మొగుడు, పెళ్లాం.. మధ్యలో ఆమె!
‘పతీ, పత్నీ ఔర్ వో’ ట్రైలర్ స్పైసీ డైలాగులు, క్రేజీ సీన్లతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. కార్తీక్ ఆర్యన్, భూమి పడ్నేకర్, అనన్య పాండే హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ సోమవారం విడుదలైంది. 1978లో వచ్చిన సూపర్హిట్ సినిమా ‘పతీ, పత్నీ ఔర్ వో’ ను అదే పేరుతో దర్శకుడు ముదస్సర్ అజిజ్ తెరకెక్కించారు. అప్పటి సినిమాను, ఇప్పటి సినిమాను కూడా బీఆర్ చోప్రా ఫిలిమ్స్ నిర్మించడం గమనార్హం. కానీ, పాత సినిమా కథకు ఏమాత్రం సంబంధంలేకుండా సరికొత్త నేపథ్యంతో ఈ సినిమాను దర్శకుడు తెరపైకి తెచ్చారు.
తండ్రి మాట మేరకు టెన్త్లో పాసై.. ఇంజినీరింగ్ పూర్తి చేసి జాబ్ చేస్తున్న చింటూ త్యాగి (కార్తీక్) వేదిక (భూమి)ను పెళ్లి చేసుకుంటాడు. కానీ, ఇంతలోనే తపస్య శర్మ (అనన్య) పరిచయం అవుతోంది. ఆమె మాయలో పడిన చింటూ త్యాగి.. ఆ తర్వాత ఎలాంటి కష్టాలు పడ్డాడు.. పెళ్లి తర్వాత ఎఫైర్తో వల్ల అతను పడే ఇబ్బందులు ఏమిటన్నది సినిమా కథగా ట్రైలర్ బట్టి అర్థమవుతోంది. మీ హాబీస్ ఏమిటని కార్తీక్ అడిగితే.. ‘సెక్స్ బహోత్ పసంద్ హై’ అంటూ భూమి బదులివ్వడం.. పెళ్లయిన విషయం ప్రియురాలు అనన్యకు తెలియడంతో తన భార్యకు ఎఫైర్ ఉందని ఆమెతో కార్తీక్ బుకాయించడం.. తన భార్య ఇంటినుంచి పారిపోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసే డైలాగులు ట్రైలర్లో బాగా పేలాయి. పెళ్లయ్యాక ‘అచ్చేదిన్’ కోసం ఎదురుచూస్తున్నానని, భార్యతో శృంగారం బికారీ, హత్యాచారీ, బలత్కారీగా భర్త మారిపోతున్నాడంటూ కార్తీక్ చెప్పిన పంచ్ డైలాగులను నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.