‘పోడు’కు ప్రభుత్వం వ్యతిరేకం కాదు
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బేగ్
ఖమ్మం వైరారోడ్ : పోడు సాగుకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎస్.బి. బేగ్ స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు రాజకీయం చేస్తూ అమాయ గిరిజనులను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోడు భూముల్ని ప్రభుత్వం హరితహారం పేరుతో స్వాధీనం చేసుకొని పంటలను ధ్వంసం చేస్తోందని వామపక్షాలు విమర్శించటాన్ని తీవ్రంగా ఖండించారు. 2005 ఏడాదికి ముందు నుంచి పోడు వ్యవసాయం చేస్తున్న భూముల జోలికి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లదన్నారు. 2005 తర్వాత విచ్చలవిడిగా పొక్లెయిన్లతో చెట్లు నరికి వ్యవసాయం చేస్తున్న వారి భూముల్లోనే హరితహారం నిర్వహిస్తున్నామన్నారు. చెట్లను నరికి వ్యవసాయం చేస్తున్న వారిలో వామపక్ష నాయకులే ఎక్కువగా ఉన్నారన్నారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాల్లో భాగం పోడు వ్యవసాయమని టీఆర్ఎస్ రైతు సంఘం నాయకులు నల్లమల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఇప్పుడు జరిగేది పోడు వ్యవసాయం కాదన్నారు. పిండిప్రోలు, నేలకొండపల్లి ప్రాంతాల నుంచి వామపక్షాల నాయకులు వెళ్లి అటవీ సంపదను కొల్లగొడుతున్నారని ఆరోపించారు. సమావేశంలో నాయకులు బిచ్చాల తిరుమలరావు, శాఖమూరి రమేష్ పాల్గొన్నారు.