MLA Jalil Khan
-
‘ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న పుత్రరత్నాలు’
సాక్షి, విజయవాడ : అధికార పార్టీ నేతల పుత్రరత్నాలు ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడ్డారు. విజయవాడ వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కుమారుడు సాహుల్ ఖాన్ గత రాత్రి కారు రేసులో ఓ బైక్ను ఢీకొట్టి, పైపెచ్చు బాధితుల్ని బెదిరిస్తున్నారని అన్నారు. ఈ సంఘటన జరిగి 24 గంటలు గడిచినా ఇంతవరకూ ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు. గతంలో బోండా ఉమ, రావెల కిషోర్ బాబు, నిమ్మల కిష్టప్ప కుమారులు అరాచకాలకు పాల్పడ్డారని, అప్పుడు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అధికార పార్టీ నేతలకు పోలీసులు తొత్తుగా మారారని వైఎస్ఆర్ సీపీ నేతలు ధ్వజమెత్తారు. మద్యం, జూదం, కారు రేసుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందని అన్నారు. నగరంలో అధికార పార్టీకి చెందిన నేతల కొడుకులు కారు రేసులు, బైక్ రేసుల నిర్వహించడం వల్లే వారిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు వెనకడుగు వేస్తున్నారన్నారు. వీటన్నింటికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. -
అవినీతి ఎమ్మెల్యే జలీల్ఖాన్
మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత వెలంపల్లి శ్రీనివాస్ సాక్షి, విజయవాడ : పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ఖాన్ సెటిల్మెంట్ కోసమే తెలుగుదేశంపార్టీలో చేరారే తప్ప, నియోజకవర్గం అభివృద్ధి గురించి కాదని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. శనివారం వన్టౌన్లోని తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో జలీల్ఖాన్ అవినీతి భాగోతాన్ని వెలంపల్లి శ్రీనివాస్ ఎండగట్టారు. జలీల్ఖాన్ అవినీతినిపై మాట్లాడుతూ ఆధారాల సహా వెల్లడించారు. తారాపేటలో కరీంకాంప్లెక్స్ స్థలం వక్ఫ్బోర్డుదని, దాన్ని తక్కువ రేటుకుకొని భార్య, తమ్ముడు పేరుతో మార్చుకున్నారని చెప్పారు. ఆ తరువాత ఆ కాంప్లెక్స్ను వ్యాపారులకు విక్రయించి రూ.50 కోట్ల మేరకు లబ్ధిపొందారన్నారు. ఈ కాంప్లెక్స్ను వక్ఫ్బోర్డు స్వాధీనం చేసుకునేందుకు హైకోర్టులో కేసు వేయడంతో వాటిని కొనుగోలు చేసిన వారు జలీల్ఖాన్ పై వత్తిడి తేవడంతో, కాంప్లెక్స్ను క్రమబద్ధీకరించుకునేందుకు టీడీపీలో చేరారని వివరించారు.జలీల్ భార్య పేరుతో ఆస్తులు కొన్న డాక్యుమెంట్ నకళ్లను మీడియాకు ఇచ్చారు. తారాపేటలోని ఇంటి పైఅంతస్తు నిర్మించి పేద లకు ఉయోగిస్తానంటూ కార్పొరేషన్నుంచి అనుమతిపొంది, రవీంద్రభారతి స్కూల్కు లీజుకు ఇచ్చి లక్షలు గడిస్తున్నారన్నారు. భవానీపురం సర్వే నంబర్ 10లో వక్ఫ్బోర్డు స్థలంలో 45 మంది వ్యాపారుల లీజును రద్దు చేయిస్తానని బెదిరించి రూ.45 లక్షలు వసూలు చేశారని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా ఉండగా షేక్ రాజా హాస్పటల్ను 30 పడకల హాస్పటల్గా మార్చేందుకు జీవో తెచ్చానని, విద్యాధరపురంలో 9 ఎకరాల లేబర్ కాలనీలోని స్థలాన్ని స్టేడియంగా మార్చేందుకు రూ.2.10 కోట్లు మంజూరు చేయించానని చెప్పారు. ఈ రెండేళ్లలో ఈ ఉత్తర్వులను అమలు చేయించలేని అసమర్థ ఎమ్మెల్యే జలీల్ఖాన్ అని వెలంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు నగరాభివృద్ధి కోసం రూ.450 కోట్లు మంజూరు చేశారని ఈ నిధుల్ని ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా ఉమాలు తమ నియోజకవర్గాల్లో సద్వినియోగం చేసుకుంటే జలీల్ఖాన్ పట్టించుకోవడం లేదన్నారు. పశ్చిమ కార్పొరేటర్లే కార్పొరేషన్ నిధులు తెచ్చుకుని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారని తెలిపారు. జలీల్ఖాన్ బెదిరింపులకు భయపడకండి గత ఎన్నికల్లో తనకు ఓటు వేసిన వారిని గుర్తించి ఎమ్మెల్యే జలీల్ఖాన్ బెదిరిస్తున్నారని వెలంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. రోడ్లను విస్తరిస్తామంటూ అధికారులతో 25 అడుగులకు మార్కింగ్ చేయించి, ఆతర్వాత రోడ్డు విస్తరణ పది అడుగులకు తగ్గిస్తానంటూ వ్యాపారులతో బేరలు సాగిస్తున్నారని తెలిపారు. ఆయన బెదిరింపులకు భయపడి డబ్బు ఇవ్వవద్దని, తనని కలిస్తే వారికి అండగా ఉండి పోరాటం చేస్తామన్నారు. ఈ విషయాన్నిమంత్రి దేవినేని ఉమా, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న గుర్తుంచుకోవాలన్నారు.సమావేశంలో ఏలూరు వెంకన్న, వక్కలగడ్డ శ్రీకాంత్, మైలవరపు దుర్గారావు, బీఎస్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
సాక్షి విలేకరులపై అక్రమ కేసులు అమానుషం
జిల్లా వ్యాప్తంగా పాత్రికేయుల నిరసన విధి నిర్వహణలో భాగంగా న్యూస్ కవరేజీకి వెళ్లిన ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్, వీడియో జర్నలిస్టులపై తన అనుచరులతో కలసి దాడికి పాల్పడ్డ విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లావ్యాప్తం గా సోమవారం పాత్రికేయులు ఆందోళన చేపట్టారు. దాడిచేసిన వారిని కఠినం గా శిక్షించాలని డిమాండ్ చేశారు. మదనపల్లె: అమరావతి భూ కుంభకోణాన్ని వెలికి తీసిన సాక్షి దినపత్రిక జర్నలిస్టులపై పోలీసులు అక్రమ కేసులు బనాయించి, విచారణ పేరుతో వేధింపులకు గురిచేయడం అమానుషమని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి బండపల్లి అక్కులప్ప అన్నారు. సోమవారం ఏపీయూడబ్ల్యూజే పిలుపుమేరకు స్థానిక సబ్ కలెక్టరేట్ ఎదుట ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. అక్కులప్ప మాట్లాడుతూ అమరావతి భూ కుంభకోణం విషయాన్ని వెలుగులోకి తెచ్చిన సాక్షి జర్నలిస్టులను ప్రజాస్వామ్య విరుద్ధంగా ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందన్నారు. ఏ ఆధారాలతో జర్నలిస్టులు వార్తలు రాశారంటూ ప్రశ్నించిన ప్రభుత్వం ఇది ఒక్కటేనని విమర్శించారు. ఇటీవల కాలంలో రాష్ర్టంలో జర్నలిస్టులపై దాడులు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భౌతిక దాడులకు పాల్పడుతున్న అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులపై నాన్ బెయిబుల్ చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం సొంత జిల్లాలోనే జర్నలిస్టులకు భద్రత కరువైందన్నారు. దాడుల నివారణ కమిటీని వెంటనే పునరుద్ధరించాలని కోరారు. డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని, హెల్త్కార్డులకు ప్రభుత్వం ప్రీమియం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సబ్ కలెక్టర్ కృతికాబాత్రాకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె ప్రెస్క్లబ్ ఆధ్యక్ష కార్యదర్శులు రమేష్, రాజు పట్టణంలోని ప్రింట్, ఎల క్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు.