Mandal Parishads office
-
‘మన ఊరు.. మన ప్రణాళిక’ లోఉద్రిక్తం
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ‘మన ఊరు.. మన ప్రణాళిక’లో భాగంగా శనివారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమం రసాభాసగా సాగింది. సమావేశం ప్రారంభమైన కాసేపటికి హాల్లోకి వచ్చిన కప్పాడు ఎంపీటీసీ సభ్యుడు మర్రి నిరంజన్రెడ్డి హల్చల్ చేశారు. ఎంపీపీ డోకూరి వెంకట్రామ్రెడ్డిపై వ్యాఖ్యలు చేయడం, పోడియం వద్దకు దూసుకెళ్లడంతో సభలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీకి చెందిన నిరంజన్రెడ్డి ఎంపీపీ పీఠాన్ని కైవసం చేసుకోవాలని చేసిన ప్రయత్నాలు విఫలమై అనూహ్యంగా పోచారం ఎంపీటీసీ వెంకట్రామ్రెడ్డి ఎంపీపీగా లాటరీ విధానంతో ఎన్నికైన విషయం తెలిసిందే. తన వద్ద డబ్బులు తీసుకుని.. తనకు దక్కాల్సిన పదవిని వెంకట్రామ్రెడ్డి ఎగరేసుకుపోయారని నిరంజన్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నారు. ఎంపీపీగా ఎన్నికైన తర్వాత వెంకట్రామ్రెడ్డితో పాటు ఆయా గ్రామా ల ఎంపీటీసీలు తొలిసారిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో నిరంజన్రెడ్డి వచ్చీరావడంతోనే వెంకట్రామ్రెడ్డిపై తిట్ల దండకం మొదలుపెట్టాడు. వెంకట్రామ్రెడ్డి తనకు ఓటేస్తానని మాటిచ్చి చివరికి తనపైనే పోటీ చేశాడని, పదవి చేపట్టాలని తుది వరకూ వ్యయప్రయాసలకోర్చిన తన పొట్టపై కొట్టి అడ్డదారిలో పదవి చేపట్టారన్నారు. నిరంజన్రెడ్డి సభకు అంతరాయం కలిగి స్తున్నారని తెలుసుకున్న పోలీసులు అతడిని అక్కడి నుంచి పంపించి వేశారు. ఎంపీపీ, వైస్ ఎంపీపీలను పోలీసు సంరక్షణలో అక్కడి నుంచి తరలించారు. పరిస్థితిని ముందుగానే పసిగట్టిన పోలీసులు అంబేద్కర్ చౌరస్తా నుంచి మండల పరి షత్ కార్యాలయం వరకు 144 సెక్షన్ను విధించారు. ఏసీపీ సురేందర్రెడ్డి పర్యవేక్షణలో ఇబ్రహీంపట్నం సీఐ మహ్మద్గౌస్, యాచారం సీఐ అశోక్కుమార్, ఎస్సైలు నర్సింహ, సంజీవరెడ్డి రంగంలోకి దిగి బలగాలను మోహరించారు. -
సమస్యలకు చెక్
కందుకూరు:మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కూలీలకు ఇకపై కూలిడబ్బుల పంపిణీ విషయంలో జాప్యాన్ని నివారించడంతో పాటు వారు ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టడానికి సమాయత్తమైంది. మధ్యలో ఏజెన్సీలు, సీఎస్పీల పంపిణీ గొడవ లేకుండా బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా కూలిడబ్బులను జమ చేసేలా ప్రయోగాత్మకంగా జిల్లాలోని కందుకూరు మండలాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి పనులు ప్రారంభించింది. ఈ విషయాన్ని ఇటీవల డ్వా మా అధికారులు ప్రకటించారు. దీంతో కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలకు త్వరలో పరిష్కారం లభించనుంది. సమస్యలను అధిగమించేందుకు.. ఇప్పటి వరకు కూలీలు చేసిన పనులకు సంబంధించిన నగదును మండల పరిషత్ కార్యాలయం నుంచి ఎంత మందికి ఎంత కూలిడబ్బులు ఇవ్వాలో సీఆర్డీకి నివేదిస్తే, అక్కడి నుంచి నగదు బదిలీ ఆదేశాల ద్వారా యాక్సిస్ బ్యాంక్కు చేరేది. ఆ బ్యాంక్ ఆధ్వర్యంలో మణిపాల్, ఫినో వంటి ఏజెన్సీల ద్వారా కూలీలకు డబ్బు పంపిణీ చేస్తున్నారు. దీంతో చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. సీఎస్పీలు సమయానికి రాకపోవడం, బినామీలు వంటి పలు సమస్యలను అధికారులు గుర్తించారు. దీంతో అన్ని సమస్యలను అధిగమిస్తూ క్షేత్ర స్థాయిలో పారదర్శకంగా పని చేసేలా చేయడానికి ప్రయోగాత్మకంగా కందుకూరు మండలాన్ని ఎంపిక చేసి పనులు ప్రారంభించారు. కూలీలకు నేరుగా ఆయా బ్యాంక్ ఖాతాల్లో కూలీ డబ్బు జమ అవుతుంది. దీంతో పాటు వారి సెల్ నంబర్కు జమ చేసిన వివరాలతో కూడిన మెసేజ్ చేరుతుంది. అవసరమైతే ఆ సెల్ నంబర్కు ఉన్నతాధికారులు ఫోన్ చేసి కూలీలతో నేరుగా మాట్లాడి క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకునే అవకాశం ఉంది. దీంతో అవకతవకలను నివారించే అవకాశం ఉంది. పథకం పటిష్టంగా అమలైతే కూలీ డబ్బులు అందలేదని ఆందోళన చెందాల్సిన అవసరం ఇకపై తప్పనుంది. పనులు ప్రారంభం.. మండలంలో 15,453 జాబ్ కార్డులు ఉన్నాయి. 653 శ్రమశక్తి సంఘాల్లో 13,465 మంది కూలీలు పని చేస్తున్నారు. ప్రస్తుతం కూలీల నుంచి బ్యాంక్ ఖాతాల వివరాలతో పాటు సెల్ ఫోన్ నంబర్లను సిబ్బంది సేకరించే ప్రయత్నంలో నిమగ్నమైంది. ఇక్కడ ప్రయోగాత్మకంగా చేపడుతున్న ప్రాజెక్టుతో మంచి ఫలితాలు వస్తే తెలంగాణ రాష్ర్టమంతటా అమలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.