బహ్రెయిన్లో తెలంగాణ వాసి మృతి
► మృతదేహం తరలింపుకు సహకరించిన ఎన్నారై సెల్
సాక్షి, కామారెడ్డి: విదేశాల్లో మరో తెలంగాణ వాసి దుర్మరణం పాలయ్యాడు. కామారెడ్డి జిల్లా, గాంధారి మండలం, పోతంగల్ కలాన్ గ్రామానికి చెందిన మార్కంటి బాబు ఉపాధి కోసం బహ్రెయిన్ వెళ్లాడు. ఓప్రైవేటు కంపెనీలో పదేళ్ల నుండి కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈనెల 8న డ్యూటికి వెళ్లడానికి రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించడానికి ఇబ్బందులు ఎదురౌతుండటంతో బాబు స్నేహితులు సాయన్న, ఆంజనేయులు టీఆర్ఎస్ ఎన్నారై సెల్కు సమాచారం అందించారు. ఎన్నారై సెల్ ప్రెసిడెంట్ సతీష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ బోలిశెట్టిలు కంపెనీ అధికారులతో మాట్లాడి బాబు మృతదేహాన్ని భారత్ తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
మృతదేహాన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి స్వగ్రామం పోతంగల్ కలాన్కు తీసుకెళ్లడానికి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో జాగృతి రాష్ట ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, బాబు రావులు ఉచిత అంబులెన్సు ఏర్పాటు చేశారు. బాబు కుటుంబ సభ్యులకు ఎన్నారై టీఆరెస్ సెల్ బహ్రెయిన్ ప్రెసిడెంట్ సతీష్ కుమార్ రాధారపు, వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ బోలిశెట్టి, జనరల్ సెక్రెటరీలు, డాక్టర్ రవి, సెక్రెటరీలు రవిపటేల్, సుమన్, జాయింట్ సెక్రెటరీలు రాజేందర్, గంగాధర్, విజయ్, సంజీవ్, దేవన్న, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ సుధాకర్, రాజేష్, రాజు, నర్సయ్య, సాయన్నలు సానుభూతి తెలిపారు.