వైఎస్ఆర్ సిపిలోకి భారీగా వలసలు
హైదరాబాద్ : వివిధ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. రోజురోజుకు ఈ సంఖ్య పెరుగుతోంది. కాంగ్రెస్కు చెందిన ఒక ఎమ్మెల్యే, మరో ఎమ్మెల్సీ గురువారం ఈ పార్టీలో చేరారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన సాధారణ కార్యకర్తలు, నేతలు కూడా పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో వీరందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు సన్నిహితుడైన కాంగ్రెస్ ఎమ్మెల్యే మీసాల నీలకంఠం నాయుడు (ఎచ్చెర్ల) గురువారం పార్టీలో చేరారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు నీలకంఠంను వెంట బెట్టుకుని వచ్చి జగన్ సమక్షంలో పార్టీలో చేర్చారు.
విశాఖపట్టణం స్థానిక సంస్థల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ డి.వి.సూర్యనారాయణరాజు కూడా పార్టీలో చేరారు. తంగేడు రాజుల కుటుంబానికి చెందిన వైఎస్సార్సీపీ నేతలు రాజా సాగి సీతారామరాజు, రాజా సాగి రామభద్రరాజు (ఏటికొప్పాక చక్కెర ఫ్యాక్టరీ మాజీ ఛైర్మన్) ఇద్దరూ కలిసి సూర్యనారాయణరాజును వెంట తీసుకుని జగన్ వద్దకు వచ్చారు. ఆయనతో పాటు ఆ ప్రాంతానికి చెందిన పలువురు నేతలకు కూడా జగన్ కండువాలు వేసి పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పటికే పార్టీలో చేరిన విశాఖపట్టణం (పశ్చిమ) ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ ఆధ్వర్యంలో ఆయన నియోజకవర్గానికి చెందిన పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు కూడా వైఎస్సార్సీపీలో చేరారు. విశాఖపట్టణం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ కూడా ఈ సందర్భంగా ఉన్నారు.
కర్నూలు నేతల చేరిక
మాజీ ఎమ్మెల్సీ ఎస్.వి.మోహన్రెడ్డి ఆధ్వర్యంలో కర్నూలుకు చెంది మహ్మద్ పాషా (రాష్ట్ర వక్ఫ్బోర్డు సభ్యుడు) ఎస్.చాంద్పాషా(జిల్లా వక్ఫ్బోర్డు ఛైర్మన్), అక్బర్ సాహెబ్ (జిల్లా వక్ఫ్ కమిటీ సభ్యుడు), హెచ్.కె.మనోహర్ (జిల్లా బ్రాహ్మణ సంఘం కార్యదర్శి), మైనారిటీ నేత అమీరుద్దీన్ గురువారం జగన్ క్యాంపు కార్యాలయానికి వచ్చి ఆయన సమక్షంలో పార్టీలో చేరారు.
ఇల్లెందు నేత చేరిక
ఖమ్మం జిల్లా ఇల్లెందు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన డాక్టర్ రవిబాబు నాయక్, జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఖమ్మం లోక్సభా నియోజకవర్గం వైఎస్సార్సీపీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రవిబాబును వెంట తీసుకుని వచ్చి పార్టీలో చేర్చారు.