తాపేశ్వరం నుంచి ఖైరతాబాద్ గణపతికి 4 వేల కిలోల లడ్డూ
మండపేట, న్యూస్లైన్: వినాయక ఉత్సవాలు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ వినాయకుడు. ఒక్కో ఏడాది ఒక్కో రూపంలో దర్శనమిచ్చే ఇక్కడి గణనాధుని విగ్రహం రాష్ట్రంలోనే ఎత్తైదిగా గణతికెక్కుతుంది. ఇంతభారీ విగ్రహం వద్ద ఉంచే భారీ లడ్డూ తయారీకి తూర్పు గోదావరి జిల్లా తాపేశ్వరంలో సురుచి ఫుడ్స్ అధినేత పోలిశెట్టి మల్లిబాబు ఆధ్వర్యంలో బృందం సిద్ధమైంది.
ఖైరతాబాద్లో ఈ సంవత్సరం ప్రతిష్టించే 59 అడుగుల ‘గోనాగ చతుర్ముఖ వినాయక’ విగ్రహం చేతిలో 4 వేల కేజీల భారీ లడ్డూను ఉంచనున్నారు. గురువారం మల్లిబాబు విలేకరులతో మాట్లాడుతూ తనతోపాటు, గణేష్మాల ధరించిన 16 మంది దీనిని తయారీ చేయనున్నట్టు తెలిపారు. సెప్టెంబర్ 4న బూందీ తయారీని ప్రారంభించి 6న లడ్డూను తయారు చేస్తామన్నారు. 7న తుదిమెరుగులు దిద్దుతామని, 8న క్రేన్ సహాయంతో ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలోకి చేర్చి 9న హైదరాబాద్కు చేరుస్తామని వివరించారు.