Nandheeswar Goud
-
కొందరు ఇబ్బంది పెడుతున్నందునే ....
హైదరాబాద్ : కొందరు ఇబ్బంది పెడుతున్నందునే పార్టీని వీడాలనుకున్నానని పటాన్చెరు ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ అన్నారు. ఆయన సోమవారం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను కలిశారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నట్లు ఆయన ఈ సందర్భంగా పొన్నాల సమక్షంలో ఆయన మీడియాకు తెలిపారు. కాంగ్రెస్ తనకు కన్నతల్లిలాంటిదని నందీశ్వర్ గౌడ్ తెలిపారు. తెలంగాణకు బీసీనే ముఖ్యమంత్రిని చేయాలని ఆయన అన్నారు. చిత్తశుద్ధితో పని చేసేవారిని కాంగ్రెస్ పార్టీ గుర్తించాలని నందీశ్వర్ గౌడ్ సూచించారు. పొన్నాల తనకు అండగా ఉంటానని హామీ ఇచ్చారన్నారు. -
ఫలించిన కాంగ్రెస్ నేతల రాయబారం
హైదరాబాద్ : కాంగ్రెస్ నేతల రాయబారం ఫలించింది. పటాన్చెరు ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్...కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. రాహుల్ గాంధీ కార్యాలయం నుంచి కూడా ఆయనకు ఫోన్ కాల్ వచ్చినట్లు సమాచారం. స్థానికంగా కాంగ్రెస్ పరిస్థితి బాగోలేదని, పార్టీ తరఫున పోటీ చేస్తే గెలిచే అవకాశాల్లేవనే ఉద్దేశంతోనే నందీశ్వర్ గౌడ్ టీఆర్ఎస్ వైపు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ను కూడా కలిశారు. అయితే నందీశ్వర్ గౌడ్ పార్టీ వీడేందుకు సిద్ధం కావటంతో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు ఆయన్ని బుజ్జగించేందుకు యత్నించారు. చివరకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ పీసీసీ నేత డీ శ్రీనివాస్, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ...రంగంలోకి దిగి నందీశ్వర్ గౌడ్ను బుజ్జగించి టీఆర్ఎస్లోకి వెళ్లే ఆలోచనను విరమింపచేశారు. నేతల రాయబారం ఫలించటంతో నందీశ్వర్ హస్తాన్ని వీడే యోచన విరమించుకున్నారు. -
కేసీఆర్ ను కలిసిన నందీశ్వర్ గౌడ్
హైదరాబాద్: పటాన్చెరు కాంగ్రెస్ శాసనసభ్యుడు నందీశ్వర్గౌడ్ శనివారం టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ను కలిశారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ మేరకు నందీశ్వర్ గౌడ్ కేసీఆర్ తో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. అలాగే టీఆర్ఎస్ లో చేరికపై ఆయన తన అనుచరులతో మంతనాలు జరుపుతున్నారు. కాగా పటాన్చెరు ఎమ్మెల్యే నందీశ్వర్గౌడ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్కు ప్రధాన అనుచరుడు. స్థానికంగా కాంగ్రెస్ పరిస్థితి బాగోలేదని, పార్టీ తరఫున పోటీ చేస్తే గెలిచే అవకాశాల్లేవనే ఉద్దేశంతోనే ఆయన టీఆర్ఎస్ వైపు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ సమాచారం తెలిసి డీఎస్ ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. డీఎస్ స్వయంగా ఫోన్ చేసినా రెండ్రోజుల నుంచి స్పందించడం లేదని సమాచారం. అయితే డీఎస్ సన్నిహితులు మాత్రం నందీశ్వర్గౌడ్కు తాత్కాలిక ఇబ్బందులున్నప్పటికీ ఆయన మాత్రం కాంగ్రెస్ను వీడబోరనే చెబుతున్నారు.