Paralympics Rio 2016
-
ఈ 'స్ఫూర్తి' సరిపోదా ...మనం గెలవడానికి
భగవంతుడు నాకే ఇన్ని కష్టాలు ఎందుకిచ్చాడు...? అనుకుంటూ నిద్రలేచే వాళ్లు కోకొల్లలు. అసలు నాకు అదృష్టమే లేదు... ఏ చిన్న వైఫల్యం ఎదురైనా బాధపడేవాళ్లు కొందరు. మా నాన్న నాకు ఇంకొంచెం ఇచ్చి వుంటేనా...! నేనంటే ఏంటో చూపించేవాడిని...! ఇలా తృప్తిపడేవాళ్లు మరికొందరు. అమ్మ నచ్చిన టిఫిన్ చేసి పెట్టలేదని ఎగిరేవాడొకడు... నాన్న స్పోర్ట్స బైక్ కొనివ్వలేదని అలిగేవాడు ఇంకొకడు... ఉద్యోగం రావడం లేదని వ్యవస్థనే ద్వేషించేవాడు వేరొకడు... టీవీ రిమోట్ ఇవ్వలేదని ఆత్మహత్య చేసుకునేవాడొకడు... వీళ్లంతా ఎవరు..? మనం... అవును మనమే. మనలోనే చాలామంది నిత్యం అసంతృప్తితో రగిలిపోతూ... బద్దకంగా రోజులు గడుపుతూ... విధిని తిట్టుకుంటూ... నిస్సారంగా ‘బతికేస్తున్నాం’. ఇలాంటి ‘మనం’ అందరం వీళ్లని చూసి స్ఫూర్తి పొందుదాం. ఏదో ఒక లోపంతోనో, విధి వైపరీత్యం వల్లో వైకల్యం పొందిన వీళ్లంతా ప్రపంచానికి స్ఫూర్తిని ఇస్తున్నారు. రియోలో పారాలింపిక్స్ వేదికగా తమ అద్భుత విన్యాసాలతో, పోరాటపటిమతో ప్రపంచాన్ని అబ్బురపరుస్తున్నారు. రెండు చేతులూ లేకపోయినా నోటితో బ్యాట్ పట్టుకుని టేబుల్ టెన్నిస్ ఆడే యోధుడు ఒకరు... రెండు కాళ్లూ లేకపోయినా బ్లేడ్లతోనే రాకెట్ వేగంతో పరిగెత్తే అథ్లెట్ మరొకరు... తనకంటే మూడింతలు పొడవున్న ‘ఈటె’ను అల్లంత దూరం విసిరే వీరుడు ఇంకొకరు... ఒక్కరా... ఇద్దరా... 4,350 మంది అథ్లెట్లు రియో వేదికగా ‘గెలుస్తున్నారు’. పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే ఆకాశమే హద్దుగా ఎదగొచ్చని నిరూపిస్తున్నారు. ప్రపంచాన్ని గెలిచేందుకు కావలసిన ‘స్ఫూర్తి’ని ఇస్తున్నారు. వాళ్లకు సలామ్ చేసి ఊరుకుందామా..! వాళ్ల స్ఫూర్తితో మనం కూడా గెలుద్దామా..! -
పారాలింపిక్స్ విజేతలకు వైఎస్ జగన్ కంగ్రాట్స్
హైదరాబాద్: రియో పారాలింపిక్స్ లో పతకాలు సాధించిన అథ్లెట్లకు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. దీపా మలిక్, మరియప్పన్ తంగవేలు, వరుణ్ సింగ్ భటిలకు ఆయన అభినందనలు చెప్పారు. తృటిలో కాంస్య పతకం కోల్పోయినప్పటికీ పవర్ లిఫ్టర్ ఫర్మాన్ భాషా మంచి ప్రయత్నం చేశాడని ప్రశంసించారు. ‘దీపా మలిక్, మరియప్పన్ తంగవేలు, వరుణ్ సింగ్ భటిలకు అభినందనలు. ఫర్మాన్ మంచి ప్రయత్నం చేశాడు. పారాలింపిక్స్ లో మన అథ్లెట్లు చూపిన దృఢత్వం, అంకితభావం మనందరికీ గర్వకారణమ’ని వైఎస్ జగన్ మంగళవారం ట్వీట్ చేశారు. ఇప్పటివరకు రియో పారాలింపిక్స్లో భారత్కు మూడు పతకాలు లభించాయి. పురుషుల హైజంప్లో మరియప్పన్ తంగవేలు స్వర్ణం, వరుణ్ సింగ్ భటి కాంస్యం నెగ్గారు. మహిళల షాట్పుట్ (ఎఫ్-53) ఈవెంట్లో భారత క్రీడాకారిణి దీపా మలిక్ రజత పతకాన్ని సొంతం చేసుకుంది. పురుషుల 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ఫర్మాన్ నాలుగో స్థానంలో నిలిచి కొద్దిలో పతకం కోల్పోయాడు. Congrats DipaMalik,Thangavelu,Bhati. Good attempt Farman. Proud of the grit & determination shown by all our athletes #ParalympicsRio2016 — YS Jagan Mohan Reddy (@ysjagan) 13 September 2016