్రుల్లో వార్డు బాయ్లతో ఇంజక్షన్స్ ఇప్పించడం, సైలెన్స్ పెట్టించడం వంటి ఘటనలు దర్శనం ఇస్తున్నాయి. ● జిల్లాలో 64.21శాతం సిజేరియన్లు ● ఆరోగ్యశాఖలోని ఓ అధికారి సొంత ఆస్పత్రిలో అధిక ఆపరేషన్లు ● ఒక్కో కాన్పుకి రూ.40 వేల నుంచి రూ.70 వేల వరకు వసూలు చేస్తున్న వైనం ● దృష్టి సారించని వైద్యారోగ్యశాఖ పాలమూరు: ఒకవైపు ప్రభుత్వం అన్ని రకాల ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు గణనీయంగా పెంచాలని కసరత్తు చేస్తుంటే.. జిల్లాలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా జరుగుతుంది. ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాహకులు డెలవరీ అంటే కేవలం సిజేరియన్ అనే విధంగా కత్తెర కాన్పులు చేసి డబ్బులు దండుకుంటున్నారు. వైద్యం అంటేనే వ్యాపారం అనే విధంగా పలు ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు ప్రవర్తిస్తున్నారు. ఆస్పత్రులకు ప్రసవం కోసం వచ్చిన గర్భిణులకు కోతల కాన్పులే చేస్తున్నారు. జిల్లాలో 2022 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు 48 ప్రైవేట్ ఆస్పత్రుల్లో 16,109 ప్రసవాలు అయితే ఇందులో 5,698 సాధారణ కాన్పులు కాగా.. 10,411 సిజేరియన్లు చేయడం గమనార్హం. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో 64.21 శాతం సిజేరియన్లు చేశారు. ప్రభుత్వ వైద్యులే అధికం జిల్లా వైద్యారోగ్యశాఖలో పనిచేస్తున్న వైద్యాధికారులతో పాటు జిల్లా జనరల్ ఆస్పత్రిలో పని చేస్తున్న చాలామంది ప్రభుత్వ వైద్యులకు ప్రైవేట్ ఆస్పత్రులు ఉన్నాయి. ప్రధానంగా ఆరోగ్యశాఖలో పని చేసే ఓ జిల్లా స్థాయి అధికారికి ఉన్న నర్సింగ్ హోంలో అయితే సాధారణ ప్రసవాలే ఉండటం లేదు. ఆరోగ్యశాఖ ఇచ్చిన లెక్కల ప్రకారం చూస్తే అక్కడ కేవలం సిజేరియన్స్ పైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఒక ప్రభుత్వ జిల్లాస్థాయి అధికారి నర్సింగ్లోనే ఈ పరిస్థితి ఉంటే.. ఇక మిగిలిన ఆస్పత్రుల్లో ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. జనరల్ ఆస్పత్రిలో పని చేసే వైద్యులు మధ్యాహ్నం కాకముందే విధులు ముగించుకొని సొంత క్లినిక్లకు వెళుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఒకరిద్దరు వైద్యులు ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే కేసులను సైతం సొంత ఆస్పత్రులకు రెఫర్ చేసి పంపుతున్నట్లు సమాచారం. ఆడిట్ చేస్తాం.. జిల్లాలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రుల్లో సిజేరియన్ అధికంగా చేస్తున్న వాటితో అన్నింటిపై ఆడిట్ పూర్తి చేస్తాం. ఇందులో ఏదైనా ఆస్పత్రిలో సెక్షన్లు అధికంగా చేస్తున్నట్లు నిర్ధారణ అయితే చర్యలు తీసుకుంటాం. ప్రసవాలపై ప్రోగ్రామ్ అధికారులతో విచారణ చేయిస్తాం. – డాక్టర్ కృష్ణ, డీఎంహెచ్ఓ -
మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలి
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలని పీయూ వైస్చాన్స్లర్ జీఎస్ శ్రీనివాస్ పేర్కొన్నారు. పీయూలో ఏర్పాటు చేసిన మహనీయుల జయంతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. సమాజంలో ఉన్న అనేక రుగ్మతలను రూపుమాపేందుకు ఎంతో మంది గొప్ప వ్యక్తులు జీవితాంతం కృషి చేశారని, వారి కృషి వల్ల ఎంతో మంది అట్టడుగు వర్గాల వారికి మేలు జరిగిందన్నారు. మహనీయుల జయంతులు చేస్తే వారి ఆశయాలను కొనసాగించినట్లు కాదని, వారు ఎలాంటి సేవలు చేయడం వల్ల గొప్ప వ్యక్తులయ్యారనే అంశాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్సీ జానకి మాట్లాడుతూ గతంలో మహనీయులు చేసిన త్యాగాల వల్లే అన్ని వర్గాల వారు స్వేచ్ఛ సమానత్వంతో మెలుగుతున్నారని, నేటి తరం యువతకు కూడా సమాజసేవ చేసేందుకు తమ వంతుగా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో కార్యక్రమంలో ప్రొఫెసర్ కాశీం, పీయూ రిజిస్ట్రార్ రమేష్బాబు, పీయూ ప్రిన్సిపాల్ మధుసూదన్రెడ్డి, కుమారస్వామి, ప్రవీణ తదితరులు పాల్గొన్నారు. -
భూభారతి ద్వారా సురక్షిత హక్కులు
అడ్డాకుల: భూభారతి చట్టం ద్వారా భూమికి సురక్షిత హక్కులు కల్పిస్తామని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. అడ్డాకుల, మూసాపేటలో సోమవారం నిర్వహించిన భూభారతి అవగాహన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డితో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ల్యాండ్ ట్రిబ్యునల్ ఏర్పాటుతో కలెక్టర్ స్థాయిలోనే భూముల సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయని చెప్పారు. భూమి ఉన్న ప్రతి రైతుకు భూధార్ కార్డు ఇచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. భూ సమస్యలపై కోర్టుల చుట్టూ తిరగకుండా భూభారతి చట్టం మేలు చేస్తుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే జీఎమ్మార్ మాట్లాడుతూ గ్రామస్థాయి అధికారి నుంచి కలెక్టర్ వరకు తిరిగినా ధరణి వల్ల భూ సమస్యలు పరిష్కారం కాలేదని..అందుకే భూ భారతి చట్టాన్ని తెచ్చి రైతుల బాధను తీరుస్తున్నామన్నారు. అర్హత ఉన్న ప్రతి రైతుకు భూమిపై హక్కులు కల్పిస్తామన్నారు. కేసీఆర్ కుటుంబ దోపిడీ కోసమే ధరణిని తెచ్చి రైతులకు కన్నీరు మిగిల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే సీఎం రేవంత్రెడ్డి భూ భారతి చట్టాన్ని తెచ్చి తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ స్థాయిలోనే సమస్యలకు పరిష్కారం లభించేలా కృషి చేస్తున్నారని తెలిపారు. కాగా.. అడ్డాకులలో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ఎమ్మెల్యే, కలెక్టర్ పరిశీలించారు. కూచిపూడి డ్యాన్స్లో గిన్నిస్రికార్డు సాధించిన మూసాపేటకి చెందిన నామాల ఎల్లస్వామి కుమార్తె శ్రీఆధ్యను అభినందించి శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్రావు, ఆర్డీఓ నవీన్, ప్రత్యేకాధికారి శంకరాచారి, తహసీల్దార్లు శేఖర్, రాజునాయక్ పాల్గొన్నారు. -
రామేశ్వరం టు కాశీ
అడ్డాకుల: తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం ప్రాంతానికి చెందిన సోమసుందరం ఆధ్వర్యంలో 24 మంది సభ్యుల బృందం ప్రపంచ శాంతి కోరుతూ రామేశ్వరం నుంచి కాశీకి చేపట్టిన పాదయాత్ర చేపట్టారు. ఆ యాత్ర సోమవారం అడ్డాకుల, మూసాపేట మండలాల్లోని 44వ నంబర్ జాతీయ రహదారిపై సాగింది. మూసాపేట వద్ద సంకల్పసిద్ధి హరిహర అయ్యప్ప క్షేత్రానికి చేరుకున్న పాదయాత్ర బృందం సభ్యులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పాదయాత్ర ప్రారంభించి 50 రోజులు కావడంతో వారు వెంట తెచ్చుకున్న మురుగన్స్వామి విగ్రహానికి ఆలయంలో పంచామృతాభిషేకాలు చేసి, భజనలు చేపట్టారు. పాదయాత్ర బృందానికి సంకల్పసిద్ధి అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. ఇదిలా ఉండగా ప్రపంచ శాంతి కోసం ప్రతి ఏడేళ్లకు ఒకసారి రామేశ్వరం టు కాశీకి పాదయాత్ర చేస్తున్నట్లు సోమసుందరం తెలిపారు. 1983లో మొదటిసారి పాదయాత్ర ప్రారంభమైందని, ప్రస్తుతం ఏడో పాదయాత్ర సాగుతోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు తిరుపతయ్యగౌడ్, కొంగరి శ్రీనివాసులు, గూపని కొండయ్య, మిడ్జిల్ల విశ్వేశ్వర్, వాకిటి నరహరి, వెంకటాంపల్లి రాజు తదితరులు ఉన్నారు. ప్రపంచ శాంతి కోసం పాదయాత్ర -
పేద విద్యార్థులకు చేయూత
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఉన్నత విద్య అభ్యసించేందుకు గాను ఎంట్రెన్స్ పరీక్షలు రాసి ర్యాంకులు సాధించాలనే తపన ఉన్న చాలా మంది విద్యార్థులకు ఆర్థిక పరిస్థితి అనుకూలించదు. ఐఐటీ, నీట్, ఎంసెట్ వంటి పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకునేందుకు ప్రస్తుత పరిస్థితుల్లో రూ.లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో పేద విద్యార్థులకు చేయూత అందిస్తున్నారు మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి. వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ అందించేందుకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ఏడు నెలల క్రితం బాలికల, బాలుర జూనియర్ కళాశాలల విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం శిక్షణ చివరి దశలో ఉంది. తాజాగా జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ కళాభవన్లో ఎస్ఐ, కానిస్టేబుల్, వీఆర్ఓ, టెట్ వంటి పోటీ పరీక్షలకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుమారు 700 మంది అభ్యర్థులు శిక్షణ పొందేందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ పరీక్ష కోసం సుమారు 150 మంది విద్యార్థులు స్థానిక బాలికల జూనియర్ కళాశాలలో ఓ సంస్థ ఆద్వర్యంలో శిక్షణ పొందుతున్నారు. వారికి ఉచితంగా భోజన సదుపాయాన్ని ఎమ్మెల్యే కల్పిస్తున్నారు. దీంతో ప్రైవేటు కోచింగ్ సెంటర్ల ఫీజుల భారం తగ్గిందని విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోచింగ్ బాగుంది.. కొన్ని నెలలుగా ఇక్కడ శిక్షణ తీసుకుంటున్నా. ఏమైనా సందేహాలు ఉంటే వెంటనే నివృత్తి చేస్తున్నారు. మంచి స్టడీ మెటీరియల్ కూడా ఇవ్వడంతో చదువుకునేందుకు వీలుగా ఉంది. సీటు సాధించాలనే ఆశయంతో సెలవుల్లో కూడా ఇక్కడే ఉండి చదువుకుంటున్నాం. – స్వాతి, ఎంసెట్ అభ్యర్థిని అన్ని వసతులు ఉన్నాయి.. ఇక్కడ చదువుకునేందుకు అన్ని వసతులను ఎమ్మెల్యే కల్పించడం గొప్ప విషయం. ప్రైవేటు కోచింగ్ సెంటర్లకు వెళ్లే పరిస్థితి లేని క్రమంలో ఇక్కడ చదువుకునేందుకు మంచి ప్లాట్ఫాం దొరికింది. స్టడీ మెటీరియల్స్, స్టడీ చైర్స్, హాస్టల్ వసతి అన్ని కల్పించారు. సీటు సాధించే విధంగా చదువుకుంటున్నాం. – మహాలక్ష్మీ, ఎంసెట్ అభ్యర్థిని విజయ తీరాలకు చేర్చుతాం.. జిల్లాలో అనేక మంది విద్యార్థులకు చదవాలనే కోరిక ఉన్నప్పటికీ.. ఆర్థిక పరిస్థితుల కారణంగా వెనకడుగు వేస్తున్నారు. పేద విద్యార్థులకు చదువు భారం కావొద్దని ఉచితంగా ఐఐ టీ, నీట్, ఎంసెట్ కోచింగ్ ఇప్పిస్తున్నాం. వారికి భోజన వసతి కూడా కల్పిస్తున్నాం. నాణ్యతలో రాజీ లేకుండా ప్రైవేటు కోచింగ్ సెంటర్ల వారి సహకారంతో శిక్షణ ఇస్తున్నాం. ఉన్నతంగా ఎదగాలనే కోరిక ఉన్న విద్యార్థుల ను విజయతీరాలకు చేర్చేందుకు కృషి చేస్తున్నాం. – యెన్నం శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే, మహబూబ్నగర్ ఐఐటీ, నీట్, ఎంసెట్ కోచింగ్కు సంబంధించి సుమారు 150 మంది విద్యార్థులకు క్రాష్ కోర్సు నిర్వహిస్తున్నారు. అయితే విద్యార్థులకు మెరుగైన శిక్షణ అందించడంలో ఎలాంటి రాజీ లేకుండా కొన్నేళ్లుగా ఐఐటీ, నీట్ స్థాయిలో కోచింగ్ అందిస్తున్న రిషి, ప్రతిభ కళాశాలల అధ్యాపకులు ఇక్కడ బోధిస్తున్నారు. వీటితో పాటు మంచి స్టడీ మెటీరియల్స్, ప్రాక్టీస్ టెస్టులు, స్టడీ చైర్లు, పరీక్ష ప్యాడ్లు ఉచితంగా అందించారు. ఇక భోజన, వసతి సదుపాయం బాలికలకు జిల్లా కేంద్రంలోని బీసీ హాస్టల్లో కల్పించారు. బాలురకు మెట్టుగడ్డ వద్ద ఉన్న ఎస్సీ హాస్టల్లో వసతి కల్పించారు. ఇక అంబేడ్కర్ కళాభవన్లో ఇస్తున్న కోచింగ్కు పలు ప్రఖ్యాత కోచింగ్ సెంటర్ల అధ్యాపకులను పిలిపించి ఇక్కడ శిక్షణ ఇప్పిస్తున్నారు. ఇందుకు రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. మెరుగైన కోచింగ్.. ఎంసెట్, నీట్కు ఉచితంగా కోచింగ్ ఇప్పిస్తున్న ఎమ్మెల్యే యెన్నం ఏడు నెలలుగా కొనసాగుతున్న శిక్షణ కార్యక్రమం తాజాగా ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు కోచింగ్ ప్రారంభం -
వికసించిన అరుదైన పుష్పం
జడ్చర్ల టౌన్: పట్టణంలోని డాక్టర్ బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల బొటానికల్ గార్డెన్లో అత్యంత అరుదైన బ్రాకిస్టెల్మా బైలోబేటమ్ పుష్పించిందని ప్రిన్సిపాల్ డాక్టర్ జి.సుకన్య తెలిపారు. ఈ మొక్కను గార్డెన్ సమన్వయకర్త డా.సదాశివయ్య, ఢిల్లీలోని శ్రీవెంకటేశ్వర కళాశాల వృక్షశాస్త్ర సహాయ ఆచార్యుడు డా.ప్రసాద్ 2020లో కనుక్కొని బ్రాకిస్టెల్మా బైలోబేటమ్ అని నామకరణం చేశారన్నారు. ఇవి కేవలం నల్లమల అటవీ ప్రాంతంలోనే లభ్యమవుతాయని.. ప్రపంచంలో మరెక్కడ లభ్యం కావన్నారు. సన్నని కాండంతో 25 సెం.మీ. వరకు మొక్క పెరుగుతుందని.. ప్రతి కనుపు వద్ద తెల్లని కేశాలుగల రెండు ముదురు ఎరుపు, నల్లని పుష్పాలు ఇస్తుందని గార్డెన్ సమన్వయకర్త డా. సదాశివయ్య తెలిపారు. భూమిలోపల దుంప కలిగిన ఈ మొక్క తొలకరి వర్షాలు పడగానే ముందుగా పొడవాటి కాండాన్ని ఇచ్చి పుష్పిస్తుందని.. ఆ తర్వాత ఆకులు ఇవ్వడం దీన్ని ప్రత్యేకత అని ఆయన చెప్పారు. బ్రాకిస్టెల్మా దుంపలను జలుబు, తలనొప్పి, రొమ్ము నొప్పులకు మందుగా వినియోగిస్తుంటారన్నారు. దుంపల ఔషధ గుణాలపై లోతైన పరిశోధనలు జరగాల్సి ఉందన్నారు. ఇలాంటి అరుదైన మొక్క గార్డెన్లో పుష్పించడం ఇదే మొదటిసారి అని.. ఇలాంటి అరుదైన మొక్కలను కాపాడటమే గార్డెన్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. -
కల్తీ ఆహారం విక్రయిస్తే కఠిన చర్యలు
జడ్చర్ల: హోటళ్లు, రెస్టారెంట్లలో వినియోగదారులకు నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందించాలని.. కల్తీ ఆహారం విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ మనోజ్ హెచ్చరించారు. సోమవారం జడ్చర్లలో ఫాస్ట్ఫుడ్ సెంటర్లతో పాటు పాల విక్రయ కేంద్రాలను తనిఖీ చేశారు. రెండు రోజుల క్రితం ఓ ఫాస్ట్ఫుడ్ సెంటర్లో చికెన్ దుర్వాసన రావడంతో వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. సెంటర్లోని బిర్యానీ తదితర వంట పదార్థాలను పరిశీలించగా.. చికెన్లో బొద్దింక కనిపించింది. దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో హల్చల్ అయ్యింది. వెంటనే స్థానిక మున్సిపల్ అధికారులు స్పందించి సదరు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తనిఖీలు చేపట్టి రూ. 5వేల జరిమానా విదించారు. ఈ నేపథ్యంలో జిల్లా ఆహార భద్రత అధికారి మనోజ్ తనిఖీలు చేపట్టారు. తాజ్ ఫుడ్ కోర్టుతో పాటు ఇతర ఫాస్ట్ఫుడ్ సెంటర్లను పరిశీలించారు. వంటశాలలు, చికెన్ బిర్యానీ తదితర ఆహార పదార్థాలను ఆయన పరిశీలించి శాంపిల్స్ను ల్యాబ్కు పంపించారు. ల్యాబ్లో నాణ్యత ప్రమాణాలు తగ్గినట్లు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదే విధంగా పాల విక్రయ కేంద్రాల్లో కల్తీ జరిగినట్లు రుజువు అయితే చర్యలు తప్పవన్నారు. కాగా, ఇంతకు ముందు కూడా కొత్త బస్టాండ్ సమీపంలోని గజ ఫుడ్కోర్టులో బిర్యానీలో బొద్దింక వచ్చింది. వినయోగదారుడి ఫిర్యాదు మేరకు అధికారులు తనిఖీలు చేపట్టారని.. మిగతా అన్ని హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాల్లో తనిఖీలు చేయాలని ప్రజలు కోరారు. ఈ సందర్బంగా ఫాస్ట్ఫుడ్ సెంటర్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. -
రోడ్డు ప్రమాదంలో జీహెచ్ఎం దుర్మరణం
వెల్దండ/తెలకపల్లి: రోడ్డు ప్రమాదంలో జీహెచ్ఎం మృతిచెందిన ఘటన వెల్దండ మండలం పెద్దాపూర్ సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. అచ్చంపేటకు చెందిన పాపిశెట్టి శ్రీనివాసులు (61) తెలకపల్లి పాఠశాలలో జీహెచ్ఎంగా విధులు నిర్వర్తిస్తున్నారు. పిల్లల చదువు నిమిత్తం కొంతకాలంగా ఆయన భార్య కమల తమ కుమార్తెతో కలిసి హైదరాబాద్లోని మన్నెగూడలో నివాసం ఉంటున్నారు. పాఠశాలకు సెలవులు వచ్చినప్పుడు శ్రీనివాసులు కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి వస్తుంటారు. ఈ క్రమంలో ఆదివారం హైదరాబాద్కు వెళ్లిన ఆయన.. సోమవారం కారులో తెలకపల్లి పాఠశాలకు బయలుదేరారు. మార్గమధ్యంలోని పెద్దాపూర్ సమీపంలో కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. ప్రమాదంలో అతడికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు 108 అంబులెన్స్లో కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్ఐ కురుమూర్తి తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. కాగా, జీహెచ్ఎం పాపిశెట్టి శ్రీనివాసులు ఈ నెల 30న ఉద్యోగ విరమణ పొందనున్నారు. వేసవి సెలవులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ నెల 17న తెలకపల్లి పాఠశాలలో పదవీ విరమణ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు, విద్యార్థుల నడుమ నిర్వహించారు. రోడ్డు ప్రమాదంలో జీహెచ్ఎం మృతితో పాఠశాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. పురుగుమందు తాగి వ్యక్తి ఆత్మహత్య మల్దకల్: అనారోగ్యంతో బాధపడుతూ మనస్థాపం చెంది ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం మండలంలోని ఎల్కూరులో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఎల్కూరు గ్రామానికి చెందిన వెంకటేష్ (42) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. ఈ నెల 17 రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు అపస్మారక స్థితిలో ఉన్న వెంకటేష్ను చికిత్స నిమిత్తం గద్వాల, అక్కడి నుంచి కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య పద్మ, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్కానిస్టేబుల్ పురేందర్ తెలిపారు. రంపంతో భర్త గొంతు కోసిన భార్య లింగాల: నిద్రలో ఉన్న భర్త గుండూర్ కురుమయ్య గొంతుపై భార్య చెన్నమ్మ రంపం బ్లేడ్తో గాయపర్చిన ఘటన సోమవారం మండలంలోని అవుసలికుంటలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్ఐ వెంకటేష్గౌడు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 19న భార్య చెన్నమ్మతో కుర్మయ్య గొడవపడ్డారు. అదే రోజు రాత్రి 11 గంటలకు చెన్నమ్మ రంపం బ్లేడ్తో ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న భర్తపై కుర్మయ్య గొంతు కోసింది. కుర్మయ్య అరుపులు విని పక్క ఇంటిలో ఉన్న అన్న వెంకటయ్య, ఆయన భార్య లక్ష్మి వెళ్లి చెన్నమ్మను పక్కకు తోసినట్లు ఎస్ఐ తెలిపారు. వెంటనే బాధితుడిని 108 అంబులెన్సులో లింగాల ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్ సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం నాగర్కర్నూల్ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. వెంకటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. కుటుంబ కలహాలతో వ్యక్తి బలవన్మరణం గోపాల్పేట: కుటుబ కలహాలు తట్టుకోలేక వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండల కేంద్రంలోని బండపల్లి కాలనీలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్ఐ నరేష్కుమార్ తెలిపిన వివరాల మేరకు.. గోపాల్పేటకు చెందిన గిరమ్మ, గోపాల్ దంపతుల పెద్దకుమారుడు మండ్ల రాములు(35)కు 15ఏళ్ల క్రితం నాగర్కర్నూల్ జిల్లా శ్రీపురం గ్రామానికి చెందిన లావణ్యతో పెళ్లయింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో లావణ్య వారి పుట్టింటి వద్దే ఉంటోంది. రాములు అప్పుడప్పుడు భార్య వద్దకు వెళ్లి వస్తుండేవాడు. గొడవల వల్ల జీవితంపై విరక్తి చెందిన రాములు సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని మరణించాడని మృతుడి తల్లి గిరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. -
బాలికపై అత్యాచారం
మద్దూరు: మైనర్ బాలికకు మాయ మాటలు చెప్పి అత్యాచారం చేసిన వ్యక్తిని పోలీసులు పట్టుకొని కోర్టులో హాజరుపర్చగా మెజిస్ట్రేట్ నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించినట్లు కోస్గి సీఐ సైదులు సోమవారం తెలిపారు. సీఐ కథనం మేరకు.. దామరగిద్ద మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక (17) మద్దూర్లో కంప్యూటర్ కోర్సు చేస్తోంది. దామరగిద్ద మండలానికి చెందిన బోయిని శ్రీనివాస్ (24) ఈ నెల 10న బాలికకు మాయమాటలు చెప్పి తన ద్విచక్ర వాహనంపై హైదరాబాద్కు తీసుకెళ్లాడు. అక్కడే ఓ కిరాయి రూంలో బాలికపై అత్యాచారం చేసి మరుసటి రోజు మద్దూరు బస్టాండ్లో వదిలిపెట్టాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని పట్టుకొని సోమవారం కోస్గి న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. ఈ మేరకు మెజిస్ట్రేట్ నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించగా.. మహబూబ్నగర్ సబ్ జైలుకు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. చెక్ బౌన్స్ కేసులో ఆరునెలల జైలుశిక్ష ఖమ్మం లీగల్: మహబూబ్నగర్కు చెందిన కుమ్మరి శేఖర్కు చెల్లని చెక్కు కేసులో ఆరు నెలల జైలు శిక్ష విధించడమే కాక ఫిర్యాదుదారుడికి రూ.7లక్షల పరిహారం చెల్లించాలని ఖమ్మం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కాసరగడ్డ దీప సోమవారం తీర్పు చెప్పారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకినేపల్లికి చెందిన వరికల వెంకటేశ్వరరావు వద్ద శేఖర్ రెండు దఫాలుగా రూ.5 లక్షల అప్పు తీసుకున్నాడు. తిరిగి చెల్లించే క్రమంలో 2018 డిసెంబర్లో రూ.7 లక్షలకు చెక్కు ఇచ్చాడు. కానీ ఆయన ఖాతాలో సరిపడా నగదు లేక చెక్కు తిరస్కరణకు గురైంది. ఈ మేరకు వెంకటేశ్వరరావు తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీస్ జారీ చేసి కోర్టులో ప్రైవేటు కేసు దాఖలు చేశారు. కేసు విచారణ అనంతరం శేఖర్కు జైలుశిక్ష విధించడంతో పాటు ఫిర్యాదికి రూ.7లక్షలు చెల్లించాలని న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. నిందితుడికి 14 రోజుల రిమాండ్ -
59 రోజులైనా లభించని కార్మికుల ఆచూకీ
అచ్చంపేట: ఎస్ఎల్బీసీ సొరంగంలో 59 రోజులుగా సహాయక చర్యలు నిరంతరాయంగా కొనసాగుతున్నా.. గల్లంతైన ఆరుగురి కార్మికుల జాడ లభించడం లేదు. 13.936 కి.మీ. వద్ద కంచె ఏర్పాటు చేసిన నిషేధిత డీ–1 ప్రదేశంలో 43 మీటర్లు మినహా మిగతా ప్రాంతంలో టీబీఎం ప్లాట్ఫాం భాగాలతో పాటు మట్టి, బురద, బండరాళ్లను తొలగించి బయటికి తరలిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సుమారు 450 మంది రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. పైకప్పు కూలిన ప్రదేశంలో పేరుకుపోయిన శిథిలాలను తొలగిస్తే.. మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉందని జీఎస్ఐ సర్వే విభాగం తేల్చిచెప్పడంతో అక్కడ ఇప్పట్లో పనులు చేపట్టే అవకాశం లేదు. సొరంగంలో ఏర్పడిన గండి నుంచి ఉబికి వస్తున్న నీటి ఊటను భారీ మోటార్ల సాయంతో బయటకు పంపింగ్ చేస్తున్నారు. సహాయక చర్యలు పూర్తయిన తర్వాత నీటిఊటను అలాగే వదిలేస్తే.. నిషేధిత ప్రాంతం మరింత బురదగా మారుతుందని రెస్క్యూ సిబ్బంది అభిప్రాయపడుతున్నారు. ప్రమాద ప్రదేశం నుంచి 324 మీటర్ల వరకు శిథిలాలు పేరుకుపోయి ఉండగా.. ఇప్పటి వరకు 281 మీటర్ల మేర మట్టి, బురద, బండరాళ్లు, టీబీఎం ప్లాట్ఫాంం భాగాలను తొలగించారు. 13.850 కి.మీ. నుంచి 13.936 కి.మీ. మధ్య సొరంగం పైకప్పు కూలిన ప్రదేశం క్రిటికల్ జోన్గా గుర్తించారు. 43 మీటర్ల వద్ద గల్లంతైన ఆరుగురి కార్మికులు ఉండవచ్చని భావిస్తున్నారు. ఎస్ఎల్బీసీ సొరంగంలో కొనసాగుతున్న సహాయక చర్యలు -
దేవరగుట్టలోనే చిరుతలు
నవాబుపేట: ఈ గుట్ట నాదే.. ఈ ప్రాంతం నాదే.. అనే చిరుత సినిమాలోని డైలాగ్ తరహాలో నవాబుపేట మండలం యన్మన్గండ్ల దేవరగుట్టపై చిరుతలు తిష్ట వేశాయి. సోమవారం గుట్ట పైభాగంలో ఓ చిరుత దర్జాగా కూర్చుని కనిపించింది. కాగా, గుట్టను ఆవాసంగా చేసుకున్న రెండు చిరుతలను బంధించేందుకు అటవీశాఖ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. నాలుగు రోజుల క్రితం గుట్టపై సీసీ కెమెరాలతో పాటు బోన్ ఏర్పాటు చేసినప్పటికీ చిరుతలు చిక్కడం లేదు. దేవరగుట్టలోనే చిరుతలు ఉండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సీసీ నిఘా మధ్య చిరుతలకు అటవీశాఖ అధికారులు గస్తీ ఏర్పాటు చేసినట్టుగా చిరుతల తీరు ఉందని చర్చించుకుంటున్నారు. -
సోషల్ మీడియా, ఏఐపై అప్రమత్తంగా ఉండాలి
కొల్లాపూర్: సంప్రదాయ మీడియా భవిష్యత్కు ప్రశ్నార్థకంగా మారిన సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ)పై అప్రమత్తంగా ఉండాలని, దీనిపై త్వరలోనే హైదరాబాద్లో జాతీయ స్థాయి వర్క్షాప్ నిర్వహిస్తామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే.శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. సోమవారం కొల్లాపూర్ మండలం సోమశిలలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఐ వల్ల భవిష్యత్లో మీడియా రంగంలో మానవ శక్తి అవసరం లేకుండా చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కల్పిత వార్తలు, కథనాలు, సమాచారాలతో సమాజాన్ని తప్పుదోవ పట్టించే ప్రమాదం పొంచి ఉందన్నారు. దీనిపై జర్నలిస్టులతో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. గత ప్రభుత్వం రూపొందించిన అక్రిడిటేషన్ జీఓ అప్రజాస్వామికంగా ఉందని కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం వల్ల కొత్త అక్రిడిటేషన్ జారీ ఆలస్యమవుతోందన్నారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డులు మంజూరు అవుతాయని తెలిపారు. సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు ప్రభుత్వాలు ఏవైనా జర్నలిస్టుల పక్షపాతిగా, జర్నలిస్టుల సంక్షేమం కోసం 65 ఏళ్లుగా పోరాడుతున్న చరిత్ర ఐజేయూదని స్టీరింగ్ కమిటీ సభ్యుడు దేవులపల్లి అమర్ అన్నారు. ఉద్యమాలతోనే జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. సంఘ నాయకులకు ప్రభుత్వ పదవులు వచ్చినంత మాత్రాన, సంఘ ప్రయోజనాలు, పదవుల బాధ్యతలు వేరుగా ఉంటాయని వివరించారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్అలీ మాట్లాడుతూ జర్నలిస్టుల ప్రధాన సమస్యలైన ఇళ్ల స్థలాలు, హెల్త్కార్డులు, అక్రిడిటేషన్ కార్డులు, ఉచిత విద్య అంశాలపై కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామనారాయణ, కార్యదర్శి వై.నరేందర్రెడ్డి, నగునూరి శేఖర్, కె.రాములు, బుర్ర సంపత్కుమార్ గౌడ్, గాడిపల్లి మధుగౌడ్, ఫైజల్ అహ్మద్, మధుగౌడ్, యాదగిరి, శ్రీకాంత్రెడ్డి, మోతే వెంకటరెడ్డి, జిల్లా అధ్యక్షుడు సుదర్శన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి -
గోడ కూలి వలస కూలీ మృతి
కొత్తపల్లి: బతుకుదెరువు కోసం హైదరాబాద్లో భవన నిర్మాణ కూలీగా పనిచేస్తున్న కొత్తపల్లి మండలంలోని భూనీడు గ్రామానికి చెందిన శివనోళ్ల రాంరెడ్డి (50) మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. భూనీడు గ్రామానికి చెందిన శివనోళ్ల రాంరెడ్డి ఆయన భార్య అనురాధతో కలిసి ఐదేళ్లుగా హైదరాబాద్లోని బుద్వేల్లో అద్దె ఇంట్లో ఉంటూ రోజువారీ కూలీగా జీవనం కొనసాగిస్తున్నాడు. ఆదివారం భవన నిర్మాణ పనులు చేస్తుండగా.. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఒక్కసారిగా గోడ కూలి పనిచేస్తున్న ఐదుగురు కూలీలపై పడింది. ఈ ఘటనలో గాయపడ్డ కూలీలను ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన భూనీడు గ్రామానికి చెందని రాంరెడ్డి చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మరణించాడు. అక్కడే పనిచేస్తున్న మృతుడి భార్య అనురాధకు కాలు విరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. సోమవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చారు. మృతుడికి 12 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. భార్యకు తీవ్ర గాయాలు -
నాన్‘లోకల్’ ఎక్కడ.?
తెలంగాణలో కన్నడ మీడియం.. ప్రశ్నార్థకం కృష్ణా: రాష్ట్ర సరిహద్దులోని కృష్ణా మండలం విభిన్న సంస్కృతీ సంప్రదాయాలకు నిలయం. ఇక్కడి ప్రజల వేషం, భాష, అలవాట్లు భిన్నంగా ఉంటాయి. అందుకే కృష్ణా మండలాన్ని మినీ ఇండియాగా కూడా పిలుస్తారు. ఇక్కడ నివసించే ప్రజలు వందకు 70 శాతం మంది కన్నడ భాషలో మాట్లాడుతారు. ప్రజల మాతృభాషకు అనుగుణంగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మండలంలోని ప్రతి గ్రామంలో కన్నడ మీడియం పాఠశాలలను ఏర్పాటు చేసింది. ఇక్కడ కన్నడ మీడియం చదివిన విద్యార్థులు ఉన్నత చదువుల నిమిత్తం తప్పనిసరిగా కర్ణాటకకు వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కేవలం పదోతరగతి వరకు మాత్రమే కన్నడ మీడియం ఉంది. మిగతా ఉన్నత చదువులు చదివేందుకు తెలంగాణలో ఎక్కడా అవకాశం లేకపోవడంతో కర్ణాటకకు వెళ్లక తప్పని పరిస్థితి ఉంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఏ ఉద్యోగ పోటీ పరీక్షలు రాయాలన్నా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇక్కడ చదివి ఉండాలనే నిబంధనలు ఉన్నాయి. దీంతో కర్ణాటకలో ఇంటర్ చదివిన విద్యార్థులు స్థానికతను కోల్పోతున్నారు. అటు కర్ణాటకలోనూ ఇవే నిబంధనలు ఉన్నాయి. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు స్థానికత అవసరం ఉంటుంది. ఇక్కడ పదో తరగతి వరకు చదివిన విద్యార్థులు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో నాన్లోకల్ కిందకు వస్తున్నారు. అక్కడ, ఇక్కడ విద్య, ఉద్యోగ అవకాశాలు రాక మధ్యలోనే చదువులు నిలిపివేస్తున్నారు. కన్నడ మీడియంలో 871 మంది విద్యార్థులు.. కృష్ణా ఉన్నత పాఠశాలలో 270 మంది, తంగిడి ప్రాథమికోన్నత పాఠశాలలో 170, చేగుంటలో 120, క్రిష్ణ ప్రాథమిక పాఠశాలలో 60, గుర్జాల్లో 70, కుసుమర్తిలో 40, ఐనాపూర్లో 36, హిందూపూర్ 80, గుడెబల్లూర్లో 25 మందితో కలిపి మొత్తం 871 మంది విద్యార్థులు కన్నడ మీడియం చదువుతున్నారు. ప్రతి విద్యాసంవత్సరం 200 నుంచి 250 మంది విద్యార్థులు 10వ తరగతి పూర్తి చేసుకొని ఉన్నత చదువులకు కర్ణాటకకు వెళ్తుంటారు. వీరిని అక్కడ నాన్లోకల్గా పరిగణిస్తున్నారు. తెలంగాణలోనూ నాన్లోకల్ కింద రాష్ట్ర ప్రభుత్వం పరిగణిస్తుంది. దీంతో చాలా మంది విద్యార్థులు ప్రతిభ ఉన్నప్పటికీ.. నాన్లోకల్ కారణంగా విద్య, ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నారు. కృష్ణా స్కూల్కు రూ. 10లక్షలు మంజూరు.. కృష్ణాలోని కన్నడ మీడియం ఉన్నత పాఠశాలలో అదనపు గదుల నిర్మాణం కోసం కర్ణాటక ప్రభుత్వం రూ. 10లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులతో భవన నిర్మాణం పూర్తయింది. దీంతో పాటు కన్నడ భాషకు సంబంధించిన పాఠ్య పుస్తకాలను ప్రతి సంవత్సరం కర్ణాటక ప్రభుత్వం కృష్ణా మండలంలోని కన్నడ మీడియం పాఠశాలలకు సరఫరా చేస్తోంది. ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నాం.. నేను 1994–95లో కృష్ణా ఉన్నత పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసుకొని కర్ణాటకలోని రాయచూర్లో ఉన్నత విద్యాభ్యాసం పూర్తిచేశాను. 1998లో టీటీసీ చేసేందుకు ప్రయత్నించగా.. అక్కడి ప్రభుత్వం నాన్లోకల్ కారణంగా టీటీసీలో అవకాశం కల్పించలేదు. 2002లో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం రాగా.. అప్పడు కూడా నాన్లోకల్ కారణం చూపుతూ ఉద్యోగం ఇవ్వలేదు. నాలా చాలా మంది నష్టపోతున్నారు. తెలంగాణలోని కన్నడ మీడియం పాఠశాలల మూలంగా ఇటు తెలంగాణ, అటు కర్ణాటకలో నష్టపోతున్నాం. ఈ విషయంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తగు నిర్ణయం తీసుకోవాలి. – భీంసీ, కృష్ణా బడుల బలోపేతానికి కృషి.. రాష్ట్రంలోని కన్నడ మీడియం పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తున్నాం. అందుకు అటు కర్ణాటక, ఇటు తెలంగాణ ప్రభుత్వంతో పోరాడుతున్నాం. గతంలో కృష్ణా ఉన్నత పాఠశాలలో అదనపు గదుల నిర్మాణానికి కర్ణాటక ప్రభుత్వం నిధులు కేటాయించింది. గడినాడ విద్యార్థులకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో ‘వరనాడు’ ద్వారా ప్రత్యేక రిజర్వేషన్లు అమలుచేస్తుంది. దాంతో పాటు హాస్టల్ సౌకర్యం, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశాం. – రాంలింగప్ప, గడినాడ కన్నడ సంఘం అధ్యక్షుడు, కున్సీ పోరాడుతున్నాం.. కన్నడ భాషపై ఉన్న అభిమానంతో తాము కన్నడ మీడియం పాఠశాలలను అన్నివిధాలుగా అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తున్నాం. మూతపడిన రెండు కన్నడ మీడియం పాఠశాలలను పునఃప్రారంభించేందుకు స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఆయన చొరవతో ఆ పాఠశాలలను త్వరలోనే పునరుద్ధరిస్తాం. – నిజాముద్దీన్, ఎంఈఓ, గడినాడ కన్నడ సంఘం గౌరవాధ్యక్షుడు, కృష్ణా స్థానికత కోసం కర్ణాటకకు ఇక్కడి విద్యార్థులు రాష్ట్ర సరిహద్దులో ఆదరణ కోల్పోతున్న పాఠశాలలు ఇప్పటికే రెండు ప్రాథమిక పాఠశాలలు మూత గడినాడ ఉద్యమంతో కర్ణాటక ప్రభుత్వంలో చలనం.. కన్నడ భాషపై అభిమానంతో ఈ ప్రాంతంలోని నాయకులు, ఉపాధ్యాయులు గడినాడ (రాష్ట్ర సరిహద్దులోని ప్రాంతం) కన్నడ సంఘం ఏర్పాటు చేసుకొని కర్ణాటక ప్రభుత్వంతో అవిశ్రాంతంగా పోరాడుతున్నారు. ఫలితంగా కొంతకాలం క్రితం కన్నడ మీడియం చదివిన ఇతర రాష్ట్ర విద్యార్థులకు కర్ణాటకలో విద్య, ఉద్యోగ అవకాశాల్లో 5శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని అక్కడి ప్రభుత్వం జీఓ జారీ చేసింది. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం 5 శాతం రిజర్వేషన్లు అమలు చేయకపోవడంతో గడినాడ కన్నడిగులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. -
పది రోజుల తర్వాత కోసేదుండే
నాకు సొంతంగా మా గ్రామంలో 2.75 ఎకరాల భూమి ఉంది. ఆ పొలంలో వరి పంట వేసిన. ఇంకో 10–15 రోజులైతే వరి పూర్తిగా కోతకు వచ్చేది. వాన భయంతో ముందుగానే కోయించిన. కొంత పొల్లు పోయినా వాన పడితే ఇత్తు చేతికి రాదనే భయంతోనే కోయించిన. ఏం చేస్తాం బాకీ ఉన్న కాడికి అయితాయి. ఇంకా 10 రోజులు ఉంచితే చేతికొస్తదనే గ్యారంటీ లేదాయే. నేనే కాదు చాలా మంది పచ్చి చేలనే కోయిస్తుండ్రు. – బోయ నర్సిములు, రైతు, మాచన్పల్లి గ్రామం, మహబూబ్నగర్ రూరల్ ఎర్రబడక ముందే కోస్తే నష్టం వరి పంటలు పూర్తిగా ఎర్రబడక ముందే కోయడం వల్ల నష్టం వాటిల్లుతుంది. వరి గొలుసులు 85 నుంచి 90 శాతం వరకు ఎర్రబడ్డ తర్వాతనే కోస్తే దిగుబడి మంచిగా వస్తుంది. వానల భయంతో రైతులు పూర్తిగా గొలుసు కాకముందే కోస్తుండడం వల్ల చాలా వరకు గింజలు తాలు పోయే పరిస్థితి ఉంటుంది. – బి.వెంకటేష్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి ● -
ఎండీసీఏ మైదానంలో ‘టర్ఫ్ వికెట్’
మహబూబ్నగర్ క్రీడలు: మహబూబ్నగర్ జిల్లా క్రికెట్ సంఘం (ఎండీసీఏ) ఆధ్వర్యంలో టర్ఫ్ వికెట్ పిచ్లు సిద్ధం చేస్తున్నారు. జిల్లాకేంద్రం పిల్లలమర్రి సమీపంలోని ఈ మైదానంలో క్రీడాకారుల సౌకర్యార్థం చాలా వసతులు అందుబాటులోకి వస్తున్నాయి. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)కు ఉన్న ఏకై క క్రీడా మైదానమిది. ఇప్పటికే ఇక్కడ క్రీడాకారుల ప్రాక్టీస్ కోసం దాతల సహకారంతో నెట్, రెండు బౌలింగ్ యంత్రాలతో పాటు పెవిలియన్ భవనాన్ని ఏర్పాటు చేశారు. ● క్రికెట్లో టర్ఫ్ వికెట్(పిచ్)లకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. కేవలం మ్యాట్ల మీద క్రికెట్ ఆడే క్రీడాకారులకు టర్ఫ్ వికెట్పై ఆడాలంటే మెరుగైన ప్రాక్టీస్ ఉండాల్సిందే. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఔత్సాహిక ఉమ్మడి జిల్లా క్రికెట్ క్రీడాకారులకు కల నెరవేరనుంది. గతేడాది ఎండీసీఏ మైదానంలో వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం ప్రారంభోత్సవంలో పలువురు హెచ్సీఏ ప్రతినిధులు పాల్గొనగా మైదానంలో టర్ఫ్ వికెట్ ఏర్పాటు కోసం ఎండీసీఏ ప్రతినిధులు వారి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో హెచ్సీఏ రూ.60 లక్షలు కేటాయించగా.. కొన్ని రోజులుగా పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అదే విధంగా మైదానం మొత్తం పచ్చగడ్డి (గ్రీనరీ)ని ఏర్పాటు చేస్తున్నారు. మైదానంలో వర్షపు నీరు నిలువకుండా ఎత్తు పెంచి చుట్టూ అండర్గ్రౌండ్ పైప్లైన్ వేస్తున్నారు. త్వరలో ఎండీసీఏ మైదానంలో మూడు టర్ఫ్ వికెట్ పిచ్లు అందుబాటులోకి రానున్నాయి. ● టర్ఫ్ వికెట్ పిచ్పైనే జాతీయ, అంతర్జాతీయస్థాయిలో మ్యాచ్లు ఆడుతారు. ఇంతకాలం మ్యాట్పై ఆడే జిల్లా క్రీడాకారులు టర్ఫ్ వికెట్ అందుబాటులోకి వస్తే వారి ఆటతీరు మరింత మెరుగు పడే అవకాశం ఉంటుంది. హెచ్సీఏ రాష్ట్రస్థాయి టోర్నీల్లో జిల్లా క్రీడాకారులు మరింతగా రాణించవచ్చు. రంజీస్థాయిలో ఆడేలా జిల్లా క్రీడాకారులను తీర్చిదిద్దవచ్చు. ఎండీసీఏ మైదానంలో టర్ఫ్ వికెట్ ఏర్పాటయితే భవిష్యత్లో రాష్ట్రస్థాయి మ్యాచ్లతో పాటు రంజీ మ్యాచ్లు జరిగే అవకాశం ఉంది. త్వరలో మూడు పిచ్లు అందుబాటులోకి.. మైదానం మొత్తం గ్రీనరీ ఏర్పాటు భవిష్యత్లో రంజీ మ్యాచ్లకు వేదిక కానున్న పాలమూరు -
స్థానిక సంస్థల్లో దివ్యాంగులకు ప్రాతినిధ్యం కల్పించాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): రాష్ట్రంలో దివ్యాంగులకు స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మల్లికార్జున్ డిమాండ్ చేశారు. ఆదివారం తెలంగాణ చౌరస్తాలోని రెడ్క్రాస్ సొసైటీ భవనంలో దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక ఉమ్మడి జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ణగారిన వర్గాలలో ఉన్న దివ్యాంగులు అధికారం కలిగిన సంస్థల్లో భాగం కావడానికి చట్టపర అధికారాలతో స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్లలో దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దివ్యాంగులందరూ అందరూ ఉద్యమాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా రాజశేఖర్ను ఎన్నుకున్నారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెస్త యాదగిరి, జాతీయ ఉపాధ్యక్షుడు కుమార్, నాయకులు హరీశ్కుమార్, దేవేందర్ ప్రసాద్, విజయ్, రామకృష్ణారెడ్డి, బాలపీర్, భీమ్సాగర్, మంగమ్మ, వెంకటయ్య, మధురాజు, జనార్దన్, సుదర్శన్, నారాయణమ్మ పాల్గొన్నారు. -
చురుగ్గా సాగుతున్న పనులు..
ఎండీసీఏ మైదానంలో టర్ఫ్ వికెట్ పిచ్ ఏర్పాటు చేయాలనే కల నెరవేరబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. గతే డాది హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్కు టర్ఫ్ వికెట్ కోసం విన్నవించగా వారు సానుకూలంగా స్పందించారు. మైదానంలో టర్ఫ్ వికెట్ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. క్రీడాకారులకు మెరుగైన క్రికెట్ శిక్షణ లభిస్తుంది. హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్కు కృతజ్ఞతలు – ఎం.రాజశేఖర్, ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ● -
డంపింగ్ యార్డుకు కొత్త రోడ్డు
డంపింగ్ యార్డు వరకు పూర్తయిన ఫార్మేషన్ రోడ్డు మహబూబ్నగర్ మున్సిపాలిటీ: కోయిల్కొండ ఎక్స్ రోడ్డులోని డంపింగ్ యార్డును ఆనుకుని కొన్ని నెలలుగా కొనసాగుతున్న భూత్పూర్–చించోళి ఎన్హెచ్ పనులతో అప్రోచ్ రోడ్డును పూర్తిగా తొలగించారు. అసలే అంతంత ఆదాయ వనరులున్న మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్కు కొత్త రోడ్డు నిర్మాణంతో అదనపు భారం పడింది. ఒకవైపు నగరంలో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్న క్రమంలో కాంట్రాక్టర్లకు ఎప్పటికప్పుడు పూర్తిస్థాయిలో బిల్లులు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు డంపింగ్ యార్డు వద్ద అడ్డుగా ఉన్న పెద్ద గుట్టను తవ్వి 200 ఫీట్ల వెడల్పుతో జాతీయ రహదారిని నిర్మిస్తున్నారు. ఈ పనులు నిర్విరామంగా జరుగుతుండటంతో డంపింగ్ యార్డు చేరుకోవడానికి కొత్త అప్రోచ్ రోడ్డు కోసం 2024–25 మున్సిపల్ బడ్జెట్లో రూ.35 లక్షలు కేటాయించారు. తాజాగా 2025–26 బడ్జెట్లో రూ.88 లక్షలు మంజూరు చేశారు. ఇలా మొత్తం రూ.1.23 కోట్లు వెచ్చిస్తున్నారు. ఎన్హెచ్ కోసం తొలగించడంతో.. వాస్తవానికి కోయిల్కొండ ఎక్స్ రోడ్డు మొదలుకుని 300 మీటర్ల వరకు గతంలోనే సీసీ రోడ్డు ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి నేరుగా డంపింగ్ యార్డు చేరుకోవడానికి కేవలం 50 మీటర్ల దూరమే ఉండేది. అది కాస్తా ఎన్హెచ్ కోసం తొలగించడంతో కొత్తగా అప్రోచ్ రోడ్డు కోసం పలుమార్లు ఉన్నతాధికారులతో కలిసి మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. చివరకు ఎన్హెచ్ కింది నుంచి మూడు మలుపులతో ఉండేలా మొదట ఫార్మేషన్ రోడ్డు పూర్తి చేశారు. ఇదంతా గుట్ట ప్రదేశం కావడంతో సీసీ కోసం రిటైనింగ్ వాల్ తప్పనిసరి అయింది. కనీసం దీని పొడవు 550 మీటర్లు ఉంటుందని అంచనా వేశారు. ఈ పనులు మొత్తం వర్షాకాలం వచ్చేలోపు పూర్తి చేయాలని నిర్ణయించారు. గత సీజన్లో వర్షాలు కురిసినప్పుడు తడి, పొడి చెత్త లోడ్తో స్వచ్ఛ ఆటోలు, మున్సిపల్ ట్రాక్టర్లు, ఇతర వాహనాలు డంపింగ్ యార్డు వరకు చేరుకోవడానికి ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచి గుంతలు పడటంతో పైకి ఈ వాహనాలు వెళ్లడానికి చివరకు జేసీబీల సాయం తీసుకోవాల్సి వచ్చింది. ఇక గుట్టపై నుంచి ప్రత్యామ్నాయంగా వంతెన నిర్మిద్దామన్నా ఎన్హెచ్ఏఐ అధికారులు ఇంకా రోడ్డు కోసం గుట్టను పెద్ద ఎత్తున కనీసం 50 మీటర్ల లోతుకు తవ్వుతూనే ఉన్నారు. దీంతో ఇప్పట్లో వంతెన పనులు చేపట్టడం సాధ్యం కాదని తేలింది. అయితే స్ట్రక్చర్ డామేజీ కింద మున్సిపల్ కార్పొరేషన్కు కేవలం రూ.ఐదు లక్షలే పరిహారం చెల్లించడం గమనార్హం. ఎన్హెచ్ పనులతో పాతది పూర్తిగా తొలగింపు 2 విడతలుగా రూ.1.23 కోట్ల వ్యయం మున్సిపల్ కార్పొరేషన్కు వచ్చిన పరిహారం రూ.5 లక్షలే నగర పాలక సంస్థపైనే పడిన అదనపు భారం -
డీ–1 ప్రదేశంలో తవ్వకాలు
అచ్చంపేట: ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదం జరిగిన డీ–1 ప్రదేశంలో మరో 25 మీటర్లు మేర శిథిలాలను తొలగించేందుకు రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. డీ–2 ప్రదేశంలో శిథిలాలు, మట్టి తొలగింపు పనులు దాదాపుగా పూర్తికావడంతో గల్లంతైన కార్మికులు నిషేధిత ప్రదేశంలోనే ఉన్నట్లు సహాయక బృందాల ఉన్నతాధికారులు నిర్ధారణకు వచ్చారు. డేంజన్ జోన్లో ఇప్పట్లో సహాయక చర్యలు చేపట్టే అవకాశం కనిపించడం లేదు. గత ఫిబ్రవరి 22న సొరంగంలో ప్రమాదం జరిగిన నాటి నుంచి 58 రోజులపాటు నిరంతరాయంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆదివారం నిషేధిత ప్రదేశం సమీపంలో మట్టి, రాళ్లు, శిథిలాల తొలగింపు పనులు చేపట్టారు. ఆ ప్రదేశంలో టీబీఎం భాగాలు కత్తిరించే పని ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. కీలకమైన స్టీల్ భాగాలను తొలగిస్తే మరో వారం రోజుల్లో శిథిలాల తొలగింపు పనులు పూర్తవుతాయని సిబ్బంది చెబుతున్నారు. గల్లంతైన కార్మికుల ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి మైన్స్ రెస్క్యూ సిబ్బంది, హైడ్రా, దక్షిణమధ్య రైల్వే, ఆర్మీ వంటి 12 విభాగాలకు చెందిన 450 మంది సిబ్బంది నిరంతరాయంగా శ్రమిస్తున్నారు. షిఫ్ట్ల వారీగా కొంత మంది సిబ్బంది వెళ్లిపోగా.. వారి స్థానంలో కొత్తవారు వచ్చి సహాయక చర్యలు చేపడుతున్నారు. థర్మల్ కట్టర్తో కట్ చేసిన టీబీఎం స్టీల్ భాగాలు, బండరాళ్లను లోకో ట్రైన్ ద్వారా.. మట్టి, బురదను కన్వేయర్ బెల్టుపై సొరంగం బయటకు తరలిస్తున్నారు. సొరంగం పైకప్పు కూలిన ప్రదేశం నుంచి ఉబ్బికి వస్తున్న నీటి ఊటను 150 హెచ్పీ సామర్థ్యం కలిగిన మోటార్లతో బయటకు తోడేస్తున్నారు. -
బైక్తో ఢీ.. వ్యక్తి మృతి
మహబూబ్నగర్ క్రైం: రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని ద్విచక్ర వాహనదారుడు వేగంగా ఢీకొట్టడంతో తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. రూరల్ ఎస్ఐ విజయ్కుమార్ కథనం ప్రకారం.. జిల్లాకేంద్రంలోని షాషాబ్గుట్టకు చెందిన ముక్తార్ బేగ్(56) శనివారం రాత్రి 10.30గంటల ప్రాంతంలో పట్టణంలోని విద్యుత్ ఆఫీస్ ఎదుట రోడ్డు దాటుతున్న క్రమంలో టంకరకు చెందిన శ్రీరామ్ బైక్పై వేగంగా వచ్చి ఢీకొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ముక్తార్బేగ్ను జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించగా అక్కడే చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడి భార్య నఫిస్ సుల్తానా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. సర్వీస్ వైరు సరిచేస్తుండగా.. విద్యుదాఘాతం మహబూబ్నగర్ క్రైం: విద్యుత్ తీగలపై చెట్టు కొమ్మలు తొలగించే కూలీ ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. వన్టౌన్ సీఐ అప్పయ్య కథనం ప్రకారం..హన్వాడ మండల టంకర గ్రామానికి చెందిన వర్లదాసు(51)కొన్ని రోజుల నుంచి విద్యుత్ శాఖకు చెందిన విద్యుత్ తీగలకు చెట్లు ఉన్న ప్రాంతాల్లో వాటిని తొలగించడం కోసం కాంట్రాక్టర్ పవన్కుమార్ వద్ద దినసరి కూలీగా పని చేస్తున్నాడు. అయితే ఆదివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో జిల్లాకేంద్రంలోని రాం మందిర్ చౌరస్తా ఏరియాలో చెట్లు విద్యుత్ తీగలకు సమీపంలో ఉండటంతో.. కొమ్మలు తొలగిస్తున్న క్రమంలో కొన్ని కొమ్మలు తీగలపై పడ్డాయి. దీంతో వర్లదాస్ విద్యుత్ సరఫరా బంద్ చేసి.. స్తంభం ఎక్కి తొలగిస్తున్న క్రమంలో ఓ సర్వీస్వైర్ తెగిపోయింది. దానిని తిరిగి అతికిస్తున్న సమయంలో ఒక ఇంటికి ఉన్న ఇన్వేటర్ ద్వారా సర్వీస్ వైర్ నుంచి విద్యుత్ సరఫరా కావడంతో షాక్ తగిలి స్తంభంపైనే మృతి చెందాడు. మృతుడు భార్య వర్ల దానమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ● స్తంభంపైనే మృతి చెందిన దినసరి కూలీ -
బైక్లో చెలరేగిన మంటలు
● కిందపడి ఒకరి దుర్మరణం.. మరొకరికి తీవ్రగాయాలు వంగూరు: ఊహకు అందని విధంగా ఒక్కసారిగా బైక్లో మంటలు చెలరేగడంతో అదుపుతప్పి కిందపడింది. బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరిలో ఒకరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన వంగూరు స్టేజీ సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ మహేందర్ వివరాల మేరకు.. హైదరాబాద్ మెహదీపట్నానికి చెందిన జునాయత్ (27) ఇబ్రహీంలు బైక్పై శ్రీశైలం బయల్దేరారు. మార్గమధ్యంలోని వంగూరు స్టేజీ సమీపంలోకి చేరుకున్న బైక్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బైక్ నడుపుతున్న జునాయత్ మంటల నుంచి తప్పించుకునే క్రమంలో అదుపుతప్పి కిందపడటంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ఇబ్రహీంకు తీవ్రగాయాల కావడంతో స్థానికులు చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. బైక్ పూర్తిగా దగ్ధమైంది. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చిన్నచింతకుంట: గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలోని ఉంద్యాల సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ రాంలాల్నాయక్ కథనం మేరకు.. మక్తల్ మండలం వనైకుంటకు చెందిన ఊట్కూర్ ఆశప్ప (55) ఆదివారం తన ద్విచక్ర వాహనంపై ఉంద్యాలలోని బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యానికి హాజరయ్యాడు. కార్యక్రమం ముగించుకొని తిరిగి వెళ్తుండగా గ్రామ శివారులో గుర్తు తెలియని వాహనం ఢీకొంది. గమనించిన గ్రామస్తులు వెంటనే బంధువులు, కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చి 108 వాహనంలో చికిత్స నిమిత్తం మహబూబ్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. టిప్పర్ను ఢీకొట్టిన ఆటో.. డ్రైవర్ దుర్మరణం మహమ్మదాబాద్: ఎదురెదురుగా టిప్పర్, ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతిచెందిన ఘటన మహమ్మదాబాద్ మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. హన్వాడ మండలం షేక్పల్లి ఎల్లంబాయి తండాకు చెందిన సునీల్ (20) ఆటో తీసుకుని షేక్పల్లి నుంచి మహమ్మదాబాద్ వైపు వస్తుండగా.. నంచర్ల క్రాస్రోడ్డు వద్ద టైరు పగిలింది. ఈ క్రమంలో ఆటో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న టిప్పర్ వైపు దూసుకెళ్లి ఢీకొట్టింది. ప్రమాదంలో ఆటో డ్రైవర్ సునీల్కు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తల్లి మంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ శేఖర్రెడ్డి తెలిపారు. మృతదేహం లభ్యం వనపర్తి రూరల్: జిల్లా కేంద్రంలోని నల్లచెరువులో ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పట్టణ ఎస్ఐ హరిప్రసాద్ వివరాల మేరకు.. నల్లచెరువులో వ్యక్తి మృతదేహాన్ని గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకొని వెలికితీశారు. సదరు వ్యక్తి వయసు 40 ఏళ్లు ఉంటాయని, నాలుగు రోజుల క్రితం చెరువులో పడి ఉంటాడని ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని జిల్లా మార్చురీకి తరలించినట్లు పేర్కొన్నారు. ఆ వ్యక్తి గోదుమ కలర్ నలుపు గీతల షర్ట్, నీలం రంగు ఫ్యాంట్ ధరించి ఉన్నాడని.. ఎవరైనా గుర్తిస్తే 87126 70612 నంబర్ను సంప్రదించాలని ఎస్ఐ తెలిపారు. -
వరి కోతల్లో జాగ్రత్తలు తప్పనిసరి
కోస్గి: యాసంగి వరి పంటలు కోత దశకు చేరుకోగా.. ముందుగా సాగుచేసిన పంటల కోతలు ప్రారంభమయ్యాయి. వరి కోతలు, కోతల అనంతరం కొన్ని మెళకువలు పాటిస్తే నాణ్యమైన దిగుబడి పొందవచ్చని నారాయణపేట జిల్లా వ్యవసాయశాఖ అధికారి జాన్ సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు, జాగ్రత్తలు వివరించారు. ● పొలంలో 80 నుంచి 90 శాతం వరి వెన్నులు పసుపురంగుకు మారుతున్న సమయంలో పంట కోయాలి. పూర్తిగా ఎండిపోయే వరకు ఉంచరాదు. ఈ దశలో గింజల్లో 18 నుంచి 20 శాతం తేమ ఉంటుంది. ● కోత ఆలస్యమైతే గింజ పగుళ్లు వచ్చి ధాన్యం నూకలయ్యే ప్రమాదం ఉంది. ● గింజల్లో తేమశాతాన్ని తగ్గించడానికి 2 నుంచి 3 రోజులు మెదను ఎండనివ్వాలి. ఒకవేళ వర్షం కురిసి తడిస్తే 5 శాతం ఉప్పు ద్రావణాన్ని వరిపై పిచికారీ చేయాలి. ● వరి కోత యాంతాలతో కోతలు చేస్తే దుమ్ము, మట్టిపెడ్డలు ధాన్యంలో కలవకుండా జాగ్రత్త పడాలి. రెండు వేర్వేరు రకాల ధాన్యం కలవకుండా చూసుకోవాలి. పంట కోతల తర్వాత.. ● ధాన్యాన్ని తుర్పారబట్టి చెత్త, మట్టి, రాళ్లు వేరు చేయాలి. ● తుర్పారబట్టిన ధాన్యంలో తేమశాతం 12 నుంచి 14 వరకు తగ్గే వరకు ఆరబెట్టాలి. ఈ విధంగా చేయడంతో ధాన్యం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ● చౌడు నేలల్లో పండించిన ధాన్యాన్ని మంచి ధాన్యంతో కలపరాదు. ● చీడపీడలు ఆశించినా, రంగు మారినా జాగ్రత్తలు తీసుకోవాలి. ధాన్యంలో కలుపు మొక్కల గింజలు లేకుండా చూడాలి. నిల్వలో జాగ్రత్తలు.. ● ధాన్యాన్ని నిల్వ చేసేటప్పుడు అధిక తేమశాతం లేకుండా చూసుకోవడం మంచిది. ●ఽ ధాన్యాన్ని ఆశించే కీటకాల నుంచి రక్షణ కోసం పరిసరాల్లో పొగబెట్టాలి. ● శుభ్రమైన గోనె సంచులు, గుమ్ముల్లో ధాన్యం నిల్వ చేయాలి. అదేవిధంగా ఎలుకలు, సూక్ష్మ జీవులు ఆశించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ● ధాన్యం నిల్వ చేసే ప్రదేశం తడి లేకుండా, బస్తాలకు చిల్లులు లేకుండా చూసుకోవాలి. పాడి–పంట చిన్నపాటి మెళకువలతో నాణ్యమైన దిగుబడి -
కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలకు..
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థులు కష్టపడి చదివితే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుతారని పీయూ అకాడమిక్ ఆడిట్సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్ పేర్కొన్నారు. ఈమేరకు పీయూలో ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కెమిస్ట్రీ పూర్తి చేసిన విద్యార్థులు మంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకుని జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు కృషి చేయాలన్నారు. రీసెర్చ్ కెరీర్ను ఎంచుకోవడం వల్ల మిగతా విద్యార్థుల కంటే కూడా జీవితంలో త్వరగా స్థిరపడేందుకు అవకాశాలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో హెచ్ఓడీ రవికుమార్, శ్రీధర్రెడ్డి, రామ్మోహన్, జ్ఞానేశ్వర్, సిద్దరామగౌడ్, రామరాజు, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ రవికాంత్ తదితరులు పాల్గొన్నారు. 20 మంది టీచర్లకు స్పౌజ్ బదిలీలు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: 317 జీఓలో గతంలో ఇబ్బందులకు గురైన స్పౌజ్ ఉపాధ్యాయులకు త్వరలో బదిలీ చేయాలని ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. భార్య ఒక జిల్లాలో, భర్త మరో జిల్లాలో విధులు నిర్వహిస్తున్న వారు గతంలో తమకు బదిలీ చేయాలని దరఖాస్తులు చేసుకున్నారు. ఇటీవల మంత్రి వర్గ ఉపసంఘం ఈ అంశంపై నిర్ణయం తీసుకుని బదిలీలకు ఆమోదం తెలిపింది. మొత్తంగా మహబూబ్నగర్ జిల్లాకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి మొత్తం 20 మంది బదిలీపై రానున్నారు. పాత ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన రంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, గద్వాల జిల్లాల నుంచి మహబూబ్నగర్కు బదిలీ కానున్నారు. కాగా 8 మంది టీచర్లు ఇక్కడి నుంచి ఇతర జిల్లాలకు బదిలీ కానున్నారు. ఇటీవల డీఎస్సీ ద్వారా ప్రభు త్వం చాలా పోస్టులు భర్తీ చేసింది. ఖాళీలు ఎక్కువ లేని క్రమంగా మహబూబ్నగర్ జిల్లాకు వచ్చే ఉపాధ్యాయులకు బై పోస్టుల కింద భర్తీ చేయాలని ప్రభుత్వం సూచించింది. ఈ విషయంపై డీఈఓ ప్రవీణ్కుమార్ను వివరణ కోరగా.. 20 మంది ఉపాధ్యాయులకు అన్ని పరిశీలించి ఈ నెల 22లోగా బదిలీ ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పటిష్టం జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): రాష్ట్ర ప్రభు త్వం విద్య వ్యవస్థను పటిష్టం చేసేందుకు కృషి చేస్తోందని విద్యా కమిషన్ సభ్యుడు చారకొండ వెంకటేశ్ అన్నారు. ఆదివారం ఆయన జిల్లాకేంద్రంలో మాట్లాడుతూ ప్రభుత్వం విద్యాపరంగా అనేక మార్పులు తెస్తోందని, ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టిందన్నారు. యాదవులు తమ పిల్లలను బాగా చదివించాలన్నారు. చదువు ద్వారానే సమాజంలో గుర్తింపు వస్తుందన్నారు. చదువు ఉంటేనే ఈ పోటీ ప్రపంచంలో అవకాశాలు లభిస్తాయ ని పేర్కొన్నారు. ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే విద్యతోనే అది సాధ్యమవుతుందని ప్రతి ఒక్కరూ నమ్మాలన్నారు. కార్యక్రమంలో యాదవ సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటనర్సయ్య, నాయకులు నాచా శ్రీనివాస్ యాదవ్, యువజన సంఘం జిల్లా కార్యదర్శి చందుయాదవ్, కృష్ణ, ప్రవీణ్, గోపాల్ పాల్గొన్నారు. -
ప్రపంచ దేశాల్లో శాంతి కరువు
జడ్చర్ల టౌన్: ప్రపంచంలోని ఏ దేశంలో చూసినా హింస, విధ్వంసం, దుఃఖం గోచరిస్తుందని ఉదయమిత్ర అనువాదించిన సొంతూరు కవితల ద్వారా మరోసారి అవగతమవుతుందని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ఆదివారం పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో జడ్చర్ల పట్టణంలోని డాక్టర్ బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కవి ఉదయమిత్ర అనువాదించిన సొంతూరు, అవిలివల పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోని ఏ దేశంలో అయినా శాంతి కరువైందని.. హింస, ప్రాణనష్టం, కోల్పోతున్న విలువలు, యుద్ధ వాతావరణం కనిపిస్తున్నాయన్నారు. దేశాల పరిస్థితులపై ప్రపంచవ్యాప్తంగా కవులు స్పందిస్తున్నారని.. వారి కవిత్వంలో మానవీయ విలువలు గోచరిస్తున్నాయన్నారు. అమానవీయ ప్రపంచంలో ఉన్నట్టుగా కవులు బలంగా తమ వాదనలు వినిపిస్తున్నారని.. వారు క్షుణ్ణంగా జీవితానుభవాలను వెలిబుచ్చుతున్నారని అన్నారు. ఆయా దేశాల కవులు రచించిన కవితలు, రచనలను ఉదయమిత్ర సొంతూరులో అనువాదించడం అభినందనీయమన్నారు. సాహిత్యం చరిత్ర చూస్తే 1930లో గొప్పగా కనిపిస్తుందన్నారు. ఆ కాలంలో శ్రీశ్రీది విప్లవ కవిత్వం అయితే.. కృష్ణశాస్త్రిది భావకవిత్వమన్నారు. అయితే కాలక్రమేణ భావకవిత్వం కనుమరుగైందని.. ఇప్పుడు అలాంటివారు కనిపించరన్నారు. ప్రకృతి రమణీయతను వర్ణించే కవులు లేరన్నారు. ప్రస్తుతం ప్రకృతిలోని విధ్వంసాన్ని చూస్తున్నామని, కవులు వినిపిస్తున్నారన్నారు. అవిలివలలో సాంకేతికత వల్ల జరిగిన నష్టం గురించి వివరించారన్నారు. ఏఐ ద్వారా భవిష్యత్ ఏమవుతుందో అర్థం కావడం లేదన్నారు. టెక్నాలజీ అమానవీయంగా మారితే ఎలాంటి దుష్ప్రరిణామాలు సంభవిస్తాయో అంతుపట్టకుండా ఉందన్నారు. సాంకేతికత విధ్వంసం సృష్టించడం ఖాయమన్నారు. వాస్తవ జీవితంలో కలిగిన సంఘటనలు, అనుభవాలను కవితల రూపంలో ఉదయమిత్ర తీసుకువచ్చారని కొనియాడారు. కాగా, సొంతూరు పుస్తకాన్ని శ్రీరామ్ పుష్పాల, సతీశ్ బైరెడ్డిలు పరిచయం చేయగా.. అవిలివల పుస్తకాన్ని డా.సుభాషిణి, నారాయణ పరిచయం చేశారు. పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి, జనజ్వాల, చాంద్ఖాన్, ఖలీల్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఏఐతో మరింత విధ్వంసం తప్పదు సొంతూరు, అవిలివల పుస్తకాల ఆవిష్కరణ సభలో ప్రొ.హరగోపాల్ -
భక్తిశ్రద్ధలతో ఈస్టర్ వేడుకలు
స్టేషన్ మహబూబ్నగర్: జిల్లాలో క్రిస్టియన్లు ఆదివారం ఈస్టర్ పర్వదిన వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. క్రీస్తు మహిమలను పాటల ద్వారా కొనియాడారు. జిల్లాకేంద్రంలోని కల్వరికొండపై వేడుకలను నిర్వహించారు. హైదరాబాద్కు చెందిన డాక్టర్ ఏజే ఏసు ప్రసంగీకుడిగా హాజరై విశ్వమానవ కల్యాణాన్ని కాంక్షిస్తూ ప్రార్థనలు నిర్వహించారు. ఈస్టర్ పండుగ ప్రాముఖ్యత గురించి వివరించారు. ముఖ్య అతిథిగా హాజరైన యెన్నం శ్రీనివాస్రెడ్డి యేసుక్రీస్తూ ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈస్టర్ పండుగ మీ అందరితో కలిసి జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. కల్వరికొండను దశల వారీగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం రూ.10.72 లక్షల జనరల్ ఫండ్ నిధుల ద్వారా నిర్మించిన సీసీరోడ్డు, వాటర్ట్యాంక్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. వేడుకకు క్రైస్తవులు వేలాదిగా హాజరయ్యారు. కార్యక్రమంలో ఎంబీసీ చర్చి చైర్మన్, సీనియర్ పాస్టర్ రెవరెండ్ ఎస్.వరప్రసాద్, వైస్ చైర్మన్ బీఐ జేకబ్, కార్యదర్శి జేఐ డేవిడ్, సహాయ కార్యదర్శి ఇమ్మాన్యుయెల్ రాజ్, కోశాధికారి టీఏ స్టీవెన్, సహ కోశాధికారి ఎ.టైటస్ రాజేందర్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్కుమార్, డీసీసీ మీడియా సెల్ కన్వీనర్ సీజే బెనహర్, క్రిస్టియన్ మైనార్టీ పట్టణ అధ్యక్షుడు దాసరి శామ్యుల్, చిన్నరాజు, ఎంపీ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
హిటాచీ వాహనం దగ్ధం
నారాయణపేట రూరల్: రోజురోజుకు ఎండలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో మనుషులతో పాటు వాహనాలు సైతం తట్టుకోలేని పరిస్థితి నెలకొంది. తాజాగా ఓ హిటాచీ వాహనం దగ్ధమైన ఘటన నారాయణపేట జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. గుండుమల్ మండల కేంద్రం నుంచి నారాయణపేట మండలం కోటకొండ వరకు డబుల్రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం హిటాచీ వాహనంతో బండగొండ సమీపంలో రోడ్డును తవ్వుతుండగా.. మధ్యాహ్నం వేళ ఎండ తీవ్రతకు వాహనంలోని బ్యాటరీలు, ఆయిల్ విపరీతమైన వేడికి గురయ్యాయి. దీంతో వాహనంలో నుంచి పొగలు రావడంతో భయపడి అప్రమత్తమైన ఆపరేటర్ ఆంజనేయులు వెంటనే వాహనం నుంచి దిగి దూరంగా పరిగెత్తాడు. అంతలోనే మంటలు వ్యాపించి వాహనం పూర్తిగా కాలిపోయింది. ఫైరింజన్ అక్కడికి చేరుకున్నా ఫలితం లేకపోయింది. ప్రమాదంలో సుమారు రూ. 20లక్షలనష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. -
పేదవాడి చుట్టంలా ’భూ భారతి’
నాగర్కర్నూల్: పేదల భూ సమస్యలు తీర్చే చట్టమే భూ భారతి అని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం జిల్లాకేంద్రం సమీపంలోని గగ్గలపల్లిలో ఉన్న ఓ ఫంక్షన్హాల్లో భూ భారతి చట్టం–2025పై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతుల కన్నీరు తుడవడానికి తీసుకొచ్చిన చట్టమే భూ భారతి అని, ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి చట్టాన్ని అమలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం ఒక చట్టం రూపొందిస్తే అది పేదవాడికి చుట్టంలాగా ఉండాలని.. భూ భారతి చట్టం వందేళ్లకు సరిపడే విధంగా ఉందని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో భూ సమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. రైతులు తమ భూ సమస్యల పరిష్కారానికి చెప్పులు అరిగేలా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగారని.. ఇప్పుడింకా ఆ అవసరం లేదని, అధికారులే రైతుల వద్దకు వచ్చి సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు. మే 1 నుంచి ప్రతి రెవెన్యూ గ్రామానికి అధికారులు వచ్చి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారని వివరించారు. ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా ప్రతిపక్షాలు అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయని.. ప్రజలు గుర్తించి పేద ల అభ్యున్నతికి పాటుపడే ఇందిరమ్మ ప్రభుత్వాన్ని దీ వించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీ మల్లురవి, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్రెడ్డి, కలెక్టర్ బదావత్ సంతోష్, ఎమ్మెల్యేలు కూచుకుళ్ల రాజేష్రెడ్డి, కసిరెడ్డి నారా యణరెడ్డి, తూడి మేఘారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి -
భూములను కాపాడేందుకే భూభారతి చట్టం
గండేడ్/మహమ్మదాబాద్: పేద రైతుల భూములను కాపాడేందుకే భూభారతి చట్టాన్ని తీసుకువచ్చినట్లు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్రెడ్డి తెలిపారు. శనివారం గండేడ్ మండల పరిధిలోని వెన్నాచేడ్, మహమ్మదాబాద్ మండలపరిధిలోని నంచర్ల పల్లవి ఆడిటోరియంలో రైతులకు అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పేరుతో రైతులను ఎంతో మోసం చేసి కోర్టుల చుట్టూ తిరిగేలా చేశారన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ధరణిని బంగాళాఖాతంలో పడేసి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చినట్లు సూచించారు. ఇలాంటి చట్టంతో ఎంతో మంది రైతుల సమస్యలు తీరుతాయని తెలిపారు. ఇది ప్రజా ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని రైతులు సంతోషంగా ఉండాలన్నదే సీఎం లక్ష్యమని తెలిపారు. ఉమ్మడి గండేడ్ మండలంలో నవోదయ విద్యాలయం ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్యలో వెనుకబడిన మన ప్రాంతం విద్యలో ఎంతో అభివృద్ధి చెందే అవకాశం ఉన్నదన్నారు. భూమికి సురక్షితమైన హక్కు భూభారతి పేద రైతుల భూములకు సురక్షితమైన హక్కులు కల్పించేది భూభారతి చట్టమని కలెక్టర్ విజయేందిర అన్నారు. భూమి ఉన్న ప్రతి రైతుకు భూధార్ కార్డు ఇచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సమస్యలు ఉన్న రైతులు మండల తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు పెట్టుకుంటే సమస్య పరిష్కారం కాకుంటే ఆర్డీఓకు అప్పీలు చేయవచ్చని, అక్కడ కూడా సమస్య పరిష్కారం కాకుంటే కలెక్టర్ దగ్గర అర్జీ పెట్టుకోవచ్చన్నారు. భూసమస్యలతో రైతులు మహిళలు కోర్టుల చుట్టూ తిరుగకుండా భూబారతి చట్టం ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా వెన్నాచేడ్ వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ రైతులకు తాగునీరు, నీడ కనీస సౌకర్యాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఓ రైస్మిల్లుకు ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్న 6 ట్రాక్టర్లను పట్టుకుని స్టేషన్కు తరలించి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ మోహన్రావు, ఆర్డీఓ నవీన్కుమార్, తహసీల్దార్లు నాగలక్ష్మి, తిరుపతయ్య, ఎంపీడీఓలు దేవన్న, నరేందర్రెడ్డి, నాయకులు జితేందర్రెడ్డి, కేఎం నారాయణ, రాములు, విష్ణువర్ధన్రెడ్డి, పుల్లారెడ్డి, శాంతీబాయి, రాధారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
కోర్టు డ్యూటీల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
మహబూబ్నగర్ క్రైం: పోలీస్ వ్యవస్థపై విశ్వాసం నిలబెట్టాలంటే ప్రతి అధికారి తన విధులను నిబద్ధతతో, సమర్థవంతంగా నిర్వహించాలని ఎస్పీ డి.జానకి సూచించారు. జిల్లా ఎస్పీ సమావేశ మందిరంలో శనివారం కోర్టు డ్యూటీ, కోర్టు లైజన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. న్యాయ సంబంధిత విధుల్లో నిర్లక్ష్యం అంగీకరించడం సరికాదని, ప్రతి కేసు విచారణలో చార్జిషీట్లను నిర్దేశిత కాల వ్యవధిలో న్యాయస్థానాలకు సమర్పించాల్సిన అవసరం ఉందన్నారు. సాక్షులను హాజరుపరిచే విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో సమన్వయం మెరుగుపరుచుకోవాలని సూచించారు. కోర్టులలో కేసుల పరిష్కార వేగాన్ని పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. అనుమానితులను కోర్టుకు హాజరుపరిచే సమయంలో వారిని సురక్షితంగా సమయానికి న్యాయస్థానాలకు తరలించడానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి భద్రత లోపాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. కోర్టు డ్యూటీలలో నిర్లక్ష్యం చేసే అధికారులపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. సమావేశంలో డీఎస్పీలు రమణారెడ్డి, సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు. ● జిల్లాలో ఆదివారం నుంచి ప్రారంభమయ్యే తెలంగాణ ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ పరీక్ష కేంద్రాల దగ్గర 163 బీఎన్ఎస్ఎస్ అమల్లో ఉంటుందని ఎస్పీ డి.జానకి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 8 పరీక్ష కేంద్రాల వద్ద 163సెక్షన్ ఉంటుందని, ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పరీక్ష కేంద్రాల దగ్గర ఎవరూ గుమ్మికూడరాదని పేర్కొన్నారు. -
క్రీడా శిబిరాలకు సన్నద్ధం
మహబూబ్నగర్ క్రీడలు: ఔత్సాహిక క్రీడాకారులకు ప్రతి ఏడాది నిర్వహించే వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు క్రీడా నైపుణ్యాన్ని చాటేందుకుగా వేదికగా ఉపయోగపడుతున్నాయి. జిల్లా యువజన, క్రీడాశాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది వేసవి సెలవుల్లో చిన్నారులు, యువత కోసం ప్రత్యేక వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. నెలరోజుల పాటు వేలాది మంది ఔత్సాహిక క్రీడాకారులు శిక్షణ తీసుకుంటారు. ఈ శిబిరాల్లో ప్రతిభ కనబరిచిన వారిని గుర్తించి జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతారు. ● ఈ ఏడాది జిల్లా యువజన, క్రీడాశాఖ ఆధ్వర్యంలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్) ఆదేశాల మేరకు జిల్లా యువజన, క్రీడాశిఖ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 10 వరకు వేసవి క్రీడాశిక్షణా శిబిరాలు నిర్వహిస్తారు. అయితే జిల్లా యువజన, క్రీడాశాఖ ఆధ్వర్యంలో పట్టణ ప్రాంతాల ఔత్సాహిక క్రీడాకారుల కోసం అర్బన్ కింద దాదాపు 15 వరకు వేసవి క్రీడాశిక్షణా శిబిరాలు నిర్వహిస్తారు. దరఖాస్తులను ఆహ్వానించిన యువజన, క్రీడాశాఖ ఈఏడాది జిల్లాలో నిర్వహించే వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణపై జిల్లా యువజన, క్రీడాశాఖ కార్యాచరణ రూపొందిస్తుంది. వివిధ క్రీడాంశాల్లో మే 1వ తేదీ 30 వరకు (నెల రోజుల పాటు) ఔత్సాహిక క్రీడాకారులకు శిక్షణ అందజేస్తారు. ఈ మేరకు జిల్లా యువజన, క్రీడాశాఖ జిల్లాలో వేసవి క్రీడా శిబిరాల ఏర్పాటుకు దరఖాస్తులను ఆహ్వానించింది. జిల్లా యువజన, క్రీడల అధికారి ఎస్.శ్రీనివాస్ ఇటీవల వేసవి క్రీడా శిక్షణ శిబిరాల దరఖాస్తుల కోసం ప్రకటన విడుదల చేశారు. జాతీయస్థాయి సీనియర్ క్రీడాకారులు లేదా వ్యాయామ ఉపాధ్యాయులు (పీడీ, పీఈటీ) వేసవి క్రీడా శిబిరాలు నిర్వహించడానికి దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈనెల 22వ తేదీ వరకు దరఖాస్తుతో పాటు క్రీడల్లో తాము సాధించిన ధ్రువపత్రాలను జిల్లాకేంద్రం మెయిన్ స్టేడియంలోని యువజన, క్రీడా కార్యాలయంలో వ్యక్తిగతంగా లేదా పోస్ట్ ద్వారా పంపాలి. వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి ఈ ఏడాది వేసవి క్రీడాశిక్షణా శిబిరాల నిర్వహణపై స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. గతేడాది వేసవి శిబిరాల్లో చాలా మంది విద్యార్థులు, ఔత్సాహిక క్రీడాకారులు పాల్గొన్నారు. వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు సంబంధించి సీనియర్ క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం. వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను పకడ్బందీగా నిర్వహిస్తాం. – ఎస్.శ్రీనివాస్, డీవైఎస్ఓ జిల్లా క్రీడాశాఖ ఆధ్వర్యంలోవేసవి శిబిరాలు మే 1వ తేదీ నుంచి నెల రోజుల పాటు ప్రత్యేక శిక్షణ దరఖాస్తులు ఆహ్వానించిన యువజన, క్రీడాశాఖ -
న్యాయసేవలు పల్లెలకు విస్తరించాలి: జిల్లా జడ్జి
పాలమూరు: జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో అందిస్తున్న న్యాయసేవలను గ్రామీణస్థాయికి తీసుకువెళ్లి పేదలకు మేలు జరిగే విధంగా పారా లీగల్ వలంటీర్లు కృషి చేయాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో శనివారం పారా లీగల్ వలంటీర్లతో నిర్వహించిన సమావేశంలో న్యాయమూర్తి మాట్లాడారు. న్యాయ సేవలను విస్తరించేందుకు పారా లీగల్ వలంటీర్లు కృషి ఎక్కువగా ఉండాలని తెలిపారు. లీగల్ ఎయిడ్ క్లినిక్లు, అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్లు, చైల్డ్ ఫ్రెండ్లీ కమిటీ ఆధ్వర్యంలో అందిస్తున్న న్యాయసేవలను మరింత మెరుగైన స్థాయిలో అందించాలన్నారు. అనంతరం పారా లీగల్ వలంటీర్లకు గుర్తింపు కార్డులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర పాల్గొన్నారు. బాదేపల్లి యార్డుకుపోటెత్తిన మొక్కజొన్న జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి మార్కెట్ యార్డుకు శనివారం మొక్కజొన్న దిగుబడులు పోటెత్తాయి. 4,579 క్వింటాళ్ల మొక్కజొన్న విక్రయానికి రాగా.. క్వింటాల్కు గరిష్టంగా రూ.2,260, కనిష్టంగా రూ.1,521 ధరలు లభించాయి. వేరుశనగ గరిష్టంగా రూ.6,100, కనిష్టంగా రూ.4,816, పెబ్బర్లు గరిష్టంగా రూ.4,957, కనిష్టంగా రూ.4,617, రాగులు గరిష్టంగా రూ.2,611, కనిష్టంగా రూ.2,511, జొన్నలు రూ.3,907, ధాన్యం హంస గరిష్టంగా రూ.1,969, కనిష్టంగా రూ.1,806, ఆర్ఎన్ఆర్ గరిష్టంగా రూ.2,209, కనిష్టంగా రూ.1,806, ఆముదాలు గరిష్టంగా రూ.6,278, కనిష్టంగా రూ.5,629, పత్తి రూ.5,389, శనగలు రూ.5,250 ధరలు లభించాయి. దేవరకద్ర లో ఆర్ఎన్ఆర్ ధాన్యం క్వింటాల్కు గరిష్టంగా రూ.2,209, కనిష్టంగా రూ.1,701, హంస ధాన్యం గరిష్టంగా రూ.1,809, కనిష్టంగా రూ.1,639గా, ఆముదాలు గరిష్టంగా రూ.5,981గా ఒకే ధర వచ్చింది. పీయూలో కాంట్రాక్టు అధ్యాపకుల సమ్మె మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం నుంచి నిరవధిక సమ్మె బాట పట్టారు. ఈ మేరకు పీయూ ప్రధాన గేట్ వద్ద మోకాళ్లపై నిలబడి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా సంఘం నాయకులు భూమయ్య, శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ.. నెట్, సెట్, పీహెచ్డీ వంటి అర్హతలు ఉన్న అధ్యాపకులను ఎలాంటి షరతులు లేకుండా నేరుగా రెగ్యులరైజ్ చేయాలని, జీఓ నంబర్ 21ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు అధ్యాపకుల సమ్మెకు నాన్ టీచింగ్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రామ్మోహన్, బుర్రన్న సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో రవికుమార్, సుదర్శన్రెడ్డి, విజయభాస్కర్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, ఈశ్వర్కుమార్, ప్రదీప్ కుమార్, సురేశ్, మొయినుద్దీన్, తదితరులు పాల్గొన్నారు. -
‘జేఈఈ’లో అత్యుత్తమ ‘ప్రతిభ’
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రంలోని ప్రతిభ జూనియర్ కళాశాల విద్యార్థులు జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో విజయదుంధుబి మోగించారు. ఆలిండియా స్థాయిలో విద్యార్థులు విశాల్ 281వ ర్యాంకు, సాకేత్కుమార్రెడ్డి 98.75 పర్సంటైల్తో 2,587వ ర్యాంకు సాధించారు. వీరితో పాటు భీంసింగ్ రాథోడ్ 2,683, తిరుపతి 4,952వ ర్యాంకు, కేదార్నాథ్ 98.28 పర్సంటైల్తో 6,988వ ర్యాంకు, వర్షిత్గౌడ్ 98.15 పర్సంటైల్తో 7,661వ ర్యాంకు, ప్రేమ్చంద్ 7,682వ ర్యాంకు సాధించగా.. కె.భరత్ 96.16, సి.జతిన్ 96.03, నాగకౌశిక 96.95, భానుప్రదీప్ 95.43, సాయి జశ్వంత్రెడ్డి 95.39, సాయి రేవంత్రెడ్డి, 95.04 పర్సంటైల్ సాధించారు. 90 పర్సంటైల్కు పైగా 48మంది, 80 నుంచి 90 పర్సంటైల్ మధ్య 62 మంది సాధించారని.. ఫలితాల్లో 198 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్ పరీక్షకు అర్హత సాధించినట్లు కళాశాల యాజమాన్యం పేర్కొంది. కార్యక్రమంలో డైరెక్టర్స్ మంజులాదేవి, లక్ష్మారెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి, జనార్దన్రెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి, ప్రిన్సిపాల్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
లభించని ఆరుగురి ఆచూకీ
అచ్చంపేట: ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదం జరిగి శనివారంతో 57 రోజులకు చేరింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి మైన్స్ రెస్క్యూ, ఆర్మీ, హైడ్రా, ర్యాట్ హోల్ మైనర్స్ వంటి 12 విభాగాలకు చెందిన సిబ్బంది విడతల వారీగా 24గంటల పాటు సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఐదు ఎస్కవేటర్ల సాయంతో మట్టి తొలగిస్తున్నప్పటికీ ఆరుగురి కార్మికుల ఆచూకీ మాత్రం లభ్యం కావడం లేదు. డీ–2 నుంచి డీ–1 ప్రదేశంలో మట్టి, బురద, రాళ్లు తొలగించినా కార్మికుల జాడ లభించక పోవడంతో.. కంచె ఏర్పాటు చేసిన నిషేధిత ప్రదేశం 40 మీటర్ల పరిధిలో ఉండే అవకాశం ఉందని సహాయక సిబ్బంది భావిస్తున్నారు. ప్రభుత్వం విధించిన గడువు ఈ నెల 20వ తేదీలోగా శిథిలాల తొలగింపు పూర్తి చేయాల్సి ఉండటంతో సహాయక సిబ్బంది రాత్రిబంవళ్లు శ్రమిస్తున్నారు. యంత్రాలతో ఎక్కువగా పనులు చేస్తుండటంతో సిబ్బందిని తగ్గిస్తూ వస్తున్నారు. ప్రమాద ప్రదేశం పరిశీలన.. ఎస్ఎల్బీసీ సొరంగం పైకప్పు కూలిన ప్రదేశంలో మట్టి తొలగింపు సాధ్యాసాధ్యాలను సహాయక బృందాల ఉన్నతాధికారులు మరోసారి పరిశీలించారు. అయితే ఇప్పట్లో డేంజర్ జోన్ ప్రదేశంలో తవ్వకాలు జరిపే వీలు కనిపించడం లేదు. మరో రెండు రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన బృందాలు సహాయక చర్యలను నిలిపివేసి వారి స్వస్థలాలకు వెళ్లే అవకాశం ఉంది. కాగా, సహాయక బృందాల ఉన్నతాధికారులతో ప్రత్యేకాధికారి శివశంకర్ లోతేటి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదు ఎస్కవేటర్ల సాయంతో మట్టి, బురదతీత పనులను వేగవంతం చేసినట్లు తెలిపారు. డేంజర్ జోన్ సమీపంలో మట్టి తరలింపునకు అడ్డుగా వస్తున్న బండ రాళ్లను విచ్చిన్నం చేసి లోకో ట్రేన్ ద్వారా బయటకు తరలిస్తున్నట్లు వివరించారు. సిబ్బందికి అవసరమైన సామగ్రిని సమకూరుస్తున్నామని.. తాగునీరు, ఆహార పదార్థాలను లోకో ట్రైన్ ద్వారా సొరంగం లోపలకు పంపిస్తున్నామని చెప్పారు. సమావేశంలో ఆర్మీ అధికారులు వికాస్సింగ్, విజయ్కుమార్, జేపీ కంపెనీ సీనియర్ ప్రాజెక్టు ఇంజినీర్ సంజయ్కుమార్ సింగ్, సింగరేణి మైన్స్ రెస్క్యూ జనరల్ మేనేజర్ బైద్య, ఎన్డీఆర్ఎఫ్ అధికారి గిరిధర్రెడ్డి, దక్షిణమధ్య రైల్వే అధికారి రవీంద్రనాథ్ తదితరులు ఉన్నారు. ఎస్ఎల్బీసీలో 57 రోజులకు చేరిన సహాయక చర్యలు -
ఎక్కువ సమయం కేటాయించా..
ముఖ్యమైన అంశాలను ఎక్కువ సార్లు రాయడం, నోట్ చేసుకోవడం వల్ల ఎంతో ప్రయోజనం కలిగింది. ఇందుకు ఎక్కువ సమయం కేటాయించాను. అధ్యాపకుల సలహాలు, సూచనలతో మంచి మెటీరియల్ చదివాను. అనుకున్న ఫలితం వచ్చాయి. మా నాన్న ప్రైవేటు ఉద్యోగి. ఆయన అనుకున్న విధంగా సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ చదవాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నా. – వర్షిత్గౌడ్, విద్యార్థి, ప్రతిభ కళాశాల (98.15 పర్సంటైల్) -
ట్రాక్టర్ బోల్తా : రైతు దుర్మరణం
ఇటిక్యాల: ట్రాక్టర్ బోల్తాపడిన ప్రమాదంలో ఓ రైతు దుర్మరణం చెందిన ఘటన మండలంలోని షాబాద్ గ్రా మంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకటేశ్ వివరాల మేరకు.. షాబాద్కు చెందిన రైతు తెలుగు చిన్న రామకోటి (65) ట్రాక్టర్తో గ్రామ సమీపంలోని తన వ్యవసాయ పొలాన్ని దున్ని వస్తుండగా.. శనగపల్లి రోడ్డు వ ద్ద ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదంలో చిన్న రామకోటికి తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికు లు అతడిని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి సోదరుడు కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. బావిలో పడి వ్యక్తి మృతి అమరచింత: బావిలోని బోరుమోటారు బయటకు తీసే ప్రయత్నంలో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతిచెందిన ఘటన అమరచింతలో శనివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. అమరచింతకు చెందిన హమాలీ గుడిసె శ్రీనివాసులు (34)తో పాటు హమాలీ రిక్షా రవి, మరో రవి ముగ్గురు కలిసి రిటైర్డ్ టీచర్ గోపాల్రెడ్డి పొలంలోని బావిలో ఉన్న బోరుమోటారు బయటకు తీసేందుకు వెళ్లారు. మోటారును బయటకు తీసు కుని వస్తున్న క్రమంలో బోరుపైపులు గుడిసె శ్రీనివాసులుపై పడటంతో అతడు బావిలో పడి మృతి చెందాడు. గ్రామస్తుల సహాయంతో బావిలో నుంచి అతడి మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడికి భార్య సువర్ణ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహం లభ్యం కేటీదొడ్డి: ఉపాధి హామీ పథకం పను లు చేస్తుండగా.. గుర్తుతెలియని యు వకుడి (30) మృతదేహం లభ్యమైన ఘటన కేటీదొడ్డి మండలంలో శనివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. కేటీదొడ్డి గ్రామ శివారులో ఉన్న కొత్తకుంట ఆంజనే యస్వామి ఆలయం సమీపంలోని ప్రభుత్వ భూమిలో వర్షపునీటి నిల్వ కోసం ఉపాధి హామీ పథకం కూలీలు గుంతలు తవ్వుతుండగా.. యువకుడి మృతదేహం లభ్యమైంది. సమాచా రం అందుకున్న గద్వాల సీఐ టంగుటూరి శ్రీను, ఎస్ఐ శ్రీనివాసులు ఘటన స్ధలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి గొంతు కోసినట్లు ఆనవాళ్లను గుర్తించారు. మృతదేహాన్ని పో స్టుమార్టం నిమిత్తం జిల్లా మార్చురీకి తరలించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. బీజేపీ నాయకుడి హత్యకు కుట్ర? దేవరకద్ర/దేవరకద్ర రూరల్: దేవరకద్ర నియోజకవర్గానికి చెందిన ఒక బీజేపీ ముఖ్యనేతపై ప్రత్యర్థులు హత్యకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ఈ విషయం ఆయనకు తెలియడంతో తన వద్ద ఉన్న ఆధారాలతో ఎస్పీ జానకికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. విచారణ చేసి, తనకు రక్షణ కల్పించాలని కోరినట్లు తెలిసింది. -
‘రిషి’ విద్యార్థుల ప్రభంజనం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రంలోని రిషి జూనియర్ కళాశాల విద్యార్థులు జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ప్రభంజనం సృష్టించారు. కళాశాల విద్యార్థులు 1000 లోపు ర్యాంకులతో అత్యుత్తమ ప్రతిభ చాటారు. రోహిత్రెడ్డి 308, జంగం శ్రీతులసి 927వ ర్యాంకులు సాధించినట్లు కళాశాల చైర్మన్ చంద్రకళా వెంకట్ తెలిపారు. వీరితో పాటు సాయి సుజన్రెడ్డి 98.40, ప్రణిత్కుమార్ 98.04, సాయి అక్షయ 97.08, తరుణ్సాయి 96.76 పర్సంటైల్ సాధించారన్నారు. 90శాతం పర్సంటైల్ను 36 మంది సాధించగా.. జేఈఈ అడ్వాన్స్కు 45 మంది అర్హత సాధించినట్లు పేర్కొన్నారు. తమ కళాశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నామన్నారు. ఉమ్మడి జిల్లాలోనే అత్యధిక ర్యాంకులు సాధించిన కళాశాలగా నిలిచిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అకాడమీ చీఫ్ అడ్వైజర్ వెంకటయ్య, డీన్ లక్ష్మారెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ డీన్ భూపాల్రెడ్డి, ప్రిన్సిపాల్ ప్రసన్నకుమారి, అధ్యాపకులు పాల్గొన్నారు. -
ఇద్దరి ప్రాణాలు తీసిన అతివేగం
ఎర్రవల్లి: అతివేగం ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. బంధువుల గృహప్రవేశానికి వెళ్లి వస్తుండగా కారు అదుపుతప్పి బోల్తాపడటం.. అదే సమయంలో వస్తున్న ట్రావెల్ బస్సు కారును ఢీకొట్టడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఎర్రవల్లి మండలం వేముల స్టేజీ సమీపంలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. కోదండాపురం ఎస్ఐ మురళి వివరాల మేరకు.. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కాకునూరుకుచెందిన దేరెడ్డి పుల్లారెడ్డి (59), ఆయన భార్య లక్ష్మి పుల్లమ్మ (51), కుమారుడు వెంకటసుబ్బారెడ్డితో పాటు మరో ముగ్గురు కుటుంబ సభ్యులు శుక్రవారం హైదరాబాద్లో బంధువుల గృహప్రవేశానికి వెళ్లారు. అక్కడ కార్యక్రమం పూర్తయ్యాక తిరిగి అదే రోజు రాత్రి 8:30 గంటలకు కారులో స్వగ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యంలోని ఎర్రవల్లి మండలం వేముల స్టేజీ సమీపంలో దేరెడ్డి వెంకటసుబ్బారెడ్డి కారును అతివేగంగా, అజాగ్రత్తగా నడపడంతో అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి అవతలి రోడ్డుపై బోల్తాపడింది. అదే సమయంలో కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ ట్రావెల్ బస్సు కారును ఢీకొట్టడంతో భార్యాభర్తలు దేరెడ్డి సుబ్బారెడ్డి, లక్ష్మి పుల్లమ్మతో పాటు వారి బంధువు స్రవంతికి తీవ్రగాయాలయ్యాయి. డ్రైవర్తో పాటు మరో ఇద్దరు తేలికపాటి రక్త గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షించి అప్పటికే దేరెడ్డి సుబ్బారెడ్డి, లక్ష్మిపుల్లమ్మ మృతిచెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు మృతుల బంధువు మహేశ్వరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఎన్హెచ్–44పై బోల్తాపడిన కారును ఢీకొట్టిన ట్రావెల్ బస్సు భార్యాభర్తల దుర్మరణం.. మరో నలుగురికి గాయాలు బంధువుల గృహ ప్రవేశానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం మృతులు నంద్యాల జిల్లా వాసులు -
సత్తా చాటిన వాగ్దేవి విద్యార్థులు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రంలోని వాగ్దేవి ఐఐటీ అకాడమీ విద్యార్థులు జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటారు. విద్యార్థులు రోహిత్ 99.80 పర్సంటైల్, మనోహర్ 99.40, రేవంత్రెడ్డి 98 పర్సంటైల్ సాధించారు. వీరితో పాటు ఓంకార్, ఆర్తి, కౌశిక్, అశ్విని, మమత, నవనీత్గౌడ్, నవీన్, శివ, శరణ్య, గణేశ్ జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చినటు ్ల కళాశాల కరస్పాండెంట్ వెంకట్రెడ్డి తెలిపారు. ఇన్నోవేటివ్ సైంటిఫిక్ టీచింగ్ అప్రోచ్ కార్యక్రమంలో భాగంగా అకాడమీలో మెరుగైన విద్య అందించడంతో పాటు ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. కళాశాల విద్యార్థులు జాతీయస్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించడం జిల్లాకే గర్వకారణమని అన్నారు. కార్యక్రమంలో ఐఐటీ, నీట్ అకాడమీ ఇన్చార్జి పావనిరెడ్డి, ప్రిన్సిపాల్ గీతాదేవి, యాజమాన్య సభ్యులు రాఘవేందర్రావు, శివకుమార్, నాగేందర్, సతీశ్రెడ్డి, షాకీర్, యాకూబ్ తదితరులు పాల్గొన్నారు. -
పంట పొలాల్లోకి కాలుష్య జలాలు
రాజాపూర్: చిన్నపాటి వర్షం కురిస్తే చాలు.. కాలుష్య జలాలు బయటకు వదిలేందుకు పరిశ్రమల యాజమాన్యానికి అవకాశం వచ్చినట్లే. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం సాయంత్రం ఈదురు గాలులతో పాటు ఓ మోస్తరు వర్షం కురిసింది. దీనిని అదునుగా చేసుకొని పోలేపల్లి సెజ్లో ఉన్న ఓ పరిశ్రమ వర్షపు నీటి చాటున కాలుష్య జలాలను రైతుల పొలాల్లోకి వదిలింది. రైతులు వీటి ఫొటో తీసి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు, ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డికి సమాచారం ఇచ్చారు. జల, వాయు కాలుష్యంతో పాటు శబ్ధ కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నామని.. ఆయా పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని ముదిరెడ్డిపల్లి, రాయపల్లి గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
మట్టి తరలింపు వేగవంతం
అచ్చంపేట: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగంలోని ప్రమాద ప్రదేశంలో మట్టి, బురద తవ్వకాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రమాదం జరిగి శుక్రవారం నాటికి 56 రోజులు గడిచినా మిగిలిన ఆరుగురి ఆచూకీ లభించలేదు. డీ2 ప్రదేశంలో ఐదు ఎస్కవేటర్లతో మట్టి, బురద తవ్వి కన్వేయర్ బెల్టు ద్వారా, టీబీఎం భాగాలను కత్తిరించి శకలాలను లోకో ట్రైన్లో బయటకు తరలిస్తున్నారు. పైకప్పు కూలిన ప్రదేశం నుంచి వస్తున్న నీటి ఊటను భారీ మోటార్ల సాయంతో ఎప్పటికప్పుడు కృష్ణానదిలోకి పంపింగ్ చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల 12 రకాల సహాయక బృందాల్లోని 560 మంది సిబ్బంది నిత్యం మూడు షిఫ్ట్లలో సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా సహాయక చర్యలు పూర్తి చేసేందుకు సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తున్నారు. మరో రెండ్రోజుల్లో నిషేధిత ప్రదేశం వరకు మట్టి, శిథిలాల తొలగింపు పూర్వవుతుందని సహాయక సిబ్బంది వివరించారు. కొనసాగుతున్న సహాయక చర్యలు.. ప్రమాదంలో చిక్కుకున్న ఆరుగురి జాడ కనుగొనేందుకు సొరంగంలోని ప్రమాద ప్రదేశంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని ప్రత్యేకాధికారి శివశంకర్ లోతేటి తెలిపారు. శుక్రవారం దోమలపెంట ఎస్ఎల్బీసీ వద్ద జేపీ కార్యాలయంలో సహాయక బృందాల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సహాయక బృందాల ఉన్నతాధికారుల పర్యవేక్షణలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని, వారికి అవసరమైన సామగ్రి, వసతులు, పౌష్టికాహారం సమకూర్చుతున్నామని చెప్పారు. సమావేశంలో ఆర్మీ అధికారులు వికాస్సింగ్, విజయ్కుమార్, జేపీ కంపెనీ సీనియర్ ప్రాజెక్టు ఇంజనీర్ సంజయ్కుమార్ సింగ్, సింగరేణి మైన్స్ రెస్క్యూ జనరల్ మేనేజర్ బైద్య, ఎన్డీఆర్ఎఫ్ అధికారి గిరిధర్రెడ్డి, హైడ్రా అధికారి, దక్షిణ మధ్య రైల్వే అధికారి రవీంద్రనాథ్ పాల్గొన్నారు. 56 రోజులుగా సాగుతున్న సహాయక చర్యలు.. లభించని ఆరుగురి ఆచూకీ -
ముదిరాజ్ అభ్యున్నతికి కృషి: ఎమ్మెల్యే యెన్నం
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ముదిరాజ్ల అభ్యున్నతి కోసం తన వంతు పాటుపడుతానని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. ముదిరాజ్ సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ముదిరాజ్ భవనంలో నిర్వహించిన ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లాకేంద్రం నడిబొడ్డున ఉన్న ముదిరాజ్ భవనాన్ని ఓ విజ్ఞాన కేంద్రంగా మారుద్దామని అందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. చదువుకుంటేనే సమాజంలో మంచి గుర్తింపు రావడంతో పాటు ఉన్నత శిఖరాలకు చేరుకుంటామన్నారు. అందుకోసం ప్రతి ఒక్కరూ తమ బిడ్డలను బాగా చదివించాలని ముదిరాజ్లలో కూడా బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు వెళ్లిన వారు ఉన్నారన్నారు. ముదిరాజ్ భవనాన్ని భవిష్యత్ తరాలు గుర్తించుకునేలా తీర్చిదిద్దుదామన్నారు. సమాజాన్ని అర్థం చేసుకునే స్వభావం ముదిరాజ్లకు ఉందని ప్రేమ గల మనుసులు ముదిరాజ్లు అని అన్నారు. పీసీసీ నాయకులు ఎన్పీ వెంకటేశ్, సంజీవ్ ముదిరాజ్ మాట్లాడుతూ బీసీ డీలో ఉన్న ముదిరాజ్లను బీసీ ఏలోకి మార్చాలని అందుకు ఎమ్మెల్యే కృషి చేయాలని కోరారు. ముదిరాజ్లు రాజకీయంగా ఎదిగిన నాడే అభివృద్ధి చెందుతారని అన్నారు. కార్యక్రమంలో నాయకులు మైత్రియాదయ్య, కృష్ణముదిరాజ్, పెద్ద విజయ్కుమార్, రశ్రీనివాసులు, విజయ్కుమార్, నారాయణ, వెంకన్న, ఏఓ శంకర్, రామకృష్ణ, కిషోర్, లక్ష్మన్, యాదయ్య, వెంకటేశ్ పాల్గొన్నారు. -
ఫుట్బాల్ క్రీడాకారుల సైకిల్ యాత్ర
గద్వాలటౌన్: జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఏర్పాటు కోరుతూ మూడేళ్ల కిందట గద్వాల క్రీడాకారులు జిల్లాకేంద్రం నుంచి మంత్రాలయం వరకు సైకిల్ యాత్ర చేపట్టారు. గతేడాది జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఏర్పాటు కావడంతో మంత్రాలయం రాఘవేంద్రస్వామికి మొక్కు చెల్లించడంలో భాగంగా శుక్రవారం సీనియర్ క్రీడాకారుడు, ఇంటిలిజెన్స్ సీఐ నర్సింహారాజు ఆధ్వర్యంలో 30 మంది క్రీడాకారులు ప్రత్యేక డ్రస్ కోడ్లో స్థానిక గుంటి చెన్నకేశవస్వామి ఆలయం నుంచి సైకిల్ యాత్ర చేపట్టారు. ఫుట్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బండల వెంకట్రాములు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. శుక్రవారం స్వామివారికి మొక్క చెల్లించి శనివారం గద్వాలకు చేరుకుంటారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి విజయ్కుమార్, విజిలెన్స్ సీఐ విజయసింహ, మాజీ కౌన్సిలర్ బండల పాండు, సీనియర్ క్రీడాకారులు జగన్, ఇండికా శివ, జయసింహ, ప్రశాంత్, స్వామి, హరిశంకర్గౌడ్, విజయ్, బండల నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీల వాటా తేల్చాకే ఉద్యోగ ప్రకటనలివ్వాలి
కందనూలు: బీసీల వాటా తేల్చాకే ఉపాధ్యాయ, ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రకటనలు ఇవ్వాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో జరిగిన బీసీ చైతన్య సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తానంటూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు మరిచిపోయిందని ఎద్దేవా చేశారు. బీసీల రిజర్వేషను తేల్చకుండా నోటిఫికేషన్లు ఇస్తానంటే చూస్తూ ఊరుకోమని.. ఉద్యోగ, ఉపాధ్యాయులు ఏకమై భరతం పడతామని హెచ్చరించారు. ఈడబ్ల్యూఎస్ కోటాతో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని.. తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాని చెప్పారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం బీసీలను మోసం, కుట్ర, నయవంచన చేసి పాలన సాగిస్తోందని.. ఎన్ని రోజులు సాగదని తెలిపారు. రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే 62 మంది అగ్రవర్ణాల వారేనని.. అలాంటప్పుడు బీసీలకు కల్యాణలక్ష్మి ఎలా చేరుతుందని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల మేధావులు, నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి.. కల్వకుర్తి రూరల్: రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధం కావాలని, స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనే బీసీల సత్తా ఏంటో అన్ని పార్టీలకు చూపిద్దామని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు. శుక్రవారం నాగర్కర్నూల్కు వెళ్తూ పట్టణంలోని బీసీ ముఖ్యనాయకులతో కాసేపు మాట్లాడారు. బీసీ వాదాన్ని గ్రామగ్రామానికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని.. 2028ని లక్ష్యంగా చేసుకొని స్థానిక ఎన్నికల్లో బీసీల పార్టీ, బీసీ గుర్తుతోనే పోటీ చేద్దామన్నారు. నల్లమల నుంచి వచ్చిన క్రూర మృగాలను తరిమి వేయాల్సిన సమయం వచ్చిందని.. 2028లో బీసీ ముఖ్యమంత్రి పాలన చేస్తారని జోస్యం చెప్పారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీల ఐక్యత చాటామని.. నియోజకవర్గానికి బలమైన బీసీ నాయకుడిని కన్వీనర్గా త్వరలోనే నియమిస్తామన్నారు. ఉపాధ్యాయ లోకం బీసీ ఉద్యమాన్ని విస్తృతం చేసేందుకు తమవంతు పాత్ర పోషించాలని కోరారు. బీసీ జేఏసీ నేత హరిశంకర్గౌడ్, జానయ్య యాదవ్, మేకల రాజేందర్, సదానందంగౌడ్, రమేష్చారి, రుక్కుల్గౌడ్, శ్రీనివాస్యాదవ్, కురిమిద్దె మాజీ ఉపసర్పంచ్ విజయభాస్కర్, జమ్ముల శ్రీకాంత్, నర్సింహ, దుర్గాప్రసాద్, కరెంటు రాజు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారానికి డెడ్లైన్
సాక్షి, నాగర్కర్నూల్: భూ సమస్యలపై తీసుకువచ్చిన భూభారతి చట్టం–2025పై ప్రజలకు క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ధరణికి బదులుగా తీసుకువచ్చిన కొత్త రెవెన్యూ చట్టంపై ప్రజలకు అర్థమయ్యేలా వివరించేందుకు అవగాహన సదస్సులను నిర్వహిస్తోంది. గత రెవెన్యూ చట్టాలకు భిన్నంగా ఈసారి కొత్త చట్టంలో భూసమస్యల పరిష్కారానికి నిర్దేశిత గడువును విధించింది. భూరికార్డుల్లో తప్పుల సవరణ పరిష్కారం 60 రోజుల్లో పూర్తి కావాలని నిర్దేశించింది. వారసత్వ భూముల్లో హక్కుదారులను 30 రోజుల్లోగా నిర్ణయించాలని, లేకపోతే దరఖాస్తు ఆమోదించాల్సి ఉంటుందని పేర్కొంది. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించేందుకు సైతం చర్యలు తీసుకోగా, ఇందుకోసం గరిష్టంగా 90 రోజుల గడువు విధించింది. విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు.. పూర్వంలో గ్రామాల్లో రికార్డుల నిర్వహణ పక్కాగా నిర్వహించినట్టుగా ఇకనుంచి గ్రామస్థాయిలో రెవెన్యూ రికార్డులను నిర్వహించనున్నారు. మ్యుటేషన్, రికార్డుల మార్పులు జరిగినప్పుడు వాటిని గ్రామ పహాణి, ప్రభుత్వ భూముల రిజిస్టర్లను మారుస్తారు. భూభారతి పోర్టల్లో దరఖాస్తుల పరిష్కారంలో రెవెన్యూ అధికారుల నిర్ణయాలపై అభ్యంతరాలు ఉంటే అప్పీల్కు వెళ్లేందుకు అవకాశం కల్పించారు. తహసీల్దార్ నిర్ణయంపై ఆర్డీఓకు, ఆర్డీఓ నిర్ణయంపై కలెక్టర్కు, కలెక్టర్ నిర్ణయంపై ట్రిబ్యునల్కు అప్పీల్ చేసుకోవచ్చు. ఈ అప్పీళ్లను 60 రోజుల్లోపు పరిష్కరించాల్సి ఉంటుంది. ఈ చట్టం కింద ఎస్సీ, ఎస్టీ, మహిళలు, వికలాంగ రైతులకు ఉచిత న్యాయసాయాన్ని అందించనున్నారు. మండలస్థాయి, జిల్లా లీగల్ అథారిటీల ఆధ్వర్యంలో పేద రైతులకు ఉచితంగా న్యాయ సహాయాన్ని అందించనున్నారు. మోసపూరితంగా పట్టాలు పొందితే చర్యలు.. ఇష్టారీతిగా భూ రికార్డుల్లో మార్పులు చేయడం, మోసపూరితంగా భూమి హక్కులు, పట్టాలను పొందితే వాటిని వెంటనే రద్దు చేయనున్నారు. ప్రభుత్వ, భూదాన్, అసైన్డ్, వక్ఫ్, దేవాదాయ భూములను ఎవరైనా పట్టాలుగా పొందితే ఆ భూములన్నీ రద్దు కానున్నాయి. ఈ భూములు అన్యాక్రాంతం అయినట్టుగా అనుమానాలున్నా ప్రజలు నేరుగా సీసీఎల్ఏకు ఫిర్యాదు చేయవచ్చని భూభారతి చట్టం పేర్కొంది. గ్రామాల్లో ఎక్కువగా ఆబాదీ భూముల్లో ఇళ్లు నిర్మించుకుని ఉంటున్నారు. గ్రామకంఠం, ఆబాదీ భూముల్లో ఇళ్లు ఉన్నవారికి సరైన చట్టబద్ధమైన భూ హక్కులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇళ్లస్థలాలు, ఆబాదీ, వ్యవసాయేతర భూములకు హక్కుల రికార్డులను పక్కాగా నిర్వహిస్తారు. ప్రతి భూ యజమానికి ఆధార్ తరహాలో భూధార్ కార్డులను జారీ చేస్తారు. భూభారతి పోర్టల్లో ఉన్న హక్కుల రికార్డు ఆధారంగా తహసీల్దార్లు భూధార్ కార్డులను జారీ చేయనున్నారు. కొత్త రెవెన్యూచట్టంలో సాదా బైనామా దరఖాస్తులను సైతం పరిష్కరించాలని నిర్ణయించడంతో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న దరఖాస్తుల్లో కదలిక రానుంది. ఈ దరఖాస్తుల పరిష్కారం కోసం విచారణకు రావాలని సంబంధిత ఆర్డీఓ నోటీసులు ఇస్తారు. ఆ తర్వాత దరఖాస్తుదారుడు అఫిడవిట్ సమర్పించాలి. ఆర్డీఓ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి సాదాబైనామా దరఖాస్తుపై నిర్ణయం తీసుకుంటారు. వీటిలో అసైన్డ్, సీలింగ్, షెడ్యూల్ ఏరియా భూములు ఉంటే వాటిపై భూ హక్కులు ఉండవు. దరఖాస్తు సక్రమంగా తేలితే ఆర్డీఓ సర్టిఫికెట్ను జారీ చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం 90 రోజుల్లోగా పూర్తికావాలని చట్టంలో నిర్దేశించారు. ఉమ్మడి జిల్లాలో నేడుమంత్రి పొంగులేటి పర్యటన.. భూభారతి చట్టంపై ప్రజలకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేందుకు నిర్వహించే అవగాహన సదస్సునకు హాజరయ్యేందుకు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శనివారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. జోగుళాంబ గద్వాలతో పాటు నాగర్కర్నూల్ జిల్లాల్లోని సదస్సుల్లో పాల్గొంటారు. శనివారం ఉదయం 8.50 గంటలకు జోగుళాంబ గద్వాల జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్కు హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు. ధరూర్ మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించే భూ భారతి చట్టం –2025 అవగాహన సదస్సుల్లో పాల్గొంటారు. అనంతరం 11.30 గంటలకు నాగర్కర్నూల్ జిల్లాకేంద్రం సమీపంలోని గగ్గలపల్లిలో ఉన్న తేజ కన్వెన్షన్ హాల్లో నిర్వహించే అవగాహన సదస్సుకు హాజరవుతారు. అనంతరం 2 గంటలకు హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్కు తిరుగుపయనమవుతారు. భూభారతిపై విస్త్తృత అవగాహనకల్పించేందుకు సిద్ధమైన ప్రభుత్వం 60 రోజుల్లో సమస్యలకు పరిష్కారం చూపేలా కొత్త రెవెన్యూ చట్టం సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు నేడు గద్వాల, నాగర్కర్నూల్ జిల్లాల్లో పర్యటించనున్న మంత్రి పొంగులేటి -
సుమారు 25 కి.మీ.లు పయనించి..
కర్ణాటక రాష్ట్రంలో యాద్గిర్ ఫారెస్ట్ డివిజన్లో హోరంచ, అష్నాల్, ఎర్గోల, మినాస్పూర్ బ్లాక్లు ఉన్నాయి. మొత్తం 28,868.55 హెక్టార్ల పరిధిలో అడవులు విస్తరించినట్లు అటవీ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. జింకలు, దుప్పులు, ఎలుగుబంట్లు, చిరుతపులులు, పెద్దపులులకు ఆవాసంగా ఉన్న ఈ అడవిలో కొన్నేళ్లుగా చిరుతల సంతతి గణనీయంగా పెరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో నీరు, ఆహారం కోసం చిరుతలు ఇతర ప్రాంతాలకు వలసబాట పట్టినట్లు తెలుస్తోంది. ప్రధానంగా మినాస్పూర్ బ్లాక్ నుంచి సుమారు 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించి నారాయణపేట జిల్లాలోకి వస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. -
జూరాల కాల్వలకు నిలిచిన నీటి సరఫరా
అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వకు సాగునీటిని శుక్రవారం సాయంత్రం నిలిపివేశారు. ఎడమ కాల్వ పరిధిలో 20 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని గత వారమే నిలిపివేయగా.. చివరి దశలో ఉన్న పంటలను కాపాడుకోవడానికి నీటిని వదలాలని రైతులు ఆందోళనలు చేయడంతో రెండు రోజులపాటు నీటిని విడుదల చేశారు. అమరచింత, ఆత్మకూర్ మండలాల్లోని వరి పొలాలు పొట్ట దశలో ఉన్నాయని, మరో రెండు తడులు కావాలని రైతులు డిమాండ్ చేస్తున్నా.. ప్రాజెక్టులో నిల్వ నీటిమట్టం అడుగంటిపోతుండటంతో కేవలం ఒకే తడి ఇస్తున్నట్లు ప్రకటించి నీటిని విడుదల చేశారు. ఇచ్చిన గడువు ప్రకారం శుక్రవారం కాల్వకు సాగునీటిని నిలిపివేశామని డీఈ నారాయణ, ఏఈ ఆంజనేయులు తెలిపారు. పురాతన విగ్రహాల సంరక్షణ ఏది? పెంట్లవెల్లి: మండలంలోని మల్లేశ్వరం గ్రామంలో పుష్కరఘాట్ దగ్గర బండపై పురాతన పద్మనాభుడు, వీరభద్రుడి విగ్రహాలు ఏళ్లుగా ఎండకు ఎండుతూ, వానకు తడుస్తున్నాయి. కృష్ణానదిలో మునిగిన సమయంలో వీటిని తీసుకొచ్చి ఇక్కడ ఉంచారే తప్ప నేటికి ఆలయం నిర్మించి పూజలు చేయడం లేదు. ఈ విషయాన్ని పలుమార్లు దేవాదాయశాఖ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటికై నా స్పందించి సంరక్షించాలని కోరుతున్నారు. ఊర్కొండపేట అత్యాచార ఘటన సీన్ రీ కన్స్ట్రక్షన్ ఊర్కొండ: నాగర్కర్నూల్ జిల్లా ఊర్కొండపేట పబ్బతి ఆంజనేయస్వామి దైవ దర్శనానికి వచ్చిన వివాహితపై దుండగులు అత్యాచారం చేసిన సంఘటన విదితమే. దీనికి సంబంధించి నిందితులను కల్వకుర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో శుక్రవారం సీన్ రీ కన్ స్ట్రక్షన్ కోసం సంఘటన స్థలానికి తీసుకువచ్చారు. మొత్తం ఏడుగురు నిందితుల్లో మారుపాకుల ఆంజనేయులు, సాధిక్ బాబా ముందుగా ఆ తర్వాత మణికంఠ, కార్తీక్లను సంఘటన స్థలానికి తీసుకొచ్చారు. నేరం జరిగిన తీరుపై నిందితుల నుంచి పూర్తిస్థాయిలో సమాచారాన్ని రాబట్టారు. అలాగే అత్యాచార ఘటన తర్వాత ఇంటికి ఎలా వెళ్లారన్న కోణంలో పోలీసులు గ్రామంలోని నిందితులను వారి ఇంటికి తీసుకెళ్లి విచారణ చేపట్టారు. పంచాయతీ కార్యదర్శి సమక్షంలో మూడు బైకులు, సంఘటన రోజు నిందితులు ధరించిన దుస్తులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు సంఘటన స్థలంతో పాటు నిందితుల గ్రామంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. -
భక్తిశ్రద్ధలతో గుడ్ఫ్రైడే
స్టేషన్ మహబూబ్నగర్: జిల్లావ్యాప్తంగా గుడ్ఫ్రైడే వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహబూబ్నగర్లోని కల్వరి ఎంబీ చర్చి, శాలెం, క్రిస్టియన్పల్లిలోని బెత్లహం, క్రిస్టియన్కాలనీలోని ఎంబీ ప్రేయర్, మోతీనగర్లోని చర్చితో పాటు ఇతర చర్చిల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం పాస్టర్లు క్రీస్తూ సందేశం ఇచ్చారు. బైబిల్ సూక్తులను చదివి వినిపించారు. ప్రతి ఒక్కరూ శాంతియుతంగా జీవించాచాలని, పరస్పరం కష్ట, సుఖాల్లో పాలుపంచుకోవాలన్నారు. క్రీస్తు ప్రభువు శిలువపై పలికిన ఏడు మాటల గురించి వివరించారు. కల్వరి ఎంబీ చర్చిలో జరిగిన కార్యక్రమంలో చైర్మన్, సీనియర్ పాస్టర్ రెవరెండ్ వరప్రసాద్ క్రీస్తూ సందేశం ఇచ్చారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ జేకబ్, కార్యదర్శి జేఐ డేవిడ్, సహ కోశాధికారి టైటస్ రాజేందర్, ఆర్ఎస్ డేవిడ్, పి.శామ్యుల్, జేఐ.యోహాన్, ఎంకే.పాల్ సుధాకర్, జీపీ ప్రసన్కుమార్ తదితరులు పాల్గొన్నారు. పాప విముక్తి కోసమే యేసు శిలువ త్యాగం యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి మానవాళికి పాప విముక్తి కల్పించేందుకే శిలువ త్యాగం చేశారని రెమా వర్షిప్ సెంటర్ డైరెక్టర్, రెవరెండ్ పాస్టర్ బీఎస్ పరంజ్యోతి అన్నారు. రెమా వర్షిప్ సెంటర్లో ప్రార్థనలు నిర్వహించారు. పరంజ్యోతి ప్రసంగిస్తూ యేసు క్రీస్తూ త్యాగాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకొని ఆయనకు సాక్షులుగా రాణించేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘ పెద్దలు దేవయ్య, డాక్టర్ ప్రేమ్చంద్, భరత్, లక్ష్మన్న, రాజు, ప్రసన్నకుమార్, చంద్రశేఖర్, బ్లాండీనా, మహిమ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్ఎల్బీసీకి చేరిన టీబీఎం బేరింగ్
అచ్చంపేట: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగం వద్దకు శుక్రవారం టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం)కు సంబంధించిన బేరింగ్ చేరుకుంది. అమెరికాకు చెందిన రాబిన్స్ కంపెనీ నుంచి బేరింగ్ కొనుగోలు చేసి ప్రత్యేక నౌకలో చైన్నెకి తీసుకొచ్చారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి ఎస్ఎల్బీసీ అవుట్లెట్ వద్దకు భారీ వాహనంలో తరలించారు. 2023, జనవరి 29న టీబీఎం బేరింగ్, అడాప్టర్, రింగ్బేర్ మరమ్మతుకు గురై అవుట్లెట్ నుంచి పనులు నిలిచిపోయాయి. శ్రీశైలం జలాశయం దోమలపెంట ఇన్లెట్ నుంచి మన్నెవారిపల్లి అవుట్లెట్ వరకు మొత్తం 43.93 కిలోమీటర్ల సొరంగం పనులకుగాను ఇప్పటి వరకు 34.71 కిలోమీటర్ల మేర తవ్వకం పూర్తికాగా, మరో 9.559 కి.మీ. తవ్వాల్సి ఉంది. దోమలపెంట ఎస్ఎల్బీసీ ఇన్లెట్ 13.936 కిలోమీటరు వద్ద ఫిబ్రవరి 22న సొరంగం పైకప్పు కూలి ఎనిమది మంది కార్మికులు చిక్కుకోగా.. ఇద్దరి మృతదేహాలు మాత్రమే వెలికితీశారు. మరో ఆరుగురి జాడ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో ఇన్లెట్ వద్ద తవ్వకాలు జరిపే టీబీఎం పూర్తిగా ధ్వంసం కావడంతో ప్లాస్మా కట్టర్తో కత్తిరించి భాగాలను బయటకు తరలిస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాన్ని డీ1 జోన్గా గుర్తించారు. జీఎస్ఐ ఇచ్చిన నివేదిక ప్రకారం సొరంగం, కార్మికుల భద్రత దృష్ట్యా ఇక్కడ తవ్వకాలు జరపడం మంచిది కాదని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రత్యామ్నాయంగా డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానం అనుసరించాలని చూస్తోంది. కేంద్ర పర్యావరణశాఖ అనుతిస్తేనే ఈ విధానంలో పనులు చేపట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు మన్నెవారిపల్లి వైపు 20.43 కిలోమీటరు నుంచి సొరంగం తవ్వకం పనులు ప్రారంభించి పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం టీబీఎం బేరింగ్, ఇతర పరికరాలు తెప్పించారు. మరో పదిరోజుల్లో బేరింగ్ బిగించి నెలాఖరులో తవ్వకాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మన్నెవారిపల్లి అవుట్లెట్ నుంచి ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం -
జడ్చర్లలో గాలివాన బీభత్సం
జడ్చర్ల టౌన్/రాజాపూర్/నవాబుపేట: జడ్చర్ల నియోజకవర్గంలో శుక్రవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో పాటు ఉరుములు, మెరుపులతో వనగండ్ల వర్షం కురిసింది. జడ్చర్ల మండలంలోని మాచారం, పోలేపల్లి, గంగాపురం, మల్లెబోయిన్పల్లి, జడ్చర్ల పట్టణంలో పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి విద్యుత్ తీగలపై పడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ట్రాన్స్ఫార్మర్ సైతం ఒరిగిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో ఫ్లెక్సీలు, ప్లాస్టిక్ కవర్లు గాలులకు ఎగిరి కరెంట్ తీగలపై పడ్డాయి. రాజాపూర్ మండలంలోని ముదిరెడ్డిపల్లి, రాయపల్లి, నందిగామలో వడగండ్ల పడ్డాయి. పలు చోట్ల వడ్లు, మామిడి కాయలు రాలిపోయాయి. ముదిరెడ్డిపల్లి నుంచి రాయపల్లి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై చెట్లు విరిగి అడ్డంగా పడటంతో గ్రామానికి వెళ్లే ప్రజలు ఇబ్బందుల పడ్డారు. నవాబుపేట మండలం కారూర్లో గాలివానకు పెంపుడు పందుల షెడ్డు ధ్వంసం కావడంతో నిర్వాహకుడు ఆంజనేయులుకు దాదాపు రూ.10 లక్షల నష్టం వాటిల్లింది. కాగా.. వీలైనంతంగా త్వరగా విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నట్లు ఏడీఈ చంద్రశేఖర్ తెలిపారు. ● కావేరమ్మపేట శివారులో వ్యవసాయ పొలంలో వెంకటయ్యకు చెందిన రెండు గేదెలు పిడుగుపాటుకు గురై మృతి చెందాయి. గేదెల విలువ దాదాపు రూ.1.20 లక్షలు ఉంటుందని.. ప్రభుత్వపరంగా ఆదుకోవాలని బాధిత రైతు కోరారు. బాదేపల్లి వ్యవసాయ మార్కెట్యార్డు ఆవరణలో ఆరబోసిన మొక్కజొన్న వర్షానికి తడిసిపోయింది. -
పెద్దర్పల్లి యువకుడు
దుబాయ్లో చిక్కుకున్న ● చేయని నేరానికి మూడు నెలల జైలుశిక్ష ● హోల్డ్లో పాస్పోర్ట్.. స్వదేశానికి రాకుండా ఇబ్బందులు ● ఆదుకోవాలంటూ వేడుకోలు హన్వాడ: బతుకుదేరువు కోసం మధ్య దళారి ద్వారా దుబాయ్కి వెళ్లిన ఓ యువకుడు చిక్కుల్లో పడ్డాడు. తన గుర్తింపు కార్డుతో వేరొక మిత్రునికి మొబైల్ సిమ్ ఇప్పించిన నేరానికి అక్కడి పోలీసులు ట్రావెల్ బాండ్ కేసులో రూ.9 వేలు (దుబాయ్ రూపాయలు) జరిమానా విధించారు. ఈ డబ్బులు కట్టని నేరానికి యువకుడిని మూడు నెలల పాటు జైలుకు పంపారు. అలాగే స్వదేశానికి రాకుండా పాస్పోర్ట్ను హోల్డ్లో పెట్టారు. దీంతో అక్కడ చేసేందుకు పనులు దొరకక, స్వదేశానికి రాలేక తోటి కార్మికుల సాయంతో ఫోన్లో సందేశాలు పంపుతూ తనను ఆదుకోవాలంటూ వేడుకుంటున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలంలోని పెద్దర్పల్లి గ్రామానికి చెందిన మ్యాతరి గోపాల్ 2019లో బతుకుదెరువు కోసం మధ్య దళారీ ద్వారా దుబాయ్ వెళ్లాడు. నాలుగేళ్లకు ఇంటికి వచ్చి మళ్లీ దుబాయ్కు వెళ్లాడు. అయితే గోపాల్ను షార్జా విమానాశ్రయంలో తన ఐడీ కార్డు సాయంతో వేరొక మిత్రుడికి సిమ్ ఇప్పించినందుకు అక్కడి పోలీసులు దుబాయ్ రూపాయలలో రూ.9 వేల దినార్ కట్టాలని ఫైన్ వేళారు. అంత డబ్బు నేను చెల్లించలేనని చెప్పడంతో 3 నెలల జైలుశిక్ష అనుభవించాడు. తనపై ఉన్న ట్రావెల్ బాండ్ కేసును కొట్టివేయాలని అక్కడి అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదు. పనులు దొరకక నరకం అనుభవిస్తున్న గోపాల్ స్వదేశానికి రావడానికి ప్రయత్నం చేయడంతో పాస్పోర్ట్ను హోల్డ్లో పెట్టారు. దీంతో యువకుడు ఇటు స్వదేశానికి రాలేక.. అటు పనులు దొరకక ఇబ్బందులు పడుతున్నానని, తనను స్వదేశానికి రప్పించాలని స్నేహితులకు ఫోన్లో సమాచారం ఇచ్చాడు. ఈ విషయమై ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని యువకుడిని స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని బాధితుడి కుటుంబీకులు, పెద్దర్పల్లి గ్రామస్తులు ముక్తకంఠంతో కోరుతున్నారు. మతిస్థిమితం లేని తల్లి.. బ్లడ్ క్యాన్సర్తో అన్న ఇదిలా ఉండగా.. మ్యాతరి గోపాల్ తల్లి మ్యాతరి వెంకటమ్మ మతిస్థిమితం లేక కొడుకు రాక కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తోంది. దీనికి తోడు తన అన్న మ్యాతరి కృష్ణయ్య బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నాడు. రెక్కాడితే కాని డొక్కాడని స్థితిలో ఉన్న మ్యాతరి గోపాల్ కుటుంబాన్ని ఆదుకోవడానికి వెళ్లి చిక్కుల్లో పడ్డాడు. ఇది తెలిసిన బంధువులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొడుకు రాక కోసం ఎదురుచూస్తున్న మతిస్థిమితం లేని వెంకటమ్మ -
రైలు కిందపడి వ్యక్తి బలవన్మరణం
ఆత్మకూర్: రైలుకు ఎదురుగా వెళ్లి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన గద్వాల, శ్రీరాంనగర్ రైల్వేస్టేషన్ల నడుమ చోటు చేసుకుంది. రైల్వే పోలీస్ అధికారి అశోక్, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. గద్వాలలోని హౌజింగ్బోర్డుకాలనీకి చెందిన ఏకే బాలరాజు (30) కొంతకాలంగా తాగుడుకు బానిసకావడంతో ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. తండ్రి నాగేశ్వర్రెడ్డి, కుటుంబ సభ్యులు వైద్యం చేసుకోవాలని కోరగా బాలరాజు నిరాకరించి గురువారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి వెళ్లి అర్ధరాత్రి సమయంలో గద్వాల, శ్రీరాంనగర్ రైల్వేస్టేషన్ల నడమ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం మృతదేహాన్ని గద్వాల మార్చురికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు రైల్వే పోలీసులు తెలిపారు. కాంట్రాక్ట్ అధ్యాపకుడి దుర్మరణం పెద్దకొత్తపల్లి: కారు, బైక్ ఢీకొని ఓ యువకుడు మృతిచెందిన ఘటన మండలంలోని చంద్రకల్ సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. మండలంలోని గన్యాగులకు చెందిన బాలరాజు (27), మల్లేష్ గ్రామం నుంచి మండల కేంద్రానికి వస్తుండగా కొల్లాపూర్ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో బాలరాజు అక్కడికక్కడే మృతిచెండగా.. మల్లేష్కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానికులు వెంటనే జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని జిల్లా ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాలరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కాంట్రాక్ట అధ్యాపకుడి పని చేస్తున్నారు. కారు ఢీకొని వ్యక్తి.. కొత్తకోట: కారు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన పెబ్బేరు మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ యుగంధర్రెడ్డి కథనం మేరకు.. పెబ్బేరుకు చెందిన చెటమోని ఎల్లస్వామి (37) పొలం పనులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై పెబ్బేరుకు బయలుదేరాడు. రంగాపూర్ జాతీయ రహదారిపై బైపాస్ వద్దకు చేరుకోగానే హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ వివరించారు. ఎల్లస్వామికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. బస్సు, బైక్ ఢీకొని మరొకరు .. కృష్ణా: మండలంలోని గుడెబల్లూర్ గ్రామపంచాయతీ టైరోడ్డులో శుక్రవారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనం, బస్సు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందినట్లు ఎస్ఐ ఎండీ నవీద్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. మండలంలోని ప్రెగడబండకు చెందిన కుర్వ అంజప్ప (28) తన ద్విచక్ర వాహనంపై కర్ణాటకలోని కొర్తికొందకు బయలుదేరాడు. టైరోడ్డుకు చేరుకోగానే హైదరాబాద్ నుంచి రాయచూర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. వెంటనే చుట్టుపక్కల వారు అంబులెన్స్లో రాయచూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. అంజప్పకు భార్య శంక్రమ్మ, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. -
11 నెలల్లో 4 మృత్యువాత..
చిరుత వలసలు పెరిగిన క్రమంలో నారాయణపేట జిల్లాలో 11 నెలల కాలంలో నాలుగు మృతి చెందడం కలకలం సృష్టిస్తోంది. గత ఏడాది మే నాలుగో తేదీన మద్దూరు మండలం నందిగామ గ్రామ పంచాయతీ పరిధి మల్కిజాదరావుపల్లి శివారులోని పొలంలో ఓ చిరుత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. అదే ఏడాది ఆగస్ట్ 17న అదే మండలం జాదరావుపల్లి శివారు తాటిగట్టు సమీపంలోని రాయం చెరువు వద్ద మరో చిరుత చనిపోయింది. ఈ ఏడాది జనవరి 28న దామరగిద్ద మండలం ఉడుమల్గిద్ద శివారులో ఉన్న గుట్టలో ఇంకొకటి, ఫిబ్రవరి 16న మద్దూరు మండలంల మోమినాపూర్ శివారులో మరొకటి మృత్యువాత పడింది. పోస్టుమార్టంలో ఇవి సహజ మరణాలేనని తేలినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో సంరక్షణకు చర్యలు చేపట్టారు. మోమిన్ పూర్ లో చనిపోయిన చిరుతను పరిశీలిస్తున్న అటవీ సిబ్బంది -
నిర్వాసితులను ఆదుకోవాలి
మక్తల్: నియోజకవర్గంలోని జూరాల, సంగంబండ, భూత్పూర్ రిజర్వాయర్ల కింద ముంపునకు గురైన గ్రామాలకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఆదుకోవాలని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి విన్నవించారు. శుక్రవారం హైదరాబాద్లోని జలసౌధలో ఆర్అండ్ఆర్ నిర్వాసితుల సమస్యలపై సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముంపు గ్రామాల ప్రజల సమస్యలు పరిష్కరించి ప్రభుత్వం తరపున ఆదుకోవాలని కోరారు. అదేవిధంగా కృష్ణానదిపై ఉన్న ఎత్తిపోతల పథకాలు ఎన్నో ఏళ్లగా పని చేయడం లేదని, కొన్నింటికి మాత్రమే మరమ్మతులు చేశామని తెలిపారు. మిగిలిన ఎత్తిపోతల పథకాల్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని, బాగు చేయించి వినియోగంలోకి తీసుకురావాలని కోరారు. అసంపూర్తిగా ఉన్న సాగునీటి కాల్వలు పూర్తి చేస్తే మరికొన్ని ఎకరాలకు సాగునీరు అంది రైతులు అభివృద్ధి బాటలో పయనిస్తారని చెప్పారు. సమావేశంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీపీ గడ్డంపల్లి హన్మంతు, గడ్డం రమేష్, కుర్మయ్యగౌడ్, రాఘవేందర్రెడ్డి, రఘుపతిరెడ్డి, అశోక్గౌడ్ పాల్గొన్నారు. -
‘నల్లమల’కు తరలిస్తున్నాం..
నారాయణపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో చిరుతల సంచారం పెరిగిన మాట వాస్తవమే. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నాం. చిరుత సంచారాన్ని తెలుసుకునేలా మోమినాపూర్, నందిగామ, నందిపాడ్ వంటి ప్రధాన చోట్ల ట్రాక్ కెమెరాలు అమర్చాం. ఈ ప్రాంతాలతోపాటు దేవరకద్ర, ధన్వాడ ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేశాం. కొత్తపల్లి మండలం నందిగామ, ధన్వాడలో ఇప్పటివరకు రెండింటిని బంధించి నల్లమల పరిధిలోని లింగాల, అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాం. మిగతా వాటిని తరలిస్తాం. ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకుంటాం.. – కమాలొద్దీన్, జోగుళాంబ సర్కిల్ అటవీ రేంజ్ ఆఫీసర్ ● -
పంచాయతీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి
మహబూబ్నగర్ న్యూటౌన్: గ్రామ పంచాయితీ వర్కర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయితీ వర్కర్ల యూనియన్ జిల్లా అధ్యక్షుడు జి.వెంకట్రాములు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం జిల్లాకేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీఓ 60 ప్రకారం జీతాలు పెంచాలని, పెండింగ్ వేతనాలు ఇవ్వాలని, జీఓ 51ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీయూసీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేశ్, జిల్లా అధ్యక్షుడు దేవదానం, సాంబశివుడు, కుర్మయ్య, వెంకట్రాములు, తిమ్మయ్య, రంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
మెనూ పాటించడం లేదని హాస్టల్ విద్యార్థుల నిరసన
కల్వకుర్తి టౌన్: పట్టణంలోని మోడల్ డిగ్రీ కళాశాల హాస్టల్లో విద్యార్థులకు ప్రభుత్వం అందించే కామన్ మెనూ పాటించడం లేదని విద్యార్థులు నిరసన తెలిపారు. గురువారం రాత్రి భోజన సమయంలో భోజనానికి ముందు మెనూ గురించి అడిగితే ఔట్సోర్సింగ్ కుక్ శ్రీశైలం పొంతలేని సమాధానాలు చెప్పారని ఆరోపించారు. భోజనాలు చేయకుండా హాస్టల్లో ఉండే విద్యార్థులు అంతా కలిసి పట్టణంలోని పాలమూరు రోడ్డుపైకి వెళ్లారు. వెంటనే అప్రమత్తమైన హాస్టల్ వార్డెన్ ఖలీల్ విద్యార్థులకు నచ్చజెప్పి హాస్టల్కు తీసుకొచ్చారు. హాస్టల్ లోపలికి వచ్చిన విద్యార్థులు భోజనం చేయమని వారించి రాత్రి 10 గంటల దాకా హాస్టల్ ఎదుట కూర్చొని నిరసన తెలిపారు. చివరికి హాస్టల్ వార్డెన్ వారికి నచ్చజెప్పి, కుక్ను తొలగిస్తామని, మెనూ ప్రకారం భోజనం ఉండేలా చూసేందుకు ఉన్నతాధికారులతో మాట్లాడి అందేలా చూస్తానని చెప్పడంతో విద్యార్థులు నిరసన విరమించి.. భోజనాలు చేశారు. -
ఆధార్లా ప్రతి రైతుకు భూధార్ కార్డులు
జడ్చర్ల: ప్రతి ఒక్కరికి భూమితో అనుబంధం ఉందని, ఆయా భూ సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం ధరణి స్థానంలో కొత్తగా భూభారతి చట్టం అమలులోకి తీసుకొచ్చిందని కలెక్టర్ విజయేందిర బోయి పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న భూభారతి చట్టంపై జడ్చర్లలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధరణి చట్టంలో భూ సమస్యలను సకాలంలో పరిష్కరించలేని స్థితి ఉండేదని, ప్రజావాణిలో తమకు అనేక సమస్యలపై ఫిర్యాదు లు వచ్చాయన్నారు. తాజాగా అమలులోకి వచ్చిన భూభారతి చట్టంలో ఆయా సమస్యల పరిష్కారం లభించే అవకాశం ఏర్పడిందన్నారు. గతంలో తాము పరిష్కరించలేని సమస్యలకు సంబంధించి సివిల్ కోర్టులను ఆశ్రయించే పరిస్థితి ఉండేదన్నా రు. ఇక నుంచి భూభారతి చట్టంతో ఆ పరిస్థితి ఉండదన్నారు. తహసీల్దార్పై ఆర్డీఓకు, ఆర్డీఓ నుంచి కలెక్టర్కు, కలెక్టర్ నుంచి భూపరిపాలన కమిషనర్కు, అక్కడి నుంచి ట్రిబ్యునల్కు అప్పీల్కు వెళ్లి సమస్యలు పరిష్కరించుకునే వెసులుబాటు ఉందన్నారు. ఆధార్కార్డుల మాదిరిగా భూధార్ కార్డులు జారీ చేయడంతో పాటు పాసు పుస్తకంలో భూమికి సంబంధించి మ్యాపును పొందుపరుస్తామన్నారు. సమస్య సత్వర పరిష్కారానికి క్షేత్రస్థాయిలో గ్రామ పరిపాలన అధికారులు ఉంటారని, లైసెన్స్డ్ సర్వేయర్లను ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందన్నారు. ఇక భూ తగాదాలు, వివాదాలు, భయాలు లేకుండా భూ క్రయవిక్రయాలు పారదర్శకంగా ఉంటాయన్నారు. భూ హక్కులు భూ యజమానికే ఉంటూ సంపూర్ణంగా అనుభవించే హక్కులు కొత్తచట్టంలో ఉంటాయని పేర్కొన్నారు. ● భూ భారతి చట్టం ఓ విప్లవాత్మకమైన మార్పు అని చట్టం రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించిన భూమి సునీల్ పేర్కొన్నారు. ఇందులో కీలకమైన 4,5,7,8 సెక్షన్లను గుర్తుంచుకుంటే మంచిందన్నారు. 25 లక్షల మంది రైతులకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసమే భూ భారతి చట్టాన్ని అధ్యయనం చేసి రూపొందించినట్లు చెప్పారు. జూన్ 2 నుంచి ఆగస్టు 15 వరకు జరిగే రెవెన్యూ సదస్సులలో దరఖాస్తును స్వీకరించనున్నట్లు చెప్పారు. దాదాపు 6వేల మంది లైసెన్స్డ్ సర్వేయర్లను ప్రభుత్వం గుర్తించనుందన్నారు. సెక్షన్ 6 ప్రకారం సాదాబైనామాలను క్రమబద్ధీకరించనుందని తెలిపారు. అవగాహన సదస్సు అనంతరం రైతులతో కలిసి వారు సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మోహన్రావు, ఆర్డీఓ నవీన్, తహసీల్దార్ నర్సింగరావు, మార్కెట్ యార్డు చైర్పర్సన్ జ్యోతి, తదితరులు పాల్గొన్నారు. నేనూ ధరణి బాధితుడినే: ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి తాను రాజకీయాల్లోకి రావడానికి భూ సమస్యలే కారణమని, తానూ ధరణి బాధితుడినేనని ఎమ్మెల్యే అనిరుధ్డ్డి తెలిపారు. రంగారెడ్డిగూడెంలో తమ తాతలు దేవాదాయశాఖకు ఇచ్చిన భూమిని కొందరు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో తాము కొట్లాడి కోర్టుకు వెళ్లి దేవాదాయ శాఖ భూమిని కాపాడుకున్నామన్నారు. తాను రాజకీయాలలోకి రావడానికి ఇదే కారణమన్నారు. ప్రజాపాలనలో భాగంగానే భూ సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్రెడ్డి కొత్త చట్టాన్ని అమలులోకి తెచ్చారని తెలిపారు. భూసమస్యల పరిష్కారం కోసమే భూభారతి పాసు పుస్తకంలో భూమికి సంబంధించి మ్యాపు: కలెక్టర్ విజయేందిర జడ్చర్లలో అవగాహన సదస్సు -
సంజనకుఎస్పీ అభినందన
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఇటీవల తోటి కళాకారులతో కలిసి కూచిపూడి నృత్య ప్రదర్శనలో గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించిన నగరానికి చెందిన సంజనను ఎస్పీ డి.జానకి అభినందించారు. మహబూబ్నగర్లోని రైతుబజార్లో కూరగాయల వ్యాపారం చేసే భాగ్యలక్ష్మి, మాడమోని చందు దంపతుల ఏకై క కూతురైన ఈ బాలిక ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని చైతన్య సెంట్రల్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతోంది. అలాగే స్థానిక వైష్ణవి ఆర్ట్స్ అకాడమిలో క్లాసికల్ డాన్స్ టీచర్ విజయలక్ష్మి వద్ద తొమ్మిదేళ్ల పాటు కూచిపూడి నాట్యం నేర్చుకుంది. గురువారం ఎస్పీని ఈ విద్యార్థిని తన తల్లిదండ్రులతో పాటు కలిశారు. కాగా, చదువులోనూ ఉత్తమ ప్రతిభ చూపి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకునిరావాలని సూచించారు. బాదేపల్లి మార్కెట్కు పోటెత్తిన మొక్కజొన్న జడ్చర్ల: బాదేపల్లి మార్కెట్ యార్డుకు గురువారం మొక్కజొన్న దిగుబడులు పోటెత్తాయి. దాదాపు 2,474 క్వింటాళ్ల మొక్కజొన్న విక్రయానికి రాగా.. క్వింటాల్గా గరిష్టంగా రూ.2,259, కనిష్టంగా రూ.1,681 ధరలు లభించాయి. అదేవిధంగా వేరుశనగ గరిష్టంగా రూ.6,639, కనిష్టంగా రూ.5,241, కందులు రూ.6,411, రాగులు రూ.2,711, చిందగింజలు రూ.3,427, జొన్నలు గరిష్టంగా రూ.4,177, కనిష్టంగా రూ.3,277, ధాన్యం హంస గరిష్టంగా రూ.1,925, కనిష్టంగా రూ.1,809, ఆర్ఎన్ఆర్ గరిష్టంగా రూ.2,306, కనిష్టంగా రూ.1,809, ఆముదాలు రూ.గరిష్టంగా రూ.6,188, కనిష్టంగా రూ.6,058 ధరలు పలికాయి. ఎన్టీఆర్ కళాశాలలో జాతీయ సదస్సు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో తెలుగు డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రబంధ వాజ్మ యం సాహిత్యం శీలనముఅనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ నేటి కాలంలో కవులు అంతరించి పోతున్నారని, ఇలాంటి తరుణంలో కళాశాలలో ప్రబంధ వాజ్మయం పేరుతో సెమినార్ నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. ఈ ప్రబంధ వాజ్మయం హాస్యం, చతురత, వర్ణన, శృంగారం, కథ అనే అంశాల ఆధారంగా ఆనాటి జీవన స్థితిగతులను, ఆర్థిక, సామాజిక పరిస్థితులను వివరిస్తుందన్నారు. ఈ సందర్భంగా సెమినార్ సావనీర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పీయూ ప్రిన్సిపాల్ మధుసూదన్రెడ్డి, కసిరెడ్డి వెంకట్రెడ్డి, పీయూ కంట్రోలర్ రాజ్కుమార్, లక్ష్మీనరసింహరావు, కేశర్దన్ తదితరులు పాల్గొన్నారు. 22న జిల్లా సదస్సు మహబూబ్నగర్ న్యూటౌన్: కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మే 20న నిర్వహించే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేసేందుకు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 22న జిల్లా సదస్సు నిర్వహించనున్నట్లు సీఐటీయూ జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి తెలిపారు. గురువారం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం కలిసి రావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు వెంకటేశ్గౌడ్, వేణుగోపాల్, అనురాధ, పద్మ, అంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రాథమిక హక్కులపై అవగాహన ఉండాలి
చిన్నచింతకుంట: రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహణ కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి డి.ఇందిర సూచించారు. చైల్డ్ ఫ్రెండ్లీ కమిటీ ఆధ్వర్యంలో చిన్నచింతకుంటలో మహిళా సంఘం సభ్యులు, కస్తూర్బ విద్యార్థినీలకు ప్రాథమిక హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ ఒక నేరం జరిగినప్పుడు చూసినా, తెలిసినా కచ్చితంగా సాక్ష్యం చెప్పాలని.. అప్పుడే నేరస్తుడికి శిక్ష పడుతుందన్నారు. నేరాల అదుపునకు చట్టాలతో పాటు బాధ్యతలు కూడా ముఖ్యమన్నారు. ప్రభుత్వం బాలల హక్కుల పరిరక్షణకు ఎన్నో పథకాలను అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బాల్య వివాహాలు చట్ట విరుద్ధమని వాటిని ప్రోత్సహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. స్నేహ పూర్వకమైన బాలల న్యాయ సేవల పథకం 2024 ప్రకారం బాలలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఎక్కడైనా బాల్యవివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే జిల్లా న్యాయ సేవ అధికార సంస్థకు లేదా 100 డయల్ చేయాలని, 1098కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఎల్లయ్య, ఎంపీడీఓ సుధాకర్రెడ్డి, ఎస్ఐ రామ్లాల్నాయక్, ఏపీఎం విష్ణుచారి, మండల మహిళ సమైక్య అధ్యక్షురాలు పద్మమ్మ, లీగల్ వలంటీర్ యాదయ్య, తదితరులు పాల్గొన్నారు. -
బీసీలంతా సంఘటితం కావాలి
నవాబుపేట: బీసీలంతా సంఘటితమై దోపిడీ వర్గాల రాజ్యాలను కూలదోసి నియంత పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని బీసీ జనచైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు అజయ్కుమార్ యాదవ్ అన్నారు. గురువారం మండలంలోని పర్వతాపూర్ మైసమ్మ ఆలయ ఆవరణలో బీసీ జనచైతన్య సదస్సు వేదిక జిల్లా నాయకుడు మాధవులు అధ్యక్షతన జరగగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా నేటికీ దోపిడీ రాజ్యం నడుస్తోందన్నారు. ఏళ్లుగా దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్కు తాజాగా బీసీల గణన గుర్తుకురావటం హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్ అది నాయకత్వానికి ధైర్యం ఉంటే రాష్ట్రంలో బీసీని ముఖ్యమంత్రి చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కేంద్రంలోని బీజేపీ సైతం అధిక జనాభా కలిగిన బీసీలను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. బీసీలంతా పార్టీలు వీడి సమష్టిగా ఉన్నప్పుడే బలం తెలిసి రాజ్యాధికారం వస్తుందని వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర యూత్ అధ్యక్షుడు బోయిని మహేష్, జిల్లా అధ్యక్షుడు గోపాల్యాదవ్, మాజీ సర్పంచ్లు యాదయ్య, ఆంజనేయులు, మాసయ్య, నాయీ బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేష్నాయీ, జిల్లా నాయకులు అంజయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
హార్వెస్టర్ మరమ్మతు చేస్తూ.. యువకుడు మృతి
ఆత్మకూర్: వరి కోత యంత్రం మరమ్మతు చేస్తూ ప్రమాదవశాత్తు ఓ యువకుడు మృతిచెందిన ఘటన గురువారం పట్టణంలో చోటు చేసుకుంది. ఎస్ఐ నరేందర్ కథనం మేరకు.. పట్టణంలోని భార్గవినగర్కు చెందిన కావలి వెంకటేష్ (30) సొంతంగా వరి కోత యంత్రం నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. గురువారం మధ్యాహ్నం మేడేపల్లి శివారులో వరికోత యంత్రం మరమ్మతుకు గురికావడంతో డ్రైవర్ మన్యంతో కలిసి బాగు చేస్తుండగా కట్టర్ బార్ మీద పడటంతో వెంకటేష్ తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వివరించారు. చికిత్స పొందుతూ వ్యక్తి .. పాన్గల్: రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతిచెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 13వ తేదీన పాన్గల్ మండలంలోని అన్నారంతండా సమీపంలో రెండు బైక్లు ఢీకొన్నాయి. ఈ సంఘటనలో వనపర్తి మండలం నాగవరం గ్రామానికి చెందిన దేవేందర్(47)కు తీవ్ర గాయాలు కావడంతో హైదరాబాద్కు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ గురువారం మృతిచెందినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. మృతుఢి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. బాలికపై వేధింపులు.. యువకుడిపై కేసు నమోదు మిడ్జిల్: మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలోని బోయిన్పల్లిలో మైనర్ బాలికను అదే గ్రామానికి చెందిన రాఘవేందర్ వేధిస్తున్నాడని, అమ్మాయి తండ్రి చేసిన ఫిర్యాదు మేరకు యువకుడిపై గురువారం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివనాగేశ్వర్నాయుడు తెలిపారు. దొంగకు మూడేళ్ల జైలుశిక్ష ఖిల్లాఘనపురం: దొంగతనానికి పాల్పడిన ఓ వ్యక్తికి న్యాయమూర్తి మూడేళ్ల కఠిన జైలు శిక్ష, రూ.500 జరిమానా విధించినట్లు ఎస్ఐ సురేష్గౌడ్ తెలిపారు. వివరాలు.. ఖిల్లాఘనపురం మండలంలోని బజారు ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో ఉన్న బంగారు వర్క్షాపులో 2024 డిసెంబర్ 24న 14 గ్రాముల బంగారు ఆభరణాలు, 615 గ్రాముల వెండి వస్తువులు కలిపి మొత్తం రూ.40,300 విలువ చేసే వస్తువులు దొంగిలించబడ్డాయి. ఈ విషయమై షాపు యజమాని ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఖిల్లాఘనపురం గ్రామానికి చెందిన పంతంగాణి మన్యంకొండ దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు డిసెంబర్ 29 కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి ఆదేశంతో రిమాండ్ తరలించారు. ఎస్ఐ సురేష్గౌడ్ చోరీకి సంబంధించిన పూర్తి వివరాలు కోర్టుకు సమర్పించడంతో వనపర్తి జూనియర్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు రెండో అదనపు న్యాయమూర్తి నిందితుడికి మూడేళ్ల కఠిన జైలు శిక్ష ఖరారు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ కేసులో రాష్ట్ర అభియోగ అధికారి వై.రాజేష్, కోర్టు డ్యూటీ అధికారి టి.శ్రీనివాసులు సహకారం అందించారని పేర్కొన్నారు. -
డెడ్ స్టోరేజీ
మే నెలాఖరుకు ఎడారిలా.. జూరాల ప్రాజెక్టు●అడుగంటిపోయిన జూరాల జలాశయం ఎండలు ఎక్కువైతే ఇబ్బందులు.. ప్రస్తుతం జూరాలలో ఉన్ననీటి నిల్వలను పూర్తిగా తాగునీటి అవసరాలకే వినియోగిస్తాం. ఇప్పుడు జలాశయంలో అందుబాటులో ఉన్న నీరు మే నెలాఖరు వరకు సరిపోతాయి. అయితే ఎండలు ఎక్కువైతే ఇబ్బందులు రావొచ్చు. అప్పుడు పరిస్థితులను బట్టి అవసరమైన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటాం. – రహీముద్దీన్ ఎస్ఈ జూరాల మరో తడి ఇవ్వండి.. అమరచింత ఎత్తిపోతల ద్వారా రబీలో 6 ఎకరాల్లో వరి పంట సాగు చేశా. ప్రస్తుతం జూరాల ఎడమ కాల్వ ద్వారా సాగునీటిని నిలిపేస్తున్నామని అధికారులు చెప్పారు. ఈ కాల్వకు అనుసంధానంగానే అమరచింత లిఫ్ట్కు సాగునీరు అందుతుంది. మరో తడి సాగు నీరు ఇస్తేనే మా పంటలు చేతికి వస్తాయి. – వెంకటేశ్వర్రెడ్డి, రైతు, అమరచింత రైతులను ఆదుకోవాలి.. జూరాల ప్రధాన ఎడమ కాల్వ పరిధిలోని డీ–6లో పంటలు సాగు చేస్తున్న రైతులకు ఇంకా పక్షం రోజుల పాటు నీళ్లు ఇస్తేనే పంట చేతికి వస్తుంది. ఈ విషయమై ప్రజాప్రతినిధులు, అధికారులకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం. మా పంటలు చేతికి వచ్చే విధంగా సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలి. – లక్ష్మణ్, రైతు, ఆరేపల్లి, ఆత్మకూర్ మండలం గద్వాల: ఉమ్మడి పాలమూరు జిల్లాకు పెద్దదిక్కుగా అయిన జూరాల జలాశయం గతంలో ఎన్నడూ లేనంతటి గడ్డు పరిస్థితులను ఎదుర్కోబోతోంది. వరుసగా రెండో ఏడాది కూడా జలాశయం అడుగంటిపోయింది. ఫలితంగా ఇప్పటికే సాగునీటి కష్టా లు తలెత్తగా.. రాబోయే రోజుల్లో తాగునీటికి సైతం ఇబ్బందులు ఎదురుకానున్నాయి. అధికారులు ఇప్పటికే జూరాల ఎడమ, కుడి ప్రధాన కాల్వల కింద రబీలో సాగుచేసిన ఆయకట్టుకు నీటి విడుదల పూర్తిగా నిలిపివేశారు. ప్రస్తుతం జూరాలలో అందుబాటులో ఉన్న నీటి నిల్వలు ఈ నెలాఖరు నాటికే సరిపోతాయని, మే, జూన్ నెలల్లో తాగునీటికి కూడా ఇబ్బందులు తలెత్తవచ్చని రూపొందించిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. ఈ నేపథ్యంలో రాబోయే రెండు నెలల్లో తాగునీటి గండాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నా య చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జిల్లాకు రూ.కోటి చొప్పున రూ.5 కోట్లను ఆయా కలెక్టర్లకు విడుదల చేశారు. అధిక సాగు నేపథ్యంలో.. జూరాల కింద.. జూరాల జలాశయం కింద ఎడమ, కుడి ప్రధాన కాల్వలు ఉండగా.. దీని ద మొత్తం ఆయకట్టు 1.09 లక్షల ఎకరాలు. కాగా ప్రతి ఏడాది ఖరీఫ్లో ఎడమ ప్రధాన కాల్వ పరిధిలో వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాల్లో 72 వేల ఎకరాలు, కుడి ప్రధాన కాల్వ కింద జోగుళాంబ గద్వాల జిల్లా పరిధిలో 37 వేల ఎకరాల్లో పంటలు సాగు చేస్తారు. ఈ ఏడాది జూరాలలో నీటి నిల్వలను దృష్టిలో ఉంచుకుని ఆయా కాల్వల కింద కేవలం 35 వేల ఎకరాలకు వారబందీ విధానంలో ఏప్రిల్ 15 వరకు సాగునీటిని అందిస్తామని అధికారులు ప్రకటించారు. కానీ, రైతులు అధికంగా సుమారు 50 వేల ఎకరాల్లో వరిపంట సాగుచేయడంతో సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. మే నెలాఖరు నాటికే.. ఇదిలా ఉండగా ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట, వనపర్తి, నాగరకర్నూల్ జిల్లాలు తాగునీటి అవసరాల కోసం జూరాల జలాశయం మీదనే ఆధారపడి ఉన్నాయి. ఇందుకోసం ప్రస్తుతం రోజుకు 0.1 టీఎంసీల నీటిని వదులుతున్నామని అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన జలాశయంలో ఉన్న 0.208 టీఎంసీల నీరు మే నెలాఖరు నాటికే సరిపోతాయని అధికారులు అంచనా వేశారు. తొమ్మిదేళ్లుగా మే మొదటి వారంలో జూరాలలో అందుబాటులో నీటినిల్వలు ఇలా... ఏడాది అందుబాటులో నీటినిల్వ 2016 3.696 టీఎంసీలు 2017 4.829 టీఎంసీలు 2018 4.747 టీఎంసీలు 2019 2.689టీఎంసీలు 2020 7.627 టీఎంసీలు 2021 6.477 టీఎంసీలు 2022 7.836 టీఎంసీలు 2023 4.038 టీఎంసీలు 2024 4.004 టీఎంసీలు 2025 2.953 టీఎంసీలు (ఏప్రిల్17) అడుగంటిన జలాశయం.. ఆందోళనలో రైతన్నలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నది 2.871 టీఎంసీలు మాత్రమే తాగునీటి కోసం ప్రతి రోజు 0.1 టీఎంసీలు వినియోగం ఇప్పటికే ఆయకట్టు పరిధిలోని పంటలకు సాగునీటి నిలిపివేత రాబోయే రోజుల్లో మరింత గడ్డు పరిస్థితులు -
ఐతోల్లో భవన నిర్మాణ కార్మికుడి మృతి
నాగర్కర్నూల్ క్రైం: భవన నిర్మాణ పనులకు వచ్చిన కార్మికుడు మృతి చెందిన సంఘటన తాడూరు మండల పరిధిలోని ఐతోలులో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు కథనం ప్రకారం.. పెద్దకొత్తపల్లి మండలం వెన్నచెర్ల గ్రామానికి చెందిన సంపంగి రాములు (32) ఐతోల్లో నిర్మాణమవుతున్న ప్రైవేటు పాఠశాల భవనంలో కూలీ పనికోసం వెళ్లాడు. అస్వస్థతకు గురై కింద పడిపోయి మృతి చెందాడు. మృతదేహాన్ని జిల్లాకేంద్రంలోని జనరల్ ఆస్పత్రికి తరలించారు. భవన యజమాని లక్ష్మారెడ్డి గురువారం రాత్రి వరకు పట్టించుకోకపోవడంతో ఆగ్రహంతో కుటుంబసభ్యులు జిల్లాకేంద్రంలోని ప్రధానరహదారిపై ధర్నాకు దిగారు. యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కొద్దిసేపు ట్రాఫిక్కు అంతరాయం కలగడంతో.. అక్కడికి చేరకున్న పోలీసులు అక్కడి వారిని సముదాయించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. న్యాయం చేయాలని జిల్లాకేంద్రంలో ధర్నా -
‘సోనియాగాంధీపై ఆరోపణలు తట్టుకోలేకపోయా’
వనపర్తి టౌన్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాహుల్గాంధీ బ్రాండ్ ఇమేజ్ రాజకీయాలకు భయపడుతూ ఆక్రమ కేసులతో భయపెట్టాలని చూస్తోందని, మోదీ గాంధీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ, రాహుల్గాంధీలపై ఈడీ చార్జిషీట్ వేయడాన్ని నిరసిస్తూ గురువారం వనపర్తి ప్రధాన పోస్టల్ కార్యాలయం ఎదుట డీసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో చిన్నారెడ్డి పాల్గొని మాట్లాడారు. విలువలు, నిజాయితీ కలిగిన రాజకీయాలకు సోనియాగాంధీ పెట్టింది పేరని, ఆమైపె చార్జీషీటు వేయడాన్ని తట్టుకోలేకపోయానని చిన్నారెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. సోనియాగాంధీని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ గుర్తించుకుంటారన్నారు. నేషనల్ హెరాల్డ్ను రుజువులు లేకుండా లాగుతున్నారని, పుష్కరకాలం నాటి హెరాల్డ్ కేసులో ఒక్క పైసా కూడా మార్పిడి జరగలేదని చెప్పారు. న్యాయస్థానంలో ఈడీకి, కేడీకి భంగపాటు తప్పదని జోస్యం చెప్పారు. డీసీసీ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో ప్రధాని నరేంద్రమోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు రవి, వర్కింగ్ ప్రెసిడెంట్ రాములు, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి వేణు, సింగిల్ విండో అధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాదకర ప్రదేశం మినహాయించి..
అచ్చంపేట: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగంలో శిథిలాల తొలగింపు వేగంగా కొనసాగుతోంది. సహాయక బృందాలు 55 రోజులుగా నిరంతరాయంగా తవ్వకాలు చేపడుతున్నా ఆరుగురి ఆచూకీ లభ్యం కావడం లేదు. గురువారం మూడు షిఫ్ట్లలో సొరంగంలోకి వెళ్లి పేరుకుపోయిన మట్టి, బురద తవ్వకాలు చేపడుతున్నారు. డీ2 ప్రదేశంలో 5 ఎస్కవేటర్లతో పెద్ద పెద్ద బండరాళ్లు తొలగిస్తూ అత్యధికంగా ఉన్న మట్టిని కన్వేయర్ బెల్టు ద్వారా బయటకు తరలిస్తున్నారు. నిషేధిత ప్రదేశం 50 మీటర్లు మినహాయిస్తే.. డీ2–డీ1 మధ్య మరో 20 మీటర్ల పొడువు మూడు అడుగుల మేర ఉన్న మట్టి, బురద, శిథిలాల తొలగింపు ప్రక్రియను మరింత వేగవంతం చేశారు. మరో రెండ్రోజుల్లో ఈ పని పూర్తయ్యే అవకాశం ఉందని సహాయక సిబ్బంది చెబుతున్నారు. సొరంగం పైకప్పు కూలిన 13.940 కిలోమీటరు డీ1 ప్రదేశంలో 40 మీటర్ల వరకు డేంజర్ జోన్గా గుర్తించి కంచె ఏర్పాటు చేశారు. ఈ ప్రదేశంలో బలహీనంగా ఉన్న కాంక్రీట్ సెగ్మెంట్లకు సపోర్టుగా సింగరేణి మైన్స్ రెస్క్యూ సిబ్బంది టైగర్ క్లాక్స్ను ఏర్పాటు చేశారు. ఇక్కడ శిథిలాలు నిండుగా ఉన్నాయి. అత్యంత ప్రమాదకర ప్రదేశం మినహాయించి తవ్వకాలు చేపడుతున్నాయి. ప్రస్తుతం చేపడుతున్న 20 మీటర్ల తవ్వకాల్లో కార్మికుల ఆచూకీ లభించకపోతే పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. టీబీఎం కొంత భాగం నిషేధిత ప్రదేశంలో చిక్కుకుపోయి ఉండటంతో కార్మికులు అందులో ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, జీఎస్ఐ తదితర జాతీయ సహాయక బృందాలతో పాటు ప్రభుత్వ విభాగాలతో ఉన్నతస్థాయి సాంకేతిక కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్వింద్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. నిషేధిత ప్రదేశంలో కార్మికులను గుర్తించే ప్రయత్నాలు కొనసాగించాలా? సహాయక సిబ్బందికి ఎలాంటి నష్టం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కమిటీ ఇచ్చే నివేదికపై ఆధారపడి ముందకెళ్లే అవకాశం కనిపిస్తోంది. డీ–2 ప్రదేశంలో మట్టి తవ్వకాలు.. సొరంగంలోని ప్రమాద డీ2 ప్రదేశంలో సహాయ సిబ్బంది మట్టి తవ్వకాలు చేపడుతున్నారని ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి తెలిపారు. ఎస్ఎల్బీసీ సొరంగం ఇన్లెట్ వద్ద గురువారం సహాయక బృందాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికుల అచూకీ కనుక్కొనేందుకు డీ1, డీ2 ప్రాంతాల్లో అన్వేషణ కొనసాగుతుందన్నారు. డీ2 ప్రదేశంలో మట్టి తవ్వకాలు చేపడుతూ టీబీఎం కత్తిరింపు పనులు చేపడుతున్నామని తెలిపారు. నిరంతరంగా వస్తున్న నీటి ఊటను బయటకు పంపిస్తున్నామని, ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని నిషేధిత ప్రదేశంగా గుర్తించి కంచె ఏర్పాటు చేశామన్నారు. సొరంగం నిపుణులు ప్రమాద ప్రదేశాన్ని నిరంతరం పరిశీలిస్తూ సహాయక సిబ్బందికి తగిన సూచనలు ఇస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో ఆర్మీ అధికారులు వికాస్సింగ్, విజయ్కుమార్, జేపీ కంపెనీ సీనియర్ ప్రాజెక్టు ఇంజినీర్ సంజయ్కుమార్సింగ్, సింగరేణి మైన్స్ రెస్క్యూ జనరల్ మేనేజర్ బైద్య, ఎన్డీఆర్ఎఫ్ అధికారి గిరిధర్రెడ్డి, హైడ్రా అధికారి, దక్షిణ మధ్య రైల్వే అధికారి రవీంద్రనాథ్ పాల్గొన్నారు. మరో రెండ్రోజుల్లో తవ్వకాలు పూర్తయ్యే అవకాశం నిషేధిత ప్రదేశంలో రెస్క్యూ కొనసాగేనా? -
ఉమ్మడి జిల్లాలో సీనియర్ సివిల్ జడ్జిల బదిలీలు
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: రాష్ట్రవ్యాప్తంగా గురువారం జరిగిన సీనియర్ సివిల్ జడ్జిల బదిలీలలో ఉమ్మడి మహబూబ్నగర్కు చెందిన పలువురు ఉన్నారు. వీరిలో నాగర్కర్నూల్ జిల్లా కోర్టులో సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న జి.సబిత యాదాద్రి–భువనగిరి జిల్లాలోని రామన్నపేటకు బదిలీ అయ్యారు. దీంతో ఆ బాధ్యతలను కల్వకుర్తి జడ్జికి అప్పగించారు. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ కోర్టులో అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న నసీం సుల్తానాను నాగర్కర్నూల్ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శిగా పంపిస్తున్నారు. ఇక హైదరాబాద్లోని సిటీ సివిల్ కోర్టులో అడిషనల్ జడ్జిగా పని చేస్తున్న వి.ఈశ్వరయ్యను మహబూబ్నగర్ జిల్లా కోర్టుకు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా వస్తున్నారు. సికింద్రాబాద్లోని రాష్ట్ర జుడీషియల్ అకాడమిలో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్న ఎన్.వెంకట్రాంను నాగర్కర్నూల్ జిల్లా కోర్టుకు సీనియర్ సివిల్ జడ్జిగా రానున్నారు. హైదరాబాద్లోని రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్న జి.కళార్చన వనపర్తి జిల్లా కోర్టుకు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా వస్తున్నారు. ఇక్కడ పనిచేస్తున్న కమలాపురం కవితను వనపర్తిలోని అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జిగా మార్చారు. జోగుళాంబ గద్వాల జిల్లా కోర్టులో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న టి.లక్ష్మిని అక్కడే అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జిగా మార్చారు. అలాగే ఇదే జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శిగా పనిచేస్తున్న గంటా కవితాదేవిని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కోర్టులో సీనియర్ సివిల్ జడ్జిగా బదిలీ చేశారు. మహబూబ్నగర్ కోర్టులో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న గుండ్ల రాధికను ఇక్కడే అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జిగా మార్చారు. -
దేవరగుట్టలో సీసీ కెమెరాల నిఘా
నవాబుపేట: మండలంలోని యన్మన్గండ్ల దేవరగుట్టపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ఫారెస్టు అధికారి చంద్రయ్య తెలిపారు. గురువారం ఆయన సిబ్బందితో కలిసి చిరుతలు నివాసం ఉంటున్న గుట్టను పరిశీలించారు. తమకు, పశువులకు ప్రాణహాని ఉందని చిరుతల నుంచి కాపాడాలని గ్రామస్తులు కోరారు. గ్రామానికి దగ్గరగా ఉన్న గుట్టలో చిరుతలు ఉండటంతో నిత్యం భయంతో జీవిస్తున్నామని రక్షణ కల్పించాలన్నారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారి మాట్లాడుతూ.. దేవరగుట్టలో చిరుతలు ఆవాసం ఏర్పాటు చేసుకున్నాయని, పరిసరాల్లోకి వెళ్లరాదని సూచించారు. చిరుతల కదలికలు గుర్తించేందుకు ముందుగా గుట్ట ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సీసీ కెమెరాల్లో వాటి కదలికల ఆధారంగా బోనుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంటామని వివరించారు. ● బోన్ల ఏర్పాటుపై త్వరలో నిర్ణయం -
దేశంలోనే రోల్ మోడల్గా భూభారతి
నారాయణపేట/మద్దూర్/కొత్తపల్లి: పేదలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చిందని.. ఒక్క రూపాయి తీసుకోకుండానే భూ సమస్యలను పరిష్కరించనున్నామని.. దేశంలోనే భూ భారతి చట్టం రోల్మోడల్గా నిలుస్తుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికై న మద్దూరు మండలం ఖాజీపూర్ గ్రామంలో గురువారం ఏర్పాటు చేసిన భూ భారతి రెవెన్యూ సదస్సుకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై పోర్టల్ను ప్రారంభించారు. అంతకుముందు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి గ్రామస్తులు, రైతులు పెద్ద ఎత్తున మంత్రికి స్వాగతం పలకగా.. కాలినడకన రెవెన్యూ సదస్సు సభా స్థలికి చేరుకుని మాట్లాడారు. ప్రతి రైతుకు భరోసా, భద్రత కల్పించాలని ఉద్దేశంతో మేధావులతో కలిసి ఈ చట్టాన్ని రూపొందించామని, గత ప్రభుత్వ ధరణి చట్టానికి దీనికి ఎంతో తేడా ఉందన్నారు. ప్రజల వద్దకే అధికారులు.. ధరణి చట్టంతో ప్రజలు అధికారుల వద్దకు వెళ్లాల్సి ఉండేదని, భూభారతితో ప్రజల వద్దకే అధికారులు వచ్చి భూ సమస్యలను పరిష్కరిస్తారన్నారు. గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను, వీఆర్ఏ వీఆర్వో వ్యవస్థను కుప్ప కూల్చిందని, ఈ ప్రజా ప్రభుత్వంలో గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించి, అర్హులైన వారిని మళ్లీ తీసుకువచ్చి గ్రామాల్లో ఇలాంటి భూ సమస్య ఎక్కడ ఉన్నా అక్కడే పరిష్కారం చూపిస్తామన్నారు. ఎవరి పేరుతో ఎంత భూమి ఉందో అది వారికే చెందేలా చూస్తామన్నారు. మొదటి విడత 6 వేల మంది లైసెన్స్డ్ సర్వేయర్లను ఏర్పాటు చేసి వారికి శిక్షణ ఇచ్చి మ్యాప్పై సర్వేయర్ సంతకంతో కంప్యూటర్లో అప్లోడ్ చేయడం జరుగుతుందన్నారు. సీఎం ఇటీవల కలెక్టర్లను పిలిచి భూ భారతి చట్టం ద్వారా రైతుల భూ సమస్యలను పరిష్కరించాలని స్పష్టంగా చెప్పారన్నారు. అన్ని మండలాలకు కలెక్టర్లు వెళ్లి ఈ చట్టంపై ప్రజలు, రైతులకు అవగాహన కల్పిస్తారన్నారు. అయితే జూన్ 2 లోగా ఎంపిక చేసిన మొదటి నాలుగు పైలెట్ గ్రామాల్లో సమస్యలను పరిష్కరిస్తారన్నారు. ఆ తర్వాత ప్రతి మండలం, ప్రతి రెవెన్యూ గ్రామానికి ఇదే పద్ధతిలో అధికారులే రైతుల వద్దకు వస్తారన్నారు. సీఎం నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యం ప్రజలకు అండగా ఉంటుందన్నారు. తాము అమలు చేస్తున్న కొత్త భూభారతి చట్టాన్ని ప్రతిపక్షంలో ఉన్న వాళ్లు వినియోగించుకోవచ్చని మంత్రి సూచించారు. ధరణితో ప్రజలను ఎంత గోస పెట్టారో భూ భారతి అమలులోకి వచ్చిన తర్వాత తెలుస్తుందన్నారు. ప్రభుత్వం ఏదైనా మంచి పని చేస్తే మంచి చేసిందని చెప్పకపోయినా పర్వాలేదు కానీ.. మంచిని చెడుగా చెప్పి ప్రచారం చేస్తే మాత్రం ప్రతిపక్షానికి వచ్చే ఎన్నికలలో రెండు అంకెల సీట్లు కూడా రావని, పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల మాదిరిగా శాసనసభ ఎన్నికలలో రిపీట్ అవుతుందని జోస్యం చెప్పారు. కార్యక్రమంలో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీతాదయాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, చిట్టెం పర్ణికారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ వార్ల విజయ్ కుమార్, కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎనుముల తిరుపతిరెడ్డి, భూభారతి ప్రత్యేక అధికారి యాదగిరి, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జ్యోతి బుద్ధ ప్రకాష్, మంద మకరంద్, ఎస్పీ యోగేష్ గౌతమ్, అడిషనల్ కలెక్టర్ బేన్షాలం, కడా ప్రత్యేక అధికారి వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నూతన అధ్యాయానికి శ్రీకారం రాష్ట్ర ప్రభుత్వం భూ పరిపాలనలో నూతన అధ్యాయానికి శ్రీకారం చూడుతూ భూ భారతి పోర్టల్ను ఈ నెల 14న ప్రారంభించిందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జిల్లాలోని మద్దూరు మండలాన్ని పైలెట్ మండలంగా ఎంపిక చేసిందని, భూ పరిపాలనలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ పోర్టల్ను జిల్లా అధికార యంత్రాంగం, ఉద్యోగుల సహకారంతో విజయవంతంగా నిర్వహించడానికి కృషి చేస్తామన్నారు. ఒక్క రూపాయి తీసుకోకుండానేభూ సమస్యలు పరిష్కరిస్తాం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మద్దూరు మండలం ఖాజీపూర్లో రెవెన్యూ సదస్సు ప్రారంభం -
అకాల వర్షాలు.. పంటలో జాగ్రత్తలు
అలంపూర్: అకాల వర్షాలతో పంటకు నష్టం జరిగే ప్రమాదం పొంచి ఉంది. ప్రధానంగా వివిధ దశలో ఉన్న మొక్కజొన్న, పత్తి, వరి, పసుపు వంటి పంటకు నష్టం జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇటీవల కురుస్తున్న ఆకాల వర్షాలతో రైతులకు నష్టాలు తప్పడం లేదు. ఈ దశలో పంటను కాపాడుకోవడానికి రైతులు తగు జాగ్రత్తలు పాటించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియ నాయక్ రైతులకు సూచించారు. వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు పంటను రక్షించుకోవడానికి జాగ్రత్తలు తీసుకుంటే కొంత వరకు రైతులకు మేలు జరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. వివిధ పంటను కాపాడుకోవడానికి సూచనలు ఇలా.. వరి ● వరి పంట ప్రస్తుతం పొట్టు దశలో చివరి దశలో ఉంది. గింజ గట్టిపడి కోతకు సిద్ధంగా ఉంది. ● కోతకు సిద్ధంగా ఉన్నా..లేదా గింజ గట్టిపడి వెన్ను వంగి ఉన్న దశలో పైరు పడిపోతే పొలంలోకి చేరిన నీటిని తొలగించుకోవాలి. ● గింజకు శిలీంధ్రాలు ఆశించకుండా గింజ నల్లబడకుండా ఉండటానికి ఒక లీటర్ నీటికి 2 మి.లీ. హెక్సా కొన జోల్ కలిపి పిచికారీ చేసుకోవాలి. ● ఖాళీగా ఉన్న పొలాల్లో ఈ తేమతో దుక్కి దున్నుకోవాలి. ● హైబ్రిడ్ వరిలో వర్షాల వలన సుంకు రాలిపోవడం జరుగుతుంది. ఈ మేరకు కొంత నష్టం జరుగుతుంది. ● వరి కోత దశలో ఉన్న సమయాల్లో తొందరపడి కోయకుండా వారం రోజుల పాటు ఆగి ఆ తర్వాత మొదలు పెట్టుకోవాలి. ● కోత కోసిన పైర్లను వాటిని పొలాల్లో కాకుండా పొలం గట్ల మీద వేసుకోవాలి. పొలాల్లోనే ఉంటే మొలకలు వచ్చే ప్రమాదం ఉంటుంది. గట్లపై వేసిన పైరుపై లీటర్ నీటికి 50 గ్రాముల ఉప్పు కలిపి చల్లాలి. ఇలా చేస్తే మొలక రాదు. ● వర్షాలు తగ్గిన తర్వాత పంటను నూర్పిడి చేసి ఎండలో బాగ ఆరబెట్టి నిల్వ చేసుకోవాలి. పత్తి ● పత్తి సాగు చేసిన రైతులు ఎట్టి పరిస్థితుల్లో పంట పైరు కాలన్నీ పొడగించరాదు. తేమను ఆసరాగా చేసుకోని లోతు దుక్కిలు చేసుకోవాలి. పసుపు ● తడిసిన దుంపలను భూమి నుంచి వేరు చేసి టార్పాలిన్ బరకలతో కప్పుకోవాలి. ● దుంపలు తడవడం వలన ఎండిన తర్వాత రంగు మారుతాయి. మార్కెట్కు తీసుకెళ్లే మంచి ధర లభించే అవకాశం ఉండకపోవచ్చు. ● ఆశించిన ధర లభించాలంటే దుంపలను పాలిషింగ్ చేయాలి. దీని వలన నాణ్యత పెరిగి మంచి ధర లభిస్తోంది. అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి వారి సహాయ సహకరాలను తీసుకోవాలని సూచించారు. పాడి–పంట మొక్కజొన్న కోతకు వచ్చిన పంటను ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను దృష్టిలో ఉంచుకోని కోత కోయరాదు. వర్షాలు పూర్తిగా తగ్గిన తర్వాత కోతను ప్రారంభించుకోవడం మంచిది. కోసిన కంకులు తడిస్తే వెంటనే పొలం నుంచి బయటికి తెచ్చి ప్రత్యేక గాలి మరల ద్వారా 100 శాతం ఆరబెట్టాలి. ఇలా ఆరబెట్టకపోతే ధాన్యం రంగు మారుతుంది. బూజుపట్టే అవకాశం లేకపోలేదు. తినడానికి పనికిరాకుండా పోవడం, విక్రయానికి తీసుకెళ్లిన ఆశించిన మద్దతు ధర లభించకపోవడం జరుగుతుంది. గింజలు తడిస్తే నీడలో ఆరబెట్టి గాలి పంకాల ద్వార ఆరబెట్టుకోవాలి. వర్షాలు తగ్గిన తర్వాత ఎండలో ఆరబెట్టి నిల్వ చేసుకోవాలి. -
12.75 క్వింటాళ్ల నకిలీ విత్తనాల పట్టివేత
మల్దకల్: మండలంలోని కుర్తిరావుల చెర్వులో 12.75 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ నందీకర్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సీడ్ సబ్ ఆర్గనైజర్ శ్రీను అలియాస్ రాజు గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలం దగ్గర ఏర్పాటు చేసిన షెడ్డులో అక్రమంగా నిల్వ ఉంచిన 12.75క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు, వ్యవసాయాధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడిలో షెడ్డులో నిల్వ ఉంచిన నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకుని, సీడ్ సబ్ ఆర్గనైజర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ దాడులలో వ్యవసాయాధికారి రాజశేఖర్, హెడ్ కానిస్టేబుల్ గోపాల్ నాయక్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
పైపులైన్ లీకేజీలువెంటనే సరిచేయండి
● నల్లా బిల్లుల వసూళ్ల శాతం పెరగాలి ● మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి మహబూబ్నగర్ మున్సిపాలిటీ: నగరంలో ఎక్కడైనా పైపులైన్లో లీకేజీలు ఉంటే వెంటనే సరిచేయాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్రెడ్డి ఆదేశించారు. బుధవారం సాయంత్రం మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో తాగునీటిని సరఫరా చేసే లైన్మెన్లు, ఫిట్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వేసవికాలం కావడంతో తాగునీటి సరఫరాలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీరు సరఫరా అయ్యే సమయంలో మున్సిపల్ పవర్ బోర్లు వినియోగించవద్దన్నారు. దీనివల్ల ఇతరులకు ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. మొత్తం 49 డివిజన్ల పరిధిలో సుమారు 750 పవర్ బోర్లును ఏర్పాటు చేశామన్నారు. వీటిని అత్యవసర పరిస్థితుల్లోనే వాడాలని సూచించారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే తమ దృష్టికి తీసుకుని రావాలన్నారు. అలాగే నల్లా బిల్లులు కేవలం 13 శాతమే వసూలైందని, బకాయిలను ఎక్కువగా రాబట్టాలన్నారు. సమావేశంలో ఇన్చార్జ్ ఎంఈ సందీప్ వరల్డ్ తదితరులు పాల్గొన్నారు. -
చెరువు మట్టితో భూసారం
అలంపూర్: పంటల సాగులో ప్రధాన భూమిక భూసారానిదే. భూమిలో శక్తి ఉంటేనే దిగుబడులు ఆశించిన మేరకు వస్తాయి. భూసారం తగ్గితే తెగుళ్లు, పురుగుల బెడద ఎక్కువగా ఉంటుందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి సక్రియ నాయక్ రైతులకు సూచించారు. పెట్టుబడులు పెరగడంతో పాటు పంట నాణ్యత తగ్గుతుందని వివరించారు. వీటిని తట్టుకోవడానికి భూసారం అవసరమని వివరించారు. భూసారం పెంపు ఇలా.. చెరువు పూడిక మట్టితో భూమి నాణ్యత, తేమను నింపుకొనే శక్తిని పెరుగుతుంది. నీటి వినియోగ సామర్థ్యంతో పాటు భూమిలోని సారం పెరగడానికి దోహద పడుతుంది. మట్టి పీహెచ్ తగ్గి సేంద్రియ కర్బనం, నత్రజని, భూసారం, పొటాష్, సూక్ష్మ పోషకాలు పెరిగి అధిక దిగుబడి వస్తోంది. సేంద్రియ కర్బనం ఎక్కువగా ఉంటే మినరలైజేషన్ అధికంగా జరిగి మొక్కల పెరుగుదల ఉంటుంది. పండ్ల తోటల్లో.. మామిడి, జామ, దానిమ్మ, బత్తాయి తదితర పంటలకు చెరువు మట్టి వాడకం వల్ల వేరు వ్యవస్థ బలంగా విస్తరించి ఏపుగా పెరుగుతుంది. దీంతో భూమిలో తేమ నిలుపుకొనే శక్తి పెరుగుతుంది. పాదుల్లో మల్చింగ్ మాదిరిగా ఉపయోగపడుతుంది. ఎకరానికి 10 కిలోల చెరువు మట్టిని వేసుకోవచ్చు. కూరగాయల సాగులో.. టమాటా, బెండ, వంకాయ తదితర పంటల సాగులో అధిక దిగుబడుల కోసం ఎరువులు ఎక్కువగా వాడటం జరుగుతుంది. దీంతో పెట్టుబడి విపరీతంగా పెరుగుతుంది. కూరగాయల సాగుచేసే పొలాల్లో ఎకరాకు 8 నుంచి 10 ట్రాక్టర్ల చెరువుమట్టి ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నితే మంచి నాణ్యతగల పంటలు వస్తాయి. పెట్టుబడి తగ్గుతుంది. అంతేగాక తేమ శాతం కూడా తగ్గకుండా ఉంటుంది. వ్యవసాయ పొలంలో వేసిన చెరువు మట్టి (మిల్లీ గ్రాముల్లో).. నత్రజని 720 పొటాష్ 310భాస్వరం 35 బొరాన్ 0.8 మేలుచేసే సూక్ష్మజీవుల సాంద్రత : 308గంథకం 18 పాడి–పంట ఒక కిలో చెరువు మట్టిలో ఉండే పోషక విలువలు ఇలా కర్బనం 0.5 జింక్ 2.8 -
నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి
మహబూబ్నగర్ న్యూటౌన్: జిల్లాలో నమోదవుతున్న ప్రతి నేరానికి సంబంధించిన కేసుల్లో పారదర్శకంగా సమగ్రమైన విచారణ చేపట్టి నిందితులకు శిక్షలు పడే శాతాన్ని పెంచే దిశగా కృషి చేయాలని ఎస్పీ జానకి పోలీస్ అధికారులకు సూచించారు. బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సర్కిల్ వారీగా పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి కేసును ప్రాధాన్యతతో సమగ్రంగా విచారించాలని సూచించారు. పోలీస్స్టేషన్ వారీగా గ్రేవ్, నాన్–గ్రేవ్, యూఐ కేసుల వివరాలను సమీక్షించి.. యూఐ కేసులు విచారణ దశలోనే నిలిచిపోతున్నాయనే విషయంపై ఆరా తీశారు. వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, పోక్సో కేసుల పురోగతిని సమీక్షిస్తూ ఈ కేసుల్లో నిందితులకు గరిష్టంగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. బాధితులకు కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలియజేస్తూ నిందితులకు శిక్షల శాతం పెంచేలా పని చేయాలన్నారు. మహిళలపై జరిగే నేరాలు, ముఖ్యంగా పోక్సో కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. దొంగతనాల కేసులను ఛేదించడంలో ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని సూచించారు. నిందితులను లోతుగా విచారించేందుకు తగిన కృషి జరగాలన్నారు. ఎఫ్ఎస్ఎల్ నివేదికలు, అరెస్టులు వంటి అంశాలు పెండింగ్లో లేకుండా చూసుకోవాలన్నారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని, ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెంచే విధంగా ముందుకు సాగాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ రాములు, ఏఆర్ ఏఎస్పీ సురేష్కుమార్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, డీసీఆర్బీ డీఎస్పీ రమణారెడ్డి, సీఐలు వెంకటేశ్, అప్పయ్య, ఇజాజుద్దీన్, కమలాకర్, నాగార్జునగౌడ్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
వడదెబ్బతో ఉపాధి హామీ కూలీ మృతి
మానవపాడు: వడదెబ్బకు గురై వ్యక్తి మృతిచెందిన ఘటన మానవపాడు మండలం చెన్నిపాడులో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. చెన్నిపాడు గ్రామానికి చెందిన తిరుపాలు (58) మంగళవారం ఉపాధి హామీ పనులకు వెళ్లి వడదెబ్బకు గురయ్యాడు. ఈ క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఎంపీడీఓ భాస్కర్, ఏపీఓ విజయశంకర్, పంచాయతీ కార్యదర్శి సంధ్యారాణి బుధవారం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుడికి భార్య చిట్టెమ్మ, కుమారులు చిరంజీవి, రాజేశ్, కూతురు అనిత ఉన్నారు. తిరుపాలు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం మానవపాడు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన ఘటన మండల కేంద్రం సమీపంలోని ఎన్హెచ్–44పై బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ చంద్రకాంత్ వివరాల మేరకు.. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలోని పెద్దమారూరు గ్రామానికి చెందిన కాశీనాథ్ నాయుడు (32) కర్నూలులోని ఆటో షారూంలో మెకానిక్గా పనిచేస్తున్నాడు. బుధవారం కర్నూలు నుంచి పెద్దమారూరుకు బైక్పై వెళ్తుండగా.. మానవపాడు స్టేజీ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. గమనించిన స్థానికులు అతడిని హైవే అంబులెన్స్లో కర్నూలు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య గాయత్రి, కొడుకు, కూతురు ఉన్నారు. అతడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతదేహం లభ్యం రాజాపూర్(బాలానగర్): ప్రమాదవశాత్తు చెరువులో పడి రెండు రోజుల క్రితం గల్లంతైన యాదయ్య మృతదేహం బుధవారం లభ్యమైంది. మండలంలోని మోతిఘనాపూర్ గ్రామ శివారులోని పెద్ద చెరువులో గంగధర్పల్లి గ్రామానికి చెందిన శివకుమార్, యాదయ్యలు గల్లంతుకావడంతో మంగళవారం శివకుమార్ మృతదేహం లభ్యం కాగా, ఈరోజు యాదయ్య మృతదేహం లభ్యమైంది. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, అనంతరం కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అప్పగించినట్లు బాలానగర్ ఎస్ఐ లెనిన్గౌడ్ తెలిపారు. తేనెటీగల దాడిలో గొర్రెల కాపరికి గాయాలు మన్ననూర్: తేనెటీగల దాడిలో గొర్రెల కాపరికి తీవ్రగాయాలైన ఘటన మన్ననూర్ సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. అమ్రాబాద్కు చెందిన గొర్రెలకాపరి నోముల ఎల్లయ్య రోజు మాదిరిగా తన గొర్రెల మందను మేత కోసం మన్ననూర్ సమీపంలోని నీరంజన్ షావలి దర్గా సమీపంలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఓ చెట్టుకు ఉన్న తేనె తుట్టెలోని తేనెటీగలు ఒక్కసారిగా ఎల్లయ్యపై దాడి చేశాయి. గమనించిన తోటి గొర్రెల కాపరులు అతడిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్లో అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు. -
చివరి 40 మీటర్ల వరకు చేరితేనే ఆనవాళ్లు
అచ్చంపేట: శ్రీశైలం ఎడమగట్టు కాలువ(ఎస్ఎల్బీసీ)సొరంగం లోపల బుధవారం సైతం సహాయక చర్యలు కొనసాగాయి. 54 రోజులుగా ఆరుగురి కార్మికుల ఆచూకీ కోసం సహాయక సిబ్బంది నిర్విరామంగా తవ్వకాలు చేపడుతున్నారు. ఇంత వరకు ఎలాంటి ఆనవాళ్లు లభించకపోవడంతో సొరంగంలో చిక్కుకున్న కార్మికులు నిషేధిత ప్రదేశం 40 మీటర్ల పరిధిలో ఉన్నారనే అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలాఉండగా, ఈనెల 20 వరకు ప్రభుత్వం విధించిన గడువులోగా తవ్వకాలు పూర్తి చేసేందుకు సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తున్నారు. 50మీటర్ల పొడవు, 3 మీటర్ల ఎత్తు మేర సహాయక చర్యలు చేపట్టాల్సి ఉంది. సొరంగం లోపల ఐదు ఎస్కవేటర్లు, బాబ్ క్యాట్లు బండరాళ్లను తొలగిస్తుండగా.. డీ2 ప్రదేశంలో తొలగించిన శిథిలాలను కన్వేయర్ బెల్టు ద్వారా సొరంగం బయటకు తరలిస్తున్నారు. అలాగే, ప్లాస్మా కట్టర్తో టీబీఎం బాగాలు కత్తిరించి స్టీల్, బండరాళ్లను లోకో ట్రైన్ ద్వారా దక్షిణ మధ్య రైల్వే సిబ్బంది బయటకు పంపిస్తున్నారు. ఇచ్చిన టాస్క్ ప్రకారం నిషేధిత ప్రదేశం వరకు ఉన్న శిథిలాలను తొలగించే పనిలో సహాయక బృందాలు నిమగ్నమైయ్యారు. శిథిలాల కింద ఇప్పటి వరకు ఆరుగురి కార్మికుల అచూకీ లభ్యం కాలేదు. సహాయక చర్యలు చేపట్టి సుమారుగా రెండు నెలలు కావస్తుండటం, కార్మికుల ఆచూకీ లభ్యం కాకపోవడంతో సహాయక బృందాల్లో రోజురోజుకు టెన్షన్ పెరుగుతుంది. చివరి వరకు తవ్వకాలు చేపడితే తప్పా అచూకీ లభ్యం అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. బండరాళ్లు తొలగించే ప్రక్రియ వేగవంతం సొరంగం లోపల సహాయక సిబ్బంది బండరాళ్లు తొలగించే ప్రక్రియను వేగవంతం చేశామని ప్రత్యేక అధికారి శివశంకర్ అన్నారు. దోమల పెంట ఎస్ఎల్బీసీ సొరంగం ఇన్లేట్ వద్ద బుధవారం సహాయక బృందాల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సొంరంగం లోపల చేపడుతున్న సహాయక చర్యలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సహాయక బృందాలు పూర్తి సమన్వయంతో సహాయక చర్యలు చేపడుతున్నారని, విధిగా ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు నివేదికలు అందజేస్తున్నామని చెప్పారు. సమావేశంలో ఆర్మీ అధికారులు వికాస్సింగ్,విజయ్కుమార్,జేపీ కంపెనీ సీనియర్ ప్రాజెక్టు ఇంజనీర్ సంజయ్కుమార్ సింగ్,సింగరేణి మైన్స్ రెస్క్యూ జనరల్ మేనేజర్ బైద్య,ఎన్డీఆర్ఎఫ్ అధికారి గిరిధర్రెడ్డి,హైడ్రా అధికారి,దక్షణ మద్య రైల్వే అధికారి రవింద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎల్బీసీలో కార్మికుల జాడ కోసం 54 రోజులుగా సహాయక చర్యలు -
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోండి
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: కానిస్టేబుల్, ఎస్సై, వీఆర్వో వంటి ఉద్యోగాలు పొందేందుకు యువతకు ఉచితంగా అందిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. ఈమేరకు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కళాభవన్లో నిరుద్యోగ యువతకు ఎమ్మెల్యే తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని ఆయన రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ రియాజ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్లోని అశోక్నగర్, దిల్సుఖ్నగర్లో ఉండే కోచింగ్ సెంటర్లకు ధీటుగా కోచింగ్ ఇస్తామని, అందుకోసం అనుభవజ్ఞులైన హైదరాబాద్ ఫ్యాకల్టీ ద్వారా శిక్షణ ఇప్పిస్తామని, త్వరలో ప్రభుత్వం వేలాది ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్న క్రమంలో యువత శిక్షణలో పాల్గొనాలని తెలిపారు. శిక్షణ వచ్చే వారికి అన్ని రకాల వసతులు కల్పిస్తామని, స్టడీ మెటీరియల్ ఉచితంగా అందిస్తామన్నారు. రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ రియాజ్ మాట్లాడుతూ నిరుద్యోగ యువత భవిష్యత్ కోసం ఎమ్మెల్యే ఎంతో కృషి చేస్తున్నారని, వారు ఉచితంగా శిక్షణ ఇవ్వడం చాలా సంతోషకరమైన విషమం అన్నారు. ఈ అవకాశాన్ని యువత అందిపుచ్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్గౌడ్, గుండా మనోహర్, శ్రీనివాస్యాదవ్, ఆవేజ్, తదితరులు పాల్గొన్నారు. -
అలంపూర్ ఆలయాల అభివృద్ధికి సమష్టి కృషి
అలంపూర్: అలంపూర్ ఆలయాల అభివృద్ధికి సమష్టిగా కృషి చేద్దామని ఆలయ కమిటీ చైర్మన్ నాగేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం ఆలయాల్లో ధర్మకర్తల మండలి సాధారణ సమావేశం జరగగా.. చైర్మన్తో పాటు ఈఓ పురేందర్కుమార్, ధర్మకర్తలు హాజరయ్యారు. ఆలయాల అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను చర్చించినట్లు ఆయన తెలిపారు. ఆలయాల అభివృద్ధి ఉన్నత కమిటీ, కలెక్టర్ ఆదేశాల మేరకు సమావేశం నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఆలయ ప్రాంగణంలో సీసీ రోడ్డు శిథిలావస్థకు చేరడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారని.. పునరుద్ధరణకు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు చేయనున్నట్లు తెలిపారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ప్రతిపాదనలను నివేదించి అందుకు అనుగుణంగా ఉత్తర్వులు పొందాల్సిన అంశాలను చర్చించినట్లు వివరించారు. 2025–2027 సంవత్సరానికి సంబంధించి కౌలు వేలం నిర్వహించడానికి తగిన చర్యలు తీసుకోవడానికి ఆలయ ధర్మకర్త మండలి తీర్మానించిందన్నారు. సమావేశంలో ధర్మకర్తలు జగదీశ్వర్గౌడ్, జగన్మోహన్నాయుడు, అడ్డాకుల వెంకటేశ్వర్లు, గోపాల్, విశ్వనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
భూభారతిపై అవగాహనతో ఉండాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూభారతి–2025 చట్టంపై రెవెన్యూ అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. బుధవారం కలెక్టరేట్లోనీ సమావేశ మందిరంలో ‘భూభారతి’ భూమి హక్కుల రికార్డు–2025 చట్టంపై తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ఆర్ఐలు, ఇతర రెవెన్యూ సిబ్బందితో పాటు ఇతర అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం గతంలో ఉన్న ధరణి స్థానంలో భూభారతి భూమి హక్కుల రికార్డు–2025 చట్టాన్ని కొత్తగా తీసుకొచ్చిందని తెలిపారు. ఈ చట్టంపై రెవెన్యూ అధికారులు క్షుణ్ణంగా పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. చట్టంలోని అన్ని నియమాలను చదివి తెలుసుకోవాలని, ఏవైనా సందేహాలు ఉంటే అవగాహన కార్యక్రమంలోనే అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. న్యాయసేవ సంస్థలు, ఇతర సంస్థ లు, వ్యవస్థల ద్వారా పేదలకు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్ తెగల వారికి, మహిళలకు ఉచిత న్యాయ సహాయం, సలహాలు ఈ చట్టం ద్వారా అందించాలన్నారు. ప్రభుత్వం ఈ చట్టం ద్వారా అనేక భూ సమస్యలకు పరిష్కారమార్గం చూపించనుందని తెలిపారు. తహసీల్దారు చేసిన మ్యుటేషన్లు, జారీ చేసిన పాస్ పుస్తకాలపై అభ్యంతరాలు ఉంటే ఆర్డీఓ లేదా కలెక్టర్కు అప్పీలు చేసుకునేలా రెండు అంచెల అప్పీలు వ్యవస్థను తీసుకొచ్చిందన్నారు. వారసత్వంగా సంక్రమించే భూముల మ్యుటేషన్ల విష యంలో నోటీసులు జారీ చేయాల్సిన ప్రక్రియపై కలెక్టర్ పలు సూచనలు చేశారు. భూభారతి చట్టం–2025 ప్రకారం ఒకేరోజు రిజిస్ట్రేషన్తో పాటు మ్యుటేషన్ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. అలాగే ప్రతి ఒక్క భూకమతానికి యూనిక్ ఐడీ భూదార్ ఇవ్వడం గురించి వివరించారు. భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మోహన్రావు, ఆర్డీఓ నవీన్, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేష్, జెడ్పీ సీఈఓ వెంకటరెడ్డి, డీసీఓ శంకరాచారి, డీఆర్డీఓ నర్సింహులు పాల్గొన్నారు. నేటి నుంచిఅవగాహన సదస్సులు జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): భూభారతి చట్టంపై గురువారం నుంచి ఈ నెల 29వ తేదీ వరకు జిల్లాలో మండలాల రోజువారీగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ విజయేందిర బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 17న జడ్చర్లలో, 19న గండేడ్లో మండలంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మహమ్మదాబాద్ మండలంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, 21న అడ్డాకల్ మండలంలో ఉదయం, మూసాపేట మండలంలో మధ్యాహ్నం, 22న మిడ్జిల్, భూత్పూర్, 23న చిన్నచింతకుంట, కౌకుంట్ల, 24న కోయిలకొండ, హన్వాడ, 25న దేవరకద్ర, మహబూబ్నగర్ రూరల్, 26న మహబూబ్నగర్ అర్బన్, 28న నవాబుపేట, 29న బాలానగర్, రాజాపూర్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సదస్సులో ప్రజా ప్రతినిధులు, రెవెన్యూ అధికారులు పాల్గొని భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కలిగించనున్నట్లు పేర్కొన్నారు. -
ఉద్యోగ ఆధారిత కోర్సులు ప్రవేశ పెడతాం..
డిగ్రీ, పీజీ పూర్తి చేసిన విద్యార్థులు.. ఆ వెంటనే ఉద్యోగాలు సాధించే దిశగా వివిధ కోర్సుల్లో అన్ని స్థాయిల్లో సిలబస్లో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. కొత్త కోర్సుల వల్ల సులువుగా ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, ఫిన్టెక్, రీసెర్చి ఆప్టిట్యూట్, మెషిన్ టూల్స్, వంటి కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. సాధారణ తరగతులతో పాటు వీటిని బోధిస్తారు. అవకాశం ఉన్న కోర్సుల్లో మార్కులు నేరుగా విద్యార్థి మెమోలో ముద్రిస్తాం. అవకాశం లేని వాటికి నేరుగా సర్టిఫికెట్లు అందజేస్తాం. – జీఎన్ శ్రీనివాస్, వైస్ చాన్స్లర్, పీయూ ఉన్నత విద్యా మండలి సూచనలతో.. ప్రస్తుత సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులను ఉద్యోగాలకు సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. చదువులు పూర్తయిన వెంటనే సాంకేతిక విద్యనభ్యసించిన వారికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం, ఉన్నత విద్యా మండలి సూచనలతో సిలబస్లో 25 శాతం మార్పులకు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యనందించేందుకు కృషి చేస్తాం. – రమేష్ బాబు, రిజిస్ట్రార్, పీయూ ● -
విస్తృతం ప్రచారం చేయాలి
బాలల హక్కుల రక్షణ కోసం మహబూబ్నగర్ రూరల్: బాలల రక్షణ కోసం చట్టం నిర్దేశించిన హక్కులను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ సభ్యులు వందనగౌడ్, వచన్కుమార్, మరిపల్లి చందన, ప్రేమ్లత అగర్వాల్ అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలో మహిళా, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న శిశుగృహ, స్టేట్ హోమ్, జువైనెల్ జస్టిస్ బోర్డులను సందర్శించారు. ముందుగా శిశుగృహను సందర్శించిన కమిషన్ సభ్యులు పిల్లల గురించి, అక్కడ ఉన్న పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక అవసరాలు పిల్లల గురించి శిశు గృహ సిబ్బందికి సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా కమిషన్ సభ్యులు మాట్లాడుతూ శిశుగృహలో ఉన్న చిన్నారుల ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చిన్నారులకు బలవర్ధకమైన ఆహారం అందించాలని చెప్పారు. స్టేట్హోంలో ఉన్న యువతులకు స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అనంతరం డీడబ్ల్యూఓ జరీనాబేగంతో కలిసి జిల్లాలోని పిల్లల వివరాలపై సమీక్షించారు. బాల్య వివాహాలు జరగకుండా కఠినచర్యలు తీసుకోవాలని కమిషన్ సభ్యులు సూచించారు. బాల్య వివాహాల వివరాలపై ఎప్పటికప్పుడు కమిషన్కు నివేదించాలని ఆదేశించారు. బాల కార్మిక వ్యవస్థ లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో పిల్లల కోసం పని చేస్తున్న ఎన్జీఓలను సమన్వయం చేసుకొని చిన్నారులకు అన్ని విధాలుగా న్యాయం చేయాలని తెలిపారు. పిల్లల సంరక్షణ కేంద్రాలలో ఉన్న చిన్నారులకు అన్ని వసతులు కల్పించాలని అన్నారు. పిల్లల హక్కుల రక్షణ కోసం స్టేట్ కమిషన్ ఉందనే విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ చైర్మన్ నయిమొద్దీన్, సభ్యులు మాణిక్యప్ప, విజయకుమార్, జేజేబీ సభ్యులు గేస్ సీడీపీఓ శైలాశ్రీ, ఏసీడీపీఓ వెంకటమ్మ, డీసీపీఓ నర్మద, శిశుగృహ మేనేజర్ గణేష్బాబు, సూపర్వైజర్ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. -
రైతన్నకు అకాల కష్టం
మహబూబ్నగర్ (వ్యవసాయం): జిల్లాలో రైతుల పరిస్థితి ఆగమాగం అవుతుంది. పంట చేతికొచ్చే సమయంలో కురిసిన అకాల వర్షాలు రైతన్నకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. ఒకవైపు అకాల వర్షాలు, మరోవైపు ఎండలతో అన్నదాతలు ఆగమాగం అవుతుంది. చేతికొచ్చిన పంటలు ఎండిపోయి ఒకవైపు.. వడగండ్లతో వరి పంట రాలిపోయింది. భూగర్భ జలాలు తగ్గిపోతుండటంతో జిల్లాలో సుమారు 12 వేల ఎకరాలకు పైగా సాగునీరు అందక పంటలు ఎండిపోయాయి. అధికారులు మాత్రం 504 ఎకరాల వరి పంటనే ఎండిపోయిందని చెబుతున్నారు. కాగా.. రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో ఐదువేల ఎకరాలకు పైగానే పంట నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మహబూబ్నగర్ రూరల్, దేవరకద్ర, మిడ్జిల్ మండలాల్లో కోతకు వచ్చిన వరి పంట వడగండ్ల వానతో పూర్తిగా నేలమట్టమైంది. వడగండ్ల వానకు ధాన్యం రాలిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మామిడి తోటలు సైతం అకాల వర్షం వల్ల నష్టపోయినట్లు అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ వర్షాలతో 2 వేల ఎకరాలలో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. పొలాలను పరిశీలించి రైతు వారీగా వరి పంట నష్టాన్ని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రైతు వారీగా వివరాలు సేకరిస్తాం అకాల వర్షాల కారణంగా జిల్లాలో 2 వేల ఎకరాలలో వరి పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేశాం. రైతు వారీగా ఏఈఓలతో కలిసి క్షేత్రస్థాయిలో సర్వే కొనసాగుతుంది. ఆ తర్వాత నష్టానికి సంబంధించిన నివేదిక సిద్ధం చేస్తాం. అకాల వర్షాలకు వరి పంట 33 శాతానికి పైగా దెబ్బతింటే ఆ రైతు వందశాతం పంట నష్టపోయినట్లు గుర్తిస్తున్నాం. సర్వే పూర్తయిన తర్వాత కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి జిల్లాలో పంట నష్టపోయిన రైతుల వివరాలు పంపిస్తాం. – బి.వెంకటేష్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటలు 2 వేల ఎకరాల్లో పంట నష్టం -
ఉల్లి ధర తగ్గుముఖం
● క్వింటా గరిష్టంగా రూ.1,500.. కనిష్టంగా రూ.వెయ్యి దేవరకద్ర: స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డులో బుధవారం జరిగిన ఉల్లి వేలంలో ధరలు మరింత పడిపోయాయి. మూడు వారాలుగా నిలకడగా ఉన్న ధరలు.. ఈ వారం మరింత తగ్గడంతో వినియోగదారులు పెద్దఎత్తున కొనుగోలు చేశారు. మార్కెట్లో ఎక్కడ చూసినా కొనుగోలుదారులు కనిపించారు. మార్కెట్కు దాదాపు 5 వేల బస్తాల ఉల్లి అమ్మకానికి వచ్చింది. ఉదయం పదికి వేలం ప్రారంభంకాగా.. మధ్యాహ్నం వరకు కొనసాగింది. అయితే సమయం సరిపోకపోవడంతో చాలామంది వ్యాపారులు రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి విక్రయాలు సాగించారు. ధరలు ఇలా.. ఉల్లి క్వింటా గరిష్టంగా రూ.1,500 పలికింది. గత వారంతో పోలిస్తే దాదాపు రూ.500 తగ్గింది. కనిష్టంగా రూ.1000 వరకు వచ్చింది. గత వారంతో పోలిస్తే సుమారు రూ.600 వరకు తగ్గింది. నాణ్యమైన ఉల్లి 50 కిలోల బస్తా రూ.600 నుంచి రూ.750 వరకు విక్రయించారు. రెండో రకం ఉల్లిని రూ.500 నుంచి రూ.550 వరకు విక్రయించారు. పోటాపోటీగా.. మార్కెట్లో ఉల్లిని తూకం వేసి అమ్మే వరకు చాలా ఖర్చు వస్తుందని భావించిన పలువురు రైతులు పొలం వద్దే 50 కిలోల బస్తాలు తయారు చేసి ట్రాక్టర్లపై తెచ్చి రోడ్డుపైనే విక్రయించారు. రూ.600 నుంచి రూ.700 వరకు బస్తా విక్రయించడంతో చాలామంది కొనుగోలు చేశారు. ఉదయం మార్కెట్ తెరవక ముందే 7 గంటల నుంచే ఉల్లి విక్రయాలు ప్రారంభమయ్యాయి. దాదాపు పది ట్రాక్టర్ల ఉల్లిని రైతులు బయటనే విక్రయించారు. -
దేవరగుట్టలోనే చిరుతల మకాం
నవాబుపేట: మండలంలోని యన్మన్గండ్ల దేవరగుట్టలో రెండు చిరుతలు వారం రోజులుగా మకాం వేశాయి. గుట్టలోని గుహలను ఆవాసంగా మార్చుకున్నాయి. బుధవారం రెండు చిరుతలు ఒకదాని తర్వాత మరొకటి బయట తిరిగి.. మళ్లీ గుహలోకి వెళ్లిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. చాలా వరకు చిరుతలు తమ స్థావరాన్ని మారుస్తూ వస్తాయి. కానీ ఇక్కడ మాత్రం రెండు చిరుతలు దేవరగుట్టను వదలడం లేదు. ఇందుకు అనారోగ్యం కారణమై ఉండవచ్చని అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్ వెంకటేశ్ అనుమానం వ్యక్తంచేశారు. గుట్ట పరిసరాల్లో పశువులను ఉంచరాదని.. ప్రజలు సైతం జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాగా, దేవరగుట్ట పరిసరాల్లోని కుక్కలను చిరుతలు హతమార్చి ఆహారంగా తీసుకుంటున్నట్లు స్థానికులు తెలిపారు. -
వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ముస్లింల హక్కులను కాలరాయడం కోసం తెచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని ఇన్సాఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫయాజ్ డిమాండ్ చేశారు. సీపీఐ పార్టీ పిలుపులో భాగంగా బుధవారం స్థానిక తెలంగాణ చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వక్ఫ్ చట్టాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. దేశంలోని మైనార్టీలపై కేంద్రంలో అధికారంలోఉన్న బీజేపీ సర్కారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు. దేశంలో భాగమైన ఓ వర్గం ప్రజలపై కక్ష సాధింపులకు దిగడం సరికాదన్నారు. ముస్లిం ఆత్మగౌరవానికి భంగం కలించే ఏ చర్యలను తాము సహించేది లేదని అన్నారు.కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి బాలకిషన్, నాయకులు పరమేశ్గౌడ్, రాముల, గోవర్థన్, సత్యనారాయణరెడ్డి, బాషా, రాజు, లక్ష్మన్, శ్రీను, సురేష్, ఖద్దుస్బేగ్, సుభానిపటేల్, నసీర్, తకీహుస్సెన్ తదితరులు పాల్గన్నారు. -
రైతన్న క‘న్నీటి’ వ్యథ
అమరచింత: జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వ పరిధిలో యాసంగి వరిపంట సాగుచేసిన రైతులకు క‘న్నీటి’ కష్టాలు వెంటాడుతున్నాయి. ఇన్నాళ్లు వారబందీ పద్ధతిలో ఆయకట్టుకు సాగునీరు అందించిన అధికారులు.. ఇటీవల జూరాల కాల్వలకు నీటి విడుదలను పూర్తిగా నిలిపివేయడంతో వ్యయప్రయాసాలకోర్చి సాగుచేసిన పంట రైతుల కళ్లెదుటే ఎండిపోతోంది. కనీసం ఒక తడి అయినా సాగునీరు అందిస్తే కొంత మేరకై నా వరిపంట చేతికి అందుతుందని రైతన్నలు ఆందోళన బాట పట్టారు. తమకు సాగునీరు కావాలంటూ వారంరోజుల వ్యవధిలోనే రెండు పర్యాయాలు జూరాల ప్రాజెక్టు రహదారిపై రాస్తారోకో చేపట్టారు. చివరి దశలో ఉన్న పంటకు సాగునీరందించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ● యాసంగి సీజన్లో జూరాల ఎడమ కాల్వ పరిధిలో రామన్పాడు వరకు 20వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తామని ప్రాజెక్టు అదికారుల ప్రకటనతో ఉమ్మడి అమరచింత, ఆత్మకూర్ మండలాల రైతులు వరిపంట సాగుచేసుకున్నారు. ఆత్మకూర్ మండలంలోని డీ–6 కెనాల్ పరిధిలోని కాల్వ పూర్తిగా దెబ్బతినడంతో సాగునీరు దిగువన ఉన్న గ్రామాల రైతులకు సకాలంలో అందక పంటసాగు ఆలస్యమైంది. ప్రాజెక్టులో నీరు ఉండటం, వారబందీ పద్ధతిలో సాగునీరు వదులుతున్నారని గ్రహించిన రైతులు.. ఈసారి గట్టెక్కుతామని ఆశపడి వరిసాగు సాగుచేసుకున్నారు. ఎకరానికి రూ. 25వేల చొప్పున పెట్టుబడి పెట్టిన రైతులకు చివరి దశలో సాగునీరు అందక పోవడంతో వారి ఆశలన్నీ అడియాశలుగా మిగిలిపోయాయి. ఇప్పటికే జూరాల, గుంటిపల్లి, తూంపల్లి, ఆరేపల్లి, కత్తేపల్లె తదితర గ్రామాల్లో 3వేలకు పైగా ఎకరాల్లో వరిపైరు ఎండింది. తమకు కనీసం ఒక తడి అయినా సాగునీరు ఇవ్వాలంటూ అధికారులు, ప్రజాప్రతినిధులను విన్నవిస్తున్నారు. పంట ఎండిపోతుంది.. యాసంగి పంట పూర్తి వరకు సాగునీరు వస్తుందని అప్పుచేసి పన్నెండు ఎకరాల్లో వరిసాగు చేశాను. వారబందీతో కాల్వకు సాగునీరు వదలడంతో పంట ఎండిపోయే స్థితికి చేరింది. ఇప్పుడు సాగునీటి విడుదలను పూర్తిగా నిలిపివేయడంతో పంట చేతికివచ్చే పరిస్థితి లేకుండాపోయింది. కనీసం ఒక్క తడైనా సాగునీరు ఇస్తే మూడెకరాల్లో అయినా పంట చేతికి వస్తుందనే ఆశ ఉంది. – వెంకటేశ్, రైతు, మోట్లంపల్లి, ఆత్మకూర్ మండలం ఎమ్మెల్యే చొరవ చూపాలి.. యాసంగిలో 12 ఎకరాల్లో వరిసాగు చేసుకున్నా. చివరి తడి వరకు సాగునీరు ఇస్తామని అధికారులు అన్నారు. ఇప్పుడేమో తాగటానికి నీరు లేదని రైతులకు ఇచ్చే నీటిని నిలిపివేశారు. దీంతో 12 ఎకరాల పంట పూర్తిగా దెబ్బతింటుంది. సాగునీటి విడుదలకు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి చొరవ చూపాలి. – వినోద్, రైతు, ఆరేపల్లి, ఆత్మకూర్ మండలం జూరాల ఎడమ కాల్వకు సాగునీటిని నిలిపివేసిన అధికారులు రైతుల కళ్లెదుటే ఎండిపోతున్న పంట చివరి తడికై నా సాగునీరు ఇవ్వాలంటూ వేడుకోలు -
పాలమూరు పనుల్లో కదలిక
వివరాలు 8లో u● నార్లాపూర్– ఏదుల ప్రధాన కాల్వ పెండింగ్ పనులకు రూ. 780.63 కోట్లు మంజూరు ● డిసెంబర్ నాటికి కర్వెన రిజర్వాయర్ వరకు పనులు పూర్తిచేసేలా కార్యచరణ ● విడతల వారీగా పనులను పూర్తిచేయనున్న ప్రభుత్వం ఏదుల రిజర్వాయర్ప్రధాన కాల్వ నిర్మాణ పనులకు నిధులు.. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్లో భాగమైన నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఏదుల రిజర్వాయర్ మధ్యలో ప్రధాన కాల్వకు 1.725 కి.మీ. పాయింట్ నుంచి 2.125 పాయింట్ కాల్వ తవ్వకం పనులు పెండింగ్లో ఉన్నాయి. అలాగే 6.325 కి.మీ. పాయింట్ నుంచి 6.650 కి.మీ. పాయింట్ నడుమ కాల్వ నిర్మాణం పూర్తిచేయాల్సి ఉంది. ప్యాకేజీ 3 పరిధిలో పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఇటీవల రూ.780.63 కోట్లు కేటాయించింది. నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఏదుల రిజర్వాయర్ మధ్య పెండింగ్లో ఉన్న అప్రోచ్ కెనాల్, ఓపెన్ కెనాల్ నిర్మాణంతో పాటు హెడ్ రెగ్యులేటరీ ఏర్పాటు కోసం ఈ నిధులను వినియోగించనున్నారు. కుడికిళ్ల సమీపంలో ప్రధాన కాల్వ నిర్మాణం పూర్తిగా ఆగిపోయాయి. అక్కడ హార్డ్ రాక్తో కాల్వ తవ్వకాలకు ఇబ్బందిగా ఉందని చెబుతుండగా, తాజాగా ప్రభుత్వం అంచనాలను సవరించి నిధులను విడుదల చేసింది. గతంలో ఈ ప్యాకేజీ కింద పనులకు రూ.416.10 కోట్లు కేటాయించగా, ప్రస్తుతం ఈ పనుల విలువను రూ.780.63 కోట్లకు చేరింది. -
సమ్మె నోటీస్ ఇచ్చిన కాంట్రాక్టు అధ్యాపకులు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకులు రిజిస్ట్రార్ రమేష్బాబుకు మంగళవారం సమ్మె నోటీస్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని 12 యూనివర్సిటీ ల్లో ఒప్పంద అధ్యాపకులు ఏళ్లుగా యూనివర్సిటీలో పని చేస్తున్నారని, అలాంటి వారిని రెగ్యులరైజ్ చేయాలని, బడ్జెట్, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులలో పనిచేస్తున్న వారిని కూడా పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభు త్వం ఉన్న ఫలంగా నోటిఫికేషన్ ఇచ్చి కాంట్రాక్టు అధ్యాపకుల గొంతు నొక్కవద్దన్నారు. శ్రీధర్రెడ్డి, భూమయ్య, రవికుమర్, విజయ్భాస్కర్, ప్రభాకర్రెడ్డి, సోమేశ్వర్, సుదర్శన్రెడ్డి, రవికుమార్, మృదుల పాల్గొన్నారు. రోడ్లపై ధాన్యం ఆరబెట్టొద్దు: ఎస్పీ మహబూబ్నగర్ క్రైం: జిల్లాలో ఎక్కడా జాతీయ, అంతర్రాష్ట్ర రహదారులపై ధాన్యాన్ని పోసి ప్రమాదాలకు కారణం కావొద్దని ఎస్పీ డి.జానకి ఒక ప్రకటనలో తెలిపారు. ఎలాంటి రోడ్ల అయినా ధాన్యం ఆరబెట్టొద్దని, రోడ్లపై ధాన్యం గుట్టలను గమనించలేక ప్రమాదాలకు దారి తీస్తున్నాయని, ప్రధానంగా రాత్రి వేళ ధాన్యంపై నల్ల కవర్ కప్పడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. గతంలో ఇలాంటి ప్రమాదాల వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయ ని గుర్తు చేశారు. రైతులు ధాన్యం అరబెట్టే సమయాల్లో రోడ్లను కాకుండా ఇతర అనువైన ప్రదేశాలను ఎంచుకోవాలని సూచించారు. దేశాభివృద్ధిలో ఆర్థికశాస్త్రం కీలకం మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఆర్థికశాస్త్రం దేశాభివృద్ధిలో ముఖ్య భూమిక పోషిస్తుందని ప్రిన్సిపాల్ మధుసూదన్రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు పీయూలో ఎకానామిక్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని నేషనల్ ఎకానామిక్స్ డేను నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఎకానామిక్స్ పూర్తిస్థాయిలో ఎగుమతులు, దిగుమతులు వ్యాపార, వాణిజ్య విషయాల్లో కీలకంగా వ్యవహరిస్తుందని తెలిపారు. స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందన్నారు. కార్యక్రమంలో హెచ్ఓడీ రాఘవేందర్రావు, జిమ్మికార్టన్, శివలింగం, రాజునాయక్ పాల్గొన్నారు. పోటెత్తిన ధాన్యం జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి మార్కెట్ యార్డుకు మంగళవారం మొక్కజొన్న దిగుబడులు పోటెత్తాయి. దాదాపు 11 వేల బస్తాల మొక్కజొన్న విక్రయానికి రాగా.. క్వింటాల్ గరిష్టంగా రూ.2,261, కనిష్టంగా రూ.1,748 ధరలు లభించాయి. వేరుశనగ గరిష్టంగా రూ.6,321, కనిష్టంగా రూ.4,821, కందులు రూ.5,806, పొద్దుతిరుగుడు రూ.3,114, పెబ్బర్లు రూ.4,500, జొన్నలు రూ.3, 577, ధాన్యం హంస రూ.1,892, ఆర్ఎన్ఆర్ గరిష్టంగా రూ.2,309, కనిష్టంగా రూ.1,450, ఆముదాలు రూ.గరిష్టంగా రూ.6,321, కనిష్టంగా రూ.6,000 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్కు దాదాపు 6వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. ఆర్ఎన్ఆర్ ధాన్యం క్వింటాల్కు గరిష్టంగా రూ.2,209, కనిష్టంగా రూ.1,750, హంస గరిష్టంగా రూ.1,769, కనిష్టంగా రూ.1,639, ఆముదాలు గరిష్టంగా రూ.6,030, కనిష్టంగా రూ.6,000 లుగా ధరలు నమోదు అయ్యావి. హుండీ లెక్కింపు దేవరకద్ర: చిన్నరాజమూర్ ఆంజనేయస్వామి దేవాలయంలో మంగళవారం హుండీని లెక్కించారు. అధికారులు, గ్రామస్తుల సమక్షంలో హుండీని తెరిచి లెక్కించగా.. మొత్తం రూ.4,13,633 ఆదాయం వచ్చింది. కార్యక్రమరంలో దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఈఓ కవిత, ప్రసాద్, ఆలయ కమిటీ చైర్మన్ రాఘవేంద్రచార్యులు పాల్గొన్నారు. -
పునరావాస పనులు వేగవంతం చేయండి: కలెక్టర్
జడ్చర్ల: ఉదండాపూర్ రిజర్వాయర్ ముంపు గ్రామాల నిర్వాసితులకు ఏర్పాటు చేస్తున్న పునరావాస కేంద్రాలలో పనులను యుద్ధ ప్రాతిపదికన వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో కలిసి దాదాపు మూడు గంటల పాటు పోలేపల్లి సమీపంలో ఏర్పాటు చేస్తున్న పునరావాస కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి పనులను పరిశీలించారు. దేవునిగుట్ట తండా వద్ద ఏర్పాటు చేస్తున్న పునరావాస కేంద్రాలు 1, 2లలో ముంపునకు గురవుతున్న వల్లూరు, ఉదండాపూర్ నిర్వాసిత గ్రామాలతో పాటు చిన్నగుట్టతండా, తుమ్మలకుంట తండా, ఒంటిగుడిసె తండా, రేగడిపట్టి తండావాసులకు సంబంధించి చేపట్టిన మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు. పునరావాస కేంద్రం–1లో రేగడిపట్టి తండా, చిన్నగుట్టతండాలకు సంబంధించి 151 ప్లాట్లలో చేపట్టిన మిషన్ భగీరథ తాగునీటి పైపులైన్లు, వాటర్ ట్యాంకుల నిర్మాణం, డ్రెయినేజీ, విద్యుత్ సరఫరాకు సంబంధించిన పనులు పూర్తి చేసినట్లు అధికారులు కలెక్టర్కు వివరించారు. ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన భవన నిర్మాణాలు చేపట్టనున్న స్థలాలను పరిశీలించారు. పునరావాస కేంద్రాలలో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలతో పాటు అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, పెండింగ్ పనులపై దృష్టి సారించి నిర్వాసితులకు ప్లాట్లు కేటాయించే విధంగా సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇకపై ప్రతివారం పునరావాస కేంద్రాల పనుల పురోగతిని తమ కార్యాలయంలో సమీక్షించనున్నట్లు తెలిపారు. ఇక నుంచి పనుల జాప్యాన్ని సహించబోమన్నారు. వేసవి కాలం పూర్తయ్యేలోగా పనులు పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మోహన్రావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్, ఆర్డీఓ నవీన్, నీటిపారుదల శాఖ ఎస్ఈ చక్రధరం, ఈఈలు రమేశ్, ఉదయ్కుమార్, మిషన్ భగీరథ ఎస్ఈ జగన్మోహన్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కిషన్రావు, మిషన్ భగీరథ ఇంట్రా ఈఈ పుల్లారెడ్డి, మౌలిక విద్య సదుపాయాల సంస్థ ఈఈ రాంచందర్, స్థానిక తహసీల్దార్ నర్సింగరావు, తదితరులు పాల్గొన్నారు. -
అంబేడ్కర్ను మోసం చేసిన ఘనత కాంగ్రెస్దే
పాలమూరు: కాంగ్రెస్ పార్టీ అడుగడున అంబేడ్కర్ను మోసం చేసిందని, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ రచయిత, ఆర్థికవేత్త అయిన అలాంటి వ్యక్తిని అవమానించిన ఘనత ఆ ఒక్క పార్టీకే దక్కుతుందని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. అంబేద్కర్ జయంతి వేడుకల్లో భాగంగా జిల్లా బీజేపీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మేధావుల సదస్సులో ఎంపీ మాట్లాడారు. అంబేడ్కర్ చరిత్ర తెలియని వారు ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారని, 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అంబేడ్కర్ను ఎలా మోసం చేసిందో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. కాంగ్రెస్ ఇప్పటి వరకు 74 సార్లు రాజ్యాంగ సవరణ చేసిందని, మరో 88 సార్లు రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. 1952లో లోక్సభ ఎన్నికల్లో అంబేడ్కర్ను పనిగట్టుకుని ఓడించిందన్నారు. ఆయన అంత్యక్రియలకు ఢిల్లీలో స్థలం కూడా ఇవ్వలేదని, మృతదేహన్ని పంపిన విమాన చార్జీలు కూడా చెల్లించాలని బిల్లు పంపిందన్నారు. బీజేపీ అంబేడ్కర్ను గౌరవించుకోవడానికి అనేక ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్గౌడ్, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, రాజేష్, కిరణ్,రమేష్, సునీల్, అనంతరెడ్డి, శ్రీకాంత్, కొండయ్య తదితరులు పాల్గొన్నారు. -
మహిళల చేతికి ప్రగతి చక్రాలు
అచ్చంపేట: మహిళల ఆర్థిక పరిపుష్టికి ప్రభుత్వం వివిధ పథకాలు అమలు చేస్తోంది. ఇందిరా మహిళా శక్తి ద్వారా విరివిగా రుణాలు మంజూరు చేస్తూ కోటీశ్వరులు చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ఈ నేపథ్యంలోనే మహిళా సమాఖ్యలకు జిల్లాల పరిధిలో ఆర్టీసీ బస్సుల నిర్వహణ బాధ్యతను అప్పగిస్తోంది. ఇందుకోసం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున సీఎం రేవంత్రెడ్డి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే ఉమ్మడి పాలమూరు జిల్లాలో బస్సుల ఆవశ్యకతను దృష్టిలో మొత్తం ఉంచుకుని 10 డిపోల పరిధిలో అచ్చంపేట 5, కల్వకుర్తి 4, నాగర్కర్నూల్ 2, కొల్లాపూర్ 2, గద్వాల 4, వనపర్తి 7, మహబూబ్నగర్ 5, నారాయణపేట 2, కోస్గి 1, షాద్నగర్ 17 చొప్పున 49 బస్సుల కోసం ప్రతిపాదనలు పంపించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో నూతన సంఘాల ఏర్పాటుతో పాటు ఇది వరకు ఉన్న సంఘాలకు బస్సుల నిర్వహణకు అవసరమయ్యే రుణాలను బ్యాంకు లింకేజీ ద్వారా అందించనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి ద్వారా క్యాంటీన్ల ఏర్పాటు, పెరటి కోళ్ల పెంపకం, మీ– సేవ కేంద్రాలు, ఈవెంట్ మేనేజ్మెంట్, ఆహార కేంద్రాలు తదితర వాటి ఏర్పాటుకు సహకారం అందిస్తోంది. రద్దీ నేపథ్యంలో 64 కొత్త బస్సుల కోసం.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేశాక అన్ని డిపోల్లో బస్సుల కొరత తీవ్రమైంది. రద్దీతో డ్రైవర్లు, కండక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రద్దీకి సరిపడా బస్సులు లేక ఉన్న వాటినే పంపిస్తున్నారు. ఇవి చాలా ఏళ్ల కిందటివి కావడంతో తరుచుగా మరమ్మతుకు గురవుతున్నాయి. పండుగలు, జాతర్లు, ముఖ్యమైన రోజుల్లో ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సులు నడిపేందుకు అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. బస్భవన్ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలో బస్సుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని 10 డిపోల పరిధిలో అచ్చంపేటకు (2 ఎక్స్ప్రెస్లు), కల్వకుర్తికి (2 ఎక్స్ప్రెస్లు) నాగర్కర్నూల్కు (3 పల్లె వెలుగులు), గద్వాలకు (7 ఎక్స్ప్రెస్లు, 12 పల్లె వెలుగులు, 2 డీలక్స్లు), వనపర్తికి (4 ఎక్స్ప్రెస్లు, 4 పల్లె వెలుగులు), మహబూబ్నగర్కు (11 ఎక్స్ప్రెస్లు, 6 పల్లె వెలుగులు), నారాయణపేటకు (1 ఎక్స్ప్రెస్, 1 పల్లెవెలుగు), షాద్నగర్కు (6 ఎక్స్ప్రెస్లు, 3 పల్లె వెలుగులు) చొప్పున మొత్తం 64 బస్సుల కోసం అధికారులు ప్రత్యేకంగా ప్రతిపాదనలు పంపించారు. త్వరలోనే ఈ కొత్త బస్సులు ఆయా డిపోలకు చేరనున్నాయి. అద్దె ప్రాతిపదికన రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం అమలుతో ఆర్టీసీ బస్సుల్లో విపరీతమైన రద్దీ పెరిగింది. ఉమ్మడి జిల్లాలోని డిపోల పరిధిలో సరిపడా బస్సులు లేవు. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో బస్సుల కొనుగోలుతో కొంత వరకై నా సమస్య తీరనుంది. ఈ క్రమంలో మహిళా సమాఖ్యలు బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దె ప్రాతిపదికన ఇవ్వనున్నారు. దీంతో మండల మహిళా సమాఖ్యలు పెట్టుబడి పెట్టిన మొత్తానికి ఆర్టీసీ సంస్థ ఏడేళ్లపాటు ప్రతి నెలా రూ.77,220 అద్దె చెల్లించనుంది. దీంతో మహిళా సంఘాల మహిళలకు ఆర్థిక ఊతం లభిస్తుంది. మరోవైపు రూ.లక్షల విలువైన బస్సు సమాఖ్య సొంతం కానుంది. మండల సమాఖ్యలకు ఆర్టీసీ అద్దె బస్సుల నిర్వహణ బాధ్యతలు ఉమ్మడి జిల్లాలో 49 బస్సుల కోసం ప్రతిపాదనలు ప్రతినెలా ఒక్కో బస్సుకు అద్దె రూపంలో రూ.77,220 చెల్లింపు మహిళలూ ఆర్థిక పరిపుష్టి సాధించే సదావకాశం ఇందిరా మహిళా శక్తి ద్వారా ప్రభుత్వం చేయూత -
సాగునీటి కోసం రైతుల రాస్తారోకో
అమరచింత: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టు రహదారిపై సాగునీరు ఇవ్వాలంటూ మండుటెండలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. జూరాల ఎడమ కాల్వ ద్వారా యాసంగిలో 20 వేల ఎకరాలకు సాగునీటిని రామన్పాడు వరకే అందిస్తామని అధికారులు ప్రకటించారు. దీంతో ప్రాజెక్టు సమీపంలో ఉన్న అమరచింత, ఆత్మకూరు మండలాల రైతులు వరిపంట సాగుచేశారు. వారబందితో సాగునీటిని అందించిన అధికారులు పంటలు చేతికొచ్చే సమయంలో నీటిని నిలిపివేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆత్మకూర్ మండలంలోని ఆరేపల్లి, తూంపల్లి, గుంటిపల్లి, జూరాల గ్రామాలకు చెందిన రైతులు మంగళవారం జూరాల ఎడమ కాల్వ వద్దకు చేరుకొని ప్రాజెక్టు రహదారిపై రాస్తారోకో చేపట్టారు. అక్కడే ఉన్న బారికేడ్లు, ముళ్లపొదలు అడ్డంగా పెట్టడంతో వాహనాల రాకపోకలు పూర్తిస్థాయిలో నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న జోగుళాంబ గద్వాల జిల్లా ధరూర్ ఎస్ఐ, వనపర్తి జిల్లా అమరచింత ఎస్ఐ సురేష్ సిబ్బందితో అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ, తమకు సాగునీరు అందించాల్సిందేనని, అప్పటి వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని రైతులు తెగేసి చెప్పడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో రైతుల రాస్తారోకో విషయాన్ని సీఐ శివకుమార్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన వచ్చి ఉన్నతాధికారులతో చర్చించి సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పడంతో రైతులు రాస్తారోకో విరమించారు. మండుటెండలో జూరాల ప్రాజెక్టుపై బైఠాయింపు గంటన్నర వరకు కదలని రైతులు నిలిచిన వాహన రాకపోకలు -
కొల్లాపూర్– నాగర్కర్నూల్ మధ్య నడిపిస్తున్నాం..
మాకు కేటాయించిన బస్సును మార్చి 20 నుంచి కొల్లాపూర్– నాగర్కర్నూల్ మధ్య నడిపిస్తున్నాం. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.30 లక్షలతో ఎలక్ట్రికల్ బస్సు కొనుగోలు చేసి అప్పగించింది. ఆర్టీసీ వారు నెలకు రూ.77,220 అద్దె చెల్లిస్తామని చెప్పారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి డబ్బులు చెల్లించలేదు. పెద్దకొత్తపల్లి మండల మహిళా సమాఖ్య జిల్లాలోనే ఉత్తమ మహిళా సమాఖ్యగా ఎంపికై ంది. – అరుణ, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, పెద్దకొత్తపల్లి జిల్లాకు ఏడు బస్సులు.. నాగర్కర్నూల్ జిల్లాలోని 20 మండలాలకు గాను ఏడింటికి మొదటి విడతలో ఏడు బస్సులు మంజూరయ్యాయి. సీఎం రేవంత్రెడ్డి చేతులమీదుగా పెద్దకొత్తపల్లికి చెందిన సమాఖ్య బస్సు ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన రూ.30 లక్షల నిధులు ప్రభుత్వం నుంచి విడుదల కాగా మహిళా సంఘాల అకౌంట్లో జమ అయ్యాయి. – చిన్న ఓబులేషు, డీఆర్డీఓ, నాగర్కర్నూల్ ● -
కొడుకు చేసిన పనికి తండ్రి బలి
అచ్చంపేట రూరల్: కుమారుడి వివాహేతర సంబంధానికి ఓ తండ్రి బలయ్యాడు. ప్రత్యర్థులు వెంటాడి వేటాడి దారుణంగా హతమార్చారు. ప్రశాంతంగా ఉండే నల్లమల ప్రాంతం ఈ హత్యతో ఒక్కసారిగా ఉలికిపడింది. గ్రామస్తుల వివరాల మేరకు.. అచ్చంపేట మండలం నడింపల్లి గ్రామానికి చెందిన బూరం వీరయ్య (54) చిన్న కుమారుడు పరమేశ్ అదే గ్రామానికి చెందిన భర్త, ఇద్దరు సంతానం ఉన్న ఓ వివాహితతో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో నెలరోజుల క్రితం ఆ మహిళను ఆంధ్రప్రదేశ్లోని ఓ ప్రాంతానికి తీసుకెళ్లి సహజీవనం చేశారు. సదరు మహిళ భర్త, బంధువులు వారున్న ప్రాంతానికి వెళ్లి యువకుడిని చితకబాది.. మహిళను స్వగ్రామానికి తీసుకువచ్చారు. అయితే సదరు యువకుడు, అతడి కుటుంబసభ్యులపై మహిళ కుటుంబ సభ్యులు పగ పెంచుకున్నారు. ప్రతీకారం కోసం ఎదురుచూశారు. మంగళవారం వీరయ్య తన పెద్ద కుమారుడు వెంకటేశ్తో కలిసి అచ్చంపేట నుంచి నడింపల్లికి బైక్పై వస్తున్న విషయాన్ని గుర్తించారు. హైదరాబాద్–అచ్చంపేట ప్రధాన రహదారిపై నడింపల్లి సమీపంలో బైక్పై కొందరు వెంబడించగా.. మరికొందరు కారుతో వీరయ్య బైక్ను ఢీకొట్టారు. అనంతరం వారి కళ్లల్లో కారం చల్లి సుత్తి, గొడ్డలితో వీరయ్యపై విరుచుకుపడ్డారు. మెడ భాగంపై గొడ్డలితో వేటు వేయడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకటేశ్పై దాడికి యత్నించగా.. స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రధాన రహదారిపై ఆందోళన.. వీరయ్య హత్య విషయం తెలుసుకున్న అతడి బంధువులు, గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకు దిగారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్– అచ్చంపేట ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. గతంలో వీరయ్య కుటుంబంపై దాడి జరిగిన విషయంపై అచ్చంపేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదని వీరయ్య కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. నిందితులకు పోలీసుల సపోర్టు ఉందని ఆరోపిస్తూ.. ఘటనా స్థలానికి వచ్చిన ఓ కానిస్టేబుల్పై దాడికి యత్నించారు. గమనించిన తోటి పోలీసులు ఆర్టీసీ బస్సులో అతడిని అచ్చంపేటకు పంపించారు. ఘటనా స్థలానికి డీఎస్పీ శ్రీనివాసులు చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ రవీందర్ తెలిపారు. ● భర్త, ఇద్దరు పిల్లలున్న మహిళతో వివాహేతర సంబంధం ● నెల రోజుల క్రితం ఏపీకి వెళ్లి సహజీవనం ● కుమారుడిపై కోపంతో... తండ్రిని వెంటాడి వేటాడి హతమార్చిన ప్రత్యర్థులు -
రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
జడ్చర్ల: 44వ నంబర్ జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ గుర్తుతెలియన వ్యక్తి (సుమారు 58 ఏళ్లు) రోడ్డు ప్రమాదానికి గురై మృత్యువాత పడినట్లు సీఐ కమలాకర్ తెలిపారు. జమ్జమ్ హోటల్ ఎదుట రోడ్డు దాటుతున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడని, మృతదేహాన్ని జడ్చర్ల ఆస్పత్రిలోని మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. రైలు నుంచి పడి యువకుడు.. ● ఫోన్ లొకేషన్ ఆధారంగా మృతదేహం గుర్తింపు అమరచింత/దేవరకద్ర రూరల్: రైలు డోర్ తగిలి కిందపడి యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం దేవరకద్ర సమీపంలో చోటు చేసుకుంది. అమరచింత పట్టణానికి చెందిన మరెడి సురేందర్ రెడ్డి రెండో కుమారుడు భరత్కుమార్రెడ్డి సిద్దిపేటలోని మెరిడియాన ప్రైవేటు కళాశాలలో లెక్చరర్గా విధులు నిర్వహిస్తున్నాడు. వరుస సెలవుల నేపథ్యంలో ఇంటికి వచ్చాడు. మంగళవారం సిద్దిపేటకు వెళ్లడానికి తెల్లవారు జామున తండ్రి సురేందర్ రెడ్డితో కలిసి మదనాపురం రైల్వే స్టేషన్లో వెంకట్రాది ఎక్స్ప్రెస్ రైలులో హైదరాబాద్కు బయలు దేరాడు. హైదరాబాద్లో రైలును క్లీన్ చేస్తున్న సిబ్బందికి బ్యాగ్ దొరకడంతో రైల్వే పోలీసులు ఐడెంటిటీ కార్డును పరిశీలించి కాలేజీ సిబ్బందికి, భరత్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో పోలీసులు భరత్కుమార్రెడ్డి ఫోన్ లోకేషన్ ఆధారంగా దర్యాప్తు చేయగా దేవరకద్ర రైల్వే ట్రాక్ సమీపంలోని పంట పొలాల్లో భరత్కుమార్రెడ్డి విగతజీవిగా పడి ఉండటాన్ని కనుగొన్నారు. చేతికందొచ్చిన కొడుకు మృతి చెందడంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. యువకుడి మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఈదురు గాలులకు డబ్బా పడి మహిళా రైతు.. అడ్డాకుల: డబ్బా మీదపడి ఓ మహిళా రైతు ప్రాణాలు కోల్పోయిన ఘటన మూసాపేట మండలం వేములలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన అల్లమాయపల్లి మల్లయ్య, అయ్యమ్మ (59) భార్యాభర్తలు. వీరు గ్రామ సమీపంలోని హన్మంత్రెడ్డి వ్యవసాయ పొలంలో వరి ధాన్యం ఆరబోశారు. మంగళవారం సాయంత్రం వర్షం కురవడంతో అయ్యమ్మ ధాన్యంపై టార్పాలిన్లు కప్పి సమీపంలో ఉన్న డబ్బా చాటున నిలబడగా గాలుల ధాటికి ఆమైపె పడింది. కాసేపటి తర్వాత తోటి రైతులు ఆమె కోసం వెదకగా డబ్బా కింద కనిపించింది. అందరూ కలిసి డబ్బాను పైకెత్తి చూడగా అప్పటికే మృతిచెందింది. -
కొనసాగుతున్న వెంటిలేషన్ పునరుద్ధరణ
అచ్చంపేట: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగం పైకప్పు కూలిన ఘటనలో గల్లంతైన కార్మికుల ఆచూకీ మంగళవారం కూడా లభ్యం కాలేదు. సొరంగం లోపల డీ–2, డీ–1 ప్రదేశాల మధ్యన మట్టి తవ్వకాలు కొనసాగుతుండగా.. పూర్తి కావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. నిషేధిత ప్రదేశం వరకు శిథిలాల తొలగింపు కొనసాగుతుండగా.. అక్కడి వరకు ఆక్సిజన్ అందించేందుకు వెంటిలేషన్ పునరుద్ధరణ పనులు కొనసాగిస్తున్నారు. టీబీఎం శకలాలు, బండరాళ్లను లోకో ట్రైన్లో, మట్టి, బురదను కన్వేయర్ బెల్టుపై బయటకు తరలిస్తున్నారు. నీటి ఊటను 150 హెచ్పీ మోటార్ల సాయంతో కృష్ణానదిలోకి వదులుతున్నారు. చిక్కుకున్న ఆరుగురి కార్మికుల జాడ రెండు, మూడు రోజుల్లో లభించే అవకాశం ఉందని సహాయక సిబ్బంది తెలిపారు. డీ–2 ప్రదేశంలో తవ్వకాలు.. సొరంగంలో ప్రమాద ప్రదేశం డీ–2 సమీపంలో మట్టి తవ్వకాలు వేగంగా కొనసాగుతున్నాయని ప్రత్యేక అఽధికారి శివశంకర్ లోతేటి తెలిపారు. మంగళవారం జేపీ కార్యాలయంలో ప్రత్యేక బృందాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి కొనసాగుతున్న సహాయక చర్యలపై ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ.. ఎస్కవేటర్లు, బాబ్ క్యాట్లు నిర్విరామంగా మట్టి తవ్వకాలు చేపడుతూ కన్వేయర్ బెల్టు ద్వారా సొరంగం బయటకు పంపుతున్నట్లు తెలిపారు. టీబీఎం మిషన్పై పేరుకుపోయిన బురదను వాటర్ జెట్ల సాయంతో తొలగించే ప్రక్రియ సమాంతరంగా కొనసాగుతుందని చెప్పారు. సహాయక సిబ్బంది రాత్రింబవళ్లు విరామం లేకుండా పనిచేస్తున్నారని, వారికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సమావేశంలో ఆర్మీ అధికారులు వికాస్సింగ్, విజయ్కుమార్, జేపీ కంపెనీ సీనియర్ ప్రాజెక్టు ఇంజినీర్ సంజయ్కుమార్ సింగ్, సింగరేణి మైన్స్ రెస్క్యూ జనరల్ మేనేజర్ బైద్య, ఎన్డీఆర్ఎఫ్ అధికారి గిరిధర్రెడ్డి, హైడ్రా అధికారి, దక్షిణ మధ్య రైల్వే అధికారి రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎల్బీసీలో కార్మికల జాడ కోసం 53 రోజులుగా అన్వేషణ -
75 ట్రాక్టర్ల ఇసుక డంప్లు సీజ్
వనపర్తి రూరల్: పెబ్బేరు మండలంలోని రంగాపురం గ్రామ శివారులోని నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను డపింగ్ చేయడంతో విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఐ యుగేందర్రెడ్డి, ఆర్ఐ రాఘవేందర్రావులు దాదాపు 75 ట్రాక్టర్ల ఇసుకను డంపింగ్ సీజ్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా ఇసుక డపింగ్ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్ఐ తెలిపారు. భార్య హత్య కేసులో భర్త రిమాండ్ ఎర్రవల్లి: భార్యను హత్య చేసిన కేసులో భర్తను రిమాండ్కు తరలించినట్లు ఇటిక్యాల ఎస్ఐ వెంకటేష్ తెలిపారు. ఆయన తెలిపిన ప్రకారం.. మండలంలోని సాతర్ల గ్రామానికి చెందిన షాలు తన భార్య సంసీన్ అలియాస్ నషియాబాను (32)తో మార్చి 30న గొడవ పెట్టుకొని ఆగ్రహంతో రోకలి బండతో తలపై కొట్టాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై ఆమె కోమాలోకి వెళ్లింది. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కర్నూల్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఈ నెల 4న పరిస్థితి విషమించి మృతి చెందింది. ఆమె తల్లి మాసుంబీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. అలంపూర్ సీఐ రవిబాబు కేసు విచారణలో భాగంగా మంగళవారం షాలును అరెస్ట్ చేసి అలంపూర్ కోర్టులో హాజరుపర్చి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. యువకుల మృతదేహాలు లభ్యం మహబూబ్నగర్ క్రైం: దివిటిపల్లి డబుల్ బెడ్రూం కాలనీకి చెందిన మహిమూద్ (24), అయ్యప్ప అలియాస్ సుశాంత్ (17) మృతదేహాలను క్వారీ గుంత నుంచి మంగళవారం సాయంత్రం అధికారులు వెలికితీశారు. విజయ్కుమార్ మృతదేహం సోమవారమే లభ్యం కాగా.. అయ్యప్ప, మహిమూద్ కోసం రాత్రి వరకు గాలింపు చేపట్టినా ఆచూకీ లభించలేదు. మంగళవారం ఉదయం అగ్నిమాపకశాఖ, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టగా సాయంత్రం 5.40 ప్రాంతంలో ఇద్దరి మృతదేహాలు వేర్వేరు ప్రాంతాల్లో లభ్యమయ్యాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. మోతీఘనపూర్లో.. రాజాపూర్ (బాలానగర్): బాలానగర్ మండలం మోతీఘనపూర్ పెద్దచెరువులో ప్రమాదవశాత్తు పడి ఇద్దరు మృతిచెందిన విషయం విధితమే. కాగా మంగళవారం ఉదయం శివకుమార్ మృతదేహం చెరువులో నీటిపై తేలియాడుతూ కనిపించడంతో బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ లెనిన్గౌడ్ తెలిపారు. యాదయ్య మృతదేహం కోసం సాయంత్రం వరకు గాలించినా ఫలితం లేకపోయింది. -
ముమ్మరంగా సహాయక చర్యలు
అచ్చంపేట: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగి సోమవారం నాటికి 52 రోజులు గడుస్తోంది. డి–1 ప్రదేశంలో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకుండా నిపుణుల సూచనలు, సలహాల మేరకు అత్యాధునిక సాంకేతిక పరికరాలు వినియోగించి మట్టి తవ్వకాలు, టీబీఎం శకలాల తొలగింపు చేపడుతున్నారు. ఐదు ఎస్కవేటర్లు నిరంతరాయంగా మట్టి తవ్వతుండగా.. కన్వేయర్ బెల్టుపై సొరంగం నుంచి బయటకు తరలిస్తున్నారు. సిబ్బందికి ఆక్సిజన్ అందించేందుకు వెంటిలేషన్ వ్యవస్థ పునరుద్ధరణ కొనసాగుతోంది. సొరంగంలో నిరంతరాయంగా ఉబికివస్తున్న నీటిని భారీ మోటార్ల సాయంతో బయటకు తరలిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 12 సంస్థల 560 మంది సిబ్బంది రాత్రింబవళ్లు గల్లంతైన ఆరుగురి ఆచూకీ గుర్తించేందుకు శ్రమిస్తున్నా.. ఇంతవరకు దొరకలేదు. షిఫ్ట్లలో 560 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. వెంటిలేషన్ వ్యవస్థ పునరుద్ధరణ.. సొరంగం ప్రమాద ప్రదేశంలో సహాయక చర్యలు చేపడుతున్నామని, సిబ్బందికి అవసరమైన ఆక్సిజన్ అందించేందుకు వెంటిలేషన్ వ్యవస్థ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి తెలిపారు. సోమవారం ఎస్ఎల్బీసీ సొరంగం ఇన్లెట్ జేపీ కార్యాలయం వద్ద సహాయక బృందాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డీవాటరింగ్ ప్రక్రియ కొనసాగుతుందని, నీటిని కృష్ణానదిలోకి వదులుతున్నట్లు తెలిపారు. సహాయక బృందాల భద్రతకు సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటున్నామని, సిబ్బంది నిర్విరామంగా పని చేస్తున్నారని చెప్పారు. సమావేశంలో ఆర్మీ అధికారులు వికాస్సింగ్, విజయ్కుమార్, జేపీ కంపెనీ సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ సంజయ్కుమార్ సింగ్, సింగరేణి మైన్స్ రెస్క్యూ జనరల్ మేనేజర్ బైద్య, ఎన్డీఆర్ఎఫ్ అధికారి గిరిధర్రెడ్డి, హైడ్రా అధికారి, దక్షిణ మధ్య రైల్వే అధికారి రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎల్బీసీలో 52 రోజులుగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ నిపుణుల సూచన మేరకు డి–1 ప్రదేశంలో తవ్వకాలు -
చెరువులో పడి ఇద్దరి గల్లంతు
రాజాపూర్ (బాలానగర్): చెరువులో పడి ఇద్దరు వ్యక్తులు గల్లంతైన ఘటన సోమవారం బాలానగర్ మండలం మోతీఘనపూర్ పెద్దచెరువులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బాలానగర్ మండలం గంగాధర్పల్లికి చెందిన శివరాములు (45) గ్రామ శివారులోని పెద్ద చెరువులో పడిపోయాడు. గుర్తించిన యాదయ్య (25) శివరాములు కుటుంబసభ్యులకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంలో వెంటనే అక్కడకు చేరుకున్నారు. తీసుకొస్తానంటూ యాదయ్య కూడా చెరువులోకి దిగగా.. ఈత రాకపోవడంతో ఆయన కూడా చెరువులో మునిగిపోయాడు. విషయం తెలుసుకున్న బాలానగర్ ఎస్ఐ లెనిన్గౌడ్ గజ ఈతగాళ్లను రప్పించి గాలింపు ప్రారంభించినా.. రాత్రి వరకు ఆచూకీ లభించలేదు. క్రికెట్ బెట్టింగ్ మాయ జడ్చర్ల: బెట్టింగ్ యాప్లో పందాలు కాసిన ఓ విద్యార్థి చివరకు రూ. 1.05కోట్ల అప్పులపాలైన ఘటన జడ్చర్లలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణానికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి కుమారుడు (ఇంజినీరింగ్ విద్యార్థి) ఓ యాప్లో క్రికెట్కు సంబంధించి బెట్టింగ్ కాశాడు. అయితే బెట్టింగ్ యాప్లో వచ్చిన లోన్ అప్లికేషన్ను పూర్తిచేసి.. ఆధార్, పాన్కార్డు, బ్యాంకు ఖాతా తదితర వివరాలను పొందుపరిచి, వారిచ్చిన నిబంధనలకు అంగీకారం తెలిపారు. దీంతో విద్యార్థి అనుకున్నంత లోన్ మంజూరు కావడం.. మంజూరైన డబ్బులతో బెట్టింగ్ కాయడం జరిగింది. తీరా బెట్టింగ్ పూర్తయ్యే సరికి సదరు విద్యార్థికి రూ. 1.05కోట్ల అప్పులు మిగిలాయి. ఈ అప్పునకు రూ.30 నుంచి రూ.40 వరకు వడ్డీగా ఉంది. తీసుకున్న అప్పు తీర్చకపోవడంతో ఇటీవల వారు విద్యార్థి ఇంటికి వచ్చి నానాయాగి చేశారు. అయితే పరువు కలిగిన ఆ కుటుంబ సభ్యులు తమ కుల సంఘం నాయకుడి ద్వారా మధ్యవర్థిత్వం నెరిపి చివరకు సెటిల్మెంట్ చేసుకున్నారు. అప్పులవాళ్లు ఇచ్చిన రూ. 1.05 కోట్లను వడ్డీ లేకుండా చెల్లించే విధంగా ఒప్పందం కుదర్చుకున్నట్లు తెలిసింది. ఇలా.. పట్టణంలో బెట్టింగ్ యాప్ల వలలో పడి పలువురు యువకులు రూ. కోట్ల అప్పుల్లో కూరుకుపోయినట్లు సమాచారం. ఇప్పటికై నా పోలీసులు స్పందించి సైబర్ నేరాలతో పాటు బెట్టింగ్ యాప్లపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. రూ.1.05కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన విద్యార్థి -
రైతుల కష్టం నీటిపాలు
●ఎడెకరాల్లో పంట దెబ్బతింది.. ఎడెకరాల్లో సాగుచేసిన వరిపంట మొత్తం దెబ్బతింది. వడగండ్ల వానకు వడ్లు నేలరాలడంతో 70శాతం వరకు నష్టం వాటిల్లింది. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలి. – నర్సింహారెడ్డి, రైతు, అయ్యవారిపల్లి, మిడ్జిల్ మండలం 400 బస్తాల ధాన్యం తడిసింది.. మద్దతు ధరకు అమ్ముకోవాలని 400 బస్తాల ధాన్యాన్ని మార్కెట్లోని సీసీరోడ్డుపై ఆరబోశాను. అకాల వర్షాంతో ధాన్యం అంతా తడిసి ముద్దయింది. కొనుగోలు కేంద్రంలో అయితే మద్దతు ధరతో పాటు బోనస్ వస్తుందని ఆశ పడగా.. ధాన్యం అంతా నీటిపాలు అయింది. – వర్కుటి లక్ష్మారెడ్డి, రైతు, దేవరకద్ర కొనుగోలు కేంద్రం ప్రారంభించాలి.. కొనుగోలు కేంద్రం ప్రారంభం అవుతుందని చెప్పడంతో రెండు రోజుల నుంచి మార్కెట్ ఆవరణలో ఽ300 బస్తాల ధాన్యాన్ని అరబెట్టుకుంటున్న. మార్కెట్లో అమ్మితే రూ. వెయ్యి వరకు తక్కువ ధర వస్తుంది. అదే కొనుగోలు కేంద్రంలో అయితే మద్దతు ధరతో పాటు బోనస్ వస్తుందని ఎదురుచూస్తున్నా. అకాల వర్షంతో ధాన్యం మొత్తం తడిసి ముద్దయింది. – బండ కొండారెడ్డి, రైతు, దేవరకద్ర కుప్పగా పోసేందుకు కూడా సమయం లేదు.. ఆరబెట్టుకున్న ధాన్యం కళ్లెదుటే తడిసిపోయింది. కనీసం కుప్పగా పోసుకోడానికి కూడా సమయం దొరకలేదు. భారీ వర్షానికి 600 బస్తాల ధాన్యం తడిసిపోగా.. మరికొంత నీటిలో కొట్టుకుపోయింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఇలా నీటిపాలు అవుతుంటే చూస్తున్న తప్ప రక్షించుకునే పరిస్థితి కనిపించలేదు. అధికారులు స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆదుకోవాలి. – డోకూర్ హన్మిరెడ్డి, రైతు, దేవరకద్ర మహబూబ్నగర్ (వ్యవసాయం)/దేవరకద్ర/మిడ్జిల్/కల్వకుర్తి రూరల్/వెల్దండ: ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంట వరుణుడి దెబ్బకు తడిసి ముద్దయింది. ఇది చూసిన రైతు అయ్యో వరుణదేవా ఏందీ పరిస్థితి అని గుండెలవిసేలా రోదిస్తున్నాడు. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. మరికొన్ని చోట్ల గాలి దుమారానికి చెట్లు నేలకొరిగాయి. దేవరకద్ర, మహబూబ్నగర్ రూరల్, కల్వకుర్తి, మిడ్జిల్, వెల్దండ మండలాల్లో కురిసిన అకాల వర్షంతో ధాన్యం తడిసి ముద్దయింది. నాటు వేసినప్పటి నుంచి కోత కోసే దాక తెగుళ్ల బారి నుంచి పంటను కాపాడుకుంటున్న పంట.. చేతికి వచ్చే సరికి అకాల వర్షాలతో దెబ్బతింటుందని రైతులు వాపోతున్నారు. పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వపరంగా ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ● మహబూబ్నగర్ రూరల్ మండలం మన్యంకొండ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం వద్ద కుప్పలుగా పోసిన వరి ధాన్యం వర్షానికి తడిసిపోయింది. వర్షం పడే సమయానికి రైతులు అక్కడి చేరుకొని ధాన్యాన్ని కుప్పగా పోసినప్పటికీ.. కప్పడానికి సరైనా టార్పాలిన్లు లేకపోవడంతో ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పాయిపల్లి, మాచన్పల్లి, ఓబ్లాయిపల్లి, తండా, రామచంద్రాపూర్, కోడూర్, తెలుగుగూడెం తదితర గ్రామాల్లో వడగండ్లు పడటంతో వరిపంటలు దెబ్బతిన్నాయి. గాలివాన కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ● మిడ్జిల్ మండలం మిడ్జిల్, వాడ్యాల్, వెలుగొమ్ముల, అయ్యవారిపల్లి, చిల్వేర్ గ్రామాల్లో వరిపంట నేలకొరిగింది. 50 నుంచి 65శాతం మేర వడ్లు నేలరాలినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ● కల్వకుర్తి మండలంలోని తాండ్ర గ్రామంలో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షం కురవడంతో 15 మంది రైతులకు చెందిన 40 ఎకరాల వరిపంట దెబ్బతింది. అకాల వర్షానికి వరిపంట దెబ్బతినడంతో పెట్టిన పెట్టుబడి కూడా చేతికొచ్చే పరిస్థితి లేకుండాపోయిందని రైతులు వాపోతున్నారు. మహబూబ్నగర్ రూరల్ మండలంలోని ఆయా గ్రామాల్లో కురిసిన అకాల వర్షానికి తడిసిన ధాన్యంతో పాటు దెబ్బతిన్న పంటలను బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. కోడూర్, తెలుగుగూడెం, అప్పాయిపల్లి, ఓబ్లాయిపల్లి, తండా, కోటకదిర, మాచన్పల్లి గ్రామాల్లో అకాల వర్షంతో రైతులకు అపారనష్టం చేకూరిందని.. ఎకరాకు రూ. 30వేల పరిహారం చెల్లించి ఆదుకోవాలని మాజీ జెడ్పీటీసీ పి.రవీందర్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్లు దేవేందర్రెడ్డి, నాయకులు రాఘవేందర్గౌడ్, లక్ష్మారెడ్డి, వెంకటస్వామి, మస్తాన్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేవరకద్ర మార్కెట్లో వర్షంలో తడుస్తున్న ఆరబెట్టిన ధాన్యం ఎకరాకు రూ. 30వేల పరిహారం ఇవ్వాలి ఓబ్లాయిపల్లిలో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలిస్తున్న బీఆర్ఎస్ నాయకులు అకాల వర్షంతో తడిసిన వడ్లు దేవరకద్ర మార్కెట్లో తడిసి ముద్దయిన 2వేల బస్తాల ధాన్యం ప్రభుత్వం ఆదుకోవాలంటున్న రైతులు వెల్దండ మండలంలోని చొక్కన్నపల్లి, కుందారంతండా, బండోనిపల్లి తదితర గ్రామాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ వర్షంతో పాటు ఈదురుగాలుల దుమారంతో కుందారంతండాలో విద్యుత్ స్తంభాలు, భారీ చెట్లు నేలకొరిగి ఇళ్లపై పడ్డాయి. పలువురి ఇళ్ల సిమెంట్ రేకులు ధ్వంసమైనట్లు స్థానికులు తెలిపారు. బండోనిపల్లిలో పిడుగుపాటుకు గురై రైతు వావిళ్ల పర్వతాలు అస్వస్తతకు గురయ్యారు. దేవరకద్ర మార్కెట్యార్డులో రెండు రోజుల క్రితం ఆరబోసిన 2వేల బస్తాల ధాన్యం తడిసి ముద్దయింది. మార్కెట్కు రెండు రోజులపాటు సెలవు కారణంగా లావాదేవీలు జరగడం లేదు. మంగళవారం మార్కెట్లో ధాన్యాన్ని విక్రయించవచ్చని కొందరు, కొనుగోలు కేంద్రం ప్రారంభమైతే మద్దతు ధరకు అమ్ముకోవచ్చని మరికొందరు రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకోగా.. అకాల వర్షం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. అదే విధంగా దేవరకద్ర సమీపంలోని అమ్మాపూర్ రోడ్డులో ఆరబెట్టుకున్న ధాన్యం తడిసి ముద్దయింది. కల్లాలు లేక పోవడం వల్ల పలువురు రైతులు దేవస్థానం పొలంలో ఆరబెట్టుకుంటుండగా.. అకాల వర్షానికి ధాన్యం తడిసి పోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. -
బావాజీని దర్శించుకున్న ప్రముఖులు
కొత్తపల్లి: మండలంలోని తిమ్మారెడ్డిపల్లిలో వెలిసిన గురులోకమాసంద్ ప్రభు బావాజీ బ్రహ్మోత్సవాలకు సోమవారం మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి హాజరయ్యారు. లోకమాసంద్ ప్రభు బావాజీ, కాళికాదేవిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ కమిటీ సభ్యులు వారికి పుష్పగుచ్ఛాలు అందేజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద గిరిజన జాతర లోకమాసంద్ ప్రభు బావాజీని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల భక్తులు తరలివస్తారని.. రాష్ట్ర ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమైందని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో దేవాలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేశామని, నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆలయాన్ని విస్మరించారని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు శాసం రామకృష్ణ, సలీం, గోపాల్, మధుసూదన్రెడ్డి, వీరారెడ్డి, రాజురెడ్డి, నెల్లి రాములు తదితరులు పాల్గొన్నారు. ముగిసిన బావాజీ ఉత్సవాలు కొత్తపల్లి: మండలంలోని తిమ్మారెడ్డిపల్లిలో నాలుగు రోజులుగా కొనసాగుతున్న బావాజీ ఉత్సవాలు అట్టహాసంగా ముగిశాయి. సోమవారం చివరిరోజు ఉదయం అమ్మవారికి పల్లకీసేవ నిర్వహించారు. అలాగే అమ్మవారైన కాళికాదేవికి కొందరు భక్తులు మేకపోతులు, గొర్రె పొట్టేళ్లు, కోళ్లు బలిచ్చి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ పూజారులు చందర్నాయక్, భీమ్లాయాక్, దేవ్లానాయక్, ధన్సింగ్ కాళికామాతకు మహా హోమం జరిపారు. గురులోకా మసంద్ బావాజీ, కాళికామాతను సోమవారం సాయంత్రం ఎంపీ డీకే అరుణ దర్శించుకున్నారు. ఎంపీగా గెలుపొందిన తర్వాత మొదటిసారి వచ్చిన ఆమెకు ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించారు. ఆమె వెంట నారాయణపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు సత్యయాదవ్, నాయకులు ప్రతాప్రెడ్డి, మదన్, సుధాకర్రెడ్డి, విజయభాస్కర్రెడ్డి తదితరులున్నారు. -
నిర్వహణ అస్తవ్యస్తం
మహబూబ్నగర్ (వ్యవసాయం): సాగులో రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు జిల్లాలో ఏర్పాటు చేసిన రైతువేదికలు సమస్యలతో సతమమవుతున్నాయి. 31 నెలలుగా ప్రభుత్వం నిర్వహణ నిధులు విడుదల చేయక వేదికలు నిస్తేజంగా మారాయి. కరెంట్ బిల్లులు, పారిశుద్ధ్య నిర్వహణ, స్టేషనరీ, తాగునీటి సౌకర్యాల కల్పనకు డబ్బులు లేక ఏఓలు, ఏఈఓలు ఇబ్బంది పడుతున్నారు. వీటి కోసం అధికారులు సొంత డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా రైతు వేదికల్లో విద్యుత్ బకాయిలు పేరుకుపోవడంతో ఎప్పుడు కరెంట్ కట్ చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. వ్యవసాయశాఖ సేవలను రైతులకు మరింత చేరువ చేసే లక్ష్యంతో గత ప్రభుత్వం క్లస్టర్ల వారీగా రైతు వేదికలను నిర్మించింది. శాఖాపరంగా రైతులకు ఆధునిక సాగు విధానంపై సలహాలు, సూచనలు ఇవ్వాలనేది దీని ప్రధాన లక్ష్యం. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ రైతు వేదికల నిర్వహణపై పట్టింపు లేకుండాపోయింది. ● గత ప్రభుత్వం జిల్లాలో 86 రైతు వేదికలను నిర్మించేందుకు రూ.18.92 కోట్లు మంజూరు చేసింది. ఒక్కొక్క నిర్మాణానికి రూ.22 లక్షల వరకు ఖర్చు చేశారు. 150 నుంచి 200 మంది కూర్చునే సామర్థ్యంతో వేదికలను నిర్మించారు. టేబుళ్లు, కుర్చీలు, మైక్ సిస్టంతో పాటు ఇతర సామగ్రిని సమకూర్చింది. ఏఈఓ, రైతుబంధు సమితి కోఆర్డినేటర్ కోసం రెండు గదులు, రైతుల సమావేశం కోసం ఒక మీటింగ్హాల్తో కూడిన రైతు వేదికలను నిర్మించారు. ప్రతి ఐదువేల ఎకరాలకు ఒక ఏఈఓ ను నియమించి వారి సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు రైతు వేదికలను నిర్మించింది. ఒక్కో రైతువేదిక నిర్వహణ కోసం మొదట నెలకు రూ.3 వేలు ఇచ్చింది. ఈ నిధులు సరిపోకపోవడంతో వ్యవసాయశాఖ ప్రతిపాదనల మేరకు రైతు వేదికల నిర్వహణకు రూ.9 వేల చొప్పున అందజేస్తామని గత ప్రభత్వం ప్రకటించింది. అయితే 2022 సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు ఒక్కపైసా విడుదల కాలే దు. 86 రైతు వేదికలకు సంబంధించి 31 నెలలకు నిర్వహణ నిధులు రూ.2,31,57,000 మేర పేరుకుపోయాయి. నిధులు విడుదల చేయకపోవడంతో విద్యుత్ చార్జీలు, పారిశుద్ధ్య నిర్వహణ, మరమ్మతు లు, స్టేషనరీ, రైతు శిక్షణ, తాగునీటి సౌకర్యాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వ్యవసాయ అధికారులు (ఏఓ), మండల వ్యవసాయ విస్తరణ అధి కారులు (ఏఈఓలు) వాపోతున్నారు. ఒక్కో రైతు వేదికకు రూ.2.79 లక్షలు రావాల్సి ఉందని, తమ సొంత డబ్బులను ఖర్చు చేయాల్సి వస్తుందని అంటున్నారు. ఒక్కో వేదికకు రూ.10 వేల నుంచి రూ. 12 వేల చొప్పున విద్యుత్ చార్జీలు బకాయిలు పేరుకుపోయినట్లు చెబుతున్నారు. ఒక్కో కేంద్రానికి మినీ భూసార పరీక్ష ల్యాబ్ కిట్లను అందజేసి వీటి ద్వారా వేదికల్లో పరీక్షలు చేయాల్సి ఉన్నా నిధులు లేకపోవడంతో ఈ ప్రక్రియ కూడా అటకెక్కింది. ● శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు, రైతులు సమావేశమై సాగు సమస్యలు, ఆధునిక పద్ధతులపై చర్చించేందుకు వీలుగా రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటి విడతగా జిల్లాలోని 16 మండలాల పరిధిలో ఒక రైతు వేదికను వీడియో కాన్ఫరెన్స్ యూనిట్ కోసం ఎంపిక చేశారు. ప్రతి మంగళవారం రైతునేస్తం నిర్వహిస్తున్నారు. ఇదంతా బాగానే ఉన్నా నెలల తరబడి నిధులు విడుదల చేయకపోతే ఈ కార్యక్రమాలను ఎలా నిర్వహిస్తామని ఏఈఓలు ప్రశ్నిస్తున్నారు. ఊరికి దూరంగా... ఒక్కో రైతు వేదిక పరిధిలో 5 వేల ఎకరాలు ఉండేలా 5–6 గ్రామాలను చేర్చారు. కానీ వీటిని ఊరికి దూరంగా నిర్మించడంతో రైతులు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. ప్రతి రైతు వేదికకు ఒక విస్తరణ అధికారి బాధ్యులుగా ఉండగా, వీరిలో 37 మంది మహిళలే ఉన్నారు. ఊరికి దూరంగా ఉన్న రైతు వేదికల్లో వీరు ఒక్కరే విధులు నిర్వర్తించేందుకు భయపడుతున్నారు. కనీసం అటెండర్ కూడా లేకపోవడంతో ఏఈఓనే తాళం తీసుకుని శుభ్రం చేసుకుని విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏఈఓలు తప్పనిసరిగా వారి క్లస్టర్ పరిధిలోని రైతువేదిక నుంచి జియో ట్యాగింగ్ ద్వారా తమ హాజరు నమోదు చేసుకోవాలి. ప్రతిరోజు విధిగా రైతు వేదికకు వెళ్లి హాజరునమోదు చేసుకున్న తర్వాతే క్షేత్ర స్థాయికి వెళ్లాల్సి వస్తుంది. రైతు వేదికల నిధుల విడుదలలో జాప్యం భారంగా విద్యుత్ చార్జీలు, పారిశుద్ధ్య పనులు వీడియో కాన్ఫరెన్స్ల నిర్వహణతోఅదనపు భారం సొంత డబ్బు ఖర్చు చేస్తున్న ఏఓ, ఏఈఓలు -
7 కిలోమీటర్ల దూరంలో...
మాకు వ్యవసాయమే జీవనాధారం. మా గ్రామంలో రైతువేదిక లేదు. మా ఊరు నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్నచింతకుంటలో రైతువేదిక ఉంది. అక్కడికి గ్రామం నుంచి వెళ్లేందుకు రైతులెవరూ శ్రద్ధ చూపడం లేదు. అక్కడికి వెళ్లిన సరైన సూచనలు, సలహాలు అందడం లేదు. – విష్ణుచారి, అల్లీపూర్, చిన్నచింతకుంట మండలం నిర్వహణ ఖర్చులు భరిస్తున్నాం ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో రైతువేదికల నిర్వహణ ఖర్చులను మేమే భరిస్తున్నాం. 2022 సంవత్సరం మొదట్లో కొంత నిర్వహణ ఖర్చులు మంజూరు చేసినప్పటికీ తర్వాత ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. రైతు వేదికలకు వచ్చే విద్యుత్ చార్జీలు మాత్రం ఏడీఎ కార్యాలయం నుంచి చెల్లిస్తున్నారు. – రాజేందర్ అగర్వాల్, మండల వ్యవసాయాధికారి, దేవరకద్ర ప్రభుత్వానికి నివేదించాం రైతులకు సాగులో సలహాలు, సూచనలు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రైతు వేదికలను ఏర్పాటు చేసింది. కరెంట్ బిల్లు, స్టేషనరీ, తాగునీటి సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వం మొదట్లో నిధులు విడుదల చేసింది. జిల్లాలోని 86 రైతు వేదికల నిర్వహణ నిధులు విడుదల కోసం ప్రభుత్వానికి నివేదించాం. – బి.వెంకటేష్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి ● -
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని కాపాడిన పోలీసులు
వనపర్తి రూరల్: పెబ్బేరు మండలంలోని రంగాపురం గ్రామ శివారు వ్యవసాయ పొలంలో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్న వ్యక్తిని కాపాడి ఆస్పత్రిలో చేర్పించినట్లు ఎస్ఐ యుగేందర్రెడ్డి తెలిపారు. ఎస్ఐ కథనం ప్రకారం.. పెబ్బేరు మండలంలోని అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులు కుటుంబ సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో తీసి గ్రామానికి సంబంధించిన ఓ వాట్సప్ గ్రూప్లో పోస్టు చేశాడు. ఈ విషయం పోలీసుల దృష్టికి రావడంతో అతని మొబైల్ లొకేషన్ ఆధారంగా పోలీస్ సిబ్బంది వెంకట్రాములు, రామణ్గౌడ్తో కలిసి రంగాపురం శివారులోని వ్యవసాయ పొలంలో గుర్తించి అడ్డుకొని ఆస్పత్రికి తరలించామని చెప్పారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు. సరైన సమయంలో స్పందించి ఓ నిండు ప్రాణాన్ని కాపాడిన పోలీసులను గ్రామస్తులు అభినందించారు. చాలని పేర్కొన్నారు. -
‘భూ భారతి’కిమద్దూరు ఎంపిక
● పైలెట్ ప్రాజెక్టుగా అందుబాటులోకి.. ● పోర్టల్పై నేటి నుంచి అవగాహన సదస్సులు నారాయణపేట: వ్యవసాయ భూములకు సంబందించి సమస్యల పరిష్కారం, భూ లావాదేవీలకు సంబంధించిన సమాచారం రైతులకు, ప్రజలకు సులభంగా, వేగంగా అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం భూభారతి పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది. మంగళవారం ఈ పోర్టల్ ను సీఎం రేవంత్రెడ్డి హైదరాబాద్లో ప్రారంభించగా.. రాష్ట్ర వ్యాప్తంగా మూడు మండలాలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. అందులో సీఎం ఇలాఖా అయిన కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు మండలాన్ని ఎంపిక చేశారు. పైలెట్ ప్రాజెక్టు కింద మద్దూరుమండలాన్ని ఎంపిక చేయడంతో కలెక్టర్ సిక్తా పట్నాయక్, రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ బెన్షాలం సూచనలతో తహసీల్దార్ మహేశ్ గౌడ్, అధికార యంత్రాంగం భూభారతిని క్షేత్ర స్థాయిలో పక్కాగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు. మంగళవారం నుంచి మండలంలో క్షేతస్థాయిలో రైతులకు, ప్రజలకు భూ భారతిపై అవగాహన కల్పించనున్నారు. ప్రజల నుంచి వచ్చే సందేహాలు, సలహాలు, సూచనలు స్వీకరించి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయనున్నారు. ● మద్దూరు మండలంలో 17 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. చెన్వార్, చెన్నారెడ్డిపల్లి, చింతల్దిన్నె దమ్గన్పూర్ దొరెపల్లి, జాదరావ్పల్లి, ఖాజీపూర్, లక్కాయపల్లి, మద్దూర్, మల్కిజాదవ్రావ్పల్లి, మొమినాపూర్, నాగిరెడ్డిపల్లి, నందిపహడ్, పల్లెర్ల, పర్సపూర్, పెదరిపాడు, రేనివట్ల గ్రామాలు ఉన్నా యి. రెవెన్యూ రికార్డుల ప్రకారం మండలంలో 30,621 ఎకరాల భూమి ఉంది. డిప్యూటీ తహసీల్దార్ పోస్టు ఖాళీగా ఉండగా ఒక ఆర్ఐ, ఒకరు సర్వేయర్ విధుల్లో ఉన్నారు. పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన మద్దూరుకు జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తూ రెవెన్యూ, సర్వేయర్లను నియమించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. -
మహిళపై మత్తు మందు చల్లి.. నంచర్లలో భారీ చోరీ
మహమ్మదాబాద్: మహిళపై మత్తు మందు చల్లి పట్టపగలే చోరీకి పాల్పడిన సంఘటన మండలంలోని నంచర్లలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, బాధిత కుటుంబం కథనం ప్రకారం.. నంచర్లకు చెందిన శివగోపాల్ ఇంట్లోనే కిరాణం దుకా ణం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం తన కోడలిని దుకాణంలో కూర్చోబెట్టి పనిమీద బయటకు వెళ్లాడు. అయితే రెక్కీ నిర్వహించిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మధ్యాహ్నం దుకాణానికి వచ్చి సదరు మహిళను వాటర్ బాటిల్ అడిగారు. ఆమె వాటర్ బాటిల్ తీసుకువచ్చి ఇవ్వబోగా ఆమె ముఖంపై మత్తుమందు చల్లారు. దీంతో స్పృహతప్పి పడిపోయిన మహిళను ఇంట్లోకి తీసుకెళ్లి పడుకోబెట్టి ఆమె మెడలో ఉన్న సుమారు 3 తులాల బంగారు నగలు, బీరువాలో దాచిన రూ.6 లక్షల నగ దు, 12 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. మొత్తం దాదాపు రూ.20 లక్షల విలువైన సొత్తు అపహరణకు గురైనట్లు బాధిత కుటుంబ సభ్యులు వాపోయారు. మధ్యాహ్నం 3 గంటలకు ఇంటికి వచ్చిన యజమాని శివగోపాల్ జరిగిందంతా చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఐ నంచర్లలో పట్టపగలే ఇంట్లో చోరీ జరిగిన విష యాన్ని తెలుసుకున్న మహబూబ్నగర్ రూరల్ సీఐ గాంధీనాయక్, మహమ్మదాబాద్ ఎస్ఐ శేఖర్రెడ్డితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇంట్లో కుటుంబీకులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. క్లూస్టీంతో వేలిముద్రలు, దొంగలు ఉపయోగించిన పరికరాలు ఏమైనా ఉన్నాయా.. మత్తు ఎలా చల్లారు.. దుకాణంలో ఏమైనా ఆధారాలు ఉ న్నాయా అన్న కోణంలో పరిశీలించారు. దొంగలు ముందే రెక్కీ నిర్వహించి ఇలాంటి ఘటనకు పాల్ప డి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. తెలిసి న వారెవరైనా ఇలాంటి ఘటనకు పాల్పడ్డారా అన్న కోణంలోనూ దర్యాప్తు చేపట్టారు. బాధితుడు శివగోపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసు కుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
తాగునీటి అవసరాలకే..
ప్రస్తుతం తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. కేఎల్ఐ ప్రాజెక్టు వద్ద 818 అడుగుల మేరకు కృష్ణానదిలో బ్యాక్ వాటర్ ఉంది. 800 అడుగుల వరకు తాగునీటి అవసరాలకు నీటిని ఎత్తిపోసుకోవచ్చు. తాగునీటి అవసరాలను బట్టే ఎత్తిపోతలు సాగుతున్నాయి. కృష్ణానదిలో బ్యాక్ వాటర్ నిల్వలు, మిషన్ భగీరథ అవసరాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేస్తున్నాం. నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి మిషన్ భగీరథకు నీటిని మళ్లించేందుకు చేపట్టిన పనులు తుదిదశకు చేరాయి. ఈ పనులు పూర్తయితే తాగునీటి అవసరాలకు ఎప్పటికీ ఢోకా ఉండదు. – అంజాద్ పాషా, డీఈఈ, మిషన్ భగీరథ -
పాలమూరులో ముస్లింల భారీ ర్యాలీ
● రాజ్యాంగానికి విరుద్ధంగా వక్ఫ్ సవరణ చట్టం: టీజీఎంఎఫ్సీ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ స్టేషన్ మహబూబ్నగర్: వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జిల్లాకేంద్రంలో ముస్లింలు సోమవా రం భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని వివిధ కాలనీల నుంచి తరలివచ్చిన ముస్లింలు సమూహంగా ఏర్పడి క్లాక్ టవర్ నుంచి ర్యాలీని ప్రారంభించారు. వేలాది ముస్లింలతో ఈ నిరసన ర్యాలీ అశోక్టాకీస్ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా మీదుగా తెలంగాణ చౌరస్తా వరకు నిర్వహించారు. ర్యాలీలో ప్లకార్డులతో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంట్లో మద్దతు ఇచ్చినందుకు నిరసనగా సీఎంలు చంద్రబాబునాయుడు, నితీష్కుమార్ల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని కేంద్రం వక్ఫ్ సవరణ చట్టం తీసుకొచ్చిందని ఆరోపించారు. వక్ఫ్ ఆస్తులు అల్లా పేరిట ఉంటాయని, దీంట్లో కేంద్రం ప్రభుత్వం పెత్తనం ఎందుకని ప్రశ్నించారు. వక్ఫ్ సవరణ చట్టానికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందన్నారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పలువురు ముస్లిం పెద్ద లు, సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల మాదిరిగా తెలంగాణ ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నిరసన ర్యాలీల్లో పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కురుమూర్తి, కిల్లె గోపాల్, చంద్రకాంత్, రాజ్కుమార్, మోహ న్, వామన్కుమార్తో పాటు ముస్లిం సంఘాల ప్రతినిధులు మోసీన్ఖాన్, తఖీ హుస్సేన్, ఆల్మేవా రాష్ట్ర అధ్యక్షులు ఫారుఖ్ హుస్సేన్, ఖుద్దూస్బేగ్, సిరాజ్ఖాద్రీ, మహ్మద్ తఖీ, అజ్మత్అలీ, అబ్దుల్ రహెమాన్, షబ్బీర్ అహ్మద్, హాఫిజ్ ఇద్రీస్, ఎండీ ఫయాజ్, ఎండి.అయూబ్, షేక్ ఫరీద్, సిరా జ్ఖాన్, నిజాముద్దీన్, అవేజ్ పాల్గొన్నారు. -
రాజ్యాంగ ఫలాలు ప్రజలకు అందించాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): రాజ్యాంగ ఫలాలు ప్రజలు అనుభవించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని కలెక్టర్ విజయేందిర అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా సోమవారం స్థానిక అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా సంక్రమించే హక్కులకు ఎవరు భంగం కల్పించవద్దని అన్నారు. ప్రపంచ దేశాల్లో రాజ్యాంగాలను పరిశీలించి అత్యంత ఉత్తమమైన రాజ్యాంగాన్ని మన దేశ ప్రజలకు అందించిన గొప్ప వ్యక్తి అంబేడ్కర్ అని అన్నారు. ప్రపంచ మేధావి: ఎంపీ డీకే అరుణ అంబేడ్కర్ ప్రపంచ మేధావి అని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం మాట్లాడుతూ ఆ మహనీయుడి ఆశయాలకు అనుగుణంగా పని చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అణగారిన వర్గాల ఆశా జ్యోతి అంబేడ్కర్ అని పేర్కొన్నారు. -
అగ్నిప్రమాదాలపైఅవగాహన తప్పనిసరి
మహబూబ్నగర్ క్రైం: అగ్నిప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు తప్పనిసరిగా అవగాహన ఉండాలని అదనపు కలెక్టర్ మోహన్రావు అన్నారు. సోమవారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు నిర్వహించనున్న అగ్నిమాపక వారోత్సవాలకు సంబంధించిన పోస్టర్లను కలెక్టరేట్లో ఆయన ఆవిష్కరించారు. అనంతరం జిల్లా అగ్నిమాపక శాఖ కార్యాలయంలో సిబ్బంది స్మారక కవాతు నిర్వహించగా.. అగ్నిమాపక జెండాను ఎగురవేశారు. 1944లో ముంబాయిలో జరిగిన పేలుడులో ప్రాణాలు కోల్పోయిన 66మంది అగ్నిమాపక సిబ్బందికి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన స్టాల్ను విశ్రాంత అగ్నిమాపక శాఖ అధికారులతో పాటు డీఎఫ్ఓ కిషోర్ ప్రారంభించారు. కార్యక్రమంలో అగ్నిమాపకశాఖ అధికారి మల్లిఖార్జున్, సిబ్బంది పాల్గొన్నారు. నేడు విద్యుత్ అంతరాయం జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాకేంద్రంలోని 11 కేవీ వెంకటేశ్వరకాలనీ ఫీడర్ పరిధిలో చెట్ల కొట్టివేత కారణంగా మంగళవారం పలు ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని విద్యుత్ శాఖ టౌన్–3 ఏఈ అరుణ్ నాయక్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ అసౌకర్యానికి ప్రజలు సహకరించాలని కోరారు. డిగ్రీ కళాశాలలోనే ఎన్నికల సామగ్రి ● గదుల కొరతతో అవస్థలు జడ్చర్ల టౌన్: పట్టణంలోని డాక్టర్ బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్న ఎన్నికల సామగ్రిని తరలించకపోవడంతో గదుల కొరత ఏర్పడింది. 2023 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సామగ్రి, ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను కళాశాలలో ఏర్పాటుచేశారు. ఎన్నికలు ముగిశాక ఈవీఎంలను జిల్లా కేంద్రానికి తరలించగా.. ఇతర సామగ్రి మొత్తాన్ని కళాశాలలోనే నిల్వ చేశారు. ఇందుకోసం ఫిజికల్ డైరెక్టర్ గదులు రెండింటిని వినియోగిస్తున్నారు. ఈ కారణంగా ఫిజికల్ డైరెక్టర్ గదిని మరోచోట ఏర్పాటు చేసుకోవా ల్సివచ్చింది. 2023 డిసెంబర్ నుంచి ఎన్నికల సామగ్రిని తరలించి తమకు గదులు అప్పగించాలని కళాశాల ప్రిన్సిపాల్ పలుమార్లు అధికారులు విన్నవిస్తున్నా పట్టించుకోవడం లేదని తెలిసింది. అయితే ఆ సామగ్రిని ఎక్కడికి తరలించాలో తెలియక అధికారులు మిన్నకుండిపోయినట్లు తెలుస్తోంది. ఎన్నికల కోసం కళాశాల గదులను ఇస్తే.. వాటిని 16 నెలలుగా తమకు అప్పగించకుండా ఇబ్బందులకు గురిచేయడం తగదని అధ్యాపక బృందం వాపోతోంది. ఇప్పటికై నా ఎన్నికల సామగ్రిని తరలించాలని ప్రిన్సిపాల్ డా. సుకన్య కోరుతున్నారు. ఈ విషయమై స్థానిక తహసీల్దార్ నర్సింగ్రావును వివరణ కోరగా.. ఎన్నికల సామగ్రి విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి తరలిస్తామన్నారు. తమ పాత కార్యాలయంలో వాటిని భద్రపరిచేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. -
అంబేడ్కర్ అందరివాడు
మహబూబ్నగర్ రూరల్: రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అందరివాడని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని అంబేద్కర్ కళాభవన్లో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాల ప్రజలు సమాన స్థాయికి వచ్చేంతవరకు రాజ్యాంగంలో ప్రత్యేకమైన వెసులుబాటు కల్పించారని చెప్పారు. అగ్రవర్ణాలు, బడుగు, బలహీన వర్గాలు, మైనారిటీలు అందరూ ఈ రోజు సుఖసంతోషాలతో భారతదేశంలో ఉండగలుగుతున్నారంటే దానికి కారణం అంబేడ్కర్ చూపిన విధానం అని స్పష్టం చేశారు. జనాభా ప్రాతిపదికన బడ్జెట్లో కేటాయింపులు ఉండాలని, ఏ వర్గానికి కేటాయించిన బడ్జెట్ను ఆ వర్గానికే కేటాయించి వారి అభివృద్ధికి కార్యాచరణ ఉండాలని 100 శాతం ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారని చెప్పారు. అందుకే కేవలం ఒక్క హన్వాడ మండలంలోనే రూ.4 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో ఇంకా అభివృద్ధి పనులు చేస్తామని, ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ కింద ప్రతి తండాకు కూడా రోడ్డు వేస్తున్నామని అన్నారు. వచ్చే సంవత్సరంలోగా కచ్చితంగా మిగిలిన రోడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. మహబూబ్నగర్ను ఎడ్యుకేషనల్ హబ్గా అభివృద్ధి చేసేందుకు అందరి సహకారం తనకు కావాలన్నారు. మీ పిల్లలను మంచిగా చదివించాలని, చదువుకుంటే భవిష్యత్ బంగారు మాయమవుతుందన్నారు. జనవరి నెలలో విద్యానిధి ఏర్పాటు చేశానని, వివిధ రంగాల వ్యక్తుల నుంచి దీనికి ఇప్పటికి రూ.50 లక్షల విరాళాలు వచ్చాయన్నారు. మహబూబ్నగర్ ఫస్ట్ కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ కళాభవన్లో నిరుద్యోగులకు ఈ నెల 16 నుంచి ఉచితంగా కోచింగ్ ఇస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఏఎస్పీ రాములు, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ మహేశ్వర్రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ డీడీ సుదర్శన్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్కుమార్గౌడ్, వకీల్ భీమయ్య, మల్లెపోగు శ్రీనివాస్, వెంకటేష్, సామెల్, యాదయ్య, రవికుమార్, చెన్నకేశవులు, శ్రీరాములు, బండారి రాములు, బాలపీరు, రఘునాథ్ పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ కింద అభివృద్ధి పనులు మహబూబ్నగర్ విద్యా నిధికి విశేషంగా ఆదరణ: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి -
నేడు జిల్లాకేంద్రంలో విద్యుత్ సరఫరా బంద్
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాకేంద్రంలోని 11 కేవీ వీఐపీ ఫీడర్తో పాటు 11 కేవీ నవాబ్పేట ఫీడర్ పరిధిలో చెట్ల కొట్టివేత కారణంగా సోమవారం పలు ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని ట్రాన్స్కో ఏడీ తవుర్యనాయక్, టు ఏఈ ఆదిత్య ఆదివారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. దీంతో రామయ్యబౌలి, వేపురివేగిరి, హబీబ్నగర్, గోల్మజీద్, రాంనగర్, గణేష్నగర్, హన్మాన్పుర, రైమానియా మజీద్, పాతపాలమూరు, ఫరీద్ మజీద్ ప్రాంతం, సంజయ్నగర్, బోయపల్లిగేట్, మోతీనగర్, కొత్తగంజ్, నవాబ్పేట రోడ్డు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొన్నారు. ఈ అసౌకర్యానికి ప్రజలు సహకరించాలని కోరారు. వచ్చే నెల నుంచి వృద్ధులకు ప్రత్యేక ప్రజావాణి మహబూబ్నగర్ మున్సిపాలిటీ: వయోవృద్ధులకు వచ్చే నెల నుంచి ‘ప్రత్యేక ప్రజావాణి’ నిర్వహించేందుకు జిల్లా అధికారులు అంగీకరించారని సీనియర్ సిటిజన్స్ ఫోరం అధ్యక్షుడు జగపతిరావు చెప్పారు. ఆదివారం స్థానిక మెట్టుగడ్డలోని ‘ఫోరం’ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో జరిగే ‘ప్రజావాణి’కి జిల్లా నుంచి వయోవృద్ధులు రావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కలెక్టర్ విజయేందిర బోయి దృష్టికి తీసుకెళ్లామన్నారు. దీంతో ఆమె స్పందించి అందరికీ అనుకూలమైన జిల్లా కోర్టు పక్కనున్న తహసీల్దార్ అర్బన్ మండల కార్యాలయంలో ప్రతినెలా మొదటి బుధవారం నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. 1,075 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత కల్వకుర్తి రూరల్: రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న సన్నబియ్యం సైతం పక్కదారి పట్టిన సంఘటన కల్వకుర్తి మండలంలో వెలుగుచూసింది. సన్నబియ్యంతోపాటు దొడ్డు బియ్యం నిల్వ ఉంచినట్లు పక్కా సమాచారం రావడంతో రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్ ఏఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జిల్లా అధికారులు ఆదివారం మార్చాల సమీపంలో ఉన్న శ్రీకృష్ణ రైస్మిల్పై ఆకస్మికంగా దాడులు నిర్వహించగా.. 1,075 క్వింటాళ్ల బియ్యం పట్టుబడినట్లు అధికారులు తెలిపారు. మిల్లర్లు ఇవి రేషన్ బియ్యం కావని బుకాయించగా.. ఈ మిల్లుకు నాలుగేళ్లుగా సీఎమ్మార్ వడ్లు ఇవ్వలేదని అధికారులు చెప్పారు. కాగా.. వారు ఈ బియ్యం ఎక్కడి నుంచి వచ్చాయో ఆరా తీసే పనిలో పడ్డారు. రాత్రి 10 గంటల వరకు.. రైస్ మిల్లులో రేషన్ బియ్యం నిల్వ ఉంచినట్లు సమాచారం రావడంతో అధికారులు మిల్లుకు చేరుకున్నారు. ఆ సమయంలో మిల్లు మూసి ఉండగా సంబంధిత యజమాని గుమాస్తాలతో మిల్లు తెరిపించారు. దీంతో ఏఎస్పీ వెంకటేశ్వర్లు టెక్నికల్ సిబ్బందితోపాటు జిల్లాలో పనిచేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డీటీలు, డీఎం రాజేందర్ను మిల్లు వద్దకు రప్పించారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్విరామంగా సోదాలు నిర్వహించారు. మిల్లులో ఉన్న రేషన్ బియ్యాన్ని వివిధ వాహనాల ద్వారా వేరే మిల్లుకు తరలించారు. మిల్లు గుమాస్తాలను అదుపులోకి తీసుకున్నారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ చెప్పారు. మిల్లు యజమాని సంబు రమణపై పోలీసులకు ఫిర్యాదు చేశామని డీఎం రాజేందర్ తెలిపారు. -
ఇప్పటివరకు 12,521 మెట్రిక్ టన్నుల పంపిణీ..
● అన్నం వండుకోవడానికే ఆసక్తి చూపుతున్న లబ్ధిదారులు ● పలు రేషన్ షాపుల పరిధిలో నిర్ణీత కోటా మించి డిమాండ్ ● అక్కడక్కడా కొంత మేర నూకలు.. ముద్దగా అన్నం ● దొడ్డు బియ్యంతో పోల్చితే పరవాలేదంటున్న వినియోగదారులు ● సరైన సమయంలో గంజి వార్చితే బాగుంటుందంటున్న మహిళలు ● ‘రేషన్ దుకాణాల్లో ఇదివరకు దొడ్డు బియ్యం ఇచ్చేవారు. అన్నం సరిగ్గా కాకపోయేది. వాటిని పిండి పట్టించి దోశలు ఇతర పిండి పదార్థాల తయారీకి ఉపయోగించేటోళ్లం. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారు. కొంత మేర నూకలు ఉన్నాయి. అన్నం ముద్దగా అవుతోంది. అయినా దొడ్డు బియ్యంతో పోల్చితే నయమే కదా. ఈ సన్న బియ్యంతో అన్నమే వండుకుంటున్నాం. సరైన సమయంలో గంజి వార్చితే అన్నం పుల్లలు పుల్లలుగా ఉంటుంది.’ అని రేషన్ లబ్ధిదారులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ● దొడ్డుబియ్యం పంపిణీ సమయంలో ఆసక్తి చూపని లబ్ధిదారులు, కిలో రూ.9, రూ.10 అంటూ బేరసారాలకు దిగే వారు.. సన్న బియ్యం వచ్చాయా.. తీసుకోవడానికి వస్తున్నాం అంటూ డీలర్లకు ఫోన్ చేసి మరీ చెబుతున్నారు... సర్కారు ఉగాది కానుకగా అమలు చేస్తున్న సన్నబియ్యం పంపిణీపై ప్రజా స్పందనకు ఇవి అద్దం పడుతున్నాయి. లబ్ధిదారులు అన్నం వండుకుని తినేందుకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట, నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల పరిధిలో 2,024 రేషన్ దుకాణాలు ఉన్నాయి. 9,67,639 రేషన్ కార్డులు ఉండగా.. ఏప్రిల్ కోటాకు సంబంధించి రేషన్ దుకాణాలకు సుమారు 20,469 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేయాల్సి ఉంది. ఇప్పటివరకు 21,064 మెట్రిక్ టన్నులు సరఫరా కాగా.. రేషన్షాపుల ద్వారా లబ్ధిదారులకు శనివారం వరకు 12,521 మెట్రిక్ టన్నులు పంపిణీ చేశారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 2.60 లక్షల మంది వలస కూలీలు ఉన్నారు. ఇందులో మెజార్టీ సంఖ్యలో ముంబై, పూణే వంటి ప్రాంతాల్లో కూలీలుగా పనిచేస్తున్నారు. వీరు కాకుండా హైదరాబాద్, నగర శివారు ప్రాంతాల్లో 80 వేల మంది వరకు భవన నిర్మాణ రంగంలో మేసీ్త్రలు, అడ్డా కూలీలు, డైలీ కూలీలుగా బతుకీడుస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా సన్న బియ్యం పంపిణీ వాయిదా పడింది. అక్కడ దొడ్డు బియ్యమే పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాకు చెందిన వలస కూలీలు సొంత ప్రాంతాలకు వచ్చి రేషన్షాపుల్లో తమ కోటా సన్న బియ్యం తీసుకెళ్తున్నారు. దీంతో వనపర్తి జిల్లా అమరచింత, ఆత్మకూర్, మదనాపురం, కొత్తకోట, పెబ్బేరుతో పాటు మహబూబ్నగర్ జిల్లా గండేడ్, మహమ్మదాబాద్, హన్వాడా, కోయిల్కొండ, మహబూబ్నగర్, దేవరకద్ర, నారాయణపేట జిల్లా కోస్గి, మద్దూర్, దౌల్తాబాద్ మండలాల పరిధిలోని పలు రేషన్ దుకాణాలకు నిర్ణీత కోటాకు మించి సరఫరా చేయాలని డీలర్లు కోరుతున్నారు. ఈ మేరకు అధికారులు రేషన్ కోటా పెంచేలా ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వనపర్తి జిల్లాలో ఇప్పటివరకే కోటాకు మించి 594.478 మెట్రిక్ టన్నుల బియ్యం అదనంగా పంపిణీ చేసినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ● వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలంలో మొత్తం 9,673 రేషన్ కార్డులు ఉన్నాయి. రేషన్ షాపులు 21 ఉండగా.. లబ్ధిదారులు 34,629 మంది ఉన్నారు. ఫిబ్రవరిలో చౌక దుకాణాలకు 203.929 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా అయ్యాయి. అదే ఏప్రిల్ నెలకు సంబంధించి ఇప్పటివరకు సుమారు నాలుగు మెట్రిక్ టన్నులు అధికంగా సరఫరా చేశారు. వలస కూలీలు వచ్చి సన్నబియ్యం తీసుకెళ్లడంతో కోటాకు మించి అధికంగా కావాల్సి వచ్చినట్లు డీలర్లు చెబుతున్నారు. సన్నవి ఇస్తుండడంతో ఊరికొచ్చి తీసుకున్నాం.. నా భార్య, పిల్లలతో సహా 15 ఏళ్లుగా హైదరాబాదులో నివాసం ఉంటున్నాం. మేం మొత్తం ఐదుగురం. ప్రతి నెల 35 కిలోల బియ్యం వస్తాయి. ఈ సారి సన్న బియ్యం ఇస్తున్న కారణంగా మా ఊరిలో తీసుకున్నాం. సన్న బియ్యంలో కొంత నూక ఉంది. అయినా బాగానే ఉన్నాయి. – స్వామి, వలస కూలీ, దుప్పల్లి, మదనాపురం, వనపర్తి అన్నం బాగానే అయింది.. గతంలో వేసే లావు బియ్యం తినటానికి కొంచెం ఇబ్బందిగా ఉండేది. అయితే ప్రభుత్వం ఉచితంగా సన్న బియ్యం ఇస్తుండగా.. మొన్ననే తెచ్చుకున్నాం. అవే తింటున్నాం. అన్నం చాలా బాగా అయ్యింది. కాకపోతే కొత్త బియ్యం కావడంతో మెత్తగా అయింది. ఇదే బియ్యం బయట అంగట్లో కొంటే కిలో రూ.53 పలుకుతోంది. మా లాంటి పేదోళ్లు అంత ధర పెట్టి కొనలేం. – వెంకటేష్, నల్లకుంట, గద్వాల నాణ్యతపై రాజీ పడొద్దు.. మేము కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాం. కుటుంబంలో నలుగురికి కలిపి వచ్చే 24 కేజీల రేషన్ బియ్యమే మాకు కడుపు నింపుతోంది. సన్నబియ్యం ఇవ్వడం సంతోషం. అన్నం బాగానే అయింది. ప్రతి నెలా నాణ్యమైన బియ్యం పంపిణీ చేసేలా అధికారులు చొరవ తీసుకోవాలి. ఎక్కడా రాజీ పడొద్దు. – కాసింబీ, గోప్లాపూర్, దేవరకద్ర 3 రోజుల్లోనే అయిపోయాయి.. రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేపట్టడంతో ఎప్పుడూ లేని విధంగా మూడు రోజుల్లోనే నా షాప్నకు వచ్చిన కోటా 171.33 క్వింటాళ్లు అయిపోయాయి. మిగతా రెండు షా పుల్లో కూడా మూడు రోజుల్లోనే బియ్యం స రఫరా జరిగిపోయింది. గతంలో బియ్యం పంపిణీకి 15 రోజులు పట్టేది. కోటా అయిపోయి న కూడా లబ్ధిదారులు వస్తున్నారు. అదనపు కోటా కోసం అధికారులకు తెలియజేశాం. – సంజీవరెడ్డి, రేషన్ డీలర్, మద్దూరుఅవసరమైతే గడువు పెంపు.. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల పరిధిలో శనివారం నాటికి 65 శాతం మంది లబ్ధిదారులకు సన్నబియ్యం సరఫరా చేశారు. మరో మూడు రోజుల్లో పంపిణీ పూర్తి చేసేలా అధికారులు ముందుకు సాగుతున్నారు. ఈ మేరకు వేగం పెంచాలని డీలర్లను ఆదేశించారు. నిర్దేశిత గడువు ముగిసిన తర్వాత ఇంకా ఎవరైనా లబ్ధిదారులు మిగిలి ఉన్నట్లయితే.. వారికి ఈ నెల 20వ తేదీ వరకు గడువు పెంచి అందజేయనున్నట్లు సివిల్ సప్లయ్ అధికారులు చెబుతున్నారు. జిల్లాల వారీగా సన్న బియ్యం పంపిణీ వివరాలు (మెట్రిక్ టన్నుల్లో).. జిల్లా రే.షా రే.కా ఏప్రిల్ కోటా రే.షా.ప.అ(మె) ల.ప.అ మహబూబ్నగర్ 506 2,53,229 5,228.000 5,129.000 3,471 జోగుళాంబ గద్వాల 335 1,63,693 3,591.429 3,591.428 2,500 నారాయణపేట 301 1,44,472 3,382.916 3,382.916 1,745 నాగర్కర్నూల్ 558 2,43,107 4,946.455 4,500.000 2,813 వనపర్తి 324 1,63,138 3,321.066 4,461.000 1,992 మొత్తం 2,024 9,67,639 20,469.866 21,064.344 12,521 రే.షా: రేషన్షాపులు, రే.కా: రేషన్కార్డులు, రే.షా.ప.అ(మె): రేషన్ షాపులకు పంపిణీ అయింది (మెట్రిక్ టన్నుల్లో) , ల.ప.అ: లబ్ధిదారులకు పంపిణీ అయింది నిర్ణీత కోటాకు మించి డిమాండ్.. -
శివాజీ జీవితం స్ఫూర్తిదాయకం
కోయిల్కొండ: ఛత్రపతి శివాజీ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. ఆదివారం కోయిలకొండ మండలం రాంపూర్లో హిందువాహిణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని నారాయఫేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అలుపెరగని పోరాటయోధుడు ఛత్రపతి శివాజీ అని కొనిడాయారు. ఆదిత్యపరాశ్రీ స్వామిజీ, విగ్రహ దాత మాజీ సర్పంచ్ కల్పన బచ్చిరెడ్డి, కుమ్మరి రాములు, రవీందర్, రవీందర్రెడ్డి, వై.విద్యాసాగర్, విజయ్భాస్కర్రెడ్డి పాల్గొన్నారు.