అది చూసి వణికి పోయాం!
ఊహించని సంఘటనలు జరగడమే జీవితం. అయితే ఒక్కోసారి ఎదురైన భయంకర సంఘటలను ఎప్పటికీ మరువలేం. మేల్నాట్టు మరుమగన్ చిత్ర యూనిట్ అలాంటి సంఘటనే చవి చూసిందట. ఉదయ క్రియేషన్స్ పతాకంపై మనో ఉదయకుమార్ నిర్మిస్తున్న చిత్రం మేల్నాట్టు మరుమగన్. రాజ్కమల్ కథానాయకుడిగా నటిస్తున్న ఇందులో ఫ్రాన్స్ బ్యూటీ ఆండ్రియన్ నాయకిగా పరిచయం అవుతోంది. వీఎస్.రాఘవన్, అంజలిదేవి, అశోక్రాజ్, శాంతయ్య ముఖ్యపాత్రలను పోషిస్తున్న ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను ఎంఎస్ఎస్ నిర్వహిస్తున్నారు.
ఈ చిత్ర షూటింగ్లో జరిగిన ఒక ప్రమాదకర సంఘటన గురించి దర్శకుడు తెలుపుతూ ఇటీవల చిత్రంలోని యారో ఇవన్ యార్ ఇవనో అనే పాటను చిత్రీకరించడానికి కొత్తగిరి ప్రాంతానికి వెళ్లామని తెలిపారు. అక్కడ తాము బసచేసిన ఇంటి యజమాని బయటకు వెళ్లేపుడు ఇంటికి వచ్చేప్పుడు తనతో చెప్పాలని హెచ్చరించాడట. అక్కడ పులులు తిరుగుతుంటాయని.., ప్రమాదకరమైన ప్రాంతం కావటంతో తాను చెప్పినట్లే నడుచుకోవాలని హెచ్చరించాడు.
ఒక రోజు రాత్రి 10 గంటల ప్రాంతంలో షూటింగ్ ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చిన యూనిట్, ఉదయం లేచేసరికి యజమాని పెంచుకున్న కుక్క కనిపించకపోవడంతో అంతా షాక్ అయ్యారు. తరువాత సీసీ కెమరాలను పరిశీలించిన యూనిట్ సభ్యులు భయంతో వణికిపోయారు. రాత్రి యూనిట్ ఇంటికి చేరిస కాసేపటికి ఓ చిరుతపులి కుక్కను చంపి తినేయటం సీసీ టీవి కెమరాల్లో రికార్డ్ అయ్యింది. దీంతో తరువాత షూటింగ్ ను వీలైనంత త్వరగా ముగించుకొని తిరిగి వచ్చేశామని తెలిపారు.