హంద్రీనీవా జల సాధనకు రాజీలేని పోరాటం
‘విశ్వ’ జలదీక్షకు మద్దతు తెలిపిన
సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీష్
గుంతకల్లు: జిల్లాలోని చెరువులన్నింటికీ హంద్రీ నీవా కృష్ణ జలాలు ఇవ్వాలని, పిల్ల కాలువలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో మార్చిలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి డి.జగదీష్ తెలిపారు. స్థానిక సీపీఐ కార్యాల యంలో శుక్రవారం ఆయన విలేకరులతో మా ట్లాడారు. కృష్ణ జలాలను చిత్తూరుకు మళ్లించాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు జి ల్లాలోని ఆయకట్టుకు నీరు ఇవ్వరాదని, డిస్ట్రిబ్యూటరీలు, పిల్ల కాలువ పనులను ఆపి వేయాలని ఆదేశాలు జారీ చేశారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో అనంతపురం జిల్లాకు 23 టీఎంసీలు కృష్ణ జలాలు కేటాయించారని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం 7, 8 టీఎంసీలు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుంతోందని ఆరోపించారు. గుంతకల్లు నియోజకవర్గంలోని రాగులపాడు నుంచి గూళపాళ్యం వరకు పిల్ల కాలువ ల నిర్మాణానికి రూ.36 కోట్లు అవసరమని అధికారులు జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమాకు తెలిపారన్నారు. అయినా ఇప్పటి వరకూ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదన్నారు.
‘విశ్వ’ జలదీక్షకు సీపీఐ మద్దతు
కృష్ణ జలాల సాధన కోసం ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి చేపట్టబోయే జలదీక్షకు సీపీఐ తరుపున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్లు జగదీష్ ప్రకటించారు. ఈ జలదీక్షకు సీపీఐ, దాని అనుబంధ సంఘాల నాయకులు, రైతులు తరలిరావాలని పిలుపునిచ్చారు. హంద్రీనీవా కా లువ పారే అన్ని మండలాల్లో మార్చి నుంచి ఆం దోళనలు చేపడతామన్నారు. సీపీఐ పట్టణ కార్యదర్శి ఎం.వీరభద్రస్వామి, సహాయ కార్యవర్శి బి.మహేష్, ఎస్ఎండీ గౌస్ పాల్గొన్నారు.