‘నానో’ బారి నుంచి కాపాడండి
పాణ్యం : పాడి పంటలతో కళకళలాడుతున్న గ్రామంలో కెమికల్ పరిశ్రమ పెట్టి మనుషులు, పశు సంపద మనుగడకు పెనుముప్పు తెచ్చి పెడుతున్నారని మండల పరిధిలోని కొండజూటూరు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సమీపంలో రూ. 1100 కోట్లతో నిర్మించతలపెట్టిన శాంతిరాం నానో కెమికల్ పరిశ్రమను ఎలాగైనా అడ్డుకోవాలని కోరుతూ గ్రామస్తులు మంగళవారం హైదరాబాద్లోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు.
ప్రస్తుతం గ్రామ పరిధిలో సాగునీటి ఆధారంగా ఏటా రెండుకార్ల పంటలు పండుతున్నాయని, కెమికల్స్ పరిశ్రమ ఏర్పాటు చేస్తే మొత్తం విషపూరితమవుతుందని జగన్మోహన్రెడ్డికి తెలిపారు. పరిశ్రమకు సంబంధించి అన్ని విషయాలను గోప్యంగా ఉంచుతున్నారన్నారు. ప్రభుత్వం ఇష్టానుసారంగా పరిశ్రమలకు అనుమతులు ఇస్తూ గ్రామాలను నాశనం చేసేందకు పూనుకుందన్నారు. కొద్దిగా చొరవ తీసుకుని కెమికల్ పరిశ్రమను అడ్డుకోవాలని కోరారు. ఇందుకు స్పందించిన జగన్మోహన్రెడ్డి త్వరలోనే గ్రామానికి వచ్చి ప్రజలతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య, లాయర్బాలస్వామి, సుమిత్ర, మహేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.