breaking news
Nandyal District News
-
చాలా బాధగా ఉంది
ఆరబోసిన ధాన్యం వరదలో కొట్టుకుపోవడం చాలా బాధగా ఉంది. నేను ఆరు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశా. దిగుబడి తక్కువగానే వచ్చింది. కనీసం రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల దాకా పంట దిగుబడి ఆదాయం వస్తుందని భావించాను. మా కష్టం నీటిపాలు అయ్యింది. ప్రభుత్వం మాలాంటి రైతులను ఆదుకుని న్యాయం చేయాలి. – రాజేంద్రప్రసాద్, ఆత్మకూరు మార్కెట్యార్డులో ధాన్యాన్ని నిల్వ ఉంచితే తడవదని భావించాం. వ్యాపారులు రావడంతో 60 క్వింటాళ్ల ధాన్యాన్ని కాటా వేసి ఉంచాం. ఊహించని విధంగా గోడౌన్లో దాచుకున్న ధాన్యమంతా తడిచింది. ఈ ధాన్యాన్ని కొనే నాథుడే లేడు. ఆరబోసేందుకు అవకాశం లేకుండా పోయింది. అధికారులు స్పందించి మమ్మల్ని ఆదుకోవాలి. – భాస్కర్రెడ్డి, ఆత్మకూరు మాకు కన్నీళ్లు తప్ప ఏమీ మిగల్లేదు. మూడు ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగుచేసి సంబరపడ్డాను. పెట్టుబడి పోయి అంతోఇంతో వస్తుందని భావించాను. అయితే పంట ఇలా వరదపాలవుతుందని ఊహించలేదు. అప్పులను మూటగట్టుకునే పరిస్థితి నెలకొంది. మాలాంటి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. – సాంబశివుడు, క్రిష్ణాపురం -
అప్రమత్తంగా ఉండాలి
● ఎస్పీ సునీల్షెరాన్ ఆత్మకూరు: నల్లమల అడవుల్లో భారీ వర్షాలు కురిసినందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సునీల్షెరాన్ పేర్కొన్నారు. ఆత్మకూరు మండలంలోని సిద్ధాపురం చెరువు అలుగు ప్రాంతాన్ని, పట్టణంలో పీదిరివాగు, భవనాశి, పెద్దవాగులను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పటికే కురుకుంద, వడ్లరామాపురం, కొత్తపల్లి మండలాల్లోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయని, వరద ఉధృతితో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితులు ఉంటే గ్రామంలోని వీఆర్వో, పోలీసులను సంప్రదిస్తే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారన్నారు. సిద్ధాపురం చెరువు నిండి అలుగు ప్రవహించడంతో శ్రీశైలంకు వెళ్లే అన్ని వాహనాలను, దోర్నాల వైపు వెళ్లే అన్ని వాహనాలను నిలిపివేశారన్నారు. విజయవాడకు నంద్యాల మీదుగానే వెళ్లాలన్నారు. అనంతరం స్థానిక పోలీస్స్టేషన్కు చేరుకుని పోలీస్ సిబ్బందితో చర్చించారు. ఆత్మకూరు డీఎస్పీ రామాంజినాయక్, సీఐలు రాము, సురేష్కుమార్రెడ్డి, ఆర్డీఓ నాగమణి పాల్గొన్నారు. -
ప్రామాణికంగా పంట నష్టం అంచనా
● జిల్లా కలెక్టర్ రాజకుమారిరుద్రవరం: వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్నాయని, వెంటనే నష్టం అంచనా ప్రక్రియను ప్రామాణికంగా చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. రుద్రవరం మండలం ఆలమూరులో మోంథా తుపానుతో దెబ్బతిన్న వరి, మొక్కజొ న్న, బొప్పాయి పంటలను ఆమె బుధవారం పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. ఇప్పటికే మొక్కజొన్న 30శాతం కోత పూర్తి అయ్యిందని, మిగిలిన 70శాతం దెబ్బతినే అవకాశ ముందని అంచనా వేశామన్నారు. నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని, క్షేత్ర స్థాయికి వచ్చిన అధికారులకు సహకరించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. -
లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధం
ఆత్మకూరు: శ్రీశైలం నియోజకవర్గంలో అతి భారీ వర్షాలు కురవడంతో జన జీవనం స్తంభించిపోయింది. పలు కాలనీలు జలదిగ్బంధం అయ్యాయి. ఇళ్లలోకి వర్షపు నీరు చేరి బియ్యం, కందిపప్పుతోపాటు నిత్యావసర వస్తువులు తడిసిపోయాయి. వాగులు పొంగిపొర్లడంతో మొత్తం 18 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పొలాలన్నీ జలమయం అయ్యి కోట్ల రూపాయలు విలువ చేసే పంట మట్టిపాలైంది. రెవెన్యూ అధికారుల సమాచారం మేరకు 10 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 8 వేల ఎకరాలకు పైగా వరి పంటలు ధ్వంసమయ్యాయి. శ్రీశైలం: తుపాన్ కారణంగా శ్రీశైలానికి చేరుకునే వాహనాలను మున్ననూరు, దోర్నాల చెక్పోస్టుల వద్ద మంగళవారం రాత్రి నుంచి నిలుపుదల చేశారు. శ్రీశైల మహా క్షేత్రంలో అమ్మవారి ఆలయం వెనుక ఉన్న ఏనుగుల చెరువు నిండిపోయి ఆలయ ప్రాకార దక్షిణ మాడ వీధిలో వరదలా ప్రవహించింది. పాతాళగంగ రోప్వే నుంచి ఘాట్ల వరకు ఉన్న రోడ్డు మార్గంలో కొండ రాళ్లు విరిగిపడటంతో తాత్కాలికంగా వేసుకున్న షాపులు కూలిపోయాయి. -
జిల్లా పరిషత్లో కంట్రోల్ రూమ్
కర్నూలు(అర్బన్): మోంథా తుపాను నేపథ్యంలో ప్రజలకు అవసరమైన సహాయక చర్యలను అందించేందుకు జిల్లా పరిషత్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జెడ్పీ సీఈఓ జి.నాసరరెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కంట్రోల్ రూమ్లో ఈ నెల 31వ తేది వరకు 24 గంటలు సేవలు అందించేందుకు ఆరుగురు ఉద్యోగులు మూడు షిఫ్టుల వారీగా విధుల్లో ఉంటారన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా 9885050659, 9603944141, 8247569269, 9494734090, 9014581332, 9848498816 నెంబర్లను సంప్రదించాలన్నారు. అదేవిధంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయాల్లోనూ కంట్రోల్ రూములను ఏర్పాటు చేశామన్నారు. -
తిరుపతి బస్సుకు తప్పిన ప్రమాదం
ఉయ్యాలవాడ: సర్వాయిపల్లె సమీపంలో మంగళవారం రాత్రి ఓ ఆర్టీసీ బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. కోవెలకుంట్లకు చెందిన ఆర్టీసీ బస్సు ఉయ్యాలవాడ మీదుగా ప్రతి రోజు తిరుపతికి నడుస్తోంది. తిరుపతి నుంచి బయలుదేరిన బస్సు మంగళవారం రాత్రి 8 గంటలకు ఆళ్లగడ్డకు చేరుకోగా ఉయ్యాలవాడ మీదుగా డిపోకు రావాల్సి ఉంది. భారీ వర్షాల కారణంగా ఇంజేడు సమీపంలోని కుందరవాగు ఉప్పొంగి ప్రవహిస్తుండంతో బస్సు డ్రైవర్ దస్తగిరి, కండెక్టర్ సూరిబాబు.. సర్వాయిపల్లె మీదుగా బస్సును మళ్లించారు. గ్రామ సమీపంలో సైతం చిన్నపాటి వంకకు వర్షపునీరు పోటెత్తింది. వంకను దాటించే క్రమంలో బస్సు అదుపు తప్పి సైడులో ఇరుక్కపోయింది. ప్రమాదాన్ని గమనించిన బస్సులోని 15 మంది ప్రయాణికులు గ్రామస్తుల సహకారంతో బస్సు దిగి సురక్షితంగా బయట పడటంతో ప్రమాదం తప్పింది. బస్సులోని ప్రయాణికులను ఆయా సొంత ప్రాంతాలకు తరలించేందుకు రెవెన్యూ అధికారులు ప్రైవేటు వాహనాన్ని ఏర్పాటు చేశారు. కాగా ప్రమాద ఘటనపై ఆర్టీసీ, పోలీసు అధికారులు విచారణ జరుపుతున్నారు. -
శ్రీగిరిలో షాడో ఈఓ
శ్రీశైలంటెంపుల్: ‘నేను చెప్పిందే వేదం.. నన్ను ఎవరూ ఏమి చేయలేరు’ అంటూ శ్రీశైల దేవస్థానంలో ఓ చిన్న సారు హవా సాగిస్తున్నా అడిగేవారు లేరు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే తనకు ఉన్న రాజకీయ పలుకుబడి ఉపయోగించి అర్హత లేకపోయినా కీలకమైన విభాగానికి పోస్టింగ్ వేయించుకున్నారు. అంతటితో అ చిన్న సారు అగకుండా తనకు ఇద్దరు కీలక శాఖలకు చెందిన మంత్రులు బాగా తెలుసునని, ఇక కూటమి ఎమ్మెల్యేలు చాలా మంది బాగా పరిచయమని గొప్పలు చెపుకుంటున్నాడు. అంతేకాకుండా సీఎంవోలో ఓ అధికారి తాను ఎది చెబితే అది చేస్తాడని, దేవదాయ శాఖ రాష్ట్ర స్థాయి అధికారి తన ఇంటికి వచ్చి భోజనం చేస్తాడని దేవస్థాన అధికారుల దగ్గర సొంతడబ్బా కొట్టుకుంటూ, కొంత మంది ఉద్యోగులను బెదిరిస్తున్నట్లు సమాచారం. ఉన్నతాధికారిని సైతం తన గుప్పిట్లో పెట్టుకున్న చిన్నసారు..షాడో ఈఓగా వ్యవహరిస్తున్నట్లు శ్రీగిరిలో గుసగుసలు గుప్పుమంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత చిన్నసారు తన స్వలాభం కోసం అధికారులు, ఉద్యోగులను బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఓ కీలక విభాగానికి విభాగాధిపతిగా పోస్టింగ్ వేయించుకున్నా.. ఆ విభాగంపై పట్టు లేకపోయినా కిందిస్థాయి సిబ్బందిని అడ్డుపెట్టుకుని పనులు చేయిస్తున్నారు. అ విభాగాధిపతితో అందరికి అవసరాలు ఉంటాయి. అలాగే చాలా మంది ప్రజాప్రతినిధులతో పరిచయాలు సైతం పెరుగుతాయి. అంతేకాకుండా అమ్యామ్యాలు కూడా అదేస్థాయిలో ఉంటాయని, అందుకే ఏరి కోరి స్థానిక ప్రజాప్రతినిధి మీద తనకు తెలిసిన, పలుకుబడి ఉన్న రాజకీయ నాయకులు, అధికారులతో ఓత్తిడి తెప్పించి మరీ ఆ పోస్టింగ్లో జాయిన్ అయినట్లు ప్రచారం జరుగుతుంది. ఏకంగా దేవస్థానం ఉన్నతాధికారి చెప్పిన విషయాలను సైతం విస్మరిస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. పెత్తనమంతా చిన్న సార్దే.. కీలకమైన విభాగానికి అధిపతి అయినప్పటి నుంచి అ చిన్న సారు షాడో ఈఓగా వ్యవహరిస్తున్నట్లు శ్రీగిరిలో చర్చ జరుగుతోంది. దేవదాయశాఖకు కీలక ప్రజాప్రతినిధి కుమార్తె ఏది చెబితే అది చేస్తానమ్మా, ఏదైనా నాకు చెప్పండి అని ఆమె చెప్పిన పనులు చేస్తూ.. ఆమె అండదండలు తనకు ఉన్నాయని గొప్పలు చెప్పుకుంటున్నట్లు సమాచారం. క్షేత్రంలో అన్ని విభాగాల అధికారులు తాను చెప్పిందే వినాలంటూ ఆదేశిస్తూ ఉద్యోగులపై పెత్తనం చేస్తూ షాడో ఈఓగా వ్యవహరిస్తున్నట్లు ఉద్యోగులు గుసగుసలాడుకుంటున్నారు. క్షేత్రంలో ఏ విభాగంలోనైనా అధికారులు ఏ పని చేయాలన్నా షాడో ఈఓను సంప్రదించాల్సిందే, షాడో ఈఓ సూచనలతో ఆయా పనులు చేయాలని ఆదేశిస్తాడని విమర్శలు వినిపిస్తున్నాయి. నా బ్యాక్గ్రౌండ్ మీకు తెలియదు.. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ కీలక శాఖ మంత్రి, గుంటూరు జిల్లాకు చెందిన ఓ కీలక శాఖ మంత్రి తనకు బాగా సన్నిహితులని చిన్న సారు తరచూ సిబ్బంది, అధికారులకు చెప్పుకుంటాడని సమాచారం. అంతేకాకుండా కూటమి ప్రభుత్వంలో చాలా మంది ఎమ్మెల్యేల పరిచయం ఉందని, దేవదాయ శాఖకు చెందిన రాష్ట్రస్థాయి అధికారి తన ఇంటికి వచ్చి భోజనం చేస్తాడని, అంతేకాకుండా సీఎంవోలో ఓ ముఖ్య అధికారి కూడా తనకు బాగా సన్నిహితుడని తన సిబ్బందితో గొప్పలు చెప్పుకుంటాడని తెలుస్తుంది. తన బ్యాక్ గ్రౌండ్ మీకు తెలియదు.. నేను తలుచుకుంటే మీరు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్తారు’ అని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ‘నేను చెప్పిందే వేదం.. నన్ను ఎవరూ ఏమి చేయలేరు’ అని ఉద్యోగులను తన దారిలోకి తెచ్చుకుని తను చెప్పిందే వినేలా చేసుకుంటాడని విమర్శలు ఉన్నాయి. ఇప్పటికై న దేవదాయశాఖ ఉన్నతాధికారులు స్పంధించి షాడో ఈఓగా వ్యవహరిస్తున్న చిన్న సారు పై దృష్టిసారించి అతని చేష్టలకి కళ్లెం వేస్తారో లేక తన రాజకీయ బ్యాక్గ్రౌండ్ చూసి భయపడి ఏమి చేయలేక మిన్నకుండి పోతారో వేచిచూడాలి మరి. -
నాపరాతి పరిశ్రమను ఆదుకోవాలి
బనగానపల్లె: కూటమి ప్రభుత్వం వెంటనే మైనింగ్ ప్రైవేటీకరణను రద్దు చేసి నాపరాతి పరిశ్రమను ఆదుకోవాలని మైనింగ్, ట్రాక్టర్ యజమానులు, కార్మికులు ఆందోళనకు దిగారు. కూటమి ప్రభుత్వ తీరుతో ఉపాధి కోల్పోయి కార్మికులు, వ్యాపారులు రోడ్డున పడ్డారని మండిపడ్డారు. స్థానిక మైనింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం మైనింగ్ ప్రైవేటీకరణ రద్దు చేయాలంటూ పలుకూరు క్రాస్ రోడ్డులో రాయల్టీ వసూలుకు ప్రైవేటు సంస్థ ఏర్పాటు చేసిన చెక్ పోస్టు వద్ద ధర్నా చేపట్టారు. ప్రైవేటీకరణతో మైనింగ్ పరిశ్రమ స్తంభించి పోయినా కూటమి నేతలు పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. ప్రభుత్వ నిబంధనలతో మైనింగ్ లీజ్ పొందాలంటే సుమారు రూ.25 లక్షలు వెచ్చించాల్సి వస్తోందని వాపోయారు. జిల్లాలోని కూటమి నేతలు వెంటనే ప్రభుత్వంతో చర్చించి ప్రైవేటు చెక్ పోస్టులను ఎత్తేసి మైనింగ్పరిశ్రమను ఆదుకోవాలని కోరారు. ఆందోళనలో మైనింగ్ అసోసియేషన్ సభ్యులు యల్ల నాగయ్య, విజయుడు, మోహన్రావు, నాగేశ్వరరెడ్డి, ఉపేంద్ర, కేటీ చౌదరి, బీటీ మహేష్, తిరుమలేష్రెడ్డి, నాగేష్ కుమార్రెడ్డి అరుణ్, నామాల వెంకటేశ్వర్లు, ఆర్ఆర్ బ్రదర్స్, బి రాజు మరికొందరు మైనింగ్ యజమానులు వ్యాపారులు కార్మికులు పాల్గొన్నారు. -
అవసరమైతే తప్ప బయటికి రావద్దు
నంద్యాల: తుఫాన్ ప్రభావం వలన ఆరెంజ్ అలర్ట్ ఇచ్చిన నేపథ్యంలో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రయాణాలు చేయవద్దని జిల్లా ఎస్పీ సునీల్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. జాతీయ రహదారులలో ప్రయాణించే భారీ వాహనాలను రాత్రి 7 గంటల నుంచి సురక్షితమైన ప్రాంతాల్లో నిలుపుకోవాలని, రాత్రి వేళ ప్రయాణాలు చేయరాదన్నారు. ఏదైనా కాలువలు, వాగులు, వంకలు, నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహించినా, వరదలు వచ్చే అవకాశం ఉన్నా వెంటనే పోలీసు, రెవెన్యూ అధికారులు సమాచారం తెలియజేయాలన్నారు. తుపాన్ ప్రభావం విద్యుత్ అంతరాయం, ఇళ్లల్లోకి నీరు చేరడం, చెట్లు, విద్యుత్ స్తంభాలు వైర్లు తెగిపోవడం, ఎవరైనా ప్రమాదంలో ఉన్న పోలీస్ టోల్ ఫ్రీ నెంబర్ 112కు కాల్ చేయాలన్నారు. -
వీఓఏలను అన్యాయంగా తొలగిస్తే ఉద్యమిస్తాం
● 5వ రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మినంద్యాల(న్యూటౌన్): వీఓఏలను అన్యాయంగా తొలగిస్తే ఉద్యమిస్తామని వీఏఓల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి హెచ్చరించారు. సోమవారం నంద్యాల పట్టణంలోని జేకే ఫంక్షన్ హాల్లో వీఓఏల ఉద్యోగుల సంఘం ఐదవ రాష్ట్ర మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వీఓఏలపై రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వేధింపులు పెరిగిపోతున్నాయన్నారు. కూటమి నేతలు వీఓఏలను అన్యా యంగా తొలగిస్తున్నారని, గ్రామ ఐక్య సంఘాల తీర్మానం లేకుండా తొలగిస్తే ఉద్యమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. వీఓఏలకు 25 ఏళ్లుగా వేత నాలు పెంచకపోవడం దారుణమన్నారు. వేతనాలు పెంచాలని అడిగితే ప్రభుత్వ ఉద్యోగులు కాదని, ప్రభుత్వం దాటవేస్తుందన్నారు. కనీస వేతన చట్టాన్ని అమలు చేయడంలో పాలకులు నిర్లక్ష్యంగా ఉన్నారని ఆరోపించారు. అనంతరం సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ.. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ వైపు తీసుకొని వెళ్తుందన్నారు. స్కీం వర్కర్లపై కూటమి నాయకులు కత్తి పెట్టారని, తొలగింపులే ప్రధాన అజెండాగా పెట్టుకొని తొలగించడం అన్యాయమన్నారు. మహాసభల్లో ముందుగా మహిళా సమాఖ్య సీనియర్ నాయకులు నిర్మలమ్మ, వీఏఓల సంఘం నాయకులు రూపాదేవి, కృష్ణమ్మ, శ్రీదేవి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఏసురత్నం, వీఓఏల సంఘం జిల్లా కార్యదర్శి మిట్నాల తిరుపతయ్య, సీపీఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
కోటి సంతకాలతో ప్రజల్లో చైతన్యం
● వైద్య కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం ● మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి, ఎమ్మెల్సీ ఇసాక్బాషా బొమ్మలసత్రం: ప్రభుత్వ వైద్య కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రజల్లో చైతన్యం తెచ్చిందని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక గాంధీచౌక్ సెంటర్లో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి, ఎమ్మెల్సీ ఇసాక్బాషాతో పాటు స్టేట్ ఎగ్జిక్యూటీవ్ మెంబర్ పీపీ నాగిరెడ్డి, కౌన్సిల్ మెంబర్ గోపవరం సాయినాథరెడ్డి, రాష్ట్ర సెక్రటరీ దేశం సుధాకర్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా హాజరయ్యారు. ఈ సందర్భంగా గాంధీచౌక్లోని ప్రతి దుకాణం వద్దకు వెళ్లి వారు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం శిల్పా మాట్లాడుతూ.. పేద విద్యార్థులు డాక్టర్లు కావాలనే లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రానికి 17 నూతన ప్రభుత్వ మెడికల్ కళాశాలలను తీసుకొచ్చారన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 5 కళాశాలలు ప్రారంభమై అందులో పేద విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని వివరించారు. పేదలకు తక్కువ ఖర్చుతో వైద్య విద్య అందటం ఇష్టంలేని కూటమి నేతలు తమ స్వలాభం కోసం ప్రైవేటీకరణ పేరుతో కుట్ర పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య విద్యతో పాటు ఆయా ప్రాంతాల పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించే మెడికల్ కళాశాలలతో కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేయడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. పీపీపీ విధానం కొనసాగితే రాష్ట్రంలో పేదలకు వైద్య విద్య దూరమవుతుందనే విషయాన్ని ప్రజలు తెలుసుకున్నారన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి అందరూ ముందుకు రావాలన్నారు. కూటమి నేతలు రాక్షాసానందం పేదలకు మంచి జరగాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తలపెట్టిన ప్రతి పనిని నీరుగారుస్తూ కూటమి నేతలు రాక్షాసానందం పొందుతున్నారని ఎమ్మెల్సీ ఇసాక్బాషా విమర్శించారు. వైద్య విద్యను పేదలకు దూరం చేస్తే ప్రజలు సహించరని కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు దాల్మిల్ అమీర్, మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, మండల ఎంపీపీ శెట్టి ప్రభాకర్, రాష్ట్ర మహి ళా విభాగం జనరల్ సెక్రెటరీ శశికళారెడ్డి, ప్రధాన కార్యదర్శి సోమశేఖర్రెడ్డి, మేధావుల సంఘం అధ్యక్షులు రసూల్ ఆజాద్, జిల్లా అధికార ప్రతినిధి, అనిల్ అమృతరాజ్, క్రిస్టియన్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు కారు రవికుమార్, సెక్రటరీ దేవనగర్బాషా, సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షులు రమణ, అసెంబ్లీ గ్రీవెన్స్ అధ్యక్షులు వివేకానందరెడ్డి, లీగల్సెల్ అధ్యక్షులు ప్రతాప్రెడ్డి, యూత్ అధ్యక్షులు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి
● ఉల్లి, మొక్కజొన్న, టమాట పంట కోత వాయిదా వేసుకోవాలి ● జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల: ‘మొంథా’తుపాను ప్రభావంతో మూడు రోజుల పాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలందరినీ అప్రమత్తం చేయడంతో పాటు అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో తుపాన్ ప్రభావ భద్రతా చర్యలపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొంథా తుపా ను కాకినాడ – విశాఖపట్నం మధ్య తీరం దాటనుందని, దాని ప్రభావం నంద్యాల జిల్లాపైనా ఉండే అవకాశముందని అన్నారు. తుపాను ప్రభావం నేపథ్యంలో జిల్లాలోని రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నా రు. ముఖ్యంగా ఉల్లి, మొక్కజొన్న, టమాట రైతులు పంట కోతను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని సూచించారు. ఇప్పటికే జిల్లాలో సుమారు 30 శాతం మొక్కజొన్న కోత జరగగా, అధిక తేమ కారణంగా పంటలకు తక్కువ ధరలు పడే అవకాశం ఉందన్నారు. పంట కోత వాయిదా ప్రాముఖ్యతపై అధి కారులు అవగాహన కల్పించాలన్నారు. మట్టి మిద్దెల్లో నివసించే ప్రజలకు నోటీసులు జారీ చేసి, సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. చెరువుల వద్ద గండి పడే ప్రాంతాలను ముందుగానే గుర్తించి, ఇసుక సంచులు, అవసరమైన సామగ్రిని సిద్ధంగా ఉంచుకోవాలని, అధిక వర్షపాతం నమోదైతే వెంటనే ప్రత్యామ్నా య చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో ఆధార్ అప్డేట్ స్పెషల్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్, డీఆర్ఓ రామునాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
పోలీసు అమరవీరుల త్యాగాలు స్మరించుకుందాం
నంద్యాల: పోలీసు అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ఎస్పీ సునీల్ షెరాన్ అన్నా రు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో ఓపెన్ హౌస్ పేరుతో పోలీసు ఆయుధాల ప్రదర్శనను ఎస్పీ ప్రారంభించారు. పోలీసులు విధి నిర్వహణలో ఉపయోగించే ఆయుధాలు, వాటి పనితీరు, పరికరాలు, సాంకేతిక సాధనలను గురించి విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసుల విధులు, వారు వాడే ఆయుధాలు, పరికరాలు, బాధ్యతలు, శాంతిభద్ర నిర్వహణ తదితర అంశాలను విద్యార్థి దశలోనే తెలుసుకోడానికి ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు అందరూ పోలీస్ శాఖకు సహకరించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ యుగందర్ బాబు, ఆర్ఐలు బాబు, మంజునాథ్, సురేశ్ బాబు, ఆర్ఎస్ఐలు పాల్గొన్నారు. చట్ట పరిధిలో సమస్యలు పరిష్కరిస్తాం ప్రజలు పీజీఆర్ఎస్లో ఇచ్చిన సమస్యలు చట్టపరిధిలో పరిష్కరించి న్యాయం చేస్తామని జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో పీజీఆర్ఎస్లో భాగంగా ప్రజల నుంచి ఎస్పీ వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, ఉద్యోగం ఇప్పి స్తానని డబ్బులు తీసుకుని మోసం చేయడం, పొలం తగాదాలు, అన్నదమ్ముల ఆస్తి తగాదాల వంటివి 140 వినతులు వచ్చాయన్నారు. వాటిని విచారించి ప్రజలకు న్యాయం చేస్తామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు పాల్గొన్నారు. -
శ్రీగిరి కిటకిట
శ్రీశైలంటెంపుల్: కార్తీకమాసం పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు శ్రీగిరికి తరలివచ్చారు. ఆదివారం వేకువజాము నుంచే భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం మల్లన్న దర్శనానికి ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా భక్తులు బారులుదీరారు. భక్తుల రద్దీతో ఆలయ క్యూలైన్లు నిండిపోయాయి. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. పలువురు భక్తులు కార్తీకదీపారాధన చేసుకుని ప్రత్యేక నోములు నోచుకున్నారు. కార్తీక దీపారాధనకు దేవస్థానం విస్త్రత ఏర్పా ట్లు చేసింది. భక్తుల రద్దీతో ఆలయ పురవీధులన్నీ కిటకిటలాడాయి. కుందూనదికి పోటెత్తిన వరద కోవెలకుంట్ల: స్థానిక వ్యవసాయ సబ్ డివిజన్తోపాటు ఎగువ ప్రాంతాల్లో ఐదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో కుందూనదికి వరదనీరు పోటెత్తింది. అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలతో వాగులు, వంకలు, పొలాల్లోని నీరంతా కుందూలోకి చేరడంతో నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మండలంలోని గుళ్లదూర్తి సమీపంలో నదికి అనుసంధానంగా ఉన్న కప్పల పాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. వాగు పరీవాహకంలో ఉన్న వరి పైర్లలోకి భారీగా వర్షపు నీరు చేరడంతో పంట నీట మునిగింది. వైఎస్సార్సీపీ ర్యాలీ వాయిదా కల్లూరు: మొంథా తుపాన్ కారణంగా వైఎస్సార్సీపీ ఆధ్యర్యంలో ఈ నెల 28న ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ నియోజకవర్గాల్లో తలపెట్టిన ర్యాలీని వాయిదా వేసినట్లు వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. వైఎస్సార్సీపీ నేతలు గమనించాలని ప్రకటనలో సూచించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పోరాటం నంద్యాల(న్యూటౌన్): ఉద్యోగుల సమస్యల పరిష్కార ధ్యేయంగా పోరాడుతామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర పరిశీలకుడు సుదర్శన్రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక కార్యాలయంలో నంద్యాల జిల్లా అధ్యక్షుడు నాగేంద్రప్ప ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ మేరకు సభ్యత్వ నమోదుపై దృష్టి సారించాలన్నారు. ఉద్యోగులకు రావా ల్సిన బకాయిలపై కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి చేసేందుకు ఉద్యమాలే శరణ్యమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ, కోశాధికారి శ్రీనివాసులు, టైం స్కేల్ అధ్యక్షుడు సురేష్, సభ్యులు హనుమంతు, వేణుగోపాల్రెడ్డి, యశ్వంత్, విజయలక్ష్మి, చెంచమ్మ, లక్ష్మీదేవమ్మ, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. నేడు కలెక్టరేట్లో ప్రజా వినతుల స్వీకరణ నంద్యాల: స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ఈనెల 27న సోమవారం ‘ప్రజా ఫిర్యా దుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ దరఖా స్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam.ap.gov. in వెబ్సైట్లో, టోల్ ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను కూడా ఇలాగే నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో, డివిజన్ స్థాయిలో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. -
పరిహారం కోసం వివరాలను తీసుకున్నాం
ఏపీ ప్రభుత్వం బాధిత కుటుంబాలకు ప్రకటించిన పరిహారం ఇచ్చే ప్రక్రియ మరింత ఆలస్యం కానున్నది. మృతి చెందిన కుటుంబ సభ్యులకు రూ.5లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల పరిహారాన్ని ప్రకటించింది. అయితే ఇందుకోసం బాధిత కుటుంబ సభ్యులు బ్యాంకు ఖాతాలు, ఆధార్, ఇతర వివరాలను తీసుకున్నాం. త్వరలోనే బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందుతుంది. – డాక్టర్ ఏ.సిరి, కర్నూలు జిల్లా కలెక్టర్ నా అల్లుడు శ్రీనివాసరెడ్డి బస్సు దహనంలో చనిపోయాడు. ఆయనకు సెంటు భూమి కూడా లేదు. క్రేన్ మెకానిక్గా పనిచేసి జీవనం చేసేవాడు. పనికోసం హైదారాబాద్కు వెళ్లాడు. అక్కడి నుంచి బెంగళూరులో పని కోసం కాల్ వస్తే వెళ్లాడు. అయితే మార్గమధ్యలో ప్రమాదం జరిగి చనిపోయాడు. శ్రీనివాసరెడ్డికి భార్య లక్ష్మీజ్యోతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలి. లేదంటే వారు రోడ్డున పడతారు. – అచ్చిరెడ్డి. రావులపాళెం, తూగో జిల్లా నా కుమారుడు ఆర్గ బంధోపాధ్యాయ చనిపోవడం చాలా బాధ ఉంది. నా భార్య, కుటుంబ సభ్యులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. మాది సొంతూరు కలకత్తా. అయితే ఉద్యోగం కోసం బెంగళూరు వచ్చాం. మా అబ్బాయి బెంగళూరు నుంచి స్నేహితుడు పిలిస్తే దీపావళి పండగకు హైదరాబాద్కు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో చనిపోవడం అన్యాయం. 23 ఏళ్లకే నూరేళ్లు నిండాయి. పెళ్లి కోసం ఎన్నో కలలు కన్నాం. అవన్నీ కల్లలయ్యాయి. – అభిజిత్ బంధోపాధ్యాయ, బెంగళూరు● -
‘అంతస్తులు’ దాటిన అవినీతిపై ఇంటెలిజెన్స్ ఆరా
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానంలో చక్రం తిప్పుతున్న ఓ ఉద్యోగిపై ‘సాక్షి’ దినపత్రిక ప్రచురించిన కథనంపై ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. ఆదివారం సాక్షి దినపత్రికలో ‘అంతస్తులు’దాటిన అవినీతి అనే శీర్షికతో దేవస్థానంలో ఓ అధికారి అవినీతిపై కథనం ప్రచురితమైంది. ఈ కథనం గురించి శ్రీశైల దేవస్థానం అధికారుల్లో, స్థానికంగా చర్చ జరుగుతోంది. ఇంటలిజెన్స్ అధికారులు సదరు అధికారి నివాసం ఉంటున్న రెవెన్యూ పట్టా ఎవరి పేరుతో ఉంది? ప్రస్తుతం ఆ పట్టా భూమిలో ఎన్ని అంతస్తుల ఇల్లు నిర్మించారు? ఆ గృహానికి విద్యుత్మీటర్లు ఎవరి పేరుతో ఉన్నాయి? అని ఆరా తీసినట్లు సమాచారం. విద్యుత్ మీటర్ ఇవ్వాలంటే పట్టా భూమి ఎవరి పేరుతో ఉంటే వారి పేరుతో ఇస్తారు. అలాగే దేవస్థానం స్థలంలో అయితే దేవస్థానం అధికారులు ఎన్వోసీ ఇస్తేనే విద్యుత్ మీటర్లు ఇస్తారు. కానీ ఆ అధికారి సతీమణి పేరుతో విద్యుత్ మీటర్లు ఎలా ఇచ్చారని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు సైతం ఆరా తీస్తున్నట్లు సమాచారం. అంతేకాక ‘సాక్షి’ కథనంపై దేవస్థాన ట్రస్ట్బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్నాయుడు సైతం అధికారుల ద్వారా ఆరా తీసినట్లు తెలుస్తోంది. పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నంద్యాల(వ్యవసాయం): కార్తీక మాసాన్ని పురస్కరించుకుని అరుణాచలం, పంచారామాలు క్షేత్రాలకు నంద్యాల నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు డిపో మేనేజర్ మాధవీలత ఆదివారం తెలిపారు. వచ్చే నెల పౌర్ణమి నాలుగో తేదీ ఉదయాన ఏడు గంటలకు అరుణాచలానికి బస్సు సర్వీస్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రిజర్వేషన్ చార్జీతో కలిపి రూ.1750 అవుతుందన్నారు. అదేవిధంగా పంచారామా ఆలయాలైనా అమరావతిలోనే అమరరామం, భీమవరంలోని సోమేశ్వర రామం, పాలకొల్లులోని క్షీరరామం,, ద్రాక్షారామంలోని భీమేశ్వర రామం, సామర్లకోటలోని కొమరామం క్షేత్రాల దర్శనం దర్శనానికి నంద్యాల ఆర్టీసీ డిపో నుండి నవంబర్ ఒకటో తేదీ 4, 7, 8, 15 తేదీల్లో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు. రానుపోను చార్జీతో కలిపి ఒక్కొక్కరికి రూ.2,500 అవుతుందన్నారు. మరిన్ని వివరాలకు 95050 65651, 9959225800ను సంప్రదించలన్నారు. -
అడుగడుగునా ‘మందు’పాతర్లు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్చలవిడిగా మద్యం లభిస్తోంది. గుడి, బడి అనే తేడా లేకుండా ఎక్కడంటే అక్కడ మద్యం దుకాణాలను ఏర్పాటు చేశారు. ఎప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ మద్యం లభిస్తోంది. బెల్టు షాపుల నిర్వహణకు అడ్డూఅదుపూ లేకపోవడంతో 16 సంవత్సరాలు దాటని పిల్లలు కూడా మద్యానికి బానిసలుగా మారుతున్నారు. తరచూ ప్రమాదాలు చోటుచేసుకుని ప్రాణాలు పోతున్నా రాష్ట్ర ప్రభుత్వంలో కనీస స్పందన కరువైంది. – సాక్షినెట్వర్క్ ఎమ్మిగనూరు పట్టణంలో మంత్రాలయం రోడ్డు పక్కనే ఉన్న వైన్ షాప్ -
నేర రహిత జిల్లాగాతీర్చిదిద్దడమే లక్ష్యం
నంద్యాల: నేరరహిత జిల్లాగా నంద్యాలను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఎస్పీ సునీల్ షెరాన్ అన్నారు. ఆది వారం జిల్లాలోని నంద్యాల వైఎస్సార్నగర్, చింతకుంట్ల, పాములపాడు, కొండమనాయినిపల్లెలో, నెహ్రూనగర్, పగిడ్యాల, లక్ష్మితండాలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. అనుమానిత ప్రాంతాలు, రౌడీ షీటర్లు, అనుమానాస్పద వ్యక్తుల ఇళ్లలో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 111 క్వార్టర్ మద్యం బాటిళ్లు, 8 బీర్లు, 24 మోటారు బైక్లు స్వాధీ నం చేసుకున్నారు. ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. -
మొక్కజొన్న రైతుల కష్టాలు కనిపించవా!
రుద్రవరం: వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్న మొక్కజొన్న రైతుల కష్టాలు కూటమి ప్రభుత్వానికి కనిపించవా అని ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి విమర్శించారు. ఆళ్లగడ్డ–అహోబిలం రహదారిపై ముత్తలూరు మెట్ట వద్ద ఆరబోసిన మొక్కజొన్నలను ఆదివారం ఆయన పరిశీలించారు. పలువురు రైతులు తడిసి మొలకెత్తిన మొక్కజొన్నలను చూపించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాలతో దిగుబడులు ఎకరాకు 15 క్వింటాళ్లకే పడిపోయిందన్నారు. అరకొర దిగుబడి కూడా తడిసి మొలకెత్తాయని వాటిని ప్రైవేటు వ్యాపారులు క్వింటా రూ.1600కే కొనుగోలు చేస్తుండటంతో పెట్టిన పెట్టుబడుల్లో సగం కూడా రైతులకు అందే పరిస్థితి లేదన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం బీమా చేయించడంతో పాటు పరిహారం అందించింది ఆదుకుందని గుర్తు చేశారు. అదే విధంగా కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.2,400ల ప్రకారం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కష్టాల్లో ఉన్న రైతులను విస్మరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అనంతరం నల్లవాగుపల్లె మెట్ట సమీపంలో గాలివానకు నేలవాలిన వరిపైరును పరిశీలించారు. ఆయన వెంట ఆళ్లగడ్డ వ్యవసాయ మార్కెట్ యార్డు కమిటీ మాజీ చైర్మన్ గంధం రాఘవరెడ్డి, ఆళ్లగడ్డ ఎంపీపీ గజ్జెల రాఘవేంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ప్రసాదరెడ్డి, నాయకులు రామకృష్ణారెడ్డి, బద్రినారాయణ, రామనాథరెడ్డి, పాణ్యం చంద్ర, నాగేష్, శూలం ప్రభాకర్, మాధవ, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి -
ఉప్పొంగిన బుచ్చమ్మ కుంట
● స్తంభించిన రాకపోకలుకోవెలకుంట్ల: మండలంలోని కంపమల్ల– ఉయ్యాలవాడ ఆర్అండ్బీ రహదారిలో శనివారం బుచ్చమ్మ కుంట ఉప్పొంగి ప్రవహించింది. దీంతో కంపమల్ల, క్రిష్టిపాడు, హరివరం నుంచి కోవెలకుంట్ల, దొర్నిపాడు ప్రాంతాలకు వెళ్లేందుకు రాకపోకలు స్తంభించి పోయాయి. ఆయా గ్రామాల ప్రజలు ఉయ్యాలవాడ మీదుగా రాకపోకలు కొనసాగించారు. కుంట పరివాహకంలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన వంద ఎకరాల్లో మిరప, వరి, మినుము, తదితర పంటలు నీట మునిగి నష్టం వాటిల్లింది. అధికారులు పంటనష్టం అంచనా వేసి పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు. పొంగిపొర్లిన మద్దిలేరు వాగు బేతంచెర్ల: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో శ్రీ మద్దిలేటి నరసింహ స్వామి ఆలయం సమీపంలోని మద్దిలేరు వాగు శనివారం పొంగి పొర్లింది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఈ వాగు పారలేదు. కొండపైనుంచి వాగు జాలు వారుతూ శనివారం కనువిందు చేసింది. భక్తులు వర్షంలో తడుస్తూనే స్వామి వారిని దర్శించుకున్నారు. -
‘అంతస్తులు’ దాటిన అవినీతి!
శ్రీశైలం టెంపుల్: ఓ ప్రభుత్వ ఉద్యోగి జీతం నెలకు రూ.50వేలు ఉంటుందనుకుంటే, ఆ ఉద్యోగి ఇంట్లో నిత్యావసర సరుకులు, పిల్లల చదువులకు, ఇతర అవసరాలు పోను నెలకు రూ.10వేలు దాచిపెట్టినా సంవత్సరానికి రూ.1.20లక్షలు అవుతుంది. అంటే ఆ ఉద్యోగి సొంత ఇల్లు నిర్మించాలంటే 20సంవత్సరాలు ఇదేవిధంగా డబ్బు దాచిపెడితే రూ.24లక్షలతో ఓ మోస్తరుగా నిర్మించుకోవచ్చు. అలాంటిది శ్రీశైలం దేవస్థానం ఉద్యోగి ఒకరు ఉద్యోగంలో చేరిన అనతికాలంలోనే రెండంతస్తుల భవనం నిర్మించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇంటి పట్టా బినామీ పేరుతో ఉండగా.. విద్యుత్ మీటర్లు మాత్రం ఆయన సతీమణి పేరిట తీసుకోవడం గమనార్హం. అంతేకాదు.. సొంత ఊర్లో పొలాలు, ఇతర పట్టణాల్లో స్థలాలను కూడా పోగేసుకోవడం చూస్తే ఏస్థాయిలో అక్రమార్జన చేస్తున్నాడో అర్థమవుతోంది.ఆ మల్లన్నకే ఎరుక..!శ్రీశైల దేవస్థానంలో ఎన్ఎంఆర్గా విధుల్లో చేరిన ఓ ఉద్యోగి అంచలంచెలుగా వాచ్మన్(హెల్పర్)గా రెగ్యులర్ అయ్యాడు. జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, అక్కడి నుంచి నేరుగా ఓ విభాగానికి అధిపతి, ఏఈవో స్థాయి జీతం తీసుకుంటున్నాడు. సదరు ఉద్యోగి శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి వార్ల దర్శనార్థం వచ్చే ఉన్నతాధికారులు, వ్యాపారులను, రాజకీయ నాయకులను ప్రసన్నం చేసుకోవడంలో దిట్ట. వారిని తనదైన మాటలతో మైమరపించి, దగ్గరుండి దర్శనాలు చేయించడంతో పాటు సకల సౌకర్యాలు, అవసరాలు తీరుస్తుంటాడు. తన ఉద్యోగం రెగ్యులర్ అయిన కొన్ని సంవత్సరాలకే శ్రీశైలంలో పట్టా భూమిని చేజిక్కించుకుని, గ్రౌండ్ఫ్లోర్తో పాటు రెండంతస్తుల భవనం రూ.కోటి వ్యయంతో నిర్మించాడు. తన పేరుతో పట్టా ఉంటే ఏసీబీ అధికారులకు దోరుకుతానేమోనని బినామి అయిన సమీప బంధువు పేరుతో పట్టా పొందాడు. తాను ఉన్న దేవస్థానం ఎల్ఐజీ క్వార్టర్ను అర్హత లేకపోకపోయిన తన బినామీ అయిన సమీప బంధువు, దేవస్థానం ఔట్సోర్సింగ్ ఉద్యోగికి అలాట్ చేయించాడు. పిల్లలను పెద్ద సిటీలో చదివించడంతో పాటు అమెరికా పంపించే స్థాయికి ఎదిగాడు. విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు. సున్నిపెంటలో ఓ స్థలం, సొంత ఊరిలో పొలాలు, ఇతర పట్టణాల్లో సైతం స్థలాలు ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఇంత తక్కువ సమయంలో అంత డబ్బు ఎలా సంపాదించాడనేది ఆ మల్లన్నకే ఎరుక.సతీమణి పేరుతో విద్యుత్ మీటర్ఈ అధికారి తన సతీమణి పేరుతో గ్రౌండ్ ఫ్లోర్తో పాటు రెండంతస్తుల భవనానికి విద్యుత్ మీటర్ తీసుకున్నాడు. బినామీ భవనానికి సతీమణి పేరుతో మూడు, నాలుగు మీటర్లు తీసుకుని విద్యుత్ శాఖ అధికారులను సైతం బురిడీ కొట్టిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యుత్ శాఖ అధికారులు శాఖాపరంగా విచారిస్తే అసలు విషయం బయటికి వచ్చే అవకాశం లేకపోలేదు.బంగారం తాకట్టు, ఫైనాన్స్ వ్యాపారంసదరు ఉద్యోగి వెనకేసుకున్న డబ్బుతో ఫైనాన్స్ వ్యాపారం కూడా నిర్వహిస్తున్నాడు. తనకు నమ్మకంగా ఉన్న వారికి వడ్డీలకు డబ్బు ఇవ్వడంతో పాటు బంగారం కూడా తాకట్టు పెట్టుకుంటున్నాడు. అడ్డదారిలో పదోన్నతులు, అక్రమ సంపాదనకు అలవాటు పడి శ్రీశైలం నుంచి దేవదాయశాఖ ఎప్పుడు బదిలీ చేసినా కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకోవడం ఈయనకు పరిపాటి. తన అనుభవంతో ఉన్నతస్థాయిలో చక్రం తిప్పుతుండటంతో ఆయనపై చర్యలకు ఎవరూ సాహించని పరిస్థితి నెలకొంది. -
మోంథా తుపాను పట్ల అప్రమత్తం
నంద్యాల: మోంథా తుపాను నేపథ్యంలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సూచించారు. శనివారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జిల్లా విపత్తు నిర్వహణపై జిల్లా, మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్, అదనపు ఎస్పీ యుగంధర్ బాబు, డీఆర్ఓ రాము నాయక్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మోంథా తుపాను చైన్నె తీరం వైపు నుంచి విశాఖపట్నం దిశగా గంటకు 90 నుంచి 110 కి.మీ వేగంతో ఈదుర గాలులతో కదులుతున్న నేపథ్యంలో భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందన్నారు. అందువల్ల అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలో సుమారు 330 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు ఉన్నాయని, అందులో 200 ట్యాంకులు పూర్తి స్థాయిలో నిండి ఉన్నాయని, వీటి బండ్లను బలపరచాలని సంబంధిత మైనర్ ఇరిగేషన్ అధికారులకు కలెక్టర్ సూచించారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, అన్ని విభాగాల అధికారులు 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి.. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ 08514–293903 నెంబర్కు సమాచారం అందించాలన్నారు. పాఠశాలలు, కమ్యూనిటీ హాల్స్, కళ్యాణ మండపాలను పునరావాస కేంద్రాలుగా సిద్ధం చేయాలని ఆదేశించారు. కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్: 08514–293903 జిల్లా కలెక్టర్ రాజకుమారి వెల్లడి -
నంద్యాలలో పత్తి కొనుగోలు కేంద్రం
● జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్నంద్యాల: రైతులు తాము పండించిన పత్తిని గిట్టుబాటు ధరకు అమ్ముకునేందుకు పట్టణంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్ తెలిపారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లాస్థాయి పత్తి కొనుగోలు కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. ప్రస్తుతం మార్కెట్లో పత్తి క్వింటా కనీస మద్దతు ధర రూ.7710 (పొట్టి పింజ రకం), రూ.8110 (పొడవు పింజరకం) ఉందన్నారు. పత్తిని నంద్యాల పట్టణంలోని మురారి పవన్ ఆగ్రో టెక్ జిన్నింగు మిల్లులో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి అమ్ముకోవచ్చునన్నారు. రైతులు జిన్నింగు మిల్లుకు పత్తిని తీసుకొచ్చే ముందుగా రైతుసేవా కేంద్రంలో ఈ క్రాప్ రిజిస్ట్రేషన్, కపాస్ కిసాన్ అప్ లో స్లాట్ బుకింగ్ చేయించుకోవాలన్నారు. కనీస నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ అధికారి అబ్దుల్ రెహ్మాన్, మురారి జిన్నింగ్ మిల్ ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. -
మొక్కజొన్న రైతులను ఆదుకోవాలి
శిరివెళ్ల: తుఫాన్తో కురిసిన వర్షాలకు మొక్కజొన్న పంట దెబ్బతిందని, రైతులను ఆదుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామచంద్రుడు అన్నారు. శనివారం మహదేవపురం, గుండంపాడు గ్రామాలలో పర్యటించి తడిసిన మొక్క జొన్న గింజలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ అతివృష్టి, అనావృష్టితో మొక్కజొన్న పూర్తిగా దెబ్బతిందన్నారు. ఆరబోసుకున్న గింజలు తడిసి రంగు మారాయన్నాయన్నారు. ఎకరాకు రూ. 30 వేలు పెట్టి సాగు చేస్తే 15 కింటాళ్లు కూడా రాలేదన్నారు. వచ్చిన దిగుబడులను ఆరబోసుకుంటే వర్షాలకు తడిసి పోయాయన్నారు. ప్రభుత్వం స్పందించి మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. -
ప్రైవేట్ బస్సులు భద్రమేనా?
శ్రీశైలంటెంపుల్: ఇతర రాష్ట్రాల్లో బస్సులను రిజిస్ట్రేషన్ చేయించుకుని ఏపీలో తిరుగుతున్న ప్రైవేట్ ట్రావెల్కు చెందిన స్లీపర్ బస్సులను రవాణాశాఖ అధికారులు నామమాత్రపు తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఘాట్రోడ్లలో బెంగళూరు నుంచి శ్రీశైలానికి, హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి ట్రావెల్ బస్సులు నడుపుతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున వేమూరి కావేరి ట్రావెల్స్కు చెందిన స్లీపర్ బస్సు చిన్నటేకూరు సమీపంలో ఆగ్నిప్రమాదానికి గురై 19 మంది మృతి చెందారు. అయితే వేమూరి కావేరి ట్రావెల్స్కు చెందిన ఓ స్లీపర్ బస్సు బెంగళూరు నుంచి శ్రీశైలానికి ప్రతి రోజూ వస్తోంది. అలాగే భైరవ, ఎస్వీబీటీ, శ్రీతులసి, గుమ్మాల ఇలా పలు ట్రావెల్కు చెందిన స్లీపర్ బస్సులు వస్తున్నాయి. శ్రీశైలం నుంచి ఆత్మకూరు వరకు 115 కిలోమీటర్ల ఘాట్రోడ్లో ట్రావెల్ స్లీపర్ బస్సులు ప్రయాణిస్తుంటాయి. ఇప్పటికై నా రవాణశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించాలని పలువురు భక్తులు కోరుతున్నారు. -
ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
ఆళ్లగడ్డ: అకాల వర్షాలతో తడిసి మగ్గిపోయిన మొక్కజొన్న ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి భూమా కిషోర్రెడ్డి డిమాండ్ చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్ల వెంట ఆరబోసుకున్న మొక్కజొన్నలను శనివారం ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఎమ్మెల్యే అఖిలప్రియకు రైతుల గోడు పట్టడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం మద్దతు ధర కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ఇదే అదునుగా భావించిన దళారులు ధరను అమాంతం తగ్గించేశారన్నారు. ఇప్పటికై నా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయించి ప్రతి గింజనూ మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేయించాలన్నారు. లేదంటే రైతుల తరఫున పోరాటానికి వెనుకాడబోమని హెచ్చరించారు. -
తెలుగుగంగ ప్రధాన కాలువకు గండి?
చాగలమర్రి: నంద్యాల జిల్లా చాగలమర్రి మండలంలోని డి.వనిపెంట గ్రామ సమీపంలో తెలుగంగ ప్రధాన కాలువలో నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో పులి గుండం ప్రదేశంలోని 84వ కిలోమీటరు వద్ద గండి పడినట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన మండల తహసీల్దార్ విజయ్కుమార్, ఎస్ఐ సురేష్, తెలుగంగ అధికారులు గండి పడిన ప్రదేశాన్ని పరిశీలిస్తున్నారు. గండి పడి ప్రవహిస్తున్న నీరు డి.వనిపెంట, చెంచుగూడెం గ్రామాల్లోని పంట పొలాలను ముంచెత్తుతూ చెంచుగూడెం సమీపంలోని చౌటువంకలోకి భారీగా ప్రవహిస్తున్నాయి. ఈ నీరు డి.కొత్తపల్లె గ్రామంలో ఉన్న ఊరవంక నుంచి భవనాసిలోకి గొడిగనూరు మీదుగా ఉద్ధృతంగా పారుతున్నాయి. నీటి ప్రవాహం ఇలాగే కొనసాగితే తీవ్ర నష్టం తప్పదని డి.వనిపెంట, డి.కొత్తపల్లె గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై తహసీల్దార్ విజయకుమార్ మాట్లాడుతూ కాలువకు ఎక్కడా గండి పడలేదని, 84వ కిలోమీటరు వద్దనున్న అండర్ టన్నెల్ నుంచి అటవీ ప్రాంతంలో నీటి ఊట పారుతోందన్నారు. -
పొలంలో రక్త పింజరి
మహానంది: బుక్కాపురం గ్రామానికి చెందిన గాజుల వెంకటేశ్వర్లు సాగు చేస్తున్న గడ్డి పొలంలో గురువారం రక్తపింజరి పాము కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. గడ్డి కోసేందుకు వెళ్లిన వారు పామును గుర్తించి పరుగులు తీశారు. అయ్యన్ననగర్ గ్రామానికి చెందిన స్నేక్ క్యాచర్ మోహన్కు సమాచారం అందించారు. మోహన్ పొలం వద్దకు చేరుకొని గడ్డి మొక్కల మధ్య ఉన్న నాలుగు అడుగుల పొడవున్న రక్తపింజరి పామును చాకచక్యంగా పట్టుకుని సమీపంలోని నల్లమల అడవిలో వదిలేశారు. రైలు కిందపడి వ్యక్తి మృతి డోన్ టౌన్: స్థానిక రైల్వే స్టేషన్లో ఓ వ్యక్తి రైలు ఎక్కుతూ ప్రమాదవశాత్తూ కాలు జారి రైలు కిందపడి మృతి చెందాడు. రైల్వే ఎస్ఐ బింధుమాధవి తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని త్రివర్ణకాలనీకి చెందిన ఫెయింటర్ సతీష్ (52) గురువారం ఉదయం పని నిమిత్తం గుంతకల్లు నుంచి కాచిగూడ మీదుగా బోధన్ వెళ్లే రైలు కదులుతున్న సమయంలో ఎక్కడానికి ప్రయత్నించాడు. కాలు జారీ కింద పడటంతో అతనిపై రైలు వెళ్లడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. లైంగిక నేరాలపై విద్యార్థులకు అవగాహన కర్నూలు టౌన్: లైంగిక నేరాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. గురువారం పోలీసు సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలోని పాఠశాలలో విద్యార్థులకు లైంగిక నేరాలు, మహిళలు, పిల్లల రక్షణలో విద్యార్థుల పాత్ర అన్న అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విద్యార్థు ల్లో ఉన్న ప్రతిభను వెలికి తీయడం, పోలీసు శాఖ పట్ల పూర్తి అవగాహన కల్పించడం కోసమే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పోలీసు శాఖ వెల్లడించింది. వ్యాస రచన పోటీ ల్లో ప్రతిభ చాటిన వారికి ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు. మద్యం మత్తులో వీరంగం ● రైల్వేస్టేషన్ పరిసరాలు శుభ్రం చేయాలని శిక్ష విధించిన న్యాయమూర్తి కడప కోటిరెడ్డిర్కిల్: తిరుపతి నుంచి చర్లపల్లికి వెళుతున్న రైలులో మద్యం తాగి తోటి ప్రయాణికులకు ఇబ్బందులు సృష్టించిన యువకుడికి శిక్షగా రైల్వే స్టేషన్ పరిసరాలను శుభ్రం చేయించారు. రైల్వే పోలీసుల కథనం మేరకు ఈనెల 18వ తేదీ కర్నూలు జిల్లా దేవనకొండకు చెందిన వి.రవి అనే యువకుడు తిరుపతి–చర్లపల్లి రైలు లో వెళుతూ మద్యం మత్తులో ఇతర ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించాడు. ఈ క్రమంలో సమాచారం అందుకున్న జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బంది రైలు కడప రైల్వేస్టేషన్ మూడవ ప్లాట్ఫారానికి చేరుకున్న వెంటనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. బీఎన్ఎస్ యాక్టు 355 ప్రకా రం కేసు నమోదు చేశారు. రవి చేసిన తప్పునకు శిక్షగా కడప రైల్వేస్టేషన్ను మూడు గంటల పాటు అతనితో శుభ్రం చేయించాలని గురువారం అసిస్టెంట్ సెకండ్ క్లాస్ జూనియర్ మెజిస్ట్రేట్ ఆదేశించారు. ఈ మేరకు పోలీసులు యువకుడి చేత రైల్వే స్టేషన్ పరిసరాలను శుభ్రం చేయించారు. -
సాగు నష్టాల మూట.. ఊర్లు వలస బాట
కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో వ్యవసాయం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. అధిక వర్షాల వల్ల పంటలు దెబ్బతినడం, పండిన పంటలకు మద్దతు ధరలు లేక పోవడం వల్ల రైతులు ఆర్థికంగా చితికిపోయారు. మరో వైపు ఉన్న ఊరిలో ఉపాధి కరువై ప్రజలు వలస బాట పట్టారు. పల్లెలు ఖాళీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగే సర్వసభ్య సమావేశంపై అందరి దృష్టి నెలకొంది. కర్నూలు జిల్లాలో 4.22 లక్షల హెక్టార్లు, నంద్యాల జిల్లాలో 2.38 లక్షల హెక్టార్లు సాగు విస్తీర్ణం కాగా, కర్నూలు జిల్లాలో 3.86 లక్షలు, నంద్యాల జిల్లాలో 2.15 లక్షల హెక్టార్లలో మాత్రమే రైతులు వివిధ రకాల పంటలను సాగు చేశారు. గత నెలలో కురిసిన అధిక వర్షాల వల్ల పత్తి, వేరుశనగ, మొక్కజొన్న, ఉల్లి తదితర పంటలు పూర్తి స్థాయిలో నష్టపోవడమే గాక, పంటల దిగుబడి కూడా తగ్గింది. రెండు జిల్లాల్లో దాదాపు 30 వేలకు పైగా హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లింది. అయితే నష్టపోయిన పంటలకు పరిహారం అందించే ప్రక్రియలో పూర్తి జాప్యం చోటు చేసుకుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. నేటికీ మెజారిటీ మండలాల్లో నష్ట పరిహారం అందించేందుకు చేపట్టిన ఎన్యుమరేషన్ పూర్తి కాలేదు. ఈ సీజన్లో ఉల్లి రైతులు తీవ్రంగా నష్టపోయారు. పండిన పంటకు గిట్టుబాటు ధర లభించక, పండిన ఉల్లిని కొనేవారు లేక రైతులు నరకయాతనను అనుభవించారు. అనేక మంది రైతులు ఉల్లి పంటను మేకలు, గొర్రెలకు వదిలి వేయగా, మరి కొందరు పంటను పూర్తిగా దున్నేశారు. మరి కొంత మంది కోసిన ఉల్లిని మార్కెట్కు తీసుకువచ్చినా, ఎలాంటి లాభం లేకపోవడంతో హంద్రీనీవా కాలువలో పడవేశారు. ఉల్లి రైతుల నుంచి పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా 2,554 మంది రైతుల వద్ద నుంచి దాదాపు 10 వేల టన్నుల ఉల్లిని కొనుగోలు చేసింది. ఉల్లిని విక్రయించిన 250 మంది రైతుల ఖాతాల్లోకి ఇప్పటి వరకు కేవలం రూ.1.50 కోట్లు మాత్రమే జమ అయినట్లు తెలుస్తోంది. ఇంకా ప్రభుత్వం రూ.16.50 కోట్లను రైతుల ఖాతాలకు జమ చేయాల్సి ఉంది. ఉల్లిని కొనుగోలు చేసి నెల రోజులు దాటి పోయినా, నేటి వరకు నగదును జమ చేయకపోవడం పట్ల రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డెక్కిన టమాట రైతు.. జిల్లాలోని పశ్చిమ ప్రాంతాల్లో అధికంగా పండించే టమాట ఈ ఏడాది రైతు కంట కన్నీరు తెప్పించింది. దాదాపు 13,500 ఎకరాల్లో సాగు చేసిన టమాటకు ఈ ఏడాది ధర లేకపోవడం వల్ల రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు. ఒకానొక సందర్భంలో కిలో టమోటా ధర 10 పైసలు కూడా పలకకపోవడం వల్ల రైతులు తాము పండించిన టమోటాను రోడ్లపై పారబోసి నిరసన వ్యక్తం చేశారు. ఆదుకుంటామంటూ పాలకులు, అధికారులు ఇచ్చిన హామీలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. శనగ విత్తనాలు కరువు ప్రస్తుత రబీ సీజన్లో రైతులకు అందించాల్సిన శనగ విత్తనాలను కూడా ప్రభుత్వం అందించలేని పరిస్థితి ఉమ్మడి కర్నూలు జిల్లాలో నెలకొంది. కర్నూలు జిల్లాలో 46 వేల క్వింటాళ్ల శనగ విత్తనాలు అవసరం కాగా, ఇప్పటి వరకు 23 వేల క్వింటాళ్లను మాత్రమే సరఫరా చేశారు. అలాగే నంద్యాల జిల్లాలో 37 వేల క్వింటాళ్లు అవసరమని ప్రతిపాదనలు పంపగా, కేవలం 12,654 క్వింటాళ్లు మాత్రమే సరఫరా అయ్యాయి. రైతులకు అవసరాలకు అనుగుణంగా కూడా శనగ విత్తనాలను అందించక పోవడం పట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ పల్లెలు ఖాళీ..జిల్లాలో పనులు లేక, పస్తులుండలేక పశ్చిమ పల్లెలు వలస బాట పడుతున్నాయి. ఉన్న కొద్ది భూముల్లో వేసిన పంటలు వివిధ కారణాల వల్ల చేతికి రాకపోవడం, వచ్చిన అరకొర పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల చిన్న, సన్నకారు రైతులు కూడా గ్రామాలను వదిలి కూలీ పనులు చేసుకునేందుకు పట్టణాలకు వలస వెళ్తున్నారు. ఇప్పటికే ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆలూరు, పత్తికొండ, ఆదోని నియోజకవర్గాల్లోని ఆనేక గ్రామాల ప్రజలు హైదరాబాద్, ముంబాయి, బెంగుళూరు తదితర ప్రాంతాలకు వలసలు వెళ్లారు. వలసలను నివారించేందుకు ఉద్దేశించిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూడా కూలి అంతంత మాత్రంగానే ఇస్తుండడం వల్ల కూలీలు వలస పోతున్నారు. పైగా కూలీలకు చెల్లించాల్సి వేతనాలు ఆగస్టు నెల నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.5 కోట్ల వరకు ప్రభుత్వం బకాయి పడినట్లు తెలుస్తోంది. అలాగే ఉపాధి నిధులతో చేపట్టిన వివిధ రకాల అభివృద్ధి పనులు ( సీసీ రోడ్లు, డ్రైనేజీ, ప్రహరీగోడలు, పశువుల షెడ్లు, సోక్పిట్స్ ) కూడా దాదాపు రూ.100 కోట్ల వరకు నిధులు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. అసెంబ్లీలో ప్రస్తావించినా.. ‘ఆదోని నియోజకవర్గంలో ఏ పల్లైకె నా వెళ్లండి అధ్యక్షా ... అన్ని తలుపులకు తాళాలు వేసి ఉంటాయి, 2.62 లక్షల మంది ఓటర్లు ఉన్న ఆదోని నియోజకవర్గంలో లక్ష మంది వివిధ ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారు. సాగు, తాగు నీటికి ఇబ్బందే, పరిశ్రమలు లేవు ... ఇవన్ని మంత్రికి తెలుసా’ అని అసెంబ్లీలో కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యే డా.పార్థసారథి ప్రశ్నించారు. ఒక్క ఆదోని నియోజకవర్గంలోనే లక్ష మంది పనుల్లేక వలసలు వెళ్లారని ఎమ్మెల్యే డా.పార్థసారథి సాక్షాత్తు అసెంబ్లీలో ప్రస్తావించినా, నేటికి ప్రభుత్వం వలసలను నివారించే చర్యలను చేపట్టలేదు. వర్షాలతో కుదేలైన రైతాంగం నత్తనడకన పంట నష్ట పరిహారం ఎన్యుమరేషన్ ఉల్లి రైతుకు ప్రభుత్వం రూ.16.50 కోట్ల బకాయి అవసరానికి అందని శనగ విత్తనాలు వలసలతో ఖాళీ అయిన పశ్చిమ పల్లెలు నేడు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంనేడు జెడ్పీ సర్వసభ్య సమావేశం ... జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 24వ తేదిన ఉదయం 11 గంటలకు స్థానిక జెడ్పీ ప్రాంగణంలోని సమావేశ భవనంలో నిర్వహించనున్నారు. జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో ప్రధానంగా వ్యవసాయం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, మత్స్య శాఖ, దేవదాయ శాఖలపై సమీక్షించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఉదయం 10 గంటలకు జెడ్పీ కార్యాలయంలోని మినీ సమావేశ భవనంలో 1వ స్థాయీ సంఘ సమావేశాన్ని నిర్వహించనున్నారు. -
‘కూటమి’ కుట్రకు అధికారుల సహకారం
ఆదోని రూరల్: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ కుట్రకు అధికారుల సహకారం అందించి ఎంపీపీపై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని వీగిపోయేలా చేశారని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్ అన్నారు. దీనిపై తాము కోర్టుకు వెళ్తామని చెప్పారు. ఆదోనిలోని ఎంపీడీఓ కార్యాలయానికి గురువారం వెళ్లారు. అవిశ్వాస తీర్మానానికి సంబంధించి మినిట్స్ బుక్లో పేర్కొన్న తీర్మాన పత్రాన్ని ఇవ్వాలని బుధవారమే వైస్ ఎంపీపీ నరేంద్రరెడ్డి, ఇతర ఎంపీటీసీలు కోరగా ఎందుకు ఇవ్వలేదని ఎంపీడీఓ జనార్దన్ను ప్రశ్నించారు. అందుకు ఎంపీడీఓ జనార్ధన్ మాట్లాడుతూ.. ‘అవిశ్వాస తీర్మానానికి సంబంధించి నా పరిధిలో లేదని, ఇన్చార్జి సబ్కలెక్టర్ అజయ్కుమార్ పరిధిలో ఉందని, అందుచేత ఆయనే తీర్మాన మినిట్స్ అందించాల్సి ఉంది’ అన్నారు. వెంటనే సబ్కలెక్టర్ అజయ్కుమార్కు ఫోన్ చేసి మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి మాట్లాడారు. ‘అందుబాటులో లేనని, రేపు కూడా అందుబాటులో ఉండనని, శనివారం వచ్చి అందుకు సంబంధించిన వివరాలు ఇవ్వగలను’ అని సబ్ కలెక్టర్ తెలిపారు. చట్ట విరుద్ధంగా.. మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్ మాట్లాడుతూ.. బుధవారం జరిగిన అవిశ్వాస తీర్మానం పూర్తిగా చట్టానికి విరుద్ధంగా ఉందన్నారు. దీనిపై ఎంతటి న్యాయ పోరాటానికై నా సిద్ధంగా ఉన్నామన్నారు. 29 మంది ఎంపీటీసీ స్థానాలను పరిగణనలోకి తీసుకుని కోరం ప్రకారం 19 మంది ఉండాలని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 26 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరగ్గా, అందులో ఇద్దరు ఎంపీటీసీలు మృతిచెందగా, ఒకరు రాజీనామా చేశారన్నారు. ప్రస్తుతం ఉన్న 23 మంది ఎంపీటీసీలను పరిగణనలోకి తీసుకుని అవిశ్వాస తీర్మానం ఎన్నిక జరిపి ఉంటే 15 మంది ఎంపీటీసీలు ఉంటే నెగ్గేందుకు అవకాశం ఉండేదన్నారు. అందుకు వైఎస్సార్సీపీకి చెందిన 16 మంది ఎంపీటీసీలు హాజరైతే అధికారులు కూటమి ప్రభుత్వ కుట్రకు కొమ్ము కాసి వీగిపోయేలా చేశారని ఆరోపించారు. దీనిపై తాము కోర్టుకు వెళ్తామని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ లోకేశ్వరి, వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి చంద్రకాంత్రెడ్డి, న్యాయవాది జీవన్సింగ్ తదితరులు పాల్గొన్నారు. అవిశ్వాస తీర్మానాన్ని వీగిపోయేలా చేశారు న్యాయం కోసం కోర్టుకు వెళ్తాం మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్ -
‘గులాబీ’ పురుగు మరింత ఉద్ధృతి
● నివారణ చర్యలు చేపట్టండినంద్యాల(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఖరీఫ్ కింద సాగు చేసిన పత్తి పంటను గులాబీ రంగు పురుగు ఆశించినట్లు ఆర్ఏఆర్ఎస్ ఏడీఆర్ జాన్సన్, పత్తి విభాగ కీటక శాస్త్రవేత్త డాక్టర్ శివరామకృష్ణలు తెలిపారు. భీమవరం సమీపంలో సాగు అయిన పత్తి పంటను గురువారం డాక్టర్ శివరామకృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ.. పత్తి పంట సాగు అయి నేటికి 140 రోజులు అయ్యిందన్నారు. కాయ, పక్వ దశ నుంచి పత్తి తీత దశలో ఉందన్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో జరిపిన సర్వే ఆధారంగా పత్తి పైరును గులాబీ పురుగు ఆశించిందన్నారు. పురుగు ఉద్ధృతి రాబోయే మూడు నెలల్లో మరింతగా పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ ఉద్ధృతి అక్టోబర్ నెలలోనే ఆర్థిక నష్ట పరిమితి దాటినట్లు గుర్తించామన్నారు. రైతులు రాబోవు మూడు నెలల్లో తగిన యాజమాన్య పద్ధతులు చేపట్టి పురుగు ఉద్ధృతిని తగ్గించుకోవాలన్నారు. ముందుగా ఎకరాకు నాలుగు లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసి పురుగు ఉద్ధృతిని గుర్తించాలన్నారు. ప్రతి బుట్టలో వరుసగా మూడు రోజులు 8–10 పురుగులు పడిన వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. పురుగు సామూహిక నిర్మూలనకు ఎకరాకు 10–15 లింగాకర్షణ బుట్టలు ఉంచాలని, పురుగు ఆర్థిక నష్ట పరిమితి (ప్రతి బుట్టలో 8–10 పురుగులు మూడు రోజులు వరుసగా పడిన) దాటిన వెంటనే వేపనూనె 1500 పీపీఎం, 5మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. పదిరోజుల వ్యవధిలో వరుసగా ప్రొఫొనోపాస్, 20మి.లీ క్లోరో పైరీపాస్, 2.5మి.లీ పైరీడా లిల్, 1.5మి.లీ లీటరు నీటితో కలిపి మార్చిమార్చి పిచికారీ చేయాలన్నారు. పంట ఆఖరి దశలో బైఫ్రెన్త్రిన్, 2.0మి.లీ, పెంప్రోపత్రిన్, 2.0మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పంటను జనవరి నెల తర్వాత పొడిగించకూడదన్నారు. -
ఆర్జేడీ ఆకస్మిక తనిఖీ
చాగలమర్రి: విద్యా శాఖ ఆర్జేడీ శామ్యూల్ గురువారం చాగలమర్రిలోని జిల్లాపరిషత్ బాలుర, బాలికల ఉన్నత, కేజీబీవీ, జూనియర్ కళాశాలలను ఆకస్మికంగా తనిఖి చేశారు. ఆయా పాఠశాలలో ఉపాధ్యాయుల బోధన విధానాన్ని పరిశీలించారు. ఉపాధ్యాయులు విద్యార్థుల సామర్థ్యాన్ని పెంచే విధంగా సులభం అర్థమయ్యే పద్ధతిలో విద్యాబోధన చేపట్టాలని సూచించారు. విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం పోషకాలతో పాటు నాణ్యమైన భోజనాన్ని అందించే విధంగా ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా మెనూ ప్రకారం భోజనం అందించాలని, నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. ఆయన వెంట ఎంఈఓలు అనురాధ, న్యామతుల్లా, ప్రధానోపాధ్యాయులు జీవయ్య, శివలక్ష్మీ, ఎస్ఓ స్వప్న తదితరులున్నారు. కాగా నెల రోజుల క్రితం చాగలమర్రిలోని సెయింట్ఆన్స్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థిపై నాన్ టిచింగ్ స్టాఫ్ దాడి ఘటనపై ఆయన స్పందిస్తూ.. పాఠశాల యాజమాన్యానికి నోటీసులు ఇచ్చామన్నారు. విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామన్నారు. -
ఆలూరులో భారీ వర్షం
ఆలూరు రూరల్: అల్పపీడన ప్రభావంతో గురువారం ఆలూరులో కుండపోత వర్షం కురిసింది.దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. మధ్యా హ్నం 1 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏకధాటిగా వర్షం కురిసింది. వాగులు వంకలు పొంగిపొర్లాయి. పాత బస్టాండు సమీపంలోని జూనియ ర్ కళాశాల ముందు ఎల్లార్తి రోడ్డులోని ఫైర్ స్టేషన్ ఎదురుగా ఉన్న రహదారులు చెరువులను తలపించాయి. అలాగే మండలంలోని అన్ని గ్రామాల్లో వర్షం కురిసింది. హాలహర్వి: మండలంలో గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు కాలనీల్లోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. విరుపాపురం, బిలేహాల్, గూళ్యం, నిట్రవట్టి, బాపురం, పచ్చారపల్లి తదితర గ్రామాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లాయి. దీంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
పంటలకు మద్దతు ధర కల్పించాలి
నంద్యాల(అర్బన్): జిల్లాలో సాగు చేసిన మొక్కజొన్న, సోయాబిన్, సజ్జ పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వంగాల భరత్కుమార్రెడ్డి కోరారు. మార్కెట్లో క్వింటా మొక్కజొన్న రూ.1,800 మాత్రమే ధర పలుకుతుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని, మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకొనేలా ప్రభుత్వానికి తెలపాలని కోరుతూ బుధవారం జిల్లా కలెక్టర్ రాజకుమారి వినతి పత్రం ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో 1.59 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు అయ్యిందని, గత నెల రోజులుగా కోతలు జరుగుతూ పంట దిగుబడులు రైతుల ఇళ్లకు చేరుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ ద్వారా క్వింటాకు ప్రకటించిన రూ.2,400 ధరకు మార్కెట్లో రూ.600 తక్కువగా వస్తుందన్నారు. మొక్కజొన్న పంటను మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలన్నారు. అదే విధంగా సోయాబిన్ ఎంఎస్పీతో రూ.5,328గా ఉంటే మార్కెట్లో రూ.3,900 మాత్రమే కొనుగోలు జరుగుతుందన్నారు. సజ్జ ఎంఎస్పీతో క్వింటా రూ.2,775 మద్దతు ధరతో ఉంటే కేవలం రూ.1,900తోనే కొనుగోలు జరుగుతున్నాయన్నారు. అకాల వర్షాలతో అరకొర దిగుబడులు సాధించిన రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోవడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వం స్పందించి రైతులు సాగు చేసిన పంటలకు మద్దతు ధర కల్పించాలన్నారు. ఆయన వెంట నాయకులు శివరామయ్య, రామచంద్రారెడ్డి, దస్తగిరయ్య, వెంకటరంగడు, శ్రీనివాసులు, వెంకట నారాయణ తదితరులు ఉన్నారు. -
బాధితులకు పరిహారం త్వరితగతిన అందించాలి
కర్నూలు(సెంట్రల్): కోర్టుల ఆదేశాల మేరకు బాధితులకు త్వరగా పరిహారం ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్థి కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. బుధవారం జిల్లా న్యాయ సేవాసదన్లో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి ఆధ్వర్యంలో విక్టిమ్ కంపన్సేషన్, అండర్ ట్రయల్ రివ్యూ కమిటీ, హిట్ అండ్ రన్ కేసులు, అనాథ పిల్లలకు ఆధార్ కార్డుల మంజూరు, జిల్లా న్యాయ సేవాధికారసంస్థ అకౌంట్స్పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కర్నూలు, నంద్యాల, నారాయణపేట జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్థి మాట్లాడుతూ కర్నూలు, నంద్యాల జిల్లాల్లో హిట్ అండ్ రన్ కేసులను త్వరగా పరిష్కరించి బాధితులకు పరిహారాలు అందించాలని ఆదేశించారు. అండర్ ట్రయల్ రివ్యూ కమిటీలో భాగంగా జైలులో ఉన ఖైదీల విడుదలకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆధార్ కార్డులేని 125 మంది అనాథ బాలలను గుర్తించామని, అందులో 56 మందికి కార్డులు మంజూరు కాగా, మిగిలిన వారికి త్వరగా కార్డులు ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
ఇవీ కష్టాలు..
● కోవెలకుంట్ల మండలంలోని రేవనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న ఇద్దరు డాక్టర్లు సమ్మెలోకి వెళ్లడంతో నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న డాక్టరుకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఆ డాక్టర్ పీహెచ్సీకి చుట్టపు చూపుగా వెళ్తున్నారు. పీహెచ్సీకి వైద్యసేవలో నిమిత్తం రోజు 60 నుంచి 70 మంది రోజులు వస్తున్నారు. డాక్టర్ లేకపోవడంతో పీహెచ్సీలో పనిచేసే వైద్య సిబ్బంది రోగులకు వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ● సంజామల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు సమ్మెకు వెళ్లడంతో అక్కడ డాక్టర్ లేక రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పీహెచ్సీలో స్టాఫ్ నర్స్ మౌలాలి ఒక్కడే రోగులకు దిక్కు. ● కొలిమిగుండ్ల పీహెచ్సీలో ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు ఉండగా సమ్మెలో వెళ్లారు. రోజు 30 నుంచి 40 మంది ఓపీ వస్తుంటారు. డాక్టర్లు లేక పోవడంతో సిబ్బంది రోగులకు మందులు ఇచ్చి పంపుతున్నారు. ఎవరికీ ఇన్చార్జి ఇవ్వలేదు. ● బనగానపల్లె మండలంలోని పలుకూరు, టంగుటూరు గ్రామాలలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యం కోసం వచ్చే రోగులకు సరైన వైద్యం అందడం లేదు. ప్రతిరోజు 20 నుంచి 30 ఓపీలు జరుగుతున్నాయి. అక్కడికి బనగానపల్లె ఏరియా ఆసుపత్రి డాక్టర్కు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. డాక్టర్ బుధవారం హాజరు కాకపోవడంతో అక్కడ సిబ్బంది వైద్య సేవలు అందిస్తున్నారు. ● పాణ్యం మండలంలోని మద్దూరు పీహెచ్సీకీ వచ్చే రోగులకు సరైన వైద్యసేవలు అందటంలేదు. డాక్టర్లు లేక ఆసుపత్రికి వచ్చేవారికి సిబ్బంది మందులు ఇస్తున్నారు. ● నందికొట్కూరు పరిధిలోని మిడుతూరు, తలముడిపి, పాములపాడు పీహెచ్సీలలో అత్యవసరమైతే తప్ప వైద్యం అందని పరిస్థితి. ● గోస్పాడు, జిల్లెల్ల పీహెచ్సీలలో డాక్టర్లు లేక అక్కడికి వచ్చే రోగులకు పూర్తిస్థాయి వైద్యం కొరవడింది. తాత్కాలికంగా వైద్యులను నియమించినా ఇక్కడ మాత్రం ఎవరూ కనిపించడం లేదు. -
శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు ప్రారంభం
● తొలిరోజు పరమేశ్వరుడి దర్శనానికి పోటెత్తిన భక్తులుశ్రీశైలంటెంపుల్: పరమేశ్వరుడు కొలువైన శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీకమాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. బుధవారం నుంచి నవంబరు 21వ తేదీ వరకు కార్తీక మాసోత్సవాలు జరగనున్నాయి. కార్తీకమాసంలో శివుని ఆరాధనకు భక్తులు అసక్తి చూపుతారు. ఇందులో భాగంగా కార్తీకమాసం మొదటిరోజు శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాస్ట్రాల నుంచి సైతం భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి స్వామిఅమ్మవార్లను దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. వేకువజామునే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు స్వామిఅమ్మవార్ల దర్శనానికి బారులు తీరారు. ఆలయం ముందు గంగాధర మండపం వద్ద, ఆలయ ఉత్తర మాఢవీఽధిలో ఉసిరి చెట్ల కింద పలువురు భక్తుల దీపారాధన చేసుకుని, ప్రత్యేక నోములు చేశారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మారుమోగింది. క్షేత్ర పురవీధులన్ని కిటకిటలాడాయి. వెలిగిన ఆకాశదీపం శ్రీశైలం టెంపుల్: కార్తీకమాసోత్సవాలను పురస్కరించుకుని బుధవారం సాయంత్రం ఆలయ ప్రాంగాణంలోని ఆలయ ప్రధాన ధ్వజస్తంభం పైభాగంలో ఆకాశదీపం నెలకొల్పారు. కార్తీకమాసం ముగింపు వరకు ప్రతిరోజు ఈ దీపాన్ని వెలిగిస్తారు. ముందుగా అర్చకులు సంకల్పాన్ని పఠించి, మహాగణపతిపూజను చేశారు. అనంతరం దీపప్రజ్వలన, దీపారాధన జరిపించారు. కార్యక్రమంలో శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం
కర్నూలు(అర్బన్): గ్రామాల అభివృద్ధిలో సర్పంచులు, మండల పరిషత్ అధ్యక్షుల పాత్ర చాలా కీలకమని జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి అన్నారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ ప్రాంగణంలోని డీపీఆర్సీ భవనంలో కర్నూలు డివిజన్లోని సర్పంచులు, మండల పరిషత్ అధ్యక్షులకు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అనే అంశంపై రెండు రోజుల శిక్షణా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ముందుగా జాతిపిత మహాత్మాగాంధీ, భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి ఆధారంగానే దేశం అభివృద్ధి అంచనా వేస్తారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల భవన నిర్మాణాలు, పారిశుద్ధ్యం, రోడ్లు తదితర అభివృద్ధి కార్యక్రమాలన్ని క్షేత్ర స్థాయిలోని సర్పంచులు, ఎంపీపీల ఆధ్వర్యంలోనే కొనసాగుతాయన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే నిధులకు తోడుగా స్థానిక వనరులను పెంచుకోవాలన్నారు. అవసరమైన ప్రాంతాల్లో సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ) నిధుల ద్వారా సామాజిక అవసరాలను మెరుగు పరచుకోవాలన్నారు. జెడ్పీ సీఈఓ జి.నాసరరెడ్డి మాట్లాడుతూ గ్రామంలో మొదటి పౌరుడైన సర్పంచు గ్రామీణాభివృద్ధిలో ప్రధాన భూమిక పోషించాలన్నారు. గ్రామాలను ప్రగతి పథం వైపు నడిపించేందుకు ఈ శిక్షణా కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. గ్రామాల్లో పేదరికానికి దిగువన ఉన్న కుటుంబాలను గుర్తించి వారి జీవన ప్రమాణాలను మెరుగు పరచాలన్నారు. శిక్షణా కార్యక్రమంలో డీపీఆర్సీ కోఆర్డినేటర్ మంజులావాణి, ట్రైనింగ్ మేనేజర్ గిడ్డేష్, టీఓటీలు వి.జేమ్స్ కృపావరం, జి.నాగేష్, ఆస్రఫ్ బాషా, పి.జగన్నాథం పాల్గొన్నారు. -
● ప్రణాళిక బద్ధంగా క్యూలైన్ల నిర్వహణ ● మాసమంతా గర్భాలయ, సామూహిక అభిషేకాలు నిలుపుదల ● 14న కోటి దీపోత్సవం, 18న పాతాళగంగలో తెప్పోత్సవం
కార్తీక మాసోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని విస్తృత ఏర్పాట్లు చేశామని శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం దేవస్థాన పరిపాలన భవనంలోని సమీక్ష మందిరంలో డీఈఓ, పలు విభాగాల అధికారులు, ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు, అధ్యాపక తదితరులతో ఈఓ సమావేశాన్ని నిర్వహించారు. వివిధ అంశాలపై సమీక్షించిన ఆయన పలు ఆదేశాలు జారీ చేశారు. అలాగే కార్తీకమాసంలో ప్రతి సోమవారం, కార్తీక పౌర్ణమిన జరిగే లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి, జ్వాలాతోరణం, 31న జరిగే కృష్ణమ్మ హారతి, నవంబర్ 14న జరిగే కోటి దీపోత్సవం, 18న జరిగే తెప్పోత్సవం ఏర్పాట్లపై సమీక్షించారు. అనంతరం ఈఓ మాట్లాడుతూ కార్తీకమాసమంతా తెల్లవారుజామున 4.30 నుంచి రాత్రి 10.30 గంటల వరకు దర్శనాలు కొనసాగుతాయన్నారు. -
డీఏ అరియర్స్ విషయంలో ప్రభుత్వ తీరు సరికాదు
కర్నూలు(అగ్రికల్చర్): డీఏ అరియర్స్ విషయంలో ప్రభుత్వ తీరు ఏమాత్రం సరికాదని ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి జవహర్లాల్ అన్నారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఒక్క డీఏ విడుదల చేస్తూ జారీ చేసిన జీవో ఆర్టీ నెంబర్ల 60, 61పై ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు, పెన్షనర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. పెరిగిన డీఏ అక్టోబర్ నెల వేతనంతో కలిపి నవంబర్ నెలలో చెల్లిస్తారని, సంప్రదాయం ప్రకారం అరియర్స్ ఉద్యోగులకు జనరల్ ప్రావిడెండ్ ఫండ్ (జీపీఎఫ్), ఉపాధ్యాయులకు జిల్లా పరిషత్ ప్రావిడెండ్ ఫండ్(జెడ్పీపీఎఫ్)లో కలపాల్సి ఉందన్నారు. 2024 జనవరి నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ నెల వరకు 21 నెలల అరియర్స్ డీఏ ఆ విధంగానే కలుపుతార ని భావించామన్నారు. అయితే జీపీఎఫ్లో కాకుండా పదవీ విరమణ తర్వాత ఇస్తామని జీవోలో పేర్కొనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సర్వీస్లో ఉండి మరణించిన వారికి, పెన్షనర్లకు డీఏ అరియర్స్ 2027–28 నుంచి 12 విడతల్లో చెల్లిస్తామనడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. అభ్యంతరాలను ఇప్పటికే ఏపీ ఎన్జీవో అసోసియేషన్తో పాటు ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయన్నారు. త్వరలోనే జీవోల మా ర్పునకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. ఆయన వెంట జిల్లా నాయకులు సాంబశివారెడ్డి, భాస్కరనాయుడు, పి.రామకృష్ణారెడ్డి, ఆర్వీ రమణ, వ్యవసాయ ఉద్యోగుల సంఘం, వెటర్నరీ పారా సిబ్బంది సంఘం నేతలు శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు ఉన్నారు. -
పోలీసు అమరవీరుల సేవలు చిరస్మరణీయం
● జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల: ప్రజల శాంతిభద్రత పరిరక్షణలో ప్రాణాలు త్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి, మూడవ అదనపు జిల్లా న్యాయమూర్తి అమ్మన్నరాజు తదితరులు హాజరయ్యారు. ముందుగా పరేడ్ కమాండర్ జి. బాబు నుంచి జిల్లా కలెక్టర్, ఎస్పీ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల వివరాలను ఏఆర్ డీఏస్పీ శ్రీనివాసరావు చదివి వినిపించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో సైబర్ నేరాలను అరికట్టడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ను మరింత సమర్ధవంతంగా అమలు చేసి, పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారుల సమస్యలను ఓర్పుతో విని, పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ మాట్లాడుతూ.. పోలీసు ఉద్యోగం ఎంతో కష్టసాధ్యమైనదని, ప్రజల భద్రత కోసం నిరంతరం విధులు నిర్వహిస్తున్నారన్నారు. . స్వాతంత్య్రం తర్వాత దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు సిబ్బందిని స్మరించుకుంటూ, ఏటా అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. అమరవీరుల కుటుంబాల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందు ఉంటామని ఎస్పీ స్పష్టం చేశారు. మూడవ అదనపు జిల్లా న్యాయమూర్తి అమ్మన్నరాజు మాట్లాడుతూ.. విధి నిర్వహణలో అమరులైన పోలీసులను స్మరించుకోవడం, వారి కుటుంబ సభ్యులను సన్మానించడం అత్యంత గర్వించదగ్గ విషయమన్నారు. పోలీసులు సమాజ శాంతి–భద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. -
పోతిరెడ్డిపాడు నుంచి నీటి సరఫరా తగ్గింపు
జూపాడుబంగ్లా: పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ నుంచి ఎస్సారెమ్సీకి నీటి సరఫరాను తగ్గించినట్లు ఏఈ విష్ణువర్ధన్రెడ్డి తెలిపారు. మంగళ వారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో పోతిరెడ్డిపాడు వద్ద 880.30 అడుగుల నీటిమట్టం ఉందని, కాగా పలు చోట్ల వర్షాలు కురుస్తుండటంతో నీటి విడుదలను తగ్గించామన్నారు.హెడ్రెగ్యులేటర్ ఐదు గేట్లను 0.2 మీటర్ల మేర ఎత్తి 3వేల క్యూసెక్కులు, ఎన్సీఎల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం 2 వేల క్యూసెక్కుల నీటిని ఎస్సారెమ్సీ కాల్వలోకి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ నీటిని బానకచర్ల నీటినియంత్రణ వ్యవస్థ నుంచి తెలుగుగంగ కాల్వకు 4వేల క్యూసెక్కులు, కేసీ ఎస్కేప్ కాల్వ కు 500, జీఎన్ఎస్ఎస్(ఎస్సార్బీసీ) కాల్వకు 500క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నట్లు బానకచర్ల ఏఈ దేవేంద్ర తెలిపారు. ఆకాశదీపం వెలిగింది మహానంది: కార్తీకమాసం పురస్కరించుకుని మహానంది క్షేత్రంలో మంగళవారం రాత్రి ధ్వజస్తంభంపై ఆకాశదీపాన్ని వెలిగించారు. దీపగౌరి పూజల నిర్వ హించిన అనంతరం ధ్వజస్తంభం పైన ఆకాశ దీపం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వేదపండితులు రవిశంకర అవధాని మాట్లాడుతూ ఆకాశ దీపం దర్శనం ద్వారా మంచి ఆలోచనలు కలగడంతో పాటు శుభాలు చేకూరుతాయన్నారు. ఆకాశ మార్గాన ప్రయాణించే పితృదేవతలకు వైకుంఠానికి మార్గాన్ని శివకేశవులు చూపుతారని చెప్పారు. అందుకోసం ఆకాశ దీపాన్ని వెలిగించాలని కార్తీకపురాణంలో ఉందన్నారు. ఆకాశదీపం ద్వారా శివకేశవులు తమ తేజస్సును జగత్తుకు అందిస్తారన్నారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్లు అంబటి శశిధర్రెడ్డి, పి.సుబ్బారెడ్డి, అర్చకులు పాల్గొన్నారు. శ్రీరాముని జీవితం స్ఫూర్తిదాయకం జూపాడుబంగ్లా: శ్రీరాముని జీవితం మానవులకు స్ఫూర్తిదాయకమని తిరుమల తిరుపతి దేవస్థానం ఉమ్మడి కర్నూలు జిల్లా ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహకులు మల్లు వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని తూడిచెర్ల గ్రామంలోని శ్రీసీతారాముల వారి ఆలయంలో ధార్మిక ప్రవచనాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీరాముడు సూచించిన సత్యం, ధర్మం, జాలి, దయ, క్షమాగుణం, దాతృత్వం, వంటి సుగుణా లను అలవర్చుకోవాలని సూచించారు. అసూయను వీడి ఆపదలో ఉన్న వారికి సహా యం చేసే గుణాన్ని అలవర్చుకోవాలని తెలిపారు. అనంతరం భజనమండలి సభ్యులు రాము లవారి గీతాలు ఆలపించారు. కార్యక్రమంలో సర్పంచ్ బాలమద్దిలేటి, తితిదే ధర్మ ప్రచార మండలి సభ్యుడు రామచంద్రుడు, దొడ్డాసుధాకర్, రాము డు పాల్గొన్నారు. విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీయాలి కోవెలకుంట్ల: విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయాలని జిల్లా విద్యాధికారి జనార్దన్రెడ్డి ఉపాధ్యాయులకు సూచించారు. రాజ్యాంగ దినో త్సవాల్లో (కాన్ట్సిట్యూషన్ డే సెలబ్రేషన్స్) భాగంగా మంగళవారం కోవెలకుంట్ల ప్రభుత్వ ఉన్నత, బాలికోన్నత, గురుకుల పాఠశాల, మండలంలోని రేవనూరు, గుళ్లదూర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో 8, 9,10వ తరగతి విద్యార్థులకు వివిధ అంశాలపై వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. పోటీల్లో ప్రతి భ కనబరిచిన విద్యార్థుల్లో నియోజకర్గం నుంచి ఒకరిని ఎంపిక చేస్తామన్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 175 మందిని ఎంపిక చేసి మాక్ అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తారన్నారు. ఆయన వెంట డోన్ డిప్యూటీ డీఈఓ వెంకట్రామిరెడ్డి, ఎంఈఓ వెంకటసుబ్బయ్య, హెచ్ ఎంలు మల్లికార్జున, అరుణకుమారి, సౌభాగ్యలక్ష్మి, సుందరయ్య, ఓబులయ్య పాల్గొన్నారు. -
అద్దె పెంచి యజమానులను ఆదుకోవాలి
ప్రస్తుతం ఆర్టీసీ అద్దె బస్సుల నిర్వహణ యజమానులకు భారంగా మారింది. సీ్త్ర శక్తి పథకం అమల్లోకి వచ్చాక బస్సులు నడపడం ఇబ్బందిగా మారింది. ప్రయాణికులపట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తున్నా కొన్ని చోట్ల డ్రైవర్లపై దాడులు జరుగుతున్నాయి. దీనికి తోడు డీజిల్ మైలేజి షార్టేజీ వస్తుండటంతో యజమానులు నష్టాలు ఎదుర్కొవాల్సి వస్తోంది. ఆర్టీసీ చెల్లిస్తున్న అద్దె బస్సుల నిర్వహణకే సరిపోతున్నాయి. అద్దె పెంచి యజమానులను అన్ని విధాలా ఆదుకోవాలి. – సుధాకర్, సీఐటీయూ జిల్లా నాయకుడు -
మట్టిపై రాయల్టీ ఎత్తేయాలి
● ట్రాక్టర్ యజమానుల నిరసన బనగానపల్లె రూరల్: కూటమి ప్రభుత్వం మైనింగ్ రాయల్టీ వసూలు ప్రైవేట్ సంస్థకు అప్పగించడంతో మట్టిపై కూడా రాయల్టీ వసూలు చేస్తోంది. దీనిని నిరసిస్తూ మంగళవారం సాధుకొట్టం సమీపంలో ప్రైవేట్ సంస్థ ఏర్పాటు చేసిన చెక్పోస్టు వద్ద పలుట్రాక్టర్ యజమానులు ఆందోళనకు దిగారు. ట్రాక్టర్లను రోడ్డుకు అడ్డంగా పెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు ట్రాక్టర్ యజమానులు మాట్లాడుతూ.. జ్వాలాపురం గ్రామానికి చెందిన సుమారు 50 కుటుంబాలు తమ సొంత పొలాల్లో ఉన్న మట్టిని పాత మట్టి మిద్దెలకు తరలిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నామన్నారు. అయితే కొత్తగా రాయల్టీ పేరుతో మట్టిపై కూడా టన్నుకు రూ.90లు వసూలు చేస్తే ఎలా అంటూ ట్రాక్టర్ యజమానులు నిరసన వ్యక్తం చేశారు. తాము మట్టి తరలింపును నిలిపితే కూలీలు కూడా ఉపాధిని కోల్పోతారన్నారు. అధికారులు స్పందించి మట్టిపై రాయల్టీ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న బనగానపల్లె ఎస్ఐలు దుగ్గిరెడ్డి, కల్పన వెంటనే ధర్నా వద్దకు చేరుకుని ట్రాక్టర్ల యజమానులతో చర్చించి ఆందోళన విరమింపజేశారు. -
వేటగాళ్ల అడ్డ్డుకట్టకు త్రిముఖ వ్యూహం
ఆత్మకూరురూరల్: నల్లమలలో ఇప్పటికే వేటగాళ్ల ఉచ్చుకు అరుదైన వన్యప్రాణాలు ఎన్నో బలయ్యాయి. వాటిలో పెద్దపులులు కూడా ఉన్నాయి. ఇన్నాళ్లు చూసీ చూడనట్లు వ్యవహరించిన అధికారులు ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని వెలుగోడు నార్త్ బీట్లో నాలుగు రోజుల క్రితం జరిగిన ఘటనతో ఉలిక్కిపడ్డారు. వన్యప్రాణుల కోసం వేటగాళ్లు వేసిన విద్యుత్ తీగల ఉచ్చుకు ఏకంగా స్ట్రయికింగ్ ఫోర్స్లో పని చేస్తున్న ప్రొటెక్షన్ వాచర్ లక్ష్మణ్ నాయక్ బలి కావడంతో వేటగాళ్లకు చెక్ పెట్టేందుకు అటవీ అధికారులు రంగంలోకి దిగారు. వన్యప్రాణుల మాంసంతో వ్యాపారం చేస్తున్న వేటగాళ్లకు చెక్ పెట్టేందుకు తెరపైకి త్రిముఖ వ్యూహాన్ని తెచ్చినట్లు తెలుస్తోంది. అటవీ శాఖ, ఎక్సైజ్, పోలీసు శాఖలు సమన్వయంతో వన్యప్రాణుల వేటకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే జిల్లా ఎస్పీ, ఎన్ఎస్టీఆర్ ఫీల్డ్ డైరెక్టర్ కలసి ఈ విషయంపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. పోలీసు ఇంటెలిజెన్స్ సమాచారంతో అటవీ సమీప గ్రామాల్లో అక్రమ ఆయుధాలు కలిగిన వారి ఆచూకీ తెలుసుకుని, ఆ ఆయుధాలు సీజ్ చేయడం, వన్యప్రాణుల వేటకు ఒక ముసుగుగా, సహ వ్యాపారంగా ఉన్న నాటుసారా దందాపై ఉక్కుపాదం మోపడం, అటవీ శాఖ సిబ్బందిని పెంచి నిఘా కట్టుదిట్టం చేసే అంశాలపై ముందుకెళ్లేందుకు అధికారులు పకడ్బందీ ప్రణాళిక రూపొందించనున్నట్లు తెలిసింది. వేటగాళ్లు ఉచ్చుకు ప్రొటెక్షన్ వాచర్ మృతి చెందిన బానకచర్ల ప్రాంతంలో ఒక బేస్ క్యాంప్ను ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ ప్రాంతం నుంచి గతంలో ఒక పెద్ద పులి అడవి బయటకు వచ్చి వివిధ గ్రామాల పరిధిలో 25 కిమీ మేర సంచరించి తిరిగి అడవిలోకి వెళ్లినట్లు అధికారులు ట్రాక్ చేసి రికార్డు చేసిన విషయం తెలిసిందే. అంతే కాక ఇక్కడ గతంలో ఒక చిరుత పులి ఉచ్చులో చిక్కు కోగా దాన్ని రక్షించి అడవిలోకి పంపారు. ముఖ్యమైన రక్షిత వన్య ప్రాణులు సంచరించే ప్రాంతం కావడంతో ఈ ఏర్పాట్లకు అటవీ శాఖ సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. విద్యుత్ శాఖపై కేసులు అటవీ ప్రాంతాల్లో అనుమతి లేకుండా విద్యుత్ లైన్లను ఏర్పాటు చేసిన అంశాన్ని అటవీ శాఖ ఉన్నతాధికారు లు గుర్తించారు. లక్ష్మణ్ నాయక్ మృతి చెందిన ఘటన లో బానకచర్ల అటవీ ప్రాంతంలో ఉన్న విద్యుత్ లైన్లకు అనుమతులు లేవని అటవీ అధికారుల విచారణలో తేలింది. ఈ విషయంపై ఇప్పటికే విద్యుత్ అధికారులకు అటవీ శాఖ నుంచి నోటీసులు పంపారు. వెంటనే అనుమతి లేని విద్యుత్ లైన్లను తొలగించక పోతే కేసు లు నమోదు చేస్తామని హెచ్చరించినట్లు తెలుస్తోంది. పోలీసుల అదుపులో వేటగాళ్లు.. బానకచర్ల అటవీ ప్రాంతంలో విద్యుత్ ఉచ్చులు వేసి ప్రొటెక్షన్ వాచర్ మరణానికి కారణమైన వన్యప్రాణి వేటగాళ్లను ఆత్మకూరు రూరల్ సర్కిల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వశనీయ సమాచారం. మిడుతూరు మండలం తలముడిపికి చెందిన ఓ వ్యక్తితో పాటు మరో వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. తలముడిపికి చెందిన వేటగాడు వన్య ప్రాణుల వేటను జీవనోపాధిగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిందితుడు పెద్దగా అటవీ శాఖ నిఘా ఉండని ఎర్రమల ప్రాంతాల్లో అడవి పందులు, జింకలకు ఉచ్చులు వేసి మాంసం విక్రయిస్తూ వచ్చాడు. ఈ దందాను క్రమేపి నల్లమల ప్రాంతాలకు కూడా విస్తరించాడు. వెలుగోడు, ఆత్మకూరు, పాములపాడు మండలాలలోని కొందరు వ్యక్తులను కలుపుకుని ముఠాగా ఏర్పడి ఈ దందాను సాగిస్తున్నట్లు తెలిసింది. -
నాలుగు డీఏలు ఇవ్వాలి
కూటమి ప్రభుత్వంపై ఉద్యోగుల్లో వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులతోముఖ్యమంత్రి చంద్రబాబు చర్చలు జరుపడం హర్షణీయమే. కాని ఉద్యోగులు ఆశించిన రీతిలో డిమాండ్లకు ఆమోదం లభించలేదు. సరండర్ లీవ్లు ఒక్క పోలీసులకు మాత్రమే ఇస్తామనడం తగదు. ఇతర ఉద్యోగుల పరిస్థితి ఏమిటి? పోలీసులతో సమానంగా అందరికీ సరండర్ లీవ్లు మంజూరు చేయాలి. ఒక్క డీఏ మాత్రమే ఇవ్వడం దరదృష్టకరం. పెడింగ్లో ఉన్న నాలుగు డీఏలు ఇవ్వాలి. – సర్దార్ అబ్దుల్ హమీద్, ఆల్ ఇండియా డ్రైవర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు -
పీపీపీతో మెడికల్ కళాశాలలు బినామీలకు ధారాదత్తం
● జేబులు నింపుకునేందుకు కూటమి నేతల కుట్ర ● ఎమ్మెల్సీ ఇసాక్బాషా బొమ్మలసత్రం: ప్రభుత్వ మెడికల్ కళాశాలలను బినామీలకు ధారాదత్తం చేసేందుకు కూటమి నేతలు పీపీపీ విధానాన్ని తెరపైకి తెచ్చారని ఎమ్మెల్సీ ఇసాక్బాషా విమర్శించారు. స్థానిక కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. విద్య, వైద్య విధానాల్లో దేశంలోనే కనీవినీ ఎరుగని రీతిలో మార్పులు తీసుకొచ్చిన ఘనత ఒక్క వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో నూతనంగా 17 మెడికల్ కళాశాలల నిర్మాణం చేపట్టి ఐదు ప్రారంభించారన్నారు. పాడేరు లోని మెడికల్ కాలేజీ ఇటీవల ప్రారంభం కావడం సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం నిర్మా ణం పూర్తి దశ లో ఉన్న 11 మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం పీపీపీ విధానం ద్వారా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. జేబులు నింపుకునేందుకు కూటమి నేతలు బరితెగించారన్నారు. ఎన్నికల ముందు సంపద సృష్టిస్తామని చెప్పిన వారు నేడు సూపర్సిక్స్ను అమలు చేయాలంటే తమ వద్ద అంత సంపద లేదని చెబుతుండటం పేదలను మోసం చేయడమేనన్నారు. వివిధ దశల్లో ఉన్న 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు రూ. 5 వేల కోట్లు అవసరం ఉందని, ఆ నిధులను సమకూర్చకుండా ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టాలను కోవడం ఎంత వరకు సమంజసమన్నారు. పేదల కోసం తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందాకైనా పోరాడతారని, ప్రభుత్వ కళాశాలలను ప్రైవేటు పరం చేసినా వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేస్తారన్నారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంతో కూటమి ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామన్నారు. -
వివక్ష తగదు
ఉపాధ్యాయుల సరండర్ లీవ్ల బిల్లులు పెండింగ్లోనే ఉండిపోయాయి. వాటిపైన ప్రతి ఏడాది ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారు. అయినప్పటికీ వారి ఖాతాల్లో ఇంతవరకు సరండర్ లీవ్స్ మొత్తం కెడ్రిట్ కాలేదు. పోలీసులకు విడతల వారీగా సరండర్ లీవ్ బకాయిలు చెల్లిస్తామని ప్రకటించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా ప్రభుత్వం ఉచిత పథకాలకు నిధులు ఖర్చు చేస్తున్న విధంగానే ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులకు పెండింగ్ బకాయిలను ఇవ్వాల్సిందే. – కరుణానిధి మూర్తి, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు -
నీ వెంటే నేను..
● భార్య మృతి చెందిన గంటలోనే భర్త మరణం ● ఒకే రోజు వృద్ధ దంపతుల మృతి ప్యాపిలి: దాదాపు ఆరు దశాబ్దాల పాటు కష్టసుఖాల్లో ఒకరినొకరు తోడుగా నిలిచారు. వృద్ధాప్యంలో సైతం అన్యోన్యంగా ఉంటూ కాలం వెళ్లదీశారు. మరణం సైతం వీరిని వీడయలేదు. నీ వెంటే నేనంటూ గంటల వ్యవధిలో ఇద్దరు తనవు చాలించారు. ఈ విషాద ఘటన ఆదివారం ప్యాపిలిలో చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన అరవేటి లక్ష్మీనారాయణ (90), వెంకటలక్ష్మమ్మ (77) దంపతులు అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం మృతి చెందారు. వీరికి నలుగురు కుమారులు సంతానం కాగా వారిలో ఇద్దరు కుమారులు కొద్ది సంవత్సరాల క్రితం మృతి చెందారు. ఒక కుమారుడు ఉద్యోగరీత్యా బెంగళూరులో స్థిరపడ్డాడు. మూడో కుమారుడు సతీశ్ తల్లిదండ్రులతో కలసి ప్యాపిలిలో ఉంటున్నాడు. కొంతకాలంగా లక్ష్మీనారాయణ, వెంకటలక్ష్మమ్మలు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. భర్త లక్ష్మీనారాయణకు సపర్యలు చేస్తూ అతనికి చేదోడువాదోడుగా ఉంటున్న భార్య వెంకటలక్ష్మమ్మ ఆదివారం ఉదయం 6 గంటలకు మృతి చెందారు. విషయం తెలిసిన భర్త లక్ష్మీనారాయణ తీవ్ర మనస్తాపానికి గురై 10.30 గంటల సమయంలో మృతి చెందారు. అరవేటి లక్ష్మీనారాయణ నంద్యాల, నందికొట్కూ రు, మద్దికెర తదితర ప్రాంతాల్లో లైబ్రేరియన్గా పని చేసి 1993లో పదవీ విరమణ పొందారు. ఒకే రోజు భార్యాభర్తలు గంటల వ్యవధిలో మృతి చెందడంతో స్థానికంగా విషాదం నెలకొంది. -
జీఎస్టీ 2.0పై విస్తృత అవగాహన
● డిప్యూటీ కమిషనర్ మురళీ మనోహర్ నంద్యాల: జిల్లాలో జీఎస్టీ 2.0 (సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్) సంస్కరణలపై నెల రోజుల పాటు ప్రజల్లో విస్తృతతంగా అవగాహన కల్పించాలని వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్, నోడల్ అధికారి మురళీ మనోహర్ అన్నారు. ఆదివారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జీఎస్టీ 2.0 (ఉత్సవ్) అవగాహన కార్యక్రమాల ముగింపు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ రాజకుమారి, జేసీ కొల్ల బత్తుల కార్తీక్ మార్గదర్శకత్వంలో జిల్లాలోని అన్ని విభాగాల సహకారంతో జీఎస్టీ 2.0పై అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. జీఎస్టీ సంస్కరణలు వ్యాపారులు, వినియోగదారుల మధ్య సులభమైన పన్ను విధానం, పారదర్శకతను తీసుకురావడమే లక్ష్యమని వివరించా రు. గతంలో ఉన్న నాలుగు జీఎస్టీ స్లాబ్లు (5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం)ను సంక్షిప్త పరిచి రెండు స్లాబ్లుగా మార్చడం, కొన్ని వస్తువులపై పన్ను పూర్తిగా తొలగించడం వంటి కీలక మార్పులను ప్రజల కు సులభంగా అర్థమయ్యే విధంగా వివరించామని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ శేషన్న మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సెప్టెంబర్ 22వ తేదీ నుం,ఇ అమలు చేస్తున్న కొత్త జీఎస్టీ విధానం వల్ల నిత్యావసర వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలపై పన్ను తగ్గింపుతో ప్రజలకు నేరుగా లాభాలు కలుగుతున్నా యని వివరించారు. ప్రజలలో పన్నుల అవగాహన పెరగడంతో మార్కెట్లో పారదర్శకత, వినియోగదారుల విశ్వాసం పెరుగుతుందన్నారు. అంతకుముందు డీఈఓ జనార్దన్రెడ్డి ఆధ్వర్యంలో సాంస్కృతిక, జీఎస్టీ అంశంపై విద్యార్థులు ప్రదర్శనలు ఇచ్చారు. -
ఉద్యమం ఆగదు
డిమాండ్లను సాధించుకునేందుకు మొదట ఉద్యమాన్ని లేవదీసింది ఉపాధ్యాయ సంఘాలే. ఎట్టకేలకు 16 నెలల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల నేతలతో చర్చలు జరుపడటం సంతోషాన్ని ఇచ్చింది. అయితే చర్చలు మాకు సంతృప్తిని ఇవ్వలేదు. ముఖ్యమంత్రితో చర్చలంటే దాదాపు అన్ని డిమాండ్లకు పరిష్కారం లభించాలి. నాలుగు డీఏలు పెండింగ్లో ఉండగా.. కేవలం ఒక్క డీఏ మాత్రమే ఇవ్వడం తీవ్ర నిరాశను మిగిల్చింది. 12వ పీఆర్సీ లేదు. ఐఆర్ ఊసే లేదు. ముఖ్యమంత్రితో జరిపిన చర్చలు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉంది. పీఆర్సీ, ఐఆర్ సాధించుకునేందుకు మా ఉద్యమం ఆగదు. – హృదయరాజు, ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కేవలం ఒక్క డీఏకు ఉద్యోగ సంఘాల నేతలు సంబరపడుతుండటం చూస్తుంటే బాధ కలుగుతోంది. ప్రభుత్వంతో కోట్లాది రూపాయల విలువ చేసి డిమాండ్లు సాధించుకున్నాం అన్నట్లుగా ఉద్యోగ సంఘాలు గొప్ప స్టేట్మెంట్లు ఇస్తుండటం దారుణం. ఒక్క డీఏతో సంబరపడిపోతూ.. ఈ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులంతా సంతోషంగా ఉన్నారనే విధంగా ప్రకటనలు ఇస్తుండటం చూస్తే బాధేస్తోంది. ఇప్పటికై నా మిగిలిన మూడు డీఏలు, పీఆర్సీ, ఐఆర్ ఇతర డిమాండ్లు సాధించుకోవడానికి ఉద్యమించాల్సిన అవసరం ఉంది. – గిరికుమార్రెడ్డి, మాజీ అధ్యక్షుడు, ఉమ్మడి జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం, కర్నూలు ● -
జగతికి నాగరికత నేర్పిందే అమ్మ!
కర్నూలు కల్చరల్: ‘జగతికి నాగరికత నేర్పింది అమ్మ. అమ్మ చరితం పొగడటం ఎవరి తరం కాదు’ అని పలువురు సాహితీ వేత్తలు అభిప్రాయపడ్డారు. సాహితీ సదస్సు, నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం మద్దూరు నగర్లోని పింగళి సూరన తెలుగు తోటలో ప్రముఖ పద్య కవి, రాష్ట్ర పతి అవార్డు గ్రహీత చేగిరెడ్డి చంద్రశేఖర రెడ్డి రచించిన ‘మాతృ దర్శనం’ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. సాహితీ సదస్సు అధ్యక్షులు కురాడి చంద్రశేఖర కల్కూరా, తెలుగు భాష వికాస ఉద్యమం కార్యదర్శి జేఎస్ఆర్కే శర్మ పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. భారతీయ సాహిత్యంలో ఇప్పటి వరకు అమ్మపై ఎంత మంది కవులు కవిత్వ రాసినా అంది నిత్య నూతనంగానే ఉంటుందన్నారు. తెలుగు ఉపాధ్యాయురాలు డాక్టర్ కె.చంద్రమౌళిని, తెలుగు అధ్యాపకురాలు డాక్టర్ దండెబోయిన పార్వతీదేవి పుస్తక సమీక్ష చేశారు. అనంతరం రచయిత కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు. నరసం అధ్యక్షరాలు సుబ్బలక్ష్మమ్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సాహితీ వేత్తలు పోత న్న, వెంకట కృష్ణ, మారుతి, గౌరెడ్డి హరిశ్చంద్రారెడ్డి, బసరావరాజు, మధుసూ దన శర్మ, శ్రీనివాసమూర్తి, డాక్టర్ హరికిషన్, ఎస్డీవీ అజీజ్ పాల్గొన్నారు. -
బ్రహ్మనందీశ్వర ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజన సేవ
నంద్యాల(వ్యవసాయం): కార్తీక మాసాన్ని పురస్కరించుకొని పట్టణంలోని కోటా వీధిలో వెలసిన శ్రీబ్రహ్మనందీశ్వరస్వామి దేవస్థానంలో మన ఊరు–మన గుడి, మన బాధ్యత సభ్యులు కోయిల్ ఆల్వార్ తిరుమంజన సేవ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఆలయ పరిసరాల్లో చెత్తా చెదారం, పిచ్చి మొక్కలను తొలగించడంతో పాటు ఆలయ గోపురాలను శు భ్ర పరిచారు. ఈ సందర్భంగా నిర్వాహకులు గుంటూరు ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్స్పెక్టర్ శివకుమార్రెడ్డి మాట్లాడుతూ 100 మందికి పైగా సభ్యులచే గుడిని శుభ్రం చేయడం జరిగిందన్నారు. అదే విధంగా పాత బడిన దేవుళ్ల ఫొటోలను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా తమ సభ్యులకు అందజేస్తే తాము వాటిని విసర్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో హరికృష్ణ, డాక్టర్ కార్తీకమ్మ, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. -
సీమ సాగునీటి హక్కుల పరిరక్షణే ధ్యేయం
● 24న నంద్యాలలో భారీ సభ ● సాగునీటి సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి నంద్యాల(అర్బన్): సీమ సాగునీటి హక్కుల పరిరక్షణే రాయలసీమ సాగునీటి సాధన సమితి ధ్యేయ మని ఆ సమితి రాష్ట్ర అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు. రాయలసీమ నీటి హక్కులను రక్షించడం, సీమకు న్యాయం జరిగేలా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈనెల 24న పట్టణంలోని మున్సిపల్ టౌన్హాల్లో భారీ సభ నిర్వహిస్తున్నామన్నారు. స్థానిక సమితి కార్యాలయంలో ఆదివారం సమితి సభ్యులతో కలిసి సభ పాంప్లేట్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కోసం సీమ రైతులు 60 వేల ఎకరాలు త్యాగం చేసినప్పటికీ ప్రాజెక్టు రూపకల్పనలో సీమ ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. అన్యాయాన్ని సరిదిద్దేందుకు నాలుగు దశాబ్దాల క్రితం ఎస్సార్బీసీ, హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగుగంగ ప్రాజెక్టుల నిర్మాణం జరిగిందన్నారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా సుమారు 3 లక్షల ఎకరాలను భూ సేకరణ ద్వారా రైతులు త్యాగం చేశారని, వాటి ద్వారా సీమలోని 14 లక్షల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉన్నప్పటికీ కేవలం 2 లక్షల ఎకరాలకు మాత్రమే కాల్వల ద్వారా నీరు అందుతుందన్నారు. మరో 2 లక్షల ఎకరాలకు రైతులు ఇంజిన్ల సాయంతో నీరు తోడుకోవాల్సి వస్తుందన్నారు. మిగిలిన 10 లక్షల ఎకరాల రైతులు నీటి చుక్క కోసం ఆకాశం వైపు చూస్తున్నారన్నారు. ప్రాజెక్టుల నిర్మాణాల్లో పెండింగ్లో ఉన్న 5 నుంచి 10 శాతం పనులు పూర్తి చేస్తే మొత్తం ఆయకట్టుకు నీరు అందించే అవకాశం ఉందన్నారు. కుందూనది విస్తరణ పేరుతో కొత్త భూసేకరణలు చేయడం అన్యాయమన్నారు. 24న నిర్వహించే సభకు ఆంధ్ర ఉద్యమాల ఐక్యవేదిక నాయకులు వడ్డె మహదేవ్, చైర్మన్ వడ్డె శోభానాద్రీశ్వరరావుతో పాటు కోస్తాంద్ర, ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజా సంఘాల నాయకులు పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షుడు వైఎన్రెడ్డి, ఏర్వ రామచంద్రారెడ్డి, వెంకటేశ్వరనాయుడు, మహేశ్వరరెడ్డి, సుధాకర్రావు, భాస్కరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పేలుతున్న టపాసుల ధరలు!
కర్నూలు(సెంట్రల్): బాణాసంచా ధరలు విపరీతంగా పెరిగాయి. ఏ రకం టపాసులను ముట్టుకున్నా షాక్ కొడుతున్నంత పని అవుతోంది. దీంతో దీపావళి పర్వదినాన పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు అటువైపు చూడాలంటే భయపడాల్సి వస్తోంది. కనీసంగా రూ.5 వేల వరకు క్రాకర్స్ కోసమే ఖర్చు చేయాల్సి వస్తుండడంతో అయోమయంలో ఉన్నారు. స్థానికంగా రేట్లు పెంచి.. దీపావళి పండుగ రోజున నరకాశుని వధ కోసం బాణాసంచాను పేల్చి సంబరాలు చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో బాణాసంచాను కుటుంబ సభ్యులందరూ ఒకచోటా చేరి పేల్చడం పారిపాటైంది. ఈ క్రమంలో ప్రజలకు అవసరమైన బాణాసంచాను అందుబాటులో ఉంచేందుకు 86 ఏళ్ల నుంచి ప్రభుత్వ పర్యవేక్షణలో క్రాకర్స్ మర్చంట్ అసోసియేషన్ స్టాళ్లను ఏర్పాటు చేస్తోంది. కర్నూలు, పత్తికొండ, ఆదోనిలలో ప్రజలకు అనువైన చోటా స్టాళ్లను ఏర్పాటు చేసి బాణాసంచాను పరిమితమైన రేట్లకు ఉంచుతున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది కర్నూలులో 100, ఆదోనిలో 15, పత్తికొండలో 4 బాణాసంచా స్టాళ్లను ఏర్పాటుచేశారు. గతేడాదితో పోల్చుకుంటే ఆయా పట్టణాల్లో స్టాళ్ల సంఖ్యను పెంచారు. ఇదేక్రమంలో స్టాళ్లలో బాణాసంచా రేట్లను కూడా విపరీతంగా పెంచడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గతేడాదితో పోల్చుకుంటే ఏకంగా 25 శాతం వరకు రేట్లు పెరిగినట్లు వినియోగదారులు చెబుతున్నారు. దీంతో ఒక్కో కుటుంబంపై దాదాపు 3–5 వేల వరకు అదనపు భారం పడుతోంది. మరోవైపు స్థానిక క్రాకర్స్ మర్చంట్ ప్రోద్బలంతోనే రేట్లు పెంచి అముతున్నట్లు చెబుతున్నారు. ఈ స్టాళ్లలో షాపు ఏర్పాటు చేసుకోవాలంటే అసోసియేషన్కు రూ.20 వేలు, జీఎస్టీ పేరిట రూ.20 వేలు, మునిసిపాలిటీకి రూ.5 వేలు, అదనపు ఖర్చుల కింద రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆయా డబ్బులతోపాటు పెట్టుబడి, నాలుగు రోజుల నిర్వహణ ఖర్చులు, లాభాల కోసం రేట్లను పెంచి అమ్ముతున్నట్లు తెలుస్తోంది. కాగా, షాపుల్లో మాత్రం 80–90 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నా వినియోగదారుడికి మాత్రం రేట్లు తగ్గడంలేదు. వ్యాపారాలు తగ్గాయంటున్న వ్యాపారులు మరోవైపు తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయన్న ఆశతో అసోసియేషన్కు రూ.46 వేలు కట్టి స్టాల్ను ఏర్పాటు చేసిన వ్యాపారాలు జరగడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. కర్నూలుకు సమీపంలోని వెల్దుర్తిలో క్రాకర్స్ తయారీ కేంద్రం ఉండడంతో వినియోగదారులతోపాటు వ్యాపా రులు అక్కడికి వెళ్లి తెచ్చుకుంటున్నారు. దీంతో ఇక్కడ కంటే అక్కడే తక్కువ బాణాసంచా విక్రయాలు జరుగుతుండడంతో అక్కడే వెళ్లి తెచ్చుకుంటున్నారని, ఫలితంగా ఇక్కడ వ్యాపారాలు తగ్గినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో స్టాళ్లు ఏర్పాటు చేసుకున్న వారు కనీసం అసోసియేషన్కు చెల్లించినా డబ్బులైనా వస్తాయా లేదా అన్న మీమాంసలో ఉన్నారు. గ్రీన్కాకర్స్ను మాత్రమే కాల్చాలిజాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు దీపావళి రోజున గ్రీన్ క్రాకర్స్ను మాత్రమే కాల్చేలా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాళ్లలో గ్రీన్ కాకర్స్ను మాత్రమే అమ్మేలా వ్యాపారులకు నిర్దేశం చేశారు. ఈ మేరకు కలెక్టరు, ఎస్పీ, జిల్లా అగ్నిమాపక అఽధికారి, ఆర్డీఓలు, కాలుష్య నియంత్రణ మండలి, మునిసిపల్ అధికారులు బాణసంచా వ్యాపారులతో సమావేశాలను నిర్వహించుకొని ప్రభుత్వం రూపొందించిన నియమ, నిబంధనలను కచ్చితంగా పాటించాలని, నిబంధనలను అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. పండుగరోజున రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య బాణసంచాను పేల్చాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు. జీఎస్టీ తగ్గినా రేట్లు అధికమే కనీసం రూ.5 వేలు వెచ్చించాల్సి వస్తోందని ప్రజల ఆవేదన విపరీతమైన ధరలతో వేడుకలకు దూరంగా పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు -
ఆలయ నిర్మాణానికి ఆదోని మాజీ ఎమ్మెల్యే విరాళం
ఆదోని రూరల్: మండలంలోని గణేకల్ గ్రామంలో ఉన్న బంగారమ్మవ్వ దేవాలయ నిర్మాణానికి ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి రూ.1,01,000 విరాళంగా ఆలయ కమిటీ సభ్యులకు ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అవ్వవారి ఆలయ అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. ఆలయ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేకు గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. దేవత ఆశీస్సులు సాయిప్రసాద్రెడ్డిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు ధర్మయ్య, ఉచ్చీరప్ప, లక్ష్మయ్య, గోపాల్, చిన్న ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు. యువత దేశభక్తిని పెంపొందించుకోవాలి కర్నూలు(అర్బన్): యువత దేశభక్తిని పెంపొందించుకోవాలని తులసీ గ్రూప్ చైర్మన్ తులసీ రామచంద్ర ప్రభు అన్నారు. ఆదివారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ భవనంలో రాయల అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్, శ్రీ కృష్ణదేవరాయ ఎయిడ్ ఫర్ పూర్ అండ్ అండర్ ప్రివిలైజ్డ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద బలిజ విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బలిజ సంఘం జిల్లా అధ్యక్షులు కోనేటి చంద్రబాబు, మాజీ అధ్యక్షులు యర్రంశెట్టి నారాయణ రెడ్డి, రోపా అధ్యక్షులు చింతలపల్లి రామక్రిష్ణ, ప్రధాన కార్యదర్శి కోనేటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం అందిస్తున్న స్కాలర్షిప్స్ ఉన్నత చదువులకు తోడ్పాటును అందిస్తుందన్నారు. బలిజ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి తాము ఎంచుకున్న రంగాల్లో రాణించాలన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి 180 మంది విద్యార్థినీ, విద్యార్థులకు రూ.9 లక్షలను స్కాలర్షిప్స్ రూపంలో అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గౌరు జనార్దన్రెడ్డి, కొట్టే చెన్నయ్య, బాలరాజు, భాస్కర్బాబు, మల్లికార్జునమూర్తి, మలిశెట్టి దివాకర్, గాండ్ల లక్ష్మన్న, మండ్లెం రవి, సింగంశెట్టి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. 22 నుంచి బస్సుయాత్ర ఆదోని సెంట్రల్: విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఈ నెల 22వ తేదీ నుంచి నవంబర్ 12వ తేదీ వరకు ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు బస్సుయాత్ర చేపడుతున్నట్లు ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షాబీర్ బాషా, నిర్మాణ బాధ్యులు గిడ్డయ్య తెలిపారు. ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆదోని పట్టణంలోని ఏఐవైఎఫ్ కార్యాలయంలో ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంవగా వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభు త్వం పీపీపీ విధానం పేరుతో మెడికల్ కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే ఆలోచనను తక్షణమే విరమించుకోవాలన్నారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్ బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. ఏఐఎస్ఎఫ్ జిలా ఆఫీస్ బేరర్స్ శరత్ కుమార్, రంగస్వామి, థామస్, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు. రైతు అదృశ్యం బండి ఆత్మకూరు: కడమల కాలువ గ్రామానికి చెందిన ఓ రైతు పొలానికి వెళ్లి ఇంటికి తిరిగి రాలేదని ఎస్ఐ జగన్మోహన్ ఆదివారం తెలిపారు. గ్రామానికి చెందిన చాకలి పెద్ద వెంకటేశ్వర్లు (57) శనివారం సాయంత్రం పొలం దగ్గరకు వెళ్తున్నానని ఇంటిలో చెప్పి తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు చుట్టు చుట్టు పక్కల, బంధువుల వద్ద గాలించినా ఆచూకీ లభించలేదు. అతని కుమారుడు చాకలి సురేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ తెలిపారు. -
టపా‘కాసులు’.. బాణా‘సంచు’లు
దీపావళి పర్వదినం ఆనందంగా జరుపుకునేందుకు నగర ప్రజలు సిద్ధమయ్యారు. పండుగకు రెండు రోజుల ముందు నుంచే బాణాసంచా కొనుగోలు చేస్తున్నారు. స్థానిక ఎస్టీబీసీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన క్రాకర్స్ దుకాణాలు రద్దీగా కనిపిస్తున్నాయి. చిన్నారులు, పెద్దలు ఆసక్తిగా రకరకాల టపాసులు కొనుగోలు చేస్తున్నారు. రేట్లు అధికంగా ఉన్నాయంటూనే కొందరు సంచులు, బ్యాగులు నింపుకుని వెళ్తున్నారు. కాగా మైదానంలో బాణాసంచా విక్రయాల సమయంలో పాటించాల్సిన నిబంధనలను వ్యాపారులు బేఖాతరు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు పండగ -
27 నుంచి ‘రాయలసీమ’ కార్మికుల రిలే దీక్షలు
ఆదోని సెంట్రల్: సమస్యల పరిష్కారానికి రాయలసీమ స్పిన్నింగ్ మిల్ కార్మికులు ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు రిలే నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్టీయూ) జిల్లా కార్యదర్శి వెంకప్ప తెలిపారు. ఆదోని రాయలసీమ మిల్లు కార్మికుల జనరల్ బాడీ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిల్లు మూతపడి 25 సంవత్సరాలు అవుతున్నారు 150 మంది కార్మికులకు పీఎఫ్, పెన్షన్ రాలేదన్నారు. సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే పార్థసారథి దృష్టికి తీసుకొని వెళ్లినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఏఐకేఎంఎస్ ప్రధాన కార్యదర్శి మల్లికార్జున, ఐఎఫ్టీయూ నాయకుడు నారాయణ, కార్మికులు కుమార్, మల్లికార్జున, రెడ్డి, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి దశలవారీగా పోరాటం కర్నూలు(సెంట్రల్): విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల కోసం దశల వారీగా ఉద్యమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎండీ అంజిబాబు, పీఎస్ రాధాకృష్ణ, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు బి.నాగరాజు తెలిపారు. ఆదివారం కార్మిక, కర్షక భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ ఉద్యోగులతో ప్రభుత్వం జరిపిన చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదన్నారు. కాంట్రాక్ట్ కార్మికులను ప్రభుత్వంలోకి తీసుకోవాలంటే మిన్నకుండిపోవడం అన్యాయమన్నారు. gê¡Ä¶æ$ çÙ*sìæ…VŠæ ´ùsîæ-ÌSMýS$ MýSÆý‡*²Ë$ }MýSÆŠæలు కర్నూలుటౌన్: జాతీయ స్థాయి రైఫిల్ షూటింగ్ పోటీలకు కర్నూలు షూటర్ శ్రీకర్ ఎంపికయ్యారు. ఈ మేరకు జిల్లా రైఫిల్ షూటింగ్ సంఘం కార్యదర్శి ఎండీ బాషా ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేరళ రాష్ట్రం త్రివేండ్రంలో నిర్వహించిన 16వ సౌత్జోన్ స్థాయి రైఫిల్ షూటింగ్ చాంపియన్షిప్ పోటీల్లో కర్నూలు షూటర్ శ్రీకర్ ప్రతిభ చూపారని తెలిపారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో 400 పాయింట్లకు 350 పాయింట్లు సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు చెప్పారు. -
పత్రికా స్వేచ్ఛపై దాడి హేయం
పత్రికా స్వేచ్ఛపై కూటమి ప్రభుత్వం దాడులు చేయడం హేయం. సాక్షి ఎడిటర్పై, ఇతర జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించడం మంచి పద్ధతి కాదు. ప్రభుత్వాలను మార్చే శక్తి అక్షరానికి ఉన్నదని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంలా ఉన్న పత్రికా రంగంపై ఇలా దాడులు చేయడం, కేసులు నమోదు చేయడం మంచి పద్ధతి కాదు. జర్నలిస్టులు వారు చూస్తున్న, జరుగుతున్న అన్యాయాలను పత్రికా ముఖంగా వెలుగులోకి తెస్తారు. దీన్ని తప్పుగా భావించి కేసులు పెట్టడం సరికాదు. – జనార్దన్రెడ్డి, సీనియర్ పాత్రికేయులు, నంద్యాల నకిలీ మద్యంపై కథనాలు రాసిన జర్నలిస్టులు నోటీసులు ఇవ్వడం కక్ష సాధింపు చర్యలో భాగమే. స్వేచ్ఛగా జర్నలిస్టులు వార్తలు రాస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది. అవినీతి, అక్రమాలను ప్రశ్నించే జర్నలిస్టులకు సంకెళ్లు వేయాలనుకోవడం అవివేకం. అక్రమ మద్యంపై కథనాలు రాసిన జర్నలిస్టులపై కేసులు బనాయించడం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడటమే. –బోయ పులికొండన్న, ఎంవీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు, నంద్యాల -
జీఎస్టీ తుస్.. డిప్ ‘ధనా’ధన్!
● టపాసుల అంగళ్ల ఏర్పాటుకు కొత్తగా డిప్ పద్ధతి ● నంద్యాలలో 63 షాపులకు రూ.29.61లక్షల వసూలు నంద్యాల(అర్బన్): జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) తగ్గిందని కేంద్ర ప్రభుత్వం ఓ వైపు చెబుతున్నా.. రాష్ట్రంలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. గతేడాది కంటే ఈ ఏడాది టపాసుల అంగళ్ల ఏర్పాటుకు అధిక మొత్తాలను వసూలు చేస్తున్నారు. ఇదంతా దారుణం అని షాపుల యజమానులు వాపోతున్నారు. ప్రభుత్వ నిర్ణయం ఇలా.. రెవెన్యూ, పోలీసులు, మున్సిపల్, ఫైర్, విద్యుత్ తదితర శాఖల నుంచి ఎన్ఓసీ(నో అబ్జెక్షన్ సర్టిఫికెట్)తో పాటు రూ.500 చలానా చెల్లిస్తే ఆర్డీఓ కార్యాలయంలో డిప్ పద్ధతి ద్వారా టపాసుల స్టాల్స్ ఏర్పాటు చేసుకోవచ్చు అనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. నంద్యాల పట్టణంలోని ఎస్పీజీ గ్రౌండ్లో 63 స్టాల్స్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఇందు కోసం ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించాల్సిన స్టాల్స్ ఏర్పాటు డిప్ సిస్టమ్ను కొన్ని కారణాల వల్ల తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించారు. ఇందు కోసం ఉదయం 10గంటల నుంచి స్టాల్స్ ఏర్పాటు దారులు డిప్ సిస్టమ్ కోసం నిరీక్షించాల్సి వచ్చింది. ఎట్టకేలకు సాయంత్రం 5.30గంటలకు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, అర్బన్ తహసీల్దార్ శ్రీనివాసులుల ఆధ్వర్యంలో 62 స్టాల్స్ ఏర్పాటుకు డిప్ సిస్టమ్ను నిర్వహించారు. వసూళ్లు ఇలా.. ఎన్ఓసీ సర్టిఫికెట్లు లేక పోవడంతో డిప్ సిస్టమ్లో పాల్గొనేందుకు అర్హులు కాదంటూ 21 మందిని కొద్ది సేపు నిలిపి వేశారు. అనంతరం సొంత పూచీకత్తు మీద వారిని డిప్లో పాల్గొనాలని సూచించారు. మొత్తం మీద 62 స్టాల్స్ మాత్రం డిప్ ద్వారా నంబర్లు కేటాయించారు. అయితే ఒక్కో షాపుకు రూ.47 వేలు చొప్పున వసూలు చేస్తున్నారని షాపు యజమానులు వాపోయారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.500 చెల్లిస్తే షాపు కేటాయిస్తారని చెబుతున్న ప్రకటనలు పేపర్లకే పరిమితం అయ్యాయని ఆరోపిస్తున్నారు. దాదాపు 63 షాపులకు రూ.29.61లక్షలు అవుతున్న మొత్తం ఎక్కడికి వెళ్తుందని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ నేత హస్తం నంద్యాల పట్టణంలోని ఒక టీడీపీ నేత ఈ మొత్తాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. ఇలా సేకరించిన మొత్తాన్ని పలు శాఖలు, ప్రజాప్రతినిధులకు కొంత మొత్తాన్ని కేటాయించి మొగిలిన మొత్తాన్ని స్వాహా చేయనున్నట్లు షాపుల కేటాయింపు పొందిన పలువురు ఆరోపిస్తున్నారు. జీఎస్టీ తగ్గిందని కేంద్ర ప్రభుత్వం ఓ వైపు చెబుతున్నా గత ఏడాది కంటే ఈ ఏడాది షాపుల యజమానులపై ఈ విధంగా అంత మొత్తాలను మోపడం దారుణమని వాపోతున్నారు. ఈ విషయమై తహసీల్దార్ శ్రీనివాసులును వివరణ కోరగా ఏ షాపు యజమాని అయినా రూ.47వేలు చెల్లిస్తున్నామని ఫిర్యాదు చేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రూ.500 చలానా చెల్లిస్తే చాలు షాపులు కేటాయిస్తున్నామని, అధిక మొత్తలు వసూలు చేస్తున్నామనడంలో అర్థం లేదన్నారు. -
మల్లన్న సన్నిధిలో భక్తులు చల్లన
శ్రీశైలంటెంపుల్: శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా స్వామివారి దర్శనం అనంతరం బయటికి వచ్చిన తరువాత మల్లికాగుండం నుంచి అమ్మవారి ఆలయం వరకు రూ.60లక్షల నిధులతో టెంజైన్ ఫ్యాబ్రికేషన్ చేశారు. భక్తులు నడిచేందుకు వీలుగా ఏర్పాటు చేశారు. ఈ ప్రదేశంలో గతంలో రేకులు ఉండటంతో భక్తులు ఇబ్బందులు పడేవారు. రేకులను తొలగించి టెంజైన్ ఫ్యాబ్రికేషన్ ఏర్పాటు చేశారు. దీంతో ఎండకు , వానకు ఇబ్బందులు లేకుండా భక్తులకు చల్లగా ఉంటుంది. అలాగే కోతుల బెడద కూడా లేకుండా ఉంటుంది. శివరాత్రి, ఉగాది ఉత్సవాల్లో సైతం అదనపు క్యూలైన్లు ఏర్పాటు చేసే అవసరం ఉండదు. వీబీఆర్లో 16 టీఎంసీల నీరు వెలుగోడు: వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (వీబీఆర్)లో 16.443 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నట్లు ఏఈ శివనాయక్ తెలిపారు. బానకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి వెలుగోడు జలాశయానికి తెలుగుగంగ కాల్వ ద్వారా 6,500 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందన్నారు. వీబీఆర్ నుంచి చైన్నె ప్రధాన కాల్వకు 6000, వనన్ఆర్ తూముకు 60, వన్్ ఎల్ తూముకు 30 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఆర్టీసీలో అప్రెంటీస్కు దరఖాస్తుల ఆహ్వానం నంద్యాల(వ్యవసాయం): నంద్యాల జిల్లాలోని ఏపీఎస్ ఆర్టీసీ అప్రెంటిషిప్ ఐటీఐ ఉత్తీర్ణులైన నిరుద్యోగులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ కర్నూలు శిక్షణా కళాశాల సిబ్బంది నజీర్ అహమ్మద్ శనివారం తెలిపారు. ఈనెల 25 నుంచి నవంబర్ 8వ తేదీలోపు www.apprenticeshipindian.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో డీజల్ మెకానిక్ 32, మోటారు మోకానిక్ 4, ఎలక్ట్రీషియన్ 4, వెల్డర్ 1, పెయింటర్ 1, డ్రాప్స్మెన్ సివిల్ 1 చొప్పున ఖాళీగా ఉన్నాయని వారు తెలిపారు. వెరిఫికేషన్ కోసం ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీలను కర్నూలు శిక్షణ కళాశాలలో హాజరు కావాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 08518–257025ను సంప్రదించాలన్నారు. క్లాప్ మిత్రల సంక్షేమంపై దృష్టి సారించండి కర్నూలు(అర్బన్): గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు పారిశుద్ధ్య పనులు చేపడుతున్న క్లాప్ మిత్రల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా పరిషత్ సీఈఓ జి.నాసరరెడ్డి కోరారు. శనివారం స్థానిక జిల్లా పరిషత్ ప్రాంగణంలోని డీపీఆర్సీ భవనంలో జిల్లాలోని ఎంపీడీఓలకు ఎల్ఎస్డీజీఎస్ థీమ్ – 5 ( క్లీన్ అండ్ గ్రీన్ ) అనే అంశంపై టీఓటీ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ అర్హులైన క్లాప్ మిత్రలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న బీమా భద్రత, సంక్షేమ పథకాలు, పీఎంఎస్బీవై, చంద్రన్న బీమా, ఈ శ్రమ్, ఎన్టీఆర్ భరోసా అందేలా చూడాలన్నారు. ప్లాస్టిక్ అధిక వినియోగంతో మానవ మనుగడకే ముప్పు వాటిల్లుతోందన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిస్తూ ప్రత్యామ్నాయాల దిశగా అడుగులు వేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్లాస్టిక్ వాడకం వల్ల వచ్చే వ్యాధులు, జరిగే నష్టాలపై అవగాహన కలిగించాలన్నారు. శిక్షణా కార్యక్రమంలో డీపీఆర్సీ కోఆర్డినేటర్ మంజులావాణి, ట్రైనింగ్ మేనేజర్ గిడ్డేష్, టీఓటీలు ఆస్రఫ్ బాషా, పి.జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. అందుబాటులో టీటీడీ క్యాలెండర్లు కర్నూలు కల్చరల్: తిరుమల తిరుపతి దేవస్థానముల పంచాంగం క్యాలెండర్లు, డైరీలు విక్ర యానికి అందుబాటులో ఉన్నాయని టీటీడీ కల్యాణ మండపం మేనేజర్ సి.రామ్మోహన్ తెలిపారు. కర్నూలు సీ.క్యాంప్ టీటీడీ కల్యాణ మండపంలో తగినన్ని క్యాలెండర్లు, డైరీలు విక్రయానికి అందుబాటులో ఉంచామన్నారు. పెద్ద డైరీ రూ.150, చిన్న డైరీ రూ.120, 12 సీట్స్ క్యాలెండర్ రూ.130, తెలుగు పంచాంగం క్యాలెండర్ రూ.30, టేబుల్ క్యాలెండర్ రూ.75, శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటంతో కూడిన క్యాలెండర్ రూ.20, శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారు కలిసి ఉన్న క్యాలెండర్ రూ.15, ఆరుషీట్స్ డిజిటల్ క్యాలెండర్ రూ.450 ధరలతో విక్రయిస్తున్నట్లు తెలిపారు. -
అభివృద్ధి పనులకు రూ.2.50 కోట్లు మంజూరు
కౌతాళం: జిల్లాలో ప్రసిద్ధి చెందిన ఉరుకుంద ఈరన్నస్వామి ఆలయంలో వివిధ అభివృద్ధి పనులకు రూ.2.50కోట్లు మంజూరైనట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ వాణి తెలిపారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ లడ్డూ కౌంటర్ తయారీ బిల్డింగ్, నాలుగు గెస్ట్హౌస్ల నిర్మాణం, నూతన పరిపాలనా కార్యాలయ భవనం, అదనంగా భక్తుల సౌకర్యార్థం 50గదుల నిర్మాణానికి తాజాగా ప్రతిపాదనలు పంపామన్నారు. అన్నదానం కోసం జీప్లస్ బిల్డింగ్ నిర్మాణానికి ఇప్పటికే రూ.2.30కోట్ల నిధులు మంజూరు కాగా రివైజింగ్ కోసం పంపినట్లు వెల్లడించారు. మంజూరైన అభివృద్ధి పనులను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. -
22నుంచి శ్రీశైలంలో కార్తీకమాసోత్సవాలు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థానంలో ఈ నెల 22 నుంచి నవంబర్ 21వ తేది వరకు కార్తీకమాసోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. శనివారం దేవస్థాన ఈఓ ఎం.శ్రీనివాసరావు మాట్లాడుతూ కార్తీకమాసమంతా భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ పూజావేళలను మార్పులు చేసి వేకువజామున 4గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు, తిరిగి సాయంత్రం 5.30గంటల నుంచి రాత్రి 10.30గంటల వరకు దర్శనాలు కొనసాగుతాయన్నారు. ప్రతి సోమవారం ఆలయ పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి కార్యక్రమాలు వైభవంగా నిర్వహిస్తామన్నారు. నవంబర్ 1న కార్తీక శుద్ద ఏకాదశిని పురస్కరించుకుని కోటి దీపోత్సవ కార్యక్రమం ఏర్పాటవుతుందన్నారు. 5న కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని గంగాధర మండపం వద్ద జ్వాలాతోరణోత్సవం, లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి ఉంటుందన్నారు. కార్తీకమాసమంతా ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చనలు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. -
కలం.. నిరసన గళం
నంద్యాల: ప్రజల పక్షాన నిలుస్తూ ప్రభుత్వ అక్రమాలను, వైఫల్యాను ఎండగడుతున్న జర్నలిస్టులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులు, ప్రజా సంఘాల నాయకులు ఆందోళన చేస్తున్నారు. సాక్షి ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డితో పాటు ఇతర పాత్రికేయులపై నమోదు చేసి అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు.‘సాక్షి’పై కక్ష సాధింపు చర్యలు తక్షణమే నిలిపి వేయాలి. సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిని పోలీసులు వేధించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ప్రభుత్వాలు కాదు. అక్షరం శాశ్వతమన్నది పోలీసులు గుర్తెరగాలి. మీడియా కార్యాలయాలపై దాడులు చేయడం, పత్రికా ఎడిటర్పై తప్పుడు కేసులు నమోదు చేయడం మంచి పద్ధతి కాదు. ఇది ఒక్క సాక్షిపైనే కాదు పత్రికా రంగంపైనే దాడి. పోలీసులను పాత్రికేయులపై ఉసిగొల్పుతున్నారు. జర్నలిస్టు సంఘాలు చూస్తూ ఊరుకోవు. –పీ.ఎం. లక్ష్మినరసింహం, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు, నంద్యాల ప్రజల పక్షాన గొంతుకగా నిలుస్తున్న జర్నలిజానికి సంకెళ్లు వేయాలనుకోవడం అవివేకం. పోలీసులను అడ్డుపెట్టుకొని యథేచ్చగా ప్రజల హక్కులు, విలువలను కాలరాయాలనుకోవడం తగదు. నిజాలు చెప్పే మీడియా సంస్థలపై దాడి చేయడం దుర్మార్గపు చర్య. రాష్ట్రాన్ని నకిలీ మద్యం పట్టి పీడిస్తూ అమాయకుల ప్రాణాలు హరిస్తున్నా ప్రభుత్వం చోద్యం చూడటం తగదు. నకిలీ మద్యంపై వార్తలు రాస్తే ఎడిటర్, జర్నలిస్టులపై కేసు నమోదు చేయడంలో అర్థం లేదు. ప్రభుత్వం పునరాలోచన చేయాల్సి ఉంది. – శివనాగిరెడ్డి, ఏపీ ఎన్జీఓస్ ఉమ్మడి కర్నూలు జిల్లా మాజీ అధ్యక్షుడు, నంద్యాల -
24న జెడ్పీ సర్వసభ్య సమావేశం
కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 24న నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈఓ జి.నాసరరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన స్థానిక సమావేశ భవనంలో ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందన్నారు. సమావేశంలో వ్యవసాయం – అనుబంధ శాఖలు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, మత్స్యశాఖ, దేవదాయ శాఖలపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్లు, జెడ్పీటీసీ, ఎంపీపీలు సమావేశానికి హాజరు కావాలని ఆయన కోరారు. పీఏసీఎస్ల్లో అడ్డగోలుగా ఉద్యోగుల నియామకం ఇష్టానుసారంగా గౌరవ వేతనాల చెల్లింపు నిర్వీర్యమైన ప్యాక్స్ డెవలప్మెంటు సెల్ ఉమ్మడి జిల్లాలో 70 సంఘాల్లో నష్టాలు -
అంతా మీ ఇష్టమేనా?
● సర్పంచ్ల డిజిటల్ సిగ్నేచర్లు ఎందుకు ఉంచుకున్నారు? ● అధికారుల పనితీరుపై జెడ్పీ చైర్మన్ ఆగ్రహంకొలిమిగుండ్ల: ‘గ్రామ పంచాయితీల సర్పంచ్లు, పంచాయితీ కార్యదర్శుల డిజిటల్ సిగ్నేచర్లు ఎందుకు డిప్యూటీ ఎంపీడీఓ కార్యాలయంలో ఉంచారు. అంతా మీ ఇష్టానుసారంగా చేస్తారా?’ అని అధికారులపై జెడ్పీచైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీపీ కారపాకుల నాగవేణి అధ్యక్ష్యతన కొలిమిగుండ్ల మండల పరిషత్ కార్యాలయంలో శనివారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. డిప్యూటీ ఎంపీడీఓ పనితీరుపై ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లు ఫిర్యాదు చేయగా జెడ్పీ చైర్మన్ స్పందిస్తూ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తానన్నారు. గత సమావేశంలో మండలంలో ఎక్కడా పందులు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారని, ఏం చేశారని డిప్యూటీ ఎంపీడీఓను ప్రశ్నించారు. నాయకుల నుంచి ఒత్తిళ్లు ఉన్నాయని సమాధానం రావడంతో జెడ్పీ చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రబీ సీజన్ ప్రారంభమైనా రైతులకు సబ్సీడిపై శనగ విత్తనాలు అందిచరా, యూరియా కూడా ఇవ్వరా’ అని వ్యవసాయ అధికారులను ప్రశ్నించారు. కొలిమిగుండ్ల నుంచి పెట్నికోట రోడ్డును నాసిరకంగా వేశారని, పీహెచ్సీల్లో సిబ్బంది ఉండటం లేదని సభ్యులు చెప్పగా సమస్యలు పునరావృతం కాకుండా చూసుకోవాలని జెడ్పీ చైర్మన్ సూచించారు. ఇటిక్యాల, కొలిమిగుండ్ల రెవిన్యూ గ్రామాల్లో ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. డిగ్రీ, ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలలతో పాటు ఇతరత్రా వాటి కోసం స్థలాలు అవసరం అవుతాయని, ప్రభుత్వ స్థలాల్లో బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. మైనింగ్ సీనరేజ్ వసూలును ప్రైవేట్కు అప్పగించకుండా పాత పద్ధతిలోనే ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహించాలని, ఈ మేరకు తీర్మానం చేసి పంపాలని సూచించారు. -
వైఎస్సార్సీపీ హయాంలో ఇలా..
సహకార సంఘాలను లాభాల బాట పట్టించేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. మల్టీపర్పస్ సెంటర్లుగా తీర్చిదిద్దేందుకు పలు చర్యలు తీసుకుంది. ఇందుకోసం జిల్లా సహకార కేంద్రబ్యాంకులో ప్రత్యేకంగా ప్యాక్స్ డెవలప్మెంటు సెల్ ఏర్పాటు చేసి ఆప్కాబ్లో పనిచేసే సీనియర్ మేనేజర్, ఏజీఎం స్థాయి అధికారిని ఇన్చార్జ్గా నియమించారు. ఏఏ సంఘం ఎలాంటి వ్యాపారాల్లో రాణించేందుకు ఆసక్తి చూపుతుందో అందుకు అనుగుణంగా ఈ సెల్ డీపీఆర్లు సిద్ధం చేస్తుంది. ఇందుకు అనుగుణంగా డీసీసీబీ, ఆప్కాబ్ సంఘాలకు నిధులు ఇచ్చేది. గత ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యలతో సహకార సంఘాలు లాభాల బాట పట్టాయి. సంఘాలకు సొంత భవనాలతో పాటు షాపింగ్ కాంప్లెక్స్లు ఏర్పాటు అయ్యాయి. కొన్ని సంఘాలకు పెట్రోలు పంపులు కేటాయించారు. పలు సంఘాలకు జీవనధార మందుల దుకాణాలు కూడా ఇచ్చారు. బంగారంపై రుణాలు ఇచ్చే ప్రక్రియ మొదలైంది. కొన్ని సంఘాలు బియ్యం వ్యాపారం కూడా చేస్తున్నాయి. సంఘాలకు అనుబంధంగా మల్టీపర్సప్ గోదాములు కూడా నిర్మించారు. -
బ్యాగ్ అప్పగింత
● ఆటోలో మరిచిపోయిన ప్రయాణికులు ● అందులో 9 తులాల బంగారు నంద్యాల: పట్టణంలోని నడిగడ్డకు చెందిన షేక్ రహిమాన్ ఈనెల 17న ఆటోలో మరిచిపోయిన బ్యాగ్ను నంద్యాల వన్టౌన్ పోలీసులు బాధితుడికి శనివారం అప్పగించారు. వన్టౌన్ సీఐ సుధాకర్రెడ్డి తెలిపిన మేరకు.. షేక్ రహిమాన్ కుటుంబంతో కలిసి కోవెలకుంట్ల వెళ్లడానికి నడిగడ్డలో ఆటో ఎక్కి ఆర్టీసీ బస్టాండ్ వద్ద దిగారు. దిగే సమయంలో ఆటోలో తన భార్యకు చెందిన హ్యాండ్ బ్యాగ్ మరిచిపోయారు. అందులో 8 తులాల బంగారు నెక్లెస్, ఒక తులం మాట్నీలు ఉన్నాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు క్రైం టీం సభ్యులతో కలిసి బస్టాండ్లోని సీసీ టీవీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్లోని కెమెరాలను పరిశీలించి ఆటోను గుర్తించారు. కాగా..విశ్వనగర్కు చెందిన మాబుహుసేన్ తన ఆటోలో మరిచిపోయిన బ్యాగ్తో బాధితుల కోసం ప్రయత్నించినా లాభం లేకపోయింది. దీంతో బ్యాగ్ను పోలీసులకు ఇవ్వాలనుకున్న సమయంలో పోలీసులు వెళ్లి బ్యాగ్ను స్వాధీనం చేసుకుని బాధితుడికి అప్పగించారు. -
నవంబర్లో గుండ్రేవుల కోసం జలదీక్ష
కర్నూలు(సెంట్రల్): వెనుకబడిన కర్నూలు జిల్లా స్థితిగతిని మార్చే గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణం కోసం నవంబర్ మూడో వారంలో జలదీక్ష చేపట్టాలని మేధావులు, రైతు సంఘాల నాయకులు నిర్ణయించారు. శనివారం బిర్లా కంపౌండ్లోని కేపీఎస్ కార్యాలయంలో ‘కర్నూలుకు తాగునీరు– రైతులకు సాగునీరు’ నినాదంతో గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణ ఆవశ్యకతపై కర్నూలు ప్రగతి సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి కేపీఎస్ అధ్యక్షుడు శ్రీ హర్ష అధ్యక్షత వహించగా మేధావులు రిటైర్డ్ ప్రిన్సిపాల్ చెన్నయ్య, రిటైర్డ్ ప్రొఫెసర్ మన్సూర్ రెహమాన్, విద్యావేత్త జి.పుల్లయ్య, రైతు సంఘం నాయకులు రామకృష్ణారెడ్డి, శేషన్నరెడ్డి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సునీల్రెడ్డి, విద్యార్థి సంఘాల నాయకులు రవికుమార్, లోక్సత్తా నాయకుడు డేవిడ్, వీహెచ్పీ నాయకులు ప్రతాప్రెడ్డి, సీపీఎం నాయకులు పుల్లారెడ్డి, ఇతర నాయకులు హరినాథ్రెడ్డి తదితరులు హాజరయ్యారు. ముందుగా గుండ్రేవుల ప్రాజెక్టుకు 20 టీఎంసీలతో డీపీఆర్ రూపొందించిన సుబ్బారాయు డు చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేపీఎస్ అధ్యక్షుడు శ్రీహర్ష మాట్లాడుతూ.. గుండ్రేవుల ప్రాజెక్టు చేపడితే కర్నూలుకు తాగునీటితోపాటు పశ్చిమ ప్రాంతంలోని పత్తికొండ, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాలకు సంపూర్ణంగా సాగునీరు అంది రైతులు బాగుపడతారన్నారు. 40 ఏళ్లుగా ప్రాజెక్టు నిర్మాణాన్ని పాలకులు కుంటిసాకులు చెబుతూ విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2018లో ఎన్నికల కోసం శంకుస్థాపన చేసిన చంద్రబాబునాయుడు..ఇప్పుడు అధికారంలోకి వచ్చినా ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. ఈ క్రమంలో ప్రాజెక్టు నిర్మా ణం కోసం ప్రజల మద్దతు పోరాటాలు చేయడంలో భాగంగా నవంబర్ మూడో వారంలో జలదీక్ష చేపట్టనున్నట్లు వివరించారు. -
ముస్లింల సామూహిక వివాహాలు
ఆదోని సెంట్రల్: పట్టణంలో అబాబెల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలను శనివారం ఘనంగా నిర్వహించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతంలోని నిరుపేద ముస్లిం కుటుంబాలకు చెందిన ఏడు జంటలను గుర్చించి కేకేబీ ఫంక్షన్ హాలులో ముస్లిం మత పెద్దల సమక్షంలో వివాహాలను జరిపించారు. ఈ వివాహాలను జరిపించడానికి ముస్లిం సోదరులు చాలా మంది తమవంతుగా చేయుత నందించారని ఇస్లామిక్ ట్రస్ట్ సభ్యులు తెలిపారు. కొందరు వస్తు రూపంలోనూ మరి కొందరు భోజనాలు ఏర్పాట్లు వంటి అవసరమైన ప్రతి వస్తువులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలకు ముస్లిం ఆచారం ప్రకారం వారి ఇంటికి అవసరమైన ప్రతి వస్తువులను దాతలు అందజేశారు. -
అధికారులూ.. ‘చెత్త’గించరూ!
సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్స్ అంటూ కూటమి నేతలు కర్నూలు సభలో ఊదరగొట్టారు. సభకు లక్షలాది జనాన్ని బస్సుల్లో తరలించి ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులు, మూడు పార్టీల నాయకులు హడావుడి చేశారు. అయితే ప్రజలు సభలో ఏమి తెలుసుకున్నారో ఏమో కానీ.. సభాప్రాంగణం ప్రస్తుతం అంతా ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయింది. ఎటు చూసినా వాటర్ బాటిళ్లు, నీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు, భోజనం పార్సిల్ కవర్లు కనిపిస్తున్నాయి. పది రోజుల క్రితం పచ్చని పైర్లతో కళకళలాడుతున్న పొలాలు నేడు డంప్యార్డును తలపిస్తున్నాయి. స్వచ్ఛ భారత్.. స్వచ్ఛాంధ్ర.. స్వచ్ఛ దివాస్ అంటూ చెప్పే పాలకులు, అధికారులు ఈ ప్రాంతాన్ని మాత్రం విస్మరించారు. ప్లాస్టిక్ రహిత సమాజాన్ని స్థాపిద్దామంటూ ప్రతి నెలా మూడో శనివారం కార్యక్రమాలు చేపట్టే అధికారులు ఈ సభా ప్రాంగణం వైపు మాత్రం ఈ రోజు కన్నెతి చూడలేదు. వెంటనే వ్యర్థాలను తొలగించాలని ప్రజలు, పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. – వడ్డె శ్రీనివాసులు, సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు -
నెల రోజులుగా నీటి సరఫరా తగ్గింపు
జూపాడుబంగ్లా: పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ నుంచి నెల రోజుల నుంచి నీటి సరఫరాను తగ్గించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పట్లో నీటిసరఫరాను పెంచే అవకాశాల్లేవని పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ నాల్గోగేటు, ఎన్సీఎల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి 6,500 క్యూసెక్కుల నీటిని ఎస్సారెమ్సీ కాల్వలోకి విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఈ నీటిని బానకచర్ల నీటినియంత్రణ వ్యవస్థ నుంచి తెలుగుగంగ కాల్వకు 6 వేల క్యూసెక్కులు, కేసీ ఎస్కేప్ కాల్వకు 300, జీఎన్ఎస్ఎస్(ఎస్సార్భీసీ) కాల్వకు 200 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నట్లు బానకచర్ల ఏఈ దేవేంద్ర తెలిపారు. -
టీడీపీ ముఖ్య నేతలే నకిలీ మద్యం వ్యాపారులు
● మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిడోన్: రాష్ట్రంలో చలామణి అవుతున్న నకిలీ మద్యం మూలాలు టీడీపీ ప్రభుత్వంలోని ముఖ్య నాయకులవేనని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ కళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని శుక్రవారం డోన్లోని తన స్వగృహంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం, మొలకల చెరువులలో కల్తీ లిక్కర్ డెన్లు గుర్తించినప్పుడే బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోకుండా కేసులు పక్కదారి పట్టించేందుకు కూటమి ప్రభుత్వం కుటిల యత్నాలు చేస్తోందన్నారు. ఏకకాలంలో రాష్ట్రవ్యాప్తంగా బెల్టుషాపులపై దాడులు నిర్వహించి నకిలీ మద్యం తయారీ మూలాలను కనుగొనడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. గురువింద గింజ తన కింది నలుపు ఎరగదన్నట్లు కల్తీ మద్యం కేసులో నిందితులందరూ టీడీపీకి చెందిన వారే కాగా, దురుద్దేశ్య పూర్వకంగా ఆ నిందను వైఎస్సార్సీపీ నాయకులకు అంటగట్టాలని చూస్తున్నారన్నారు. గతంలో పాలకొల్లు, ఏలూరు, పరవాడ ప్రాంతాల్లో దొరికిన కల్తీ మద్యం ఎవరిదనే విషయాన్ని బయటకు పొక్కనివ్వకుండా అధికార పార్టీ నేతలు కప్పిపుచ్చిన సంగతిని ప్రజలు మరిచిపోలేదన్నారు. పాల్గొన్న పార్టీ నాయకులు వైఎస్సార్సీపీ నియోజకవర్గ పరిశీలకులు దేశం సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు సోమేష్ యాదవ్, మల్లికార్జునరెడ్డిల అధ్యక్షతన కోటి సంతకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీలు బుగ్గన నాగభూషణంరెడ్డి, రేగటి రాజశేఖర్ రెడ్డి, దిలీప్ చక్రవర్తి, మున్సిపల్ చైర్మన్లు సప్తశైల రాజేష్, చలంరెడ్డి, పార్టీ వాలెంటీర్ విభాగం జిల్లా అధ్యక్షులు పోసు్ట్రపసాద్, ఉపాధ్యక్షులు కురుకుందు హరి, బొబ్బల శివరామిరెడ్డి, బుగ్గన జయచంద్రారెడ్డి, మల్యాల శ్రీనివాసరెడ్డి, దినేష్గౌడ్, మున్సిపల్ వైస్చైర్మన్ జాకీర్హుసేన్, వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శులు పాలుట్ల రఘురాం, రఘు, జెడ్పిటిసిలు బద్దల రాజ్కుమార్, మార్కెట్యార్డు మాజీ చైర్మన్లు మల్యాల రామచంద్రుడు, బోరెడ్డి పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలి కూటమి ప్రభుత్వంలో అన్ని చోట్ల టీడీపీ నేతలు అవినీతి చేస్తున్నారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వంలో ప్రారంభమైన అభివృద్ధి పనులు చేస్తున్న కాంట్రాక్టర్లను బెదిరించి టీడీపీ నేతలు మామూళ్లు వసూలు చేస్తున్నారన్నారు. ఇప్పటికే ఆరోగ్య శ్రీ పథకాన్ని కూటమి ప్రభుత్వం నీరుగార్చిందన్నారు. పేద విద్యార్థులకు ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలుచేయడంలో ఘోరంగా విఫలమైందన్నారు. రైతాంగంతో పాటు అట్టడుగు నిరుపేద వర్గాలు, అల్ప సంఖ్యాకుల వర్గాలకు ఒరిగిందేమీ లేదన్నారు. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జననేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను అమలుచేయడం తప్ప కూటమి ప్రభుత్వం పేదల కోసం ఫలానా పని చేశామని గొప్పలు చెప్పుకునేందుకు ఏమీ లేదన్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టే కుట్ర జరుగుతోందన్నారు. ఇదే జరిగితే నిరుపేదలకు వైద్యం ఉచితంగా అందే అవకాశం ఉండబోదన్నారు. ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజలు ఐక్యంగా ఉద్యమించాల్సిన అసవరం ఉందన్నారు. -
శ్రీశైలానికి మొండి చేయి చూపారు!
శ్రీశైలంప్రాజెక్ట్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం శ్రీశైలంలో పర్యటించడంతో నిధులు వరదలా వస్తాయని ఆశించామని, అయితే శ్రీశైలానికి మొండి చేయి చూపించారని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్లోని ఏపీజెన్కో అతిథి గృహంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శిల్పా మాట్లాడుతూ.. శ్రీశైలంలో ప్రధాని పర్యటన అనగానే అభివృద్ధికి మహర్దశ పడుతుందని భావించామన్నారు. అయితే శ్రీశైలం పర్యటనలో ప్రధాని మోదీ నోట అభివృద్ధి మాట రాకపోవడంతో నిరాశకు గురయ్యామన్నారు. నిధులు రాబట్టడంలో టీడీపీ నేతలు విఫలం అయ్యారని, అలాగే శ్రీశైల ప్రాంతంలో ఉన్న సమస్యల పరిష్కారానికి హామీ కూడా పొందలేకపోయారన్నారు. ప్రశ్నిస్తాననే రాష్ట్ర అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నోరు మొదపలేదన్నారు. గతంలో కేంద్ర మంత్రి అమితాషా శ్రీశైలం పర్యటనకు రాగా.. తాము శ్రీశైలం అభివృద్ధి, రైల్వేలైన్, దోర్నాల నుంచి శ్రీశైలం, ఆత్మకూరు రోడ్ల విస్తరణ, దోర్నాల నుంచి శ్రీశైలం ఎలివేషన్ కారిడార్, శ్రీశైలం–సున్నిపెంట స్ప్రింగ్బ్రిడ్జ్ తదితర ప్రతిపాదనలు తీసుకువచ్చామన్నారు. ప్రధాని మోదీ శ్రీశైలానికి వస్తే బీజేపీ మండల నాయకుడు చదువుల శ్రీనుకు అపాయింట్మెంట్ ఇచ్చి, స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డికి ఇవ్వకపోవడం చూస్తుంటే ఆయన స్థాయి ఎంతకు దిగజారిందో అర్ధమవుతోందన్నారు. ట్రస్ట్బోర్డ్ సభ్యుల నియామకంలో బుడ్డా ప్రాధాన్యత ఏమిటో తెలిసిపోయిందన్నారు. ప్రమాణ స్వీకారానికి ఆయనకు ఆహ్వానం లేకపోవడం చూస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర ఎన్ని మార్కులు ఉన్నాయో ప్రజలకు అర్ధమవుతోందన్నారు. శ్రీశైలం అభివృద్ధి కోసం కాకుండా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి తన అనుచరుల కోసం పనిచేస్తున్నారని శిల్పా ఆరోపించారు. ఇసుక, ఇటుక, మద్యం దుకాణాలు, బెల్ట్షాపులు, దేవస్థానంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల్లో లంచాలు, సున్నిపెంటలో భూముల కబ్జాలపైన ప్రతిరోజు తీరిక లేకుండా ఉన్నారని విమర్శించారు. ‘దేవస్థానానికి స్వయంగా నేను కాటేజీ కట్టిస్తున్నానని, ఇందుకు ఇసుక లారీలను పంపిస్తే వాటిని బుడ్డా తన అనుచరుల చేత ఆపిస్తున్నారని, కప్పం కట్టాలని ఆదేశాలు జారీ చేస్తున్నారని, వసూల్ కింగ్గా మారారేమో’ అని శిల్పా అన్నారు. సున్నిపెంటలో వైఎస్సార్సీపీ నాయకుడు వట్టి వెంకటరెడ్డిని ఇబ్బంది పెట్టాలని ఎమ్మెల్యే చూస్తున్నారని, డిజిటల్ బుక్లో నోట్ చేసుకుని, అధికారంలోకి వచ్చాక వదిలి పెట్టబోమని హెచ్చరించారు. శ్రీశైలంలో అభివృద్ధి పేరిట శివాసదనం, పెద్ద సత్రంలను పడగొట్టినప్పటికీ అక్కడి నివాసితులకు శ్రీశైలంలోనే నివాసాలను కల్పించాలని శిల్పా డిమాండ్ చేశారు. అభివృద్ధిపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు నిధులు రాబట్టడంలో టీడీపీ నేతలు విఫలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి -
చంద్రన్న బీమా..లేదు ధీమా
● 17 నెలల్లో ఉమ్మడి జిల్లాలో 2,446 మంది మృతి ● వీరిలో ప్రమాద మృతులు 151 మంది ● ఇచ్చిన హామీ మేరకు ప్రమాద మరణాలకు రూ.10 లక్షలు.. సాధారణ మరణాలకు రూ.5 లక్షలు ఇవ్వాలి ● ఇప్పటి వరకు ఒక్క కుటుంబానికీ దక్కని భరోసా ● గత ప్రభుత్వంలో వైఎస్సార్ బీమాతో పేదలకు ఎంతో మేలు ● అప్పట్లో క్రమం తప్పకుండా సాయం అందజేత ఈ చిత్రంలో కనిపించే మహిళ పేరు చాంద్బేగం. తుగ్గలి మండలం హుసేనాపురం గ్రామానికి చెందిన ఈమె భర్త కాశీంవలి(50) ఆరు నెలల క్రితం అనంతపురం జిల్లా గుత్తి రైల్వే స్టేషన్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. ఇంటికి ఆధారమైన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబం పరిస్థితి దయనీయంగా మారింది. నిబంధనల మేరకు ఈ కుటుంబానికి రూ.10 లక్షలు సాయం అందాలి. బాధితురాలికి వితంతు పింఛన్ ఇవ్వాలి. అయితే ఇవేమీ అందలేదు. ఈమె పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. గుంతలు పడిన రోడ్లు.. వేగంగా దూసుకొచ్చే వాహనాలు.. వణికిస్తున్న డెంగీ జ్వరాలు.. అకస్మాత్తుగా లయతప్పుతున్న గుండెలు.. ప్రజల పరిస్థితి దినదిన గండంగా మారింది. ఎప్పుడు ప్రమాదం సంభవిస్తుందో, ప్రబలుతున్న రోగాలతో ప్రాణం ఉంటుందో లేదో తెలియని దుస్థితి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మృతుల కుటుంబాలకు ‘చంద్రన్న బీమా’ భరోసా ఇవ్వలేకపోతోంది. కుటుంబ పెద్ద అకాల మృతితో ఇంటిళ్లిపాది రోడ్డున పడాల్సి వస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలలు అయినా ఈ పథకం కింద కనీసం దరఖాస్తులు స్వీకరించలేని దౌర్భాగ్యం నెలకొంది.కర్నూలు(అగ్రికల్చర్): రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు చరమగీతం పాడి పేద, మధ్య తరగతి ప్రజల ఇళ్లల్లో సంక్షోభాన్ని తీసుకొచ్చింది. గతంలో ఉన్న వైఎస్సార్ బీమా పథకాన్ని చంద్రన్న బీమాగా పేరు మార్చి అమలు చేయకపోవడం ఇందుకు నిదర్శనంగా నిలిచింది. చంద్రన్న బీమా పథకం కింద సహజ మృతికి రూ.5 లక్షలు, ప్రమాదవశాత్తూ మృతి చెందితే రూ.10 లక్షలు అందచేస్తామని ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన, బీజేపీ నేతలు కూడా చెప్పారు. అయితే మృతి చెందిన కుటుంబాల నుంచి ఈ పథకం కింద దరఖాస్తులు స్వీకరించేందుకు మార్గదర్శకాలను ఇప్పటి వరకు విడుదల చేయలేదు. బీమా ఆర్థిక సాయం అందక బాధితులు కన్నీటితో ‘అంతా మాయ చేశారు’ అని ఆరోపిస్తున్నారు. వేనవేల వేదనలు! రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 2024 జూన్ 12న ఏర్పాటైంది. ప్రభుత్వం ఏర్పాటై 17 నెల నడుస్తున్నా చంద్రన్న బీమా హామీ అమలుపై దృష్టి సారించిన దాఖలాలు లేవు. సాధారణంగా 18 నుంచి 50 ఏళ్లు వారు మృతి చెందితే, అలాగే ప్రమాదాల్లో 18 నుంచి 70 ఏళ్ల లోపు వారు మృతి చెందితే ఈ పథకానికి అర్హులు. గత ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు కర్నూలు జిల్లాలో 1,256 మంది, నంద్యాల జిల్లాలో 1,190 మంది సాధారణంగా మృతి చెందారు. ప్రమాదాల్లో కర్నూలు జిల్లాలో 72, నంద్యాల 79 మంది మృతి చెందారు. కుటుంబానికి ఆధారమైన వారిని పోగొట్టుకున్న ఎన్నో కుటుంబాలు చంద్రన్న బీమా పథకం కింద పరిహారం వస్తుందనుకున్నారు. అయితే కూటమి ప్రభుత్వం సామాన్య, మధ్యతరగతి ప్రజల మృతులను పట్టించుకోలేదు. ఇంటికి ఆధారమైన వారిని పోగొట్టుకొని, ప్రభుత్వం నుంచి చేయూత కరువై వేలాది కుటుంబాలు వీధిన పడ్డాయి. అప్పటి పరిస్థితులు పునరావృతం టీడీపీ పాలనలో 2014 నుంచి 2019 వరకు వేలాది మంది మృతి చెందినప్పటికీ చంద్రన్న బీమా ఉన్న వారికి పరిహారం రాలేదు. బీమా ఉన్న వారు మృతి చెందితే వారి వారసులు పరిహారం పొందాలంటే ఏళ్లుగడిచేవి. బాధిత కుటుంబ సభ్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్పట్లో బాధిత కుటుంబాల్లో 20 శాతం మంది కూడా బీమా దక్కలేదు. ప్రస్తుతం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది. సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు దోహదపడే చంద్రన్న బీమా అమలును పూర్తిగా పక్కన పెట్టడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 12.38 రైస్కార్డులు ఉండగా... వైఎస్సార్సీపీ ప్రభుత్వం 10.25 లక్షల కటుంబాలకు వైఎస్సార్ బీమా కల్పించింది. కూటమి ప్రభుత్వం మాత్రం చంద్రన్న బీమాను ఇంతవరకు పట్టించుకోలేదు. వెబ్ సైట్ను మూసివేసి చంద్రన్న బీమా పథకాన్ని డీఆర్డీఏ అమలు చేస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడమే మొదలు సాధారణ, ప్రమాద మృతుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. ఇందుకు సంబంధించిన వెబ్ సైట్ను పూర్తిగా మూసి వేశారు. నిబందనల ప్రకారం బీమా ఉన్న వ్యక్తి మృతి చెందితే 24 గంటల్లో రూ.10 వేలు చెల్లించాల్సి ఉంది. మృతుల కుటుంబాలు దుర్భర జీవితం గడుపుతున్నా.. ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా లేదు.వైఎస్సార్సీపీ హయాంలో ఇలా..గత వైఎస్సార్సీపీ హయాంలో పేద బడుగు, బలహీన వర్గాల కుటుంబాల్లో 18 నుంచి 50 ఏళ్లలోపు వారు, 50 నుంచి 60 ఏళ్లలోపు వారు మృతిచెందితే రూ.లక్ష నుంచి రూ.ఐదు లక్షల వరకు బీమా సొమ్ము మంజూరయ్యేది. మృతి చెందిన వెంటనే వలంటీర్లు, గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది మృతుడి ఇంటికి వెళ్లి అంత్యక్రియల కోసం తక్షణ సాయంగా రూ.10 వేలు అందించేవారు. మిగతా సొమ్ము 15 నుంచి 20 రోజుల్లో నామిని బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేది. బీపీఎల్ కుటుంబాలకు చెందిన వారు అర్హులు కావడంతో ప్రభుత్వమే పూర్తి ప్రీమియం చెల్లించింది. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం, ఇన్సూరెన్స్ కంపెనీలు సహకరించకపోయినా పూర్తిగా ఈ పథకాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వమే అమలు చేసింది. రైస్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి ఈ పథకం అమలు అయ్యింది. ప్రస్తుత ప్రభుత్వం ఏం చేసిందంటే..సామాన్య, మధ్య తరగతి ప్రజలు మృతి చెందినా ప్రస్తుతప్రభుత్వం పట్టించుకోవడం లేదు. టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు మాత్రం పెద్దపీట వేసింది. కోటి మందికిపైగా టీడీపీ సభ్యత్వం కల్పించింది. వారికి రూ.5 లక్షలతో టీడీపీ తరఫున ప్రమాద బీమా కూడా కల్పించింది. టీడీపీ కార్యకర్తలకు ఇచ్చిన విలువ సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు ఇవ్వకపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. తమకు పార్టీ కార్యకర్తలే ముఖ్యం.. సామాన్య, మధ్య తరగతి ప్రజలు కాదని టీడీపీ నిరూపించుకున్నట్లు అయిందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
వైభవంగా పల్లకీ సేవ
బనగానపల్లె రూరల్: నందవరం గ్రామంలో వెలసిన శ్రీ చౌడేశ్వరిదేవి ఆలయంలో అమ్మవారి పల్లకీ సేవ కార్యక్రమం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, అర్చకుల ఆధ్వర్యంలో ఉదయం అమ్మవారికి కుంకుమార్చన, అభిషేకం జరిపించారు. సాయంత్రం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకీలో అధిష్టింపజేశారు. పల్లకీ సేవా కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీ చౌడేశ్వరిదేవి అమ్మవారి ఆలయాన్ని నంద్యాల జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి దర్శించుకున్నారు. పలువురు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ అనుబంధ విభాగంలో ముగ్గురికి స్థానం బొమ్మలసత్రం: వైఎస్సార్సీపీ రాష్ట్ర అనుబంధ విభాగంలో నందికొట్కూరుకు చెందిన ముగ్గురికి స్థానం కల్పిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. స్టేట్ స్టూడెంట్ వింగ్ కమిటీ జనరల్ సెక్రటరీగా నందికొట్కూరుకు చెందిన కె.మాధురిగౌడ్, సెక్రటరీగా కుందన రాజశేఖర్గౌడ్, స్టేట్ మైనార్టీ సెల్ కమిటీ సెక్రటరీగా షేక్ మహమ్మద్ అబ్దుల్జఫార్లను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతిభను వెలికి తీసేందుకు యువజనోత్సవాలు ● జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల: యువతలో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు యువజన ఉత్సవాల పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపా. జిల్లా యువజన సంక్షేమ శాఖ–సెట్కూరు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోటీలకు సంబంధించి పోస్టర్ను శుక్రవారం తన చాంబర్లో జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోటీల్లో 15 నుంచి 29 సంవత్సరాల మధ్య వయస్సు గల యువతీ యువకులు పొల్గొనవచ్చన్నారు. ఈ నెల 29న నంద్యాల రామకృష్ణ డిగ్రీ కళాశాలలో జిల్లా స్థాయి యువజనోత్సవ పోటీలు ఏడు విభాగాల్లో నిర్వహిస్తామని చెప్పారు. సెట్కూరు సీఈఓ డాక్టర్ కె. వేణుగోపాల్ మాట్లాడుతూ.. జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన విజేతలు రాష్ట్ర స్థాయికి, రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన వారు జాతీయ స్థాయికి ఎంపికవుతారని తెలిపారు. పూర్తి వివరాలకు మొబైల్ నంబర్లు 9292207601, 8328181581లను సంప్రదించవచ్చన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి జనార్దన్ రెడ్డి, ఇంటర్మీడియట్ విద్యాధికారి శంకర్ నాయక్, స్కిల్ డెవలప్మెంట్ అధికారి శ్రీకాంత్ రెడ్డి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సుబ్బయ్య, సెట్కూరు పర్యవేక్షణ అధికారి శ్యామ్ బాబు పాల్గొన్నారు. ‘నంద్యాల శనగ’తో అధిక దిగుబడులు నంద్యాల(అర్బన్): నంద్యాల గ్రామ్ 776 శనగ రకం సాగుతో రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చని ఆర్ఏఆర్ఎస్ ఏడీఆర్ జాన్సన్ తెలిపారు. అఖిల భారత రబీ అపరాల(శనగ) సమన్వయ పరిశోధనా పథకం కింద షెడ్యూల్ కులాల ఉపప్రణాళిక– ప్రథమ శ్రేణి ప్రదర్శన క్షేత్రాల నిర్వహణలో భాగంగా శుక్రవారం ఓర్వకల్లు మండలం ఉప్పలపాడు గ్రామ ఎస్సీ రైతులకు నంద్యాల గ్రామ్ 776 శనగ రకంతో విత్తనశుద్ధి మందులను పంపిణీ చేశారు. స్థానిక కార్యాలయలలో జరిగిన కార్యక్రమంలో ఏడీఆర్ జాన్సన్ మాట్లాడుతూ.. ఎండుతెగులును తట్టుకొనే నంద్యాల గ్రామ్ 776 శనగ రకం జీవన శిలీంధ్ర నాశినిలతో విత్తన శుద్ధి చేసుకోవాలన్నారు. సరైన సమయంలో ఇచ్చిన పురుగు మందులు, శిలీంధ్ర నాశినిలను వినియోగించి అధిక దిగుబడులు సాధించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వనరుల కేంద్రం ఏడీఏ చెన్నయ్య, శనగ శాస్త్రవేత్తలు నీలిమ, మంజునాథ్, చైతన్య పాల్గొన్నారు. -
కన్నీటి పర్యంతం..
‘అమ్మా.. కాలేజీకి వెళ్లి వస్తా అని చెప్పి.. ఇంకా రాలేదు కదా’ అంటూ ఉదయ్ తల్లిదండ్రులు రోదించారు. ఎమ్మిగనూరుకు చెందిన గోవింద్, రాధలకు ఇద్దరు కుమారులు. వీరు పట్టణంలో మగ్గం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పెద్ద కుమారుడు మనోహర్ బెంగళూరులో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. చిన్న కుమారుడు ఉదయ్ కుమార్ ఎర్రకోట సెయింట్ జాన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం సీఈసీలో ఏఐ చేస్తున్నాడు. గురువారం ఉదయం కాలేజీ వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి వచ్చాడు. ‘3 గంటల సమయంలో మీ వాడు గాజులదిన్నె ప్రాజెక్టు నీటిలో మునిగి పోయాడని ఫోన్ వచ్చిందని మేము ఇకా ఎవరి కోసం బతకాలి’ అంటూ తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించాయి. రోదిస్తున్న ఉదయ్ కుమార్ తల్లిదండ్రులు -
‘స్ఫూర్తి’దాయకం
శివాజీస్ఫూర్తి కేంద్రాన్ని ప్రధాని నరేంద్రమోదీ దర్శించారు. శివాజీ కాంస్య విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. దర్బార్లో త్రీడీ చిత్రాలతో ఏర్పాటు చేసిన శివాజీ జీవిత చరిత్రను చూశారు. నావికాదళానికి శివాజీ రాజముద్రను చిహ్నంగా మోదీ ఏర్పాటు చేయగా.. అది దర్బార్లో ఉండడంతో చూసిన ప్రధాని చిరునవ్వు చిందించారు. శివాజీ దర్బార్ను 1994 అక్టోబరు 16న ప్రారంభించామని, 2025 అక్టోబర్ 16న భారత ప్రధాని సందర్శనకు రావడం విశేషమని నిర్వాహకలు వివరించారు. దీంతో ప్రధాని చిరునవ్వులు చిందించారు. అనంతరం శివాజీ ధ్యానం చేసిన ధ్యాన మందిరాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా దర్భార్ హాల్లో ఉన్న జీవితవిశేషాలను డిజిటలైజేషన్ చేస్తే బాగుంటుందని ప్రధాని అన్నట్లు నిర్వాహకులు నాగేశ్వరరావు తెలిపారు. -
ఫోన్ మాట్లాడుతూ కుప్పకూలిన యువకుడు
● గుండెపోటుతో బీటెక్ విద్యార్థి మృతిఎమ్మిగనూరురూరల్: ఎర్రకోట సెయింట్ జాన్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీలో గురువారం మధ్యాహ్నం గుండె పోటుతో ఓ బీటెక్ విద్యార్థి హఠాన్మరణం చెందాడు. పట్టణంలోని ముగతి పేటకు చెందిన ఫారూక్, రెహెనాబానుల కుమారుడు అబ్దుల్రహీమాన్ (22) బీటెక్–సీఎస్బీ నాల్గవ సంవత్సరం చదువుతున్నాడు. మధ్యాహ్నం భోజనం చేసి చెట్టు కింద ఫోన్ మాట్లాడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి విద్యార్థులు వెంటనే చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గుండెపోటుతో మృతి వలనే మృతి చెందినట్లు చెప్పారు. కాగా ఇదే రోజు గాజులదిన్నె వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఎర్రకోట సెయింట్ జాన్స్ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన ఓ విద్యార్థి మృతి చెందడం, మరో విద్యార్థి గల్లంతు కావడం, ఇంకో విద్యార్థి గుండెపోటుతో మృతి చెందడంతో కళాశాలలో విషాదం అలుముకుంది. -
ఘాట్ రోడ్డులో ప్రమాదం
● పాత రైల్వే వంతెనను ఢీకొన్న లారీ, డ్రైవర్ దుర్మరణం మహానంది: నంద్యాల నుంచి గిద్దలూరు వెళ్లే నల్లమల ఘాట్రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ దుర్మరణం చెందాడు. బొగద వంతెన దాటిన తర్వాత ఉన్న పురాతన రైల్వే వంతెన వద్ద ఈ ప్రమాదం జరిగింది. కర్నూలు నుంచి విజయవాడ వెళుతున్న లారీ మలుపు వద్ద అదుపు తప్పి పురాతన వంతెనను ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి వంతెన గోడ, లారీ మధ్య ఇరుక్కు పోయిన లారీ డ్రైవర్ రాజు (42) అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదిలా ఉండగా లారీ రోడ్డుకు అడ్డుగా ఉండటంతో సుమారు ఆరు గంటల పాటు నల్లమల ఘాట్రోడ్డులో వాహనాల రాకపోకలు స్తంభించాయి. నంద్యాల నుంచి విజయవాడ, విజయవాడ వైపు నుంచి నంద్యాల, కర్నూలు, అనంతపురం మీదుగా ప్రయాణిస్తున్న వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. ప్రమాద విషయం తెలుసుకున్న గిద్దలూరు, మహానంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. రెండు క్రేన్లను తీసుకెళ్లి వాటి సాయంతో రోడ్డుపై అడ్డుగా ఉన్న లారీని పక్కకు తప్పించడంతో ఆరు గంటల తర్వాత వాహనాల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి. ప్రమాద స్థలం గిద్దలూరు పరిధికి రావడంతో గిద్దలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మట్టి మిద్దె కూలి వృద్ధురాలి మృతి
చిప్పగిరి: వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు మట్టి మిద్దె కూలి ఓ వృద్ధురాలు దుర్మరణం చెందింది. ఈ ఘటన నేమకల్లు గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన శాంతమ్మ(85) ఇంట్లో ఒంటరిగా నివాసముంటోంది. బుధవారం రాత్రి మంచంపై నిద్రిస్తుండగా పైకప్పు కూలి ఆమైపె పడటంతో అక్కడికక్కడే మృతి చెందింది. గురువారం గమనించిన చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు, తహసీల్దార్ ఇజాజ్ అహ్మద్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. వృద్ధురాలి మృతదేహాన్ని వెలికి తీయించి అంత్యక్రియలు చేయించారు. మృతురాలికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వీరు ఉపాధి రీత్యా ఇతర ప్రాంతాల్లో స్థిర పడినట్లు గ్రామస్తులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో రైతు మృతి మహానంది: ఆంజనేయపురం సమీపంలోని తెలుగుగంగ కాలువ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ రైతు మృతి చెందాడు. ఎస్ఐ రామ్మోహన్రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. గాజులపల్లె గ్రామానికి చెందిన నరసింహులు(60) పొలం పనులకు వెళ్లి తెలుగుగంగ కాలువ వద్ద రోడ్డు దాటుతుండగా అబ్బీపురం గ్రామానికి చెందిన బాలవర్ధన్ రాజు ఆటోలో వెళ్తూ ఢీకొన్నాడు. విషయం తెలుసు కున్న ఎస్ఐ రామ్మోహన్రెడ్డి వెంటనే తన వాహనంలో వృద్ధుడిని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నంద్యాల ప్రభుత్వాస్పత్రికి అంబులెన్స్ తర లించారు. అయితే కోలుకోలేక నరసింహులు మృతి చెందాడు. మృతుడి భార్య రాజమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని.. బండి ఆత్మకూరు: ఎర్రగుంట్ల గ్రామ సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వేల్పనూరు గ్రామానికి చెందిన ఎర్రద్దుల బ్రహ్మయ్య (33) అనే వ్యక్తి బుధవారం రాత్రి నంద్యాల వైపు బైక్పై వెళ్తుండగా.. ఎర్రగుంట్ల సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య లక్ష్మిదేవి, కూతురు, కుమారుడు ఉన్నారు. సమా చారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
వేదావతి నదిపై బ్రిడ్జి నిర్మాణానికి కృషి
● కర్ణాటక బళ్లారి ఎంపీ తుకారామ్హాలహర్వి: కర్ణాటక–ఆంధ్ర రాష్ట్రాల సరిహద్దులో ఉన్న వేదావతి నదిపై బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తామని కర్ణాటక రాష్ట్రం బళ్లారి ఎంపీ తుకారామ్ అన్నారు. గురువారం మండలంలోని గూళ్యం గ్రామంలో ఆయన పర్యటించారు. గ్రామ సమీపంలోని వేదావతి నదిపై బ్రిడ్జి నిర్మాణం, వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. వేదావతి నదిపై బ్రిడ్జి నిర్మాణానికి ఎంత నిధులు ఖర్చు అవుతాయన్న విషయాలపై ఆరా తీశారు. అనంతరం గాదిలింగేశ్వరస్వామి వారిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. శ్రీ గాదిలింగేశ్వరస్వామి ఆశీర్వాదంతో గతంలో తాను రెండుసార్లు ఎమ్మెల్యేగా, ప్రస్తుతం ఎంపీగా ఎన్నికయ్యానన్నారు. గూళ్యం గ్రామ సమీపంలో ఉన్న వేదావతి నదిపై బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. వేదావతి నదిపై బ్రిడ్జి నిర్మాణం జరిగితే ఆంధ్ర–కర్ణాటక రాష్ట్రాల పరిధిలోని గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందుతాయన్నారు. ఈ విషయాన్ని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య దృష్టికి తీసుకెళ్తామన్నారు. 2026 ఉగాది రోజున వేదావతి నదిపై బ్రిడ్జి నిర్మాణానికి భూమిపూజ చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే బళ్లారి నుంచి ఆంధ్ర సరిహద్దు వరకు నేషనల్ హైవే రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో సండూరు ఎమ్మెల్యే అన్నపూర్ణ, కంప్లీ ఎమ్మెల్యే గణేష్, వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి శశికళ కృష్ణమోహన్, గూళ్యం మాజీ సర్పంచ్ రాజశేఖర్గౌడ్, కురువ సంఘం నాయకులు పూజారి మల్లన్న, బజారప్ప, వీరేశప్ప, లింగమల్లప్ప, మాజీ ఎంపీపీ గాదిలింగప్ప, తిప్పేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఇలా ఉంటే ఎలా చదువుతారు?
● గురుకులం నిర్వహణ లోపాలపై మంత్రి సవిత ఆగ్రహంవెల్దుర్తి: వందలాది బాలికలు చదువుకునే గురుకులం నిర్వహణ ఇంత అధ్వానమా.. అంటూ బీసీ సంక్షేమ శాఖ రాష్ట్ర మంత్రి సవిత వెల్దుర్తి మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలికల గురుకుల పాఠశాల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆమె కర్నూలులో ప్రధానమంత్రి పర్యటనకు హాజరై తిరిగి అనంతపురం వెళ్తూ మార్గమధ్యలో వెల్దుర్తి బీసీ గురుకులాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా విద్యార్థినుల వద్దకు వెళ్లి ఎలా చదువుతున్నారని, భోజన, సౌకర్యాలు ఎలా ఉన్నాయని తెలుసుకున్నారు. అనంతరం స్టాఫ్ రిజిస్టర్, భోజన సరుకుల స్టాక్ రిజిస్టర్లు అందుబాటులో లేకపోవడం, భోజన సరుకులు నాణ్యత లేకపోవడం, వాసన వచ్చేంత వరకు వాడకుండా ఉంచడం, ఆ సమయంలో గురుకులంలో ప్రిన్స్పాల్, వార్డెన్ తదితరులు లేకపోవడంతో.. ఇదేనా నిర్వహణ అంటూ వైస్ ప్రిన్స్పాల్ రాధపై అగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తమ శాఖ సెక్రటరీకి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. బాలికల గురుకులంలో ముగ్గురు యువకు లు పనిచేస్తుండడంపై ఇదేమిటంటూ ప్రశ్నించారు. పాఠశాలకు సొంత భవనం, గ్రౌండ్ లేదని విద్యార్థినులు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే ద్వారా వెల్దుర్తి బీసీ గురుకల పాఠశాలకు సొంత భవన ఏర్పాటు కోరుతూ వినతి వచ్చిందని, త్వరలో తగు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. -
అభివృద్ధి పేరుతో అప్పులు చేస్తున్నారు!
● వామపక్ష నాయకుల ఆందోళన నంద్యాల(న్యూటౌన్): రాష్ట్ర అభివృద్ధి పేరుతో కూటమి నేతలు విపరీత అప్పులు చేస్తున్నారని వామపక్ష పార్టీల నాయకులు ఆరోపించారు. ఎలాంటి అభివృద్ధి లేకున్నా వేల కోట్ల రూపాయలు అప్పులు ఎలా తీసుకు వస్తారని ప్రశ్నించారు. నంద్యాల పట్టణంలోని పద్మావతినగర్ ఆర్చి నుంచి గాంధీచౌక్ వరకు సీపీఐ, సీపీఎం న్యూడెమోక్రసీ సంఘాల నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ‘మోదీ గో బ్యాక్’ అని నినాదాలు చేశారు. అనంతరం గాంధీచౌక్లో జరిగిన నిరసనలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగరాజు మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి శాంతియుతంగా నిరసన చేస్తున్న వామపక్ష నాయకుల అక్రమ అరెస్ట్లకు పాల్పడటం శోచనీయమన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు. సిద్ధేశ్వరం అలుగు పూర్తి చేయాలని, శ్రీశైలానికి రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జీఎస్టీ తగ్గిస్తున్నామంటూ సభలను నిర్వహించడం ప్రజలను పక్కదారి పట్టించడమేనన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు సోమన్న, డి శ్రీనివాసులు పాల్గొన్నారు. -
విధుల్లో అప్రమత్తంగా ఉండండి
● పోలీసు అధికారులకు డీజీపీ ఆదేశంకర్నూలు: ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు పర్యటన నేపథ్యంలో బందోబస్తు విధుల్లో ఉండే పోలీసు అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో అడిషనల్ డీజీ ఎన్. మధుసూదన్ రెడ్డి, ఐజీ శ్రీకాంత్, డీఐజీలు కోయ ప్రవీణ్, గోపీనాథ్ జెట్టి, సెంథిల్ కుమార్, సత్య ఏసుబాబు, ఫక్కీరప్ప కాగినెల్లిలతో కలసి పీఎం భద్రత ఏర్పాట్లపై సమీక్షించారు. మినిట్ టు మినిట్ ప్రోగ్రాం, రూట్ మ్యాప్, రాగమయూరి బహిరంగ సభ తదితర ప్రాంతాలను గూగుల్ జియో మ్యాప్ను తెరపై చూపిస్తూ డీజీపీకి ఎస్పీ విక్రాంత్ పాటిల్ వివరించారు. భద్రత చర్యలపై చర్చించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. బహిరంగ సభకు ఎక్కడినుంచి ఎన్ని బస్సులు వస్తున్నాయనే విషయంపై అధికారులు అవగాహన కలిగి ఉండాలన్నారు. బహిరంగ సభ వద్ద మఫ్టీ పోలీసులను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వీవీఐపీలు వెళ్లిపోయేవరకు ఎక్కడ కూడా ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చూడాలన్నారు. డీఐజీలు, ఎస్పీలు, ట్రైనీ ఐపీఎస్లు, అడిషనల్ ఎస్పీలు, డీఎస్పీలు సమావేశంలో పాల్గొన్నారు. పటిష్ట బందోబస్తు శ్రీశైలంటెంపుల్: ప్రధాని నరేంద్రమోదీ తొలిసారిగా శ్రీశైలం వస్తున్న నేపథ్యంలో 1,800 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీశైలంలో ప్రత్యేక పూజల అనంతరం జగద్గురు పీఠాన్ని ప్రధానమంత్రి సందర్శిస్తారు. శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని, ధ్యాన మందిరాన్ని సందర్శించి సున్నిపెంటకు వెళ్తారు. ప్రధాని శ్రీశైలం పర్యటనను పురస్కరించుకుని పోలీసులు బుధవారం ట్రయల్రన్ నిర్వహించారు. -
శ్రీగిరి అభివృద్ధికి ఆమోదీంచేనా!
శ్రీశైలంటెంపుల్: ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వరూపంలో కొలువైన ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీశైల మహాక్షేత్రం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకే ప్రాంగణంలో జ్యోతిర్లింగ స్వరూపుడు, శక్తిపీఠం కలగలసి వెలసి ఉన్న ఏకైక క్షేత్రం. అంతటి ప్రాశస్త్యం ఉన్న మహాక్షేత్రం అభివృద్ధికి దూరమవుతోంది. అరకొర సౌకర్యాలతో భక్తులు అవస్థలు పడుతున్నారు. క్షేత్రంలో ఏ చిన్న అభివృద్ధి చేయాలన్న అటవీశాఖ నుంచి అడ్డంకులు ఎదురవుతున్నాయి. రహదారులు, వసతి సౌకర్యాలు భక్తులను వేధిస్తున్నాయి. గురువారం శ్రీశైలానికి భారత ప్రధాని మోదీ వస్తున్న నేపథ్యంలో క్షేత్ర అభివృద్ధిపై దృష్టి సారించి, శ్రీగిరిలో నెలకొన్న సమస్యలపై దృష్టిసారించి పరిష్కరించాలని భక్తులు కోరుతున్నారు. ఈ క్షేత్రానికి చేరుకోవాలంటే అటు ఆంధ్రా నుంచి అయినా, ఇటు తెలంగాణ ప్రాంతం నుంచి అయినా రైలు మార్గం లేదు. సుమారు 80 కిలోమీటర్ల దూరంలోని మార్కాపురం రోడ్డు వరకు మాత్రమే రైలు మార్గం ఉంది. ఇటు తెలంగాణ నుంచి అయితే రైలు మార్గం అసలే లేదు. గతంలో పార్లమెంట్సభ్యులు శ్రీశైలానికి రైలు మార్గం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించడంతో పరిశీలించాలని అధికారులకు ఆదేశించింది. కేంద్రం ఆదేశాలతో ప్రత్యేక కమిటీ సభ్యులు శ్రీశైలానికి రైలు మార్గానికి ఉన్న అవకాశాలను పరిశీలించారు. శ్రీగిరి చుట్టూ నల్లమల అభయారణ్యం కావడంతో మార్కాపురం రోడ్డు నుంచి దోర్నాల వరకు రైలు మార్గాన్ని విస్తరించవచ్చునని ప్రతిపాదనలను పంపినట్లు సమాచారం. అయితే ఏటా బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు శ్రీశైలానికి రైలు మార్గం బడ్జెట్లో ప్రస్తావనకు రావడం లేదు. క్షేత్రానికి రైలు మార్గం ఉంటే సామాన్య భక్తులు సైతం క్షేత్ర యాత్ర చేసుకునే అవకాశం ఉంటంది. ఐకానిక్ బ్రిడ్జికి గ్రీన్సిగ్నల్ ఇచ్చేనా? శ్రీశైల దేవస్థానంలో విధులు నిర్వహించే ఉద్యోగులకు సున్నిపెంటగ్రామంలో సుమారు రూ.70 కోట్లతో స్టాఫ్ క్వాటర్స్ నిర్మించారు. సున్నిపెంట నుంచి శ్రీశైలానికి 10 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ దూరాన్ని తగ్గించాల నే ఉద్దేశంతో సున్నిపెంట నుంచి కృష్ణానదిపై శ్రీశైలం వరకు ఐకానిక్ బ్రిడ్జి నిర్మించాలని మాస్టర్ప్లాన్లో ప్రతిపాదించారు. అలాగే తెలంగాణ నుంచి శ్రీశైలంకు సమీపంలో దూరాన్ని తగ్గించేలా తెలంగాణ ప్రభుత్వం ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు డీపీఆర్ సిద్ధం చేసి అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపారు. ఏపీ, తెలంగాణ ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వ అటవీశాఖ అధికారులు అనుమతులు ఇవ్వాలి. ఐకానిక్ వంతెనను నిర్మిస్తే భక్తులకు శ్రీశైలం దూరం తగ్గడంతో పాటు ప్రయాణం సాఫీగా సాగుతుంది. భూ బదలాయింపు జరిగేనాగతంలో దేవదాయ, అటవీ, రెవెన్యూ శాఖల మంత్రులు, మూడు శాఖల ఉన్నతాధికారులతో హైపవర్ కమిటీ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి ప్రాథమికంగా శ్రీశైల దేవస్థానానికి 5,302 ఎకరాల భూమి ఉందని నిర్ధారించారు. శ్రీశైల దేవస్థానానికి 1967 నవంబర్లో ఫుడ్ అండ్ అగ్రికల్చరేట్ డిపార్ట్మెంట్ ప్రకారం 5,302 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ మొత్తం భూమి 9 సర్వే నెంబర్లలో ఉంది. 5,302 ఎకరాల్లో 900 ఎకరాలు శ్రీశైలం ప్రాజెక్టు రిజర్వాయర్లో ముంపు అయింది. బ్రిటీష్ కాలం నాటి జీవో, బ్రిటీష్ కాలం నాటి గెజిట్ ఎంట్రీ ద్వారా సర్వే చేయించి క్షేత్ర సరిహద్దులను గుర్తించారు. 4,400 ఎకరాలు శ్రీశైల మల్లన్న కు చెందిన భూమి అని గుర్తించి, అటవీశాఖ అంగీకరించింది. దీంతో ఆ భూమిని దేవస్థానానికి అప్పగించేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరుఫున దేవదాయశాఖకు భూమిని అప్పగించేందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్వే డిపార్ట్మెంట్కు డీఎఫ్వో లేఖ రాశారు. అక్కడి నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. ఘాట్రోడ్డు విస్తరించేనాశ్రీశైల క్షేత్రానికి ఏపీ, అటు తెలంగాణ నుంచి చేరుకోవాలంటే సుమారు 100 కి.మీ దూరం ఘాట్రోడ్డులో రోడ్డు ప్రయాణం చేయాలి. ఏపీ వైపు శ్రీశైలం నుంచి ఆత్మకూరు వైపు సుమారు 100 కిలోమీటర్లు ఘాట్రోడ్డు సింగిల్ రోడ్డు మాత్రమే. వర్ష కాలంలో ఇరుకైన ఈ రోడ్డులో తరచూ భారీ వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్య నెలకొంటుంది. ఈ రోడ్డు నేషనల్ హైవే పరిధిలో ఉన్నప్పటికీ విస్తరించడం లేదు. ఆత్మకూరు నుంచి దోర్నాల, దోర్నాల నుంచి శ్రీశైలం నాలుగు లైన్లుగా విస్తరిస్తే క్షేత్రానికి భక్తుల రాకపోకలు మరింత పెరిగే అవకాశం ఉంది. అలాగే దోర్నాల–శ్రీశైలం నేషనల్ హైవే 765 పరిధిలో ఉంది. ఎన్హెచ్–765 రహదారిని విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.3వేల కోట్లతో చేపట్టేందుకు డీపీఆర్ సిద్ధం చేశారు. ఈ ప్రాంతంలో అండర్పాస్, ఓవర్ పాస్ బ్రిడ్జిలు నిర్మిస్తే వన్యప్రాణులు, పులుల సంచారానికి ఆటంకం లేకుండా, వన్యప్రాణులు వాహనాల ప్రమాదానికి గురికాకుండా ఉంటుందని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అలాగే లింగాలగట్టు నుంచి శ్రీశైలానికి ఆంధ్రా–తెలంగాణ ప్రాంతాలను కలుపుతూ సుమారు రూ.300కోట్లతో ఒక ఐకానిక్ బ్రిడ్జి నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మల్లన్న క్షేత్రానికి ‘ప్రసాదం’ అందేనా..! శ్రీశైల క్షేత్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ స్కీం రూ.43 కోట్లతో అభివృద్ధి చేసింది. శ్రీశైలక్షేత్రానికి రోజు రోజుకు పెరుగుతున్న భక్తులు, పర్యాటకుల సౌకర్యార్థం శ్రీశైలంలో కల్పించాల్సిన సౌకర్యాలపై 2017 లో అప్పటి ఈవో భరత్గుప్తా కేంద్ర పర్యటక శాఖ అధికారులకు వివరించి, డీపీఆర్ను సమర్పించారు. దీంతో కేంద్ర పర్యాటక శాఖ (పిలిగ్రిమేజ్ రెజువెనేషన్ అండ్ స్పిర్చువల్ అగ్మెంటేషన్ డ్రైవ్) ప్రసాద్ పథకం కింద శ్రీశైల క్షేత్రంలో భక్తులకు, పర్యాటకులకు కల్పించాల్సిన సౌకర్యాల కోసం రూ.43 కోట్లు నిధులు మంజూరు చేసింది. మూడు విడతలుగా నిధులు మంజూరయ్యాయి. 2017లో శ్రీశైలంలో ప్రసాద్ పథకం ద్వారా పనులు ప్రారంభించారు. కేంద్రం మంజూరు చేసిన పనులను రాష్ట్ర పర్యాటక శాఖ, శ్రీశైల దేవస్థాన ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణలో చేపట్టారు. 2022 డిసెంబరు 26న రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా ఆయా అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మల్లన్న దర్శనానికి వస్తున్న మోదీ.. శ్రీగిరి అభివృద్ధికి వరాలు కురిపించాలని భక్తులు కోరుతున్నారు. -
చౌడేశ్వరిదేవి ఆభరణాల లెక్కింపు
బనగానపల్లె రూరల్: నందవరంలో వెలిసిన శ్రీ చౌడేశ్వరిదేవి అమ్మవారికి భక్తులు విరాళంగా అందజేసిన బంగారు, వెండి ఆభరణాల లెక్కింపు కార్యక్రమం రాయలసీమ జోన్ జువెలరీ వెరిఫికేషన్ అధికారి పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టారు. 2005 సంవత్సరం నుంచి బంగారు, వెండి ఆభరణాలు లెక్కింపు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు మొత్తం 7.436 కేజీల బంగారు ఆభరణాలు ఉన్నట్లు అధికారులు ధ్రువీకరించారు. 139.500 గ్రాముల ఆభరణాలకు రశీదులు లేకపోవడంతో వాటిని రాయించారు. వెండి ఆభరణాలను బుధవారం పరిశీలించనున్నట్లు పాండురంగారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో గత ఈవో రామానుజన్, ఆలయ అర్చకులు, వెరిఫికేషన్ అధికారులు పాల్గొన్నారు. నేటి నుంచి న్యాయవాదుల విధుల బహిష్కరణ నంద్యాల(వ్యవసాయం): కర్నూలులో హైకోర్టు బెంచి త్వరగా ఏర్పాటు చేయాలని కోరుతూ కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ పిలుపు మేరకు నంద్యాల బార్ అసోసియేషన్ నాయ కులు బుధవారం నుంచి రెండు రోజుల పాటు కోర్టు విధులను బహిష్కరిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు హుసేన్బాషా, సుబ్బరాయు డు, ముక్కెర కృష్ణారెడ్డిలు మంగళవారం తెలిపారు. విధుల బహిష్కరణ కార్యక్రమానికి న్యాయవాదులు, కక్షిదారులు, కోర్టు సిబ్బంది సహకరించాలని వారు కోరారు. రెండు రోజులు ప్రైవేటు పాఠశాలలకు సెలవు నంద్యాల(న్యూటౌన్): ప్రధాని నరేంద్రమోదీ ఉమ్మడి జిల్లా పర్యటన నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రైవేటు పాఠశాలలకు బుధ, గురువారా లు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు జనార్దన్రెడ్డి మంగళవారం ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 15, 16వ తేదీల్లో ప్రైవేటు యాజమాన్య పాఠశాలల కు మాత్రమే సెలవు ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ తేదీల్లో జరిగే ఎఫ్ఏ–2 పరీక్షలు 21, 22 తేదీల్లో నిర్వహించడం జరుగుతుందన్నారు. మద్యం బాటిళ్లపై క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి నంద్యాల: నకిలీ మద్యం అనే అనుమానం వస్తే మద్యం బాటిల్పై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే తెలిసిపోతుందని జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ రవికుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీ ఎకై ్సజ్ సురక్ష యాప్ను ప్లేస్టోర్లోకి వెళ్లి డౌన్లోడ్ చేసుకోవాలని, మద్యం కొనుగోలు చేసేటప్పుడు ఈ యాప్ ద్వారా స్కాన్ చేయాలన్నారు. మద్యం బాటిల్పై ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే బాటిల్ తయారు అయిన కంపెనీ, తయారు చేసిన తేదీ, కంపెనీ, ఎమ్మార్పీ ధరతో సరి చూసుకొని కొనుగోలు చేయవచ్చన్నారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు ఏవైనా తప్పులు వస్తే టోల్ఫ్రీ నం.14405, 9440902586 ఫోన్ చేయాలన్నారు. హోలోగ్రాఫిక్, ఎకై ్సజ్ లేబుల్స్ బీర్లపై ఉండవని, మద్యం బాటిళ్లపై మాత్రమే ఉంటాయన్నారు. ఏపీ ఎకై ్సజ్ సురక్ష యాప్ను ఉపయోగించుకోవాలన్నారు. -
పీఎం పర్యటనకు పకడ్బందీ బందోబస్తు
● విధుల్లో 1,800 మంది పోలీసులు ● ఎస్పీ సునీల్ షెరాన్ శ్రీశైలంటెంపుల్: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 16న శ్రీశైలం పర్యటనను పురస్కరించుకుని 1800 మంది పోలీసు బలగాలతో పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు నంద్యాల ఎస్పీ సునీల్షెరాన్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం మీడియాతో ఎస్పీ మాట్లాడుతూ.. ప్రధాని శ్రీశైలం పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేశామన్నారు. ప్రధాని హెలిపాడ్కు చేరుకున్నప్పటి నుంచి దర్శనం అనంతరం తిరిగి వెళ్లేంత వరకు ఆయన పర్యటించే ప్రదేశాలలో విస్త్రత తనిఖీలు నిర్వహించి, ప్రధాన కూడళ్లలో సాయుధ బలగాలతో పికెట్లు ఏర్పాటు చేశామన్నారు. బందోబస్త్కు వచ్చిన సిబ్బందిని 10 సెక్టార్లుగా విభజించి, ప్రతి సెక్టార్కు ఒక ఉన్నతాధికారిని ఇన్చార్జ్గా నియమించామన్నారు. జియోగ్రాఫికల్ మ్యాప్ ద్వారా ప్రధాని పర్యటించే ప్రాంతాల్లో తీసుకోవలసిన భద్రత చర్యలను క్షుణ్ణంగా సిబ్బందికి వివరించామని వివరించారు. నల్లమలలో గ్రేహౌండ్స్ కూంబింగ్: నల్లమల అడవుల్లో స్పెషల్పార్టీ పోలీసులు, గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ ముమ్మరం చేశారు. స్పెషల్ పార్టీ సాయుధబలగాలు శ్రీశైలం చుట్టూ, ప్రధాని పర్యటించే ప్రదేశాలలో తనిఖీలు చేపట్టారు. ప్రధాని పర్యటించే ప్రాంతాల్లో రోడ్డు ఓపెనింగ్ పార్టీ సిబ్బంది హ్యాండ్ హోల్డ్ మెటల్ డిటెక్టర్ సహాయంతో, పోలీసు జాగిలాలతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. క్షేత్ర పరిధిలోని అన్ని డార్మెంటరీలు, సత్రాలలో బస చేస్తున్న భక్తుల వివరాలను తెలుసుకుంటున్నారు. -
సీమ హక్కుల అమలుకు చర్యలు చేపట్టండి
నంద్యాల(అర్బన్): రాయలసీమ ప్రాంతానికి చట్టబద్ధంగా కల్పించిన హక్కులను తక్షణమే అమలు చేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి విన్నవించారు. ఈ మేరకు స్థానిక కార్యాలయంలో మంగళవారం వినతి పత్రాన్ని మెయిల్ ద్వారా ఆయన పీఎం కార్యాలయానికి పంపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం సీమకు ప్రత్యేక ప్యాకేజీ విడుదల చేయాలని, రాష్ట్రం విడిపోయి 11 ఏళ్లు అవుతున్నా సీమ జిల్లాలకు నిధుల విడుదలలో అన్యాయం జరుగు తుందన్నారు. కేంద్రీకృత అభివృద్ధి విధానాన్ని పాలకులు ఎంచుకోవడంతో ఏర్పడిన నిధుల కొరత వల్ల రాష్ట్ర విభజన చట్టం హక్కులు కల్పించిన తెలుగుగంగ, గాలేరునగరి, హంద్రీనీవా, వెలుగొండ ప్రాజెక్టుల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని నిధులు విడుదల చేసి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కడప ఉక్కు కర్మాగారం, జాతీయ స్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరారు. బచావత్ ట్రిబ్యునల్ హక్కులు కల్పించిన హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీ, కేసీ కెనాల్, ఎస్సార్బీసీ ప్రాజెక్టులకు పూడిక, రిజర్వాయర్ల లేమి కారణంగా కేటాయించిన నీరు వినియోగించుకోలేని పరిస్థితి ఉందన్నారు. సీమ యువత భవిష్యత్తు, గ్రామీణ ప్రజల జీవనోపాధిపై తక్షణ చర్యలు చేపట్టి సీమ సమగ్ర అభివృద్ధికి పునాదులు వేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు వైఎన్ రెడ్డి, రామచంద్రారెడ్డి, అసదుల్లా, బెక్కెం రామసుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
నిధులు, నీళ్లు కావాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు రాయలసీమకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయి. పెండింగ్లోని సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించడంలేదు. బీజేపీ రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించి 8 ఏళ్లు అయినా ఒక్క డిమాండ్నూ నెరవేర్చలేదు. ఒక్క ప్రాజెక్టును కూడా కట్టలేదు. రాయలసీమలో హైకోర్టును ఏర్పాటు చేస్తామన్నా అమలుకు నోచుకోలేదు. 11ఏళ్లుగా జీఎస్టీ భారం మోపుతున్న మోదీ ఇప్పుడు కొసరులో పీసరు తగ్గించి సంబరాలకు రావడం అన్యాయం. – కె.ప్రభాకరరెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు, కర్నూలు -
సాగునీటి రంగానికి తీవ్ర అన్యాయం
బీజేపీ డిక్లరేషన్లో పెండింగ్ ప్రాజెక్టులకు రూ.10 వేల కోట్లు కేటాయించాలని పెట్టారు. ఆ నిధుల ద్వారా సిద్దేశ్వరం అలుగు, గుండ్రేవుల, వేదవతితో రాయలసీమను సస్యశ్యామలం చేయవచ్చన్నది వారి ఆలోచన. అయితే అందుకు సంబంధించిన నిధులను కేటాయిండంలో విఫలం కావడంతో రాయలసీమ రైతాంగానికి తీరని అన్యాయం జరుగుతోంది. వర్షాలు సమృద్ధిగా పడినా సముద్రం పాలవుతున్నాయి. వర్షపు నీటిని ఒడిసి పట్టుకునే పరిస్థితి లేకపోవడంతో కళ్లెదుటే నీళ్లున్నా పొలాల్లో కన్నీళ్లు పారుతున్నాయి. రాయలసీమలోని ఓర్వకల్లు(కర్నూలు), కొప్పర్తి(వైఎస్ఆర్)లలో పారిశ్రామిక వాడలు ఉన్నాయి. వాటిని వృద్థిపథంలోకి తేవడానికి కేంద్రం చేయూత ఎంతో అవసరం. అయితే ఆ దిశగా కేంద్రం చర్యలు తీసుకోవడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ పార్కులో 10 వేల ఎకరాలతో ల్యాండ్ బ్యాంకును ఏర్పాటు చేసినా మౌలిక వసతుల కల్పనలో విఫలంతో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకు రావడంలేదు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పారిశ్రామికవాడలపై దృష్టి సారించాల్సి ఉంది. -
సీనరేజ్ వసూలుకు అష్ట దిగ్బంధం
● పలు చోట్ల చెక్పోస్టులు ఏర్పాటు చేసిన ప్రైవేట్ సంస్థ ● ఎగుమతి నిలిపివేసిన నాపరాతి పరిశ్రమ యజమానులు కొలిమిగుండ్ల: భూగర్భంలో నుంచి వెలికితీసే వివిధ రకాల ఖనిజాలకు ప్రభుత్వం సీనరేజ్ (రాయల్టీ) వసూలు చేసే బాధ్యత ప్రైవేట్ సంస్థకు అప్పగించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోటా పోటీలో వేలం దక్కించుకున్న సుధాకర ఇన్ఫ్రా సంస్థ కూటమి ప్రభుత్వానికి నెలకు రూ.14.05 కోట్ల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. నాపరాళ్లు (బ్లాక్స్టోన్) ఇతర ఖనిజాలను ట్రాక్టర్లు, లారీల్లో ఎగుమతి చేసేందుకు టన్నుల ప్రకారం సీనరేజ్ వసూలును ప్రవేట్ సంస్థ ప్రారంభించింది. కొలిమిగుండ్ల, అవుకు, మండలాల్లో పలు చోట్ల చెక్పోస్ట్లు ఏర్పాటు చేసి ఒక్క వాహనం తప్పించుకోకుండా అష్ట దిగ్బంధం చేశారు. ప్రతి చెక్పోస్ట్ వద్ద ప్రవేట్ సిబ్బందిని 24 గంటల పాటు పర్యవేక్షణ చేసేలా ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, బైక్, జీపుల్లో పెట్రోలింగ్ చేసే టీంను ప్రత్యేకంగా నియమించా రు. నాపరాళ్ల మైనింగ్లో వ్యర్థాలుగా మిగిలే గోడరాళ్లుకు కూడా సీనరేజ్ వసూలు చేస్తున్నారు. గతంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో భూగర్భ గనుల శాఖ అధికారులు రాయల్టీ వసూలు చేసేవారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయడంతో ఓ సంస్థ రంగంలోకి దిగింది. గతంలో ట్రాక్టర్ రవాణా చేసేందుకు రాయల్టీకి రూ.600 మేర చెల్లించాల్సి వస్తుండేది. ప్రస్తుతం 18 శాతం జీఎస్టీతో కలిపి టన్నుకు రూ.222 వసూలు చేస్తున్నారు. ట్రాక్టర్కు 5 టన్నులకు రూ.1,100 రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచన రాగానే అప్పటి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, ఎమ్మెల్యే కాటసా ని రామిరెడ్డి, జెడ్పీచైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డిలు వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఈ ప్రాంతంలో మైనింగ్ పరిశ్రమ ఎదుర్కొంటున్న కష్టాల గురించి వివరించారు. దీంతో యజమానులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఆ ఆలోచనను విరమించుకుంది. కానీ కూటమి ప్రభుత్వం ఏమాత్రం ఆలో చించకుండా ఇష్టారాజ్యంగా ప్రైవేట్కు అప్పగించడంతో యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిలిచిన రవాణా నాపరాళ్ల రవాణా ట్రాక్టర్లు, లారీలతో రద్దీగా ఉండే రహదారులు బోసిపోయి కనిపిస్తున్నాయి. మూడు రోజుల నుంచి రవాణా నిలిచిపోవడంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దినసరి కూలీ పనులు చేసే కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూడు మండలాల్లో లారీ, ట్రాక్టర్లకు లోడింగ్ చేసే కార్మికులు సుమారు 1,500 మేర ఉంటారు. మూడు రోజుల నుంచి పనులు లేక పోవడంతో కుటుంబ పోషణ భారంగా మారుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. ట్రాక్టర్ యజమానుల నిరసన.. బనగానపల్లె రూరల్: కూటమి ప్రభుత్వం రాయల్టీలను ప్రవేట్ పరం చేయడంతో ట్రాక్టర్ల యజమానులు నిరసన వ్యక్తం చేశారు. బీరవోలు సమీపంలో ప్రైవేట్ సంస్థ ఏర్పాటు చేసిన రాయల్టీ చెక్పోస్ట్ వద్ద ట్రాక్టర్ యజమానులు నాపరాతి గనుల్లోని వేస్ట్ మెటీరియల్ను ట్రాక్టర్లలో తీసుకొచ్చి రోడ్డుకు అడ్డంగా వేశారు. గతంలో నాపరాతి గనుల్లో వెలికితీసిన వేస్ట్ మెటిరియల్కు ప్రభుత్వానికి ఎటువంటి రాయల్టీ చెల్లించకుండా ఉచితంగా రవాణా చేసే వారమని, ప్రస్తుతం ఈ రాయల్టీ చెల్లింపు ప్రవేట్ వారికి ప్రభుత్వం అప్పగించడంతో వారు వేస్ట్ మెటిరియల్కు కూడా టన్నుకు సుమారు రూ.140 ప్రకారం చెల్లించాల్సి వస్తోందన్నారు. దాదాపు రెండు గంటల సేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. బందార్లపల్లె క్రాస్ రోడ్డులో ప్రైవేటు సంస్థ ఏర్పాటు చేసిన చెక్పోస్ట్రాయల్టీ కోసం ట్రాక్టర్లను నిలిపిన దృశ్యం -
కర్నూలులో కదంతొక్కిన మహిళలు
సీబీఐతో విచారణ చేయించాలి ప్రజల ప్రాణాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోంది. రాష్ట్రంలో వెలుగుచూసిన భారీ నకిలీ మద్యం రాకెట్ వ్యవహా రంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పాత్ర ఉందని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. నకిలీ మద్యంపై సిట్ చేత దర్యాప్తు చేయిస్తామని చంద్రబాబు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉంది. చిత్తశుద్ధి ఉంటే సీబీఐ చేత విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. – కాటసాని రాంభూపాల్రెడ్డి, వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు టీడీపీ నాయకులు డబ్బు కక్కుర్తి కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నకిలీ మద్యాన్ని తయారు చేసి దర్జాగా అమ్ముతున్నా పట్టించుకునేవారు లేరు. గత వైఎస్సార్సీపీ హయాంలో కనీసం బెల్ట్షాప్లు కూడా ఉండేవి కావు. ఇప్పుడు ఏ ఊరు చూసినా నకిలీ మద్యం, బెల్ట్ షాపులే కనిపిస్తున్నాయి. నకిలీ మద్యం గుట్టు వీడాలంటే సీబీఐతో దర్యాప్తు చేపట్టాల్సిందే. – గంగుల బిజేంద్రారెడ్డి, ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే ఎన్నికల ముందు కూటమి నేతలు నాణ్యమైన మద్యం సరఫరా చేస్తామని చెప్పి ఇప్పుడు నకిలీ మద్యాన్ని ప్రజలకు అంటగడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో నకిలీ మద్యం రాష్ట్రంలో ఏరులై పారుతుంది. నకిలీ మద్యం గుట్టు పూర్తిగా వీడాలంటే రాష్ట్ర వ్యాప్తంగా వైన్షాపులు, బార్లు, బెల్ట్ షాపుల్లో ఎకై ్సజ్ శాఖ తనిఖీలు చేయాల్సిందే. – దారా సుధీర్, వైఎస్సార్సీపీ నందికొట్కూరు ఇన్చార్జ్ నంద్యాల: నకిలీ మద్యాన్ని తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలు తీస్తున్న టీడీపీ నాయకుల తీరు, కూటమి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా వ్యాప్తంగా ఎకై ్సజ్ కార్యాలయాల ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనకు మహిళలు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ‘నారా వారి నకిలీ మద్యం వద్దు.. ప్రజల ప్రాణాలే ముద్దు’ అంటూ మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జిల్లాలోని నంద్యాల, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, డోన్, బనగానపల్లె, నందికొట్కూరు నియోజకవర్గ కేంద్రాల్లో నకిలీ మద్యం అమ్మకాలను అరికట్టాలని వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ర్యాలీలు, నిరసనలు నిర్వహించారు. నకిలీ మద్యం అమ్మకాలు ఆపి ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరుతూ జిల్లా కేంద్రం నంద్యాలలో నూనెపల్లె నుంచి ఎకై ్సజ్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి గంట పాటు ఎకై ్సజ్ కార్యాలయం ఎదుట శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు. సీఎం డౌన్.. డౌన్.. నారా వారి నకిలీ మద్యం వద్దు.., విచ్చలవిడి మద్యం అమ్మకాలను అరికట్టాలి.. అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఎకై ్సజ్ సీఐ కృష్ణమూర్తికి వినతి పత్రం అందజేశారు. వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షు డు దాల్మిల్ అమీర్, వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శశికళారెడ్డిలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇటీవల బట్టబయలైన నకిలీ మద్యం తయారీ, సరఫరా చూస్తే ప్రజల్లో ఆందోళన కలుగుతుందన్నారు. కేవలం స్పిరిట్, రసాయనాలతో తయారు చేసి, పాపులర్ బ్రాండ్లను తలపించేలా బాటిళ్లపై నకిలీ లేబుల్స్ అతికించి యథేచ్ఛగా సరఫరా చేస్తూ అమ్ముతున్నారంటే వారి వెనుక టీడీపీ నాయకులు ఉన్నారని అందరికీ అర్థమవుతుందన్నారు. నకిలీ మద్యం గుట్టు పూర్తిగా తేల్చేందుకు ఈ కేసును దమ్ముంటే సీబీఐకి కూటమి ప్రభత్వం అప్పగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా, వైఎస్సార్సీపీ నాయకులు కల్లూరి రామలింగారెడ్డి, అనిల్ అమృతరాజ్, రసూల్ ఆజాద్, తదితరులు పాల్గొన్నారు. ● ఆళ్లగడ్డలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త గంగుల బిజేంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన నకిలీ మద్యంపై నిరసన కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. నియోజకవర్గంలోని ఆరు మండలాలతో పాటు పట్టణంలోని మహిళా కార్యకర్తలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ కార్యాలయం నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించి అక్కడ దివంగత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం ర్యాలీగా ఎకై ్సజ్ కార్యాలయానికి చేరుకుని ఎకై ్సజ్ అధికారికి వినతి పత్రం అందజేశారు. ● నారావారి నకిలీ మద్యాన్ని అరికట్టాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో బనగానపల్లెలో నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నాయకుడు కాటసాని తిరుపాల్రెడ్డి ఇంటి వద్ద నుంచి బస్టాండ్ సమీపంలో ఉన్న ఎకై ్సజ్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఎకై ్సజ్ ఎస్ఐ కమలాకర్కు వినతి పత్రం అందజేశారు. కల్తీ మద్యంపై విచారణను రాష్ట్ర ప్రభుత్వం సిట్ అధికారులతో కాకుండా సీబీఐకి అప్పగించాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. ● ఆత్మకూరు పట్టణంలోని ఎకై ్సజ్ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్సీపీ పట్టణ, మండల అధ్యక్షులు రాజమోహన్ రెడ్డి, సయ్యద్ మీర్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి ఎక్సైజ్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించి ఎకై ్సజ్ ఎస్ఐ వీరస్వామికి వినతి పత్రం అందజేశారు. ● నకిలీ మద్యం అమ్మకాలపై వైఎస్సార్సీపీ ఇచ్చిన పిలుపు మేరకు డోన్ పట్టణంలో వైఎస్సార్సీపీ నేతలు ఎకై ్సజ్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. పార్టీ వాలంటరీ విభాగం జిల్లా అధ్యక్షుడు పోస్ట్ ప్రసాద్, జెడ్పీటీసీలు బద్దుల రాజకుమార్, వైఎస్సార్సీపీ మండలాధ్యక్షులు సోమేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు కార్పొరేషన్ మేయర్ బీవై రామయ్య ఆధ్వర్యంలో సోమవారం కర్నూలులో మహిళలు కదం తొక్కారు. పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కోట్ల సర్కిల్ (పాత కంట్రోల్ రూమ్) వద్ద నుంచి ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం వరకు పార్టీ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ‘నకిలీ మద్యంతో ప్రాణాలు తీస్తున్న కూటమి ప్రభుత్వం’ అంటూ భారీ బ్యానర్ చేత పట్టి ఎన్–బ్రాండ్ లిక్కర్ను అరికట్టాలంటూ నినాదాలు చేశారు. డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ఎదుట దాదాపు రెండు గంటల పాటు బైఠాయించారు. ప్రజల ప్రాణాలు హరిస్తున్న టీడీపీ నాయకుల వైఖరి, కూటమి ప్రభుత్వం మద్యం విధానానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎకై ్సజ్ కార్యాలయం గేటు వద్ద మద్యాన్ని పారబోసి నిరసన తెలియజేశారు. అనంతరం ఎకై ్సజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డికి వినతిపత్రం సమర్పించారు. పల్లెల్లో బెల్టు షాపుల ద్వారా విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ఏఈఎస్ను నాయకులు నిలదీశారు. వైఎస్సార్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు శివారెడ్డి, హనుమంత రెడ్డి, కార్పొరేటర్లు చిట్టెమ్మ, అరుణ, లక్ష్మిరెడ్డి, సుదర్శన్రెడ్డి, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నకిలీ మద్యం అమ్మకాలను నిరసిస్తూ నందికొట్కూరులో వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ దారా సుధీర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని పటేల్ సెంటర్ నుంచి ఎకై ్సజ్ శాఖ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వ తీరును అడుగడుగునా ఎండగట్టారు. మద్యం సీసాలు పగులగొట్టి నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు ఎకై ్సజ్ కార్యాలయాల ఎదుట నిరసనలు తరలి వచ్చిన మహిళలు, ప్రజలు, పార్టీ శ్రేణులు నకిలీ మద్యంపై సీబీఐతో విచారణ చేయాలని డిమాండ్ కూటమి ప్రభుత్వ తీరుపై మండిపాటు -
చారిత్రక వారసత్వ సంపదను పరిరక్షిద్దాం
నంద్యాల(వ్యవసాయం): చారిత్రక వారసత్వ సంపదను పరిరక్షిద్దామని డీఈఓ జనార్దన్ రెడ్డి అన్నారు. ఇంటాక్ నంద్యాల చాప్టర్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణ సదస్సు స్థానిక గురురాజా పాఠశాలలో సోమవారం ప్రారంభమైంది. ఇంటాక్ సంస్థ నంద్యాల చాప్టర్ అధ్యక్షులు శివకుమార్రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన సదస్సులో డీఈఓ మాట్లాడుతూ భారతీయ కళలు సంస్కృతి వారసత్వ సంపద చాలా గొప్పవని, వాటి వైభవాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. కో కన్వీనర్ సేతురామన్ గురురాజా స్కూల్ డైరెక్టర్ షావలి రెడ్డి, సుబ్బయ్య పాల్గొన్నారు. -
కొలువుదీరిన శ్రీశైల దేవస్థానం ట్రస్ట్బోర్డు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థానం ట్రస్ట్బోర్టు నూతన కమిటీ కొలువుదీరింది. ఇటీవల శ్రీశైల దేవస్థానానికి ధర్మకర్తల సలహా మండలి కమిటీని 17 మంది సభ్యులు, ఆరుగురు ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ జీవో జారీ చేసింది. ఈ మేరకు సోమ వారం ఉదయం చంద్రావతి కల్యాణ మండపంలో ట్రస్ట్బోర్డు సభ్యులతో దేవస్థాన సహాయ కమిషనర్ చంద్రశేఖరరెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి హాజరయ్యారు. ముందుగా పోతుగంటి రమేష్నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. వరుసగా ఏవీ రమణ, బీ రవణమ్మ, జీ లక్ష్మీశ్వరి, కే కాంతివర్దిని, ఎస్ పిచ్చయ్య, జే రేఖాగౌడ్, అనిల్కుమార్, దేవకి వెంకటేశ్వర్లు, బీ వెంకటసుబ్బారావు, జీ కాశీనాథ్, మురళీధర్, యు.సుబ్బలక్ష్మీ, ిపీయూ శివమ్మ, జిల్లెల శ్రీదేవి ప్రమాణస్వీకారం చేశారు. ఈ ప్రమాణస్వీకారానికి చిట్టిబోట్ల భరద్వాజశర్మ, గుల్లా గంగమ్మ హాజరుకాలేదు. అనంతరం ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులైన ఆరుగురిలో ముగ్గురు సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం సభ్యులు పోతుగంటి రమేష్నాయుడుని చైర్మన్గా ఎన్నుకున్నారు. చైర్మన్, సభ్యులందరికీ వేద పండితులు ఆశీర్వచనంతో పాటు, స్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలు, జ్ఞాపికలు అందజేసి సత్కరించారు. -
విద్యార్థులూ.. వీరగాథలు రాద్దాంరండి!
నంద్యాల(న్యూటౌన్): విద్యార్థుల్లో సృజనాత్మకతతో పాటు దేశభక్తిని పెంపొందించేందుకు జాతీయ విద్యా, రక్షణ శాఖలు సంయుక్తంగా వీరగాథ 5.0 పేరుతో ఆయా విభాగాల్లో పోటీలను నిర్వహిస్తోంది. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల విద్యార్థులకు ఈ పోటీలు నిర్వహిస్తుంది. 3 నుంచి 12వ తరగతి (ఇంటర్) వరకు విద్యార్థులకు నాలుగు విభాగాల్లో పోటీలు చేపడుతున్నారు. విద్యార్థులు దేశభక్తిని పెంపొందిస్తూ, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరుల గాథలను వివరించడం, వారి త్యాగాలను తెలిపేలా విద్యార్థులకు పద్యాలు, కథలు, చిత్రలేఖనం, వ్యాసరచన, మల్టీమీడియా ప్రదర్శన వంటి పోటీలు నిర్వహిస్తున్నారు. వివిధ పోటీల్లో పాల్గొనే వారికి ఈ నెల 31వ తేదీ గడువు ఇచ్చారు. ఇప్పటికే ఈ పోటీలకు సంబంధించి జిల్లా విద్యా శాఖ ఆయా పాఠశాలలకు ఉత్తర్వులు జారీ చేశారు. వీరగాథ 5.0 పోటీల్లో పాల్గొనే విద్యార్థులు వారికి నచ్చిన అంశాలను ఎంచుకునే అవకాశాన్ని కల్పించారు. దేశం కోసం అత్యున్నత త్యాగం చేసిన వారిని రోల్ మోడల్గా ఎందుకుని, వారి నుంచి నేర్చుకున్న విలువలను ప్రస్తావించాలి. ఆ విద్యార్థికి అవకాశమిస్తే ఏం చేయదలిచాడో చెప్పాలి. ఉదాహరణకు ఝాన్సీ లక్ష్మీబాయి కలలోకి వచ్చి దేశానికి సేవ చేయాలని కోరితే ఏం చేస్తాడో వివరించవచ్చు. 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటును తాను ఆదర్శంగా తీసుకున్న స్వాతంత్య్ర సమరయోధుల జీవిత కథలు విద్యార్థిపై ఎలా ప్రభావితం చేసిందో చెప్పాల్సి ఉంటుంది. అలాగే స్వాతంత్య్ర పోరాటంలో గిరిజనుల తిరుగుబాటు పాత్ర, ఇతర అంశాలను ఎంపిక చేసుకుని వివరించవచ్చు. నాలుగు విభాగాల్లో.. జిల్లాలోని పాఠశాలల వారీగా వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. 3–5 తరగతులకు ఓ విభాగంగా, 6–8, 9–10, 11–12 తరగతులకు వేర్వేరు కేటగిరీలుగా విభజించారు. 3–5 తరగతుల వారికి పద్యం, కథ (150 పదాలు), చిత్రలేఖనం, పెయింటింగ్, 6–8 తరగతుల వారికి పద్యాలు/ కథ(300 పదాలు), చిత్రలేఖనం, పెయింటింగ్, మల్టీమీడియా ప్రదర్శన. 9–10 తరగతుల వారికి పద్యాలు, వ్యాసం (700 పదాలు), చిత్రలేఖనం, పెయింటింగ్, మల్టీమీడియా ప్రదర్శన. 11–12 తరగతుల వారికి పద్యాలు, వ్యాసం (వెయ్యి పదాలు), చిత్రలేఖనం, పెయింటింగ్, మల్టీ మీడియా ప్రదర్శన ఉంటుంది. ఒకటి లేదా రెండు నిమిషాల నిడివితో దేశభక్తికి సంబంధించిన ప్రదర్శన వీడియో రూపంలో ఇవ్వడమే మల్టీమీడియాగా పరిగణిస్తారు. ప్రతిభ కనబరుస్తూ.. నంద్యాల జిల్లా పరిధిలో ఉన్న 1,849 ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలో 2,77,625 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఆయా పాఠశాలల్లో తరగతులు, కేటగిరీల వారీగా ఉపాధ్యాయులు పోటీలు నిర్వహిస్తున్నారు. పలు వురు విద్యార్థులు సొంతంగా దేశభక్తిని పెంపొందించేలా చిన్న వీడియోలు రూపొందిస్తున్నారు. నమోదు విధానం ఇలా..ఆయా పాఠశాలల విద్యార్థులకు ఉపాధ్యాయులు కేటగిరీలుగా, తరగతుల వారీగా పోటీలు నిర్వహిస్తారు. ఆసక్తి ఉన్న విద్యార్ధులకు పోటీలు నిర్వహించి, వారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఇందుకు ఇన్నోవేటివ్ ఇండియా మై జీవోవీ, ఇన్/వీర్గాథ 5.0 అనే వెబ్సైట్లో నమోదు చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ యువర్ ఎంట్రీ అని ఉన్న చోట క్లిక్ చేసి వివరాలను నమోదు చేయాలి. ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలల నుంచి అత్యుత్తమమైన నాలుగు ఎంట్రీలను అప్లోడ్ చేయాలి. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఉత్తమంగా ఎంపిక చేసిన వాటిని జాతీయ స్థాయికి పంపిస్తారు. జాతీయ స్థాయిలో ఒక్కో విభాగంలో 25 మంది వంతున అత్యుత్తమ ప్రతిభ చూపిన వారిని ఎంపిక చేసి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున నగదు పారితోషికాన్ని, ప్రశంసాపత్రాన్ని అందజేస్తారు. కేటగిరీలుగా వివిధ అంశాలపై నిర్వహణ నాలుగు విభాగాల్లో విద్యార్థులకు పోటీలు 3 నుంచి 12 తరగతుల వారికి పలు పోటీలు ఈనెల 31తో ముగియనున్న గడువు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలంటున్న అధికారులు -
కుటుంబాలు వీధిన పడుతున్నాయి
అధికార పార్టీ నాయకుల ధన దాహంతో సామాన్య, పేదల కుటుంబాలు వీధిన పడుతున్నాయి. పల్లెల్లో బెల్ట్షాపులు ఏర్పాటు చేయడంతో కొందరు మద్యానికి బానిసలవుతున్నారు. రోజంతా కష్టపడి సంపాదించిన సొమ్మును మద్యానికి పెట్టాల్సి వస్తోంది. పేదలకు మెరుగైన వైద్యం, విద్యనందించాల్సిన కూటమి ప్రభుత్వం మద్యాన్ని బెల్ట్షాప్ల ద్వారా డోర్ డెలివరి చేయడం ఎంత వరకు సమంజసం. – సుమలత సురేష్, వార్డు కౌన్సిలర్, డోన్కూటమి ప్రభుత్వం సంపద సృష్టి అంటూ పేదల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మద్యం విక్రయాలను నియంత్రిస్తూ సంపూర్ణ మద్యపాన నిషేధం అమలుకు దశల వారీగా ప్రయత్నిస్తే కూటమి ప్రభుత్వం ఊరూరా బెల్ట్ షాప్లు నడపుతుండటం దారుణం. పల్లెల్లో జనావాసాల మధ్య మద్యం విక్రయాలు జరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడం శోచనీయం – పసుల కీర్తి, వైఎస్సార్సీపీ జిల్లా వలంటీర్ విభాగం అధ్యక్షురాలు ● -
పోటీలతో సృజనాత్మకత వెలికి
విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత ఈ పోటీల ద్వారా బయటకు వస్తుంది. వీరగాథ 5.0 పోటీలను అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్య పాఠశాలల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. జిల్లాలోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలి. విద్యార్థులకు నిర్వహించిన పోటీలు, మల్టీమీడియా వీడియోలు ఆన్లైన్లో నమోదు చేయాలి. – జనార్దన్రెడ్డి, డీఈఓ, నంద్యాల విద్యార్థులు దేశ భక్తిని చాటేలా వీరుల గాథలు వారిలో స్ఫూర్తి నింపేలా పోటీలు నిర్వహించాలి. విద్యార్థుల ప్రతిభ జాతీయ స్థాయిలో కనబరిచేలా ఉపాధ్యాయులు విద్యార్థులను మార్గదర్శకత్వం చేయాలి. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసే చక్కటి కార్యక్రమం. వీరగాథ 5.0 కార్యక్రమం విద్యార్థుల్లో దేశ భక్తిని పెంపొందిస్తుంది. విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలి. – ప్రేమాంతకుమార్, అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్, సమగ్రశిక్ష, నంద్యాల -
ప్రధాని పర్యటనకు పటిష్ట బందోబస్తు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 16న భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను పురస్కరించుకుని పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ తెలిపారు. ఆదివారం ఆయన శ్రీశైలంలో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ప్రధాని పర్యటించే ప్రదేశాలైన హెలిపాడ్, సున్నిపెంట నుంచి శ్రీశైలం రోడ్డు మార్గం, భ్రమరాంబా అతిథిగృహం, ఆలయ పరిసరాలు తదితర ప్రాంతాల్లో ఎస్పీ పర్యటించి భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రధాని ఈ నెల 16న శ్రీశైలం చేరుకుని శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను దర్శించుకోనున్నారని, ఈ సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే శ్రీశైలం పరిసరాలు, నల్లమల అడవుల్లో గ్రేహౌండ్స్ సాయుధ బలగాలతో కూంబింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆయన వెంట ఆత్మకూరు డీఎస్పీ రామాంజినాయక్, శ్రీశైలం, సున్నిపెంట సీఐలు ప్రసాదరావు, చంద్రబాబు ఉన్నారు. -
ముగిసిన పవిత్రోత్సవాలు
● పూర్ణాహుతితో ఘనంగా ముగిసిన అహోబిల పవిత్రోత్సవాలు ● గోవింద నామస్మరణతో హోరెత్తిన నల్లమల ఆళ్లగడ్డ: దిగువ అహోబిలంలో వెలసిన శ్రీప్రహ్లాదవరదస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు ఆదివారం తెల్లవారుజామున పూర్ణాహుతితో ముగిశాయి. శనివారం రాత్రి నుంచి వైభవోపేతంగా పూజలు ప్రారంభమయ్యాయి. పీఠాధిపతి శ్రీ రంగరాజ యతీంత్ర మహాదేశికన్ స్వామీజీ ఆధ్వర్యంలో ఉత్సవమూర్తులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదులకు ముందుగా గ్రామోత్సవం, రాత్రి నిత్యపూజ అనంతరం శాంతి హోమాలు నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి, అర్ధరాత్రి అనంతరం ఉత్సవ మూర్తులైన స్వామి అమ్మవార్లకు తిరుమంజనం, సంప్రోక్షణం చేపట్టారు. ఆదివారం తెల్లవారు జామున శాత్తుమురై గోష్టితో పవిత్రోత్సవ కార్యక్రమాన్ని ముగించారు. కార్యక్రమాలను అహోబిలం ప్రధానార్చకులు శ్రీమాన్ శఠకోప వేణుగోపాలన్, మణియార్ సౌమ్యానారాయణ్ ఆధ్వర్యంలో వివిధ ప్రదేశాల నుంచి ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చిన వేద పాఠశాలల పండితులు నిర్వహించారు. ఏడాది పొడువునా ఆలయంలో నిర్వహించే నిత్య కైంకర్యాలు, వార, మాస, వార్షిక మహోత్సవాలు, ఇతరత్రా పూజాది కార్యక్రమాల్లో తెలసీ తెలియక చేసిన తప్పుల వలన ఏర్పడిన దోషాలకు నివారణగా ఏటా నియమనిష్టలతో పవిత్రోత్సవా లు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కార్యక్రమంలో పాల్గొనేందుకు వివిధ ప్రదేశాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. -
మోదీ పర్యటనను విజయవంతం చేద్దాం
కర్నూలు(సెంట్రల్): ప్రధానమంత్రి నరేంద్రమోదీ కర్నూలు జిల్లా పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతం చేయాలని మంత్రులు బీసీ జనార్థన్రెడ్డి, ఎన్ఎండీ ఫరూక్, టీజీ భరత్ అధికారులను ఆదేశించారు. శనివారం నన్నూరు సమీపంలోని రాగమయూరిలో జరుగుతున్న ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లను మంత్రులు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, పీఎం ప్రోగ్రామ్ నోడల్ అధికారి వీరపాండియన్, కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, ఎస్పీ విక్రాంత్పాటిల్ తదితరులు పరిశీలించారు. అనంతరం అక్కడే ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్లో ఏర్పాట్లపై అధికారులతో మంత్రులు సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ మాట్లాడుతూ స్థానికంగా టోల్ గేట్ వల్ల ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో 16వ తేదీన టోల్ఫీజు లేకుండా వాహనాలను వదలాలని ఆదేశించారు. ప్రధానమంత్రి ప్రోగ్రామ్ నోడల్ అధికారి వీరపాండియన్ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తున్న నేపథ్యంలో శ్రీశైలం, కర్నూలులో భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. శ్రీశైల దర్శనం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ప్రధానమంత్రి మోదీ బహిరంగసభలో పాల్గొంటారన్నారు. సభా ప్రాంగణంలోకి పెన్నులు, నోటుబుక్లు, మ్యాచ్ బాక్సులు, సిగరెట్లు, స్నాక్స్ వంటివి అనుమతించకూడదని, కేవలం నీటిని మాత్రం కప్ల ద్వారా ట్రేలలో అందిస్తారన్నారు. సెక్యూరిటీ పరంగా 250 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇదిలాఉంటే ఆదివారం ప్రధానమంత్రి పర్యటించే రూట్లన్నీ ఎస్పీజీ సెక్యూరిటీ ఆధీనంలోకి వెళ్తాయని ఎస్పీ వెల్లడించారు. కార్యక్రమంలో ఐఏఎస్ అధికారి ప్రసన్న వెంకటేష్, విజయ సునీత, శివ్ నారాయణ్, డాక్టర్ బి.నవ్య, గణేష్కుమార్, గీతాంజలి, జేసీ నూరుల్ ఖమర్, ఆదోని సబ్ కలెక్టర్ భరద్వాజ్ పాల్గొన్నారు. -
విత్తుకోని ఆశలు.. పొలాలు బీళ్లు!
కర్నూలు (అగ్రికల్చర్): రెక్కల కష్టాన్ని నమ్ముకున్న రైతుకు అడుగడుగునా కష్టాలు ఎదురవుతున్నాయి. ఎరువులు అందక, ప్రకృతి సహకరించక, రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం లేక నష్టాలే మిగులుతున్నాయి. ఖరీఫ్లో వేసిన పంటలన్నీ మట్టిపాలయ్యాయి. అరకొర పండిన పంటలకు మార్కెట్లో మద్దతు ధర కూడా లభించక మట్టి మనిషికి కన్నీళ్లే దిక్కయ్యాయి. రబీపై ఆశలు పెట్టుకున్నా.. బ్యాంకులు రుణాలు ఇవ్వకుండా మొండికేశాయి. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలు ఇప్పటి వరకు పంపిణీ చేయకపోవడంతో చాలా పొలాలు బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. అవసరం ఎక్కువ... కేటాయింపు తక్కువ జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు 4.22 లక్షల హెక్టార్లు ఉండగా 3.85 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. ప్రకృతి వైపర్యీతాలతో గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని పంటలు దెబ్బతిని 2.50 లక్షల మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. రబీలో శనగ సాగు చేద్దామనుకుంటే సబ్సిడీ విత్తనాలు ఇప్పటి వరకు ఇవ్వలేదు. విత్తనం వేయకపోవడంతో పొలాలు బీళ్లుగా దర్శనం ఇస్తున్నాయి. జిల్లాకు 46 వేల క్వింటాళ్ల శనగ విత్తనాలు అవసరం అవుతాయని జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి నివేదించగా 23,897 క్వింటాళ్లు మాత్రమే కేటాయించింది. వీటిలో 10 వేల క్వింటాళ్లు ఏపీ సీడ్స్లో ఉన్నాయి. ప్రయివేటు విత్తన కంపెనీల దగ్గర శనగ విత్తనాలు ఉన్నప్పటికీ గత ఏడాదికి సంబంధించిన బకాయిలను ఇప్పటికి చెల్లించలేదు. ఉన్న అరకొర విత్తనం ఎవరికి పంపిణీ చేయాలో తెలియక వ్యవసాయ అధికారులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. రబీలో శనగతో పాటు వేరుశనగ, జొన్న తదితర పంటలు సాగు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం శనగ విత్తనాలను మినహా ఇతర విత్తనాలు సబ్సిడీపై పంపిణీ చేయడానికి తీసుకున్న చర్యలు శూన్యం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం నిల్ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పంటల బీమాకు ఎగనామం పెట్టింది. కేంద్ర వాటా విడుదల చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఖరీఫ్ ప్రారంభంలోనే కొన్ని పంటలు దెబ్బతిన్నా పరిహారం ఇవ్వలేదు. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి రూ.20 చెల్లిస్తామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.14 వేలకు కుదించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పంట రుణాల పంపిణీలో నిర్లక్ష్యం రైతులకు ఎటువంటి హామీ లేకుండానే రూ.2లక్షల వరకు రుణాలు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే ఆ దిశగా ఎటువంటి చర్యలు లేవు. పంటరుణాల పంపిణీలో కొన్ని బ్యాంకులు తీవ్ర అలసత్వం వహించాయి. ఖరీఫ్ సీజన్ సెప్టెంబరు నెల చివరితోముగిసింది. ఖరీఫ్లో రూ.3,635.62 కోట్లు పంట రుణాలుగా పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించినా రూ.2,537.61 కోట్లు మాత్రమే పంపిణీ చేసినట్లు స్పష్టం అవుతోంది. పలు బ్యాంకులు కొత్త రైతులకు రుణాలు ఇచ్చిన దాఖలాలు లేవు. రబీ సీజన్లో రూ.2,526.44 కోట్లు పంపిణీ చేయాలనేది లక్ష్యం. ఖరీఫ్లో రైతులకు మొండిచెయ్యి చూపిన బ్యాంకులు రబీలో పంపిణీ చేయడం అనుమానమేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఎరువులు అందేనా? రబీ సీజన్లో శనగ, జొన్న, వాము, వరి, వేరుశనగ తదితర పంటలు కర్నూలు జిల్లాలో 1.01 లక్షలు, నంద్యాల జిల్లా 1.73 లక్షల హెక్టార్లలో సాగయ్యే అవకాశం ఉంది. కర్నూలు జిల్లాకు లక్ష టన్నులు, నంద్యాల జిల్లాకు 1.52 లక్షల ఎరువులు అవసరమవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించింది. రబీలోనూ ఎరువుల సమస్య వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ధర ఎక్కువ.. సబ్సిడీ తక్కువ బహిరంగ మార్కెట్లో శనగల కిలో ధర గరిష్టంగా రూ.55 వరకు మాత్రమే ఉంది. ప్రభుత్వం సబ్సిడీ పోను కిలో శనగ విత్తనాలను రూ.58.50 ప్రకారం పంపిణీ చేస్తోంది. కూటమి ప్రభుత్వం అధిక ధర నిర్ణయించి సబ్సిడీ మాత్రంగా 25 శాతానికే పరిమితం చేయడంతో రైతులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. ప్రభుత్వం రైతులకు పంపిణీ చేసే శనగ విత్తనాలు కిలో ధరను రూ.78గా నిర్ణయించింది. ఇందులో 25శాతం సబ్సిడీ (రూ.19.50) పోగా రైతులు కిలోకు రూ.58.50 చెల్లించాల్సి ఉంది. బహిరంగ మార్కెట్లో ఇంతకంటే తక్కువ ధరకు లభిస్తున్నాయని రైతులు పేర్కొంటున్నారు. ఆంద్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ 20కిలోల ప్యాకెట్లతో శనగ విత్తనాలు సిద్ధం చేస్తోంది. ఎకరాకు 80కిలోల శనగలు అవసరం. అయితే ఎకరాకు 60 కిలోలు(3 ప్యాకెట్లు) మాత్రమే పంపిణీ చేయనున్నారు. భూమిని బట్టి ఎకరాకు గరిష్టంగా 10 ప్యాకెట్లు( 2 క్వింటాళ్లు) పంపిణీ చేస్తారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రారంభమైన రబీ అతీగతీ లేని సబ్సిడీ విత్తనాలు అరకొరగా పంట రుణాల పంపిణీ వేధిస్తున్న ఎరువుల సమస్య పొంచి ఉన్న అధిక వర్షాల గండం -
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత
● నూతన జాయింట్ కలెక్టర్ కొల్ల బత్తుల కార్తీక్ నంద్యాల: ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని నూతన జాయింట్ కలెక్టర్ కొల్లబత్తుల కార్తీక్ అన్నారు. శనివారం కలెక్టరేట్లోని జేసీ చాంబర్లో అధికారుల సమక్షంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. పరిపాలనలో సమర్థత, పారదర్శకతను బలోపేతం చేసే దిశగా కృషి చేస్తానన్నారు. జిల్లా అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసే దిశగా అధికారులు సమష్టిగా కృషి చేయాలని సూచించారు. బాణసంచా విక్రయాల్లో నిబంధనలు పాటించాలి నంద్యాల: దీపావళి సందర్భ ంగా బాణసంచా తయారీ, నిల్వ కేంద్రాలు, దుకాణాలలో తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ ఎం.జావళి హెచ్చరించారు. శనివారం పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా టపాసులు నిల్వ ఉంచినా, విక్రయించిన వారిపై పేలుడు పదార్థాల చట్టం ప్రకారం చర్యలు తప్పవన్నారు. ప్రమాదాలకు తావులేకుండా, సరైన భద్రతా ప్రమాణాలు, సూచనలు పాటిస్తూ షాప్లు ఏర్పాటు చేసుకుని టపాసులను విక్రయించాలన్నారు. జనసంచారం, ప్రజల నివాస ప్రాంతాలలో టపాసులు విక్రయించరాదని, ప్రభుత్వ అధికారులు నిర్దేశించిన ప్రదేశాలలో మాత్రమే నిబంధనల ప్రకారం దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. నీరు, ఇసుక, తదితర అగ్నిమాపక సామగ్రిని తప్పనిసరిగా టపాసుల విక్రయ దుకాణాల్లో సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఎవరైనా అక్రమంగా టపాసులు విక్రయిస్తున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 112 లేదా సంబంధిత పోలీసు స్టేషన్కు సమాచారం అందించాలన్నారు. బిట్కాయిన్ పెట్టుబడుల పేరుతో మోసాలు కర్నూలు: బిట్కాయిన్ పెట్టుబడుల విషయంలో స్మార్ట్ ఫోన్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ జిల్లా ప్రజలకు సూచించారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పెట్టుబడులు పెడితే లాభాలు వస్తున్నాయంటూ ఫాలోయర్లకు నకిలీ లింకులు పంపుతున్నారని, బిట్కాయిన్ను క్రిప్టో కరెన్సీలలో మదుపు చేస్తే లాభాలంటూ స్నేహితులకు సందేశాలు పంపుతున్నట్లు పేర్కొన్నారు. లాభాలు వచ్చినట్లు కొన్ని ఫొటోలు చూపించి ఆశ కల్పిస్తారని, ఆ సందేశాలు చూసి కొందరు లింకు ద్వారా రూ.లక్షల్లో నగదు పెట్టుబడి పెట్టి నష్టపోతున్నారని తెలిపారు. ముఖ్యంగా టెలిగ్రామ్, ఫేస్ బుక్లలో డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి లింకులు వస్తే అసలు క్లిక్ చేయవద్దని సూచించారు. సైబర్ మోసానికి ఎవరైనా గురైతే వెంటనే సైబర్ క్రైం 1930 హెల్ప్లైన్ నెంబర్కు, అలాగే www.cyber crime.gov.inలో ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. -
అంతర పంటల సాగుపై దృష్టి సారించాలి
బనగానపల్లె రూరల్: అంతర పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయాధికారి మద్దిలేటి అన్నారు. శనివారం యాగంటిపల్లె గ్రామ సమీపంలోని కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే)లో ధన ధాన్య కృషి యోజనపై రైతులకు కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన అధికారి ధనలక్ష్మీ అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయాధికారి మద్దిలేటి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ధన ధాన్య కృషి యోజన ద్వారా పుప్పుధాన్యాలు, పశుపోషణ, ఫుడ్ ప్రాసెసింగ్కు సంబంధించి కార్యక్రమాలను ప్రారంభించిందన్నారు. నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహాయ సంచాలకులు డాక్టర్ జాన్సన్ మాట్లాడుతూ.. పూర్వం దేశం పంటల ఉత్పత్తుల్లో మొదటి స్థానంలో ఉండేదని, కాలక్ర మేణా వాతావరణ ప్రభావం వల్ల 24 రకాల పంటల ఉత్పాదకత తగ్గిందన్నారు. పంటల సరళిలో మార్పులు చేపట్టి దిగబడులు పొందాలని కేవీకే శాస్త్రవేత్తలు సుధాకర్, బనగానపల్లె మార్కెట్యార్డు చైర్మన్ కాట్రెడ్డి మల్లికార్జునరెడ్డి సూచించారు. ఈ సందర్భంగా రైతులకు సబ్సిడీ శనగ విత్తనాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మార్కెట్యార్డు వైస్ చైర్మన్ భూషన్న, మండల వ్యవసాయాధికారి సుబ్బారెడ్డి, కేవీకే ఏఈ సురేష్, బనగానపల్లె గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ బురానుద్దిన్ ప్రకృతి వ్యవసాయం సిబ్బంది రైతులు పాల్గొన్నారు. -
శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి శనివారం భక్తులు పోటెత్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు మల్లన్న దర్శనానికి భారీగా తరలివచ్చారు. వేకువజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లికార్జునస్వామివారి దర్శనానికి బారులుదీరారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తుల రద్దీతో ఆలయ క్యూలైన్లు నిండిపోయాయి. పలువురు భక్తులు ఆన్లైన్ ద్వారా టికెట్లు పొంది స్వామివారి స్పర్శదర్శనం నిర్వహించుకున్నారు. గాలేరు నగరి గేట్లు మూసివేత అవుకు(కొలిమిగుండ్ల): అవుకు రిజర్వాయర్కు సంబంధించి చెర్లోపల్లె సమీపంలో ఉన్న గాలేరు నగరి వరద కాల్వకు చెందిన గేట్లను శనివారం ఎస్సార్బీసీ అధికారులు మూసివేశారు. ఇటీవల రిజర్వాయర్ రివిట్మెంట్ కుంగిపోవడంతో నీళ్లను గాలేరు నగరి వరద కాల్వ ద్వారా వైఎస్సార్ కడప జిల్లాకు విడుదల చేశారు. ఎస్సార్బీసీ కాల్వ ద్వారా రిజర్వాయర్కు ఇన్ఫ్లో తగ్గడంతో గేట్లు బంద్ చేశారు. రిజర్వాయర్లో రివిట్మెంట్ కుంగక ముందు నాలుగు టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 2.40 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కమనీయం.. ప్రహ్లాదవరదుడి పవిత్రోత్సవం ఆళ్లగడ్డ: అహోబిలంలో వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శనివారం తెల్లవారు జామున మూలవిరాట్ శ్రీ ప్రహ్లాదవరదస్వామి, అమృతవల్లీ అమ్మవార్లకు నిత్య పూజల అనంతరం పవిత్ర యాగశాలలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరద స్వామి ఉత్సవమూర్తుల ను కొలువుంచి నవకలశ స్నపనం, ద్వారతోరణ పూజ, మండల ప్రతిష్ట, కుంభ ప్రతిష్ట నిర్వహించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య పవిత్ర హోమం చేపట్టారు. రాత్రి ఉత్సవ మూర్తులను పల్లకీలో వుంచి గ్రామోత్సవం నిర్వహించారు. నూతన టీచర్లకు నేడు ఆర్డర్లు కర్నూలు సిటీ: ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ ప్రక్రి యలో భాగంగా ఇండక్షన్ ట్రైనింగ్ పూర్తయ్యింది. నూ తన ఉపాధ్యాయులను స్కూళ్లకు కేటాయించేందుకు నిర్వహిస్తున్న కౌన్సెలింగ్ శనివారంతో ముగిసింది. ఉమ్మడి జిల్లాలో విద్యార్థుల సంఖ్య కు తగ్గట్టు 4,168 టీచర్ల పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. అయితే ఏప్రిల్లో 2,678 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చారు. రాత పరీక్షలో ఎంపికైన 2,590 మందికి ఈ నెల 3 నుంచి నిర్వహించిన ఇండక్షన్ ట్రైనింగ్ ఈ నెల 10న ముగిసింది. ఇద్దరు మినహా మిగిలిన వారందరూ శిక్ష ణ పూర్తి చేసుకున్నారు. వీరిలో 1,765 ఎస్జీటీల కు మాన్యువల్గా, మిగిలిన స్కూల్ అసిస్టెంట్స్ కు వెబ్ ఆప్షన్స్ ఇచ్చి కౌన్సెలింగ్ పూర్తి చేశారు. కౌన్సెలింగ్కు హాజరైన వారందరికీ ఆదివారం ఆర్డర్లు జారీ చేయనున్నారు. వీరందరూ కేటాయించిన స్కూళ్లలో సోమవారం చేరనున్నారు. -
‘కూటమి’ నేతలు భయపడుతున్నారు
కూటమి ప్రభుత్వం ఆదాయం కోసం రాష్ట్ర వ్యాప్తంగా వైన్షాప్లు, బెల్టు దుకాణాల్లో కల్తీ మద్యం విక్రయించి ప్రజల ప్రాణాలు తీస్తోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి ఆరోపించారు. ఇందుకు నిరసనగా మహిళలతో ఎకై ్సజ్ పోలీస్టేషన్ల ఎదుట రానున్న రోజుల్లో ధర్నా చేపడతామన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అక్టోబర్ 10 నుంచి నవంబర్ 22 వరకు రచ్చబండ కార్యక్రమం ద్వారా వాడవాడలా కోటి సంతకాల సేకరణకు శ్రీకారం చుడుతున్నామన్నారు. అక్టోబర్ 28న నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. నవంబర్ 12న జిల్లా కేంద్రాల్లో కార్యకర్తలతో కలిసి ర్యాలీలు నిర్వహించబోతున్నామని వివరించారు. బొమ్మలసత్రం: రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ మాజీ సీఎం వైఎస్ జగన్మోన్రెడ్డికి తోడుగా వైఎఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఉద్యమం కొనసాగించాలని వైఎస్సార్సీపీ రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. పేద విద్యార్థులు వైద్య విద్య అభ్యసించేందుకు, ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో 17 నూతన మెడికల్ కాలేజీల నిర్మాణం చేపడితే వాటిని కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరంచేసి నిర్వీర్యం చేస్తోందన్నారు. ప్రజల తరఫున పోరాటం చేయాలన్నారు. నంద్యాలలోని ఆర్కే ఫంక్షన్హాల్లో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంథ్రనాధ్రెడ్డి ముఖ్యఅతిఽథులుగా, పార్లమెంట్ పరిశీలకురాలు, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్బాషా, మాజీ ఎమ్మెల్యేలు శిల్పా రవిచంద్రకిషోర్రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, కాటసాని రామిరెడ్డి, గంగుల బిజేంద్రనాఽథ్రెడ్డి, నందికొట్కూరు ఇన్చార్జ్ దారా సుధీర్, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్రెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి హాజరయ్యారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుల్పర్పించారు. వైఎస్సార్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం పోస్టర్లను ఆవిష్కరించారు. ‘జగనన్న విజన్’ అనే డాక్యుమెంటరీని ప్రదర్శించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అధికారంలోకి వచ్చాక మోసం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరిందన్నారు. అనేక సంక్షేమ పథకాలను అందిస్తామని ‘కూటమి’ నేతలు కల్లబొల్లి హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చాక మోసం చేశారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ‘సూపర్ సిక్స్’లో భాగంగా చెప్పిన ఏ ఒక్క హామీని కూడా సంపూర్ణంగా అందించలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి రైతుల పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదన్నారు. అన్నదాతలు పంటలను రోడ్లపై పడేస్తుండటం చూస్తే కన్నీళ్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే నెల 22 వరకు కోటి సంతకాల సేకరణ కల్తీ మద్యం, బెల్టు దుకాణాలు ప్రజల ప్రాణాలు తీస్తున్నాయని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం మెడలు వంచాలంటే గ్రామ, మండల, నియోజకవర్గాల్లో కమిటీల ద్వారా కార్యకర్తలను కలుపుకుంటూ ఉద్యమబాటను కొనసాగించాలన్నారు. వచ్చే నెల 22 వరకు కోటి సంతకాల సేకరణను తలపెట్టాలన్నారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈనెల 28న ర్యాలీలు నిర్వహించాలని, వచ్చే నెల 12న జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పల్లె ప్రాంతాల్లో కల్తీ సారాతో, బెల్టు దుకాణాల్లో కల్తీ మద్యంతో పేదల ప్రాణాలు పోతున్నాయని, దీన్ని వ్యతిరేకిస్తూ మహిళలతో కలిసి ఎకై ్సజ్ కార్యాలయాల ముట్టడికి సిద్ధంగా ఉండాలన్నారు. సమావేశానికి హాజరైన వైఎస్సార్సీపీ నేతలు జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి వైఎస్సార్సీపీ ఎస్ఎస్ఈసీ మెంబర్లు పీపీ నాగిరెడ్డి, కల్లూరి రామలింగారెడ్డి, గోపవరం సాయినాథ్రెడ్డి, ఆళ్లగడ్డ బాబులాల్, చల్లా విఘ్నేష్రెడ్డి, పోచా జగదీశ్వరరెడ్డి, మలికి రెడ్డి వెంకట సుబ్బారెడ్డి హాజరయ్యారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శులు బుడ్డా శేషిరెడ్డి, దేశం సుధాకర్రెడ్డి, భూమా కిషోర్రెడ్డి, గుండం సూర్యప్రకాష్రెడ్డి , పీపీ మధుసుదన్రెడ్డి, రాష్ట్రకార్యదర్శి చల్లా మధుసుదన్రెడ్డి, స్టేట్ జాయింట్ సెక్రెటరీలు అబ్ధుల్ రజాక్, మల్లు సురేంద్రనాథ్ రెడ్డి, స్టేట్ వైఎస్సార్టీయూసీ జనరల్ సెక్రటరీ మోమిన్ మన్సూర్, మున్సిపల్ ఛైర్పర్సన్ మాబున్నిసా, జిల్లా ఉపాధ్యక్షులు దాల్మిల్ అమీర్, సూర్యనారాయణరెడ్డి జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి నాయకులు పాల్గొన్నారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న వైఎస్సార్సీపీనేతలు నంద్యాల పట్టణంలో నిర్వహించిన వైఎస్సార్సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదాయం కోసమే కల్తీ మద్యం! ఎన్నికల ముందు అమలుకు వీలు కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక మరచిపోవడంతో ‘కూటమి’ నేతలు ప్రజల్లోకి రావాలంటేనే భయపడిపోతున్నారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాఽథ్ రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం అప్పుల విషయంలో అసెంబ్లీలో ఒక మాట అసెంబ్లీ బయట మరో మాట చెబుతోందన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే పోలవరం ప్రాజెక్ట్ కోసం రూ. 12,900 కోట్లు కేంద్రం మంజూరు చేయిస్తే అది కూడా తామే చేశామని టీడీపీ నేతలు ప్రజలను తప్పు దోవపట్టిస్తున్నారన్నారు. రాజకీయాన్ని సేవగా భావించి వైఎస్సార్సీపీ కార్యకర్తలు ముందుకు నడవాలన్నారు. కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాటం చేయాలన్నారు. -
ప్రధాని పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
● అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 16న శ్రీశైల పుణ్యక్షేత్రానికి రానున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లపైకలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలన్నారు. సున్నిపెంటలో హెలిపాడ్ పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. హెలిపాడ్ నుంచి ప్రధానమంత్రి పర్యటించే ప్రదేశాల వరకు రహదారుల అభివృద్ధి, పారిశుద్ధ్యం, లైటింగ్, పార్కింగ్ తదితర అంశాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసర వైద్య సేవలకోసం నిపుణులైన వైద్యుల బృందాలను నియమించాలన్నారు. అంబులెన్న్స్లు, అవసరమైన వైద్య పరికరాలు సిద్ధంగా ఉంచాలని జీజీహెచ్ సూపరింటెండెంట్, డీసీహెచ్ఎస్ అధికారులను ఆదేశించారు. భ్రమరాంబ గెస్ట్ హౌస్, దేవస్థాన పరిధిలో ఎటువంటి విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్ఓ రాము నాయక్, ఆర్డీఓ విశ్వనాథ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ డ్రైవర్ల మెరుపు సమ్మె
● బస్టాండ్లలో ధర్నానంద్యాల(న్యూటౌన్): జిల్లాలోని అన్ని బస్స్టేషన్లలో బుధవారం అద్దె బస్సులను నిలిపి వందలాదిమంది డ్రైవర్లు మెరుపు సమ్మె చేశారు. ఆర్టీసీ ఉద్యోగులందరికీ రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ బస్టాండ్లలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి డ్రైవర్లకు, కండక్టర్లకు రక్షణ లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట దాడులు జరుగుతున్నాయన్నారు. దువ్వూరులో ఆళ్లగడ్డ డిపోకు చెందిన హెయిర్ బస్ డ్రైవర్ మహమ్మద్పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలన్నారు. అంత వరకు సమ్మెను విరమించేది లేదన్నారు. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్లో ధర్నా చేస్తున్న డ్రైవర్లతో ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ మేనేజర్ రజియా సుల్తానా మాట్లాడారు. ప్రజలకు అవగాహన కల్పించేలా బస్టాండ్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు అద్దె బస్సుల డ్రైవర్లు తెలిపారు. -
‘బంగారు’ కాంతులు!
విద్యుత్ కాంతుల మధ్య ప్లాంట్మండలంలోని జొన్నగిరి, బొల్లవానిపల్లి, పగిడిరాయి గ్రామాల మధ్య జియో మైసూర్ గోల్డ్ మైనింగ్ కంపెనీ ప్రాసెసింగ్ ప్లాంట్ రాత్రి పూట విద్యుత్ కాంతులతో వెలిగిపోతోంది. 30 ఎకరాల్లో దాదాపు రూ.200 కోట్లతో గోల్డ్ మైనింగ్ ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్మించారు. ప్లాంట్ లోపలి భాగంలో చుట్టూ పచ్చని గడ్డితో పాటు మొక్కలు నాటారు. అధునాతన హంగులతో ప్లాంట్ నిర్మాణం పూర్తయింది. ఈనెలఖారు నుంచి ప్లాంట్లో బంగారం ఉత్పత్తి మొదలు కానుండటం విశేషం. –తుగ్గలి -
బంగారం హారం బహూకరణ
పాణ్యం: తిరుపతికి చెందిన కర్నాటి సుబ్బ ప్రశాంత్, స్వాతి దంపతులు కొత్తూరు గ్రామంలో వెలసిన శ్రీవల్లి సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయానికి బుధవారం బంగారం హారాన్ని బహూకరించారు. నాలుగు తులాల 200 మిల్లీ గ్రాముల బంగారం హారాన్ని బహూకరించినట్లు ఈఓ రామకృష్ణ తెలిపారు. దాతలకు తీర్థప్రపాదాలు అందించినట్లు చెప్పారు. నేడు ఎస్సీ సెల్ విస్తృత స్థాయి సమావేశం బొమ్మలసత్రం: నంద్యాల పట్టణంలోని తేజస్విని హోటల్లో గురువారం ఎస్సీసెల్ జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజే సుధకర్బాబు హాజరవుతున్నారని పేర్కొన్నారు. సమావేశానికి ఎస్సీ సెల్కు సంబంధించిన నాయకులందరూ హాజరుకావాలని కోరారు. వ్యాధులపై అప్రమత్తత అవసరం గోస్పాడు: వ్యాధులపై ప్రజలను ఆరోగ్య సిబ్బంది అప్రమత్తం చేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ ఆదేశించారు. నంద్యాల గాంధీ నగర్లోని సమావేశపు మందిరంలో బుధవారం వ్యాధుల నియంత్రణపైఅవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా మలేరియా అధికారి చంద్రశేఖరరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ మాట్లాడారు. మలేరియా, డెంగీ, చికెన్గున్యా, మెదడువాపు, బోదకాలు వంటి వ్యాధులు దోమకాటుతో వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. ప్రతి శుక్రవారం ఫ్రైడే, డ్రైడే పాటించాలన్నారు. మెడికల్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ నిరంజన్, జిల్లా టీబీ, ఎయిడ్స్ నివారణ అధికారి డాక్టర్ శారదాబాయి, మలేరియా సబ్ యూనిట్ అధికారి విజయారెడ్డి, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు. పార్లమెంట్ రాష్ట్రకార్యదర్శిగా దేశం సుధాకర్రెడ్డిబొమ్మలసత్రం: వైఎస్సార్సీపీ పార్లమెంట్ రాష్ట్రకార్యదర్శిగా దేశం సుధాకర్రెడ్డిని నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన దేశం సుధాకర్రెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంతో సమన్వయం చేసుకుంటూ సంబంధిత రీజినల్ కో ఆర్డినేటర్, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులకు సహాయకారిగా వ్యవహరించనున్నారు. కర్నూలు సిటీ: అధికారంలో ఉన్నామని, తమకు ఎదురు లేదని తెలుగుదేశం పార్టీ నాయకులు బరితెగించారు. విద్యార్థులకు మధ్యాహ్నం భోజ నం వడ్డిస్తున్న ఒకరిపై పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అనుచరులు దాడికి పాల్పడ్డారు. బాధితులు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. వివరాలు.. కర్నూలు ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కాలేజీ విద్యార్థులకు జీఎస్టీ 2.0పై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విజేతలకు బుధవారం ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గౌరు చరిత బహుమతులు ప్రదానం చేశారు. ఆమె తిరిగి వెళ్లే సందర్భంలో మధ్యాహ్న భోజనంపై కొంత మంది విద్యార్థులు ఫిర్యాదు చేశారు. ఆ సమమంలో అక్కడే ఉన్న వంట ఏజేన్సీ నిర్వాహకులకు చెందిన ఓ వ్యక్తికి, ఎమ్మెల్యే అనుచరుల మధ్య వాగ్వావాదం చోటు చేసుకుంది. ఈ సమయంలో వంట ఏజెన్సీ నిర్వాహకుల్లో ఒకరిపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేసినట్లు సమాచారం. ఇదే విషయంపై బాధితులు కర్నూలు 3వ పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అదే విధంగా తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకునేంత వరకు బీక్యాంపులో ప్రభుత్వ జూనియర్, ప్రభుత్వ ఒకేషనల్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం చేయబోమని జిల్లా వృత్తి విద్యాధికారి కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ ఘటనపై జూనియర్, ఒకేషనల్ కాలేజీల ప్రిన్సిపాళ్లను అడుగగా తమకు తెలియని చెప్పారు. ఇదిలా ఉండగా పై రెండు కాలేజీల్లో వంట ఏజెన్సీని ఎలాగైనా మార్చాలనే ఉద్దేశంతో వివిధ సందర్భాల్లో టీడీపీ నేతలు ప్రయత్నించారు. -
రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలన!
డోన్: రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలన సాగుతోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ధ్వజమెత్తారు. అభివృద్ధి చేయకుండా అనవసర ఆరోపణలు చేస్తూ టీడీపీ నేతలు కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ప్రగతి ఫలాలను ప్రజలకు అందించడమే నిజమైన పాలన అని అన్నారు. డోన్లో బుధవారం ప్యాపిలి, బేతంచెర్ల మండలాల వైఎస్సార్సీపీ బూత్కమిటీ కన్వీనర్ల సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కోవిడ్ మహమ్మారిని కూడా లెక్కచేయకుండా అంతా అభివృద్ధి జరిగిందన్నారు. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందాయన్నారు. రాష్ట్రంలో కూట మి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నకిలీ మద్యం వ్యాపారం యథేచ్ఛగా సాగుతోందన్నారు. ఉచిత ఇసుక అని చెబుతూ అడ్డూ అదుపూ లేకుండా అ క్రమ రవాణా చేస్తున్నారని ఆరోపించారు. అక్రమ మై నింగ్తో ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని ఆరోపించారు. ‘స్థానిక’ ఎన్నికలకు సిద్ధం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం డోన్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిందని బుగ్గన అన్నారు. డోన్కు అప్పట్లోనే ఉత్తమ మున్సిపాలిటీగా అవార్డు దక్కిందనే విషయాన్ని టీడీపీ నాయకులు సైతం అంగీకరిస్తున్నారన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పరిపాలనను ఎలా సాగించామనే దానిపై ప్రజలకు కార్యకర్తలు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి బూత్కు కన్వీనర్లే కీలకమని, ప్రతి బూత్ పరిధిలో 40 మంది సురక్షితులైన కార్యకర్తలను తయారు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. వైఎస్సార్సీపీ మళ్లీ అధికారంలోకి వస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2.0 పాలన ఎలా ఉంటుందో ప్రజలకు తెలుస్తుందన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలందరూ సంసిద్ధంగా ఉండాలన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ ప్యాపిలి మండల కన్వీనర్ పోదొడ్డి క్రిష్ణమూర్తి, పార్టీ నాయకులు చిన్నపూదెళ్ల రామచంద్రారెడ్డి, పెద్దపూదెళ్ల భాస్కర్ రెడ్డి, మెట్టుపల్లె వెంకటేశ్వరరెడ్డి, బూరుగల శ్యాంరెడ్డి, బోరెడ్డి రాము, రాజా మురళి, బోరా మల్లికార్జునరెడ్డి, గార్లదిన్నె రామసుబ్బయ్య, రాచెర్ల దివాకర్రెడ్డి, బేతంచెర్ల మండల కన్వీనర్ తిరుమలేశ్వరరెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షులు పిట్టల జాకీర్, ఎంపిపి బుగ్గన నాగభూషణంరెడ్డి, మున్సిపల్ చైర్మన్ చలంరెడ్డి, పార్టీ నాయకులు రామచంద్రుడు, మురళీక్రిష్న, లక్ష్మిరెడ్డి, ఇబ్రహీం, కోట్ల మధుసూధన్ రావ్, మురళీధర్రెడ్డి, చలపతిరెడ్డి, బుగ్గన చంద్రారెడ్డి, బలరాంరెడ్డి, ఎద్దులన్న తదితరులు పాల్గొన్నారు. యథేచ్ఛగా నకిలీ మద్యం వ్యాపారం అడ్డూఅదుపూ లేని ఇసుక అక్రమ రవాణా అక్రమ మైనింగ్తో ప్రజాధనం లూటీ రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి -
కల్తీ మద్యంతో ప్రజల్ని చంపేస్తారా?
కర్నూలు (టౌన్): ‘ రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతోంది.. అమాయక ప్రజలు మద్యం తాగి పిట్టల్లా రాలుతున్నారు.. అయినా ఈ ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోంది.. చాలా దారుణం’ అని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్వీ విజయ మనోహరి అన్నారు. ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఇలాగే వ్యవహరిస్తూ కల్తీ మద్యంతో ప్రజల్ని చంపేస్తారా అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో బుధవారం కర్నూలులో నిరసన తెలిపారు. చిల్డ్రన్స్ పార్కు నుంచి ఎకై ్సజ్ కార్యాలయం వరకు మహిళలు ర్యాలీ నిర్వహించారు. ‘ సీఎం డౌన్.. డౌన్, కల్తీ మద్యం విక్రయాలు అరికట్టాలి’ అని నినాదాలు చేశారు. ‘నకిలీ మద్యంతో పేదలు పిట్టల్లా రాలిపోతున్నారు.. ప్రభుత్వ పెద్దలే మద్యం సూత్రధారులు.. రాష్ట్రంలో ఎన్–బ్రాండ్ విక్రయాలు’ తదితర ప్లకార్డులను ర్యాలీలో ప్రదర్శించారు. ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంటు కార్యాలయం ఎదుట బైఠాయించారు. మద్యాన్ని పారబోసి బాటిళ్లను పగులకొట్టారు. ‘మద్యం తాగి ప్రజలు చనిపోతుంటే డిప్యూటీ సీఎం నోరు మెదపరేం, ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఎక్కడ’ అని ప్రశ్నించారు. మహిళలకు రక్షణ కరువు వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లా నాగవేణి రెడ్డి, భారతి, మంగమ్మ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని విమర్శించారు. నకిలీ మద్యం సరఫరా చేస్తూ పేద ప్రజలను నిలువు దోపిడీ చేస్తోందని ఆరోపించారు. అడ్డగోలు పర్మిట్ రూమ్లతో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. టీడీపీ నాయకులు వైన్ షాపుల ద్వారా కల్తీ మద్యం అమ్ముతుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోరు మెదపడం లేదన్నారు. ఈ ప్రభుత్వానికి మహిళల ఉసురు తగులుతుందన్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి బెల్టు షాపులు రద్దు చేయాలని, కల్తీ మద్యాన్ని అరికట్టాలని, పర్మిట్ లైసెన్సులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంటు అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నగరపాలక కార్పొరేటర్లు ఆర్షియా ఫర్హీన్, మహిళలు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వానికి మహిళల ఉసురు తగులుతుంది వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసెడింట్ ఎస్వీ విజయ మనోహరిదోషులను కఠినంగా శిక్షించాలి నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లో కల్తీ మద్యం తాగి నలుగురు పేదలు మృతిచెందినా రాష్ట్రప్రభుత్వంలో చలనం లేదని ఎస్వీ విజయ మనో హరి విమర్శించారు. కల్తీ మద్యం విక్రయాల వెనుక రాష్ట్ర పెద్దలు ఉన్నారని ఆరోపించారు. కల్తీ మద్యం తయారు చేసేందుకు టీడీపీ నాయకులు ఏకంగా ఫ్యాక్టరీ నడుపుతున్నారంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతోందన్నారు. కల్తీ మద్యం దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
నవంబర్ 12న ఆర్యూ కాన్వొకేషన్
కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ (ఆర్యూ) 4వ కాన్వొకేషన్ నవంబర్ 12న వర్సిటీలో నిర్వహిస్తున్నట్టు వైస్చాన్స్లర్ ప్రొఫెసర్ వి.వెంకటబసవరావు తెలిపారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ కాన్వొకేషన్కు గవర్నర్, వర్సిటీ చాన్స్లర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ హాజరవుతారన్నారు. 2021–22, 2022–23, 2023–24, 2024–25 విద్యా సంవత్సరాల్లో వర్సిటీ పరిధిలో యూజీ, పీజీ, బీఈడీ, బీపీఈడీ, ఎల్ఎల్బీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు పూర్తి చేసుకొని ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు వారి విద్యార్హత పట్టాలను పొందవచ్చన్నారు. ఇప్పటికే రెండుసార్లు కాన్వొకేషన్కు నోటిఫికేషన్ విడుదల చేయడంతో విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. యూజీ విద్యార్థులు 9404, పీజీ, ఇతర ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థులు 420, పీహెచ్డీ 148 మంది దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్నారన్నారు. 70 మంది విద్యార్థులకు గోల్డ్మెడల్స్ ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. -
ప్రధాని పర్యటన ఏర్పాట్ల పరిశీలన
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 16న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను మోదీ పర్యటన ప్రత్యేక అధికారి వీరపాండియన్ పరిశీలించారు. మంగళవారం శ్రీశైలం చేరుకున్న ఆయన జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ సునీల్ షెరాన్ ఇతర అధికారులతో కలిసి ప్రధాని పర్యటించే ప్రాంతాలలో ఏర్పాట్లను పరిశీలించారు. ముందుగా సున్నిపెంట హెలిపాడ్కు చేరుకుని, అక్కడి నుంచి రోడ్డుమార్గం ద్వారా శ్రీశైల భ్రమరాంబా అతిథి గృహానికి చేరుకున్నారు. అక్కడ శ్రీశైల దేవస్థాన ఈఓ శ్రీనివాసరావు, అధికారులు వారికి ఆహ్వానం పలికారు. అనంతరం నందిసర్కిల్, గంగాధర మండపం, అనంతరం ఆలయంలో మల్లికార్జున స్వామివారికి అభిషేకం, భ్రమరాంబాదేవికి కుంకుమార్చన, వేదాశీర్వచనం తదితర కార్యక్రమాల ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఆతర్వాత శివాజీ స్ఫూర్తి కేంద్రానికి చేరుకుని శివాజీ కాంస్య విగ్రహం వద్ద, ధ్యాన మందిరంలో ఏర్పాట్లను పరిశీలించారు. పనులు తర్వితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వారి వెంట జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, ఆర్డీవో నాగజ్యోతి తదితరులు ఉన్నారు. మోదీ పర్యటన భద్రతపై సమీక్ష.. మోదీ పర్యటన నేపథ్యంలో ఐజీ ఆకే రవికృష్ణ మంగళవారం శ్రీశైలంలో పోలీసు ఉన్నతాధికారులతో భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. సుమారు 2,500 మంది పోలీసు సిబ్బందితో ప్రధాని మోదీ పర్యటనకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. మోదీ పర్యటించే సున్నిపెంట హెలిపాడ్ నుంచి శ్రీశైలం వరకు భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. సమీక్షలో కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, గ్రేహౌండ్స్ డీఐజీ బాపూజీ, నంద్యాల ఎస్పీ సునీల్షెరాన్, ప్రకాశం ఎస్పీ హర్ష వర్దన్రాజు, డీజీపీ ఆఫీసు అధిరాజ్ సింగ్ రాణా, ఐజీ అశోక్కుమార్, సీఐడీ ఎస్పీ శ్రీధర్రావు, ఎఎస్పీ యుగంధర్బాబు, ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్, శ్రీశైలం సీఐ ప్రసాదరావు, ఇతర సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
కోసిగిలో భారీ చోరీ
కోసిగి: మండల కేంద్రంలోని సాయిబాబా గుడి సమీపంలో అర్ధరాత్రి ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. బాధితులు తెలిపిన మేరకు వివరాలు.. స్థానిక ఉరుకుంద మెయిన్ రోడ్డులో మధు, లీలావతి దంపతులు నివాసం ఉంటున్నారు. సోమవారం కౌతాళంలో బంధువు చనిపోగా మధు అంత్యక్రియలకు వెళ్లాడు. రాత్రి వేళ ఇంట్లో ఒంటరిగా ఉండలేక లీలావతి గ్రామంలోనే ఉంటున్న అమ్మ వద్దకు వెళ్లింది. ఇదే అదునుగా భావించిన దుండగులు అర్ధరాత్రి ఇంటి తాళాలు పగులగొట్టి లోనికి చొరబడి బీరువాలోని సొమ్మును దోచుకెళ్లారు. ఉదయం దంపతులు ఇంటికి వచ్చి చూసేసరికి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. బీరువాలో ఉంచిన 6 తులాల బంగారు నగలు, కేజీ వెండి, రూ.లక్ష నగదును దుండగులు దోచుకెళ్లినట్లు బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. బయటి వ్యక్తులకు చెందిన బంగారు తాకట్టు పెట్టుకుని డబ్బు వడ్డీకి ఇచ్చినట్లు దంపతులు తెలిపారు. ఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా క్లూస్ బృందం వచ్చి వేలిముద్రలు సేకరించారు. ఆ ప్రాంతంలోని సీజీ ఫుటేజీ పరిశీలించగా ఇద్దరు దుండగులు మూఖా నికి గుడ్డ కట్టుకొని చోరీకి పాల్పడినట్లు తెలిసింది. వరుస చోరీల నేపథ్యంలో పోలీసులు రాత్రి వేళ గస్తీ నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. ట్రావెల్స్ బస్సు బోల్తా ఎమ్మిగనూరురూరల్: మండల పరిధిలోని సిరాలదొడ్డి సబ్స్టేషన్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి ఆదోనికి వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్స్ అదుపుతప్పి బోల్తాపడింది. బస్సులోని ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. బస్సులో 15 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. అందరూ స్వల్ప గాయాలతో బయట పడటంతో ప్రభుత్వాసుపత్రికి వెళ్లకుండా తెల్లవారుజామునే ఎవరికి వారు ఇతర వాహనాలలో ఆదోనికి వెళ్లిపోయినట్లు రూరల్ పోలీసులు తెలిపారు. డ్రైవర్ అజాగ్రత్త వల్లనే ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు చెబుతున్నారని పోలీసులు చెప్పారు. -
వైభవంగా పవిత్రోత్సవాలు
ఆళ్లగడ్డ: దిగువ అహోబిలం శ్రీ ప్రహ్లాదవరదస్వామి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగే వార్షిక పవిత్రోత్సవాలు మంగళవారం నుంచి వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా అహోబిలం మఠం పీఠాధిపతి శ్రీ రంగరాజ యతీంద్ర మహాదేశికన్ ఆధ్వర్యంలో మూలమూర్తులు శ్రీ ప్రహ్లాదవరదస్వామి, అమృతవల్లీ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల వేదమంత్రోచ్ఛారణలతో ఆస్థాన విద్వాంసుల మంగళవాయిద్యాల మధ్య పవిత్ర హోమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. రాత్రి ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదులకు గ్రామోత్సతం నిర్వహించారు. ఎగువ అహోబిలంలో సోమవారం పవిత్రోత్సవాలు ముగిసిన విషయం తెలిసిందే. కంప్యూటర్ కోర్సులపై ఉచిత శిక్షణ నంద్యాల(న్యూటౌన్): రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 20 నుంచి స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ కోర్సులపై ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ శశికళ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ డిగ్రీ, బీటెక్ చేసిన వారికి పైథాన్ కోర్సు, ఇంటర్, ఆపై చదివిన యువతి,యువకులు డెమోస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సుల శిక్షణకు అర్హులన్నారు. శిక్షణ పూర్తిచేసిన వారికి రాష్ట్ర ప్రభుత్వం సర్టిఫికెట్ అందజేస్తుందని ఆమె తెలిపారు. వివరాల కోసం 8297812530ర్ను సంప్రదించాలన్నారు. పీడీఎస్ బియ్యం పట్టివేత ప్యాపిలి: చిరురుమాను సర్కిల్ వద్ద సోమవారం అర్ధరాత్రి విజిలెన్స్ అధికారులు 35 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. బనగానపల్లె నంచి కర్ణాటక రాష్ట్రానికి అక్రమంగా పీడీఎస్ రైస్ తరలిస్తున్నట్లు సమాచారం అండటంతో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. జిల్లా సివిల్ సప్లై అధికారి రవిబాబు, ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్లు శేఖర్రెడ్డి, నాగేశ్వర్రెడ్డి తదితరులు వాహనాల తనిఖీ చేపడుతుండగా ఓ లారీలో పీడీఎస్ రైస్ను తరలిస్తున్నట్లు గుర్తించారు. 35 టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేసి లారీని జలదుర్గం పోలీస్స్టేషన్కు తరలించారు. లారీ డ్రైవర్లు ప్రవీణ్, చిన్నమద్దిలేటిలను పోలీసులకు అప్పగించారు. అక్రమ బియ్యం తరలింపునకు సంబంధిచిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ప్యాపిలి ఎస్ఐ మధుసూదన్ తెలిపారు. -
భారీగా నష్టపోయా..
ప్యాలకుర్తిలో ఎకరా రూ.20 వేల ప్రకారం కౌలుకు తీసుకొని రెండెకరాల్లో రూ.లక్షన్నర పెట్టుబడి పెట్టి ఉల్లి పంట సాగు చేశా. పంట చేతికొచ్చినప్పటి నుంచి మార్కెట్లో ధర లేకుండా పోయింది. కనీసం ఉల్లి గడ్డలు కోసి మార్కెట్కు తరలించినా కూలీలకు కూడా గిట్టుబాటు కాని పరిస్థితి. దీంతో రెండెకరాల్లోని ఉల్లి పంటను పూర్తిగా రోటావేటర్తో ధ్వంసం చేశా. ఉల్లి సాగుతో భారీగా నష్టపోయా. ఏమి చేయాలో పాలుపోవడం లేదు. – రైతు గోపాల్, ముడుమలగుర్తి గ్రామం రెండున్నర ఎకరాల్లో బోరు కింద రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టి ఉల్లి పంట సాగు చేశా. ఉల్లి దిగుబడి బాగున్నా మార్కెట్లో కొనే నాథుడే లేడు. చేసేది లేక పంటనంతా గత రెండు రోజుల నుంచి గొర్రెలకు వదలేశా. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కనీసం ఉల్లి రైతులకు ప్రకటించిన నష్టపరిహారంమైన త్వరగా అందిస్తే ఇతర పంటలు సాగు చేసుకుంటాం. – రైతు విజయభాస్కర్రెడ్డి, ప్యాలకుర్తి గ్రామం -
రైతు సమస్యలపై చిత్తశుద్ధి లేని ప్రభుత్వం
పత్తికొండ: అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ కంగాటి శ్రీదేవి విమర్శించారు. మంగళవారం పత్తికొండ వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరులతో సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ అధికారంలోనే హోసూరు రహదారిలో టమాట ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టామన్నారు. అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాజకీయ కారణాలతో మరో చోటుకు మార్చడంతో పాటు ఆరు నెలల్లో పూర్తి చేశామని ప్రారంభ సమయంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ప్రగల్బాలు పలికారన్నారు. ఇంకా ఇప్పటికీ పనులు పునాదులు దశలోనే ఉన్నాయన్నారు. గత ప్రభుత్వంలో పత్తికొండ పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు రూ. 30 కోట్లతో ప్రారంభిస్తే టీడీపీ లీగల్ సెల్ నాయకుడు కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారన్నారు. ఇప్పటికై నా కూటమి నాయకులు రోడ్డు పనులు ప్రారంభించి ప్రజలకు మేలు చేయాలని హితవు పలికారు. రాష్ట్రవ్యాప్తంగా విచ్చలవిడిగా గ్రామాల్లో బెల్ట్షాపుల్లో నకిలీ మద్యం విక్రయాలు జరుగుతున్నాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఉల్లి, టమాట రైతులు భారీగా నష్టపోతున్నా ప్రభుత్వంలో కనిస స్పందన లేకపోవడం దారుణమన్నారు. రైతులు దిగుబడిని పొలంలోనే పశువులకు మేతగా వదిలేస్తున్నారని, ఇలాంటి పరిస్థితిని కూడా పార్టీలకు ఆపాదించడం వారి కూటమి నేతల అవివేకమన్నారు. ఉల్లి, టమాట పంటలను వైఎస్సార్సీపీకు చెందిన రైతులు మాత్రమే సాగు చేయలేదనే విషయాన్ని గుర్తించాలన్నారు. వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తలా.. తోక లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. గిట్టుబాటు ధర కల్పించ డం చేతగాక టమాట నాణ్యతపై మాట్లాడటం మంత్రి స్థాయిలో తగదన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర మేధావుల ఫోరం అధికార ప్రతినిధి శ్రీరంగడు, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సోమశేఖర్, ఎంపీపీ నారాయణ్దాస్, ఎస్టీ సెల్ జిల్లా ఆధ్యక్షుడు భాస్కర్నాయ క్,మండల కన్వీనర్ కారం నాగరాజు, సీనియర్ నాయకులు టీఎమ్డీ హుశేన్, జిట్టా నాగేష్, భాస్కర్రెడ్డి, కోతిరాళ్ల అంజినయ్య, పులికొండ తిప్పన్న, కారుమంచి నజీర్, సాబ్డిన్ నూర్బాషా, అట్లా గోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ట్రావెల్స్ బస్సుకు జరిమానా
డోన్ టౌన్: రాష్ట్రానికి చెల్లించాల్సిన ట్యాక్స్ చెల్లించకుండా రాకపోకలు సాగిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కు రూ.1.91 లక్షల జరిమానా విధించినట్లు డోన్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ క్రాంతికుమార్ మంగళవారం తెలిపారు. సోమవారం అర్ధరాత్రి కర్నూలు రోడ్డులోని అముకతాడు టోల్ ప్లాజా వద్ద రవాణా శాఖ అధికారులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో మధ్యప్రదేశ్కు చెందిన శిఖర్వార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆ రాష్ట్రం నుంచి బెంగుళూరుకు వెళుతుండగా అమకతాడు టోల్ గేట్ వద్ద ఆపి తనిఖీ చేయగా ఏపీ చెల్లించాల్సిన ట్యాక్స్ చెల్లించలేదని తెలిసింది. దీంతో వాహనంపై జరిమానా విధించినట్లు ఎంవీఐ తెలిపారు. నంద్యాల అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నాగేంద్రరావు ఉన్నారు. హడావుడిగా మండలాలకు శనగ విత్తనాలు కర్నూలు(అగ్రికల్చర్): రబీ సీజన్ మొదలై వారం రోజులు గడచినప్పటికీ పప్పు శనగ విత్తన పంపిణీ అతీగతీ లేకపోయింది. దీనిపై మంగళవారం ‘సాక్షి’లో శనగ విత్తు అందక రైతుకు బెంగ శీర్షికన కథనం ప్రచురితమవడంతో వ్యవసాయ శాఖలో కదలిక వచ్చింది. ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖపై బుధవారం సమీక్ష నిర్వహిస్తున్న తరుణంలో హడివుడిగా వెల్దుర్తి, తుగ్గలి, ఆలూ రు, బనగానపల్లి మండలాల్లో శనగ విత్తనాలను అరకొరగా అందుబాటులో ఉంచడం గమనార్హం. విత్తనాల కోసం రైతులు డి–క్రిషి యాప్లో పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ‘సాక్షి’లో కథనం వచ్చిన తర్వాత ఆగమేఘాల మీద యాప్ ఇచ్చారు. ఇంతవరకు ఒక్క రైతు కూడా పేరు రిజిస్ట్రేషన్ చేసుకొని విత్తనాలు పొందలేదంటే యాప్ అమల్లోకి రాకపోవడమే కారణంగా తెలుస్తోంది. సబ్సిడీపై విత్తనాల పంపిణీకి ఎగనామం పెట్టే కుట్రలో భాగంగానే అధిక ధర నిర్ణయం, నామమాత్రపు సబ్సిడీ అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యమాలతోనే మహిళా సమస్యలకు పరిష్కారం కర్నూలు(సెంట్రల్): ఐక్య ఉద్యమాల ద్వారానే మహిళల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి.నిర్మల అన్నారు. కూటమి ప్రభుత్వం మహిళల సమస్యల పరిష్కారంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్న నేపథ్యంలో పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మంగళవారం కార్మిక కర్షక భవన్లో ఐద్వా 12వ జిల్లా మహాసభలు నిర్వహించారు. సభకు అరుణమ్మ, ధనలక్ష్మీ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథి పి.నిర్మల మాట్లాడారు.. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు మద్యాన్ని ఏరులై పారిస్తున్నారన్నారు. నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. మహిళలపై దౌర్జ న్యాలు, దాడులు, హత్యలు,మానభంగాలు ఎక్కు వయ్యాయని, వాటిని అరికట్టడంలో ఘోరంగా విఫలమయ్యారన్నారు. ఈ నెల 13, 14, 15 తేదీల్లో అనంతపురంలో జరిగే రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రత్నమ్మ, ఉమాదేవి, సుజాత పాల్గొన్నారు. -
పంటకోతకు ముందే కన్నీరు
● ఉల్లికి గిట్టుబాటు ధర లేక దున్నేయడం, గొర్రెలకు మేతగా వదిలేస్తున్న వైనం ● పది రోజుల్లో వందలాది ఎకరాల్లో పంటను ధ్వంసం చేసిన రైతులు కోడుమూరు రూరల్: ఆరుగాలం కష్టించి పండించిన ఉల్లి పంటకు కూటమి ప్రభుత్వం గిట్టుబాటు ధరను కల్పించలేకపోతుంది. ధర లేక చేతికొచ్చిన ఉల్లి పంట ను కొందరు దున్నేస్తుండగా, మరికొందరు రైతులు గొర్రెలకు మేతగా వదిలేస్తున్నారు. దీంతో కష్టపడి పండించిన పంట కళ్లెదుటే నాశనమవుతున్న దృశ్యాలను చూస్తూ రైతుల గుండెలు బరువెక్కుతున్నాయి. గతంలో ఏనాడు కూడా ఇలా చేతికొచ్చిన పంటలను చేజేతులా నాశనం చేసే దృశ్యాలను చూడలేదనిని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ దృశ్యాలు ప్రతి గ్రామంలో నిత్యం చోటుచేసుకుంటున్నాయి. కర్నూలు జిల్లాలో ఈ ఏడాది 30 వేలకు పైగా ఎకరాల్లో రైతులు వర్షాధారం, బోరుబావుల కింద లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి ఉల్లి పంటను సాగు చేశారు. రైతుల కష్టం ఫలించి దిగుబడులు బాగానే ఉన్నా మార్కెట్లో మాత్రం ధర పూర్తిగా పడిపోవడంతో పాటు, ఉల్లి అంటే మాకొద్దు అనే పరిస్థితి నెలకొంది. మార్కెట్లో క్వింటాల్ ఉల్లి రూ.500 కూడా పలకకపోవడంతో పంట కోసి మార్కెట్కు తరలించినా కూలీ రేట్లు కూడా రైతులకు గిట్టుబాటుగాని పరిస్థితి నెలకొంది. దీంతో గత 10 రోజుల వ్యవధిలో జిల్లాలోని కోడుమూరు, గూడూరు, సి.బెళగల్, క్రిష్ణగిరి, దేవనకొండ, గోనెగండ్ల, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆస్పరి, తుగ్గలి, పత్తికొండ, ఆదోని, ఆలూరు వంటి ప్రాంతాల్లో వందలాది ఎకరాల్లో రైతులు చేతికొచ్చిన ఉల్లి పంటను దున్నేస్తూ గొర్రెలకు మేతగా వదిలేస్తూ ధ్వంసం చేశారు. ఒక్క కోడుమూరు మండలం ప్యాలకుర్తి గ్రామంలోనే గత వారం రోజుల్లో వెంకటప్ప, రఫీక్, శ్రీనివాసులు, షఫీ, తెలుగు శ్రీనివాసులు, గోపాల్, భాస్కర్రెడ్డిలతో పాటు మరికొందరు రైతులు 40కు పైగా ఎకరాల్లో సాగు చేసిన ఉల్లి పంటను ధ్వంసం చేశారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధమవుతోంది. ఉల్లి రైతులను పట్టించుకోని ప్రభుత్వం ఆరంభ శూరత్వంగా కొద్ది రోజుల పాటు ఉల్లికి మద్దతు ధర అంటూ క్వింటాలు ఉల్లి రూ.1200 ప్రకారం కోనుగోలు చేసిన కూటమి ప్రభుత్వం ఆ తర్వాత పూర్తిగా చేతులెత్తేసింది. తర్వాత ఉల్లికి మద్దతు ధర గాకుండా హెక్టార్కు రూ.50 వేల ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తామంటూ ప్రకటన చేసి చేతులు దులుపుకుంది. ఉల్లి పంటను రోటావేటర్తో ధ్వంసం చేస్తున్న రైతు ధ్వంసమైన ఉల్లి -
స్థానిక ఎన్నికల్లో బూత్కమిటీ కన్వీనర్లే కీలకం
డోన్: వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బూత్ కమిటీ కన్వీనర్లే కీలకమని రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అన్నారు. తన స్వగృహంలో మంగళవారం ఆయన వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు మల్లికార్జునరెడ్డి అధ్యక్షతన జరిగిన పట్టణ పార్టీ బూత్ కమిటీ కన్వీనర్ల సమావేశంలో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ యంత్రాంగాన్ని పటిష్టపరుచుకుంటే శాసనసభ సాధా రణ ఎన్నికలలో కూడా పార్టీ విజయం సులువవుతుందన్నారు. ఇందుకోసం ప్రతి బూత్ పరిధిలో సుశిక్షితులైన 40 మంది కార్యకర్తలను తయారుచేసుకోవాల్సిన బాధ్యత కన్వీనర్లదేనన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి నాయకులు కృషి చేయాలన్నారు. రానున్న రోజులలో పార్టీ కార్యకర్తలకు నామినేట్ పదవులతో పాటు అన్ని రకాల పదవులలో పెద్దపీట వేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మోసగించి అధికారాన్ని చేజిక్కించుకుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన పలు పథకాలనే కొనసాగిస్తూ అన్నిరకాల పథకాల్లో భారీ ఎత్తున కోత విధించిన విషయాన్ని ప్రజలు గ్రహిస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో ప్రజలు కూటమి నేతలపై తిరగబడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. విద్యుత్ చార్జీలు పెంచడంతో సామాన్యుల బతుకు భారంగా మారిందన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణమంటూనే పురుషుల నుంచి చార్జీలను విపరీతంగా వసూలు చేస్తున్నట్లు ఆరోపించారు. అనేక రకాల పన్నుల భారంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారన్నారు. కల్తీ మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తున్నారన్నారు. నాణ్యమైన మందు, సరసమైన ధర అంటూ కల్తీ మద్యంతో కూటమి నాయకులు ఊరూరా బెల్టుషాపులు ఏర్పాటు చేసి నిలువుదోపిడీ చేయడంతో పాటు ప్రాణాలు తీసేందుకు సిద్ధమయ్యారన్నారు. సమావేశంలో మున్సిప ల్ చైర్మన్ సప్తశైల రాజేష్, ఎంపీపీ రేగటి రాజశేఖర్ రెడ్డి, జెడ్పీటీసీ బద్దల రాజ్కుమార్, పార్టీ జిల్లా వలంటీర్ విభాగం అధ్యక్షులు పోసు్ట్రపసాద్, మున్సిపల్ వైస్చైర్మన్ జాకీర్హుసేన్ తదితరులు పాల్గొన్నారు. -
స్కూల్ బ్యాగులు చిరిగి.. నాణ్యత నవ్వి!
కర్నూలు సిటీ/నంద్యాల(న్యూటౌన్): ‘సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థిమిత్ర’ బ్యాగుల పరిస్థితి జిల్లాలో దారుణంగా ఉంది. చిరిగిపోయిన బ్యాగులు గుట్టలుగా పడి ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు స్కూల్ బ్యాగులను అత్యంత నాణ్యత కలిగినవి అందిస్తున్నామని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటన చేశారు. అయితే విద్యా సంవత్సరం మొదలయ్యాక కొంత ఆలస్యంగా విద్యార్థులకు బ్యాగులను అందించారు. నెల రోజుల్లో పే వాటిలో 60 శాతంపైనే చిరిగిపోయాయి. విద్యార్థులు అవస్థలు పడుతుండటంతో విద్యాశాఖ ఉన్నతాధికారులు దిద్దుబాటు చర్య లు చేపట్టారు. చిరిగిన, కుట్లుపోయిన వాటిని రిటర్న్ పంపించాలని, వాటి స్థానంలో కొత్తవి ఇస్తామని ఇటీవలే ఆయా స్కూళ్ల హెచ్ఎంలకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో చాలా మంది హెచ్ఎంలు యాప్లో బ్యాగ్లను రిటర్న్ చేసేందుకు వివరాలు నమోదు చేశారు. అయితే ఇందులో బ్యాగ్ మొత్తం పనికిరాకుండా ఉంటేనే వెనక్కి తీసుకుని కొత్త ది ఇస్తామని విద్యాశాఖ అధికారులు మెలిక పెట్టారు. చిరిగితే కుట్టించుకోండి! నంద్యాల జిల్లాలోని 1,387 ప్రభుత్వ యాజమాన్య స్కూళ్లు ఉండగా 1,21,462 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు అందజేశారు. ఒక్కో కిట్టు విలువ రూ.2,279 కాగా వీటిలో స్కూల్ బ్యాగు ఉంది. చిరిగిపోయిన స్కూల్ బ్యాగ్ రిటర్న్ ఇవ్వాలని విద్యాశాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లాలో 127 పాఠశాలల నుంచి 1,828 మంది పిల్లలు రిటర్న్ చేసేందుకు యాప్లో అప్లోడ్ చేశారు. అయితే 640 మందికి మాత్రమే కొత్త బ్యాగ్లు ఇవ్వనున్నారు. మిగిలిన బ్యాగ్లను ఆయా స్కూళ్లకు వెనక్కి పంపించి కుట్లు పోయింటే, చిరిగిపోయింటే కుట్లు వేయించుకోండి అని విద్యాశాఖ అధికారులు చెబుతున్నట్లు సమాచారం.ఈనెల10వ తేదీన కొత్తగా వచ్చిన బ్యాగులు, షూష్లు అందజేస్తామని డీఈఓ జనార్దన్రెడ్డి తెలిపారు. కొలతలు లేకుండానే బూట్లు.. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లలో కర్నూలు జిల్లాలో 2,71,006 మంది విద్యార్థులకు బూట్లు, ఒక్కో విద్యార్థికి రెండు జతల సాక్సులు ఇవ్వాలి. కానీ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో విద్యార్థులకు అందజేయలేదు. కొందరికి ఇచ్చినా ఎలాంటి ముందస్తు కొలతలు తీయకుండానే విద్యార్థులకు అందజేశారు. దీంతో చాలా మంది విద్యార్థులు బూట్లు వదిలేసి చెప్పులతోనే వస్తున్నారు. చిప్పగిరి,కృష్ణగిరి, వెల్దుర్తి, ఎమ్మిగనూరు మండలాల్లో సుమా రుగా 500 మంది విద్యార్థులకు ఇంత వరకు బ్యాగ్లు ఇవ్వలేదని ఉపాధ్యాయ వర్గాలే చెబుతున్నాయి. ఆయా మండలాల పరిధిలోని స్కూళ్ల నుంచి చిరిగిన బ్యాగ్లు, కుట్లుపోయిన బ్యాగ్లను సేకరించి జిల్లా కేంద్రం సమీపంలోని పెద్దపాడు మండల పరిషత్ ప్రా థమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన స్టోరేజీ పాయింట్కు చేర్చాలని సమగ్ర శిక్ష అధికారులు ఎంఈఓలకు ఆదేశాలు ఇచ్చారు. జిల్లాలో కేవలం నాలుగు మండలాల నుంచి మాత్రమే బ్యాగ్లు మార్పులు చేసేందుకు యాప్లో అప్లోడ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నాలుగు మండలాల్లో కూడా కొన్ని స్కూళ్ల నుంచి మాత్రమే కొత్త బ్యాగ్లు కోరినట్లు తెలుస్తోంది. -
వైఎస్సార్సీపీ టాక్స్–కర్నూలు యూట్యూబ్ చానల్ ప్రారంభం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ టాక్స్– కర్నూలు యూట్యూబ్ చానల్ను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రారంభించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, కర్నూలు, నంద్యాల జిల్లాల పార్టీ అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు నగర మేయర్ బీవై రామయ్య, కర్నూలు జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి హనుమంత రెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు. -
బాధ దిగమింగి.. జీవాలకు మేతగా..
ఉల్లిని కూలీలతో తెంపి మార్కెట్కు తీసుకెళ్లి విక్రయిస్తే సొమ్ము చేతికి రావాల్సింది పోయి.. మరింత అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సిన దుస్థితి. దీంతో దిక్కుతోచక రైతులను పంటను జీవాలకు మేతగా వదిలేస్తున్నారు. ఆలూరు మండలం మనేకుర్తికి చెందిన చాకలి పరమేష్ బోరు బావి కింద రెండెకరాల్లో ఉల్లి సాగు చేశారు. పెట్టుబడుల కోసం రూ.2 లక్షలు అప్పు చేశారు. పంట చేతికొచ్చిన దశలో ఉల్లికి ధర లేకుండా పోయింది. ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. మార్కెట్లో ఉల్లి ధర.. పంట కోతకు కూలీల ఖర్చు, రవాణా ఖర్చును భేరీజు వేసుకోగా మరింతగా అప్పుల భారం మీద పడుతుందని లెక్కలు వేసుకున్నారు. బాధను దిగమింగుకుని మంగళవారం ఉల్లి పంటను జీవాలకు మేతగా వదిలేశారు. దీనిపై బాధిత రైతును పలకరించగా.. ప్రభుత్వం ఉల్లి పంట హెక్టారుకు రూ.50 వేలు సాయం ప్రకటించింది. అది వచ్చే వరకు పొలంలో పంటను అలాగే ఉంచుకోలేం. అంతకుముందు ఉల్లి క్వింటాలుకు ప్రకటించిన రూ.1,200 మద్దతు ధర కూలీలకు కూడా సరిపోదు. కష్టనష్టాలకోర్చి ఆరుగాలం శ్రమించి పంటలను సాగు చేసిన రైతులకు చివరకు ఆత్మహత్యలే శరణ్యం తప్పా.. మిగిలేది ఏమీ లేదని కన్నీటి పర్యంతమయ్యారు. – ఆలూరు జీవాలకు మేతగా వదిలేసిన ఉల్లి పంట ఉల్లిగడ్డలను చూపుతున్న రైతు వీరేష్ -
కల్వర్టు వద్ద ఇరుక్కుపోయిన లారీ
● స్తంభించిన రాకపోకలు కోవెలకుంట్ల: కోవెలకుంట్ల– జమ్మలమడుగు ఆర్అండ్బీ రహదారిలో మంగళవారం అర్ధరాత్రి కల్వర్టు వద్ద ఫ్లయాష్ లారీ ఇరుక్కుపోయింది. నంద్యాల నుంచి వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు వరకు జాతీయ రహదారి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మండలంలోని గుళ్లదూర్తి సమీపంలో కల్వర్టు విస్తరణ పనుల్లో భాగంగా రోడ్డును పక్కకు మళ్లించారు. అరకొరగా గ్రావెల్ వేసి తాత్కాలికంగా రోడ్డును ఏర్పాటు చేయడంతో ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు దెబ్బతింది. ఈ స్థితిలో మంగళవారం జమ్మలమడుగు నుంచి కోవెలకుంట్లకు వస్తున్న ఫ్లయాష్ ట్యాంకర్ లారీ గ్రావెల్ రోడ్డులో ఇరుక్కుపోయింది. ఈ రహదారిలో ప్రత్యామ్నా యం లేకపోవడంతో రెండు వైపులా వాహనాలు నిలిచి రాకపోకలు స్తంభించాయి. దీంతో కర్నూలు, నంద్యాల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కడప, తిరుపతి, తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు అవస్థలు పడ్డారు. కొన్ని వాహనాలను గుళ్లదూర్తి నుంచి సంజామల మీదుగా కోవెలకుంట్ల వైపు మళ్లించారు. ఉదయం 10 గంటలకు జేసీబీ సాయంతో లారీని తొలగించడంతో రాకపోకలు యథావిధిగా సాగాయి. -
ఉల్లి.. రైతు తల్లడిల్లి!
కూటమి పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. దాదాపు అన్ని పంటలకు గిట్టుబాటు ధర లేక రైతన్నలు తల్లడిల్లుతున్నారు. ఉల్లి రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. పండించిన ఉల్లిని మార్కెట్కు తీసుకెళ్తే పెట్టుబడి ఖర్చులు దేవుడెరుగు కనీసం కూలీలు, రవాణా ఖర్చులు కూడా రావడం లేదు. ప్రభుత్వం మొదట ఉల్లి క్వింటాలుకు రూ.1200 ధర కల్పిస్తామని చెప్పడం తర్వాత ఎకరానికి రూ.20 వేలు ఇస్తామంటూ రోజుకో మాట చెబుతుండటంతో నమ్మకం లేక రైతన్నలు తీవ్ర ఆవేదనతో చేతికొచ్చిన పంటను దున్నేస్తున్నారు. ఈ క్రమంలో ఆస్పరి మండలం జొహరాపురం గ్రామానికి చెందిన జేపీ రంగస్వామి అనే రైతు ఆరెకరాల్లో ఉల్లి పంటను ట్రాక్టర్తో మంగళవారం తొలగించాడు. పంట సాగు కోసం రూ.3 లక్షల పెట్టుబడి పెట్టాడు. మార్కెట్లో ఉల్లికి ధర లేకపోవడం, కోతలకు అయ్యే ఖర్చులు కూడా రాని పరిస్థితి ఉండటంతో తీవ్ర ఆవేదనకు గురై చేతికొచ్చిన పంటను ట్రాక్టర్తో దున్నేశాడు. అంతకుముందు పంటను గొర్రెలకు వదిలేశాడు. ఇదిలాఉండగా జొహరాపురంలో 15 మంది రైతులు దాదాపు 100 ఎకరాల్లో నల్లరేగడి మెట్ట పొలంలో ఉల్లిని సాగు చేశారు. వారు కూడా చేసేది లేక ఉల్లి పంటను తొలగించారు. – ఆస్పరిజొహరాపురంలో ఉల్లి పంటను ట్రాక్టర్తో తొలగిస్తున్న రైతన్న -
అడవిలో అగ్నిశిఖ
ఆయుర్వేద వైద్యంలో అడవి నాభిగా ప్రసిద్ధి చెందిన అగ్నిశిఖ మొక్కలు నల్లమలలోని కనువిందు చేస్తున్నాయి. కొత్తపల్లి సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతం, గువ్వలకుంట్ల, పాలెంచెరువు, బండినాయిని పాలెం సమీపంలోని వరి పంట పొలాల్లో, ఆత్మకూరు మండలంలోని కొట్టాల చెరువు గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో మొక్కలు విరివిగా ఉన్నాయి. దీనినే నాగేటిగడ్డ, నీరుపిప్పిలి మొక్క అని పిలుస్తుంటారు. ఈ తీగ జాతి మొక్క పక్కనున్న మొక్కలను ఆధారం చేసుకుని పైకి ఎగబాకుతుంటాయి. ఈ పుష్పాలు ఎరుపు, నారింజ, తెలుపు, పసుపు రంగుల కలబోతగా దర్శనమిస్తాయి. ఈ పుష్పాలను ఆయుర్వేదంలో దివ్య ఔషధంగా భావిస్తారు. దీని కాండం, ఆకులు, విత్తనాలు, పండ్లు, పూలు, దుంపలన్నీ విషపూరితం. పాముకాటు, తేలు కాటుకు విరుగుడుగా, పలు రోగాల నివారణగా ఉపయోగపడుతుందని ఆయుర్వేద వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. వైద్యుల సూచనలు, సలహాల మేరకు వాడుకోవాలని నిపుణులు చెబుతున్నారు. – కొత్తపల్లిఎరుపు, పసుపు రంగులతో.. -
స్వచ్ఛ జిల్లాకు అందరూ సహకరించాలి
● జిల్లా కలెక్టర్ రాజకుమారినంద్యాల: స్వచ్ఛ జిల్లాకు ప్రజలందరూ సహకరిస్తూ పారిశుద్ధ్య కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పిలుపునిచ్చారు. సోమ వారం పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన స్వచ్ఛాంధ్రా అవార్డ్స్–2025 జిల్లా స్థాయి బహుమతుల ప్రదాన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాబోయే మూడు నెలల్లో స్వచ్ఛ జిల్లాగా తీర్చిదిద్దాలని, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, వ్యాపార ప్రదేశాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేయాలని, తడి, పొడి వ్యర్థాలను వేరుగా వర్గీకరించేందుకు శ్రీకారం చుట్టాలని, మెప్మా, డీఆర్డీఏ ఆధ్వర్యంలోని మహిళా స్వచ్ఛంద సమూహాల ద్వారా ఇంట్లోనే కంపోస్ట్ తయారీని ప్రోత్సహించాలని, నీటి మట్టాలు తగ్గిపోయిన 165 గ్రామాల్లో భూగర్భ జలాలను పునరుద్ధరించే చర్యలు చేపట్టాలని కలెక్టర్ తీర్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో 24 పర్యాటక కేంద్రాల పరిసరాలు ఆహ్లాదకరంగా మార్చాలన్నారు. స్వచ్ఛ ఆంధ్రా అవార్డ్స్–2025లో రాష్ట్ర స్థాయిలో ‘మన ఊరు మన గుడి మన బాధ్యత‘ స్వచ్ఛంద సంస్థ అవార్డు లభించిందని తెలిపారు. జిల్లాలో వివిధ విభాగాల్లో మొత్తం 51 అవార్డులు సాధించిన నిర్వాహకులకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన మెమొంటోలు, సర్టిఫికెట్లు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందజేసి, వారిని శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న, డీపీవో లలితాబాయి, డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి, డోన్ మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్, నంద్యాల ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తక్ అహ్మద్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. -
హృదయ విదారకం
కొలిమిగుండ్ల: చిన్నా .. పెద్దా వయస్సు తేడా లేకుండా గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయనేందుకు ఈ వ్యక్తి ఆకస్మిక మరణమే మరో నిదర్శనం. 35 ఏళ్ల వ్యక్తి గుండె ఆగిపోయింది. ఆరోగ్య సమస్యతో ఆసుపత్రికి వెళ్లేందుకు బస్టాప్లో బస్సు కోసం వేచి ఉన్న వ్యక్తి అందరూ చూస్తుండగానే గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన సోమవారం కొలిమిగుండ్లలో చోటు చేసుకుంది. గొర్విమానుపల్లెకు చెందిన చెన్నయ్య(35) జీవనోపాధి కోసం నెల రోజుల నుంచి కొలిమిగుండ్లలోని మోడల్ స్కూల్ సమీపంలోని కాలనీలో ఉంటున్నాడు. రెండు రోజుల క్రితం గ్యాస్ ట్రబుల్ సమస్య అంటూ తాడిపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. బైక్లో వస్తుండగా మార్గమధ్యలో కిందపడిపోయాడు. స్థానికులు సపర్యలు చేయడంతో కోలుకుని ఇంటికి చేరుకున్నాడు. నంద్యాల సమీపంలోని ఆసుపత్రికి వెళ్లేందుకు సోమవారం కాలనీలోని ఓ వ్యక్తి సాయంతో బైక్పై తహసీల్దార్ కార్యా లయం సమీపంలోని బస్టాప్ వద్దకు వచ్చాడు. వెనుక భార్య రమాదేవి, తల్లి నడిచి వస్తున్నారు. కూర్చున్న చోట మరొక వ్యక్తితో మాట్లాడుతుండగానే చెన్నయ్య కు గుండెపోటు రావడంతో కుప్పకూలి మృతి చెందాడు. ఈలోగా భార్య, తల్లి అక్కడికి చేరుకుని బోరున విలపించారు. మృతునికి కుమారుడు, కుమార్తె ఉన్నా రు. కుటుంబీకుల రోదన పలువురిని కలిచివేసింది. -
పీజీఆర్ఎస్లో అర్జీల వెల్లువ
నంద్యాల: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సోమవారం అర్జీలు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యలపై ప్రజలు వినతులు అందజేశారు. 222 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి దరఖాస్తులు సమర్పించారు. ఎక్కువగా భూ సమస్యలు, రీ సర్వేపై వినతులు వచ్చాయి. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో డీఆర్ఓ రాము నాయక్, డిప్యూటీ కలెక్టర్లు, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొని అర్జీలు స్వీకరించా రు. అంతకుముందు జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలు నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాల్సినవి 2,017, రీఓపెన్ అయిన దర ఖాస్తులు 539 ఉన్నాయని, వాటిని గడువు ముగిసే వరకు వేచి చూడకుండా వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై ఫీడ్ బ్యాక్ స్వీకరణ తక్కువ శాతం ఉందని వేగవంతం చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని సంక్షేమ హాస్టళ్లు, సీ్త్ర శిశు సంరక్షణ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై సంబంధిత క్షేత్రాధికారులు తనిఖీలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. వినతుల్లో కొన్ని.. ● గోస్పాడు మండలం ఎం.చింతకుంట్ల గ్రామంలో సర్వే నెం.247, 232లో అనుభవంలో ఉన్న భూమిని కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్నానని, ఆ భూమిని ఆన్లైన్లో ఎక్కించాలని కోరుతూ గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు వినతి పత్రం అందజేశారు. ● ఆళ్లగడ్డ మండలం జి.జంబులదిన్నె గ్రామంలో సర్వే నెం.328/ఎ2లో రెండు ఎకరాలు, సర్వే నెం.328/బి2లో 0.40 ఎకరాలు సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నానని, కానీ ఆన్లైన్లో 2.20 ఎకరాలు మాత్రమే చూపుతోందని అందుకు తగు చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన బి.శ్రీరామ్ అర్జీ ఇచ్చారు. ● తన భర్త అనారోగ్యంతో మృతి చెందారని జీవనోపాధి కోసం వితంతు పింఛన్ మంజూరు చేయాలని పాణ్యం ఎస్సీ కాలనీకి చెందిన నెరవాటి పుల్లమ్మ వినతి పత్రం అందజేశారు. -
పప్పుశనగ సాగుపై నీలినీడలు
అటు కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం.. ఇటు అనుకూలించని వాతావరణంతో పప్పుశనగ సాగుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఏటా రబీ సీజన్ మొదటి పంటగా జిల్లాలో విస్తారంగా పప్పుశనగ సాగు చేసే రైతులకు ఆదిలోనే అవరోధాలు ఎదురవుతున్నాయి. కోవెలకుంట్ల: అక్టోబర్ మాసం ప్రారంభంతో రబీ సీజన్ షురూ అయ్యింది. పప్పుశనగ సాగుకు సరైన అదును. జిల్లాలోని 29 మండలాల పరిధిలో జేజే–11, ఫూలేజి రకాలకు చెందిన శనగ సాగు సాధారణ విస్తీర్ణం 57,299 హెక్టార్లు. ఇందులో స్థానిక వ్యవసాయ సబ్ డివిజన్లోని కోవెలకుంట్ల, సంజామల, అవుకు, కొలిమిగుండ్ల, ఉయ్యాలవాడ, దొర్నిపాడు మండలాల్లో అత్యధికంగా 38,900 హెక్టార్లలో శనగ సాగు కావాల్సి ఉంది. అల్పపీడన ప్రభావంతో ఇటీవల కురుస్తున్న వర్షాలు, రసాయన ఎరువులు అందుబాటులో లేకపోవడం. కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు సబ్సిడీ విత్తనాలను సరఫరా చేయకపోవడంతో విత్తన ప్రక్రియ ముందుకు సాగడం లేదు. గత నెల 20వ తేదీ నుంచి ఒకటి రెండు, రోజుల వ్యవధిలో వరుసగా వర్షాలు కు రుస్తుండటంతో నీరు నిల్వ చేరి పొలాలు బీళ్లు అయ్యాయి. ఈ నెల మొదటి వారం సాగుకు అనుకూలంగా ఉంటుందనుకున్నా రైతులకు నిరాశే మిగిలింది. వర్షాలు వీడకపోవడంతో సాగు ముందుకు సాగడం లేదు. వర్షాల కారణంగా పొలాల్లో పిచ్చిమొక్కలు, కలుపు పెరిగి బీళ్లను తలపిస్తున్నాయి. ప్రతి ఏటా దసరా పండుగ ముగిసిన వెంటనే విత్తనా లు వేసే వారు. ఈ ఏడాది దసరా పండుగ ముగిసినా విత్తనానికి పొలాలు సిద్ధం చేసుకులేని పరిస్థితి తలెత్తింది. పొలాల్లో తేమ శాతం ఆరేందుకు మరో వారం రోజులపాటు గడువు పట్టేలా ఉండటం, అల్పపీడన ప్రభావంతో తిరిగి వర్షాలు కురిసే ఆస్కారం ఉండటంతో రైతులు దిగాలు చెందుతున్నారు.గతేడాది కుదేలుగత ఏడాది విత్తన సమయంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. వరణుడిపై భారం వేసి రైతులు విస్తారంగా శనగ పంట సాగు చేశారు. జిల్లాలోని 29 మండలాల పరిధిలో 51 వేల హెక్టార్లలో శనగ సాగు సాధారణ విస్తీర్ణం కాగా 52 వేల హెక్టార్లలో రైతులు జేజే–11, ఫూలేజీ రకాలకు చెందిన శనగ పంట సాగుచేశారు. విత్తనాలు, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, కలుపు నివారణ, తదితర పెట్టుబడుల రూపంలో ఎకరాకు రూ. 20 వేలు వెచ్చించారు. కౌలు రైతులపై కౌలు రూపంలో అదనంగా మరో రూ. 15 వేలు భారం పడింది. పంట మార్పిడి విధానం అవలంభించకపోవడం, విత్తన సమయంలో పొలాలను కలియదున్నక పోవడం, వాతావరణం అనుకూలించకపోవడం, తదితర కారణాలతో శనగ పైరును వేరుకుళ్లు (ఎండు తెగులు) ఆశించి పైరులో మొక్కలు ఎండిపోయాయి. ఫూలేజి (తెల్లశనగ) రకానికి చెందిన పైరుకు ఎక్కువశాతం ఎండు తెగులు ఆశించింది. తెగులుకు తోడు గత నవంబర్, డిసెంబర్ నెలల్లో తుపాన్ల ప్రభావంతో కురిసిన వర్షాలు, అధిక తేమ కారణంగా పైరు దెబ్బతినింది. వేలాది రూపాయాలు పెట్టుబడులు వెచ్చించగా అధిక వర్షాలు, తెగుళ్ల కారణంగా దెబ్బతిని ఎకరాకు 3– 4 క్వింటాళ్లకు మించి దిగుబడులు రాకపోడంతో రైతులు నష్టాల ఊబిలో కూరకపోయారు.ఈ ఏడాది ఆరంభంలోనే అడ్డంకులు..జిల్లాలో ఈ ఏడాది పప్పుశనగ సాగుకు సరైన అదును కాగా సాగుకు అడ్డంకులు వేధిస్తున్నాయి. విత్తనానికి ముందు రైతులు ఎకరాకు రెండు బస్తాల డీఏపీ ఎరువులను భూమిలో వేయాల్సి ఉంది. ఖరీఫ్ సీజన్లో రైతులను యూరియా కష్టాలు వేధించగా ఈ సీజన్లో డీఏపీ కష్టాలు తప్పడం లేదు. జిల్లాలోని ఆయా మండలాల్లో రైతులు గత కొన్నేళ్ల నుంచి శనగ పంటకు గోదావరి డీఏపీని విరివిగా వినియోగిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఆ రకం డీఏపీ అందుబాటులో లేదు. రైతు సేవా కేంద్రాలు, మనగ్రోమోర్ కేంద్రాల్లో, సహకార పరపతి సంఘాల్లో గోదావరి డీఏపీ దొరకడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం బస్తా రూ. 1,430కు రైతులకు అందాల్సి ఉంది. దీన్ని ఆసరా చేసుకుని కొందరు ప్రైవేట్ డీలర్లు గోదావరి డీఏపీని అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. అలాగే జిల్లాకు 11,950 క్వింటాళ్ల సబ్సిడీ శనగలను ప్రభుత్వం కేటాయించింది. క్వింటాకు రూ. 7,800 ప్రభుత్వం ధర నిర్ణయించగా 25 శాతం సబ్సిడీతో రైతులకు రూ. 5,850 ప్రకారం సరఫరా చేయాల్సి ఉంది. విత్తన కేటాయింపులు తప్పా ఇప్పటి వరకు విత్తనాలు సరఫరా కాకపోవడంతో రైతులు విత్తనాల కోసం ఎదురు చూడాల్సి వస్తోంది.రసాయన ఎరువులు దొరకడం లేదు ఈ ఏడాది 65 ఎకరాల సొంత పొలంతోపాటు ఎకరాకు రూ. 20 వేలు కౌలు చెల్లించి మరో పదిహేను ఎకరాలు కౌలుకు తీసుకున్నారు. మొత్తం 80 ఎకరాల్లో తెల్ల, ఎర్ర శనగ సాగు చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. గోదావరి డీఏపీ దొరకడం లేదు. ఇతర రకాలకు చెందిన డీఏపీ వేద్దామనుకున్నా రైతుసేవా కేంద్రాల్లో వ్యవసాయ శాఖ సిబ్బంది ఎరువులు ఇవ్వడం లేదు.– గోవిందరెడ్డి, రైతు, గుంజలపాడు, కోవెలకుంట్ల మండలం50 శాతం సబ్సిడీతో విత్తనాలు ఇవ్వాలిఈ ఏడాది పప్పు శనగ సాగుకు ప్రభుత్వం 25 శాతం సబ్సిడీతో శనగ విత్తనాలను సరఫరా చేస్తోంది. క్వింటా రూ. 7,800 ధర నిర్ణయించి రూ. 5,850 ప్రకారం పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మూడు ఎకరాల సొంత పొలంలో ఈ ఏడాది శనగ సాగు చేయాలనుకుంటున్నాను. ప్రస్తుత మార్కెట్ క్వింటా రూ. 6 వేలలోపు ధర ఉంది. 25 శాతం సబ్సిడీ ఇచ్చినా మార్కెట్ధర ప్రకారం శనగలు కొనుగోలు చేయాల్సి వస్తోంది. 50 శాతం సబ్సిడీతో శనగ విత్తనాలు సరఫరా చేసి ఆదుకోవాలి.– సుబ్బరాయుడు, రైతు, కోవెలకుంట్లసబ్ డివిజన్ సాధారణ సాగు విస్తీర్ణం విత్తన కేటాయింపులు(హెక్టార్లలో) (క్వింటాళ్లలో)కోవెలకుంట్ల 38,900 7,900నంద్యాల 5,000 2,125ఆళ్లగడ్డ 4,747 500ఆత్మకూరు 1,310 250నందికొట్కూరు 6,772 1,000డోన్ 570 175జిల్లాలో 57,299 హెక్టార్లలో సాగు లక్ష్యం -
ఆశలు నీట మునిగి.. కన్నీళ్లు మిగిలి!
● కుండపోత వర్షం ● నీట మునిగిన పంటలు.. తడిచిన దిగుబడులు ● లబోదిబోమంటున్న రైతన్నలు హరినగరం సమీపంలో ఆరబెట్టిన మొక్క జొన్నలు తడిచిన దృశ్యంచిత్రేనిపల్లె సమీపంలో మొక్కజొన్న పొలంలో నుంచి పారుతున్న వాన నీరురుద్రవరం: అన్నదాతలను వరుణుడు ముంచేస్తున్నాడు. భారీ వర్షాలకు చేతికొచ్చిన పంటలు నీటి పాలవుతున్నాయి. 20 రోజులుగా కురిసిన వరుణుడు ఇక తెరిపి ఇచ్చాడులే అనుకుంటున్న తరుణంలో కుండపోత వర్షంతో రైతులు కుదేలయ్యారు. రుద్రవరం, చాగలమర్రి, దొర్నిపాడు, ఉయ్యాలవాడ మండలాల్లో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు ఉప్పొంగాయి. పంట పొలాల్లో నీళ్లు నిలిచాయి. మొక్కజొన్న రైతులకు కోలుకోలేని దెబ్బ పడింది. గత 20 రోజులుగా కురుస్తున్న వర్షం మూడు రోజులుగా తెరిపి ఇవ్వడంతో మండల కేంద్రమైన రుద్రవరం, టీ.లింగందిన్నె, ఆలమూరు, నర్సాపురం, అప్పనపల్లె, ఎల్లావత్తుల, కోటకొండ, ముకుందాపురం, హరినగరం, నక్కలదిన్నె, ముత్తలూరు తదితర గ్రామాల పరిధిలో మొక్కజొన్న కోతలు జోరుగా సాగాయి. దిగుబడులను ఆర్అండ్బీ రోడ్లు, కల్లాలు, బయలు ప్రదేశాల్లో ఆరబెట్టారు. హఠాత్తుగా వర్షం కురవడంతో ఆరబోసిన మొక్క జొన్నలు తడిచిపోవడంతో రైతులు నష్టపోయారు. ఆలమూరు వద్ద ఉన్న దొన్ల వాగుపై నీరు ఉద్ధృతంగా పారుతోంది. భారీ వర్షానికి మండలంలోని పలు గ్రామాల వద్ద వరి, మొక్కజొన్న, మిర్చి, మినుము, వేరుశనగ వంటి పంటలు నీట మునిగాయి. అలాగే మండల కేంద్రమైన రుద్రవరంతో పాటు పలు గ్రామాల్లోని లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. దొర్నిపాడు మండలంలో.. పత్తి, మినుము, కంది, మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. పొలాల్లో తేమ శాతం అధికం కావడంతో ఈ పంటలన్నీ నీరుకుట్టు తీసుకుంటున్నాయని రైతులు వాపోతున్నారు. ఇటీవలే విత్తనపత్తి క్రాసింగ్ పనులు మొదలు కావడంతో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పింజలన్నీ నేలరాలుతున్నాయి. కుందూ పరీవాహక ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ సుభద్ర హెచ్చరించారు. జిల్లాలో మళ్లీ వర్షం నంద్యాల(అర్బన్): జిల్లాను వరుణుడు వీడటం లేదు. మూడు రోజులు తెరిపి ఇచ్చి మళ్లీ కురిశాడు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు పలు మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. చాగలమర్రి మండలంలో అత్యధికంగా 75.2 మి.మీ, వెలుగోడు మండలంలో అత్యల్పంగా 3.0 మి.మీల వర్షపాతం నమోదైంది. అదే విధంగా రుద్రవరంలో 70.2, పాములపాడు 43.6, జూపాడుబంగ్లా 43.2,ఆళ్లగడ్డ 33.6, దొర్నిపాడు 30.4, శిరువెళ్ల 19.2, పగిడ్యాల 14.4, ఉయ్యాలవాడ 10.0, కోవెలకుంట్ల 3.4 మి.మీల వర్ష పాతం నమోదైంది. వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ముత్యాలపాడులో మొక్కగింజలను నీళ్లలో నుంచి బయటకు తీస్తున్న మహిళా రైతు భారీ వర్షం.. అపార నష్టం చాగలమర్రి: భారీ వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మండలంలో 75.2 మి.మీ వర్షపాతం నమోదైంది. గొడిగనూరు, శెట్టివీడు గ్రామాల వద్ద భవనాశి, అడ్డువాగులు ఉద్ధృతంగా ప్రవహించాయి. బ్రాహ్మణపల్లె వద్ద వక్కిలేరు వాగు వంతెన మీదుగా ప్రవహించింది. ముత్యాలపాడు చెరువు నిండి అలుగు ఎక్కి పారడంతో గ్రామం జలమయమైంది. స్థానిక ఎస్పీజీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆరబెట్టిన మొక్కజొన్న గింజలు తడిచి పోయాయి. దిగుబడులను కాపాడుకునేందుకు రైతులు పాట్లు అన్నీ ఇన్నీ కావు. కళ్ల ముందు కష్టమంతా నీటి పాలవుతుండటంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. -
వైభవంగా శ్రీశైలగిరి ప్రదక్షిణ
శ్రీశైలంటెంపుల్: పౌర్ణమిని పురస్కరించుకుని సోమవారం సాయంత్రం శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. స్వామిఅమ్మవార్ల మహా మంగళహారతుల అనంతరం ఉత్సవమూర్తులను పల్లకీలో ఉంచి ప్రత్యేక పూజలు జరిపారు. పల్లకీ ఊరేగింపుతో శ్రీశైల గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. ఆలయ మహాద్వారం నుంచి మొదలైన ఈ ప్రదక్షిణ గంగాధర మండపం, అంకాళమ్మ గుడి, నందిమండపం, గంగాసదనం, బయలు వీరభద్రస్వామి ఆలయం, రింగ్రోడ్డు, ఫిల్టర్బెడ్, సిద్దరామప్ప కొలను, పుష్కరిణి వద్దకు చేరుకుంది. అక్కడి నుంచి తిరిగి నందిమండపం, ఆలయ మహాద్వారం వద్దకు చేరుకుంది. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమంలో శ్రీశైల దేవస్థాన అధికారులు, సిబ్బంది, పలువురు భక్తులు పాల్గొన్నారు. చట్ట పరిధిలో విచారించి న్యాయం చేస్తాం నంద్యాల: ప్రజలు ఇచ్చిన సమస్యలను చట్ట పరిధిలో విచారించి సత్వర న్యాయం చేస్తామని అడిషనల్ ఎస్పీ యుగంధర్బాబు అన్నారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పలువురు నుంచి ఆయన ఫిర్యా దులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. నిర్ణీత గడువు లోపల ఫిర్యాదులను పరిష్కరించాలని, ఫిర్యాదు లు పునరావృతం కాకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్నప్రసాద వితరణకు విరాళాలు శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ పథకానికి పలువురు భక్తులు విరాళాలు అందించారు. సోమవారం గుంటూరుకు చెందిన దాత వీరశేఖరరావు రూ.1,00,116, కర్నూలుకు చెందిన దాత ఎల్.రమేష్బాబు రూ.1,01,101 విరాళాన్ని పర్యవేక్షకులు కె.శివప్రసాద్కు అందజేశారు. విరాళాలు అందించిన దాతలకు దేవస్థానం తరుఫున స్వామివారి శేషవస్త్రాలను, లడ్డూప్రసాదాలను, జ్ఞాపికను అందించి సత్కరించారు. నేడు కర్నూలుకు డీజీపీ కర్నూలు: ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్త మంగళవారం కర్నూలులో పర్యటించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 16వ తేదీన జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించేందుకు డీజీపీ కర్నూలుకు వస్తున్నారు. ఈ మేరకు జిల్లా పోలీసు శాఖకు సమాచారం అందింది. ప్రధానమంత్రి పర్యటన నిమిత్తం వీవీఐపీలు, పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పర్యటించనున్న నేపథ్యంలో ముందస్తు భద్రత ఏర్పాట్లపై డీజీపీ సమీక్షించనున్నారు. ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ విడుదల కర్నూలు(హాస్పిటల్): జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ప్రభుత్వ సర్వజన వైద్యశాలల్లో పోస్టుల భర్తీకి ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ విడుదల చేసినట్లు కర్నూలు మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 10 కేటగిరీల్లో పోస్టులు భర్తీ చేసేందుకు జూలై 7న నోటిఫికేషన్ జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఏడు కేటగిరీల్లో పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారి ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్లను https:// kurnool.ap.gov.in, https://kurnool medical college.ac.in వెబ్సైట్లలో అప్లోడ్ చేశామని తెలిపారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 8 నుంచి 10వ తేదీలోపు కర్నూలు మెడికల్ కాలేజీలో సాయంత్రం 5 గంటల్లోపు లిఖిత పూర్వకంగా సమర్పించాలని పేర్కొన్నారు. ఆన్లైన్లో పంపిన అభ్యంతరాలు స్వీకరించబోమని తెలిపారు. -
ముగిసిన అహోబిల పవిత్రోత్సవాలు
ఆళ్లగడ్డ: ఎగువ అహోబిలంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహ ఆలయంలో నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు వైభవోపేతంగా ముగిశాయి. ఆదివారం తెల్లవారు జామున ప్రారంభమైన పూజలు సోమవారం ఉదయం పూర్ణాహుతితో ముగిశాయి. ముందుగా మూలమూర్తులు జ్వాలా నరసింహస్వామి, చెంచులక్ష్మీ అమ్మవార్లను సుప్రభాతసేవతో మేల్కొలిపి దివ్యదర్శనం అనంతరం నిత్యపూజలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ జ్వాలా నరసింహుడిని యాగశాలలో కొలువుంచి నవకళశాలతో అభిషేకించి నూతన పట్టు పీతాంబరాలతో అలంకరించి పవిత్ర హోమం నిర్వహించారు. సాయంత్రం గ్రామోత్సవం, రాత్రి నిత్యపూజ అనంతరం శాంతి హోమాలు నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి, అర్ధరాత్రి అనంతరం ఉత్సవమూర్తులైన స్వామి అమ్మవార్లకు తిరుమంజనం, సంప్రోక్షణ చేపట్టారు. సోమవారం తెల్లవారు జామున శాత్తుమురై గోష్టితో పవిత్రోత్సవ కార్యక్రమాన్ని ముగించారు. ఆయా కార్యక్రమాలను అహోబిలం ప్రధానార్చకులు శ్రీమాన్ శఠగోప వేణుగోపాలన్ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చిన వేద పాఠశాలల పండితులు నిర్వహించారు. -
జాడలేని బట్టమేక పక్షి
● వాతావరణంలో మార్పులే కారణమా ?నందికొట్కూరు: ప్రతి ఏడాది సెప్టెంబర్ నెలలో అరుదైన బట్టమేక పక్షి.. రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి కొన్ని నెలల పాటు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆ పక్షులు ఇక్కడే గుడ్లు పెడుతుంటాయి. అయితే ఈ ఏడాది ఇంత వరకు అభయారణ్యంలో బట్టమేక పక్షుల జాడ కనిపించలేదని అధికారులు చెబుతున్నారు. వీటితో పాటు సుమారు 80 నుంచి 100 పక్షి జాతులు ఇక్కడికి వస్తుంటాయి. కొల్లేరు ప్రాంతంలో అరుదుగా కనిపించే ఫ్లవింగ్ బర్డ్స్ కూడా ఇక్కడికి వస్తాయి. ఈ ఏడాది అధిక వర్షాలు కురవడం, వాతావరణంలో మార్పులు రావడంతో కొన్ని పక్షులు సమయానికి రాలేదని తెలుస్తోంది. అందువల్లే బట్టమేక పక్షి కూడా రావడానికి ఆలస్యం అయ్యి ఉంటుందన్నా రు. పక్షి జాతులపై అధ్యయనం చేయడానికి చైన్నె, హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి శాస్త్రవేత్తలు, జంతు ప్రేమికులు ప్రతి శని, ఆదివారాల్లో వస్తుంటారు. వచ్చిన వారికి వసతి కోసం రెండు గదులు ఉన్నాయి. మరిన్ని వసతులు కల్పిస్తే పక్షులను, జింకలను చూసేందుకు జంతు ప్రేమికులు, పాఠశాలల విద్యార్థులు వచ్చే అవకాశం ఉంది. పక్షులను చూసేందుకు అభయారణ్యంలోకి వెళ్లాలంటే తప్పని సరిగ్గా ఉన్నతాధికారుల అనుమతులు ఉండాలని అధికారులు తెలిపారు. -
రైతుల అభ్యున్నతికి కృషి చేయాలి
నంద్యాల(వ్యవసాయం): రైతుల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా అన్నారు. ఆదివారం నంది రైతు సమాఖ్య రజతోత్సవ కార్యక్రమాన్ని రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. నంది రైతు సమాఖ్య ముఖ్య సలహాదారులు డాక్టర్ రవీంద్రనాథ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మాట్లాడుతూ.. రైతు సంఘాల కృషితో గోరుకల్లు రిజర్వాయర్ నిర్మాణం సాధ్యమైందని, అలాగే గిట్టుబాటు ధరల కోసం సమాఖ్య కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సిద్దేశ్వరం అలుగు నిర్మాణం ఆవశ్యకతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నారు. డాక్టర్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ 25 సంవత్సరాల పాటు నంది రైతు సమాఖ్య రైతు సంక్షేమానికి, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంత రైతుల అభ్యున్నతికి కృషి చేసిందన్నారు. ఎమ్మెల్సీ ఇసాక్బాషా మాట్లాడుతూ.. రైతులకు సరసమైన ధరలతో నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు అందించడానికి ప్రభుత్వం ముందుకు రావాలన్నా రు. రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేలా రైతు సమాఖ్య మరింత కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా నంది రైతు సమాఖ్య 25 ఏళ్ల ప్రత్యేక వార్షిక సంచికను అతిథులు, రైతులు, రైతు నాయకులు ఆవిష్కరించారు. అనంతరం వ్యవసాయ రంగంలో విశేష కృషి చేస్తున్న మహిళా రైతులు పద్మావతమ్మ, గోవిందమ్మను సత్కరించారు. సమాఖ్య నూతన అధ్యక్షునిగా బీవీ రామసుబ్బారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో రైతు సమాఖ్య ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, కోఆర్డినేటర్ ఓబుళపతి, రైతు నాయకులు డాక్టర్ హయాగ్రీవచారి, రామసుబ్బారెడ్డి, శివరామకృష్ణారెడ్డి, శివారెడ్డి, అనుపూరు రామ సుబ్బారెడ్డి, రఫీ, హరినాథ్రెడ్డి, మధుసూదన్ రెడ్డి, ఆదినారాయణరెడ్డి, డీవీ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
శాస్త్రోక్తంగా శేర్తి పూజ
ఆళ్లగడ్డ: నవనారసింహులు కొలువైన ప్రసిద్ధ వైష్ణవ పుణ్యక్షేత్రం అహోబిలంలోని నల్లమల అటవీ ప్రాతంలో కొలువైన శ్రీ మాలోల లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో ఆదివారం శేర్తి పూజ శాస్త్రోక్తంగా నిర్వహించారు. అహోబిలం మఠం 46వ పీఠాధిపతి శ్రీవణ్ శఠగోప రంగనాథ యతీంద్ర మహాదేశికన్ ఆధ్వర్యంలో ఉద యం సుప్రభాత సేవతో స్వామిని మేల్కొలిపారు. నిత్య పూజలు అనంతరం గద్య త్రయం విన్నవించారు. అనంతరం నిత్యం ఆరాధించే ఉత్సవమూర్తి స్వర్ణ మాలోల నరసింహస్వామిని మూలమూర్తితో ఉంచి ప్రత్యేక శేర్తి పూజలు నిర్వహించి స్వామివారిని ప్రత్యేకంగా ఆరాధించారు. అనంతరం శాత్తుమురై గోష్టి కార్యక్రమాలతో పూజలు ముగించారు. ఈ పూజలు ప్రధానార్చకులు కీడాంబి వేణుగోపాలన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. -
శ్రీశైలం డ్యాం గేట్ల మూసివేత
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గడంతో ఆదివారం సాయంత్రం డ్యాం రేడియల్ క్రస్ట్ గేట్లను మూసివేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో జలాశయానికి భారీగా వరద ప్రవా హం చేరడంతో 10 రేడియల్ క్రస్ట్గేట్లను 26 అడుగుల మేర తెరచి దిగువకు నీటిని విడుదల చేశారు. గత కొద్దిరోజుల నుంచి వరద తగ్గుముఖం పడుతుండడంతో క్రమేపి గేట్ల ఎత్తును, సంఖ్యను తగ్గించుకుంటూ వచ్చారు. శనివారం నుంచి ఆదివారం వరకు జలాశయానికి 3,19,207 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేర గా దిగువ ప్రాంతాలకు 3,13,478 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. స్పిల్వే ద్వారా 2,35,088 క్యూసెక్కు లు, విద్యుత్ ఉత్పత్తి అనంతరం 70,555 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్కు విడుదల చేశారు. బ్యాక్ వాటర్ నుండి పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీ ద్వారా 5,000 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 2,835 క్యూసెక్కుల నీటిని వదిలా రు. కుడిగట్టు కేంద్రంలో 15.450 మిలియన్ యూ నిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 16.955 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేశారు. ఆదివారం సాయంత్రానికి జలాశయంలో 210.9946 టీఎంసీల నీరు నిల్వ ఉంది. -
శ్రీగిరికి పోటెత్తిన భక్తులు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైలంలో వెలసిన శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు శ్రీగిరి చేరుకుని స్వామి అమ్మవార్లను దర్శించుకు న్నారు. వేకువజామున పాతాళగంగలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి క్యూలైన్లలో బారులుదీరారు. భక్తుల రద్దీతో ఆలయ క్యూలైన్లు నిండి పోయాయి. భక్తుల శివ నామ స్మరణతో శ్రీశైల ఆలయం మారుమోగింది. గోస్పాడు: వైద్యుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని పీహెచ్సీ వైద్యుల సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అంకిరెడ్డి అన్నారు. పీహెచ్సీల వైద్యులు డీఎంహెచ్ఓ కార్యాలయం వద్ద ఆ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిరసన కార్యక్రమాన్ని చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ అంకిరెడ్డి మాట్లాడుతూ.. పీహెచ్సీ వైద్యుల సమస్యలను పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఎంతో కాలంగా గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా ప్రభు త్వం మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి ఓకే క్యాడర్లో పని చేస్తున్న సంబంధిత వైద్యులకు ఎలాంటి ప్రమోషన్లకు నోచుకోగా అవస్థలు పడాల్సి వస్తుందన్నారు. ఇన్ సర్వీస్ పీజీ కోటా పునరుద్ధరించాలని, టైమ్ బౌండ్ ప్రమోషన్లు అమలు చేయాలని, గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వారికి బేసిక్ పే 50 శాతం ట్రెబల్ అలవెన్స్, నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని కోరారు. నంద్యాల: స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ఈనెల 29న సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam. ap.gov.in వెబ్సైట్లో, టోల్ ఫ్రీ నెంబర్ 1100ను సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో, డివిజన్ స్థాయిలో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రశాంతంగా ఏపీపీ రాత పరీక్షలు కర్నూలు (టౌన్): పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) రాత పరీక్షలు ప్రశాంత వాతవరణంలో జరిగాయి. నగరంలోని జి. పుల్లయ్య ఇంజినీరింగ్ కళాశాలలో 42 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షలకు కర్నూలులో 261 మంది హాజరయ్యారు. పరీక్ష కేంద్రాన్ని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తనిఖీ చేశారు. ఎస్పీ వెంట ఏఎస్పీ హుస్సేన్ పీరా, కర్నూలు తాలూకా సీఐ తేజమూర్తి ఉన్నారు. -
విక్రయాలను అడ్డుకోవాలి
గంజాయి, డ్రగ్స్ రవాణా, విక్రయాలను అధికారులు అడ్డుకోవాలి. నంద్యాలలో ఇంజినీరింగ్, మెడికల్, డిగ్రీ, బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్లో చదువుకోడానికి పలు జిల్లాల నుంచి యువత వస్తోంది. యువకులనే కేంద్రంగా చేసుకొని గంజాయి వ్యాపారులు గంజాయిని పట్టణంలో అమ్ముతున్నారు. పోలీసులు విస్తృత దాడులు చేసి ముఠా ఆట కట్టించాలి – రాజునాయుడు, ఆర్వీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, నంద్యాల పోలీసు, ఎకై ్సజ్ శాఖ అధికారులు మత్తు పదార్థాలతో కలిగే నష్టాలపై యువతకు అవగాహన కల్పించడంలో పూర్తిగా విఫలం అయ్యారు. తూతూ మంత్రంగా కాకుండా ప్రధాన కూడళ్లు, కళాశాలలు, పాఠశాలల వద్ద అవగాహన కలిగేలా ప్లెక్సీలు ఏర్పాటు చేయాలి. పోలీసులు కాలేజీలు, గ్రామ శివారులు, నిర్మానుష్య ప్రాంతాలో నిఘా ఉంచాలి. తల్లిదండ్రులు తమ పిల్లలపైనే నిఘా ఉంచి పక్కదారి పట్టకుండా బాధ్యతగా ఉండాలి. మత్తు పదార్థాలపై విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు అవగాహన సదస్సులు కల్పించాలి. – నాగరాముడు, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి, నంద్యాల -
‘గంపెడు’ నష్టాలు!
కర్నూలు(అగ్రికల్చర్): నిన్న మొన్నటి వరకు ఉల్లి రైతుల కన్నీరు.. ఇప్పుడు టమాట రైతుల వేదన.. కూటమి ప్రభుత్వం రైతన్నల జీవితాలను రోడ్డు పడేస్తోంది. ఆరుగాలం కష్టించినా గిట్టుబాటు ధరలేక రైతులు దిగాలు చెందుతున్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలకు, క్షేత్రస్థాయిలో చర్యలకు పొంతన లేకపోవడంతో రైతు నష్టాలను మూటకట్టుకుంటున్నాడు. టమాట కిలో ధర కనీసం రూ.8లకు తగ్గకుండా కొనుగోలు చేయాల్సి ఉన్నా.. ప్రస్తుతం రూ.2 కూడా దక్కని పరిస్థితి. 20 కిలోల టమాటకు లభిస్తున్న ధర రూ.50 మాత్రమే. టమాటకు మార్కెట్లో లభిస్తున్న ధరతో అమ్ముకుంటే కోత, రవాణా చార్జీలు, కమీషన్కే సరిపోవడం లేదని రైతులు వాపోతున్నారు. కర్నూలు జిల్లా లో పత్తికొండ, ఆస్పరి మండలం బిల్లేకల్, కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డు, కర్నూలు మండలం గార్గేయపురంలో టమాట క్రయవిక్రయాలు సాగుతున్నాయి. నంద్యాల జిల్లాలో ప్యాపిలి, డోన్ మండలం చింతలపేట టమాట క్రయవిక్రయాలు చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో ఆస్పరి, పత్తికొండ, పెద్దకడుబూరు, దేవనకొండ, క్రిష్ణగిరి, హాలహర్వి, హొళగుంద, వెల్దుర్తి, ఓర్వకల్, సీ.బెళగల్, గూడూరు మండలాలు, నంద్యాల జిల్లాలో ప్రధానంగా ప్యాపిలి, డోన్, బేతంచెర్ల మండలాల్లో సాగవుతోంది. సీఎం ఆదేశాలు బేఖాతరు రైతులు తెచ్చిన టమాటను హోల్సేల్గా కిలో రూ.8 కంటే తక్కువకు కొనరాదని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశించారు. ఈ ఆదేశాలు ఎక్కడా అమలుకు నోచుకోని పరిస్థితి. 25 కిలోల బాక్స్ను రూ.50 నుంచి రూ.80 ధరతో కొనుగోలు చేస్తున్నారు. అంటే కిలో ధర రూ.2 నుంచి రూ.3 వరకు మాత్రమే పలుకుతోంది. రెండు, మూడు రోజులుగా టమాట ధర మరింత దయనీయంగా మారింది. గత వైఎస్సార్సీపీ పాలనలో ధరలు పడిపోయినప్పుడు మార్కెటింగ్ శాఖ అధికారులు కిలో రూ.8కి తక్కువ లేకుండా కొనుగోలు చేశారు. ఇందుకు అనుగుణంగా వ్యాపారులు ధరలు పెంచారు. నేడు ఈ పరిస్థితి లేకపోవడం పట్ల రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. భారీగా నష్టపోతున్న టమాట రైతులు ఉమ్మడి జిల్లాలో 13,500 ఎకరాల్లో సాగు ధర పడిపోయినా స్పందించని సర్కారు రూ.8లకు కొనాలనే సీఎం ఆదేశాలు బేఖాతరు అనువుగాని చోట టమాట ప్రాసెసింగ్ యూనిట్ ఈ చిత్రంలోని రైతు పేరు లింగన్న. పత్తికొండ మండలం చిన్నహుల్తి గ్రామానికి చెందిన టమాట రైతు. శుక్రవారం మార్కెట్కు 30 గంపల టమాట తెచ్చారు. ఒక్కో గంప 20 కిలోలు ఉంటుంది. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం కనీస ధర రూ.8 ప్రకారం కొంటే గంపకు రూ.160 లభిస్తుంది. అయితే పత్తికొండ మార్కెట్లో 20కిలోల గంపకు లభించిన ధర రూ.50 మాత్రమే. అంటే కిలో టమాటకు లభించిన ధర రూ.2 మాత్రమే. ఒక ఎకరాలో టమాట సాగు చేశారు. పెట్టుబడి రూ.60 వేల వరకు వచ్చింది. కొద్ది రోజులుగా మార్కెట్కు టమాట తీసుకొస్తున్నా ఒక్క రోజు కూడా రూ.8 ధర లభించలేదు. టమాట పంటకు కూడా ఎకరాకు రూ.20 వేల ప్రకారం పరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరుతున్నాడు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 13,500 ఎకరాల్లో టమాట సాగయింది. ఈ–క్రాప్ బుకింగ్ ప్రకారం కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకు 3,990 ఎకరాలు, నంద్యాల జిల్లాలో 3,312 ఎకరాల్లో సాగయింది. ఈ–క్రాప్ బుకింగ్ ఇంకా కొనసాగుతుండటంతో టమాట సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. ఉద్యాన శాఖ అధికారుల అంచనాల ప్రకారం ఎకరాకు 15 టన్నుల ప్రకారం దిగుబడి వస్తోంది. ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన టమాట నుంచి దాదాపు 2 లక్షల టన్నులు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ప్రతి రోజు 300 టన్నుల టమాట మార్కెట్కు వస్తోంది. -
కష్టాలే పెట్టుబడి.. నష్టాలే దిగుబడి!
కోవెలకుంట్ల: మొక్కజొన్న సాగుతో గతేడాది నష్టాలు చవి చూసిన రైతులకు ఈ ఏడాది సాగు కలిసి రాలేదు. గత ఖరీఫ్లో చోటు చేసుకున్న నష్టాన్ని పూడ్చుకునేందుకు ఈ ఏడు లక్ష్యాన్ని మించి సాగు చేసినా నిరాశే మిగిలింది. జిల్లాలోని 29 మండలాల పరిధిలో 54,150 హెక్టార్లలో మొక్కజొన్న సాగు సాధారణ విస్తీర్ణం కాగా ఆయా మండలాల పరిధిలో 55,408 హెక్టార్లలో సాగైంది. విత్తనానికి ముందు విస్తారంగా వర్షాలు కురియడంతో సాగుకు అనుకూలంగా మారింది. బోర్లు, బావులు, చెరువులు, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్, తదితర సాగు నీరు వనరులు అందుబాటులో ఉండటంతో లక్ష్యానికి మించి సాగైంది. విత్తనం వేశాక వరణుడు ముఖం చాటేయడం, పైరు వివిధ దశల్లో తెగుళ్లు, పుప్పడి దశలో వేసవిని తలపించేలా ఎండలు, పంట చేతికందే తరుణంలో అధిక వర్షాలు మొక్కజొన్న రైతులను వెంటాడటంతో రైతులు కుదేలయ్యారు. జిల్లాలో ప్రస్తుతం మొక్కజొన్న కోత, నూర్పిడి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నష్టాల మూట! గత ఏడాది జిల్లాలోని 29 మండలాల పరిధిలో 45,200 హెక్టార్లలో మొక్కజొన్న సాగు సాధారణ విస్తీర్ణం కాగా ఆయా మండలాల్లో 54 వేల హెక్టార్లలో సాగు చేశారు. 105 నుంచి 110 రోజులు పంటకాలం కాగా పైరు ఆరంభంలో వర్షాభావం, పంట చేతికందే తరుణంలో తుఫాన్ వెంటాడి దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపాయి. పైరు కంకిదశలో ఉండగా గత ఏడాది అక్టోబర్ నెలలో తుఫాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసి పంట దెబ్బతిని దిగుబడులు తగ్గాయి. విత్తనాలు, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, కోత, నూర్పిడి, తదితర పెట్టుబడుల రూపంలో ఎకరాకు రూ. 25వేల నుంచి రూ. 30 వేలు వెచ్చించారు. ఎకరాకు 22 నుంచి 30 క్వింటాళ్లలోపే దిగుబడులు రావడంతో నష్టాల ఊబిలోకూరకపోయారు. మార్కెట్లో క్వింటా రూ. 2,200 మించి పలకపోవడంతో నష్టాలు మూటగట్టుకున్నారు. ఈ ఏడాది మిరపకు ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న సాగు చేసినా రైతులకు కష్టాలు తప్పలేదు. క‘న్నీటి’కష్టాలు ఈ ఏడాది కోటి ఆశలతో మొక్కజొన్న సాగు చేసిన రైతులకు విత్తనం వేసినప్పటి నుంచి అష్టకష్టాలు తప్పలేదు. తొలుత సాగునీటిని మళ్లించుకునేందుకు అవస్థలు పడ్డారు. ఎస్సార్బీసీ, కేసీ కెనాల్, కుంటలు, చెరువులకు డీజల్ ఇంజిన్లు అమర్చుకుని ఐదు నుంచి ఏడు తడులు సాగునీటిని అందించారు. ఒక్కో తడి సాగునీటి మళ్లింపుకు డీజిల్ ఇంజిన్లు, పైపులు, డీజల్, కూలీ ఖర్చుల రూపంలో రూ. 5 వేలు అదనపు భారం పడింది. వర్షాభావానికి తోడు పైరు పుప్పడి దశలో వేసవికాలాన్ని తలపించేలా ఎండలు మండటంతో మొక్కజొన్న కంకి కట్టక దిగుబడులపై ప్రభావం చూపింది. వీటికి తోడు కొన్ని చొట్ల పైరుకు ఎండు తెగులు, కత్తెర పురుగు ఆశించడంతో వాటి నుంచి పైరును కాపాడుకునేందుకు రైతులు వ్యయ ప్రయాసలు ఎదుర్కొన్నారు. ఎకరాకు 30 నుంచి 35 క్వింటాళ్ల దిగుబడులు వస్తాయనుకుంటే వర్షాభావం, పుప్పడి రాలిపోడం, తెగుళ్లతో ఎకరాకు 20 నుంచి 22 క్వింటాళ్లకే దిగుబడులు పరిమితమయ్యాయి. కోత, నూర్పిడి పనులు ప్రారంభం కాగా అల్పపీడన ప్రభావంతో ఇటీవల కురుస్తున్న వర్షాలతో రైతులు అల్లాడిపోతున్నారు. రోడ్లపై, కల్లాల్లో ఆరబెట్టిన దిగుబడులు తడిచి పోతుండటంతో వర్షానికి పైరు నేలవాలడంతో రైతులకు వరుస కష్టాలు తప్పలేదు. వేలాది రూపాయలు పెట్టుబడుల రూపంలో వెచ్చించగా దిగుబడులు తగ్గిపోయా మరోవైపు రైతులను గిట్టుబాటు ధర వేధిస్తోంది. ప్రస్తుత మార్కెట్లో క్వింటా రూ. 2 వేల లోపే ధర ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నియోజకవర్గం సాగు విస్తీర్ణం (హెక్టార్లలో) నందికొట్కూరు 28,465 ఆళ్లగడ్డ 9,334 బనగానపల్లె 7,766 శ్రీశైలం 5,570 డోన్ 1,735 నంద్యాల 1,202 పాణ్యం, గడివేముల 1,336 రెండో ఏడాది కలిసి రాని మొక్కజొన్న సాగు ఎకరాకు రూ. 35 వేల పెట్టుబడి 20 నుంచి 22 క్వింటాళ్లకే దిగుబడి లభించని గిట్టబాటు ధర అన్నదాతకు మిగిలింది కన్నీరే! -
టీడీపీ అరాచకాలను అడ్డుకుంటాం
● ఉనికి కోల్పోతామనే భయంతోనే టీడీపీ నాయకుల దాడులు ● రౌడీషీటర్కు పోలీసుల అండదండలు! ● మాజీ ఎమ్మెల్యేకాటసాని రామిరెడ్డికోవెలకుంట్ల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టు ఉన్న కలుగొట్ల గ్రామంలో రాబోయే రోజుల్లో తమ ఉనికి కోల్పోతామనే భయంతో టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నారని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ధ్వజమెత్తారు. టీడీపీ అరాచకాలను అడ్డుకుంటామన్నారు. శుక్రవారం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు పెద్దగుర్రప్ప, తలారి శ్రీనివాసులు, నడిపిగుర్రప్ప, చిన్నగుర్రప్ప, గడ్డం బ్రహ్మానందరెడ్డి, బూస సుధాకర్రెడ్డి, మగ్బుల్పై ఇదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు గడ్డం నాగార్జునరెడ్డి తన అనుచరులతో కర్రలు, రాడ్లతో దాడి చేసి గాయపరిచారు. ఈ మేరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కాటసాని పరామర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో వైఎస్సార్సీపీకి పట్టు ఉన్న గ్రామంలో ఆధిపత్యం కోసం పోలీసు రికార్డుల్లో రౌడీషీటర్గా ఉన్న నాగార్జునరెడ్డి వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి చేశారన్నారు. రౌడీషీటర్గా ఉన్న టీడీపీ నాయకుడిని పోలీసులు గడిచిన 15 నెలల కాలంలో ఏ రోజు పోలీస్స్టేషన్కు పిలువలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ అధికారంలో ఉందని, తామేమి చేసినా అడిగేవారు ఉండరన్న అహంభావంతో ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌడీషీటర్ అండతోనే గ్రామంలో బహిరంగంగా బెల్ట్షాపు ద్వారా మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయన్నారు. బస్టాండ్ ప్రాంతంలో తెల్లారకముందే మద్యం బాటిళ్లు అమ్ముతున్నా స్థానిక, ఎకై ్సజ్ పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కూరగాయలు, పాలు తెచ్చుకునేందుకు వెళుతున్న మహిళలను దుర్భాషలాడుతూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో ఎక్కడా ఎలాంటి ఘర్షణలు, గొడవలు చోటు చేసుకోకుండా ప్రజలు ప్రశాంత జీవనం గడిపారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అరాచకాలు సృష్టిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. వైఎస్సార్ కార్యకర్తలపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దాడి ఘటనను డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లామని, ఎస్పీని కలిసి వివరిస్తామన్నారు. దాడికి పాల్పడిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు బీవీ నాగార్జునరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు సిద్ధంరెడ్డి రాంమోహన్రెడ్డి, చిక్కేపల్లి ప్రసాదరెడ్డి, రాచంరెడ్డి రాంభూపాల్రెడ్డి, రాజారెడ్డి, పోతం రాంమోహన్రెడ్డి, ఉప్పరి సుబ్బరాయుడు, రాంభూపాల్రెడ్డి, జశ్వంత్రెడ్డి పాల్గొన్నారు. -
నిలిచిపోయిన రహదారి పనులు
● ఇబ్బందుల్లో 5 గ్రామాల ప్రజలు బేతంచెర్ల: మండల పరిధిలోని వెంకటగిరి గ్రామం నుంచి సీతారామాపురం, శంకరాపురం, బైనపల్లె మీదుగా యంబాయి, మండ్లవానిపల్లె గ్రామం వరకు చేపట్టిన పనులు నిలిచిపోయాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత వైఎస్సార్సీపీ హయాంలో ఈ రహదారికి రూ.8.50 కోట్ల నిధులు మంజూరయ్యాయి. కాంట్రాక్ట్ దక్కించుకున్న మేఘా సంస్థ వెంకటగిరి గ్రామం నుంచి సీతారామాపురం వరకు రహదారి పనులు పూర్తి చేసింది. అంతలో సార్వత్రిక ఎన్నికలు రావడం, ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో అప్పటి నుంచి శంకరాపురం, బైనపల్లె మీదుగా యంబాయి, మండ్లవానిపల్లె వరకు చేయాల్సిన పనులు కాంట్రాక్టర్ నిలిపేశారు. ఇప్పటికి ఏడాదిన్నర గడిచిపోయినా పనులు ప్రారంభించకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 35 ఏళ్ల క్రితం నిర్మించిన శంకరాపురం బ్రిడ్జి సైతం ప్రమాదకరంగా ఉండటంతో అధికారులు స్పందించి మధ్యలో నిలిచిపోయిన పనులను పూర్తి చేయించాలని కోరుతున్నారు. -
సారూ కాళ్లు మొక్కుతా .. స్తంభాలు తొలగించండి
● తహసీల్దార్ను వేడుకున్న రైతు కుమారుడు నందికొట్కూరు: సారూ తమ పొలంలో ఉన్న విద్యుత్ స్తంభాలు తొలగించండి అంటూ మిడుతూరు మండలం చౌట్కూరు గ్రామానికి చెందిన రైతు నాగేశ్వరరావు కుమారుడు స్వామన్న తహసీల్దార్ శ్రీనివాసులు కాళ్లు మొక్కాడు. బుధవారం గ్రామ సభ జరుగుతుండగా స్వాములు తహసీల్దార్ వద్దకు వెళ్లి తమకు ఉన్నదే ఎకరా పొలమని, అందులో విద్యుత్ స్తంభాలు వేయడంతో సాగుకు కష్టంగా మారిందని, ఇదే విషయమై పదేళ్లుగా అధికారులకు విన్నవించుకుంటున్నా తొలగించడం లేదని ఆవేదన వ్యక్తం చేయగా.. స్పందించిన తహసీల్దార్ విద్యుత్ అధికారులతో మాట్లాడి తొలగించేందుకు చర్యలు తీసుకుంటానని హామీచ్చారు. -
డ్రోన్ కెమెరాల నిఘాలో బన్ని ఉత్సవం
కర్నూలు: దసరాను పురస్కరించుకుని జిల్లాలో ప్రతిష్టాత్మకంగా జరిగే దేవరగట్టు మాళమల్లేశ్వర స్వామి బన్ని ఉత్సవాన్ని డ్రోన్ కెమెరాల నిఘాలో నిర్వహించనున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయుధ పూజ అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడారు. బన్ని ఉత్సవాల్లో 10 డ్రోన్ కెమెరాలతో పాటు 110 సీసీ కెమెరాలను వినియోగిస్తున్నట్లు తెలిపారు. సీసీ కెమెరాల కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఉత్సవాల్లో ఎవరైనా గాయాలపాలైతే వెంటనే వైద్యం అందించేందుకు 20 బెడ్లతో తాత్కాలిక ఆసుపత్రితో పాటు 104, 108 అంబులెన్స్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఇప్పటికే దాదాపు 200 మంది ట్రబుల్ మాంగర్స్, సారా విక్రేతలను బైండోవర్ చేశామన్నారు. కార్డెన్ సెర్చ్లో భాగంగా 340 రింగుల కర్రలు, నాటుసారాను సీజ్ చేశామన్నారు. దేవరగట్టు పరిసర ప్రాంతాల్లో ఐదు చెక్పోస్టులు, పది పికెట్లు ఏర్పాటు చేశామన్నారు. ఉత్సవంలో చిన్నపిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలన్నారు. బన్ని ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా జరుపుకో వాలని భక్తులకు ఎస్పీ సూచించారు. తప్పిన ప్రమాదం ఆస్పరి: మండల కేంద్రం సమీపంలోనున్న విద్యుత్ సబ్ స్టేషన్ దగ్గర విద్యత్ స్తంభాన్ని బుధవారం ఓ లారీ ఢీ కొట్టింది. అయితే ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. స్తంభం లేకుంటే నేరుగా లారీ విద్యుత్ సబ్ స్టేషన్లోకి దూసుళ్లేదని ట్రాన్స్కో సిబ్బంది తెలిపారు. మహారాష్ట్ర నుంచి చక్కెర లోడుతో ఆదోని నుంచి ఆస్పరి వైపు వస్తున్న లారీని ఒక కారు ఓవర్ టేక్ చేసి వెళ్లే క్రమంలో స్పీడ్ బ్రేకర్ వద్ద సడన్ బ్రేక్ వేయడంతో.. లారీ డ్రైవర్ కారును తప్పించే క్రమంలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టారు. ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు డ్రైవర్, క్లీనర్ వెంటనే లారీ నుంచి కిందకు దూకేశారు. ప్రమాదంపై తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని ఆస్పరి పోలీసులు తెలిపారు. -
నేడు అశ్వాల పారువేట
● కొనసాగుతున్న యాదవరాజ వంశీయుల సంప్రదాయం ● సైనికులుగా మద్ది కులస్తులు మద్దికెర: రాజులు పోయారు.. రాజ్యాలు పోయాయి.. కానీ ఆనాటి సంప్రదాయాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. యాదవ రాజ వంశంలోని పెద్దనగిరి, చిన్ననగిరి, యామనగిరి కుటుంబీకులు అశ్వాల పారువేట ఉత్సవాన్ని మూడు శతాబ్దాల నుంచి కొనసాగిస్తున్నారు. ఏటా విజయదశమి రోజున గుర్రాలపై స్వారీ చేయడం వీరి ఆచారం. అందులో భాగంగా గురువారం ఉత్సవాలు నిర్వహించడానికి సిద్ధం చేసుకున్నారు. భోగేశ్వరాలయం నుంచి.. పూర్వం యాదవ వంశాలు రాజ్యాలను ఏలిన విజ యం విదితమే. అందులో భాగంగా ఆయా యాదవ వంశీయుల కుటుంబాలు తమ పూర్వీకుల నుంచి వస్తున్న గురప్రు స్వారీ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. ఒక్కో కుటుంబం నుంచి రెండు, మూడు గుర్రాలను స్వారీకి అనుమతిస్తుండటంతో ఆయా కుటుంబాలు విజయదశమికి నెల రోజుల ముందు నుంచే గుర్రాలు సమకూర్చుకుని శిక్షణ ఇస్తారు. పండుగ రోజు వారు తలపాగ ధరించి రాచరికపు వస్త్రాలతో ఖడ్గాలు ధరించి గుర్రాలపై మేళ తాళాలతో మండల కేంద్రానికి 3 కి.మీ దూరంలోని బొజ్జనాయినిపేట గ్రామంలో ఉన్న భోగేశ్వర ఆలయానికి చేరుకుంటారు. వీరికి సైనికులుగా ‘మద్ది’ కులస్తులు ఆయుధాలు ధరించి వెంట నడుస్తారు. ఆలయంలోని స్వామి వారికి పూజలు నిర్వహించిన అనంతరం అక్కడి నుంచి మద్దికెరకు గుర్రాల స్వారీ ప్రారంభిస్తారు. విజయం సాధించిన వారిని భాజాభజంత్రీలతో మొదట ఊరేగిస్తారు. అనంతరం యాదవ రాజ వంశీకుల కుటుంబాలు గుర్రాలపై ప్రధాన రహదారిలో తమ రాచఠీవిని ప్రదర్శిస్తారు. ఈ వేడుకలను ప్రజలకు ఎంతో ఆశక్తితో తిలకిస్తారు. -
ఘనంగా బీఎస్ఎన్ఎల్ రజతోత్సవాలు
కర్నూలు(హాస్పిటల్): భారత సంచార నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) ఏర్పాటై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం కర్నూలు నగరంలో సంస్థ ఆధ్వర్యంలో రజతోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ జి.రమేష మాట్లాడుతూ బీఎస్ఎన్ఎల్ 2000 అక్టోబర్ 1న ప్రభుత్వ రంగ సెక్టార్ యూనిట్గా రూపుదిద్దుకున్నప్పటి నుంచి ప్రజలకు చేరువగా మారుమూల గ్రామాలకు కాపర్ ద్వారా ల్యాండ్లైన్, బ్రాండ్ బాండ్ సేవలను అందిస్తోందన్నారు. టెక్నాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పూర్తి ఫైబర్ టెక్నాలజీ ద్వారా వాయిస్, హై స్పీడ్ ఇంటర్నెట్ అందిస్తోందన్నారు. ప్రపంచంలోనే స్వదేశీ టెక్నాలజీని ఉపయోగిస్తున్న ఆరవ అతి పెద్ద సంస్థగా బీఎస్ఎన్ఎల్ రూపుదిద్దుకుందన్నారు. వినియోగదారులు తమ పాత సిమ్కార్డులను 4జీ సిమ్లుగా మార్చుకోవాలన్నారు. సిల్వర్ జూబ్లీ సందర్భంగా సరసమైన ధరలతో ప్రవేశపెట్టిన నూతన ప్లాన్లను వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ జనరల్ మేనేజర్ సాయినాథ్, ఏజీఎంలు వి.శ్రీను నాయక్, దేవచంద్ నాయక్, లక్ష్మనాయక్, మురళీకృష్ణ, నారాయణస్వామి, వి.జాన్సన్, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు. -
సంప్రదాయ సమరానికి ‘సై’
దేవరగట్టు హొళగుంద మండలం నెరణికి గ్రామ సమీపంలోని దేవరగట్టుపై వెలసిన మాత మాళమ్మ, మల్లేశ్వర స్వామి అమ్మవార్ల ఉత్సవాలు విజయదశమి రోజున వైభవంగా జరుగుతాయి. అదే రోజు అర్ధరాత్రి నిర్వహించే స్వామి అమ్మవార్ల కల్యాణం తర్వాత జరిగే బన్ని ఉత్సవంలో ఘర్షణలకు తావులేకుండా కలిసి కట్టుగా జరుపుకుందామని దేవరగట్టు సమీపంలోని నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులు చెరువుకట్ట (డొళ్లిన బండే)వద్దకు చేరి పాలబాసలు తీసుకుంటారు. అనంతరం కల్యాణానికి వస్తున్నట్లు గ్రామపెద్దలు పోలీసులకు బండారాన్ని ఇస్తారు. జౌట్లు పేల్చీ ఇనుప తొడుగులు, రింగు కర్రలు, అగ్గి కాగడాలు చేతపట్టి డోలు, మేళతాళాలతో నిమిషాల్లో కొండ(గిరి)పైకి చేరుకుంటారు. అక్కడ మాత మాళమ్మ, మల్లేశ్వర ఉత్సవ విగ్రహాలకు పురోహితులు, వేదపండితులు కల్యాణం జరిపిస్తారు. అనంతరం అర్ధరాత్రి ఉత్సవ మూర్తులతో జెత్రయాత్ర ప్రారంభమవుతుంది. నిట్రవట్టి, బిలేహాల్, విరుపాపురం, ఎల్లార్తి, సుళువాయి, అరికెర, అరికెర తండా, కురుకుంద, లింగంపల్లి తదితర గ్రామాల భక్తులు మొగలాయిలో పాల్గొంటారు. ఈక్రమంలో భక్తుల చేతుల్లో ఉన్న కర్రలు తగిలి పలువురికి గాయాలవుతాయి. మాళ మాళమ్మ, మల్లేశ్వరుని విగ్రహాలను మల్లప్ప గుడిలో కొద్ది సేపు కొలువుంచి తిరిగి ఉత్సవ విగ్రహాలను పల్లకీతో ఊరేగింపుగా జైత్రయాత్రను కొనసాగిస్తారు. భవిష్యవాణిపై నమ్మకం శమీ వృక్షం నుంచి విగ్రహాలు బసవన్న గుడికి చేరుకోవడంతో ఆలయ పూజారి గిరిస్వామి భక్తులకు భవిష్యవాణి వినిపిస్తారు. ఆ సమయంలో అందరూ ఒక్కసారిగా మొగలాయిని నిలిపేసి నిశ్శబ్దాన్ని పాటిస్తారు. రాబోయే కాలంలో వాణిజ్య పంటల ధరలు, ప్రకృతి వైపరీత్యాలు, రాజకీయాలు తదితర పరిస్థితులను పూజారి వివరిస్తారు. అనంతరం పూజారి బహుపరాక్... గోపరాక్ అనగానే విగ్రహాలు సింహాసన కట్ట వైపు ఊరేగింపుగా బయలుదేరుతాయి. విగ్రహాలు సింహాసన కట్టకు చేరుకోవడంతో జైత్రయాత్ర ముగుస్తుంది. జంతువుల నుంచి రక్షణకే.. పురాతన కాలంలో దసరా బన్ని ఉత్సవాలు జరుపుకోవడానికి దూర ప్రాంతాల నుంచి భక్తులు దేవరగట్టు మాళ మల్లేశ్వస్వామి కొండకు తరలి వచ్చే సమయానికి చీకటయ్యేది. అప్పట్లో విద్యుత్, రవాణా సదుపాయాలు లేకపోవడంతో విషపురుగులు, జంతువుల భారీ నుంచి రక్షణ పొందేందుకు దివిటీటులు, మారణాయుధాలు చేత పట్టుకుని కొండపైకి వెళ్లి స్వామి వారి కల్యాణాన్ని నిర్వహించేవారు. కొందరు వ్యక్తిగత కక్షలతో చీకట్లో జరిగే ఊరేగింపులో రింగుకర్రలు, దివిటీలు, మారణాయు ధాలతో తమ ప్రత్యర్థులపై దాడులు చేసి పగ తీర్చుకునేవారు. ఇది కాలక్రమంలో కర్రల సమరంగా ముద్ర పడిపోయింది. హెల్త్ క్యాంప్ ఏర్పాటు ఉత్సవంలో గాయపడిన భక్తులకు దేవరగట్టులో భారీ ఎత్తున హెల్త్ క్యాంప్ను ఏర్పాటు చేయనున్నారు. డీఎంఅండ్హెచ్ఓ ఆధ్వర్యంలో 10 మంది డాక్టర్లు, ఆర్థోపెడిక్ సర్జన్, జనరల్ సర్జన్తో పాటు 100 మంది సిబ్బందితో వైద్య సేవలు అందించనున్నారు. వాటర్ ప్రూప్ టెంట్లో వందకు పైగా మంచాలు, మెడిసిన్, ఇతర అత్యవసర చికిత్సకు కావాల్సిన మందులు, పరికరాలతో పాటు 108, 104 అంబులెన్స్లు అందుబాటులో ఉంచనున్నారు. విజయ దశమి రోజున అర్ధరాత్రి సాగనున్న సంప్రదాయ సమరానికి దేవరగట్టు సర్వం సిద్ధమైంది. స్వామి అమ్మవార్ల జైత్రయాత్ర సందర్భంగా బన్ని ఉత్సవం పేరుతో జరిగే కర్రల సమరాన్ని తిలకించేందుకు రాష్ట్ర నలమూలల నుంచే గాక పొరుగున ఉన్న కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రానున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జిల్లా అధికారులు వెయ్యి మందితో పోలీసు బందోబస్త్ను ఏర్పాటు చేశారు. – హొళగుంద ఆలూరు నియోజకవర్గ ప్రజలకు దసరా శుభకాంక్షలు. ప్రతి ఒక్కరూ దేవరగట్టు బన్ని ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి. ఆచారాలను, సంప్రదాయాలను గౌరవిస్తూనే పండుగను భక్తితో నిర్వహించుకుని, సంతోషంగా ఇంటికి చేరాలి. ఉత్స వాల్లో పాల్గొనే నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులతో పాటు దేవరగట్టు చుట్టు పక్కల గ్రామస్తులు బన్ని ఉత్సవం సమరం కాదు సంప్రదాయ పండుగని సమాజానికి చాటి చెబుదాం. – బుసినే విరూపాక్షి, ఆలూరు ఎమ్మెల్యే -
అనారోగ్యంతో ఆర్మీ జవాన్ మృతి
పగిడ్యాల: జ మ్మూ కశ్మీర్లో ఆర్మీ జవాన్గా విధులు నిర్వ హించే పగిడ్యాల వాసి శెట్టిమాన్ తిక్కస్వామి(35) వారం రోజులు గా అనారోగ్యం బారినపడి ఢిల్లీ ఆర్ఆర్ హస్పిటల్లో చికిత్స పొందుతూ కోలు కోలేక బుధవారం మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. ఆర్మీలో 14 ఏళ్ల సర్వీస్ను పూర్తి చేసుకుని ఇటీవల మళ్లీ 8 ఏళ్ల సర్వీస్ను పొడిగించుకుని ఢిల్లీలో పరేడ్కు హాజరై బీపీ లెవెల్స్ పడిపోయి అనారోగ్యానికి గురయ్యాడని వెల్లడించారు. మృతునికి భార్య సుభాషిణి, కుమారులు నిక్షిత్, షణ్ముఖ్ ఉన్నారు. గురువారం స్వగ్రామం పగిడ్యాలలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.


